హతస్సాక్షి జెకర్యా
*హతస్సాక్షి జెకర్యా-మొదటి భాగము*
*ఉపోద్ఘాతం*
మత్తయి 23:35.....
నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును, దేవాలయమునకును
మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జెకర్యా రక్తమువరకు భూమిమీద చిందింపబడిన నీతిమంతుల
రక్తమంతయు మీ మీదికి వచ్చును.
ఈ మాటలు చెబుతుంది స్వయానా యేసుక్రీస్తుప్రభులవారు! ఒక ప్రవక్తకోసం చెబుతున్నారు- ఆయన బలిపీటమునకు- మందిరమునకు మధ్యలో హత్యకావించబడ్డాడు. హతస్సాక్షి అయ్యాడు అని దేవుడు చెబుతున్నారు. ఇంతకీ ఈయన ఎవరు?
*పేరు*: జెకర్యా
*పేరుకు అర్ధం*: యెహోవా జ్ఞాపకం చేసుకొనెను
*జననం*: తెలియదు. అయితే బబులోను చెరలో పుట్టినవాడు. ప్రవక్తయైన యిర్మియాకు దేవుడు చెబితే యిర్మియా గారు ఉత్తరం రాశారు బబులోనులో ఉన్నవారికి: 70 సంవత్సరాలు బబులోను లోనే మీరు చెరలో ఉంటారు, కాబట్టి అక్కడ మీరు పెళ్లి చేసుకోండి, మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయండి, ఇల్లు కట్టించుకోండి (యిర్మియా 29:1—7) అని, ఇది చదివిన ప్రవక్తయైన యేహెజ్కేలు గారు అప్పటికే సమాజమందిరాల వ్యవస్తను స్థాపించి ఏలాము, నీనెవే ఇంకా తదితర ప్రాంతాలలో ఉన్నవారికి, అష్షూరులో ఉన్నవారికి ఈ ఉత్తరాన్ని పంపగా అక్కడ వారు లేవీయులు, యాజకులు, ప్రజలు కూడా వివాహాలు చేసుకోవడం, ఇల్లు కట్టుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు పుట్టినవాడు జెకర్యా.
*తల్లిదండ్రులు*: తల్లిపేరు తెలియదు. తండ్రి బెరక్యా, తాత- ఇద్దో (యాజకుడు, ప్రవక్త అని కూడా అంటారు) (జెకర్యా 1:1; ఎజ్రా 5:1; 6:14) అయితే చరిత్ర ప్రకారం బెరక్యా -- జెకర్యా చిన్న వయస్సులోనే చనిపోయారు, అందుకనే తన తాత , యాజకుడైన ఇద్దో దగ్గరనే పెరిగారు. క్రీస్తుపూర్వం 538 లో తన తాత ఇద్దోతోపాటు, షేష్బజ్జరు అనెడి జెరుబ్బాబెలు సారధ్యంలో చెరనుండి యేరూషలేము కి వచ్చారు. అప్పటికి ఆయన వయస్సు సుమారు పది సంవత్సరాలు. కాబట్టి జెకర్యా గారి జననం బహుశా BC 548 లో అయి ఉండవచ్చు!
*విధ్యాబ్యాసం*: అంతా తన తాత గారి దగ్గర నేర్చుకున్నారు.
*ప్రవచన పరిచర్య—అప్పటి పరిస్తితులు*: ఎజ్రా 1:1 ప్రకారం కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం అనగా BC 539లో యేరూషలేము మందిరం తిరిగి కట్టవచ్చు అని, ఆసక్తి ఉన్నవారు తిరిగి వారి దేశానికి వెళ్ళవచ్చు అని ఆజ్ఞ జారిచేస్తే చాలామంది బయలుదేరి వెళ్ళారు. వారికి నాయకుడుగా అనగా గవర్నర్ గా షేష్బజ్జర్ ని నియమిస్తారు. అయితే ఎజ్రా మిగతా అధ్యాయాలలో షేశ్బజ్జర్ కనబడడు- జెరుబ్బాబెలు అధిపతిగా కనిపిస్తాడు కాబట్టి బైబిల్ పండితులు షేస్బజ్జర్ జెరుబ్బాబెలు ఇద్దరు ఒకరే అంటారు. ఇక ఎజ్రా ౩:౩ నుండి అక్కడక్కడ ఆ దేశమందు కాపురస్తులైన వారికి భయపడుచు అని ఉంటుంది, ఇక్కడ ఆ దేశమందు కాపురస్తులు ఎవరు అంటే సమరయులు. *సమరయులు ఎవరు*?
సమరయ అనగా Watch Tower (కాపలా కోట). అది ఇశ్రాయేలు దేశం మధ్యలో ఉంది. ఇశ్రాయేలు రాజైన ఒమ్రీ, షెమెరు అనే వ్యక్తిదగ్గర రెండు తలాంతులకు ఆ కొండను కొని అక్కడ పట్టణం కట్టించి దానికి షోమ్రోను(సమరయ) అని పేరు పెట్టినట్టు చూస్తాం 1 రాజులు 16వ అధ్యాయం. కాలక్రమేనా ఈ పట్టణం అనేకసార్లు దాడికి గురిచేయబడ్డాది. (1,2వ రాజులు). సమరయులు అనే పేరు ఎలా వచ్చిందంటే క్రీ.పూ. 721-677 మధ్యలో ఏషర్హద్దోన్ అనే అస్సూరు రాజు ఆప్రాంతాన్ని జయించి ఇశ్రాయేలీయులను చెరపట్టి, అస్సూరు రాజ్యానికి తీసుకోనిపోయాడు. ఇతర దేశ ప్రజలను తీసుకొచ్చి ఈ సమరయ ప్రాంతంలో నివాసం చేయమని చెప్పి అక్కడ పెడతాడు. ఈ రకంగా వచ్చిన మిశ్రమ జాతి వారే సమరయులు.(2రాజులు 17: 24-41). ఇది దేవునికి ఇష్టంలేని పని. అందువల్ల దేవుడు సింహాలను పంపుతారు. అప్పుడు వారు ఈ విషయం రాజుకు చెబితే ఒక యాజకున్ని వారి దగ్గరకు పంపగా ఈ యాజకుడు వారికి దేవునియందు భయభక్తులు- దేవుని పద్దతులు నేర్పుతాడు. తర్వాత వారు తమ విగ్రహాలను విడచిపెట్టి క్రమక్రమంగా యూదుల ఆచారాలను, యెహోవా దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెడతారు. (ఎజ్రా 4:2,9,10; లూకా 17:18). వీరే అనగా ఈ మిశ్రమ జనాంగమే సమరయులు.
అయితే యూదులు/ఇశ్రాయేలీయులు చెర విముక్తి పొందిన తర్వాత దైవాజ్న
మేరకు మందిరం కట్టడం ప్రారంభిస్తారు. అప్పుడు ఈ సమరయులు మేము
కూడా మీ దేవున్నే ప్రార్దిస్తున్నాం. మేము కూడా మీతోపాటు మందిరాన్ని
కడతాం అంటే జెరుబ్బాబెలు, యేశూవ (యెహోషువ)
అనే పెద్దలు దానికి అంగీకరించరు. నెహేమ్యా గారైతే
ఏకంగా మీకు మాలో పాలైనను, స్వాస్త్యమైనను లేదని ఖరాఖండిగా చెబుతారు.అప్పటినుండి యూదులకు/ఇశ్రాయేలీయులుకు మధ్య వైరం మొదలైంది.
(చివరకు సమరయులు గెరీజీము కొండమీద ఒక మందిరాన్ని కట్టుకొంటే క్రీ.పూ. 139 లో ఒక యూదురాజు దానిని పడగొట్టినట్లు చరిత్ర
చెబుతుంది. అప్పుడు వారు సమరయ అనగా షెకెము కొండమీద ఒకమందిరాన్ని
కట్టుకొని ఆరాదించడం మొదలు పెట్టారు.)
సరే, ఇలాంటి పరిస్తితులలో ఇశ్రాయేలు వారు మందిర నిర్మాణాన్ని ప్రారంభించారు. గాని ఎప్పుడైతే వీరు సమరయులను మందిరం నిర్మాణంలో మీరు రావద్దు అని చెప్పారో వారు ఎన్నో ఆటంకాలు పెట్టడం మొదలు పెట్టారు. ఆ స్టోరీ మనకు ఎజ్రా ౩—4 అధ్యాయాలలో ఉంటుంది. అంతేకాకుండా చెరనుండి వచ్చిన యూదులు కటిక పేదరికం అనుభవిస్తున్నారు కారణం అప్పటికే ఇశ్రాయేలు దేశం మొత్తం సేద్యం చెయ్యక బీడుభూమిగా మారిపోయింది. ప్రజలకు సేద్యం చెయ్యడానికి పనిముట్లు లేవు, ఇంకా పంట పండించినా వర్తకం చెయ్యడానికి అవకాశాలు లేవు. అందుకే చాలా పేదరికంలో ఉన్నారు. ఈ రకంగా ఇశ్రాయేలు వారు చెరనుండి BC 539/538లో వచ్చి, BC 538లో పునాదివేసి మందిర నిర్మాణం అనగా రెండవ మందిర నిర్మాణం ప్రారంభించినా పైన చెప్పిన అన్ని కారణాల వలన మందిర నిర్మాణం పూర్తికాలేదు. ఇలా 18 సుదీర్ఘమైన సంవత్సారాలు గడిచిపోయాయి. అప్పుడు దేవుడు ఇద్దరు ప్రవక్తలను లేపుకుని ప్రజలను ఉత్సాహపరచడం మొదలుపెట్టారు. వారే ఎజ్రా 5:1 ప్రకారం హగ్గయి, జెకర్యా! హగ్గయి గారు దర్యావేషు( ఈ దర్యావేషు దానియేలు 6వ అధ్యాయంలో దర్యావేషు కాదు, యితడు దర్యావేషు-2) ఏలుబడి రెండవ సంవత్సరం అనగా క్రీ.పూ. 520 లో ఆరవ నెలనుండి ప్రవచన పరిచర్య ప్రారంభించగా ఉజ్జీవం కలిగింది గాని పుసుక్కున ఆరిపోయింది. రెండునెలలు గడిచాక యవ్వనస్తుడైన జెకర్యా గారిని దేవుడు లేపడం మొదలు పెట్టారు. మొదటగా దర్శనాలు చూపించి ప్రజలను రేపితే, తర్వాత ప్రవచన పరిచర్య ద్వారా దేవుడు వారిని రేపి చివరకు మందిరం క్రీ.పూ. 515 లో పూర్తిగా కట్టబడింది.
*మరణం*: ఈ రకంగా సుమారుగా 28 సంవత్సారాలు వయస్సులో జెకర్యా గారు ప్రవచన పరిచర్య ప్రారంభించి కొద్ది సంవత్సారాలు పరిచర్య చేసి, చివరకు వారి అవిశ్వాసాన్ని, అవిదేయతను మాటిమాటికి ఖండించడం బట్టి ఆయనను సొంత ప్రజలే బలిపీటానికి మందిరానికి మధ్యలో హత్యచేస్తే హతస్సాక్షిగా చనిపోయారు. దీనిని యేసుక్రీస్తుప్రభులవారు తననోటితో చెప్పారు. అయితే కొంతమంది పండితులు అది ఈ జెకర్యా కాదు 2 దినవృత్తాంతముల గ్రంధంలో చెప్పబడిన యెహోయూదా కుమారుడైన జెకర్యానే చంపారు, ఈ బెరక్యా కుమారుడైన జెకర్యాను చంపలేదు అంటారు. మరి ఈ పండితులకు యేసుక్రీస్తు ప్రభులవారి కన్నా జ్ఞానం ఉన్నట్లు బిల్డప్ లు ఇస్తున్నారు. యేసుప్రభువే దానిని దృవీకరించిన తర్వాత దీనికోసం వాదనలు అనవసరం!
కాబట్టి ప్రియ దైవజనమా! యేసుక్రీస్తుప్రభులవారు ఎవరినైనా ఏ వయస్సులో ఉన్నా వాడుకోడానికి సిద్దంగా ఉన్నారు. కేవలం ఆయనకు సంపూర్తిగా లోబడి నీ జీవితాన్ని సంపూర్తిగా ఆయన చేతికి అప్పగించుకుంటే చాలు. జెకర్యా గారు చిన్నవయస్సులో దేవునికి అప్పగించుకున్నారు. దేవుడు ఎంతో గొప్పగా ఆయనను వాడుకున్నారు. అంతేకాకుండా యెషయా ప్రవక్త తప్పించి యేసుక్రీస్తుప్రభులవారి మొదటిరాకడ, రెండవరాకడ (రహస్యరాకడ, బహిరంగ రాకడ), ఆయనపొందే మరణ వేదనలు, వృత్తాంతములు కోసం ఎక్కువగా విస్తారంగా రాసినవారు జెకర్యాగారు తప్పించి మరెవరు లేరు అని చెప్పుకోవచ్చు!
అట్టి భాగ్యం నీకు కావాలంటే, అట్టి ఘనమైన సేవ-పరిచర్య నీవు కూడా చెయ్యాలంటే, దేవుని చేతిలో వాడబడాలంటే నిన్నునీవు నేడే దేవునికి సమర్పించుకో!
దేవుడునిన్నుకూడా వాడుకోడానికి సిద్దంగా ఉన్నారు!
మరి నీవు సిద్దమా?
దైవాశీస్సులు!
*హతస్సాక్షి జెకర్యా-రెండవ భాగము*
జెకర్యా 1:1—౩....
1.
దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము ఎనిమిదవ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయు
ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైన జెకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా
2.
యెహోవా మీ పితరులమీద బహుగా కోపించెను.
3.
కాబట్టి నీవు వారితో ఇట్లనుము సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున
దేమనగా మీరు నాతట్టు తిరిగినయెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా
సెలవిచ్చుచున్నాడు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.
దేవుని నామమునకు మహిమ కలుగును గాక! ప్రభువునందు ప్రియమైన దైవజనమా! క్రీస్తుయేసు అతిశ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ శుభాదివందనాలు. ఆధ్యాత్మిక సందేశాలు-7 లో భాగంగా మరో ప్రవక్త జీవిత అనుభవాలు, దర్శనాలను ధ్యానిస్తూ మరోసారి మిమ్మలను కలుసుకోవడం ఆనందంగా ఉంది. అట్టి కృపనిచ్చిన ఆ దేవాదిదేవునికి నిండు వందనాలు. మనం కొన్నిరోజులు జెకర్యా భక్తుని జీవిత అనుభవాలు, దర్శనాలు, ప్రవచనాలు ధ్యానం చేస్తూ ప్రభువు మనతో వీటిద్వారా ఏమి మాట్లాడుతున్నారో కొద్దిగా ధ్యానం చేద్దాం. గత భాగంలో చెప్పిన విధంగా యెషయా ప్రవక్త తప్పించి యేసుక్రీస్తుప్రభులవారి మొదటిరాకడ, రెండవరాకడ (రహస్యరాకడ, బహిరంగ రాకడ), ఆయనపొందే మరణ వేదనలు, వృత్తాంతములు కోసం ఎక్కువగా విస్తారంగా రాసినవారు జెకర్యాగారు తప్పించి మరెవరు లేరు అని చెప్పుకోవచ్చు! కాబట్టి పరిశుద్ధాత్ముని నడిపింపు మేరకు మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాము.
గమనించాలి: ఈ జెకర్యా గ్రంధం ప్రవచన గ్రంధం కాబట్టి – ఈయన చెప్పిన ప్రవచనాలకు అనేకవాటికి లేఖనాలలో మరొక దానికి సంభంధం ఉంటుంది కాబట్టి ఈ జెకర్యా గ్రంధ ధ్యానములలో ఎక్కువగా రిఫరెన్సులు ఇవ్వడం జరుగుతుంది. కారణం లేఖనాలు పరిశీలించవలసిన విధానం అదే! ఒక లేఖనాన్ని మరో లేఖనంతో పోల్చుకోవాలి.
ఇక ఈయనకోసం గతభాగంలో చూసుకున్నాం. తండ్రి బెరెక్యా, తాతగారు ఇద్దో-యాజకుడు. ఈయనకూడా యాజకుడు అయ్యారు. అంతకన్నా శ్రేష్టముగా దేవునిచే ఎన్నుకోబడి ప్రవక్తగా జీవించారు. ఈయన సమకాలికుడు- హగ్గయి గారు. గమనించాలి- హగ్గయిగారి వయస్సు జెకర్యా గారికంటే చాలా ఎక్కువ! ఈయన సుమారుగా 28 సంవత్సారాలు వయస్సులో తన పరిచర్య ప్రారంభించారు. అప్పటి పరిస్తితులు గతభాగంలో వివారించడం జరిగింది.
ఇక ఈయన సేవా పరిచర్య సందర్భం- హగ్గయి గారి లాగనే దేవుని మందిర నిర్మాణం భయపడక ధైర్యంగా కట్టమని చెబుతున్నారు.
ఇక్కడ మొదట వచనంలో దర్యావేషు పాలనలో రెండవ సంవత్సరం అంటున్నారు. ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. ఇక్కడ చెబుతున్న దర్యావేషు –
దానియేలు గ్రంధం 6వ అధ్యాయంలో కనిపించే దర్యావేషు కాదు. ఆయన దర్యావేషు-1,
ఈయన దర్యావేషు-2. ఈ దర్యావేషు క్రీ.పూ.
521 లో రాజయ్యాడు. కాబట్టి ఈయన పరిచర్య క్రీ.పూ.
520 లో ప్రారంబించారు.
రెండవ వచనంలో యెహోవా మీ పితరులమీద బహుగా కోపించెను. ....... ఇక్కడ మీ పితరులు అనగా వారి పూర్వికులు. మీ పితరులమీద యెహోవా బహుగా కోపించెను గనుక ఇప్పుడు నా వైపు తిరగమని చెబుతున్నారు. ఇంతకీ ఎందుకు కోపగించారు అంటే మనకు తెలుసు న్యాయాధిపతుల గ్రంధము నుండి దినవృత్తాంతములు, ఇంకా ప్రవక్తల గ్రంధాలలో వారు ఎలా దేవునిమీద తిరుగబడి అన్యదేవతలను పూజించారో చూడవచ్చు. అందుకే దేవునికి అంత కోపం కలిగింది. యిర్మియా 7:18, 20; 8:19; 11:17; 32:31—35; ఇలాంటి తప్పులు చేశారు కాబట్టే దేవుడు వీరిని బబులోను- అష్షూరు వారికి బానిసలుగా అమ్మివేశారు. వారు వీరిని చెరలోనికి తీసుకునిపోయారు. 2దిన 36:5—21 .....ఇప్పుడు దేవుడు కనికరించి వీరిని మరలా తీసుకుని వస్తున్నారు.
కాబట్టి మీరైనా నావైపు తిరగండి, బుద్ధి తెచ్చుకోమని దేవుడు హితవు పలుకుతున్నారు.
౩..కాబట్టి నీవు వారితో ఇట్లనుము సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున దేమనగా
మీరు నాతట్టు తిరిగినయెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు;
ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ..... గమనించాలి—ఆయన దేవుడు, మన తండ్రి కాబట్టి మొదటగా మనం తప్పులు ఒప్పుకుని ఆయన వద్దకు వస్తే- అప్పుడు ఆయన మన వద్దకు వస్తారు. ఇలా నావైపు తిరగండి అని దేవుడు ప్రవక్తల గ్రంధాలలో అనేకసార్లు చెప్పినట్లు చూస్తున్నాం. యిర్మియా 4:1
ఇదే యెహోవా వాక్కుఇశ్రాయేలూ, నీవు తిరిగి రానుద్దేశించినయెడల నా యొద్దకే
రావలెను, నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయక్రియలను నా సన్నిధినుండి
తొలగించి.....
హోషేయ
14:1...
ఇశ్రాయేలూ, నీ పాపముచేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవాతట్టుకు తిరుగుము.
మలాకి ౩:7..
మీ పితరులనాటనుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి; అయితే మీరు నాతట్టు
తిరిగిన యెడల నేను మీతట్టు తిరుగుదునవి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవియ్యగామేము
దేని విషయములో తిరుగుదుమని మీరందురు.
యాకోబు
4:8...
దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును, పాపులారా,
మీ చేతులను శుభ్రము చేసికొనుడి; ద్విమనస్కులారా,
మీ హృదయములను పరిశుద్ధ పరచుకొనుడి.
గమనించాలి మొదటగా మన వంతు కర్తవ్యము మనం నెరవేరిస్తే ఆయన ఆయనవంతు కర్తవ్యం ఆయన నేరవేర్చుతారు. కారణం ఆయన తన గుణగణాలు ప్రత్యక్షం చేస్తూ చెబుతున్నారు నిర్గమకాండము 34:6,7
6.
అతనియెదుట యెహోవా అతని దాటి వెళ్లుచుయెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల
దేవుడైన యెహోవా.
7.
ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును
పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులగా ఎంచక మూడు నాలుగు తరములవరకు
తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించు నని ప్రకటించెను.
యేహెజ్కేలు
18:౩౦—32 ....
ఇంకా దేవుడు చెబుతున్నారు.4—6..... Zechariah(జెకర్యా) 1:4,5,6
4.
మీరు మీ పితరులవంటివారై యుండవద్దు; పూర్వికులైన
ప్రవక్తలు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగామీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించక పోయిరి; ఇదే యెహోవా వాక్కు.
5. మీ పితరు లేమైరి?
ప్రవక్తలు నిత్యము బ్రదుకుదురా?
6.
అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలును కట్టడలును మీ
పితరుల విషయములో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగిమన ప్రవర్తననుబట్టియు
క్రియలను బట్టియు యెహోవా మనకు చేయదలచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసియున్నాడని చెప్పుకొనిరి.
అందుకే మరోసారి జెఫన్యా 2:1—౩ లో
చెబుతున్నారు....
1.
సిగ్గుమాలిన జనులారా, కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది.
2.
విధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునుపే,
మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడిరండి.
3.
దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధుల ననుసరించు సమస్త దీనులారా,
యెహోవాను వెదకుడి; మీరు వెదకి వినయముగలవారై నీతిని
అనుసరించినయెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు.
ఈరోజుకూడా దేవుడు మనలను పిలుస్తున్నారు- తప్పిపోయిన పిల్లలారా! మరలా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతిని ఇస్తాను.
నాకాడి సులువు తేలిక అంటున్నారు. మత్తయి
11: 28
ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును.
మరినీవు ఆయన మాట వింటావా? వస్తావా?
ఆయన మాట వింటే నీవు బ్రతుకుతావు. ఆయనకు దూరంగా పోయిన బుద్దిలేని కుమారుడు పందుల పొట్టు తిందామని అనుకున్నా అదికూడా దొరకక అనేక తిప్పలు పడ్డాడు. ఆ తిప్పలు తప్పించుకోవాలంటే, ఆ నిత్య నరకం తప్పించుకోవాలంటే, నేడు అనే సమయముండగానే ఆయన యొద్దకు వచ్చి నీ పాపాలు ఒప్పుకుని పశ్చాత్తాపపడి ఆయన శరణువేడుకో! ఆయన నిన్ను చేర్చుకోడానికి సిద్దంగా ఉన్నారు.
*నీవు ఏ స్తితిలో ఉన్నా పర్వాలేదు*. *యేసుక్రీస్తు
క్షమించలేని పాపిలేడు. ఆయన స్వస్తపరచలేని రోగము లేదు.*
కాబట్టి నీవున్న స్తితిలోనే ఇప్పుడే ఆయన యొద్దకు రా!
విడుదల పొంది ఆ నిత్యరాజ్యము పొందుకో!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
దైవాశీస్సులు!
*హతస్సాక్షి జెకర్యా-మూడవ భాగము*
*జెకర్యా దర్శనాలు-1*
*ఎర్రని గుర్రముపై ఉన్న మనిషి*
జెకర్యా 1:7—17......
7.
మరియు దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము శెబాటు అను పదకొండవ నెల
యిరువది నాలుగవ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైన
జెకర్యాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.
8.
రాత్రి ఎఱ్ఱని గుఱ్ఱమునెక్కిన మనుష్యు డొకడు నాకు కనబడెను; అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలువబడియుండగా అతని వెనుక ఎఱ్ఱని గుఱ్ఱములును
చుక్కలు చుక్కలుగల గుఱ్ఱములును తెల్లని గుఱ్ఱములును కనబడెను.
9. అప్పుడునా యేలినవాడా,
యివి ఏమని నేనడుగగా నాతో మాటలాడు దూత ఇవి ఏమియైనది నేను నీకు తెలియజేతుననెను.
10.
అప్పుడు గొంజి చెట్లలో నిలువబడి యున్నవాడు ఇవి లోకమంతటను తిరుగులాడుటకు
యెహోవా పంపించిన గుఱ్ఱములని చెప్పెను.
11.
అవి గొంజి చెట్ల మధ్యను నిలువబడిన యెహోవా దూతను చూచిమేము లోకమంతట తిరుగులాడివచ్చి
యున్నాము; ఇదిగో లోకులందరు శాంతము కలిగి నిమ్మళముగా ఉన్నారని
చెప్పెను.
12.
అందుకు యెహోవా దూత సైన్యములకధిపతియగు యెహోవా, డెబ్బది
సంవత్సరములనుండి నీవు యెరూషలేము మీదను యూదా పట్టణముల మీదను కోపముంచియున్నావే;
యిక ఎన్నాళ్లు కనికరింపకయుందువు అని మనవిచేయగా
13.
యెహోవా నాతో మాటలాడిన దూతకు ఆదరణయైన మధుర వచనములతో ఉత్తరమిచ్చెను.
14.
కాబట్టి నాతో మాటలాడు చున్న దూత నాతో ఇట్లనెనునీవు ప్రకటన చేయవలసినదేమనగా
సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను యెరూషలేము విషయములోను సీయోనువిషయములోను
అధికాసక్తి కలిగియున్నాను;
15.
నిమ్మళముగా ఉన్న అన్యజనులమీద నేను బహుగా కోపించుచున్నాను; ఏలయనగా నేను కొంచెము కోపపడగా కీడుచేయవలెనన్న తాత్పర్యముతో వారు సహాయులైరి.
16.
కాబట్టి యెహోవా సెలవిచ్చున దేమనగా వాత్సల్యముగలవాడనై నేను యెరూషలేము
తట్టు తిరిగియున్నాను; అందులో నా మందిరము కట్టబడును; యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగ లాగుదురు; ఇదే సైన్యములకు
అధిపతియగు యెహోవా వాక్కు.
17.
నీవు ఇంకను ప్రకటన చేయవలసినదేమనగా ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా
నింపబడును, ఇంకను యెహోవా సీయోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును.
ప్రియ దైవజనమా! జెకర్యా గారికి ఎనిమిది దర్శనాలు కలిగాయి. అవన్నీ బహుశా ఒకేరాత్రి కలిగాయి అని వేద పండితుల అభిప్రాయం! కారణం అన్నీ ఒకదానివెనుక ఒకటి వ్రాయబడి ఉన్నాయి. తారీకులు మార్చబడలేదు.
*ఇక జెకర్యా గారి దర్శనాలకు ప్రకటన గ్రంధానికి సంబందం ఉంది. అంతేకాకుండా ఆయన మొదట రాకడకు సంబందించిన ప్రవచనాలకు- నాలుగు సువార్తలకు సంబందం ఉంది. కాబట్టి నాలుగు సువార్తలు, ప్రకటన గ్రంధం కలిపి చదవకపోతే ఈ సత్యాలు అర్ధం కావు*.
ఈ దర్శనం మొదటి దర్శనం! ఒకవ్యక్తి ఎర్రని గుఱ్ఱము ఎక్కి గొంజి చెట్ల మధ్యలో నిలబడి ఉన్నాడు. అతని వెనుక ఎర్రని గుఱ్ఱములు, చుక్కలుచుక్కలు గల గుఱ్ఱములు తెల్లని గుఱ్ఱములు ఉన్నాయి. అప్పుడు జెకర్యా గారు నా ఏలిన వాడా ఇవి ఏమిటి అని అడిగితే 2—6 వచనాల వరకు మాట్లాడిన వ్యక్తి జవాబు చెబుతున్నాడు.
సరే, మొదటగా దేవుడు తన ప్రవక్తలకు దర్శనాలు ఇచ్చి మాట్లాడటం బైబిల్ గ్రంధంలో అనేకసార్లు కనబడుతుంది. దానియేలు, యేహెజ్కేలు, యెషయా, యిర్మియా ఇలా అనేకమందితో మాట్లాడారు.
గమనించాలి: గొంజిచెట్లు పర్ణశాల పండుగకు ఉపయోగించే చెట్లు, అవి పవిత్రమైన చెట్లు, పర్ణశాల పండుగ విశ్రాంతి కి ఆదరణ కు సాదృశ్యం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొందాక దేవుడు వారికి ఇచ్చే ఆదరణ, కొంతకాలం సేదదీరమని ఆయన రెక్కల నీడలో అలసట తీర్చుకోమని చెప్పడం. మరలా ఇదే పండగ కోసం ఇదే గ్రంధంలో రాయబడింది. గనుక ఇది రెండవ రాకడ తర్వాత ఇంతవరకూ ఇశ్రాయేలు జాతి పడిన శ్రమలకు దేవుడు ఆదరణ కలిగించడానికి ముంగుర్తుగా ఆ వ్యక్తి గొంజి చెట్లు మధ్య నిలబడి ఉన్నారు.
ఎనిమిదో వచనంలో కనబడే ఎర్రని గుఱ్ఱం: రక్తపాతాన్ని సూచిస్తుంది. అనగాగొప్ప యుద్దాలు త్వరలో జరగబోతున్నాయి అని అర్ధం! ప్రకటన 6:4 చూడండి....
అప్పుడు ఎఱ్ఱనిదైన వేరొక గుఱ్ఱము బయలువెళ్ళెను; మనుష్యులు ఒకని ఒకడు చంపు కొనునట్లు భూలోకములో సమాధానము లేకుండ చేయుటకు ఈ గుఱ్ఱముమీద కూర్చున్నవానికి అధికార మియ్యబడెను; మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గమియ్యబడెను.
తెలుపు: విజయానికి, అధికారానికి సూచనగా ఉంది. ప్రకటన 6వ అధ్యాయంలో క్రీస్తు విరోధి అధికారం పొందడాన్ని సూచిస్తే, ప్రకటన 19:11—15..... యేసుక్రీస్తు ప్రభులవారు అధికారం పొందిన సందర్భాలు సూచిస్తుంది. కాబట్టి తెల్లని గుర్రాలు అధికారానికి సూచనగా ఉన్నాయి.
ఇక గుర్రాలు ఎందుకు కనిపిస్తున్నాయి అంటే—ఈ గుఱ్ఱములు దేవుని పనిని నెరవేర్చే దేవుని దూతలు. మనకు ఏలియా గారు ఆరోహణమైనప్పుడు, ఇంకా ప్రకటన గ్రంధంలో ఇంకా అనేకమైన సందర్బాలలో గుఱ్ఱములు కనిపిస్తాయి.
ఇక గొంజి చెట్లలో ఉన్న దూత- యెహోవా దూత- అనగా ఈ దూతలందరికీ పెద్దదూత కావచ్చు!
10వ వచనంలో ఆ గుఱ్ఱాలు
ఏమిటో చెబుతున్నాడు యెహోవాదూత! అవి లోకమంతటా తిరుగులాడుటకు యెహోవా
పంపిన దూతలు అని చాలా స్పష్టముగా చెప్పడం జరిగింది. స్టడీ బైబిల్
లో లోకమంతటా గస్తీ తిరగటానికి దేవుడు పంపిన దూతలు అని వ్రాయబడింది. వీరిపని లోకంలో ప్రజలు ఎలా ఉన్నారు,
ఏం చేస్తున్నారు అనేది దేవునికి చెప్పడం అన్నమాట! యోబు 1:7 లో సాతానుగాడు ఏమనిచెప్పాడో ఒకసారి గుర్తుకు
చేసుకోండి.
11వ వచనంలో ఈ గుఱ్ఱాలు అన్ని కలసి యెహోవాదూతతో
జవాబు చెబుతున్నాయి- మేము లోకమంతా గస్తీ తిరుగుతున్నాము. లోకమంతా శాంతముగా నిమ్మళముగా ఉంది
అంటున్నాయి. బహుశా ఈ
నిమ్మళము, నెమ్మది దేనిని సూచిస్తుంది అంటే—మాదీయ పారశీక రాజ్యం బబులోను సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాక కొద్దికాలంలో
లోకంలో శాంతి ఏర్పడింది. దానికోసం బహుశా ఈ గుఱ్ఱములు చెబుతున్నాయి.
12..అందుకు యెహోవా దూత సైన్యములకధిపతియగు
యెహోవా, డెబ్బది సంవత్సరములనుండి నీవు యెరూషలేము మీదను యూదా పట్టణముల
మీదను కోపముంచియున్నావే; యిక ఎన్నాళ్లు కనికరింపకయుందువు అని
మనవిచేయగా .. ఇక్కడ ఈ వచనం చూసుకుంటే యూదాలోని స్తితిని గూర్చి
యేసుక్రీస్తు ప్రభులవారు తండ్రిని వేడుకున్న వచనాలు జ్ఞాపకం వస్తాయి.యోహాను 17వ అధ్యాయం; రోమా
8:౩4; 1తిమోతి 2:5; హెబ్రీ
7:25; 1యోహాను 2:1;
ఇంకా మరో విషయం కూడా జ్ఞాపకం వస్తుంది. బలిపీటం దగ్గర ఆత్మలు కూడా ఇలాగే దేవుణ్ణి అడుగుతున్నాయి.
ప్రకటన గ్రంథం 6: 10
వారునాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూని వాసులకు
ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలువేసిరి.
ఇక్కడ 70 సంవత్సరాలు కోపగించావు ఇంకా ఎంతకాలం కోపం చూపుతావు అని మొర్రపెడుతున్నాడు. యిర్మియా
25:11—12 వరకు ప్రవచనంలో 70 సంవత్సరాలు పాడుగా ఉంటుంది అని చెప్పగా నిజంగా 70సంవత్సారాలు పాడుగా ఉన్నాయి. క్రీ.పూ 586 లో పట్టణం, దేవాలయం కాల్చబడి, కూల్చబడితే క్రీ.పూ. 515 లో మందిరం తిరిగి కట్టబడింది. ఇంకా యేరూషలేము పట్టణం కట్టబడాలి.
ఇక 13—17 వరకు తండ్రియైన దేవుడు ఆ ప్రశ్నకు జవాబుగా చక్కని శాంతికరమైన జవాబును ఇస్తున్నారు.
14....కాబట్టి నాతో మాటలాడు చున్న
దూత నాతో ఇట్లనెనునీవు ప్రకటన చేయవలసినదేమనగా సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు
నేను యెరూషలేము విషయములోను సీయోను విషయములోను అధికాసక్తి కలిగియున్నాను;
ఇక్కడ ఒకమాట చెప్పనీయండి. 14వ వచనంలో నేను సీయోను నొద్దకు మరలా వచ్చి యేరూషలేములో నివాసం చేతును అంటున్నారు. ఈ అధ్యాయంలోని ఈ గ్రంధంలోను దేవుడు ఎక్కువగా సీయోను అని పిలవడం చూడగలరు. సీయోను అనగా దావీదు పురము. 2 సమూయేలు 5:7; ఇక తర్వాత ఇశ్రాయేలు ప్రజలను సీయోను కుమారి అనియు, సీయోను అని పిలవడం మొదలుపెట్టారు. 2రాజులు 19:21 తర్వాత నుండి. తర్వాత నా పరిశుద్ధ పర్వతమయన సీయోనుమీద నా రాజును నిలబెడతాను. కీర్తనలు 2:6; ఇశ్రాయేలు ప్రజలను సీయోను వాసులుగా దేవుడు అనేకసార్లు పిలిచేవారు. అంటే ఇప్పుడు వారితో దేవుడు చేసిన ఆత్మీయ నిభందనను గుర్తుకు చేసుకుంటున్నారు అన్నమాట! అలాగే ఆయన ఆత్మీయ యేరూషలేము నిర్మాణం కోసం కూడా చెబుతున్నారు! కారణం మనకు ప్రకటన 14వ అధ్యాయంలో పరమ సీయోను కనబడుతుంది. వారు ఎవరూ అనేది ఆ అధ్యాయంలో ఉంది. కాబట్టి ఎప్పుడైతే దేవుడు యెరూషలేము, సీయోను అని రెండు పిలుస్తున్నారో ఈ గ్రంధంలో దాని అర్థం కేవలం భూమి మీదనున్న
యెరూషలేము అని కాకుండా ఆత్మీయ యెరూషలేము, పరమ సీయోను కోసం కూడా చెప్పబడుతుంది అని గ్రహించాలి.
ఇక్కడ అధికాసక్తి అనే పదానికి రోషం అని అనువదించవచ్చు. జెకర్యా
8:2.
సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా మిగుల ఆసక్తితో నేను సీయోను విషయమందు
రోషము వహించియున్నాను. బహు రౌద్రము గలవాడనై దాని విషయమందు నేను రోషము వహించియున్నాను.
యోవేలు 2:18
అప్పుడు యెహోవా తన దేశమునుబట్టి రోషము పూని తన జనులయెడల జాలిచేసికొనెను.
ఈ దేవుని ఆసక్తి లేక రోషం వెనుక దేవుని ప్రేమ దాగియుంది. ఇశ్రాయేలు ప్రజలపట్ల ఆయనకున్న ప్రేమ చాలా గొప్పది. అందుకే తననుండి వారిని దూరం చేసే ప్రతీది ఆయనకు చాలా రోషం కలిగిస్తుంది. వారిని బాదించే ఏ జాతినైనా ఆయన తప్పకుండ శిక్షిస్తారు. అందుకే నిమ్మళంగా ఉన్న జనాలను నేను శిక్షిస్తాను అంటున్నారు.
ఇంకా ఆయన నేను మరలా దేవాలయాన్ని పూర్తిచేస్తాను అని సెలవిచ్చారు. ఇది నిజంగా క్రీ.పూ.
515 లో నెరవేరింది.
ఎజ్రా 6:14—15....
14. యూదుల పెద్దలు కట్టించుచు,
ప్రవక్తయైన హగ్గయియు ఇద్దో కుమారుడైన జెకర్యాయు హెచ్చరించుచున్నందున
పని బాగుగా జరిపిరి. ఈ ప్రకారము ఇశ్రాయేలీయుల దేవుని ఆజ్ఞ ననుసరించి
వారు కట్టించుచు, కోరెషు దర్యావేషు అర్తహషస్త అను పారసీక దేశపురాజుల
ఆజ్ఞచొప్పున ఆ పని సమాప్తి చేసిరి.
15.
రాజైన దర్యావేషు ఏలుబడి యందు ఆరవ సంవత్సరము అదారు నెల మూడవనాటికి మందిరము
సమాప్తి చేయ బడెను.
యేరూషలేము మీద శిల్పకారులు నూలు సాగ లాగుదురు అనగా యెరూషలేము మరలా కట్టబడుతుంది
అని అర్ధం!
17...నీవు ఇంకను ప్రకటన చేయవలసినదేమనగా ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా
నింపబడును, ఇంకను యెహోవా సీయోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. . యెహోవా మరలా సీయోనును
ఓదార్చుతారు అంటున్నారు.
యెషయా 40: 2
నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను
ఆమె దోషరుణము తీర్చబడెను యెహోవా చేతివలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనను
సమాచారము ఆమెకు ప్రకటించుడి.
ఇంకా యేరూషలేమును ఎన్నుకుంటాను అని కూడా సెలవిస్తున్నారు.
జెకర్యా
2:12....
మరియు తనకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశములో యూదాను స్వతంత్రించు కొనును, యెరూషలేమును ఆయన
ఇకను కోరుకొనును.
జెకర్యా ౩:2...జెకర్యా 3: 2
సాతానూ, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును ఇతడు అగ్నిలోనుండి తీసిన కొరవివలెనే
యున్నాడుగదా అని యెహోవా దూత సాతానుతో అనెను.
యెషయా
14:1...
ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును వారిని స్వదేశములో
నివసింపజేయును పరదేశులు వారిని కలిసికొందురు వారు యాకోబు కుటుంబమును హత్తుకొనియుందురు
ఈ మొదటి దర్శనం యొక్క తాత్పర్యం ఏమిటంటే: దేవుడు మరలా ఇశ్రాయేలు ప్రజలమీద జాలిపడి మరలా దేవాలయాన్ని కట్టిస్తాను అని వాగ్దానం చెయ్యడం. ఇంకా ప్రజలను ఓదార్చి తన దగ్గరకు చేర్చుకుంటాను అని వాగ్దానం చెయ్యడం! ఇంకా ఏమని చెబుతున్నారు అంటే ఇశ్రాయేలుకి సమాధానం మిగిలిన జనులకు అశాంతి యుద్దాలు కలుగుతాయి అని చెప్పడం!
ఇక్కడ మరో ఆత్మీయార్ధం కూడా వస్తుంది. దేవుడు తన కుమారుని పంపి ఆత్మీయ యెరూషలేమును నిర్మిస్తాను అని వాగ్ధానం చేసినట్లు కనబడుతుంది. కారణం అనేకసార్లు దేవుడు సంఘాన్ని కడదాం అనుకున్నప్పుడు సాతాను ఎన్నోసార్లు ఆ సంఘాన్ని పాడుచేశాడు. ఇప్పుడు మనుషులు కాకుండా తానే వచ్చి తన సొంత రక్తాన్ని చిందించి పాప పరిహారం చేసి మానవుల హృదయాల్లో తన రాజ్యమును సీయోనును కట్టాలని దేవుడు యోచిస్తున్నారు. అందుకే ఇంతవరకూ దూరస్తులుగా ఉన్న తన ప్రజలను ఇకను కోరుకుంటాను అంటున్నారు.
Psalms(కీర్తనల గ్రంథము) 102:16,17
16.
ఏలయనగా యెహోవా సీయోనును కట్టియున్నాడు ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను
(ప్రత్యక్షమగును).
1పేతురు 2: 5
యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ
యాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.
ప్రియ దైవజనమా! నీవుకూడా దేవునికి దూరమై బాధపడుతున్నావా? ప్రేమలేక ఓదార్పులేక ఆదరించేవారులేక బాధ పడుతున్నావా? బాధపడకు! ఇకనుండి నేను మిమ్మును కాపాడతాను. రక్షిస్తాను, ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం చేశారు. ఆయన వద్దకు రా ఇప్పుడే! భయంకరమైన విగ్రహారాధనకు లోబడి దేవునికి దూరమైపోయిన తన సొంతప్రజలను మొదట శిక్షించి, తర్వాత ప్రేమించి దరికి చేర్చుకున్న దేవుడు నిన్నుకూడా తన దరికి చేర్చుకోగలరు. ఈరోజు నిన్ను రమ్మని పిలుస్తున్నారు. విననొల్లని వారికొరకు దినమెల్ల తన చేతులు చాపి పిలుస్తున్నారు.
మరి ఆయన వద్దకు వస్తావా?
వస్తే నీకు ఆదరణ!
నీ దుఃఖదినములు సమాప్తం చేస్తారు దేవుడు.
Psalms(కీర్తనల గ్రంథము) 102:17. ఆయన దిక్కులేని
దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనవైపు తిరిగియున్నాడు.
నేడే ఆయనవద్దకు రా!
దైవాశీస్సులు!
*హతస్సాక్షి జెకర్యా-4వ భాగము*
*జెకర్యా దర్శనాలు-2*
*నాలుగు కొమ్ములు- నలుగురు కంసాలులు*
జెకర్యా 1:18—21.....
18.
అప్పుడు నేను తేరిచూడగా నాలుగు కొమ్ములు కనబడెను.
19. ఇవి ఏమిటివని నేను
నాతో మాటలాడుచున్న దూతనడుగగా అతడు ఇవి యూదావారిని ఇశ్రాయేలువారిని యెరూషలేము నివాసులను
చెదరగొట్టిన కొమ్ములనెను.
20. యెహోవా నలుగురు
కంసాలులను నాకు కనుపరచగా
21.
వీరేమి చేయబోవుచున్నారని నేనడిగి నందుకు ఆయన ఎవడును తలయెత్తకుండ యూదావారిని
చెదరగొట్టిన కొమ్ములు ఇవే. అయితే వాటిని భయ పెట్టుటకును,
యూదాదేశస్థులనందరిని చెదరగొట్టుటకై వారిమీద బలాత్కారము జరిగించిన అన్యజనుల
కొమ్ములను పడగొట్టుటకును వీరు వచ్చియున్నారని నాకు సెలవిచ్చెను.
ప్రియ దైవజనమా! జెకర్యా గారి దర్శనాలను ధ్యానం చేస్తున్నాం. గతభాగంలో మొదటి దర్శనాన్ని ధ్యానం చేశాము. ఈరోజు రెండవ దర్శనాన్ని ధ్యానం చేసుకుందాం!
ప్రియులారా! ఈ దర్శనంలో మనకు నాలుగు కొమ్ములు- నలుగురు కంసాలు వారు కనబడుతున్నారు. వెంటనే జెకర్యా గారు అడిగారు—ఈ కొమ్ములు ఏమిటి? ఆ దూత చెప్పాడు: ఇవి యూదా వారిని ఇశ్రాయేలు వారిని చెదరగొట్టిన కొమ్ములు. ఇక్కడ ఒకసారి ఆగుదాం!
కొమ్ములు – అధికారానికి సాదృశ్యంగా ఉన్నాయి. అనగా వీరిని బాధించి చెరగొనిపోయిన రాజ్యాలు అని అర్ధం! కొమ్ముల కోసం బైబిల్ లో చాలా రిఫరెన్సులు ఉన్నాయి. కీర్తనలు 18:2; దానియేలు 7:7—8;
ప్రకటన 17:12
నీవు చూచిన ఆ పది కొమ్ములు పదిమంది
రాజులు. వారిదివరకు రాజ్యమును పొందలేదు గాని యొకగడియ
క్రూరమృగముతోకూడ రాజులవలె అధికారము పొందుదురు.
కాబట్టి పై రిఫరెన్సులు ప్రకారం ఆ కొమ్ములు దేవుని ప్రజలను చెల్లాచెదురు చేసిన రాజ్యాలను సూచిస్తున్నాయి. వీరిలో ముఖ్యులు ఆష్షూరు, బబులోను.
ఇక తర్వాత నాలుగు కొమ్ములు కోసం ఆలోచిస్తే- బహుశా నాలుగు
అనేది ప్రపంచం నలుదిక్కుల లేక నాలుగు మూలలకు ఇశ్రాయేలు వారు చెదిరిపోవడం సూచించవచ్చు!
ఇక 20 వచనంలో నలుగురు కంసాలులు కనిపిస్తున్నారు. వెంటనే అడిగారు ప్రవక్త దూతను: వీరు ఏమి చేయబోతున్నారు అని. దూత చెప్పాడు- వీరు ఎవడును తలెత్తకుండా చేసిన ఆ నాలుగు కొమ్ములను భయపెట్టడానికి, ఇశ్రాయేలు వారిమీద బలాత్కారం చేసిన అన్యజనుల కొమ్ములను అనగా అధికారాన్ని పడగొట్టడానికి వీరు వచ్చారు అని సెలవిచ్చారు. అయితే ఇక్కడ ఈ కంసాలు వారు దేవుడు వీరిని నలుగగొట్టిన జాతులను పడగొట్టడానికి ఉపయోగిస్తున్నారు. అదే సమయంలో మరో విషయం గుర్తుకు తెచ్చుకోవాలి. ఈ కంసాలు వారు పడగొట్టడమే కాకుండా తిరిగి నిర్మాణం కూడా చేయగలరని గుర్తు పెట్టుకోవాలి. అనగా ఎవరైతే ఇశ్రాయేలు వారిని బాధపెట్టారో వారందరి అధికారాన్ని సమయం వచ్చినప్పుడు దేవుడు వారందిరికి తీర్పుతీర్చి నాశనం చేస్తాను అని చెబుతున్నారు. గమనించాలి ఇదే విధమైన ప్రవచనాలు బైబిల్ గ్రంధంలో చాలామంది ప్రవక్తలు చెప్పారు. చివరలో మన జెకర్యా గారిద్వారా కూడా దేవుడు మరోసారి చెబుతున్నారు.
ఒకసారి మనం యిర్మియా గ్రంధం 46 నుండి అన్యజనులకు జరిగే తీర్పులు చెబుతున్నారు. 46 లో ఐగుప్తు కోసం; 47లో ఫిలిస్తీయులకు కలిగే తీర్పు; 48 లో మోయాబు వారికి కలిగే తీర్పు; 49 లో అమ్మోనీయులకు కలిగే తీర్పు; 50—51 లో బబులోను వారికి కలిగే తీర్పులు దేవుడు ప్రకటిస్తున్నారు. జెకర్యా 1:15లో చెప్పబడిన విధముగా కొంతగా దండించమని చెబితే వీరు మహా రౌద్రము చూపారు కాబట్టి వీరిని శిక్షిస్తాను అంటున్నారు.
ఇంకా యేహెజ్కేలు గారు ప్రకటించారు. హోషేయ గారు ప్రవచించారు. ఆమోషు
1—౩ అధ్యాయాలులో దేవుడు ఇదే జనులను ఎలా శిక్షించబోతున్నారో చెప్పారు.
ఓబధ్యా ఎదోము కోసం ప్రవచించారు. నహూము గారు నీనెవే కోసం ప్రవచించారు.
హబక్కూకు 2వ అధ్యాయంలో బబులోను అష్షూరు వారికి
కలగబోయే దానిని చెప్పారు. ఇలా అందరూ ప్రవచించాక జెకర్యా గారిద్వారా
మరోసారి దృవీకరిస్తున్నారు దేవుడు : ఎవరైతే తన ప్రజలను బాధించారో
వారందరిని దేవుడు బాధించబోతున్నారు. అంతేకాదు మీదన చెప్పిన విధముగా
మరలా ఇశ్రాయేలు ప్రజలను- దేశాన్ని కట్టబోతున్నారు దేవుడు!
ప్రియ దేవునిబిడ్డా! నిరాశలో ఉన్నావా? బాధలలో ఉన్నావా? శత్రువుల శోధనలో తట్టుకోలేకపోతున్నావా? ప్రజలు నిన్ను అనగా ద్రొక్కేస్తున్నారా? భయపడకు! యెహోవా నీ పక్షంగా యుద్ధం చేసే గడియ ఆసన్నమయ్యింది. జడియకు! వెరువకు! ఎక్కడైతే అవమానం పొందుకున్నావో అక్కడే నీవు ఘనపరచబడబోతున్నావు. రెట్టింపు ఆశీర్వాదం నీకు కలగబోతుంది. నీ అవమానానికి ప్రతిగా ఆశీర్వాదం, ఘనత కలగబోతుంది. యెషయా 61: 7
మీ యవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనొందుదురు నిందకు ప్రతిగా
తాము పొందిన భాగము ననుభవించి వారు సంతోషింతురు వారు తమ దేశములో రెట్టింపుభాగమునకు కర్తలగుదురు
నిత్యానందము వారికి కలుగును.
ఇశ్రాయేలుని కట్టిన దేవుడు నిన్నుకూడా కట్టగలరు. కట్టబోతున్నారు. గమనించాలి. మనం నూతన యెరూషలేముగా ఆత్మీయ ఇశ్రాయేలు గా కట్టబడుతున్నాము.
అయితే నీవు భయపడకూడదు. దేవుని మీద విశ్వాసంలో జారిపోకూడదు. దేవునికోసం సాక్షిగా నిలబడాలి. షడ్రక్, మేషక్, అబెద్నేగోలు చావు వరకు వెళ్ళారు. అవమానం పొందుకున్నారు. చివరకు అవమానం రెట్టింపు ఘనతను, హోదాను తెచ్చిపెట్టింది.
నీవుకూడా దేవునిపై ఆనుకో!
ముందుకు సాగిపో!
దైవాశీస్సులు!
*హతస్సాక్షి జెకర్యా-5వ భాగము*
*జెకర్యా దర్శనాలు-౩*
*కొలనూలు*
జెకర్యా 2:1—13......
1.
మరియు నేను తేరిచూడగా కొలనూలు చేతపట్టుకొనిన యొకడు నాకు కనబడెను.
2.
నీ వెక్కడికి పోవుచున్నావని నేనతని నడుగగా అతడు యెరూషలేము యొక్క వెడల్పును
పొడుగును ఎంతైనది కొలిచి చూడ బోవుచున్నాననెను.
4. రెండవ దూత పరుగెత్తిపోయి
యెరూషలేములో మనుష్యులును పశువులును విస్తారమైనందున అది ప్రాకారములు లేని మైదానముగా
ఉండునని ఈ యౌవనునికి తెలియజేయుమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చెను.
8. సైన్యములకు అధిపతియగు
యెహోవా సెలవిచ్చునదేమనగా మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని యెంచి తనకు
ఘనత తెచ్చుకొనదలచి, మిమ్మును దోచుకొనిన అన్యజనులయొద్దకు ఆయన నన్ను
పంపియున్నాడు.
10.
సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసముచేతును;
సంతోషముగా నుండి పాటలు పాడుడి; ఇదే యెహోవా వాక్కు.
ప్రియ దైవజనమా! జెకర్యా గారి దర్శనాలను ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మూడవ దర్శనాన్ని ధ్యానం చేసుకుందాం! ఈ దర్శన భావం – భవిష్యత్ లో యేరూషలేము- యూదులు తిరిగి వారి స్వదేశానికి వస్తారని, అప్పుడు యేరూషలేముకు యూదాకు గొప్ప పేరుప్రతిష్టలు కలుగుతాయని- దేవుడే వారితో శాశ్వత నివాసం చేస్తారని చెప్పడం!
ఇక్కడ మొదట వచనంలో ఒక వ్యక్తి చేతిలో కొలనూలు ఉంది. గతభాగాలలో చెప్పినట్లు కొలనూలు ఇశ్రాయేలు తిరిగి కట్టబడటాన్ని సూచిస్తుంది.
జెకర్యా
1:16....
కాబట్టి యెహోవా సెలవిచ్చున దేమనగా వాత్సల్యముగలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగియున్నాను; అందులో నా మందిరము
కట్ట బడును; యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగ లాగుదురు;
ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.
ఇక రెండవ వచనంలో ఎక్కడికి వెళ్తున్నావ్ అని
అడిగితే యెరూషలేము యొక్క కొలతలు కొలవడానికి వెళ్తున్నాను అంటాడు ఆ వ్యక్తి. వెంటనే జెకర్యా గారితో మాట్లాడుచున్న
దూత ఆ నిలబడ్డ వ్యక్తితో పాటు కొలవడానికి వెళ్లబోతుంటే మరో దూత వచ్చి నీవు ఆ యువకునితో
ఈ మాటలు చెప్పు అంటున్నాడు.
ఇక్కడ ఆ యువకుడు అనగా మనకు రెండు అర్ధాలు వస్తాయి.
మొదటిది: ఆ కొలనూలు పట్టుకున్న వ్యక్తి యువకుడు అయ్యుండాలి.
రెండవది: లేదా మన జెకర్యా గారు ఈ ప్రవచనాలు కలగబోయే సరికి నవయవ్వనుడు కాబట్టి జెకర్యా
గారికోసం అని ఉండాలి.
ఇక ఈ దూత- జెకర్యా గారితో మాట్లాడుచున్న దూతతో జెకర్యా గారికి ఏమని చెప్పమంటున్నాడు?
4—13 .......
చూడండి నాల్గవ వచనంలో యెరూషలేములో మనుషులు పశువులు విస్తారం అవ్వడం వలన గోడలు లేని నగరంగా ఉంటుంది అని చెప్పమంటున్నారు.
గోడల లేని నగరం అంటే ఏ మాత్రం కాపుదల లేని నగరం, గోడలు/ప్రాకారాలు కూడా లేని నగరం అనికాదు. మనుషులు పశువులు విస్తారం అవ్వడం వలన స్థలము చాలక చాలా విశాలంగా తయారవుతుంది
అని అర్ధం! దీనికోసం ఇంకా వివరంగా జెకర్యా 10:10 లో చెప్పబడింది...
ఐగుప్తు దేశములోనుండి వారిని మరల రప్పించి అష్షూరు దేశములోనుండి సమకూర్చి, యెక్కడను చోటు చాలనంత
విస్తారముగా గిలాదు దేశములోనికిని లెబానోను దేశములోనికిని వారిని తోడుకొని వచ్చెదను.
ఇదేమాట మనకు యెషయా 49:19—20 లో కూడా చెప్పబడింది.....
19.
నివాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లును బీటి స్థలములును నాశనము
చేయబడిన నీ భూమియు వారికి ఇరుకుగా ఉండును నిన్ను మింగివేసినవారు దూరముగా ఉందురు.
20.
నీవు సంతానహీనురాలవైనప్పుడు నీకు పుట్టిన కుమారులు ఈ స్థలము మాకు ఇరుకుగా
ఉన్నది. ఇంక విశాలమైన స్థలము మాకిమ్మని నీ చెవులలో చెప్పుదురు.
ఇంకా 5వ వచనంలో నేనే దానిచుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను అంటున్నారు హల్లెలూయ! ఎంత భాగ్యమండి! నేను దానిమధ్యను నివాసినై మహిమకు కారణంగా ఉంటాను అంటున్నారు. మొదటగా అగ్ని ప్రాకారం కోసం కీర్తన
125:2 లో యేరూషలేము చుట్టూ పర్వతాలున్నట్లు నేనుకూడా మిమ్ములను ఆవరించి ఉంటాను అని సెలవిచ్చారు. ఇక్కడ నేనే అగ్ని ప్రాకారంగా ఉంటాను అంటున్నారు.
ఇక రెండవదిగా నేనే మీ మధ్య నివాసినై ఉంటాను అనేమాట ఈ అధ్యాయంలో మూడుసార్లు కనిపిస్తుంది.
10, 11 వచనాలలో కూడా ఇదేమాట అంటున్నారు.....
10.
సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసముచేతును;
సంతోషముగా నుండి పాటలు పాడుడి; ఇదే యెహోవా వాక్కు.
11.
ఆ దినమున అన్య జనులనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు,
నేను మీ మధ్య నివాసముచేతును; అప్పుడు యెహోవా నన్ను
మీ యొద్దకు పంపియున్నాడని మీరు తెలిసికొందురు.
*ఈ మాట కోసం పరిశీలిస్తే ఇది ఒకసారి నిజంగా జరిగింది- మరోసారి జరగబోతుంది యదార్ధంగా!* అనగా ఇది దేవుడు మీ మధ్య నివాసం చేస్తాను అని సెలవివ్వడమే కాకుండా మొదటగా *ఆయన మొదట రాకడలో 2020 సంవత్సారాలు క్రితం ఒకసారి నిజంగానే మెస్సయ్యా గా వచ్చి ౩౩.5 సంవత్సారాలు ఇశ్రాయేలు జాతిమధ్య నివాసం చేశారు.*
అంతేకాకుండా మరలా ప్రకటన గ్రంధంలో వ్రాయబడిన విధంగా మరోసారి రెండవ రాకడ జరిగాక ఆయన ఇశ్రాయేలు వారితోనూ సర్వ పరిశుద్దుల సంఘముతోను నివాసం చేయడాన్ని కూడా సూచిస్తుంది. అందుకే మూడుసార్లు దేవుడు ఇదేమాట చెప్పడం జరిగింది.
ఇంకా జెకర్యా
9:9 లో కూడా చెప్పారు.
సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా,
ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును
దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు.
జెకర్యా 8:౩....
యెహోవా సెలవిచ్చునదేమనగా నేను సీయోను నొద్దకు మరల వచ్చి, యెరూషలేములో నివాసముచేతును,
సత్యమును అనుసరించు పురమనియు, సైన్యములకు అధిపతియగు
యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును.
యెహేజ్కేలు
37: 26
నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసెదను, అది నాకును వారికిని
నిత్య నిబంధనగా ఉండును, నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపజేసి వారిమధ్య నా పరిశుద్ధస్థలమును నిత్యము ఉంచెదను.
ప్రకటన 21:౩
అప్పుడుఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును,
వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి
వారికి తోడైయుండును.
ఇక మహిమకు కారణంగా ఉందును అనేమాట కోసం చూసుకుంటే కొన్ని ప్రతులలో శోభాయమానంగా ఉంటాను అని ఉంది. అనగా నిర్గమ
40:౩4 లో,
1రాజులు
8:10—11 లో జరిగిన విధముగా ఎప్పుడూ ఆయన ఇశ్రాయేలు తోనే ఉంటారు. అప్పుడు యెషయా
60:1—౩ లో చెప్పినట్లు యెహోవా మహిమ ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. ప్రకటన
21:23....
ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే
దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱెపిల్లయే దానికి దీపము.
ఇక 6వ వచనంలో ఉత్తర దేశంలో ఉన్నవారిని అందరిని రమ్మని పిలుస్తున్నారు. 7వ వచనంలో బబులోను నుండి తప్పించుకుని రండి అంటున్నారు. ఇది దేవుడు యూదులను యెరూషలేము నకు రమ్మని పిలిచే విధానాన్ని సూచిస్తుంది. ఆయన ఇశ్రాయేలు వారిని తిరిగి తమ దేశానికి తీసుకుని వస్తారు అనేది ఇక్కడ భావం!
ఇంకా నాలుగు మూలలు:
నలుదిక్కులా చెదిరిపోయిన వారిని రప్పించడం. యెషయా 11:11,12
11.
ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులోనుండియు ఐగుప్తులోనుండియు
పత్రోసులోనుండియు కూషులోనుండియు ఏలాములోనుండియు షీనారులోనుండియు హమాతులో నుండియు సముద్రద్వీపములలోనుండియు
విడిపించి రప్పించుటకు యెహోవా రెండవమారు తన చెయ్యి చాచును
12.
జనములను పిలుచుటకు ఆయన యొక ధ్వజము నిలువ బెట్టును భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను
పోగుచేయును భూమియొక్క నాలుగు దిగంతములనుండి చెదరి పోయిన యూదా వారిని సమకూర్చును.
యెషయా 43:5—6
5.
భయపడకుము, నేను నీకు తోడైయున్నాను తూర్పునుండి
నీ సంతానమును తెప్పించెదను పడమటినుండి నిన్ను సమకూర్చి రప్పించెదను.
6.
అప్పగింపుమని ఉత్తరదిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను బిగబట్టవద్దని దక్షిణదిక్కునకు
ఆజ్ఞ ఇచ్చెదను దూరమునుండి నా కుమారులను భూదిగంతమునుండి నా కుమార్తెలను తెప్పించుము.
యెషయా 49:12
12.
చూడుడి వీరు దూరమునుండి వచ్చుచున్నారు వీరు ఉత్తర దిక్కునుండియు పడమటి
దిక్కునుండియు వచ్చుచున్నారు వీరు సీనీయుల దేశమునుండి వచ్చుచున్నారు.
ఇంకా నేనే చెదరగొట్టాను తిరిగి నేనే రప్పిస్తున్నాను అంటున్నారు.
7వ వచనంలో బబులోను దేశములో నివసించే సీయోను అనగా చెరలో ఉన్న ఇశ్రాయేలు జనాంగం! తప్పించుకోవడం అంటే- ఇక చెర విడుదల అయ్యింది కాబట్టి రావడం అన్నమాట!
యెషయా 48:20...
బబులోనునుండి బయలువెళ్లుడి కల్దీయుల దేశములోనుండి పారిపోవుడి యెహోవా తన సేవకుడైన
యాకోబును విమోచించె నను సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయుడి భూదిగంతములవరకు అది వినబడునట్లు
దాని ప్రకటించుడి.
నిజంగా ఇది జరిగింది. కోరేషు ద్వారా, దర్యావేషు ద్వారా, అర్తహసస్త ద్వారా ఇవ్వబడిన డిక్రీలు ద్వారా ప్రజలు అలాగే సంభరాలతో సంభ్రమాలతో తిరిగి వారి దేశాన్ని చేరుకున్నారు. క్రీ.పూ
538లో, ఇంకా
460-450 లో చాలామంది వచ్చారు. ఆయన పిలిచారు- వీరు వచ్చారు.
ఇక 8,9,10,11 వచనాలలో నేను, నన్ను అనేమాట కనిపిస్తుంది. అది యేసుక్రీస్తు ప్రభులవారిని సూచిస్తుంది.
8లో *నన్ను* అనగా ఆయనే! నన్ను పంపియున్నాడు అనేమాట—దీనికి సాదృశ్యం
Isaiah(యెషయా గ్రంథము) 6:8
8.
అప్పుడునేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని
ప్రభువు సెలవియ్యగా వింటిని. అంతట నేనుచిత్తగించుము నేనున్నాను
నన్ను పంపు మనగా .....
ఇంకా లూకా సువార్త 4:18,19,21
18.
ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను
చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును,
(కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును
19.
ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను.
21.
సమాజ మందిరములో నున్నవారందరు ఆయనను తేరిచూడగా, ఆయననేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను.
8వచనంలో యెహోవా దేవుడు మాట్లాడుతూ సైన్యములకధిపతియగు యెహోవా తనను పంపాడు అని ఉంది- దీని అర్ధం ఏమిటి?
జెకర్యా 2: 8
సైన్యములకు అధిపతియగు యెహోవా
సెలవిచ్చునదేమనగా మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని యెంచి తనకు ఘనత
తెచ్చుకొనదలచి, మిమ్మును దోచుకొనిన అన్యజనులయొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు.
యెహోవా- యెహోవాను
పంపడం ఏమిటి????
కంగారు పడవద్దు. దీనిలో త్రిత్వం కనిపిస్తుంది. మత్తయి ౩:16—17
లో లాగ యెహోవా దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ను అనగా – తండియైన దేవుడుగా ఉన్న యెహోవా, కుమారుడైన దేవుడుగా ఉన్న
యెహోవాను పంపారు.
ఇదేమాట జెకర్యా 4:9 లో, జెకర్యా6:15 లో దృవీకరిస్తున్నారు. ...
దూరముగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయమును కట్టుదురు, అప్పుడు యెహోవా
నన్ను మీ యొద్దకు పంపెనని మీరు తెలిసికొందురు; మీ దేవుడైన యెహోవా
మాట మీరు జాగ్రత్తగా ఆలకించినయెడల ఈలాగు జరుగును.
ఇంకా 8వ వచనంలో మరో ప్రాముఖ్యమైన మాట: మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టిన వాడు అని దేవుడు ఎంచుతున్నారు! ఎంత దొడ్డ మాట కదండీ! ఎవరైనా మనలను హింసిస్తుంటే అది దేవునికి ఎలా ఉంది అంటే ఆయన కనుగుడ్డును ముట్టినట్ట్లుగా భావిస్తున్నారు. ఉదాహరణ చెప్పమంటారా? సౌలు గారు అపోస్తలుడైన పౌలుగా మారకమునుపు దేవుడు పౌలుగారితో ఏమన్నారో చూడండి అపో 9:4 లో
అప్పుడతడు నేలమీదపడి సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను.
ఇశ్రాయేలు వారు, ఇంకా తనను నమ్ముకున్న ప్రజలంటే దేవునికి చాలా ఇష్టం/ ప్రేమ! కాబట్టి వారిని ఎవరైనా బాధిస్తే దేవుడు తననే బాధించినట్లు తనకు వారు ఎదురుతిరిగినట్లు భావిస్తారు.
అందుకే 10వ వచనంలో ఆనంద గీతాలు పాడండి కారణం నేను మీ మధ్య నివాసం చేస్తాను అంటున్నారు.
11వ వచనంలో అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకుని నాకు జనులగుదురు. దీనికి సాదృశ్యంగా జెకర్యా 8:20...
సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా జనములును అనేక
పట్టణముల నివాసులును ఇంకను వత్తురు.
జెకర్యా
14:16
మరియు యెరూషలేముమీదికి వచ్చిన అన్యజనులలో శేషించినవారందరును సైన్యములకు అధిపతియగు
యెహోవాయను రాజునకు మ్రొక్కుటకును పర్ణశాలపండుగ ఆచరించుటకును ఏటేట వత్తురు.
యెషయా 2:2—4, 11:10,12; 14:1; 19:23—25;
23.
ఆ దినమున ఐగుప్తునుండి అష్షూరుకు రాజమార్గ మేర్పడును అష్షూరీయులు ఐగుప్తునకును
ఐగుప్తీయులు అష్షూరున కును వచ్చుచు పోవుచునుందురు ఐగుప్తీయులును అష్షూరీయులును యెహోవాను
సేవిం చెదరు.
24.
ఆ దినమున ఐగుప్తు అష్షూరీయులతోకూడ ఇశ్రాయేలు మూడవ జనమై భూమిమీద ఆశీర్వాద
కారణముగ నుండును.
25.
సైన్యములకధిపతియగు యెహోవా నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పనియైన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా,మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును.
ఇది ఎప్పుడు జరిగింది -జరుగుతుంది అంటే యేసుక్రీస్తుప్రభులవారు సిలువమరణం తర్వాత మీరు సర్వసృష్టికి వెళ్లి సమస్త జనులనుశిష్యులను గా చేయుడి నమ్మి భాపిస్మం పొందువాడు రక్షించబడును...... మత్తయి 28:19; మార్కు 16:15-18;
ఇలా చెప్పాక, ఆ బోధను వినిన మనం ఇప్పుడు ఆయనదగ్గరకు వస్తున్నాము. వచ్చాము. కాబట్టి ఈ విధముగా అన్యజనులమైన మనము ఆయన ప్రజగా మారిపోయి- ఇశ్రాయేలు జనులతో కూడా సహపౌరులము సహవారసులము అయ్యాము.....
ఎఫెసీయులకు 3: 6
ఈ మర్మమేదనగా అన్యజనులు, సువార్త వలన క్రీస్తుయేసునందు, యూదులతోపాటు సమానవారసులును, ఒక శరీరమందలి సాటి అవయవములును,
వాగ్దానములో పాలివారలునైయున్నారను నదియే.
ఇక అప్పటి నుండి మనం
నూతన యెరూషలేముగా కట్టబడుచున్నాము.
అంతేకాకుండా బబులోను
చెర అనగా పాపపు బంధకాలలో మనం కూడా ఉన్నాము అప్పుడు దేవుని ప్రణాళిక వలన మనము ఆయనను
అంగీకరించి నూతన నిభందన ద్వారా యూదులతోపాటు వారసులముగా చేయబడి, ఆ నూతన యెరూషలేములో భాగమైయున్నాము. ఆత్మీయ ఇశ్రాయేలు గా మారాము.
ఇక 12వ వచనంలో ... యూదాను ఇకను కోరుకొనును అనగా ఒకప్పుడు
తిరస్కరించిన దేవుడు ఇప్పుడు మరల కోరుకుంటున్నారు. ఎక్కడైతే మీరు
నా పిల్లలు కాదు అన్నారో అక్కడే నా పిల్లలు అంటున్నారు.....
హోషేయా 1: 10
ఇశ్రాయేలీయుల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును; ఏ స్థలమందు మీరు
నా జనులు కారన్నమాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే మీరు జీవముగల దేవుని కుమారులైయున్నా
రని వారితో చెప్పుదురు.
ఇక ఈ కార్యాలు నెరవేర్చడానికి దేవుడు బయలుదేరాడు కాబట్టి అందరినీ మౌనముగా ఉండమని చెబుతున్నారు.
కాబట్టి ఈ దర్శనంలో యెరూషలేముకు కలుగబోయే భాగ్యము కోసం, ప్రజలను ఆదరించడం జరిగింది. అలాగే దేవుడు నిన్ను నన్ను ఆదరిస్తున్నారు. అన్యజనాంగమైన మనలను కూడా ఆయన ప్రేమిస్తున్నారు. అందుకే నిన్ను నన్ను ఎన్నుకున్నారు. నీమీద నామీద ఎవరైనా తిరగబడి బాదిస్తే తననే బాధించి నట్లు ఆయన భావిస్తారు.
కాబట్టి ధైర్యంగా ఉండు!
గాయపరచువాడు ఆయనే! గాయాన్ని కట్టేవాడు కూడా ఆయనే!
పడగొట్టు వాడు ఆయనే! తిరిగికట్టువాడు ఆయనే!
కాబట్టి ఆయనమీద విశ్వాసంతో ముందుకు సాగిపో!
దైవాశీస్సులు!
*హతస్సాక్షి జెకర్యా-6వ భాగము*
*జెకర్యా దర్శనాలు-4*
*మలిన వస్త్రములు గల ప్రధాన యాజకుడైన యెహోషువా-1*
జెకర్యా ౩:1—5......
1.
మరియు యెహోవా దూతయెదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు,
సాతాను ఫిర్యాదియై అతని కుడిపార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనుపరచెను.
2. సాతానూ,
యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను
యెహోవా నిన్ను గద్దించును ఇతడు అగ్నిలోనుండి తీసిన కొరవివలెనే యున్నాడుగదా అని యెహోవా
దూత సాతానుతో అనెను.
3.
యెహోషువ మలిన వస్త్రములు ధరించినవాడై దూత సముఖములో నిలువబడియుండగా
4. దూత దగ్గర నిలిచియున్నవారిని
పిలిచి ఇతని మైలబట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన
వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను.
5. అతని తలమీద తెల్లని
పాగా పెట్టించుడని నేను మనవిచేయగా వారు అతని తలమీద తెల్లని పాగాపెట్టి వస్త్రములతో
అతనిని అలంకరించిరి; యెహోవా దూత దగ్గర నిలుచుండెను.
ప్రియ దైవజనమా! జెకర్యా గారి దర్శనాలను ధ్యానం చేస్తున్నాం. ఈరోజు 4వ దర్శనాన్ని ధ్యానం చేసుకుందాం!
ఈ దర్శనంలో మనకు ప్రధానయాజకుడైన యెహోషువా- అతనిముందర సాతానుగాడు నిలబడ్డారు.
యెహోషువా మీద సాతానుగాడు పిర్యాదు చేస్తున్నాడు. మరి ఏ పిర్యాదు చేశాడో మనకు వ్రాయబడలేదు.
ఇంతకీ యెహోషువా ఎవరు? అప్పటి ప్రధాన యాజకుడు.హగ్గయి 1:1 లో ఈయనకోసం చెప్పబడింది. అలాగే ఎజ్రా 2:2 లోనే కాకుండా ఎజ్రా గ్రంధంలో చాలా చోట్ల కనిపిస్తారు ఈ యెహోషువా! అయితే ఎజ్రా గ్రంధంలో ఆయన పేరు యేశూవ అని ఉంటుంది. ఇద్దరు ఒక్కరే! పేర్లకు అర్ధం కూడా ఒక్కటే! జెరుబ్బాబెలు గారితోపాటు చెరనుండి వచ్చారు. తర్వాత వచనాలు ప్రకారం ఎంతో నమ్మకమైన వాడు, భక్తిపరుడు అని చూసుకోవచ్చు! కారణం దేవునిచేతనే అగ్నిలోనుండి తీసిన కొరువు వలె ఉన్నాడు కదా అని అనిపించుకున్నారు అంటే నిజంగా ఎంతో భక్తిశ్రద్ధలు కలవాడు అని మనం తెలుసుకోవచ్చు!
అయితే ఇప్పుడు సాతానుగాడు ఇలాంటి వానిమీద పిర్యాదు (కంప్లైంట్) చేస్తున్నాడు. అది ఏమిటో మనకు తెలియదు. గాని తర్వాత వచనాలు ప్రకారం మలిన వస్త్రములు ఉన్నవి అని ఉంది కాబట్టి అతని పాత జీవితం కోసం అయి ఉండవచ్చు! లేదా అభిషేకం పొందుకున్నాక మరల ఏదైనా పాపమలినము అంటించుకుని ఉండవచ్చు. తర్వాత పశ్చాత్తాప పడి ఉండవచ్చు. కారణం దేవునిదూత అగ్నిలోనుండి తీసిన కొలిమిలా ఉన్నాడు కదా అంటున్నాడు. ఏదిఏమైనా మలిన వస్త్రాలు పాప జీవితానికి సాదృశ్యం!
ఒకసారి ఆగి ఆలోచిద్దాం! దీనివలన ఏమని అర్ధమవుతుంది అంటే: సాతానుగాడికి ఏ పని లేదు! కేవలం దేవుని బిడ్డలను ఎలా పాడుచేయాలి అనేది. ఒకవేళ- సాతాను గాడి ప్రలోభాలకు లొంగకుండా ముందుకు దేవునిసేవలో సాగిపోతుంటే ఇప్పుడు ఈ దేవుని బిడ్డమీద ఏదో ఒక పిర్యాదు చేయడమే వీడి పని! ఉదాహరణ యోబు గ్రంధంలో మొదటి రెండు అధ్యాయాలలో వాడు ఎలా యోబుగారి మీద వల పన్నాడో మనకు ఇట్టే అర్ధమవుతుంది. కాబట్టి ప్రియమైన దైవ సేవకుడా! సంఘపెద్డా! విశ్వాసి! నీమీద నామీద సాతాను గాడి కన్ను 24x7 ఉంటూనే ఉంటుంది. మనలో ఏ చిన్న పొరపాటు కనిపించిన వాడి సీసీ టీవీలో రికార్డ్ చేసి- దేవుని ముందు ప్లే చేస్తూ ఉంటాడు. కాబట్టి భయము నొంది పాపము చేయకుండా మన ఘటములను కాపాడుకుంటూ ఉండాలి. దేవుని బిడ్డలను సాతానుగాడే కాకుండా, లోకము, ప్రజలు 24 గంటలు గమనిస్తూ ఉంటారు కాబట్టి మన నోటిని, ప్రవర్తనను ఎల్లప్పుడూ జాగ్రత్తగా చూసుకుంటూ, యేసయ్య బిడ్డలకు మాదిరిగా నడుచుకుంటూ పోవాలని యేసయ్య పేరిట మనవిచేస్తున్నాను!
రెండవ వచనంలో వాడి పిర్యాదుకు యెహోవా దూత, సాతాను గాడితో యెహోవా నిన్ను గద్ధించును గాక అంటున్నారు. యితడు అగ్నిలో నుండి తీసిన కొరివి లాగ ఉన్నాడు కదా! ఎందుకు ఇలా కంప్లైట్ చేస్తున్నావు అంటున్నాడు యెహోవా దూత!
ఇక యెరూషలేమును కోరుకున్న యెహోవా నిన్ను గద్ధించును గాక అంటున్నారు. కారణం వీడు కేవలం
ప్రధాన యాజకుని మీద మాత్రమే కాకుండా యావత్ యేరూషలేము మీద పిర్యాదు చేస్తున్నాడు.
అంతేకాకుండా 8వ వచనంలో యెహోషువ ని నీవు నీ సహకారుల
ఎదుట సూచనగా ఉన్నావు అంటున్నారు. కాబట్టి మొత్తం యేరూషలేము నకు
ప్రతిగా ఉన్నాడు కాబట్టి యేరూషలేమును కోరుకున్న యెహోవా అంటున్నాడు దూత! అవును దేవుడు యేరూషలేమును తనకు ప్రతిష్టిత స్థలముగా కోరుకున్నారు.
జెకర్యా 1:17;
నీవు ఇంకను ప్రకటన చేయవలసినదేమనగా ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును, ఇంకను యెహోవా సీయోనును
ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును.
జెకర్యా 2: 12
మరియు తనకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశములో యూదాను స్వతంత్రించు కొనును, యెరూషలేమును ఆయన
ఇకను కోరుకొనును.
ఇక అగ్నిలోనుండి అనగా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఒక అర్ధం పాపము
నుండి దేవుడు రక్షించారు అనియు, శ్రమలలో పరీక్షించి తీయడం అనికూడా వస్తుంది.
కాబట్టి ఇక్కడ మనం మొదటి అర్థాన్నే తీసుకుందాం! పాపమును నుండి తీసి కడగబడిన విశ్వాసి ప్రతీఒక్కరు ఇలాంటి వారే! యూదా 1:23...
అగ్నిలోనుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన
వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పుకొనక దానిని (మూలభాషలో-
శరీరమువలన డాగుపడిన అంగీని) అసహ్యించుకొనుచు భయముతో
కొందరిని కరుణించుడి.
ఆ రక్షణను నిలబెట్టుకుంటే నిత్యరాజ్యము, ఆ రక్షణను పోగొట్టుకుంటే నిత్య నరకము. ప్రకటన 21:8... ఇక్కడ యెహోషువా గారు ఇశ్రాయేలునకు ప్రతినిధిగా ఉన్నారు. అందుకే ఈ మాట అంటున్నారు దేవుడు. ఆమోషు 4:11......
దేవుడు సొదొమ గొమొఱ్ణాలను బోర్లదోసి
నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనముచేయగా మీరు మంటలోనుండి తీయబడిన కొరవులైనట్టు
తప్పించు కొంటిరి; అయినను మీరు నా తట్టు
తిరిగినవారు కారు; ఇదే యెహోవా వాక్కు.
ఇక తర్వాత వచనంలో ఆయన అనగా యెహోషువా వస్త్రాలు మురికిగా ఉన్నట్లు కనబడుతుంది. మలిన వస్త్రాలు అనగా మన యొక్క పాప జీవితాన్ని సూచిస్తున్నాయి.
యెషయా
64:6.....
మేమందరము అపవిత్రులవంటివారమైతిమి మా నీతిక్రియలన్నియు మురికిగుడ్డవలె నాయెను మేమందరము
ఆకువలె వాడిపోతిమి గాలివాన కొట్టుకొనిపోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొనిపోయెను
రోమా ౩:23.....
ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.
ఎఫేసి 2:౩
వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి
మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు
పాత్రులమై(మూలభాషలో-ఉగ్రత పిల్లలమై)
యుంటిమి.
మనం చేసే భక్తి, ఆచారాలు దేవుని దృష్టికి మురికి గుడ్డలా కనిపిస్తున్నాయి. మన సొంతభక్తి చేత, పుణ్యకార్యాల వలన చేసే ఆచారాల వలన మనం నీతిమంతులుగా తీర్చబడలేము. దీనినే పౌలు భక్తుడు రోమా పత్రికలో విస్తారంగా చెబుతున్నారు. కేవలం ఆయన కుమారుని యందు విశ్వాసముంచి, ఆయన ద్వారానే ఆయనయందు విశ్వాసముంచడం వలననే మనం నీతిమంతులుగా తీర్చబడగలం!....
రోమీయులకు 3: 20
ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన
క్రియలమూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది.
రోమీయులకు 3:
24
కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా
నీతిమంతులని తీర్చబడుచున్నారు.
తీతుకు 3: 5
మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే
పునర్జన్మ సంబంధమైన (పునఃస్థితిస్థాపన సంబంధమైన) స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట
ద్వారాను మనలను రక్షించెను.
కాబట్టి ప్రియ దైవజనమా! మనం కేవలం దేవునియందలి విశ్వాసం మూలంగానే, ఆయన కృపచేతనే నీతిమంతులవుతాము తప్ప మన సొంత నీతి కార్యాలు ద్వారా కానేకాదు.
(ఇంకాఉంది)
*హతస్సాక్షి జెకర్యా-7వ భాగము*
*జెకర్యా దర్శనాలు-4*
*మలిన వస్త్రములు గల ప్రధాన యాజకుడైన యెహోషువా-2*
జెకర్యా ౩:1—5......
1.
మరియు యెహోవా దూతయెదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు,
సాతాను ఫిర్యాదియై అతని కుడిపార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనుపరచెను.
2. సాతానూ,
యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను
యెహోవా నిన్ను గద్దించును ఇతడు అగ్నిలోనుండి తీసిన కొరవివలెనే యున్నాడుగదా అని యెహోవా
దూత సాతానుతో అనెను.
3.
యెహోషువ మలిన వస్త్రములు ధరించినవాడై దూత సముఖములో నిలువబడియుండగా
4. దూత దగ్గర నిలిచియున్నవారిని
పిలిచి ఇతని మైలబట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన
వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను.
5. అతని తలమీద తెల్లని
పాగా పెట్టించుడని నేను మనవిచేయగా వారు అతని తలమీద తెల్లని పాగాపెట్టి వస్త్రములతో
అతనిని అలంకరించిరి; యెహోవా దూత దగ్గర నిలుచుండెను.
(గతభాగం తరువాయి)
*ఇక్కడ మరో విషయం చెప్పనీయండి మొదటి అధ్యాయం నుండి ఇంతవరకు అనగా మూడవ అధ్యాయం వరకు ఈ యెహోవా దూతను పరిశీలిస్తే ఈయన యేసుక్రీస్తు ప్రభులవారే అనిపిస్తుంది. కారణం ఇక్కడ నీ పాపములను పరిహరించి ప్రశస్త వస్త్రములతో నిన్ను అలంకరిస్తున్నాను అంటున్నారు. అనగా పాపములను తీసివేసే అధికారం- మనం సువార్తలు ప్రకారం కేవలం మనుష్యకుమారునికి అనగా యేసుక్రీస్తుప్రభులవారికే ఉంది కాబట్టి ఈయన యేసుక్రీస్తు ప్రభులవారు అని మనం అనుకోవచ్చు! మార్కు 2:10; లూకా 5:24; అనగా ఆదికాండం 16:7 లో కనిపించిన వాడు, 31:11—13 లో కనిపించినవాడు, నిర్గమ ౩:2—6 లో కనిపించిన వాడు, ఇంకా చాలా సందర్భాలలో కనిపించిన వాడు యేసుక్రీస్తుప్రభులవారే అని గ్రహించవచ్చు! కారణం పై సందర్బాలలో తనే దేవుడు- యెహోవా అన్నట్లుగా దేవుని మాటలను చెప్పడం జరిగింది.
సరే, ఎప్పుడైతే ఆయన క్రొత్త బట్టలు ప్రశస్తవస్త్రములు ఇవ్వమని చెప్పారో వెంటనే ఆ దూతలు యెహోషువా గారికి నూతన వస్త్రములు ధరింపజేశారు. దీని ఆత్మీయార్ధం ఏమిటంటే మలిన జీవితాన్ని దేవుడు మార్చివేసి నూతన జీవితం, పవిత్ర జీవితం దయచేసి దేవుని నీతిని కట్టబెట్టడం అన్నమాట!
8వ వచనం ప్రకారం యెహోషువా వీరందిరికి సూచనగాను ప్రతినిధిగాను ఉన్నారు కాబట్టి మొత్తం ఇశ్రాయేలు జాతిని దేవుడు విమోచించి వారికి దేవుని నీతిని ప్రసాదిస్తున్నట్లు మనం అర్ధం చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనకు/ ఇశ్రాయేలు వారికి/ దేవుని సేవకునికి/ దేవుని బిడ్డకు నూతన పవిత్ర వస్త్రాలున్నాయి కాబట్టి ఎలా పడితే అలా జీవించకూడదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసలుకోవాలి. కారణం వీరి బట్టలు ఎంతో శ్రేష్టమైనవి. మన వస్త్రములకు పాపమనే డాగులు, కళంకం అంటకుండా చూసుకోవలసిన భాద్యత మనదే! దానినే యాకోబు 1:27 లో ఇహలోక మాలిన్యం తమ ఘటములకు అంటకుండా చూసుకోవడం! అదే నిజమైన భక్తి! అందుకే కొలస్సీ ౩:9—10 లో అంటున్నారు పౌలుగారు.....
9.
ఒకనితో ఒకడు అబద్ధ మాడకుడి; ఏలయనగా ప్రాచీన స్వభావమును
(ప్రాచీన పురుషుని)దాని క్రియలతో కూడ
10.
మీరు పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని
సృష్టించినవాని పోలికచొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొనియున్నారు.
ఇంకా జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ నూతన వస్త్రములు దేవుని నీతిన్యాయాలు కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి.
ఫిలిప్పీ ౩:9.
క్రీస్తును సంపాదించుకొని, ధర్మశాస్త్రమూలమైన నా
నీతినిగాక, క్రీస్తునందలి విశ్వాసమువలననైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతిగలవాడనై ఆయనయందు అగపడు నిమిత్తమును,
..
2కొరింథీ 5:21
ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను.
సరే, ఇక ప్రశస్త వస్త్రముల తర్వాత జెకర్యా గారు అతని తలమీద తెల్లని పాగా పెట్టించమని మనవి చేసినట్లు చూస్తున్నాం. వెంటనే ఆయనకు తెల్లని పాగా కూడా పెట్టారు. గమనించాలి ఈ పాగా: యాజకధర్మానికి సూచనగా ఉంది నిర్గమ 28:౩—4,36 ప్రకారం. కాబట్టి వీరు అనగా యాజకులు చేయవలసిన పవిత్రమైన ఆచారాలు- అర్పణలు చేసినప్పుడు ఈ పాగా తప్పకుండా ఉండాలి. అయితే యాజకులు అనగా కేవలం దేవునిసేవ చేసే దైవసేవకుల కోసమే ఈ పవిత్రమైన జీవిత విధానం పాటించాలి అనుకుంటే తప్పులో కాలేశారు జాగ్రత్త! 1 పేతురు 2:9 ప్రకారం మనము రాజులైన యాజక సమూహముగా చేయబడ్డాము. కాబట్టి రక్షించబడిన ప్రతీ వ్యక్తి తన జీవితానికి తన ఆత్మకు మలినం అంటకుండా పాపం అంటకుండా జాగ్రత్తగా చూసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. 1పేతురు 2: 9
అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని
గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన
యాజక సమూహమును, పరిశుద్ధ జననమును, దేవుని
సొత్తైన ప్రజలునైయున్నారు.
ఇది జరిగాక 6—10 వచనాలలో వ్రాయబడిన సంగతులు ఎంతో శ్రేష్టమైనవి.
6. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఈలాగు
ఆజ్ఞ ఇచ్చెను.
7. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగానా
మార్గములలో నడుచుచు నేను నీ కప్పగించిన దానిని భద్రముగా గైకొనిన యెడల, నీవు నా మందిరముమీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు; మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీ కిత్తును.
8. ప్రధానయాజకుడవైన యెహోషువా,
నీ యెదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు; నీవును వారును నా మాట ఆలకింపవలెను, ఏదనగా చిగురు అను
నా సేవకుని నేను రప్పింపబోవుచున్నాను.
9. యెహోషువ యెదుట నేనుంచిన రాతిని తేరి
చూడుడి, ఆ రాతికి ఏడు నేత్రములున్నవి, దాని
చెక్కడపు పని చేయువాడను నేను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా
వాక్కు; మరియు ఒక దినము లోగానే నేను ఈ దేశముయొక్క దోషమును పరిహరింతును;
10. ఆ దినమున ద్రాక్షచెట్ల క్రిందను
అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండుటకు మీరందరు ఒకరినొకరు పిలుచుకొని పోవుదురు;
ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.
ఇక్కడ మొదటగా యెహోవా దూత అనగా యేసుక్రీస్తుప్రభులవారు
క్రొత్త కమిషన్/ ఆర్డర్ ఇస్తున్నారు ఇక్కడ యెహోషువా
గారికి!
7... సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగానా
మార్గములలో నడుచుచు నేను నీ కప్పగించిన దానిని భద్రముగా గైకొనిన యెడల, నీవు నా మందిరముమీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు; మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీ కిత్తును.
అయితే దానిని చేసేముందు యెహోషువా
గారు నమ్మకంగా పవిత్రంగా జీవించవలసిన అవసరముంది.
రోమా 12:1—2
1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని
దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి
సేవ మీకు యుక్త మైనది.
2. మీరు ఈ లోక( లేక, ఈ యుగ) మర్యాదను అనుసరింపక,
ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న
దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము
పొందుడి.
ఎఫెసీయులకు 4: 2
మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా
దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,
ఎప్పుడైతే అలా చేస్తావో అప్పుడు నీవు నా ఆలయం మీద అధికారిగా ఉంటావు. నా ఆవరణాలు కాపాడువాడుగా ఉంటావు. అంతేకాకుండా శ్రేష్టమైన మాట:*ఇక్కడ నిలువబడిన వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును*! హల్లెలూయ! అందుకే కదండీ మనకీ చప్పిడి పథ్యం! ఒకరోజు దేవుని కలుసుకుని ఆయనరాజ్యంలో ఆయనతోపాటు నివాసం చెయ్యాలి. ఆయన విందులో పాల్గోవాలి అనేకదా అన్నీ మానుకుని మూసుకుని దేవుని సన్నిధిలో భక్తిగా ఉండటం. లేకపోతే మనం కూడా అన్యుల వలెనే ప్రవర్తించవచ్చు. ఆ భాగ్యం కావాలంటే ఈ చప్పిడి పథ్యం తప్పదు! ఇదేమాట దానియేలు గారికి కూడా చెప్పారు దేవుడు. దానియేలు
12: 13
నీవు అంత్యము వరకు నిలకడగా ఉండినయెడల విశ్రాంతి నొంది కాలాంత మందు నీ వంతులో నిలిచెదవు.
దేవుడు కేవలం యెహోషువాగారికే కాదు,
దానియేలు గారికే కాదు నీకు నాకు మనందరికీ ఇస్తున్నారు. ఆ భాగ్యం అనగా దేవదూతలు ఎలా దేవుని సన్నిధిలో నిల్చుంటున్నారో అలాగే నీవుకూడా
దేవునిసన్నిధిలో నిత్యమూ జీవించవచ్చు. ఎప్పుడూ ఆయన చెప్పినట్లు
చేసి- మన సాక్ష్యము, ఘటము కాపాడుకున్నప్పుడు!!!
ఇక తర్వాత వచనంలో బహుశా దేవుడే పరవశుడై పలికినట్లు ఉంది: ఓ ప్రధాన
యాజకుడవైన యెహోషువా! నీవును నీ ఎదుట నీ సహకారులును సూచనలుగా ఉన్నారు. వారును నీవును నా మాట ఆలకించాలి.
ఏమిటంటే నా చిగురు అనే సేవకున్ని రప్పించబోతున్నాను......
మొదటగా సూచనలుగా ఉన్నారు అనేదానిని చూసుకుంటే
యెషయా 8:18
ఇదిగో, నేనును, యెహోవా నా కిచ్చిన పిల్లలును, సీయోను కొండమీద నివసించు సైన్యముల కధిపతియగు యెహోవావలని సూచనలుగాను,
మహత్కార్యములు గాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము.
యెహేజ్కేలు
12: 11
కాబట్టి వారికీమాట చెప్పుమునేను మీకు సూచనగా ఉన్నాను, నేను సూచించినది
వారికి కలుగును, వారు చెరలోనికి పోయి దేశాంతర నివాసులగుదురు
కాబట్టి దేవుని సేవకులు సూచనలుగా ఉన్నారు. వారి జీవితాలను సూచనలుగా పెట్టి దేవుడు తన సంఘానికి భోధిస్తూ ఉంటారు. ఇంకా కొరింథీ ప్రకారం ఈ సంగతులు వారికి సంభవించి ఈ యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిఉన్నాయి.....1కోరింథీయులకు
10: 11
ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంత మందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను.
కాబట్టి ప్రియ సేవకుడా! నీవు మాదిరిగా జీవించి, నీ సంఘాన్ని కూడా అదేబాటలో నడిపించు.
దైవాశీస్సులు!
(ఇంకాఉంది)
*హతస్సాక్షి జెకర్యా-8వ భాగము*
*జెకర్యా దర్శనాలు-4*
*మలిన వస్త్రములు గల ప్రధాన యాజకుడైన యెహోషువా-౩*
జెకర్యా ౩:7--10
7.
సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగానా మార్గములలో నడుచుచు
నేను నీ కప్పగించిన దానిని భద్రముగా గైకొనిన యెడల, నీవు నా మందిరముమీద
అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు; మరియు ఇక్కడ నిలువబడు
వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీ కిత్తును.
8.
ప్రధానయాజకుడవైన యెహోషువా, నీ యెదుట కూర్చుండు
నీ సహకారులు సూచనలుగా ఉన్నారు; నీవును వారును నా మాట ఆలకింపవలెను,
ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోవుచున్నాను.
9.
యెహోషువ యెదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి, ఆ
రాతికి ఏడు నేత్రములున్నవి, దాని చెక్కడపు పని చేయువాడను నేను.
ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు; మరియు
ఒక దినము లోగానే నేను ఈ దేశముయొక్క దోషమును పరిహరింతును;
10.
ఆ దినమున ద్రాక్షచెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండుటకు
మీరందరు ఒకరినొకరు పిలుచుకొని పోవుదురు; ఇదే సైన్యములకు అధిపతియగు
యెహోవా వాక్కు.
(గతభాగం తరువాయి)
ఇక ఈ వచనంలో *చిగురు లేదా కొమ్మ* అనే మాట కనిపిస్తుంది. అది రాబోయే యేసుక్రీస్తు ప్రభులవారి మొదట రాకడ కోసం వ్రాయబడియుంది అని గ్రహించాలి. జెకర్యా 6:12
అతనితో ఇట్లనుము సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా చిగురు అను ఒకడు
కలడు; అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము
కట్టును.
యెషయా 4:2
ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూష ణమునగును. ఇశ్రాయేలులో తప్పించుకొనినవారికి భూమిపంట
అతిశయాస్పదముగాను శుభలక్షణము గాను ఉండును.
యెషయా 11:1
యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును వాని వేరులనుండి అంకురము ఎదిగి ఫలించును
యిర్మియా
23:5
యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడురాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును
పుట్టించెదను; అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు
కార్యము జరిగించును, భూమిమీద నీతి న్యాయములను జరిగించును.
యిర్మియా ౩౩:15
ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతిచిగురును మొలిపించెదను; అతడు భూమిమీద నీతి
న్యాయములను అనుసరించి జరిగించును.
ప్రకటన గ్రంథం 22: 16
సంఘములకోసము(మూలభాషలో సంఘములమీద) ఈ సంగతులనుగూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు
యేసు అను నేను నా దూతను పంపి యున్నాను. నేను దావీదు వేరుచిగురును
సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కయునై యున్నాను.
మరో విషయం గమనించాలి యేసుక్రీస్తుప్రభులవారినే ఇక్కడ
*నా సేవకుడు* అనికూడా చెబుతున్నారు. అనగా ఆయన అభిషక్తుడే కాకుండా సేవకుడు కూడా! అందుకే ఆయన శిష్యుల పాదములు
కడిగారు. ...యోహాను 13:5--14;
ఇంకా ఈ క్రింది వచనాలు చూడండి
యెషయా 49:5—6
5.
యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని నా దేవుడు నాకు బలమాయెను కాగా తనకు
సేవకుడనైయుండి తనయొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇశ్రాయేలు ఆయనయొద్దకు సమకూర్చబడుటకు
నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఈలాగు సెల విచ్చుచున్నాడు
6.
నీవు యాకోబు గోత్రపువారిని ఉద్ధరించునట్లును ఇశ్రాయేలులో తప్పింపబడినవారిని
రప్పించునట్లును నా సేవకుడవై యుండుట ఎంతో స్వల్పవిషయము; భూదిగంతములవరకు
నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై యుండునట్లు నిన్ను నియమించి
యున్నాను.
యెషయా 52:13
ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహా ఘనుడుగా
ఎంచబడును.
యెషయా 53:11
అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను
భరించి నకున్న అనుభవజ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును.
రోమా 15:8
నేను చెప్పునదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును,
అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి(
సున్నతి యొక్క) గలవారికి పరిచారకుడాయెను.
మత్తయి 20:
28
ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును
అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను.
కాబట్టి ఆ సేవకుడు యేసుక్రీస్తు ప్రభులవారే!
ఇక తర్వాత చెబుతున్న విషయం:
నేను యెహోషువా ఎదుట ఉంచిన *రాతిని* చూడండి. దానికి ఏడు నేత్రములున్నాయి.....
ఇక్కడ చెప్పిన
*రాయి* కూడా యేసుక్రీస్తుప్రభులవారినే సూచిస్తుంది.
అభిషక్తుడు లేక మెస్సయ్యకి గల పేర్లలో ఇది ఒకటి.
కీర్తనలు
118: 22—23
22.
ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను.
23.
అది యెహోవావలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము
యెషయా 8:13—15
13.
సైన్యములకధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడను కొనుడి మీరు భయపడవలసినవాడు
ఆయనే, ఆయన కోసరమే దిగులుపడవలెను అప్పుడాయన మీకు పరిశుద్ధస్థలముగా
నుండును.
14.
అయితే ఆయన ఇశ్రాయేలుయొక్క రెండు కుటుంబ ములకు తగులు రాయిగాను అభ్యంతరము
కలిగించు బండగాను ఉండును యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కువలగాను ఉండును
యెషయా 28:16
ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు సీయోనులో పునాదిగా రాతిని వేసినవాడను
నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాదియైన మూలరాయియైయున్నది
విశ్వసించువాడు కలవరపడడు.
దానియేలు
2:34,35,45
34.మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి, యినుమును మట్టియు
కలిసిన ఆ ప్రతిమయొక్క పాదములమీద పడి దాని పాదములను తుత్తునియలుగా విరుగగొట్టినట్టు
తమకు కనబడెను.
35.అంతట ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్లములోని
చెత్తవలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండ గాలి వాటిని కొట్టుకొనిపోయెను;
ప్రతిమను విరుగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయెను.
45.చేతి సహాయము లేక పర్వతమునుండి
తియ్యబడిన ఆ రాయి యినుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరే; యిందువలన మహాదేవుడు
ముందు జరుగబోవు సంగతి రాజునకు తెలియజేసియున్నాడు; కల నిశ్చయము,
దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పెను.
మత్తయి 21:42,44
42.
మరియు యేసు వారిని చూచిఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి
ఆయెను. ఇది ప్రభువువలననే కలిగెను. ఇది మన
కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడును చదువ లేదా?
44.
మరియు ఈ రాతిమీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవనిమీద పడునోవానిని
నలిచేయుననెను.
ఎఫెసి 2:19—22
20.
క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియైయుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన
పునాదిమీద మీరు కట్టబడియున్నారు.
21.
ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు
పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధిపొందుచున్నది.
22.ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమైయుండుటకు కట్టబడుచున్నారు.
కాబట్టి ఇవన్నీ మన యేసుక్రీస్తు ప్రభులవారినే సూచిస్తున్నాయి. ఇంకా రాతికి *ఏడు నేత్రములున్నాయి* అంటున్నారు. దీనికోసం చూసుకుంటే ఏడు సంపూర్ణ సంఖ్య. అనగా ఆయన భూదిగంతాలను చూస్తున్నారు గమనిస్తున్నారు అని అర్ధం వస్తుంది. లేదా అభిషక్తునిలో ఉండే దేవుని ఆత్మ సంపూర్ణతకు సూచన కావచ్చు!
ప్రకటన 5:6
6.
మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవుల కును పెద్దలకును మధ్యను,
వధింపబడినట్లుండిన గొఱ్ఱెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొఱ్ఱెపిల్లకు ఏడు కొమ్ములును ఏడు కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి యందంతటికి పంపబడిన దేవుని యేడు ఆత్మలు.
యెషయా 11:2—3
2.
యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ
తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును
3.
యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును.
ఇక తర్వాత చెప్పబడిన మాట బహు శ్రేష్టమైనది. *ఒక్కరోజులోనే నేను ఈ దేశము యొక్క అనగా ఇశ్రాయేలు దేశముయొక్క దోషమును పరిహరిస్తాను* అంటున్నారు. గమనించాలి మా గ్రామంలో పుట్టిన గురజాడ అప్పారావు గారు అన్నారు- దేశమంటే మట్టికాదోయ్- దేశమంటే మనుషులోయ్! అనగా దేశముయొక్క దోషము అనగా దేశస్తుల యొక్క దోషమును ఒక్కరోజులోనే తీసేస్తాను లేక పరిహరిస్తాను అంటున్నారు. ఆయన చెప్పారు నిజంగా ఆ కలువరి సిలువలో ఆయన యవ్వన రక్తాన్ని కార్చి కేవలం ఇశ్రాయేలు వారియొక్క దోషములనే కాకుండా సర్వమానవాళి పాపములను ఒక్కనాడే పరిహరించారు. అయితే ఆయన పరిహారం అయితే చేశారు గాని ఇశ్రాయేలు వారికి గాని, అన్యులకు గాని దోష నివారణ జరిగిందా అంటే: వారు అనగా ఇశ్రాయేలు వారు గాని, ఎవరైనా ఎప్పుడైతే నిజమైన పశ్చాత్తాపం కలిగి హృదయపూర్వకముగా కన్నీరు విడిచి ఆయన వద్దకు వచ్చి క్షమాపణ కోరుతారో అప్పుడే , ఆరోజునే వారికీ క్షమాపణ లభ్యమవుతుంది. దేవుని మహాకృప వలన మనం పొందుకున్నాము గాని ఇశ్రాయేలు వారు, ఇంకా మన ఇరుగుపొరుగు వారు పొందుకోలేదు. అయితే ఒకరోజు ఇశ్రాయేలు వారు పొందుకుంటారు ఇద్దరు సాక్షుల బోధను ఆలకించి కొందరు, అంత్యక్రీస్తు నాశనకరమైన హేయవస్తువును బలిపీటం మీద అర్పించినప్పుడు తప్పు తెలుసుకుని, నిజం తెలుసుకుని ఇశ్రాయేలు వారు మొర్రపెడతారు. విలపిస్తారు. అప్పుడు వారు రక్షణ పొందుకుని ఆరోజు వారి దోషములకు పరిహారం కలుగుతుంది.
జెకర్యా
12:10—14
10.
దావీదు సంతతివారిమీదను యెరూషలేము నివాసులమీదను కరుణ నొందించు ఆత్మను
విజ్ఞాపనచేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నామీద(వాని) దృష్టియుంచి, యొకడు తన యేక
కుమారుని విషయమై దుఃఖించునట్లు,తన జ్యేష్ఠపుత్రుని విషయమై యొకడు
ప్రలా పించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు.
11.
మెగిద్దోను లోయలో హదదిమ్మోనదగ్గర జరిగిన ప్రలాపమువలెనే ఆ దినమున యెరూషలేములో
బహుగా ప్రలాపము జరుగును.
12.
దేశనివాసులందరు ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు, దావీదు కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను,
నాతాను కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు
ప్రత్యేకముగాను,
13.
లేవి కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు
ప్రత్యేకముగాను, షిమీ కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను,
14.
మిగిలిన వారిలో ప్రతి కుటుంబపువారు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, ప్రలాపింతురు.
ఇంకా చివరి వచనంలో జెకర్యా
3: 10
ఆ దినమున ద్రాక్షచెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండుటకు మీరందరు ఒకరినొకరు
పిలుచుకొని పోవుదురు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.
ఆకాలంలో అంటే వారు రక్షణ పొందుకునే దినాలలో ద్రాక్షచెట్లు అంజూరపు చెట్ల క్రింద కూర్చోడానికి పిలుస్తారు అనగా అంజూరపు చెట్లు భద్రతకు సహవాసానికి, ఇంకా క్రొత్త నిబంధన ప్రకారం దేవునిరాకడకు సిద్దపాటు కు సాదృశ్యం, ద్రాక్ష చెట్లు సంతోషానికి, మధురానికి, దేవునితో సహవాసానికి, దేవుని కల్వరి ప్రేమకు సాదృశ్యంగా ఉన్నాయి. అనగా అప్పుడు మీకు శాంతి సమాధానం భద్రత కలుగుతుంది అని అర్ధం!
మీకా 4:4
ఎవరి భయములేకుండ ప్రతివాడును
తన ద్రాక్షచెట్టుక్రిందను తన అంజూరపు చెట్టుక్రిందను కూర్చుండును; సైన్యములకధిపతియగు
యెహోవా మాట యిచ్చియున్నాడు.
1రాజులు 4:25
సొలొమోను దినములన్నిటను ఇశ్రాయేలువారేమి యూదా వారేమి దాను మొదలుకొని బెయేర్షెబా
వరకును తమ తమ ద్రాక్షచెట్ల క్రిందను అంజూరపుచెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి.
ప్రియ దైవజనమా! అటువంటి భద్రతా అటువంటి శాంతి సమాధానాలు నీకు కావాలంటే నేడే నీవుకూడా ఆయన హస్తములలోనికి ఆయన రెక్కల నీడలోనికి రా! నీకు కూడా అటువంటి శాంతి భద్రతలతో పాటు ఒకే రోజున నీకు నీపాపాలకు పరిహారం కూడా దొరుకుతుంది. మత్తయి 11: 28
ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును.
మరి వస్తావా?
దైవాశీస్సులు!
*హతస్సాక్షి జెకర్యా-9వ భాగము*
*జెకర్యా దర్శనాలు-5*
*దీప స్తంభం- రెండు ఒలీవచెట్లు-1*
జెకర్యా 4:1—5......
1.
నాతో మాటలాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన యొకని లేపినట్లు నన్ను
లేపి
2.
నీకు ఏమి కనబడుచున్నదని యడుగగా నేను సువర్ణమయమైన దీపస్తంభమును దానిమీద
ఒక ప్రమిదెయును, దీపస్తంభమునకు ఏడు దీపములును దీపమునకు ఏడేసి
గొట్టములును కనబడుచున్నవి.
3.
మరియు రెండు ఒలీవచెట్లు దీపస్తంభమునకు కుడిప్రక్క ఒకటియు ఎడమప్రక్క ఒకటియు
కనబడుచున్నవని చెప్పి
4.
నా యేలినవాడా, యిదేమిటియని నాతో మాటలాడుచున్న దూత
నడిగితిని.
5.
నాతో మాటలాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదాయని నన్నడుగగానేను--నా యేలినవాడా, నాకు తెలియదంటిని.
ప్రియ దైవజనమా! జెకర్యా గారి దర్శనాలను ధ్యానం చేస్తున్నాం. ఈరోజు 5వ దర్శనాన్ని ధ్యానం చేసుకుందాం! గత దర్శనంలో యెహోషువా గారు కనిపిస్తే ఈ దర్శనంలో జెరుబ్బాబెలు కోసం చెప్పబడుతుంది.
మొదటి వచనంలో నాతో మాట్లాడుచున్న దూత అనగా మొదటి అధ్యాయం నుండి తనతో మాట్లాడుచున్న దూత అని అర్ధం చేసుకోవాలి. గమనించాలి ఇది 5వ దర్శనం. ఈ దర్శనాలు అన్నీ ఒకేరోజు కలిగాయి. తర్వాత మాటలలో నిద్రపోవుచున్న వానిని లేపినట్లు నన్ను లేపారు అంటున్నారు జెకర్యా గారు. ఏం ఇలా అంటున్నారు అంటే: జెకర్యా గారు చూసినవి కలలు కాదు దర్శనాలు. ఆయన నిద్రపోవటం లేదు. ప్రార్ధనలో కనిపెడుతూ ఉంటే ఆత్మవశుడవ్వగా దేవుడు చూపిస్తున్న దర్శనాలు అని గ్రహించాలి. మరి ఎందుకు లేపుతున్నారు అంటే పూర్తి మెలుకువ స్పృహలో ఉంది జాగ్రత్తగా ఈదర్శనాన్ని చూడమని కావచ్చు!
షరామామూలే—జెకర్యా నీకు ఏమి కనిపిస్తుంది అంటే నాకు ఒక బంగారు దీపస్తంభము కనిపిస్తుంది. దానిమీద నూనెపాత్ర ఉంది. స్తంభానికి ఏడు దీపాలున్నాయి. అనగా ఒక స్తంభం ఉంది. దానికి అన్నిప్రక్కల ఏడు దీపాలు తగిలించి ఉన్నాయన్నమాట! దీపాలకు ఏడు గొట్టాలున్నాయి. దాని ప్రక్కనే రెండు ఒలీవ చెట్లు కూడా ఉన్నాయి అన్నారు.
దీప స్తంభము వెలుగునివ్వడాన్ని సూచిస్తుంది. అక్కడ నూనె కూడా పాత్రలో ఉంది. కాబట్టి బహుశా దేవుని సేవకులు బిడ్డలు ఆత్మతో నింపబడి లోకానికి వెలుగుగా ఉండాలని భావం కావచ్చు. మీరు లోకానికి వెలుగు..... మత్తయి 5:14,15,16
14.
మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండమీదనుండు పట్టణము
మరుగై యుండనేరదు.
15.
మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది యింటనుండువారికందరికి
వెలుగిచ్చుటకై దీపస్తంభముమీదనే పెట్టుదురు.
16.
మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు
వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి. ..
ఇంకా ఆ రెండు ఒలీవ మొక్కలు కోసం రెండు అర్ధాలు కనిపిస్తాయి.
మొదటిది: రెండు ఒలీవ చెట్లు ఇద్దరు వ్యక్తులు. 12—14 వచనాల ప్రకారం వీరిద్దరి ద్వారా నూనె ఆ దీపాలకు సరఫరా అవుతుంది. కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తులు ఒకరు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు అనగా అప్పటి గవర్నర్! రెండవది ప్రధానయాజకుడైన యెహోషువా! జెరుబ్బాబెలు గారు దావీదు వంశమునకు చెందినవారు కాబట్టి రాజరికానికి అధికారానికి సూచనగా ఉండగా, యెహోషువా గారు యాజకుడు కాబట్టి యాజకత్వానికి సూచనగా ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరి పని వీరు వెలుతుగూ ఉండి ఇశ్రాయేలు ప్రజలను కాపాడుతూ వెలుగునిస్తూ దేవుని బాటలో నడిపించాలి అలా సమస్త జనులను పురికొల్పాలి. మత్తయి 5:14.. ఇది మొదటి అభిప్రాయం!
రెండవ అర్ధం దేవదూత చివరిలో చెప్పిన అర్ధం. దీనిని చివరిలో ధ్యానం చేద్దాం!
ఇక దీని లోని అనగా ఈ దర్శనంలో గల దీపస్తంభం మరియు ఒలీవ మొక్కలు లో ఆత్మీయ భావాన్ని కూడా ధ్యానం చేద్దాం! ఆ కాలంలో రాజరికం- యాజకత్వం ఇద్దరికి ఇచ్చారు దేవుడు. అయితే నేటికాలంలో ప్రతీ దైవజనుడిని, విశ్వాసిని రాజులైన యాజక సమూహముగా చేసుకున్నారు, పరిశుద్ధ జనముగా తన సొత్తైన ప్రజగా చేసుకున్నారు..... మరి ఇప్పుడు ప్రతీ దైవజనుడు, ప్రతీ సంఘపెద్ద, ప్రతీ రక్షించబడిన విశ్వాసి, తాను వెలుగుతూ ఇతరులను వెలిగించాలి. చీకటిలో పాపాంధకారములో ఉన్న మన పొరుగువారికి కూడా ఈ వెలుగును పంచి వారిలో ఉన్న పాపపు చీకటిని పారద్రోలి యేసయ్య వద్దకు నడిపించాలి. ప్రపంచానికి దేవుని వెలుగును పంచాలి. ఇది ప్రతీ ఒక్కరి భాద్యత!
ప్రియ స్నేహితుడా! మరి నీవు అలా చేస్తున్నావా?
ఇక నాల్గవ వచనంలో ఆసక్తికరమైన సంగతి కనబడుతుంది. జెకర్యా గారు అడిగారు- ఈదర్శన భావం ఏమిటి అని! ఆ దూత అడిగాడు ఇది నీకు తెలియదా అని!!! కారణం బహుశా ఈ దీప స్తంభం ఒలీవ చెట్లు చూసిన వెంటనే జెకర్యా వెంటనే దానిభావం గ్రహిస్తాడు అని దూత అనుకుని ఉండొచ్చు. అయితే జెకర్యా గారు ఉన్నది ఉన్నట్లు చెప్పేశారు అయ్యా! నాకు తెలియదు, దయచేసి మీరే చెప్పేయండి అని! ఇక్కడ బాగా గమనిస్తే జెకర్యా గారు గొప్పలు చెప్పడం లేదు. ఫోజులు కొట్టడం లేదు. నాకేమి తెలియని సుద్దును నాకు మీరే చెప్పేయండి అని ఒప్పేసుకున్నారు. లేదా యేహెజ్కేలు గ్రంధంలో 37లో గల ఎముకల లోయ దర్శనంలో వలె ఈయన కూడా తప్పించేసుకున్నారు. కారణం అక్కడ నరపుత్రుడా ఈ ఎండిన ఎముకలు బ్రతకగలవా అని దేవుడు అడిగితే యేహెజ్కేలు గారు కూడా ఓస్ ఎందుకు లేవవు. మీరు జస్ట్ ఒకమాట అంటే చాలు వెంటనే లేచిపోతాయి అనలేదు. ఎందుకొచ్చిన గొడవ అని అయ్యా అది మీకే తెలుసు. ఏమీ తెలియని వ్యక్తిని బాబు అని తగ్గించుకుని తప్పించుకున్నారు. ఇదీ తగ్గింపు అంటే, తెలివి (జ్ఞానం/దైవిక జ్ఞానం) అంటే! దేవుని దగ్గర నీ సొంత తెలివితేటలు ప్రదర్శించకుండా నిజం ఒప్పుకుంటే దేవుడు దాని అర్ధము, గూడార్దము కూడా వివరిస్తారు.
కాబట్టి ప్రియ స్నేహితుడా! దేవుని దగ్గర గొప్పలకు పోక తగ్గించుకుని యధార్ధం చెప్పు!
(ఇంకాఉంది)
*హతస్సాక్షి జెకర్యా-10వ భాగము*
*జెకర్యా దర్శనాలు-5*
*దీప స్తంభం- రెండు ఒలీవచెట్లు-2*
జెకర్యా 4:6—9......
6.
అప్పుడతడు నాతో ఇట్లనెను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు
ఇదే; శక్తిచేత నైనను బలముచేతనై ననుకాక నా ఆత్మచేతనే ఇది జరుగునని
సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను.
7.
గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు
ఏమాత్రపు దానవు? నీవు చదును భూమివగుదువు; కృప కలుగును గాక కృప కలుగునుగాక అని జనులు కేకలువేయగా అతడు పైరాయి తీసికొని
పెట్టించును.
8.
యెహోవా వాక్కు మరల నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
9.
జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసియున్నవి, అతని చేతులు ముగించును, అప్పుడు సైన్యములకు అధిపతియగు
యెహోవా నన్ను మీయొద్దకు పంపియున్నాడని నీవు తెలిసికొందువు.
( గతభాగం తరువాయి)
కాబట్టి 6వ వచనంలో ఆ దర్శన మొదట భావాన్ని దూత వివరిస్తున్నాడు. ఆయన మొదటగా జెరుబ్బాబెలుని ఎత్తి చెబుతున్నాడు. అనగా ఆ ఒలీవ చెట్లలో మొదటి వ్యక్తి జెరుబ్బాబెలు అని ఇట్టే అర్ధమవుతుంది.
6....అప్పుడతడు నాతో ఇట్లనెను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే; శక్తిచేత నైనను బలముచేతనై ననుకాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. అలాగే మరోసారి 11—12 వచనాలలో రెండు ఒలీవచెట్లు – వాటినుండి నూనె పారుతుంది ఏమిటి అని అడిగినప్పుడు (13వ వచనంలో) అడిగారు. నూనె గతంలో వివరించినట్లు అభిషేకానికి సాదృశ్యం! నిర్గమ 25:6; 29:7; లేవీ 2:1; 1సమూయేలు 10:1; కీర్తన 23:5; 45:7; మార్కు 6:13; లూకా 10:౩4; యాకోబు 5:14 . కాబట్టి జెరుబ్బాబెలు ఇంకా వీరిద్దరూ దేవునిపనిచేయ్యడానికి అభిషేకించబడ్డారు.
కాబట్టి ఇప్పుడు మొదటి ఒలీవ చెట్టయిన జెరుబ్బాబెలు ఇశ్రాయేలు ప్రజలకు సరైన రీతిలో వారిని నడిపించాలి అన్నమాట! అంతేకాదు దేవుని పనిని స్వశక్తితో చేయడానికి ప్రయత్నం చేయకుండా దేవుని ఆత్మను పొందుకుని ఆయన ఆత్మతో ఆత్మశక్తితో దేవుని పని చెయ్యాలి. కాబట్టి అతనిద్వారా ప్రజలకు చేరవలసిన నూనె ఇదే! అనగా దేవునిఆత్మతో నింపబడి ఆయన ఆత్మనే ప్రజలకు పరిచయం చెయ్యాలి. అప్పుడు శక్తితో కాదు బలముతో కాదు- దేవునిపని అనగా దేవుని మందిర నిర్మాణం ఆత్మద్వారా జరుగుతుంది.
అలాగే ప్రియ దైవజనుడా! నీవు ఆత్మతో నింపబడి, ఆత్మతో నడిపించబడి ఆయన సేవలో సాగుతుంటే ఆయన మందిర నిర్మాణం అనే దేవుని ఆత్మీయ సంఘ నిర్మాణం దేవుడు కట్టుకుంటూ వెళ్తారు. నీ సొంత భోదతో, ప్రయాసతో నీవు కట్టలేవు. ఒకవేళ చేస్తే నీవు పొల్లును తయారు చేస్తున్నావు గాని నిజమైన నిఖార్సైన గింజలను తయారు చెయ్యడం లేదు అని తెలుసుకోవాలి! అప్పుడే పౌలుగారు, ఆది అపొస్తలులు పొందుకున్న అనుభవం నీవుకూడా పొందుకోగలవు.
ఇక 7వ వచనంలో గొప్ప పర్వతమా! అంటున్నారు అనగా ఇది జెరుబ్బాబెలు గారు మందిర నిర్మాణంలో కలుగుతున్న ప్రతీ ఆటంకాన్ని సూచిస్తుంది. అయితే దేవుని సేవకుడు ఆయన ఆత్మతో నింపబడి నిర్మాణం చేస్తూ ఉంటే ఏ ఆటంకం అనగా కొండలాంటి ఆటంకాలయినా సేవకున్ని ఆపలేవు! మహా పర్వతమా లేక గొప్ప పర్వతమా నీవు నేలమట్టం చేయబడతావు అంటున్నారు దేవుడు. అలాగే ప్రియ సేవకా! నీవు దేవుని ఆత్మతో నింపబడి ఆయన సంకల్పం ప్రకారం చేస్తూ ఆయన సేవలో సాగుతుంటే నిన్ను ఎవడూ, ఏ అధికారము నిన్ను ఆపలేవు. ఏ సాతాను శక్తులు నిన్ను ఆపలేవు కదిలించలేవని క్రీస్తు ఆత్మతో నొక్కి వక్కాణించి చెబుతున్నాను. ఆ సమస్య పర్వతమంత పెద్దదయినా సరే అది నీముందు నిలువలేదు. పటాపంచలై పోతుంది. అయితే ఆటంకాలు తప్పకుండా కలుగుతాయి. అది లోకస్తులు నుండి కావచ్చు, అధికారుల నుండి కావచ్చు. శత్రువుల నుండి కావచ్చు. లేక నీ సంఘస్తులు సంస్థనుండి కావచ్చు. చివరకు నీ కుటుంభం, నీ భార్య, నీ బిడ్డల నుండి కావచ్చు! ఆటంకాలు రావడం లేదు అంటే లోకంతో అడ్జస్ట్ అయిపోయి ఉండవచ్చు. అయితే నీవు దేవుని ఆత్మావేశంతో సాగిపోతూ ఉంటే అవిఏవీ ఏమీ చెయ్యలేవు. చివరి విజయం నీదే అని గ్రహించు!
ఇక ఈ వచనంలో చివరిమాట: అతడు పై రాయి తీసి పెట్టించును అనగా మందిర నిర్మాణం జరిగాక మీదన గోపురం మీద పెట్టే చివరి రాయి అన్నమాట! ప్రజలు సంతోషంతో కృప కలుగును గాక కృప కలుగును గాక అని కేకలు వేస్తుండగా చివరి రాయి పెట్టడం జరుగుతుంది అంటున్నారు.
ఇక 9వ వచనంలో జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరానికి పునాదులు వేశాయి. అతని చేతులతోనే మందిర నిర్మాణం పూర్తిచేస్తాడు అని దేవుడు వాగ్దానం చేసారు. చూడండి ఎజ్రా ౩:8—11 ఇది పునాది సన్నివేశం జరిగింది!
8.
యెరూషలేములోనుండు దేవునియొక్క మందిరమునకు వారు వచ్చిన రెండవ సంవత్సరము
రెండవ నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, యోజాదాకు కుమారు
డైన యేషూవయును, చెరలోనుండి విడిపింపబడి యెరూష లేమునకు వచ్చినవారందరును
పని ఆరంభించి, యిరువది సంవత్సరములు మొదలుకొని పై యీడుగల లేవీయులను
యెహోవా మందిరముయొక్క పనికి నిర్ణయించిరి.
9.
యేషూవయు అతని కుమారులును అతని సహోదరులును, కద్మీయేలును
అతని కుమారులును, హోదవ్యా కుమారులును, హేనాదాదు
కుమారులును, వారి కుమారులును, లేవీయు లైనవారి
బంధువులును, దేవుని మందిరములో పనివారిచేత పనిచేయించుటకు నియమింపబడిరి.
10.
శిల్పకారులు యెహోవా మందిరముయొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలు రాజైన
దావీదు నిర్ణయించిన విధిచొప్పున తమ వస్త్రములు ధరించుకొనినవారై యాజకులు బాకాలతోను,
ఆసాపు వంశస్థులగు లేవీయులు చేయి తాళములతోను నిలువబడి యెహోవాను స్తోత్రము
చేసిరి.
అయితే ఆ సన్నివేశం అయ్యాక సుమారు
20 సంవత్సారాలు గడిచాక మందిర నిర్మాణం పూర్తి అయ్యింది. ఎజ్రా 6:13—16....
13.
అప్పుడు నది యివతల అధికారియైన తత్తెనైయును షెతర్బోజ్నయియును వారి పక్షమున
నున్నవారును రాజైన దర్యావేషు ఇచ్చిన ఆజ్ఞచొప్పున వేగముగా పని జరిపించిరి.
14. యూదుల పెద్దలు కట్టించుచు,
ప్రవక్తయైన హగ్గయియు ఇద్దో కుమారుడైన జెకర్యాయు హెచ్చరించుచున్నందున
పని బాగుగా జరిపిరి. ఈ ప్రకారము ఇశ్రాయేలీయుల దేవుని ఆజ్ఞ ననుసరించి
వారు కట్టించుచు, కోరెషు దర్యావేషు అర్తహషస్త అను పారసీక దేశపురాజుల
ఆజ్ఞచొప్పున ఆ పని సమాప్తి చేసిరి.
15.
రాజైన దర్యావేషు ఏలుబడి యందు ఆరవ సంవత్సరము అదారు నెల మూడవనాటికి మందిరము
సమాప్తి చేయ బడెను.
16.
అప్పుడు ఇశ్రాయేలీయులును యాజకులును లేవీయులును చెరలోనుండి విడుదలనొందిన
తక్కినవారును దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి.
వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు దానిని నేరవేర్చగలిగిన శక్తి గలవాడు.
ఇక జెకర్యా 4: 10
కార్యములు అల్పములైయున్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము
చేయు యెహోవాయొక్క యేడు నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుటచూచి సంతోషించును.
దీని అర్ధం మొదట్లో వీరు వేసిన పని
పునాది ఎంతో అల్పముగా కనిపించింది ఇశ్రాయేలు వారికి. హగ్గయి
2:౩
పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచినవారు మీలో ఉన్నారు గదా; అట్టివారికి ఇది
ఎట్టిదిగా కనబడుచున్నది? దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది
గదా.
ఎజ్రా 3: 12
మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీయుల లోను కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన
అనేకులు, ఇప్పుడు వేయబడిన యీ మందిరముయొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి.
అయితే మరి అనేకులు సంతోషముచేత బహుగా అరచిరి.
*అయితే దేవుని కార్యాలు మొదట చిన్నగానే ప్రారంభం అవుతాయి. గాని చివరకు కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతాయి. ఏలియా గారి సమయంలో అరచేయి అంత మేఘమే గాని కుండపోత వర్షాన్ని కురిపించింది. యేసయ్య సమయంలో కేవలం 5రొట్టెలు 2చిన్నచేపలు- గాని 5000 మంది ఆకలి తీర్చాయి. ఆవగింజ చిన్నదే గాని పెరిగాక గొప్ప వృక్షం అవుతుంది. శిష్యులు చదువులేని కేవలం చేపలు పట్టేవారు. గాని భూలోకాన్ని తలక్రిందులు చేసేవారు అనే పేరు తెచ్చుకున్నారు. వారితో చిన్నగా ప్రారంభమైన పరిచర్య నేడు లోకమంతటా వ్యాపించింది.* కాబట్టి ఇప్పుడు దేవుని కార్యములు అల్పముగా కనిపిస్తున్నాయా కంగారు పడకు! ఒకరోజు నీవే దానిని చూసి ఆశ్చర్య పడతావు. కాబట్టి దేవుడు పిలిచి అప్పగించిన పని చిన్నదిగా కనిపిస్తుందా? నిరుత్సాహపడకు! ఒకరోజు నీవు ఆశ్చర్యపడే రీతిలో అది వృద్ధిపొందబోతుంది. ఇంకా నూతన నిబంధన సంఘము ఆది అపొస్తలుల పునాది మీద, క్రీస్తు అనే బండమీద కట్టబడింది. దానిని పరిశుద్ధాత్ముడే కడుతున్నాడు. కాబట్టి నీవు ఆయనాత్మతో నింపబడి ఆయన సేవలో అదే అపొస్తలుల బోధలో సాగిపో! అప్పుడు నీ సేవ ఘనంగా సాగుతుంది.
ఇక తర్వాత మాట లోకమంతటను సంచరించు యెహోవాయొక్క ఏడు నేత్రములు అంటున్నారు మరొక్కసారి... దీనికోసం గతా భాగంలో చెప్పుకున్నాం! అది సంపూర్ణతకు, అలాగే అన్ని దిక్కులలో అంతటా దేవుడు చూస్తున్నారు అనడానికి సూచనగా ఉంది.
కాబట్టి అభిషేకం పొందుకున్న ఓ సేవకుడా! ధైర్యంగా ముందుకు సాగిపో! అత్మాభిషేకం పొందుకోలేని ఓ సేవకుడా నాయకుడా విశ్వాసి దానికోసం పాటుపడు! లేకపోతే సిద్దెలలో నూనె లేకపోతె విడువబడతావు సుమా! ఆ నూనెను పొందుకుని నింపుకుని ఆయన పనిలో ముందుకు సాగిపో!
దైవాశీస్సులు!
(ఇంకాఉంది)
*హతస్సాక్షి జెకర్యా-11వ భాగము*
*జెకర్యా దర్శనాలు-5*
*దీపస్తంభం- రెండు ఒలీవచెట్లు-౩*
జెకర్యా 4:11—14......
11.
దీపస్తంభమునకు ఇరుప్రక్కలనుండు ఈ రెండు ఒలీవచెట్లు ఏమిటివనియు,
12. రెండు బంగారపు కొమ్ములలోనుండి
సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లకున్న రెండు కొమ్మలును ఏమిటివనియు నేనతనిని నడుగగా
13.
అతడు నాతో ఇవేమిటివని నీకు తెలియదా యనెను నా యేలినవాడా, నాకు తెలియదని నేననగా
14.
అతడువీరిద్దరు సర్వలోకనాధుడగు యెహోవాయొద్ద నిలువబడుచు తైలము(అభిషేకము పొందినవారు)పోయువారై యున్నారనెను.
( గతభాగం తరువాయి)
ప్రియులారా! ఇప్పుడు జెకర్యా గారు దేవదూతను మరలా ప్రశ్నిస్తున్నారు ఆ దీప స్తంభానికి ఇరుప్రక్కల ఉన్న ఈ రెండు ఒలీవ చెట్లు భావమేమిటి అని! మరలా దూత అడిగాడు నీకు తెలియదా అని? బాబు నాకు తెలియదు మీరే చెప్పండి అని మరోసారి నమ్రతతో అడిగారు జెకర్యా గారు! అప్పుడు దేవునిదూత సెలవిస్తున్నాడు: వీరిద్దరూ సర్వలోకనాధుడగు యెహోవా యొద్ద నిలువబడుచు తైలము పోయుచున్నవారై ఉన్నారు అంటున్నాడు. అయితే స్టడీ బైబిల్ లో ఇలా ఉంది: అవి (అనగా ఆ ఒలీవచెట్లు) అభిషక్తులైన ఇద్దరు వ్యక్తులను సూచిస్తాయి. వారు సర్వలోకనాధుడగు యెహోవా సన్నిధాన సేవకులు.
ప్రియులారా! గతభాగాలలో మనం ఈ ఒలీవచెట్లు ఎవరు అనగా మొదటి అర్ధం/ భావం చూసుకున్నాం—వీరు ఒకరు జెరుబ్బాబెలు అనియు, మరొకరు ప్రధాన యాజకుడైన యెహోషువా అని చూసుకున్నాం! ఇక ఈ రెండవ భావం చూసుకుందాం! అభిషక్తులు అనగా దేవునిచేత అభిషేకం పొందుకున్నవారు ప్రత్యేకమైన పనికోసం!
ఉదాహరణ : యాజకులు – యాజకత్వం చేయడానికి;
సౌలురాజు, దావీదుగారు: రాజ్యాన్ని
పరిపాలించడానికి;
అయితే ఇక్కడ వీరిద్దరూ రాబోయేకాలంలో లేక అంత్యదినాలలో జరుగబోయే విషయం కోసం అభిషేకం
పొందుకున్న వారన్నమాట! వీరికోసం ప్రకటన 11వ అధ్యాయంలో కనిపిస్తుంది.
.......Revelation(ప్రకటన గ్రంథము) 11:3,4,5
3.
నేను నా యిద్దరు సాక్షులకు అధికారము ఇచ్చెదను; వారు గోనెపట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ప్రవచింతురు.
4.
వీరు భూలోకమునకు ప్రభువైన వాని యెదుట నిలుచుచున్న రెండు ఒలీవచెట్లును
దీపస్తంభములునై యున్నారు.
5.
ఎవడైనను వారికి హాని చేయ నుద్దేశించినయెడల వారి నోటనుండి అగ్ని బయలు
వెడలి వారి శత్రువులను దహించివేయును గనుక ఎవడైనను వారికి హానిచేయ నుద్దేశించినయెడల
ఆలాగున వాడు చంపబడవలెను.
అయితే వీరు ఎవరు అంటే: అంత్యదినాలలో మహాశ్రమల కాలంలో యేసుక్రీస్తు కోసం యూదుల మధ్య సాక్ష్యం చెప్పడానికి రాబోతున్నారు. కారణం వీరు దీప స్తంభం అనియు, దీపస్తంబాలు అనియు వ్రాయబడిఉంది అంటే వీరు సాక్ష్యము చెప్పే వారు అని అర్ధం అవుతుంది. అయితే మరి ఈ ఇద్దరు ఎవరు? దీనిమీద చాలా భిన్నాభిప్రాయాలున్నాయి. వారు మోషే ఏలియాలనియు,
ఏలియా హనోకు అనియు అంటుంటారు. కారణం మత్తయి 17:౩ లో రూపాంతర కొండమీద మోషే ఏలియాలు యేసుక్రీస్తు ప్రభులవారికి కనబడి ఆయన పొందబోయే సిలువ మరణం కోసం మాట్లాడి వెళ్ళారు కాబట్టి వీరే అంటారు కొంతమంది.
ఏదిఏమైనప్పటికీ ఎక్కువ శాతం, ఆ ఇద్దరిలో ఏలీయా ఒకరు అనే విషయాన్ని మాత్రం తప్పక అంగీకరిస్తారు. దానికి గల కారణాలేంటి?
1. ఇద్దరు సాక్ష్యులకు తమ ప్రవచన కాలమందు వర్షము పడకుండా చేయుటకు వారికి అధికారము కలదు. (ప్రకటన 11:6)
* ఏలియా కూడా ఆలాగు చేసెను. (1రాజులు 17:1, యాకోబు 5:7)
2. తమకు కీడు చేయువారిని నోటనుండి వచ్చు అగ్ని చేత నశింపచేయగలరు. (ప్రకటన 11:5)
• ఏలియా ఆకాశము నుండి అగ్నిని దింపినాడు.
అందుకు ఏలీయానేను దైవజనుడనైతే అగ్ని ఆకాశమునుండి దిగివచ్చి నిన్ను నీ యేబదిమందిని దహించునుగాక అని యేబదిమందికి అధిపతియైన వానితో చెప్పగా, అగ్ని ఆకాశమునుండి దిగి వానిని వాని యేబదిమందిని దహించెను.
( 2రాజులు
1:10,12)
3. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును. (మలాకీ 4:5)
4. ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతి మంతుల జ్ఞానము ననుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధ పరచుటకై *ఏలీయాయొక్క ఆత్మయు శక్తియు గలవాడై* ఆయనకు ముందుగా వెళ్లును గనుక నీకు సంతోషమును మహా ఆనంద మును కలుగును; అతడు పుట్టినందున అనేకులు సంతో షింతురనెను. (లూకా 1:16,17)
దీని ఆత్మీయ అర్ధము యోహాను అయినా ,
అక్షరార్ధముగా ఏలీయాను సూచిస్తుంది..
నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహానునొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యమిదే. అతడు ఎరుగననక ఒప్పుకొనెను; క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు మరి నీవెవరవు, నీవు ఏలీయావా అని అడుగగా అతడు కాననెను. (యోహాను 1:19-21)
5. మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి; (ప్రకటన 11:12)
* ఏలీయా సుడిగాలిచేత ఆకాశమునకు ఆరోహణమాయెను:
వారు ఇంక వెళ్లుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుఱ్ఱములును
కనబడి వీరిద్దరిని వేరు చేసెను; అప్పుడు ఏలీయా సుడిగాలిచేత ఆకాశమునకు ఆరోహణమాయెను.
(2రాజులు 2:11)
6. ప్రతి ఒక్కడు ఒకసారి మరణించవలెనని నిబంధన ప్రకారము ఏలీయా మరల వచ్చి, మరణించవలెను అనే అభిప్రాయం అనేకమందిలో వుంది.
(హెబ్రీ 9:27)
ఇక
ఇద్దరు సాక్ష్యులలో ఒకరు ఏలీయా అయితే, మరొకరో మోషే అనే అభ్కిప్రాయం కొందరిలో వుంది. దానికి గల కారణాలు:
1. ఇద్దరు సాక్ష్యులకు నీటిని రక్తముగా మార్చుటకు అధికారము గలదు.
(ప్రకటన 11:6)
* మోషే కూడా ఐగుప్తులో ఇట్లా చేసినట్లు లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి. (నిర్గమ 7:17,24;
8:11)
2. ప్రతీ విధమైన తెగుళ్లతో భూమిని శ్రమ పెట్టగలరు ( ప్రకటన 11:6)
* మోషే కూడా ఐగుప్తులో ఇట్లా చేసినట్లు లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి.
(నిర్గమ 7, 8 అధ్యాయములు)
* మోషే, ఏలీయాలు రూపాంతరం కొండపైన ప్రభువు మరణ విషయములను గూర్చి మాటలాడిరి. (లూకా 9:30, మత్తయి 17:3)
* పునరుత్తానమును గూర్చి ప్రకటించింది వీరిని నమ్ము చున్నారు. ( లూకా24:4,7)
* ప్రభువు తిరిగి వచ్చునని ప్రకటించినవారు వీరై యుండాలి. (అపో 1:10,11)
* కనుక వీరు మహాశ్రమల కాలంలో వచ్చి, ప్రభువు రాకడను గురించి, వెయ్యేండ్ల పరిపాలనను గురించి ప్రకటించ వచ్చునని నమ్ముచున్నారు.
* మోషేగారు ధర్మ శాస్త్రమును ఇచ్చారు., ఏలీయాగారు ప్రవక్తలకు మాదిరిగా యున్నారు. కావున, ఆ ఇద్దరు సాక్ష్యులు వీరై వుండవచ్చు అనే అభిప్రాయం కొందరిలో ఉంది..
కొందరి అభిప్రాయం ఏలీయా, మోషేలు కాగా, మరికొందరు ఏలీయా, హానోకు అంటారు.
* హానోకు, ఏలియాలు
మరణం లేకుండా కొనిపోబడ్డారు. కావున వారు మరలా వచ్చి మరణించవలెననేది
వీరి వాదన.
* హానోకు, ఏలియాలు ఇద్దరూ ప్రవక్తలై యున్నారు.
(యూదా 14-15)
* ఏలీయా ధర్మ శాస్త్ర యుగమునకు, హానోకు మనస్సాక్షి యుగమునకు
సూచనగా యున్నారు.
కాబట్టి హనోకు, ఏలియా కావచ్చు లేదా ఏలియా మోషే అయినా కావచ్చు.
*అయితే హనోకుగారు,
ఏలియా ప్రవక్త కావచ్చు అని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది నా ఉద్దేశం మాత్రమే సుమా*
*మరొకసారి ఈ విషయాన్ని మీ జ్ఞాపకంలోనికి తీసుకొని వస్తున్నాను. ఆ ఇద్దరు సాక్ష్యులు ఎవరనేది మనకు ముఖ్యం కానేకాదు. దేవుడు ఎవరిని పంపిస్తే, వారు వస్తారు. వారికి అప్పగించిన భాధ్యతను నెరవేర్చి వెళ్తారు.*
అయితే, మనకిప్పుడో సందేహం! ఎత్తబడిన సంఘంలో లేకపోయినా, రక్షించబడడానికి మరొక ఆప్షన్ వుంది కదా? ఇప్పుడెందుకు అంత తొందరపడటం? అయితే, ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. ఆ దినం వరకు నేను బ్రతికే వుంటాననే గ్యారంటీ నీకుందా? ఒకవేళ, బ్రతికి యున్నామే అనుకుందాం. ఆ దినాల్లో రక్షించబడడం అంత సులభమేమి కాదు. ఎందుకంటే? పరిశుద్ధాత్ముడు కూడా సంఘముతోనే ఎత్తబడతాడు కాబట్టి, ఇక మన మనస్సాక్షిని ఒప్పించేవారెవ్వరూ వుండరు.
ప్రియ చదువరీ! మరి నీవు సిద్ధంగా ఉన్నావా? లేకపోతె నేడే సిద్దపడు!
దైవాశీస్సులు!
(ఇంకాఉంది)
*హతస్సాక్షి జెకర్యా-12వ భాగము*
*జెకర్యా దర్శనాలు-5*
*దీపస్తంభం- రెండు ఒలీవచెట్లు-4*
జెకర్యా 4:11—14......
11.
దీపస్తంభమునకు ఇరుప్రక్కలనుండు ఈ రెండు ఒలీవచెట్లు ఏమిటివనియు,
12. రెండు బంగారపు కొమ్ములలోనుండి
సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లకున్న రెండు కొమ్మలును ఏమిటివనియు నేనతనిని నడుగగా
13.
అతడు నాతో ఇవేమిటివని నీకు తెలియదా యనెను నా యేలినవాడా, నాకు తెలియదని నేననగా
14.
అతడువీరిద్దరు సర్వలోకనాధుడగు యెహోవాయొద్ద నిలువబడుచు తైలము(అభిషేకము పొందినవారు)పోయువారై యున్నారనెను
( గతభాగం తరువాయి)
🔺 *ఇద్దరు సాక్ష్యులు భూమి మీదకు ఎప్పుడు పంపబడతారు?*
* అంత్య క్రీస్తు రాజ్య స్థాపన అయిన వెంటనే సంఘము ఎత్తబడుతుంది.
* సంఘము ఎత్తబడిన తర్వాత, విడువబడిన సంఘానికి ఏడేండ్లు
శ్రమకాలం.
* అబద్ధ ప్రవక్త అనేకమైన సూచక క్రియలను చేస్తూ, ప్రజలను
మోసం చేస్తూ, అంత్య క్రీస్తే, మెస్సియా
అని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు.
* అంత్య క్రీస్తు యూదులను, తానే మెస్సియానని నమ్మించడానికి
దేవాలయములో ( సంఘము ఎత్తబడక ముందే మూడవ దేవాలయము నిర్మించబడుతుంది)
బలులను, నైవేద్యములను ప్రవేశపెడతాడు.
* ఇశ్రాయేలీయులు అంత్య క్రీస్తును, మెస్సియా గా అంగీకరిస్తారు.
* ఇట్లాంటి పరిస్థితుల్లో దేవుడు సంపూర్ణాధికారమిచ్చి ఇద్దరు సాక్ష్యులను భూమి
మీదకి పంపిస్తారు.
🔺 *ఇద్దరు సాక్ష్యులు భూమి మీదకు రావడానికి గల ముఖ్య ఉద్ధేశ్యమేమి?*
* అంత్య క్రీస్తుని ఎదిరించుటకు
* అతడు మెస్సియా కాదని, క్రీస్తు విరోధియని లోకానికి ప్రకటించుటకు.
🔺 *ఇద్దరు సాక్ష్యులకు గల అధికారాలేమిటి? *
* ఎవడైనను వారికి హాని చేయ నుద్దేశించినయెడల వారి నోటనుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించివేయును. (ప్రకటన 11:5)
* తాము ప్రవచింపు దినములు వర్షము కురువకుండ ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. (ప్రకటన 11:6)
* వారికిష్టమైనప్పుడెల్ల నీళ్లు రక్తముగా చేయుటకును,
(ప్రకటన 11:6)
* నానావిధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. (ప్రకటన 11:6)
🔺 *వారెంతకాలము ప్రవచిస్తారు?*
* మొదటి మూడున్నర సంవత్సరాలు
🔺 *వీరు ఎప్పుడు చంపబడతారు?*
* మొదటి మూడున్నర సంవత్సరములు ప్రవచించడం ముగించిన తర్వాత.
🔺 *వీరు ఎవరిచేత చంపబడతారు?*
* అంత్య క్రీస్తు చేత.
వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములోనుండి వచ్చు క్రూరమృగము వారితో యుద్ధముచేసి
జయించి వారిని చంపును. (ప్రకటన 11:7)
🔺 *వారెక్కడ సమాధి చేయబడ్డారు?*
* వారు సమాధి చేయబడలేదు. మూడున్నర దినములు వారి శవములు
యెరూషలేము వీధుల్లో పడివుంటాయి. వాటిని ప్రపంచమంతా చూస్తూ ఆనందముతో
ఒకనికొకరు బహుమానాలు పంపుకుంటారు.
అయితే, 100 సంవత్సరాల క్రితం ఈ ప్రవచనం నెరవేరడం అసాధ్యమని అనుకున్నారు. కారణం? యెరూషలేములో పడియున్న వీరి శవాలను ఇండియాలో నున్నవారు ఎట్లా చూడగలరు? సాధ్యం కానేకాదు.
కానీ, ‘టెలివిజన్’ కనిపెట్టిన తర్వాత, అందరి అనుమానాలు పటాపంచలయ్యాయి. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతుంది. అందరికి ఇంటర్నెట్, కంప్యూటర్ , స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో వున్నాయి. ప్రపంచంలోని ఎక్కడి సమాచారమైనా కనురెప్పపాటులో మనకు చేరిపోతుంది. ఆ దృశ్యాలను అత్యంత స్పష్టముగా చూడగలుగుతున్నాము. పరిశుద్ధ గ్రంధములో వ్రాయబడినది అక్షరాలా నెరవేరుతుంది. సందేహం లేనేలేదు.
🔺 *ఇద్దరు సాక్ష్యులు మరణిస్తే? ప్రజలకెందుకు
ఆనందం?* (ప్రకటన
11:10)
వీరు అంత్య క్రీస్తు, మెస్సియా కాదని నిరూపించడం కొరకు వర్షాలు పడకుండా చేస్తారు. నీటిని రక్తముగా మారుస్తారు. అనేక తెగుళ్లను రప్పిస్తారు. ఇట్లా అనేకమైన సూచక క్రియలు చేస్తారు. దానితో ప్రజలంతా చాలా ఇబ్బంది పడతారు. ప్రజల దృష్టిలో వీరు దుర్మార్గులు. అంత్య క్రీస్తు అయితే, మొదటి మూడున్నర సంవత్సరాలు శాంత మూర్తిగా వ్యవహరిస్తాడు కాబట్టి. అంత్య క్రీస్తు పట్ల సద్భావము కలిగియుంటారు.
🔺 *వీధులలో పడియున్న, వీరి శవములు
సంగతేమిటి?* ( ప్రకటన
11:11-13)
* మూడుదినములన్నరయైన పిమ్మట దేవునియొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను. గనుక వారు పాదములు ఊని నిలిచిరి;
* వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను.
* అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకమునుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని, మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి;
* వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి
* ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో పదియవ భాగము కూలిపోయెను.
* ఆ భూకంపమువలన ఏడువేలమంది చచ్చిరి.
* మిగిలినవారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరచిరి.
🔺 *ఇద్దరు సాక్ష్యులు భూమి మీదకు రావడం వలన కలిగిన ప్రయోజనమేంటి?*
*
144000 మంది ఇశ్రాయేలీయులు రక్షించబడ్డారు. (ప్రకటన
7:4)
ప్రియ విశ్వాసి! దేవుని రాకడ ఆసన్నమౌతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్దమేనా? సరిచేసుకుందాం! ప్రభువు రాకడకై సిద్దపడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!
దైవాశీస్సులు!
*హతస్సాక్షి జెకర్యా-13వ భాగము*
*జెకర్యా దర్శనాలు-6*
*ఎగిరిపోవు పుస్తకం*
జెకర్యా 5:1—4......
1.
నేను మరల తేరిచూడగా ఎగిరిపోవు పుస్తకమొకటి నాకు కనబడెను.
2. నీకేమి కనబడుచున్నదని
అతడు నన్నడుగగా నేను,ఇరువైమూరల నిడివియు పదిమూరల వెడల్పునుగల
యెగిరిపోవు పుస్తకమొకటి నాకు కనబడు చున్నదంటిని.
3. అందుకతడు నాతో ఇట్లనెను
ఇది భూమియంతటి మీదికి బయలువెళ్లు శాపమే; దానికి ఒక ప్రక్కను వ్రాసియున్న
దానినిబట్టి దొంగిలువారందరును కొట్టివేయబడుదురు; రెండవ ప్రక్కను
వ్రాసియున్న దానినిబట్టి అప్రమాణికులందరును కొట్టివేయబడుదురు.
4.
ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కునేనే దాని బయలుదేరజేయుచున్నాను;
అది దొంగల యిండ్లలోను, నా నామమునుబట్టి అబద్ధ ప్రమాణము
చేయువారి యిండ్లలోను ప్రవేశించి వారి యిండ్లలో ఉండి వాటిని వాటి దూలములను రాళ్లను నాశనము
చేయును.
ప్రియ దైవజనమా! మనం జెకర్యా గారి దర్శనాలు ధ్యానం చేసుకుంటున్నాం. ఇక ఆరవ దర్శనంలో- ఎగిరిపోవు పుస్తకం కనబడుతుంది జెకర్యా గారికి.
మామూలుగానే జెకర్యా నీకేమి కనిపిస్తుంది అని దూత అడిగితే అయ్యా ఒక 20 మూరల పొడుగు,
పదిమూరల వెడల్పు ఉండే ఒక ఎగిరిపోవు పుస్తకం కనిపిస్తుంది అని చెప్పారు.
వెంటనే దూత ఆ పుస్తకం యొక్క భావం చెబుతున్నాడు.
ఈదర్శనంలో మిగతా దర్శనాల కంటే భావం చాలా స్పష్టముగా కనిపిస్తుంది. దాని భావము కూడా స్పష్టముగా తెలుస్తుంది. ఏమిటంటే పాపుల మీదకు, అబద్దికుల మీదకు దేవుని ఉగ్రత త్వరలో దిగబోతుంది అని!! ఈ దర్శనంలో ప్రత్యేకంగా రెండు రకాలైన పాపముల కోసం చెబుతూ వారి మీదకు దేవుని ఉగ్రత న్యాయంగా దిగుతుంది అని చెబుతున్నాడు.
దూత చెబుతున్నాడు జెకర్యా గారితో ఈ పుస్తకం—భూమియంతటి మీదకి బయలువెల్లు శాపమే! దానికి ఒకప్రక్కన వ్రాసియున్న దానిని బట్టి దొంగతనం చేసేవారు కొట్టివేయబడతారు. రెండవ ప్రక్కన అబద్ద ప్రమాణం చేసేవారు కొట్టివేయబడతారు అని భావం స్పష్టముగా చెప్పారు. 4......ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నేనే దాని బయలుదేరజేయుచున్నాను; అది దొంగల యిండ్లలోను, నా నామమునుబట్టి అబద్ధ ప్రమాణము చేయువారి యిండ్లలోను ప్రవేశించి వారి యిండ్లలో ఉండి వాటిని వాటి దూలములను రాళ్లను నాశనము చేయును. .
ఇక్కడ ఒకసారి ఆగుదాం! మొదటగా దొంగల ఇండ్లలోను నా నామముబట్టి అబద్దప్రమాణం చేసే వారి ఇండ్లలో ప్రవేశించి వారి ఇంటి దూలములను రాళ్ళను నాశనము చేస్తుంది అంటున్నాడు దూత! గమనించాలి. ఇప్పుడైతే స్లాబ్ ఇల్లు వచ్చాయి. పూర్వకాలంలో రాళ్ళతో కట్టబడిన ఇల్లు, పెంకిటిల్లుకు దూలములు ఉండేవి. ఇప్పటి మన కోలం (పిల్లర్లు), భీమ్స్ లాగ. వీటిని దేవుడు పడగొడతాను అంటున్నారు.
మొదటి బాచ్: *దొంగలు*.
మనలో చాలామంది దొరికితే దొంగలు- దొరకకపోతే దొర!
దేవుడు కొందరు దొంగలకోసం ఏమని చెబుతున్నారో చూద్దాం.
దేవుని పది ఆజ్ఞలలో ఒకటి: నిర్గమ
20:15 దొంగిల కూడదు.
ఒకరకమైన దొంగలు: యోహాను 10:8 ...
గొఱ్ఱెలు పోవు ద్వారమును నేనే; నాకు ముందు వచ్చిన వారందరు దొంగలును దోచుకొనువారునై
యున్నారు; గొఱ్ఱెలు వారి స్వరము వినలేదు.
వీరు సంఘాన్ని దోచుకునేవారు. దారి తప్పించే వారు.
మరో రకం దొంగలు: మలాకి ౩:8—10....
8. మానవుడు దేవుని
యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి; దేని విషయములో మేము నీయొద్ద దొంగిలితిమని మీరందురు. పదియవ
భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి.
9.
ఈ జనులందరును నాయొద్ద దొంగిలుచునేయున్నారు, మీరు
శాపగ్రస్తులైయున్నారు.
10.
నా మందిరములో ఆహారముండునట్లు పదియవభాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి
తీసికొనిరండి; దీని చేసి మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపువాకిండ్లను
విప్పి,పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు
అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
మరికొంతమంది దేవుని మందిరానికి, సేవకు వచ్చిన ధనమును దొంగిలించే వారున్నారు.
అయితే మేము ఆ కేటగిరి కాదు. మేము దొంగలం కాదు అని అనుకోవచ్చు. దీనిని చదువుతున్న అనేకులు దొంగలు అని నా ఉద్దేశం! కేవలం దేవుని డబ్బు దాచుకునే వారు, దోచుకునే వారే కాదు దొంగలు! దేవుని సమయాన్ని దోచుకునే వారు అనగా దేవునికివ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వకుండా సొంతపనులకు, సినిమాలు సీరియల్లు, షికార్లు, శరీర కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగించే ప్రతీ స్త్రీ మరియు పురుషుడు దొంగ! దొంగ! దొంగ! అన్ని విషయాలలో మనం దేవునికి దశమ భాగం ఇస్తాము కదా మరి దేవుడు మనకిచ్చిన ఆయుస్సులో, దేవుడు మనకు ఇచ్చిన నూతన దినములో ఎంత దశమ భాగం దేవునికి ఇస్తున్నాము? దేవుడు నీతో కొన్ని నిమిషాలు గడియలు గడపాలి అని ఆశిస్తుంటే మరి నీవు నీ సమయాన్ని దేవునికి ఇస్తున్నావా ప్రియ స్నేహితుడా! జాగ్రత్త! దొంగలు దోచుకును వారు దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు!
ఇక రెండవ బాచ్: *అబద్దికులు- అబద్ద ప్రమాణం చేసేవారు*.! దేవుని పర్వతము మీద ఎక్కాలి అంటే నష్టము కలిగినా మాట తప్పనివారై ఉండాలి అని బైబిల్ సెలవిస్తే (కీర్తన
15:4)- ఎంతోమంది బొంకుతున్నారు. అబద్ద ప్రమాణాలు చేస్తున్నారు.
గమనించాలి- పేతురు గారు యేసయ్య ఎవరో నాకు తెలియదు అని బొంకినా అప్పుడు యేసుప్రభులవారు అక్కడ ఉండి పాపమును పరిహరించారు కాబట్టి సరిపోయింది. నీవునేను బొంకితే ఖబడ్దార్! జాగ్రత్త! అదే పేతురు గారు మార్పు నొంది ఆత్మను పొందుకుని వాక్యం చెబుతుంటే అపోస్తలుల కార్యముల 5 వ అధ్యాయం ప్రకారం- అననీయ సప్పీర దేవుని దగ్గర మ్రొక్కుకుని కొంతదాచుకుని కొంత తెచ్చి ఏమయ్యారు? అక్కడే చచ్చారు. వారిద్దరికీ పరిశుద్ధాత్మ దేవుడు పౌలుగారి ద్వారా చివరి అవకాశం కూడా ఇచ్చారు. అననీయ నీవు అంతకే అమ్మావా అంటే అంతకే అమ్మాను అని బొంకాడు. సప్పీరా నీవు అంతకే అమ్మావా అంటే అంతకే అమ్మాము అని ఆ తల్లి కూడా బొంకింది. అక్కడికక్కడే చచ్చింది! జాగ్రత్త ప్రియ సంఘమా! అబద్దాలు అబద్దప్రమాణాలు దేవునికి ఇష్టం ఉండదు. అందుకే ఈ రెండు పాపాల కోసం ప్రత్యేకంగా చెబుతున్నారు దేవుడు!
ప్రకటన
22:15.....
కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంత కులును విగ్రహారాధకులును అబద్ధమును
ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.
అబద్దమును ప్రేమించి జరిగించావా నరకమే
ఖబడ్దార్!!!
ప్రకటన 21:27
..
గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు వ్రాయ బడినవారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన
దేదైనను, అసహ్యమైనదానిని అబద్ధమైనదానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు.
నిషిద్దమైనది, అసహ్యమైనది, అబద్దమైనది ఈ మూడు గ్రూపుల వారు దేవుని పరలోకంలో చేరనే చేరరు జాగ్రత్త!
ప్రకటన
21:8....
పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి
కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును
అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.
చూడండి ఇక్కడ కూడా అబద్దికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుతారు.!!!
ప్రియ సంఘమా! దైవజనమా! నీ మాటలు కాచుకుంటున్నావా? మాటజారిపోతే తిరిగి తీసుకోలేవు జాగ్రత్త! అబద్ద ప్రమాణం చేస్తే దేవుడు వారి ఇంటి దూలములు పెరికి వేస్తాను అంటున్నారు. అనగా నీ ఆత్మీయ జీవితానికి ఆధారమైన దానిని అనగా నీ విశ్వాసపు గోడలను, స్థంబాన్ని కూల్చివేస్తారు దేవుడు. కాబట్టి విశ్వాసం లేకుండా నీవు దేవుని సన్నిధిని రాజ్యమును చేరలేవు. అనగా నరకమే శరణ్యం!
ప్రియ సహోదరీ సహోదరుడా! ఏమి కావాలి నీకు? పరలోకమా నరకమా? దేవుడా లోకమా? ఇప్పుడే తేల్చుకో!
Deuteronomy(ద్వితీయోపదేశకాండము) 30:19,20
19. నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ యెదుటను ఉంచి, భూమ్యాకాశములను
మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను.
20. నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు
ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించునట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్షుకును
మూలమై యున్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రదుకుచు,
నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని
ఆయనను హత్తుకొను నట్లును జీవమును కోరుకొనుడి.
దైవాశీస్సులు!
*హతస్సాక్షి జెకర్యా-14వ భాగము*
*జెకర్యా దర్శనాలు-7*
*కొల-తూము-దోషమూర్తి*
జెకర్యా
5:5—11......
5.
అప్పుడు నాతో మాటలాడుచున్న దూత బయలు వెళ్లి నీవు నిదానించి చూచి ఇవతలకు
వచ్చునదేమిటో కనిపెట్టుమని నాతో చెప్పగా
6.
ఇదేమిటియని నేనడిగితిని. అందుకతడు ఇది కొల,
ఇది బయలువెళ్లు తూము అనెను; మరియు లోకమంతటను జనులు
ఈలాగున కనబడుదురని చెప్పెను.
7.
అప్పుడు సీసపుబిళ్లను తీయగా కొల తూములో కూర్చున్న యొక స్త్రీ కనబడెను.
8.
అప్పుడతడు ఇది దోషమూర్తి యని నాతో చెప్పి తూములో దాని పడవేసి సీసపుబిళ్లను
తూముమీద నుంచెను.
9.
నేను మరల తేరి చూడగా ఇద్దరు స్త్రీలు బయలుదేరిరి; సంకుబుడి కొంగ రెక్కలవంటి రెక్కలు వారి కుండెను, గాలి
వారి రెక్కలను ఆడించుచుండెను, వారు వచ్చి తూమును భూమ్యాకాశముల
మధ్యకు ఎత్తి దాని మోసిరి.
10.
వీరు ఈ తూమును ఎక్కడికి తీసికొని పోవుదురని నాతో మాటలాడుచున్న దూతను
నేనడుగగా
11.
షీనారుదేశమందు దానికొక సాలను కట్టుటకు వారు పోవుచున్నారు; అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠముమీద పెట్టియుంచుదురని అతడు నాకుత్తర
మిచ్చెను.
ప్రియ దైవజనమా! మనం జెకర్యా గారి దర్శనాలు ధ్యానం చేసుకుంటున్నాం. ఇక
ఏడవ దర్శనంలో మనకు ఒక కొల-తూము- దోషమూర్తి కనిపిస్తున్నారు. అయితే గమనించాలి-
ఈ దర్శనభావం స్పష్టముగా లేదు. కావున అర్ధం చేసుకోవడం
కష్టం!
5వ వచనంలో దూత అడుగుతున్నాడు బయటకు
వచ్చేదానిని కనిపెట్టు అని. అదేమిటో జెకర్యా గారికి అర్ధం కాక,
ఇదేమిటి అని అడిగారు. దూత : ఇది ఒక కొల, బయటికి వెళ్ళు తూము అని చెప్పారు.
ఇంకా లోకమంతటా జనులు ఇలాగే కనబడతారు అంటున్నారు. ఇంతకీ వీటి భావం బహుశా కొల-మనకు ఏవైనా కొలవడానికి వాడుతాము,
ఇక తర్వాత 7-8 వచనాలలో దోషమూర్తి అంటున్నారు,
కాబట్టి ఈ కొల, తూము బహుశా ఇశ్రాయేలీయుల పాపములను
దేవుడు కొలిచారు అని భావం వస్తుంది. ఇక లోకమంతటా జనులు కనబడతారు
అనగా ఇలాగే లోకస్తులందరూ
లేక ఇజ్రాయిల్ ప్రజలందరూ కొలవబడతారు అనేభావం స్పురిస్తుంది.
ఇక ఆ తూముకి (తూము అనగా ఒకరకమైన కొలిచేబుట్ట) ఒక మూత ఉంది అని సీసంతో
చేసి ఉంది. ఆ మూత తీసి చూస్తేదానిలో ఒక స్త్రీ కూర్చొని ఉంది.
ఆ స్త్రీ దోషమూర్తి అని చెప్పి చూపించి మరలా ఆ స్త్రీని తూములో
పెట్టేసి మూతను పెట్టేశారు. ఇక తర్వాత వచనాలలో ఇద్దరు స్త్రీలు కనబడతారు
వారికి ఎగిరే పక్షి వంటిరెక్కలు కలిగి, ఆ స్త్రీని ఆ తూముతో సహా
మోసుకుని పోతున్నారు. వీరు ఎక్కడికి తీసుకుని పోతున్నారు అని
జెకర్యా గారు దూతను అడిగితే షీనారు దేశంలో దానికి ఒక ఇల్లు కట్టడానికి పోతున్నారు.
అప్పుడు ఆ ఇల్లు పూర్తయిన వెంటనే ఈ స్త్రీని ఆ ఇంట్లో పెడతారు అన్నారు.
ఈ
దర్శనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే దోషమూర్తిని ఇశ్రాయేలు దేశం నుండి షీనారు దేశము
అనగా బబులోను దేశానికి తీసుకుని పోతున్నారు. అనగా ఇశ్రాయేలు దేశంలో
గల పాపమును దోషమునకు కారణమైన స్త్రీని, ఆ దోషాలను ఇష్రాయేలునుండి
తొలగించి బబులోను దేశానికి తీసుకునిపోతున్నారు. మరి ఆ దోషాలను
ఎలా రవాణా చేస్తారో మనకు తెలియదు.
అయితే ఒకటి చెప్పవచ్చు : అన్ని దుర్మార్గాలకు పాపములకు బబులోను నివాసంగా ఉంది ఈ క్రింది
రిఫరెన్సులు ప్రకారం: ప్రకటన 17:1—5;
ప్రకటన 18:2—8,
23,24....
ఇజ్రాయేలు దేశం యొక్క గొప్ప పాపాలు
మొదటగా దేవునినుండి తిరిగిపోయి ఇతర దేవతలను మ్రొక్కడం. నిజదేవున్ని విసర్జించడం. కాబట్టి ఇలాంటి బ్రష్టత్వాన్ని దేవుడు
ఇశ్రాయేలు దేశం నుండి పూర్తిగా తొలగిస్తాను అనిచెబుతున్నారు. ఇది కేవలం యుగాంతం లో మాత్రమే జరుగుతుంది. కారణం ఇంతవరకు
వారు యేసయ్యను మెస్సయ్యగా అంగీకరించలేదు. ప్రకటన 12వ అధ్యాయం ప్రకారం, దానియేలు 12వ అధ్యాయం ప్రకారం, యెషయా గ్రంధంలో అనేక ప్రవచనాల ప్రకారం వారు అంత్యకాలంలో తప్పకుండ దేవుణ్ణి
తెలుసుకుని ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఇశ్రాయేలు దేశంలో పూర్తిగా దోషము తొలగిపోతుంది.
అయితే ఇక్కడ షీనారు దేశం లోనికి తీసుకుని పోతున్నారు కాబట్టి దేవుడు ఏ బబులోను
కోసం చెబుతున్నారు. బైబిల్ లో మనకు రెండు బబులోనులు కనిపిస్తాయి.
అక్షరార్ధమైన బబులోను- ఇది ఇరాక్ లో ఉంది.
ప్రస్తుతం షీనారు ప్రాంతం బబులోను లో ఉంది. అనగా
ఇరాక్ లో ఉంది.
ఇక రెండవ బబులోను దానియేలు
గ్రంధం ప్రకారం, ప్రకటన
17,18,19 ల ప్రకారం రోమా నగరంలో కనిపించే ఒక మతపరమైన మరియు వ్యాపారవ్యవస్త. దీనికోసం దానియేలు గ్రంధ వివరణలో
మీకు చెప్పడం జరిగింది.
అయితే ఈ వచనం
ప్రకారం కొంతమంది దేవుడు షీనారు దేశము అనే బబులోను దేశం అలియాస్ ఇరాక్ ను దేవుడు పునరుద్ధరిస్తారు
అంటారు. కాని అది ఎలా సాధ్యమవుతుంది? ఈ బబులోను నెబుకద్నేజరు సమయంలో గొప్ప
ప్రాబల్యం పొందింది. తరువాత దానికి నాశనం కలిగి మాదీయ పారశీక
రాజ్యాల హస్తాలలోనికి పోయింది. అప్పటినుండి ఇంతవరకు దానికి ప్రభావాలు
లేవు. సద్దాం హుస్శేన్ సమయంలో కొంచెం కలిగినా, నెబుకద్నేజర్ సమయంలో కలిగిన గొప్పతనం అధికారం కలగలేదు. అంతేకాకుండా క్రంది రిఫరెన్సులు ప్రకారం బబులోను ఇక తిరిగి కట్టబడదు.
అది నాశనమైపోతుంది.
యెషయా 13:17—22
17.
వారిమీద పడుటకు నేను మాదీయులను రేపెదను వీరు వెండిని లక్ష్యము చేయరు
సువర్ణముకూడ వారికి రమ్యమైనది కాదు
19.
అప్పుడు రాజ్యములకు భూషణమును కల్దీయులకు అతిశ యాస్పదమును మహాత్మ్యమునగు
బబులోను దేవుడు పాడుచేసిన సొదొమ గొమొఱ్ఱాలవలె నగును.
20.
అది మరెన్నడును నివాసస్థలముగా నుండదు తరతరములకు దానిలో ఎవడును కాపురముండడు
అరబీయులలో ఒకడైనను అక్కడ తన గుడారము వేయడు గొఱ్ఱెలకాపరులు తమ మందలను అక్కడ పరుండ నియ్యరు
21.
నక్కలు అక్కడ పండుకొనును గురుపోతులు వారి యిండ్లలో ఉండును నిప్పుకోళ్లు
అక్కడ నివసించును కొండమేకలు అక్కడ గంతులు వేయును
22.
వారి నగరులలో నక్కలును వారి సుఖవిలాస మందిరములలో అడవికుక్కలును మొరలిడును
ఆ దేశమునకు కాలము సమీపించియున్నది దాని దినములు సంకుచితములు.
యిర్మియా
50:39—40
39.
అందుచేతను అడవిపిల్లులును నక్కలును అక్కడ నివసించును నిప్పుకోళ్లును
దానిలో నివాసముచేయును ఇకమీదట అది ఎన్నడును నివాసస్థలము కాకపోవును తరతరములు దానిలో ఎవరును
కాపురముండరు.
40.
యెహోవా వాక్కు ఇదే సొదొమను గొమొఱ్ఱాను వాటి సమీపపట్టణములను దేవుడు నాశనము
చేసినప్పుడు జరిగిన రీతిగా ఎవడును అక్కడ కాపురముండకపోవును ఏ నరుడును దానిలో బసచేయడు.
Jeremiah(యిర్మీయా)
51:24,25,29,33,34,37,55,56
24.
బబులోనును కల్దీయుల దేశనివాసులును మీ కన్నులయెదుట సీయోనులో చేసిన కీడంతటికి
నేను వారికి ప్రతికారము చేయుచున్నాను, ఇదే యెహోవా వాక్కు.
25.
సర్వభూమిని నశింపజేయు నాశనపర్వతమా, నేను నీకు విరోధిని
ఇదే యెహోవా వాక్కు. నేను నీమీదికి నా చేయి చాపి శిలలపైనుండి నిన్ను
క్రిందికి దొరలించుదును చిచ్చుపెట్టిన కొండవలె ఉండజేయుదును.
29.
భూమి కంపించుచున్నది నొప్పిచేత అది గిజగిజ లాడు చున్నది ఒక్క నివాసియు
లేకుండ బబులోను దేశమును పాడుగా చేయవలెనని బబులోనునుగూర్చిన యెహోవా ఉద్దేశము స్థిర మాయెను.
33.
ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుబబు
లోనుపురము చదరముచేయబడిన కళ్లమువలె ఆయెను ఇంక కొంతసేపటికి దానికి కోతకాలము వచ్చును.
34.
బబులోనురాజైన నెబుకద్రెజరు మమ్మును మింగివేసెను మమ్మును నుగ్గుచేసెను,
మమ్మును వట్టికుండవలె ఉంచి యున్నాడు భుజంగము మింగునట్లు మమ్మును మింగెను
మా శ్రేష్ఠపదార్థములతో తన పొట్ట నింపుకొని మమ్మును పారవేసియున్నాడు.
37.
బబులోను నిర్జనమై కసువు దిబ్బలుగా ఉండును నక్కలకు నివాసస్థలమగును అది
పాడై యెగతాళికి కారణముగా ఉండును.
55.
యెహోవా బబులోనును పాడుచేయుచున్నాడు దాని మహాఘోషను అణచివేయుచున్నాడు వారి
తరంగములు ప్రవాహజలములవలె ఘోషించు చున్నవి వారి ఆర్భాటము వినబడుచున్నది.
56.
బబులోనుమీదికి పాడుచేయువాడు వచ్చుచున్నాడు దాని బలాఢ్యులు పట్టబడియున్నారు
వారి విండ్లు విరిగిపోయినవి యెహోవా ప్రతికారము చేయు దేవుడు గనుక నిశ్చయముగా ఆయన క్రియకు
ప్రతిక్రియ చేయును.
ఇక రెండవ బబులోను అనగా
రోమా నగరంలో గల బబులోను; దీని ప్రకారం
చూసుకుంటే తప్పకుండా ఇది జరిగింది అని చెప్పుకోవాలి. ఇశ్రాయేలు
దేశం నుండి సువార్త ప్రబలి వెళ్ళాక కొద్దిరోజుల తర్వాత సృష్టికర్తకు బదులుగా ఆయన చెప్పిన
బోధలకు బదులుగా వారి సొంత బోధలు చేసి, దేవుని స్తానాన్ని వారు
తీసుకున్నారు. పోపు దేవునికి ప్రతిగా భూమి మీద ఉన్నాడని,
ప్రీష్టుల చెవిలో పాపములు ఒప్పుకుంటే పాపాలు పోతాయని, అని ఇలాంటి తప్పుడు బోధలు చెయ్యడమే కాకుండా విగ్రహారాధన ప్రారంభించారు. అప్పుడు వారు అక్కడ అనగా రోమా పట్టణంలో
ఏడు కొండలపై గల పట్టణంలో వారు గొప్ప ఇల్లు కట్టారు. పెద్ద పుణ్యక్షేత్రం
అయిపోయింది. ఇప్పుడు మొత్తం దోషం ఈ బబులోను లోనే కేంద్రీకృతమైయుంది.
అయితే ఈ దర్శనం యొక్క ముఖ్య భావం బహుశా ఇశ్రాయేలు పాపాలను దేవుడు కొలిచారని,
ఆ పాపములను దోషములను దేవుడు దేశంలో ఉండకుండా తొలగించి వేస్తారని ఈ దర్శనం
సూచిస్తుంది. జెకర్యా ౩:9..
యెహోషువ యెదుట నేనుంచిన
రాతిని తేరి చూడుడి, ఆ
రాతికి ఏడు నేత్రములున్నవి, దాని చెక్కడపు పని చేయువాడను నేను.
ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు; మరియు
ఒక దినము లోగానే నేను ఈ దేశముయొక్క దోషమును పరిహరింతును;
అందుకే మొదటగా జెకర్యా 5:౩—4 లో రెండు రకాలైన
పాపాత్ములను ఇశ్రాయేలు దేశం నుండి తుడిచేస్తున్నారు. దేవుడు మరోసారి యేరూషలేమును కోరుకుంటారు.
అక్కడ నివాసం చేస్తారు. 2:11—12; అప్పుడు దేశంలో
దోషానికి దుర్మార్గానికి తావు లేకుండా దేవుడు చెప్పినట్లు పవిత్ర దేశం అవుతుంది.
ఇక్కడ మరో అత్మీయ అర్థం కూడా ఉంది
అనిపిస్తుంది. మనమందరం ఆత్మీయ ఇశ్రాయేలీయులం. యూదులతో పాటు సహపౌరులం. కాబట్టి దేవుడు ఒకరోజు తానే మన
అందరి పాపములకు పరిహారం చేసి మన పాపములను మనలోనుండి తీసివేస్తారు. ఇక ఆ పాపములను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోరు దేవుడు. అందుకు
గాను ఆయన తనకుమారుని పంపి ప్రాయశ్చిత్తం చేశారు. యెషయా
43: 25
నేను నేనే నా చిత్తానుసారముగా నీ యతిక్రమము లను తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను
జ్ఞాపకము చేసికొనను.
అలా చేసి పరిశుద్ధులుగా మనల్ని తీర్చిదిద్దారు. కాబట్టి ఆ పిలుపును ఏర్పాటు ను గుర్తుచేసుకుంటూ
మందుకు సాగిపోవాలి మనము.
దైవాశీస్సులు!
*హతస్సాక్షి జెకర్యా-15వ భాగము*
*జెకర్యా దర్శనాలు-8*
*రెండు ఇత్తడి పర్వతాలు-నాలుగు రధాలు*
జెకర్యా 6:1—8......
1.
నేను మరల తేరిచూడగా రెండు పర్వతముల మధ్య నుండి నాలుగు రథములు బయలుదేరుచుండెను,
ఆ పర్వతములు ఇత్తడి పర్వతములై యుండెను.
2. మొదటి రథమునకు ఎఱ్ఱని
గుఱ్ఱములు, రెండవ రథమునకు నల్లని గుఱ్ఱములు,
3.మూడవ రథమునకు తెల్లని గుఱ్ఱములు నాలుగవ రథమునకు చుక్కలు చుక్కలుగల బలమైన గుఱ్ఱములుండెను.
5.
అతడు నాతో ఇట్లనెను ఇవి సర్వలోకనాధుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలు
వెళ్లు ఆకాశపు చతుర్వాయువులు.
8.
అప్పుడతడు నన్ను పిలిచి ఉత్తరదేశములోనికి పోవు వాటిని చూడుము;
అవి ఉత్తరదేశమందు నా ఆత్మను నెమ్మది పరచునని నాతో అనెను.
ప్రియ దైవజనమా! మనం జెకర్యా గారి దర్శనాలు ధ్యానం చేసుకుంటున్నాం. ఇక 8వ చివరి దర్శనంలో మనకు రెండు ఇత్తడి పర్వతాలు- నాలుగు రధాలు కనిపిస్తాయి. గమనించాలి జెకర్యా మొదటి అధ్యాయం నుండి ఈ ఆరవ అధ్యాయం వరకు ఒకేరోజులో ఇన్ని దర్శనాలు కనిపించాయి. ఈ దర్శనంలో మనకు దేవుడు ఇశ్రాయేలును బాధించినవారికి ఇచ్చే తీర్పులు చూడవచ్చు!
ఇక మొదటి వచనంలో రెండు పర్వతాలు మధ్య నుండి నాలుగు రధాలు బయలుదేరుచున్నట్లు చూస్తున్నారు. జెకర్యా గారు ఈ దర్శనం చూసేటప్పుడు యేరూషలేములో ఉన్నారు. కాబట్టి ఈ రెండు ఇత్తడి పర్వతాలు బహుశా యేరూషలేములో ఉన్న రెండు పేరెన్నికగన్న పర్వతాలు కావచ్చు. ఇక పర్వతాలు ఇత్తడివి అని ఎందుకు చెప్పారు అంటే బహుశా అది దేవుని దృఢసంకల్పాన్ని సూచిస్తుంది. (యెషయా 45:2; యిర్మియా 1:18 ప్రకారం ఇత్తడి స్థిరమైన బలమైన వాటికి సాదృశ్యం గా ఉంది). అనగా యేరూషలేము విషయంలో ఆయన ఉద్దేశాలు ఎప్పుడూ దృఢమైనవి అని తెలియజేస్తున్నారు.
ఇక నాలుగు రధాలు కనిపిస్తున్నాయి. నాలుగు అనేది నలుదిక్కులకు అనగా ప్రపంచం అన్నిమూలలకు సాదృశ్యం అని గతభాగాలలో వివరించడం జరిగింది. అందుకే ఎక్కువగా మనకు నాలుగు కొమ్ములు, నాలుగు వాయువులు ఇలా కనిపిస్తూ ఉంటాయి బైబిల్ లో!
ఇక రధాలు కోసం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంధం ప్రకారం రధములు: దేవుని ప్రజలను కాచే ఆత్మలు లేక దేవదూతలు, ఇంకా వారి శత్రువులను ఓడించేవి అని గమనించవచ్చు. కీర్తనలు 68:17
2రాజులు 6:17
యెహోవా, వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థనచేయగా
యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషాచుట్టును పర్వతము అగ్ని గుఱ్ఱములచేత
రథములచేతను నిండియుండుట చూచెను.
అయితే 6:5 ప్రకారం దీని భావం నాకు చెప్పమంటే దూత చెప్పాడు నాలుగు రధాలు
5.......
5.
అతడు నాతో ఇట్లనెను ఇవి సర్వలోకనాధుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలు
వెళ్లు ఆకాశపు చతుర్వాయువులు. కాబట్టి నాలుగు రధాలు- నాలుగు వాయువులను -( దేవుని నాలుగు ఆత్మలు) సూచిస్తున్నాయి. ఇవి పైన చెప్పిన రిఫరెన్సులు ప్రకారం దేవుని దేవదూతలు లేక పరలోకంలో దేవునిచే
నియమింపబడిన అధికారులు కావచ్చు! ప్రకటన 7:1
అటు తరువాత భూమియొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచియుండి, భూమిమీదనైనను సముద్రముమీదనైనను
ఏ చెట్టుమీదనైనను గాలి వీచ కుండునట్లు భూమియొక్కనాలుగు దిక్కుల వాయువులను పట్టుకొనియుండగా
చూచితిని.
సరే, ఇక రెండవ వచనంలో మొదటి రధానికి ఎర్రని గుర్రాలు, రెండో రధానికి నల్లని గుఱ్ఱములు, మూడవ రధానికి తెల్లని గుఱ్ఱములు, నాల్గవ రధానికి చుక్కలుచుక్కలు గల బలమైన గుఱ్ఱములు కట్టబడి ఉన్నట్లు చూస్తున్నాం! ఇక వీటి అర్ధం- జెకర్యా 1:8 ప్రకారం, ప్రకటన 6,7 అధ్యాయాలు ప్రకారం ఎర్రని గుఱ్ఱములు – యుద్ధాలకు – రక్తపాతానికి గుర్తుగా ఉన్నాయి. తెల్లని గుఱ్ఱములు అధికారానికి, విజయానికి గుర్తుగా ఉన్నాయి. నల్లని గుఱ్ఱములు కరవుకాటకములకు గుర్తుగా ఉన్నాయి. ఇక చుక్కలుచుక్కలు దేనికి గుర్తుగా ఉన్నాయో లేఖనాలు సాదృశ్యం లేదు కాబట్టి అవి ఏమిటో *నాకు తెలియదు*. గాని బహుశా చుక్కలు చుక్కలు అనగా ఏదైనా తెగులు/ వైరస్ వచ్చినప్పుడు ఎలా చుక్కలు చుక్కలుగా వస్తుందో అలా ఈ చుక్కలు చుక్కలు గుర్రాలు తెగులుకు సాదృశ్యంగా ఉన్నాయేమో అనిపిస్తుంది.
అయితే ఆరవ వచనం ప్రకారం నల్లని గుఱ్ఱముల రధం- ఉత్తర దేశంలోనికి పోయేది, తెల్లని గుర్రాల రధం కూడా దాని వెనుకనే పోయేది. ఇక చుక్కలుచుక్కలు గలది దక్షిణ దేశానికి పోతుంది. అయితే గమనించ వలసినది ఏమిటంటే: ఎర్రనిగుర్రాల రధం మాత్రం ఎక్కడికి పోవడం లేదు. అది యేరూషలేములోనే ఉండిపోయింది, అనగా బహుశా ఈ దర్శన భావం యుగాంతం లో జరిగే దేవుని మహాతీర్పుకు సూచనగా ఉండవచ్చు!
ఇక ఏడవ వచనంలో మీరు పోయి లోకమంతటా సంచరించి లేక గస్తీ తిరిగమని చెప్పినట్లు చూస్తున్నాం. దీనికోసం గతబాగాలలో చూసుకున్నాం. అయితే ఇక్కడ లోకమంతటా అనగా ఈ దర్శనం కేవలం ఇశ్రాయేలు దేశానికే కాదు ప్రపంచమంతటికి వర్తిస్తుంది. అనగా ఈ రధములు గుఱ్ఱములు ప్రపంచమంతా తిరుగుతూ దేవుని ఉద్దేశాలను నెరవేర్చుతున్నాయి అన్నమాట!
ఇక 8వ వచనం...... చూడండి ఉత్తర దేశంలో నా ఆత్మను శాంతి పరచడానికి వెళ్తున్నాయి అంటున్నారు. గత భాగాలలో వివరించాను, ఇంకా యేహెజ్కేలు, దానియేలు గారి దర్శనాల భావంలో వివరించడం జరిగింది ఉత్తర దేశము అనగా యేహెజ్కేలు 38:1—9 వచనాలలో గల దేశాలు అని గమనించాలి. కారణం ఇశ్రాయేలు దేశంలో గల దాడులు చాలావరకు ఉత్తర దేశాలనుండే కలిగాయి కాబట్టి దేవుడు తీర్పులు తీరుస్తున్నారు. ఇంకా యేహెజ్కేలు 38 ప్రకారం, 39:2 ప్రకారం కూడా చివరి కాలంలో అంతిమ దాడి ఈ ఉత్తర దేశాలనుండే కలుగుతాయి. అనగా ప్రకటన 16, 19 అధ్యాయాలలో కలిగే హార్మెగిద్దోను యుద్ధం అన్నమాట! కాబట్టి ఈ ఉత్తర సైన్యాలపై దేవుని తీర్పు వెలువడి దేవుని ఆత్మను శాంతింప జేస్తాయి అని అంటున్నారు. అయితే గమనించాలి- దక్షిణ దేశం కోసం ఏమీ వ్రాయబడలేదు. దక్షిణ దేశాలు అనగా మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రాలకు ఆనుకుని ఉన్న దేశాలు. ఉత్తర దేశాలు అనగా టర్కీ, రష్యా ఇంకా నల్ల సముద్రం, కష్పియన్ సముద్రం గల దేశాలు కావచ్చు.
కాబట్టి ఈ దర్శన భావం ఏమిటంటే యుగాంతంలో దేవుడు దేవుని ప్రజలను అనగా ఇశ్రాయేలును బాధించిన దేశాలన్నిటిమీదకు తీర్పులు తీరుస్తారు అంటున్నారు. ఎవరూ తప్పించుకోలేరు. ఇదేమాట జెకర్యా 1:14—15, 21; 12:2—4; 14:2—౩; లో వివరించారు. ఇంకా గతభాగాలులో వివరించినట్లు యెషయా గారు, యిర్మియా గారు, యేహెజ్కేలు గారు కూడా ఇదే దానిని ప్రకటించారు. అలాగే ఆత్మీయ ఇశ్రాయేలీయులమైన మనల్ని బాధించిన ఎవడూ నిలువలేడు.
ప్రియ దేవుని బిడ్డా! దేవుని అంత్య తీర్పు దగ్గరలో ఉంది! మరి నీవు సిద్దంగా ఉన్నావా? సిద్ధంగా ఉంటే ఎత్తబడతావు! సిద్దపాటు లేకపోతే విడువబడతావు!
దైవాశీస్సులు!
*హతస్సాక్షి జెకర్యా-16వ భాగము*
జెకర్యా 6:9—12......
9.
మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా
10.
చెరపట్టబడినవారిలో బబులోను నుండి వచ్చిన హెల్దయి టోబీయా యెదాయా అనువారు
జెఫన్యా కుమారుడగు యోషీయా యింట దిగియున్నారు; వారు చేరిన దినముననే
నీవు ఆ యింటికిపోయి
11.
వారి నడిగి వెండి బంగారములను తీసికొని కిరీటముచేసి ప్రధాన యాజకుడును
యెహోజాదాకు కుమారుడునైన యెహోషువ తలమీద ఉంచి
12.
అతనితో ఇట్లనుము సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా చిగురు
అను ఒకడు కలడు; అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును.
ప్రియ దైవజనమా! ఇంతవరకు మనం జెకర్యా గారి దర్శనాలు ధ్యానం చేసుకున్నాం. ఇక దర్శనాలు అయిపోయాయి. ప్రవచనాలు మొదలయ్యాయి. బహుశా దర్శనాలు చూసిన రోజునే ఈ ప్రవచనం కూడా వచ్చి యుంటుంది. అందుకే తారీకు మార్చలేదు జెకర్యా గారు.
ఇక ఈ మొదటి ప్రవచన వాక్కులలో దేవుడు మొదటగా చెరనుండి విడుదల పొంది వచ్చిన ముగ్గురు పేర్లు ఉదాహరించి వారి దగ్గర బంగారం తీసుకుని ప్రధానయాజకుడైన యెహోషువాకి కిరీటం చేసి పెట్టమంటున్నారు. ఆ చెరనుండి విడుదల పొందిన వారిపేర్లు మూడు మనం ఎజ్రా 2వ అధ్యాయంలోను, నెహేమ్యా గ్రంధంలో కూడా మనకు కనిపిస్తారు.
ఇక ఏ బంగారం కోసం దేవుడు చెబుతున్నారు అంటే ఎజ్రా 6:5 లో ఉదహరించబడిన బబులోను రాజైన నెబుకద్నేజర్ తీసుకుని పోయిన వెండి బంగారాలు కోసం మాట్లాడుతున్నారు........ఎజ్రా 6: 5
మరియు యెరూషలేములోనున్న ఆలయములోనుండి నెబుకద్నెజరు బబు లోనునకు తీసికొని వచ్చిన
దేవుని మందిరముయొక్కవెండి బంగారు ఉపకరణములు తిరిగి అప్పగింపబడి, యెరూష లేములోనున్న
మందిరమునకు తేబడి, దేవుని మందిరములో వాటి స్థలమందు పెట్టబడవలెను.
ఇక ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే: ప్రధానయాజకుడైన యెహోషువా గారికి కిరీటం పెట్టమంటున్నారు. గమనించాలి- కిరీటం- రాజరికానికి
గుర్తు. మరి యాజకునికి పాగాలు పెట్టాలి గాని కిరీటం పెట్టమంటున్నారు
ఏమిటి? జెకర్యా ౩:5 లో జెకర్యా గారు దేవుణ్ణి
రిక్వెస్ట్ చేసి అడిగితే యెహోషువా గారికి పాగా పెట్టించారు. ఇంకా
నిర్గమ 28:4 ప్రకారం కూడా పాగాయే ఉండాలి. మరి ఇప్పుడు దేవుడు కిరీటం చేసి తలమీద పెట్టడం ఏమిటి? ఇంతవరకు యూదులను జనాలను పాలించింది యూదా వంశం గాని లేవీయుల వంశం పాలించలేదు.
మరి యాజకునికి కిరీటం పెట్టమంటున్నారు ఏమిటి?
అయితే యెహోషువా తలమీద కిరీటం పెట్టడం అనేది ఆత్మీయార్ధంగా రాబోయే దినాలలో సంభవించే విషయం కోసం చెప్పడం జరిగింది. జెకర్యా ౩:8 లో దేవుడు యెహోషువా కోసం ఏమన్నారు?.....
ప్రధానయాజకుడవైన యెహోషువా, నీ యెదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు; నీవును వారును నా మాట ఆలకింపవలెను, ఏదనగా చిగురు అను
నా సేవకుని నేను రప్పింపబోవుచున్నాను.
అతడు రాబోయే అభిషక్తుడు, మెస్సయ్యకి సూచనగా ఉన్నాడు. ఇక యెహోషువా, యేశూవ అనగా అర్ధం రక్షకుడు లేక యెహోవా రక్షించును! దానినే
గ్రీకు బాషలో యేసు అని వచ్చింది. కాబట్టి రెండు పేర్లకు అర్ధం
ఒక్కటే!
ఇక సూచనలుగా ఉన్నారు అని చెప్పి వెంటనే కొమ్మ కోసం చెబుతున్నారు: కొమ్మ లేక చిగురు అనే వ్యక్తి ఉన్నాడు. తన స్థలములో చిగుర్చును అతడే ఆలయమును కట్టును. ...... చిగురు కొమ్మ కోసం గతంలో చెప్పడం జరిగింది...
*చిగురు లేదా కొమ్మ* అనే మాట అది రాబోయే యేసుక్రీస్తు ప్రభులవారి మొదట రాకడ కోసం వ్రాయబడియుంది అని గ్రహించాలి. జెకర్యా 6:12
అతనితో ఇట్లనుము సైన్యములకు
అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా చిగురు అను ఒకడు కలడు; అతడు తన స్థలములో నుండి చిగుర్చును,
అతడు యెహోవా ఆలయము కట్టును.
యెషయా 4:2
ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూష ణమునగును. ఇశ్రాయేలులో తప్పించుకొనినవారికి భూమిపంట
అతిశయాస్పదముగాను శుభలక్షణము గాను ఉండును.
యెషయా 11:1
యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును వాని వేరులనుండి అంకురము ఎదిగి ఫలించును
యిర్మియా
23:5
యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడురాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును
పుట్టించెదను; అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు
కార్యము జరిగించును, భూమిమీద నీతి న్యాయములను జరిగించును.
యిర్మియా ౩౩:15
ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతిచిగురును మొలిపించెదను; అతడు భూమిమీద నీతి
న్యాయములను అనుసరించి జరిగించును.
మరో విషయం గమనించాలి యేసుక్రీస్తుప్రభులవారినే ఇక్కడ *నా సేవకుడు* అనికూడా చెబుతున్నారు. అనగా ఆయన అభిషక్తుడే కాకుండా సేవకుడు కూడా! అందుకే ఆయన శిష్యుల పాదములు
కడిగారు. ...యోహాను 13:5--14;
ఇంకా ఈ క్రింది వచనాలు చూడండి
యెషయా 49:5—6
5.
యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని నా దేవుడు నాకు బలమాయెను కాగా తనకు
సేవకుడనైయుండి తనయొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇశ్రాయేలు ఆయనయొద్దకు సమకూర్చబడుటకు
నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఈలాగు సెల విచ్చుచున్నాడు
6.
నీవు యాకోబు గోత్రపువారిని ఉద్ధరించునట్లును ఇశ్రాయేలులో తప్పింపబడినవారిని
రప్పించునట్లును నా సేవకుడవై యుండుట ఎంతో స్వల్పవిషయము; భూదిగంతములవరకు
నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై యుండునట్లు నిన్ను నియమించి
యున్నాను.
యెషయా 52:13
ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహా ఘనుడుగా
ఎంచబడును.
యెషయా 53:11
అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను
భరించి నకున్న అనుభవజ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును.
రోమా 15:8
నేను చెప్పునదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును,
అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి(
సున్నతి యొక్క) గలవారికి పరిచారకుడాయెను.
మత్తయి 20:
28
ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును
అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను.
కాబట్టి ఆ సేవకుడు యేసుక్రీస్తు ప్రభులవారే!
ఇక అతడే ఆలయమును కట్టును
అనగా యేసుక్రీస్తుప్రభులవారు ఏ ఆలయమును చేతులతో లేక కలపతో లేక రాతితో కట్టలేదు.
గాని దేవుడు ఆలయమును కట్టును, అతడే ఆలయమును కట్టును
అంటున్నారు. దీని అర్ధం అంతకంటే శ్రేష్టమైన చేతులతో చేయబడని మందిరం కట్టారు. మన
హృదయమే దేవుని ఆలయం. మన హృదయాలలో ఆయన ఆలయమును కట్టారు దేవుడు.
ఇంకా సింహాసనాసీనుడై ఉంటాడు అని కూడా అన్నారు. అనగా మానవ హృదయాలలో దేవుడు స్థాపించిన సామ్రాజ్యమే దేవునిరాజ్యం/ పరలోక రాజ్యం/ దేవుని సంఘం! మత్తయి
16:
18.
మరియు నీవు పేతురువు(పేతురు అను శబ్దమునకు రాయి
అని అర్థము); ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను.
19.
పరలోకరాజ్యముయొక్క తాళపుచెవులు నీ కిచ్చెదను, నీవు
భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు
దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను.
ఎఫేసి 2:
20.
క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియైయుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన
పునాదిమీద మీరు కట్టబడియున్నారు.
21.
ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు
పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధిపొందుచున్నది.
22.
ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమైయుండుటకు కట్టబడుచున్నారు.
గమనించాలి అపో 17:24—25 ప్రకారం మనుషులు కట్టిన ఆలయంలో నిజదేవుడు నివాసం చేయరు గాని భూమిపై దేవుడు మానవ హృదయాలలో కట్టిన ఆలయం అనగా యేసుక్రీస్తులో విశ్వాసులతో ఏర్పడిన ఆలయంలో దేవుడు ఎప్పుడూ నివాసం చేస్తారు. .....
ఇక ఆయన సింహాసనాసీనుడై యాజకత్వము చేస్తారు అంటున్నారు. అనగా రాజు మరియు యాజకుడు. దీనికోసం చూసుకుంటే మొదటగా సింహాసనాసీనుడై ...
యెషయా 9:6—7
6.
ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద
రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు
తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
7.
ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమ మును కలుగునట్లు సర్వకాలము
దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచు
టకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు
యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.
లూకా 1:
32.
ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన
దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును.
33.
ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము
అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను.
కీర్తన 89:35—37
35.
అతని సింహాసనము సూర్యుడున్నంతకాలము నా సన్నిధిని ఉండుననియు
36.
చంద్రుడున్నంతకాలము అది నిలుచుననియు మింటనుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు
అది స్థిర పరచబడుననియు
37.
నా పరిశుద్ధతతోడని నేను ప్రమాణము చేసితిని దావీదుతో నేను అబద్ధమాడను.
యిర్మియా ౩౩:20—22
20.యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా దివారాత్రములు వాటి సమయము లలో ఉండకపోవునట్లు నేను
పగటికి చేసిన నిబంధనను రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయకలిగిన యెడల
21.నా సేవకుడైన దావీదు సింహాసనముమీద కూర్చుండి రాజ్య పరిపాలనచేయు కుమారుడు అతనికి
ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థ మగును; మరియు నా
పరిచారకులైన లేవీయులగు యాజకులతోను నేను చేసిన నా నిబంధన వ్యర్థమగును.
యేహెజ్కేలు
43:7
ప్రకటన 22:౩
ఇకమీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు, దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనము
దానిలో ఉండును.
ఇక యాజకత్వం కోసం: హెబ్రీ 4:14
ఆకాశమండలముగుండ వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధానయాజకుడు మనకు ఉన్నాడు
గనుక మనము ఒప్పుకొనినదానిని గట్టిగా చేపట్టుదము.
హెబ్రీ 5:5—6
5.
అటువలె క్రీస్తుకూడ ప్రధాన యాజకుడగుటకు తన్నుతానే మహిమపరచుకొనలేదు గాని
నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను. అని ఆయనతో చెప్పినవాడే అయనను మహిమపరచెను.
6.
ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై
యున్నావు అని మరియొకచోట చెప్పుచున్నాడు.
హెబ్రీ 10:19—21
19.
సహోదరులారా, యేసు మనకొరకు ప్రతిష్ఠించిన మార్గమున,
అనగా నూతనమైనదియు, జీవముగలదియు, ఆయన శరీరము అను తెరద్వారా యేర్పరచబడినదియునైన మార్గమున,
20.
ఆయన రక్తమువలన పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది
గనుకను,
21.
దేవుని యింటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను, ......
పై రిఫరెన్సుల ప్రకారం ఆయన రాజు మరియు యాజకుడు. కాబట్టి ఈ ప్రవచనం కేవలం యేసుక్రీస్తు ప్రభులవారి కోసం చెప్పబడింది. ఆయన కట్టిన దేవాలయం సంఘం/ పరలోక రాజ్యం/మనమే! దానిని పొందిన వారికి తప్ప అది మరెవరికీ చెందదు!
ఇక ఆ వచనంలో తర్వాత మాటలు తెలుగులో సరిగా తర్జుమా జరగలేదు అని నాఉద్దేశం. ..... ఇంగ్లిష్ లో ఇలా ఉంది.....జెకర్యా 6: 13
అతడే యెహోవా ఆలయము కట్టును; అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై యేలును, సింహాసనాసీనుడై అతడు(ఒకడు) యాజకత్వము చేయగా ఆ యిద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును.
Zechariah 6: 13
Even he shall build the temple of
the LORD; and he shall bear the glory, and shall sit and rule upon his throne;
and he shall be a priest upon his throne: and the counsel of peace shall be
between them both.
కొన్ని తర్జుమాలలో ఇలా ఉంది........ఆయనే యెహోవా ఆలయాన్ని నిర్మిస్తాడు. ఆయన హోదా కలిగి సింహాసనంమీద కూర్చుని పరిపాలన చేస్తాడు. అంతేగాక, ఆయన తన సింహాసనం మీద యాజకుడుగా ఉంటాడు. ఈ రెంటికి పొందిక ఉంటుంది.
రాజరికము యాజకత్వము ఈ రెండు కేవలం యేసుక్రీస్తులో ఉన్నాయి. రెండు క్రీస్తుయేసులో ఏకమయ్యాయి. చివరికి ఆయన రాజరికం- పాలనా, యాజకత్వమే కాకుండా మధ్యవర్తిగా కూడా వ్యవహరించారు. వ్యవహరిస్తున్నారు. దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నారు.
రోమా 8:౩4
1తిమోతి 2:5
దేవుడొక్కడే,
దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన
క్రీస్తుయేసను నరుడు.
హెబ్రీ 7:24—27
24.
ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయెను.
25.
ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు
శక్తిమంతుడై యున్నాడు.
26.
పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును.
ఆకాశ మండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు
సరిపోయినవాడు. (లేక, తగినవాడు)
27.
ధర్మ శాస్త్రము బలహీనతగల మనుష్యులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు
తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధిపొందిన కుమారుని నియమించెను
గనుక,
1యోహాను 2:1—2
1.
నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై యీ
సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన
యేసుక్రీస్తు అను ఉత్తరవాది(ఆదరణకర్త) తండ్రియొద్ద
మనకున్నాడు.
2.
ఆయనే మన పాపములకు శాంతికరమైయున్నాడు (ప్రాయశ్చిత్తమైయున్నాడు);
మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై
యున్నాడు.
ఇక చివరి వచనంలో యెహోవా ఆలయాన్ని దూరంనుండి వచ్చిన వారు కడతారు అనగా రెండు అర్ధాలున్నాయి. మొదటగా దూరంనుండి చెరనుండి దూరం నుండి వచ్చిన యూదులు తన ఆలయాన్ని కడతారు అనేది ఒకటి. ఇక మరో అర్ధం ఇప్పుడు కట్టబడుతున్న దేవుని ఆధ్యాత్మిక ఆలయం కోసం—దూరంగా ఉన్నవారు అనగా క్రీస్తుకు దూరంగా ఉన్నవారు క్రీస్తు చెంతకు వచ్చి ఆ పనిలో చేయి కలపడం . యోహాను 10:16
ఈ దొడ్డివికాని వేరే గొఱ్ఱెలును నాకు కలవు; వాటిని కూడ నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొఱ్ఱెల కాపరి ఒక్కడును అగును.
అపోస్తలు
2:39
ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికిని, అనగా ప్రభువైన
మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను.
ఎఫేసి 2:13
అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులైయున్నారు.
ఎఫెసీయులకు
2: 19
కాబట్టి మీరికమీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని
యింటివారునైయున్నారు.
లేదా యేహెజ్కేలు 40-43 అధ్యాయాలలో చెప్పబడిన ఆలయం కోసమైనా చెప్పి ఉండాలి.
అయితే చివరిగా దేవుడు అంటున్న మాట: ఇది ఎప్పుడు నెరవేరుతుంది అంటే మీరు జాగ్రత్తగా నేను చెప్పిన మాటలు వింటేనే ఇది జరుగుతుంది. అవును దేవుడు ఎన్నో ప్రవచనాలు, దర్శనాలు, వాగ్దానాలు చేసారు మనకోసం! అయితే అవి ఎప్పుడు మన జీవితంలో నెరవేరుతాయి అంటే మనం ఆయన చెప్పినట్లు చేసి ఆయన ఆజ్ఞలలో నడిచినప్పుడే!
మీరు నాతట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను అంటున్నారు దేవుడు. గాని మనం ఆయన మాట వినడం లేదు. ఆయన వాగ్దానాలను సొంతం చేసుకోవడం లేదు. మరి ఈ రోజైనా ఆయన మాట విని ఆయన చెప్పినట్లు చేస్తావా?
దైవాశీస్సులు!
*హతస్సాక్షి జెకర్యా-17వ భాగము*
*5,7,10 నెలలలో ఉపవాసం-1*
జెకర్యా 7:1—౩ ......
1.
రాజైన దర్యావేషు ఏలుబడియందు నాలుగవ సంవత్సరము కిస్లేవు అను తొమ్మిదవ
నెల నాలుగవ దినమున బేతేలువారు షెరెజెరును రెగెమ్మెలెకును తమ వారిని పంపి
2.
ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్టు అయిదవ నెలలో ఉపవాసముండి దుఃఖింతుమా
అని
3.
యెహోవాను శాంతిపరచుటకై మందిరము నొద్దనున్న యాజకులను ప్రవక్తలను మనవి
చేయగా ....
ప్రియ దైవజనమా! గతభాగం నుండి జెకర్యా గారి ప్రవచనాలను ధ్యానం చేసుకుంటున్నాం!
ఈ 7:1 లో దర్యావేషు పరిపాలన 4వ సంవత్సరం లో ఈ ప్రవచనాలు వచ్చాయి అని రాస్తున్నారు ప్రవక్త! గమనించాలి:
7—14 అధ్యాయాలలో గల ప్రవచనాలు జెకర్యా గారి ప్రవచన పరిచర్యలో రెండవ ఇన్నింగ్ లో కలిగాయి. మొదటగా దర్యావేషు రెండవ సంవత్సరం లో కలిగాయి అనగా
BC 520 లో ఎనిమిది దర్శనాలు మరియు 6వ అధ్యాయంలో గల ప్రవచనం కలిగితే, రెండు సంవత్సరాలు తర్వాత దర్యావేషు ఏలుబడి నాల్గవ సంవత్సరం అనగా
BC 518 లో
7,8 అధ్యాయాల ప్రవచనాలు కలిగాయి. ఇక కొన్ని నెలలలోనే మిగతా అధ్యాయాల ప్రవచనాలు కలిగాయి. ఆ తర్వాతనే ఆయనను ఇశ్రాయేలు వారు బలిపీటానికి మందిరానికి మధ్యన చంపివేశారు.
సరే, రెండవ వచనం లో చెరనుండి వచ్చి బేతెలు లో కాపురముంటున్న వారు దేవుని ప్రవక్తల యొద్దకు ఈ వర్తమానం పంపించారు.........
ఒకసారి ఆగుదాం. మొదటగా బేతెలు అనగా దేవుని మందిరం- దీనిని నామకరణం చేసినది యాకోబుగారు. ఆదికాండం 12:8; 18:19; 35:1; ఈ చిన్న పట్టణం యేరూషలేముకి
20 కి.మీ. దూరంలో ఉత్తరంగా ఉంది. నెహేమ్యా 11:31 ప్రకారం చెరనుండి విడుదల అయిన కొందరు అక్కడ స్థిరపడ్డారు.
ఇక రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే: వారు 5వ నెలలో ఇంతకాలము అనగా ఈ 70 సంవత్సారాలు అనగా చెరలో ఉన్న 70 సంవత్సరాలు చేసినట్లు 5వ నెలలో ఉపవాసం ఉండాలా? ఇదీ ప్రశ్న! చెరలో ఉన్నప్పుడు ఉపవాసం చేశాము.ఇప్పుడు చెర విముక్తి అయ్యింది కదా ఇపుడు కూడా చెయ్యాలా అదీ వారి ప్రశ్న! దానికి దేవుని జవాబు చెంపదెబ్బ కొట్టినట్లు ఉంది.
అయితే ఇప్పుడు మనం ధ్యానం చేయబోయేది మొదటగా ఈ 5వ నెల ఉపవాసం ఎందుకు వచ్చింది? చరిత్ర చూసుకుంటే క్రీ.పూ. 586 లో నెబుకద్నేజర్ సేవకుడు నెబూజరదాను ఇశ్రాయేలు దేశం మీద దండెత్తి వారిని చెరలోని పోయేటప్పుడు 5వ నెలలో యేరూషలేమును తగలబెట్టడం జరిగింది. 2రాజులు 25:8—9 ....
8.
మరియు బబులోనురాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో పందొమ్మిదవ సంవత్సరమందు అయిదవ
నెల యేడవ దినమున రాజదేహసంరక్షకులకు అధిపతియు బబులోనురాజు సేవకుడునగు నెబూజరదాను యెరూషలేమునకు
వచ్చి
9.
యెహోవా మందిరమును రాజనగరును యెరూషలేము నందున్న యిండ్లన్నిటిని గొప్పవారి
యిండ్లన్నిటిని అగ్నిచేత కాల్పించెను.
10.
మరియు రాజదేహసంరక్షకుల అధిపతియొద్దనున్న కల్దీయుల సైనికులందరును యెరూషలేము
చుట్టునున్న ప్రాకారములను పడగొట్టిరి. కాబట్టి దానిని గుర్తుకు పెట్టుకుంటూ చెరలో ఉన్న యూదులు వారు చెరలో ఉన్న స్థలాలలో 5వ నెల ప్రతీ సంవత్సరం 5వ నెలలో దీనిని అనగా యేరూషలేమును నాశనం చెయ్యడాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ 5వ నెలలో ఉపవాసం ఉండాలి అనే ఒక ఆచారాన్ని మొదలుపెట్టారు. మరి ఎన్ని రోజులు చేసేవారో స్పష్టంగా లేదు చరిత్రలో, గాని తప్పకుండా చేసేవారు ఆ 70 సంవత్సరాలు. దీనినే ఇప్పుడు మేము చెయ్యాలా వద్దా అంటున్నారు. ప్రస్తుతం అనేకమంది శ్రమదినాలు పాటించినట్లు. కొంతమంది అన్యులు 40 దీక్ష చేస్తున్నట్లు వారు కూడా చేసేవారు ఎన్ని రోజులో మాత్రం తెలియదు!
ఇక 4,5 వచనాల ప్రకారం 7వ నెలలో కూడా ఉపవాసం చేసేవారు. అది ఎలా వచ్చింది అంటే: 2రాజులు 25:25 ప్రకారం గవర్నర్ గెదల్యా ను ఇష్మాయేలు అనేవాడు హత్యచేసిన సందర్భాన్ని గుర్తుకు చేసుకుంటూ 7వ నెలలో ఉపవాసం మొదలుపెట్టారు. .......
25. అయితే ఏడవ మాసమందు
రాజవంశజుడగు ఎలీషామాకు పుట్టిన నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు పదిమంది మనుష్యులను పిలుచుకొని
వచ్చి గెదల్యా మీద పడగా అతడు మరణమాయెను. మరియు మిస్పాలో అతని
యొద్దనున్న యూదులను కల్దీయులను అతడు హతముచేసెను.
ఇక 8వ అధ్యాయం 18—19 వచనాల ప్రకారం ఈ రెంటితో పాటు నాల్గవ నెలలో ఉపవాసం, పదో నెలలో ఉపవాసం కూడా మీరు చేస్తున్నారు అని దేవుడే అంటున్నారు. ఇవి ఎందుకు వచ్చాయి అంటే 2రాజులు 25:౩—4 లోని సంఘటనలను జ్ఞాపకం చేసుకుంటూ వారు నాలుగో నెలలో ఉపవాసం ఉండేవారు. ......2 Kings(రెండవ రాజులు) 25:3,4
3.
నాల్గవ నెల తొమ్మిదవ దినమందు పట్టణములో క్షామము అఘోరమాయెను, దేశపు జనులకు ఆహారము లేకపోయెను.
4.
కల్దీయులు పట్టణ ప్రాకారమును పడగొట్టగా సైనికులు రాత్రియందు రాజు తోటదగ్గర
రెండు గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున పారిపోయిరి.
ఇక పదో నెలలో ఎందుకు ఉపవాసం ఉండేవారు అంటే 2రాజులు 25:1 సంఘటన జ్ఞాపకం చేసుకుంటూ......
1.
అతని యేలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు పదియవ మాసము పదియవ దినమందు బబులోను
రాజైన నెబుకద్నెజరును అతని సైన్యమంతయును యెరూషలేము మీదికి వచ్చి దానికెదురుగా దిగి
దాని చుట్టును ముట్టడి దిబ్బలు కట్టిరి.
ఇదీ వారు ఉపవాసం ఉండటానికి కారణం/ నేపధ్యం! *అయితే దేవుడు ఉపవాసం చెయ్యమన్నారా లేదా అనేది తర్వాత భాగాలలో చూసుకుందాం గాని మొదటగా దేవుడు చెప్పిన సమాధానం జ్ఞాపకం చేసుకుందాం!*
సరే , మీద ప్రశ్నకు దేవుడు జెకర్యా గారితో మాట్లాడి జవాబును పంపించారు. 7:4—7 .....
4. సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు
నాకు ప్రత్యక్షమై సెలవిచ్చిన దేమనగా
5. దేశపు జనులందరికిని యాజకులకును నీవీ
మాట తెలియజేయవలెను. ఈ జరిగిన డెబ్బది సంవత్సరములు ఏటేట అయిదవ
నెలను ఏడవ నెలను మీరు ఉపవాసముండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు, నాయందు భక్తికలిగియే ఉపవాసముంటిరా?
6. మరియు మీరు ఆహారము పుచ్చుకొనినప్పుడు
స్వప్రయోజనమునకే గదా పుచ్చుకొంటిరి; మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనమునకే
గదా పానము చేసితిరి.
7. యెరూషలేములోను దాని చుట్టును పట్టణములలోను
దక్షిణదేశములోను మైదానములోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్నకాలమున పూర్వికులగు ప్రవక్తలద్వారా
యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనస్సునకు తెచ్చుకొనకుండవచ్చునా?
చూశారా దేవుడు చెంపమీద కొట్టినట్లు ఎలా చెప్పారో...
మీరు గత 70 సంవత్సరాలు ఉపవాసం చేశారు గాని నామీద భక్తితో ప్రేమతో చెయ్యలేదు. ఏదో ఆచారబద్దంగా చేశారు. మీ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి అంటున్నారు. ఇది మరికొన్ని ప్రతులలో ఇలా ఉంది..........
4 అప్పుడు సేనల ప్రభువు యెహోవానుంచి
నాకు వాక్కు వచ్చింది:
5 “నీవు ఈ దేశస్థులందరికీ యాజకులకు ఇలా చెప్పాలి: గడచిన డెబ్భై సంవత్సరాలనుంచి ఏటేటా అయిదో నెల ఏడో నెల మీరు ఉపవాసం ఉంటూ విలపిస్తూ
వచ్చారు గాని నా నిమిత్తం ఉపవాసం ఉన్నారా?
6 మీరు తింటూ త్రాగుతూ ఉన్నప్పుడు అది కూడా మీ కోసమే గదా
చూడండి ఇక్కడ దేవుడు జెకర్యా గారి ద్వారా ప్రజలను మందలిస్తున్నారు వారు చేసే ఉపవాసమైనా ఉత్సవం అయినా వారు తమకోసమే ఆలోచించుకుంటున్నారు తప్ప దేవుని గురుంచి కాదు. దేవునిమీద నిజమైన భక్తిశ్రద్దలతో కానేకాదు అంటున్నారు దేవుడు! దేవునికున్న మహిమ, ప్రభావం, ఆయనకున్న పేరు ప్రతిష్టలు వారికి గుర్తుకులేదు, పట్టింపులేదు. ఇంతకీ దేవుడు ఎవరో నిజంగా గుర్తెరిగి ఆ ఉపవాసాలు చెయ్యడం లేదు. పెదాలతో ప్రార్ధన చేస్తున్నారు గాని వారి ప్రార్ధన నిజమైన ప్రార్ధన కాదు. వారి భక్తి నిజమైన భక్తి కాదు. అది ఆచారవ్యవహారాల వలన వచ్చిన భక్తిమాత్రమే గాని ఆత్మతోను సత్యముతోను చేసే భక్తి, ఆరాధన, ప్రార్ధన కానేకాదు. ఇప్పుడే కాదు గతంలో కూడా దేవుడు ఇదే అన్నారు మీరు ఐగుప్టు నుండి వచ్చినప్పుడు అరణ్యంలో కూడా మీరు నాకు ప్రార్ధన చెయ్యలేదు...... Acts(అపొస్తలుల కార్యములు) 7:42,43
42.
అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశసైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను.
ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఈలాగు వ్రాయబడియున్నది.ఇశ్రాయేలు ఇంటివారలారా మీరు అరణ్యములో నలువది యేండ్లు బలి పశువులను అర్పణములను
నాకు అర్పించితిరా?
43.
మీరు పూజించుటకు చేసికొనిన ప్రతిమలైన మొలొకు గుడారమును రొంఫాయను దేవతయొక్క
నక్షత్రమును మోసికొని పోతిరి గనుక బబులోను ఆవలికి మిమ్మును కొనిపోయెదను.
ఇప్పుడు కూడా అదే చెరనుండి వచ్చినప్పుడు, చెరలో ఉన్నప్పుడు మీరు నన్ను హృదయపూర్వకంగా వెదకలేదు, ప్రార్ధించలేదు, ఉపవాస ముండలేదు అంటున్నారు దేవుడు! అందుకే యెషయా
58:1—10 లో అంటున్నారు దేవుడు...........
1. తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయుము వారు చేసిన
తిరుగుబాటును నా జనులకు తెలియ జేయుము యాకోబు ఇంటివారికి వారి పాపములను తెలియ జేయుము
2. తమ దేవుని న్యాయవిధిని విడువక నీతిని అనుసరించువారైనట్టు అనుదినము
వారు నాయొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలిసికొన నిచ్ఛ కనుపరచుదురు తమకు న్యాయమైన
తీర్పులు తీర్చవలెనని వారడుగుదురు దేవుడు తమకు ప్రత్యక్షుడు కావలెనని యిచ్ఛ యింతురు.
3. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము
మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్యపెట్టవు? అని అందురు
మీ ఉపవాసదినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. మీ పనివారిచేత కఠినమైనపని
చేయించుదురు
4. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు
మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా మీరిప్పుడు ఉపవాసముండరు.
5. అట్టి ఉపవాసము నాకనుకూలమా? మనష్యుడు తన
ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్మువలె తలవంచుకొని
గోనెపట్ట కట్టుకొని బూడిదె పరచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి
ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరను కొందురా?
6. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు
బాధింపబడినవారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగగొట్టుటయు నే నేర్పరచుకొనిన ఉపవాసము
గదా?
7. నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము
తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు
8. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియే
గదా నాకిష్టమైన ఉపవాసము? ఆలాగున నీవు చేసినయెడల నీ వెలుగు వేకువ
చుక్క వలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడచును యెహోవా
మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును.
9. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తర మిచ్చును నీవు మొఱ్ఱపెట్టగా
ఆయననేనున్నాననును. ఇతరులను బాధించుటయు వ్రేలుపెట్టి చూపి తిరస్కరించుటయు
చెడ్డదానినిబట్టి మాటలాడుటయు నీవు మాని
10. ఆశించినదానిని ఆకలిగొనినవానికిచ్చి శ్రమపడినవానిని తృప్తిపరచినయెడల
చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నమువలె నుండును.
ఇక్కడ వారు దేవుని కంటే వారి ఆచార వ్యవహారాల పైనే ఎక్కువగా ఆలోచిస్తున్నారు తప్ప దేవుని మీద ప్రేమతో భయంతో కాదు.
ఇంకా మీరు అలా చెయ్యకూడదు నిజంగా భక్తితో పశ్చాత్తాపంతో చెయ్యాలి
అని పదేపదే పెందలకడ నా భక్తులను ప్రవక్తలను పంపించినా మీరు వినలేదు అంటున్నారు 7వ వచనంలో!
పూర్వ ప్రవక్తలు ఎన్నోసార్లు చెప్పారు- దేవునికి
ఆనందం కలిగించేవి మీ మతాచారాలు కర్మకాండలు కాదు అని. యెషయా
1:11—14
11. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలులు నాకేల?
దహనబలులగు పొట్టేళ్లును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయెను
కోడెల రక్తమందైనను గొఱ్ఱెపిల్లల రక్తమందైనను మేక పోతుల రక్తమందైనను నాకిష్టములేదు.
12. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే నా ఆవరణములను త్రొక్కుటకు
మిమ్మును రమ్మన్న వాడెవడు?
13. మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము
దాని నికను తేకుడి అమావాస్యయు విశ్రాంతిదినమును సమాజకూట ప్రక టనమును జరుగుచున్నవి పాపులగుంపుకూడిన
ఉత్సవసమాజమును నే నోర్చ జాలను.
14. మీ అమావాస్య ఉత్సవములును నియామక కాలము లును నాకు హేయములు అవి
నాకు బాధకరములు వాటిని సహింపలేక విసికియున్నాను.
ప్రియ దైవజనమా! అప్పుడేనా? ఇప్పుడు కూడా అలా జరగటం లేదా మన దేశంలో ప్రాంతంలో! దేవునిమీద భక్తిలేదు గాని వారి సంఘంలో చేసే ప్రార్ధనాచారాలే భక్తి అనుకుంటున్నారు. మరికొంతమంది వారి సంఘంలో ఆరాధన క్రమం చదివి ప్రార్ధన చేస్తేనే భక్తి అనుకుంటున్నారు. ఏదో పెదాలతో ప్రార్ధనలు చేస్తున్నారు. దేవునిమీద ఉండాల్సిన భక్తి క్రిస్మస్ మరియు ఇంకా కొన్ని ఆచారాల మీద వెళ్ళిపోతుంది గాని దాని అర్ధంలో లేదు. ఎందుకు పనికిరాని చర్చి డెకరేషన్లు, పనికిమాలిన డేన్సులు, వ్యర్ధమైన ఆచారాలు. వాటికి పెట్టే ఖర్చుల్లో కొంత పేదలకు దిక్కులేని వారికి పెట్టి వారికి దేవుని ప్రేమను పంచితే ఇప్పటికి మన దేశంలో అనేకమంది యేసయ్యను తెలుసుకుని ఉండేవారు. మరికొంతమంది పండుగ పేరుతొ పార్టీలు, మందు పార్టీలు, ఖరీదైన బట్టలు. అవసరమా ఇవి? దేవునికి ఇవ్వాల్సిన పాముఖ్యం దేనికి ఇస్తున్నాం? కేవలం ఆచారాలకు మాత్రం ఇస్తున్నాం! అవి వాక్యానుసారమా అంటే కాదు! క్రిస్మస్ చేసుకోవడం తప్పు అని నేను అనడం లేదు. సంతోషానికి చేసుకోవడం తప్పుకాదు. గాని దానికోసం వేలాది కోట్లాది దేవుని డబ్బులు పనికిమాలిన వాటికోసం ఖర్చుపెట్టడం మాత్రం తప్పు! తప్పు! తప్పు! నీవు నీ ఇంటిల్లిపాదీ క్రిస్మస్ పండుగకు 20వేల రూపాయలు పెట్టి బట్టలు కొనుక్కునారు అనుకుందాం, మరి మీ సంఘంలో ఉన్న పేద విధవరాలికి కనీసం ఒక చీరైనా కొన్నావా? ఒకరోజైనా అన్నం పెట్టావా ఇంటికి పిలిచి! మీ ఇంటిప్రక్కనే ఎవరో అన్యులు- దేవుడు తెలియనివారు – ఆకలితో ఉన్నారు, వారిని పిలిచి భోజనం పెట్టి, వారి అవసరాలు తీర్చి, క్రీస్తుప్రేమ కోసం చెప్పావా? నీ సొంత అన్నయ్య, తమ్ముడు, చెల్లి, అక్క పేదరికంలో ఉన్నారు. దేవుడు నీకు ఆస్తి ఐశ్వర్యం ఇచ్చారు కదా, పండగకు వారిని నీ ఇంటికి పిలిచి నీకు కలిగిన దానిలో కొంత వారికోసం ఖర్చుపెట్టి వారిని క్రీస్తుప్రేమ రుచి చూపించావా? సరే, క్రిస్మస్ కు పెట్టిన ఆడంబరం ఖర్చులు గుడ్ ఫ్రైడే ఈస్టర్ కి ఎందుకు పెట్టవు? కారణం RCM వారు దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. కాబట్టి నీవుకూడా దానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. వారు ఏమి చేస్తే మనం కూడా అదే చేస్తాం. సినిమా వారు ఏం చేస్తే మనం కూడా దానికి అనుగుణంగా స్టెప్పులు వేస్తున్నాము. ఇది భక్తా? వేషధారణా? ఒకసారి ఆలోచించమని అందరికీ మనవి చేస్తున్నాను. ఇంకా అన్యులు 40రోజులు చేసినట్లు మనం కూడా 40 రోజులు భక్తి చేసి ఆ తర్వాత మరల పాపంలో మునిగిపోతే వారికి మనకు తేడా ఏమిటి? దయచేసి దీనిని కూడా ఒకసారి ఆలోచించమని వినయపూర్వకంగా మనవిచేస్తున్నాను!
ప్రియ స్నేహితుడా! ఈ మాటలు నిన్ను మండిస్తున్నాయా? అయితే క్రీస్తుయేసు ఆత్మ నిన్ను రేపుతుంది అని గ్రహించి, నేను చెప్పింది వాక్యానుసారము అనుకుంటే నేడే నీ బ్రతుకును దిద్దుకుని వాక్యపు గద్దింపునకు లోబడి- యేసయ్యతో సమాధాన పడు! దేవుడు నిన్ను క్షమించి నీ జీవితాన్ని మార్చగలరు!
ఆమెన్!
దైవాశీస్సులు!
(ఇంకాఉంది)
*హతస్సాక్షి జెకర్యా-18వ భాగము*
*5,7,10 నెలలలో ఉపవాసం-2*
జెకర్యా 7:8—14 ......
8. మరియు యెహోవా వాక్కు జెకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా
9. సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చియున్నాడు సత్యము ననుసరించి
తీర్పు తీర్చుడి, ఒకరియందొకరు కరుణా వాత్సల్యములు కనుపరచుకొనుడి.
10. విధవరాండ్రను తండ్రిలేనివారిని పరదేశులను దరిద్రులను బాధపెట్టకుడి,
మీ హృదయమందు సహోదరులలో ఎవరికిని కీడు చేయదలచకుడి.
11. అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండ చెవులు మూసికొనిరి.
12. ధర్మశాస్త్రమును, పూర్వికులైన ప్రవక్తల
ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణచేత తెలియజేసిన మాటలను,
తాము వినకుండు నట్లు హృదయములను కురువిందమువలె కఠినపరచుకొనిరి గనుక సైన్యములకు
అధిపతియగు యెహోవా యొద్దనుండి మహోగ్రత వారిమీదికి వచ్చెను.
13. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగానేను పిలిచినప్పుడు
వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను.
14. మరియు వారెరుగని అన్యజనులలో నేను వారిని చెదరగొట్టుదును.
వారు తమ దేశమును విడిచినమీదట అందులో ఎవరును సంచరింపకుండ అది పాడగును;
ఈలాగున వారు మనోహరమైన తమ దేశమునకు నాశనము కలుగజేసియున్నారు.
ప్రియ దైవజనమా! గతభాగం నుండి జెకర్యా గారి ప్రవచనాలను ధ్యానం చేసుకుంటున్నాం!
(గతభాగం తరువాయి)
ప్రియులారా! గతభాగంలో వారు దేవునికి అడిగిన ప్రశ్నకు వారికి జవాబు చెప్పినట్లు చూసుకున్నాం! మీ ప్రార్ధన, మీ ఆచారవ్యవహారాలూ నాకు అసహ్యం పుట్టించాయి అని దేవుడు చెప్పినట్లు చూసుకున్నాం! గతభాగంలో దేవునికి వారిలో అసహ్యం పుట్టించేవి చెబితే ఈ ప్రవచన భాగంలో దేవునికి మనలో ఏమి కావాలో ఏ క్వాలిటీలు కోసం దేవుడు ఎదురుచూస్తున్నారో తన ఉద్దేశ్యాన్ని తేటతెల్లంగా అందరికీ అర్ధమయ్యేరీతిలో చాలా స్పష్టమైన సులువైన మాటలతో దేవుడు చెప్పారు. దీనినే ఈ రోజు ధ్యానం చేసుకుందాం!
నాకు కావలసింది మీ ఉపవాసం కాదు గాని మొదటగా సత్యముననుసరించి తీర్పుతీర్చుడి. ఒకరియందుఒకరు కరుణావాత్సల్యములు కనపరచుకొండి. ఆహా ఏమి సింపుల్ గా చెప్పారు. నిజంగా ఈ మాటలు దేవునికి ఘనత తెచ్చేమాటలు కోసం దేవుణ్ణి స్తుతించేవి కాదు. మానవుల మధ్య పరస్పర ప్రేమానురాగాలే దేవునికి ఇష్టమైనవి అని తెలియజేస్తున్నారు. దీనికోసం బైబిల్ లో చాలా చోట్ల విస్తారంగా వ్రాసారు దేవుడు.
మొదటగా పాతనిబంధనలో ఏమన్నారో చూసుకుని క్రొత్త నిబంధన కోసం చూసుకుందాం!
జెకర్యా 7:9—10
జెకర్యా 8:
16.మీరు చేయవలసిన కార్యము లేవనగా, ప్రతివాడు
తన పొరుగు వానితో సత్యమే మాటలాడవలెను, సత్యమునుబట్టి సమాధానకరమైన
న్యాయమునుబట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను.
17.తన పొరుగువాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు, అబద్ద ప్రమాణము చేయనిష్టపడకూడదు, ఇట్టివన్నియు నాకు అసహ్యములు;
ఇదే యెహోవా వాక్కు.
యెషయా 1:17
కీడుచేయుట మానుడి మేలుచేయ నేర్చుకొనుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని
విడిపించుడి తండ్రిలేనివానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్ష ముగా వాదించుడి.
యిర్మియా 22:౩
యెహోవా ఈలాగు ఆజ్ఞనిచ్చుచున్నాడు మీరు నీతి న్యాయముల ననుసరించి
నడుచుకొనుడి, దోచుకొనబడినవానిని బాధపెట్టువాని చేతిలోనుండి విడిపించుడి,
పరదేశులనైనను తండ్రిలేనివారినైనను విధవ రాండ్రనైనను బాధింపకుడి వారికి
ఉపద్రవము కలుగజేయకుడి, ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందింపకుడి.
యెహెజ్కేలు 45:9
మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఇశ్రాయేలీయుల అధిపతులారా, మీరు జరిగించిన
బలాత్కారమును దోచుకొనిన దోపును చాలును; ఆలాగు చేయుట మాని నా జనుల
సొమ్మును అపహరింపక నీతి న్యాయముల ననుసరించి నడుచుకొనుడి; ఇదే
ప్రభువగు యెహోవా వాక్కు.
నిర్గమ 22:
21. పరదేశిని విసికింపవద్దు, బాధింపవద్దు;
మీరు ఐగుప్తు దేశ ములో పరదేశులై యుంటిరి గదా.
22. విధవరాలినైనను దిక్కులేని పిల్లనైనను బాధపెట్ట కూడదు.
23.వారు నీచేత ఏ విధముగా నైనను బాధనొంది నాకు మొఱ పెట్టినయెడల నేను
నిశ్చయముగా వారి మొఱను విందును.
లేవీ
25:17
మీరు ఒకరి నొకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను. నేను మీ దేవుడనైన
యెహోవాను.
ద్వితీ 10:
18. ఆయన తలిదండ్రులు లేనివానికిని విధవరాలికిని న్యాయము తీర్చి,
పరదేశియందు దయ యుంచి అన్నవస్త్రముల ననుగ్రహించువాడు.
19. మీరు ఐగుప్తు దేశములో పరదేశులై యుంటిరి గనుక పరదేశిని జాలి తలచుండి.
చివరగా మీకా 6:
6. ఏమి తీసికొని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసికొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును?
దహనబలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా?
7. వేలకొలది పొట్టేళ్లును వేలాది నదులంత విస్తారమైన
తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని
నేనిత్తునా? నా పాపపరిహారమునకై నా గర్భ ఫలమును నేనిత్తునా?
8. *మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది*;
*న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు,
దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు*.
ఇక క్రొత్త నిబంధనలో కొన్ని చూసుకుందాం.
ఎఫేసి 4:32
ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన
ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.
రోమా 12:10, 17,
19, 20
10. సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగము గలవారై, ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి.
17. కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు; మనుష్యులందరి
దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి యుండుడి.
18. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.
19. ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక,
దేవుని ఉగ్రతకు చోటియ్యుడి పగతీర్చుట నా పని, నేనే
ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది.
20. కాబట్టి, నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి
భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము; ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు.
కొలస్సీ ౩:
12. కాగా, దేవునిచేత ఏర్పరచ బడినవారును పరిశుద్ధులును
ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును,
దీర్ఘశాంతమును ధరించుకొనుడి.
13. ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనిన యెడల ఒకనినొకడు సహించుచు
ఒకనినొకడు క్షమించుడి, ప్రభువు (క్రీస్తు)మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి.
ఇంకా చాలా ఉన్నాయి గాని చివరిగా ముఖ్యమైనది యాకోబు 1:27
తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను
విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము
తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.
ఇదే నిజమైన భక్తి అని దేవుడు చెబుతున్నారు. దేవునికి మనలో కావలసిన గుణాలు ఇవే! మన భక్తి, గొప్ప కార్యాలు, దీర్ఘ ప్రార్ధనలు ఉపవాసాలు, గొప్ప కానుకలు, దశమభాగాలు ఇవికాదు దేవుడు మనలో కావాలని మొదటగా ఆశించేది. మొదట మనుష్యుల మధ్య, పొరుగువారి మధ్య, అన్నదమ్ముల మధ్య ప్రేమానురాగాలు కావాలి. నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమించగలగాలి. ఆ తర్వాత నీవు చేసే ప్రార్ధనలు, భక్తి ఉపవాసం, కానుకలు మ్రొక్కుబడులు. దయచేసి ఈ విషయం గమనించి గ్రహించమని మనవిచేస్తున్నాను.
ఇక తర్వాత మాటలలో దేవుడు చెబుతున్నారు- ఈ విషయాన్ని పూర్వకాలంలో ప్రవక్తల చేత చెప్పించినా మీ పూర్వికులు వినలేదు అందుకే నేను వారిమీద కోపగించాను. దూరదేశాలకు తరిమాను . మీరుకూడా అలా చేయవద్దని ప్రేమతో హెచ్చరిస్తున్నారు. 11—12
యెషయా 1:2
యెహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా, ఆలకించుము; భూమీ,
చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా
చేసితిని వారు నామీద తిరుగబడియున్నారు.
యిర్మియా 5:౩
యెహోవా, యథార్థతమీదనే గదా నీవు దృష్టి యుంచుచున్నావు?
నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలుగలేదు; వారిని క్షీణింప జేసియున్నావు గాని వారు శిక్షకు లోబడనొల్లకున్నారు.
రాతికంటె తమ ముఖములను కఠినముగా చేసికొనియున్నారు, మళ్లుటకు సమ్మతింపరు.
యిర్మియా 8:5
యెరూషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు? వారు మోసమును ఆశ్రయము
చేసికొని తిరిగి రామని యేల చెప్పుచున్నారు?
యిర్మియా 32:౩౩
నేను పెందలకడ లేచి వారికి బోధించినను వారు నా బోధ నంగీకరింపక పోయిరి, వారు నా తట్టు
ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి.
నెహేమ్యా 9:౩౦
నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి, నీ ప్రవక్తలద్వారా నీ ఆత్మచేత వారిమీద
సాక్ష్యము పలికితివి గాని వారు వినక పోయిరి; కాగా నీవు ఆయా దేశములలోనున్న
జనుల చేతికి వారిని అప్పగించితివి.
ప్రియ దైవజనమా! మనము కూడా అలా ప్రవర్తించకూడదు. దేవుడు పిలిచినప్పుడు విందాం. ఆయన బుద్ది చెప్పినప్పుడు మాట విని ఆయన మార్గంలో నడుచుకుందాం. లేకపోతే ఇశ్రాయేలు మీదకు వచ్చిన తీర్పులే మనకు కూడా వస్తాయి. వారిని శ్రమ పరచిన దేవుడు మనలను కూడా శ్రమపెట్ట గలరు. కాబట్టి నేడే బుద్ధి తెచ్చుకుందాం!
సామెతలు 1:24, 28
24.నేను పిలువగా మీరు వినకపోతిరి. నా చేయిచాపగా
ఎవరును లక్ష్యపెట్టకపోయిరి
28.అప్పుడు వారు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టెదరుగాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును
నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను కనబడ కుందును.
కీర్తనలు 18:25—26
25. దయగలవారియెడల నీవు దయచూపించుదువు యథార్థవంతులయెడల యథార్థవంతుడవుగా
నుందువు
26. సద్భావముగలవారియెడల నీవు సద్భావము చూపుదువు. మూర్ఖులయెడల నీవు వికటముగా నుందువు
కాబట్టి ఆయన మార్గములలో నడుద్దాం!
అందరితో ప్రేమగా ఉందాం! క్రీస్తు ప్రేమను పంచుదాం!
ఇశ్రాయేలు దేశం పాడుగా అవ్వడానికి కారణం ఇశ్రాయేలు జనాంగమే!
అలాగే ఇప్పుడు మనం కూడా పాడైపోతే దానికి కారణం మనమే!
మనలను మనము సరిచేసుకుందాం!
దేవునితో సమాధాన పడదాం!
నిత్య రాజ్యంలో ప్రవేశిద్దాం!
దైవాశీస్సులు!
*హతస్సాక్షి జెకర్యా-19వ భాగము*
*5,7,10 నెలలలో ఉపవాసం-3*
జెకర్యా 8:1—5 ......
1. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ప్రత్యక్షమై యీలాగు
సెలవిచ్చెను.
2. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా మిగుల ఆసక్తితో
నేను సీయోను విషయమందు రోషము వహించియున్నాను. బహు రౌద్రము గలవాడనై
దాని విషయమందు నేను రోషము వహించియున్నాను.
3. యెహోవా సెలవిచ్చునదేమనగా నేను సీయోను నొద్దకు మరల వచ్చి,
యెరూషలేములో నివాసముచేతును, సత్యమును అనుసరించు
పురమనియు, సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు
పేర్లు పెట్టబడును.
4. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా
అందరును వృద్ధత్వముచేత కఱ్ఱపట్టుకొని, వృద్ధులేమి వృద్ధురాండ్రేమి
ఇంకను యెరూషలేము వీధులలో కూర్చుందురు.
5. ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగ పిల్లలతోను ఆడు పిల్లలతోను
నిండియుండును.
ప్రియ దైవజనమా! గతభాగం నుండి జెకర్యా గారి ప్రవచనాలను ధ్యానం చేసుకుంటున్నాం! గత రెండు భాగాలలో ఏడవ అధ్యాయంలో గల ప్రవచనం ధ్యానం చేసాము. 8వ అధ్యాయంలో దానినే కొనసాగిస్తున్నారు. ఈ రోజు దీనిని ధ్యానం చేద్దాం!
(గతభాగం తరువాయి)
మొదటి వచనంలో మరియు అని మొదలుపెట్టారు కాబట్టి ఏడవ అధ్యాయములో గల విషయాన్నే ఇక్కడ కొనసాగిస్తున్నారు అని గమనించాలి. ఏడవ అధ్యాయంలో మొదలుపెట్టిన అంశం ఏమిటి? 5,7,10
వ నెలలలో ఉపవాసం ఉండాలా వద్దా? దానినే కొనసాగిస్తున్నారు. మొదటగా చెడామడా వాయించి తర్వాత కరుణ చూపించి దయగల మాటలు చెబుతున్నారు. ఎంతైనా తండ్రిప్రేమ కదా దానినే చూపిస్తున్నారు.
ఇక ఈ 8వ అధ్యాయం మొదట్లో ఏమంటున్నారో చూద్దాం.
2.. మిగుల ఆసక్తితో నేను సీయోను విషయమందు రోషము వహించియున్నాను,
దేనికి రోషం క్రింద వచనాలలో ఉంది..౩—5
అయితే మిగతా గ్రంధాలలోని కూడా దేవుడు అదే చెప్పారు. కొంచెం కోపపడితే
వారు ఎంతో ఉగ్రత చూపించారు, కాబట్టి యేరూషలేమును ఇశ్రాయేలు ప్రజలను
శిక్షించడానికి నేను ఎంత రోషము వహించానో అలాగే కట్టడానికి వారిని పునరుద్ధరించడానికి
కూడా అంతే రోషముగా, ఆసక్తిగా కడతాను అంటున్నారు.
యిర్మియా 31:28
వారిని పెల్లగించుటకును విరుగగొట్టుటకును పడద్రోయుట కును నాశనము చేయుటకును హింసించుటకును
నేనేలాగు కనిపెట్టి యుంటినో ఆలాగే వారిని స్థాపించుటకును నాటుటకును కనిపెట్టియుందును; ఇదే యెహోవా వాక్కు.
జెకర్యా 8:13
యూదావారలారా, ఇశ్రాయేలువారలారా, మీరు అన్యజనులలో నేలాగు
శాపాస్పదమై యుంటిరో ఆలాగే మీరు ఆశీర్వాదాస్పద మగునట్లు నేను మిమ్మును రక్షింతును;
భయపడక ధైర్యము తెచ్చుకొనుడి.
మూడవ వచనంలో నేను సీయోను నొద్దకు మరలా వచ్చి యేరూషలేములో నివాసం చేతును అంటున్నారు. ఈ అధ్యాయంలోని ఈ గ్రంధంలోను దేవుడు ఎక్కువగా సీయోను అని పిలవడం చూడగలరు. సీయోను అనగా దావీదు పురము. 2 సమూయేలు 5:7; ఇక తర్వాత ఇశ్రాయేలు ప్రజలను సీయోను కుమారి అనియు, సీయోను అని పిలవడం మొదలుపెట్టారు. 2రాజులు 19:21 తర్వాత నుండి. తర్వాత నా పరిశుద్ధ పర్వతమయన సీయోనుమీద నా రాజును నిలబెడతాను. కీర్తనలు 2:6; ఇశ్రాయేలు ప్రజలను సీయోను వాసులుగా దేవుడు అనేకసార్లు పిలిచేవారు. అంటే ఇప్పుడు వారితో దేవుడు చేసిన ఆత్మీయ నిభందనను గుర్తుకు చేసుకుంటున్నారు అన్నమాట! అలాగే ఆయన ఆత్మీయ యేరూషలేము నిర్మాణం కోసం కూడా చెబుతున్నారు! కారణం మనకు ప్రకటన 14వ అధ్యాయంలో పరమ సీయోను కనబడుతుంది. వారు ఎవరూ అనేది ఆ అధ్యాయంలో ఉంది. కాబట్టి ఎప్పుడైతే దేవుడు యెరూషలేము, సీయోను అని రెండు పిలుస్తున్నారో ఈ గ్రంధంలో దాని అర్థం కేవలం భూమి మీదనున్న యెరూషలేము అని కాకుండా ఆత్మీయ యెరూషలేము, పరమ సీయోను కోసం కూడా చెప్పబడుతుంది అని గ్రహించాలి.
ఈ వచనంలో మూడు ఆశీర్వాదాలు కనిపిస్తున్నాయి లేక ఇస్తున్నారు దేవుడు: ఒకటి సీయోను వద్దకు వచ్చి యేరూషలేములో నివాసం చేస్తాను అనేది.
రెండవది: సత్యము అనుసరించు పురము అని దానికి పేరు పెడతాను.
మూడు: యెహోవా పర్వతము, పరిశుద్ధ పర్వతము అనే పేర్లు పెడతాను అంటున్నారు. గమనించాలి ఇవన్నీ అంత్యదినాలలో జరగబోయేవి.
మొదటి ఆశీర్వాదానికి సూచనగా చాలా వాగ్దానాలు చేశారు:
జెకర్యా 1:16,17
16. కాబట్టి యెహోవా సెలవిచ్చున దేమనగా వాత్సల్యముగలవాడనై నేను యెరూషలేము
తట్టు తిరిగియున్నాను; అందులో నా మందిరము కట్ట బడును;
యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగ లాగుదురు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.
17. నీవు ఇంకను ప్రకటన చేయవలసినదేమనగా ఇక నా పట్టణములు భాగ్యముతో
మరి ఎక్కువగా నింపబడును, ఇంకను యెహోవా సీయోనును ఓదార్చును,
యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును.
జెకర్యా 2:10
సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసముచేతును;
సంతోషముగా నుండి పాటలు పాడుడి; ఇదే యెహోవా వాక్కు.
యేహెజ్కేలు 48:35
దాని కైవారము పదునెనిమిదివేల కొలకఱ్ఱల పరిమాణము. యెహోవా యుండు స్థలమని
నాటనుండి ఆ పట్టణమునకు పేరు.
ఇక రెండవ ఆశీర్వాదానికి: ఆ పేరు పెట్టడానికి కారణం గతభాగాలలో చూసుకున్నాం- ఆరవ అధ్యాయంలో ఎగిరి పోవు పుస్తకం దర్శనంలో దేవుడు అప్పుడే అబద్ద ప్రమాణికులను వెళ్లగొట్టేశారు కాబట్టి ఇప్పుడు సత్యమును పలికేవారు దానిలో ఉన్నారు కాబట్టి ఆయన పేరు సత్యవంతుడు కాబట్టి, ఆయనే మార్గము సత్యము జీవము కాబట్టి ఇప్పుడు ఆయనే ఈ సీయోనులో ఉంటాను అని వాగ్దానం చేశారు కాబట్టి సత్యమును అనుసరించు పురము అని పేరు పెట్టబడింది.
ప్రకటన 19:11
మరియు పరలోకము తెరువబడియుండుట చూచితిని. అప్పుడిదిగో, తెల్లని గుఱ్ఱమొకటి కనబడెను. దానిమీద కూర్చుండియున్నవాడు
నమ్మకమైనవాడును సత్యవంతు డును అను నామము గలవాడు. ఆయన నీతినిబట్టి
విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు
యోహాను 14: 6
యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును;
నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.
యెషయా 1: 26
మొదటనుండినట్లు నీకు న్యాయాధిపతులను మరల ఇచ్చెదను ఆదిలోనుండినట్లు నీకు ఆలోచనకర్తలను
మరల నియమించెదను అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును.
ఇక మూడవ దీవెన : పరిశుద్ద పర్వతము దేవుని పర్వతం
మీకా
4: 1
అంత్యదినములలో యెహోవా మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండలకంటె ఎత్తుగా
ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు.
యెషయా 2:
2. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున
స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి
వచ్చెదరు
3. ఆ కాలమున సీయోనులోనుండి ధర్మశాస్త్రము యెరూషలేములోనుండి యెహోవా
వాక్కు బయలు వెళ్లును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు
దేవుని మందిరమునకు యెహోవా పర్వత మునకు మనము వెళ్లుదము రండి ఆయన తన మార్గముల విషయమై
మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు.
ఓబద్యా 1: 17
అయితే సీయోను కొండ ప్రతిష్ఠితమగును, తప్పించుకొనినవారు దానిమీద నివసింతురు, యాకోబు సంతతివారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు.
ఇక 4—5 వచనాలలో ......
4. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా
అందరును వృద్ధత్వముచేత కఱ్ఱపట్టుకొని, వృద్ధులేమి వృద్ధురాండ్రేమి
ఇంకను యెరూషలేము వీధులలో కూర్చుందురు.
5. ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగ పిల్లలతోను ఆడు పిల్లలతోను
నిండియుండును.
సరే, ఇలా చెబితే 6వ వచనంలో వారికి కలిగే అనుమానం దేవుడు ముందుగానే ఉటంకిస్తున్నారు. ఇలా జరగగలదా? ఎందుకంటే దేశం సర్వనాశనం అయ్యింది. అతి కొద్దిమంది మాత్రమే వచ్చారు తిరిగి. దేశం నిర్మానుష్యం గా ఉంది. అక్కడక్కడ ప్రజలు ఉంటున్నారు. ప్రజలు తక్కువ ప్రాంతమెక్కువ. కాబట్టి
4—5 వచనాలలో గల సమృద్ది, శాంతి అభివృద్ధి వారికి కలుగుతుందా అని అనుమానం రావచ్చు. అందుకే దేవుడు చెబుతున్నారు మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు అయితే అది నాకు ఆశ్చర్యం కాదు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని ఒకసారి (ఆదికాండం
18:14), మనుష్యలకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యము అంటున్నారు.
(మత్తయి
19:26; మార్కు
10:27)
ప్రియ దైవజనమా! దేవుడు అసాధ్యాలను సుసాధ్యాలుగా చేయగలరు. ఏ చేతితో కొట్టారో అదే చేతితో పెడతారు. దీవిస్తారు. కేవలం ఆయన మీద నమ్మకం కలిగి, కష్టమైనా నష్టమైనా నీవే నాకు దిక్కు ప్రభువా అని ఆయన పాదాల దగ్గర కనిపెడితే తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తారు. మరి నీవు సిద్దమా?
*ప్రియ దైవజనమా! ఒకసారి ఇక్కడ ఆగి పరిశీలన చేద్దాం. పైన చెప్పిన అన్ని విషయాలు, రిఫరెన్సులు జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది నూతన నిబంధన సంఘానికి కూడా వర్తిస్తుంది అని గ్రహించగలము. అలాగే పరమ సీయోనుకు సాదృశ్యంగా కనిపిస్తుంది. నేను మీమద్య నివాసం చేస్తాను అంటున్నారు అనగా మొదటగా మారుమనస్సు పొంది క్రీస్తు రక్తంలో కడుగబడిన వారు నీతిమంతులుగా తీర్చబడి నూతన నిబంధన సంఘంలో చేర్చబడ్డారు. ఆ తర్వాత వారియొక్క ఆత్మీయ ఆధ్యాత్మిక స్థితి, ఉన్నతమైన ఆత్మీయానుభవం లోనికి వెళ్లడం సీయోను అనుభవంగా చెప్పుకోవచ్చు. సీయోనును కట్టడం అంటే ఇదే! నూతన నిబంధన సంఘంలో సీయోను అనేది ఉన్నతమైన ఆత్మీయ అనుభవం! యెరూషలేము మీదన సీయోనుపురము, కొండ ఎలా ఉన్నదో అలాగే ఒకవ్యక్తి ఉన్నతమైన ఆత్మీయానుభవం సాధించడం కూడా ఒకమెట్టు! అనగా ఒకవ్యక్తి రక్షించబడి మారుమనస్సు అనుభవం పొంది పరిశుధ్దాత్మ పూర్ణుడై ఆత్మానుసారమైన జీవితం కలిగి ఒకమెట్టునుండి ఇంకా ఉన్నతమైన ఆత్మానుభవం కలిగి ఉండటమే సీయోనుగా కట్టబడటం! మూడు ఆశీర్వాదాలలో మొదటిది దేవునిఆత్మ వారిలో నివాసం చేయడం. రెండవది సత్యమును అనుసరించు పట్టణం అనేపేరు ఎందుకు కలిగింది అంటే వీరు ఆత్మను పొందుకున్నారు కాబట్టి పరిశుద్ధాత్ముడు వారిని సర్వ సత్యము లోనికి నడిపిస్తున్నారు కాబట్టి ఆయన నీతి వీరిని నీతిమంతులుగా తీర్చింది కాబట్టి నీతిగల పట్టణముగా అనగా సత్యమైన నీతిగల పట్టణముగా, సంఘముగా సీయోను అనుభవంలో ఉన్నారు. ఇంకా మూడవది పరిశుద్ధ పర్వతం అని ఎందుకు పిలుస్తున్నారు అంటే పరిశుద్ధులు నివాసం చేస్తున్నారు కాబట్టి. ఆ పర్వతం అంత ఎత్తుగా ఎందుకుంది అంటే వీరి ఆత్మీయ స్థితి అంత ఉన్నతముగా ఉంది కాబట్టి వీరు పరమ సీయోనుగా కట్టబడుతున్నారు. ఇలాగే వీరు పరిపూర్ణత సాధిస్తారు. కాబట్టి వీటన్నిటినీ బట్టి ఇది నూతన నిబంధన సంఘానికి, సీయోనుకు సాదృశ్యంగా కనిపిస్తుంది*
గమనించాలి దేవుడు చెబుతున్నారు యాకోబు గుమ్మములకంటే నేను సీయోను ను కోరుకుంటున్నాను.
కీర్తనలు 87:
2,3
యాకోబు నివాసములన్నిటికంటె సీయోను గుమ్మ ములు యెహోవాకు ప్రియములై యున్నవి.
దేవుని పట్టణమా, మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు.
ప్రియ స్నేహితుడా! ఆ సంఘములో సీయోను లో నీవున్నావా? ఉండాలని ఆశిస్తున్నావా? అయితే నీవు ఆత్మానుసారమైన జీవితం, సాక్ష్యార్ధమైన జీవితం పవిత్రమైన జీవితం జీవిస్తూ ఉన్నతమైన అనుభవం లోనికి వెళ్లగలగాలి. అప్పుడు మాత్రమే ఆ పరమ సీయోనులో ప్రవేశించ గలవు!
దైవాశీస్సులు!
(ఇంకాఉంది)
*హతస్సాక్షి జెకర్యా-20వ భాగము*
*5,7,10 నెలలలో ఉపవాసం-4*
జెకర్యా 8:4—5 ......
4. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా
అందరును వృద్ధత్వముచేత కఱ్ఱపట్టుకొని, వృద్ధులేమి వృద్ధురాండ్రేమి
ఇంకను యెరూషలేము వీధులలో కూర్చుందురు.
5. ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగ పిల్లలతోను ఆడు పిల్లలతోను
నిండియుండును.
ప్రియ దైవజనమా! గతభాగం నుండి జెకర్యా గారి ప్రవచనాలను ధ్యానం చేసుకుంటున్నాం!
(గతభాగం తరువాయి)
ప్రియ దైవజనమా! గతభాగంలో చెప్పినట్లు ఈ ప్రవచన నెరవేర్పు అంత్యకాలంలో జరుగుతుంది. అనగా యేసుక్రీస్తు ప్రభులవారి ప్రత్యక్ష పరిపాలనలో అనగా క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి కలిగాక జరుగుతాయి.
దీనికోసం యెషయా గారు కూడా ప్రవచించారు.
యెషయా 11:
6. తోడేలు గొఱ్ఱెపిల్లయొద్ద వాసముచేయును చిఱుతపులి మేకపిల్లయొద్ద
పండుకొనును దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును.
7. ఆవులు ఎలుగులు కూడి మేయును వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును
ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును.
8. పాలుకుడుచు పిల్ల నాగుపాము పుట్టయొద్ద ఆటలాడును మిడినాగు పుట్టమీద
పాలువిడిచిన పిల్ల తన చెయ్యి చాచును
9. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు నాశముచేయదు సముద్రము
జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యుండును.
యెషయా గ్రంథము 65:17,20,21,22,23,24,25
17. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను
మునుపటివి మరువబడును జ్ఞాపకమునకురావు.
20. అక్కడ ఇకను కొద్దిదినములే బ్రదుకు శిశువులుండరు కాలమునిండని
ముసలివారుండరు బాలురు నూరు సంవత్సరముల వయస్సుగలవారై చని పోవుదురు పాపాత్ముడై శాపగ్రస్తుడగువాడు
సహితము నూరు సంవత్సరములు బ్రదుకును
21. జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు ద్రాక్షతోటలు నాటించుకొని
వాటి ఫలముల ననుభ వింతురు.
22. వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరు వారు నాటుకొన్నవాటిని
వేరొకరు అనుభవింపరు నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును నేను ఏర్పరచుకొనినవారు తాము
చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభ వింతురు
23. వారు వృథాగా ప్రయాసపడరు ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను
కనరు వారు యెహోవాచేత ఆశీర్వదింపబడిన వారగుదురు వారి సంతానపువారు వారియొద్దనే యుందురు.
24. వారికీలాగున జరుగును వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను
వారు మనవి చేయుచుండగా నేను ఆలంకిచెదను.
25. తోడేళ్లును గొఱ్ఱెపిల్లలును కలిసి మేయును సింహము ఎద్దువలె గడ్డి
తినును సర్పమునకు మన్ను ఆహారమగును నా పరిశుద్ధపర్వతములో అవి హానియైనను నాశన మైనను చేయకుండును
అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
ఇవి తొందరలో జరగబోతున్నాయి- అయితే ఆ రాజ్యములో నీవు నేను ఉంటామా అనేదే మిల్లియన్ డాలర్ల ప్రశ్న! గమనించ గలరు కేవలం 4వ నెలలో ఉపవాసం, 5వ నెలలో ఉపవాసం, 7వ నెలలో ఉపవాసం, 10వ నెలలో ఉపవాసం ఉంటే సరిపోదు. దేవుడు చెప్పినట్లు చెయ్యాలి, వాక్యానుసారమైన జీవితం, సాక్షార్ధమైన జీవితం, ఆత్మానుసారమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటేనే సాధ్యం అది. అలాగే పరిపూర్ణులగుటకు సాగిపోవాలి. హెబ్రీ 6:2; మరి అవి నీలో ఉన్నాయా ఒకసారి పరిశీలన చేసుకోమని మనవిచేస్తున్నాను!
ఇక 7—8 వచనాలలో ......
Zechariah(జెకర్యా) 8:7,8
7. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా తూర్పు దేశములోనుండియు
పడమటి దేశములో నుండియు నేను నా జనులను రప్పించి రక్షించి
8. యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చెదను, వారు నా జనులైయుందురు, నేను వారికి దేవుడనై యుందును;
ఇది నీతి సత్యములనుబట్టి జరుగును.
ఇక్కడ ఒకసారి ఆగి ఆలోచిద్దాం! దేవుడు ఇప్పటికే అనగా జెకర్యా గారికి ఈ ప్రవచనం కలిగేసరికే ఎంతోమంది యూదులను తిరిగి ఇశ్రాయేలు దేశం తీసుకుని వచ్చారు. గాని మరోసారి చెబుతున్నారు తూర్పునుండి పడమట నుండి ఇంకా అనేక దిక్కులనుండి నా ప్రజలను తీసుకుని వస్తాను అంటున్నారు. అనగా ఇప్పటికే వచ్చినవారు కాకుండా ఇంకా అనేక ప్రాంతాలలో దేశాలలో ఉన్న వారిని మరలా రప్పిస్తాను అని చెప్పడం అన్నమాట! అవును ఇది ఇప్పటికి రెండుసార్లు జరిగింది. మొదటగా అర్తహసస్త కాలంలో ఎజ్రా, నెహేమ్యా గారికాలంలో చివరగా ప్రజలు మరలా వచ్చారు. ఎంతోమంది వారిస్వదేశానికి వచ్చారు. అభివృద్ధి పొందారు. ఒకసారి జరిగింది ఇది.
తర్వాత వారు యేసుక్రీస్తు ప్రభులవారి రక్తం మామీద మా పిల్లలమీద
ఉండాలి అన్నందుకు భూలోకంలో ఉన్న అన్ని దిక్కులకు చెదిరిపోయారు. క్రీ.శ 70లో పూర్తిగా కూల్చబడింది. అన్యులు
దానిలో నివాసం ఉన్నారు. అయితే దేవుడు దయామయుడు మరలా వారు
1947 నుండి తిరిగి రావడం మొదలుపెట్టారు. కాబట్టి
ఇది రెండవమారు కూడా జరిగింది. వారు ఇంకా వస్తూనే ఉన్నారు నేటికి
కూడా!
ఆమోసు 9:14—15
14. మరియు శ్రమనొందుచున్న నా జనులగు ఇశ్రాయేలీయులను నేను చెరలోనుండి
రప్పింతును, పాడైన పట్టణములను మరల కట్టుకొని వారు కాపురముందురు,
ద్రాక్షతోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములువేసి
వాటి పండ్లను తిందురు.
15. వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను
వారికిచ్చిన దేశములోనుండి వారు ఇక పెరికివేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు.
యెషయా 11:10—16
11. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులోనుండియు ఐగుప్తులోనుండియు
పత్రోసులోనుండియు కూషులోనుండియు ఏలాములోనుండియు షీనారులోనుండియు హమాతులో నుండియు సముద్రద్వీపములలోనుండియు
విడిపించి రప్పించుటకు యెహోవా రెండవమారు తన చెయ్యి చాచును
12. జనములను పిలుచుటకు ఆయన యొక ధ్వజము నిలువ బెట్టును భ్రష్టులైపోయిన
ఇశ్రాయేలీయులను పోగుచేయును భూమియొక్క నాలుగు దిగంతములనుండి చెదరి పోయిన యూదా వారిని
సమకూర్చును.
13. ఎఫ్రాయిమునకున్న మత్సరము పోవును యూదా విరోధులు నిర్మూలమగుదురు
ఎఫ్రాయిము యూదాయందు మత్సరపడడు యూదా ఎఫ్రాయిమును బాధింపడు
14. వారు ఫిలిష్తీయుల భుజముమీద ఎక్కుదురు పడమటివైపుకు పరుగెత్తిపోవుదురు
ఏకీభవించి తూర్పువారిని దోచుకొందురు ఎదోమును మోయాబును ఆక్రమించుకొందురు అమ్మోనీయులు
వారికి లోబడుదురు
15. మరియు యెహోవా ఐగుప్తు సముద్రముయొక్క అఖాతమును నిర్మూలము చేయును
వేడిమిగల తన ఊపిరిని ఊదును యూఫ్రటీసు నది మీద తన చెయ్యి ఆడించును ఏడు కాలువలుగా దాని
చీలగొట్టును పాదరక్షలు తడువకుండ మనుష్యులు దాటునట్లు దాని చేయును.
16. కావున ఐగుప్తుదేశమునుండి ఇశ్రాయేలు వచ్చిన దినమున వారికి దారి
కలిగినట్లు అష్షూరునుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గముండును
ఇంకా ఇదే వచనంలో దేవుడు నా ప్రజలు అంటున్నారు: ఇక్కడ నా ప్రజలు అనగా ఇశ్రాయేలు వారు
అని జ్ఞాపకం చేసుకోవాలి,.
హోషేయ
2:14—23... కూడా చూడండి.
ఇక తర్వాత వచనాలలో పలికిన మాటలు చూసుకుంటే ఇంతవరకు మీరు మందిరాన్ని పూర్తి చెయ్యలేదు . ఇప్పుడు మీరు మొదలుపెట్టండి దాని నేను పూర్తిచేస్తాను. అంతేకాదు మిమ్మలను దీవిస్తాను అంటున్నారు. ఇంకా మందిరపు పునాది వేసిన దినమున ప్రవక్తల మాటలు విన్నవారలారా, మాట వినువారలారా అనగా ప్రవక్తలు చెప్పినట్లు చేసేవారలారా! దైర్యము తెచ్చుకోండి అంటున్నారు దేవుడు!ఇక్కడ ప్రవక్తలు అనగా ప్రవక్తయైన హగ్గయి గారు, జెకర్యా గారు. బహుశా ఇంకా ఉన్నారేమో తెలియదు! అయితే ఎవరైతే దేవుని ప్రవక్తల మాటలు విని దేవుని పనిని మొదలుపెట్టారో వారికి దేవుడు చెబుతున్నారు- మందిర పనిని కొనసాగించండి. నేను మీతో ఉండి మిమ్మల్ని దీవించి నా పని చేసుకుంటాను అంటున్నారు. ఈ సందర్భంగా మరోసారి గుర్తుకు చేస్తున్నాను- హగ్గయిగారిని, జెకర్యా గారిని దేవుడు పంపడానికి కారణం- వారు చెరలోనుండి వచ్చిన రెండవ సంవత్సరంలో మందిర పునాదివేసి పని మొదలుపెట్టినా గాని 18 సంవత్సరాలు గడిచిపోయాయి గాని మందిరం పూర్తికాలేదు. దానికి కారణాలు మొదటిబాగాలలో వివరించాను. ఒక కారణం సమరయుల శ్రమలు, ఆటంకాలు. వారు రాజులకు చెప్పి పనిని ఆటంకపరిచారు. ఇంకా కరువు కాటకాలు. దానికోసం తర్వాత మాట్లాడుకోవచ్చు! అందుకే ఇప్పుడు దేవుడు ఈ ఇద్దరు ప్రవక్తలను ఉపయోగించుకుని వారి మనస్సులను రేపి తన పనిని పూర్తిచేసుకుంటున్నారు. అందుకే దైర్యం తెచ్చుకోండి అంటున్నారు. హగ్గయి ద్వారా మొదట దేవుడు మాట్లాడటం మొదలుపెట్టారు.
హగ్గయి 1:7—8
7. కాగా సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా మీ ప్రవర్తనను
గూర్చి ఆలోచించుకొనుడి.
8. పర్వతములెక్కి మ్రాను తీసికొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించినయెడల
దానియందు నేను సంతోషించి నన్ను ఘనపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
ఇంకా నా మందిరం పాడై యుండగా మీరు సరంభీ వేసిన గృహాలలో ఉండటం న్యాయమా? అని అడిగారు దేవుడు.
హగ్గయి 2:4
అలా చెప్పిన తర్వాత ఎజ్రా ౩:10—11 చెప్పినట్లు మందిరం కట్టడం మరలా ప్రారంభించారు.
ఇక ఈ జెకర్యా
8:10—11 లో మీకు ఇంతవరకు కరవుకాటకాలు ఎందుకు వచ్చాయో చెబుతున్నారు.....
10. ఆ దినములకు ముందు మనుష్యులకు కూలి దొరకక యుండెను, పశువుల పనికి బాడిగ దొరకకపోయెను, తన పనిమీద పోవువానికి
శత్రుభయము చేత నెమ్మది లేకపోయెను; ఏలయనగా ఒకరిమీదికొకరిని నేను
రేపుచుంటిని.
11. అయితే పూర్వదినములలో నేను ఈ జనులలో శేషించిన వారికి విరోధినైనట్టు
ఇప్పుడు విరోధిగా ఉండను.
ముందు రోజులు అనగా మందిరం పునాది వేయబడక ముందు ప్రజలు చాలా కష్టాలలో ఉండేవారు. ప్రజలు పేదరికంలో ఉన్నారు.
హగ్గయి 1:6—11
6. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను
దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది,
పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో
వేసినట్టుగా ఉన్నది.
9. విస్తారముగా కావలెనని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగా పండెను;
మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టితిని; *ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడైయుండగా
మీరందరు మీ మీ యిండ్లు కట్టుకొనుటకు త్వరపడుటచేతనే గదా*.
10. *కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపుమంచు కురువకయున్నది, భూమి పండకయున్నది*.
11. నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగజేసి,
ధాన్యము విషయములోను ద్రాక్షారసము విషయములోను తైలము విషయములోను భూమి ఫలించు
సమస్తము విషయములోను మనుష్యుల విషయములోను పశువుల విషయములోను చేతిపనులన్నిటి విషయములోను
క్షామము పుట్టించియున్నాను.
హగ్గయి 2:15—19
15. ఈ రాతి మీద రాయియుంచి యెహోవా మందిరము కట్టనారంభించినది మొదలుకొని
ఆ వెనుక మీకు సంభవించినదానిని ఆలోచనచేసికొనుడి.
16. నాటనుండి యొకడు ఇరువది కుప్పల కంకులు వేయగా పది
కుప్పలంత ధాన్యమే తేలుచున్నది; తీసికొనవలెనని ఏబది కొలల తొట్టియొద్దకు
ఒకడు రాగా ఇరువదికొలలు మాత్రమేదొరకును.
17. *తెగులుతోను కాటుకతోను వడగండ్లతోను మీ కష్టార్జితమంతటిని
నేను నాశనము చేసియున్నాను; అయినను మీలో ఒకడును తిరిగి నాయొద్దకు
రాలేదు; ఇదే యెహోవా వాక్కు*.
18. మీరు ఆలోచించుకొనుడి. ఇంతకుముందుగా తొమ్మిదవ
నెల యిరువది నాలుగవ దినమునుండి, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన
నాటనుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి.
19. కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్షచెట్లయినను
అంజూరపు చెట్లయినను దానిమ్మ చెట్లయినను ఒలీవ చెట్లయినను ఫలించకపోయెను గదా.
*అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను*.
అయితే అలా కావడానికి కారణం హగ్గయి 1:2—4 .....
2. *సమయమింక రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు
సమయమింక రాలేదని యీ జనులు చెప్పుచున్నారే.*
3. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా
4. *ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబీ వేసిన యిండ్లలో నిసించుటకు
ఇది సమయమా*?
5. కాబట్టి సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా మీ ప్రవర్తనను
గూర్చి ఆలోచించుకొనుడి.
ఈరోజులలో కూడా చాలామంది దేవుని మందిరాలు పాడై యుండగా వారి గృహాలు కట్టుకుంటున్నారు. దేవుని పరిచర్య ఎంతో ఉండగా వారు తమ ఆస్తులను పెంచుకోవడానికి చూస్తున్నారు తప్ప దేవుని సేవ- పరిచర్యకోసం ఖర్చుపెట్టడం లేదు. సంఘం పాడైపోతుంటే పట్టించుకోవడం లేదు. ఇరుగుపొరుగువారు నాశనానికి పోతుంటే తాపీగా కూర్చొని సినిమాలు సీరియల్లు చూస్తున్నారు. కరోనాతో లోకం అల్లాడుపోతుంటే నాకెందుకు, నాకు ఏమీ కాలేదు కదా, పోతే పోనీయ్ అని నిమ్మకునీరెత్తినట్లు ఉన్నారు. ఇది భావ్యమా? వారికోసం ప్రార్ధించాల్సిన అవసరం నీమీద నామీద లేదా? అందుకే ఈ కష్టాలు నష్టాలు మనకు! అందుకే ఇప్పుడే దేవుని పనిని ప్రారంభించమంటున్నారు దేవుడు.
సరే, ఇలాంటి స్తితిలో ఉన్నారు మీరు. అయితే ఇప్పుడు మీరుపనిని మరలా మొదలుపెట్టండి. నేను మిమ్మును దీవిస్తాను అంటున్నారు దేవుడు.12.......
12. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశమునుండి మంచు కురియును, ఈ జనులలో శేషించినవారికి వీటి నన్నిటిని నేను స్వాస్థ్యముగా ఇత్తును;
ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.
ఇదేమాట హగ్గయి 2:19 లో చెబుతున్నారు.....*అయితే ఇది మొదలుకొని
నేను మిమ్మును ఆశీర్వదించెదను*.
ఇదేమాట దేవుడు నీతో నాతో చెబుతున్నారు. దేవుడు పనిని మొదలుపెట్టు! ఈరోజునుండి దేవుడు నిన్ను దీవించడం మొదలు పెట్టబోతున్నారు!!! మరి నీవు మొదలుపెడతావా?
ఎప్పుడు దేవుడు ఆశీర్వదిస్తారు అంటే విధేయత చూపించినప్పుడు!
లేవీ 26:౩—10; ద్వితీ 28:11—12 ... మాట వినకపోతే ఆకాశాన్ని ఇత్తడిగాను భూమిని ఇనుముగాను చేసేస్తాను అంటున్నారు దేవుడు!
28:23;
మాట వింటే యెషయా58:14
నీవు యెహోవాయందు ఆనందించెదవు దేశముయొక్క ఉన్నతస్థలములమీద నేను నిన్నెక్కిం చెదను
నీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యమును నీ యనుభవ ములో ఉంచెదను యెహోవా సెలవిచ్చిన వాక్కు
ఇదే.
యెషయా 60: 20
నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా
ఉండును నీ దుఃఖదినములు సమాప్తములగును.
21. నీ జనులందరు నీతిమంతులై యుందురు నన్ను నేను మహిమపరచుకొనునట్లు
వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు.
22. వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును
యెహోవానగు నేను తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును.
ఇంకా 13వ వచనంలో
...... మీరు ఎలా శాపానికి గురయ్యారో ఆరోజులలో, ఈ రోజు నామాట వింటే మీరు దీవెనకు/ ఆశీర్వాదానికి కారణంగా ఉంటారు అంటున్నారు దేవుడు!
ద్వితీ 28:37
యిర్మియా 24:9
యిర్మియా 25:18
ఎలా శాపానికి గురయ్యారో అలాగే దీవెన/ ఆశీర్వాదానికి కారణంగా ఉంటారు.
ఆదికాండం 12:1—౩
1. యెహోవానీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువుల యొద్దనుండియు నీ
తండ్రి యింటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము.
2. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామ మును గొప్ప
చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు.
3. నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమియొక్క సమస్తవంశ ములు
నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా ...
గమినించాలి=దేవుని దీవెనలు పొందటం గొప్ప విషయం అయితే- నీవే ఇతరులకు
ఆశీర్వాదంగా ఉండటం మహాద్భుతం!
మరి దేవుడు నిన్ను నన్ను అలా చెయ్యాలని కోరుకుంటున్నారు.
మరి నీవు సిద్దమా?
దైవాశీస్సులు!
(ఇంకాఉంది)
*హతస్సాక్షి జెకర్యా-21వ భాగము*
*5,7,10 నెలలలో ఉపవాసం-5*
జెకర్యా 8:18—19 ......
18. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై
యీలాగు సెలవిచ్చెను.
19. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చున దేమనగా నాలుగవ నెలలోని
ఉపవాసము, అయిదవ నెలలోని ఉపవాసము, ఏడవ నెలలోని
ఉపవాసము, పదియవ నెలలోని ఉపవాసము యూదా యింటివారికి సంతోషమును ఉత్సాహమును
పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును
ప్రియముగా ఎంచుడి.
ప్రియ దైవజనమా! గతభాగం నుండి జెకర్యా గారి ప్రవచనాలను ధ్యానం చేసుకుంటున్నాం!
(గతభాగం తరువాయి)
ప్రియ దైవజనమా! ఇంతవరకు మనం 7వ అధ్యాయంలో బేతేలు వారు అడిగిన ప్రశ్న అనగా 5,7,10 వ నెలలోని ఉపవాసం ఉండాలా వద్దా అనే ప్రశ్నకు దేవుడు చెబుతున్న సమాధానం 7,8 అధ్యాయాలలో చూసుకుంటున్నాము. దానికి దేవుడు మొదటగా మీరు నాకోసం ఉపవాసం ఉండటం లేదు. మీ మనస్సులు దూరంగా ఉంటున్నాయి. మీ స్వార్ధం కోసమే మీరు ఉపవాసాలు చేస్తున్నారు. అని చెప్పాక, దేవుడు మనిషిలో ఏమేమి కోరుకున్నారో చెప్పారు. ఆ తర్వాత వారికిచ్చే దీవెనలు చెప్పారు. ఇప్పుడు ఆ ప్రశ్నకు దేవుడు ఇప్పుడు సూటిగా సమాధానం చెబుతున్నారు.
ఇక 16—17 వచనాలు ఏడవ అధ్యాయంలో మనిషిలో తనకు కావలసిన లక్షణాలను మరలా దానికి కొనసాగింపుగా రాస్తున్నారు. ...
జెకర్యా
8:16,17
16. మీరు చేయవలసిన కార్యము లేవనగా, ప్రతివాడు
తన పొరుగు వానితో సత్యమే మాటలాడవలెను, సత్యమునుబట్టి సమాధానకరమైన
న్యాయమునుబట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను.
17. తన పొరుగువాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు, అబద్ద ప్రమాణము చేయనిష్టపడకూడదు, ఇట్టివన్నియు నాకు అసహ్యములు;
ఇదే యెహోవా వాక్కు.
ఇవే నాకు కావాలి అంటున్నారు. వీటికోసం గతభాగాలలో చెప్పుకున్నాము కాబట్టి ముందుకు పోదాం! అయితే ఈ విషయంలో మరోసారి గుర్తుకుచేస్తున్నాను సత్యమే పలకాలి అని దేవుడు మరోసారి చెబుతున్నారు. అందుకే 6వ అధ్యాయం ఎగిరిపోవు పుస్తకం దర్శనంలో అబద్దప్రమాణం చేసేవారికి శిక్ష విధించారు గమనించాలి. ఆయనపేరే సత్యవంతుడు. ప్రకటన 19:11;
నేనే మార్గము, నేనే సత్యము అన్నారు
యేసయ్య! యోహాను 14:6;
నేను సత్యము కోసం సాక్ష్యం చెప్పడానికి వచ్చాను అన్నారు పిలాతుతో యేసయ్య! యోహాను
18:37;
ఆయనకు సత్యము కావాలి.
అంతరంగములో సత్యమును కోరుచున్నారు దేవుడు. కీర్తనలు
51:6;
నిర్గమ 20:16
కీర్తన 15:2
యథార్థమైన ప్రవర్తన గలిగి నీతి ననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే.
ఎఫెసి 4:25
మనము ఒకరికొకరము అవయవములైయున్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో
సత్యమే మాటలాడవలెను.
అబద్దప్రమాణం నాకు అసహ్యం అని మరోసారి చెబుతున్నారు.
ప్రకటన 21:8
పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి
కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును
అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.
ఇదంతా చెప్పి ఇప్పుడు ఉపవాసం కోసం చెబుతున్నారు. 18—19 ...
18. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై
యీలాగు సెలవిచ్చెను.
19. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చున దేమనగా నాలుగవ నెలలోని
ఉపవాసము, అయిదవ నెలలోని ఉపవాసము, ఏడవ నెలలోని
ఉపవాసము, పదియవ నెలలోని ఉపవాసము యూదా యింటివారికి సంతోషమును ఉత్సాహమును
పుట్టించు *మనోహరములైన పండుగలగును*. *కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి*.
ఇలా చేసినప్పుడు, ఎప్పుడూ... మీద చెప్పిన
పనులన్నీ చేసిన తర్వాత మీరు ఉపవాసం ఉంటే అప్పుడు మీరు చేసే 4, 5, 7, 10 వ నెలలో ఉపవాస కాలాలు యూదా వారికి సంతోషం ఉల్లాసం తో కూడిన పండుగలు అవుతాయి
అంటున్నారు దేవుడు! *దేవుడు ఉపవాసం చెయ్యవద్దు అనడం లేదు.
చెయ్యండి గాని దానికి ముందుగా ఇంతవరకు చెప్పిన పనులు చేస్తూ అప్పుడు
ఉపవాసం ఉంటే అప్పుడు మీకు ఆశీర్వాదం మరియు దీవెన. ఆ ఉపవాసాన్ని
నేను ఇష్టపడతాను అంటున్నారు*.
ఇక 4, 5, 7,10 వ నెలలో ఎందుకోసం ఉపవాసముండేవారో గతంలో వివరించడం జరిగింది. అవన్నీ చాలా చేదు అనుభవాల వలన వచ్చిన ఉపవాసాలు. అయితే ఇప్పుడు దేవునికి ఇష్టమైనవి చేస్తూ ఈ ఉపవాస దీక్షలు చేస్తే దేవుడు ఆ దుఃఖాన్ని ఉల్లాసంగా మారుస్తాను అంటున్నారు.
యెషయా 61:3
సీయోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదెకు ప్రతిగా పూదండను
దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమును వారికిచ్చుటకును
ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనునట్లు నీతి అను మస్తకివృక్షములనియు
యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్ట బడును.
హోషేయ 2:15
అక్కడనుండి దానిని తోడుకొనివచ్చి దానికి ద్రాక్షచెట్లనిత్తును; ఆకోరు
(శ్రమగల) లోయను నిరీక్షణద్వారముగా చేసెదను,
బాల్యమున ఐగుప్తు దేశములోనుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు...
ఒకసారి మనలో మనం ఆలోచించుకుందాం! మనమెట్టి ఉపవాసాలు చేస్తున్నాం. పేరుకు మాత్రము ఉపవాస ప్రార్ధన! గాని ఫుల్ల్ గా తినేసి వస్తున్నాం ప్రార్ధనకు! మా పల్లెటూళ్ళలో ఉపవాస ప్రార్ధనలకు ఎక్కువమంది రారు గాని మిగతా సభలకు వస్తారు. ఇంకా ఉపవాస కూటములు అంటే మీటింగ్ లకు రాకుండా ఇంట్లో టీవీలు చూసే అమ్మలక్కలు బోలెడుమంది. మరి ఇలాంటి వారికి ఆ పరలోకం ఇమ్మంటే దేవుడు ఇస్తారా? మీరు ఎవరో నాకు తెలియదు. అక్రమం చేసేవారలారా గెటౌట్ అంటారు కదా!!!!
ఇక కొంతమంది ప్రభుద్దులు పేరుకు గొప్ప ప్రసంగీకులు – క్రొత్త నిబంధనలో ఉపవాసం ఉండాలి అనేది లేదు. పాత నిబంధనలోనే ఉపవాసం ఉండేవారు. క్రొత్త నిబంధనలో ఎక్కడ దశమభాగం ఇమ్మని లేదు. ఇలాంటి పనికిమాలిన చెత్త ప్రసంగాలు చేస్తూ ప్రజలను కలిపిచెరపడం చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభులవారిని కొంతమంది అడిగారు – యోహాను శిష్యులు పరిసయ్యుల శిష్యులు ఉపవాసం ఉంటున్నారు. నీ శిష్యులు ఉండటం లేదేమి? అయన చెప్పిన జవాబు పెండ్లి కుమారుడు వారి దగ్గరనుండి వెళ్ళిపోయిన తర్వాత వారు ఉపవాసం చేస్తారు. మత్తయి 9:25;
*అవును వారు అనగా ఆది అపోస్తలులు ఉపవాసం ఉన్నారు*. అపో 13:౩
అంతట వారు ఉపవాసముండి ప్రార్థనచేసి
వారిమీద చేతులుంచి వారిని పంపిరి.
అపో 14:23
మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి, ఉపవాసముండి, ప్రార్థనచేసి, వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి.
కాబట్టి మనం కూడా ఉపవాస ప్రార్ధనలు చెయ్యాలి. చివరకు శిష్యులు
రూపాంతర కొండమీద నుండి రాబోయేసరికి ఒక దయ్యం పట్టిన యవ్వనస్తుని వారు బాగు చెయ్యలేకపోయారు.
యేసయ్య బాగుచేశారు. అప్పుడు శిష్యులు మేము ఎందుకు
బాగుచేయ్యలేకపోయాము అంటే ఇలాంటివి కేవలం ఉపవాస ప్రార్ధన వలననే పోతాయి అన్నారు.
మార్కు 9: 29
అందుకాయన ప్రార్థనవలననే (అనేక ప్రాచీన ప్రతులలో-(వలనను) ఉపవాసము వలననే అని కూర్చబడి యున్నది) గాని మరి దేనివలననైనను ఈ విధమైనది వదలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను.
అనగా
*యేసుక్రీస్తుప్రభులవారు కూడా ఉపవాసం ఉన్నారు*. *సేవను ప్రారంభించక ముందు
40రోజులు, ఇక మొదలుపెట్టాక అనేకసార్లు*!
నీ సేవలో సాతానుని ఎదిరించే శక్తి కావాలి అంటే నీకు కావాలి ఉపవాస ప్రార్ధన!
ఉపవాసం అనగా దేవునితో సహవాసం!
అందుకే యోవేలు 2: 12లో
ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి
నాయొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు అంటున్నారు.
మరి నీవు మొదలు పెడతావా ఉపవాసం? దేవుడు మెచ్చే ఉపవాసమే దేవునికి కావాలి గాని
మత్తయి సువార్తలో దేవుడు అసహ్యించుకున్న ఉపవాసాలు దేవునికి అక్కరలేదు......
మత్తయి 6:16-17లో చెప్పిన విధంగా ఉందాం.
గమనించాలి: క్రొత్త నిబంధనలో ఏదైనా పండుగలు ఉన్నాయంటే అవి కేవలం ఉపవాస పండుగలు మాత్రమే! మిగతా క్రిస్మస్ ఈస్టర్ లు మనం కల్పించుకున్నవి.
భక్తులు ఉపవాసాలు చేసి ఎన్నెన్నో అసాధ్యమైన కార్యాలు చేశారు.
సమూయేలు, దావీదు, దానియేలు, షడ్రక్, మేషాక్, అబెద్నేగోలు, ఆహాబు, నెహెమ్యా ఉపవాస మున్నారు. రాజు మరచిపోయిన కలను చెప్పి ప్రాణాలు కాపాడుకున్నారు.
ఎస్తేరు మరియు షూషను కోటలో ఉన్నవారందరూ ఉపవాసమున్నారు- మరణశాసనాన్ని జీవ శాసనంగా మార్చుకున్నారు.
పాత నిబంధన భక్తులు క్రొత్త నిబంధన భక్తులు ఎందఱో ఉపవాసమున్నారు గొప్ప కార్యాలు చేశారు.
ఉపవాస ప్రార్ధన మన జీవితాలకు చార్జింగ్ ఇస్తుంది. దేవునితో సంబంధం గట్టి పరుస్తుంది.
కాబట్టి ఆరిపోయే మన జ్యోతులు, ఉజ్జీవం లేని మన ఆత్మలకు జీవం- ఉజ్జీవం కావాలంటే ఉపవాస ప్రార్ధన కావాలి.
నీవు పూర్ణత నుండి పరిపూర్ణత సాధించాలి అంటే, దేవుని నుండి వరాలు ఫలాలు కావాలంటే, ఆత్మాభిషేకం సంపూర్ణంగా అనుభవించాలి అంటే, ఆయనేమైయున్నారో నిజంగా అనుభవించి రుచిచూడాలంటే ఉపవాసం చెయ్యాలి!
ఉపవాసం ఉందాం!
దేవునితో సంబంధం పెంచుకుందాం!
దైవాశీస్సులు!
*హతస్సాక్షి జెకర్యా-22వ భాగము*
జెకర్యా 8:19—23 ......
19. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చున దేమనగా నాలుగవ నెలలోని
ఉపవాసము, అయిదవ నెలలోని ఉపవాసము, ఏడవ నెలలోని
ఉపవాసము, పదియవ నెలలోని ఉపవాసము యూదా యింటివారికి సంతోషమును ఉత్సాహమును
పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును
ప్రియముగా ఎంచుడి.
20. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా
జనములును అనేక పట్టణముల నివాసులును ఇంకను వత్తురు.
21. ఒక పట్టణపువారు మరియొక పట్టణపువారి యొద్దకు వచ్చి ఆలస్యముచేయక
యెహొవాను శాంతిపరచుటకును, సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకుటకును
మనము పోదము రండి అని చెప్పగా వారుమేమును వత్తుమందురు.
22. అనేక జనములును బలముగల జనులును యెరూషలేములో సైన్యములకు అధిపతియగు
యెహోవాను వెదకుటకును, యెహోవాను శాంతిపరచుటకును వత్తురు.
23. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా
ఆ దినములలో ఆయా భాషలు మాటలాడు అన్యజనులలో పదేసిమంది యొక యూదుని చెంగుపట్టుకొని దేవుడు
మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడ వత్తుమని చెప్పుదురు.
ప్రియ దైవజనమా! గతభాగం నుండి జెకర్యా గారి ప్రవచనాలను ధ్యానం చేసుకుంటున్నాం!
ప్రియులారా! మీద నున్న ప్రవచనం అంత్యకాలంలో నెరవేరబోతుంది. దీనికి నేపద్యం ఏమిటంటే: గతభాగంలో వివరించిన దేవునికి మనిషిలో కావలసిన లక్షణాలను అలవరచుకుని అప్పుడు ఉపవాసం చేస్తే వచ్చే దీవెనలు చెబుతూ ఈ మాటలు దేవుడు చెబుతున్నారు. మొదటగా సత్యమును సమాధానమును ఇష్టంగా ఎంచుకోండి. అప్పుడు ఇవి జరగబోతున్నాయి అంటున్నారు.
ఒక పట్టణం వారు మరొక పట్టణం వారి దగ్గరకు వచ్చి ఆలస్యం చేయకుండా యెహోవాను శాంతి పరచడానికి యెహోవాను వెదకుటకు వెళ్దాము రండి అంటే సరే మేముకూడా వస్తాము అని వెంటనే వెళ్తారు. అనేక దేశాలు వారు దేవుణ్ణి వెదకటానికి, యెహోవాను శాంతి పరచటానికి వస్తారు. ఇంకా అనేక భాషలు మాట్లాడువారు అన్యులలో పదిమంది ఒక్క యూదుని చెంగు పట్టుకుని దేవుడు మీకు తోడుగా ఉన్నాడు కాబట్టి మేముకూడా వస్తాము అని అంటారు.
గమనించాలి మీద చెప్పినట్లు ఇది అంత్యకాలంలో జరుగుతుంది. అయితే ఇప్పుడు అనేకమంది క్రైస్తవులు ఈ పండగలకు వెళ్తున్నారు. అనేకులు ఇశ్రాయేలు దేశానికి సహాయం చేస్తున్నారు కారణం యేరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అని చెప్పబడినందున ఎంతోమంది సహాయం చేస్తున్నారు. కీర్తనలు 122: 6
యెరూషలేము యొక్క క్షేమముకొరకు ప్రార్థన చేయుడి యెరూషలేమా, నిన్ను
ప్రేమించువారు వర్ధిల్లుదురు.
మన దేశంలోనూ ఇతరదేశాల లోను యేరూషలేముకోసం ప్రత్యేక ప్రార్ధనలు
చేస్తున్నారు. కాబట్టి ప్రవచనం నెరవేరిపోయింది
అని అనుకోకూడదు. ఇంకా నెరవేరవలసిననవి ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇది
అంత్యకాలంలోనే జరగబోతుంది.
ఒకసారి చూద్దాం దీనికోసం దేవుడు ఎక్కడెక్కడ ఈ వాగ్దానాలు చేశారో!!
జెకర్యా 14:16
మరియు యెరూషలేముమీదికి వచ్చిన అన్యజనులలో శేషించినవారందరును సైన్యములకు అధిపతియగు
యెహోవాయను రాజునకు మ్రొక్కుటకును పర్ణశాలపండుగ ఆచరించుటకును ఏటేట వత్తురు.
యెషయా 2:1—4
2. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున
స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి
వచ్చెదరు
3. ఆ కాలమున సీయోనులోనుండి ధర్మశాస్త్రము యెరూషలేములోనుండి యెహోవా
వాక్కు బయలు వెళ్లును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు
దేవుని మందిరమునకు యెహోవా పర్వత మునకు మనము వెళ్లుదము రండి ఆయన తన మార్గముల విషయమై
మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు.
4. ఆయన మధ్యవర్తియై అన్యజనులకు న్యాయము తీర్చును అనేక జనములకు తీర్పుతీర్చును
వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనముమీదికి
జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.
యెషయా 14:1
ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును వారిని స్వదేశములో నివసింపజేయును పరదేశులు వారిని కలిసికొందురు వారు యాకోబు కుటుంబమును హత్తుకొనియుందురు
యెషయా 19:23—25
23. ఆ దినమున ఐగుప్తునుండి అష్షూరుకు రాజమార్గ మేర్పడును అష్షూరీయులు
ఐగుప్తునకును ఐగుప్తీయులు అష్షూరున కును వచ్చుచు పోవుచునుందురు ఐగుప్తీయులును అష్షూరీయులును
యెహోవాను సేవిం చెదరు.
24. ఆ దినమున ఐగుప్తు అష్షూరీయులతోకూడ ఇశ్రాయేలు మూడవ జనమై భూమిమీద
ఆశీర్వాద కారణముగ నుండును.
25. సైన్యములకధిపతియగు యెహోవా నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పనియైన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా,మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును.
యెషయా 55:5
నీవెరుగని జనులను నీవు పిలిచెదవు నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహోవానుబట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునిబట్టి నీయొద్దకు పరుగెత్తి వచ్చెదరు.
యెషయా 56:6—7
6. విశ్రాంతిదినమును అపవిత్రపరచకుండ ఆచరించుచు నా నిబంధనను ఆధారము
చేసికొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన
పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను
7. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసెదను నా బలిపీఠముమీద
వారర్పించు దహనబలులును బలు లును నాకు అంగీకారములగును నా మందిరము సమస్తజనులకు ప్రార్థనమందిరమన
బడును.
దేవుడు ఇశ్రాయేలు ప్రజలను దీవెనకరంగా మార్చిన తర్వాత ఇవన్నీ జరుగుతాయి. వారు మొదటగా యేసుక్రీస్తుప్రభులవారిని మెస్సయ్యగా అంగీకరించిన తర్వాతనే ఈ మొత్తమన్ని ప్రవచనాలు నెరవేరుతాయి.
మనమందరం నూతన యేరూషలేముగా కట్టబడుతున్నాము. మనం కూడా ఒకరోజు అక్కడ చేరి పండగ చేసుకోబోతున్నాము. అయితే దానికి అనుగణంగా మన బ్రతుకులను సరిచేసుకుంటున్నామా లేదా? మన బ్రతుకులు ఆరకంగా కట్టుకుంటున్నామా?
గమనించాలి విడువబడుట బహు ఘోరం!
ఆ శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు నీవు పడలేవు!
నేడే నీ బ్రతుకును సరిచేసుకో!
దైవాశీస్సులు!
*హతస్సాక్షి జెకర్యా-23వ భాగము*
జెకర్యా 9:1—8 ......
1. హద్రాకు దేశమునుగూర్చియు దమస్కు పట్టణమును గూర్చియు వచ్చిన దేవోక్తి
2. ఏలయనగా యెహోవా సర్వ నరులను ఇశ్రాయేలీయుల గోత్రపువారినందరిని
లక్ష్యపెట్టువాడు గనుక, దాని సరిహద్దును అనుకొనియున్న హమాతునుగూర్చియు,
జ్ఞాన సమృద్ధిగల తూరు సీదోనులనుగూర్చియు అది వచ్చెను.
3. తూరు పట్టణపువారు ప్రాకారముగల కోటను కట్టుకొని, యిసుక రేణువులంత విస్తారముగా వెండిని, వీధులలోని కసువంత
విస్తారముగా సువర్ణమును సమకూర్చుకొనిరి.
4. యెహోవా సముద్ర మందుండు దాని బలమును నాశనముచేసి దాని ఆస్తిని పరులచేతి
కప్పగించును, అది అగ్నిచేత కాల్చబడును.
5. అష్కెలోను దానిని చూచి జడియును, గాజా దానిని
చూచి బహుగా వణకును, ఎక్రోనుపట్టణము తాను నమ్ముకొనినది అవమానము
నొందగా చూచి భీతినొందును, గాజారాజు లేకుండపోవును, అష్కెలోను నిర్జనముగా ఉండును.
6. అష్డోదులో సంకరజనము కాపురముండును, ఫిలిష్తీయుల
అతిశయాస్పదమును నేను నాశనము చేసెదను.
ప్రియ దైవజనమా! జెకర్యా గారి ప్రవచనాలను ధ్యానం చేసుకుంటున్నాం! ఈ 9వ అధ్యాయంలో పై వచనాలలో గల ప్రవచనం సిరియా మీద, తూరుసీదోనుల మీద, ఇంకా ఫిలిష్తీయులమీద దేవుడు తీర్చిన తీర్పులు కనిపిస్తున్నాయి. ప్రవక్తలెందరో దీనికోసం ప్రవచించారు. అయితే మరోసారి యూదుల చెర విడుదల తర్వాత కూడా దేవుడు చెబుతున్నారు అనగా ఇంతవరకు బబులోను చేతిలో వారు పొందిన తీర్పు కాకుండా ఇంకా రాబోయేదినాలలో కూడా ఇంకా ఘోరమైన తీర్పులు ద్వారా దేవుడు వారిని శిక్షించబోతున్నారు అని గ్రహించాలి.
మొదటి వచనంలో హద్రాకు గూర్చి దమస్కు పట్టణం గూర్చి అంటున్నారు. గమనించాలి దమస్కు సిరియా దేశానికి రాజధాని. దానికి ఉత్తరంగా ఉన్న పట్టణం హద్రాకు. ఇది కూడా సిరియాలో భాగమే. ఇంకా హమాతు అంటున్నారు రెండవ వచనంలో. ఇది కూడా సిరియా దేశంలోనిదే. దీని అర్ధం ఏమిటంటే మొత్తం సిరియా దేశాన్ని నేను శిక్షించబోతున్నాను అని అర్ధం! ఇదే తీర్పులను మనం యెషయా గ్రంధంలో కూడా చూడవచ్చు. 17:1-3
1.
దమస్కును గూర్చిన దేవోక్తి
2. దమస్కు పట్టణము కాకపోవలసివచ్చెను
అది పాడై దిబ్బగా నగును అరోయేరు పట్టణములు నిర్మానుష్యములగును అవి గొఱ్ఱెల మందలు మేయు
తావులగును ఎవడును వాటిని బెదరింపకుండ మందలు అచ్చట పండుకొనును.
3.
ఎఫ్రాయిమునకు దుర్గము లేకపోవును దమస్కునకు రాజ్యము లేకుండును ఇశ్రాయేలీయుల
ప్రభావమునకు జరిగినట్లు సిరియాలో నుండి శేషించినవారికి జరుగును సైన్యములకధిపతియగు యెహోవా
ఈ మాట సెల విచ్చుచున్నాడు.
ఇంకా యిర్మియా గారు కూడా ప్రవచించారు.49:23—27; ఇంకా ఆమోసు గారు కూడా ప్రవచించారు. ఇక్కడ ఒకమాట చెప్పనీయండి. మిగిలిన ప్రవక్తల ప్రవచనాలకు ఆమోసు భక్తుని ప్రవచనాలలో గల తేడా ఏమిటంటే: మిగిలిన వారు ప్రవచించినవి కేవలం తీర్పులే అయితే అమోషు గారి తీర్పులలో ఆ శిక్షించడానికి అసలు కారణం క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఫలాని పని వారు చేశారు కాబట్టి నేను దానికి ఈ విధంగా నేను శిక్షించబోతున్నాను అని దేవుడు చెప్పడం జరిగింది. 1:౩—5....
3.
యెహోవా సెలవిచ్చునదేమనగా దమస్కు మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి
నేను తప్పకుండ దాని శిక్షింతును; ఏలయనగా దాని జనులు పంట దుళ్లగొట్టు
ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి.
4.
నేను హజాయేలు మందిరములో అగ్ని వేసెదను; అది బెన్హదదు
యొక్క నగరులను దహించివేయును;
5.
దమస్కుయొక్క అడ్డగడియలను విరిచెదను, ఆవెను లోయలోనున్న
నివాసులను నిర్మూలము చేతును, బెతేదేనులో ఉండకుండ రాజదండము వహించినవానిని
నిర్మూలము చేతును, సిరియనులు చెరపట్టబడి కీరు దేశమునకు కొనిపోబడుదురని
యెహోవా సెలవిచ్చుచున్నాడు.
ఇక్కడ వారు ఇశ్రాయేలు వారికి వ్యతిరేఖంగా ఎలా ప్రవర్తించారో అందుకు దేవుడు తీర్చిన
తీర్పులు గమనించవచ్చు! ఇది సిరియాను దేవుడు దండించే విధానం కోసం చెప్పబడింది. నిజంగా ఇవన్నీ ఒకసారి జరిగాయి మరలా జరగబోతున్నాయి
అని గ్రహించాలి. అలగ్జాండర్ కి ముందు కొద్దిగా, తర్వాత రోమా వారిద్వారా సిరియా నాశనం అయ్యింది. మరలా
మరోసారి నాశనం కాబోతుంది.
ఇక తర్వాత తూరు సీదోనుల కోసం చెబుతున్నారు దేవుడు! తూరు సీదోనులు ఎక్కడున్నాయి అంటే ఇశ్రాయేలు దేశమునకు ఆనుకుని ఉన్నాయి. మధ్యధరా సముద్ర రేవు ప్రాంతాలు. ఒకసారి మీ చేతులలో ఉన్న మన బైబిల్ గ్రంధాలు తెరిస్తే చివరి పేజీలలో కొన్ని మ్యాప్ లు కనిపిస్తాయి. దానిలో క్రొత్త నిభందన కాలపు పాలస్తీనా అనే మ్యాప్ కనిపిస్తుంది. దానిలో మనకు ఇశ్రాయేలు దేశం యూదయ, సమరయ, గలలియ ప్రాంతాలు కనిపిస్తాయి. గలలియ ప్రాంతాన్ని ఆనుకుని ఫెనేకియ ప్రాంతము ఉంది. దానిలో మనకు తూరు, సీదోను పట్టణాలు, ఆ రెంటి మధ్యలో సారేపతు గ్రామం కనిపిస్తాయి. దేవుడు వీరిని కూడా శిక్షిస్తాను అంటున్నారు. వీరు ఇశ్రాయేలు జాతిని డైరెక్ట్ గా ఎప్పుడు బాధించలేదు. శత్రువులకు సహాయం చేసారు. ముఖ్యంగా ఇశ్రాయేలు వారు పాపంలో పడిపోడానికి కారణం ఈ పట్టణాలే. ఇక్కడనుండి భయంకరమైన విగ్రహారాధన వారి మధ్యకు వచ్చి ఇశ్రాయేలు జాతిని సర్వ నాశనం చేసేసాయి. యెజెబెలు సీదోను ప్రాంతానికి చెందినదే! ఇవి ఓడలరేవు ప్రాంతాలు అయినందున విస్తారమైన వ్యాపారం, ధనం, ఐశ్వర్యం, వ్యభిచారం, విగ్రహారాధన తో నిండిపోయాయి. ఆ బ్రష్టత్వం ఇశ్రాయేలు జాతికి అంటుకుంది. అందుకే ఈ తీర్పులు. Zechariah(జెకర్యా) 9:2,3,4
2. ఏలయనగా యెహోవా సర్వ నరులను ఇశ్రాయేలీయుల గోత్రపువారినందరిని లక్ష్యపెట్టువాడు గనుక, దాని సరిహద్దును అనుకొనియున్న హమాతునుగూర్చియు, జ్ఞాన సమృద్ధిగల తూరు సీదోనులనుగూర్చియు అది వచ్చెను.
3. తూరు పట్టణపువారు ప్రాకారముగల కోటను కట్టుకొని, యిసుక రేణువులంత విస్తారముగా వెండిని, వీధులలోని కసువంత విస్తారముగా సువర్ణమును సమకూర్చుకొనిరి.
4. యెహోవా సముద్ర మందుండు దాని బలమును నాశనముచేసి దాని ఆస్తిని పరులచేతి కప్పగించును, అది అగ్నిచేత కాల్చబడును.
యెషయా గారి ద్వారా దేవుడు తీర్పులు చెప్పారు. 23:1—18; ఇంకా యిర్మియా
గారు కూడా ప్రవచించారు.25:22; యేహెజ్కేలు గ్రంధంలో మూడు అధ్యాయాలు
వీటికోసమే 26—28 అధ్యాయాలు. యోవేలు గ్రంధంలో
౩:4—8 .
4. తూరు పట్టణమా, సీదోనుపట్టణమా, ఫిలిష్తీయ ప్రాంత వాసులారా, మీతో నాకు పనియేమి?
నేను చేసినదానికి మీరు నాకు ప్రతికారము చేయుదురా? మీరు నా కేమైన చేయుదురా?
5. నా వెండిని నా బంగారమును మీరు పట్టుకొనిపోతిరి; నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకొనిపోయి మీ గుళ్లలో ఉంచుకొంటిరి.
6. యూదావారిని యెరూషలేము పట్టణపువారిని తమ సరిహద్దులకు దూరముగా నివసింపజేయుటకై
మీరు వారిని గ్రేకీయులకు అమ్మివేసితిరి; మీరు చేసినదానిని బహుత్వరగా
మీ నెత్తిమీదికి రప్పించెదను.
7. ఇదిగో మీరు చేసిన దానిని మీ నెత్తిమీదికి రాజేయుదును;
మీరు వారిని అమ్మి పంపివేసిన ఆ యా స్థలములలోనుండి నేను వారిని రప్పింతును
;
చివరగా ఆమోసు గ్రంధంలో చూద్దాం 1:9—10 ...
9. యెహోవా సెలవిచ్చునదేమనగా తూరు మూడుసార్లు నాలుగుసార్లు చేసిన
దోషములనుబట్టి నేను తప్పకుండ దానిని శిక్షింతును; ఏలయనగా దాని
జనులు సహోదర నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొనక పట్టబడినవారినందరిని ఎదోమీయులకు అప్పగించిరి.
10. నేను తూరు ప్రాకారములమీద అగ్ని వేసెదను, అది దాని నగరులను దహించివేయును. అందుకే ఈ తీర్పులు.
తూరు కట్టుకున్న బలమైన కోట
కోసం యెషయా గారు 23వ అధ్యాయంలో చెప్పారు ; వెండిని బంగారాన్ని విస్తారంగా కూర్చుకోవడాన్ని యేహెజ్కేలు 28:4—5 లో దృవీకరిస్తున్నారు....
4. నీ ధనాగారములలోనికి వెండి బంగారములను తెచ్చు కొంటివి.
5. నీకు కలిగిన జ్ఞానాతిశయముచేతను వర్తకము చేతను నీవు విస్తారమైన
ఐశ్వర్యము సంపాదించుకొంటివి, నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించినవాడవైతివి. అందుకే నాశనం చేస్తాను అంటున్నారు
యెషయా 23:1.
తూరునుగూర్చిన దేవోక్తి తర్షీషు ఓడలారా, అంగలార్చుడి తూరు పాడైపోయెను ఇల్లయినను
లేదు ప్రవేశమార్గమైనను లేదు కిత్తీయుల దేశమునుండి ఆ సంగతి వారికి వెల్లడి చేయబడెను.
ఇక తర్వాత తీర్పులు ఫిలిష్తీయుల మీదన! 5—6...
5.
అష్కెలోను దానిని చూచి జడియును, గాజా దానిని చూచి
బహుగా వణకును, ఎక్రోనుపట్టణము తాను నమ్ముకొనినది అవమానము నొందగా
చూచి భీతినొందును, గాజారాజు లేకుండపోవును, అష్కెలోను నిర్జనముగా ఉండును.
6.
అష్డోదులో సంకరజనము కాపురముండును, ఫిలిష్తీయుల
అతిశయాస్పదమును నేను నాశనము చేసెదను.
ఇదికూడా ఉంది అదే మ్యాప్ లో చూడండి, యూదయ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్నాయి.
అనగా ఇశ్రాయేలు దేశానికి పడమరగా ఉన్నాయి. గలలియ
ను ఆనుకుని తూరు సీదోనులు, వాటి ప్రక్కన సిరియా ఉండగా యూదయను
ఆనుకుని ఫిలిష్తీయులు ఉన్నారు. వీరిని కూడా శిక్షిస్తాను
అంటున్నారు. వీరు ఎన్నోసార్లు ఇశ్రాయేలు ప్రజలను బాధపెట్టారు. ఇప్పటికి
కూడా వీరి మధ్య యుద్దాలు తగాదాలు జరుగుతున్నాయి. వీరికోసం యెషయా
గారు కూడా ప్రవచించారు. 14:28—32; యిర్మియా
47:1—7; యేహెజ్కేలు
25:15—17; జేఫన్యా 2:4—7;
చివరగా ఆమోసు
1:6—8 ...
6. యెహోవా సెలవిచ్చునదేమనగా గాజా మూడుసార్లు నాలుగుసార్లు చేసిన
దోషములనుబట్టి నేను తప్పకుండ దాని శిక్షింతును; ఏలయనగా ఎదోము
వారి కప్పగింపవలెనని తాము చెరపట్టినవారినందరిని కొనిపోయిరి.
7. గాజా యొక్క ప్రాకారముమీద నేను అగ్ని వేసెదను, అది వారి నగరులను దహించివేయును;
8.అష్డోదులో నివాసులను నిర్మూలము చేతును, అష్కెలోనులో
రాజదండము వహించిన వాడుండకుండ నిర్మూలముచేతును, ఇంకను శేషించియున్న
ఫిలిష్తీయులును క్షయమగునట్లు నేను ఎక్రోనును మొత్తెదనని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
దీని తర్వాత నిజంగా చాలా ఆశ్చర్యమైన విషయాలు ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నారు దేవుడు ఏడవ వచనంలో. జెకర్యా
9: 7
వారి నోటనుండి రక్తమును వారికను తినకుండ వారి పండ్లనుండి హేయమైన మాంసమును నేను తీసివేసెదను. వారును శేషముగా నుందురు, మన దేవునికి వారు యూదా వారిలో పెద్దలవలె నుందురు, ఎక్రోనువారును యెబూసీయులవలె నుందురు.
చూడండి వారినోట నుండి రక్తమును వారు తినకుండా వారి పండ్లనుండి హేయమైన మాంసమును తీసివేస్తాను అంటున్నారు, అనగా ఇకను వారు విగ్రహాలకు అర్పించే మాంసమును తినకుండా వారు విగ్రహారాధన చేయకుండా చేస్తాను అంటూ వారు శేషముగ ఉందురు అంటున్నారు అనగా ఈ తీర్పులు జరిగాక మిగిలిన వారు కొద్దిగా ఉంటారు. ఆ ఉన్నవారు కూడా మన దేవునికి యూదావారిలో పెద్దలవలె ఉంటారు. అనగా వీరు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజలతో కలసిపోయి దేవుణ్ణి అంగీకరించి యూదుల వలె మారిపోతారు. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే అంత్యదినాలలో అని గ్రహించాలి. ఇంకా ఎక్రోను వారు యెబూషీయుల వలె ఉంటారు అనగా 2సమూయేలు 5:6—10 లో జరిగినటువంటి సంఘటన మరలా జరుగుతుంది అన్నమాట. అక్కడ యెబూషీయులు మొదట అన్యులు, వీరిని ఇశ్రాయేలు వారు ఆక్రమించుకోలేకపోయారు యెహోషువా కాలంలో. దావీదు గారు దానిని జయించి అక్కడే సీయోను అనే దావీదు పురమును కట్టారు. ఆ తర్వాత వారు కూడా మారిపోయి కాలక్రమేనా ఇశ్రాయేలు గా మారిపోయారు. అలాగే యుగాంతంలో బహుశా ఈ ఫిలిష్తీయులు కూడా నూతన యేరూషలేములోనే కాదు పరమ సీయోనులో ఒక భాగంగా మారిపోవచ్చును ఈ వచనం ప్రకారం! ఈ సీయోను కోసం గతంలో వివరించడం జరిగింది.
ఇక ఇది జరిగిన తర్వాత ఇక ఎప్పుడూ ఏ సైన్యము నా ఆలయం మీద/ మందిరం మీదకు రాకుండా నేను ఒక దండుపేటను ఏర్పరుస్తాను అంటున్నారు. ఇది ఖచ్చితంగా అంత్యదినాలలో జరుగబోయేది. ఒకసారి ఓబధ్యా 1:21 చూడండి...
మరియు ఏశావుయొక్క కొండకు తీర్పుతీర్చుటకై సీయోను కొండమీద రక్షకులు పుట్టుదురు; అప్పుడు రాజ్యము
యెహోవాది యగును.
కాబట్టి ఇదే ఆ దండుపేట అని
గ్రహించాలి.
ఇక ఎల్లప్పుడూ కాపాడుతాను అనే విషయం కోసం ఆలోచిస్తే ఆమోసు 9:14—15
14.
మరియు శ్రమనొందుచున్న నా జనులగు ఇశ్రాయేలీయులను నేను చెరలోనుండి రప్పింతును,
పాడైన పట్టణములను మరల కట్టుకొని వారు కాపురముందురు, ద్రాక్షతోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములువేసి
వాటి పండ్లను తిందురు.
15.
వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికిచ్చిన
దేశములోనుండి వారు ఇక పెరికివేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు.
యోవేలు ౩:21
అయితే యూదాదేశములో నివాసులు నిత్యముందురు, తరతరములకు యెరూషలేము నివాసముగా నుండును,
యెహోవా సీయోనులో నివాసిగా వసించును.
ప్రియ దైవజనమా! దేవుడు వారికే కాదు మనకు కూడా ఆశ్రయమును దుర్గమునై ఉన్నారు. అయితే ఆయన కాపుదలలో ఉండాలంటే ఆయన మాటలు నీవు వినాలి. ఆయన సిలువ రక్తములో కడుగబడి ఆ రక్తపునీడలో నీవుండాలి. అప్పుడు ఏ తెగులు నీగుడారము సమీపించదు. దేవుడు నీకు ఆశ్రయముగా ఆయన దూతలు కాపలాగా ఉంటారు.
మరి ఆయన రెక్కల నీడకు వస్తావా?
దైవాశీస్సులు!
*హతస్సాక్షి జెకర్యా-24వ భాగము*
జెకర్యా 9:9 .....
సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు.
ప్రియ దైవజనమా! జెకర్యా గారి ప్రవచనాలను ధ్యానం చేసుకుంటున్నాం! ఇక ఈ తొమ్మిదవ వచనం గొప్ప ప్రవచనం. యేసయ్య మొదటిరాకడలో, ఆయన చనిపోడానికి ముందుగా లేఖనాల నెరవేర్పుకై గాడిద, గాడిద పిల్లపై కూర్చుని యేరూషలేములో ప్రవేశించే సన్నివేశాన్ని కొన్ని వందల సంవత్సారాలు ముందుగానే అనగా క్రీ.పూ.518లో అనగా సుమారు 548 సంవత్సారాలకు ముందుగానే జెకర్యా గారు ప్రవచించారు అన్నమాట! (518+30).
మనకు తెలుసు ఇది నిజంగానే జరిగింది. దీనిని నాలుగు సువార్తలు దృవీకరించాయి. మత్తయి
21:1—11; మార్కు
11:1—11; లూకా
19:28—38;
యోహాను 12:12—16....
12. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహు జనసమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని
విని
13. ఖర్జూరపుమట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి.
14. సీయోను కుమారీ, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు
15. అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దానిమీద
కూర్చుండెను.
16. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమ పరచబడినప్పుడు
అవి ఆయనను గూర్చి వ్రాయబడెననియు, వారాయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు
తెచ్చుకొనిరి.
ఇక ఈ వచనంలో ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలున్నాయి. మొదటగా *సీయోను కుమారి* అంటున్నారు. సీయోను అనగా దావీదు పట్టణం అనియే కాదు దేవుని వాగ్ధాన పట్టణం, వాగ్ధాన సంతానం ఇంకా దేవుడు అంత్యకాలంలో నిర్మించబోతున్న పరమసీయోను అని కూడా వస్తుంది అని గ్రహించాలి. గతంలో చెప్పిన విధంగా 2రాజులు
19:21 నుండి అనేకసార్లు సీయోను కుమారి అని చెప్పబడింది...
2రాజులు
19: 21
అతని గూర్చి యెహోవా సెలవిచ్చుమాట యేదనగా-సీయోను కుమారియైన కన్యక నిన్ను దూషణచేయుచున్నది; నిన్ను అపహాస్యము చేయుచున్నది; యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది.
కీర్తనలు 9: 13
నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధిచేయుచు సీయోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణనుబట్టి హర్షించునట్లు యెహోవా, నన్ను కరుణించుము.
యెషయా 1:8
ద్రాక్షతోటలోని గుడిసెవలెను దోసపాదులలోని పాకవలెను ముట్టడి వేయబడిన పట్టణమువలెను సీయోను కుమార్తె విడువబడియున్నది.
ఇంకా *ఇదిగో నీ రాజు*!
ముఖ్యంగా గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి అని వ్రాయబడింది .
Psalms(కీర్తనల గ్రంథము) 24:7,8,9,10
7. గుమ్మములారా, మీ తలలు పైకెత్తికొనుడి మహిమగల
రాజు ప్రవేశించునట్లు పురాతనమైన తలుపులారా, మిమ్మును లేవనెత్తికొనుడి.
8. మహిమగల యీ రాజు ఎవడు? బలశౌర్యములుగల యెహోవా
యుద్ధశూరుడైన యెహోవా.
9. గుమ్మములారా, మీ తలలు పైకెత్తికొనుడి,
పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించునట్లు
మిమ్మును లేవనెత్తికొనుడి.
10. మహిమగల యీ రాజు ఎవడు? సైన్యములకధిపతియగు
యెహోవాయే. ఆయనే యీ మహిమగల రాజు.
యెషయా 9:6—7
6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను
*ఆయన భుజముమీద రాజ్యభారముండును*. ఆశ్చర్యకరుడు
ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు
పెట్టబడును.
7. ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమ మును కలుగునట్లు
*సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును* *న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన
చేయును*. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.
ఇంకా మత్తయి 2:2
*యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు*? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప
వచ్చితిమని చెప్పిరి
యోహాను 18:37
అందుకు పిలాతు *నీవు రాజువా*? అని ఆయనను అడుగగా *యేసు నీవన్నట్టు నేను రాజునే*; సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని; సత్యసంబంధియైన ప్రతివాడును నా మాట వినుననెను.
ప్రకటన 19:16
*రాజులకు రాజును* ప్రభువులకు ప్రభువును అను
నామము ఆయన వస్త్రముమీదను తొడమీదను వ్రాయబడియున్నది.
ఇక ఆయన *నీతిపరుడు*: పిలాతుకు ఆయనలో దోషం అనేది ఏదీ కనబడలేదు. యోహాను
18:38
అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి? అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్లి *అతనియందు ఏ దోషమును నాకు కనబడలేదు*;
యోహాను 19:4
పిలాతు మరల వెలుపలికి వచ్చి *ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని* మీకు తెలియునట్లు ఈయనను మీయొద్దకు వెలుపలికి తీసికొని వచ్చుచున్నానని వారితో అనెను.
పిలాతు బార్య వినండి....మత్తయి
27: 19
అతడు న్యాయపీఠముమీద కూర్చుండియున్నప్పుడు అతని భార్య *నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు*; ఈ ప్రొద్దు ఆయననుగూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపెను.
హెబ్రీ 7:26
*పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును*
ఆకాశ మండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు
సరిపోయినవాడు.(లేక, తగినవాడు)
1పేతురు 2:22
*ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు*.
1పేతురు ౩:18
ఏలయనగా మనలను దేవునియొద్దకు తెచ్చుటకు, అనీతిమంతుల కొరకు *నీతిమంతుడైన క్రీస్తు* శరీర విషయములో చంపబడియు,....
*రక్షణ గలవాడు*: అయన పేరే రక్షకుడు: యేసు అనగా రక్షకుడు
*తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు* అని పేరు పెట్టమని గబ్రియేలు చెప్పాడు...మత్తయి 1:21;
లూకా 1:
70
తన సేవకుడైన దావీదు వంశమునందు మనకొరకు రక్షణ శృంగమును, అనగా
లూకా 1:
71
మన శత్రువులనుండియు మనలను ద్వేషించు వారందరి చేతినుండియు తప్పించి *రక్షణ కలుగజేసెను*.
అపోస్తలులు 4:12
*మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము
రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి
ఏ నామమున రక్షణ పొందలేము అనెను*.
అపో 13:47
ఏలయనగా నీవు *భూదిగంతములవరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను* అని ప్రభువు మాకాజ్ఞాపించెననిరి.
రోమీయులకు 10: 9
అదేమనగాయేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల,
*నీవు రక్షింపబడుదువు*.
*దీనుడు*: మత్తయి 11:29
*నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను* గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.
ఫిలిప్పీయులకు 2: 8
మరియు, *ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను*.
ఇక *ఆయన గాడిద పిల్లనే ఎందుకు ఎక్కాలి*? గుర్రం మీద రావచ్చు కదా??!!
*ఆ కాలంలో గాడిద విజయానికి సాదృశ్యంగా ఉండేది. రాజులు యుద్ధంలో గెలిచాక గాడిద మీద ఊరేగేవారు*. *కాబట్టి
యేసుక్రీస్తు ప్రభులవారు అతి త్వరలో తను చేయబోయే బలియాగం, సాతానుతో
చేసే పాపాల పోరాటంలో విజయోత్సాహంతో వస్తారని, ఇంకా ఆ విధానంలో
సాతానునే కాదు మరణాన్ని కూడా జయించబోతున్నారు అని, ఇక చివరగా
అంత్యకాలంలో రారాజుగా విజయశీలిగా రాజ్యాలను ఏలబోతున్నారు అనేదానికి సూచనగా ఈ గాడిద
మీద ఊరేగింపు జరిగింది*. లేఖనాలు నెరవేరాలి కాబట్టి ఆయన అదే గాడిద
మీద తిరిగినట్లు చూస్తున్నాం!
అయన రాజులరాజు, ప్రభువుల పభువు, దేవాదిదేవుడు గాని మనుష్యులు చేసే స్తోత్రాలు అందుకోవాలని, వారి చిన్న హృదయాలలో నివాసం చెయ్యాలని ఇంత గొప్ప దేవాదిదేవుడు ఎదురుచూస్తున్నారు. మరి నీవు ఆయనను నీ హృదయంలో చేర్చుకుంటావా?
ప్రకటన గ్రంథం 3: 20
*ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను.
ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను
అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము.*
మరి నీవు నీ హృదయపు ద్వారం తెరుస్తావా?
అలా తెరిస్తే ఆయన నీలోనికి వచ్చి నీతో నివాసం చేస్తూ నీతో భోజనం చెయ్యాలని ఆశిస్తున్నారు.
మరి నీవు సిద్దమా?
దైవాశీస్సులు!
*హతస్సాక్షి జెకర్యా-25వ భాగము*
జెకర్యా 9:10—17 ....
10. ఎఫ్రాయిములో రథములుండకుండ నేను చేసెదను, యెరూషలేములో గుఱ్ఱములు లేకుండ చేసెదను, యుద్ధపు విల్లు
లేకుండ పోవును, నీ రాజు సమాధానవార్త అన్యజనులకు తెలియజేయును,
సముద్రమునుండి సముద్రమువరకు యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతము వరకు
అతడు ఏలును.
11. మరియు నీవు చేసిన నిబంధన రక్తమునుబట్టి తాము పడిన నీరులేని గోతిలోనుండి
చెరపట్టబడిన నీవారిని నేను విడిపించెదను.
12. బంధకములలో పడియుండియు నిరీక్షణగలవారలారా, మీ కోటను మరల ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసెదనని
నేడు నేను మీకు తెలియజేయుచున్నాను.
13. యూదావారిని నాకు విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను. సీయోనూ,
నీ కుమారులను రేపుచున్నాను, శూరుడు ఖడ్గము ప్రయోగించునట్లు
నేను నిన్ను ప్రయోగింతును. గ్రేకీయులారా, సీయోను కుమారులను మీమీదికి రేపుచున్నాను.
14. యెహోవా వారికి పైగా ప్రత్యక్షమగును, ఆయన
బాణములు మెరుపువలె విడువబడును, ప్రభువగు యెహోవా బాకానాదము చేయుచు
దక్షిణదిక్కునుండి వచ్చు గొప్ప సుడిగాలితో బయలు దేరును.
ప్రియ దైవజనమా! జెకర్యా గారి ప్రవచనాలను ధ్యానం చేసుకుంటున్నాం! ఇక ఈ 9:10—17 వచనాలు ముఖ్యంగా రెండు భాగాలుగా చెయ్యవచ్చు.
మొదటది: 1౦—13 వరకు
– యేసుక్రీస్తు మొదటి రాకడ కోసం చెప్పియుండగా,
రెండవది: 14—17 వరకు అంత్యకాలంలో యేసుక్రీస్తు ప్రభులవారి రెండవరాకడ అనగా ముఖ్యంగా ఆయన ప్రత్యక్షరాకడ
జరిగాక జరిగే సంభవాలు కోసం చెప్పబడింది.
గమనించాలి ఈ 10వ అధ్యాయంలో ఎఫ్రాయిములో రధాలు లేకుండా చేస్తాను, యేరూషలేములో గుర్రాలు లేకుండా చేస్తాను అనేమాట చూసి ఇది రెండవరాకడకు సంభందించినది అని అనుకోవచ్చు గాని అది మొదటి రాకడ కోసం చెప్పబడింది అని ఆ తర్వాత మాటలనుబట్టి అర్ధం చేసుకోవచ్చు! కాబట్టి సగం మొదటి రాకడ సగం రెండవరాకడ కోసం అనికూడా అనుకోవచ్చు.
ఎఫ్రాయిము, యేరూషలేము అని ఎందుకు అన్నారంటే ఎఫ్రాయిము గతంలో ఇశ్రాయేలు వారికి నాయకులుగా ఉండేవారు. కాబట్టి ఇది ఇశ్రాయేలు వారిని అనగా 10 గోత్రాలకు సాదృశ్యం! ఇక యేరూషలేము అనగా యూదా పట్టణాలకు సాదృశ్యం! అనగా దేవుడు మొత్తం ఇశ్రాయేలు జాతిని గూర్చి మాట్లాడుతున్నారని, భవిష్యత్ లో ఈ రెండు ఒక్కటిగా ఉండబోతుంది అని చెబుతున్నారు.
సరే, ఆయన యుద్దాలు లేకుండా ఉండటం కోసం చూద్దాం!
యెషయా 2:4
ఆయన మధ్యవర్తియై అన్యజనులకు న్యాయము తీర్చును అనేక జనములకు తీర్పుతీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.
హోషేయ 2:18
ఆ దినమున నేను నా జనులపక్షముగా భూజంతువుల తోను ఆకాశపక్షులతోను నేలను ప్రాకుజంతువులతోను నిబంధన చేయుదును. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశ ములో ఉండకుండ మాన్పించి వారిని నిర్భయముగా నివసింపజేయుదును.
ఇక *మొదట రాకడ కోసం*
యెషయా 9:6,7
6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన
భుజముమీద రాజ్య భారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన
దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
7. ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమ మును కలుగునట్లు
సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును
స్థిరపరచు టకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు
యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.
యెషయా 11:1—10;
*నీ రాజు అన్యజనులకు సమాధాన వార్త తెలియజేయును*...
లూకా 4:18.....
*ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును*
ఇక 12వ వచనం చూసుకుంటే.....
బంధకములలో పడియుండియు నిరీక్షణగలవారలారా, మీ కోటను మరల ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసెదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను.
ఇక్కడ కనిపించే బంధకములు లో పడిఉండి నిరీక్షణ గలవారలారా అనగా మామూలుగా ఇంకను చెరలో ఉన్న యూదులను సూచిస్తుంది గాని దాని ఆత్మీయ అర్ధం వేరు. మామూలు అర్ధం మీరు ఇంకా నిరీక్షణ గలవారిగా ఉన్నారు. తప్పకుండ మీ చెరను విడిపిస్తాను అని చెప్పడమే గాని; తర్వాత మాటలు ప్రకారం ఆ బంధకాలు మామూలు బంధకాలు కాదు పాపమనే బంధకాలలో ఉన్న మానవులారా నేను మిమ్మును నా రక్తం ద్వారా విడుదల చేస్తాను అని దేవుడు చెబుతున్నట్లు అర్ధం చేసుకోవాలి. ఇదేమాట చాలాసార్లు దేవుడు చెప్పారు.
యెషయా 42: 6
గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును బంధింపబడినవారిని చెరసాలలోనుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించువారిని బందీగృహములోనుండి వెలుపలికి తెచ్చుటకును
యెషయా 61: 3
సీయోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదెకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనునట్లు నీతి అను మస్తకివృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్ట బడును.
కీర్తనలు 146: 7
బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును యెహోవా బంధింపబడిన వారిని విడుదలచేయును.
అందుకే ఇది జరిగాక యేసుక్రీస్తు ప్రభులవారు చెప్పారు లూకా 4:21.
సమాజ మందిరములో నున్నవారందరు ఆయనను తేరిచూడగా, ఆయననేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను.
ఇక *నీరులేని గోతిలో నుండి అనగా పాపపు ఊభి అని అర్ధం*!
ఇక *నిబంధన రక్తము అనగా మనకు తెలుసు అది క్రొత్తనిబంధన రక్తము*!!!
మత్తయి 26: 28
*ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము
అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన(అనేక ప్రాచీన ప్రతులలో-క్రొత్త నిబంధన అని పాఠాంతరము) రక్తము*.
1కొరింథీ 11:23—26
23. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువువలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞ తాస్తుతులు చెల్లించి
24. దానిని విరిచి *యిది మీకొరకైన (అనేక ప్రాచీనప్రతులలో-మీ కొరకు విరవబడిన అని పాఠాంతరము) నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను*.
25. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట *ఆయన పాత్రను ఎత్తికొనియీ పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధన*; మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.
26. మీరు ఈ రొట్టెను తిని, యీ పాత్రలోనిది త్రాగు నప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు.
ఇక ఈ నిబంధన రక్తమునకు మూలము పస్కా పశువు అని గ్రహించాలి. ఇప్పుడు దానికోసం చెప్పను గాని ఒకసారి నిర్గమ 14వ అధ్యాయం చదవమని మనవిచేస్తున్నాను. ఇక ఆ తర్వాత మోషేగారు దేవుడు చెప్పే ప్రతీమాట ఇశ్రాయేలు వారితో చెబుతూ చివర్లో దానిని నిర్దారించడానికి బలులు అర్పించి ఆ రక్తాన్ని ప్రజలమీద చిలకరిస్తూ ఇది దేవుని నిబంధన రక్తం అంటూ అనేవారు. ఉదా నిర్గమ 24:౩—8
ఇక తర్వాత యిర్మియా గారి ద్వారా మరో ప్రవచనం చెప్పారు
31:31—34; ఈ వచనాలలో క్రొత్త నిబంధన చేస్తాను అని చెప్పి ఆ నిబంధన ను రక్తముతో నిర్ధారించారు లేక రక్తాన్ని ప్రోక్షించి యేసయ్య మరో నిబంధన చేశారు. నిత్యనిబంధన చేసారు. అదే క్రొత్త నిబంధన!
ఇక *కోటలోనికి తిరిగి రండి* అనగా అది తిరిగి యేరూషలేముకి తిరిగి రండి అంటున్నారు. అలా వస్తే రెండింతల ఆశీర్వాదం ఇస్తాను అంటున్నారు. 12....బంధకములలో పడియుండియు నిరీక్షణగలవారలారా, మీ కోటను మరల ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసెదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను.
యెషయా 61:7
మీ యవమానమునకు ప్రతిగా రెట్టింపు
ఘనత నొందుదురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగము ననుభవించి వారు సంతోషింతురు వారు తమ
దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు నిత్యానందము వారికి కలుగును.
అలా జరిగాక 13....యూదావారిని నాకు విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను. సీయోనూ, నీ కుమారులను రేపుచున్నాను, శూరుడు ఖడ్గము ప్రయోగించునట్లు నేను నిన్ను ప్రయోగింతును. గ్రేకీయులారా, సీయోను కుమారులను మీమీదికి రేపుచున్నాను.
ఇక్కడ మరలా యూదా వారు, ఎఫ్రాయిము అంటున్నారు అనగా మొత్తం ఇశ్రాయేలు వారు చెర విడుదల అయ్యాక ఇశ్రాయేలు-యూదా అని కాకుండా అందరూ కలసి ఉంటారని దేవుడు చెబుతున్నారు అన్నమాట! అప్పుడు దేవుడు యోధుడిలా, ఇశ్రాయేలు ఆయన బాణంలా, యూదా విల్లుగా ఉంటుంది అన్నమాట! ఆ రెండు రాజ్యాలు ఏకమవుతాయి అని సూచిస్తుంది.
యెషయా 11:12—14
12. జనములను పిలుచుటకు ఆయన యొక ధ్వజము నిలువ బెట్టును భ్రష్టులైపోయిన
ఇశ్రాయేలీయులను పోగుచేయును భూమియొక్క నాలుగు దిగంతములనుండి చెదరి పోయిన యూదా వారిని
సమకూర్చును.
13. ఎఫ్రాయిమునకున్న మత్సరము పోవును యూదా విరోధులు నిర్మూలమగుదురు
ఎఫ్రాయిము యూదాయందు మత్సరపడడు యూదా ఎఫ్రాయిమును బాధింపడు
14. వారు ఫిలిష్తీయుల భుజముమీద ఎక్కుదురు పడమటివైపుకు పరుగెత్తిపోవుదురు
ఏకీభవించి తూర్పువారిని దోచుకొందురు ఎదోమును మోయాబును ఆక్రమించుకొందురు అమ్మోనీయులు
వారికి లోబడుదురు
యిర్మియా ౩:18
ఆ దినములలో యూదావంశస్థులును ఇశ్రాయేలు వంశస్థులును కలిసి ఉత్తరదేశములోనుండి ప్రయాణమై, మీ పితరులకు నేను స్వాస్థ్యముగా ఇచ్చిన దేశమునకు వచ్చెదరు.
యేహెజ్కేలు 37:15—23 కూడా చూడండి.
హోషేయ 1:11..
యూదావారును ఇశ్రా యేలువారును ఏకముగా కూడుకొని, తమ పైన నొకనినే ప్రధానుని నియమించుకొని తామున్న దేశములోనుండి బయలుదేరుదురు; ఆ యెజ్రెయేలు దినము మహా ప్రభావముగల దినముగానుండును.
గమనించవలసిన విషయం ఏమిటంటే ఇది జరిగిపోయింది. యేసయ్య మొదట రాకడకు ముందుగానే వారు తమ దేశానికి రావడం, కలసిపోవడం జరిగింది. ఇప్పటికీ కూడా ఇశ్రాయేలు దేశమని, ప్రజలను యూదులు అని పిలుస్తున్నారు. ఈ యూదులలో యూదా గోత్రం వారున్నారు, లేవీ గోత్రం వారున్నారు అన్ని గోత్రాల వారున్నారు గాని అందరినీ ఇప్పుడు యూదులు అని పిలుస్తున్నారు. దేశం మొత్తాన్ని ఇశ్రాయేలు దేశం అంటున్నారు.
(ఇంకాఉంది)
*హతస్సాక్షి జెకర్యా-26వ భాగము*
జెకర్యా 9:10—17 ......
14. యెహోవా వారికి పైగా ప్రత్యక్షమగును, ఆయన
బాణములు మెరుపువలె విడువబడును, ప్రభువగు యెహోవా బాకానాదము చేయుచు
దక్షిణదిక్కునుండి వచ్చు గొప్ప సుడిగాలితో బయలు దేరును.
15. సైన్యములకు అధిపతియగు యెహోవా వారిని కాపాడును గనుక వారు భక్షించుచు,
వడిసెలరాళ్లను అణగద్రొక్కుచు త్రాగుచు, ద్రాక్షారసము
త్రాగువారి వలె బొబ్బలిడుచు, బలిపశురక్త పాత్రలును బలిపీఠపు మూలలును
నిండునట్లు రక్తముతో నిండియుందురు.
16. నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నములవలె నున్నారు గనుక
కాపరి తన మందను రక్షించునట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును.
17. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా
ఉన్నారు; ధాన్యముచేత యౌవనులును క్రొత్త ద్రాక్షా రసముచేత యౌవన
స్త్రీలును వృద్ధి నొందుదురు.
ప్రియ దైవజనమా! జెకర్యా గారి ప్రవచనాలను ధ్యానం చేసుకుంటున్నాం! ఇక ఈ 9:10—17 వచనాలు ముఖ్యంగా రెండు భాగాలుగా చెయ్యవచ్చు.
మొదటది: 1౦—13 వరకు – యేసుక్రీస్తు మొదట
రాకడ కోసం చెప్పియుండగా,
రెండవది: 14—17 వరకు అంత్యకాలంలో యేసుక్రీస్తు ప్రభులవారి రెండవరాకడ అనగా ముఖ్యంగా ఆయన ప్రత్యక్షరాకడ
జరిగాక జరిగే సంభవాలు కోసం చెప్పబడింది.
ప్రియ దైవజనమా! పై ప్రవచనంలో సగభాగం గతాభాగంలో ధ్యానం చేసుకున్నాం! ఇక సగభాగం ఇప్పుడు ధ్యానం చేసుకుందాం. 14—17......
ఈ వచనాలు జాగ్రత్తగా పరిశీలన చేస్తే
ఇవి అంత్యదినాలలో జరుగబోయే సంఘటనలు అని గ్రహించవచ్చు. సంఘము ఎత్తబడ్డాక, యూదులు రక్షించబడిన తర్వాత
అనగా మొదట క్రీస్తువిరోది చేత మోసగించబడి, ఇద్దరు సాక్షుల సువార్త
విని రక్షించబడ్డాక, యూదులు అంత్యక్రీస్తుకు వ్యతిరేఖంగా తిరుగబడిన
తర్వాత వాడు, వాడి సైన్యాలు సమస్తమును వెంటబెట్టుకుని యుద్దానికి
వస్తారు. అనగా యెరూషలేము చుట్టూ దండ్లు పొంచి ఉన్నప్పుడు జరుగబోయే
సంఘటనలుగా కనిపిస్తున్నాయి ఇవి. అనగా హార్మేగిద్దోన్ యుద్దానికి
సంభందించినట్లు కనిపిస్తుంది.
ప్రకటన
16:14—15 ..
14. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే; అవి సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను
పోగుచేయవలెనని వారియొద్దకు బయలు వెళ్లి,
15. హెబ్రీభాషలో హార్ మెగిద్దోనను చోటుకు
వారిని పోగుచేసెను. ,
ప్రకటన 19: 19—21
19. మరియు ఆ గుఱ్ఱముమీద కూర్చున్నవానితోను ఆయన సేనతోను యుద్ధముచేయుటకై
ఆ క్రూరమృగమును భూరాజులును వారి సేనలును కూడియుండగా చూచితిని.
20. అప్పుడా మృగమును, దానియెదుట సూచక క్రియలు
చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించినవారిని మోసపరచిన
ఆ అబద్ధప్రవక్తయు, పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో
ప్రాణముతోనే వేయబడిరి.
21. కడమ వారు గుఱ్ఱముమీద కూర్చున్న వాని నోటనుండి వచ్చిన ఖడ్గముచేత
వధింపబడిరి; వారి మాంసమును పక్షులన్నియు కడుపార తినెను.
ఎప్పుడైతే వారు అనగా అంత్యక్రీస్తు సైన్యము అలా కూడివస్తారో దేవుడే ఇశ్రాయేలు పక్షమున యుద్ధము చేసి వారిని రక్షించబోతున్నారు.
జెకర్యా 12:2—9
యోవేలు ౩:16
యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు;
యెరూషలేములోనుండి తన స్వరము వినబడజేయుచున్నాడు; భూమ్యాకాశములు వణకుచున్నవి. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయ
మగును, ఇశ్రాయేలీయులకు దుర్గముగా ఉండును.
అప్పుడే జెకర్యా 14 వ అధ్యాయంలో ఉదహరించబడిన క్రియలు మొత్తం జరుగుతాయి. ఒలీవల కొండ మీద ఆయన పాదాలుంచగా అది రెండుగా విడిపోతుంది. జెకర్యా
14:
3. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా
ఆ అన్యజనులతో యుద్ధము చేయును.
4. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పుతట్టుననున్న ఒలీవ కొండమీద ఆయన
పాదములుంచగా ఒలీవకొండ తూర్పు తట్టునకును పడమటి తట్టువకును నడిమికి విడిపోయి సగము కొండ
ఉత్తరపుతట్టునకును సగముకొండ దక్షిణపుతట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ యొకటి యేర్పడును.
5. కొండలమధ్య కనబడు లోయ ఆజీలువరకు సాగగా మీరు ఆ కొండలోయలోనికి పారిపోవుదురు.
యూదారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు
మీరు పారిపోవుదురు, అప్పుడు నీతోకూడ పరిశుద్దులందరును వచ్చెదరు.
నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును.
ఇక 16వ వచనంలో.....
జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నములవలె నున్నారు గనుక కాపరి తన మందను రక్షించునట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును.
నా జనులు అనగా ఇశ్రాయేలు ప్రజలు అని గ్రహించాలి.
యెహోవాదినము అనగా యెషయా
2:12
అహంకారాతిశయముగల ప్రతిదానికిని ఔన్నత్యము గల ప్రతిదానికిని విమర్శించు దినమొకటి సైన్యములకధిపతియగు యెహోవా నియమించియున్నాడు అవి అణగద్రొక్కబడును.
Isaiah(యెషయా గ్రంథము) 2:17,18,19,20,21
17. అప్పుడు నరుల అహంకారము అణగద్రొక్కబడును మనుష్యుల గర్వము తగ్గింపబడును
ఆ దినమున యెహోవామాత్రమే ఘనత వహించును.
18. విగ్రహములు బొత్తిగా నశించిపోవును.
19. యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధినుండియు
ఆయన ప్రభావ మాహాత్మ్యమునుండియు మనుష్యులు కొండల గుహలలో దూరుదురు నేల బొరియలలో దూరుదురు.
20. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధినుండియు
ఆయన ప్రభావ మాహాత్మ్యమునుండియు కొండల గుహలలోను బండబీటలలోను
21. దూరవలెనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను
సువర్ణ విగ్రహ ములను ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు.
యెషయా 13:6
యెహోవా దినము వచ్చుచున్నది ఘోషించుడి అది ప్రళయమువలె సర్వశక్తుడగు దేవుని యొద్దనుండి వచ్చును.
యోవేలు 1:15
ఆహా, యెహోవా దినము వచ్చెనే అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయమువలెనే సర్వశక్తునియొద్దనుండి వచ్చును.
యోవేలు 2:31—32
ఇక కిరీటమందలి రత్నములు అనగా ఇది ఇశ్రాయేలు ప్రజలకు కలిగే సౌందర్యానికి శోభకు సూచనగా కనిపిస్తుంది.
యెషయా 62:౩
నీవు యెహోవాచేతిలో భూషణ కిరీటముగాను నీ దేవునిచేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు.
కాపరి మందను రక్షించునట్లు యెహోవా ఆ దినమున వారిని రక్షించును.. అందుకే యేసయ్య నేను గొర్రెలకు మంచికాపరిని. మంచి కాపరి తన మందకొరకు ప్రాణం పెట్టును. అని చెప్పడమే కాదు ప్రాణం పెట్టారు కూడా! ఇప్పుడు ప్రాణాలు కాపాడటానికి యూదా గోత్రపు సింహముగా మారి తన శత్రువులపై యుద్ధం చేయడానికి వస్తున్నారు..... యోహాను
10:11,14
ప్రకటన 5:5
ఇక 17వ వచనం....వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు; ధాన్యముచేత యౌవనులును క్రొత్త ద్రాక్షా రసముచేత యౌవన స్త్రీలును వృద్ధి నొందుదురు
ఇది చదివాక జనులు తినితాగుతారు అని
అర్ధం చేసుకోకూడదు. ఇది కేవలం ఇశ్రాయేలు వారు అనుభవించే శాంతిని
సమృద్ధిని సూచిస్తుంది.
ధాన్యము అనగా వారు సంతృప్తిగా ఉంటారు అని అర్ధం.
ఇంకా ధాన్యము- రొట్టెకు సంభంధం ఉంది- మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదు గాని ఆయన నోటనుండి వచ్చిన ప్రతీ మాట వలన జీవించును. కాబట్టి దీనిని ఇంకా లోతుగా ఆలోచిస్తే వారు అనగా ఇశ్రాయేలు వారు దేవుని మాటలచేత, వాక్యంచేత నిత్యమూ సమృద్ధిగా ఉంటారు అన్నమాట!
ఇక క్రొత్తదాక్షారసము—ఇది వారు పొందుకునే క్రొత్త అభిషేకానికి – పరిశుద్ధాత్మ అభిషేకానికి గుర్తుగా ఉంది. వారు క్రొత్త నిభందనలోనికి వచ్చాక క్రొత్త అభిషేకం- కడవరి దీవెనలు పొందుకుంటారు అనేదానిని సూచిస్తుంది.
ప్రియ సంఘమా! దేవుడు నీకు కూడా కాపరిగా ఉన్నారు. వారికి కలుగబోయే ఆశీర్వాదాలు వారికంటే ముందుగానే అన్యజనాంగమైన మనకు దేవుడు దయచేశారు. కారణం వారు మొదట త్రోసివేశారు కాబట్టి. మరి ఇప్పుడు ఆయన నీకు కూడా కాపరిగా కిరీటంగా, ఆశ్రయంగా ఉన్నారు. నీకు కూడా క్రొత్త గోధుమ పంటతో, నూతన అభిషేకంతో నింపగలరు. మరి నీవు ఆయన మాట వింటావా?
దైవాశీస్సులు!
*హతస్సాక్షి జెకర్యా-27వ భాగము*
జెకర్యా 10:1—2 .....
1. కడవరి వానకాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి.
ప్రతివాని చేనిలోను పైరు మొలుచునట్లు యెహోవా మెరుపులను పుట్టించును,
ఆయన వానలు మెండుగా కురిపించును.
2. గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి, సోదెగాండ్రకు
నిరర్థకమైన దర్శనములు కలిగినవి, మోసముతో కలలకు భావము చెప్పిరి,
మాయగల భావములు చెప్పి ఓదార్చిరి. కాబట్టి గొఱ్ఱెలమంద
తిరుగులాడునట్లు జనులు తిరుగులాడిరి, కాపరి లేక బాధనొందిరి.
ప్రియ దైవజనమా! జెకర్యా గారి ప్రవచనాలను ధ్యానం చేసుకుంటున్నాం! ప్రియులారా! మీదన రెండు వచనాలు చూసుకుంటే జెకర్యా గారి సమయంలో హగ్గయి గ్రంధం ప్రకారం కరవుకాటకాలు వచ్చాయి కాబట్టి వర్షం కోసం ప్రార్ధన చేయమని జెకర్యా గారు చెప్పినట్లు అనిపిస్తుంది కదా, గాని దాని ఆత్మీయ అర్ధం వేరుగా కనిపిస్తుంది.
అవును హగ్గయి గ్రంధం ప్రకారం వారు కరవుతో బాధపడుతున్నారు. 1:6, 9-11. అయితే వర్షం కోసం ప్రార్ధన చేయ్యమని జెకర్యా గారు చెప్పినట్లు అని పించవచ్చు. కారణం ప్రకృతి దేవునిచేతిలో ఉంది. మాటతో మహిమలుచేసిన దేవుడు ఆయన! గాలి తుఫాను ఆగిపో అని చెప్పిన వెంటనే నిమ్మలమయ్యాయి అవి. వెలుగు కలుగుగాక అని పలుకగా వెలుగు కలిగెను.కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. తనకి ఇష్టం వచ్చినప్పుడు వర్షం కురిపిస్తారు. ప్రజలకు బుద్ధి చెప్పడానికి వర్షాలు ఆపి కరవుకాటకాలు పంపగలరు,. ఏలియా గారు ప్రార్ధించగా వర్షాలు ఆపివేశారు. మరలా ప్రార్ధించగా వర్షం కురిపించారు. లేవీ 26:4; 1రాజులు 8:36; 1రాజులు 17:1; కీర్తన 135:6—7; ఆమోసు 4:7—8; అపోస్త 14:17
ఇంకా ప్రతివాని చేతిలో పైరు అనగా పంటలు పండేలాగా యెహోవా మెరుపులు పుట్టించును, వానలు మెండుగా కురిపించును అంటున్నారు.
పైరులు పండటానికి మెరుపులు కి సంబంధం ఏమిటి? ఈ సైంటిస్టులు కనుక్కోకముందే దేవుడు జెకర్యా గారిద్వారా చెప్పారు- మెరుపులు వస్తేనే పంటలు పండుతాయి అని. కారణం వాతావరణంలో నైట్రోజన్ చాలా విస్తారంగా ఉంది. అలాగే హైడ్రోజన్ కూడా ఎక్కువగా ఉంది. గాని అవి రెండుకలవాలి అంటే కొన్నివేల వేడి/ ఉష్ణోగ్రత కావాలి. అది ఎప్పుడు కలుగుతుంది అంటే ఈ మేఘాలు గుద్దుకొన్నప్పుడు మెరుపులు కలిగి దానివలన అత్యధిక ఉష్ణోగ్రత పుట్టి, వాతావరణంలో గల నైట్రోజన్ మరియు హైడ్రోజన్ కలుసుకుని, అమ్మోనియా గా మారుతుంది. ఆ అమ్మోనియా వర్షం పడినప్పుడు వర్షంతో పాటు భూమిమీద పడి పంటలు బాగా పండుతాయి. అందుకే జెకర్యా గారు వర్షం పడాలని దేవుణ్ణి వేడుకోండి గాని పనికిమాలిన సోదెగాండ్రను, మంత్రగాల్లను ఆశ్రయించి మోసపోవద్దు. వారివలన మీకు వర్షాలు రావు అంటున్నారు.
అయితే దీని అసలు అర్ధం వేరు అని ఎందుకు చెబుతున్నావు అని అడగవచ్చు. 1—౩ వచనాలు జాగ్రత్తగా పరిశీలన చేస్తే దీని ఆత్మీయ అర్ధం వేరుగా కనిపిస్తుంది. జెకర్యా గారు కడవరి వర్షం కోసం ప్రార్ధన చెయ్యమంటున్నారు. 2వ వచనంలో మందకాపరులు, పనికిమాలిన వాటిని ఆశ్రయించి ప్రజలను దారితప్పించేశారు కాబట్టి మూడవ వచనంలో కాపరులను శిక్షిస్తాను అంటున్నారు. మరి ఇప్పుడు దేవుడు ఈ సాధారణ వర్షం కోసం చెబుతున్నారా లేక మరి దేనికోసం చెబుతున్నారు? నా ఉద్దేశ్యంలో దేవుడు ఈ సాధారణ వర్షం కోసం చెప్పడం లేదు గాని కడవరి ఉజ్జీవం కావాలి అని ప్రార్ధన చెయ్యమని అడుగుతున్నట్లు కనిపిస్తుంది. కడవరి వానాకాలం అనగా కడవరి ఉజ్జీవం. కడవరి వానకాలం లో ఉజ్జీవం కావాలి అంటే వర్షం రావాలి, కడవరి వర్షం అనే ఆత్మకుమ్మరింపు కావాలి. అప్పుడు దేవుడు కడవరి ఉజ్జీవాన్ని కలిగిస్తారు. మీ యవ్వనులు దర్శనాలు చూస్తారు. ప్రవచిస్తారు అనే ప్రవచనం ద్వారా కలిగిన ఉజ్జీవం- ఆది అపోస్తలుల సమయంలో మేడగది అనుభవం ద్వారా పెంతుకోస్తు నాడు ఆత్మ కుమ్మరింపబడగా ఉజ్జీవం కలిగింది. ఆ ఉజ్జీవ జ్వాలలు రేగి ఇంతవరకు సువార్త వ్యాపించింది. ఈ జ్వాలలను ఆపడానికి ఎంతోమంది ప్రయత్నించి ఆ జ్వాలలో కాలిపోయారు తప్ప ఆ జ్వాల ఆరిపోలేదు. మరి ఇంకొక ఉజ్జీవం కోసం, మరొకసారి ఆత్మాభిషేకాన్ని పొందుకునే లాగ ప్రార్ధన చెయ్యండి అంటున్నారు జెకర్యా గారు.
ఇప్పుడు ఈ కరోనా వలన కలిగింది కడవరి ఉజ్జీవమా? ఏమో తెలియదు. కాదు అని పిస్తుంది. నిజం చెప్పాలంటే ఈ కరోనా వలన చాలా ఉజ్జీవం కలిగింది. ముఖ్యంగా యూరోపియన్ దేశాలలో, అమెరికా ఖండంలో, బ్రెజిల్ లాంటి పాప భూయిష్టమైన దేశాలలో ఉజ్జీవ జ్వాలలు చెలరేగాయి. రోజుకు కొన్ని లక్షలమంది దేవుని దగ్గరకు వస్తున్నట్లు మనం చూస్తున్నాం. నిజంగా ఇది ఉజ్జీవమే! అయితే ఇది కడవరి ఉజ్జీవమా? ఏమో తెలియదు. నా ఉద్దేశ్యంలో కాదు అనిపిస్తుంది . కారణం దీని ద్వారా కూడా ఇంకా యూదులు రక్షింపబడలేదు. రక్షింపబడరు కూడా! వారు అంత్యదినాలలో రక్షణపొందుతారు. అయితే ఏదిఏమైనా మనం మన దేశం మార్పుకోసం ఉజ్జీవం కోసం ప్రార్ధన చెయ్యాల్సి ఉంది. కారణం ప్రార్దిస్తేనే దేవుడు పంపుతారు. ఒకసారి యేసయ్య చెప్పిన మాట చూడండి—కోత విస్తారంగా ఉంది గాని పనివారు కొద్దిమందిగా ఉన్నారు కాబట్టి కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకోమని చెబుతున్నారు ఆయన! మత్తయి 9:37—38; లూకా 10:2; ఆయనే దేవుడు కదా మరలా యజమాని అనగా తండ్రిని వేడుకోమని ఎందుకు చెబుతున్నారు అంటే ప్రతీదానికి ఒక పద్దతి, రివాజు అనేది ఉంటుంది. దానిప్రకారం ప్రార్ధించవలసిన అవసరం మనకుంది. ఎప్పుడైతే అప్లికేషన్ వస్తుందో వెంటనే దేవుడు దానికి సరియైన సమయంలో అనగా దేవుని పని దేవుని సమయంలో దేవుని పద్దతిలో దేవుడు చేస్తారు. అలాగే ఇప్పుడు మనపని కడవరి ఉజ్జీవం మన ప్రాంతంలో రావాలని ప్రార్ధన చెయ్యాలి.
ఇంతవరకు బాగుంది గాని మరి కాపరులను శిక్షించడం ఎందుకు? అంటే కాపరులే మందను దారి తప్పించేస్తున్నారు. పనికిమాలిన విగ్రహాలు కోసం, సోదెగాండ్ర దగ్గరకు, మంత్రగాళ్ళదగ్గరకు నడిపించారు ప్రజలను ఆ రోజులలో! దేవుని నుండి దూరం చేశారు వారిని. అందుకే శిక్షిస్తాను అంటున్నారు. అప్పుడు ప్రజలు కాపరిలేని గొర్రెల మంద తిరుగులాడునట్లు తిరుగులాడారట. కాపరిలేక బాధనొందారు అంటున్నారు. మరి నేటి పరిస్తితి ఎలా ఉంది? ఇప్పుడు కూడా అలాగే ఉంది కదా! కాపరులు అనే సేవకులు, ప్రసంగీకులు, పెద్దలు, నాయకులు ప్రస్తుతం ప్రజలను దారి తప్పిస్తున్నారు. నిజమైన బోధ లేదు. మారుమనస్సు పశ్చాత్తాపం లేదు. పిట్టకధలు చెబుతూ ఒకరు, సైన్సు చెబుతూ ఒకరు, మర్మాలు చెబుతూ ఒకరు, నవ్వులు కలిగించే విషయాలు చెబుతూ ఒకరు, వేదాంతం చెబుతూ ఒకరు ఏదో ఏదో చెబుతున్నారు కాని కడవరి ఉజ్జీవం రావాలంటే దేవుని ఆత్మ అభిషేకం పొందుకోవాలని దాని అవసరం కోసం చెప్పడం లేదు. కారణం ఎప్పుడైతే ఆత్మ నడిపిస్తుందో అప్పుడే అసలు బోధ వస్తుంది. కారణం యేసుక్రీస్తుప్రభులవారు తను పరలోకం వెళ్లేముందు చెప్పారు- *నేను వెళ్లి మీ కొరకు ఆదరణ కర్తను అనగా సత్య స్వరూపియైన ఆత్మను పంపుతాను* *అతడు మిమ్ములను సర్వ సత్యములోనికి నడిపించును*. అవును ఆయన వెళ్లారు. పరిశుద్దాత్ముడు వచ్చాడు పెంతుకోస్తు దినాన. అప్పటినుండి బయలుదేరింది *అపోస్తలులు బోధ*! దానిపైనే కట్టబడింది సంఘం, నూతన నిబంధన సంఘము. దానికి పునాది పరిశుద్దాత్మ బాప్తిస్మము! నేటి దినాలలో ఆది అపోస్తలులు బోధ కరువైంది. ఏదేదో చెబుతున్నారు. వారి సంస్తల డాక్టరెన్సులు చెబుతున్నారు గాని అపోస్తలులు బోద యొక్క డాక్టరెన్సు ఎవరు చెప్పడం లేదు. అది కావాలి అంటే ముందుగా పరిశుద్దాత్మ అభిషేకాన్ని అనుభవించాలి. అప్పుడే కడవరి ఉజ్జీవం కలిగి నిజమైన బోధ బయటకు వస్తుంది.
ఇంతకీ అపొస్తలుల భోధ అంటే ఏమిటి?
👉 అపోస్తలుల బోధలో మొదటగా దేవుని ఆత్మ శక్తితో, ఆత్మ అభిషేకముతో కోసం ఆత్మ అభిషేకం కోసం ప్రకటింపబడుతుంది. (అపో.కా 2:1-3)
🔺 *దేవుని వాక్యం మాత్రమే ప్రకటింపబడుతుంది.*
(అపో.కా
2:16-35).
🔺 *సిలువ వేయబడిన యేసుని, పునరుత్థానుడైన
యేసుని గురించి ప్రకటింపబడుతుంది.*
(అపో.కా
2:22-24).
🔺 *యేసు దేవుని కుమారుడని ప్రకటింపబడుతుంది.*
(అపో.కా
2:31-36).
*యేసే; మెసయ్య ; క్రీస్తు
అని ప్రకటింపబడుతుంది.* (అపో.కా
2:22-36).
🔺 *ప్రాముఖ్యంగా యేసుక్రీస్తే దేవుడని ,ప్రభువని ప్రకటింపబడుతుంది.*
(అపో.కా
2:36).
🔺 *పాపక్షమాపణ గురించి ప్రకటింపబడుతుంది.*
(అపో.కా
2:38).
🔺 *మారుమనస్సు, బాప్తిసము గురించి
ప్రకటింపబడుతుంది.*
(అపో.కా
2:38).
🔺 *పరిశుద్ధాత్మ అను వరమును ఎలా పొందుకోవాలో ప్రకటింపబడుతుంది.*
(అపో.కా
2:38).
🔺 *ఈ బోధలో అన్వయింపు కూడా ప్రకటింపబడుతుంది.* (అపో.కా 2:38-40).
🔺. *పరిశుద్ధ జీవితం యొక్క ప్రాముఖ్యత కోసం చెప్పబడుతుంది.*
అపొ 2:40; రోమా
1:2; 1కొరింథీ 1:2; 1 పేతురు 1:14; ఎఫెసీ 5:26,27
🔺 *శ్రమలను అనుభవించాలని తద్వారా పరిపూర్ణత కలుగుతుంది అని
చెప్పబడుతుంది* అపొ 14:22; ఎఫెసీ 3:13; 1థెస్స 3:4; 1పేతురు 5:1; ఫిలిప్పీ 3:10--16; 1పేతురు 1:7;
🔺 *ప్రభురాకడ కొరకు సిద్దపాటు కోసం భోదించబడుతుంది*
1థెస్స
4:13-17; 2 థెస్స 2:1-8; 2పేతురు
3:4--13;
🔺 *శుధ్దీకరించబడవలసిన అవసరం కోసం చెప్పబడుతుంది*
1పేతురు
1:14; ఎఫెసీ 5:26,27
🔺 *పరిపూర్ణత సంపూర్ణత పొందుకోవాలని చెప్పబడుతుంది*
హెబ్రీ 6:2; ఎఫెసీ
4:11-13; కొలస్సీ 3:14;
♻ *ఈ బోధ ఉన్న సంఘం బలముగా కట్టబడుతుంది.* (అపో.కా 2:41).
👉నా ప్రియ స్నేహితులారా....
ఇదే అపోస్తలుల బోధనాక్రమము.
కాబట్టి ప్రియ దైవజనమా! మీ ప్రాంతంలో కడవరి ఉజ్జీవం రావాలి అంటే ప్రార్ధన చెయ్యు. అప్పుడు దేవుడు ముందుగా ఉరుములు మెరుపులు పుట్టిస్తారు. అనగా శ్రమలు శోధనలు బాధలు పుట్టిస్తారు. ఆ శ్రమల వలన కలిగే రాపిడిలో అనేకమైన అద్భుతాలు జరిగి అమ్మోనియా లాంటి పైరుకు పనికొచ్చే- అనగా సంఘాభివృద్ధికి అవసరమైన వరాలు ఫలాలు అద్భుతాలు అన్ని కలిగి అప్పుడు ఉజ్జీవం పుట్టి వర్షం అనగా పరిశుద్దాత్మ తో పాటు ఉజ్జీవజ్వాలలు పుడతాయి.
మరి ప్రియ చదువరీ నీకు ఆ మంట ఉందా? ఆ ఆత్మీయ మంటలు నీలో రేగటం లేదా? బహుశా నీవు ఆరిపోయిన దివిటీవేమో! సిద్దెలో నూనె లేదేమో!
ఒకసారి పరీక్షించుకో!
దైవాశీస్సులు!
*హతస్సాక్షి జెకర్యా-28వ భాగము*
జెకర్యా 10:3—4 ......
3. నా కోపాగ్ని మండుచు కాపరులమీద పడును, మేకలను
(నాయకులను) నేను శిక్షించెదను, సైన్యములకు అధిపతియగు యెహోవా తన మందయగు యూదావారిని దర్శించి వారిని తనకు రాజకీయములగు
అశ్వములవంటివారినిగా చేయును.
4. వారిలోనుండి మూలరాయి పుట్టును, మేకును యుద్ధపువిల్లును
వారిచేత కలుగును, బాధించువాడు వారిలోనుండి బయలుదేరును,
ప్రియ దైవజనమా! జెకర్యా గారి ప్రవచనాలను ధ్యానం చేసుకుంటున్నాం!
ఈ మూడవ వచనంలో కాపరులను శిక్షిస్తాను అంటున్నారు, కారణం
గతభాగంలో చెప్పినట్లు కాపరులే వీరిని త్రోవతప్పించారు కాబట్టి. ఇంకా నాయకులను కూడా శిక్షిస్తాను అంటున్నారు. దీనికోసం
ఎన్నెన్నో రిఫరెన్సులు ఉన్నాయి. గతంలో వివరించడం జరిగింది.
యిర్మియా 25:౩4—38; యేహెజ్కేలు
34:1—16 వాక్యాలు సూటిగా సరిపోతాయి. అప్పటి రోజులే
కాదు, నేటిరోజులకు కూడా సరిగా సరిపోతాయి. ....
Ezekiel(యెహెజ్కేలు) 34:2,3,4,5,8,10
2. నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులనుగూర్చి
ఈ మాట ప్రవచింపుము, ఆ కాపరులతో ఇట్లనుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా
తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ; కాపరులు గొఱ్ఱెలను
మేపవలెను గదా.
3. మీరు క్రొవ్విన గొఱ్ఱెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు
గాని గొఱ్ఱెలను మేపరు,
4. బలహీనమైనవాటిని మీరు బలపరచరు, రోగముగలవాటిని
స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరల తోలుకొనిరారు, తప్పిపోయినవాటిని
వెదకరు, అది మాత్రమేగాక మీరు కఠినమనస్కులై బలాత్కారముతో వాటిని
ఏలుదురు.
5. కాబట్టి కాపరులు లేకయే అవి చెదరిపోయెను, చెదరి పోయి సకల అడవి మృగములకు ఆహారమాయెను.
8. కాపరులు లేకుండ నా గొఱ్ఱెలు దోపుడుసొమ్మయి సకలమైన అడవిమృగములకు
ఆహార మాయెను; కాపరులు నా గొఱ్ఱెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు గాని గొఱ్ఱెలను మేపరు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
10. ప్రభు వైన యెహోవా సెలవిచ్చునదేమనగా నా జీవముతోడు నేను ఆ కాపరులకు
విరోధినైతిని, నా గొఱ్ఱెలనుగూర్చి వారియొద్ద విచారించెదను,
వారు గొఱ్ఱెలు మేపుట మాన్పించెదను, ఇకను కాపరులు
తమ కడుపు నింపుకొన జాలక యుందురు; నా గొఱ్ఱెలు వారికి తిండికాకుండ
వారి నోటనుండి వాటిని తప్పించెదను, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
దీనికోసం దైవజనుడా శీర్షికలో వివరంగా వివరించడం జరిగింది.
ఇక తర్వాత మాటలో ఇదే వచనంలో నా మందయగు యూదా వారిని దర్శిస్తాను అంటున్నారు దీనికోసం కూడా ఇదే శీర్షికలో ఇంతవరకు విస్తారంగా ధ్యానం చెయ్యడం జరిగింది.
Ezekiel(యెహెజ్కేలు) 34:12,13,14,15,16,17
12. తమ గొఱ్ఱెలు చెదరిపోయి నప్పుడు కాపరులు వాటిని వెదకునట్లు నేను నా గొఱ్ఱె లను వెదకి, చీకటిగల మబ్బుదినమందు ఎక్కడెక్కడికి అవి చెదరిపోయెనో అక్కడనుండి నేను వాటిని తప్పించి
13. ఆ యా జనులలోనుండి వాటిని తోడుకొని వచ్చి, ఆ యా దేశములలోనుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశము లోనికి వాటిని తెచ్చి పర్వతములమీదను వాగులయొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను.
14. నేను మంచి మేతగలచోట వాటిని మేపె దను, ఇశ్రాయేలుయొక్క ఉన్నతస్థలములమీద వాటికి దొడ్డి యేర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండు కొనును, ఇశ్రాయేలు పర్వతములమీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును,
15. నేనే నా గొఱ్ఱెలను మేపి పరుండబెట్టుదును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
16. తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిన దానిని మరల తోలుకొని వచ్చెదను, గాయపడినదానికి కట్టు కట్టు దును, దుర్బలముగా ఉన్నదానిని బలపరచుదును; అయితే క్రొవ్వినవాటికిని బలముగలవాటికిని శిక్షయను మేతపెట్టి లయపరచెదను.
17. నా మందా, మీ విషయమై దేవుడనైన యెహోవానగు నేను సెలవిచ్చునదేమనగా గొఱ్ఱెకును గొఱ్ఱెకును మధ్యను, గొఱ్ఱెలకును పొట్టేళ్ల కును మధ్యను, గొఱ్ఱెలకును మేకపోతులకును మధ్యను భేదము కనుగొని నేను తీర్పుతీర్చెదను.
ఇక వారిని తనకు రాజకీయములగు ఆశ్వములు వంటివారిగా చేస్తాను అంటున్నారు. కొన్ని ప్రతులలో రాజయోగ్యమైన యుద్దాశ్వములుగా చేస్తాను అని రాయబడింది. అనగా బహుశా జెకర్యా 12:8 లో చెప్పబడిన విధంగా వీరు ఎంతో చురుకుగా బలాడ్యులుగా ఉంటారు. ....జెకర్యా 12: 8
ఆ కాలమున యెహోవా యెరూషలేము
నివాసులకు సంరక్షకుడుగా నుండును; ఆ కాలమున
వారిలో శక్తిహీనులు దావీదువంటివారుగాను, దావీదు సంతతి వారు దేవునివంటి
వారుగాను జనుల దృష్టికి యెహోవా దూతలవంటి వారుగాను ఉందురు.
ఇక 4వ వచనం చాలా ప్రాముఖ్యమైనది: ...జెకర్యా 10: 4
వారిలోనుండి మూలరాయి పుట్టును, మేకును యుద్ధపువిల్లును వారిచేత కలుగును,
బాధించువాడు వారిలోనుండి బయలుదేరును,
చూడండి వారిలో.....అనగా వారి వంశములలోనే
! అవును యేసుక్రీస్తు ప్రభులవారు వారి వంశం లోనే యూదా గోత్రములో జన్మించినట్లు
చూడగలం! ఇంకా ఆదికాండం 49:10
షిలోహు వచ్చువరకు యూదా యొద్దనుండి దండము తొలగదు అతని కాళ్ల మధ్యనుండి రాజదండము
తొలగదు ప్రజలు అతనికి విధేయులై యుందురు.
యిర్మియా ౩౦:21;
మీకా 5:2....
బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను.
ఇంకా
మూలరాయి పుట్టును..... గతంలో వివరించడం జరిగింది ఆ మూలరాయి యేసుక్రీస్తు ప్రభులవారు!
యెషయా 28:16
ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు సీయోనులో పునాదిగా రాతిని వేసినవాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాదియైన మూలరాయియైయున్నది విశ్వసించువాడు కలవరపడడు.
అపో.కార్యములు 4: 11
ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే; ఆ రాయి మూలకు తలరాయి ఆయెను.
ఎఫెసి 2:20
క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియైయుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.
ఇక డేరా మేకు! ఆ డేరా మేకు ఎవరో కాదు యేసయ్య! డేరా మేకు ఎందుకు కావాలి? డేరా ఎగిరిపోకుండా ఉండటానికి! ఆధారంగా ఉండటానికి! యెషయా
22:22—24....
22. నేను దావీదు ఇంటితాళపు అధికారభారమును అతని భుజముమీద ఉంచెదను
అతడు తీయగా ఎవడును మూయజాలడు అతడు మూయగా ఎవడును తీయజాలడు
23. దిట్టమైనచోట మేకు కొట్టినట్టు నేను అతని స్థిర పరచెదను అతడు
తన పితరుల కుటుంబమునకు మాన్యతగల సింహాసనముగా నుండును.
24. గిన్నెలవంటి పాత్రలను బుడ్లవంటి సమస్తమైన చిన్న చెంబులను అనగా
అతని పితరుల సంతాన సంబంధులగు పిల్లజల్ల లందరిని అతనిమీద వ్రేలాడించెదరు.
యుద్ద ధనుస్సు/విల్లు: ఇక్కడ దేవుడు నేను మిమ్ములనే యుద్దపు విల్లుగా మారుస్తాను అంటున్నారు. జెకర్యా 9:13..
యూదావారిని నాకు విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను. సీయోనూ, నీ కుమారులను రేపుచున్నాను, శూరుడు ఖడ్గము ప్రయోగించునట్లు నేను నిన్ను ప్రయోగింతును. గ్రేకీయులారా, సీయోను కుమారులను మీమీదికి రేపుచున్నాను.
ఇప్పుడు ఆ బాణాలు శత్రువుల గుండెలో దూరుతాయి. కీర్తన
45:5...
నీ బాణములు వాడిగలవి ప్రజలు నీచేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును.
ఇక 5వ వచనం....
వారు యుద్ధముచేయుచు వీధుల బురదలో శత్రువులను త్రొక్కు పరాక్రమశాలుర వలె ఉందురు. యెహోవా వారికి తోడైయుండును గనుక వారు యుద్ధముచేయగా గుఱ్ఱములను ఎక్కువారు సిగ్గునొందుదురు.
దీనినే మరలా జెకర్యా
12:6—9 లో పునరుధ్ఘాటించారు....
6. ఆ దినమున నేను యూదా అధికారులను కట్టెల క్రింది నిప్పులుగాను పనల
క్రింది దివిటీగాను చేతును, వారు నలుదిక్కులనున్న జనములనందరిని
దహించుదురు. యెరూషలేమువారు ఇంకను తమ స్వస్థలమగు యెరూష లేములో
నివసించుదురు.
7. మరియు దావీదు ఇంటి వారును యెరూషలేము నివాసులును, తమకు కలిగిన ఘనతనుబట్టి యూదావారిమీద అతిశయపడకుండునట్లు యెహోవా యూదావారిని మొదట
రక్షించును.
8. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును;
ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారు గాను, దావీదు సంతతి వారు దేవునివంటి వారుగాను జనుల దృష్టికి యెహోవా దూతలవంటి వారుగాను
ఉందురు.
9. ఆ కాలమున యెరూషలేముమీదికి వచ్చు అన్యజనులనందరిని నేను నశింపజేయ
పూనుకొనెదను.
ఇక 6—12 వచనాల కోసం అనేకసార్లు ఈ శీర్షికలో చూసుకున్నాం కాబట్టి తొందరగా ముందుకు పోదాం!........
Zechariah(జెకర్యా) 10:6,7,8,9,10,11,12
6. నేను యూదా వారిని బలశాలురుగా చేసెదను, యోసేపు సంతతివారికి రక్షణ కలుగజేసి వారికి నివాసస్థలము ఇచ్చెదను, నేను వారియెడల జాలిపడుదును, నేను వారి దేవుడనైన యెహోవాను,
నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరచిపోవుదురు.
7. ఎఫ్రాయిమువారు బలాఢ్యులవంటి వారగుదురు, ద్రాక్షారస పానము చేయువారు సంతోషించునట్లు వారు మనస్సున ఆనందింతురు,
వారి బిడ్డలు దాని చూచి ఆనందపడుదురు, యెహోవాను
బట్టివారు హృదయ పూర్వకముగా ఉల్లసించుదురు.
8. నేను వారిని విమోచించియున్నాను గనుక వారిని ఈల వేసి పిలిచి సమకూర్చెదను,
మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు.
9. అన్యజనులలో నేను వారిని విత్తగా దూరదేశములలో వారు నన్ను జ్ఞాపకము
చేసికొందురు, వారును వారి బిడ్డలును సజీవులై తిరిగి వత్తురు,
10. ఐగుప్తు దేశములోనుండి వారిని మరల రప్పించి అష్షూరు దేశములోనుండి
సమకూర్చి, యెక్కడను చోటు చాలనంత విస్తారముగా గిలాదు దేశములోనికిని
లెబానోను దేశములోనికిని వారిని తోడుకొని వచ్చెదను.
11. యెహోవా దుఃఖసముద్రమును దాటి సముద్రతరంగములను అణచి వేయును,
నైలునదియొక్క లోతైన స్థలములను ఆయన ఎండజేయును, అష్షూరీయుల
అతిశయాస్పదము కొట్టివేయబడును, ఐగుప్తీయులు రాజదండమును పోగొట్టుకొందురు.
12. నేను వారిని యెహోవాయందు బలశాలురగా చేయుదును, ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు;ఇదే యెహోవా వాక్కు.
6 వ వచనంలో వారి మునుపటి క్షేమస్తితి వారికి కలుగుతుంది అనియు, ఇంకా వారి ప్రార్ధనలకు జవాబు ఇస్తాను అని చెబుతున్నారు. గమనించాలి దేవుడు మన ప్రార్ధనలకు మూల్గులకు ఎప్పుడు జవాబు ఇస్తారు అంటే విరిగినలిగిన హృదయంతో ప్రార్ధించినప్పుడు! అసలు ప్రార్ధన చేయకపోతే- జవాబు కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు.
ఇక 8వ వచనంలో ఈలవేసి పిలిచి వారిని సమకూరుస్తాను అంటున్నారు. అవును దేవుడు అర్తసహస్త సమయంలో ఒకసారి పిలిచారు, ఇంకా
1947 తర్వాత ఈలవేసి పిలిచి తన ప్రజలను సమకూరుస్తున్నారు. ఇంకా వస్తున్నారు యూదులు తమ దేశానికి!
ఇక ఈల వేయడం ఏమిటి? మంద కాపరి తన మందను ఈలవేసి పిలుస్తాడు. అలాగే యేసయ్య నేను గొర్రెలకు మంచికాపరిని అన్నారు కాబట్టి ఆయన మన మందకాపరి కాబట్టి ఈలవేసి పిలుస్తాను అంటున్నారు. దీనిలో మరో అర్ధం కూడా ఉంది. మొదటగా వారిని విమోచించి యున్నాను గనుక వారిని ఈలవేసి పిలిచి సమకూర్చెదను అని చెప్పి 9వ వచనంలో అన్యజనులలో వారిని విత్తగా దూరదేశంలో వారు నన్ను జ్ఞాపకం చేసుకుని వారును వారి బిడ్డలు సజీవులై వత్తురు. అనగా మొదటగా పాప బంధకములలో ఉన్న అన్య జనులమైన మనలను కూడా దేవుడు తన సిలువ రక్తముద్వారా విమోచించి, ఎందుకు పనికిరాని మనలను ఏర్పరచుకుని, ఈల వేసి మనలను పిలిచి తన మందలో సమకూర్చారు. ఇప్పుడు మన కాపరి యేసయ్య! కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా! ఆయన కాపరత్వములోనే నీవుండాలి. అప్పుడే నీకు భద్రత! ఆయన కాపరత్వమును నిరాకరించి లోకంలో పడ్డావా, లోకానికి కాపరి సాతానుగాడు జాగ్రత్త! వాడు నిన్ను నరకానికి తీసుకుని పోతాడు.
ఇక 10వ వచనంలో ఐగుప్టు నుండి, అస్సూరు నుండి వారిని తీసుకుని వస్తాను అనగా మనకు తెలుసు, ఇశ్రాయేలు వారు మొదటగా ఐగుప్తు దేశానికి చెరలో తీసుకుని పోయారు, అస్సూరు రాజుకు ముందుగా! ఆ తర్వాత అస్సూరు రాజు, బబులోను రాజులు తీసుకుని పోయారు చెరలోనికి. ఇప్పుడు మరలా నేను అక్కడనుండి తీసుకుని వస్తాను. అలాగే పాప బంధకములలో ఉన్నవారిని కూడా దేవుడు మరలా ఆయన కాపరత్వము లోనికి తీసుకుని వస్తారు అని గ్రహించాలి.
11.....యెహోవా దుఃఖసముద్రమును దాటి సముద్రతరంగములను అణచి వేయును, నైలునదియొక్క లోతైన స్థలములను ఆయన ఎండజేయును, అష్షూరీయుల అతిశయాస్పదము కొట్టివేయబడును, ఐగుప్తీయులు రాజదండమును పోగొట్టుకొందురు.
సముద్రాలు ఎదురొచ్చినా అవి అనగారి పోతాయి గాని తన ప్రజలు మాత్రం తిరిగి వారి దేశానికి వస్తారు అంటున్నారు.
ఇక నైలునది లోతులు ఇంకిపోతాయి, అస్శూరు వారి గర్వం అణచివేస్తాను అనగా ఇది ఈ క్రింది ప్రవచనాలకు సపోర్టింగా కనిపిస్తుంది.
యెషయా 11:15
మరియు యెహోవా ఐగుప్తు సముద్రముయొక్క అఖాతమును నిర్మూలము చేయును వేడిమిగల తన ఊపిరిని ఊదును యూఫ్రటీసు నది మీద తన చెయ్యి ఆడించును ఏడు కాలువలుగా దాని చీలగొట్టును పాదరక్షలు తడువకుండ మనుష్యులు దాటునట్లు దాని చేయును.
యెషయా 19:5—8
5. సముద్రజలములు ఇంకిపోవును నదియును ఎండి పొడినేల యగును
6. ఏటి పాయలును కంపుకొట్టును ఐగుప్తు కాలువలు ఇంకి యెండిపోవును రెల్లును
తుంగలును వాడిపోవును.
7. నైలునదీ ప్రాంతమున దాని తీరముననున్న బీడులును దానియొద్ద విత్తబడిన
పైరంతయు ఎండి కొట్టుకొని పోయి కనబడక పోవును.
8. జాలరులును దుఃఖించెదరు నైలునదిలో గాలములు వేయువారందరు ప్రలాపించె
దరు జలములమీద వలలు వేయువారు కృశించిపోవుదురు
జెఫన్యా 2:13—15
13. ఆయన ఉత్తరదేశము మీద తన హస్తమును చాపి అష్షూరు దేశమును నాశనముచేయును;
నీనెవె పట్టణమును పాడుచేసి దానిని ఆరిపోయిన యెడారివలె చేయును.
14. దానిలో పసుల మందలు పండుకొనును; సకలజాతి
జంతువులును గంపులుగాకూడును; గూడ బాతులును తుంబోళ్లును వారి ద్వారముల
పైకమ్ముల మీద నిలుచును; పక్షుల శబ్దములును కిటికీలలో వినబడును;
గడపలమీద నాశనము కనుపించును. వారు చేసికొనిన దేవదారు
కఱ్ఱపనియంతటిని యెహోవా నాశనము చేయును.
యెషయా
2:12—18
12....నేను వారిని యెహోవాయందు బలశాలురగా చేయుదును, ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు;ఇదే యెహోవా వాక్కు.
అప్పుడు వారు కేవలం యెహోవా నామమును మాత్రమే స్మరణతెచ్చుకుంటారు. విగ్రహాల పేర్లు
ఎత్తరు.
మీకా 4:5
5. సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు,
మనమైతే మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడును స్మరించుకొందుము.
యెషయా
26:8
మేము నీకొరకు కనిపెట్టుకొనుచున్నాము మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించు చున్నది.
ప్రియ దైవజనమా! ఇవి తొందరలో జరగబోతున్నాయి. నీవుకూడా ఆయనయందు విశ్వాసముంచి ఆయనను మాత్రమే నమ్ముకుని ముందుకు సాగిపోయావా పరలోకాన్ని పట్టేసినట్టే! వెనకడుగు వేశావా విడచిపెట్ట బడతావు.
దైవాశీస్సులు!
*హతస్సాక్షి జెకర్యా-29వ భాగము*
*యేసుక్రీస్తు మొదటి రాకడ-1*
జెకర్యా 11:4—8 ......
4. నా దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా వధకేర్పడిన గొఱ్ఱెల మందను
మేపుము.
5. వాటిని కొనువారు వాటిని చంపియు నిరపరాధులమని యనుకొందురు;
వాటిని అమ్మినవారు మాకు బహు ద్రవ్యము దొరుకుచున్నది, యెహోవాకు స్తోత్రమని చెప్పుకొందురు; వాటిని కాయువారు
వాటి యెడల కనికరము చూపరు.
6. ఇదే యెహోవా వాక్కు నేనికను దేశ నివాసులను కనికరింపక ఒకరిచేతికి
ఒకరిని, వారి రాజుచేతికి వారినందరిని అప్పగింతును, వారు దేశమును, నాశనముచేయగా వారి చేతిలోనుండి నేనెవరిని
విడిపింపను.
7. కాబట్టి నేను సౌందర్యమనునట్టియు(కటాక్షము)
బంధకమనునట్టియు(సమకూర్చుట అనియున్నది) రెండు కఱ్ఱలు చేతపట్టుకొని వధకేర్పడిన గొఱ్ఱెలను ముఖ్యముగా వాటిలో మిక్కిలి
బలహీనమైన వాటిని మేపుచువచ్చితిని.
8. ఒక నెలలోగా కాపరులలో ముగ్గురిని సంహరించితిని; ఏలయనగా నేను వారి విషయమై సహనము లేనివాడను కాగా వారు నా విషయమై ఆయాసపడిరి.
ప్రియ దైవజనమా! జెకర్యా గారి ప్రవచనాలను ధ్యానం చేసుకుంటున్నాం!
ఇక ఈ 11వ అధ్యాయం మొత్తం యేసుక్రీస్తు ప్రభులవారి
మొదటి రాకడ కోసమే ప్రవచనాత్మకంగా చెప్పబడింది. అనగా యేసుక్రీస్తు
ప్రభులవారి బలియాగం సమయంలో జరిగే వృత్తాంతములు, ఆయనను నిరాకరించడం
మొత్తం ముందుగానే దేవుడు ప్రవచనాత్మకంగా బయలుపరిచారు.
1—౩
1. లెబానోనూ, అగ్నివచ్చి నీ దేవదారు వృక్షములను కాల్చివేయునట్లు నీ ద్వారములను తెరువుము.
2. దేవదారు వృక్షములు కూలెను, వృక్షరాజములు పాడైపోయెను; సరళవృక్షములారా, అంగలార్చుడి చిక్కని అడవి నరకబడెను; సింధూరవృక్షములారా, అంగలార్చుడి.
3. గొఱ్ఱె బోయల రోదన శబ్దము వినబడుచున్నది, ఏలయనగా వారి అతిశయాస్పదము లయమాయెను. కొదమ సింహముల గర్జనము వినబడుచున్నది, ఏలయనగా యొర్దాను యొక్క మహారణ్యము పాడైపోయెను.
ఈ అధ్యాయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే మొదటి మూడు వచనాలలో ఉత్తర దిక్కున ఉండే వారు అనగా ఇశ్రాయేలు దేశానికి ఉత్తర దిక్కున ఉండేవారు లెబానోను నుండి యోర్దానుకు తూర్పుగా ఉన్న భాషాను మీదుగా యోర్దాను ప్రాంతంలోనికి చొచ్చుకు వచ్చి వారి మీద దాడిచేసి తమకు అడ్డువచ్చిన వారిని నాశనం చేస్తూ వచ్చే సైన్యాన్ని సూచిస్తుంది. అయితే 4—8 వచనాలలో వీరు ఎందుకు ఇశ్రాయేలు దేశం మీద దండెత్తి వచ్చారు, దేవుడు ఎందుకు వారిని అలా ఒప్పుకున్నారు అనేది మనం చూడవచ్చు, కారణం వారు అభిషక్తుని నిరాకరించి ఘోరంగా చంపడం వలన! అందువలననే యూదులకు అన్ని శ్రమలు శోధనలు ప్రపంచమంతా చెదిరిపోవడం జరిగింది. ఈ శ్రమలు కలుగుతాయి అని దేవుడు ముందుగానే చెప్పారు.
మత్తయి 24:1—2
లూకా 19:41—44
లూకా 21:23—24
ఇక 4—7 చూసుకుంటే.... నా దేవుడైన యెహోవా నాకు ఏమి చెప్పారంటే వధకు ఏర్పరచబడిన మందను మేపుము. వధకు ఏర్పరచబడిన మంద అంటే??? అనగా ఇశ్రాయేలు జాతి యేసుక్రీస్తు ప్రభులవారిని నిరాకరించినందువలన వారు వధకు తేబడిన గొర్రెలవలే వారు వధించబడటం, అనేక దేశాలకు చెదిరిపోవడం సూచిస్తుంది. అందుకే వధకు ఏర్పరచబడిన మంద అన్నారు. మేపుము--- అనగా అది జెకర్యా గారిని సూచిస్తున్నా, జెకర్యా గారు అభిషక్తుడైన యేసుక్రీస్తు ప్రభులవారికి సూచనగా ఉన్నారు. ఇది మొత్తం యేసయ్య కోసమే ఆయన మొదటి రాకడ కోసమే చెప్పబడింది. వారు యేసయ్యను నిరాకరించిన తర్వాత చూసుకుంటే నీరో చక్త్రవర్తి గాని, టైటస్ అనేవాడు గాని పాపిలియస్, పాంపే అనేవాడు, డొమిషియాస్, నీరో, అగష్టస్ సీజర్, హిట్లర్ కానీయండి ఇశ్రాయేలు వారిని ఎంతో ఘోరంగా చంపారు. హిట్లర్ కొన్ని లక్షలమంది యూదులను చంపాడు. ఇలా ఇశ్రాయేలు మంద వధకు సిద్దమైన మందలా అణచబడింది. వారు ఈ దోషము మామీదను మా పిల్లల మీదను ఉండుగాక అని ఒప్పుకున్నారు. అనుభవించారు.
మత్తయి 27: 25
అందుకు ప్రజలందరువాని రక్తము మా మీదను మా పిల్లలమీదను ఉండుగాకనిరి.
ఇక 5వ వచనంలో వారిని కొనేవారు అనగా వారిని చెరలోనికి తీసుకుని పోయిన వారు, వారిని బాధించిన వారు, వారిని అమ్మిన వారు అనగా ఇశ్రాయేలు దేశంలో ఉన్న నాయకులు, ప్రధాన యాజకులు అందరూ!
ఇక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తే మనము అనగా నూతన నిబంధన సంఘానికి కూడా ఈ మాటలు వర్తిస్తాయి. మనము దారితప్పి తిరుగుతూ పాపబంధకములలో ఉండగా సాతానుడు పట్టి మనలను చీల్చుతూ నరకానికి తీసుకుని పోతుండగా యేసుక్రీస్తు ప్రభులవారు బల్యర్పణ చేసి మనలను విమోచించి మంచికాపరిగా మనలను మేపడం మొదలుపెట్టారు. ఇక ఆయనతోపాటు మనము కూడా శ్రమలను అనుభవిస్తూ మనం కూడా వధకుతేబడిన గొర్రెలముగా ఉన్నాము. మన మంచికాపరి యేసయ్య! మంచికాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. యోహాను 10: 11
నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱెలకొరకు తన ప్రాణము పెట్టును.
ఇక తర్వాత మాటలలో మాకు విస్తారమైన ద్రవ్యం దొరుకుతుంది అందుకు దేవునికి స్తోత్రం అని చెప్పుకుంటారు అంటున్నారు. వీరి వక్రబుద్ధి ఇక్కడ మనకు కనిపిస్తుంది. వారు చేసేది దుర్మార్గమైన పని. దానివలన వారికి ద్రవ్యము, ఐశ్వర్యము కలిగితే వక్రబుద్ధితో దేవునికి స్తోత్రం చెబుతున్నారు.
ఇంకా వారి కాపరులు నాయకులు ఇశ్రాయేలు జాతిమీద కనికరం లేకుంగా ప్రవర్తించారు అంటున్నారు.
ఇక 6వ వచనంలో నేను ఈ దేశస్తుల మీద జాలిపడను అంటున్నారు. ..... ఇక్కడ వారి రాజుచేతికి వారిని అప్పగిస్తాను అంటే అక్కడ వారి రాజు ఎవరంటే అప్పటి రోమా చక్రవర్తి చేతికి వారిని అప్పగిస్తాను అంటున్నారు. వారు దేశమును నాశనం చేయగా వారి చేతిలో నుండి వారిని నేను విడిపించను అంటున్నారు.
యిర్మియా గ్రంధంలో కూడా దేవుడు చెప్పారు. 13:14
అప్పుడు నేను తండ్రులను కుమారులను అందరిని ఏకముగా ఒకనిమీద ఒకని పడద్రోయుదునని యెహోవా
సెలవిచ్చుచున్నాడు; వారిని కరుణింపను శిక్షింపక పోను; వారియెడల
జాలిపడక నేను వారిని నశింప జేసెదను.
యేహెజ్కేలు 24:14
యెహోవానైన నేను మాటయిచ్చి యున్నాను, అది జరుగును, నేనే నెరవేర్చెదను నేను వెనుకతీయను, కనికరింపను, సంతాపపడను, నీ ప్రవర్తనను బట్టియు నీ క్రియలనుబట్టియు నీకు శిక్ష విధింపబడును, ఇదే యెహోవా వాక్కు.
7. కాబట్టి నేను సౌందర్యమనునట్టియు (కటాక్షము) బంధకమనునట్టియు (సమకూర్చుట అనియున్నది) రెండు కఱ్ఱలు చేతపట్టుకొని వధకేర్పడిన గొఱ్ఱెలను ముఖ్యముగా వాటిలో మిక్కిలి బలహీనమైన వాటిని మేపుచువచ్చితిని.
ఇక్కడ మిక్కిలి బలహీన మైన మందను మేపుచు వచ్చితిని అనగా నేను అనగా జెకర్యా- జెకర్యా యేసయ్యకు సూచనగా ఉన్నారు. ఇక్కడ జెకర్యా గారు చెబుతుంది రాబోయేకాలంలో జరగబోయే విషయాలు కోసం! దీనిని బాగా పరిశీలన చేస్తే కొంతకాలము మందకు కాపలాగా పనిచేసినట్లు గమనించగలము. ఇలా మందకు కాపలాగా ఉన్నప్పుడు సౌందర్యమనే కర్ర – (కటాక్షము), బంధకము అనే కర్ర (సమకూర్చడం) ఈ రెండు కర్రలు పట్టుకుని మందను కాచినట్లు గమనించవచ్చు. అవును యేసుక్రీస్తు ప్రభులవారు నశించిన దాని వెదకి రక్షించడానికి వచ్చారు. లూకా 19: 10
నశించినదానిని వెదకి రక్షించుటకు
మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను.
ఎవరైతే బాధలలో ఉన్నారో వారిని ఆదుకున్నారు. కుంటివారికి కాళ్ళు, గ్రుడ్డి వారికి కళ్ళు
ఇచ్చారు.బంధకములలో ఉన్నవారిని విడిపించారు. సాతాను బంధకాలను పటాపంచలు చేసారు. అదే సమయంలో వారిని
కాస్తున్న కాపరులకు, అధికారులకు, అనగా పరిసయ్యులు
శాస్త్రులకు బుద్ధి చెప్పారు. ఈ రకంగా వారిని నలిపి పిండిచేస్తున్న
, వారి పళ్ళ మధ్య పెట్టుకుని నలిపేస్తున్న సంఘాన్ని వారి పల్లమధ్య నుండి
లాగారు యేసయ్య!
ఇక రెండుకర్రల కోసం చూసుకుంటే 14వ వచనం ప్రకారం మరో అర్ధం యేహెజ్కేలు 37:15—28 లో వ్రాయబడిన వృత్తాంతము, ఇశ్రాయేలు వారు యూదులు కలసి ఉంటారు, వారిద్దరికీ ఒకే నాయకుడు ఉంటాడు. వారు నాకు ప్రజలుగా ఉంటారు అనేదానిని కూడా సూచిస్తుంది.
8....ఒక నెలలోగా కాపరులలో ముగ్గురిని సంహరించితిని; ఏలయనగా నేను వారి విషయమై సహనము లేనివాడను కాగా వారు నా విషయమై ఆయాసపడిరి.
ఇలా ఇంతచేసినా మంద యేసయ్య విషయంలో అసూయ పడింది అట. మందనే కాదు వారి కాపరులు కూడా అసూయ పడ్డారు. కారణం ఒక నెలలో ముగ్గురు కాపరులను సంహరించారు అట. మరి ఈ ముగ్గురు ఎవరో తెలియదు గాని బహుశా ముగ్గురు నాయకులు అప్పుడు మరణించి ఉండవచ్చు.
మొదటగా నేను వారి విషయమై సహనము లేని వాడనయ్యాను అంటున్నారు. ఏమి ఆ అసహనం! ఎందుకు?
మత్తయి 17:17
అందుకు యేసువిశ్వాసములేని మూర్ఖతరమువారలారా, మీతో నేనెంతకాలము ఉందును? ఎంతవరకు మిమ్మును సహింతును? వానిని నాయొద్దకు తీసికొనిరండని చెప్పెను.
మత్తయి 21:42—44
42. మరియు యేసు వారిని చూచిఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు
తలరాయి ఆయెను. ఇది ప్రభువువలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడును చదువ లేదా?
43. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్దనుండి తొలగింపబడి, దాని ఫలమిచ్చు జనుల కియ్యబడునని మీతో చెప్పుచున్నాను.
44.మరియు ఈ రాతిమీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవనిమీద పడునో
వానిని నలిచేయుననెను.
మత్తయి 23:37—39
37. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీయొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా,
కోడి తన పిల్లలను రెక్కలక్రింది కేలాగు చేర్చుకొనునో ఆలాగే నేనును నీ
పిల్లలను ఎన్నోమారులు చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరు ఒల్లకపోతిరి.
38. ఇదిగో మీ యిల్లు మీకు విడువబడియున్నది
39. ఇదిమొదలుకొనిప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాకని మీరు చెప్పువరకు
నన్ను చూడరని మీతోచెప్పుచున్నాను.
ఇక మంద ఎందుకు అసూయ పడింది? వారు ఎందుకు సహించలేకపోయారు? కారణం వారు చేస్తున్న పనులను దేవుడు ఎత్తి చూపడం వలన!
Matthew(మత్తయి సువార్త) 23:1,2,3,4,5,6,7,13,14,15,16,17,18,19,23,24,25,26,27,29,31,33
1.అప్పుడు యేసు జనసమూహములతోను తన శిష్యులతోను ఇట్లనెను
2. శాస్త్రులును పరిసయ్యులును మోషే పీఠమందు కూర్చుండువారు
3.గనుక వారు మీతో చెప్పువాటి నన్నిటిని అనుసరించిగై కొనుడి, అయినను వారి క్రియలచొప్పున చేయకుడి; వారు చెప్పుదురే గాని చేయరు.
4. మోయ శక్యముకాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజములమీద వారు పెట్టుదురేగాని తమ వ్రేలితోనైన వాటిని కదలింపనొల్లరు.
5. మనుష్యులకు కనబడునిమిత్తము తమ పనులన్నియు చేయుదురు; తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు;
6. విందులలో అగ్రస్థానములను సమాజ మందిరములలో అగ్రపీఠములను
7. సంత వీధులలో వందనములను మనుష్యులచేత బోధకులని పిలువబడుటయు కోరుదురు.
13. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యులయెదుట పరలోకరాజ్యమును మూయుదురు;
14. మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనియ్యరు.
15. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టివచ్చెదరు; అతడు కలిసినప్పుడు అతని మీకంటె రెండంతలు నరక పాత్రునిగా (మూలభాషలో-నరకకుమారునిగా) చేయుదురు.
16. అయ్యో, అంధులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయముతోడని ఒట్టుపెట్టుకొంటె అందులో ఏమియు లేదు గాని దేవాలయములోని బంగారముతోడని ఒట్టు పెట్టుకొంటె వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు.
17. అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? బంగారమా, బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా?
18. మరియు బలిపీఠముతోడని యొకడు ఒట్టుపెట్టుకొంటె, అందులో ఏమియు లేదు గాని, దాని పైనుండు అర్పణముతోడని ఒట్టుపెట్టు కొంటె దానికి బద్ధుడని మీరు చెప్పుదురు.
19. అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? అర్పణమా, అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా?
23. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకఱ్ఱలోను పదియవ వంతు చెల్లించి, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి; వాటిని మానక వీటిని చేయవలసియుండెను.
24. అంధులైన మార్గదర్శకులారా, దోమలేకుండునట్లు వడియగట్టి ఒంటెను మింగువారు మీరే.
25. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్లెమును వెలుపట శుద్ధిచేయుదురు గాని అవి లోపల దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండియున్నవి.
26. గ్రుడ్డిపరిసయ్యుడా, గిన్నెయు పళ్లెమును వెలుపల శుద్ధియగునట్టుగా ముందు వాటిలోపల శుద్ధిచేయుము.
27. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యు లారా, మీరు సున్నముకొట్టిన సమాధులను పోలియున్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చినవారి యెముకలతోను సమస్త కల్మషముతోను నిండియున్నవి.
29. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు, నీతిమంతుల గోరీలను శృంగారించుచు
31. అందువలననే మీరు ప్రవక్తలను చంపినవారి కుమారులైయున్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు.
33. సర్పములారా, సర్పసంతానమా, నరకశిక్షను మీ రేలాగు తప్పించుకొందురు?
ఇలాంటి బోధలు చేసినందుకు వారు అసూయ పడ్డారు. సహించలేకపోయారు.
యెషయా 53:౩
అతడు తృణీకరింపబడినవాడును ఆయెను మనుష్యులవలన విసర్జింపబడిన వాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడు గాను మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నికచేయకపోతిమి.
యోహాను 1:11
ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు.
యోహాను 15:24
ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండినయెడల వారికి పాపము లేకపోవును; ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించియున్నారు.
యోహాను 19:15
అందుకు వారు ఇతనిని సంహరించుము, సంహరించుము, సిలువవేయుము అని కేకలు వేసిరి. పిలాతు మీ రాజును సిలువవేయుదునా? అని వారిని అడుగగా ప్రధానయాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి.
(ఇంకాఉంది)
*హతస్సాక్షి జెకర్యా-౩౦వ భాగము*
*యేసుక్రీస్తు మొదటి రాకడ-2*
జెకర్యా 11:11—13
11. అది విరువబడిన దినమున నేను చెప్పినది యెహోవా వాక్కు అని మందలో
బలహీనములై నన్ను కనిపెట్టుకొనియున్న గొఱ్ఱెలు తెలిసికొనెను.
12. మీకు అనుకూలమైన యెడల నా కూలి నాకియ్యుడి, లేనియెడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికై ముప్పది తులముల వెండి
తూచి యిచ్చిరి.
13. యెహోవా యెంతో అబ్బురముగా వారు నా కేర్పరచిన క్రయధనమును కుమ్మరికి
పారవేయుమని నాకు ఆజ్ఞ ఇయ్యగా నేను ఆ ముప్పది తులముల వెండిని తీసికొని యెహోవా మందిరములో
కుమ్మరికి పారవేసితిని. ......
ప్రియ దైవజనమా! జెకర్యా గారి ప్రవచనాలను ధ్యానం చేసుకుంటున్నాం!
(గతభాగం తరువాయి)
9..... నేను మీకు కాపరిగా ఉండను. చచ్చేది చావనీయండి, నశించేది నశించనీయండి లేక ఒకరికొకరు చంపుకు తిననీయండి అని విసిగిపోయారు.
ఇక్కడ దేవుని మాటను వినకుండా మొండిగా తిరుగుతున్నందుకు దేవుడు వారి తిరుగుబాటుకోసం దేవుని తీర్పును చెబుతుంది ఈ వచనం! అందుకే యేసయ్య అంటున్నారు లూకా
19:41—44
41. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై యేడ్చి
42. నీవును ఈ నీ దినమందైనను సమాధానసంబంధమైన సంగతులను తెలిసికొనినయెడల
నీకెంతో మేలు; గాని యిప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడియున్నవి.
43. (ప్రభువు) నిన్ను దర్శించిన కాలము నీవు
ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టు గట్టుకట్టి ముట్టడివేసి, అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి, నీలోనున్న నీ పిల్లలతో
కూడ నిన్ను నేల కలిపి
44. నీలో రాతిమీద రాయి నిలిచియుండ నియ్యని దినములు వచ్చునని చెప్పెను.
ఇలా చేసి 10వ వచనంలో సౌందర్యము అనే కర్రను విరిచేశారు, అనగా నేను చేసిన నిబంధనను భంగము చేసేసాను అంటున్నారు. ఇక్కడ నిబంధన అనగా బహుశా సీనాయి పర్వతం మీద ఆయనచేసిన మొదట నిబంధన లేక పాత నిబంధన కావచ్చు. యేసుక్రీస్తు ప్రభులవారు పాత నిబంధనను రద్దుచేసి నూతన నిబంధనను ఇచ్చారు.
మత్తయి 26:28
ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన (అనేక ప్రాచీన ప్రతులలో-క్రొత్త నిబంధన అని పాఠాంతరము) రక్తము.
11....అది విరువబడిన దినమున నేను చెప్పినది యెహోవా వాక్కు అని మందలో బలహీనములై నన్ను కనిపెట్టుకొనియున్న గొఱ్ఱెలు తెలిసికొనెను.
ఇక్కడ బలహీనమైన నన్ను కనిపెట్టుకున్న గొర్రెలు తెలిసికొనెను అనగా ఆ గొర్రెలు ఎవరో కాదు మొదటగా ఆయన బోధవినిన ఆది అపోస్తలులు, ఇంకా అప్పటి సంఘము. . ఇంకా వారి బోధవినిన మనమే అనగా నూతన నిబంధన సంఘము అని గ్రహించాలి. అనగా యేసుక్రీస్తు ప్రభులవారే మెస్సయ్య, ఆయనే దేవుడు అని గ్రహించి అంగీకరించినవారు అన్నమాట.
ఇక 12...మీకు అనుకూలమైన యెడల నా కూలి నాకియ్యుడి, లేనియెడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికై ముప్పది తులముల వెండి తూచి యిచ్చి....
ఇది యేసుక్రీస్తుప్రభులవారి మరణమప్పుడు యూదా ఆయనను ౩౦ వెండి నాణెములకు అమ్మడం
సూచిస్తుంది.
జీతం ఇస్తే ఇవ్వండి లేకపోతే మానెయ్యండి అనడం: యేసుక్రీస్తు ప్రభులవారిని వారు కాపరిగా అభిషక్తునిగా రక్షకునిగా మెస్సయ్యగా అంగీకరించకపోవడాన్ని సూచిస్తుంది. మత్తయి 23:38—39
ఇక ముప్పై వెండి నాణెములకు అమ్మివేయడం మనం మత్తయి
26:14—15 లో చూసుకోవచ్చు...
14. అప్పుడు పండ్రెండుమందిలో నొకడగు ఇస్కరియోతు యూదా, ప్రధాన యాజకులయొద్దకు వెళ్లి
15. నేనాయనను మీకప్పగించిన యెడల నాకేమి ఇత్తురని వారినడిగెను.
అందుకు వారు ముప్పది వెండి నాణములు తూచి వానికి ఇచ్చిరి.
ఇంతకీ ముప్పై నాణెములకే ఎందుకు కొన్నారు? కారణం ఇశ్రాయేలు దేశంలో ఒక ఎద్దు బానిసను పొడిచి చంపితే యజమానికి ఇవ్వవలసినది- ౩౦ వెండి నాణెములు! అనగా బానిస ఖరీదు ౩౦ వెండి నాణెములు అన్నమాట! నిర్గమ 21:32
అలాగే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులవారు వారు చేసే తప్పులు ఎండగడితే దానికి వారు కట్టిన వెల ౩౦వెండి నాణెములు!
13....జెకర్యా 11: 13
యెహోవా యెంతో అబ్బురముగా వారు నా కేర్పరచిన క్రయధనమును కుమ్మరికి పారవేయుమని నాకు ఆజ్ఞ ఇయ్యగా నేను ఆ ముప్పది తులముల వెండిని తీసికొని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేసితిని.
ఇక్కడ మొదటగా ఎంతో అబ్భురముగా అంటున్నారు అనగా ఎంతో వ్యంగంగా చెబుతున్నారు అన్నమాట దేవుడు—నాకు వారు కట్టిన విలువ చూశారా? అంటూ! ఇక్కడ వ్యంగమే కాకుండా విచారం కూడా కనిపిస్తుంది.
ఇక యెహోవా నాకేర్పరచిన క్రయధనం అనగా ౩౦ వెండి నాణెములు—కుమ్మరికి పారవేయమని చెప్పారు అట! వెంటనే జెకర్యా గారు యెహోవా సన్నిధిలో కుమ్మరికి పారవేశారు అట! యెహోవా సన్నిధిలో కుమ్మరి ఎందుకు ఉంటాడు? దానికి జవాబు మనం మత్తయి 27:౩—10 లో చూడవచ్చు. .....
3. అప్పుడాయనను అప్పగించిన యూదా, ఆయనకు శిక్ష
విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి, ఆ ముప్పది వెండి నాణెములు ప్రధానయాజకుల
యొద్దకును పెద్దలయొద్దకును మరల తెచ్చి
4. నేను నిరపరాధరక్తమును (అనేక ప్రాచీన ప్రతులలో-నీతిమంతుని రక్తమును అని పాఠాంతరము) అప్పగించి పాపము
చేసితినని చెప్పెను. వారుదానితో మాకేమి? నీవే చూచుకొనుమని చెప్పగా
5. అతడు ఆ వెండి నాణములు దేవాలయములో పారవేసి, పోయి ఉరిపెట్టుకొనెను.
6. ప్రధానయాజకులు ఆ వెండి నాణములు తీసికొని ఇవి రక్తక్రయధనము గనుక
వీటిని కానుక పెట్టెలో వేయతగదని చెప్పుకొనిరి.
7. కాబట్టి వారు ఆలోచనచేసి వాటినిచ్చి, పరదేశులను
పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి.
8. అందువలన నేటివరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది.
9. అప్పుడువిలువ కట్టబడినవాని, అనగా ఇశ్రాయేలీయులలో
కొందరు విలువకట్టినవాని క్రయధనమైన ముప్పది
10. వెండి నాణములు తీసికొని ప్రభువు నాకు నియమించినప్రకారము వాటిని
కుమ్మరి వాని పొలమున కిచ్చిరి అని ప్రవక్తయైన యిర్మీయాద్వారా చెప్పబడినమాట నెరవేరెను.
ఇక్కడ మనకు కుమ్మరి వాని పొలం కొనడానికి కారణం కళ్ళకు కట్టినట్లు అర్ధం అవుతుంది. అది రక్తపు డబ్బు కాబట్టి దేవుని కానుక పెట్టెలో వేయడానికి అంగీకరించలేదు అందుకే వారు ఆలోచించి అది దేవుని మందిరానికి తేబడింది కాబట్టి దానిని దేవుని పనికి వాడాలి కాబట్టి పరదేశులు ఎవరైనా వచ్చి ఆ దేశంలో చనిపోతే వారిని పాతిపెట్టడానికి ఒక పొలం కొన్నారు. ఆ పొలం ఒక కుమ్మరివానిది అన్నమాట! ఇక్కడ మత్తయి గారు యిర్మియా గారు అని రాశారు గాని ఈ ప్రవచనం మన జెకర్యా గారు ప్రవచించారు. యిర్మియా గారు ప్రవచించినది వేరే విషయం!
14... జెకర్యా 11: 14
అప్పుడు బంధకమనునట్టి నా రెండవ కఱ్ఱను తీసికొని యూదావారికిని
ఇశ్రాయేలువారికిని కలిగిన సహోదరబంధమును భంగము చేయునట్లు దాని విరిచితిని.
ఇప్పుడు మీదన చెప్పిన ఇశ్రాయేలు యూదా ప్రజలమధ్య ఉన్న సహోదర బంధమును భంగము చేసేలాగా ఆ బంధకము అనే కర్రను కూడా విరిచేశారు అట దేవుడు. ఇది బహుశా యేసుక్రీస్తు ప్రభులవారిని నిరాకరించాక దేవుడు వారితో చేసిన నిబంధనను రద్దు చేయడమే కాదు వారు ఒక జాతిగా ఉండటాన్ని కూడా బ్రద్దలు చేయడం కోసం చెప్పి ఉంటారు.
ఇంతవరకు మనం యేసుక్రీస్తుప్రభులవారి మొదట రాకడ కోసం చూసుకుంటే ఇక
15—17 రెండవరాకడ కోసం చెప్పబడినట్లు కనిపిస్తుంది.
15—17
Zechariah(జెకర్యా) 11:15,16,17
15. అప్పుడు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా ఇప్పుడు బుద్ధిలేని యొక్క
కాపరి పనిముట్లను తీసికొమ్ము.
16. ఏలయనగా దేశమందు నేనొక కాపరిని నియమింపబోవుచున్నాను; అతడు నశించుచున్న గొఱ్ఱెలను కనిపెట్టడు, చెదరిపోయినవాటిని
వెదకడు, విరిగిపోయినదాని బాగుచేయడు, పుష్టిగా
ఉన్నదాని కాపుకాయడు గాని క్రొవ్వినవాటి మాంసమును భక్షించుచు వాటి డెక్కలను తుత్తునియలగా
చేయుచుండును.
17. మందను విడనాడు పనికిమాలిన కాపరికి శ్రమ; అతని చెయ్యియు కుడికన్నును తెగవేయబడును; అతని చెయ్యి
బొత్తిగా ఎండిపోవును అతని కుడికంటికి దృష్టి బొత్తిగా తప్పును.
ఇక్కడ చెప్పిన బుద్ధిలేని కాపరి ఎవడు? ఇంతకీ బుద్ధిలేని కాపరి ఎందుకు వచ్చాడు అని ఆలోచిస్తే- మొదటగా వారు నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెట్టును అని చెప్పి ప్రాణము పెడితే (యోహాను 10:11—15) ఆయనను తిరస్కరించారు కాబట్టి ఇప్పుడు వారి దగ్గరకు బుద్ధిలేని కాపరి వచ్చాడు. అయితే పాత నిబంధన గ్రంధంలో వారికి బుద్ధిలేని కాపరులు పనికిమాలిన కాపరులు ఎందఱో వచ్చారు కాని ఈ బుద్ధిలేని కాపరి అంత్యకాలంలో రాబోయే ఒక పనికిమాలిన కాపరి కావచ్చు! వాడు క్రీస్తువిరోది కావచ్చు! ఒకసారి క్రింద రిఫరెన్సులు చూడండి.
యోహాను 5:43
నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను, మీరు నన్ను అంగీకరింపరు, మరి యొకడు తన నామమున వచ్చిన యెడల వానిని అంగీకరింతురు,
2 థెస్సలోనిక 2:౩—4
3. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు(నాశనపుత్రుడు) పాపపురుషుడు(ధర్మవిరుద్ధపురుషుడు) బయలుపడితేనేగాని ఆ దినము రాదు.
4. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికిపైగా వాడు తన్నుతానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరచుకొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏవిధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి.
1యోహాను 2:18
చిన్న పిల్లలారా, యిది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని
వింటిరి గదా ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరియున్నారు; ఇది కడవరి గడియ అని దీనిచేత తెలిసికొనుచున్నాము.
చూడండి మంచి కాపరిని నిరాకరిస్తే ఎలాంటి కాపరి వారికి దొరికాడో!! వీడు గొర్రెల ప్రాణాలను లాగాలని చూస్తున్నాడు.
16......ఏలయనగా దేశమందు నేనొక కాపరిని నియమింప బోవుచున్నాను; అతడు నశించుచున్న గొఱ్ఱెలను కనిపెట్టడు, చెదరిపోయినవాటిని వెదకడు, విరిగిపోయినదాని బాగుచేయడు, పుష్టిగా ఉన్నదాని కాపుకాయడు గాని క్రొవ్వినవాటి మాంసమును భక్షించుచు వాటి డెక్కలను తుత్తునియలగా చేయుచుండును.
అందుకే 17వ వచనంలో ...మందను విడనాడు
పనికిమాలిన కాపరికి శ్రమ; అతని చెయ్యియుకుడికన్నును తెగవేయబడును;
అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును అతని కుడికంటికి దృష్టి బొత్తిగా తప్పును.
ఇది అక్షరార్ధంగా కాపరులకు వర్తించినా ఇది అంత్యక్రీస్తుకు కలగబోయే తీర్పును సూచిస్తుంది.
సరే, ఇప్పుడు అక్షరార్ధమైన బోధకులారా, కాపరులారా, పెద్దలారా! మీరుకూడా సంఘాన్ని పట్టించుకోకుండా కేవలం వారినుండి వచ్చే కానుకల కోసం కలిపి చెరిపితే మీ గతి కూడా అంతేనని గ్రహించాలి. సంఘాన్ని పాడుచేసే గుంటనక్కలను పట్టించుకోకుండా నా జీతం నాకొచ్చేస్తుంది కదా నాకెందుకు అని కొందరు, మా కానుకలు మా కొస్తున్నాయి కదా అని కొందరు తాపీగా ఉంటే గుంటనక్కలు సంఘాన్ని అనేక తప్పుడుబోధలతో పాడుచేస్తున్నారు. మరి వారిని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది కదా! బలహీన మైన గొర్రెలను ఆదరించి మందు పెట్టి బాగుచెయ్యాల్సిన అవసరం ఉంది కదా! పాలిచ్చే వాటినే పట్టించుకుని బాగులేని వాటిని వదిలెయ్యడం బాగుందా? అనగా కానుకలు ఇచ్చేవారిని పట్టించుకుని బీదలను పట్టించుకోకపోవడం భావ్యమా? ఇక సంఘానికి కావలసిన పౌష్టికాహారం వారికి పెడుతున్నావా? గడ్డి పెడుతున్నావా? పిట్టకధలు సైన్సు ఇంకా అనేకరకాలైన బోధలు చేస్తున్నావు కాని అపోస్తలుల బోధను పరిశుద్ధాత్మ బోధను వారికి చెబుతున్నావా? ఖండించుము గద్ధించుము బుద్ధిచెప్పుము అని దేవుడు చెబుతుంటే ఎక్కడ వీరు కానుకలు ఇవ్వరు లేక సంఘం నుండి పంపించి వేస్తారు అని పైపైన బోధలు చేస్తున్నావా? జాగ్రత్త కాపరులకు శ్రమ ఎక్కువ అని మరచిపోకు! తీర్పుదేవుని ఇంటినుండి ప్రారంభమయ్యే రోజు వస్తుంది అని మరచిపోకు!
దైవాశీస్సులు!
*హతస్సాక్షి జెకర్యా-౩1వ భాగము*
*ఇశ్రాయేలు రక్షణ-1*
జెకర్యా 12:1—౩ ......
1. దేవోక్తి ఇశ్రాయేలీయులనుగూర్చి వచ్చిన యెహోవా వాక్కు.
ఆకాశమండలమును విశాలపరచి భూమికి పునాదివేసి మనుష్యుల అంతరంగములో జీవాత్మను
సృజించు యెహోవా సెలవిచ్చునదేమనగా
2. నేను యెరూషలేము చుట్టునున్న జనులకందరికి మత్తు పుట్టించు పాత్రగా
చేయబోవుచున్నాను; శత్రువులు యెరూషలేమునకు ముట్టడివేయగా అది యూదా
మీదికిని వచ్చును.
3. ఆ దినమందు నేను యెరూష లేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును,
దానిని ఎత్తి మోయువారందరు మిక్కిలి గాయపడుదురు, భూజనులందరును దానికి విరోధులై కూడుదురు.
ప్రియ దైవజనమా! జెకర్యా గారి ప్రవచనాలను ధ్యానం చేసుకుంటున్నాం! ప్రియులారా ఇక ఈ అధ్యాయం నుండి చివరి 14వ అధ్యాయం వరకు యేసుక్రీస్తు ప్రభులవారి రెండవరాకడ జరిగేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు కలిగే సంభవాలకోసం వ్రాయబడి యుంది. ఈ 12వ అధ్యాయం నుండి 14వ అధ్యాయం వరకు ఒకే ప్రవచనంలా కనబడుతుంది.
అయితే ఒకమాట చెప్పనీయండి ఈ సంభవాలు ఎప్పుడు జరుగుతాయి అనగా ఈ 12వ అధ్యాయం నుండి జరిగే సంభవాలు ఎప్పుడుజరుగుతాయి అనగా ఈ క్రింద ఉదాహరించినవి జరిగిపోవాలి.
* అంత్య క్రీస్తు రాజ్యము భూలోకంలో స్థాపించబడిన వెంటనే సంఘము ఎత్త బడుతుంది.
* అతడు ఇశ్రాయేలీయులతో సంధి చేసుకొని, ప్రపంచమంతటితో ఒప్పందం కుదుర్చుకొని, యెరూషలేమును రాజధానిగా చేసుకుంటాడు.
* యెరూషలేము దేవాలయములో బలి నైవేద్యములు ప్రారంభించి, ఇశ్రాయేలీయుల ఎదుట ఒక మెస్సియా గా గుర్తింపు తెచ్చుకుంటాడు. (దానియేలు 9:2)
* సంఘము ఎత్తబడిన తర్వాత మొదటి మూడున్నర సంవత్సరములలో వాని రాజ్యము స్థిరపరచబడుతుంది.
* చివరి మూడున్నర సంవత్సరాలలో అంత్య క్రీస్తు రాజ్య పాలన.
* అబద్ధ ప్రవక్త అనే రెండవ క్రూర మృగము, సంపూర్ణముగా అంత్య క్రీస్తుకు సహకరిస్తుంది.
* సాతాను వాని అధికారమును, శక్తిని అంత్య క్రీస్తునకు ఇస్తాడు.
* సాతాను, అంత్యక్రీస్తు, అబద్ధప్రవక్త త్రిత్వమై పాలిస్తారు.
* అంత్య క్రీస్తు మొదటి మూడున్నర సంవత్సరాలలో తన రాజ్యమును స్థిరపరచుకొని, చివరి మూడున్నర సంవత్సరాలలో తానే దేవుడనని చెప్పి, అత్యంత నిరంకుశంగా పరిపాలిస్తాడు.
*భూలోకంలో అంత్యక్రీస్తు ఎజెండా *
* ప్రపంచ శాంతి
* సర్వమత సమ్మేళనం
* యూరో కెరన్సీ లేదా ప్రపంచమంతా ఒకే కరెన్సీ
* 666 ముద్ర (ప్రకటన 13:17)
* మొదటి మూడున్నర సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఇతనితో వుంటారు.
* తర్వాత, అంత్య క్రీస్తు యెరూషలేము దేవాలయములో ప్రతిమను నిలబెట్టినప్పుడు, ఇంకా నాశనకరమైన హేయవస్తువు బలిపీఠం మీద అర్పించినప్పుడు అతనిని అసహ్యించుకొని అరణ్యానికి పారిపోతారు.
* అంత్య క్రీస్తు మొదట తానే క్రీస్తునని, తర్వాత నేనే దేవుడనని చెప్పుకుంటాడు.
* దేవాలయంలో బలి, నైవేద్యం, పండుగలను ఆపివేస్తాడు.
* మోషే ధర్మ శాస్త్రమును వ్యతిరేకిస్తాడు.
* దేవాలయంలో విగ్రహారాధన ప్రారంభిస్తాడు.
* తానే దేవుడనని దేవాలయంలో వచ్చి కూర్చుంటాడు.
* తనను వ్యతిరేకించిన యూదులను అరణ్యమునకు వెళ్లగొట్టి, ముద్ర వేయించుకోవలెనని బలవంతం చేస్తాడు.
* యూదులను రక్షించడానికిసాక్ష్యము చెప్పడానికి వచ్చిన ఇద్దరు సాక్ష్యులను చంపేస్తాడు.
*అప్పుడు యూదులు తమ తప్పును తెలుసుకుని క్రీస్తును మెస్సయ్యగా అంగీకరిస్తారు. ఆ సమయంలో జరిగే సంభవాలు ఇప్పుడు మనం ఈ మూడు అధ్యాయాలలో చూసుకోవచ్చు. అనగా హార్మెగిద్దోన్ యుద్ధానికి అంత్యక్రీస్తు సైన్యం బయలుదేరినప్పుడు జరగబోయే సంఘటనలు.
ఇక మొదటి వచనంలో అకాశమండలాన్ని విశాలపరచి భూమికి పునాదివేసి మనుష్యుల అంతరంగాలలో జీవాత్మను పుట్టించు యెహోవా అంటున్నారు. దీనికోసం మనము అనేక చోట్ల చూడవచ్చు దేవుడు భూమి ఆకాశాలను ఎలా చేశారో ఎలా పునాది వేశారో కనిపిస్తుంది. ఆదికాండం 1:1; 2:7; కీర్తన 104:1—5; 139:13—16; యెషయా
42:5; వీటన్నిటి బట్టి ఈ విశ్వానికి మహా సృష్టికర్త ఆయన! ఇంత బలమైన ఘనమైన దేవుడు చెప్పే మాట ఏమిటంటే.... అని మొదలుపెట్టారు అనగా నేనే సృష్టికర్తను, నేనే లయకర్తను, తప్పకుండా క్రింద చెప్పిన మాటలను నెరవేరుస్తాను అంటున్నారు.
2వ వచనంలో నేను యెరూషలేమును మత్తు పుట్టించు పాత్రగా చేయబోతున్నాను అనగా చివరి రోజులలో యెరూషలేము చుట్టూనే రాజకీయాలు గాని, యుద్దాలు గాని జరగబోతున్నాయి. ప్రపంచానికి కేంద్రబిందువుగా మారిపోబోతుంది. ఇక్కడ పాత్ర అనే మాట కనిపిస్తుంది. బైబిల్ లో ఎక్కడైనా పాత్ర అని వాడబడినప్పుడు అవి ఎక్కువగా దేవుని ఉగ్రతను సూచిస్తుంది. లేదా దేవుని తీర్పుకు సిద్దపాటు సూచిస్తుంది. మిగతా పాత్రలకోసం వ్రాయబడినా ఇక్కడ ఉగ్రతకోసమే చెప్పబడింది. ఉదాహరణకు ప్రకటన గ్రంధంలో చెప్పబడిన ఏడు ఉగ్రత పాత్రలు.
కీర్తన
75:8
యెహోవా చేతిలో ఒక పాత్రయున్నది అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది, అది సంబారముతో నిండియున్నది
ఆయన దానిలోనిది పోయుచున్నాడు భూమిమీదనున్న భక్తిహీనులందరు మడ్డితోకూడ దానిని పీల్చి
మింగివేయవలెను.
యెషయా 51:17
యెరూషలేమా, లెమ్ము లెమ్ము యెహోవా క్రోధపాత్రను ఆయన చేతినుండి పుచ్చు కొని త్రాగినదానా, తూలిపడజేయు పాత్రలోనిదంతటిని త్రాగినదానా, నిలువుము.
యిర్మియా 25:15; 51:7
బబులోను యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించు బంగారుపాత్రయై యుండెను. దానిచేతి మద్యమును అన్యజనులు త్రాగి మత్తిల్లి యున్నారు.
దీని అర్ధం ఏమిటంటే ప్రపంచ దేశాలన్నిటిని పోగుచేసి ఒకేసారి దేవుని తీర్పును ఉగ్రతను చూపించే సాధనంగా యెరూషలేము ఉండబోతుంది అంటున్నారుదేవుడు!
జెకర్యా 14:2—౩
2. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరిని సమకూర్చ
బోవుచున్నాను; పట్టణము పట్టబడును, ఇండ్లు
కొల్ల పెట్టబడును, స్త్రీలు చెరుపబడుదురు, పట్టణములో సగముమంది చెరపట్టబడి పోవుదురు; అయితే శేషించువారు
నిర్మూలము కాకుండ పట్టణములో నిలుతురు.
3. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా
ఆ అన్యజనులతో యుద్ధము చేయును.
యోవేలు ౩:9—16
ప్రకటన 16:12-15
12. ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానదిమీద కుమ్మరింపగా తూర్పునుండి
వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడునట్లు దాని నీళ్లు యెండి పోయెను.
13. మరియు ఆ ఘటసర్పము నోట నుండియు క్రూరమృగము నోటనుండియు అబద్ధ ప్రవక్త
నోటనుండియు కప్పలవంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని.
14. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే; అవి సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను
పోగుచేయవలెనని వారియొద్దకు బయలు వెళ్లి,
15. హెబ్రీభాషలో హార్ మెగిద్దోనను చోటుకు
వారిని పోగుచేసెను.
ఇంకా శత్రువులు యెరూషలేము చుట్టూ ముట్టడివేయగా అది యూదా మీదికిని వచ్చును. ఇంకా ౩వ వచనం ...ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును, దానిని ఎత్తి మోయువారందరు మిక్కిలి గాయపడుదురు, భూజనులందరును దానికి విరోధులై కూడుదురు.
యేసుక్రీస్తు ప్రభులవారు కూడా యేరూషలేము దండ్లచేత చుట్టబడుతుంది అన్నారు. లూకా
21: 20
యెరూషలేము దండ్లచేత చుట్టబడుట మీరు చూచునప్పుడు దాని నాశనము సమీపమైయున్నదని తెలిసికొనుడి.
కాబట్టి యేరూషలేము చుట్టూ దండ్లు కూడుకొన్నప్పుడు ఇవి జరుగుతాయి. మీద చెప్పిన ప్రకటన 16:12—14 లో అంత్యక్రీస్తు సైన్యం హార్మెగిద్దోను అనే చోట యుద్దానికి సిద్దమైనట్టు చూడగలం! గమనించాలి యేరూషలేము చుట్టూ అనేకసార్లు అనేకమంది యుద్దానికి వచ్చారు గాని ప్రపంచమంతా కలసి ఇంతవరకూ ఎప్పుడూ రాలేదు. కాబట్టి ఇది కేవలం హార్మెగిద్దోను యుద్ధం కోసమే చెప్పబడినట్లు గ్రహించాలి. అంతేకాదు ఇంతవరకు ఎప్పుడూ యెరూషలేము ప్రపంచానికి మత్తు పుట్టించే పాత్ర గాను, అభ్యంతరము గాను ఉండలేదు.
అప్పుడు ఎప్పుడైతే ప్రపంచదేశాలన్నీ తమ మీదకు యుద్దానికి వస్తాయో, తాము నమ్మిన అంత్యక్రీస్తు మెస్సయ్య కాదు అని వారు ఎప్పుడు గ్రహిస్తారో అప్పుడు వారు యెహోవాను నమ్ముకుంటారు.
జెకర్యా 12: 5
అప్పుడు యెరూషలేములోని అధికారులుయెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుటవలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు.
ఆయనే మాకు బలము అని చెప్పుకుంటారు.
ఈ సందర్బంగా కొన్ని రోజుల క్రితం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఒకమాట చెప్పారు: ఐగుప్తునే ఎదుర్కొన్నాము, ఈ రోజు కరోనా ను కూడా ఎదుర్కొంటాము. మాతోకూడా మా దేవుడు ఉన్నాడు. అవును వారు ఎప్పుడూ కష్టకాలంలో వారు దేవుణ్ణి ఆశ్రయించడం, దేవుడు వారికి సహాయం చేయడం జరుగుతుంది.
(ఇంకాఉంది)
*హతస్సాక్షి జెకర్యా-౩2వ భాగము*
*ఇశ్రాయేలు రక్షణ-2*
జెకర్యా 12:8—11
8. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును;
ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదువంటివారుగాను, దావీదు సంతతి వారు దేవునివంటి వారుగాను జనుల దృష్టికి యెహోవా దూతలవంటి వారుగాను
ఉందురు.
9. ఆ కాలమున యెరూషలేముమీదికి వచ్చు అన్యజనులనందరిని నేను నశింపజేయ
పూనుకొనెదను.
10. దావీదు సంతతివారిమీదను యెరూషలేము నివాసులమీదను కరుణ నొందించు
ఆత్మను విజ్ఞాపనచేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నామీద (వాని) దృష్టియుంచి, యొకడు తన యేక
కుమారుని విషయమై దుఃఖించునట్లు,తన జ్యేష్ఠపుత్రుని విషయమై యొకడు
ప్రలా పించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు.
11. మెగిద్దోను లోయలో హదదిమ్మోనదగ్గర జరిగిన ప్రలాపమువలెనే ఆ దినమున
యెరూషలేములో బహుగా ప్రలాపము జరుగును.
ప్రియ దైవజనమా! జెకర్యా గారి ప్రవచనాలను ధ్యానం చేసుకుంటున్నాం!
(గతభాగం తరువాయి)
జెకర్యా 12:6—7
6. ఆ దినమున నేను యూదా అధికారులను కట్టెల క్రింది నిప్పులుగాను పనల
క్రింది దివిటీగాను చేతును, వారు నలుదిక్కులనున్న జనములనందరిని
దహించుదురు. యెరూషలేమువారు ఇంకను తమ స్వస్థలమగు యెరూష లేములో
నివసించుదురు.
7. మరియు దావీదు ఇంటి వారును యెరూషలేము నివాసులును, తమకు కలిగిన ఘనతనుబట్టి యూదావారిమీద అతిశయపడకుండునట్లు యెహోవా యూదావారిని మొదట
రక్షించును.
6వ వచనంలో పనలక్రింద దివిటీ అనగా ఇశ్రాయేలు దేశం చుట్టూ చుట్టుముట్టిన శత్రువులకు యూదా నాయకులు కొరివిలాగ తయారవుతారు. వారు నలుదిక్కుల నున్న జనములనందరిని దహించుదురు అనగా ప్రకటన 19 అధ్యాయంలో చెప్పినట్లు దేవుడే వారి పక్షముగా యుద్దము చేసి వారిని వధిస్తారు. ...ప్రకటన గ్రంథం 19: 21
కడమ వారు గుఱ్ఱముమీద కూర్చున్న వాని నోటనుండి వచ్చిన ఖడ్గముచేత వధింపబడిరి; వారి మాంసమును పక్షులన్నియు
కడుపార తినెను.
8—9 ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును; ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదువంటివారుగాను, దావీదు సంతతి వారు దేవునివంటి వారుగాను జనుల దృష్టికి యెహోవా దూతలవంటి వారుగాను ఉందురు.
9. ఆ కాలమున యెరూషలేముమీదికి వచ్చు అన్యజనులనందరిని నేను నశింపజేయ పూనుకొనెదను.
ఇక్కడ బలహీనులు దావీదులా ఉంటారు అనగా వారిలో బలహీనుడు కూడా దావీదు బలవంతుడైన గొల్యాతును చంపినట్టు, వీరు దేవుణ్ణి ఆశ్రయించి ఒక్కొక్కరిని చంపుతారు అని అర్ధం!1సమూయేలు 17:50;
18:7;
ఇంకా దావీదు సంతతివారు దేవుని లాగ ఉంటారు అనగా దేవుడు ఎప్పుడూ వారితోనే ఉంటారు కాబట్టి వారిలో దేవుని బలం ఉంది కాబట్టి ఏ సైన్యమూ వారిని జయించలేదు. వారి సైన్యానికి సాటిలేకుండా పోతుంది అని అర్ధం! గమనించాలి హిజ్కియారాజు అంటారు- మాంస సంభంధమైన సైన్యం వారికి అండగాని మనకు మనదేవుడైన యెహోవా అండ! 2దినవృత్తాంతములు 32: 8
మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదారాజైన హిజ్కియా చెప్పినమాటలయందు నమ్మికయుంచిరి.
అలాగే ఇప్పుడు వారు దేవుణ్ణి ఆశ్రయించారు కాబట్టి దేవుడే వారికి ఆశ్రయముగా దుర్గముగా ఉన్నారు కాబట్టి వారిని ఎవరు జయించలేరు.
ఒకసారి చూడండి
జెకర్యా 1:21
వీరేమి చేయబోవుచున్నారని నేనడిగి నందుకు ఆయన ఎవడును తలయెత్తకుండ యూదావారిని చెదరగొట్టిన
కొమ్ములు ఇవే. అయితే వాటిని భయ పెట్టుటకును, యూదాదేశస్థులనందరిని
చెదరగొట్టుటకై వారిమీద బలాత్కారము జరిగించిన అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకును వీరు
వచ్చియున్నారని నాకు సెలవిచ్చెను.
జెకర్యా 14:౩
అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును.
యెషయా 29:5,6,8,9
5. నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుక రేణువులంత విస్తారముగా నుండును
బాధించువారి సమూహము ఎగిరిపోవు పొట్టువలె నుండును హఠాత్తుగా ఒక్క నిమిషములోనే యిది సంభ
వించును.
6. ఉరుముతోను భూకంపముతోను మహా శబ్దముతోను సుడిగాలి తుపానులతోను దహించు
అగ్నిజ్వాలల తోను సైన్యములకధిపతియగు యెహోవా దాని శిక్షించును.
8. ఆకలిగొన్న వాడు కలలో భోజనముచేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తిపడకపోయినట్లును
దప్పిగొనినవాడు కలలో పానముచేసి మేల్కొనగా సొమ్మసిల్లినవాని ప్రాణము ఇంకను ఆశగొని యున్నట్లును
సీయోను కొండమీద యుద్ధముచేయు జనముల సమూహమంతటికి సంభవించును.
9. జనులారా, తేరి చూడుడి విస్మయమొందుడి మీ
కండ్లను చెడగొట్టుకొనుడి గ్రుడ్డివారగుడి ద్రాక్షారసము లేకయే వారు మత్తులైయున్నారు
మద్యపానము చేయకయే తూలుచున్నారు.
అయితే ఈ సంఘటన జరుగక ముందు అనగా వారు హార్మెగిద్దోను యుద్దానికి వచ్చినప్పుడు యూదులు/ఇశ్రాయేలు వారు దేవుణ్ణి ఆశ్రయించి నప్పుడు, దేవుడు వారితో యుద్ధం చేయడానికి మధ్యలో జరుగబోయే సంఘటన 10—14 వరకు చెప్పబడింది. ....
10. దావీదు సంతతివారిమీదను యెరూషలేము నివాసులమీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపనచేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నామీద(వాని) దృష్టియుంచి, యొకడు తన యేక కుమారుని విషయమై దుఃఖించునట్లు,తన జ్యేష్ఠపుత్రుని విషయమై యొకడు ప్రలా పించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు.
11. మెగిద్దోను లోయలో హదదిమ్మోనదగ్గర జరిగిన ప్రలాపమువలెనే ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపము జరుగును.
12. దేశనివాసులందరు ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు, దావీదు కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, నాతాను కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను,
13. లేవి కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, షిమీ కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను,
14. మిగిలిన వారిలో ప్రతి కుటుంబపువారు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, ప్రలాపింతురు.
10వచనం ప్రకారం ఎప్పుడైతే దేవా నీవే మాకు దిక్కు, మేము అంత్యక్రీస్తుని నమ్మి మోసపోయాము అని ప్రార్ధిస్తారో, అప్పటికే వారు దేవుని ఇద్దరు సాక్షుల బోధను విని ఉన్నారు కాబట్టి దేవుడు తన కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయుఆత్మను కుమ్మరిస్తారు వారిమీద, అప్పుడు ఆ ఆత్మ వారిని ఏసే క్రీస్తని, మెస్సయ్యా అని బోధించి ఒప్పిస్తాడు. అప్పుడు వారు రక్షణ పొందుతారు. అనగా ఎంతమంది పశ్చాత్తాప పడి యేసే మెస్సయ్యగా అంగీకరిస్తారో వారందరూ రక్షింపబడతారు. అప్పుడు తాము పొడిచిన వానియందు దృష్టిస్తారు అనగా వారు ఎవరిని పొడిచారు అనగా మనం చూడవచ్చు యోహాను 19:౩4,37
34. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను.
37. మరియు తాము పొడిచినవాని తట్టు చూతురు అని మరియొక లేఖనము చెప్పుచున్నది. ఇంకా యెషయా 53:5; కీర్తనలు 22:16 ప్రకారం అది యేసుక్రీస్తుప్రభులవారిని ఘోరంగా హింసించి, బాధించి, పొడిచి, సిలువవేసి చంపారు కాబట్టి తమ ఏకైక కొడుకు చనిపోయినట్టు ఏడుస్తారు అంటున్నారు.
ఇక్కడ రెండు విషయాలు చూసుకోవాలి. మొదటగా పొడిచిన నా మీద, లేక పొడిచిన వానియందు.... అనగా మీరు నన్ను పొడిచారు అంటున్నారు. అనగా ఇక్కడ మాట్లాడేది త్రిత్వము అని గ్రహించాలి.
ఇక రెండవది: ఏకైక లేక జ్యేష్టపుత్రుని విషయంలో ఒకడు ప్రలాపించునట్లు.....
గమనించాలి ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడెను.... యెషయా 9:6; ఆ జ్యేష్టపుత్రుడు యేసుక్రీస్తు పభులవారు అని వారు అప్పుడు గ్రహించి, ఆ జ్యేష్టపుత్రుని మేము ఇంతవరకు అంగీకరించలేదు కదా సరికదా అంగీకరించకుండా ఘోరమైన హింసలకు గురిచేసి చంపాము కదా అని ఏడుస్తారు. ఆ ప్రలాపములో వారికి పశ్చాత్తాపం కలిగి మారుమనస్సు కలిగి రక్షించబడతారు.
12వ వచనం ప్రకారం దేశ నివాసులంతా పశ్చాత్తాప పడి ఏడుస్తారు.
గమనించాలి కృపా యుగం మొత్తం వారు క్రీస్తును రక్షకునిగా అభిషక్తునిగా మెస్సయ్యగా
అంగీకరించలేదు ఆయనను నిరాకరిస్తూ వస్తున్నారు. అయితే చివరి దినాలలో అంత్యదినాలలో వారు
అంగీకరిస్తారు. దేవునివైపు తిరుగుతారు.
యెషయా
59:20—21
20. సీయోనునొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మళ్లుకొనిన
వారియొద్దకును విమోచకుడు వచ్చును ఇదే యెహోవా వాక్కు.
21. నేను వారితో చేయు నిబంధన యిది నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ
నోటనుంచిన మాటలును నీ నోటనుండియు నీ పిల్లల నోటనుండియు నీ పిల్లల పిల్లల నోటనుండియు
ఈ కాలము మొదలుకొని యెల్లప్పుడును తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
యిర్మియా 31:31—౩4
31. ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారి తోను క్రొత్త నిబంధన
చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు.
32. అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి
పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు;
నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు.
33. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు
నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే.
34. నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు; వారు మరి ఎన్నడును యెహోవానుగూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిగాని తమ
సహోదరులకుగాని ఉపదేశము చేయరు; నేను వారి దోషములను క్షమించి వారి
పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను గనుక అల్పులేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు;
ఇదేయెహోవా వాక్కు.
దానియేలు 12:1
ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని యీ కాలము వరకు ఎన్నటికిని కలుగనంత ఆపద కలుగును; అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైనవారెవరో వారు తప్పించుకొందురు.
హోషేయ ౩:4—5 .......
4.నిశ్చయముగా ఇశ్రాయేలీయులు చాలా దినములు రాజు లేకయు అధిపతిలేకయు
బలినర్పింపకయు నుందురు. దేవతా స్తంభమును గాని ఏఫోదునుగాని గృహదేవతలను
గాని యుంచుకొనకుందురు.
5. తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను
తమ రాజైన దావీదునొద్దను విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందు వారు
భయ భక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వత్తురు.
హోషేయ 14:1—4
1. ఇశ్రాయేలూ, నీ పాపముచేత నీవు కూలితివి గనుక
నీ దేవుడైన యెహోవాతట్టుకు తిరుగుము.
2. మాటలు సిద్ధపరచుకొని యెహోవాయొద్దకు తిరుగుడి; మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నిటిని పరిహరింపుము; ఎడ్లకు బదులుగా నీకు మా పెదవుల నర్పించుచున్నాము; నీవంగీకరింపదగినవి
అవే మాకున్నవి.
3. అష్షూరీయులచేత రక్షణ నొందగోరము, మేమికను
గుఱ్ఱములను ఎక్కము మీరే మాకు దేవుడని మేమికమీదట మా చేతి పనితో చెప్పము; తండ్రిలేనివారి యెడల వాత్సల్యము చూపువాడవు నీవే గదా.
4. వారు విశ్వాసఘాతకులు కాకుండ నేను వారిని గుణపరచుదును.
వారి మీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా
వారిని స్నేహింతును.
రోమా 11:25—29
25. సహోదరులారా, మీదృష్టికి మీరే బుద్ధిమంతులమని
అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొనగోరుచున్నాను. అదేమనగా,
అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు
కలిగెను.
26. వారు ప్రవేశించు నప్పుడు విమోచకుడు సీయోనులోనుండి వచ్చి యాకోబులో
నుండి భక్తిహీనతను తొలగించును;
27. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నావలన వారికి కలుగు నిబంధన
ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు.
28. సువార్త విషయమైతే వారు మిమ్మునుబట్టి శత్రువులు గాని,
యేర్పాటు విషయమైతే పితరులనుబట్టి ప్రియులైయున్నారు.
29. ఏలయనగా, దేవుడు తన కృపావరముల విషయములోను,
పిలుపు విషయములోను పశ్చాత్తాప పడడు.
ప్రకటన 7:౩—8
3. ఈ దూతమేము మా దేవుని దాసులను వారి నొసళ్లయందు ముద్రించువరకు భూమికైనను
సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను.
4. మరియు ముద్రింపబడినవారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింప బడినవారు లక్ష నలువది నాలుగు వేలమంది.
5. యూదా గోత్రములో ముద్రింపబడినవారు పండ్రెండువేలమంది. రూబేను గోత్రములో పండ్రెండు వేలమంది, గాదు గోత్రములో
పండ్రెండు వేలమంది,
6. ఆషేరు గోత్రములో పండ్రెండు వేలమంది, నఫ్తాలి
గోత్రములో పండ్రెండు వేలమంది, మనష్షే గోత్రములో పండ్రెండు వేలమంది,
7. షిమ్యోను గోత్రములో పండ్రెండు వేలమంది, లేవి గోత్రములో పండ్రెండు వేలమంది, ఇశ్శాఖారు గోత్రములో
పండ్రెండు వేలమంది,
8. జెబూలూను గోత్రములో పండ్రెండు వేలమంది, యోసేపు గోత్రములో పండ్రెండు వేలమంది, బెన్యామీను గోత్రములో
పండ్రెండు వేలమంది ముద్రింపబడిరి.
ఇదీ జరగబోతుంది ఇశ్రాయేలు పట్ల దేవుని చిత్తము అప్పుడు నెరవేరబోతుంది. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు! తన బిడ్డలను ఆదుకునే దేవుడు. తప్పుచేసినప్పుడు శిక్షించే దేవుడు!
కాబట్టి ఆయనను నమ్ముకున్న ప్రియ దేవుని బిడ్డా!
కృప కాలం తొందరలో ముగియబోతుంది. మరి ఆయనను మనసా వాచా కర్మేనా నమ్ముకుని ఆయనలో సాగుతున్నావా? ఆత్మతోను సత్యముతోను ఆయనను ఆరాధిస్తున్నావా లేక పెదాలతో ఆరాదిస్తున్నావా?
నీవుకూడా విజ్ఞాపణ చేసే ఆత్మను, కరుణ కలిగించే ఆత్మను పొందుకుని నీ పొరుగు వారి కోసం అన్యజనుల కోసం విజ్ఞాపన చేస్తున్నావా?!
జాగ్రత్త విడువబడుట బహు ఘోరం! గమనించాలి ఇశ్రాయేలు వారికి మహా శ్రమలకాలం వరకూ అవకాశం ఉన్నా, నూతన నిబంధన సంఘానికి కేవలం కృపాకాలం వరకు మాత్రమే రక్షించబడే అవకాశముంది.
కృపాకాలం ముగియక ముందే ఆయన వద్దకు రా!
నిన్ను నీవు సరిచేసుకో!
దైవాశీస్సులు!
*హతస్సాక్షి జెకర్యా-33వ భాగము*
*ఇశ్రాయేలు రక్షణ-3*
జెకర్యా 13:1—౩ ......
1. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతివారికొరకును,
యెరూషలేము నివాసులకొరకును ఊట యొకటి తియ్యబడును.
2. ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కుఆ దినమున విగ్రహముల పేళ్లు
ఇకను జ్ఞాపకమురాకుండ దేశములోనుండి నేను వాటిని కొట్టివేతును; మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశములో లేకుండచేతును.
3. ఎవడైనను ఇక ప్రవచనము పలుక బూనుకొనినయెడల వానిని కన్న తల్లిదండ్రులు
నీవు యెహోవా నామమున అబద్ధము పలుకుచున్నావే; నీవికను బ్రదుకతగదని
వానితో చెప్పుదురు; వాడు ప్రవచనము పలుకగా వానిని కన్నతల్లిదండ్రులే
వాని పొడుచుదురు.
ప్రియ దైవజనమా! జెకర్యా గారి ప్రవచనాలను ధ్యానం చేసుకుంటున్నాం!
(గతభాగం తరువాయి)
ప్రియులారా! ఈ 13వ అధ్యాయము- 12వ అధ్యాయంలో మొదలైన ఇశ్రాయేలు ప్రజలయొక్క రక్షణ ప్రణాళికను కొనసాగిస్తుంది. ఈ అధ్యాయం కూడా ఇశ్రాయేలు వారు రక్షణ ఎలా పొందుకుంటారు అనేదానినే చెబుతుంది. అదే ప్రవచనం కొనసాగుతుంది, అధ్యాయాలు మారాయి అంతే!
మొదటి వచనంలో ఆ రోజున అనగా
12వ అధ్యాయంలో వారు పొడిచిన క్రీస్తుకోసం విలపించి, రక్షణ పొందుకున్న దినాన వారి పాపమును అపవిత్రతను పరిహరించడానికి, దావీదు సంతతి వారికొరకు, యేరూషలేము నివాసులకొరకు ఊట ఒకటి తియ్యబడును అంటున్నారు.
పాపము- అపవిత్రత: జెకర్యా ౩:9 లో దేవుడు వారికి వాగ్దానం చేసారు- ఒకే రోజున ఈ దేశస్తుల అపరాధాలు పాపాలు మొత్తం తొలగిస్తాను అని దానినే ఇప్పుడు దేవుడు చెయ్యబోతున్నారు.
ఇంకా యేహెజ్కేలు 36:24—29 లో మిమ్మును చెదిరిపోయిన ఇతర దేశాలనుండి తీసుకుని వచ్చి మీమీద పరిశుద్ధ జలాన్ని ప్రోక్షిస్తాను అప్పుడు మీరు శుద్దులవుతారు రాతిగుండె ను తీసి నూతన హృదయం మీకిస్తాను అని చెప్పారు. అదే ఇప్పుడు జరగబోతుంది.
ఇంకా హెబ్రీ 9:14..
నిత్యుడగు ఆత్మ ద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ(మన, అని పాఠాంతరము) మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధిచేయును.
1యోహాను 1:7 లో చెప్పబడినట్టు ఆయనకుమారుడైన యేసుక్రీస్తురకం ప్రతి పాపములనుండి వారిని శుద్ధిచేస్తుంది.
ఇక్కడ కనబడే ఊట బయలుదేరడం అంటే: 2000 సంవత్సారాలు క్రితం క్రీస్తుయేసు కల్వరిలో కార్చిన ఆ రక్తం ఇప్పటికీ సజీవంగా ఊటయై ప్రవహిస్తూ ఉంది. ఆ ఊట మునిగి సిలువ ప్రక్కన ఉన్న దొంగ శుద్ధి చేయబడి పరమునకు వెళ్ళాడు. అదే ఊటలో మునిగి మనము పాపములనుండి విముక్తి పొందుకున్నాము. ఆరోజున యూదులు అదే ఊటలో తమ పాపములను అపవిత్రతను కడుగుకుని శుద్దులవుతారు. గమనించాలి ఆ ఊట ఇప్పుడు కూడా ప్రవహిస్తుంది గాని దానిని వారు గ్రహించడం లేదు, గ్రహించరు కూడా! రోమా 11 లో చెప్పబడిన విధముగా అన్యజనులమైన మన లెక్క సంపూర్తి అయ్యేవరకు ఇశ్రాయేలు వారు అదే నిజమైన ఊట అని గ్రహించరు. లెక్క సంపూర్తి యైన వెంటనే వారిలో విమోచకుడు సీయోనులో నుండి వచ్చి వారియొక్క భక్తిహీనతను తొలగించి వారి పాపములను తొలగిస్తారు.
రోమా 11:25—27...
25. సహోదరులారా, మీదృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొనగోరుచున్నాను.
అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగువరకు ఇశ్రాయేలునకు
కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను.
26. వారు ప్రవేశించునప్పుడు విమోచకుడు
సీయోనులోనుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును;
27. నేను వారి పాపములను పరిహరించినప్పుడు
నావలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు.
అప్పుడు గత అధ్యాయంలో చెప్పుకున్న విధముగా (
జెకర్యా
12:10—14) వారు విలపించి క్రీస్తును అంగీకరిస్తారు.
ఇక రెండవ వచనంలో విగ్రహాల పేర్లు ఇకను జ్ఞాపకం చేసుకొనకుందురు అనగా దేవుని నుండి వారిని దూరం చేసే దేనినైనా వారు విసర్జిస్తారు. ఇది మొదటిది.
ఇక రెండవది ఏమిటంటే: వారు అంత్యకాలంలో ప్రకటన
13 వ అధ్యాయంలో చెప్పబడిన విధముగా అంత్యక్రీస్తు వలన మోసగించబడి ఆ మృగమునకు
వాడి ప్రతిమకు కొంతమంది మ్రొక్కుతారు.
ప్రకటన 13:4,15 , తర్వాత నిజం తెలుసుకుని
మారుమనస్సు పొందిన తర్వాత ఇలాంటి విగ్రహారాధనను వారు విసర్జిస్తారు.
Revelation(ప్రకటన గ్రంథము) 13:4,15
4. ఆ మృగమునకు అధికారమిచ్చినందున వారు ఘటసర్ప మునకు నమస్కారముచేసిరి.
మరియు వారుఈ మృగముతో సాటి యెవడు? దానితో యుద్ధము
చేయగల వాడెవడు? అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారముచేసిరి.
15. మరియు ఆ మృగముయొక్క ప్రతిమ మాటలాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగముయొక్క ప్రతిమకు ప్రాణ మిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను.
ఇక ౩—4 వచనాలలో అబద్ద ప్రవక్తలను తల్లిదండ్రులే అప్పగిస్తారు. అప్పుడు అబద్ద ప్రవక్త ఎవడూ ఇశ్రాయేలు దేశంలో ఉండడు. కారణం ఈ నాయకులు, కాపరులే వీరిని తప్పుడుబోధలతో పాడుచేశారు కాబట్టి.
ఇక 6—7 వచనాలు మరలా యేసుక్రీస్తు ప్రభులవారి మొదట రాకడకోసం చెబుతున్నాయి- నీ చేతులకు గాయములు ఏమిటి అని అడిగితే ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట్లో నేనుండగా నాకు కలిగిన గాయములు. అనగా దేవుడు వారిని ప్రేమించి ఈలోకానికి వచ్చినా ఆయనను అంగీకరించలేదు. ..యోహాను 1: 11
ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు.
అప్పుడు వారు చేసిన గాయములు- చేతులలో మేకులు, కాళ్ళలో మేకు, ప్రక్కలో బల్లెపు పోటు – ఇవే ఆ గాయములు!
ఆ తర్వాత గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని కాపరిని హతము చేయుము.... ఇది యేసుక్రీస్తుప్రభులవారిని బంధించి తీసుకుని పోయి సిలువవేసి చనిపోయినప్పుడు ఆయన శిష్యులు చెదిరిపోయినప్పుడు ఈప్రవచనం నెరవేరింది......మార్కు 14: 27
అప్పుడు యేసు వారిని చూచి మీరందరు అభ్యంతర పడెదరు; గొఱ్ఱెల కాపరిని కొట్టుదును; గొఱ్ఱెలు చెదరిపోవును అని వ్రాయబడియున్నది గదా.
ఇక 8—9 వచనాలు చాలా ప్రాముఖ్యమైనవి ఆలోచించదగినవి........
8. దేశమంతట జనులలో రెండు భాగములవారు తెగవేయబడి చత్తురు, మూడవ భాగము వారు శేషింతురు.
9. ఆ మూడవ భాగమును నేను అగ్నిలోనుండి వెండిని తీసి శుద్ధపరచినట్లు
శుద్ధపరతును. బంగారమును శోధించినట్లు వారిని శోధింతును;
వారు నా నామమునుబట్టి మొఱ్ఱపెట్టగా నేను వారి మొఱ్ఱను ఆలకింతును.
వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని
వారు చెప్పుదురు.
ప్రియ దైవజనమా! ఈ రెండు వచనాలు అంత్యక్రీస్తు చేత వారు మోసపోయినప్పుడు, నాశనకరమైన హేయవస్తువు వాడు బలిపీటం మీద అర్పించినప్పుడు వారు అంత్యక్రీస్తు మీద తిరగబడతారు. వెంటనే వాడు వీరిని కటినమైన హింసలకు గురిచేస్తాడు. అనేకులు అరణ్యాలకు పారిపోతారు. దానియేలు 12:1 ప్రకారం, మత్తయి
24:15—22 ప్రకారం, యిర్మియా ౩౦:7 ప్రకారం భూమి పుట్టింది మొదలు, ఇశ్రాయేలు దేశంగా మారినది మొదలు ఇంతవరకు వారి సంభవించని కటినమైన శ్రమలు ఎదురవుతాయి.........
దానియేలు 12: 1
ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని యీ కాలము వరకు ఎన్నటికిని కలుగనంత ఆపద కలుగును; అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైనవారెవరో వారు తప్పించుకొందురు.
Matthew(మత్తయి సువార్త) 24:15,16,17,18,19,20,21,22
15.కాబట్టి ప్రవక్తయైన దానియేలుద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచుట మీరు చూడగానేచదువువాడు గ్రహించుగాక
16. యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను
17. మిద్దెమీద ఉండువాడు తన యింటిలోనుండి ఏదైనను తీసికొని పోవుటకు దిగకూడదు;
18. పొలములో ఉండువాడు, తన బట్టలు తీసికొని పోవుటకు ఇంటికి రాకూడదు.
19. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ.
20. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతిదినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి.
21. లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పు డును కలుగబోదు.
22. ఆ దినములు తక్కువ చేయబడక పోయిన యెడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడినవారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును.
యిర్మియా 30: 7
అయ్యో, యెంత భయంకరమైన దినము! అట్టి దినము మరియొకటి రాదు;
అది యాకోబు సంతతివారికి ఆపద తెచ్చుదినము; అయినను
వారు దానిలో పడకుండ రక్షింపబడుదురు.
ఇలా శ్రమలు సంభవించినప్పుడు 8వ వచనం ప్రకారం దేశ జనాబాను మూడు వంతులు చేస్తే రెండు వంతుల జనాబాను వాడు హతమారుస్తాడు. జెకర్యా 14:2—౩ లో చెప్పిన సంభవాలు జరుగుతాయి. ఒక వంతు మిగులుతుంది. ఇక మిగిలిన వంతుకూడా ఎన్నెన్నో కష్టాలు పడతారు. ఇలా కష్టాలు పడటం దేనికి సూచన అనగా 9 వ వచనం ప్రకారం అగ్నిలోనుండి వెండిని తీసి శుద్ధిచేసిన విధంగా నేను ఇశ్రాయేలు ప్రజల పాపములను శ్రమల కొలిమిలో నుండి తీసి వారిని తనకొరకు ఏర్పాటుచేసుకుని ముద్రిస్తారు. ........
మలాకి ౩:2—౩....
2.
అయితే ఆయన వచ్చుదినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా
ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్నివంటివాడు, చాకలివాని సబ్బువంటి వాడు;
3. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండును.
లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను
నిర్మలము చేయురీతిని ఆయన వారిని నిర్మలులను చేయును.
అప్పుడు ప్రకటన 7వ అధ్యాయంలో చెప్పినట్లు తనకొరకు ముద్రించుకోవడం జరుగుతుంది అన్నమాట!
అప్పటికే అంత్యక్రీస్తు వాడి సైన్యము హార్మెగిద్దోను అనే ప్రాంతంలో దిగి యేరూషలేము చుట్టూ దండ్లచేత ఆవరిస్తారు.
ఎప్పుడైతే వారు యేసయ్యను అంగీకరించారో మొర్రపెట్టారో అప్పుడు దేవుడు వారి పక్షంగా యుద్ధం చేస్తారు. జెకర్యా
14 వఅధ్యాయంలో చెప్పబడిన సంఘటనలు అప్పుడు మొదలవుతాయి. 14:౩....
1.ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీయొద్ద
దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడును.
2. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరిని సమకూర్చబోవుచున్నాను;
పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్ల పెట్టబడును,
స్త్రీలు చెరుపబడుదురు, పట్టణములో సగముమంది చెరపట్టబడి
పోవుదురు; అయితే శేషించువారు నిర్మూలము కాకుండ పట్టణములో నిలుతురు.
3. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా
ఆ అన్యజనులతో యుద్ధము చేయును.
(ఇంకాఉంది)
*హతస్సాక్షి జెకర్యా-౩4వ భాగము*
*ఇశ్రాయేలు రక్షణ-4*
జెకర్యా 14:1—౩ ......
1. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు
మీయొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడును.
2. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరిని సమకూర్చబోవుచున్నాను;
పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్ల పెట్టబడును,
స్త్రీలు చెరుపబడుదురు, పట్టణములో సగముమంది చెరపట్టబడి
పోవుదురు; అయితే శేషించువారు నిర్మూలము కాకుండ పట్టణములో నిలుతురు.
3. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా
ఆ అన్యజనులతో యుద్ధము చేయును.
ప్రియ దైవజనమా! జెకర్యా గారి ప్రవచనాలను ధ్యానం చేసుకుంటున్నాం!
(గతభాగం తరువాయి)
ఇది జరిగాక అప్పుడు యేసుక్రీస్తు ప్రభులవారు బహిరంగ రాకడ జరుగుతుంది. జెకర్యా
14:4 ...
ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పుతట్టుననున్న ఒలీవ కొండమీద ఆయన పాదములుంచగా ఒలీవకొండ తూర్పు తట్టునకును పడమటి తట్టువకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపుతట్టునకును సగముకొండ దక్షిణపుతట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ యొకటి యేర్పడును.
ఆయన ఒలీవల కొండమీద కాలుమోపిన వెంటనే ఒలీవల కొండ రెండు భాగాలు అవుతుంది. దానిమధ్య పెద్ద లోయ ఏర్పడుతుంది. పెద్ద భూకంపం కలుగుతుంది ఆయన కాలు పెట్టిన వెంటనే. కారణం ఇప్పుడు ఆయన మహిమతో ప్రత్యక్షం అయ్యారు. ఇంతవరకు గొర్రె పిల్లగా, కరుణామయునిగా ప్రత్యక్షమైన యేసయ్య ఇప్పుడు ఉగ్రతామూర్తిగా తన ప్రజల పక్షంగా యుద్ధం చేసేవానిగా ప్రత్యక్షం అవుతారు. అప్పుడు భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకుంటారు. ..ప్రకటన గ్రంథం 1: 7
ఇదిగో ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్.
ఆ దినము పగలు కాదు, రాత్రి కాదు, ప్రత్యేకమైన దినంగా ఉంటుంది. ఆ రోజు తారీకు అది కేవలం యెహోవాకు మాత్రమే తెలుసు అని జెకర్యా గారితో దేవుడు చెబుతున్నారు. అందుకే యేసయ్య కూడా ఆ దినము గూర్చి ఆ గడియ గూర్చి తండ్రియైన దేవునికే తెలుసు గాని కుమారునికి కూడా తెలియదు అన్నారు. మార్కు 13: 32
ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు.
ఒకసారి ఆగుదాం. యేసుక్రీస్తు ప్రభులవారు ఒలీవల కొండ మీదనే ఎందుకు కాలుమోపాలి? మిగతా కొండమీద కాలు మోపవచ్చు కదా, కారణం అపోస్తలుల కార్యములు 1:9—12 ప్రకారం అలాగే జరగాలి......Acts(అపొస్తలుల కార్యములు) 1:10,11,12
10. ఆయన వెళ్లుచుండగా, వారు ఆకాశమువైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు
ధరించుకొనిన యిద్దరు మనుష్యులు వారియొద్ద నిలిచి
11. గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచుచున్నారు? మీయొద్దనుండి
పరలోకమునకు చేర్చుకొనబడిన యీ యేసే, ఏ రీతిగా పరలోకమునకు వెళ్లుట
మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి.
12. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండనుండి
యెరూషలేమునకు తిరిగి వెళ్లిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతిదినమున
నడవదగినంత సమీపమున ఉన్నది,
ఆయన పరలోకానికి ఆరోహణం అయ్యింది అదే కొండమీద నుండి. మరలా అదే కొండమీదకు వస్తారు.
అప్పుడు ప్రకటన 19:11—21 లో గల సంభవాలు జరుగుతాయి. ఇంకా ఆ మృగపు ముద్ర వేయించుకున్న వారిని, మృగపు ప్రతిమకు మ్రొక్కిన వారిని, మోసపరచిన అబద్ద ప్రవక్తను ఇంకా మృగము అనే అంత్యక్రీస్తును దేవుడు పట్టుకుని అగ్నిగుండములో వేస్తారు. మిగతా రాజులను సైన్యాన్ని అనగా యేరూషలేమును చుట్టుముట్టిన వారిని దేవుని నోట నుండి వచ్చిన ఖడ్గము ద్వారా హతమవుతారు.
ఇక్కడ గమనించవలసిన మరో విషయం యేసుక్రీస్తు ప్రభులవారు రెండవ రాకడలో అనగా బహిరంగ రాకడలో తను ఒక్కరే రారు తనతోపాటు పరిశుద్ధులను తోడుకుని వస్తారు. ఈ పరిశుద్దులు దేవదూతలు ఇంకా రక్షించబడిన పరిశుద్దులు .
మత్తయి 25:31
తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును.
1థెస్సలొనికయులకు 3: 12
మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు, మన తండ్రియైన దేవుని
యెదుట మీహృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై,
1థెస్సలొనికయులకు 4: 14
యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము యేసునందు
నిద్రించినవారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును.
యూదా 1: 15
భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను.
ప్రకటన 19:14
పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుఱ్ఱము లెక్కి ఆయనను వెంబడించుచుండిరి.
ప్రియ దైవజనమా! ఒకవేళ దేవుని రాకడ ఆలస్యం అయితే, ఆయన రాకడకు ముందుగా నీవు నేను చనిపోతే ఇప్పుడు బహిరంగ రాకడలో ఆయన పరిశుద్ధ సైన్యం లో నీవు నేను ఉండాలంటే ఆయనతోపాటు మరలా నీవు నేను రావాలంటే పరిశుద్ధమైన పరిపూర్ణమైన జీవితం జీవించాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి జీవితం నీకుందా??!!!!
ఇక 8వ వచనంలో కనబడే తూర్పు సముద్రం అనగా మృత సముద్రం, పడమటి సముద్రం అనగా మధ్యధరా సముద్రం అని గ్రహించాలి.
ఇది జరిగాక 9వ వచనంలో వ్రాయబడినట్లు యెహోవా సర్వభూమికి రాజై ఉంటారు. యేసుక్రీస్తు ప్రభులవారి ప్రత్యక్ష పాలన మొదలవుతుంది.
10—11...Zechariah(జెకర్యా) 14:10,11
10.యెరూషలేము బెన్యామీను గుమ్మమునుండి మూలగుమ్మమువరకును, అనగా మొదటి గుమ్మపు కొన వరకును,హనన్యేలు గుమ్మమునుండి రాజుగానుగులవరకును వ్యాపించును, మరియు గెబనుండి యెరూషలేము దక్షిణపు తట్టుననున్న రిమ్మోనువరకు దేశమంతయు మైదానముగా ఉండును,
11. పట్టణము ఎత్తుగా కనబడును, జనులు అక్కడ నివసింతురు, శాపము ఇకను కలుగదు, యెరూష లేము నివాసులు నిర్భయముగా నివసింతురు.
ఇక్కడ ఇశ్రాయేలు దేశంలో భౌగోళికంగా కొన్ని మార్పులు సంభవిస్తాయి అని చెబుతున్నారు. గెబ అనేది యేరూషలేము 10 కి.మీ దూరంలో ఉత్తరంగా ఉంది. రిమ్మోను అనేది దక్షిణంగా 60 కి.మీ దూరంలో ఉంది. గెబ నుండి రిమ్మోను యూదయ ప్రాంతంలో కొండ ప్రాంతం. అది ఇప్పుడు మైదానంలా మారిపోతుంది అంటున్నారు. గలిలియ సముద్రం నుండి మృత సముద్రం వరకు ఇంతవరకు కొండలు లోయలు గల ప్రాంతం ఇప్పుడు మైదానం లా మారిపోతుంది. ఇక యేరూషలేము ఎందుకు ఎత్తుగా కనిపిస్తుంది అంటే మిగతా ప్రాంతాలు కృంగిపోయి మైదానంలా ఇంకా లోయలా మారిపోయాయి కాబట్టి యేరూషలేము ఎత్తుగా కనిపిస్తుంది. ఇక అది ఎప్పుడూ నాశనం కాదు. కారణం దేవుడే మహారాజుగా ప్రత్యక్ష పరిపాలన చేస్తున్నారు కాబట్టి.
ఇక్కడ మరలా ఆగుదాం! గతంలో చెప్పిన విధంగా ఇది నూతన నిబంధన సంఘంలో పరమ సీయోను అనుభవానికి సాదృశ్యంగా ఉంది. సీయోను ఎందుకు ఎత్తుగా ఉంది అంటే వీరి ఆత్మీయ స్థితి అంత ఉన్నతముగా ఉంది కాబట్టి వీరు పరమ సీయోనుగా కట్టబడుతున్నారు. ఇలాగే వీరు పరిపూర్ణత సాధిస్తారు. అంతేకాకుండా సీయోను అనుభవం అన్ని అనుభవాలకంటే ఉన్నతమైన శ్రేష్టమైన అనుభవం. అందుకే అంత ఎత్తుగా ఉంది. ఆ అనుభవంలో నీవున్నావా ప్రియ స్నేహితుడా!!!
ఇక 12వ వచనం చాలా ఆసక్తిగా ఉంటుంది......
12. మరియు యెహోవా తెగుళ్లుపుట్టించి యెరూషలేముమీద యుద్ధము చేసిన జనములనందరిని ఈలాగున మొత్తును; వారు నిలిచియున్నపాటుననే వారి దేహములు కుళ్లిపోవును, వారి కన్నులు కను తొఱ్ఱలలోఉండియే కుళ్లిపోవును వారి నాలుకలు నోళ్లలో ఉండియే కుళ్లిపోవును.
ఇశ్రాయేలు దేశముపై యుద్దానికి వచ్చిన సైన్యాలమీద దేవుడు ఒక రకమైన తెగులు లేక ఉగ్రత పంపబోతున్నారు. దానివలన వారు నిలిచియున్న చోటునే వారి దేహాలు కుల్లిపోతాయి. వారి కన్నులు తొర్రలలో ఉన్నప్పుడే కుల్లిపోతాయి. ఇది ఆ కాలంలో నమ్మకపోవచ్చును గాని నేటి రోజులలో మనం నమ్మగలము. చాలామంది బైబిల్ పండితులు నమ్మేది ఏమిటంటే ఆ సమయంలో బహుశా అణుబాంబులు ప్రయోగించవచ్చు. దానివలన ఈ సైన్యాలు ఉన్నపాటునే కుల్లిపోతాయి అంటారు. అయితే అది బయోలాజికల్ వెపన్ కూడా కావచ్చు. కారణం ఈ బయోలాజికల్ వెపన్ వలన అది ఒక్కసారి విడుదల చేస్తే ఆ వాసన పీల్చినవారు అక్కడికక్కడే కుల్లిపోతారు. లేదా ఈ రోజులలో వచ్చిన కరోనా లాంటి క్రొత్త వైరస్ ని దేవుడు విడుదల చెయ్యొచ్చు. దానివలన వారంతా కుల్లిపోవచ్చు. ఏదిఏమైనా వారు ఉన్నపాటునే చనిపోతారు అనగా దేవుడు వారిమీద ఉగ్రత కురిపిస్తారు.
ఇక 13వ వచనంలో వారు అనగా హార్మెగిద్దోను యుద్ధానికి వచ్చిన శత్రుసేనలు ఓడిపోవడానికి మరో కారణం దేవుడు వారిమధ్య గొప్ప కల్లోలం గందరగోళం సృష్టిస్తారట! దానివలన వారు ఒకరిమీద ఒకరు విరోధులై పొడుచుకొని చస్తారు. న్యాయాధిపతుల గ్రంధంలో 7:22లో గిద్యోను గారు ౩౦౦ మందితో యుద్దానికి వెళ్ళినప్పుడు దేవుడు పుట్టించిన కలవరపాటు, గందరగోళం లాంటివి అప్పుడు కూడా పుట్టిస్తారు అన్నమాట!
ఇక 14వ వచనంలో యూదా వారు యుద్ధం చేస్తారు అంటున్నారు......
14. యూదావారు యెరూషలేమునొద్ద యుద్ధము చేయుదురు, బంగారును వెండియు వస్త్రములును చుట్టునున్న అన్యజనులందరి ఆస్తియంతయు విస్తారముగా
కూర్చ బడును.
అనగా జెకర్యా 12:6—8 చేసిన వాగ్దానం / ప్రవచనం అప్పుడు
నెరవేరుతుంది.......
6. ఆ దినమున నేను యూదా అధికారులను కట్టెల క్రింది నిప్పులుగాను పనల
క్రింది దివిటీగాను చేతును, వారు నలుదిక్కులనున్న జనములనందరిని
దహించుదురు. యెరూషలేమువారు ఇంకను తమ స్వస్థలమగు యెరూషలేములో నివసించుదురు.
7. మరియు దావీదు ఇంటి వారును యెరూషలేము నివాసులును, తమకు కలిగిన ఘనతనుబట్టి యూదావారిమీద అతిశయపడకుండునట్లు యెహోవా యూదావారిని మొదట
రక్షించును. తద్వారా
అక్కడ విస్తారమైన ధనం పోగవుతుంది.
యెషయా 18:7
ఆ కాలమున ఎత్తయినవారును నునుపైనచర్మముగల వారును. దూరములోనున్న భీకరమైనవారును నదులు పారు దేశము గలవారునైయున్న దౌష్టికులగు ఆ జనులు సైన్యములకధిపతియగు యెహోవాకు అర్పణముగా ఆయన నామమునకు నివాసస్థలముగానుండు సీయోను పర్వతమునకు తేబడుదురు.
యెషయా 60: 11
నీయొద్దకు జనముల భాగ్యము తేబడునట్లు వారి రాజులు జయోత్సాహముతో రప్పింపబడునట్లు నీ ద్వారములు రాత్రింబగళ్లు వేయబడక నిత్యము తెరువబడి యుండును.
యెషయా 61: 6
మీరు యెహోవాకు యాజకులనబడుదురు వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మును గూర్చి చెప్పుదురు జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు వారి ప్రభావమును పొంది అతిశయింతురు
ఈరకంగా వారు అనగా ఇశ్రాయేలు వారు భాగ్యవంతులవుతారు.
(ఇంకాఉంది)
*హతస్సాక్షి జెకర్యా-౩5వ భాగము*
*ఇశ్రాయేలు రక్షణ-5*
జెకర్యా 14:16—19 ......
16. మరియు యెరూషలేముమీదికి వచ్చిన అన్యజనులలో శేషించినవారందరును
సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకును పర్ణశాలపండుగ ఆచరించుటకును ఏటేట
వత్తురు.
17. లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు
మ్రొక్కుటకై యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురువకుండును.
18. ఐగుప్తీయుల కుటుంబపువారు బయలుదేరకయు రాకయు ఉండినయెడల వారికి
వర్షము లేకపోవును, పర్ణశాలపండుగ ఆచరించుటకై రాని అన్యజనులకు తాను
నియమించిన తెగులుతో యెహోవా వారిని మొత్తును.
19. ఐగుప్తీయులకును, పర్ణశాలపండుగ ఆచరించుటకు
రాని అన్యజనులకందరికిని రాగల శిక్షయిదే.
ప్రియ దైవజనమా! జెకర్యా గారి ప్రవచనాలను ధ్యానం చేసుకుంటున్నాం!
(గతభాగం తరువాయి)
ఇక 16—21 వరకు ఈ యుద్ధం జరిగాక దేవుడు సాతాను సైన్యాలను హతమార్చిన తర్వాత సంభవాలు కోసం చెబుతున్నారు. అనగా బహుశా హార్మెగిద్దోను మరియు గోగుమాగోగు యుద్దాల మధ్యగల సమయంలో అనగా వెయ్యేండ్ల పాలనలో జరిగే సంగతులు కావచ్చు!
16. యేరూషలేము మీద దండెత్తి వచ్చి చనిపోయిన వారు కాకుండా మిగిలిన జనాలు అనగా బ్రతికి ఉన్న మిగిలిన అన్యదేశాల వారు యెహోవా దేవుణ్ణి పూజించటానికి మ్రొక్కడానికి పర్ణశాల పండగ ఆచరించడానికి ప్రతీ సంవత్సరం ఇశ్రాయేలు దేశం వస్తారు.
17 . ఎవరైతే అలా యెహోవా దేవుణ్ణి మ్రొక్కడానికి రారో వారి దేశంలో వర్షం పడదు అంటున్నారు. ఈజిప్టు వారు రాకపోతే వారికి వర్షం పడదు. ఇలా ఎవరు రాకపోతే వారు కరవుకాటకాలు బారిన పడతారు అంటున్నారు.
అయితే ఇక్కడ పర్ణశాల పండగ కోసం చెప్పబడింది. ఇది లేవీకాండం 23:౩౩—36 లో చెప్పబడింది. ఇది యూదుల పండగలలో చివరిది. ఇది ఎందుకు చేసుకుంటారు అంటే దేవుడు వారిని చెరవిముక్తి చేసి, వారి కష్టాలను తొలగించి ఒక ప్రాంతంలోనికి తీసుకుని వచ్చి వారికి ఆదరణ కలుగజేసి వారి కష్టాలన్నిటినుండి కొంతకాలం సేదతీర్చుకోమని ఈ పర్ణశాల పండుగ చేసుకోమని చెప్పారు. అనగా వారి కష్టాలు అన్ని అయిపోయాయి ఇప్పుడు ఆయన రెక్కలనీడను సేదదీరమని చెబుతున్నారు. అలాగే ఇప్పుడు ఇశ్రాయేలు వారు తమ ఆపదలనన్నిటినుండి కష్టాలు అన్నిటినుండి ఆదరణ పొందారు కాబట్టి మరలా అంత్యకాలంలో పర్ణశాలల పండగ చేసుకుంటారు. ఆ పండగకు అన్ని దేశాలువారు వస్తారు. ఎవరైతే రారో వారిమీద దేవుని ఆశీర్వాదం ఉండక ఉగ్రత వస్తుంది.
ఇక 20—21 వచనాలు చూసుకుంటే ఈ పరిస్తితులు యెషయా
65:18—25 వ్రాసిన సంగతులు జరిగే సమయంలా కనిపిస్తుంది.....
18. నేను సృజించుచున్నదానిగూర్చి మీరు ఎల్లప్పుడు హర్షించి ఆనందించుడి నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించువారినిగాను సృజించు చున్నాను.
19. నేను యెరూషలేమునుగూర్చి ఆనందించెదను నా జనులనుగూర్చి హర్షించెదను రోదనధ్వనియు విలాపధ్వనియు దానిలో ఇకను విన బడవు.
20. అక్కడ ఇకను కొద్దిదినములే బ్రదుకు శిశువులుండరు కాలమునిండని ముసలివారుండరు బాలురు నూరు సంవత్సరముల వయస్సుగలవారై చని పోవుదురు పాపాత్ముడై శాపగ్రస్తుడగువాడు సహితము నూరు సంవత్సరములు బ్రదుకును
21. జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభవింతురు.
22. వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరు వారు నాటుకొన్నవాటిని వేరొకరు అనుభవింపరు నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును నేను ఏర్పరచుకొనినవారు తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభ వింతురు
23. వారు వృథాగా ప్రయాసపడరు ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు వారు యెహోవాచేత ఆశీర్వదింపబడిన వారగుదురు వారి సంతానపువారు వారియొద్దనే యుందురు.
24. వారికీలాగున జరుగును వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను వారు మనవి చేయుచుండగా నేను ఆలంకిచెదను.
25. తోడేళ్లును గొఱ్ఱెపిల్లలును కలిసి మేయును సింహము ఎద్దువలె గడ్డి తినును సర్పమునకు మన్ను ఆహారమగును నా పరిశుద్ధపర్వతములో అవి హానియైనను నాశన మైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
ఇంకా ఇశ్రాయేలు దేశంలో ప్రతీది దేవునికి సంపూర్ణంగా అంకితమై ఉంటుంది. అది దేవునికి ప్రత్యేకముగా ఉంటుంది. దేవుడు తన బిడ్డలు ఎలా ఉండాలి అని కోరుకున్నారో ఇశ్రాయేలు వారు అలాగే ఉంటారు.
నిర్గమ 19:6..
సమస్తభూమియు నాదేగదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనము గాను ఉందురని చెప్పుము; నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా
లేవీ 11:45..
నేను మీకు దేవుడనై యుండుటకు ఐగుప్తుదేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను.
ఇక చివరి వచనంలో కనానీయుడు లేక వర్తకుడు ఎవడూ యెహోవా మందిరంలో ఉండడు అనగా కనాను దేశం వారు పరలోకం చేరరు అని కానేకాదు.
కనాను దేశంలో జీవించిన బ్రష్టమైన జీవితం గలవారు ఎవరూ దేవుని మందిరం అనే పరలోకంలో ఉండరు. ద్వితీ 7:1—6; 18:9—12; లేవీ 18:24—౩౦ చూసుకుంటే వారు విగ్రహారాధన చేస్తూ, పిల్లలను ఆ దేవతలకు బలిస్తూ, పిల్లలను అగ్ని గుండాలు దాటిస్తూ, శకునములు చూస్తూ, జ్యోతిష్యాలు చూస్తూ, గారడీ మంత్ర విద్యలను పాటిస్తూ వచ్చారు కాబట్టి ఇలాంటి చిల్లంగి వారు గాని, విగ్రహారాధికులు గాని యెహోవా మందిరంలో ఉండనే ఉండదు అంటున్నారు.
Psalms(కీర్తనల గ్రంథము) 15:1,2
1. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు? నీ పరిశుద్ధ పర్వతముమీద నివసింపదగిన వాడెవడు?
2. యథార్థమైన ప్రవర్తన గలిగి నీతి ననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే.
యెషయా 35:8.
అక్కడ దారిగా నున్న రాజమార్గము ఏర్పడును అది పరిశుద్ధ మార్గమనబడును అది అపవిత్రులు పోకూడని మార్గము అది మార్గమున పోవువారికి ఏర్పరచబడును మూఢులైనను దానిలో నడచుచు త్రోవను తప్పక యుందురు
యేహెజ్కేలు 44:9....
కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా హృదయమందును, శరీరమందును సున్నతిలేని అన్యులై యుండి ఇశ్రాయేలీయులమధ్య నివసించువారిలో ఎవడును నా పరిశుద్ధస్థలములో ప్రవేశింపకూడదు.
ఇంకా అలాగే ప్రకటన గ్రంధంలో కూడా అంటున్నారు దేవుడు 21:8
పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రికులును,
విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో
మండు గుండములో పాలు పొందుదురు; ఇది రెండవ మరణము.
ప్రకటన 22:౩, 15....
3. ఇకమీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు, దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనము దానిలో ఉండును.
15. కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంతకులును విగ్రహారాధకులును
అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.
*ప్రియ దైవజనమా! ఈ సంగతులు యూదులకు జరిగే సంభవాలు! ఈ సంగతులు నీవు చూడాలని ఆశించకు!!!* *ఎందుకంటే ఈ సంభవాలు జరిగేసరికి సంఘం ఎత్తబడుతుంది. పరిశుద్ధాత్ముడు ఎత్తబడతాడు. కేవలం విడువబడిన వారు మాత్రమే, ఇంకా ఇశ్రాయేలు జాతివారు మాత్రమే అప్పుడు ఉంటారు. దీనిని చూస్తారు. సిద్దపాటు గలవారు ఎత్తబడి దేవునితో ఉంటారు.*
ప్రియ దైవజనమా! ఇది అంత్యదినాలలో యూదులకు జరిగే సంభవాలు! మీద చెప్పిన కేటగిరిలో ఒకవేళ నీవుంటే నీవు కూడా వెలుపల ఉంటావు. మారుమనస్సు రక్షణ అనుభవం, ఆత్మానుసారమైన జీవితం, సాక్షార్ధమైన జీవితం కలిగి ఆయన చెప్పినట్లు జీవిస్తేనే ఆ పరలోకం చేరగలవు! లేకపోతే విడిచిపెట్ట బడతావు. విడిచిపెట్టబడుట బహు ఘోరమని మరచిపోకు! పరలోకం ఉంది! అలాగే నరకం అనేది కూడా ఉంది!!!
కాబట్టి బుద్ధిమంతుడవైతే క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోడానికి మీదనున్న పరమునకు పోయే దారిలో ప్రవేశించవలసినదే!...సామెతలు 15: 24
క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడచు కొనును
లేకపోతే అగ్ని ఆరదు! పురుగు చావదు! యుగయుగములు ఆ మండేటగ్నిలో కాలవలసినదే!
నేడే నీ పాప జీవితాన్ని వదిలిపెట్టు! దేవునితో సమాధాన పడు!
ఇదిగో దేవుడు ఇప్పుడే నీ తలుపును
తట్టుచున్నారు. విని ఆయనకు తలుపు
తీస్తావా?
నీహృధయంలో ఆయనను చేర్చుకుంటావా?
రక్షించబడిన నీవు మంచి ఫలాలు ఫలిస్తున్నావా? మంచి ఫలము ఫలించక పోతే ఇదిగో గొడ్డలి చెట్టువేరున ఉంచబడింది జాగ్రత్త! మత్తయి 3:10; మంచి ఫలాలు ఫలించక కారు ద్రాక్షలు కాసిన, అసలు ఫలించక పోయినా, ఫలించని ప్రతీ తీగెను దేవుడు నరికి అగ్నిలో వేస్తారని మరచిపోకు! మత్తయి 7:19; యోహాను 15:2;
నేడే రక్షణ దినం! నేడే అనుకూల సమయం! నేడే దేవుని దగ్గరకు రా! నేడు అనే సమయముండగానే ఆయన పాదాలు పట్టుకో!
ఆయన నిన్ను చేర్చుకోడానికి సిద్దంగా ఉన్నారు.
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
దైవాశీస్సులు!
************************************
ప్రియ దైవజనమా!
ఈ జెకర్యా గ్రంధ వాఖ్యానము రాయడానికి కృప చూపిన దేవునికి వందనములు.
దీనిద్వారా దీవెనలు పొందారని నమ్ముచున్నాను. మాకోసం,
మా పరిచర్య కోసం, చేసే పని కోసం, పరిచర్య కోసం, మా పేజీలు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, నిరీక్షణ ద్వారం కోసం
, వెబ్సైట్ ఆధ్యాత్మిక సందేశాలు కోసం ప్రార్ధన చేయండి. ప్రభువు చిత్తమైతే మరో టాపిక్ తో మరల కలుసుకొందాం!
దైవాశీస్సులు!
ఇట్లు
ప్ర్రభువునందు మీ ఆత్మీయ సహోదరుడు
రాజకుమార్ దోనె
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి