ఎఫెసీ పత్రిక ధ్యానములు
*ఎఫెసీ పత్రిక –మొదటి భాగం*
*ఉపోద్ఘాతం-1*
ఎఫెసీ 4:1—2
1. కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు
ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు,
2. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో
కూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,
దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును
గాక! ప్రియ దైవజనమా! ఆధ్యాత్మిక సందేశాలు సిరీస్ లో భాగంగా పరిశుద్ధాత్మ
దేవుడు పౌలుగారితో వ్రాయించుకున్న మరో
పత్రిక ద్వారా మిమ్మల్ని మరోసారి కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది! అట్టి కృపనిచ్చిన
దేవాదిదేవునికి హృదయ పూర్వక వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను!
ప్రియులారా! ఈ పత్రికను బాగా అర్ధం
చేసుకోవాలంటే అసలు ఈ పత్రికను ఎందుకు రాశారు? ఎప్పుడు రాశారు? ఏ పరిస్తితులలో
రాయాల్సివచ్చింది? ఎవరు రాశారు? అసలు అక్కడి పరిస్తితులు ఏమిటి? అనేవి వివరంగా
తెలుసుకుంటే ఈ పత్రిక బాగా అర్ధమవుతుంది! కాబట్టి ఈ పత్రిక యొక్క నేపధ్యం
విస్తారంగా చూసుకుందాం!!
ఎవరు రాశారు? అపొస్తలుడైన
పౌలుగారు!
ఎప్పుడు రాశారు? క్రీ. శ . 60—62 మధ్యలో
ఎవరికి రాశారు? ఎఫెసీ పట్టణంలో ఉన్న విశ్వాసులకు-సంఘానికి!!
ఎఫెసీ పట్టణం ఎక్కడుంది? చిన్నాసియాలో ఉంది! అనగా మధ్యాసియాలో టర్కీ దేశంలో
పశ్చిమంగా మధ్యధరా సముద్రం ఒడ్డున ఉంది! ఇజ్మీర్ జిల్లా, కుసదాసీ పట్టణం ప్రక్కన!!
ప్రస్తుతం ఇది చిన్న పల్లెటూరు!! పోయిన సంవత్సరం వచ్చిన భూకంపంలో చాలా
పాడైపోయింది!
ప్రస్తుత పేరు: అయాసలుక్ లేదా ఐసలుక్ , సెల్కుస్
సంఘము ఎవరు స్థాపించారు? అపొస్తలుడైన పౌలు మహాశయుడు!!!
ఎప్పుడు స్థాపించారు?
పౌలుగారు మూడు సంపూర్ణ సువార్త
మిషనరీ దండయాత్రలు చేసి, నాల్గవ మిషనరీ
దండయాత్ర పూర్తిచేయలేక పోయారు, కారణం ఆయనను రోమా పట్టణంలో ఖడ్గముతో చంపేశారు అని
మనకు తెలుసు! ఇలా సువార్త దండయాత్రలు చేసేటప్పుడు తన రెండవ మిషనరీ ప్రయాణం చివరలో
కొంతకాలం, ఆపై తన మూడవ మిషనరీ ప్రయాణంలో రెండు సంవత్సరాలకు పైగా, పౌలుగారు ఎఫెసీ
సంఘమునకు పరిచర్య చేసారు (అపొస్తలుల
కార్యములు 18:18–21; 19:1–41) ప్రకారం! ఈ రకంగా పౌలుగారు అక్కడ సంఘాన్ని స్థాపించారు! ఇక్కడ
పౌలుగారు సువార్త ప్రకటించి కొన్ని దినముల తర్వాత మరో ప్రాంతము వెళ్ళిపోయారు అయితే
అక్కడ అకుల అనే విశ్వాసిని అతని భార్యయైన ప్రిస్కిల్లను ఇద్దరినీ ఆ సంఘాన్ని
బలపరచడానికి వదలివెళ్లారు. కొంతకాలానికి అక్కడకు అలెగ్జాండ్రియా పట్టణానికి చెందిన
అపోల్లో అనే దైవజనుడు వచ్చి వాక్యమును బోధిస్తున్నప్పుడు అతనిని ఈ భార్యాభర్తలు
చేర్చుకుని యేసుక్రీస్తుప్రభులవారి మార్గాన్ని పూర్తిగా వివరించినప్పుడు ఇంకా
బలంగా ఈ ఎఫెసీ సంఘం కట్టబడింది. ఆ తర్వాత 19వ అధ్యాయంలో చూసుకుంటే పౌలుగారు మరలా
ఎఫెసీ పట్టణానికి రావడం, సువార్త చెప్పడం, రక్షించబడిన విశ్వాసులకు పరిశుద్ధాత్మ
అనుభవం లేకపోవడం, అప్పుడు ప్రార్దించినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ అనుభవం
పొందుకున్నట్లు చూడగలం! ఇలా అక్కడ తురన్ను అనే పాటశాలను అద్దెకు తీసుకుని రెండు
సంవత్సరాల కాలం పౌలుగారు అక్కడ పరిచర్య జరిగించారు. మరలా అక్కడ అల్లర్లు కలిగితే
తర్వాత మరో ప్రాంతానికి వెళ్లారు! ఇదీ అపొస్తలుల కార్యములు 18,19 అధ్యాయాలలో ఈ
సంఘము కోసం మనకు దొరికే వివరాలు!
ఎక్కడనుండి రాశారు? క్రీ.శ. 60-62 లో పౌలుగారు
ఎఫెసీయులకు ఈ లేఖ రాశారు , అదే సమయంలో
కొలొస్సయులకు మరియు ఫిలేమోనుకు కూడా పత్రికలు వ్రాసారు , అతను ఈ మూడు
పత్రికలను తుకికు చేతితో పంపారు , ఒనేసిమును కూడా అతనివెంట పంపారు (ఎఫెసీయులకు 6:21; కొలొస్సయులకు 4:7–9; ఫిలేమోనుకు 1:10–12). ఈ సమయంలోనే పౌలుగారు తన మొదటి రోమా జైలు శిక్షకు
గురై రోమాలో ఉన్నారు (ఎఫెసీయులకు 3:1;
4:1). జైలు పత్రికలు అని పిలువబడే నాలుగు పత్రికల్లో ఒకటిగా ఎఫెసీ పత్రిక రచించారు . మిగిలిన మూడు ఏవంటే, ఫిలిప్పీయులకు,
కొలొస్సయులకు మరియు ఫిలేమోనుకు. నిజానికి పౌలుగారు మొదట కొలస్సీ పత్రిక, ఫిలిప్పీ
పత్రిక మరియు ఫిలేమాను పత్రికలను రాసి తుకికు ఒనేశీములకు ఇచ్చి, ఆ తర్వాత వారిని
మరో వారం రోజులు ఉండమని చెప్పారు. కారణం వారు వెళ్ళే త్రోవలో ఎఫెసీ పట్టణం ఉంది
గనుక తాను చనిపోయే ముందు వీరికి కూడా ఒక ఉత్తరం రాద్దామనుకుని ఈ ఉత్తరం రాసి
వారితోనే పంపించారు!
నిజం
చెప్పాలంటే ఈ పత్రికలు రాసేటప్పుడు పౌలుగారితో పాటుగా ఎవరున్నారు అంటే మొదటగా
తిమోతి గారు, తర్వాత తుకికు, ఒనేశీముతో
పాటుగా లూకాగారు, మార్కు అనే యోహాను గారు, ఫిలిప్పీ పట్టణపు బిషప్ ఎఫప్రొదితు,
కొలస్సీ సంఘ స్థాపకుడు ఎఫఫ్రా , విశ్వాశంలో తప్పిపోయిన దేమా . వీరంతా మొదట
ఉపవాసముండి పౌలుగారికి పరిచర్య చేస్తూ ఈ ఉత్తరాలు అన్నీ వ్రాయడానికి సహాయం చేశారు!
దైవాశీస్సులు!
(ఇంకాఉంది)
*ఎఫెసీ పత్రిక –రెండవ భాగం*
*ఉపోద్ఘాతం-2*
ఎఫెసీ 4:1—2
1. కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు
ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు,
2. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో
కూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,
దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును
గాక! ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రిక యొక్క ఉపోద్ఘాతము లేక ఈ పత్రిక వ్రాయడానికి
గల నేపధ్యము చూసుకుంటున్నాము!
ప్రశ్న: ఈ ఎఫెసీ పత్రిక పౌలుగారు ఎఫెసీయులకు వ్రాసిన మొదటి పత్రిక లేక ఏకైక
పత్రికా?
కానేకాదు!
ఇదే పత్రిక 3:2—3 వచనాల ప్రకారం దీనికంటే
ముందుగా ఎఫెసీయులకు ఒక పత్రిక రాశారు! అయితే ఆ పత్రిక మనకు లభ్యము కాలేదు!
2. మీకొరకు నాకనుగ్రహింపబడిన దేవుని కృపవిషయమైన యేర్పాటును
గూర్చి మీరు వినియున్నారు.
3. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనమువలన నాకు
తెలియపరచబడినదను సంగతినిగూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని.
కాబట్టి
ఇది ఎఫెసీయులకు పౌలుగారు వ్రాసిన రెండవ పత్రిక! పత్రికలలో మొత్తానికి అమూల్యమైన
పత్రిక! అయితే పౌలుగారు రాసిన మొదటి పత్రిక ఏమిటి? ఎందుకు రాశారు?
ఇది అర్ధం కావాలంటే
అసలు ఎఫెసీ పట్టణం యొక్క చరిత్ర అర్ధమయితే ఆ మొదటి పత్రిక ఎందుకు రాశారో మనకు చాలా
బాగా అర్ధమవుతుంది! కాబట్టి ఒకసారి ఎఫెసీ పట్టణం కోసం చరిత్ర నుండి చూసుకుందాం!
దీనికోసం అనేక శీర్షికలలో వివరించడం జరిగినది అయితే ఇప్పుడు మరోసారి సంధర్భం
కాబట్టి వివరంగా చూసుకుందాం!
ఎఫెసీ అనే పట్టణం
చిన్నాసియాలో పెద్ద పట్టణం! దీనికి ఆసియా వెలుగు అనే పేరుకూడా ఉంది. రోమా
పరిపాలనలో చిన్నాసియాకు ముఖ్యమైన రోమన్ కేంద్రాలయం ఇక్కడ ఉంది! ఇంకా చెప్పాలంటే
రోమా ప్రభుత్వం తమయొక్క సైనికుల విలాసాల కోసం ఈ పట్టణాన్ని వాడుకునేవారు! అందుకు
గాను ఈ పట్టణం రోమీయుల పాలనలో ఉన్నప్పటికీ ఈ పట్టణానికి స్వయం పరిపాలనా అధికారం
ఇచ్చారు! అంతేకాకుండా టర్కీ మరియు ఇతర చుట్టుప్రక్కల ఉన్న దేశాలలో ముఖ్యమైన
తీర్పులు ఈ పట్టణంలోనే జరిగేవి! అందుకు అనువైన తీర్పు తీర్చే పెద్ద కోర్టు ఇక్కడ
ఉండేది! అందుకే గవర్నర్ ఇక్కడకి మాటిమాటికి వచ్చి తీర్పులు తీర్చేవాడు!
అంతేకాకుండా ప్రతీ సంవత్సరం మే నెలలో ఒలింపిక్స్ మాదిరిగా ప్రపంచంలో అనేకదేశాలు
ఇక్కడికి వచ్చి ఆటలు ఆడేవారు! వాటిలో గ్లాడియేటర్ ఆట ఒకటి!
ఇంకా అక్కడ అర్తేమీ దేవి లేదా డయానా లేదా మహాదేవి
అనే ఒక దేవత గుడి ఉంది! ఇది చాలా పెద్ద గుడి! దీని పొడవు 450 అడుగులు లేక 140 మీటర్లు , వెడల్పు 250 అడుగులు
లేక 72 మీటర్లు, ఎత్తు 60 అడుగులు లేక 18 మీటర్లు! ఇది 127 చలువ రాతి స్తంభాల మీద
నిర్మించ బడింది! అందులో 36 స్తంభాలను బంగారంతో తాపించడం జరిగినది! ఆ గుడి క్రింద
భాగాన వెయ్యి గదులు ఉండేవి, వాటిలో వెయ్యిమంది ఆవివాహితులైన దేవదాసీలు అయిన
కన్యకలు ఉండేవారు! పూజ అనంతరం ఆ వెయ్యి గదులలోకి స్వదేశీయులు, విధేశీయులు పురుషులు
వెళ్ళి వారితో వ్యభిచారం చేసేవారు! అది ఎఫెసి, కొరింథీ, మాసిదోనియా ప్రాంతాలు అనగా
ఇప్పటి టర్కీ దేశము మరియు దాని చుట్టుపక్కల దేశాలలో చాలా ప్రసిద్ధి కలిగిన గుడి
మరియు చాలా ఆదాయం గల దేవత గుడి అన్నమాట! ఇంకా ఆకాలంలో ఏడు ప్రపంచ వింతలలో ఒక
ప్రపంచ వింత అన్నమాట! అయితే అంత ప్రసిద్ధి
చెందడానికి మరో కారణం ఏమిటంటే అక్కడ ఒక విచిత్రమైన ఆచారం ఉంది, ఈ దేవత పేరు సంతాన
దేవత! సంవత్సరంలో కొన్నిరోజులు పండుగ జరిగేది, అప్పుడు ఎవరైతే విదేశీ/పరజాతి పురుషులతో సంభోగం
చేస్తారో వారికి దేవత సంతాన ఫలం ఇస్తుంది! అందుకే పండుగకు లక్షలమంది వచ్చేవారు!
ఇంకా ఇలా విదేశీయుల వలన గర్భము ధరించి
పిల్లలను కంటారో వారికి దేవత నుండి ప్రత్యేకమైన వరాలు అభిషేకం కలుగుతుంది. వారికి
మోక్షంలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అనే ఒక పుకారు వ్యాపించింది. అందుకే ఆ గుడి
క్రింద భాగాన వెయ్యి గదులు కట్టారు . దేవతను పూజించి ఆ క్రిందన ఉన్న గదులలో విదేశీ
స్త్రీ పురుషులతో భయంకరమైన వ్యభిచారం
చేసేవారు! అందుకే విదేశీయులు ముఖ్యంగా పురుషులు ఈ గుడిని దర్శించుకోడానికి
విస్తారంగా వచ్చేవారు! ఆ ఎఫెసీ స్త్రీలకూ కూడా ఇది ఎంతో బాగుండేది.
ఇంకా అక్కడ 25000 మంది కూర్చోడానికి పెద్ద
స్టేడియం కూడా ఉంది! అంతేకాకుండా ఈ పట్టణం ఆ ప్రాంతంలో ఉన్న మాంత్రికులకు ముఖ్యమైన
స్థావరం గా ఉండేది!
ఇలా ఆ పట్టణము
ప్రసిద్ధి చెందటమే కాకుండా మంచి ధనవంతమైన పట్టణంగా మారిపోయింది! అంతేకాకుండా అది
ఆసియా ఐరోపా ఖండాలకు ముఖ్య కేంద్రంగా మారిపోయింది!
ఈ కారణం వలన పౌలుగారు ఈ పట్టణంలో సంఘం
స్థాపిస్తే ఇక్కడనుండి సువార్త అన్ని దేశాలలోనికి వ్యాపిస్తుంది అని భావించి అక్కడ
మొదట మూడునెలలు ఆ తర్వాత రెండున్నర సంవత్సరాలు
ఘనమైన పరిచర్య చేసి సంఘానికి తిమోతి గారిని బిషప్ గా పెట్టి వెళ్ళిపోయారు!
ఆ తర్వాత ఏమయ్యింది
అంటే విశ్వాసులు- వాటి పట్టణస్తులతో సంభంధాలు కట్ చేసేసారు! మేము మీరుచేసే పాపపు
పనులలో బాగస్తులము కాలేము అని చెప్పేశారు! కొంతకాలానికి అన్యులు ఏమన్నారు అంటే – మనందరం ఒక
ఒప్పందానికి వద్దాం! మీరు మీ దేవుణ్ణి పూజించుకోండి! మేము మా దేవతను
పూజించుకుంటాము! అయితే మీ పండుగలకు పెళ్లిళ్లకు ప్రార్ధనలకు మేము వస్తాము! మా
ఇంట్లో కధాకార్యక్రమాలు జరిగేటప్పుడు మీరు రండి, మేము మీ ఇంటికి వస్తాము. మీరు మా
ఇంట్లో భోజనం చెయ్యండి మేము మీ ఇంట్లో భోజనం చేస్తాము. అయితే మా పండుగలలో కూడా
మీరు వస్తూ ఉండండి కాని పూజ చెయ్యవద్దు. ఎంతైనా మీరు మేము బంధువులము కదా అన్నారు!
ఇదేదో బాగుంది అనుకుని సంఘము లోకముతో కలిసిపోయింది! కొన్నిరోజులకు లోకమే
సంఘములోనికి వచ్చేసింది! అన్యాచారాలు సంఘములోనికి వచ్చేసాయి! దేవుడూ కావాలి లోకమూ
కావాలి అన్నట్లు మారిపోయింది! నేటి రోజులలో మన భారతదేశంలో అన్యాచారాలు
సంఘాచారాలుగా ఎలా మారిపోయాయో, భారతదేశంలో ఉన్నాము కాబట్టి ఈ కట్టుబాట్లు ఉండాలి
అంటూ తాళి కట్టడం, వాస్తులు చూడటం, పందిరి వెయ్యడం, పసుపు వ్రాయడం, బొందులు
వెయ్యడం శ్రీమంతం చెయ్యడం లాంటి అన్యుల ఆచారాలు సంఘములోనికి వచ్చి అన్యాచారము
దేవుని ప్రార్ధనతో కలిసుకుని దానికి పాదిరిగారు సమక్షంలో ఎలా జరుగుతుందో అప్పుడు
కూడా అక్కడ అలాగే జరగటం మొదలుపెట్టింది! తిమోతి గారు ఏదో వింత చూస్తున్నట్లు
ఉన్నారు గాని ఖండించలేదు దీనిని! అందుకే ఈ విషయం తెలిసిన వెంటనే కొరడా పట్టుకుని
చీల్చినట్లు ఈ ఎఫెసీ పత్రిక రాసి, సంఘాన్ని గాడిలో పెట్టడం జరిగింది! ఉత్తరాన్ని
అందుకున్న ఎఫెసీ సంఘం పశ్చాత్తాప పడి లోకమునకు వేరై జీవించడం మొదలుపెట్టి నిజ
క్రైస్తవులుగా జీవించారు!
అయితే ఈ ఉత్తరం
ఇప్పుడు మనకు లభ్యంగా లేదు!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక –మూడవ భాగం*
*ఉపోద్ఘాతం-3*
ఎఫెసీ 4:1—2
1. కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు
ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు,
2. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో
కూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,
దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును
గాక! ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రిక యొక్క ఉపోద్ఘాతము లేక ఈ పత్రిక వ్రాయడానికి
గల నేపధ్యము చూసుకుంటున్నాము! ప్రియులారా! ఇక ఈ ఎఫెసీ పత్రిక వ్రాయడానికి గల
కారణాలు ఏమిటి?
మొదటిది: పౌలుగారు చెరసాలలో లేక గృహ నిర్భంధంలో ఉన్నారు!
కొద్దిరోజులలో చనిపోతానని గ్రహించి చనిపోయేముందు ఎఫెసీ సంఘానికి తుది పలుకులు
మరియు కొన్ని హెచ్చరికలు వ్రాయాలని అనుకుని ఈ ఉత్తరం రాశారు!
రెండు: నిజానికి పౌలుగారికి ఈ ఎఫెసీయులకు లేఖ వ్రాయాలని అనుకోలేదు.
అయితే చెరసాల పత్రికలు అని పేరుగాంచిన కొలస్సీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక మరియూ
ఫిలేమాను పత్రికను రాసి వాటిని పంపించే క్రమంలో అదే దారిలో ఎఫెసీ ప్రాంతం ఉంది
కాబట్టి దీనిని కూడా రాసి పంపించారు!
నిజం చెప్పాలంటే అసలు ఈ ఉత్తరాలు ఎందుకు మొదలు పెట్టారు అంటే – గతభాగంలో చెప్పిన విధంగా ఎఫెసీ
పట్టణంలో అర్తెమీ దేవి లేక డయానా దేవి పండుగకు కొలస్సీ పట్టణం నుండి వచ్చి, అక్కడ ఉన్న స్త్రీలతో వ్యభిచారం
చేయడానికి, ఇంకా ఆ పట్టణంలో వ్యాపారం చేయడానికి వచ్చిన ఎఫఫ్రా అనే ఒక వ్యక్తి-
ఒకరోజు తురన్ను అనే పాటశాల ప్రక్కనుండి వెళ్తూ పౌలుగారు చెబుతున్న సువార్త విని
మారుమనస్సు పశ్చాత్తాపం కలిగి పౌలుగారి పాదాల దగ్గర నేర్చుకుని తన ప్రాంతం వెళ్ళి-
వ్యాపారం మానేసి సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు ఈ ఎఫఫ్రా! అక్కడ ఒక బలమైన సంఘం
కట్టబడింది అతని ద్వారా! అయితే కొంతమంది అబద్దబోధకులు కొలస్సీ పట్టణానికి వచ్చి
లేనిపోని అబద్ద బోధలు చెబుతూ మీకు యేసుక్రీస్తు బోధలతో పాటుగా తత్వ శాస్త్రం
వేదాంత శాస్త్రం కూడా నేర్చుకోవాలి అని కొందరు, సున్నతి పొందుకోవాలి అని కొందరు
ఇంకా అనేక రకాలయిన తప్పుడు బోధలు వచ్చి సంఘాన్ని కలవర పెడితే దీనికోసం ఏమి చేయాలో
పాలుపోక తన గురువుగారి దగ్గరకు వెళ్ళి దీన్ని తేల్చుకోవాలి అనే ఉద్దేశంతో పౌలుగారి
కోసం ఆరాతీస్తే ఆయన రోమా పట్టణంలో గృహ నిర్భంధంలో ఉన్నారు అని తెలిసి, ఆయన యొద్దకు
వెళ్ళి సమస్యను చెప్పగా పౌలుగారు తిమోతి గారు ఎఫఫ్రా లూకా గారు ఒనేశీమూ ఇంకా
కొద్దిమంది భక్తులు ఉపవాస ముండి కొలస్సీ పత్రికను రాశారు! అదే సమయంలో ఫిలిప్పీ
పట్టణం నుండి ఎఫఫ్రోదితు కొన్ని చెడువార్తలు కొన్ని మంచి వార్తలు తీసుకుని
వచ్చారు! అప్పుడు ముందుగా కొలస్సీ సంఘానికి పత్రిక రాసి, తర్వాత ఫిలిప్పీ సంఘానికి
లేఖ రాసి, ఒనేశీముని తిరిగి తన యజమాని వద్దకు పంపడానికి అతనిని నాకోసం క్షమించు
అని సిఫారసు పత్రిక రాసి ఈ పత్రికలు తుకికు
చేతికి ఇచ్చి, చివరలో ఎఫెసీ సంఘం కూడా మార్గమధ్యలో ఉంది కాబట్టి చిట్టచివర
ఎఫెసీయులకు కూడా ఉత్తరం రాశారు!
అందుకే కొలస్సీ
పత్రికలో ఉన్నవే చాలావరకు ఎఫెసీ పతికలోనూ ఉంటాయి! అయితే గమనించవలసిన విషయం ఏమిటంటే
కొలస్సీ పత్రిక రాసిన కోణం వేరు! ఎఫెసీ పత్రికను రాసిన కోణం వేరు! ఒకే ఉద్దేశం-
సమాచారం రెండు విభిన్న కోణాలలో రాశారు! ఎందుకంటే కొలస్సీ పట్టణం పౌలుగారు ఎప్పుడు
వెళ్లలేదు! ఎన్నోసారులు వెళ్దామని ప్రయత్నించినా వెళ్లలేక పోయారు కాబట్టి మన
భారతదేశం లాంటి విగ్రహారాధనకు చెందిన ప్రజలకు మొదట క్రీస్తును పరిచయం చేసి- ఆయన
దైవత్వం నిరూపించి, చివరకు రక్షణ పొందిన మీరు ఎలా ఉండాలో అనేదానిని కొలస్సీ
పత్రికలో రాస్తే, ఒక రక్షణ పొంది ఆత్మీయ స్థితిలో ఉన్నతమైన స్తితిలో ఉన్న ఎఫెసీ
సంఘానికి ఈ సమాజంలోని సభ్యులు క్రీస్తు రక్షణ కార్యము ద్వారా దేవునిచేత
ఎన్నుకోబడి, దేవుని కుమారులు మరియు కుమార్తెలుగా దత్తత తీసుకోబడి, తన
కుమారునియందలి విశ్వాసం ద్వారా తండ్రి దగ్గరకు తీసుకురాబడ్డారు. ఈ విశ్వాసం ఉన్న
ప్రజలందరూ-యూదులు మరియు అన్యజనులు-వారి అతిక్రమములలో మరియు పాపాలలో చనిపోయారు,
కాని యేసుక్రీస్తు అనే వ్యక్తి కారణంగాను మరియు ఆయన యొక్క క్రియ కారణంగాను సజీవంగా
ఉన్నారు అనే సత్యాన్ని బోధించి మొదటి మూడు అధ్యాయాలలో, తర్వాత మూడు అధ్యాయాలలో
ఇంతగొప్ప రక్షణను మీరు పొందుకున్నారు కాబట్టి మీరు పిలువబడిన పిలుపుకి తగినట్లు
జీవించండి అంటూ ఎంతో ఘనమైన వర్తమానం రాసి-
చివరకు విశ్వాసులుగా ఉన్న మిమ్మును సాతాను మరియు లోకము అనేక రకాలుగా మిమ్మల్ని
శోధిస్తుంది కాబట్టి ఆ శోధనలు తట్టుకునే ఆయుధాలు దేవుడు మనకు ఇచ్చారు అంటూ ఆ
ఆయుధాలు వాడమని హితవు పలికి ముగించారు ఈ పత్రికను! కాబట్టి కొలస్సీ పత్రికను
ఆవిశ్వాసులు/ విగ్రహారాధికులు రక్షణ పొందే
కోణంలో వ్రాయగా, ఎఫెసీ పత్రిక విశ్వాస శ్రేష్టులు వారు పొందుకున్న రక్షణ భాగ్యం
ఎంత విలువైనదో చెప్పి దానికి తగినట్లు బ్రతకండి అని విశ్వాసుల కోణంలో వ్రాయడం
జరిగినది!
మరో ముఖ్యవిషయం ఏమిటంటే: *అయితే మనకు కొలస్సీ 4:16 లో ఈ పత్రిక అనగా
కొలస్సీ పత్రికను మీరు చదివించు కొన్న తర్వాత ఈ పత్రికను లవొదొకయకు పంపి అక్కడకూడా
చదివించండి, ఇంకా నేను లవొదొకయకి రాసిన పత్రికను మీరు తెప్పించుకుని మీరు దానిని
చదువుకోండి అని రాసినట్లు చూస్తాం! అయితే ఆ లవొదొకయ పత్రిక ఏదో కాదు, ఈ ఎఫెసీ
పత్రికయే అంటారు కొంతమంది బైబిల్ పండితులు! అలా అనడానికి కారణం ప్రాచీన ప్రతులలో ఈ
పత్రికకు హెడ్డింగు లేదు! .. సంఘానికి అని ఉంది! అయితే తుకికు గారు ఈ పత్రికను
తీసుకుని తిన్నగా ఎఫెసీ వారికి ఇచ్చారు గాబట్టి దీనిని ఎఫెసీ పత్రిక అన్నారు! మరి
లవొదొకయ అని ఎందుకన్నారు అంటే ఆ కాలంలో ఎఫెసీ పట్టణం లవొదొకయ ప్రాంతములో ఉండేది
కాబట్టి పౌలుగారు లవొదొకయ వారికి అన్నారు అంటారు ఈ పండితులు!* అంతేకాకుండా దీనికి
అనగా ఎఫెసీకి పశ్చిమాన 17 కి.మీ దూరంలో
కొలస్సీ పట్టణం, దక్షిణానికి 10 కి.మీ
హైరాపోలిస్. మరియు తూర్పున 160 కి.మీ
దూరంలో లవొదొకయ ఉంది .
చివరిగా: పౌలుగారు చెరసాలలో ఉన్న రోజులలో అనేకులైన అబద్దబోధకులు
అన్నీ దేశాలలోనూ బయలుదేరి పొట్టపోషణ కోసం ఎన్నెన్నో అబద్దబోధలు చేస్తూ సంఘాలను
కలవర పెట్టారు కాబట్టి అన్నీ సంఘాలకు ఉత్తరాలు వ్రాయాలని అనుకుని చెరసాల నుండి
ఉత్తరాలు రాశారు!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక –నాల్గవ భాగం*
*ఉపోద్ఘాతం-4*
ఎఫెసీ 4:1—2
1. కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు
ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు,
2. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో
కూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,
దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును
గాక! ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రిక యొక్క ఉపోద్ఘాతము లేక ఈ పత్రిక వ్రాయడానికి
గల నేపధ్యము చూసుకుంటున్నాము!
ఇక
మనము పౌలుగారు ఈ సంఘాన్ని ఎలా స్థాపించారు అనేదానిని చూసుకుందాం!
ఒకసారి
జాగ్రత్తగా గమనిస్తే ఆపో 16:6—10
6. ఆసియలో వాక్యము
చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంకపరచినందున, వారు ఫ్రుగియ గలతీయ ప్రదేశముల
ద్వారా వెళ్లిరి. ముసియ దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్లుటకు ప్రయత్నము చేసిరి గాని
7. యేసుయొక్క ఆత్మ వారిని వెళ్లనియ్యలేదు.
8. అంతటవారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి.
9. అప్పుడు మాసిదోనియ దేశస్థుడొకడు నిలిచినీవు మాసిదోనియకు
వచ్చి మాకు సహాయము చేయుమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము
కలిగెను.
10. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త
ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచియున్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే
మాసిదోనియకు బయలుదేరుటకు యత్నము చేసితివి
పై వచనాలలో పౌలుగారు ఆసియా
లేక చిన్నాసియా వెళ్దాం అని అనుకుంటే పరిశుద్ధాత్మ వారిని ఆటంక పరిచినట్లు, ఇంకా
తర్వాత వచనంలో యేసు యొక్క ఆత్మ వారిని వెళ్లనివ్వ లేదు అన్నట్లు చూడగలము! దీనిని
ఆధారంగా మతోన్మాదులు యేసుక్రీస్తు ఆసియా ఖండానికి దేవుడు కాదు అంటూ అంటూ ఉంటారు
గాని ఆ తర్వాత వచనాలలో అసలు ఎందుకు వెళ్లనివ్వలేదో గ్రహించరు! నిజానికి ఫిలిప్పీ
మరియు మాసిడోనియా ప్రాంతం వారు ఎక్కువగా ఆధ్యాత్మిక ఆకలితో ఉన్నారు కాబట్టి దేవుని
ప్రణాళిక మొదటగా మాసిడోనియా ప్రాంతాన్ని రక్షించి ఆ తర్వాత ఆసియాలో ఉన్న ఎఫెసీ
కొలస్సీ లవొదొకయ మొదలైన ప్రాంతాలను రక్షించాలని దేవుని ప్రణాళిక!
అయితే అపోస్తలుల కార్యములు 18:19 లో మొట్టమొదటగా పౌలుగారుతన రెండవ మిషనరీ
యాత్ర చివరలో క్రీ. శ. 50 లో కొరింథీ
పట్టణంలో సువార్త ప్రకటించిన తర్వాత అలా
సువార్త ప్రకటిస్తూ చివరికి ఆకుల ప్రిస్కిల్లా అనే దంపతులైన విశ్వాసులను
వెంటబెట్టుకుని సువార్త ప్రకటించి మొదటగా సువార్త భీజము వేశారు! అక్కడ సుమారుగా
మూడు నెలలు గాని మూడు వారాలు గాని ఉండి సంఘానికి నాంది పలికారు! గాని నిజానికి
అక్కడ సంఘాన్ని స్థాపించింది ఆకుల మరియు ప్రిస్కిల్లా!! వీరు క్రీ. శ. 52 లో
పౌలుగారు తన మూడవ మిషనరీ యాత్రకు మరలా ఎఫెసీ వచ్చేవరకు అక్కడే ఉండి సంఘాన్ని
ముందుకు నడిపించారు! అయితే క్రీ. శ. 51లో
అపోల్లో అనే బాప్తిస్మమిచ్చు యోహాను గారి
సేవకుడు శిష్యుడు సువార్త ప్రకటిస్తూ యోహాను గారు చెప్పిన మారుమనస్సు కోసరమైన
బాప్తిస్మం కోసం బోధిస్తూ ఇంకా యేసు క్రీస్తు దేవుని కుమారుడు అంటూ భోధిస్తూ
తిరుగుతూ ఉండగా ఆయన ఎఫెసీ పట్టణం వచ్చినప్పుడు ఈ అకుల ప్రిస్కిల్లా భక్తులు ఇద్దరు
అపోల్లో గారిని తన ఇంటికి రప్పించుకుని నిజమైన బోధ చేసి- యేసే రక్షకుడు అని
బోధించారు! అది తెలుసుకుని సుమారుగా సంవత్సరం పాటుగా అక్కడ పరిచర్య చేసి సంఘాన్ని
దృఢ పరిచారు!
ఆపో 18: 24. అలెక్సంద్రియవాడైన అపొల్లో అను ఒక యూదుడు
ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడునై యుండెను.
25. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు
తీవ్రపడి, యోహాను బాప్తిస్మము మాత్రమే తెలిసికొనిన వాడైనను, యేసును గూర్చిన
సంగతులు వివరముగా చెప్పి,
26. ప్రిస్కిల్ల అకులయు విని, అతని చేర్చుకొని
దేవునిమార్గము మరి పూర్తిగా అతనికి విశద పరచిరి.
27. తరువాత అతడు అకయకు పోదలచినప్పుడు అతనిని
చేర్చుకొనవలెనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. అతడక్కడికి
వచ్చి కృపచేత విశ్వసించినవారికి చాల సహాయము చేసెను.
28. యేసే క్రీస్తు అని లేఖనములద్వారా అతడు దృష్టాంతపరచి,
యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చెను.
ఇలా సంఘము స్తాపించబడిన తర్వాత 52 లో
మరలా పౌలుగారు మూడో మిషనరీ ప్రయాణంలో ఎఫెసీ వచ్చాక కొంతమంది విశ్వాసులు కనబడ్డారు
గాని వారు పరిశుద్ధాత్మ పొందుకోలేదు! మీరు పరిశుద్ధాత్మ పొందుకున్నారా అంటే ఆ పేరే
వినలేదు అన్నారు!
ఆపో 19: 1. అపొల్లో కొరింథులో నున్నప్పుడు జరిగినదేమనగా,
పౌలు పైప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చికొందరు శిష్యులను చూచిమీరు
విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? అని వారి నడుగగా
2. వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని
చెప్పిరి.
3. అప్పుడతడు ఆలాగైతే మీరు దేనినిబట్టి బాప్తిస్మము
పొందితిరని అడుగగా వారు యోహాను బాప్తిస్మమునుబట్టియే అని చెప్పిరి.
4. అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చువానియందు, అనగా యేసు
నందు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచు, మారుమనస్సు విషయమైన బాప్తిస్మమిచ్చెనని
చెప్పెను.
5. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము
పొందిరి.
6. తరువాత పౌలు వారిమీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారిమీదికి
వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాటలాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి.
7. వారందరు ఇంచుమించు పండ్రెండుగురు పురుషులు.
ఇది జరిగాక మూడు నెలలు సమాజ మందిరంలో ప్రసంగం చేశాక వ్యతిరేకించు వారు
ఎక్కువై పోతే అక్కడ తురన్ను అనే పాటశాలను అద్దెకు తీసుకుని రెండు సంవత్సరాలు
వాక్యము బోధించి ఆ ప్రాంతంలో మరిన్ని సంఘాలు కట్టారు! అప్పుడు ఇదే అధ్యాయం
ప్రకారం దేమెత్రి అనే కంసాలి వాడు ఎంతో
గొప్ప గొడవ పెట్టాడు! ఆ తర్వాత వెంటనే వెళ్లిపోలేదు సుమారుగా ఆరు నెలలు ఆ
ప్రాంతంలో సువార్త ప్రకటించి తర్వాత గ్రీసు దేశం వెళ్లిపోయారు! ఈ విధంగా సంఘము స్థాపించబడింది ఎఫెసీ పట్టణంలో!
*అయితే ఇక్కడ ముఖ్యముగా
గమనించవలసిన విషయం ఏమిటంటే అపొ 16:6--8 లో ఆసియా వెళ్లవద్దని ఆటంకపరచిన
పరిశుద్ధాత్ముడు, కొన్ని రోజుల తర్వాత అదే వ్యక్తిని సుమారు మూడు సంవత్సరాలు అదే
ఆసియాలో అదే పట్టణంలో ఉండేలా చేసి బలమైన సేవ జరిగించారు. ఇదీ దేవుని ప్రణాళిక!*
ఇక
ఈ పట్టణంలో పౌలుగారు ఉన్నప్పుడు జరిగిన రెండు ఘనమైన కార్యాలు తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి!
మొదటిది: *దయ్యాలు వదిలిపోవడం- రోగులు స్వస్థత పొందుట- అది
చూసి స్కెవ అను యాజకుని పిల్లలు దయ్యాలని వెల్లగొట్టటానికి ప్రయత్నిస్తే దయ్యం
వారిని గుండగా తన్ని దిగంబరులుగా పంపుట!*
19 :11. మరియు దేవుడు పౌలుచేత విశేషమైన అద్భుతములను
చేయించెను;
12. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లయినను
రోగులయొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడ వదలి పోయెను.
13. అప్పుడు దేశసంచారులును మాంత్రికులునైన కొందరు యూదులు
పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి, దయ్యములు
పట్టినవారిమీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి.
14. యూదుడైన స్కెవయను ఒక ప్రధానయాజకుని కుమారులు ఏడుగురు
ఆలాగు చేయుచుండిరి.
15. అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలునుకూడ
ఎరుగుదును, గాని మీరెవరని అడుగగా
16. ఆ దయ్యముపట్టినవాడు ఎగిరి, వారిమీద పడి, వారిలో
ఇద్దరిని లొంగదీసి గెలిచెను; అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ యింటనుండి
పారిపోయిరి.
17. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు
దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారికందరికి భయము కలిగెను గనుక ప్రభువైన యేసు
నామము ఘనపరచబడెను.
ఇక రెండవది : *మాంత్రికులు మారుమనస్సు పొంది వారి మాంత్రిక
పుస్తకాలు తగులబెట్టుట*:
19: 18. విశ్వసించినవారు అనేకులు వచ్చి, తాము చేసినవాటిని
తెలియజేసి యొప్పుకొనిరి.
19. మరియు మాంత్రిక విద్య అభ్యసించినవారు అనేకులు తమ
పుస్తకములు తెచ్చి, అందరియెదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల
యేబదివేల వెండి రూకలాయెను.
20. ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించెను.
అవును
దేవుడు గొప్పవాడు ఇంకా కరుణామయుడు! మాంత్రికులను కూడా ప్రేమిస్తాడు రక్షిస్తారు!
దయ్యాల కంటే గొప్పవాడు మనదేవుడు! దేవతలకు దేవుడు! ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న
నీవు దానికి తగినట్లు జీవించాలి తప్ప పోములు రక్షరేకులు కట్టుకో కూడదు!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక –5వ భాగం*
*ఉపోద్ఘాతం-5*
ఎఫెసీ 4:1—2
1. కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు
ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు,
2. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో
కూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,
దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును
గాక! ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రిక యొక్క ఉపోద్ఘాతము లేక ఈ పత్రిక వ్రాయడానికి
గల నేపధ్యము చూసుకున్నాము!
ఇక
మనము ఈ పత్రిక లోని ముఖ్యాంశాలు చూసుకుందాం!
*ఉద్దేశము*:- ఎఫెసు మరియు పరిసర ప్రాంతాలలో గల విశ్వాసులను క్రైస్తవ
విశ్వాసమందు స్థిరపరచుటకు , ఇంకా క్రీస్తు శరీరమైన సంఘము యొక్క గుణగణాలు ఎలా
ఉండాలి అనేవాటిని వివరంగా చెప్పారు .
*ముఖ్య ఉద్దేశ్యము*:- 1 కొరింథీ పత్రికవలే సంఘ సమస్యలను పరిష్కరించుటకు ఈ
పత్రిక వ్రాయబడలేదు. దానికి మారుగా
సంఘములను బలము పొందునట్లు చేసి, ప్రోత్సాహాపరచుటకు వ్రాయబడింది . రెండవ
కొరింథీయులకు మరియు గలతీయులకు పత్రికలు పౌలు యొక్క వ్యక్తిగత జీవితం గురించి లేదా
గ్రహీతల వ్యక్తిగత జీవితం గురించిన విషయాలతో నిండియున్నవి. అయితే, ఎఫెసీ పత్రిక
ఇందుకు పూర్తి భిన్నంగా పౌలుగారి యొక్క అత్యంత అధికారిక పత్రికలలో ఒకటిగా
నిలిచింది. ముఖ్యంగా ధర్మశాస్త్ర సంబంధమైన పితృపారంపర్యాచారములను పాటిస్తూ
కొట్టుకుపోయే సంఘాలకు గలతీ పత్రిక ముఖ్యమైన సూచనలను అందిస్తుండగా, సమాజంలో ఎటువంటి
ప్రత్యేకమైన సమస్యతో సంబంధం లేకుండా విశ్వాసము మరియు ఆచరణలో క్రైస్తవుడిగా
ఉండటమంటే అర్ధం ఏమిటో అనే దాని యొక్క ముఖ్య భాగం గూర్చి ఎఫెసీ పత్రిక
వ్యవహరిస్తుంది. ఎఫెసీయులకు 1:1 లో
‘ఎఫెసులో అనుపదము ప్రాచీన చేవ్రాత
ప్రతులలో ఆ పదము లేదని తెలిసికొనవచ్చును. ఇది ఎఫెసునందున్న వారి కొరకు మాత్రము
వ్రాయబడిన పత్రిక కాదనియు, అనేక సంఘములను మనస్సునందుంచుకొని వ్రాయబడినదనియు దీని
ద్వారా ఊహించగలము. కొలొస్సయులకు 4:16 లో చెప్పబడు “ లవొదికయకు వ్రాయబడిన పత్రిక
" యీ పత్రికయేనని పలువురు నమ్ముచున్నారు.
ముఖ్య వచనములు:- ఎఫెసీయులకు 2:8-10; ఎఫెసీయులకు 4:1-3
ఎఫెసీయులకు 2:8.
మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు,
దేవుని వరమే.
9. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ
వీలులేదు.
10. మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా
సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన
చేసిన పనియైయున్నాము.
ఎఫెసీయులకు 4:1.
కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ
కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు,
2. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో
కూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,
3. ప్రభువునుబట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు
కొనుచున్నాను.
ముఖ్య అధ్యాయము: ఎఫెసీ పత్రిక 6 వ అధ్యాయం
*గ్రంధ విభజన*:
పౌలుగారు ఈ ఎఫెసీ పత్రికను రెండు స్పష్టమైన భాగాలుగా
విభజించారు; మొదటి భాగంలో సువార్త
సత్యాలను, క్రీస్తుయేసు మర్మాలను చెప్పి
వర్తింపజేయడం, రెండవ భాగంలో ఆ మర్మాలు సువార్త సత్యాలను విశ్వాసుల క్రియల ద్వారా
మరియు జీవనశైలి ధ్వారా చూపించాలి అని చెప్పడం జరిగినది . యేసుక్రీస్తు మరణం
మరియు పునరుత్థానంలో తన ఉచితమైన కృపచేత పరిశుద్ధ సంఘాన్ని దేవుడు ఏర్పరచడం గురించి
పత్రిక యొక్క మొదటి మూడు అధ్యాయాలను వెచ్చించారు. ఈ సంఘములోని సభ్యులు క్రీస్తు
కార్యము ద్వారా దేవునిచేత ఎన్నుకోబడి, దేవుని కుమారులు మరియు కుమార్తెలుగా దత్తత
తీసుకోబడి, తన కుమారునియందలి విశ్వాసం ద్వారా తండ్రి దగ్గరకు తీసుకురాబడ్డారు. ఈ
విశ్వాసం ఉన్న ప్రజలందరూ- యూదులు మరియు అన్యజనులు- వారి అతిక్రమములలో మరియు
పాపాలలో చనిపోయారు, కాని యేసుక్రీస్తు అనే వ్యక్తి కారణంగాను మరియు ఆయన యొక్క
క్రియ కారణంగాను సజీవంగా ఉన్నారు.
పౌలుగారు
ఒక నిర్దిష్ట వేదాంత లేదా నైతిక సమస్యకు స్పందించలేదుగాని, ఎఫెసీయులను వారి
విశ్వాసంలో పరిపక్వం చెందమని ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్ సమస్యల నుండి వారిని
రక్షించాలని అతను కోరుకున్నారు. కాబట్టి పత్రిక యొక్క మొదటి భాగంలో లోతైన వేదాంత
సత్యాలను చెప్పిన తరువాత, పౌలుగారు తన ఉద్దేశ్యాన్ని స్పష్టం చేశారు : ఈ విశ్వాస
సమాజం దాని పరలోకపు పిలుపునకు అనుగుణంగా నడుస్తుందని అతను ఆశించారు (ఎఫెసీయులు
4:1). క్రైస్తవులు దేవునిమీదున్న విశ్వాసం ద్వారా అంగీకరించే వేదాంత వాస్తవాల
ఫలితంగా, సంఘము లోపల, ఇంటిలో మరియు లోకంలో వారి సంబంధాలలో అనేక అభ్యాసములను
అనుసరించాలి.
*
మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణవినయముతోను
సాత్వికముతోను నడుచుకొనవలెనని..*
దీనివలన
విశ్వాసులకు గల లాభమేమి?
ఎఫెసీయుల పత్రిక
విస్తృతమైన నీతి మరియు నైతిక ప్రవర్తనలను లక్ష్యంగా చేసుకుంది, మన పరలోకపు
పిలుపుకు అనుగుణంగా విశ్వాసులమైన మనం జీవిస్తున్నామా లేదా అని నిశ్చయించుకోవడానికి
వ్రాయబడింది . మనము రోజు రోజుకు, నెల నెలకు, సంవత్సరం సంవత్సరానికి మన
విశ్వాసాన్ని కొనసాగిస్తున్నప్పుడు, సుఖాన్ని పొందుకోవాలన్న శోధన ఎల్లప్పుడూ
ఉంటుంది. అయితే, పౌలుగారు క్రీస్తులో
దేవుని బహుమతిని మరియు మనకు లభించే ప్రయోజనాలను చాలా స్పష్టంగా సమర్పించారు , కాని
మన జీవితాలు ఆ వాస్తవికతను ప్రతిబింబిస్తున్నాయా అని మనల్ని మనం ప్రశ్నించుకోవటం
తప్ప మనమేమీ చేయలేము.
మీరు యేసుక్రీస్తునందు విశ్వాసములోనికి వచ్చినప్పటి నుండి మీ
క్రైస్తవ జీవితంలో ఎలా ఎదుగుచున్నారు? ఇనుముచేత ఇనుము పదునగునట్లు (సామెతలు 27:17)
ఆత్మీయ ఎదుగుదల ప్రధానంగా ఇతరులతో సహవాసంలో ఉంటేనే సంభవిస్తుందని ఎఫెసీ పత్రిక
చివరి సగం స్పష్టం చేస్తుంది. ఆత్మీయ యుద్ధంలో మీ క్రైస్తవ “నడక” (మరో మాటలో
చెప్పాలంటే, మీ దైనందిన జీవితం) ఐక్యత, పరిశుద్ధత, ప్రేమ, జ్ఞానం మరియు ఓర్పు
ద్వారా వర్ణించబడాలి.
పరిపక్వత విశ్వాసుల నైతిక జీవితాలలో ప్రయోజనాలను ఇస్తుంది, కానీ
అది దాన్ని మించి విస్తరిస్తుంది. పరిపక్వత వృద్ధిచెందటం వలన సమాజం మొత్తానికి
ప్రయోజనం చేకూరుతుంది. అలాగే క్రైస్తవులుగా మన జీవితాల్లో దేవుని పనికి మరింత
స్థిరమైన సాక్ష్యమిచ్చునట్లుగా నడిపిస్తుంది. అలాగే చరిత్రలో చాలా సమాజాలను
పీడించిన హానికరమైన విభజనలు మరియు తగాదాల నుండి మనలను కాపాడుతుంది.
గ్రంథ విభజన:-
(1)
క్రైస్తవుని పదవి అధ్యా. 1-3 వరకు.
(అ)
విమోచన కొరకై స్తోత్రము ఎఫెసీయులకు 1:1-14.
(ఆ)
ప్రత్యక్షత కొరకైన ప్రార్థన ఎఫెసీయులకు 1:15-23;
(ఇ)
క్రైస్తవుని స్థితి Eph,1,24-3,13; (ఈ) స్థిరపరచుటకైన ప్రార్థన
ఎఫెసీయులకు 3:14-21.
(2)
క్రైస్తవుని అనుచరణ జీవితము అధ్యా.3-6 వరకు
(అ)
సంమమందు ఐకమత్యము ఎఫెసీయులకు 4:1-16;
(ఆ)
జీవితమందు పరిశుద్ధత. Eph,4,17-5,21
;
(ఇ)
గృహమందును ఉద్యోగ స్థలమందును గల బాధ్యతలు. Eph,5,22-6,9;
(ఈ) యుద్ధమందు స్థిరముగా నిలచియుండుట.
ఎఫెసీయులకు 6:10-24.
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక –6వ భాగం*
ఎఫెసీ 1:1
1. దేవుని చిత్తమువలన క్రీస్తుయేసు అపొస్తలుడైన పౌలు
ఎఫెసులోనున్న పరిశుద్ధులును క్రీస్తుయేసునందు విశ్వాసులునైనవారికి శుభమని చెప్పి
వ్రాయునది…..
దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును
గాక! ప్రియ దైవజనమా! ఇంతవరకు మనము ఎఫెసీ పత్రిక యొక్క ఉపోద్ఘాతము లేక ఈ పత్రిక
వ్రాయడానికి గల నేపధ్యము చూసుకున్నాము! ఇక ఈ పత్రికను ధ్యానం చేసుకుందాం!
మొదటి వచనంలో అంటున్నారు: దేవుని చిత్తమువలన క్రీస్తుయేసు అపొస్తలుడైన పౌలు
ఎఫెసులోనున్న పరిశుద్ధులును క్రీస్తుయేసునందు విశ్వాసులునైనవారికి శుభమని చెప్పి
వ్రాయునది….. నిజానికి
జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ వచనం మూడు భాగాలుగా విభజించాలి!
మొదటిది: దేవుని చిత్తమువలన క్రీస్తుయేసు అపోస్టలుడు అయిన పౌలు
రెండు: ఎఫెసులో ఉన్న పరిశుద్దులు
మూడు: క్రీస్తుయేసు నందు విశ్వాసులయిన వారికి
మొదటి విషయం చూస్తే నేను దేవుని
చిత్తమువలన అపోస్తలుడయ్యాను అని అంటున్నారు 1 కొరింథీ పత్రికలోనూ ఇంకా గలతీ పత్రిక
మొత్తం లోనూ! నిజానికి చాలా పత్రికలలో ఇలాగే పరిచయం చేసుకున్నారు పౌలుగారు! నేను
దేవుని చిత్తము వలననే అపోస్తలుడుగా అయ్యాను! దేవుని చిత్తము వలననే యేసుక్రీస్తు
యొక్క అపోస్తలుడుగా ఉండటానికి నేను పిలువబడ్డాను అంటున్నారు! దీనికోసం మనం
విస్తారంగా గలతీపత్రిక ధ్యానాలు ధ్యానించేటప్పుడు ధ్యానంచేసుకున్నాము! నాకు
అపొస్తలత్వము దేవుని నుండే కలిగింది అని చెబుతున్నారు. ఇంకా ఇదే మొదటి కొరింథీ 15:9--10 లో అంటున్నారు నేను
అపోస్తలుడుగా పిలువబడటానికి అర్హుడను కాను ఎందుకంటే నేను సంఘమును హింసించాను.
అయినా గాని దేవుడు తన మహా అద్భుతమైన ప్రేమతో నన్ను ప్రేమించి నన్ను క్షమించి తన
అపోస్తలునిగా చేసుకున్నారు అని చెబుతున్నారు....
9. ఏలయనగా నేను అపొస్తలులందరిలో తక్కువవాడను దేవుని సంఘమును
హింసించినందున అపొస్తలుడనబడుటకు యోగ్యుడనుకాను.
10. అయినను నేనేమైయున్నానో అది దేవుని కృప వలననే
అయియున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని,
వారందరికంటె నేనెక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న
దేవుని కృపయే.
ఇదీ
పౌలుగారి ఆదర్శం! నేను గొప్ప అపోస్తలుడను అని గొప్పలు చెప్పుకోకుండా అపోస్తలుడను
అని పిలువబడటానికి నేను అర్హుడను కాను, అయినా నేను ఏమైయున్నానో అది దేవుని కృపవలనే
అయి ఉన్నాను అని వినయంతో సంఘానికి చెబుతున్నారు!
ఇక రెండవ విషయం చూసుకుంటే: ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులకు..
కొరింథీ పత్రిక
మొదలుపెట్టినప్పుడు కూడా ఇలాగే అన్నారు 1:2 లో.. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు
అంటూ అనగా క్రీస్తుయేసునందు పరిశుద్ధ పరచబడినవారై పరిశుద్దులుగా ఉండుటకు పిలువబడిన
వారికిని ఇంకా యేసుక్రీస్తు నామంలో ప్రతీస్థలంలో ప్రార్ధించు వారికిని అనగా
మనలాంటి వారికిని శుభమని చెప్పి వ్రాయునది అంటున్నారు! మొదటి వచనంలో తాను
యేసుక్రీస్తు యొక్క అపోస్తలునిగా ఉండుటకు పిలువబడిన పౌలును అంటూ తనకోసం
చెప్పుకుని, రెండో వచనంలో యేసుక్రీస్తునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్దులుగా
ఉండుటకు పిలువబడిన వారికి అంటూ విశ్వాసులకోసం రాస్తున్నారు! పౌలుగారు
యేసుక్రీస్తునందు అపోస్తలుడుగా ఉండటానికి పిలువబడితే కొరింథీ సంఘము లేక సార్వత్రిక
సంఘము క్రీస్తుయేసు నందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్దులుగా ఉండటానికి పిలువబడ్డారు
అని ఆత్మావేశుడై రాస్తున్నారు!
గమనించారా! సార్వత్రిక సంఘములో అంగములై ఉన్న ప్రతీ విశ్వాసి
మొదటిగా పరిశుద్ధ పరచబడ్డారు తర్వాత పరిశుద్దులుగా ఉండటానికి పిలువబడ్డారు!! ఈ
విషయం కోసం నేను రాసే ప్రతీ శీర్షికలోనూ తప్పకుండా రాస్తుంటాను! ఎందుకంటే విశ్వాసి
– క్రైస్తవుడు
లోకములోనుండి పిలుబడ్డాడు! ఎందుకోసం పిలువబడ్డాడు అంటే పరిశుద్దులుగా ఉండుటకోసం దేవుడే వారిని
పరిశుద్ధ పరిచారు కాబట్టి పరిశుద్దులుగా తమ జీవితాంతము జీవించాలని పరిశుద్దులుగా
ఉండటానికి పిలువబడ్డారు! కాబట్టి విశ్వాసి అన్యజనుల వలే మాట్లాడకూడదు, అన్యుల వలే ప్రవర్తించకూడదు, అన్యుల వలే వస్త్రధారణ
చేసుకోకూడదు, అన్యుల వలే మధ్యపానీయాలు తీసుకోకూడదు! అన్యజనుల వలే వారి ఆచార
వ్యవహారాలూ చేయనే కూడదు! నేను పరిశుద్ధుడను కాబట్టి మీరును పరిశుద్దులుగా ఉండాలి
అనే ఖండితమైన ఆజ్ఞ మనకు లేవీకాండంలో మాటిమాటికి కనిపిస్తుంది.
లేవీ
11:44-45; 20:26; 21:8;
అదే క్రొత్త నిబంధనలో కూడా దేవుడు చెప్పారు!
1 Peter(మొదటి పేతురు) 1:14,15,16
14. నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై
యుండుడని వ్రాయబడియున్నది.
15. కాగా మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞానదశలో మీ
కుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక,
16. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము
మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.
ప్రతీ శీర్షికలో దీనికోసం చెబుతున్నా
ప్రస్తుతం ఇది సంఘానికి అవసరం కాబట్టి మరోసారి దీనికోసం మీకు గుర్తుచేసి మిమ్మల్ని
కదిలించాలని ఆశిస్తున్నాను!
1).
మొదటగా పరిశుద్ద పరచబడిన వారై...
2)
పరిశుద్దులుగా ఉండుటకు పిలువబడిన వారు
పౌలుగారు అంటున్నారు దేవుని సువార్త నిమిత్తం
ప్రత్యేకించబడిన వాడను అని చెప్పుకుంటున్నారు రోమా పత్రిక 1:1లో.
పౌలుగారే కాదు ప్రియ దైవజనమా నీవునేను కూడా ప్రత్యేకించబడిన
జనము. మూర్కులైన ఈ తరమువారికి వేరై రక్షణ పొందమని చెప్పారు పరిశుద్ధాత్మ దేవుడు.
అపొస్తలుల 2:40; కాబట్టి మనము ప్రత్యేకించబడిన వారము కాబట్టి అన్యులు చేసినట్లు
మనము చేయకూడదు. అన్యాచారాలు మనం ఎంతమాత్రము చేయకూడదు. అన్యులు ప్రవర్తించినట్లు
మనం ఎంతమాత్రము ప్రవర్తించకూడదు! నీ మాట ప్రత్యేకముగా ఉండాలి. నీ చూపు పవిత్రముగా
ప్రత్యేకముగా ఉండాలి! నీ చేష్టలు ప్రత్యేకముగా ఉండాలి. అన్యులు త్రాగినట్లు నీవు
త్రాగకూడదు! అన్యులు చేసినట్లు నీవు వేషధారణ, వస్త్రధారణ చేయకూడదు. అన్నీ
ప్రత్యేకముగా ఉండాలి. దానియేలు, షడ్రక్, మేషాక్, అబెద్నేగోలు ప్రత్యేకముగా
జీవించారు. తద్వారా కష్టాలకు శ్రమలకు గురయ్యారు. అయినా సహించారు. గొప్ప అధికారులు
కాగలిగారు. ముఖ్యంగా రాజుచేతనే వీరు పూజిస్తూ, సేవిస్తున్న దేవుడు పూజార్హుడు అని
అనిపించగలిగారు! దానియేలు 3;
నీవు
ఎప్పుడైనా అలా నీ స్నేహితులతో, అన్యులతో నిజంగా మీ దేవుడు గొప్పవాడు—అని అనిపించగలిగావా??!!
పౌలుగారు
2 కొరింథీ 6:17 లో అంటున్నారు
17. కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా
ఉండుడి; అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. . . . .
కాబట్టి ప్రియ విశ్వాసి! నీవు ప్రత్యేకముగా
ఉండుటకు పిలువబడ్డావు కాబట్టి పాపిష్టి పనులు చేయకూడదు. మీరు రాజులైన యాజక
సమూహముగా పరిశుద్ధ జనముగా ఉండుటకు పిలువబడ్డారు.1పేతురు
2: 9
అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి
మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును,
రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.
అంతేకాకుండా వెండి బంగారముల వంటి వెలగల
వస్తువులచేత మీరు విమోచించ బడలేదు గాని క్రీస్తు రక్తముద్వారా విమోచించ బడ్డారు
1పేతురు 1:18; కాబట్టి ప్రత్యేకముగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా ఎందుకు
అంటే:
2) కారణం మనము దేవుని ప్రియులు అనగా పరిశుద్దులుగా ఉండుటకు
పిలువబడిన వారము: మొట్టమొదట దేవునికి ప్రియులుగా ఉండటానికి పిలువబడ్డాము. గతములో
హనోకు గారి జీవితమును ధ్యానం చేసినప్పుడు మనం దేవునికి ఇష్టులుగా లేక ప్రియులుగా
ఉండాలంటే ఏం చెయ్యాలి అనేది ధ్యానం చేసుకున్నాం. మొదటగా విశ్వాసం కలిగియుండాలని,
దేవునిమాటలకు సంపూర్ణ విధేయత కలిగియుండాలని, ఆయనకు లోబడి యుండాలని, మన మాటలు
దేవున్ని సంతోషపెట్టే విధముగా ఉండాలని, ఆయనకు ఆయాసం కలిగించే విషయాలు చేయకూడదు, అలాంటి
మాటలు మాట్లాడకూడదు అని, దేవునికి నీ ధనము, నీ సమయము ఇచ్చి ఘనపరచాలని, దేవుని పట్ల
నమ్మకముగా, ప్రేమగా ఉండాలని, నీ అంతరంగమంతా సౌందర్యముగా ఉండాలని,పరిశుద్దముగా
జీవించాలని , ఇంకా యదార్ధమైన ప్రవర్తన కలిగి, నీతిని అనుసరించి, హృదయపూర్వకముగా
నిజము పలకాలని ధ్యానం చేసుకున్నాం. అలా అయితేనే దేవునికి ఇష్టులుగా జీవించగలము!
ఇక్కడ పౌలుగారు
ఇంకా స్పష్టముగా దేవునికి ప్రియులు అనగా పరిశుద్దులుగా ఉండుటకు పిలువబడ్డారు అని
చెబుతున్నారు. గమనించాలి- దేవుడు చెప్పారు నేను పరిశుద్దుడను కాబట్టి మీరును
పరిశుద్దులుగా ఉండుడి అన్నారు. లేవీ 11:44-45; 20:26; 21:8;
అంతే తప్ప నన్ను కేవలం
నమ్ముకో! కేవలం నీటిలో నా పేరున మునిగేయ్, ఆ తరువాత నీవెలా ఉన్నా పర్వాలేదు.
వెంటనే నీకు గోల్డ్ మెడల్, నిత్యజీవము, పరలోక రాజ్యము ఇచ్చేస్తానని దేవుడు
చెప్పలేదు. మీరు పరిశుద్దులుగా ఉండాలి అంటున్నారు కారణం నేను పరిశుద్దుడను కనుక
మీరును పరిశుద్దులుగా ఉండాలి. అలా చేస్తే నేనుండే చోటున మీరును ఉంటారు. అదే
విషయాన్ని దావీదుగారు చెబుతున్నారు కీర్తన 15 లో
1. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు? నీ
పరిశుద్ధ పర్వతముమీద నివసింపదగిన వాడెవడు?
2. యథార్థమైన ప్రవర్తన గలిగి నీతి ననుసరించుచు హృదయపూర్వకముగా
నిజము పలుకువాడే. . . . .
ఇంకా అంటున్నారు
ప్రకటన గ్రంధంలో అపవిత్రమైనది ఏదీ ఆయన రాజ్యంలో ప్రవేశించలేదు! కాబట్టి ప్రియ
సహోదరీ/ సహోదరుడా! దేవుడు నీనుండి ఆశించేది కేవలం పరిశుద్దమైన జీవితం. నీ డబ్బులు,
ఇంకా మరేదో ఆశించడం లేదు. కేవలం పరిశుద్దమైన నీ హృదయం ఆయనకు కావాలి, అది ఆయనకు
మందిరమైపోవాలి,. ఆ మందిరములో దేవుడు నిత్యమూ ఉండాలని ఆశిస్తున్నారు. ఎప్పుడైతే
పరిశుద్దమైన జీవితం జీవిస్తావో, అప్పుడే దేవునికి ఇష్టుడుగా మారి, దేవుని రాజ్యంలో
ప్రవేశించగలవు. అంతేకాకుండా దేవుడు పరిశుద్దుడు కాబట్టి నీవు పరిశుద్దముగా జీవిస్తే
దేవుడే దిగివచ్చి, హనోకు గారితో దేవుడు ముచ్చటించినట్లు, ఆదాము అవ్వలతో దేవుడు
ముచ్చటించినట్లు దేవుడే దిగివచ్చి నీతో ముచ్చటిస్తూ నీతోనే ఉంటారు. నీతో నిత్యమూ
నివాసం చేస్తారు.
కాబట్టి ప్రియ దైవజనమా!
నీలో ఎటువంటి అపవిత్రత అయినా ఉంటే ఇప్పుడే దానిని విడిచిపెట్టు! ప్రభువా నన్ను
క్షమించమని అడిగి దేవుని పాదాలు పట్టుకో! ఇకను పాపము చేయకు! పరిశుద్ధమైన జీవితం
జీవించు! సాక్షార్ధమైన జీవితం, వాక్యానుసారమైన జీవితం, పేరుకు తగ్గట్టు జీవించు!
అప్పుడు దేవుడు నీతో అనునిత్యమూ సహవాసం చేయడానికి ఇష్టపడుచున్నారు!
మరి
నీవు సిద్ధమా?
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక –7వ భాగం*
ఎఫెసీ 1:1
1. దేవుని చిత్తమువలన క్రీస్తుయేసు అపొస్తలుడైన పౌలు
ఎఫెసులోనున్న పరిశుద్ధులును క్రీస్తుయేసునందు విశ్వాసులునైనవారికి శుభమని చెప్పి
వ్రాయునది…..
ప్రియులారా మనం ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం
ధ్యానం చేస్తున్నాము!
మొదటి
వచనంలో ఉన్న మూడు ముఖ్యమైన విషయాలు ధ్యానం చేసున్నాము!
మొదటిది: దేవుని చిత్తమువలన
క్రీస్తుయేసు అపోస్టలుడు అయిన పౌలు
రెండు: ఎఫెసులో ఉన్న పరిశుద్దులు
మూడు: క్రీస్తుయేసు నందు విశ్వాసులయిన వారికి
ఇక
మూడవ విషయం కోసం చూసుకుంటే: క్రీస్తుయేసు నందు విశ్వాసులయిన వారికి..
ఈ
వచనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ మాట
క్రీస్తులో మన లేక విశ్వాసుల ఐక్యతను
సూచిస్తున్నది. దీనికోసం ఎన్నో రిఫరెన్సులు వ్రాయబడ్డాయి ఈ పత్రికలో! ఇదే అధ్యాయం
3,7,12,13 వచనాలు ; ఇంకా ఎఫెసీయులకు 2:6-7, ఎఫెసీయులకు 2 :10, ఎఫెసీయులకు2 :13;
ఎఫెసీయులకు 3:6, ఎఫెసీయులకు 3:11, ఎఫెసీయులకు 3:21; ఎఫెసీయులకు 4:32; ఎఫెసీయులకు
6:10.
అందుకే
యేసుక్రీస్తు ప్రభులవారు ఈలోకమును విడిచిపెట్టి పరమునకు వెళ్లేముందు తండ్రికి
ప్రార్థన చేస్తున్నారు యోహాను పత్రికలో యోహాను
17:
20. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రీ,
నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున,
21. వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను
ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండ వలెనని
వారికొరకును ప్రార్థించుచున్నాను.
22. మనము ఏకమై యున్నలాగున, వారును ఏకమై యుండవలెనని నీవు
నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని.
23. వారియందు నేనును నా యందు నీవును ఉండుటవలన వారు
సంపూర్ణులుగా చేయబడి యేకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను
ప్రేమించినట్టే వారినికూడ ప్రేమించితివనియు, లోకము తెలిసికొనునట్లు నాకు
అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని.
ఇంకా
రోమా పత్రికలో అంటున్నారు: రోమీయులకు 6:
3. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన
మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా?
4. కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు
లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము
బాప్తిస్మమువలన మరణములో పాలు పొందుటకై ఆయనతోకూడ పాతిపెట్టబడితివిు.
5. మరియు ఆయన మరణముయొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యముగలవారమైన
యెడల, ఆయన పునరుత్థానముయొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యముగల వారమై యుందుము.
6. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాపశరీరము
నిరర్థకమగునట్లు, మన ప్రాచీన స్వభావము ఆయనతోకూడ సిలువవేయ బడెనని యెరుగుదుము.
7. చనిపోయినవాడు పాపవిముక్తుడని తీర్పుపొందియున్నాడు.
8. మనము క్రీస్తుతోకూడ చనిపోయిన యెడల, మృతులలోనుండి లేచిన
క్రీస్తు ఇకను చనిపోడనియు,
కాబట్టి విశ్వాసులంతా క్రీస్తులో ఐక్యముగా ఉన్నారు! అందరూ క్రీస్తు రక్తము
ద్వారా ఏకము చేయబడి సార్వత్రిక సంఘములో అంగములుగా క్రీస్తు అనే తన మందిరములో ఇంకా
క్రీస్తు శరీరములో ఏకముగా చేయబడ్డాము!
విశ్వాసులు “క్రీస్తులో” ఉన్నారు గనుకనే వారికి ప్రతి ఆధ్యాత్మికమైన దీవెన
లభించింది. ఆయనకు వేరుగా వారికి ఏమీ లేదు, వారు ఏమీ కాదు. “నమ్మకస్థులు”– అంటే క్రీస్తులో నమ్మకం మూలంగా
జీవించడం కొనసాగిస్తూ ఉన్నవారు అని అర్థం!
కాబట్టి ఇలాంటి విశ్వాసులకు అనగా క్రీస్తుయేసు నందు ఆయన రక్తము
ద్వారా కడుగబడి పరిశుద్దులుగా ఉండటానికి పిలువబడిన పరిశుద్ధ విశ్వాసులందరికి
శుభమని చెప్పి వ్రాయునది అంటున్నారు! మొదటి కొరింథీ పత్రికలో అయితే ఇంకా
ముందుకువెళ్ళి విశ్వాసులుగా ఉండటానికి పిలువబడి ఆయన నామమును బట్టి ప్రార్ధించువారి
కందరికి శుభములు అంటున్నారు!
ఇక్కడ మరో విషయం కనిపిస్తుంది! యేసుక్రీస్తు ప్రభులవారు తాను
సువార్తపరిచర్యకు శిష్యులను రెండుసార్లు పంపినప్పుడు అంటున్నారు మీరు ఏ గృహానికి
లేక గ్రామానికి వెళ్తారో ఆ గృహానికి/ గ్రామానికి శుభము అని చెప్పమన్నారు..
పౌలుగారు
యేసుక్రీస్తుప్రభులవారు నేర్పించిన క్రమము ప్రకారము తన లేఖలలో మొట్టమొదట శుభములు
చెప్పి ఆ తర్వాత విషయం రాస్తున్నారు!!
అలాగే
ఈ పత్రిక ధ్యానం చేస్తున్న తెలుగు క్రైస్తవ సమాజం మొత్తానికి నేను కూడా చెప్పేది
ఏమిటంటే మీ అందరికీ యేసుక్రీస్తు నామమున
శుభములు కలుగును గాక!!
ఆమెన్!
*ఎఫెసీ పత్రిక
–8వ భాగం*
ఎఫెసీ 1:3
మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు
స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోకవిషయములలో ఆత్మసంబంధమైన ప్రతి
ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.
ప్రియులారా మనం ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం
ధ్యానం చేస్తున్నాము!
ఇక
మూడో వచనంలో అంటున్నారు: మన ప్రభువైన
యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతించబడును గాక అంటున్నారు! పౌలుగారి
పత్రికలలో అన్నింటిలో తప్పకుండా దేవునికి స్తుతి చెప్పకుండా ఏ పత్రిక వ్రాయరు!
ఇక్కడ కూడా దేవునికి స్తుతులు చెబుతున్నారు!
కీర్తనల గ్రంధంలో స్తుతిచేయుట యధార్ధ వంతులకు శ్రేయస్కరం అంటున్నారు!
కీర్తనల గ్రంథము 33
నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి.
స్తుతిచేయుట యథార్థవంతులకు శోభస్కరము.
అందుకే
ఎల్లప్పుడూ దేవునికి స్తుతియాగం చేయమంటున్నారు! దావీదు గారు కేవలం చెప్పి వదిలేయడం
లేదు! తనకు కష్టమొచ్చి నప్పుడు స్తుతించారు! ఆనందం వచ్చినప్పుడు స్తుతించారు పాటలు
పాడారు! తన జీవితమంతా స్తుతిస్తూనే ఉన్నారు!
ఈ
కీర్తన మొత్తం స్తుతులే ఉంటాయి! ఇంకా కీర్తనల గ్రంధం మొత్తం దేవునికి స్తుతులే
ఉంటాయి! కీర్తనల గ్రంథము 7:17; కీర్తనల గ్రంథము 8:2; కీర్తనల గ్రంథము 9:1; కీర్తనల
గ్రంథము 16:7; కీర్తనల గ్రంథము 18:3; కీర్తనల గ్రంథము 42:5; కీర్తనల గ్రంథము
100:4; కీర్తనల గ్రంథము 150:6;
ఇంకా
కీర్తనల గ్రంధంలోనే కాదు అనేక గ్రంధాలలో స్తుతులు చెల్లించమని చెబుతున్నారు: యెషయా 12:1; మత్తయి 5:16; మత్తయి 11:25; లూకా
1:68; రోమీయులకు 15:7 రోమీయులకు 15:11; 2 కోరింథీయులకు 1:3; ఎఫెసీయులకు 1:3
ఎఫెసీయులకు 1:6 ఎఫెసీయులకు 1:12 ఎఫెసీయులకు 1:14; ప్రకటన గ్రంథం 5:12-13; ప్రకటన
గ్రంథం 19:5. ఆదికాండము 24:27; నిర్గమకాండము 15:2; లేవీయకాండము 19:24;
ద్వితీయోపదేశకాండము 8:10; ద్వితీయోపదేశకాండము 32:3; 1 దినవృత్తాంతములు 16:4 1
దినవృత్తాంతములు 16:9 1 దినవృత్తాంతములు 16:25 కూడా చూడండి.
నిజానికి తనకు స్తుతులు కరువయ్యాయని దేవుడు మనలను
స్తుతించాలని ఆజ్ఞాపించలేదు. అందరూ తన గురించి గొప్పగా చెప్పుకోవాలని కూడా
దేవుడు తాపత్రయ పడడానికి ఆయనేమీ మనిషి
కాదు. ఆయన తనను స్తుతించాలని ఆజ్ఞ ఇస్తున్నాడంటే నిజానికి మనల్ని ఆయనలో ఆనందిస్తూ
ఆ ఆనందాన్ని వెల్లడి చేయాలని చెపుతున్నారన్న మాట. స్తుతి అంటే మాటలతో వెల్లడి
చేయబడిన మెప్పు మరియు ఆమోదం. మనుషులు తమకు
ఏవైతే మంచివిగా, అందమైనవిగా, శక్తివంతమైనవిగా, అర్థవంతమైనవిగా అనిపిస్తాయో వాటిని
పొగడుతారు మామూలుగా . తమకు యోగ్యంగా అనిపించినదానిలో తమ సంతోషాన్ని వెల్లడిస్తారు.
అతి ఉన్నతమైన మంచితనం, అందం, బలప్రభావాలు, అర్థం దేవునిలోనే ఉన్నాయి. ఈ ప్రపంచంలో
గల వస్తువులు, మనుషులు జీవులన్నిటిలో అందరికంటే మిన్నగా స్తుతికి పాత్రుడు ఆయన.
మనం దీన్ని గుర్తించాలని ఆయన ఉద్దేశం. ఆయన కోసం కాదు, మన మేలుకే. మనం అంతటిలో,
అందరిలోకెల్లా స్తుతికి పాత్రుడైనవాణ్ణి గుర్తించి స్తుతించేవారమై ఉండాలని ఆయన
ఆజ్ఞాపిస్తున్నారు. దేవుణ్ణి స్తుతించడం అంటే ఆయన యోగ్యతను గమనించడమే. అంటే, అతి
శ్రేష్ఠమైన, ఉన్నతమైన దానిలో మన ఆనందాన్ని కనుక్కోవడమన్నమాట. ఇలా చెయ్యడం మనకు
సమంజసం, తగినది (1 వ). తమ స్తుతికి తగని అనేక రకాల వస్తువులనూ వ్యక్తులనూ మనుషులు
స్తుతిస్తారు. అయితే దేవుణ్ణి ఎరిగినవారు స్తుతికి పాత్రుడైన ఆయన్నే స్తుతించడం
తగిన పని కాదా.
మూర్ఖులు, తృప్తి లేనివారు,
స్వార్థపరులు, నమ్మకం లేనివారు, నైతికంగా, ఆధ్యాత్మికంగా అంధులు. ఆత్మలో, సత్యంలో
దేవుణ్ణి ఆరాధించరు. వినయ మనస్కులు, న్యాయవంతులు, జ్ఞానప్రకాశం పొందినవారు,
సత్యాన్ని గ్రహించినవారు అలా చెయ్యగలరు, చేస్తారు.
కొన్ని
ఉదాహరణలు చూసుకుంటే
దుర్మార్గులు
తమ లజ్జాకరమైన విషయాలను బట్టి ఆనందిస్తూ లోక సంబంధమైనవాటినే పొగడుతూ ఉంటారు
(ఫిలిప్పీయులకు 3:19).
న్యాయవంతులైతే
దేవునిలోను తమ రక్షకుడైన క్రీస్తులోను ఆనందిస్తారు (1 కోరింథీయులకు 1:31; 2
కోరింథీయులకు 10:17; గలతియులకు 6:14; 1 తిమోతికి 1:17).
దేవుణ్ణి
స్తుతించకపోవడం, కృతజ్ఞతలు చెప్పకపోవడం నిందాపాత్రం. ఇది మనిషి స్వభావంలోనే ఒక
లోపాన్ని చూపెడుతుంది. ఈ లోపం తన ప్రజలలో ఉండకూడదని దేవుని ఉద్దేశం. స్తోత్రాలు
చెల్లించడం, పాటలు పాడడం, దేవుణ్ణి కీర్తించడం ఇవన్నీ వారికి స్వతహాగా వస్తాయి. ఇవి
వారి కొత్త స్వభావాన్ని సూచిస్తాయి. దేవుణ్ణి బాగా ఎరిగినవారు, అందరికంటే ఎక్కువ
జ్ఞానప్రకాశం, వినయం ఉన్నవారు ఆయన్ను ఎక్కువగా స్తుతిస్తారు.
148 వ కీర్తనలో ఎవరెవరు స్తుతించాలో ఉంది! 150 వ కీర్తనలో
ఎలా స్తుతించాలి ఏఏ వాధ్యములతో స్తుతించాలో వ్రాయబడి ఉంది! 148....
కీర్తనలు 148:1
యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి
ఉన్నతస్థలముల నివాసులారా, ఆయనను స్తుతించుడి
కీర్తనలు 148:2
ఆయన దూతలారా, మీరందరు ఆయనను స్తుతించుడి ఆయన సైన్యములారా,
మీరందరు ఆయనను స్తుతించుడి
కీర్తనలు 148:3
సూర్యచంద్రులారా, ఆయనను స్తుతించుడి కాంతిగల నక్షత్రములారా,
మీరందరు ఆయనను స్తుతించుడి.
కీర్తనలు 148:4
పరమాకాశములారా, ఆకాశముపైనున్న జలములారా, ఆయనను స్తుతించుడి.
కీర్తనలు 148:5
యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను అవి యెహోవా నామమును
స్తుతించును గాక
కీర్తనలు 148:7
భూమి మీదనున్న మకరములారా, అగాధజలములారా, యెహోవాను
స్తుతించుడి
కీర్తనలు 148:8
అగ్ని వడగండ్లారా, హిమమా, ఆవిరీ, ఆయన ఆజ్ఞను నెరవేర్చు
తుపానూ,
కీర్తనలు 148:9
పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన
దేవదారు వృక్షము లారా,
కీర్తనలు 148:10
మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో
ఎగురు పక్షు లారా,
కీర్తనలు 148:11
భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద నున్న అధిపతులారా,
సమస్త న్యాయాధి పతులారా, యెహోవాను స్తుతించుడి.
కీర్తనలు 148:12
యౌవనులు కన్యలు వృద్ధులు బాలురు
కీర్తనలు 148:13
అందరును యెహోవా నామమును స్తుతించుదురు గాక ఆయన నామము
మహోన్నతమైన నామము ఆయన ప్రభావము భూమ్యాకాశములకు పైగా నున్నది.
150...
కీర్తనలు 150:1
యెహోవాను స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని
స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధిచేయు ఆకాశవిశాలమందు ఆయనను స్తుతించుడి.
కీర్తనలు 150:2
ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను
స్తుతించుడి. ఆయన మహా ప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి.
కీర్తనలు 150:3
బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోను సితారాతోను
ఆయనను స్తుతించుడి.
కీర్తనలు 150:4
తంబురతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి. తంతివాద్యములతోను
పిల్లనగ్రోవితోను ఆయనను స్తుతించుడి.
కీర్తనలు 150:5
మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీరధ్వనిగల తాళములతో
ఆయనను స్తుతించుడి.
కీర్తనలు 150:6
సకలప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక యెహోవాను
స్తుతించుడి.
కాబట్టి
నిజదేవుడైన ఆ పరాత్పరునీ స్తుతిద్దామా!!!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక –9వ భాగం*
ఎఫెసీ 1:3
మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు
స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోకవిషయములలో ఆత్మసంబంధమైన ప్రతి
ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.
ప్రియులారా మనం ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం
ధ్యానం చేస్తున్నాము!
ఇక
మూడో వచనంలో అంటున్నారు: మన ప్రభువైన
యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతించబడును గాక అంటూ ఆయన క్రీస్తునందు
పరలోక విషయాలలో ఆత్మ సంబంధమైన ప్రతీ ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను అంటున్నారు!
దీనికోసం ఇంకా లోతుగా ఆలోచిస్తే
క్రీస్తునందు పరలోక విషయాలలో ఆత్మ సంబంధమైన ప్రతీ ఆశీర్వాదాన్ని మనకు దేవుడు
అనుగ్రహించారు అంటున్నారు! పరలోక విషయాలలో అనగా ఆధ్యాత్మిక విషయాలు అనికూడా అర్ధం
వస్తుంది! ఇంకా పరలోకంలో ఉన్న అత్యున్నతమైన ప్రతీ ఈవిలో దేవుడు మనకు పాలుపొందులు
ఇచ్చారు అని కూడా అర్ధం వస్తుంది! ఎలా అంటే యేసుక్రీస్తు ప్రభులవారు ఎక్కడ
ఉన్నారు? పరలోకంలో! కాబట్టి ఇప్పుడు ఆయన పరలోక సంబంధమైన ప్రతీ విషయాలను మేలైన
ఈవులు అనుభవిస్తున్నారు! మనము బాప్తిస్మము ద్వారా ఆత్మను పొందుకుని ఆయనలో ఐక్యమై
ఉన్నాము గనుక మనము కూడా ఇప్పుడు ఆ పరలోక సంబంధమైన విషయాలతో క్రీస్తుతో కూడా
పాలుపొందులు గలవారమై ఉన్నాము! ఇది పరలోకంలో దేవుడు నివసించే స్థలం అన్నది
స్పష్టమే! దీనికి మరొక అర్థం కూడా ఉంది (ఎఫెసీయులకు
6:12). దేవుడు పరిపాలించే అదృశ్యమైన ఆత్మల లోకం, సైతాను ఆయన పాలనను వ్యతిరేకిస్తూ
ఉన్న లోకం అని కూడా దీనికి అర్థం. అక్కడ దేవుడు అత్యున్నతమైన పరలోకంలో ఉన్నారు; ఆ
ఆత్మల లోకంలో సైతాను, పిశాచాలు అట్టడుగున ఉంటూ విశ్వాసులతో పోరాడుతున్నారు. దేవుని
దృష్టిలో భూమి మీద ఉన్న విశ్వాసులు ఇప్పుడే పరమ స్థలాల్లో కూడా ఉన్నారు
(ఎఫెసీయులకు 2:6), ఎందుకంటే వారి నాయకుడు, ప్రతినిధి అక్కడ ఉన్నాడు (ఎఫెసీయులకు
1:22), వారు “ఆయనలో” ఉన్నారు. అదే సమయంలో శరీరంలోనైతే ఇంకా భూమి మీదే ఉండి అదృశ్య
లోకంలో ఉన్న దురాత్మలతో పోరాడుతున్నారు. “ఆధ్యాత్మిక ఆశీస్సులతో”– ఇవి ఆధ్యాత్మిక లోకం దీవెనలు. అంటే
మనకు పాపవిముక్తి ఇచ్చి, మనల్ని సంరక్షిస్తూ, ఆధ్యాత్మికమైనవారుగా చేస్తూ,
క్రీస్తుకోసం జీవించేలా సామర్థ్యం ఇస్తూ, చివరికి ఆయనతో శాశ్వతంగా ఉండేలా మనల్ని
పరలోకానికి తీసుకువెళ్ళే దేవుని కృప సంబంధమైన దీవెనలు అనుభవించేలా చేశారు.
దేవుడు విశ్వాసులను ఇతర విధాలుగా – అంటే శారీరికంగా, మానసికంగా,
ఆర్థికంగా – దీవించడని పౌలుగారు ఇక్కడ చెప్పడం లేదు. కానీ ఇక్కడ అతడు నొక్కి
చెప్పేది ఆ సంగతుల గురించి కాదు. ఈ ఉత్తరంలో దేవుడు విశ్వాసులకు ఇచ్చే కొన్ని
ఆధ్యాత్మికమైన దీవెనల గురించి చెప్పారు – ఎఫెసీయులకు 2:5-6, ఎఫెసీయులకు 2:10,
ఎఫెసీయులకు 2:13-19, ఎఫెసీయులకు 2:22; ఎఫెసీయులకు 3:16-17, ఎఫెసీయులకు 3:20;
ఎఫెసీయులకు 4:7, ఎఫెసీయులకు 4:13, ఎఫెసీయులకు 4:24; ఎఫెసీయులకు 5:8, ఎఫెసీయులకు
5:18, ఎఫెసీయులకు 5:25-27; ఎఫెసీయులకు 6:10-13. “
గతభాగాలులో చూసుకున్నాము! కొలస్సీ
పత్రిక మరియు ఎఫెసీ పత్రికలో గల అంశాలు చాలావరకు ఒకేలా ఉంటాయి! కాబట్టి ఇప్పుడు
కొలస్సీ పత్రికలో ఏమని చెప్పారో ఒకసారి ధ్యానం చేద్దాం!
కొలస్సీయులకు 1: 3
పరలోకమందు మీకొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి,
క్రీస్తుయేసునందు మీకు కలిగియున్న విశ్వాసమును గూర్చియు, పరిశుద్ధులందరి మీద
మీకున్న ప్రేమను గూర్చియు, మేము విని యెల్లప్పుడు మీ నిమిత్తము ప్రార్థనచేయుచు,. .
ఇక ఈ
వచనంలో కొలస్సీ సంఘానికున్న మూడు మంచి లక్షణాలను ఎత్తి రాస్తున్నారు.
అందుకు దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నారు. అవి:
1). పరలోకమందు ఉంచబడిన నిరీక్షణ,
2) క్రీస్తుయేసు నందు కలిగియున్న విశ్వాసము, 3) పరిశుద్దులందరి మీద
ఉన్న ప్రేమ!!
ఈ మూడు లక్షణాలు వారికి ఉన్నాయి. వారికే కాదు రక్షంచబడిన ప్రతీ
విశ్వాసికీ ఉండాలి!
*పరలోకమందు మీ కొరకు
ఉంచబడిన నిరీక్షణ*: వీరి నిరీక్షణ పరలోకంలో ఉంది. ఈ నిరీక్షణ కోసం ధ్యానం
చేస్తే, పరిశుద్ధ గ్రంధంలో నిరీక్షణ కోసం చాలా రిఫరెన్సులున్నాయి. కొన్నింటిని
మాత్రం చూద్దాం!
నిరీక్షణ అంటే
ఎదురుచూడటం అని అర్ధం వస్తుంది. Waiting with
Trust/Hope అనొచ్చు! బైబిల్ లో అనేకచోట్ల విశ్వాసానికి బదులుగా/
సర్వనామంగా నిరీక్షణ వాడారు. కాబట్టి నిరీక్షణ- విశ్వాసానికి దగ్గరగా ఉంటుంది.
బైబిల్ గ్రంధంలో అనేకమందికి అనేకరకాలైన నిరీక్షణలు ఉన్నట్లు చూస్తాం!
ఇక యోబుగారి
నిరీక్షణ: తన ఆస్తి, అంతస్తు, పిల్లలు అంతా ఒక్కరోజే పోగొట్టుకొన్నా,దేహానికి
కుష్టువ్యాది వంటి చర్మవ్యాధి సోకినా అంటున్నారు: యోబు 20:25-27 *అయితే నా విమోచకుడు సజీవుడనియు, నా చర్మము
చీకిపోయిన తర్వాత నేను దేవుణ్ణి చూస్తాను! ఎవరో కాదు, నేనే, నాకన్నులారా చూస్తాను*
అంటున్నారు! ఆహా! ఎంత గొప్ప నిరీక్షణ!!!
ఇక దావీదు గారిని చూస్తే
: నా నిరీక్షణ నీవే! నీవే నా నిరీక్షణకు ఆధారం, నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు?
దేవుని మీద నిరీక్షణ యుంచుము అంటున్నారు. చివరకు మరణ పర్యంతము నిరీక్షణ
కలిగియున్నట్లు చూస్తున్నాము. కీర్తనలు 42:5,11; 43:5; 62:5; 119:49.
ఇక పౌలుగారి నిరీక్షణ అమూల్యమైనది. ఆయనకు మూడు
నిరీక్షణలున్నాయి.
1). అపోస్తలుల కార్యముల ప్రకారం ముఖ్యంగా 26 : ఏ విధముగానైన మృతుల
పునరుత్థానం కోసం ఎదురు చూస్తున్నారు! యేసుప్రభులవారు ఎలా చనిపోయి తిరిగి లేచారో,
అలాగే ఆయనను విశ్వసించిన వారు కూడా ఒకరోజు తిరిగి పునరుత్థానం అవుతారు, లేచి
ప్రభువును ఎదుర్కొంటారు. అలాగే పౌలుగారు ఒకరోజు తిరిగిలేస్తారు అని ఆయన నిరీక్షణ!
అందుకోసమే ఎన్నో కష్టాలు పడ్డారు!
2) మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు తుదముట్టించితిని, విశ్వాసం
కాపాడుకొంటిని, ఇక నాకు నీతికిరీటము ఉంచబడింది అని గర్వంగా, ధైర్యంగా చెప్పగలుగుతున్నారు!
2 తిమోతి 4:7. నాకొరకు నీతి కిరీటం ఉంది అంటున్నారు. అదీ నిరీక్షణ! చూసారా ఎంత
ధైర్యమో? మరో దగ్గర నేను క్రీస్తుని పోలి నడచుకొనిన ప్రకారం మీరునూ, క్రీస్తుని
పోలి నడచుకోండి అనడం లేదు! నన్నుపోలి నడచుకోండి అని ధైర్యంగా చెబుతున్నారు. 1
కొరింథీ 11:1; ఇలా ధైర్యంగా చెప్పగలవా?
బైబిల్లో
ఇలాంటి challenging
decelerations రెండే ఉన్నాయి. మొదటిది యేసయ్య: నాలో పాపమున్నదని
మీలో ఎవడు స్తాపించగలడు అని చాలెంజ్ చేసారు యోహాను 8:46. ఇది రెండవది!
పౌలుగారు
మృతులలో పునరుత్థానం కోసం నిరీక్షణ కలిగియున్నారు. ఇంకా అంటున్నారు: ఈ నిరీక్షణ
మనలను సిగ్గుపరచదు!! రోమా 5:5;
ఇక ఇలాంటి నిరీక్షణనే కొలస్సీయులు కూడా
కలిగియున్నారు. అది పరలోక సంభందమైన నిరీక్షణ. ఈ నిరీక్షణకు పౌలుగారు మంచి పేరు
పెట్టారు.
3) శుభప్రదమైన
నిరీక్షణ: తీతుకు 2:12-13 లో చూసుకోవచ్చు దీనికోసం. శుభప్రదమైన నిరీక్షణ అనగా *మహా
దేవుడును, మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడటం*.
అదే శుభప్రదమైన నిరీక్షణ! ఇక్కడ మనం చూస్తే పౌలుగారు యేసయ్యను దేవుడు అనకుండా
*మహాదేవుడు* అంటున్నారు (GREAT GOD). ఆ మహాదేవుని మహిమకోసం మనం నిరీక్షించాలి. ఒకరోజు ఆ మహాదేవుడు
రాబోతున్నారు, కడబూర మ్రోగగానే ఎత్తబడి, ఆ దేవునిని కలుసుకుంటాము. తేజోవాసులైన
పరిశుద్దుల సమూహముతో కలసి, ఆ రాజు పెండ్లి విందులో పాల్గొంటాము. ఇక పరలోకం
వెళ్తాము. అక్కడ అబ్రహాము గారిని చూస్తాము, మోషే, ఏలీయా, ఎలీషా, దావీదు, దానియేలు
గార్ల వంటి మహానీయలతో కలసి తిరుగుతాము. వారిని ఇంటర్యూ చేస్తాము. ఇదే శుభప్రదమైన
నిరీక్షణ!
పనికిమాలిన చెత్త
బంగారం కోసం ప్రాకులాడి, మెడలో, చెవికి, చేతికి తగిలించుకొంటున్నావు గాని ఆ
శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉంటే బంగారు వీధులలో బంగారం మీద నడుస్తావు. ప్రకటన 21లో
ఆ పట్టణం శుద్ధ సువర్ణము అని వ్రాయబడింది. ఆ భాగ్యం కావాలంటే నీకు ఆ నిరీక్షణ
కావాలి!! ఆ నిరీక్షణ నీకుందా?
ప్రియ చదువరీ! నీ
నిరీక్షణ దేనిమీద? బంగారం మీదా? అధికారం మీదా? ప్రియురాలి మీదా? ఉద్యోగమా? పదవా?
ఉత్తీర్ణతా? material
blessing నా?
హెబ్రీ 11:13-16 లో విశ్వాస వీరులు పరలోకసంభందమైన శ్రేష్టమైన
దేశమును వెదికారు. దానికోసం చాలా కష్టాలు పడ్డారు. చివరకు దానిని
స్వతంత్రించుకొన్నారు! అటువంటి నిరీక్షణ నీకుందా? అసలు నీకు నిరీక్షణ అంటూ ఉందా?
ఏదో గుడికి వెళ్తున్నాం, యేసుబాబుని నమ్ముకొంటే రోగాలుపోతాయి, ఆశీర్వాదం
కలుగుతుంది, నా కుటుంబం బాగుపడుతుంది అనుకుని వస్తున్నావు గాని ఈ శుభప్రదమైన కలిగి
ఒకరోజు ఆ దేవాదిదేవుడిని, మహా దేవుడ్ని చూస్తాను అనే ఆశ ఉందా? ఏదో మా అమ్మ, బాబు
పోరు పడలేక గుడికొస్తున్నాను గాని నిరీక్షణా/పాడా అనుకుంటున్నావా? విడువబడుట
బహుఘోరమని మరచిపోవద్దు! ప్రతీ ఒక్కరు ఆ శుభప్రదమైన నిరీక్షణ కలిగియుండాలి!
అట్టి కృప, నిరీక్షణ చదువరులందరికీ కలుగును
గాక!
ఆమెన్!
ఆమెన్! ఆమెన్!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక –10వ భాగం*
ఎఫెసీ 1:4--6
4. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన
తన కృపామహిమకుకీర్తి కలుగునట్లు,
5. తన చిత్త ప్రకారమైన దయాసంకల్పముచొప్పున, యేసుక్రీస్తు
ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని,
6. మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని
జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.
ప్రియులారా మనం ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం
ధ్యానం చేస్తున్నాము!
ఇక
నాలుగో వచనంలో అంటున్నారు: ఎట్లనగా తన
ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకుకీర్తి కలుగునట్లు
తన
“కృపా మహిమకు లేక దివ్య కృపకు కీర్తి కలగాలని” అనేది దేవుని ఉద్దేశం – ఎఫెసీయులకు 2:8-9;
8. మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది
మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.
9. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ
వీలులేదు. అంటున్నారు అలాగే కొరింథీ
పత్రికలో అంటున్నారు:
1 కోరింథీయులకు 1:29-31;
29. ఎన్నికైనవారిని వ్యర్థము చేయుటకు లోకములో
నీచులైనవారిని, తృణీకరింప బడినవారిని, ఎన్ని కలేనివారిని దేవుడు ఏర్పరచుకొని
యున్నాడు.
30. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తుయేసు నందున్నారు.
31. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింప వలెను అని
వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు
విమోచనమునాయెను.
కాబట్టి
మనుషులు తమ స్వంత ప్రయత్నాల ద్వారా పాపవిముక్తి సంపాదించుకోగలిగితే దానికోసం
వారికే స్తుతులు కలగాలి. మనుషులను విమోచించడానికి దేవుడు ఎన్నుకున్న మార్గంలో
అలాంటి అతిశయానికి కారణాలేవీ లేకుండా చేశాడు. దేవుని దివ్య కృప లేక కృపా మహిమ మాత్రమే విశ్వాసులకు పాపవిముక్తి, రక్షణ
ఇస్తుంది. అందువల్ల స్తుతులన్నీ దేవునికే చెందాలి, విశ్వాసులకు కాదు. కృప అంటే
ఉచితంగా ప్రసాదించేది (వ 6), మన ప్రయత్నాల వల్ల, మనం యోగ్యత అని ఎంచే పనుల వల్ల
కాదు (రోమీయులకు 4:4-5; రోమీయులకు 6:23; రోమీయులకు 11:5-6). ఆ కృప “క్రీస్తులో”
ప్రసాదించారు దేవుడు. అది మరెక్కడా దొరకదు. దేవుని కృపకు క్రీస్తు యేసు ఒక్కరే
దారి (యోహాను 1:14,
14. ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య
నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను
కనుగొంటిమి
16. ఆయన పరిపూర్ణతలోనుండి మనమందరము కృప వెంబడి కృపను
పొందితివిు.
యోహాను 14
6. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే
తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.
ఇక ఆరవ వచనంలో దేవుడు మనము తన యెదుట పరిశుద్ధులమును
నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో
మనలను ఏర్పరచుకొనెను అనడానికి కారణం ఇదే!
– ఎఫెసీయులకు 2:4;
4. అయినను దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన
అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను
క్రీస్తుతోకూడ బ్రదికించెను.
యిర్మియా 31:3;
3. చాలకాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై యిట్లనెను
శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయెడల కృప
చూపుచున్నాను.
రోమీయులకు 5:8; . అయితే దేవుడు మనయెడల తన ప్రేమను
వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు
చనిపోయెను.
1 యోహాను 3:1, మనము
దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమ ననుగ్రహించెనొ చూడుడి; మనము
దేవుని పిల్లలమే.ఈ హేతువుచేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు.
1 యోహాను 3:16; ఆయన
మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని
తెలిసికొనుచున్నాము. మనముకూడ సహోదరులనిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై
యున్నాము.
1 యోహాను 4
8. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు.
అందుకే 5 వ వచనంలో అంటున్నారు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము
చొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, మనలను ముందుగా తన
కోసము నిర్ణయించుకొని..
గమనించాలి
ఆధ్యాత్మిక జన్మమూలంగా లేక ఆత్మ మూలంగా విశ్వాసులు దేవుని సంతానం అయ్యారు!
యోహాను 3:3-8
3. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని
అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పు చున్నాననెను.
4. అందుకు నీకొదేము ముసలి వాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు?
రెండవమారు తల్లి గర్బమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా
5. యేసు ఇట్లనెను ఒకడు నీటిమూలముగాను ఆత్మమూలము గాను
జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింప లేడని నీతో నిశ్చయముగా
చెప్పుచున్నాను.
6. శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా
జన్మించినది ఆత్మయునై యున్నది.
7 మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు
ఆశ్చర్యపడవద్దు.
8. గాలి తన కిష్టమైన చోటను విసరును; నీవు దాని శబ్దము
విందువేగాని అది యెక్కడనుండి వచ్చునో యెక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా
జన్మించిన ప్రతివాడును ఆలాగే యున్నాడనెను.
కాబట్టి
ఇప్పుడు విశ్వాసులు ఆత్మలో చనిపోయి
సజీవంగా లేచినప్పుడు దేవుడు ఆయన
కుమారులుగా స్వీకరించడం జరుగుతుంది. అంటే ఆ విధంగా వారు తన సంతానమని బహిరంగంగా
ప్రకటిస్తాడు.
ఇదంతా
పెద్ద ప్రొసెస్!
యోహాను 15:16,
మీరు నన్ను ఏర్పరచుకొనలేదు; మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన
మీకనుగ్రహించునట్లు మీరు వెళ్లి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును నేను
మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని.
19. మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును;
అయితే మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును లోకములోనుండి ఏర్పరచుకొంటిని;
అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది.
రోమీయులకు
8:33; . దేవునిచేత ఏర్పరచబడిన వారిమీద
నేరము మోపు వాడెవడు? నీతిమంతులుగా తీర్చు వాడు దేవుడే;
2 థెస్సలొనీకయులకు
2:13; ప్రభువువలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుటవలనను,
మీరు సత్యమును నమ్ముటవలనను, రక్షణపొందుటకు దేవుడు ఆదినుండి మిమ్మును ఏర్పరచుకొనెను
గనుక మేము మిమ్మునుబట్టి యెల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప
బద్ధులమైయున్నాము.
1 పేతురు 2:9.
అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి
మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును,
రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు.
కాబట్టి
విశ్వాసులు పుట్టకముందే, లోకం ఉనికిలోకి రాకముందే దేవుడు భవిష్యత్తులోకి
దృష్టి సారించి ప్రతి విశ్వాసినీ చూచి క్రీస్తులో ఎన్నుకున్నారు. వారిలో ప్రతి
ఒక్కరినీ ఒక ఉన్నతమైన స్థలంలో ఉండేలా పూర్వమే నిర్ణయం చేశారు.
రోమీయులకు 8:29-30, 29. ఎందుకనగా తన కుమారుడు అనేక
సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో
సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను.
30. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను;
ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో
వారిని మహిమ పరచెను.
ఇక్కడ
వ 4-6లో దేవుడు విశ్వాసులను ఎన్నుకొని పూర్వ నిర్ణయం చేయడానికి మూడు కారణాలు
చెప్తున్నారు పౌలుగారు.
ఒకటి,
మనం “పవిత్రంగా, నిర్దోషంగా” ఉండాలని దేవుని కోరిక – వ 4; ఎఫెసీయులకు 5:22-27; ఎఫెసీయులకు 17:17-19;
ఫిలిప్పీయులకు 2:15; తీతుకు 2:14.
రెండు,
మనం ఆయన సంతానంగా ఉండాలని ఆయన కోరిక (వ 5). యోహాను 1:12-13; రోమీయులకు 8:15; 2
కోరింథీయులకు 6:17-18; 1 యోహాను 3:1-2
మూడు,
తన “దివ్య కృపకు కీర్తి కలగాలని” దేవుని ఉద్దేశం!!!
కాబట్టి
ఇప్పుడు మనము పిలువబడ్డ పిలుపు ఏర్పాటు పూర్తిగా అర్ధం చేసుకోగలము!!
కాబట్టి
ఆయన పిలుపుకు తగినట్లుగా నడుచుకొని ఆయన రాజ్యములో ప్రవేశిద్దాం!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక –11వ భాగం*
ఎఫెసీ 1:7
7. దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన
రక్తమువలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.
ప్రియులారా మనం ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం
ధ్యానం చేస్తున్నాము!
ఇక
ఏడవ వచనంలో అంటున్నారు: దేవుని
కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమోచనము, అనగా మన
అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.
చూసారా దేవుని కృప యొక్క మహా ఐశ్వర్యము బట్టి ఆ ప్రియుని యందు అనగా
యేసుక్రీస్తుప్రభులవారి యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా లేక దేనికి
విమోచనము అంటే మన పాపములకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఆయన
రక్తముద్వారా లేక రక్తముతో మనము కడుగబడి
నందువలన మన పాపములకు క్షమాపణ కలిగి మనము పవిత్రులుగా చేయబడ్డాము అంటున్నారు!
ఇక
దేవునికృపా మహాదైశ్వర్యము లేక “కృపాసమృద్ధి”– కోసం ధ్యానం చేస్తే . ఎఫెసీయులకు 2:4,7
4. అయినను దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన
అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను
క్రీస్తుతోకూడ బ్రదికించెను.
7. క్రీస్తుయేసునందు మనలను ఆయనతోకూడ లేపి, పరలోకమందు
ఆయనతోకూడ కూర్చుండబెట్టెను.
రోమీయులకు 2:4;
లేదా, దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను
ప్రేరేపించుచున్నదని యెరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘ శాంతమును
తృణీకరించుదువా?
రోమీయులకు 10:12
12. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు; ఒక్క ప్రభువే
అందరికి ప్రభువై యుండి, తనకు ప్రార్థనచేయువారందరియెడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై
యున్నాడు.
ఇవి
అనగా దేవునికృపా సమృద్ధి ఈ విశ్వమంతటిలో నిజమైన సంపదలు. విశ్వాసులను ఇవి
భాగ్యవంతులుగా చేస్తాయి – వ 3; ఆయన క్రీస్తునందు
పరలోకవిషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.
అయితే
కృపగల దేవుడు మనకు ఆ ఐశ్వర్యము ఎలా కలుగజేశారో తెలియాలంటే
2
కోరింథీయులకు 8:9;
9. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుగదా? ఆయన
ధన వంతుడై యుండియు మీరు తన దారిద్ర్యమువలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము
దరిద్రుడాయెను.
ఇక
విమోచనము కోసం ఆలోచిస్తే –
మత్తయి 1:21
తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు
యేసు(యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థము.) అను పేరు పెట్టుదువనెను.
రోమీయులకు 3:24; కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే,
క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడు చున్నారు.
1 కోరింథీయులకు 1:30; అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తుయేసు
నందున్నారు.
యిర్మియా 23
5. యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు రాబోవు దినములలో నేను
దావీదునకు నీతి చిగురును పుట్టించెదను; అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా
నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమిమీద నీతి న్యాయములను జరిగించును.
6. అతని దినములలో యూదా రక్షణనొందును, ఇశ్రాయేలు నిర్భయముగా
నివసించును, యెహోవా మనకు నీతియని అతనికి పేరు పెట్టుదురు.
గలతియులకు 3:13;
ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసమువలన మనకు లభించునట్లు, అబ్రాహాము పొందిన
ఆశీర్వచనము క్రీస్తుయేసుద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు మనకోసము శాపమై మనలను
ధర్మశాస్త్రముయొక్క శాపమునుండి విమోచించెను;
ఇంకా
దీనికోసమాలోచిస్తే ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్న మనలను ఇప్పుడు ఆయనకుమారుని
ద్వారా ఒక రాజ్యముగా చేసి, దానికి నిన్ను నన్ను వారసులుగా చేసారు! ఈ రాజ్యము
ఉచితముగా రాలేదు! దానికి యేసుప్రభులవారు గొప్పమూల్యం చెల్లించారు! ఆయన తనసొంత రక్తాన్ని
చిందించి, మనలను పాప విముక్తులుగా చేసి, సాతాను బంధకాలు తెగ్గొట్టి- ఆయన
రాజ్యానికి వారసులుగా చేసారు! కాబట్టి ఈ విషయం గుర్తుంచుకోవాలి మనం!!
వెండిబంగారాలు
వంటి క్షయ వస్తువుల ద్వారా మనం విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తం ద్వారా
విమోచించబడ్డామని ప్రతీ క్షణము గుర్తుంచుకోవాలి! 1 పేతురు 1:18-19;
ఎఫెసీ
2:1-3 మీరు మీ అతిక్రమములలో, పాపములతో
చచ్చిన వారైయుండగా ఆయన మిమ్మలను క్రీస్తుతోకూడా బ్రతికించెను కాబట్టి ఈ శారీరక
క్రియలు మానెయ్యాలి మనం! మరి క్రొత్తదైన ఈ ఆధ్యాత్మిక జన్మ మూలముగా మనం దేవుని
పిల్లలమైతే, ఆయనలో వారసత్వం కలిగిన వారమై యున్నాము!
యోహాను 1:12-13
తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు
విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.
యోహాను 3:3-8
శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది
ఆత్మయునైయున్నది.. . .
మీరు దేవుని ఆత్మ మూలముగా జన్మించిన వారు .
రోమా 8:16-17
మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము;
క్రీస్తుతో కూడ మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తుతోడి వారసులము.
ఎఫెసీ 2:4-10.
మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది
మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.
కొలొస్సయులకు 1:14;
ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాపక్షమాపణ కలుగుచున్నది.
హెబ్రీయులకు
9:12, హెబ్రీయులకు 9:15. కీర్తనల గ్రంథము 78:35; మత్తయి 20:28
మనల్ని
దాస్యంలో ఉంచింది పాపం గనుక విముక్తి అంటే పాపక్షమాపణ కూడా. మనలను విడిపించేందుకు
క్రీస్తు తన రక్తాన్ని ఇచ్చారు, తన ప్రాణాన్ని ధార పోశారు.
యేసు
ప్రభులవారి ద్వారానే పాపక్షమాపణ, విమోచన ఉంది! అందుకే ఆది అపోస్తలులపై ఆత్మ
కుమ్మరించబడినప్పుడు – వారి (అపోస్తులులు) బోధలో
ముఖ్యాంశం: అపో.కార్యములు 4: 12
మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ
పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము
అనెను. ఇది అపోస్తులుల బోధ!
(సశేషం)
*ఎఫెసీ పత్రిక –12వ భాగం*
ఎఫెసీ 1:7
7. దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన
రక్తమువలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.
ప్రియులారా మనం ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 7వ
వచనం ధ్యానం చేస్తున్నాము!
(గతభాగం తరువాయి)
ఇక
ఏడవ వచనంలో అంటున్నారు: దేవుని
కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమోచనము, అనగా మన
అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.
ఒకసారి *పాప విమోచనం* కోసం ధ్యానం
చేద్దాం! బైబిల్ ప్రకారం రక్తం చిందించకుండా పాపక్షమాపణ/ విమోచన లేదు!! హెబ్రీ
9:22; మన హిందూ గ్రంధాలలో గాని, ఖురాన్ లో గాని, మరి ఏ ఇతర మాట గ్రంధాలు చూసినా
ఇదేమాట సెలవిస్తున్నాయి! అందుకే మన హైందవ సహోదరులు కోళ్ళు, మేకలు, గొర్రెలు బలి
ఇస్తున్నారు. బైబిల్ గ్రంధంలో పాత నిబంధనలో – ధర్మశాస్త్రం లో పాప పరిహారార్ధ బలి కోసం వివరించబడింది!
ఆ పాపపరిహారార్ధ బలిపశువు రక్తం- ప్రధాన యాజకుడు సంవత్సరమునకు
ఒక్కమారే అతి పరిశుద్ధ స్తలానికి తీసుకుని వెళ్లి, అక్కడ బలిపీఠం మీద చిందిస్తారు.
హెబ్రీ 9:25; అప్పుడు పాపక్షమాపణ కలుగుతుంది! ఇలా పాపపరిహారం చేసే యాజకుడు కూడా
మొదట తనకోసం బలిపశువు అర్పించి, తర్వాత తీసుకుని వెళ్తాడు బలిపశువు రక్తం!!
దీనికోసం మరిన్ని వివరాలు లేవీకాండం లోను, హెబ్రీ పత్రికలోను
కనిపిస్తాయి మనకు! కొన్ని వేల సం.లు అదే జరిగింది! కాని పౌలుగారు హెబ్రీ 10:4-20
వరకు ఇలా రాస్తున్నారు: ఎడ్లయొక్కయు, మేకలయొక్కయు రక్తము పాపములను తీసివేయడం
అసాధ్యం!! కాబట్టి యేసుప్రభువు – నేను గ్రంధపు చుట్టలో నన్నుగూర్చి వ్రాయబడిన విధముగా దేవా!
నీ చిత్తము చేయుటకు వచ్చియున్నాను అంటున్నారు! మరి ఆయనకోసం ఎక్కడ వ్రాయబడింది? చాల
చోట్ల వ్రాయబడింది! కొంత ఇచ్చట- కొంత అచ్చట!! వాటిలో చాలా భాగాలు యెషయా 53 వ
అధ్యాయం, మరికొంత కీర్తనలు గ్రంధములో ఈ యాగం కోసం వ్రాయబడ్డాయి! కాబట్టి యేసయ్య మన
పాపములకోసం, ఆయన సొంత రక్తముతో మనకోసం పాప పరిహారార్ధబలి చేశారు! 9:25;
మోషేగారు
ఇశ్రాయేలీయులను చెర విమోచించినప్పుడు పస్కా బలిపశువు రక్తాన్ని ద్వారబంధాలకు
రాయమని చెబుతారు. నిర్గమ 12:7-14; ఆ రక్తాన్ని చూసి సంహారకుడు వారిని దాటిపోయాడు!
అలాగే యేసురక్తము మన హృదయపు ద్వారబందాలపై ఉన్నప్పుడు, పాపానికి వచ్చు జీతం మరణం,
అది నిత్యనరకాగ్ని గుండము, కాబట్టి ఈ యేసురక్తము వలన నరకం అనే సంహారకుని నుండి
తప్పించబడి- పరలోకం వెళతాము!
నిర్గమ 24:8 లో మోషేగారు రక్తాన్ని తీసుకొని ప్రజలమీద ప్రోక్షించి,
యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అంటున్నారు!
హెబ్రీ 9వ అధ్యాయంలో ధర్మశాస్త్రము రాబోయే వాటి చాయ, గాని రియాలిటీ
యేసుప్రభువులో ఉంది అంటున్నారు! నిజముగా యేసుప్రభులవారు వచ్చి అంటున్నారు: ఇది
నారక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకులకోసం చిందించబడుతున్న నిభందన రక్తము”
మత్తయి 26:28; మార్కు 14:24; లూకా 22:20;
కాబట్టి
ఆయన రక్తములోనే మనకు పాపవిమోచనము కలుగుతుంది!
ఎఫెసీ 1:7 ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా పాపక్షమాపణ
కలుగుతుంది! హెబ్రీ 9:14; 9:22;
1యోహాను 1:7 యేసురక్తము ప్రతీపాపము నుండి మనలను కడిగి
పవిత్రులనుగా చేయును!
*ఆయనలోనే
విమోచనము*: రోమా 3:24, 1:14; హెబ్రీ 9:15; 1తిమోతీ 2:6; హెబ్రీ 9:11. అందుకే
కొన్ని వందల సం.ల క్రితమే కీర్తనాకారుడు 1౩౦:7 లో
ఇశ్రాయేలూ, యెహోవా మీద ఆశపెట్టుకొనుము యెహోవా యొద్ద కృప
దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును అంటున్నారు.
ఇక *క్షమాపణ కోసం* చూసుకుంటే – ఎఫెసీయులకు 4:32; ఒకని యెడల ఒకడు దయగలిగి
కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు
క్షమించుడి.
మత్తయి 6:12;
మత్తయి 9:6; అయినను పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి
అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని చెప్పి, ఆయన పక్షవాయువుగలవాని చూచినీవు
లేచి నీ మంచ మెత్తికొని నీ యింటికి పొమ్మని చెప్పగా
లూకా 24:47; యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయనపేరట
మారుమనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది.
అపో. కార్యములు 13:38; కాబట్టి సహోదరులారా, మీకు ఈయన
ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు,
అపో. కార్యములు 26:18; వారు చీకటిలోనుండి వెలుగులోనికిని
సాతాను అధికారమునుండి దేవుని వైపుకును తిరిగి, నా యందలి విశ్వాసముచేత
పాపక్షమాపణను, పరిశుద్ధపరచ బడినవారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు
తెరచుటకై నేను నిన్ను వారియొద్దకు పంపెదనని చెప్పెను.
1 యోహాను 1:9. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన
నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి
మనలను పవిత్రులనుగా చేయును.
కాబట్టి
మన మంచి ప్రవర్తన ద్వారా పాపక్షమాపణను సంపాదించుకోలేము. అది క్రీస్తు విశ్వాసులకు
దేవుడు ఉచితంగా ఇచ్చినది.
కాబట్టి యేసుక్రీస్తు నామములోనే, ఆయన
రక్తములోనే పాపక్షమాపణ తప్ప, మరి ఏ విధముగా నైనను రక్షణ పొందలేము!
కాబట్టి యేసుప్రభులవారిని మన స్వకీయ రక్షకుడని,
దేవునిగా అంగీకరిద్దాం!
పాప
పరిహారం పొందుదాం!
పరలోకం
చేరుదాం!
ఆమెన్!
దైవాశీస్సులు!!
*ఎఫెసీ పత్రిక -13వ భాగం*
ఎఫెసీ 1:8—9
8. కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటునుబట్టి, ఆయన
తన దయాసంకల్పముచొప్పున తన చిత్తమునుగూర్చిన మర్మమును మనకు తెలియజేసి,
9. మనకు సంపూర్ణమైన జ్ఞానవివేచన కలుగుటకు, ఆ కృపను మనయెడల
విస్తరింపజేసెను.
ప్రియులారా మనం ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం
ధ్యానం చేస్తున్నాము!
ఇక 8వ
వచనంలో అంటున్నారు: కాలము సంపూర్ణమైనప్పుడు
జరుగవలసిన యేర్పాటునుబట్టి, ఆయన తన దయాసంకల్పముచొప్పున తన చిత్తమునుగూర్చిన
మర్మమును మనకు తెలియజేసి,
కాలము
సంపూర్నమైనప్పుడు అనగా నిర్ణయ కాలమందు జరుగవలసిన ఏర్పాటును బట్టి ఆయన దయా సంకల్పము
చొప్పున అంటున్నారు ... మనుష్యుల పాపములు
పండిపోయినప్పుడు, ఇక ప్రవక్తలు భక్తుల ద్వారా పలికించిన మాటలతో ప్రజలు మారనప్పుడు,
హెబ్రీపత్రిక ప్రకారం ధర్మశాస్త్రం అట్టర్ ఫ్లాప్ అయిపోనప్పుడు దేవుడు
మెల్కీసేదేకు అనే ఒక నూతన యాజక క్రమము నిర్ణయించి, నిర్ణయ కాలమందు దేవుడు తనదయా
సంకల్పముచోప్పున తన ఒక్కగానొక్క కుమారుని ద్వారా మానవుల పాపముల యొక్క నివారణ కోసం
ఒక బలియాగం జరగాలని దేవుడు నిర్ణయించారు! అప్పుడే యేసుక్రీస్తుప్రభులవారు ఈ
లోకమునకు శరీరధారియై వచ్చారు! ఇదే ఒక మర్మముగా చెబుతున్నారు పౌలుగారు! దేవుడు
లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా
పుట్టినవానియందువిశ్వాసముంచు ప్రతివాడును
నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనగా ఆయన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుప్రభులవారిని
ఈలోకమునకు పంపించారు! యోహాను ౩:16 ఆయనను
విశ్వసించుట వలన మాత్రమే ప్రజలు తమ పాపములనుండి విడుదల పొంది ఆయన నామములో నమ్మి
బాప్తిస్మము పొంది నిజమైన పశ్చాత్తాపముతో ఆయన పాదాలు కడిగితే ఆప్పుడు ఆయన కుమారుని
రక్తం ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులునుగా చేసి ఆయన రాజ్యమునకు
వారసులుగాచేస్తుంది!!! 1 యోహాను 1:7
“విరివిగా”– మనుషులకు దీవెనలు ఇవ్వడంలో దేవుడు అయిష్టంగా,
పిసినారితనంగా ఉండడు. ఈ సమృద్ధి మనకిమ్మని ఆయన్ను బలవంతం చేయనవసరం లేదు. వాటిని
మనం పొందాలంటే పరలోకంలో ఉన్న ఏ పవిత్రులూ మన పక్షాన ఆయన్ను వేడుకోనవసరం లేదు. మనపై
ఆయన తన కృపను కుమ్మరించడం సాధ్యమయ్యేలా దేవుడు తన కుమారుణ్ణి మన పాపాలకోసం
చనిపోయేందుకు పంపాడు. రోమీయులకు 8:32. తన
సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో
పాటు సమస్తమును మన కెందుకు అనుగ్రహింపడు?
దేవుడు
దేవుడుగా ఉండడం ఎలా మానుకోలేడో, ఇవ్వడం కూడా మానుకోలేడు. శాశ్వత యుగాలన్నిటిలోనూ
విశ్వాసులపై తన కృపను కుమ్మరిస్తూనే ఉంటాడు – ఎఫెసీయులకు 2:7. క్రీస్తుయేసునందు
మనలను ఆయనతోకూడ లేపి, పరలోకమందు ఆయనతోకూడ కూర్చుండబెట్టెను.
ఇంకా
9వ వచనంలో అంటున్నారు మనకు సంపూర్ణమైన జ్ఞాన
వివేచనా కలుగుటకు ఆ కృప ను మన యెడల విస్తరింపజేసెను అంటున్నారు!
విముక్తి,
క్షమాపణ ఇంకా దేవుడిచ్చే ఇలాంటి దీవెనలన్నీ సమస్త జ్ఞాన వివేకాలతో కూడినవి. మనపట్ల
దేవుడు కృపతో వ్యవహరించిన సందర్భాలన్నిటిలోనూ ఆయన లోపం లేని జ్ఞానంతో
ప్రవర్తిస్తాడని దీని అర్థం!! ఇది వాస్తవమే. కానీ క్రీస్తు ద్వారా దేవుడు
విశ్వాసులకు సంపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞాన వివేకాలను అందుబాటులో ఉంచాడని మరో అర్థం. ఇక్కడ సంపూర్ణ మైన జ్ఞాన వివేచనా
కలుగుటకు క్రుపను ఇచ్చారు అంటున్నారు!
ఒకసారి కొలస్సీ పత్రికలోను దీనికోసం వ్రాసారు! కొలొస్సయులకు 1:9;
అందుచేత ఈ సంగతి వినిననాటనుండి మేమును మీ నిమిత్తము
ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకముగనులవారును,..
కొలొస్సయులకు
2:2-3;
2. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలిసికొనగోరు చున్నాను.
వారు ప్రేమయందు అతుకబడి, సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యము కలిగినవారై, దేవుని
మర్మమైయున్న క్రీస్తును, స్పష్టముగా తెలిసికొన్నవారై, తమ హృదయములలో ఆదరణపొందవలెనని
వారందరి కొరకు పోరాడుచున్నాను.
3. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనయందే
గుప్తములైయున్నవి.
ఇలా
చెబుతూ ఈ సత్యాన్ని , ఆయన తన దయాసంకల్పముచొప్పున
తన చిత్తమునుగూర్చిన మర్మమును మనకు తెలియజేసి, అంటున్నారు. ఈ సత్యాలు లేక మర్మాలు
చాలా ఉన్నాయి గాని వాటిలో కొన్ని ఏమిటంటే
1 కోరింథీయులకు 2:7-10.
7. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము; ఈ
జ్ఞానము మరుగైయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము
నియమించెను.
8. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు; అది వారికి తెలిసి
యుండినయెడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయియుందురు.
9. ఇందును గూర్చిదేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి
సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు
గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది.
10. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మవలన బయలుపరచి యున్నాడు; ఆ
ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు.
ఎఫెసీయులకు 3:3-4,
3. ఎట్లనగాక్రీస్తు మర్మము దేవదర్శనమువలన నాకు తెలియపరచ
బడినదను సంగతినిగూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని.
4. మీరు దానిని చదివినయెడల దానినిబట్టి ఆ క్రీస్తు
మర్మమునుగూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొన గలరు.
ఎఫెసీయులకు 3:9; పరలోకములో ప్రధానులకును అధికారులకును,
సంఘముద్వారా తనయొక్క నానావిధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడ వలెనని ఉద్దేశించి,...
ఇక్కడ ఒక విషయము చెప్పాలి. ఈ మర్మము
అందరికీ ఎందుకు తెలియపరచ బడలేదు అంటే
మత్తయి 13:11; పరలోక రాజ్యమర్మములు ఎరుగుట మీకు
అనుగ్రహింపబడియున్నది గాని వారికి అనుగ్రహింప బడలేదు.
రోమీయులకు 16:25-26
సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగు నట్లు, అనాదినుండి
రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్యదేవుని ఆజ్ఞప్రకారము
ప్రవక్తల లేఖనములద్వారా వారికి తెలుపబడియున్నది. ఈ మర్మమును అనుసరించియున్న నా
సువార్త ప్రకారము గాను,
26. యేసు క్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను, మిమ్మును
స్థిరపరచుటకు శక్తిమంతుడును
ఇవన్నీ
దేవుడు పౌలుగారికి వెల్లడి చేసిన కొన్ని
మర్మములు :
“రహస్య
సత్యం” లేక మర్మము అంటే మనుషులకు గనుక
తెలియాలంటే దేవుడు మాత్రమే బయట పెట్టవలసిన సత్యం. మరి ఏ విధంగానూ వారు దాన్ని
తెలుసుకోలేరు. శుభవార్త అనే రహస్య సత్యంలోని ప్రతి అంశం పాత పాత నిబంధన
కాలంలో వెల్లడి కాలేదు
(ఎఫెసీయులకు
3:5).
అయితే ఇప్పుడు కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడొక నూతన క్రమాన్ని ఏర్పరచి యేసు
క్రీస్తును దానిపై సర్వాధికారిగా నియమిస్తాడు.
మత్తయి 19:28; యేసు వారితో
ఇట్లనెను(ప్రపంచ) పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై
యుండునపుడు నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనములమీద ఆసీనులై ఇశ్రాయేలు
పండ్రెండు గోత్రములవారికి తీర్పుతీర్చుదురు.
1 కోరింథీయులకు 15:25; ఎందుకనగా తన శత్రువులనందరిని తన
పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను.
ఫిలిప్పీయులకు 2:9-11;
9. అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో
గాని,
10. భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును
యేసునామమున వంగునట్లును,
11. ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై
యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి
నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.
ప్రకటన గ్రంథం
20:4-6.
4. అంతట సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై
యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూరమృగమునకైనను దాని
ప్రతిమకైనను నమస్కారముచేయ తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని
ముద్రవేయించుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని
వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు
బ్రదికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడ రాజ్యము చేసిరి
5. ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు కడమ మృతులు బ్రదుక లేదు;
ఇదియే మొదటి పునరుత్థానము.
6. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులును
పరిశుద్ధులునై యుందురు. ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు
దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము
చేయుదురు.
ఇదీ
ఇంతవరకు దాచబడి నూతన నిబంధన కాలంలో మనకు ప్రభోదించ బడిన మర్మము! కాబట్టి ఇంత గొప్ప
పిలుపు ఏర్పాటును గల మనము ఆ పిలుపుకు తగినట్లుగా జీవిద్దాం! ఆయన బాటలో నిలుద్దాం!
దైవాశీస్సులు!!
ఆమెన్!
*ఎఫెసీ పత్రిక -14వ భాగం*
ఎఫెసీ 1:10—12
10. ఈ సంకల్పమునుబట్టి ఆయన పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద
ఉన్నవేగాని, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలోతాను
నిర్ణయించుకొనెను.
11. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన
మహిమకు కీర్తికలుగజేయవలెనని,
12. దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమునుబట్టి మనలను
ముందుగా నిర్ణయించి, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా
చేసిన నిర్ణయముచొప్పున సమస్తకార్యములను జరిగించుచున్నాడు.
ప్రియులారా మనం ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం
ధ్యానం చేస్తున్నాము!
ఇక 10వ
వచనంలో అంటున్నారు: ఈ సంకల్పమునుబట్టి ఆయన
పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద ఉన్నవేగాని, సమస్తమును క్రీస్తునందు ఏకముగా
సమకూర్చవలెనని తనలోతాను నిర్ణయించుకొనెను
ఇదే
విషయాన్ని కొలస్సీ పత్రికలో రాస్తూ వివరంగా అంటున్నారు:
కొలసీ 1:
18. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు; ఆయనకు అన్నిటిలో
ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఆయన ఆదియైయుండి మృతులలోనుండి లేచుటలో
ఆదిసంభూతుడాయెను.
19. ఆయనయందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు,
20. ఆయన సిలువరక్తముచేత సంధిచేసి, ఆయనద్వారా సమస్తమును, అవి
భూలోకమందున్నవైనను పరలోక మందున్నవైనను, వాటినన్నిటిని ఆయనద్వారా తనతో సమాధానపరచుకొన
వలెననియు తండ్రి అభీష్టమాయెను.
21. మరియు గతకాల మందు దేవునికి దూరస్థులును, మీ దుష్క్రియలవలన
మీ మనస్సులో విరోధభావముగలవారునై యుండిన మిమ్మును కూడ
22. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను
నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణమువలన ఇప్పుడు
మిమ్మును సమాధానపరచెను.
చాలా
జాగ్రత్తగా పరిశీలిస్తే ఎఫెసీ 1:4—6
వచనాలలో కూడా ఇదే రాస్తున్నారు!
4. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన
కృపామహిమకుకీర్తి కలుగునట్లు,
5. తన చిత్త ప్రకారమైన దయాసంకల్పముచొప్పున,యేసుక్రీస్తు
ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై,మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని,
6. మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని
జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను
“ఉద్దేశం”– లోకంలో సంఘటనలు గందరగోళంగా అస్తవ్యస్తంగా
జరుగుతున్నట్టు తరచుగా కనిపిస్తాయి. అప్పుడప్పుడూ జరుగుతున్నవాటికి ఒక దారీ
తెన్నూ, ఎలాంటి అర్థమూ ఉన్నట్టు అనిపించదు. అయితే ఇలా అనిపించడం మన అల్ప దృష్టి
మూలంగానే. దేవునికి ఒక చక్కటి ఉద్దేశం ఉంది. దాన్ని ఆయన లోపం లేని విధంగా
నెరవేరుస్తున్నారు. రోమీయులకు 8:28; రోమీయులకు 11:33-36; యెషయా 46:10. దేవుని
ఏర్పాటు ముఖ్యంగా విశ్వాసులకూ ఆయన వారి కోసం ఏర్పరచిన గమ్యానికీ చెందినది. ఆయన
మహిమకు కీర్తి కలగాలనే వారు ఉన్నారు – వ
14; ఎఫెసీయులకు 3:21; రోమీయులకు 16:27; గలతియులకు 1:5; ఫిలిప్పీయులకు 1:11;
హెబ్రీయులకు 13:21; 1 పేతురు 2:9; ప్రకటన గ్రంథం 4:11; 1 కోరింథీయులకు 10:31.
కొలస్సీయులకు 1: 20
ఆయన సిలువ రక్తముచేత సంధిచేసి, ఆయనద్వారా సమస్తమును, అవి
భూలోకమందున్నవైనను పరలోక మందున్నవైనను, వాటినన్నిటిని ఆయనద్వారా తనతో
సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయెను.
ప్రియులారా!
ఆయనయందు సర్వసంపూర్ణత నివశింపవలెనని. . . .
సర్వసంపూర్ణత అనగా సంపూర్ణ దేవుడు క్రీస్తులో కనబడాలని అనేది తండ్రియొక్క
అభీష్టము! దేవుని సంపూర్ణత లేక సంపూర్ణదేవుడు అనేది క్రీస్తు అనే తన కుమారునిలో
ఉండాలని దేవుని ఇష్టము. అందుకే 2:9 లో
ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు
నివసించుచున్నది;
దీనికోసం మనం గత భాగాలలో యేసుక్రీస్తు దైవత్వము
అనే శీర్షికలో వివరంగా చూసుకున్నాం!
అయితే 20వ వచనం
ప్రకారం: అలా సర్వసంపూర్ణత కలిగించడానికి దేవుడు తన కుమారుని రక్తాన్ని
చిందించవలసి వచ్చింది! ఎందుకంటే తండ్రియైన దేవునికి మానవులపై ఎనలేని ప్రేమ! మొదటి
ఆదాము ద్వారా కోల్పోయిన మానవునికి- దేవునికి కలిగిన అవినాభావ సంభందాన్ని తిరిగి
పునరుద్ధరించడానికి , (1కొరింథీ 15:45) చివరి ఆదామైన తన కుమారునితో ఒక మహా
ప్రణాళిక ఏర్పాటుచేసి, చివరకు తనకుమారుని సిలువరక్తముద్వారా, కోల్పోయిన ఆ అవినాభావ
సంభందాన్ని తిరిగి పునరుద్ధరించారు దేవుడు! అనగా సంధిచేశారు. తద్వారా అనగా ఆయన
కుమారుని ద్వారా సమస్తమును అనగా భూలోకసంభందమైనవి గాని, పరలోకసంభందమైనవి గాని
అన్నింటిని క్రీస్తుద్వారా – తండ్రియైన దేవునితో సంధిచేసారు! ఇక్కడ సంధి
అనగా ఒక Agreement! Agreement of Reconciliation. అనగా
చెడిపోయిన/ తెగిపోయిన ఒక relation/ సంభందాన్ని తిరిగి
ప్రారంభించారు. ఇవన్నీ చేయడానికి దేవుడు తనకుమారుని భూమిమీదకు పంపించి, రక్తాన్ని
కార్పించి, తిరిగి reconcile చేయడం జరిగింది! నిజముగా తండ్రి
ఎంత దయగలవారో కదా!!! తన సొంతకుమారుని అలా చేయడానికి ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి!!’
కారణం లోకమంతా పాపములో మునిగిపోయి, దేవునికి
దూరమై పోయింది. దేవునికోపం మనుష్యులపై మండింది. రోమా 1:18; రోమా 3:23
ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు
మహిమను పొందలేక పోవుచున్నారు.
దేవుడు అనుగ్రహించు మహిమ అనగా దేవునిరాజ్యమును
పొందుకోలేకపోతున్నారు! తద్వారా పాపమునకు వచ్చు జీతము మరణము రోమా 6:23; అది
నిత్యనరకము! ఇలా మానవుడు- మానవులకై చేసిన స్వర్గము పొందుకోకుండా, సాతానుకి, వాని
దూతల కొరకు చేసిన నరకానికి చేరుతున్నాడు! మత్తయి 25:34,41; అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు! మార్కు 9:48;
పరలోకానికి/దేవునికి, భూలోకానికి/మానవునికి గల సంభందము/ లింక్ తెగిపోయింది. మనిషి
శాంతి సమాధానాలు కోల్పోయాడు! రెండు దేశాలమధ్య శాంతి ఒప్పందం తెగిపోయినప్పుడు
బోర్డర్ లో యుద్దవాతావరణము నెలకొన్నట్లు, క్రాస్ ఫైర్ మొదలయ్యింది. ఇది దేవునికి ఇష్టం లేదు. తట్టుకోలేకపోయారు
దేవుడు!! అందుకే ప్రవక్తలను పంపించారు. సమస్య పరిష్కారం కాలేదు! శాంతి ఒప్పందం
మరలా మొదలవ్వాలి. అదికూడా శాశ్వత పరిష్కారం కావాలి. అందుకే మనమింకనూ పాపులమై
యుండగా క్రీస్తు యుక్తకాలమందు మనకొరకు చనిపోయెను!!! రోమా 5:6,8; లోకపాపాలు
తీసివేయడానికి యేసుప్రభులవారే తనసొంత రక్తాన్ని చిందించటానికి, తన రక్తముతో
బలియాగం చేయడానికి సిద్దమయ్యారు! పనిని విజయవంతంగా ముగించారు! యోహాను 1:29; రోమా
5:10; 2 కొరింథీ 5:19; ఎఫెసీ 2:16. అలా చేసి తిరిగి దేవునితో సంధిచేసారు. శాంతి
ఒప్పందం పునరుద్ధరణ జరిగింది. తద్వారా అన్ని నామముల కన్నా పైనామము ఆయనకు కలిగింది!
శిరస్సు అని పిలువబడే యోగ్యత ఆయనకు కలిగింది! అది ఉచితముగా రాలేదు!
అలాగే
ప్రియ సహోదరీ/ సహోదరుడా! నీకు కలిగిన ఈ రక్షణ భాగ్యము కూడా నీకు ఉచితముగా రాలేదు!
క్రీస్తు దానికి వెల చెల్లించారు!
మరినీవు
ఆ వెలకు తగినట్లుగా, ఆ రక్షణకు విలువ తెచ్చేట్లుగా జీవిస్తున్నావా?
ఒకసారి సరిచూసుకో!
దైవాశీస్సులు!
ఆమెన్!
*ఎఫెసీ పత్రిక -15వ భాగం*
ఎఫెసీ 1:10—12
10. ఈ సంకల్పమునుబట్టి ఆయన పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద
ఉన్నవేగాని, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలోతాను
నిర్ణయించుకొనెను.
11. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన
మహిమకు కీర్తికలుగజేయవలెనని,
12. దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమునుబట్టి మనలను
ముందుగా నిర్ణయించి, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా
చేసిన నిర్ణయముచొప్పున సమస్తకార్యములను జరిగించుచున్నాడు.
ప్రియులారా మనం ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం
ధ్యానం చేస్తున్నాము!
(గతభాగం తరువాయి)
ఇంకా
ఈ విషయం కోసం ధ్యానం చేస్తే ఆయన పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద ఉన్నవేగాని,
సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలోతాను నిర్ణయించుకొని ఏమి చేశారో
చూసుకుందాం! మరలా కొలస్సీ పత్రికకు వెళ్దాం!
కొలస్సీ 1:21-22
మరియు గతకాల మందు దేవునికి దూరస్థులును, మీ దుష్క్రియలవలన
మీ మనస్సులో విరోధ భావముగలవారునై యుండిన మిమ్మును కూడా తన సన్నిధిని
పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన
దేహమందు మరణమువలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను.
గతకాలమందు దేవునికి దూరస్తులు, పాపులుగాను,
మీ దుష్క్రియల చేత – దేవునితో విరోధభావం
గలవారమైయుండిన మిమ్మును/ మనలను –
దేవుని సన్నిధిని పరిశుద్దులనుగాను, నిర్దోషులనుగాను, నిరపరాధులనుగాను
నిలబెట్టుటకు ఆయన మరణము ద్వారా మాంసయుక్తమైన దేహమును చంపి, మనలను/ మిమ్మును
దేవునితో సమాధానపరిచెను అంటున్నారు.
అవును కదా, ఒకప్పుడు మనం దేవునికి దూరముగా
ఉన్నవారమే! దేవుడంటే తెలియనివారమే! మనలో చాలామంది దేవునితో వైరముగలవారమే! గాని
ఇప్పుడు దేవుని కృపాసమృద్ధి వలన మనము రక్షింపబడి, ఆయనలో చేర్చబడ్డాము! ఎఫెసీ 2:12.
ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుకాక, పరదేశులును, వాగ్దాన
నిబంధనలు లేని పరజనులును, నిరీక్షణలేనివారును, లోకమందు దేవుడు లేనివారునైయుండి,
క్రీస్తుకు దూరస్థులైయుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి.
అదే 13వ వచనము
అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు
క్రీస్తు రక్తము వలన సమీపస్థులైయున్నారు.
14వ వచనము
ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా
విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్ర మును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను
పడగొట్టి, మన ఉభయులను ఏకము చేసెను.
చూశారా
దేవుడు మనకోసం ఏం చేశారో!
సరే,
మనమైతే దేవునితో సమాధానపడి, దేవునితో ఐక్యమయ్యాము మరి మన పొరుగు వారో? ఎఫెసీ 4:18
వారైతే అంధకారమైన మనస్సుగలవారై, తమ హృదయ కాఠిన్యము వలన
తమలోనున్న అజ్ఞానముచేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడినవారై, తమ
మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు.
కాబట్టి వారినికూడా క్రీస్తు
వెలుగులోనికి , క్రీస్తు సత్యములోనికి నడిపించాల్సిన భాద్యత మనకుంది. కారణం వారు
ఇంకా ఎఫెసీ 6:12 లో చెప్పబడిన విధముగా అంధకార సంభంధమైన లోకనాధుల వశములో ఉన్నారు.
సాతానుగాడి కోరలలో చిక్కుకుపోయి, పాప బంధకాలలో ఉన్నారు. వారికోసం ప్రార్ధించి, వారిని
విడిపించాలి, దేవుని యొద్దకు నడిపించాలి!
ఇక వారేకాదు, క్రైస్తవులు అని పేరుపెట్టుకొని, దేవుణ్ణి సంతోషపెట్టకుండా,
తమకుతామే సంతోషపెట్టుకుంటూ, లోకాచారాలలో మునిగిపోయి, లోకస్తులులా జీవిస్తున్న వారి
హృదయాలు బండబారిపోయి, దేవునికి దూరమై నామకార్ధబ్రతుకు జీవిస్తున్నారు. వారినికూడా
తిరిగి క్రీస్తులోనికి, ఆయన వెలుగులోనికి నడిపించడానికి మనవంతు ప్రయత్నం చేయాలి!
క్రీస్తుకు దూరంగా ఉన్న మనుష్యులందరి
పరిస్తితి ఏమిటంటే, వారికి నిజదేవుడు లేడు, సత్యము తెలియదు, పాపవిముక్తికోసమైన ఆశ
వారికి లేదు, తీర్పు అనేది ఒకటి ఉంది అనేది కూడా తెలియని వారున్నారు. పాపానికి
వచ్చు జీతం—ఆధ్యాత్మిక మరణమని, అది
నిత్యనరకానికి తీసుకుపోతుంది అని తెలియదు వారికి. గలతీ
4:8
ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగనివారై, నిజమునకు దేవుళ్లు
కానివారికి దాసులై యుంటిరి గాని
సరే
అన్యులకోసం చూసుకున్నాం! రక్షింపబడిన మనము ఏం చెయ్యాలి?
గలతీ 4:9.
యిప్పుడు మీరు దేవునిని ఎరిగినవారును, మరి విశేషముగా
దేవునిచేత ఎరుగబడినవారునై యున్నారు గనుక, బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూల
పాఠముల తట్టు మరల తిరుగనేల? మునుపటివలె మరల వాటికి దాసులైయుండ గోరనేల?
గాబట్టి మరలా మూలపాఠాలు అనగా పాత లోకాచారాలు, అన్యాచారాలు చేసి,
అన్యులు ప్రవర్తించినట్లు పరవర్తించకూడదు! అలా చేస్తే అనగా పాత లోకాచారాలు చేస్తే,
మరలా (పాప)దాస్యమనే కాడిక్రిండ మరలా చిక్కుకొన్నట్లే! పాప దాస్యంలో ఉన్నట్లే!
కాబట్టి ఆ దాస్యమనే కాడి క్రింద మరలా
చిక్కుకోవద్దు అని పౌలుగారు హెచ్చరిస్తున్నారు గలతీ సంఘాన్ని, ఇంకా మనలను కూడా! గలతియులకు 5: 1
ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను
స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను
కాడిక్రింద చిక్కుకొనకుడి.
కొలస్సీ 1:21 ప్రకారం దేవునినుండి మనలను దూరం
చేసేవి, మన దుష్క్రియలే అనగా మన చేడుకార్యాలు, పాపాలు. అందుకే యెషయా 59: 1
రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు విననేరక
యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా
వచ్చెను.
గాబట్టి, దేవుని నుండి మనలను దూరం చేసేవి మన పాపాలు, అతిక్రమ
క్రియలు,. వాటిని మననుండి మనం తీసివేస్తే, దేవునికి దగ్గరగా చేరి, మన ప్రార్ధనలు
దేవునికి చేరేలా చేద్దాం! ఇలా కాకుండా ఊరికినే దేవుడు నా ప్రార్ధనలు వినడం లేదు,
నాకు జవాబివ్వడం లేదు అని లబోదిబో మని ఏడవడం వ్యర్ధము! మొదట నీయందు దేవునికి
అభ్యంతరకరమైన క్రియలు, పాపాలు మానివేయు, పరితాపంతో, పశ్చాత్తాపంతో పాపాలు
ఒప్పుకుని, దేవుణ్ణి మన్నించమని అడుగు. దేవుడు కరుణామయుడు గనుక నిన్ను మన్నించి,
నిన్ను క్షమిస్తారు. అప్పుడు నీ ప్రార్ధన
దేవుని దగ్గరకు డైరెక్టుగా జ్ఞాపకార్ధముగా చేరుతాయి కొర్నేలు గారి ప్రార్ధనలు
చేరినట్లు (అపొ 10).!
అప్పుడు
నీ ప్రార్ధనలు దేవునికి వినబడతాయి!
నీవు
తండ్రీ అని పిలిస్తే—కుమారుడా అని ఆయన
జవాబిస్తారు!!!
కాబట్టి దేవునినుండి మనలను దూరం చేసే సమస్త
చెడు పనులు, పాపాలు వదిలేద్దాం!
దేవునితో/లో
ఐక్యమవుదాం!
ఆమెన్!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -16వ భాగం*
ఎఫెసీ 1:10—12
10. ఈ సంకల్పమునుబట్టి ఆయన పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద
ఉన్నవేగాని, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలోతాను
నిర్ణయించుకొనెను.
11. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన
మహిమకు కీర్తికలుగజేయవలెనని,
12. దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమునుబట్టి మనలను
ముందుగా నిర్ణయించి, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా
చేసిన నిర్ణయముచొప్పున సమస్తకార్యములను జరిగించుచున్నాడు.
ప్రియులారా మనం ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం
ధ్యానం చేస్తున్నాము!
(గతభాగం తరువాయి)
ఇంకా
ఈ విషయం కోసం ధ్యానం చేస్తే ఆయన పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద ఉన్నవేగాని,
సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలోతాను నిర్ణయించుకొని ఏమి చేశారో
చూసుకుందాం! మరలా కొలస్సీ పత్రికకు వెళ్దాం!
కొలస్సీ 1:21-22
మరియు గతకాల మందు దేవునికి దూరస్థులును, మీ దుష్క్రియలవలన
మీ మనస్సులో విరోధ భావముగలవారునైయుండిన మిమ్మును కూడా తన సన్నిధిని
పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన
దేహమందు మరణమువలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను.
ఇక్కడ గమనించండి: ఆయన
ఎందుకు మనలను – విరోధులుగా,
దూరముగా ఉన్నప్పుడు మనకోసం యేసయ్య
రక్తమాంసములను చంపి- మనలను తండ్రితో సంధి చేసారు? తన సన్నిధిని నిర్దోషులనుగాను,
నిరపరాదులనుగాను, పరిశుద్దులనుగాను నిలబెట్టాలని!!! ఎందుకంటే తండ్రియైన
దేవునిముందు తన పరువు పోకూడదు అనియు, ఇంకా
మనలను- తనవలె మార్చి తండ్రిముందు హాజరుపరచాలని క్రీస్తుయేసు తాపత్రయము!!
మరి అలా చేయడానికి మాంసయుక్తమైన దేహమును మరణమునకు అప్పగించాలా? అవును! కారణం మనం
చేసే ప్రతీపనులు, పాపాలు మనదేహంతో, శరీరంతో చేస్తాము! మనస్సుతోను పాపాలు చేస్తాము!
ఆ పాపాలు మనదేహాన్ని కళంకము చేయడమే కాకుండా మన రక్తాన్ని పట్టేశాయి!!! మనలను
అపవిత్రులనుగా చేసేశాయి! అందుకే ఆయనకూడా మాంసయుక్తమైన దేహాన్ని ధరించి, మన
మాంసయుక్తమైన దేహానికి అంటిన మలినమునకు, కళంకమునకు, పాపమునకు విరుగుడుగా – తన
పవిత్రరక్తముద్వారా, పాపములేని రక్తముద్వారా, పరిశుద్దరక్తమును చిందించి,
పాపపరిహారము చేసి, తనతోపాటు మనలను కూడా పవిత్రులనుగా/ పరిశుద్దులుగా చేసారు!
అందుకే ఇక మనం బ్రతికే కాలమంతా ఆయన సన్నిధిలో పవిత్రులుగా, పరిశుద్దులుగా,
నిర్దోషులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు!
ఎఫెసీ 2:16-18
తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా
వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధాన పరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే
మనకు సమాధానకారకుడై యున్నాడు.
మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని
సమాధాన సువార్తను ప్రకటించెను.
ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి
చేరగలిగియున్నాము.
చూసారా
తన సిలువ వలన ఆ ద్వేషాన్ని సంహరించి, దానిద్వారా దేవునితో మనలను ఐక్యము చేసారు!
పాపులమైన మనలను పవిత్రపరిచి, పరిశుద్దుడైన దేవునితో అంటుకట్టారు! అందుకే 19,20 వచనాలలో
కాబట్టి మీరికమీదట పరజనులును పరదేశులునై యుండక,
పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునైయున్నారు.
క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియైయుండగా అపొస్తలులును
ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.
మరి ఆ కట్టడంలో ఉన్న నీవు, నీ
పవిత్రతను కాపాడుకొంటున్నావా?
దేవునిముందు నిన్ను పవిత్రముగా, పరిశుద్దముగా,
నిర్దోషిగా, నిరపరాదిగా నిలబెట్టాలనే యేసయ్య అభిలాషను – నీ తుచ్చమైన కోరికలకోసం అడియాసలుగా చేస్తున్నావా? ఆయన
గాయాన్ని మాటిమాటికి రేపుతున్నావా? అసలు నీవు పవిత్రముగా ఉండాలనే ఆయన ఆశ ఎప్పటిదో
తెలుసా? ఎఫెసీ 1:4-6
తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున,యేసుక్రీస్తు
ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై,మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని,
మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునైయుండవలెనని
జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.
మరి ఇంతప్రేమగల దేవునికి నీవిచ్చే
గౌరవం ఏమిటి?
ఇంకా ఎఫెసీ
5:25-27 లో చూసుకుంటే:.
పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె
క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి,
అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక,
పరిశుద్ధమైనదిగాను,
నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని
నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదక స్నానముచేత దానిని పవిత్రపరచి,
పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను.
చూసారా ఆయన ఆశ!
క్రీస్తుయేసు యొక్క సంఘములో కళంకమనేదిగాని, మచ్చ ముడత, అనేవి ఏమి లేకుండా,
నిర్దోషంగా ఉండాలని ఆయన ఆశ! మరి నేటి మన సంఘాలు ఎలా ఉన్నాయి? దేవునికి ఘనత
తెచ్చేవిదముగా ఉన్నాయా? అవమానం తెచ్చేవిధముగా ఉన్నాయా? ఘనత తెచ్చేవి తక్కువ,
అవమానం తెచ్చేవే ఎక్కువ!! తగవులాడుకొని దేవుని సంఘం కోర్టులకు వెళ్తుంది! ఎంత
సిగ్గుచేటు!!! పరపక్షమందున్నవారు మీమీద
ఏమి చెడ్డమాట పలుకకుండా చూసుకోండి అని వాక్యం సెలవిస్తే, అదే పరపక్షమందున్నవారి
దగ్గరకు తీర్పుకోసం వెళ్ళడం సంఘానికి ఘనతా? అవమానమా? ఆలోచించండి! మీ అధికారాలకోసం,
మీ ఇగోని సంతృప్తి పరచడం కోసం, మీ పేరు కోసం క్రీస్తు నవ్వులపాలు కావాలా?!!!
మీతోపాటు అయన కూడా కోర్టులకు రావాలా? మరి ఆయనయందు భక్తిగలవారు ఎక్కడ ఇద్దరు
ముగ్గురు కూడుకొంటారో, అక్కడ ఉంటాను అని ఆయన సెలవిచ్చారు కదా, మరి ఈ
ఇద్దరుముగ్గురు కోర్టులో ఉంటే ఆయన అక్కడ ఉంటారు కదా! మత్తయి 18:20; అప్పుడు అదే కోర్టులో యేసయ్య మీకోసం, తనకు
కలిగిన అవమానం కోసం విలపించరా అక్కడే! యేసయ్యను సంతోషపెడుతున్నారా?
దుఃఖపెడుతున్నారా ప్రియ సంఘమా! ఆలోచించండి! పరపక్షమందున్నవారు మనకోసం చెడ్డమాట
పలుకకుండా, మనమాట, ప్రవర్తన, అలవాట్లు అన్నీ కాచుకోవలసిన అవసరం లేదా ప్రియ
దైవజనమా???
నీవు త్రాగుబోతుగా,
తిట్టుబోతుగా, భార్యను కొట్టుబోతుగా, సోమరిపోతుగా, లంచగొండిగా, జూదగానిగా,
అబద్ధకునిగా, ఖూనీకోరుగా జైలుకి వెళ్తే దేవునికి ఎంత అవమానము!!! ఫలానా సంఘస్తులు
చూడండి ఆదివారం నాడు తెల్లని బట్టలు వేసుకొని చర్చికి వెళ్తారు, సాయంత్రం సినిమా
హాలుకి వెళ్తారు అంటే అది ఎంత అవమానం? ఉదయం చర్చికి వెళ్తారు, సాయంత్రం అందరితోను
తగవులాడి బూతులాడుతారు/ బ్రాందిషాపుకి
వెళ్తారు/ వ్యభిచార కొంపలకు వెళ్తారు అంటే అది దేవునికి ఘనతా? అవమానమా? దేవుడు
కోరుకోనేదేమిటి? మనం చేసేదేమిటి? ఆలోచించారా ఎప్పుడైనా?
అందుకే 1కొరింథీ 1:8 లో పౌలుగారు
మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులైయుండునట్లు
అంతమువరకు ఆయన మిమ్మును స్థిరపరచును.
అయన
వచ్చేరోజున మనం నిందారహితముగా ఉండాలి. అలాగే ప్రతీరోజు పరిశుద్ధాత్మ పూర్ణులుగా
ఆయన ఆత్మతాకిడిని అనుభవించాలి! అప్పుడు నీవు పాపము చేయడానికి భయపడతావు! నీ హృదయం
నిండా ఆయన వాక్యముంటే- శరీరం పాపానికి పరిగెత్తినప్పుడు ఆత్మ/ వాక్యం
గద్ధిస్తుంది. ఆగు! ఆగు! అని నిన్ను ఆపుతుంది.
కాబట్టి ఆయన ఆత్మపూర్ణుడవై, ఆయన సన్నిధిలో
నిందారహితుడవై జీవిస్తూ, దేవునికి పేరు తీసుకు రావాలి.
ఇంకా
అవమానకరంగా జీవిస్తుంటే ఇప్పుడే
మారుమనస్సునొంది, పశ్చాత్తాపమునొంది కన్నీటితో నీ పాపాలు ఒప్పుకొని, నీ
జీవితాని సరిదిద్దుకో! లేకపోతే దేవుని శాపం వస్తుందని తెలుసుకో!
దైవాశీస్సులు!
ఆమెన్!
*ఎఫెసీ పత్రిక -17వ భాగం*
ఎఫెసీ 1:11 —1౩
11. మరియ క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు
కీర్తికలుగజేయవలెనని,
12. దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమునుబట్టి మనలను
ముందుగా నిర్ణయించి, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా
చేసిన నిర్ణయముచొప్పున సమస్తకార్యములను జరిగించుచున్నాడు.
13. మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని,
క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి.
ప్రియులారా మనం ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం
ధ్యానం చేస్తున్నాము!
(గతభాగం తరువాయి)
ఇక 11,12 వచనాలలో అంటున్నారు మరియు క్రీస్తునందు
ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయాలని దేవుడు తన చిత్త ప్రకారం
తన సంకల్పం బట్టి మనను ముందుగా నిర్ణయించి ఆయనయందు స్వాస్త్యముగా ఏర్పరచెను
అంటున్నారు! ఇంకా తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యాలు
జరిగించు చున్నాడు అంటున్నారు! దీనికోసం గతభాగాలలో విస్తారంగా ధ్యానం చేసుకున్నాము
గనుక ముందుకు పోదాం!
ఇక
13వ వచనంలో మీరును సత్యవాక్యమును అనగా మీరక్షణ సువార్తను విని, క్రీస్తునందు
విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డారు అంటున్నారు! ఇక్కడ సత్యవాక్యము అనగా క్రీస్తు సువార్త లేక
సువార్త సత్యము అని అర్ధం చేసుకోవాలి! ఎందుకు సత్యవాక్యము అంటున్నారు అంటే దానిని
వెల్లడి చేసినది సత్య దేవుడే !
కొలొస్సయులకు
1:5;
మీయొద్దకు వచ్చిన సువార్త సత్యమునుగూర్చిన బోధవలన ఆ నిరీక్షణనుగూర్చి మీరు
ఇంతకుముందు వింటిరి.
ఇంకా
తిమోతి గారికి ఉత్తరం రాస్తూ కూడా పౌలుగారు ఇది సత్యవాక్యము అనే పదము ఉపయోగించారు!
2 తిమోతికి 2:15; దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడ
నక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే
దేవునికి కనుపరచు కొనుటకు జాగ్రత్తపడుము.
యాకోబు
గారి నోటనుండి కూడా ఇదే పదము వచ్చింది. ఇది పరిశుద్ధాత్మునివలననే ఈ మాట
పలుకబడింది!
యాకోబు 1:18 ఆయన తాను
సృష్టించిన వాటిలో మనము ప్రథమఫలముగా ఉండునట్లు సత్యవాక్యమువలన మనలను తన సంకల్ప
ప్రకారము కనెను.
దీన్ని
వెల్లడి చేసినది సత్య దేవుడు కాబట్టి ఇది
మొదటినుంచి చివరివరకు సత్యమే! యోహాను మొదటి పత్రికలో ఈసత్యము కోసంవిస్తారంగా
వ్రాయబడింది! ఇంకా యోహాను సువార్తలో కూడా అంటున్నారు
– యోహాను 17:17; సత్యమందు వారిని ప్రతిష్ఠ
చేయుము; నీ వాక్యమే సత్యము.
యోహాను
12:49-50; యోహాను 8:40; యోహాను 7:16-17.
కాబట్టి ఇది “రక్షణ సువార్త”
రోమీయులకు 1:16
సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి,
మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై
యున్నది.
సువార్త ప్రకటించడానికి అతనికున్న ఆత్రుతకు కారణం ఇక్కడ కనిపిస్తున్నది.
సువార్త ఏదో నీరసమైన, నిరుపయోగమైన విషయం అయినట్టుగా దాని గురించి అతడు
సిగ్గుపడలేదు. అది మనుషుల పాపవిముక్తికి ఏకైక మార్గం అనీ, మనుషులను క్షమించి,
వారిని మార్చి, చివరికి వారిని పరలోకం చేర్చే సాధనమైన ఏకైక శక్తి అనీ అతనికి
తెలుసు. అపో. కార్యములు 4:12 .
పౌలుగారు రాసిన మరి ఏ ఇతర పత్రికల కంటే
కూడా వివరంగా ఈ లేఖలో పాపవిముక్తి అంటే ఏమిటో పౌలుగారు చూపిస్తున్నారు. అందులో నిర్దోషిగా ఎంచబడడం
(రోమీయులకు 3:24), దేవునితో సఖ్యపడడం (రోమీయులకు 5:1), నూతనమైన పవిత్ర జీవితం (6–8 అధ్యాయాలు), మహిమ పరచబడడం (అంటే
చివరికి యేసుప్రభువు రూపానికి మారడం – రోమీయులకు 8:29-30). ఇతర అపోస్తలులు
యేసుప్రభువూ చేసినట్టుగానే ఇక్కడ పౌలు పాపవిముక్తి నమ్మకం ద్వారానే కలుగుతుందని
నొక్కి చెప్తున్నారు –
రోమీయులకు 3:22, రోమీయులకు 3:25, రోమీయులకు 3:28; రోమీయులకు 4:5; రోమీయులకు 5:1;
రోమీయులకు 10:9-10; గలతియులకు 2:16; ఎఫెసీయులకు 2:8-9; యోహాను 1:12; యోహాను 3:16,
యోహాను 3:36
ఇక ఎఫెసు క్రైస్తవులు సత్యవాక్కును కేవలం
వినడం మాత్రమే కాదు, దాన్ని నమ్మారు. వినడం ఒక్కటే మంచి ఫలితాలను ఇవ్వదు.
మత్తయి
13:14-15 గనుక మీరు వినుటమట్టుకు
విందురుగాని గ్రహింపనే గ్రహంపరు, చూచుటమట్టుకు చూతురుగాని యెంత మాత్రమును
తెలిసికొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది.
“వాగ్దానం చేసిన ఆత్మతో ముద్రించబడిరి ”
అంటున్నారు – ఎక్కడ వాగ్దానం చేశారు అంటే లూకా సువార్తలోను
అపోస్తలుల కార్యములోను దేవుడు వాగ్ధానం చేశారు! దానిని వారు అపోస్తలుల కార్యాలు 2వ
అధ్యాయంలో పొందుకున్నారు! లూకా 24:48;
అపో. కార్యములు 1:4-5.
4. ఆయన వారిని కలిసికొని యీలాగు ఆజ్ఞాపించెను మీరు
యెరూషలేమునుండి వెళ్లక, నావలన వినిన తండ్రియొక్క వాగ్దానముకొరకు కనిపెట్టుడి;
5. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది
దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను.
క్రీస్తును నమ్మడం వల్ల పరిశుద్దాత్మ
ద్వారా “ముద్ర” పడుతుంది. అసలు పవిత్రాత్మ
తానే ఆ ముద్ర –
ఎఫెసీయులకు 4:30.
దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచనదినమువరకు
ఆయనయందు మీరు ముద్రింపబడి యున్నారు.
ముద్ర అంటే
యజమానత్వాన్ని సూచిస్తుంది – వ 14;
రోమీయులకు 8:9.
దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము
గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే
వాడాయనవాడు కాడు.
దేవునికి చెందినవారికి ఆయన పరిశుద్దాత్మ
ఇస్తారు. పవిత్రాత్మ వారికి ఉండడం మరి దేనికంటే కూడా వారు ఆయనకు చెందినవారని
స్పష్టంగా సూచిస్తుంది. విశ్వాసులు క్రీస్తులో మొదట నమ్మకం ఉంచినప్పుడు పవిత్రాత్మ
వారిలో నివసించేందుకు వస్తాడు. గలతియులకు 3:2, గలతియులకు 3:5, గలతియులకు 3:14..
ఇక
“మీరు కూడా”– అంటే యూదులు కాని
విశ్వాసులు. 12వ వచనంలో క్రీస్తులో మొట్టమొదటగా నమ్మకం పెట్టుకున్న వారి గురించి
రాశారు అంటే యూదులైన విశ్వాసులన్నమాట. పాత
నిబంధన కాలంలో ఇతర ప్రజలకు ఎంత మాత్రం
వంతులేని దీవెనలను యూదులు అనుభవించారు. ఇప్పుడైతే అన్యజనులకు చెందిన విశ్వాసులు
కూడా యూద విశ్వాసుల్లాగా క్రీస్తులో చేర్చబడ్డారు. ఈ లేఖలో కనిపించే ముఖ్యాంశాల్లో
ఇది కూడా ఒకటి –
ఎఫెసీయులకు 2:11-22;
11. కాబట్టి మునుపు శరీరవిషయములో అన్యజనులైయుండి, శరీరమందు
చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారిచేత సున్నతిలేనివారనబడిన మీరు
12. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుకాక, పరదేశులును,
వాగ్దాన నిబంధనలు లేని పరజనులును, నిరీక్షణలేనివారును, లోక మందు
దేవుడులేనివారునైయుండి, క్రీస్తుకు దూరస్థులై యుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి.
13. అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు
క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తమువలన సమీపస్థులై యున్నారు.
14. ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును,
అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్ర మును తన శరీరమందు కొట్టివేయుటచేత మధ్యగోడను
పడగొట్టి, మన ఉభయులను ఏకముచేసెను.
15. ఇట్లు సంధిచేయుచు, ఈ యిద్దరిని తనయందు ఒక్క నూతన
పురుషునిగా సృష్టించి,
16. తన సిలువవలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని
ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధానపరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు
సమాధానకారకుడై యున్నాడు.
17. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన
వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను.
18. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు
తండ్రిసన్నిధికి చేరగలిగియున్నాము.
19. కాబట్టి మీరికమీదట పరజనులును పరదేశులునై యుండక,
పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునై యున్నారు.
20. క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును
ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.
21. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు
పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధిపొందుచున్నది.
22. ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమై
యుండుటకు కట్టబడుచున్నారు.
కాబట్టిమనం
రక్షణ వార్తను సత్యవార్తను మనం విని విశ్వాస ముంచుతున్నాము కనుక ఆయన వాగ్దానం
చేసిన పరిశుద్ధాత్మను పొందుకుని ఆయన ముద్రను పొందుకుని ఆ ముద్రకు తగినటుగా
జీవిద్దాం!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -18వ భాగం*
ఎఫెసీ 1:14
దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు
విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు.
ప్రియులారా మనం ఎఫెసీ పత్రిక మొదటి
అధ్యాయం ధ్యానం చేస్తున్నాము!
ఇక 14వ వచనంలో
అంటున్నారు దేవుని మహిమకు కీర్తి కలిగేలా ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం
కలిగేలా ఈ పరిశుద్ధాత్మ మన స్వాస్త్యము నకు సంచకరువుగా ఉన్నాడు అంటున్నారు!
దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘములో సభ్యులమైన
మనకు విమోచన కలిగేలా దేవుడు పరిశుద్ధాత్మను మనము పొందబోయే స్వాస్త్యమునకు హామీగా
ఇంకా బయానాగా పరిశుద్ధాత్మను మనకోసం వదిలివెళ్లారు అంటున్నారు
ఇక్కడ మనం గమనించవలసిన విషయాలు రెండు: మొదటిది స్వాస్త్యము,
రెండు: సంచకరువు
మొదటిది: స్వాస్త్యము
అనగా అతి తొందరలో మనము పొందబోయే పరలోక దీవెనలు అన్నమాట! ప్రకటన గ్రంధంలో మొదటి
మూడు అధ్యాయాలలో ఇంకాచివరి మూడు అధ్యాయాలలో వాగ్దానంచేసిన పరలోక మేలులే
స్వాస్త్యము! అనగా తేజోవాసుల స్వాస్త్యము, మరుగైన మన్నా, జీవవృక్ష ఫలము, జీవజలము,
తెల్లని రాయి క్రొత్తపేరు, తండ్రియైన దేవునితో ఇంకా మన ప్రియ రక్షకుడైన
యేసుక్రీస్తుప్రభులవారితో నిత్య సహవాసము, పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన
భక్తులతో సహవాసం, ఏడేళ్ళ గొర్రెపిల్ల
విందు , వెయ్యేండ్ల పాలనలో పొందబోయే అధికారం ఇవన్నీ మనము పొందబోయే
స్వాస్త్యము!
రెండు: సంచకరువు అనగా డిపాజిట్, ఇంకా బయానా, ఇంకా హామీ అని
అర్ధాలున్నాయి! అనగా మనము అతి తొందరలో పరలోకంలో దేవుని ఆధ్యాత్మిక పరలోక మేలులు
ఈవులు పొందబోతున్నాము అని మనము నమ్మి విశ్వాసముంచడానికి హామీగా పరిశుద్దాత్మని
మనకు డిపాజిట్ చేసి పెట్టారు దేవుడు!
తండ్రి
అయిన దేవుడు తన ఆత్మను విశ్వాసులకు “హామీగా” కొనుక్కున్నట్టు స్థిరపరిచే
అడ్వాన్సుగా ఇచ్చారు!.
2 కోరింథీయులకు 5:5
దీని నిమిత్తము మనలను సిద్ధపరచినవాడు దేవుడే; మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మన
కనుగ్రహించియున్నాడు.
అంటే మనలో తాను ఆరంభించిన పనిని కొనసాగిస్తూ
ముగిస్తానని హామీ ఇస్తున్నారన్నమాట (ఫిలిప్పీయులకు 1:4 ). ......
ఆయన
వాగ్దానం చేసిన వారసత్వాన్ని మనకు ఇస్తారు
రోమీయులకు 8:17;
మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము;
క్రీస్తుతో కూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తుతోడి వారసులము.
కొలొస్సయులకు
1:12;
తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను
పాత్రులనుగాచేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలు
చున్నాము.
హెబ్రీయులకు 6:12;
మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరచిన
ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించు చున్నాము.
హెబ్రీయులకు 9:15;
ఈ హేతువుచేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధములనుండి
విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును
గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్తనిబంధనకు మధ్యవర్తియై యున్నాడు.
1 పేతురు 1:4
మృతులలోనుండి
యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా
అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు, ఆయన తన
విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింప జేసెను.
ఆయన
మన దేహాలను విమోచించేవరకు (రోమీయులకు 8:23), తన సొత్తుగా భద్రంగా ఉంచుతారు,
అంతేకాదు, ఆత్మయొక్క ప్రథమ ఫలముల నొందిన మనముకూడ దత్త
పుత్రత్వముకొరకు, అనగా మన దేహము యొక్క విమోచనముకొరకు కనిపెట్టుచు మనలో మనము
మూలుగుచున్నాము
శాశ్వతంగా ఉంచుతారు
(యోహాను 14:16). నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన
వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును.
విశ్వాసులు
దేవుని సొత్తు (1 కోరింథీయులకు 6:19-20). 19. మీ
దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని
మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,
20. విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని
మహిమపరచుడి
కాబట్టి
దేవుడు తన వారిని అతి జాగ్రత్తగా సంరక్షిస్తారు. వారిలో ఎవరినీ పోగొట్టుకోడు. యోహాను 6:39-40; 39.
నా యిష్టమును నెరవేర్చు కొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన
వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని.
40. ఆయన నాకు అనుగ్రహించిన దాని యంతటిలో నేనే మియు
పోగొట్టుకొనక, అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపినవాని చిత్తమైయున్నది.
యోహాను 10:27-28;
27. నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును,
అవి నన్ను వెంబడించును.
28. నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక అవి
ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహ రింపడు.
యోహాను 17:11-12.
11. నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు; నేను
నీయొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రీ, మనము ఏకమై యున్నలాగున వారును ఏకమై
యుండు నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము.
12. నేను వారియొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించినవారిని నీ
నామమందు కాపాడితిని; నేను వారిని భద్రపరచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశన
పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు.
ఆయన
తన ఆత్మను మనకు అనుగ్రహించాడని మనకు తెలియడమే ఇదంతా సత్యమన్న నిశ్చయతను
మనకివ్వాలి. గనుక మనకు దేవుడు తన పరిశుద్దాత్మను మనకు అనుగ్రహించారు! గనుక మనకు ఆ
నమ్మకముకలిగి ఆయనలో ముందుకు సాగిపోతూ ఆత్మలోనూ సత్యముతోను ఆయనను ఆరాధించవలసి ఉంది!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -19వ భాగం*
మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధన-1
ఎఫెసీ 1:15—19
15. ఈ హేతువుచేత, ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును
గూర్చియు, పరిశుద్ధులందరి యెడల మీరు చూపుచున్న విశ్వాసమును (అనేక ప్రాచీన
ప్రతులలో- ప్రేమను అని పాఠాంతరము) గూర్చియు, నేను వినినప్పటినుండి
16. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు
చెల్లించుచున్నాను.
17. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, ఆయన మిమ్మును
పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క
మహిమైశ్వర్యమెట్టిదో,
18. ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి
విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తియొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో,
మీరు తెలిసికొనవలెనని,
19. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ
స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు
అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను.
ప్రియులారా మనం ఎఫెసీ పత్రిక మొదటి
అధ్యాయం ధ్యానం చేస్తున్నాము!
ప్రియమైన దైవజనమా! మనము ఇక్కడనుండి ఎఫెసీ
పత్రికలో గల మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధనల కోసం ధ్యానం చేసుకుందాం!! గతంలో
చెప్పుకున్నట్లు ఆయన ప్రార్ధనలు లోక సంబంధమైన విషయాల కోసం, మెటీరియల్ థింగ్స్ కోసం
కాకుండా పరలోక విషయాలు మరియు ఆధ్యాత్మిక విషయాల కోసమే ఆయన ప్రార్ధన చేశారు! ఇక మనం
ఎఫెసీ పత్రికలో పౌలుగారి ప్రార్ధనల కోసం ధ్యానం చేద్దాం!
ఈ వచనాలలో పౌలుగారు
చెబుతున్నారు: ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు, పరిశుద్దులందరి యెడల
మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినిన దగ్గరనుండి మీ విషయమై మానక
దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నారు!
ఈ
మాటల ద్వారా మనము నేర్చుకోదగిన అంశాలు ఏమిటంటే :
మొదటగా: ఎఫెసీ సంఘము ప్రభువైన యేసునందు స్థిరమైన విశ్వాసం కలిగి
ఉన్నారు. ఉపోద్ఘాతంలో చెప్పడం జరిగింది- మొదట్లో వీరు లోకముతో కలిసిపోయినా గాని
పౌలుగారు రాసిన ఉత్తరాల ద్వారా స్థిరపడి లోకాన్ని సంఘమునుండి వెలివేసి- మూర్ఖులైన
ఈ తరమువారికి వేరై ప్రత్యేకముగా జీవిస్తూ కష్టాలు ఎదురైనా దేవునికోసం స్థిరముగా
నిలిచిన సంఘము ఎఫెసీ సంఘము!!
మనము కూడా దేవునితో సమాధానముగా ఐక్యముగా విశ్వాసంలో స్థిరముగా ఉండాలి అంటే
మొదటగా లోకాన్ని లోకాశలను లోకాచారాలను దూరంగా పెట్టి అన్యులు చేసినట్లు మనము
చేయకుండా ప్రత్యేకముగా జీవిస్తే ఆయన యందలి విశ్వాసములోను ప్రేమలోనూ ఆత్మలోనూ
అభివృద్ధి పొందగలము!
ప్రియ చదువరీ! లోకమునుండి ప్రత్యేకముగా ఉంటున్నావా లేక లోకముతో కలిసిపోయి
ఉంటున్నావా? విశ్వాస వీరునిగా ఉంటున్నావా? లేక నులివెచ్చని స్థితిలో ఉన్నావా
ఒకసారి నిన్ను నీవు పరిశీలించుకోమని ప్రభువుపేరిట మనవిచేస్తున్నాను!
ఇక రెండవదిగా: ఈ
సంఘము పరిశుద్దులందరి యెడల విశ్వాసమును (కొన్ని ప్రతులలో ప్రేమను అని తర్జుమా
చేయబడింది): పరిశుద్దులందరి యెడల వీరు ప్రేమ చూపిస్తున్నారు! ప్రేమ చూపించడం అంటే
పెదాలతో ప్రేమ చూపించి వారికి మొండిచెయ్యి చూపడం కాదు! పరిశుద్ధుల అవసరాలను తీర్చడం, వారిని ఆదరించడం,
వారికి సపర్యలు చేయడం లాంటివి చేస్తున్నారు! వారికోసం ప్రార్ధన చేస్తున్నారు!
పరిశుద్ధులను తమసొంత వారిగా భావించి, వారిని దేవుని దూతలుగా భావిస్తూ వారికి
సపర్యలు చేస్తున్నారు!
ప్రియ చదువరీ/స్నేహితుడా! పరిశుద్దుల పట్ల నీవు అలా మెలగ
గలుగుతున్నావా? బైబిల్ చెబుతుంది- వారిలో
కొందరు తెలియకనే ఆతిధ్యం చేసి దేవుని నుండి గొప్ప మేలులు పొందుకున్నారు
అంటున్నారు....
హెబ్రీయులకు 13: 2
ఆతిథ్యము చేయ మరవకుడి; దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యముచేసిరి.
ఇంకా
మత్తయి 25 లో దీనులైన ఈ సహోదరులకు చేస్తే నాకు చేసినట్లే అని
యేసుక్రీస్తుప్రభులవారు తానే స్వయముగా చెప్పారు! మరి నీవు చేస్తున్నావా?
మత్తయి 25: 40
అందుకు రాజుమిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు
చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును.
ఇక మూడో విషయం: ఎప్పుడైతే ఈ సంఘములో
ఉన్న దేవుని పట్ల విశ్వాస ప్రేమలు, పరిశుద్ధుల పట్ల వీరికున్న ప్రేమానురాగాలు
చూసారో, వారికోసం పౌలుగారు మానక దేవునికి
కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నారు! హా మా బాగా సపర్యలు చేస్తున్నారు అని
పొంగిపోలేదు గాని వారి ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం మానకుండా ఎల్లప్పుడూ దేవునికి
కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నారు పౌలుగారు!
ప్రియ
దైవ సేవకుడా! నీ విశ్వాసుల పట్ల నీవు ఇటువంటి మనస్సు కలిగి వారి ఆధ్యాత్మిక
అభివృద్ధి కోసం ప్రార్ధన చేస్తున్నావా?
పౌలుగారు కేవలం ఎఫెసీయుల కోసమే ప్రార్ధన చేయలేదు, తన ద్వారా
స్థాపించిన సంఘాల కోసమే కాకుండా, అక్కడ దేవుని విశ్వాసులు ఉన్నారు అంటే వారు ఎవరో
ఆయనకు తెలియక పోయినా వారి ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం ప్రార్ధనలు చేసేవారు , ఉదాహరణ
కొలస్సీ సంఘము కోసం కూడా ప్రార్ధనలు చేసి ఉత్తరం రాసి పంపించారు! కొలస్సీ ప్రాంతాన్ని
ఆయన ఎప్పుడు దర్శించలేదు, గాని వారికోసం ప్రార్ధించి- అక్కడ తప్పుడుబోదలు ప్రజలను
గందరగోళంలో పడేశాయి అని తెలిసి ప్రార్ధించి ఉపవశించి ఉత్తరం రాశారు! కాబట్టి మనము
కూడా అందరికోసం ప్రార్ధన చెయ్యాలి! తెలిసిన వారికోసం, తెలియని వారికోసం,
ఇరుగుపొరుగు వారికోసం, శత్రువుల కోసం వారి రక్షణ కోసం బంధువుల రక్షణ కోసం
ప్రార్ధనలు చెయ్యాలి!
రోమా 1:9
ఇప్పుడేలాగైనను ఆటంకము లేకుండ మీ యొద్దకు వచ్చుటకు దేవుని
చిత్తమువలన నాకు వీలుకలుగు నేమో అని, నా ప్రార్థనలయందు ఎల్లప్పుడు ఆయనను
బతిమాలుకొనుచు,
రోమీయులకు 1: 10
మిమ్మును గూర్చి యెడతెగక జ్ఞాపకము చేసికొనుచున్నాను. ఇందుకు
ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి.
1థెస్సలొనికయులకు 1: 2
విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును,
మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును, మేము మన తండ్రియైన
దేవుని యెదుట మానక జ్ఞాపకము చేసికొనుచు, మా ప్రార్థనలయందు మీ విషయమై విజ్ఞాపనము
చేయుచు,
1థెస్సలొనికయులకు 1: 3
మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు
చెల్లించుచున్నాము.
2తిమోతికి 1: 3
నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసికొనుచు, నీ
కన్నీళ్లను తలచుకొని, నాకు సంపూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగలు
అపేక్షించుచు,
పౌలుగారి ప్రార్ధనలలో మనము
నేర్చుకోవలసిన మరో విషయం ఏమిటంటే కేవలం ప్రార్ధన మాత్రమే చెయ్యరు ఆయన- దేవునికి
కృతజ్ఞతాస్తుతులు చేస్తారు! ప్రార్ధన అంటే అప్లికేషన్! కృతజ్ఞతాస్తుతులు అంటే
దేవుణ్ణి స్తుతించడం పొగడటం, కొనియాడటం!
మనకు కేవలం అడగటం మాత్రమే వచ్చు గాని దేవుణ్ణి స్తుతించాలి అంటే నోరు రాదు!
ఒక నిమిషం కూడా దేవునికి స్తోత్రాలు చెప్పలేము! గాని పౌలుగారి నుండి మనము
నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే ఆయన కష్టాలలోను స్తుతించారు. మేలులందు స్తుతించారు!
ఫిలిప్పీ పట్టణంలో గుండగా తన్నేసి చెరశాలలో పెట్టేసినా స్తుతించారు! అందుకే కదా
పరలోకాన్ని కదిలించి, దూతనే తమ వద్దకు రప్పించి, భూకంపాన్ని రప్పించి, తమ బంధకాల
నుండి విడుదల పొందుకోగలిగారు! ప్రియ విశ్వాసి సేవకుడా! నీకు ఇలాంటి అనుభవం ఉందా?
ప్రతీ విషయము లోను దేవుణ్ణి స్తుతించగలుగుతున్నావా?
రోమా 1:8
మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటనుబట్టి,
మొదట మీ యందరి నిమిత్తము యేసు క్రీస్తుద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు
చెల్లించుచున్నాను.
1కొరింథీ 1:4
క్రీస్తుయేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి,
మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
ఫిలిప్పీయులకు 1: 6
నేను మిమ్మును జ్ఞాపకము చేసికొనినప్పుడెల్లను నా దేవునికి
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
2థెస్సలొనికయులకు 1: 3
సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మునుగూర్చి దేవునికి
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమైయున్నాము. ఇది యుక్తమే; ఏలయనగా మీ
విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివానియెడల
చూపు ప్రేమ విస్తరించుచున్నది.
పౌలుగారు
అన్నిటికంటే ముఖ్యంగా కోరుకున్నది విశ్వాసులు తమ దేవుని పట్ల స్థిరమైన విశ్వాసం
కలిగి, ఆ విశ్వాస ప్రేమల ద్వారా దేవునికి మహిమ తేవడం! అందుకే వారి ఆధ్యాత్మిక మేలులు కోసం ఎక్కువగా
ప్రార్ధన చేసేవారు! అంతేకాకుండా తనకు ఎన్ని కష్టనష్టాలు వచ్చినా వీరికోసం
ప్రార్ధించడం మానలేదు! కష్టాలలో కూడా దేవుణ్ణి స్తుతించడం మానలేదు!
మరి
మనం అలాంటి మాదిరికరమైన ప్రార్ధన నేర్చుకుందామా?
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -20వ భాగం*
ఎఫెసీ 1:17
మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, ఆయన మిమ్మును
పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క
మహిమైశ్వర్యమెట్టిదో,
ప్రియులారా మనం ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం
ధ్యానం చేస్తున్నాము!
ప్రియమైన దైవజనమా! మనముఎఫెసీ పత్రికలో మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధనల కోసం ధ్యానం
చేసుకుంటున్నాము!
ఇక 17వ వచనంలో మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున ఆయన
మిమ్మును పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ ఎట్టిదో .........
ఇక్కడ
జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎఫెసీ సంఘస్తులు ఎందుకు ఇంత స్థిరముగా ఉన్నారు అంటే
మొదటగా వీరి మనోనేత్రాలు వెలిగించబడ్డాయి!!! అలా వెలిగించ బడ్డాయి కనుకనే ఆయన
వారిని పిలిచిన పిలుపు ఏమిటో, ఆ పిలుపు వలన కలిగిన నిరీక్షణ ఏమిటో, పరిశుద్దులలో
ఆయన స్వాస్త్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో , దేవుడు క్రీస్తునందు వినియోగ పరచిన
బలాతిశయం ఏమిటో, మనయందు ఆయన చూపుతున్న శక్తి యొక్క అపరిమైన మహాత్యము ఎట్టిదో
కొద్దిగా తెలిసుకొన్నారు. ఇంకా సంపూర్తిగా తెలిసి కోవాలని పౌలుగారు ప్రార్ధన
చేస్తున్నారు! దీనికి కారణం మొదటగా వీరి మనోనేత్రాలు లేక ఆత్మీయ నేత్రాలు
వెలిగించబడ్డాయి!
గమనించాలి- అన్యులకు- దేవుడు అంటే పడని వారి మనోనేత్రాలు – ఈ యుగ సంబంధమైన దేవత – వారికి మబ్బు- చీకటి
కలిగించి వారు సత్యము తెలుసుకోకుండా చేస్తుంది.
2కోరింథీయులకు 4: 4
దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త
ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి
మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.
కాబట్టి మనము ప్రార్ధించి మొదటగా మనము మన
నేత్రాలు / మనోనేత్రాలు/ ఆత్మీయ నేత్రాలు వెలిగించబడి అందరికి ఈ సత్యమును వివరించి
చెప్పాలి! అప్పుడే వారు కూడా తమ మనోనేత్రాలను తెరుచుకుని సత్యమును తెలుసుకొంటారు!
ఒకసారి
ఆగి ఆలోచన చేస్తే మనోనేత్రము వెలిగించబడటం వలన ఏమి జరుగుతుంది అనేది తెలుస్తుంది!
*బిలాము గారు* మనస్సాక్షి కాలంలో దేవుని ప్రవక్తలు లేనప్పుడు ఉన్న
గొప్ప దైవజనుడు, ప్రవక్త! గాని ధనము మీద ఉన్న ఆశ- బిలాము గారి మనోనేత్రాలకు
గుడ్డితనం కలిగించి దేవుడు వద్దని చెప్పినా వినకుడా వెళ్లి నోరులేని గాడిద చేత
బుద్ధి చెప్పించుకున్నారు......
సంఖ్యా 22:22-34
26. యెహోవా దూత ముందు వెళ్లుచు కుడికైనను ఎడమకైనను
తిరుగుటకు దారిలేని యిరుకు చోటను నిలువగా
27. గాడిద యెహోవా దూతను చూచి బిలాముతోకూడ క్రింద
కూలబడెను గనుక బిలాము కోపముమండి తన చేతి కఱ్ఱతో గాడిదను కొట్టెను.
28. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కు నిచ్చెను గనుక అదినీవు
నన్ను ముమ్మారు కొట్టితివి; నేను నిన్నేమి చేసితినని బిలాముతో అనగా
29. బిలామునీవు నామీద తిరుగబడితివి; నాచేత ఖడ్గమున్నయెడల
నిన్ను చంపియుందునని గాడిదతో అనెను.
30. అందుకు గాడిదనేను నీదాననైనది మొదలుకొని
నేటివరకు నీవు ఎక్కుచు వచ్చిన నీ గాడిదను కానా? నేనెప్పుడైన నీకిట్లు చేయుట కద్దా?
అని బిలాముతో అనగా అతడులేదనెను.
31. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరచెను గనుక, దూసిన
ఖడ్గము చేతపట్టుకొని త్రోవలో నిలిచియున్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ
నమస్కారము చేయగా
సంఖ్యా
22-24 అధ్యాయాలు
చూశారా-
గాడిదకు దేవునిదూత కనబడ్డాడు గాని దైవసేవకునికి దేవుని దూత కనబడలేదు కారణం ధనము
మీద వ్యామోహంతో బిలాము గారి కళ్ళు మూసుకునిపోయాయి. తద్వారా మనోనేత్రాలు కూడా
మూసుకుపోయాయి!
మరొక దైవజనుడు ఉన్నారు! ఆయన కొండమీద నివాసం చేస్తారు! ఆయనకు ఒక
పనివాడు ఉన్నాడు! ఆ పనివాడు ఉదయాన్నే లేచిన వెంటనే ఆ కొండచుట్టు శత్రు సైనికులు
మొహరించి ఉండటం చూసి గగ్గోలు పెడుతున్నాడు! అయ్యో! గురువుగారు మన చుట్టూ శత్రు
సైనికులు ఆవరించి ఉన్నారు అంటున్నాడు. బహుశా వీడి బాధ గురువుగారిని పట్టుకుని
పోతారు అని కాదు- గురువు గారితో పాటుగా తనను కూడా వారు చంపేస్తారు అనుకుని
ఉండవచ్చు. గురువుగారు తాపీగా అంటున్నారు- కంగారు పడవద్దు, వారికంటే మన దగ్గర ఇంకా
ఎక్కువమంది సైన్యం ఉన్నారు! అయ్యా మనము ఇద్దరమే ఉన్నాము, వారు బోలెడు మంది సైన్యము
అంటున్నాడు~ గురువుగారు ప్రార్ధన చేశారు- ప్రభువా
వీడి కన్నులు తెరువు! వీడి ఆత్మీయ నేత్రాలు- మనో నేత్రాలు తెరువమని! వెంటనే దేవుడు
వాడి కన్నులు తెరిచారు- చూస్తే ఆ పర్వతం
చుట్టూ అగ్ని గుర్రాలు అగ్ని రధాలు కాపలా కాస్తున్నాయి! అప్పుడు అంటున్నాడు అయ్యా
వారికంటే మన దగ్గరే ఎక్కువ సైన్యం ఉంది!.......
2రాజులు 6: 17
యెహోవా, వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని
ఎలీషా ప్రార్థనచేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషాచుట్టును
పర్వతము అగ్ని గుఱ్ఱములచేత రథములచేతను నిండియుండుట చూచెను.
ఈరోజు మనం కూడా ఈ పనివాడులా చిన్న సమస్యను బూతద్దంలో చూస్తూ
గగ్గోలు పెడుతున్నాము! అదే మన నేత్రాలు వెలిగించ బడితే మనతో ఎవరున్నారో
తెలుసుకుంటే అరచి గగ్గోలు పెట్టము! తాపీగా దేవునిమీద ఆనుకుంటాము! అదే ఇశ్రాయేలు
ప్రజలకు- దైవజనుడైన దావీదు గారికి తేడా! గొల్యాతును ఫిలిష్తీయుల సైన్యాన్ని తమతో
పోల్చుకుని పారిపోయారు ఇశ్రాయేలు- సౌలు రాజు సైన్యం! అదే గొల్యాతును తన దేవునితో
పోల్చుకున్నారు దావీదు గారు! ఆకాశము దేవుని సింహాసనం భూమి ఆయన పాద పీఠం! వీడెంత?
సముద్రంలో కాకి రెట్టంత! వెళ్ళాడు- ఒక్క దెబ్బతో కొట్టి చంపేశారు దావీదు గారు! మనం
కూడా మన మనోనేత్రాలు- ఆధ్యాత్మిక నేత్రాలు వెలిగించ బడితే ఇలాంటి క్రియలు చేయగలము!
బిలాము గారికి కళ్ళు మూసుకుని పోయాయి- గాడిదతో బుద్ధి
చెప్పించుకున్నారు! దావీదు గారి కన్నులు తెరిచి ఉన్నాయి- ఒక్క దెబ్బతో గొల్యాతును
చంప గలిగాడు!
ఈరోజు మనలో అనేకమంది ఆత్మీయ నేత్రాలు- మనోనేతాలు మూసుకుని పోయి
ఉన్నాయి. అందుకే దేవుడు నిజంగా ఎవరో గ్రహించకుండా అజాగ్రత్తగా ఉన్నాము! మన
నేత్రాలు తెరిచి ఉంటే తప్పకుండా ఆయన ఎవరో నిజము గ్రహించి ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం,
ఆయనకు చూపించాల్సిన భయము భక్తులు ఆయనకు ఇద్దుము! అది తెలియకనే మందిరంలో కాళ్ళు
చాపుకుని తీపీగా పక్కన ఉన్నవాళ్ళతో కబుర్లు చెప్పుకుంటున్నాము!
సంసోను గారికి కామంతో ఆత్మీయనేత్రాలు/ మనోనేత్రాలు మూసుకుని పోయి-
అన్యస్త్రీని మోహించి, వేశ్య దగ్గరకు వెళ్ళారు-చివరకి కల్లుపీకించు కున్నారు! అదే
యోసేపు గారికి ధర్మశాస్త్రం లేకపోయినా/ తెలియక పోయినా తండ్రిగారు నేర్పించిన
భక్తితో తన మనస్సాక్షి ధర్మశాస్త్రంలా పనిచేసి- యజమాని భార్యను తల్లిలా భావించి
పాపమునుండి పారిపోయారు! చివరికి ఐగుప్టు దేశానికి గవర్నర్ కాగలిగారు!
బిలాము, దేమా, అననీయ సప్పీరాలు ధనముమీద ఆశతో కళ్ళు మూసుకుని పోయి
కుక్కచావు చచ్చారు!
దానియేలు షడ్రక్ మేషాక్ అబెద్నేగోలు ధనము మీద గాని, అధికారం మీద
గాని, తిని త్రాగడం మీద గాని లక్ష్యముంచక దేవునిమీదనే లక్ష్యముంచి ఆత్మీయ నేత్రాలు
వెలిగించుకున్నారు! గొప్ప అధికారులు కావడం మాత్రమే కాకుండా అనేక దేశాలలో దేవునికి
పేరును మహిమను తీసుకుని వచ్చారు!
ఈరోజు నీనోట అబద్దాలు, బూతుమాటలు, పోకిరిమాటలు వస్తున్నాయి అంటే నీ
మనోనేత్రాలు వెలిగించ బడక దేవుడు ఎవరో తెలియక ఆ మాటలు వస్తున్నాయి! ఈరోజు నీవు
వ్యభిచారం చేస్తున్నావు అంటే నీ కళ్ళు ఈ యుగసంబంధమైన దేవత మూసివేసింది. ఈరోజు నీవు కూడా అన్యులు చేస్తున్న ఆచారాలు
అన్యులు చేస్తున్న పనులు, అన్యజనులు లాగేనే సినిమాలు చూడటం సీరియల్లు చూడటం, నగలు
ధరించడం, తాళి కట్టడం, వాస్తులు చూడటం లాంటి అన్యాచారాలు చేస్తున్నావు అంటే నీ
మనోనేత్రాలు మూసుకుని పోయాయి! వాటిని మూసివేసింది ఈ యుగసంబంధమైన దేవత! నీవు దేవుని
బిడ్డవు అయితే దేవుని మాట వింటావు! గాని నీకు దేవుడు కావాలి- లోకము కావాలి! అందుకే
ఆ దేవత నీ కల్లు మూసివేసింది!
ఆ కళ్ళు తెరువబడాలని పౌలుగారు ప్రార్ధన చెయ్యడం లేదు ఇక్కడ! ఈ
సంఘానికి మనోనేత్రాలు తెరువబడే ఉన్నాయి! తద్వారా ఆధ్యాత్మిక మైన సంగతులు
గ్రహించాలని పౌలుగారు ప్రార్ధన చేస్తున్నారు!
చివరిగా
మనో నేత్రాలు వెలిగించబడితేనే/ తెరువబడితేనే వాక్యాన్ని బాగా అర్థం చేసుకోగలము! శిష్యులకు
దేవుడు పునరుత్థానం జరిగాక అదే చేశారు.
లూకా
24: 45
అప్పుడు వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సును
తెరచి....
మనస్సు
తెరచి అనగా ఆత్మీయ మనోనేత్రాలు తెరిచారు. ఈరోజు నీ ఆత్మీయ నేత్రాలు తెరువబడితే
వాక్యాన్ని బాగా అర్థం చేసుకోగలవు!!!
ప్రియ
సంఘమా! నీ నేత్రాలు వెలిగించబడ్డాయా? అయితే నీ ఆశలు చూపులు ఉద్దేశాలు కోరికలు
దేనిమీద ఉన్నాయి? భూసంబంధమైన వాటిమీదనా లేక పర సంబంధమైన ఆధ్యాత్మిక విషయాల మీదనా?
మాదిరికరమైన
పౌలుగారి ప్రార్ధనలో గల నిజమైన విషయాలు గ్రహిద్దాము!
ఆధ్యాత్మిక
మేలులు పొందుకుందాము!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -21వ భాగం*
మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధన-2
ఎఫెసీ 1:17
మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, ఆయన మిమ్మును
పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క
మహిమైశ్వర్యమెట్టిదో,...
ప్రియులారా
మనం ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం ధ్యానం చేస్తున్నాము!
ప్రియమైన దైవజనమా! మనముఎఫెసీ పత్రికలో మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధనల కోసం ధ్యానం
చేసుకుంటున్నాము!
ఇక
17వ వచనంలో మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపువల్లనైన
నిరీక్షణ ఎట్టిదో .........
ఇక
పౌలుగారి ప్రార్ధనలో తర్వాత అంశము: ఆయన మిమ్మును
పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ ఎట్టిదో....
పౌలుగారి ప్రార్ధనలలో మెటీరియల్ బ్లెస్సింగ్స్ ఉండవు అని
చూసుకున్నాము. అన్నీ ఆధ్యాత్మిక విషయాల కోసమే ఆయన ప్రార్ధన చేసేవారు- ఇక్కడ ఆయన
మిమ్మును పిలిచిన పిలుపువల్ల కలిగిన నిరీక్షణ ఎట్టిదో మీరు గ్రహించి దాని శక్తిని
పొందుకోవాలని ప్రార్ధన చేస్తున్నారు! గమనించాలి- ఎవరి మనోనేత్రాలు వెలిగించబడవో,
మూసుకుని పోయాయో వారు దేవుని పిలుపు వలన కలిగిన నిరీక్షణ ఎట్టిదో, దాని మహిమ
ఎట్టిదో, దాని ఘనత ఎట్టిదో, దాని వలన పొందుకోబోయే ఆధ్యాత్మిక మేలులు ఏమిటో
గ్రహించలేరు! గాని ఈ ఎఫెసీ సంఘము వారి మనోనేత్రాలు వెలిగించబడ్డాయి గనుక ఇప్పుడు
పౌలుగారు ప్రార్ధన చేస్తున్నారు- ఆయన ఎఫెసీయులను పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ
ఏమిటో- వారు సంపూర్ణంగా తెలుసుకోవాలి అని పౌలుగారి ఉద్దేశ్యం మరియు ప్రార్ధన!!!
చాలామందికి
వారు దేనికోసం పరుగు తీస్తున్నారో తెలియదు! మన నిరీక్షణ దేనిమీదనో ప్రతీ
విశ్వాసికి తెలియాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఒకడు గాలికి ప్రయత్నించి నట్లు
ఉంటుంది.
మన అందరికి ఒక నిరీక్షణ ఉంది. అది శుభప్రదమైన నిరీక్షణ- ఒకరోజు
మనము ఈ శ్రమలను శోధనలను జయించిన తర్వాత, మన ప్రియుడును రక్షకుడైన యేసయ్యను
కలుసుకోబోతున్నాము! దానికి గాను మేఘముల మీద ఎత్తబడబోతున్నాము! ఇంకా వేవేల
పరిశుద్ధులను, కోటివేల దూతలను జ్యేష్టుల సమూహమును కలుసుకొన బోతున్నాము! ఆయనతో
పెండ్లివిందులో పాలుపొందుకోబోతున్నాము చివరికి ఆయనతో కూడా పరిపాలన చేయబోతున్నాము!
ఆయనతో నిత్యమూ నివశించబోతున్నాము! దీనినే శుభప్రదమైన నిరీక్షణ అంటారు!
అయితే ఈ నిరీక్షణ ఎట్టిదో సంపూర్ణంగా గ్రహించాలి అని పౌలుగారి
ఉద్దేశం! గమనించాలి దేవుడు మనలను కోరుతున్నది ఏమిటంటే ఆయనను ఎరగడం మాత్రమే కాకుండా
ఆయన మనకోసం ఏవి సిద్ధం చేశారో, వాటిని ఎలా స్వాధీనం చేసుకోవాలో కూడా తెలుసుకోవాలి!
తీతు 2:12,13
12. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి,
శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము,
13. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు
మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను,
భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.
దానికి
నిరీక్షణ కావాలి మొదటగా!
ఈ
నిరీక్షణ కోసం ఆలోచిస్తే: దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ కలిగి ఉండాలి. తద్వారా
ఆయన మహిమను మనము కూడా పొందుకోవచ్చు
రోమా 5:2
మరియు ఆయన ద్వారా మనము విశ్వాసమువలన ఈ కృపయందు ప్రవేశముగల
వారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయ
పడుచున్నాము.
ఆ
నిరీక్షణ వలననే మనము ఒకరోజు మన పాప దేహం నుండి విమోచన పొంది మహిమ దేహం ధరించి
యేసుక్రీస్తుప్రభులవారిని కలవబోతున్నాము.
రోమా 8:23—25
23. అంతేకాదు, ఆత్మయొక్క ప్రథమ ఫలముల నొందిన మనముకూడ దత్త
పుత్రత్వముకొరకు, అనగా మన దేహము యొక్క విమోచనముకొరకు కనిపెట్టుచు మనలో మనము
మూలుగుచున్నాము
24. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి.
నిరీక్షింపబడునది కనబడునప్పుడు, నిరీక్షణతో పనియుండదు; తాను చూచుచున్న దానికొరకు
ఎవడు నిరీక్షించును?
25. మనము చూడనిదాని కొరకు నిరీక్షించిన యెడల ఓపికతో
దానికొరకు కని పెట్టుదుము.
అయితే
గ్రహించాల్సిన విషయమ ఏమిటంటే ఈ నిరీక్షణ కలిగి చివరికి మనము క్రీస్తు పోలికలోనికి
మారిపోవాలి! అప్పుడే ఆయనతో కూడా శాశ్వత కాలము జీవించగలము!
రోమీయులకు 8: 29
ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు,
దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని
ముందుగా నిర్ణయించెను.
రోమీయులకు 8: 30
మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని
పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ
పరచెను.
2కోరింథీయులకు 3: 18
మన మందరమును ముసుకు లేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను
అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత
(లేక, ఆత్మయగు ప్రభువుచేత) ఆ పోలికగానే మార్చబడుచున్నాము.
1యోహాను ౩:2—3
2. ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమైయున్నాము.
మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన
యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము.
3. ఆయనయందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన
పవిత్రుడైయున్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసికొనును.
ఇక
నిరీక్షణ కోసం ఆలోచిస్తే- ఈ నిరీక్షణ ఎట్టిదో చూసుకుందాము!
యోబు గారు నా నిరీక్షణకు ఆధారం ఏది అని అడిగితే
యోబు:17:15, దావీదు గారు నా
నిరీక్షణకు/నీతికి ఆధారమగు దేవా అని ప్రత్యుత్తరం చెప్పారు...
కీర్తనలు 4: 1
నా నీతికి ఆధారమగు దేవా, నేను మొఱ్ఱపెట్టు నప్పుడు
నాకుత్తరమిమ్ము ఇరుకులో నాకు విశాలత కలుగజేసినవాడవు నీవే నన్ను కరుణించి నా
ప్రార్థన నంగీకరించుము.
పౌలుగారు అంటున్నారు అబ్రాహాము గారి గురుంచి ఆయన
విశ్వాసులకు తండ్రి ఎలా అయ్యారు అంటే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు విశ్వాసముంచి
నమ్మి విశ్వాసులకు తండ్రి అయ్యారు. రోమా 4:18
ఇక రోమా 5:5 లో ఒక మేలిమి బంగారం లాంటి మాట చెప్పారు: ఈ
నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ...
ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు
అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో
కుమ్మరింపబడియున్నది.
అనేకులు మనలను
పిచ్చోళ్ళు అనుకుంటున్నారు- కారణం వారు చేసే పనులు మనము చేయటం లేదు- చప్పిడి పత్యం
చేస్తున్నాము. అయితే ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు గాని మనలను పరలోకం చేర్చుతుంది
తండ్రితో మరియు కుమారునితో ఐక్యం చేస్తుంది.
అందుకే
దావీదు గారు అంటున్నారు నా ప్రాణమా ఎందుకు కృంగి ఉన్నావు? దేవునియందు నిరీక్షణ
యుంచు....
కీర్తనలు 42:5, 11
5. నా ప్రాణమా, నీవు ఏల క్రుంగియున్నావు? నాలో నీవేల
తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా
దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను.
11. నా ప్రాణమా, నీవేల క్రుంగియున్నావు? నాలో నీవేల
తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు
ఇంకను నేనాయనను స్తుతించెదను.
అందుకే పౌలుగారు చెబుతున్నారు రోమా 8:24
ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి.
నిరీక్షింపబడునది కనబడునప్పుడు, నిరీక్షణతో పనియుండదు; తాను చూచుచున్న దానికొరకు
ఎవడు నిరీక్షించును?
రోమా 15:4
ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ
కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి.
ఇంకా
అంటున్నారు: పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఇంకా నిరీక్షణ గలవారు అవుతారు
రోమా 15:13
కాగా మీరు పరిశుద్ధాత్మశక్తి పొంది, విస్తారముగా నిరీక్షణ
గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను
మిమ్మును నింపునుగాక.
కొరింథీ
పత్రికలో అంటున్నారు చివరికి నిలిచేవి మూడు:
విశ్వాసము,
నిరీక్షణ మరియు ప్రేమ !! 1కొరింథీ 13:13
అయితే
నిరీక్షణ కలిగినప్పుడు శ్రమలు వస్తాయి. శ్రమలలో ఇంకా నిరీక్షణ విశ్వాసము కలిగి
ఉండాలి!
2కొరింథీ 1:10
ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించెను, ఇక
ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థనచేయుట వలన మీరు కూడ సహాయము
చేయుచుండగా, ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయనయందు నిరీక్షణ
గలవారమైయున్నాము.
గలతీ 5:5
ఏలయనగా, మనము విశ్వాసముగలవారమై నీతి కలుగునను నిరీక్షణ
సఫలమగునని ఆత్మద్వారా ఎదురుచూచుచున్నాము.
ఎఫెసీ పత్రికలో మనము ఎందుకు పిలువబడ్డామో చెబుతున్నారు:
ఎఫెసీ 4:4
శరీర మొక్కటే, ఆత్మయు ఒక్కడే; ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై
యొక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి.
Hebrews(హెబ్రీయులకు) 6:12,18,19
12. మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరచిన
ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించుచున్నాము.
18. మనయెదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన
మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను.
19. ఈ నిరీక్షణ నిశ్చలమును, స్థిరమునై, మన ఆత్మకు
లంగరువలెనుండి తెరలోపల ప్రవేశించుచున్నది.
హెబ్రీయులకు 10: 23
వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై
మన మొప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము.
1పేతురు 1:4, 13
4. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో
కూడిన (జీవముగల) నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ
బారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల
జన్మింపజేసెను.
13. కాబట్టి మీ మనస్సు అను నడుముకట్టుకొని నిబ్బరమైన
బుద్ధిగలవారై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ
నిరీక్షణ కలిగియుండుడి.
చివరగా
అబ్రాహాము గారు ఇదే నిరీక్షణ కలిగి ఆ పునాదులు గల పట్టణము కోసము ఎదురుచూసి
మాదిరిగా నిలిచిపోయారు.
హెబ్రీ 11:10...
ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో,
పునాదులుగల ఆ పట్టణముకొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను.
అదేవిధంగా
హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో గల విశ్వాసవీరులు కూడా ఆ పునాదులు గల పట్టణమును
స్వాధీనము చేసుకోలేక పోయినా నిరీక్షణ కలిగి
దూరము నుండి ఆ పునాదులు గల పట్టణమును చూసి వందనం చేసి విశ్వాసముగలవారై
చనిపోయారు.
హెబ్రీయులకు 11: 13
వీరందరు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి
చూచి వందనముచేసి, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పకొని,
విశ్వాసముగలవారై మృతినొందిరి.
మనము
కూడా అదే నిరీక్షణ కలిగి ఆ పునాదులు గల
పట్టణము కోసం ఎదురుచూస్తూ ఆ నిరీక్షణలో గల అధ్యాత్మికమేలులు పొందుకుందాము!!
ఆమెన్!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -22వ భాగం*
మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధన-3
ఎఫెసీ 1:17
మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, ఆయన మిమ్మును
పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క
మహిమైశ్వర్యమెట్టిదో,...
ప్రియమైన దైవజనమా! మనముఎఫెసీ
పత్రికలో మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధనల
కోసం ధ్యానం చేసుకుంటున్నాము!
ఇక
17వ వచనంలో మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపువల్లనైన
నిరీక్షణ ఎట్టిదో .........
ఇక
పౌలుగారి ప్రార్ధనలో తర్వాత అంశము: పరిశుద్ధులలో
ఆయన యొక్క స్వాస్త్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో....
తెలుగు బైబిల్ లో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అని
తర్జుమా చేయబడినా మిగిలిన ప్రతులలో ఇలా చెప్పబడింది , పరిశుద్ధులలో ఆయనకున్న
మహిమగల వారసత్వము ఎంత ఐశ్వర్యవంతమైనదో .....
గమనించవలసిన విషయం ఏమిటంటే విశ్వాసులందరికీ క్రీస్తులో
క్రీస్తుద్వారా వారసత్వం లభించింది. 14వ వచనం ఇదే చెబుతుంది. విశ్వాసులందరికీ
క్రీస్తుద్వారా దేవుని నుండి మనకు లభించే ప్రతీ ఈవిలోను ఆత్మీయ ఫలములోను పరలోక
స్వాస్త్యములోను వారసత్వం ఉంది. ఆయన మరణంలోనికి బాప్తిస్మము పొందిన మనకు
క్రీస్తుద్వారా ఆయనకున్న మహిమలోను ఈవులలోను వారసత్వము లభించింది. అందుకు గాను
ఋజువుగా పరిశుద్ధాత్మను సంచకరువుగా అనగా డిపాజిట్ గా పెట్టారు .వీటిని విశ్వాసము
ద్వారా స్వాధీనం చేసుకోవాలి విశ్వాసి!!! చివరికి చెప్పాలంటే లేవీయులకు దేవుడు నేనే
వారికి స్వాస్త్యము అని ఎలా చెప్పారో అలాగే విశ్వాసులందరికీ దేవుడే వారి
స్వాస్త్యము! అలాగే దేవుడే వారి ఆస్తి మరియు పెన్నిది! అలాగే విశ్వాసులందరూ అనగా
నిజమైన మారుమనస్సు పశ్చాత్తాపం కలిగి క్రీస్తుకోసం సాక్షులుగా నిలిచిన ప్రతీ
విశ్వాసి- దేవుని అపురూపమైన ఆస్తి. అందుకు గాను ఆయన తన సొంత ఏకైక కుమారుని
భూలోకానికి పంపించి కుమారుని ప్రాణంతో రక్తంతో ప్రజలను కొని విమోచించి తనకు
స్వాస్త్యముగా చేసుకున్నారు! అలా చేసి తన భాగములో వారికి వాటా స్వాస్త్యముగా
ఇచ్చారు! వారు కూడా అలాగే తన బిడ్డలుగా ప్రాణమున్నంత వరకు జీవించాలని దేవుడు
కోరుకుంటున్నారు!
ఈ విషయాన్ని ప్రతీ విశ్వాసి గ్రహించి ఆయన మనకొరకు దాచియుంచిన
మేలులు స్వాస్త్యమును పొందుకోవాలి! ఇదే పౌలుగారి ప్రార్ధన!
ఒకసారి యోహాను గారు చెప్పేది చూద్దాము!
యోహాను 1:12
తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు
విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.
ఇక పౌలుగారు అంటున్నారు- కుమారులైతే వారసులు అంటున్నారు:
రోమా 8:16—17
16. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ
సాక్ష్యమిచ్చుచున్నాడు.
17. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము;
క్రీస్తుతో కూడ మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తుతోడి వారసులము.
ఇక్కడ
ఒక విషయం జాగ్రత్తగా గమనించాలి- ఆయన స్వాస్త్యమును వారసత్వముగా ఎప్పుడు
పొందుకుంటాము అంటే ఆయనతో పాటుగా శ్రమ పడితేనే ఆయన మహిమను మరియు ఆయనకు గల సమస్తములో
వారసులము అవుతాము! నాకు మేలులే కావాలి- శ్రమలు శోధనలు వద్దు అంటే నీకు
స్వాస్త్యములో పాలుపంపులు లేవు!
ఇంకా
అంటున్నారు పౌలుగారు అదే అధ్యాయంలో 23—24
వచనాలు.
Romans(రోమీయులకు) 8:23,24
23. అంతేకాదు, ఆత్మయొక్క ప్రథమ ఫలముల నొందిన మనముకూడ దత్త
పుత్రత్వముకొరకు, అనగా మన దేహము యొక్క విమోచనముకొరకు కనిపెట్టుచు మనలో మనము
మూలుగుచున్నాము
24. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి.
నిరీక్షింపబడునది కనబడునప్పుడు, నిరీక్షణతో పనియుండదు; తాను చూచుచున్న దానికొరకు
ఎవడు నిరీక్షించును?
ఇదే విషయాన్ని వివరంగా ఎఫెసీ మొదటి అధ్యాయంలో
రాస్తున్నారు:1:3—14...
3. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు
స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మసంబంధమైన ప్రతి
ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.
4. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన
తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు,
5. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున,యేసుక్రీస్తు
ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై,మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని,
6. మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని
జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.
7. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన
రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.
8. కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటును బట్టి, ఆయన
తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి,
9. మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు, ఆ కృపను మనయెడల
విస్తరింపజేసెను.
10. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద
ఉన్నవేగాని, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలోతాను నిర్ణయించుకొనెను.
11. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన
మహిమకు కీర్తి కలుగజేయవలెనని,
12. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను
ముందుగా నిర్ణయించి, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను (లేక, మనకొక స్వాస్థ్యము
నేర్పరచెను) . ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను
జరిగించుచున్నాడు.
13. మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని,
క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి.
14. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన
(సొతైయిన ప్రజలకు) ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు
సంచకరువుగా ఉన్నాడు.
అదే
పేతురు గారు అంటున్నారు ఆయన మనలను రాజులైన యాజక సమూహముగాను తన సొత్తైన ప్రజగా
చేసుకున్నారు!....
1పేతురు 2: 9
అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి
మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును,
రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.
అయితే
గలతీ పత్రికలో మరో విషయాని చెబుతున్నారు పౌలుగారు- మరి ఇప్పుడు నీవు దేవుని
బిడ్డగా ఆయన కుమార/కుమార్తెగా మారావు కాబట్టి ఇక లోకమును అనుసరించి- లోకము యొక్క
ఆశల ప్రకారం నడువకుండా దేవుని బిడ్డగా ఆయన పిల్లగానే జీవించాలి. అప్పుడే నీవు
వారసుడవు!
గలతీ 4:5—9
5. మనము దత్తపుత్రులము (స్వీకృతపుత్రులము) కావలెనని
ధర్మశాస్త్రమునకు లోబడి యున్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు
లోబడినవాడాయెను.
6. మరియు మీరు కుమారులై యున్నందున నాయనా తండ్రీ, అని
మొఱ్ఱపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను.
7. కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే. కుమారుడవైతే
దేవుని ద్వారా వారసుడవు.
8. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగనివారై, నిజమునకు దేవుళ్లు
కానివారికి దాసులై యుంటిరి గాని
9. యిప్పుడు మీరు దేవునిని ఎరిగినవారును, మరి విశేషముగా
దేవునిచేత ఎరుగబడినవారునై యున్నారు గనుక, బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూల
పాఠముల తట్టు మరల తిరుగనేల? మునుపటివలె మరల వాటికి దాసులైయుండ గోరనేల?
కాబట్టి
ఆయన ద్వారా ఆయనలో మనకు స్వాస్త్యమునకు వారసత్వము లభించింది దానిని మనము
నిలబెట్టుకోవాలి! ఈ స్వాస్త్యము కరిగిపోయేది వాడిపోయేది కాదు. అది వాడబారనిది-
నిత్యమైనది- మహిమగలది! దానిని స్వాధీనం చేసుకోడానికి ఆయనతో పాటుగా శ్రమలను
అనుభవించాలి. అప్పుడే ఆయన వాగ్దానాలకు ఆయన స్వాస్త్యముకు వారసుడవు అవుతావు! దీనినే
గ్రహించాలని పౌలుగారు ఎఫెసీయుల పక్షముగా ప్రార్ధిస్తున్నారు! అట్టి స్వాస్త్యమును
మనము కూడా పొందుకుందుము గాక!
ఆమెన్!
*ఎఫెసీ పత్రిక -23వ భాగం*
మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధన-4
ఎఫెసీ 1:18
ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి
విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తియొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో,
మీరు తెలిసికొనవలెనని,
ప్రియమైన దైవజనమా! మనముఎఫెసీ
పత్రికలో మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధనల
కోసం ధ్యానం చేసుకుంటున్నాము!
ఇక
పౌలుగారి ప్రార్ధనలో తర్వాత అంశము: పరిశుద్ధులలో
ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న
తన శక్తియొక్క అపరిమితమైన మహాత్యము ఎట్టిదో....
ఈ
వచనంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనిపిస్తాయి. మొదటిది: ఆయన క్రీస్తునందు
వినియోగపరచిన బలాతిశయము...
రెండవది
: ఆ బలాతిశయమును విశ్వసించడం వలన మనయందు దేవుడు చూపుచున్న తన శక్తి యొక్క
అపరిమితమైన మహాత్యము ఎట్టిదో గ్రహించాలి.
మొదటగా మనము ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయము గూర్చి
కొద్దిగా ఆలోచిన చేద్దాం! ఆయన క్రీస్తునందు బలాతిశయమును వినియోగించారా???
అవును కదా! మహా గొప్ప బలాతిశయము వినియోగించారు దేవుడు!
కన్యక గర్భములో పుట్టడం బలాతిశయము కాదా?! యెషయా 7:14; లూకా 1:27;
గుడ్డివారికి చూపునివ్వడం బలాతిశయం కాదా!! లూకా 7:21; 18:43;
యోహాను 9:7
రోగులను బాగుచెయ్యడం బలాతిశయం కాదా!! లూకా 7:21,22
ఊచకాలుచేతులు గలవాని బాగుచెయ్యడం బలాతిశయం కాదా?
యోహాను 5
నీటిమీద నడవడం బలాతిశయం కాదా?
మత్తయి 14:25;
గాలి-తుఫాను ఆగిపో అని గద్దించిన వెంటనే గాలి తుఫాను ఆగిపోవడం
బలాతిశయం కాదా? మార్కు 4:39, లూకా 8:24;
చచ్చినవారిని లేపడం బలాతిశయం కాదా?!! యోహాను 11:44; లూకా 7:15;
దయ్యాలను అధికారంతో పొమ్మని చెబితే దయ్యాలు పారిపోవడం బలాతిశయం
కాదా? మార్కు 5:8-13; లూకా 4:41;
చివరికి తానే మన పాపముల కోసం రక్తాన్ని కార్చి చనిపోయి తిరిగి
మృత్యుంజయుడై లేచుట బలాతిశయం కాదా? మత్తయి 28:6; లూకా 24:5-7; అపొ 2:24,32, 3:15;
5:30;13:30; 1కొరింథీ 6:14;
చెరను చెరగా తీసుకుని పోవడం బలాతిశయం కాదా?
ఎఫెసీ 4:8;
సాతాను చెరలో ఉన్న ఆత్మలను విడిపించి మూడో ఆకాశమునకు
ఎత్తుకునిపోవడం అత్యధిక బలాతిశయం కాదా?!!
దానిని నమ్ముచున్న మనలను కూడా సాతాను చెరలోనుండి విడిపించడం,
నాశనానికి గురయ్యే మనలను పరముకు
హక్కుదారులుగా చెయ్యడం బలాతిశయం కాదా!!!
రోమా 6:17-18;
ఇంత
ఆశ్చర్యకరుడైన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుప్రభులవారికి అత్యధిక బలాతిశయమును
అనుగ్రహించి మనలను తనకు సొత్తుగా చేసుకున్నారు! ఒకరోజు సాతాను బిడ్డలుగా సాతానుకి
దాసులుగా పాపానికి బానిసలుగా ఉన్న మనలను నేడు ఆయన సొత్తుగా చేసుకొన్నారు అదే
బలాతిశయమును వినియోగించి!!
ఇంతటి
ఘనమైన కార్యాలు చేస్తున్నారు కాబట్టి పౌలుగారు చెబుతున్నారు దేవుడు తన కుమారుని
ఏమి చేశారో
ఎఫెసీ 1:20-23....
20. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలోనుండి లేపి,
సమస్తమైన ఆధిపత్యము కంటెను అధికారము కంటెను శక్తికంటెను ప్రభుత్వముకంటెను, ఈ
యుగమునందు మాత్రమే
21. గాక రాబోవు యుగము నందును పేరుపొందిన ప్రతి నామముకంటెను,
ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండ బెట్టుకొనియున్నాడు.
22. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, సమస్తముపైని
ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను.
23. ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపుచున్న
వాని సంపూర్ణతయై యున్నది.
అదే బలాతిశయమును
బలప్రభావాలను ఉపయోగించి నేడు తన బిడ్డలమైన మనలనందరినీ ఆయన కాపాడుచున్నారు!
గెద్దరెక్కల మీద ఎత్తుకుని సాతాను చిక్కులనుండి ఎన్నెన్నో ఆపాయాలు ఇరుకులు ఇక్కట్లు
నుండి మనలను రక్షిస్తున్నారు! ఆయన బలప్రభావాలు భూమిమీద నున్న దేనితోను సాటిరావు!
ఇక్కడ పౌలుగారు ఏమని
ప్రార్ధిస్తున్నారు అంటే దేవుడు క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును మనము కూడా
గ్రహించాలి. దాని శక్తిని గ్రహించాలి. అదే బలప్రభావాలు మనము కూడా ఆయనను విశ్వసించి
పొందుకోవాలి!!! ఇదే పౌలుగారి ప్రార్ధన!
ప్రియదైవజనమా!
ఆయన బలాతిశయమును గ్రహిస్తున్నావా? లేక అందరిలో ఒకదేవుడు అని వదిలేస్తున్నావా? ఆయన
బలాతిశయమును నిజంగా గ్రహిస్తే నీవు అజాగ్రత్తగా ఉండవు! దేవునియందు భయమును భక్తిని
కలిగిఉంటావు! ఆశ్రద్ద చేసి నిర్లక్షముగా ఉంటే విడువబడి నాశనముకు పోయే గుంపులో
ఉంటావు. ముఖ్యంగా ఆయన బలాతిశయమును గ్రహించలేక పోతే నీవు సాతానుతో యుద్ధం
చెయ్యలేవు. నీ గమ్యాన్ని చేరలేవు!
ఆయన
బలాతిశయమును గ్రహించి- ఆయన బలప్రభావాలును పొందుకొని ఆయన రాజ్యాన్ని చేరుకుందాము!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -24వ భాగం*
మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధన-5
ఎఫెసీ 1:18
ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి
విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తియొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో,
మీరు తెలిసికొనవలెనని,
ప్రియమైన దైవజనమా! మనముఎఫెసీ
పత్రికలో మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధనల
కోసం ధ్యానం చేసుకుంటున్నాము!
ఇక
పౌలుగారి ప్రార్ధనలో తర్వాత అంశము: పరిశుద్ధులలో
ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న
తన శక్తియొక్క అపరిమితమైన మహాత్యము ఎట్టిదో....
ఈ
వచనంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనిపిస్తాయి. మొదటిది: ఆయన క్రీస్తునందు
వినియోగపరచిన బలాతిశయము...
రెండవది
: ఆ బలాతిశయమును విశ్వసించడం వలన మనయందు దేవుడు
చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యము ఎట్టిదో గ్రహించాలి.
(గతభాగం తరువాయి)
ఇక రెండవ విషయం ఏమిటంటే: ఆ బలాతిశయమును విశ్వసించడం వలన మనయందు దేవుడు చూపుచున్న
తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యము ఎట్టిదో గ్రహించాలి.
ఇంత గొప్ప బలప్రభావాలు బలాతిశయము గల
దేవుణ్ణి ఆయన బలాతిశయమును విశ్వసించినందున దేవుడు మనయందు తనయొక్క అపరిమితమైన
మహాత్యమును చూపిస్తున్నారు మన జీవితాలలో! దానిని మనము గ్రహించాలి అని పౌలుగారి
ప్రార్ధన!
ఇక్కడ బలాతిశయము అనగా మన జీవితంలో ఆయనను విశ్వసించినందున ఆయన
చూపుతున్న బలాతిశయము – అది కేవలం మనము విశ్వసించి ప్రార్ధన చేయడం ద్వారా మనకు కలిగే
స్వస్తతలు, మనము ఇతరులకు ప్రార్ధించడం ద్వారా ఇతరులు పొందుకునే స్వస్తతలు, ఇతరులు
సాతాను శక్తులనుండి విడుదల పొందడానికే పరిమితమవ్వలేదు!
అవును ఈరోజు విశ్వసించి ప్రార్ధన చేయడం వలన ఎన్నెన్నో అధ్బుతాలు మహాత్కార్యాలు
జరుగుచున్నాయి. కారణం నాయందు విశ్వాసముంచువాడు అంతకంటే ఇంతకంటే గొప్ప కార్యాలు
చేస్తాడు అని యేసుక్రీస్తుప్రభులవారు చెప్పిన వాగ్దానాన్ని నమ్మడం వలన ఇవన్నీ
సాధ్యమవుతున్నాయి. యోహాను 14: 12
నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు
విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటె మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా
చెప్పుచున్నాను.
అసాధారణ అద్భుతాలు కూడా జరుగుచున్నాయి నేటి దినాలలో!
అయితే ఈ బలాతిశయము అద్భుతకార్యాలు స్వస్తతలకు ఆశీర్వాదాలకు పరిమితం
కాదు అంటున్నాను! ఇది బాగా అర్ధం కావాలంటే దేవుడు మనలను ఎలా ఎన్నుకున్నారో-
ఎలాంటివారిని ఎలా చేశారో ఇదే ఎఫెసీ పత్రిక ఇదే అధ్యాయము మూడో వచనం నుండి 14వ వచనం
వరకు జాగ్రత్తగా చదివి అర్ధం చేసుకుంటే ఆయన నిజమైన బలాతిశయము ఆయన నిజమైన
బలప్రభావాలు, మానలవులను రక్షించడానికి ఆయన
యొక్క మహోన్నతమనిన ప్రణాళిక అర్ధం అవుతుంది......
3. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు
స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మసంబంధమైన ప్రతి
ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.
4. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన
తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు,
5. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున,యేసుక్రీస్తు
ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై,మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని,
6. మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని
జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.
7. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన
రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.
8. కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటును బట్టి, ఆయన
తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి,
9. మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు, ఆ కృపను మనయెడల
విస్తరింపజేసెను.
10. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద
ఉన్నవేగాని, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలోతాను
నిర్ణయించుకొనెను.
11. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన
మహిమకు కీర్తి కలుగజేయవలెనని,
12. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను
ముందుగా నిర్ణయించి, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను (లేక, మనకొక స్వాస్థ్యము
నేర్పరచెను) . ఆయన తన చిత్తాను సారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను
జరిగించుచున్నాడు.
13. మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని,
క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి.
14. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన
(సొతైయిన ప్రజలకు) ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు
సంచకరువుగా ఉన్నాడు.
మూడో
వచనంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించారు.
తర్వాత వచనాలలో తన కుమారుని యందు మనకు ఉచితముగా రక్షణ అనుగ్రహించి
తన కృపచేత రక్షించారు. ఆయన ద్వారా మనలను కుమారులను లేక వారసులుగా చేసుకోడానికి ముందుగా
మనలను నిర్ణయించు కొన్నారు, అందుకోసం జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తుద్వారా
మనలను ఏర్పరచుకున్నారు తనకోసం!!! ఎందుకు? తన ఎదుట మనలను పరిశుద్దులము,
నిర్దోషులుగా ఉండటానికి!! ఏం పరిశుద్దులుగా నిర్దోషులుగా ఎందుకు ఉండాలి? మామూలుగా
ఉండొచ్చు కదా?
ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనలను కూడా పరిశుద్దులుగా
ఉండాలని కోరుకుంటున్నారు. ఆయన ఉండేది పరలోకం అందులో నిషిద్ధమైనది అపవిత్రమైనది
ప్రవిశించ లేవు! అందుకే తనతోపాటుగా మనము ఉండాలని మనలను నిర్దోషులుగా పరిశుద్దులుగా
ఉండాలని క్రీస్తుద్వారా మనలను ఆయనకోసం ఏర్పరచుకున్నారు! ఇందుకు గాను ఆయన మహా గొప్ప
వెల చెల్లించారు! ఆయన రక్తమువలనే మనకు విమోచనము- అపరాధాలకు క్షమాపణ కలిగింది. చివరకు పదో వచనం ప్రకారం పరలోకంలో ఉన్నవే గాని
భూమిమీద ఉన్నవే గాని సమస్తము క్రీస్తునందు దేవునితో ఏకముగా ఉండాలని క్రీస్తునందు
ముందుగా నిరీక్షించిన మనము, దేవుడు తన సంకల్పము బట్టి మనలను ముందుగా నిర్ణయించి
ఆయనయందు స్వాస్త్యముగా చేసుకున్నారు! ఆ సత్యవాక్యాన్ని సువార్తను నమ్మి విశ్వసించి
మనము వాగ్దానం చొప్పున తన ఆత్మచేత ముద్రించబడ్డాము!! దానికి గాను తన సొత్తైన
ప్రజగా మనము ఉండటానికి తన ఆత్మను
సంచకరువుగా అనగా డిపాజిట్ గా పెట్టారు!
ఇది నిజమైన బలప్రభావము! దేవుని ప్రణాళిక!!! ఇదే మనయందు ఆయన
చూపుతున్న తన శక్తి యొక్క అపరితమైన మహాత్యము! దీనిని మనం తెలుసుకోవాలని పౌలుగారు
ప్రార్ధన చేస్తున్నారు!
యోహాను గారు అంటున్నారు ౩:16,17;36
16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన
అద్వితీయకుమారునిగా ( లేక, జనితైక కుమారుడుగా) పుట్టిన వాని యందు విశ్వాసముంచు
ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.
17. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు
తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు.
36. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్యజీవము గలవాడు,
కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచి
యుండును.
యోహాను 6: 41
కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము
పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వానిని లేపుదును.
రోమా 5:10
ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణము ద్వారా మనము
దేవునితో సమాధాన పరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి
నిశ్చయముగా రక్షింపబడుదుము.
1కొరింథీ 1:9
మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు
మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు.
ఎఫెసీయులకు 4: 11
మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన
విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమగువరకు,
ఎఫెసీయులకు 4: 12
అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత
కలవారమగువరకు, ఆయన ఈలాగు నియమించెను.
కొలస్సీ 1:13
పరలోకమందు మీకొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి,
క్రీస్తుయేసునందు మీకు కలిగియున్న విశ్వాసమును గూర్చియు, పరిశుద్ధులందరి మీద
మీకున్న ప్రేమను గూర్చియు, మేము విని యెల్లప్పుడు మీ నిమిత్తము ప్రార్థనచేయుచు,
హెబ్రీ 1:2,3,4
2. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ
కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను (మూలభాషలో-
యుగములను) నిర్మించెను.
3. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, (లేక, ప్రతిబింబమును) ఆయన తత్వముయొక్క మూర్తి
మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో
శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత
శ్రేష్ఠుడై, ఉన్నత లోక
4. మందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను.
కాబట్టి
ఆయన యొక్క శక్తిని అర్ధము చేసుకుందాము! ఆ శక్తి యొక్క అపరితమైన మహాత్యాన్ని అర్ధం
చేసుకుని ఆయన పొందుకున్న బలప్రభావాలను మనము కూడా పొందుకుని ఆయన రాజ్యాన్ని
పొందుకుందాము!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -25వ భాగం*
మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధన-6
ఎఫెసీ 1:19
మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు
తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు
అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను.
ప్రియమైన దైవజనమా! మనముఎఫెసీ పత్రికలో మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధనల కోసం ధ్యానం
చేసుకుంటున్నాము!
ఇక
19వ వచనంలో తనను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును
ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించునట్లు నేను నా ప్రార్ధనల యందు మిమ్మును గూర్చి
విజ్ఞాపన చేయుచున్నాను!!
ఇక
పౌలుగారి ప్రార్ధనలో తర్వాత అంశము: తనను తెలుసుకొనుటయందు
మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించునట్లు...
ఇక్కడ
రెండు విషయాలు మనకు కనిపిస్తున్నాయి:
మొదటిది: తనను తెలుసుకోడానికి మనకు జ్ఞానము కావాలి.
రెండవది:ప్రత్యక్షత గల మనస్సు కావాలి! లేకపోతే ఆయన నిజంగా ఎవరో మనం
గ్రహించలేము! ఈ రోజులలో అనేకమంది విశ్వాసులు ఎందుకు అజాగ్రత్తగా – ఏదో మ్రొక్కుబడి భక్తి ఎందుకు
చేస్తున్నారు అంటే ఈ రెండు లేకనే! వారికి నిజంగా దేవుడు ఎవరో , ఆయన శక్తి, మహిమ
బలప్రభావాలు ఏమిటో గ్రహించే జ్ఞానము లేదు, ప్రత్యక్షత గల మనస్సు లేదు! ఈ రెండు
కావాలని, ఎఫెసీ సంఘ సభ్యులు పొందుకోవాలని పౌలుగారు ప్రార్ధన చెయ్యడం లేదు- విజ్ఞాపన
చేస్తున్నారు అనగా కన్నీటితో దేవుని సన్నిధిలో గోజాడుతున్నారు! ప్రియ
సేవకుడా/కాపరి! నీవుకూడా నా మంద ఇలాంటి జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు పొందుకోవాలి-
దేవుణ్ణి నిజంగా ఎరిగి ఆయనను సేవించాలని నీ సంఘము కోసం ప్రార్ధన చేస్తున్నావా?
బైబిల్ గందంలో కొంతమందికి దేవుడు కొన్ని
ప్రత్యక్షతలు ఇచ్చారు! యోహాను గారికి అంత్యదినాలలో ఏమి జరుగబోతున్నాయో ప్రత్యక్షత
ఇచ్చి- ప్రకటన గ్రంధము వ్రాయించుకున్నారు దేవుడు!
ప్రకటన గ్రంథం 1: 1
యేసుక్రీస్తు (క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్ధము)
తన దాసులకు కనుపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. (లేక, ప్రకటన) ఈ
సంగతులు త్వరలో సంభవింపనైయున్నవి; ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన
యోహానుకు వాటిని సూచించెను.
యోసేపు
గారికి, దానియేలు గారికి కలలకు అర్ధము చెప్పడం, లోతైన మర్మాలు గ్రహించడం లాంటి
ప్రత్యక్షత గల మనస్సు ఇచ్చారు! ......
ఆదికాండము 41: 15
ఫరో యోసేపుతో నేనొక కల కంటిని, దాని భావమును
తెలుపగలవారెవరును లేరు. నీవు కలను విన్నయెడల దాని భావమును తెలుపగలవని నిన్నుగూర్చి
వింటినని అతనితో చెప్పినందుకు
ఆదికాండము 41: 39
మరియు ఫరో : దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనుక నీవలె
వివేక జ్ఞానములు గలవారెవరును లేరు.
దానియేలు 1: 17
ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల
శాస్త్రప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములగు దర్శనములను
స్వప్నభావములను గ్రహించు తెలివిగలవాడై యుండెను.
దానియేలు 2: 47
మరియు రాజుఈ మర్మమును బయలు పరచుటకు నీవు సమర్థుడవైతివే; నీ
దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచు వాడునై యున్నాడని
దానియేలునకు ప్రత్యుత్తర మిచ్చెను.
దానియేలు 5: 11
నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు. అతడు పరిశుద్ధ దేవతల
ఆత్మగలవాడు; నీ తండ్రికాలములో అతడు దైవజ్ఞానమువంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు
గలవాడై యుండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రియైన రాజగు నెబుకద్నెజరు శకున
గాండ్రకును గారడీవిద్యగల వారికిని కల్దీయులకును జ్యోతిష్యులకును పై యధిపతిగా అతని
నియమించెను.
దానియేలు 5: 12
ఈ దానియేలు శ్రేష్ఠమైన బుద్ధిగలవాడై కలలు తెలియజేయుటకును,
మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకుత్తర మిచ్చుటకును జ్ఞానమును
తెలివియుగలవాడుగా కనబడెను గనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అను పేరు పెట్టెను. ఈ
దానియేలును పిలువనంపుము, అతడు దీని భావము నీకు తెలియజెప్పును.
దానియేలు 9: 22
అతడు నాతో మాటలాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లనెను
దానియేలూ, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చితిని.
అగబు అనే ప్రవక్తకు పౌలుగారికి ఏమేమి
సంభవించబోతున్నాయో యేరూషలేము పట్టణంలో వివేచించే మనస్సు ఇచ్చారు.
అపో.కార్యములు 11: 28
వారిలో అగబు అను ఒకడు నిలువబడి, భూలోకమంతట గొప్ప కరవు
రాబోవుచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించెను.
అపో.కార్యములు 21: 11
అతడు మాయొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసికొని, తన చేతులను
కాళ్లను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టుగల మనుష్యుని ఈలాగు బంధించి,
అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను.
ఇలా
ఒక్కొక్కరికి దేవుడు కొన్ని ప్రత్యక్షతలు ఇస్తారు వారి సామర్ధ్యము మరియు వారి
నమ్మకత్వముబట్టి! అయితే ఇలాంటి ప్రత్యక్షతలు సంఘము పొందుకోవాలి గాని ఇవి
పొందుకోలేక పోయినా గాని నిజంగా దేవుడు ఎవరో ఆయన బలప్రభావాలు శక్తి- ఆయన
క్రీస్తునందు వినియోగ పరిచిన మహిమ తెలుసుకొనే జ్ఞానము- ప్రత్యక్షత గల మనస్సు
పొందుకోలేక పోతే ఆయనను అర్ధము చేసుకోలేక ఏదో మ్రొక్కుబడి భక్తినే చేస్తారు!
ఈరోజులలో అనేకమందికి ఏ లాప్టాప్ లో ఏ ఫీచర్స్ ఉన్నాయో, ఏ
మొబైల్ లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో, ఏ కంపెనీ షేర్లు కొంటే లాభం వస్తుందో, ఎప్పుడు
అమ్మాలో ఎప్పుడు కొనాలో, ఏ ప్రాపర్టీ కొంటే లాభపడతారో ఇలాంటి వాటిలో మంచి జ్ఞానము
వివేచన ప్రత్యక్షత కలిగి ఉన్నారు గాని ఏ మార్గము అవలంభిస్తే పరలోకం చేరుతామో, ఏ
దేవుణ్ణి అనుసరిస్తే నిత్యనరకం తప్పించుకొని నిత్యరాజ్యం చేరుతామో లాంటి ఆలోచన
జ్ఞానం కొంచెమైనా లేదు! అది లేకుండా ఈ లోక దేవత వారి కన్నులకు గ్రుడ్డితనము
కలుగజేసింది. అన్యులను వదిలెయ్యండి-
దేవుని బిడ్డలు రక్షణ పొందుకున్నవారు కూడా ఈలోక ఆశలలో – పైన చెప్పిన
వాటిమీద- శరీర ఆశలమీద లక్ష్యముంచుతున్నారు గాని ఆధ్యాత్మిక ఫలములు దేవుని వరములు
మీద దృష్టి పెట్టడం లేదు! ఏదో భక్తిచేస్తున్నారు! ఆదివారం చర్చికి వస్తున్నామా,
హాజరు వేయించుకుంటున్నామా లేదా ఆరాధనాక్రమంలో పాల్గొంటున్నామా అంతే! మరికొందరు
అయితే వారి సంఘంలో చదువుకొనే సంఘ క్రమమే ఆరాధన- భక్తి అనుకుంటున్నారు గాని ఆయన
రాకడకు సిద్దపడటం గాని, సంపూర్ణత సాధించడం కోసం గాని వారి భక్తిలేదు! ఆ ఆలోచన
లేదు! కారణం వారికి దేవుణ్ణి తెలుసుకొనే జ్ఞానము లేదు! ప్రత్యక్షత గల మనస్సు లేదు!
ఇవే కావాలని పౌలుగారు ఎఫెసీ సంఘము కోసం కన్నీటితో ప్రార్ధన
విజ్ఞాపనలు చేసున్నారు! ప్రియ సంఘమా! నేడు నీవుకూడా వీటిని పొందుకోవాలి!!!
ఇక
జ్ఞానము ఎందుకు అవసరమో ఒకసారి చూసుకుందాము!
1కొరింథీ 2:6—7 లో దేవుని జ్ఞానము
మర్మమైనది, మరుగై ఉండేది అయితే అది ఇప్పుడు దేవుడు బయలుపరిచారు అంటున్నారు...
6. పరిపూర్ణులైనవారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది
యీ లోక (మూలభాషలో- ఈ యుగ) జ్ఞానము కాదు, నిరర్థకులై పోవుచున్న యీ లోకాధికారుల
జ్ఞానమును కాదుగాని
7. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము; ఈ
జ్ఞానము మరుగైయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము
నియమించెను.
ఆ
జ్ఞానము క్రీస్తు సువాసన అంటున్నారు...
2కోరింథీయులకు 2: 14
మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము
యొక్క సువాసనను కనుపరచుచు ఆయనయందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న
దేవునికి స్తోత్రము.
అది
యేసుక్రీస్తునందు యేసుక్రీస్తు ద్వారా వెల్లడి చేశారు 2కొరింథీ
4:5
అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన
దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములలో
ప్రకాశించెను.
వీటికోసం
ఈ అతిశ్రేష్టమైన జ్ఞానం కోసం నాకు కలిగిన ప్రతిదానిని పెంటగా ఎంచుకుని వదిలేశాను
అంటున్నారు పౌలుగారు
ఫిలిప్పీయులకు 3: 8
నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన
అతిశ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను.
మీరు కూడా వదిలేస్తే మీకు జ్ఞానము కలుగుతుంది అంటున్నారు-
తద్వారా దేవుని పోలికలోనికి మారగాలము నవీన స్వభావం పొండుకుంటాము అంటున్నారు
కొలస్సీయులకు 3: 10
మీరు పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని
సృష్టించినవాని పోలికచొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును
ధరించుకొనియున్నారు.
అందుకే సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోండి
కొలస్సీయులకు 4: 5
సమయము పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, సంఘమునకు వెలుపటి
వారియెడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి.
అయితే పౌలుగారు
తిమోతికి లేఖ రాస్తూ ఆ జ్ఞానమును పరిశుద్ధ గ్రంధము లేఖనములు చదవడం ద్వారా
పొందుకోవచ్చు అంటున్నారు
2తిమోతి ౩:14
క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన
జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు
గనుక,
యాకోబు
గారు అంటున్నారు ఈ జ్ఞానము పైనుండి అనగా పరమునుండి దేవుని నుండి కలిగింది
అంటున్నారు. ఈ లోక జ్ఞానము ప్రకృతి సంబంధమైనది దయ్యాలకు చెందింది.
౩:17,
15
యాకోబు 3: 17
అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత
సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను
నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణమైనను లేనిదియునైయున్నది.
యాకోబు 3: 15
ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చునదికాక భూసంబంధమైనదియు ప్రకృతి
సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునైయున్నది.
యోబు
గారు అంటున్నారు- ఈ సంగతులు వారు ఎందుకు గ్రహించడం లేదు అంటే నీవు వారి హృదయాలకు
జ్ఞానము మరుగుచేశావు 17:4
కారణం
నీమార్గము నీ జ్ఞానము మాకక్కరలేదు అంటున్నారు వారు 21:14;
చివరికి అంటున్నారు జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది? వివేచనా ఎక్కడ
దొరుకుతుంది? 28:12
జవాబు: యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానము!
సామెతలు 9: 10
యెహోవాయందు భయభక్తులు గలిగి యుండుటయే జ్ఞానమునకు మూలము
పరిశుద్ధ దేవునిగూర్చిన తెలివియే వివేచనకు ఆధారము.
కీర్తనలు 19: 7
యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థ మైనది అది ప్రాణమును
తెప్పరిల్లజేయును యెహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము
పుట్టించును.
కాబట్టి
ప్రియ సంఘమా! ఆయనను గూర్చిన జ్ఞానము మరియు ప్రత్యక్షత కలిగిన మనస్సు కావాలని
భారముగా ప్రార్ధించి పొందుకుందాము!!!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -26వ భాగం*
ఎఫెసీ 1:20--23
20. ఆయన ఆ బలాతిశయముచేత క్రీస్తును మృతులలోనుండి లేపి,
సమస్తమైన ఆధిపత్యముకంటెను అధికారముకంటెను శక్తికంటెను ప్రభుత్వముకంటెను, ఈ
యుగమునందుమాత్రమే
21. గాక రాబోవు యుగము నందును పేరుపొందిన ప్రతి నామముకంటెను,
ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వ మున కూర్చుండబెట్టుకొనియున్నాడు.
22. మరియు సమస్తమును ఆయన పాదములక్రింద ఉంచి, సమస్తముపైని
ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను.
23. ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపు చున్న వాని
సంపూర్ణతయై యున్నది.
ప్రియమైన దైవజనమా! మనము ఇంతవరకు ఎఫెసీ
పత్రికలో మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధనల
కోసం ధ్యానం చేసుకున్నాము! ఇక మనం పత్రిక ధ్యానాలు చూసుకుందాం!
ఇక 20—21 వచనాలలో అంటున్నారు ఆయన
బలాతిశయముచేత దేవుడు క్రీస్తును మృతులలోనుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటే
అధికారమును శక్తి కంటే ప్రభుత్వముల కంటే ఈ యుగమందేకాకుండా రాబోవు యుగమునందు కూడా
పేరు పొందిన ప్రతి నామముకంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను దేవుడు తన కుడి
పార్వ్శమున కూర్చుండబెట్టికొని యున్నాడంటున్నారు
యేసు క్రీస్తు మరణం నుంచి సజీవంగా లేచారు, శరీరంతో పరలోకానికి
వెళ్ళిపోయారు . ఈ మహా అధ్బుత కార్యం ద్వారా
మానవ చరిత్ర అంతటిలోకెల్లా దేవుని బలప్రభావాలు అనగా దేవుని మహా అద్భుతమైన
శక్తి సామర్ధ్యాలు అమోఘంగా వెల్లడి అయ్యాయి
– బైబిల్ లో
ఆయనలేచారు అని చాలాచోట్ల చెప్పబడి యుంది!
మత్తయి 28:6; ఆయన ఇక్కడ లేడు; తాను చెప్పినట్టే ఆయన లేచి
యున్నాడు; రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి...
మార్కు 16:6,
అందుకతడు కలవరపడకుడి సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు;
ఆయన లేచియున్నాడు, ఇక్కడ లేడు; వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి.
మార్కు 16:19; ఈలాగు ప్రభువైన యేసు వారితో మాటలాడిన తరువాత
పరలోకమునకు చేర్చుకొనబడి, దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యెను.
లూకా 24:6-7,
6. ఆయన ఇక్కడలేడు, ఆయన లేచియున్నాడు; ఆయన ఇంక గలిలయలో ఉండి
నప్పుడు
7. మనుష్యకుమారుడు పాపిష్ఠులైన మనుష్యుల చేతికి
అప్పగింపబడి, సిలువవేయబడి, మూడవ దినమందు లేవవలసియున్నదని ఆయన మీతో చెప్పిన మాట
జ్ఞాపకము చేసికొనుడని వారితో
లూకా 24:51;
వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలోనుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు
ఆరోహణుడాయెను.
అపో. కార్యములు
1:3, ఆయన శ్రమపడిన తరువాత నలువది దినములవరకు వారి కగపడుచు, దేవుని రాజ్యవిషయములనుగూర్చి
బోధించుచు, అనేక ప్రమాణములను చూపి వారికి తన్నుతాను సజీవునిగా కనుపరచుకొనెను.
అపో. కార్యములు
1:9; ఈ మాటలు చెప్పి, వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను, అప్పుడు వారి కన్నులకు
కనబడకుండ ఒక మేఘము ఆయనను కొనిపోయెను.
అపో. కార్యములు 2:32-33;
32. ఈ యేసును దేవుడు లేపెను; దీనికి మేమందరము సాక్షులము.
33. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి,
పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రివలన పొంది, మీరు చూచుచు వినుచునున్న
దీనిని కుమ్మరించి యున్నాడు.
రోమీయులకు 1: 5. యేసుక్రీస్తు, శరీరమునుబట్టి దావీదు సంతానముగాను,
మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను
ప్రభావముతో నిరూ పింపబడెను.
హెబ్రీయులకు 1:3. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును,ఆయన
తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు,
పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో
వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోక
అయితే దేవుడు యేసుక్రీస్తుప్రభులవారికి ఎందుకు అంత ఉన్నతమైన
ఔనత్యమైన నామము దయచేశారో మనకు ఫిలిప్పీపత్రికలో చాలా వివరంగా చూడవచ్చు! ఫిలిప్పీ
2:
5. క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి.
6. ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా
ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని
7. మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని,
తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.
8. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము
పొందునంతగా, అనగా సిలువమరణము పొందు నంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను
తగ్గించుకొనెను.
9. అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో
గాని,
10. భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును
యేసునామమున వంగునట్లును,
11. ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై
యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి
నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.
చూడండి
ఆయన దేవునిచేత పంపబడి దేవునితో సమానమైన శక్తిసామర్ధ్యాలు గలవాడైనా, దైవచిత్తము
నెరవేరేలా సామాన్య మానవునిలా పుట్టడమే కాకుండా దేవుడు దాసునిరూపం దాల్చి సిలువ
మరణం పొందునంతగా తనను తానూ తగ్గించుకున్నారు కాబట్టే దేవుడు అంత మహోన్నతమైన నామము
ఆయనకు ఇచ్చి అన్నింటికంటే పై నామము ఇచ్చారు! అంతగా హెచ్చించారు !
దేవుడు
సృష్టించిన విశ్వమంతటి కంటే, దాని శక్తులు, ప్రభుత్వాలన్నిటి కంటే అత్యున్నతంగా
క్రీస్తు ఉన్నత స్థలానికి వెళ్ళి తన తండ్రి సింహాసనంపై కూర్చున్నారు – కొలొస్సయులకు
2:10; మరియు ఆయనయందు మీరును సంపూర్ణులై
యున్నారు; ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై యున్నాడు;
ప్రకటన గ్రంథం 1:5.
నమ్మకమైన సాక్షియు, మృతులలోనుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు
అధిపతియునైన యేసుక్రీస్తు నుండియు, కృపాసమాధానములు మీకు కలుగునుగాక.
కాబట్టి ఇప్పుడు ఏ మనిషి గానీ దేవదూత గానీ ఒకప్పుడు జీవించి
ఉన్నవారూ ఇప్పుడు జీవిస్తున్నవారూ ఎవరూ కూడా
ఆయనయొక్క శక్తి సామర్ధ్యాలతో బలప్రభావాలలో, అధికారంలో, మహిమలో, ఘనతలో యేసు
కాలిగోటికి కూడా సాటిరారు. ఆయన్ను సజీవంగా లేపిన దేవుని బలప్రభావాలే ఇప్పుడు
మనకోసం, మనలో పని చేస్తున్నాయి – వ 19. ఈ విధంగా
మనం అత్యధిక విజయం పొందగలుగుతాం – రోమీయులకు
8:37. అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము
పొందుచున్నాము
ఈ
విధంగా మాత్రమే ఈ శత్రు లోకంలో నిజంగా క్రీస్తును సేవించగలం, లోకాన్ని, శరీర
స్వభావాన్ని, సైతానును ఓడించగలం, ఈ భూమి పై మన జీవితాన్ని ఆనందంగా ముగించగలం. అలా
కాకపోతే మనకు అందుబాటులో ఉన్న బలప్రభావాలను మనం ఉపయోగించు కోలేదు అన్నమాట.
ఇక 22,23 వచనాలలో అంటున్నారు
22. మరియు సమస్తమును ఆయన పాదములక్రింద ఉంచి, సమస్తముపైని
ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను.
23. ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపు చున్న
వాని సంపూర్ణతయై యున్నది.
అంతగా తగ్గించుకున్న్నారు కాబట్టే దేవుడు సృష్టిలో సమస్తమును
యేసుక్రీస్తుప్రభులవారి పాదాల క్రింద ఉంచి సమస్తముపై ఆయనను శిరస్సుగా నియమించారు!
ఇంకా సంఘానికి కూడా శిరస్సుగా నియమించారు!
ఆ సంఘము ఆయన అనగా యేసుక్రీస్తుప్రభులవారి యొక్క శరీరము, మరియు ఆయన యొక్క సంపూర్ణత
అయి ఉన్నది అంటున్నారు!
సమస్తము
ఏసుక్రీస్తు పాదాల కింద ఉంచారు అనడానికి మనకు చాలా రిఫరెన్సులు ఉన్నాయి”– అపో. కార్యములు 2:34-36;
34. దావీదు పరలోకమునకు ఎక్కి పోలేదు; అయితే అతడిట్లనెను–నేను నీ
శత్రువులను నీ పాదములక్రింద పాదపీఠముగా ఉంచువరకు
35. నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా
ప్రభువుతో చెప్పెను.
36. మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను
క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను
కీర్తనల గ్రంథము
110
1. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినవాక్కు నేను నీ
శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము.
హెబ్రీయులకు
1:13; అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా
కుడిపార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవనినిగూర్చియైన యెప్పుడైనను చెప్పెనా?
హెబ్రీయులకు 2:8-9;
హెబ్రీయులకు 10:13. అప్పటినుండి తన శత్రువులు తన పాదములకు
పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్యమున ఆసీనుడాయెను.
ఇక
దేవుడు క్రీస్తుని “శిరస్సుగా నియమించారు అని క్రొత్త నిబంధనలో అనేకసారులు
చూడవచ్చు!”– ఎఫెసీయులకు 4:15; ఎఫెసీయులకు 5:23; క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్న లాగున
పురుషుడు భార్యకు శిరస్సై యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు.
కొలొస్సయులకు 1:18;
సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు; ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము,
ఆయన ఆదియైయుండి మృతులలోనుండి లేచుటలో ఆదిసంభూతుడాయెను.
కొలొస్సయులకు
2:19.
నిజ సంఘానికి ఉన్న, ఉండగలిగే ఏకైక
శిరస్సు క్రీస్తే. శిరస్సు అంటే అధికారికి, నడిపించేవానికి సూచనగా ఉంది. శరీరం ఏమి
చెయ్యాలో ఆలోచించి, నిర్ణయించి ఆజ్ఞలు ఇచ్చే మెదడు, లేక మనస్సు శిరస్సు అంతే.
క్రీస్తు కేవలం సంఘంపై అధికారి మాత్రమే కాదు. దేవుని ఆత్మ మూలంగా దానితో ఏకంగా
ఉన్నవాడు. ఆయనలో ఉన్న జీవమే, ఆయనలో ఉన్న ఆత్మే తన సంఘంలో కూడా ఉన్నాడు. ఇక్కడ
“సంఘం” అంటే ఆయన ఆధ్యాత్మిక శరీరం. అందులో ఆయనలోని నిజ విశ్వాసులు మాత్రమే ఉన్నారు
దీనికోసం గతభాగాలలో విస్తారంగా చూసుకున్నాము!
ఇక
సంపూర్ణత కోసంచూసుకుంటే “సంపూర్ణత”–
క్రీస్తు విశ్వమంతా నిండివున్నవాడు –
ఎఫెసీయులకు 4:10;
కొలొస్సయులకు 1:17. ఆయన సంఘమే ఆయన సంపూర్ణత.
శరీరం లేకుండా ఒక్క తలనే సంపూర్ణమైనదిగా భావించలేము. వ 23కు ఇదొక వివరణ. మరో
వివరణేమిటంటే క్రీస్తే దేవుని సంపూర్ణత. కొలొస్సయులకు
2:9-10
9. ఏలయనగా దేవత్వముయొక్క సర్వపరిపూర్ణత శరీరముగా
క్రీస్తునందు నివసించు చున్నది;
10. మరియు ఆయనయందు మీరును సంపూర్ణులై యున్నారు; ఆయన సమస్త
ప్రధానులకును అధికారులకును శిరస్సై యున్నాడు
కాబట్టి
కొలస్సీ 2:19లో చెప్పబడిన ప్రకారం క్రీస్తు మనశిరస్సు కాబట్టి మనమందరం ఆ శిరస్సుతో
అతుకబడి ఉండాలి లేకపోతె మనం వెంటనే చనిపోతాము! అలా చనిపోకుండా జీవముకలిగి ఉండాలంటే
శిరస్సు అయిన యేసుక్రీస్తుప్రభులవారితో అతుకబడి ఆయనతో సత్సంబంధం కలిగి ఉందాం! ఆయన
ఆత్మను కలిగి ఆత్మానుసారంగా నడుచుకుందాం!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -27వ భాగం*
ఎఫెసీ 2:1—2
1. మీ అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారై యుండగా,
ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను.
2. మీరు వాటిని చేయుచు, వాయు మండల సంబంధమైన అధిపతిని, అనగా
అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ
ధర్మముచొప్పున మునుపు నడుచుకొంటిరి.
ప్రియమైన దైవజనమా! మనము ఇంతవరకు ఎఫెసీ
పత్రికలో మొదటి అధ్యాయమునుండి ధ్యానం చేసుకున్నాము! ఇక రెండవ అధ్యాయమునుండి ధ్యానం
చేసుకుందాం! గమనించాలి రెండవ అధ్యాయము పౌలుగారు 1:19 లో మొదలుపెట్టిన అంశాన్నే
కొనసాగిస్తున్నారు!
మొదటి రెండు వచనాలు చూసుకుంటే మీ ఆపరాధముల చేత పాపములచేత మీరు
చచ్చిన వారై ఉండగా దేవుడు మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను అంటున్నారు! ఎలా
చచ్చిపోయారు అంటే ఆధ్యాత్మికంగా చనిపోయిన స్థితిలో ఉండగా క్రీస్తు తన ఆధ్యాత్మిక
జీవము శాశ్వత జీవము ఇచ్చి మనలను తనతో కూడా బ్రతికించారు అంటున్నారు!
మనపట్ల దేవుని
“శక్తిసామర్ధ్యాలు చాలా ఎక్కువగా పనిచేస్తున్నాయి! గత అధ్యాయంలో ఎఫెసీయులకు
1:20-23 లో ఈ బలప్రభావాలు క్రీస్తులో ఎలా పని చేశాయో చూపించారు పౌలుగారు! .
ఇప్పుడు విశ్వాసులమైన మనలో అవి ఎలా పని
చేస్తాయో చెబుతున్నారు పౌలుగారు . దేవుడు క్రీస్తును మరణం నుంచి సజీవంగా లేపి
పరలోకంలో ఆయన్ను ఘనపరిచారు. (వ 1). అలాగే విశ్వాసులు ఆత్మసంబంధమైన మరణంలో ఉండగా
యేసుక్రీస్తుప్రభులవారు ఆ ఆత్మ సంబంధమైన మరణం నుంచి విశ్వాసులను ఆయన బ్రతికించి
వారిని కూడా అలా ఘనపరిచారు(వ 5,6). ఇవే దేవుని మహా బలప్రభావాలు లేక
శక్తిసామర్ధ్యాలు క్రీస్తును సంఘానికి శిరస్సుగా చేశాయి ఎఫెసీయులకు 1:22
మరియు సమస్తమును
ఆయన పాదములక్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను.
అదే
మహా బలప్రభావాలు విశ్వాసులను కొత్త సృష్టిగా చేసి క్రీస్తుతో ఏకం చేశాయి (వ
10).
ఇక అపరాధములతో పాపములతో “చచ్చినవారై”– అని ఎందుకు అంటున్నారు అంటే క్రీస్తు నుంచి వేరుగా ఉన్నవారెవరికీ నిజమైన
ఆధ్యాత్మిక జీవం లేదు. ఎందుకంటే అందరూ పాపులు
రోమీయులకు 3:23; ఏ
భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక
పోవుచున్నారు.
రోమీయులకు 5:12
ఇట్లుండగా ఒక
మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో,
ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను
గనుక ఇప్పుడు ప్రతి ఒక్కరూ వారికి క్రీస్తుయేసు
తన కొత్త జీవం ఇచ్చేంతవరకు ఆత్మ సంబంధంగా
చచ్చినవారే. ఈ మరణమంటే దేవుని జీవం నుంచీ సహవాసం నుంచీ దూరమై ఉండడమన్నమాట –
ఎఫెసీయులకు 4:18; వారైతే అంధకారమైన మనస్సుగలవారై, తమ హృదయ
కాఠిన్యమువలన తమలోనున్న అజ్ఞానముచేత దేవునివలన కలుగు జీవములోనుండి
వేరుపరచబడినవారై, తమ మనస్సు నకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు.
యెషయా 59:1-2.
1. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు
విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని
అడ్డముగా వచ్చెను
2. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచెను గనుక ఆయన
ఆలకింపకున్నాడు.
ఆదిలో
ఆదాము మరియు హవ్వలు ఆ విధంగానే మరణించారు
ఆదికాండము 2:17; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష
ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని
కాజ్ఞాపించెను.
అందుకే
యేసయ్య చెబుతున్నారు
యోహాను 5:24; నా మాట విని నన్ను పంపినవానియందు
విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములొ నుండి
జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
పౌలుగారు రోమా పత్రికలో ఇంకావివరంగా చెబుతున్నారు::
రోమీయులకు 7:5;
ఏలయనగా మనము శరీరసంబంధులమై యుండినప్పుడు మరణార్థమైన ఫలమును
ఫలించుటకై, ధర్మశాస్త్రమువలననైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై యుండెను.
రోమీయులకు 8:6; ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై
యున్నది.
కొలొస్సయులకు 2:13;
మరియు అపరాధముల వలనను, శరీరమందు సున్నతిపొందక యుండుటవలనను, మీరు మృతులై
యుండగా,
1 తిమోతికి 5:6; సుఖభోగములయందు ప్రవర్తించునది బ్రదుకు
చుండియు చచ్చినదైయుండును.
యాకోబు గారు అంటున్నారు యాకోబు 1:15; దురాశ గర్భము ధరించి
పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.
యోహాను గారు చెప్పేది కూడా చూడండి:
1 యోహాను 3:14. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక
మరణములోనుండి జీవములోనికి దాటియున్నామని యెరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు
నిలిచియున్నాడు.
కాబట్టి పాపవిముక్తి, రక్షణ కలగాలంటే
కొత్త జన్మ అవసరం అనేందుకు కారణం ఇదే.
యోహాను 1:12-13;
12. తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి,
దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.
13. వారు దేవునివలన పుట్టినవారే గాని, రక్తమువలననైనను
శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు.
యోహాను 3:3-8.
3. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని
అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పు చున్నాననెను.
4. అందుకు నీకొదేము ముసలి వాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు?
రెండవమారు తల్లి గర్బమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా
5. యేసు ఇట్లనెను ఒకడు నీటిమూలముగాను ఆత్మమూలము గాను
జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింప లేడని నీతో నిశ్చయముగా
చెప్పుచున్నాను.
6. శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా
జన్మించినది ఆత్మయునై యున్నది.
7. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు
ఆశ్చర్యపడవద్దు.
8. గాలి తన కిష్టమైన చోటను విసరును; నీవు దాని శబ్దము
విందువేగాని అది యెక్కడనుండి వచ్చునో యెక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా
జన్మించిన ప్రతివాడును ఆలాగే యున్నాడనెను.
కాబట్టి
ఆయన ఇచ్చిన నూతన జీవమును మనము పొందుకుని ఉన్నాము కాబట్టి మరల పాపములుచేసి అపరాధాలు
చేసి ఆధ్యాత్మికంగా మరణించవద్దు! ఆయన జీవము కలిగి ఉన్నాము కాబట్టి నిర్జీవ
క్రియలను విడిచి సజీవుడైన యేసయ్యను ఘనపరిచే పరిశుద్ధ కార్యాలు చేసి ఆయన రాజ్యములో
ప్రవేశిద్దాము!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -28వ భాగం*
ఎఫెసీ 2:1—2
1. మీ అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారై యుండగా,
ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను.
2. మీరు వాటిని చేయుచు, వాయు మండల సంబంధమైన అధిపతిని, అనగా
అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ
ధర్మముచొప్పున మునుపు నడుచుకొంటిరి.
ప్రియమైన దైవజనమా! మనము ఎఫెసీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!
(గతభాగం తరువాయి)
ప్రియులారా మరలా ఒకసారి ఈ
రిఫరెన్సుకి అనుగుణ్యమైన కొలస్సీ 2:13
చూసుకుందాం!
కొలస్సీయులకు 2: 13
మరియు అపరాధముల వలనను, శరీరమందు సున్నతిపొందక యుండుటవలనను,
మీరు మృతులైయుండగా,
14. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలవలన మనమీద ఋణముగాను మనకు విరోధముగాను
నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దానిమీది చేవ్రాతను తుడిచివేసి,మనకు
అడ్డములేకుండ దానిని ఎత్తి వేసి మన అపరాధములనన్నిటిని క్షమించి,
ప్రియులారా! ఈ వచనాలలో
a) మనము ఏ కారణాల వలన మృతులమో;
b) ఆ శిక్షను యేసయ్య ఏ రకంగా తప్పించారో చాలా వివరంగా వ్రాయబడింది!
1). మనము ఏ కారణాల వలన మృతులము??!!
a). అపరాధముల వలన. . .: ప్రియులారా! గతంలో చెప్పిన విధముగా లేఖనాలను
లేఖనాలతోనే పరిశీలించాలి. అప్పుడే అది సరియైనది. ఒక వచనానికి supporting
verse కనీసం మరొకటి ఉండాలి మనకు. ఇక్కడ ఈ వచనంలో మన అపరాధముల వలన
మనము మృతులము అని వ్రాయబడింది. supporting reference ఎఫెసీ
2:1 & 4.
1. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చినవారైయుండగా,
ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను.
4. అయినను దేవుడు కరుణా సంపన్నుడైయుండి, మనము మన అపరాధముల
చేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీసుతో
కూడ బ్రదికించెను. . . . .
ఇంకా
ఆజ్ఞ అతిక్రమమే పాపము అని వ్రాయబడింది. అపరాధము ద్వారా ఇంకా పాపముద్వారాను 3:4
అందుకే పెనాల్టీ కడతాము. అయితే పాపమునకు వచ్చు జీతం మరణం.
రోమా
6:23. కాబట్టి పాపము చేసినందువలన మనం చావ వలసినదే! అంటే మనమందరమూ మృతులమే!!
b) శరీరమందు సున్నతి పొందకయుండుట బట్టి మృతులము!!: గతంలో చెప్పిన విధముగా
ఆదికాండము 17వ అధ్యాయములో దేవుడు అబ్రాహాము గారి ద్వారా ఇశ్రాయేలీయులను తనకు
స్వకీయ జనముగా ఏర్పాటు చేయుటకు గాను, వారికి సున్నతి అనే ప్రక్రియ చేయాలి అని ఆజ్న
ఇచ్చారు. అక్షరార్ధమైన, శారీరిక సున్నతిద్వారా ఇశ్రాయేలీయులు దేవునితో
నిబంధనలోనికి వెళ్ళారు. అయితే అన్యజనాంగమునుండి రక్షణ పొందిన మనకు అటువంటి
కట్టుబాట్లు లేవు! కాబట్టి మనమందరమూ ధర్మశాస్త్రమును బట్టి మృతులము. అంతేకాకుండా
మనం సున్నతి కూడా పొందలేదు.
ఒక
రాజు శాసనం చేస్తే, దానిని మార్చే అధికారం ఎవరికీ లేదు. ఒకవేళ అదే రాజు దానిని
మారిస్తే పిచ్చి తుగ్లక్ అంటారు. ఆలోచన లేని బలహీనమైన రాజు అంటారు. అలాంటిది
దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సైన్యములకు అధిపతియగు యెహోవా
దేవుడు చేసిన శాసనాన్ని మార్చడం ఎలా??? అందుకే ఇది మానవులకు సాధ్యం కాదు కాబట్టి-
ఆ దేవాదిదేవుడే ప్రణాళిక చేసి- ఆయనే దీనుడై- కుమారునిగా శరీరరీతిగా భూలోకానికి
వచ్చి- ఆ రాతను, శాసనాన్ని గౌరవిస్తూ- ఆ పెనాల్టీ (Penalty) తానే తన స్వరక్తముతో కట్టి- ఆ రాతను చెరిపివేశారు.
14. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలవలన మనమీద ఋణముగాను మనకు
విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దానిమీది చేవ్రాతను
తుడిచివేసి, మనకు అడ్డములేకుండ దానిని ఎత్తి వేసి మన అపరాధములనన్నిటిని
క్షమించి, . . . .
** దేవుడు
వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన—అనగా ధర్మశాస్త్రము వలన – కారణం ధర్మశాస్త్రం ఏ
తప్పిదానికి ఏం చేయాలి, ప్రాయశ్చిత్తమేమిటో వ్రాయబడి యుంది.- ఇప్పుడు ధర్మశాస్త్ర
ప్రకారం మనము పాపులము, చావుకు లోనైన వారము.
** మనకు విరోధముగాను, ఋణముగాను ఉన్న పత్రమును— ధర్మశాస్త్రము వలన
నిర్ధారించబడిన మన పాపము- పాపమునకు శిక్ష- Death Penalty/ Death sentence or Judgment ను
** మేకులతో కొట్టి—మనస్థానంలో ఆయన ఉండి- మన చేతులతో మనం చేసిన పాపమునకు ఆయన
చేతులలో మేకులు కొట్టించుకొన్నారు, నడకలతో చేసిన పాపాలకు కాళ్ళలో మేకులు కొట్టారు,
తలంపులతో చేసిన పాపాలకు తలమీద ముళ్ళ కిరీటం ధరించారు. శరీరంతో చేసిన పాపాలకు కొరడా
దెబ్బలు తిన్నారు. ఈ రకంగా మనమీద పడవలసిన శిక్షను ఆయనే భరించి, మనమీద నున్న judgement పూర్తిచేసి- ఇక ఆ శాసనాన్ని సిలువకు కొట్టి-
** దాని చేవ్రాతను చెరిపివేసి – Once the Penalty
paid, it’s over. అంతేకాకుండా చేసిన నేరానికి/ పాపానికి already
శిక్ష అనుభవించారు కాబట్టి ఇక ఆ శాసనానికి విలువ లేదు. అందుకే దాని
చేవ్రాతను తుడిచివేశారు.
** మనకు అడ్డము
లేకుండా దానిని ఎత్తివేసి—ధర్మశాస్త్రము వలన పడిన శిక్షను ఆయన కేన్సిల్ చేసేశారు.
** అపరాధములను
క్షమించి—మన శిక్షను తానే భరించారు – కారణం అది ఆయన మనపై చూపించిన ప్రేమ- అందుకే శిక్షను తానే
భరించి, మన అపరాధములను జాలితో క్షమించారు.
** ఆయనతోపాటు
జీవింపజేసెను.—అనగా మొదట ఆయనతో పాటు మనం చనిపోయాము—ఆయన మృత్యుంజయుడు /
పునరుత్థానుడు కాబట్టి ఆయనతోపాటు మనలని కూడా తనతోపాటు జీవింపజేశారు.
ఇదీ రక్షణ కార్యము! ఈ రక్షణ మనకు ఉచితముగా
రాలేదు. ఆయన గొప్ప వెల చెల్లించారు. ప్రియ చదువరీ! ఇంత అమూల్యమైన రక్షణ కార్యాన్ని
చేసారు కదా దేవుడు, మరి ఆయనకోసం నీవు నీ ప్రాచీన పాత రోత జీవితాన్ని
విడచిపెట్టలేవా?? ఆయనకోసం సాక్షిగా జీవించలేవా??
ఇంతగొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఏలాగు
తప్పించుకొందువు??? హెబ్రీ 2:3
కాబట్టి
మన పాత అలవాట్లు / ప్రాచీన స్వభావము వదలివేసి ఆయనకోసం సాక్షిగా జీవిద్దాం! ఇదిగో
ఇదే రక్షణ దినం! నేడే అనుకూల సమయం!
దైవాశీస్సులు!
ఆమెన్!
*ఎఫెసీ పత్రిక -29వ భాగం*
ఎఫెసీ 2:1—2
1. మీ అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారై యుండగా,
ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను.
2. మీరు వాటిని చేయుచు, వాయు మండల సంబంధమైన అధిపతిని, అనగా
అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మముచొప్పున
మునుపు నడుచుకొంటిరి.
3. వారితో కలిసి మనమందరమును శరీరముయొక్కయు మనస్సుయొక్కయు
కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ
వారివలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి.
4. అయినను దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన
అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను
క్రీస్తుతోకూడ బ్రదికించెను.
ప్రియమైన దైవజనమా! మనము ఎఫెసీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!
(గతభాగం తరువాయి)
ఇక
రెండవ వచనంలో అంటున్నారు: ఒకానొకప్పుడు మీరు కూడా
వాటినిచేయుచు అనగా మీరు దేవుణ్ణి ఎరుగక మునుపు మీరు కూడా అదే అపరాధాలు పాపాలు చేసి
ఆధ్యాత్మికంగా చచ్చిన స్తితిలో ఉన్నారు. ఆ రోజులలో మీరు కూడా వాయుమండల సంబంధమైన
అధిపతిని అనగా అవిదేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తిని అనగా సాతానుగాడిని
అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొన్నారు అంటున్నారు!
అవును
ఒకానొకప్పుడు వారే కాకుండా మనం కూడా ఈ లోకపు ధర్మము చొప్పున ప్రవర్తించాము
క్రీస్తుని ఎరుగక మునుపు! యోహాను గారు
అంటున్నారు:”–
1 యోహాను 2:16
లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును
తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే.
యోహాను
1:10; యోహాను 7:7; యోహాను 14:17; యోహాను 16:8;
పౌలుగారు
చెబుతున్నారు: రోమీయులకు 12:2 మీరు ఈ లోక మర్యాదను
అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి
తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.
1 కోరింథీయులకు 1:21;
దేవుని
జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానముచేత దేవునిని ఎరుగకుండినందున, సువార్త ప్రకటన యను
వెఱ్ఱితనముచేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయెను.
ఇక యాకోబు గారు అంటున్నారు
యాకోబు 4:4; వ్యభిచారిణులారా, యీ లోకస్నేహము దేవునితో
వైరమని మీరెరుగరా? కాబట్టి యెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి
శత్రువగును.
పేతురుగారు అంటున్నారు:
2 పేతురు 1:4. ఆ మహిమ గుణాతిశయములనుబట్టి ఆయన మనకు
అమూల్యములును అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి యున్నాడు. దురాశను
అనుసరించుటవలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని,
దేవస్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను
కాబట్టి
ఈ లోకం పోకడలు లేక ప్రపంచ ధర్మము ఆత్మ
సంబంధమైన మరణం నుంచి పుట్టి శాశ్వత మరణానికి దారితీస్తాయి.
ఇక
మరోమాట “వాయుమండల అధికారి లేక రాజ్యాధికారి”– అంటే సైతాను. పరమ స్థలాల్లోని దిగువ భాగాల్లో వాడు
సంచరిస్తూ ఉంటాడు.దీనిగూర్చి పౌలుగారు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో బాగా వివరించారు!
ఎఫెసీయులకు
6:12.
ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను,
అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల
సమూహములతోను పోరాడుచున్నాము.
వీడినే ఈ యుగ సంబంధమైన దేవత లేక “పాలకుడు” అన్నారు – యోహాను 12:31; ఇప్పుడు ఈ
లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును;
2 కోరింథీయులకు 4:4.
దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి
ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు
గ్రుడ్డితనము కలుగ జేసెను.
సైతాను
ఆత్మ అనేది వాడి సింహాసనం భూగోళం చుట్టూ ఉన్న వాతావరణంలో అదృశ్య రూపంలో ఉంది.
ప్రభువైన యేసు క్రీస్తుకు అవిధేయులుగా ఉన్నవారందరిలో వాడు పని చేస్తున్నాడు.
యోహాను 8:44
మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు
నెరవేర్చ గోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంత కుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు;
వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును;
వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు.
అపో. కార్యములు 5:3;
అప్పుడు పేతురు అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరి
శుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను.?
2తిమోతికి 2:25
అందువలన సాతాను తన యిష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని
యురిలోనుండి తప్పించుకొని మేలుకొనెదరేమో అని,
ఇక
మూడో వచనంలో అంటున్నారు: వారితో కలిసి మనమందరమును
శరీరము యొక్కయు మనస్సుయొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి
మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై
యుంటిమి.
వారితో
కలసి అనగా ఆ ఆధ్యాత్మిక మరణం పొందిన మన పూర్వికులు,బంధువులతో పాటుగా మనము కూడా మన
శరీరం చెప్పినట్లు శరీర ఆశలు కోరికలు చేస్తూ, మన మనస్సు ఆడమన్న పాపపు ఆటలు ఆడుతూ
మన బ్రష్టమైన కోరికలు శరీరాసలను అనుసరిస్తూ మనము కూడా మన బ్రష్టమైన మనస్సును
అనుసరించి దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాము,
అయితే 4వ వచనం: అయినను
దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు
సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీస్తుతోకూడ బ్రదికించెను
అంటున్నారు!
“మనమందరమూ”
అనగా –
రోమీయులకు 3:9, ఆలాగైన ఏమందుము? మేము వారికంటె శ్రేష్ఠులమా?
తక్కువవారమా? ఎంతమాత్రమును కాము. యూదులేమి గ్రీసుదేశస్థులేమి అందరును పాపమునకు
లోనైయున్నారని యింతకుముందు దోషారోపణ చేసియున్నాము.
రోమీయులకు 3:19; ప్రతి నోరు మూయబడునట్లును, సర్వలోకము
దేవుని శిక్షకు పాత్రమగునట్లును, ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటిని
ధర్మశాస్త్రమునకు లోనైనవారితో చెప్పు చున్నదని యెరుగుదుము.
తీతుకు 3:3. “ఎందుకనగా మనము కూడ మునుపు అవివేకులమును
అవిధేయులమును మోసపోయిన వారమును నానావిధములైన దురాశలకును భోగములకును
దాసులమునైయుండి, దుష్టత్వమునందును అసూయ యందును కాలముగడుపుచు, అసహ్యులమై యొకని
నొకడు ద్వేషించుచు ఉంటిమి గాని
ఇక
కడమ వారివలె స్వభావ సిద్ధమైన కోరికలు అంటే పుట్టుక సమయంలో మన తల్లిదండ్రుల నుంచి
మనం పొందిన స్వభావం అని అర్థం. ఆదికాండము 8:21;
అప్పుడు యెహోవా ఇంపయిన సువాసన నాఘ్రాణించి ఇక మీదట నరులనుబట్టి భూమిని మరల
శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన
ప్రకారము యికను సమస్త జీవులను సంహరింపను అన్నారు
రోమీయులకు 7
18. నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని
నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు
కలుగుటలేదు.
కీర్తనల గ్రంథము
51:5; నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను.
కీర్తనల గ్రంథము 58:3; తల్లికడుపున పుట్టినది మొదలుకొని
భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు పుట్టినతోడనే అబద్ధములాడుచు
తప్పిపోవుదురు.
రోమీయులకు 3:9-19. కూడా చదవండి!
ఇక దైవోగ్రత అనగా
పాపానికి వ్యతిరేకంగా దేవుని కోపం బైబిలంతటా కనిపిస్తూ ఉంది. సంఖ్యాకాండము
25:3; కీర్తనల గ్రంథము 90:7-11; యోహాను 3:36; రోమీయులకు 1:18
అయితే
దేవుడు కరుణాసంపన్నుడు అంటున్నారు!
కీర్తనల గ్రంథము 5:7; కీర్తనల గ్రంథము 51:1; మీకా 7:18;
తన స్వాస్థ్యములో శేషించినవారి దోషమును పరిహరించి, వారు
చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన
కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు.
రోమీయులకు 2:4;
లేదా, దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని
యెరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘ శాంతమును తృణీకరించుదువా?
రోమీయులకు 10:12;
యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు; ఒక్క ప్రభువే
అందరికి ప్రభువై యుండి, తనకు ప్రార్థనచేయువారందరియెడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై
యున్నాడు.
తీతుకు
3:5; యాకోబు 5:11; 1 పేతురు 1:3.
పాపులుగా
మనందరం దేవుని కోపానికీ శిక్షకూ తగినవారం. దేవుని కృప మాత్రమే మనల్ని శిక్షించకుండా క్షమించి
రక్షించగలదు. మరి దేనిలోనూ నిరీక్షణకు
ఎలాంటి ఆధారమూ లేదు.
కాబట్టి
ఆయన మహోన్నతమైన ప్రేమను శాశ్వతమైన ప్రేమను, దైవకృపని నిరర్ధకం చేస్తూ ఆయన ఇచ్చిన
రక్షణను కాళ్ళతో త్రొక్కి మరలా పాపం చేయవద్దు! నిన్ను నన్ను రక్షించడానికి ఆయన వెల
చెల్లించారు! ఆ వెల ఆయన రక్తము అనగా ఆయన ప్రాణము అని మర్చిపోవద్దు!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -౩౦వ భాగం*
ఎఫెసీ 2:5—9
5. కృపచేత మీరు రక్షింపబడియున్నారు.
6. క్రీస్తుయేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముద్వారా
అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచునిమిత్తము,
7. క్రీస్తుయేసునందు మనలను ఆయనతోకూడ లేపి, పరలోకమందు
ఆయనతోకూడ కూర్చుండబెట్టెను.
8. మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన
కలిగినది కాదు, దేవుని వరమే.
9. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ
వీలులేదు.
ప్రియమైన దైవజనమా! మనము ఎఫెసీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!
(గతభాగం తరువాయి)
ఇక
5వ వచనంలో అంటున్నారు: కృపచేత మీరు
రక్షింపబడియున్నారు. ఇదే విషయాన్ని 8వ వచనంలో మరలా చెబుతున్నారు : . మీరు
విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని
వరమే. చూడండి ఇలా రక్షించ బడటం మన వలన మన నీటివలన మన భక్తివలన ఎంతమాత్రము కాదు
గాని దేవుని కృప ద్వారా మాత్రమే రక్షించబడ్డాము! కారణం మనం జన్మతహా పాపులం ఇంకా
పాపములోనే జీవిస్తున్నాము!
దేవుడు
విశ్వాసులకు ఆధ్యాత్మిక జీవాన్ని ఇచ్చి క్రీస్తుతో ఐక్యతలోకీ సహవాసంలోకీ తీసుకొని
వచ్చారు –
యోహాను 1:12-13;
12. తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు
విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.
13. వారు దేవునివలన పుట్టినవారే గాని, రక్తమువలననైనను
శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు.
యోహాను 5:21, యోహాను 5:24;
రోమీయులకు 5:17
మరణము ఒకని అపరాధమూలమున వచ్చినదై ఆ యొకని ద్వారానే యేలిన
యెడల కృపాబాహుళ్యమును నీతిదానమును పొందువారు జీవము గలవారై, మరి నిశ్చయముగా
యేసుక్రీస్తను ఒకని ద్వారానే యేలుదురు.
రోమీయులకు 6:4,
కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు
లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము
బాప్తిస్మమువలన మరణములో పాలు పొందుటకై ఆయనతోకూడ పాతిపెట్టబడితివిు.
రోమీయులకు 6:8;
కొలొస్సయులకు 2:13,14; 1 పేతురు 1:3, 1 పేతురు 1:23; 1
యోహాను 3:9; 1 యోహాను 5:1, 1 యోహాను 5:18.
ఇది దేవుడు ఉచితంగా ఇచ్చినదే – వ 9; రోమీయులకు 6:23.
కాబట్టి
ఆదినుంచి అంతం వరకు పాపవిముక్తి రక్షణ అనేవి ఏ యోగ్యతా లేనివారికి దేవుడు ఉచితంగా
ఇచ్చేవే. దీనికి మంచి పనులతో చేసిన పుణ్యకార్యాలతో సంబంధమేమీ లేదు –
అపో. కార్యములు 15:11;
ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము
గదా? అలాగే వారును రక్షణ పొందుదురు అనెను.
రోమీయులకు 3:24;
కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి
విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడు చున్నారు.
రోమీయులకు 4:4;
రోమీయులకు 5:15;
అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని
అపరాధమువలన అనేకులు చనిపోయినయెడల మరి యెక్కువగా దేవుని కృపయు, యేసుక్రీస్తను ఒక
మనుష్యుని కృపచేతనైన దానమును, అనేకులకు విస్తరించెను.
రోమీయులకు 6:23;
ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము
మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము.
రోమీయులకు 11:6;
అది కృపచేతనైన యెడల ఇకను క్రియల మూలమైనది కాదు; కానియెడల
కృప ఇకను కృప కాకపోవును.
తీతుకు 3:4-7.
4. మన రక్షకుడైన దేవునియొక్క దయయు, మానవులయెడల ఆయనకున్న
ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు
5. మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక, తన
కనికరముచొప్పుననే పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన
స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను.
6. మనమాయన కృపవలన నీతిమంతులమని తీర్చబడి,
7. నిత్యజీవమునుగూర్చిన నిరీక్షణను బట్టి దానికి
వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనమీద
సమృద్ధిగా కుమ్మరించెను.
కాబట్టి
మనము కేవలం విశ్వాసం ద్వారానే పరిశుద్దులుగా నీతిమంతులుగా తీర్చబడ్డాము అని
గ్రహించాలి”– దయచేసి ఈ క్రింది
రిఫరెన్సులు చూడండి!
యోహాను
1:12-13;
యోహాను
3:14-16, యోహాను 3:36; యోహాను 5:24; యోహాను 6:47; అపో. కార్యములు 13:38;
అపో. కార్యములు
16:31; కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు,
రోమీయులకు 1:16; సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను
కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ
కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది.
రోమీయులకు 3:25,
రోమీయులకు 3:28;
కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండ విశ్వాసమువలననే
మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని యెంచుచున్నాము.
రోమీయులకు 4:16;
రోమీయులకు 5:1; కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా
తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునితో సమాధానము కలిగియుందము
రోమీయులకు 10:9-13;
గలతియులకు 2:16,
ధర్మశాస్త్ర సంబంధ క్రియలమూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా.
గలతియులకు 2:21;
గలతియులకు 3:26. యేసుక్రీస్తునందు మీరందరు విశ్వాసమువలన
దేవుని కుమారులై యున్నారు.
“కాబట్టి ఈ రక్షణ దేవుడు...ఇచ్చినదే”– విశ్వాసమూ, దానిమూలంగా కలిగిన పాపవిముక్తీ రక్షణా కూడా దేవుడు ఉచితంగా
ఇచ్చినవే. మనకు ఉన్న విశ్వాసం కూడా దేవుని ఉచిత కృపావరమే కాబట్టి మిగతా వాటన్నిటి
విషయంలో లాగానే దాని విషయంలో కూడా మనం అతిశయంగా మాట్లాడలేము (ఫిలిప్పీయులకు 1:30).
ఒక వ్యక్తి మనసులో, హృదయంలో దేవుని కార్యం జరగక
పోతే ఎవరూ క్రీస్తులో నమ్మకం పెట్టుకోరు, పెట్టుకోలేరు. దేవుని విముక్తి విధానంలో
మనిషి అతిశయంగా మాట్లాడ్డం అనేదానికి తావే లేదు. రోమీయులకు 3:27; 1 కోరింథీయులకు
1:29-31. తనకు తన యోగ్యతను బట్టి, లేక తాను చేసిన దాన్ని బట్టి, లేక తనలో ఉన్న ఏదో
మంచిని బట్టి, లేక తనకు ఫలానా మతంతో లేక అలాంటి మరి దేనితోనో సంబంధం ఉండబట్టి
పాపవిముక్తి లభించిందని ఎవరైనా గొప్పగా చెప్పుకుంటే అతడు (లేక ఆమె) నిజమైన
పాపవిముక్తి విధానాన్ని అసలు అర్థం చేసుకోలేదన్నమాటే. ఏ క్రియలైనా సరే
పాపవిముక్తికీ రక్షణకూ నడిపించగలిగే అవకాశమే లేదు. పాపి చేసే ఏ పని అయినా (అందరూ
పాపులే – రోమీయులకు
3:23) పాపం రంగు కలిసినది. దేవుని దృష్టిలో అది మంచిది అనీ యోగ్యత అనీ
అనిపించుకోదు (యెషయా 64:6). అతడు ఎన్ని పనులు చేసినా ఎంత కాలం చేసినా
పాపవిముక్తినీ రక్షణనూ వాటి సహాయంతో సంపాదించుకోలేడు. దీనిని ప్రతీ విశ్వాసి
గమనించాలి!
ఇక
6, 7 వచనాలలో
6. క్రీస్తుయేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముద్వారా
అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచునిమిత్తము,
7. క్రీస్తుయేసునందు మనలను ఆయనతోకూడ లేపి, పరలోకమందు
ఆయనతోకూడ కూర్చుండబెట్టెను.
మన
విషయంలో దేవునికున్న ఘనమైన సంకల్పం ఇదే. ఇది మనకు ఏమేమి తెస్తుందో ఎవరైనా కనీసం
ఊహించనైనా ఊహించలేరు. ఆయన ఆలోచించగలిగిన అతి శ్రేష్ఠమైన దీవెనలూ వరాలూ బహుమతులూ
మనపై వర్షంలా కురిపించడం ద్వారా మన పట్ల తనకున్న ప్రేమను సంతృప్తి పరచుకుంటారు.
శాశ్వత యుగాలు ఆయన అలా చేస్తూనే ఉంటారు దేవుడు!
విశ్వాసులందరి
ప్రతినిధి క్రీస్తు. వారు ఆయనలో ఉన్నారు (ఎఫెసీయులకు 1:1,
ఎఫెసీయులకు 1:3
మన ప్రభువైన
యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు
పరలోకవిషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను. కాబట్టి, ఆయనతో
ఏకంగా ఉన్నారు కాబట్టి ఆయనకు జరిగినది వారికి కూడా జరిగినట్టు దేవుడు
ఎంచుతున్నారు. ఆయన దృష్టిలో భూమిపై ఉన్న విశ్వాసులు ఇప్పటికే మరణం నుంచి సజీవులుగా
లేచి పరలోకంలో ఘనతలో కూర్చుని ఉన్నట్టే.
కొలొస్సయులకు 3:1-4
1. మీరు క్రీస్తుతోకూడ లేపబడినవారైతే పైనున్న వాటినే
వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు.
2. పైనున్న వాటిమీదనేగాని, భూసంబంధమైనవాటిమీద మనస్సు
పెట్టుకొనకుడి;
3. ఏలయనగా మీరు మృతిపొందితిరి, మీ జీవము క్రీస్తుతోకూడ
దేవునియందు దాచబడియున్నది.
4. మనకు జీవమై యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును
ఆయనతోకూడ మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు.
అందుకే
9వ వచనంలో అంటున్నారు అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు.
కాబట్టి
మనం అతిశయపడకుండా దేవుని పట్ల భయము భక్తీ కలిగి జీవిద్దాం!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -31వ భాగం*
ఎఫెసీ 2:10
. మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా
సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన
చేసిన పనియైయున్నాము.
ప్రియమైన దైవజనమా! మనము ఎఫెసీ పత్రిక ధ్యానం చేసుకుంటున్నాము!
ఇక 10వ వచనంలో అంటున్నారు: . మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా
సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన
చేసిన పనియైయున్నాము.
ఇక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తే మరియు
వాటియందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై
అంటున్నారు! ఇంతకీ వేటియందు నడుచుకోవాలి
అంటే దేవుడు ముందుగా సిద్దపరచిన సత్క్రియలు!! అవి బైబిల్ లో చాలా విస్తారంగా
ఉన్నాయి! ఆయన ఇచ్చిన పది ఆజ్ఞలను క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుప్రభులవారు రెండు
ఆజ్ఞలుగా చేశారు! సువార్తలలోను పత్రికలలోనూ అవసరంలో ఉన్నవారిని ఆదుకోవాలని,
దిక్కులేనివారికి విధవరాల్లకు వారి అవసరాలు తీర్చాలని, ఇంకా సోదరులకు సోదరీమణులకు
సహాయం చెయ్యాలని...ఇలాంటి సత్క్రియలు చెయ్యాలని, మనలో గలతీ పత్రిక 5వ అధ్యాయంలో
చెప్పబడిన ఆత్మఫలము ఫలించాలే గాని శరీరక్రియలు ఉండకూడదు అని, అలా జరగాలంటే ఆత్మచే
నడిపించబడాలని చెప్పారు! అయితే ఇవన్నీ దేవుడు ముందుగానే మనకోసం సిద్ధం చేశారు అని
భక్తుడు చెబుతున్నారు ఇక్కడ! ఇంకా ఇవి చేయడానికే మనం క్రీస్తుయేసు నందు
సృష్టించబడ్డామని మనము ఆయన చేసిన పనియై ఉన్నామని చెబుతున్నారు! అందుకే
కీర్తనాకారుడు మనము ఆయన ఆయన పిల్లలమని ఆయన మేపు గొర్రెలమని చెబుతున్నారు! కీర్తన
95:6 లోను, 100:౩ లో కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు!
ఆయన మన దేవుడు! మనము ఆయన పాలించు
ప్రజలము, ఆయన మేపు గొర్రెలము! ఇంకా ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము ఆయన
ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అంటున్నారు!
కాబట్టి మనము ఆయన చూపిన చెప్పిన
సత్క్రియలు చేయాలి! కయీను సత్క్రియలు చేయలేదు! తన తమ్మున్ని చంపేశాడు! ఆ తర్వాత
బాధపడ్డాడు! దూరంగా పారిపోతుంటే దేవుడు అన్నారు: నీవు సత్క్రియలు చేస్తే నీ తలను
ఎత్తుకొనవా!!!!
ఆదికాండము 4:7
7. నీవు సత్క్రియ చేసిన యెడల తలనెత్తుకొనవా? సత్క్రియ
చేయనియెడల వాకిట పాపము పొంచియుండును; నీ యెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని
ఏలుదువనెను.
కాబట్టి మనము సత్క్రియలు చేయాలి వాటిని చేయడానికే దేవుడు
మనలను చేశారు అని గ్రహించాలి!
గమనించాలి:
విశ్వాసుల నూతన ఆధ్యాత్మిక జన్మ అనేది
వారు సంపాదించుకొనేది కాదు. ఈ భూమిపై తల్లి గర్భాన పుట్టడంలో ఒకడు చేసే
ప్రయత్నం ఎలా ఉండదో ఇదీ అంతే. అది వారిలో దేవుడు మాత్రమే జరిగించగలిగేది. అది
సృష్టి కార్యం – అందుకే యిర్మియా గ్రంధంలో
భక్తుడు అంటున్నారు: 10:23 లో యెహోవా, తమ మార్గము
నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున
ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును.
కాబటి
దేవుడే మనలను చేశారు, తన పనికోసం చేశారు అని గ్రహించాలి!
2
కోరింథీయులకు 5:17; యాకోబు 1:18; యోహాను 1:13.
వారు దేవునివలన పుట్టినవారే గాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను
మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు.
దేవుడు మనలో నూతన జీవాన్ని ఎందుచేత సృష్టించారో
ఇక్కడొక కారణం ఉంది గమనించండి. మనకు మంచి పనుల వల్ల విముక్తి, రక్షణ కలగలేదు గానీ
మనం మంచి పనులు చేసేందుకు దేవుడు మనకు పాపవిముక్తి ఇచ్చారు –
తీతుకు 2:14;
ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్క్రియలయందాసక్తిగల
ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు
అర్పించుకొనెను.
మత్తయి 5:16.
మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని
మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి.
యాకోబు గారు ఇంకా తెగించి క్రియలు లేని విశ్వాసము మృతము
అంటున్నారు!
యాకోబు 2: 13.
కనికరము చూపనివాడు కనికరములేని తీర్పు పొందును; కనికరము
తీర్పును మించి అతిశయ పడును.
14. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము
కలదని చెప్పినయెడల ఏమి ప్రయో జనము? అట్టి విశ్వాసమతని రక్షింపగలదా?
15. సహోదరు డైనను సహోదరియైనను దిగంబరులై ఆ నాటికి భోజనములేక
యున్నప్పుడు.
16. మీలో ఎవడైనను శరీరమునకు కావలసినవాటిని ఇయ్యక సమాధానముగా
వెళ్లుడి, చలి కాచుకొనుడి, తృప్తిపొందుడని చెప్పినయెడల ఏమి ప్రయోజనము?
17. ఆలాగే విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి
మృతమైనదగును.
కాబట్టి దేవుడు మంచి పనులను మన కోసం, మనలను మంచి పనుల
కోసం సిద్ధం చేశారు. మనందరి ఎదుట మంచి పనులు చేసేందుకు అవకాశాలను ఉంచుతారు. మంచి
పనులు పాపవిముక్తి వల్ల కలిగే ఒక ఫలం. మనం మంచి పనులు చేయకపోతే మనం దేవుని
చేతులతో చేయబడినవారము కాదని
చూపించుకుంటున్నాం అన్నమాట
(మత్తయి
7:16-20; మొ।।).
16. వారి
ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు. ముండ్లపొదలలో ద్రాక్ష పండ్లనైనను,
పల్లేరుచెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా?
17. ఆలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును,
పనికిమాలిన చెట్టు, కానిఫలములు ఫలించును.
18. మంచి చెట్టు కానిఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు
మంచి ఫలములు ఫలింపనేరదు.
19. మంచి ఫలములు ఫలింపని ప్రతిచెట్టు నరకబడి అగ్నిలో
వేయబడును.
20. కాబట్టి మీరు వారి ఫలములవలన వారిని తెలిసికొందురు.
21. ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును
పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే
ప్రవేశించును.
మంచి
చెట్టుకు మంచి కాయలు కాయడం ఎంత ఖాయమో, మనలోని నూతన జీవం మంచి పనులనే ఫలాలుగా
చూపించడం అంతే ఖాయం. విశ్వాసులు దేవుని చేతి పని కాబట్టి ఆయన ఈ పనిని మధ్యలో
ఎక్కడో ఆపివెయ్యకుండా ముగింపు వరకూ తెస్తారని అనుమానం లేకుండా నమ్మాలి! –
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -32వ భాగం*
ఎఫెసీ 2:11—13
11 కాబట్టి మునుపు శరీరవిషయములో అన్యజనులైయుండి, శరీరమందు
చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారిచేత సున్నతిలేని వారనబడిన మీరు
12 ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుకాక, పరదేశులును, వాగ్దాన
నిబంధనలు లేని పరజనులును, నిరీక్షణలేనివారును, లోక మందు దేవుడు లేనివారునైయుండి,
క్రీస్తుకు దూరస్థులై యుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి.
13. అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు
క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తమువలన సమీపస్థులై యున్నారు.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను
ధ్యానంచేసుకుంటున్నాము!
ఇక్కడ
11—13 వచనం వరకు 1:19 లో మొదలుపెట్టిన అంశాన్నే
కొనసాగిస్తున్నారు. మునుపు మీరు కూడా అన్యజనులై ఉన్నారు, ఆరోజులలో మీరు అనగా మనము
శరీరమందు చేతులతో చేయబడిన సున్నతిగలవారు అనబడే యూదులు/ఇశ్రాయేలీ ప్రజలచేత
సున్నతిలేనివారు అని పిలువబడ్డారు అంటున్నారు. నిజానికి 2:11-22 వరకు పౌలుగారు ఏమి
చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు అంటే: పాత నిబంధన
కాలంలో ఇస్రాయేలు జాతి దేవుని ప్రత్యేక ప్రజలు . దేవుడు వారికి తన
వాక్కును, తన ధర్మశాస్త్రాన్ని, తన వాగ్దానాలు మొదలైనవాటిని ఇచ్చారు – రోమ్ 9:4-5. ......
ప్రపంచంలోని
అన్యజనులకు వీటిలో వంతు లేదు – అదే 12వ వచనంలో చెబుతున్నారు పౌలుగారు, ఆ కాలంలో మీరు
ఇశ్రాయేలు ప్రజలతో సహపౌరులు కారు గాని పరదేశులును వాగ్దానాలు లేని వారు, ఇంకా
నిరీక్షణ కూడా లేనివారూ, లోకమందు నిజమైన దేవుణ్ణి ఎరుగని వారు అంటున్నారు.. వారు
చాలా దూరంలో ఉన్నారు – అయితే 13వ వచనంలో చెబుతున్నారు మునుపు మీరు
దూరస్తులైనా ఇప్పుడైతే మీరు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తమువలన ఇశ్రాయేలు
ప్రజలతో సహపౌరులు అంటున్నారు! . ఇస్రాయేలు ప్రజలకూ, ఇతర ప్రజలకూ అక్షరాలా
శత్రుత్వమనే అడ్డుగోడ ఉంది – వ
14. ఇప్పుడు దేవుడు అదంతా మార్చేశారని పౌలుగారు
అంటున్నారు. క్రీస్తులో ఇకపై అన్యజనుల విశ్వాసులకు, యూదులకూ ఎలాంటి దూరమూ
లేదు – వ 14-22. విశ్వాసులంతా
క్రీస్తులో ఒక్కటే.
1 కొరింతు 12:12-13; .....
12 ఏలాగు శరీరము
ఏకమైయున్నను అనేకమైన అవయవములు కలిగియున్నదో, యేలాగు శరీరముయొక్క అవయవములన్నియు
అనేకములైయున్నను ఒక్కశరీరమై యున్నవో, ఆలాగే క్రీస్తు ఉన్నాడు.
13 ఏలాగనగా,
యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క
శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితివిు. మనమందరము ఒక్క ఆత్మను పానము
చేసినవారమైతివిు.
14 శరీరమొక్కటే
అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది.
గలతీ 3:26--29
26 యేసుక్రీస్తునందు మీరందరు విశ్వాసమువలన దేవుని
కుమారులై యున్నారు.
27 క్రీస్తు లోనికి
బాప్తిస్మముపొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు.
28 ఇందులో యూదుడని
గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు;
యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు.
29. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాముయొక్క
సంతానమైయుండి వాగ్దాన ప్రకారము వారసులైయున్నారు.
కాబట్టి
ఇప్పుడు క్రీస్తునందు ఇశ్రాయేలు ప్రజలతో కూడా వాగ్దానముల లోను అన్నింటిలోను
రక్షించబడిన విశ్వాసి పాలిబాగస్తులై ఉన్నారు!
వారు
అనగా సున్నతిపొందిన ఇశ్రాయేలు ప్రజలు మిమ్మల్ని సున్నతిలేనివారు అని పిలిచినా
పర్వాలేదు అంటున్నారు! ఎందుకంటే దేహమందు పొందినది నిజమైన సున్నతి కాదు గాని
ఆత్మయందు పొందినదే సున్నతి అంటున్నారు పౌలుగారు
రోమా 2: 25 నీవు
ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వాడవైతివా, సున్నతి ప్రయోజనకరమగును గాని
ధర్మ శాస్త్రమును అతిక్రమించువాడవైతివా, నీ సున్నతి సున్నతి కాకపోవును.
26 కాబట్టి సున్నతి
లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనిన యెడల అతడు సున్నతి లేనివాడై యుండియు
సున్నతిగలవాడుగా ఎంచబడును గదా?
27 మరియు
స్వభావమునుబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చినయెడల అక్షరమును
సున్నతియు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా?
28. *బాహ్యమునకు యూదుడైనవాడు యూదుడు కాడు; శరీరమందు
బాహ్యమైన సున్నతి సున్నతికాదు.*
29. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి
హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరమువలన కలుగునది కాదు. అట్టివానికి
మెప్పు మనుష్యుల వలన కలుగదు దేవుని వలననే కలుగును అంటున్నారు పౌలుగారు!!
చూడండి పౌలుగారు జన్మతహా యూదుడై
ఉండికూడా ఆత్మావేశుడై వ్రాస్తున్నారు- చేతులతో చేసిన సున్నతి సున్నతి కాదు గాని
అంతరంగమందు సున్నతి పొందిన వాడే యూదుడు నిజంగా సున్నతి పొందివాడు! ఇంతకీ
అంతరంగమందు సున్నతి పొందడము అంటే పాప కార్యాలుచేయకుండుట అనగా శరీరకార్యాలు
చేయకుండా, సినిమాలు సీరియల్లు చూడకుండా, ఈలోక ప్రజలు చేసే ఏ విధమైన పాపకార్యాలు
చేయకుండా, అన్యాచారాలు చేయకుండా తనఘటమును పరిశుద్ధంగా కాపాడు కొనుటయే అంతరంగమందు
సున్నతి పొందడం!
కాబట్టి ఇప్పుడు పౌలుగారు అంటున్నారు
ఇశ్రాయేలు ప్రజలు లేక యూదులు చేతులతో దేహము మీద చేయబడిన సున్నతి పొందుకున్నారు.
వారు ధర్మశాస్త్రము ప్రకారం నడువకుండా వారి శరీరక్రియలు చేస్తూ బ్రష్ట స్వభావం
కలవారు గనుక, మనము శరీరమందు సున్నతి పొందకపోయినా శరీరమును అనుసరించకుండా మన ఆత్మను
అనుసరిస్తూ ఆత్మసంబంధమైన కార్యాలు చేస్తున్నాము గనుక మనమే నిజమైన సున్నతి పొందిన
వారము, ఇంకా వారు సున్నతి ద్వారా ఏ ఏ వాగ్దానాలు ఈవులు పొందుకున్నారో మనము కూడా
వాటికి వారసులము అంటున్నారు!
క్రీస్తుకు
దూరంగా ఉన్న మనుషులందరి విచారకరమైన పరిస్థితి ఇప్పటికీ ఇదే. నిజ దేవుడు వారికి
లేడు. పాపవిముక్తి గురించిన నిరీక్షణకి నిజమైన ఆధారం లేదు (1 యోహాను 2:23;
5:11-12; గలతీ 4:8).
మీరు:
అంటే అన్యజనులలో నుండి రక్షించబడిన మీరు
అని అర్థం. వారి పాపం, అపనమ్మకాల మూలంగా వారు దేవునికి దూరంగా ఉన్నారు. అయితే
క్రీస్తులో ఉండడం ద్వారా దేవునికి దగ్గరయ్యారు. విశ్వాసులందరికీ దేవుని సన్నిధికి
మార్గం తెరవబడింది –
హెబ్రీ 10:19-22....
19. సహోదరులారా, యేసు మనకొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా
నూతనమైనదియు, జీవముగలదియు, ఆయన శరీరము అను తెరద్వారా యేర్పరచబడినదియునైన మార్గమున,
20. ఆయన రక్తమువలన పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు మనకు
ధైర్యము కలిగియున్నది గనుకను,
21. దేవుని యింటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను,
22. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన
హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన శరీరములు గలవారమునైయుండి,
విశ్వాసవిషయములో (లేక, విశ్వాసముయొక్క) సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో
మనము దేవుని సన్నిధానమునకు చేరుదము.
కాబట్టి
ఇట్టి గొప్ప రక్షణ పొందుకున్న మనము ఆ పిలుపుకు తగిన జీవితం జీవించవలసిన అవసరం
ఎంతైనా ఉంది!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -33వ భాగం*
ఎఫెసీ 2:14—17
14. ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును,
అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్ర మును తన శరీరమందు కొట్టివేయుటచేత మధ్యగోడను
పడగొట్టి, మన ఉభయులను ఏకముచేసెను.
15. ఇట్లు సంధిచేయుచు, ఈ యిద్దరిని తనయందు ఒక్క నూతన
పురుషునిగా సృష్టించి,
16. తన సిలువవలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా
వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధానపరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే
మనకు సమాధానకారకుడై యున్నాడు.
17. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన
వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను
ధ్యానంచేసుకున్తున్నాము!
(గతభాగం తరువాయి)
ఇక్కడ 14—17 వచనం లో కూడా అదే విషయాన్ని
కొనసాగిస్తున్నారు! దానికోసం ధ్యానం చేసేముందుగా ఉపోద్ఘాతంలో చెప్పినమాట మరోసారి
జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను! ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం ఈ అధ్యాయంలో ఈ
వచనాలలో అనగా 11—22 వచనాలలో
కనిపిస్తుంది. ఈ పత్రిక మొదటి మూడు అధ్యాయాలు మనము ఎట్టిగొప్ప రక్షణ పొందుకున్నామో
ఒక మర్మముగా చెబుతున్నారు! అదేమిటంటే రక్షించబడిన విశ్వాసులు క్రీస్తుయేసు రక్తము
ద్వారా యూదులతో సహపౌరులుగా దేవుడు చేశారు అనేదే! ఇక 4—6 అధ్యాయాలలో ఇంత మహా
గొప్ప రక్షణ/ పిలుపు పొందుకున్నారు కాబట్టి ఆ పిలుపుకు తగిన జీవితం జీవించమని
చెబుతున్నారు!
ఇక 14వ వచనం చూస్కుంటే ఆయన అనగా యేసుక్రీస్తుప్రభులవారు మన
సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషాన్ని అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల
ధర్మశాస్త్రాన్ని తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యలో ఉన్న అడ్డగోడను పడగొట్టి మన
ఉభయులను ఏకము చేశారు అంటున్నారు!
ఇక్కడ మీకును- అనగా సమస్త అన్యజనులలో రక్షించబడిన విశ్వాసులు అని
అర్ధము!
మాకును అనగా పౌలుగారు యూదుడు కాబట్టి యూదులకును అని అర్ధం!
మనకు సమాధానం”– విశ్వాసులైన యూదులకూ విశ్వాసులైన అన్యజనులలో నుండి
రక్షించబడిన విశ్వాసులకు మద్య సమాధానం
యేసుప్రభువే. ఆయనలో జాతిపరమైన అడ్డుగోడలన్నీ నాశనమైపోయాయి, ఐక్యత నెలకొంది.
ఇక తన శరీరమందు అని ఎందుకు అంటున్నారు అంటే సిలువపై దైవమానవుడుగా క్రీస్తు యూదులకూ
అన్యజనులకూ మధ్య ఉన్న వైరాన్ని నాశనం చేశారు – వ 16.
విరోధాన్నీ చీలికనూ సృష్టించినదాన్ని రద్దు చేయడం ద్వారా ఆయన
దీన్ని చేశారు –
అంటే మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ఆయన రద్దుచేశారు (రోమ్
7:4; 10:4). ఈ వైరం క్రీస్తులో మాత్రమే నాశనం అయింది. క్రీస్తులో లేనివారిలో తరచుగా
ఇది ఇంకా కనిపిస్తూనే ఉంది.
రోమా: 7: 4 కావున నా సహోదరులారా, మనము దేవునికొరకు ఫలమును
ఫలించునట్లు మృతులలోనుండి లేపబడిన క్రీస్తు అనువేరొకని చేరుటకై మీరును ఆయన
శరీరముద్వారా ధర్మ శాస్త్రము విషయమై మృతులైతిరి.
5. ఏలయనగా మనము శరీరసంబంధులమై యుండినప్పుడు మరణార్థమైన
ఫలమును ఫలించుటకై, ధర్మశాస్త్రమువలననైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై
యుండెను.
6. ఇప్పుడైతే దేనిచేత నిర్బంధింపబడితిమో దానివిషయమై
చనిపోయినవారమై, ధర్మశాస్త్రమునుండి విడుదల పొందితివిు గనుక మనము అక్షరానుసారమైన
ప్రాచీనస్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీనస్థితి గలవారమై సేవచేయుచున్నాము.
10:4 విశ్వసించు
ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియై యున్నాడు.
ఇక 15వ వచనంలో అంటున్నారు:
15. ఇట్లు సంధిచేయుచు, ఈ యిద్దరిని తనయందు ఒక్క నూతన
పురుషునిగా సృష్టించి,...
ఆ ఇద్దరిని అనగా యూదులను, విశ్వాసులైన అన్యజనులను దేవుడు
ఇద్దరికీ సందిచేసి ఇద్దరినీ సమాధాన పరిచి ఇద్దరినీ ఒకే నూతన పురుషునిగా చేశారు
అంటున్నారు!
ఒక
కొత్త మానవుణ్ణి – అంటే యూదులలో, అన్యజనులలో
ఉన్న విశ్వాసులందరినీ ఒక్క శరీరంలో కలిపి
క్రీస్తు తానే శిరస్సుగా ఉండడం. ఇలాంటిది ఇంతకుముందు ఎన్నడూ లేదు గనుక, అది కొత్త
ఆధ్యాత్మిక జీవితంతో కూడిన కొత్త సృష్టి గనుక అది కొత్తది.
ఇక
16వ వచనంలో అంటున్నారు:
16. తన సిలువవలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా
వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధానపరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే
మనకు సమాధానకారకుడై యున్నాడు.
17. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన
వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను.
ఇక్కడ
సమాధాన పరిచారు అంటున్నారు: ఇంతకీ దేనితో సమాధాన పరిచారు అంటే ఆయన మోసిన సిలువ వలన”–
రోమా 5:10;
9. కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి,
మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింప బడుదుము.
10. ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణముద్వారా
మనము దేవునితో సమాధాన పరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి
నిశ్చయముగా రక్షింపబడు దుము.
11. అంతేకాదు; మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా మనము
దేవునియందు అతిశయపడుచున్నాము; ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధానస్థితి పొంది
యున్నాము.
2 Corinthians(రెండవ కొరింథీయులకు) 5:17,18
17. కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి;
పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;
18. సమస్తమును దేవుని వలననైనవి; ఆయన మనలను క్రీస్తు ద్వారా
తనతో సమాధాన పరచుకొని, ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను.
మనుషులు పాత అలవాట్లు మానుకుని కొత్త జీవితం ఆరంభించవచ్చు గానీ తమలో కొత్త
జీవాన్ని సృష్టించుకోలేరు. ఇది కష్టం మాత్రమే కాదు, అసాధ్యం. మొదటి సృష్టిని చేయడం
(ఆది 1:1) వారికెలా అసాధ్యమో ఇదీ అంతే అసాధ్యం.
సఖ్యపరచుకోవడం”–
అంటే శత్రువులను మిత్రులుగా మార్చడం, శత్రుత్వానికీ, ఎడబాటుకూ ఉన్న కారణాన్ని
తొలగించడం. పాపం మనుషుల్ని దేవునికి శత్రువులుగా చేసింది (రోమా 5:10; కొలస్సయి 1:21).
వారి పాపాల మూలంగా దేవుని కోపం వారిపై ఉంది (రోమా 1:18.
సంఖ్యా 25:3; కీర్తన 90:7-11;
యోహాను 3:36).
మనుషులను తనతో సఖ్యపరచుకోవాలంటే వారిలో తనకు కోపం కలిగించినదాన్నీ, వారిని
తనకు దూరం చేసేదాన్నీ దేవుడు పరిష్కరించాలి. లోక పాపాలకోసం బలి అర్పణంగా ఉండేందుకు
తన కుమారుణ్ణి పంపడం ద్వారా ఆయన ఇది చేశాడు.
“క్రీస్తు ద్వారా” దేవుడు మనుషులను సఖ్యపరచుకున్నాడు. ఎఫెసు 2:16;
కొలస్సయి 1:20, 22. ఇలా చేసి ఈ శుభవార్తను ప్రకటించేందుకు అన్ని వైపులకూ తన
సేవకులను పంపుతున్నారు. “సమాధానపరిచే పరిచర్య మాకిచ్చాడు” అంటే అర్థం ఇదే.
ప్రకటించాలని దేవుడు తన సేవకులకు ఇచ్చిన “సఖ్య పరిచే పరిచర్య” ఇదే. వ 18లో
పౌలుగారు “దేవుడు మమ్ములను తనతో సఖ్యపరచుకున్నాడు” అన్నారు. ఇప్పుడు దేవుడు
“లోకాన్ని” తనతో సఖ్యపరచుకునే సంగతి గురించి పౌలుగారు మాట్లాడుతున్నారు. ఇది
భూతకాలంలో ఉంది. యేసు క్రీస్తు మరణం ద్వారా తనకు, తన స్నేహాన్ని కోరిన ఏ
వ్యక్తికైనా సరే అలాంటి శాశ్వత స్నేహం ఉండేందుకు పునాది వేశాడు. మనుషుల అపరాధాలు
వారిమీద మోపకుండా, వాటిని క్రీస్తు మీద మోపాడు (వ 21; యోహాను 1:29; యెషయా 53:5-6).
అంటే మనుషులంతా పాపవిముక్తి పొందుతారని అర్థం కాదు. అందరూ పాపవిముక్తి పొందేందుకు
మార్గం సిద్ధమైందని దీని అర్థం. పాపవిముక్తి పొందాలంటే దేవుడు తమకోసం చేసిన దాన్ని
మనుషులు స్వీకరించి, క్రీస్తులో నమ్మకం పెట్టుకోవాలి. అలా చేయకపోతే నశించిపోతారు
(యోహాను 3:16, 36).
ఇక 17 వ వచనంలో “ఆయన”– అంటే యేసుప్రభువు. మనుషులకు శాంతిని తేవాలనీ, మనుషులకూ దేవునికీ మద్య,
మనుషులకూ మనుషులకూ మద్య శాంతిని స్థాపించాలని వచ్చిన శాంతిరాజు ఆయన – యెషయా 9:6; లూకా 1:79; యోహాను 14:27; 16:33; అపొ కా 10:36; 2 కొరింతు
5:20.
తాను స్వయంగానూ, తన ప్రవక్తల
ద్వారానూ ఆయన శాంతిని ప్రకటించాడు. అన్ని చోట్లా తన సేవకుల ద్వారా ఇప్పటికీ
ప్రకటిస్తూనే ఉన్నాడు.
ఇక దూరంగా ఉన్నవారికి అనగా
అన్యజనులలో రక్షించబడిన విశ్వాసులు అనియు, దగ్గరగా ఉన్నవారు అనగా యూదులు అని
గ్రహించాలి!
అందుకే 3:12; రోమ్ 5:2; హీబ్రూ
10:19-22. ఇప్పుడైతే యూదుడైనా, యూదేతరుడైనా క్రీస్తుద్వారా నేరుగా దేవుని దగ్గరికి
రావచ్చు.
ఇక్కడ త్రిత్వాన్ని గమనించండి.
దేవుని కుమారునిద్వారా, పవిత్రాత్మద్వారా తండ్రి అయిన దేవుని సన్నిధికి మనకు
ప్రవేశం కలిగింది.
దైవాశీస్సులు!
(ఇంకాఉంది)
*ఎఫెసీ పత్రిక -34వ భాగం*
ఎఫెసీ 2:14—17
19. కాబట్టి మీరికమీదట పరజనులును పరదేశులునై యుండక,
పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునై యున్నారు.
20. క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును
ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.
21. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు
పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధిపొందుచున్నది.
22. ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమై
యుండుటకు కట్టబడుచున్నారు.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను
ధ్యానంచేసుకుంటున్నాము!
(గతభాగం తరువాయి)
ఇక్కడ
19—22 వచనం లో కూడా అదే విషయాన్ని కొనసాగిస్తున్నారు!
19వ
వచనంలో అంటున్నారు కాబట్టి ఇకమీదట మీరు పరజనులును పరదేశులును ఇక కారుగాని ఇప్పుడు మీరు పరిశుద్ధులతో ఏక
పట్టణసులై ఉంటూ దేవుని ఇంటివారై ఉన్నారు అంటున్నారు! నిజానికి ఈ వచనం 12వ వచనానికి
పూర్తిగా వ్యతిరేఖమై ఉన్నది! 12వ వచనంలో ఏమన్నారు:
12. ఆ కాలమందు
ఇశ్రాయేలుతో సహపౌరులుకాక, పరదేశులును, వాగ్దాన నిబంధనలు లేని పరజనులును,
నిరీక్షణలేనివారును, లోక మందు దేవుడు లేనివారునైయుండి, క్రీస్తుకు దూరస్థులై
యుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి.
అయితే
ఇప్పుడు మీరికమీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును
దేవుని యింటివారునై యున్నారు అంటున్నారు! ఇక్కడ ఏక పట్టణస్తులు దేవుని
ఇంటివారును అనగా వారితో సహా పౌరులుగా
ఉన్నారు అని అర్ధం – ఇది ఒక నగరానికి లేక దేశానికి చెందడం గురించిన మాట.
అందుకే పౌలుగారు గలతీ 4:28 లో అంటున్నారు:
సహోదరులారా, మనమును ఇస్సాకువలె వాగ్దానమునుబట్టి పుట్టిన
కుమారులమై యున్నాము.
ఫిలిప్పీ 3:20,21
20. మన పౌరస్థితి పర లోకమునందున్నది; అక్కడనుండి ప్రభువైన
యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము.
21. సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తినిబట్టి ఆయన మన
దీనశరీరమును తన మహిమగల శరీరమునకు సమ రూపము గలదానిగా మార్చును.
హీబ్రూ 11:16;
అయితే వారు మరి శ్రేష్ఠమైన దేశమును, అనగా పరలోకసంబంధమైన
దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు
వారినిగూర్చి సిగ్గుపడడు
12:22 --24
ఇప్పుడైతే సీయోనను కొండకును జీవముగల దేవుని పట్టణమునకు,
అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేలకొలది దేవదూతలయొద్దకును,
23. పరలోకమందు వ్రాయబడియున్న జ్యేష్టుల సంఘమునకును, వారి
మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతియైన దేవుని యొద్దకును, సంపూర్ణసిద్ధి పొందిన
నీతిమంతుల ఆత్మల యొద్దకును,
24. క్రొత్తనిబంధనకు మధ్యవర్తియైన యేసునొద్దకును హేబెలుకంటె
మరి శ్రేష్ఠముగ పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చియున్నారు
“ఇంటివారిలో”
అనగా– దేవునికో కుటుంబం ఉంది.
అందులో భూమిమీద ఉన్న మనుషులంతా లేరు. ఆయన ఆత్మమూలంగా పుట్టినవారే ఆ కుటుంబంలో
ఉన్నారు – వ 5. ఆధ్యాత్మికంగా చూస్తే
క్రీస్తులో విశ్వాసులంతా దేవుడు తమ తండ్రిగాగల తోబుట్టువులే –
2
కొరింతు 6:17-18; హీబ్రూ 2:11-12.
ఇక
20వ వచనంలో : క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై
యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు
దీనికోసం
గత శీర్షికలో విస్తారంగా ధ్యానించుకున్నాము గనుక ముందుకుపోదాం !
క్రీస్తు
విశ్వాసులు దేవుని ఇల్లు, దేవుని ఆలయం కూడా.
1కోరింథీయులకు 3:16
మీరు దేవుని ఆలయమైయున్నారనియు, దేవుని ఆత్మ మీలో
నివసించుచున్నాడనియు మీరెరుగరా?
1కోరింథీయులకు 3:17
ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసినయెడల దేవుడు వానిని
పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైయున్నది; మీరు ఆ ఆలయమైయున్నారు (లేక-మీరును
పరిశుద్ధులైయున్నారు) .
1కోరింథీయులకు 6:15
మీ దేహములు క్రీస్తునకు అవయవములైయున్నవని మీరెరుగరా? నేను
క్రీస్తుయొక్క అవయవములను తీసికొని వేశ్యయొక్క అవయవములుగా చేయుదునా? అదెంత
మాత్రమును తగదు.
1కోరింథీయులకు 6:19
మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న
పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,
1కోరింథీయులకు 6:20
విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని
మహిమపరచుడి.
1పేతురు 2:4
మనుష్యులచేత విసర్జింపబడినను, దేవుని దృష్టికి
ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చినవారై,
1పేతురు 2:5
యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన
బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలె నుండి
ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.
1పేతురు 2:6
ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు
మూలరాతిని సీయోనులొ స్థాపించుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచు వాడు ఏమాత్రమును
సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడియున్నది.
విశ్వాసులకు
దేవునితో ఉన్న సంబంధాన్ని తెలిపేందుకు పౌలుగారు
ఈ పత్రికలో ఎన్ని రకాల మాటలను
వాడుతున్నారో చూడండి.
వారు దేవుని సంతానం –
1:5;
ఎఫెసీయులకు 1:5
తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, యేసుక్రీస్తు
ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై,మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని,
దేవుని వారసత్వం –
ఎఫెసీయులకు 1:17
మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, ఆయన మిమ్మును
పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క
మహిమైశ్వర్యమెట్టిదో,
దేవుని కుమారుని శరీరం – 1:23;
ఎఫెసీయులకు 1:23
ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని
సంపూర్ణతయై యున్నది.
దేవుడు చేసినవారు –
2:10;
ఎఫెసీయులకు 2:10
మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా
సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన
చేసిన పనియైయున్నాము.
దేవుని ప్రజలు, దేవుని పరలోక పౌరులు, దేవుని ఇల్లు – 2:19;
ఎఫెసీయులకు 2:19
కాబట్టి మీరికమీదట పరజనులును పరదేశులునై యుండక,
పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునైయున్నారు.
దేవుని ఆలయం.
ఎఫెసీయులకు 2:21
ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు
పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధిపొందుచున్నది.
ఎఫెసీయులకు 2:22
ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమైయుండుటకు
కట్టబడుచున్నారు.
ఆరాధన,
దేవునికి అర్పణలు జరిగే స్థలం దేవాలయం. ఆయన ప్రజలతో కూడిన దేవుని సజీవ ఆలయం కూడా
అంతే – రోమా 12:1;
రోమీయులకు 12:1
కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన
సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి
మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది.
హెబ్రీయులకు 13:14
నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని, ఉండబోవుచున్నదాని
కోసము ఎదురుచూచుచున్నాము.(మూలభాషలో-వెదకుచున్నాము)
హెబ్రీయులకు 13:15
కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము
చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.
ఇక క్రీస్తుయేసు మూలరాయి అంటూ
అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అంటున్నారు! ఇక్కడ
ప్రవక్తలు అనగా పాత నిబంధన ప్రవక్తలు క్రొత్త నిబంధన ప్రవక్తలు అని అర్ధం
చేసుకోవాలి!
మూలరాయి
కోసం గతంలో విస్తారంగా చూసుకున్నాము! “మూలరాయి”– 1 పేతురు 2:6; యెషయా 28:16. ఇళ్ళు కట్టేవారు
మూలరాయిని ముందు చెక్కేవారు. ఇది ఆ కట్టడమంతటికీ అతి ప్రాముఖ్యమైన రాయి. అది
దానినుంచి కట్టబడే గోడలను నిటారుగా చక్కగా ఉంచుతుంది. ఈ విధంగా కట్టడం అంతటికీ
స్థిరత్వం, సౌందర్యం ఇస్తుంది.
1పేతురు 2:6
ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు
మూలరాతిని సీయోనులొ స్థాపించుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచు వాడు ఏమాత్రమును
సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడియున్నది.
1పేతురు 2:7
విశ్వ సించుచున్న మీకు, ఆయన అమూల్యమైనవాడు; విశ్వ
సింపనివారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయెను.
మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయెను.
యెషయా 28:16
ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు సీయోనులో పునాదిగా
రాతిని వేసినవాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన
పునాదియైన మూలరాయియైయున్నది విశ్వసించువాడు కలవరపడడు.
అయితే ఇక్కడ మీరు క్రీస్తుయేసు మూలరాయి మీద కట్టబడుచున్నారు అంటున్నారు-
దేనిలా కట్టబడుచున్నారు అనేది తర్వాత వచనములలో మొదటగా పరిశుద్ద దేవాలయముగా
కట్టబడుతున్నారు అంటున్నారు, మరో వచనంలో దేవుని నివాస స్థలమై కట్టబడుచున్నారు
అంటున్నారు!
అయితే
21 వ వచనం చూసుకుంటే
21. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు
పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధిపొందుచున్నది అంటున్నారు. అనగా ఈ కట్టడము ఇంకా పూర్తికాలేదు! అన్యజనులలో
మార్పు నొందవలసిన వారిసంఖ్య పూర్తి అయ్యేవరకు ఇది కట్టబడుతూ వృద్ధి పొందుతూ
ఉంటుంది అనిగ్రహించాలి! అనుదినం కొత్త విశ్వాసులను ఆయన చేరుస్తూ ఉంటే అదింకా
పెరుగుతూ ఉంది. క్రీస్తులోనే ఆ కట్టడం ఒకటిగా నిలబడి ఉంది, ఆయనలోనే పెరుగుతూ ఉంది
అని గ్రహించాలి!
ఇక
దేవుని స్థలమై అనగా దేవుని నివాసం”–
నిర్గమ 25:8; ప్రకటన 21:3
ఇప్పుడు భూమిపై దేవునికి ఉన్న ఒకే ఒక ఆలయం యేసు
క్రీస్తులో విశ్వాసులతో ఏర్పడిన ఆలయమే. మనుషులు కట్టిన ఎలాంటి దేవాలయంలోనూ నిజ
దేవుడు లేడు –
అపొ
కా 17:24-25.
అపో.కార్యములు 17:24
జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే
ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు.
అపో.కార్యములు 17:25
ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక
తనకు ఏదైనను కొదువయున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు.
ఇక
చివరలో మీరు కూడా అనగా అన్యజనులలో రక్షించబడిన విశ్వాసులు అని గ్రహించాలి!
దీనిని
బట్టి విశ్వాసులంతా ఇశ్రాయేలు జనాంగము కంటే తక్కువవారు కారుగాని వారితో సహపౌరులుగా
దేవుని వాగ్దానాలు అన్నింటికీ వారసులుగా దేవుడు చేశారు కాబట్టి మొదటగా మనము
పొందుకున్న పిలుపుకు తగినట్లుగా జీవించాలి!
రెండు:పొందుకున్న
రక్షణను జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవుని పిల్లలకు తగినట్లుగా జీవించాలి!
ఆమెన్!
*ఎఫెసీ పత్రిక -35వ భాగం*
ఎఫెసీ 3:1—6
1. ఈ హేతువుచేత అన్యజనులైన మీనిమిత్తము క్రీస్తు యేసుయొక్క
ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను.
2. మీకొరకు నాకనుగ్రహింపబడిన దేవుని కృపవిషయమైన యేర్పాటును
గూర్చి మీరు వినియున్నారు.
3. ఎట్లనగాక్రీస్తు మర్మము దేవదర్శనమువలన నాకు తెలియపరచ
బడినదను సంగతినిగూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని.
4. మీరు దానిని చదివినయెడల దానినిబట్టి ఆ క్రీస్తు
మర్మమునుగూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొన గలరు.
5. ఈ మర్మమిప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులగు
అపొస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి యున్నట్టుగా పూర్వకాలములయందు మనుష్యులకు
తెలియ పరచబడలేదు.
6. ఈ మర్మమేదనగా అన్యజనులు, సువార్తవలన క్రీస్తుయేసునందు,
యూదులతోపాటు సమానవారసులును, ఒక శరీరమందలి సాటి అవయవ ములును, వాగ్దానములో
పాలివారలునై యున్నారను నదియే.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాము!
ఇక
మూడవ అధ్యాయంలో ఇంతవరకు ఈ రెండు అధ్యాయాలలో పౌలుగారు చెప్పిన విషయాలకు ఫలితార్ధం
చెబుతూ ఒక మర్మాన్ని చెబుతున్నారు!
మొదటి
వచనంలో ఈ హేతువుచేత అన్యజనులైన మీ నిమిత్తం క్రీస్తుయేసు యొక్క ఖైదీనైన పౌలు అను
నేను ప్రార్ధించుచున్నాను అంటూ మొదలుపెట్టారు! ఈ కారణం చేత అనగా ఏ కారణంచేత?
దానికంటే ముందుగా క్రీస్తుయేసు ఖైదీనైన
నేను అని అంటున్నారు!
ఉపోద్ఘాతంలో చెప్పడం జరిగింది! ఈ
పత్రిక జైలు పత్రిక అని! జైలు పత్రికల వరుసలో ఇది నాల్గవది అని చెప్పడం జరిగింది!
కొలస్సీయులకు, ఫిలిప్పీయులకు, ఒనేసీము గారికోసం ఫిలేమాను గారికి ఉత్తరం రాసి,
మార్గమధ్యంలో ఎఫెసీ పట్టణం వస్తుంది కాబట్టి ఎఫెసీయులకు కూడా ఉత్తరం రాసి, వారితోపాటుగా
ఈ ఉత్తరాన్ని పంపించారు అని చెప్పడం జరిగింది! ఈపత్రిక రోమా హౌస్ అరెస్ట్ లో
ఉన్నప్పుడు పౌలుగారు వ్రాసిన పత్రిక! అందుకే క్రీస్తుయేసు ఖైదీనైన నేను
ప్రార్ధిస్తున్నాను అంటున్నారు! ఇక ఏ హేతువుచేతనో చూసుకుందాం!
మొదటిది:
ఎఫెసీయులకు
2
20. క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును
ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.
21. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు
పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధిపొందుచున్నది.
22. ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమై
యుండుటకు కట్టబడుచున్నారు.
మీరు క్రీస్తుయేసు అనే మూలరాయిపై కట్టబడ్డారు! అయితే
దానికోసం అపోస్తలులు ప్రవక్తలు పునాది వేశారు! ఇప్పుడు ఆయన ఆత్మమూలంగా మీరు
దేవునికి నివాస స్థలమై ఉండేలా ఇంకనూ కట్టబడుచున్నారు అంటూ ఒక కారణం చెప్పారు!
అయితే రెండో వచనంలో అలా మీరు కట్టబడేలా దేవుడు మీకొరకు నాకు ఒక కృప విషయమైన
ఏర్పాటును ఇచ్చారు అంటున్నారు! అదేమిటి అంటే దేవుడు పౌలుగారిని అన్యజనులకు
అపోస్తలునిగా ఉండటానికి ఏర్పాటుచేసుకోవడమే! అనగా ఎఫెసీలో ఉన్న వారిలో దేవుడు
కొందరిని ఏర్పాటుచేసుకున్నారు తనశిష్యులుగా ఉండటానికి! దానికోసం- దేవుడు పౌలుగారిని
అపోస్తులునిగా ఏర్పాటుచేసుకుని ఆయన ద్వారా అనగా ఆయన సువార్త పరిచర్య ద్వారా
ఎఫెసీలో ఉన్న అనేకమందిని దేవుడు తన శిష్యులుగా లేక పిల్లలుగా చేసుకోవడానికి
పౌలుగారిని ఏర్పాటుచేయడం జరిగింది! దీనికోసం మనం బాగా అర్ధం చేసుకోవాలి అంటే
గలతీపత్రికలో వివరంగా చెబుతున్నారు!
గలతియులకు 2
7. అయితే సున్నతి పొందినవారికి బోధించుటకై సువార్త
పేతురుకేలాగు అప్పగింపబడెనో ఆలాగు సున్నతి పొందనివారికి బోధించుటకై నా కప్ప
గింపబడెనని వారు చూచినప్పుడు,
8. అనగా సున్నతి పొందినవారికి అపొస్తలుడవుటకు పేతురునకు
సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపొస్తలుడనవుటకు నాకును సామర్థ్యము
కలుగజేసెనని వారు గ్రహించినప్పుడు,
9. స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను అను వారు నాకు
అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకును తాము సున్నతిపొందినవారికిని
అపొస్తలులుగా ఉండవలెనని చెప్పి, తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును
కుడిచేతిని ఇచ్చిరి.
ఇక్కడ
చూసుకుంటే సున్నతిని పొందినవారికోసం దేవుడు పేతురుగారిని మరికొంతమందిని
అపోస్తలులుగా ఏర్పాటు చేసుకుంటే, పౌలుగారిని బర్నబా గారిని దేవుడు అన్యజనులకు
అపోస్తులులుగా ఉండటానికి ఏర్పాటుచేసుకున్నారు!!
ఇది
మనకు అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో కనిపిస్తుంది!
అపో. కార్యములు 9
15. అందుకు ప్రభువు నీవు వెళ్లుము, అన్యజనుల యెదుటను రాజుల
యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై
యున్నాడు
అపో. కార్యములు 22
21. అందుకు ఆయన వెళ్లుము, నేను దూరముగా అన్యజనులయొద్దకు
నిన్ను పంపుదునని నాతో చెప్పెను.
కాబట్టి ఇప్పుడు పౌలుగారు ఈ ఉత్తరం ఎఫెసీ విశ్వాసులకు ఎందుకు రాస్తున్నారు
అంటే క్రీస్తుపై అతని స్వామిభక్తి కారణంగా, అన్యజనుల మధ్య అతడు జరిగించిన పరిచర్య కారణంగా పౌలుగారు
జైలులో ఉన్నారు (అపొ కా 21—22
అధ్యాయాలులో మనకు ఈ విషయం అర్ధమవుతుంది). అందువల్ల క్రీస్తును బట్టి ఖైదులో
ఉన్నానంటున్నారు. తన విషయం క్రీస్తు సంకల్పం గనుక అలా లేకపోతే మనుషులెవరూ తనను
బంధించి ఉంచలేరని అతనికి తెలుసు. కారణం అతడు పెద్ద యుద్ద వీరుడు శూరుడు!
సినాగోగులో ఒకప్పుడు సభ్యుడు మరియు అధికారి! కాని యేసుక్రీస్తుప్రభులవారు తనని
పట్టుకున్నారు కాబట్టి తన విద్యలు తలాంతులు వదిలి క్రీస్తుఖైదీగా మారిపోయారు
పౌలుగారు!
ఇక
మూడవ వచనంలో అంటున్నారు: ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనమువలన నాకు తెలియపరచ
బడినదను సంగతినిగూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని.
క్రీస్తు
మర్మము నాకు దేవదర్శనం వలన తెలియపరచబడింది అంటున్నారు! ఇది మనకు అపోస్తలుల
కార్యములు 9వ అద్యాయం పూర్తిగా చదివితే అర్ధమవుతుంది!
1. సౌలు ఇంకను ప్రభువుయొక్క శిష్యులను బెదరించుటయును
హత్యచేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధానయాజకునియొద్దకు వెళ్లి
2. యీ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన
యెడల, వారిని బంధించి యెరూషలేము నకు తీసికొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి
పత్రికలిమ్మని అడిగెను.
3. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు,
అకస్మాత్తుగా ఆకాశమునుండి యొక వెలుగు అతనిచుట్టు ప్రకాశించెను.
4. అప్పుడతడు నేలమీదపడి సౌలా, సౌలా, నీవేల నన్ను
హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను.
5. ప్రభువా, నీవెవడవని అతడడుగగా ఆయన నేను నీవు హింసించు
చున్న యేసును;
6. లేచి పట్టణములోనికి వెళ్లుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో
అది నీకు తెలుపబడునని చెప్పెను.
అయితే ఈ విషయాన్ని మీకు సంక్షేపముగా
రాశాను అంటున్నారు! అనగా ఈ ఎఫెసీ పత్రికకు ముందుగా పౌలుగారు కొన్ని పత్రికలు
వీరికి రాశారు గాని మనకు అవి లభ్యము కాలేదు! ఉపోద్ఘాతంలో చెప్పడం జరిగింది.
ఎఫెసీలో ఉన్న సంఘము దేవుని విషయాలందు ఆసక్తి కలిగిన వారు! వారికి ఆధ్యాత్మిక విషయాలలో ఏవిధమైన అనుమానాలు కలిగినా వెంటనే
పౌలుగారికి ఉత్తరం రాసేవారు, వెంటనే పౌలుగారు జవాబులు ఇచ్చేవారు. అలాంటి సందర్బములోనే ఆ మొదటి ఉత్తరం రాశారు
పౌలుగారు ఎఫెసీ విశ్వాసులకు! ఆ ఉత్తరంలో తాను పొందుకున్న దేవదర్శనాలు అన్నీ
వ్రాయడం జరిగింది గాని మనకు ఆ ఉత్తరం లభ్యం కాలేదు!
అయితే
ఇప్పుడు పౌలుగారు ఏ మర్మముకోసం మాట్లాడుచున్నారు?
బైబిల్ లో అనేక మర్మాలున్నాయి అయితే దేనికోసం చెబుతున్నారు అంటే ఒక మర్మము
మనకు 5, 6 వచనాలలో ఉంది:
5. ఈ మర్మమిప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులగు
అపొస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి యున్నట్టుగా పూర్వకాలములయందు మనుష్యులకు
తెలియ పరచబడలేదు.
6. ఈ మర్మమేదనగా అన్యజనులు, సువార్తవలన క్రీస్తుయేసునందు,
యూదులతోపాటు సమానవారసులును, ఒక శరీరమందలి సాటి అవయవములును, వాగ్దానములో
పాలివారలునై యున్నారను నదియే.
కాబట్టి మొదటిది అన్యజనులలో
రక్షించబడిన విశ్వాసులు క్రీస్తుయేసు
సువార్త సత్యమువలన రక్షించబడి, ఇప్పుడు యూదులతో పాటుగా సమానవారసులు మరియు దేవుని
శరీరములో సాటి అవయవములు మరియు దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చేసిన వాగ్ధానములలో
పాలివారు అయి ఉన్నారు! ఇదీ ముఖ్యమైన మర్మము! అంతేకాకుండా ఈ పత్రిక యొక్క ఉద్దేశము
కూడా ఇదే!
ఇంకా
కొన్ని మర్మాలు ఉన్నాయి వారి రిఫరెన్సులు
మాత్రం చూసుకుందాం!
రోమా 11:
25. సహోదరులారా, మీదృష్టికి మీరే బుద్ధిమంతులమని
అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొన గోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల
ప్రవేశము సంపూర్ణ మగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను.
26. వారు ప్రవేశించునప్పుడు విమోచకుడు సీయోనులోనుండి వచ్చి
యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును;
27. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నావలన వారికి
కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు.
1కొరింథీ 15:
51. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మన మందరము
నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్ప పాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పు
పొందుదుము.
52. బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు,
మనము మార్పు పొందుదుము.
53. క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించుకొనవలసి యున్నది;
మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించు కొనవలసియున్నది.
కొలొస్సయులకు 1
26. మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని యేర్పాటు
ప్రకారము, నేను ఆ సంఘమునకు పరిచార కుడనైతిని.
27. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది,
అనగా మీ యందున్న క్రీస్తు, మహిమ నిరీక్షణయై యున్నాడను సంగతిని దేవుడు తన
పరిశుద్ధులకు తెలియపరచగోరి యిప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను.
ఇంకా చాలా ఉన్నాయిగాని మచ్చుకు నాలుగు మర్మములు చూపించడం
జరిగింది! గమనించాలి ఈ మర్మాలు అన్నీ పౌలుగారు అరేబియా దేశంలో తర్ఫీదుకోసం మూడు
సంవత్సరములు ప్రార్ధనలో దేవునిపాదాలు
యొద్ద కనిపెట్టినప్పుడు దేవుడు తన దర్శనాల
రూపంలో పౌలుగారికి చూపించిన మర్మములు అని గ్రహించాలి!
అయితే
5,6 వచనాలలో ఈ మర్మాలు పాత నిబంధన భక్తులకు బయలుపరచ బడలేదు అంటున్నారు! : 5. ఈ మర్మమిప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులగు అపొస్తలులకును
ప్రవక్తలకును బయలుపరచబడి యున్నట్టుగా పూర్వకాలములయందు మనుష్యులకు తెలియ పరచబడలేదు.
6. ఈ మర్మమేదనగా అన్యజనులు, సువార్తవలన క్రీస్తుయేసునందు,
యూదులతోపాటు సమానవారసులును, ఒక శరీరమందలి సాటి అవయవములును, వాగ్దానములో
పాలివారలునై యున్నారను నదియే.
దీనినే 2వ అధ్యాయంలో కూడా చెప్పారు ఎఫెసీయులకు 2
11. కాబట్టి మునుపు శరీరవిషయములో అన్యజనులైయుండి, శరీరమందు
చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారిచేత సున్నతిలేనివారనబడిన మీరు
12. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుకాక, పరదేశులును,
వాగ్దాన నిబంధనలు లేని పరజనులును, నిరీక్షణలేనివారును, లోక మందు
దేవుడులేనివారునైయుండి, క్రీస్తుకు దూరస్థులై యుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి.
క్రీస్తు సువార్తవల్ల అన్యజనులకు కలిగిన లాభాలు మూడింటిని పేర్కొంటున్నారు,
యూదులతో పాటుగా అన్యజనులలో రక్షించబడిన
విశ్వాసులు కూడా వారసులే, క్రీస్తు
శరీరం అయిన నిజ సంఘంలో సభ్యులే, దేవుని వాగ్దానాల్లో వారికీ భాగం ఉంది. ఇక్కడ
“వాగ్దానాలు” అంటే పాపవిముక్తి, రక్షణ గురించినవి, మరింత ప్రత్యేకంగా పవిత్రాత్మను
గురించినవి అని గ్రహించాలి!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -36వ భాగం*
ఎఫెసీ 3:7—11
7. దేవుడు కార్యకారియగు తన శక్తినిబట్టి నాకు అనుగ్రహించిన
కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని.
8. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన
నిత్యసంకల్పము చొప్పున,
9. పరలోకములో ప్రధానులకును అధికారులకును, సంఘముద్వారా
తనయొక్క నానావిధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడ వలెనని ఉద్దేశించి,
10. శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో
ప్రకటించుటకును,
11. సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలమునుండి మరుగై
యున్న ఆ మర్మమునుగూర్చిన యేర్పాటు ఎట్టిదో అందరి కిని తేటపరచుటకును,
పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాము!
ప్రియులారా
గతబాగంలో మొదలుపెట్టిన విషయాన్ని ఇంక్కా కొనసాగిస్తున్నారు! దేవుడు పూర్వకాలంలో మరుగైన మర్మము ఇప్పుడు బయలు
పరిచారు ఏమిటంటే అన్యజనులలోనుండి
రక్షించబడిన విశ్వాసులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసు నందు విశ్వాసము ద్వారా ఆయనలో
బాప్తిస్మం పొందుట ద్వారా కలిగిన పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడు మీరు యూదులతో పాటుగా
సమాన వారసులై ఉన్నారు! అది ప్రకటించడానికి నేను దేవుని కృప విషయమై నేను
అపోస్తులుడుగా దేవునిచేత నియమించబడ్డాను అంటూ 7వ వచనంలో దేవుడు కార్యకారియగు తన
శక్తినిబట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు
పరిచారకుడనైతిని అంటున్నారు!
సువార్త
పరిచర్యలో తన చేసున్న సేవను పౌలుగారు ఏ విధంగా ఎంచుతున్నారో చూడండి. అతని పాలిట అది దేవుని అద్భుత వరంగా
మారింది. ఈ సంగతిని క్రైస్తవులందరూ ఈ విధంగానే చూస్తే క్రైస్తవ సంఘాలు ఎంత
భిన్నంగా ఉంటాయి!
“బలప్రభావాలు లేక తన శక్తిని బట్టి”–
2 కోరింథీయులకు 3:5-6; కొలొస్సయులకు 1:29; అపో. కార్యములు
1:8. దేవుని బలప్రభావాలు మాత్రమే ఎవరినైనా దేవుని మంచి సేవకులుగా చేయగలవు. ......
2 Corinthians(రెండవ కొరింథీయులకు) 3:5,6
5. మావలన ఏదైన అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే
సమర్థులమని కాదు; మా సామర్థ్యము దేవుని వలననే కలిగియున్నది.
6. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు
గాని ఆత్మకే పరిచారకుల మవుటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడు. అక్షరము చంపునుగాని
ఆత్మ జీవింపచేయును.
కొలస్సీయులకు 1:28
ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయనయెదుట
నిలువబెట్టవలెనని, సమస్తవిధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి
బుద్ధిచెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము.
కొలస్సీయులకు 1:29
అందు నిమిత్తము నాలో బలముగా, కార్యసిద్ధికలుగజేయు ఆయన
క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను.
అపో.కార్యములు 1:8
అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు
శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల
వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.
ఇక 8,9 వచనాలలో
8. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన
నిత్యసంకల్పము చొప్పున,
9. పరలోకములో ప్రధానులకును అధికారులకును, సంఘముద్వారా
తనయొక్క నానావిధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడ వలెనని ఉద్దేశించి,
గత
కాలంలో దేవుడు అనేక సత్యాలను మనుషులకు
వెల్లడించారు. ఈ సత్యాన్ని లేక మర్మాన్ని
అయితే తగిన కాలం వచ్చేవరకు మూసి ఉంచారు. అప్పుడు వెల్లడించేందుకు
పౌలుగారిని ఎన్నుకున్నారు.
ఇక
10, 11 లలో
10. శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్య మును అన్యజనులలో
ప్రకటించుటకును,
11. సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలమునుండి మరుగై
యున్న ఆ మర్మమునుగూర్చిన యేర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును,
పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను.
దేవుడు
క్రీస్తుసంఘం ద్వారా (ఎఫెసీయులకు 1:22-23) మనుషులకే కాదు, పరలోక వాసులకు కూడా
కొన్ని విషయాలు నేర్పిస్తున్నాడు
ఎఫెసీయులకు 1:20
ఆయన ఆ బలాతిశయముచేత క్రీస్తును మృతులలోనుండి లేపి, సమస్తమైన
ఆధిపత్యము కంటెను అధికారము కంటెను శక్తికంటెను ప్రభుత్వముకంటెను, ఈ యుగమునందు
మాత్రమే
ఎఫెసీయులకు 1:21
గాక రాబోవు యుగము నందును పేరుపొందిన ప్రతి నామముకంటెను,
ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండ బెట్టుకొనియున్నాడు.
ఎఫెసీయులకు 1:22
మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను
సంఘమునకు శిరస్సుగా నియమించెను.
ఎఫెసీయులకు 1:23
ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని
సంపూర్ణతయై యున్నది.
యూదులపట్ల, అన్యజనుల పట్ల దేవుని వ్యవహారాలు, ఈ
రెండు వర్గాల విశ్వాసులనూ క్రీస్తులో ఒక్క దేహంగా చెయ్యడం, దీన్ని సాధించేందుకు
క్రీస్తు మరణించడం ఇవన్నీ దేవుని మహా జ్ఞానాన్ని వెల్లడించిన సంగతులు.
“ప్రధానులకూ అధికారులకూ”–అనగా
అదృశ్యమైన ఆత్మల లోకంలో దురాత్మలు (ఎఫెసీయులకు 6:12), మంచి ఆత్మలు
(కొలొస్సయులకు 1:16; 1 పేతురు 3:22; దానియేలు 10:12-13) ఉన్నారు. ........
ఎఫెసీయులకు 6:11
మీరు అపవాది(అనగా సాతాను) తంత్రములను ఎదిరించుటకు
శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.
ఎఫెసీయులకు 6:12
ఏలయనగా మనము పోరాడునది శరీరులతో (మూలభాషలో- రక్తమాంసములతో)
కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు లోక నాథులతోను,
ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.
కొలస్సీయులకు 1:14
ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాపక్షమాపణ
కలుగుచున్నది.
కొలస్సీయులకు 1:15
ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి
ఆదిసంభూతుడైయున్నాడు.
కొలస్సీయులకు 1:16
ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని,
అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను,
సర్వమును ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను.
కొలస్సీయులకు 1:17
ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు
ఆధారభూతుడు.
కొలస్సీయులకు 1:18
సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు; ఆయనకు అన్నిటిలో
ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఆయన ఆదియైయుండి మృతులలోనుండి లేచుటలో
ఆదిసంభూతుడాయెను.
1పేతురు 3:22
ఆయన పరలోకమునకు వెళ్లి దూతల మీదను అధికారుల మీదను
శక్తులమీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు.
దానియేలు 10:10
అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అరచేతులను
నేలమోపి నన్ను నిలువబెట్టి
దానియేలు 10:11
దానియేలూ, నీవు బహు
ప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని; నీవు లేచి నిలువబడి నేను నీతో
చెప్పుమాటలు తెలిసికొనుమనెను. అతడీమాటలు నాతో చెప్పగా నేను వణకుచు నిలువబడితిని.
దానియేలు 10:12
అప్పుడతడు దానియేలూ, భయపడకుము, నీవు తెలిసికొనవలెనని నీ
మనస్సును అప్పగించి, దేవుని యెదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని
నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చితిని
దానియేలు 10:13
పారసీకుల రాజ్యాధిపతి ఇరువది యొక్క దినములు నన్ను
ఎదిరించెను. ఇంక పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో
మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను,
పౌలుగారు బహుశా మంచి ఆత్మల గురించి ఇక్కడ చెప్తున్నారు.
తన సంఘంలో దేవుని పనులను చూచి ఆ ఆత్మలు ఆశ్చర్యంతో ఆరాధనా భావంతో నిండిపోతారు.
దేవుడు
ఈ భూమిపై చేసేదంతా ఆయన శాశ్వత ఉద్దేశాలను అనుసరించే – ఎఫెసీయులకు 1:11.
ఎఫెసీయులకు 1:10
ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద
ఉన్నవేగాని, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలోతాను
నిర్ణయించుకొనెను.
ఎఫెసీయులకు 1:11
మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు
కీర్తి కలుగజేయవలెనని,
ఇక
చివరిగా ఇన్ని ప్రత్యక్షతలు పొందుకున్న పౌలుగారు ఎలా తగ్గించుకుంటున్నారో చూడండి!
అత్యల్పుడను అంటున్నారు తనకోసం!
1 Corinthians(మొదటి కొరింథీయులకు) 3:5,6,7,8,9
5. అపొల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులే గదా. ఒక్కొక్కరికి
ప్రభువను గ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి
6. నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన
వాడు దేవుడే
7. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని,
నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమియులేదు.
8. నాటువాడును నీళ్లుపోయువాడును ఒక్కటే. ప్రతి వాడు తాను
చేసిన కష్టముకొలది జీతము పుచ్చుకొనును.
9. మేము దేవుని జతపనివారమైయున్నాము; మీరు దేవుని
వ్యవసాయమును దేవుని గృహమునైయున్నారు.
1కోరింథీయులకు 15:9
ఏలయనగా నేను అపొస్తలులందరిలో తక్కువవాడను దేవుని సంఘమును
హింసించినందున అపొస్తలుడనబడుటకు యోగ్యుడనుకాను.
విశ్వాసులందరిలోకీ తక్కువవాడుగా, పాపుల్లో
ప్రధాన పాపిగా (1 తిమోతికి 1:15) తనను భావించుకొన్నాడు.
1తిమోతికి 1:15
పాపులను రక్షించుటకు
క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్య
మైనదియునైయున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను.
కొందరికి
తమ గురించి ఇందుకు వ్యతిరేకమైన భావన ఉంటుంది. విశ్వాసులందరిలో గొప్పవారమనీ, పాపం
విషయంలో తక్కువ వారమనీ భావించుకొంటారు. ఇది చాలా విచారకరం.
“శోదింపశక్యము
కాని క్రీస్తు ఐశ్వర్యము”– వ 16
దీనికోసం
చూసుకుంటే:
ఎఫెసీయులకు 1:7, ఎఫెసీయులకు 1:18;
ఎఫెసీయులకు 1:6
మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునైయుండవలెనని
జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.
ఎఫెసీయులకు 1:7
దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన
రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.
ఎఫెసీయులకు 1:8
కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటును బట్టి, ఆయన తన
దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి,
ఎఫెసీయులకు 1:9
మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు, ఆ కృపను మనయెడల
విస్తరింపజేసెను.
ఎఫెసీయులకు 1:12
దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా
నిర్ణయించి, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను(లేక,మనకొక స్వాస్థ్యము నేర్పరచెను)
. ఆయన తన చిత్తాను సారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను
జరిగించుచున్నాడు.
ఎఫెసీయులకు 1:15
ఈ హేతువుచేత, ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు,
పరిశుద్ధులందరి యెడల మీరు చూపుచున్న విశ్వాసమును(అనేక ప్రాచీన ప్రతులలో-ప్రేమను
అని పాఠాంతరము) గూర్చియు, నేను వినినప్పటినుండి
ఎఫెసీయులకు 1:17
మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, ఆయన మిమ్మును
పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క
మహిమైశ్వర్యమెట్టిదో,
ఎఫెసీయులకు 1:18
ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి
విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తియొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో,
మీరు తెలిసికొనవలెనని,
ఎఫెసీయులకు 1:19
మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు
తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు
అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను.
ఎఫెసీయులకు 2:6
క్రీస్తుయేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన
తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచు నిమిత్తము,
ఎఫెసీయులకు 2:7
క్రీస్తుయేసునందు మనలను ఆయనతో కూడ లేపి, పరలోకమందు ఆయనతో
కూడ కూర్చుండబెట్టెను.
కొందరు
మనుషులు సువార్తను జ్ఞానం లేనిదిగా, పనికి రానిదిగా ఎంచి తృణీకారంతో చూస్తున్నారు
(1 కోరింథీయులకు 1:18, 1 కోరింథీయులకు 1:23).
1కోరింథీయులకు 1:18
సిలువను గూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని
రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.
1కోరింథీయులకు 1:21
దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానముచేత దేవునిని
ఎరుగకుండినందున, సువార్త ప్రకటనయను వెఱ్ఱి తనముచేత నమ్మువారిని రక్షించుట దేవుని
దయా పూర్వక సంకల్ప మాయెను.
1కోరింథీయులకు 1:22
యూదులు సూచక క్రియలు చేయుమని అడుగుచున్నారు,
గ్రీసుదేశస్థులు జ్ఞానము వెదకుచున్నారు.
1కోరింథీయులకు 1:23
అయితే మేము సిలువవేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము.
1కోరింథీయులకు 1:24
ఆయన యూదులకు ఆటంకము గాను అన్యజనులకు వెఱ్ఱితనముగాను
ఉన్నాడు; గాని యూదులకేమి, గ్రీసుదేశస్థులకేమి, పిలువబడినవారికే క్రీస్తు దేవుని
శక్తియును దేవుని జ్ఞానమునైయున్నాడు.
1కోరింథీయులకు 1:25
దేవుని వెఱ్ఱితనము మనుష్య జ్ఞానము కంటె జ్ఞానముగలది, దేవుని
బలహీనత మనుష్యుల బలముకంటె బలమైనది.
సువార్త
అపార ఆధ్యాత్మిక ఐశ్వర్యాలను గురించి చెప్తున్నదని వారికి తెలియదు. ఈ భూమిపై ఏ
మనిషి అయినా చేయగలిగిన గొప్ప పని క్రీస్తులోని ఈ అపార ఐశ్వర్యాన్ని గురించి
ప్రకటించడం, ఉపదేశించడం.
ఇంకా
తాను అతిశయంతో విర్రవీగకుండా తనకు ఒక ముళ్ళు పెట్టారు దేవుడు అంటున్నారు!
2కోరింథీయులకు 12:1
అతిశయపడుట నాకు తగదు గాని అతిశయ పడవలసి వచ్చినది. ప్రభువు
దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును.
2కోరింథీయులకు 12:2
క్రీస్తునందున్న యొక మనుష్యుని నేనెరుగుదును. అతడు
పదునాలుగు సంవత్సరములక్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను; అతడు శరీరముతో
కొనిపోబడెనో నేనెరుగను, శరీరములేక కొనిపోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియును.
2కోరింథీయులకు 12:3
అట్టి మనుష్యుని నేనెరుగుదును. అతడు పరదైసులోనికి
కొనిపోబడి, వచింప శక్యము కాని మాటలు వినెను; ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు.
2కోరింథీయులకు 12:7
నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను
అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముల్లు, నేను అత్యధికముగా
హెచ్చిపోకుండు నిమిత్తము, నన్ను నలగగొట్టుటకు సాతానుయొక్క దూతగా ఉంచబడెను.
2కోరింథీయులకు 12:8
అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు
ప్రభువును వేడుకొంటిని.
2కోరింథీయులకు 12:9
అందుకునా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి
పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు
నిమిత్తము(లేక,నన్ను కప్పునిమిత్తము) , విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా
అతిశయపడుదును.
మరి
నీకు ఇలాంటి తగ్గింపు జీవితం ఉందా? లేక అతిశయం ఉందా!! ఒకసారి నిన్ను నీవే పరిశీలన
చేసుకో! ఒకవేళ గర్వము గాని ఉంటె యేసయ్య అంటున్నారు తననుతాను తగ్గించుకునే వాడు
హెచ్చించ బడతాడు! తననుతాను హెచ్చించు కొనేవాడు తగ్గించ బడతాడు!...
లూకా 14:11
తన్నుతాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును;
తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పెను.
కాబట్టి
సరిచూసుకో!
సరిచేసుకో!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -37వ భాగం*
ఎఫెసీ 3:12—13
12. ఆయనయందలి విశ్వాసముచేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును
ఆయననుబట్టి మనకు కలిగియున్నవి.
13. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని
వేడుకొనుచున్నాను, ఇవి మీకు మహిమ కరములైయున్నవి.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాము!
ఇక
12-13 వచనాలలో అంటున్నారు ఆయన యందలి విశ్వాసముచేత
అనగా యేసుక్రీస్తుప్రభులవారి యందలి విశ్వాసము చేత మనకు ధైర్యమును నిర్భయమును ప్రవేశమును
కలిగియున్నవి అంటున్నారు!
విశ్వాసము వలన ధైర్యము రావడం ఏమిటి? గమనించాలి- మనిషి జన్మతహా
పాపి! దేవుడు పరిశుద్ధుడు! ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయన చుట్టూ ప్రచండవాయువు
విసరుతున్నది! అయన మహా ఘనుడు మహా దేవుడు! ఆయనను చూచిన మనుష్యుడు బ్రతుకలేడు!
ఇటువంటి భయంకరుడైన దేవునితో గడపాలన్నా మాట్లాడాలన్నా మొదటగా పరిశుద్ధత రెండు
పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి! అంతకంటే దైర్యంకావాలి! అందుకే ఆయన యందలి విశ్వాసము
బట్టి మనకుధైర్యం కలిగింది అంటున్నారు! ఇంకా ఏమి కలిగింది అంటే నిర్భయమైన ప్రవేశము
కూడా కలిగింది ఆయనయందలి విశ్వాసము చేత!!
ఇక
ఎలా కలిగింది అని ఆలోచిస్తే 2వ అధ్యాయంలో వ్రాసినట్లు ఎఫెసీయులకు
2
18. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు
తండ్రిసన్నిధికి చేరగలిగియున్నాము.
రోమా పత్రికలో అంటున్నారు: రోమీయులకు 5
2. మరియు ఆయనద్వారా మనము విశ్వాసమువలన ఈ కృపయందు ప్రవేశముగల
వారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయ
పడుచున్నాము.
అయితే హెబ్రీ పత్రికలో పౌలుగారు మనము ధైర్యముగా దేవుని
దగ్గరకు ఎలా రాగలుగు తున్నామో రాస్తున్నారు
14. ఆకాశమండలముగుండ
వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధానయాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము
ఒప్పుకొనినదానిని గట్టిగా చేపట్టుదము.
15. మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము
లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము
లేనివాడుగా ఉండెను.
16. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప
పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము.
ఇది కేవలం మన ప్రధాన యాజకుడైన
యేసుక్రీస్తుప్రభులవారి పున్యదాన బలియాగం ద్వారానే మనకు ఈ ధైర్యం కలుగుతుంది! ఇంకా
మనకు భయములేని ప్రవేశము అనగా దేవుని సన్నిదిలోనికి ఏవిధమైన రక్తము తీసుకుని
వెళ్ళకుండా కేవలం మన స్తుతులు విశ్వాసముతో ఆయన సన్నిధిలో ప్రవేశించడానికి ప్రవేశము
అనుమతి కలిగింది అన్నమాట!
10
వ అధ్యాయంలో ఇంకా వివరంగా చెబుతున్నారు
18. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాపపరి హారార్థబలి
యికను ఎన్నడును ఉండదు.
19. సహోదరులారా, యేసు మనకొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా
నూతనమైనదియు, జీవముగలదియు, ఆయన శరీరము అను తెరద్వారా యేర్పరచబడినదియునైన మార్గమున,
20. ఆయన రక్తమువలన పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు మనకు
ధైర్యము కలిగియున్నది గనుకను,
21. దేవుని యింటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను,
22. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన
హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన శరీరములు గలవారమునై యుండి,
విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్ని
ధానమునకు చేరుదము.
అయితే
నిజానికి ఈధైర్యం రాడానికి మరో కారణం కూడా మనము చూపగలము! యోహాను సువార్తలో
యేసుక్రీస్తుప్రభులవారు ఒకమాట చెప్పారు యోహాను
14
6. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే
తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.
మరి ఇప్పుడు
యేసయ్య ఎక్కడున్నారు? పరలోకంలో తండ్రిదగ్గర!
తండ్రి ఎక్కడున్నారు? పరలోకంలో! కాబట్టి ఇప్పుడు మన రక్షకుడు మన ప్రియుడైన
యేసయ్య పరలోకంలో తండ్రిదగ్గర ఉన్నారు. తండ్రి
దగ్గరకు వెళ్ళాలంటే యేసే మార్గం కాబట్టి, ఆ యేసయ్య మన ప్రధాన యాజకుడు కూడా
కాబట్టి, మనలను ఆయన అర్ధం చేసుకునే వాడు కనుక ధైర్యముగా దేవుని సన్నిదిలోనికి
వెళ్ళగలుగు తున్నాము!
ఇక
13వ వచనంలో అంటున్నారు కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు
అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను, ఇవి మీకు మహిమ కరములైయున్నవి. పౌలుగారు ఇలా
చాలాసంఘాలకు వ్రాసారు, నాకు కలుగుచున్న శోధనలను శ్రమలను బంధకాలను చూసి మీరు కృంగి
పోవద్దు అని. ఉదాహరణకు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ అంటున్నారు
1:12. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి యెక్కువగా
ప్రబలమగుటకే సమకూడెనని మీరు తెలిసికొనగోరుచున్నాను.
13. ఏలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని
ప్రేతోర్యమను సేనలోని వారి కందరికిని తక్కినవారి కందరికిని స్పష్ట మాయెను.
14. మరియు సహోదరులైన వారిలో ఎక్కువమంది నా బంధకముల మూలముగా
ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై, నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి
విశేషధైర్యము తెచ్చుకొనిరి.
ఇంకా
అంటున్నారు పౌలుగారు- ఇవి అనగా ఆయన అనుభవిస్తున్న శ్రమలు దేవునికి మహిమకరములు అనడం
లేదు గాని సంఘానికి మహిమకరంగా ఉన్నవి అంటున్నారు
అతని
కష్టాలు వారికోసమే – కొరింథీ పత్రికలో
అంటున్నారు 2 కోరింథీయులకు 1:6;
2 కోరింథీయులకు 1
6. మేము శ్రమ పొందినను మీ ఆదరణకొరకును రక్షణకొరకును
పొందుదుము; మేమాదరణ పొందినను మీ ఆదరణకొరకై పొందుదుము. ఈ ఆదరణ, మేముకూడ
పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై యున్నది.
ఇక తిమోతి పత్రికలో అంటున్నారు 2 తిమోతికి 2:9-10.
9. నేను నేరస్థుడనై యున్నట్టు ఆ సువార్తవిషయమై సంకెళ్లతో
బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి యుండలేదు.
10. అందుచేత ఏర్పరచబడినవారు నిత్యమైన మహిమతోకూడ క్రీస్తు
యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారికొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను.
అందుకే
విశ్వాసులకు “కృంగిపోవద్దని” చెబుతున్నారు – పౌలుగారు దేవుని నిజ
సేవకుడే అయితే అతనికి కష్టాలెందుకని వారు అనుకోవచ్చు. లేక అతనికే కష్టాలు
వస్తున్నాయి. కాబట్టి తమకు కూడా వస్తాయనుకోవచ్చు. ఏది ఏమైనా వారు
నిరుత్సాహపడకూడదని పౌలుగారు చెప్తున్నారు. ఇక తన విషయమైతే క్రీస్తు కోసం బాధలు
అనుభవించడంలో తనకు ఆనందం ఉంది – కొలొస్సయులకు 1:24;
24. ఇప్పుడు మీకొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు
సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడినపాట్లలో కొదువైన వాటియందు
నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను.
2 కోరింథీయులకు
12:10; నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే
బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను
ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవముల లోను నేను సంతోషించుచున్నాను.
రోమీయులకు 5:3.
అంతే కాదు; శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి
కాబట్టి
ఇలా పౌలుగారు శ్రమలయందు సంతోషిస్తున్నారు.
“మీకు
ఘనతే”– వారి పట్ల దేవుని ప్రేమకు,
(పౌలు ప్రేమకు కూడా) అతని కష్టాలు రుజువు. క్రీస్తు కోసం బాధలు అనుభవించడం ఆయనకూ
ఆయన “శరీరానికి” కూడా ఘనతను తెస్తుంది.
కాబట్టి
మనము కూడా శ్రమలలో కృంగిపోవద్దు! విశ్వాసముతో ధైర్యంగా ఉందాం!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -38వ భాగం*
మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధన-7
ఎఫెసీ 3:14—19
14. ఈ హేతువుచేత పరలోకమునందును, భూమిమీదను ఉన్న ప్రతి
కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రియెదుట నేను
మోకాళ్లూని
15. మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన
బలపరచబడునట్లుగాను,
16. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా
నివసించునట్లుగాను,
17. తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయ చేయవలెననియు,
18. మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు
వేరు పారిస్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో
గ్రహించుకొనుటకును,
19. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును
తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాము! ఇక ఈ వచనం నుండి 19వ వచనం వరకు మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధనలు
కనిపిస్తాయి!
గమనించాలి
ఈ మూడో అధ్యాయంలో పౌలుగారు చేసిన ప్రార్ధన- ఆయన చేసిన ప్రార్ధనల అన్నిటిలో
తలమానికమైన ప్రార్ధన అని నా ఉద్దేశం!!!
ఇక
పౌలుగారి ప్రార్ధనలో మరో అంశము: పరలోకమందును
భూమియందును ఉన్న ప్రతీ కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుతుందో ఆ తండ్రి
ఎదుట మోకాల్లూని ప్రార్ధన చేస్తున్నాను అంటున్నారు.
ప్రార్ధనను పరిశీలించి ధ్యానం చేసేముందు అసలు పౌలుగారు ఈసంఘాల కోసం
ఎందుకు అంత గట్టిగా ప్రార్ధనా విజ్ఞాపనలు చేస్తున్నారో ఈ వచనంలో మనకు బాగా
అర్ధమవుతుంది. రోమా మరియు కొలస్సీ సంఘాలకు ఆయన ఎప్పుడూ వెళ్ళలేదు, దర్శించలేదు.
అయినా వారికోసం కన్నీటితో ప్రార్ధన చేసి ఉత్తరాలు రాశారు! ఎందుకు అని మనం
ఆలోచిస్తే దానికి జవాబు ఈ వచనంలో కనిపిస్తుంది.
ఈ
వచనం ఈ హేతువుచేత అని మొదలయింది. ఇక అధ్యాయమే ఈహేతువు చేత అని మొదలయ్యింది. అసలు ఏ
హేతువుచేత?? హేతువు ఏమిటి? పౌలుగారు దేనికోసం చెబుతున్నారు? అధ్యాయం మొదటి
వచనంలోనే ఈ హేతువుచేత అంటున్నారు—అనగా
రెండవ అధ్యాయంలో మొదలుపెట్టిన అంశాన్ని ఈ మూడో అధ్యాయంలో కొనసాగిస్తున్నారు
అన్నమాట! ఎఫెసీ 2:11 నుండి ఎంతో ప్రాముఖ్యమైన విషయం కోసం చెబుతున్నారు. ఇది ప్రతి
అన్యజనాంగం నుండి రక్షించబడిన విశ్వాసి తెలుసుకోవలసిన ముఖ్యమైన అంశము:...
11. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులైయుండి, శరీరమందు
చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారిచేత సున్నతి లేనివారనబడిన మీరు
12. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుకాక, పరదేశులును,
వాగ్దాన నిబంధనలు లేని పరజనులును, నిరీక్షణలేనివారును, లోకమందు దేవుడు
లేనివారునైయుండి, క్రీస్తుకు దూరస్థులైయుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి.
13. అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు
క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులైయున్నారు.
14. ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును,
అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్ర మును తన శరీరమందు కొట్టివేయుట చేత
మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకము చేసెను.
15. ఇట్లు సంధిచేయుచు, ఈ యిద్దరిని తనయందు ఒక్క నూతన
పురుషునిగా సృష్టించి,
16. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా
వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధాన పరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే
మనకు సమాధానకారకుడై యున్నాడు.
17. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన
వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను.
18. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి
సన్నిధికి చేరగలిగియున్నాము.
19. కాబట్టి మీరికమీదట పరజనులును పరదేశులునై యుండక,
పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునైయున్నారు.
20. క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియైయుండగా అపొస్తలులును
ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.
21. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు
పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధిపొందుచున్నది.
22. ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి
నివాసస్థలమైయుండుటకు కట్టబడుచున్నారు.
మీరు శరీరంలో సున్నతి పొందకపోయినా ఇశ్రాయేలు జాతియైన మాతో మీరు సహపౌరులుగా
అయ్యారు ఎలా అంటే క్రీస్తుయేసునందు క్రీస్తురక్తము వలన మీరు సమీపస్తులయ్యారు. ఆయన సిలువలో మీకు మాకు మధ్య ఉన్న ద్వేషము అనగా
ధర్మశాస్త్రమును తన శరీరంమందు కొట్టివేశారు అనగా సిలువలో దానిని మేకులు కొట్టి
మధ్యగోడను త్రోసివేసి మన ఉభయులను అనగా అన్యజనులలో రక్షించబడిన మిమ్మును, ఇశ్రాయేలు
జాతియైన మమ్మును ఏకము చేశారు, ఇప్పుడు మీరు మేము క్రీస్తుయందు నూతన పురుషునిగా
సృష్టించి తన సిలువవలన ద్వేషమును సంహరించి ఇద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో
సమాధాన పరిచారు. కాబట్టి ఇప్పుడు మిమ్మును మమ్మును ఆయన ద్వారా- పరిశుద్ధాత్మద్వారా
తండ్రి సన్నిధికి చేరే మార్గము ఏర్పరచి తండ్రితో ఏకం చేశారు. 19వ వచనం కాబట్టి
ఇప్పుడు ఇకమీదట మీరు పరజనులు పరదేశులై ఉండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్తులు గా
దేవుని ఇంటివారుగా ఉన్నారు.
సరే,
అయితే ఏమిటంట????
కాబట్టి
ఇప్పుడు మీరుగాని అనగా అన్యజనులలో రక్షించబడిన విశ్వాసులైన మీరు గాని, మేమైనా
గాని,
20—22 క్రీస్తుయేసే ముఖ్యమైన
మూలరాయియై ఉండగా అపోస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద కట్టబడి యున్నారు. ఇప్పుడు ప్రతికట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి
ప్రభువునందు పరిశుద్ధ దేవాలయముగా వృద్ధిపొందుతుంది. ఆయనలో మీరు కూడా అదే ఆత్మ
మూలముగా దేవునికి నివాస స్థలమై యుండుటకు కట్టబడుచున్నారు. ఇక మూడో అధ్యాయంలో అంటున్నారు ఇదే కారణం చేత
మీకు సువార్త ప్రకటిస్తూ శ్రమలను అనుభవిస్తున్నాను అంటున్నారు.
కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తుప్రభులవారు అంతకష్టపడి అన్యజనులను –ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి
ద్వేషాన్ని సంహరించడానికి బలియాగమై దేవునితో సమాధాన పరిచారు కాబట్టి ఇప్పుడు
అన్యజనులనుండి రక్షించబడిన ఎఫెసీయుల కోసం గాని, కొలస్సీయులు కోసం గాని రోమా వారి
కోసం గాని ఎంతో కన్నీటితో దేవునికి విజ్ఞాపనం చేస్తున్నారు ఏమని అంటే ఆత్మలో
బలపడాలి- అపొస్తలుల భోదయందు స్థిరముగా నిలబడాలి ఆధ్యాత్మిక విషయాలలో ముందంజ వేసి
పరిపూర్ణత సాధించాలి! కారణం ఒకప్పుడు ఎవరో
గాని ఇప్పుడు ఈ సంఘాలు అన్ని ఒకే దేవుని చేత- ఒకే తండ్రిచేత ఒకే కుటుంబంగా కట్టబడి
ఒకే దేవాలయంగా కట్టబడుతుంది . కుటుంబంలో ఎవరికైనా ఇబ్బంది వస్తే కుటుంబమంతా
బాధపడతారు. కుటుంబంలో ఎవరైనా దొంగగా వ్యభిచారిగా క్రిమినల్ గా మారితే ఇది దొంగల
కుటుంబం లేక హంతకుల కుటుంబం లేక వాళ్ళంతా గూండాలు రా అంటారు! అదే కుటుంబమంతా
పరిశుద్ధులు పవిత్రులు మాదిరికరమైన జీవితం గలవారు అయితే వారు పరిశుద్ధులు- దేవుని
బిడ్డలు అంటారు కాబట్టి ఇప్పుడు పౌలుగారు
భూమిమీద ఉన్న సార్వత్రిక సంఘములో పాలిబాగస్తులైన అన్ని సంఘాలకోసం, మరియు
పరలోకంలో ఉన్న కుటుంబం అయిన పరిశుద్ధులు దేవదూతలు తేజోవాసులు – అందరికి తండ్రియైన ఒకే దేవుని ముందు
ఆ తండ్రిముందు మోకాళ్ళూని ప్రార్ధన చేస్తున్నారు. కుర్చీలో కూర్చుని, మంచం మీద
కూర్చుని లేక మరో భంగిమలో కాకుండా నేలమీద మోకాళ్ళూని ప్రార్ధన చేస్తున్నాను
అంటున్నారు.
ప్రియ
సంఘమా, విశ్వాసి, సేవకుడా ఇలాంటి ప్రార్ధనా భారం మనలో ప్రతి ఒక్కరికి ఉండాలి! నీకు
అలాంటి ప్రార్ధనా భారం ఉందా?
నీ కుటుంభంలో ఇంకా ఎంతమంది రక్షణ పొందకుండా ఉన్నారు? నీ ఇరుగుపొరుగు వారు
ఎంతమంది రక్షణ పొందకుండా ఉన్నారు? నీ గ్రామస్తులు ఎంతమంది రక్షణ పొందకుండా
ఉన్నారు? వారికోసం వారి రక్షణ కోసం ప్రార్ధన చేస్తున్నావా? నీకోసం నీకుటుంబం కోసం
పనిచేస్తున్న నీ కాపరి కోసం ప్రార్ధన చేస్తున్నావా? నీ గ్రామస్తుల రక్షణ కోసం ప్రార్ధన
చేస్తున్నావా? నీ గవర్నమెంట్ కోసం, సరిహద్దులలో మనకోసం పహారా కాస్తున్న సైనికుల
కోసం ప్రార్దన చేస్తున్నావా?
నేడే
అలాంటి ప్రార్ధన భారం పొందుకుని పౌలుగారిలా ప్రార్ధించడం మొదలుపెట్టు!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -39వ భాగం*
మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధన-8
ఎఫెసీ 3:14—19
14. ఈ హేతువుచేత పరలోకమునందును, భూమిమీదను ఉన్న ప్రతి
కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రియెదుట నేను
మోకాళ్లూని
15. మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన
బలపరచబడునట్లుగాను,
16. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా
నివసించునట్లుగాను,
17. తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయ చేయవలెననియు,
18. మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు
వేరు పారిస్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో
గ్రహించుకొనుటకును,
19. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును
తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాము! ఇక ఈ వచనం నుండి 19వ వచనం వరకు మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధనలు
కనిపిస్తాయి!
గమనించాలి
ఈ మూడో అధ్యాయంలో పౌలుగారు చేసిన ప్రార్ధన- ఆయన చేసిన ప్రార్ధనల అన్నిటిలో
తలమానికమైన ప్రార్ధన అని నా ఉద్దేశం!!!
ఇక
పౌలుగారి ప్రార్ధనలో మరో అంశము: మీరు అంతరంగ పురుషునియందు శక్తికలిగి ఆయన ఆత్మవలన
బలపరచబడాలి....
చూశారా
ఆయన ప్రార్ధన ఎంతటి శ్రేష్టమైనదో!!! మీరు
అత్యధిక ధనవంతులుగా మారిపోవాలి- కార్లు బిల్డింగ్లు ఉన్నవారు కావాలని ఆయన ప్రార్ధన
చెయ్యడం లేదు! మీరు అత్యధిక బలవంతులు కావాలని కూడా ప్రార్ధన చెయ్యడం లేదు! మీరు
అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆత్మవలన బలపరచ బడాలి అంటున్నారు.
ఈ వచనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అంతరంగ పురుషుడు అనేవాడు
ఉన్నాడు! వాడు మనకు కనపడడు! బాహ్యపరుషుడు ఉన్నాడు- వాడే మనకు కనిపిస్తున్నాడు! ఈ
భాహ్యపురుషునికే భోజనం, బిరియాని, హార్లిక్స్, బూస్ట్ ఇంకా బాదం పప్పు, పిస్తా
కాజూ ఇలాంటివి ఎన్నో పెట్టి మేపుతున్నాం!!! ఇంకా కొంతమంది జిమ్ కి వెల్లి వ్యాయామం
చేసి సిక్స్ పేక్ కండలు సంపాదిస్తున్నారు.
అలా చేయనివారు డబుల్ పేక్ పొట్టలు సంపాదిస్తున్నారు. బాగానే ఉంది!
మరి ఈ వచనంలో అంతరంగ పురుషుడు అనేవాడు ఉన్నాడు- ఈ అంతరంగ
పురుషుని యందు బలపడాలి అంటున్నారు! ఎలా బలపడతాడు అంటే ఆత్మద్వారా బలపడతాడు అని
కూడా చెబుతున్నారు! మరి ఆత్మద్వారా ఈ అంతరంగ పురుషుని బలం కోసం ఏమేమి వాడాలి? ఏమి
చెయ్యాలి?
1కొరింథీ
14వ అధ్యాయం ప్రకారం అన్యభాషలతో ప్రార్ధన చెయ్యాలి! ప్రవచించాలి! అప్పుడు తన
అంతరంగ పురుషుడు క్షేమాభివృద్ధి చెందుతాడు.
1 Corinthians(మొదటి కొరింథీయులకు) 14:4,12,14,15
4. భాషతో మాటలాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసికొనును
గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును.
12. మీరు ఆత్మసంబంధమైన వరముల విషయమై ఆసక్తిగలవారు గనుక
సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించునట్లు ప్రయత్నము
చేయుడి.
14. నేను భాషతో ప్రార్థన చేసినయెడల నా ఆత్మ ప్రార్థన చేయును
గాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు.
15. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోను ప్రార్థన
చేతును; ఆత్మతో పాడుదును, మనస్సుతోను పాడుదును.
ఇక తర్వాత: ఉపవాస ప్రార్ధనలో గడపాలి! ఉపవాసం అనగా దేవునితో
సహవాసం!!! దేవునితో సహవాసం చేస్తూ- ఉపవాసం ఉంటే నీ అంతరంగ పురుషుడు బలపడతాడు!
లూకా సువార్త 4:1 లో యేసు
పరిశుద్దాత్మ పూర్ణుడై యోర్దాను నుండి తిరిగివచ్చి... అంటూ రాస్తున్నారు.
యోర్దానులో బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ పూర్ణత సాధించారు యేసయ్య!
గాని పరిశుద్ధాత్మ బలము ఎప్పుడు వచ్చింది అంటే 40 రోజులు ఆయన ఉపవాసం చేసిన తర్వాత
మాత్రమే! 40 రోజులు ఉపవాసం ఎప్పుడు
చేశారో- వెంటనే సాతాను గాడు శోధించాడు- ఆశోధన జయించిన తర్వాత 4:14 లో అప్పుడు యేసు
ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను అని చెప్పడం జరిగింది! ఆత్మలో బలపడాలి,
అంతరంగ పురుషునియందు శక్తిని బలమును సాధించాలి అంటే ఉపవాస ప్రార్ధన తప్పకుండా
చెయ్యాలి!
ఇక
2కొరింథీ 4వ అధ్యాయం ప్రకారం:
మొదటగా సువార్తను ప్రకటించాలి; రెండవదిగా క్రీస్తుతో పాటుగా
క్రీస్తు మరణానుభావమును కలిగి ఉండి, శ్రమలను సహించాలి. అప్పుడు బాహ్యపురుషుడు
కృశించిపోతాడు గాని అంతరంగ పురుషుడు ఎంతో బలపడతాడు!
4:6,10—11,16
6. గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించు కొనుటలేదు గాని,
క్రీస్తుయేసును గూర్చి ఆయన ప్రభువనియు, మమ్మును గూర్చి, యేసు నిమిత్తము మేము మీ
పరిచారకులమనియు ప్రకటించుచున్నాము.
10. యేసుయొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్ష పరచబడుటకై యేసు
యొక్క మరణాను భవమును మా శరీరమందు ఎల్లప్పుడును వహించుకొని పోవుచున్నాము.
11. ఏలయనగా, యేసు యొక్క జీవము కూడ మా మర్త్య శరీరమునందు
ప్రత్యక్ష పరచబడినట్లు, సజీవులమైన మేము ఎల్లప్పుడు యేసు నిమిత్తము మరణమునకు
అప్పగింపబడుచున్నాము.
16. కావున మేము అధైర్యపడము; మా బాహ్య పురుషుడు కృశించుచున్నను,
ఆంతర్యపురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు.
ఇంకా దృశ్యమైన
వాటియందు లక్ష్యముంచక అదృశ్యమైన వాటిమీద లక్ష్యం ఉంచాలి, అనగా పరలోక సంబంధమైన
వాటియందు ధ్యానం ఉంచి వాటికోసం పరుగులెడితే అంతరంగపురుషుడు బలపడతాడు ఆత్మద్వారా!
17వ
వచనం.
తరువాత వాక్య పఠనం చేస్తూ వాక్యమందు బలపడితే విశ్వాసమందు
స్థిరపడతాము.
దీనికోసం
అనేక వచనాలు ఉన్నాయి
అయితే
కేవలం రెండు చూద్దాం
కీర్తనలు 119: 50
నీ వాక్యము నన్ను బ్రదికించి యున్నది నా బాధలో ఇదే నాకు
నెమ్మది కలిగించుచున్నది.
మార్కు 4: 20
మంచి నేలను విత్తబడినవారెవరనగా, వాక్యము విని, దానిని
అంగీకరించి ముప్పదంతలు గాను అరువదంతలుగాను నూరంతలుగాను ఫలించువారని చెప్పెను.
చివరగా ఇది స్త్రీలకోసం చెప్పబడినా పురుషులకు
కూడా వర్తిస్తుంది: సాదువైనట్టియు మృదువైనట్టియు స్వభావం కలిగి ఉండాలి
1పేతురు 3: 4
సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ
హృదయపు అంతరంగ స్వభావము (అంతరంగపురుషుడు) మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని
దృష్టికి మిగుల విలువగలది.
ఈ
లోకపు ఆశలయందు కోరికల యందు కాక సాదువైనట్టి మృదువైనట్టి మనస్సు తగ్గింపు స్వభావం
కలిగి ఉండాలి.
కాబట్టి ఆయన ఆత్మను కలిగి ఆయన ఆత్మలో బలపడుతూ ఉపవాస మందును
సహవాసమందును అన్యభాషలు మాట్లాడుట యందును అభ్యాసం కలిగి ఉంటే ఆప్పుడు అంతరంగ
పురుషుడు అత్మద్వారా బలపడతాడు! ఇదే పౌలుగారి ప్రార్ధన!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -40వ భాగం*
మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధన-9
ఎఫెసీ
3:14—19
14. ఈ హేతువుచేత పరలోకమునందును, భూమిమీదను ఉన్న ప్రతి
కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రియెదుట నేను
మోకాళ్లూని
15. మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన
బలపరచబడునట్లుగాను,
16. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను,
17. తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయ చేయవలెననియు,
18. మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు
వేరు పారిస్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో
గ్రహించుకొనుటకును,
19. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును
తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాము! ఇక ఈ వచనం నుండి 19వ వచనం వరకు మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధనలు
కనిపిస్తాయి!
గమనించాలి
ఈ మూడో అధ్యాయంలో పౌలుగారు చేసిన ప్రార్ధన- ఆయన చేసిన ప్రార్ధనల అన్నిటిలో
తలమానికమైన ప్రార్ధన అని నా ఉద్దేశం!!!
ఇక
పౌలుగారి ప్రార్ధనలో మరో అంశము: క్రీస్తు మీ
హృదయములలో విశ్వాసము ద్వారా నివశించునట్లు గాను....
పౌలుగారి ప్రార్ధనలలో మరో ప్రాముఖ్యమైన విషయం ఇది. క్రీస్తు మీ హృదయములలో
నివశించాలి- అయితే ఇది ఎలా సాధ్యం అంటే అది విశ్వాసము ద్వారా మాత్రమే
సాధ్యమవుతుంది. మనిషి హృదయం సాతాను
మరమ్మత్తు శాల/వర్క్ షాప్ అన్నాడు ఒక కవి! బైబిల్ చెబుతుంది- మనిషి హృదయంలో అనేక
ఆలోచనలు పుడుతుంటాయి. వాటిలో అనగా ఆలోచనలలో చాలా కొన్ని మాత్రమే దేవుని కోసం ఉంటాయి. బహుశా 2%. అయితే మనిషి
హృదయంలో దేవుడు నివశించాలని దేవుని కోరిక! నీ హృదయం మరియు దేహము ఆయన దేవాలయముగా
ఉండాలని దేవుని కోరిక!
1 Corinthians(మొదటి కొరింథీయులకు) 3:16,17
16. మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో
నివసించుచున్నాడనియు మీరెరుగరా?
17. ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసినయెడల దేవుడు వానిని
పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైయున్నది; మీరు ఆ ఆలయమైయున్నారు (లేక-మీరును
పరిశుద్ధులైయున్నారు) .
ఎఫెసీ 2వ అధ్యాయంలో ప్రతీ విశ్వాసి దేవునికి
ఆత్మ సంబంధమైన కట్టడముగా కట్టబడుచున్నాడు అని పరిశుద్ధాత్ముడు చెప్పుచున్నాడు.
ఎఫెసీయులకు 2: 22
ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమైయుండుటకు
కట్టబడుచున్నారు.
అయితే
నీ హృదయము దగ్గరకు వచ్చి అయన తట్టుచున్నాడు- తలుపు తీయమని!!... తలుపు తీసి ఆయనను
లోపలికి ఆహ్వానిస్తే ఆయన నీతో కలిసి భోజనం కూడా చేస్తాను అంటున్నారు.
ప్రకటన గ్రంథం 3: 20
ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా
స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ
అతడును భోజనము చేయుదుము.
నీతో
గడపాలని- నీవు చెప్పేవి అన్ని వినాలని- ఆయన చెప్పేవి అన్నీ నీవు వినాలని- నీతో సహవాసం
చెయ్యాలని దేవుని తపన! అయితే నీవు దేవుణ్ణి హృదయములోనికి రానియ్యడం లేదు!ఆయన నీ
తలుపు తడుతున్నారు!
పరమ
గీతంలో షూలమ్మితిని కూడా దేవుడు తలుపు తీయమని తలుపు తట్టితే ఆమె తీయలేదు! చూసి
చూసి- తట్టి తట్టి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆమెకు జాలికలిగి తలుపు తీసేసరికి ఆయన
వెళ్లిపోయినట్లు చూడగలము! తర్వాత ఆమె పట్టణమంతా గాలించినట్లు పట్టణ కావలివారు
ఆమెను కొట్టి ఆమె వస్త్రములు లాక్కునట్లు చూడగలము!...
Song of
Solomon(పరమగీతము) 5:2,3,4,5,6,7
2. నేను నిద్రించితినే గాని నా మనస్సు మేలుకొని యున్నది నా
సహోదరీ, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కళంకురాలా, ఆలంకిపుము నా తల మంచుకు
తడిసినది నా వెండ్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపుతీయుమనుచు
నాప్రియుడు వాకిలి తట్టు చున్నాడు.
3. నేను వస్త్రము తీసివేసితిని నేను మరల దాని ధరింపనేల? నా
పాదములు కడుగుకొంటిని నేను మరల వాటిని మురికిచేయనేల?
4. తలుపుసందులో నా ప్రియుడు చెయ్యియుంచగా నా అంతరంగము
అతనియెడల జాలిగొనెను.
5. నా ప్రియునికి తలుపు తీయ లేచితిని నా చేతులనుండియు నా
వ్రేళ్లనుండియు జటామాంసి గడియలమీద స్రవించెను
6. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్లిపోయెను
అతనిమాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను నేనతని వెదకినను అతడు కనబడకపోయెను
నేను పిలిచినను అతడు పలుకలేదు.
7. పట్టణములో తిరుగు కావలివారు నా కెదురుపడి నన్ను కొట్టి
గాయపరచిరి ప్రాకారముమీది కావలివారు నా పైవస్త్రమును దొంగిలించిరి.
ప్రియుడు
తలుపు తట్టినప్పుడు తలుపు తీస్తే ఆమెకు ఈ పాట్లు ఉండేవి కావు కదా! నీవు కూడా ఆయన
సమీపముగా నీ హృదయము బయట నీ తలుపు దగ్గర ఉండి తట్టుచున్నారు- మరి నీవు తీస్తావా???
యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపముగా ఉన్నప్పుడే వేడుకొనుడి
అంటున్నారు....
యెషయా 55: 6
యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో
ఉండగా ఆయనను వేడుకొనుడి.
మరి
నీవు ఇప్పుడు అడుగుతావా ఆయనను ఆహ్వానిస్తావా నీ హృదయము లోనికి!
ఆహ్వానించిన
తర్వాత ఆయన నీ హృదయములో నివసించాలి అంటే అది కేవలం విశ్వాసము ద్వారా మాత్రమే
సాధ్యపడుతుంది. క్రైస్తవ జీవితం మొదలయ్యేది విశ్వాసంతో! అంతమయ్యేది విశ్వాసముతోనే!
ఆదినుండి అంతము వరకు విశ్వాసము ద్వారానే క్రైస్తవ జీవితం సాగుతుంది. అందుకే ఎఫెసీ
2:8 లో అంటున్నారు....
ఎఫెసీయులకు 2: 8
మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది
మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.
అసలు
విశ్వాసం ద్వారానే దేవుని మీద నీకు నమ్మకం కలుగుతుంది రోమా
1:17
ఎందుకనిన నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన
ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు
బయలుపరచబడుచున్నది.
కొలస్సీ 2:6,7
6. కావున మీరు ప్రభువైన క్రీస్తుయేసును అంగీకరించిన విధముగా
ఆయనయందు వేరుపారినవారై, యింటివలె కట్టబడుచు,
7. మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు,
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు, ఆయనయందుండి నడుచుకొనుడి.
కాబట్టి అలా పొందుకున్న విశ్వాసాన్ని- దేవుని మీద నమ్మకాన్ని దృడంగా
కొనసాగిస్తే దేవుడు మన హృదయాన్ని తనకు ఇల్లుగా ఎంచి మన ఇల్లంతటిలో కాపురం ఉంటాడు!
ఏదో పెదాల మీద పప్పలు వండినట్లు దేవా నాహృదయంలో మీరు ఉండండి! ఈ గృహానికి మీరే
అధిపతిగా ఉండండి అంటూ నీ తప్పుడు ఆలోచనలతో –సినిమాలు- సీరియల్లు- లోకపు తలంపులతో
నీవుంటే ఆయన నీ హృదయంలో ఉండలేరు! నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు
ఒప్పుకొనుము అంటున్నారు...
సామెతలు 3: 6
నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు
ఆయన నీ త్రోవలను సరాళము చేయును.
ఏదో కొంతకాదు సంపూర్తిగా ఒప్పుకోవాలి
! అంతేకాకుండా నీ ఇంటి మొత్తంమీద ఆయనకు అధికారం ఇవ్వాలి! ప్రభువా! నీవు ఆ
ప్రార్ధనా గదిలోనే ఉండండి- మా బెడ్ రూమ్ లోనికి రావద్దు అనకూడదు! దేవా ఈ
ఇల్లంతటికి అధిపతిగా మీరే ఉండండి. నీవున్న ఈ గృహంలో నన్ను కూడా ఉండనీయండి అని గృహం
మీద అధికారం ఆయనకు ఇచ్చేస్తే అప్పుడు నీ హృదయాన్ని ఆయన పాలిస్తారు! అప్పుడు నీ
హృదయంలో ఎటువంటి పాపపు/తప్పుడు తలంపులు కలిగినా పారద్రోలుతారు! నీ గృహాన్ని
ఆక్రమిద్దామని వస్తున్న ప్రతీ దురాత్మను దేవుని అగ్ని కొరడాతో తరుముతారు! అలా ఆయనకు పూర్తిగా అధికారం ఇవ్వడమే ఆయనకు
ఇష్టము!!!
అయితే
ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే క్రీస్తు మీ హృదయాలలో కేవలం ఆత్మద్వారానే మరియు
విశ్వాసం ద్వారానే నివశించ గలరు
Romans(రోమీయులకు) 8:9,10,11,13,14
9. దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము
గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే
వాడాయనవాడు కాడు.
10. క్రీస్తు మీలోనున్నయెడల మీ శరీరము పాపవిషయమై మృతమైనది
గాని మీ ఆత్మ నీతివిషయమై జీవము కలిగియున్నది.
11. మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీలో
నివసించినయెడల, మృతులలో నుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకులోనైన మీ శరీరములను
కూడ మీలో నివసించుచున్న తన ఆత్మద్వారా జీవింపజేయును.
13. మీరు శరీరానుసారముగా ప్రవర్తించినయెడల చావవలసినవారై
యుందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపినయెడల జీవించెదరు.
14. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని
కుమారులై యుందురు.
కాబట్టి
ఆయన ఆత్మతో మనం నింపబడి నప్పుడు దేవుడు మనలో నివశిస్తారు! అప్పుడు పుష్కలమైన విశ్వాసం
మన హృదయంలో నిండి ఉంటుంది.
అందుకే
పౌలుగారు 2కొరింథీ 13:5 లో అంటున్నారు
మీరు విశ్వాసం గలవారో లేదో మిమ్మును మీరే పరీక్షించు కొండి!!!...
కారణం
మీరు దేవుని పోలిక లో ఉన్నారు ....కొలస్సీ ౩:10
మీరు పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని
సృష్టించినవాని పోలికచొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును
ధరించుకొనియున్నారు.
యేసుక్రీస్తు
ప్రభులవారు దేవుడు కనుక ఇది సాధ్యపడుతుంది. అందుకే క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం
ద్వారా నివశించేలాగున ప్రార్ధన చేస్తున్నారు. విశ్వాసి హృదయాలలో క్రీస్తు మరింత
పరిపూర్ణంగా జీవిస్తూ ఉండాలని పౌలుగారి కోరిక! ఆయన అంటున్నారు నేను క్రీస్తుతో
కూడా సిలువ వేయబడ్డాను కాబట్టి ఇప్పుడు జీవించేది నేను కాదు- క్రీస్తే నాలో
జీవిస్తున్నాడు!....
అది
విశ్వాసం వలెనే సాధ్యమవుతుంది అంటున్నారు.
గలతియులకు 2: 20
నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను
జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు
జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని
కుమారునియందలి విశ్వాసము వలన జీవించుచున్నాను.
యోహాను 14: 23
యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును,
అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వానియొద్ద నివాసము
చేతుము.
అయితే విచారం ఏమిటంటే క్రీస్తు మనలో
ఉన్నా నేటిదినాలలో ఆయనకు సంపూర్ణ అధికారం ఇవ్వకుండా ఏదో ఒక చిన్నగదికి
/కొన్నింటికి మాత్రమే పరిమితం చేస్తున్నాము! *ఆయనను గృహానికి అధిపతిగా
చెయ్యాల్సింది పోయి- గృహానికి అతిధిలా ఉంచుతున్నాము*. అందుకే మనం జయజీవితం
సాధించలేక పోతున్నాము! అందుకే సంపూర్ణత సాధించలేక పోతున్నాము! అందుకే సైతాను
చేతిలో ఓడిపోతున్నాము! మన తలంపులు పాపపు కోరికలు మనలను ఏలుతున్నాయి. తద్వారా
పరోక్షంగా సాతాను గాడు మనలను ఏలుతున్నాడు!
అయితే దేవుడు మన ఇల్లంతటినీ మన
అంతరంగంలో ప్రతీ భాగాన్ని స్వాధీనం చేసుకోవడం దేవునికి ఇష్టం! మన ఇంటికి మనమే
యజమానిగా ఉండే ప్రయత్నం చేయకూడదు! మన హృదయానికి
మనజీవితానికి ఆయనే రారాజుగా ఉండాలి! ఇది కేవలం నీవు ఆత్మ పొందుకుని
ఆత్మానుసారంగా జీవిస్తేనే సాధ్యము తప్ప- నీకు నీవుగా ఇలా ఉండలేవు!!!
అలా చేయాలంటే నీవు దేవుని పట్ల ఎంతో
విధేయతగా వినయంగా ప్రేమపూర్వకంగా ఉండాలి. నిన్నునీవు ఆయన చేతులలోనికి
అప్పగించుకోవాలి! నాదంటూ ఏమీ లేదు-ఏదైనా ఉంటే నీవిచ్చినదే! నీకు నచ్చినట్లు నన్ను
మలుచుకో! నీకు నచ్చినట్లు నన్ను వాడుకో! నీవు ఎవరినైనా వాడుకోవాలంటే – ఆ ఎవరో- నేనే కావాలి ప్రభువా! నన్ను కూడా వాడుకో- అని దేవునికి
అణిగిమణిగి ఉండి ఆయనకు నిన్నునీవు అప్పగించుకుంటే అప్పుడే దేవుడు నీ హృదయంలో స్థిర
నివాసం చేస్తారు!
మరినీవు నీ హృదయాన్ని ప్రభువుకు ఇస్తావా?
ఆయనను
నిన్ను ఏలడానికి ఇష్టపడతావా?
ఆయన
నీ తలుపు దగ్గర తట్టుచున్నారు! మరి నీ తలుపు తీస్తావా?
అయితే
నేడే ఈ క్షణంలోనే నీలోనికి వచ్చి నీతో సహవాసం చేస్తూ నిన్ను ఏలడానికి ఆయన సిద్ధంగా
ఉన్నారు!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -41వ భాగం*
మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధన-10
ఎఫెసీ 3:14—19
14. ఈ హేతువుచేత పరలోకమునందును, భూమిమీదను ఉన్న ప్రతి
కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రియెదుట నేను
మోకాళ్లూని
15. మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన
బలపరచబడునట్లుగాను,
16. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా
నివసించునట్లుగాను,
17. తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయ చేయవలెననియు,
18. మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు
వేరు పారిస్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో
గ్రహించుకొనుటకును,
19. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును
తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాము! ఇక ఈ వచనం నుండి 19వ వచనం వరకు మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధనలు
కనిపిస్తాయి!
ఇక
పౌలుగారి ప్రార్ధనలో మరో అంశము: తన మహిమైశ్వర్యము
చొప్పున మీకు దయచేయవలెనని....
తన
మహిమైశ్వర్యము చొప్పున ఏమి దయచేయాలి???
మొదటగా:
ఆయన అడుగు ప్రతివానికి పరిశుద్ధాత్మను దయచేయువాడు.......
లూకా 11: 13
పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో
నిశ్చయముగా అనుగ్రహించుననెను.
పరిశుద్ధాత్మ ఎందుకు
కావాలి?
1).నిన్ను సర్వసత్యము లోనికి నడిపించడానికి...
యోహాను 16: 13
అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును
సర్వసత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని
బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును.
2. నీకు ఎలా ప్రార్ధన చెయ్యాలో నీకు తెలియదు కనుక నీకు
ప్రార్ధన నేర్పించడానికి- నీకు బదులుగా ప్రార్ధన చెయ్యడానికి ...
రోమీయులకు 8: 26
అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు.
ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప
శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాము.
౩. ఆయనాత్మ లేనివాడు ఆయన వాడు కాదు – ఆయన వాడు
కాదు అంటే సాతాను గాడి గ్రూపు- కాబట్టి ఆయన వారిగా ఉంటూ ఆయన స్వాస్త్యానికి వారసులుగా
ఉండాలి అంటే పరిశుద్ధాత్ముడు కావాలి....
Romans(రోమీయులకు) 8:9,10,11,13,14
9. దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము
గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే
వాడాయనవాడు కాడు.
10. క్రీస్తు మీలోనున్నయెడల మీ శరీరము పాపవిషయమై మృతమైనది
గాని మీ ఆత్మ నీతివిషయమై జీవము కలిగియున్నది.
11. మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీలో
నివసించినయెడల, మృతులలో నుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకులోనైన మీ శరీరములను
కూడ మీలో నివసించుచున్న తన ఆత్మద్వారా జీవింపజేయును.
13. మీరు శరీరానుసారముగా ప్రవర్తించినయెడల చావవలసినవారై
యుందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపినయెడల జీవించెదరు.
14. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని
కుమారులై యుందురు.
రెండు: అడుగుడి మీకివ్వబడును- తట్టుడి మీకు తీయబడును- వెదకుడి మీకు
దొరకును అని వాగ్దానం చేశారుకాబట్టి మనకు ఏఏ అవసరాలు ఉన్నాయో ఆయా అవసరాలు – తన మహిమైశ్వర్యం
చొప్పున దేవుడు దయచేయాలని.....
మత్తయి 7: 7
అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును.
మత్తయి 7: 8
అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును,
తట్టువానికి తీయబడును.
మత్తయి 7: 11
పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో
నిశ్చయముగా మంచియీవుల నిచ్చును.
ఫిలిప్పీయులకు 4: 19
కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో
మీ ప్రతి అవసరమును తీర్చును.
ఎఫెసీ 1:18 లో ఆయన ప్రార్ధనలో అంటున్నారు ఆయన మహిమగల
వారసత్వము ఎంత ఐశ్వర్యవంతమైనదో- ఎరిగి దానిని పొందుకోవాలి
యోహాను గారు అంటున్నారు ప్రియుడా నీవు అన్ని విషయాలలోనూ
వర్ధిల్లాలి ...
3యోహాను 1: 2
ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని
విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను.
అనగా
ఆత్మీయముగాను, ఆధ్యాత్మికముగాను మరియు అర్దికముగాను, ఆరోగ్యముగాను అన్ని విషయాలలో వర్ధిల్లాలి!
అయితే ఇక్కడ ఒక మెలిక ఉంది. ప్రజలకు కేవలం ఆశీర్వాదాలు కావాలి
విధులు అవసరం లేదు! ప్రజలకు సంపూర్ణత సాధించాలి అనే ఉద్దేశం ఎంతో ఉంది గాని
సంపూర్ణత సాధించాలి అంటే శ్రమల ద్వారానే సంపూర్ణత సాధించాలి. ప్రజలకు శ్రమలు లేకుండా సంపూర్ణత సాధించలేరు!
అర్ధమయ్యేలా చెబుతాను!
దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మన అవసరాలు తీర్చడానికి మనలను దీవించడానికి సిద్ధంగా
ఉన్నారు అయితే నీవు చెయ్యాల్సింది కూడా ఉంది!
ప్రజలకు హక్కులతో
పాటుగా విధులు ఎలా ఉన్నాయో అలాగే మనం కూడా మొదట దేవుడు చెప్పినవి చేస్తేనే దేవుడు
వాగ్దానం చేసినవి మనకు ఇస్తారు!
ఉదాహరణ: 1. ప్రతీ
కుమారునికి తండ్రి ఆస్తిమీద ఎలా హక్కు ఉందో- అలాగే తండ్రి అప్పుచేసి చనిపోతే
తీర్చే విధి కూడా ఉంది!
2. ప్రతీ భారతీయ
పౌరునికి రాజ్యాంగం ద్వారా వాక్ స్వాతంత్ర్యం హక్కు, స్వేచ్చహక్కు, ఆస్తిహక్కు,
ఓటుహక్కు , మత స్వాతంత్ర్యం హక్కు ఎలా ఉన్నాయో అలాగే ప్రభుత్వ ఆస్తులు కాపాడటం,
శాంతి భద్రతలకు సహకరించడం, ఓటుహక్కు వినియోగించుకోవడం లాంటి విధులు కూడా ఉన్నాయి!
అలాగే దేవుడు తన
మహిమైశ్వర్వ్యం చొప్పున మన ప్రతీ అవసరాలను తీర్చడానికి, అన్ని విషయాలలో నిన్ను
ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు!!! *ఎప్పుడు అంటే మొదట ఆయన రాజ్యమును ఆయన
నీతిని నీవు వెదకాలి*!
మత్తయి 6: 33
కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి;
అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.
అందుకోసం
ప్రయత్నం చేయాలి! ఆయన యందు నమ్మకముంచి నమ్మకముగా కనిపెట్టాలి! ఆయనకు ఇవ్వాల్సినవి
అనగా ఆయనకు ఇవ్వాల్సిన సమయం, ఆయనకు ఇవ్వాల్సిన ధనము అన్ని ఆయనకు ఇవ్వాలి! ఆయన
రాజ్యవ్యాప్తికి ప్రయత్నం చెయ్యాలి! అప్పుడు నీకు ఏమి కావాలో అడుగు- అన్నీ నీకు
అనుగ్రహించ బడతాయి!
మనకు
ఏమి కావాలి అనేది మన పరమ తండ్రికి బాగా తెలుసు!
కాబట్టి
ఆయననుండి ఆశిస్తున్న నీవు ఆయన రాజ్యమును ఆయనన నీతిని వెదికి వాటిని వెంటాడు!
అప్పుడు నీకు కావలసినవి అన్నీ దేవుడు ఇస్తారు!
ఇదే
పౌలుగారి ప్రార్ధన!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -42వ భాగం*
మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధన-11
ఎఫెసీ 3:14—19
14. ఈ హేతువుచేత పరలోకమునందును, భూమిమీదను ఉన్న ప్రతి
కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రియెదుట నేను
మోకాళ్లూని
15. మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన
బలపరచబడునట్లుగాను,
16. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా
నివసించునట్లుగాను,
17. తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయ చేయవలెననియు,
18. మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు
వేరు పారిస్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో
గ్రహించుకొనుటకును,
19. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును
తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాము! ఇక ఈ వచనం నుండి 19వ వచనం వరకు మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధనలు
కనిపిస్తాయి!
ఇక
పౌలుగారి ప్రార్ధనలో మరో అంశము: మీరు దేవుని సంపూర్ణత
యందు పూర్ణులగునట్లుగా ......
ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించాలి- సంపూర్ణత యందు పూర్ణులు కావాలి
అని ప్రార్ధన చేస్తున్నారు పౌలుగారు! సంపూర్ణత కోసం గతంలో మా ఆధ్యాత్మిక సందేశాలు
అన్ని సిరీస్ లో చెప్పడం జరిగిండ్. విశ్వాసి- జయజీవితం జీవించి క్రీస్తుయేసుకు వలే
సంపూర్ణత సాధించాలి. అప్పుడే ఎత్తబడే గుంపులో ప్రత్యేకమైన గుంపులో ఉంటావు! అయితే
సంపూర్ణత అనేది కేవలం శ్రమలద్వారానే సాధించగలము! శ్రమలను సహించి జయించిన తర్వాతనే
సంపూర్ణత సాధించగలము!
2థెస్సలొనికయులకు 1: 5
దేనికొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు
యోగ్యులని యెంచబడు నిమిత్తము, మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన
సూచనయైయున్నది.
యాకోబు 2:5
నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి; ఈ లోక విషయములో
దరిద్రులైనవారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించువారికి తాను
వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడేర్పరచుకొనలేదా?
అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏమిటంటే *తన
మహిమకు మనలను పిలుచుకున్నారు గాని ఒక మెలిక (ట్విస్ట్ ఉంది)!*
ఆ మెలిక అర్ధం చేసుకోవాలి అంటే రోమా 8:17 చూసుకోవాలి! ...
మనము పిల్లలమైతే
వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన
యెడల, క్రీస్తుతోడి వారసులము.
ఇక్కడ
జాగ్రత్తగా గమనిస్తే మనం సంతానమైతే
వారసులం అంటూ వారసులం అయితే క్రీస్తుతో పాటుగా మహిమను అనుభవించడానికి శ్రమలను అనుభవించాలి అన్నమాట! ఈ మర్మాన్ని
గ్రహించాలి! కేవలం ఆశీర్వాదాలు, దీవెనలు, మహిమ మాత్రమే కావాలి గాని ఆయన శ్రమలు
వద్దు అంటే కుదరదు! శ్రమలను అనుభవిస్తేనే నీకు మహిమ దీవెనలు అన్నీ చెందుతాయి!
ఇప్పుడు వారసుడు అంటే తండ్రి ఆస్తి మాత్రమే కాకుండా తండ్రికున్న అప్పులు కూడా
పంచుకోవాలి లేక అప్పులు కూడా వారసత్వంగా వస్తాయి! అప్పులే కాదు కొన్ని భాద్యతలు
కూడా ఉంటాయి! కేవలం హక్కులు మాత్రమే కావాలి భాద్యతలు వద్దు అంటే కోర్టు బయటకు
పొమ్మంటాది ఇది కూడా అంతే!
సరే, *ఇంతకీ మహిమలోకి వెళ్ళడానికి శోధనలు శ్రమలు ఎందుకు అవసరం?*
జవాబు సింపుల్!
హెబ్రీ 2:10 ప్రకారం శ్రమ ద్వారానే
సంపూర్ణతలోనికి ప్రవేశించగలము..
అనగా
మహిమలోనికి రావాలి అంటే మొదటగా శ్రమలను అనుభవించాలి, ఆ శ్రమలు నిన్ను సంపూర్ణులుగా
చేస్తుంది! ఆ సంపూర్ణత నిన్ను మహిమలోనికి రప్పిస్తుంది అన్నమాట!
ఇంకా
బాగా అర్ధం చేసుకోవాలంటే ఈ హెబ్రీ 2:10,11 లో
అంటున్నారు
10. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, యెవనివలన సమస్తమును
కలుగు చున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను
శ్రమలద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును.
11. పరిశుద్ధ పరచువారికిని పరిశుద్ధపరచబడువారికిని అందరికి
ఒక్కటే (లేక, ఒక్కడే) మూలము. ఈ హేతువుచేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన
సిగ్గుపడక ...
యేసుక్రీస్తుప్రభులవారు
మనలను విమోచించడానికి మొదటగా తాను సంపూర్ణత సాధించారు! అలా సంపూర్ణత సాధించడానికి
మొదటగా ఆయన శ్రమల ద్వారానే సంపూర్ణత సాధించారు! కాబట్టి 11వ వచనం ప్రకారం పరిశుద్ధ
పరచేవారికి అనగా యేసుక్రీస్తుప్రభులవారికి,
పరిశుద్ద పరచబడే వారికి అనగా మనకు కూడా ఒక్కటే సిద్దాంతం అంటున్నారు!
ఇప్పుడు మరలా మనం పదో వచనం చూసుకుంటే అనేక కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి
రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేశారు దేవుడు అన్నారు! దీనిని బట్టి
సంపూర్ణత సాధించడానికి యేసుక్రీస్తుప్రభులవారు ఎలా శ్రమల మార్గమున వెళ్ళారో అలాగే
మనము కూడా సంపూర్ణత సాధించడానికి శ్రమల మార్గము లోనే వెళ్ళాలి! మరో షార్ట్ కట్
లేనేలేదు! ఆ శ్రమల ద్వారా సంపూర్ణత సాధించి ఆ సంపూర్ణత ద్వారానే మనము మహిమ
పొందగలము అన్నమాట! ఇదంతా దేవుని రక్షణ ప్రణాళికలో భాగము అని మర్చిపోవద్దు! దీవెనలు
ఆశీర్వాదాలతో పాటుగా ఈ శ్రమలు కూడా రక్షణ ప్రణాళికలో భాగమే అని గుర్తించాలి!
పౌలుగారు మసిపూసి మారేడు
కాయ చేసి ఎవరికి సువార్త ప్రకటించడం లేదు! ఏదో కల్లబొల్లి మాటలు చెప్పి వారిని
క్రైస్తవులుగా చేయలేదు పౌలుగారు! మనము శ్రమలు అనుభవించవలసి యున్నది అని మీకు
ముందుగానే చెప్పాము కదా! అలాగే జరుగుతుంది అంటున్నారు థెస్సలోనికయ పత్రికలో...!
1థెస్సలొనికయులకు 3: 3
మనము శ్రమను అనుభవింపవలసి యున్నదని మీతో ముందుగా చెప్పితిమి
గదా? ఆలాగే జరిగినది. ఇది మీకును తెలియును;
1థెస్సలొనికయులకు 3: 4
అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని
మీరెరుగుదురు.
అనగా పౌలుగారి త్రయం వారికి ముందుగానే చెప్పారు—యేసయ్యను నమ్ముకోవడం, ఆయనను అనుసరించడం ఆషామాషీ కాదు! ఎన్నో కష్టాలు
శ్రమలు అనుభవించి మనం పరలోకం వెళ్ళాలి అని ముందుగానే చెప్పారు! నేడు చాలామంది
యేసుక్రీస్తుప్రభులవారిని నమ్ముకుంటే మీ కష్టాలన్నీ తీరిపోతాయి! అనీ సుఖాలే! మీకు
ఇల్లు కార్లు బంగళాలు అన్నీ వచ్చేస్తాయి! ఒకనాడు నాకు ఏమీ ఉండేది కాదు ఇప్పుడు
అన్నీ ఇచ్చారు దేవుడు అనిచెప్పి వారిని
మోసం చేస్తున్నారు! ఇది తప్పు! యేసయ్య ను నమ్ముకుంటే కష్టాలు ఇంకా పెరిగిపోతాయి!
అవును ఆయన నమ్మిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి తనను నమ్మినవారిని
ఆశీర్వదించే దేవుడు కాబట్టి ఈ భౌతిక ఆశీర్వాదాలు ఇస్తారు గాని దానికన్నా ముందుగా ఈ
లోకంలో శ్రమలు పడక తప్పదు! యేసుక్రీస్తు ప్రభులవారే శ్రమలను అనుభవించినప్పుడు మనము
కూడా శ్రమలను అనుభవించవలసినదే!
యేసుక్రీస్తుప్రభులవారు
తన శిష్యులను మోసం చెయ్యలేదు! యోహాను 16:౩౩లో ముందుగానే చెప్పారు నా శాంతినే మీకు
ఇస్తున్నాను లోకంలో మీకు శ్రమలు కలుగును అయినా ధైర్యంగా ఉండండి నేను లోకాన్ని
జయించాను అన్నారు! అలాగే ఆయనకు శ్రమలు కలిగాయి శిష్యులకు కూడా శ్రమలు
విస్తరించాయి!
ఇక శిష్యులు
కూడా ఆదిమ సంఘాన్ని మోసం చెయ్యలేదు! అపో 14:22 లో చెబుతున్నారు శిష్యులను
స్థిరపరచి విశ్వాసంలో స్థిరంగా నిలకడగా ఉండమని చెపి అనేకమైన శ్రమలు భాధలను
అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని ముందుగానే చెప్పారు!
ఈ విషయం పౌలుగారు కూడా ఈ థెస్సలోనికయులకు ముందుగానే చెప్పాను అని
గుర్తుచేస్తున్నారు! మరీ ఘోరమైన మాట ఏమిటంటే అట్టి శ్రమలను అనుభవించడానికే మనము
నియమిచబడ్డాము! అవును క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించువారికి శ్రమలు కలుగును అని వాక్యం ముందుగానే
చెప్పింది!
2తిమోతికి 3: 12
క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదకనుద్దేశించువారందరు
హింసపొందుదురు.
అయితే ఇక్కడ
ఒక మెలిక ఉంది! ఎవరైతే సద్భక్తితో బ్రతకాలి అనుకుంటున్నారో వారికి మాత్రమే
శ్రమలు! నలుగురితో ........ కులంతో ........ అన్న వారికి ఏమీ కష్టాలు రావు! ఎవరైతే
మంచిగా భక్తిలో దేవునిలో సాగుతారో వారికే శ్రమలు కలుగుతాయి! ఇంకా చెప్పాలంటే
పరలోకం పోయే గుంపులో ఉన్నవారికి ఎన్నెన్నో శోధనలు కలుగుతాయి! ఎవరికైతే శ్రమలు
శోధనలు కలగడం లేదో వారికీ నరకం బాచ్ అన్నమాట!
ఇది చదువుతున్న ప్రియ స్నేహితుడా! నీకు శ్రమలు శోధనలు కలుగుతున్నాయా
చింతపడకు! నీవు పరలోకం పోయే గుంపులో ఉన్నావు కాబట్టి నీకు ఇవి కలుగుతాయి! ఇవి
కొన్ని రోజులు మాత్రమే అని మరచిపోకు!
పేతురు
గారు కూడా రాస్తున్నారు 1 Peter(మొదటి పేతురు) 4:1,2,12,13,14
1. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును
ఆయుధముగా ధరించుకొనుడి.
2. శరీర విషయములో (శరీరమందు) శ్రమపడినవాడు శరీరమందు జీవించు
మిగిలిన కాలము ఇకమీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, దేవుని ఇష్టానుసారముగానే
నడుచుకొనునట్లు పాపముతో జోలి యిక నేమియులేక యుండును.
12. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న
అగ్నివంటి మహాశ్రమను గూర్చి మీకేదో యొక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి.
13. క్రీస్తు మహిమ బయలుపరచ బడినప్పుడు మీరు మహానందముతో
సంతోషించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైయున్నంతగా సంతోషించుడి.
14. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనయెడల
మహిమాస్వరూపియైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ, మీమీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు.
చూశారా యేసుక్రీస్తుప్రభులవారు
శ్రమలు అనుభవించారు కాబట్టి మనము కూడా ఆయనలాగే శ్రమలు అనుభవిద్దాము అంటున్నారు!
ఇంకా మీకేదో విపరీతం జరుగుతుంది అనుకోవద్దు అంటున్నారు! ఇది కేవలం మిమ్మల్ని
పరీక్షించడానికి మాత్రమే అని తెలుసుకోండి అంటున్నారు! థెస్సలోనికయులకు ముందుగానే
చెప్పారు పౌలుగారు! 2:14 లో అంటున్నారు మీకు ముందుగా ఉన్న సంఘాలలో ముఖ్యంగా యూదయలో
ఉన్న సంఘాలకు అలాగే జరిగింది! మీరు కూడా ఆ సంఘాలను పోలి శ్రమల బాటలో నడుస్తున్నారు
అది మంచిదే అంటున్నారు!
కాబట్టి ప్రియ విశ్వాసి/ దైవజనుడా! శ్రమలలో సంతోషించు! శ్రమల ద్వారానే మనము
సంపూర్ణులుగా మారతాము! క్రీస్తు రూపంలో కి మారాలి అంటే కేవలం శ్రమల మార్గమే ఉంది!
మరో షార్ట్ కట్ లేనేలేదు! విశ్వాసులారా!
భయపడకండి! శ్రమలను సహిస్తూ ఆయనకు తగినట్లుగా ఆయన బాటలో సాగిపోదాము! ఈ శ్రమలు
అనుభవించడానికే మనం పిలువబడ్డాము నియమించబడ్డాము కాబట్టి ఆ మార్గములోనే సాగిపోయి
మన గమ్యస్తానమైన పరలోకం చేరుదాం!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -43వ భాగం*
మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధన-12
ఎఫెసీ 3:14—19
14. ఈ హేతువుచేత పరలోకమునందును, భూమిమీదను ఉన్న ప్రతి
కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రియెదుట నేను
మోకాళ్లూని
15. మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన
బలపరచబడునట్లుగాను,
16. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా
నివసించునట్లుగాను,
17. తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయ చేయవలెననియు,
18. మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు
వేరు పారిస్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో
గ్రహించుకొనుటకును,
19. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును
తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాము! ఇక ఈ వచనం నుండి 19వ వచనం వరకు మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధనలు
కనిపిస్తాయి!
ఇక
పౌలుగారి ప్రార్ధనలో మరో అంశము: మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరు
పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడవు లోతు ఎత్తు ఎంతో
గ్రహించు కొనుటకు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి
గలవారు కావలెనని ప్రార్ధన చేయుచున్నాను...
చూశారా
ఎంత మహత్తరమైన ప్రార్ధనా అంశమో!!!! గతభాగంలో
దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా అంటూ మొదలుపెట్టారు- సంపూర్ణత సాధించాలి అంటే మొదటి మెట్టు
క్రీస్తుతో పాటుగా శ్రమలను సహించి జయించాలి అని నేర్చుకున్నాము! ఇక మరో మెట్టు
సంపూర్ణతకు ప్రేమయందు వేరు పారాలి! అంతేనా దానితో పాటుగా సమస్తపరిశుద్ధులతో కూడా
దాని లోతు వెడల్పు ఎత్తు పొడవు గ్రహించాలి అంటున్నారు!!!
ఏమండి ప్రేమకు లోతు ఎత్తు పొడవు వెడల్పు ఉంటాయా? దానిని
కొలబద్ద లేక మెజరింగ్ టేప్ లేక UTI tape తో కొలవగలమా? అంటే
బైబిల్ ప్రకారం ఈ వచనం ప్రకారం కొలవగలము! ఎలా అనేది ఈ భాగంలో నేర్చుకుందాం! ఈ
ప్రార్ధన ఇంతటితో అయిపోలేదు- జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు
మీరు తగిన శక్తి గలవారు కావాలి అని ప్రార్ధన చేస్తున్నారు!
మొదటగా మీరు ప్రేమయందు వేరు పారాలని కోరుకుంటున్నారు. వేరు పారడం అనగా
ప్రేమలో పాతుకుని స్థిరపడి ఉండాలని! అంటే డీప్ లవ్ లో అనగా గాఢమైన ప్రేమలో ఉండాలి-
ఎవరితో? మొదట క్రీస్తుయేసుతో!
రెండవదిగా సమస్త పరిశుద్ధులతో!!!
అది
ఎలా సాధ్యం?
యేసుక్రీస్తుప్రభులవారికి- విశ్వాసికి గల సంబంధం ప్రేమ! ఆయన
మనలను ఎంతో ప్రేమించారు! దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ
కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతీవాడును నశించక నిత్యజీవము
పొందునట్లుగా ఆయనను అనగా క్రీస్తును లోకమునకు అనగా మనకు అనుగ్రహించెను. యోహాను
౩:16
పౌలుగారు ఇంకా లోతుగా చెబుతున్నారు: ఆయన దేవుడై ఉండి కూడా
పరలోకంలో ఉన్న మహిమను విడిచిపెట్ట కూడని భాగ్యం అని ఎంచకుండా మనలను ప్రేమించి
మనకోసం వచ్చారు. ఎంతగా ప్రేమించారు అంటే సిలువమరణం పొందునంతగా మనలను ప్రేమించి
తనను తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని మనకోసం బలియాగం అయ్యారు....
Philippians(ఫిలిప్పీయులకు) 2:6,7,8
6. ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా
ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని
7. మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని,
తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.
8. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి,మరణము
పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను
తగ్గించుకొనెను.
ఇదీ
నిజమైన గాఢమైన ప్రేమ! డీప్ లవ్ అంటే ఇదీ!
యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు అంటున్నారు- తన స్నేహితుని కోసం ప్రాణం
పెట్టువాడికంటే గొప్పవాడు లేడు. నేను మీకోసం ప్రాణం పెడుతున్నాను అన్నారు- ప్రాణం
పెట్టారు! రక్తం కార్చారు! మనలను విమోచించారు!....
John(యోహాను సువార్త) 15:12,13,14
12. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, మీరొకనినొకడు
ప్రేమించ వలెననుటయే నా ఆజ్ఞ
13. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటె
ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు.
14. నేను మీకాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు నా
స్నేహితులై యుందురు.
సరే,
ఆయన దేవుడు- మనలను ప్రేమించారు- మనకోసం బలిగా అర్పించబడి మనలను విమోచించారు.
బాగుంది! మరి మనము ఆయనను ఎలా ప్రేమించగలము? మనము కూడా ఆయన కోసం ప్రాణం పెట్టాలా?
అవసరమైతే పెట్టాలి గాని క్రీస్తు కోరుకొనినది – అంతవరకూ కాదు! చాలా సులువు ఆయనను ప్రేమించడం అంటే!
అది ఎలాగో ఆయనే చెప్పారు యోహాను సువార్త 14:23—24 లో ..
John(యోహాను సువార్త) 14:21,23,24
21. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను
ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును; నేనును వానిని
ప్రేమించి, వానికి నన్ను కనబరచు కొందునని చెప్పెను.
23. యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును,
అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వానియొద్ద నివాసము
చేతుము.
24. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు; మీరు వినుచున్న
మాట నామాట కాదు, నన్ను పంపిన తండ్రిదే.
అంటే ఆయనను ప్రేమించడం అంటే ఆయన చెప్పినట్లు చేయడం అంతే!!! నిజం
చెప్పాలంటే దేవుడంటే మనలో ప్రతీవారికి చచ్చేటంత ప్రేమ ఉంది! గాని ఆయన చెప్పినవి
చెయ్యాలంటేనే ప్రాణం పోతుంది! చప్పిడి పత్యం చెయ్యడం అంటే- లోకానుసారముగా
జీవించకూడదు అంటే ఏదో ఏదేదో అయిపోతుంటుంది మనకు! కుడుతులో పడిన ఎలకలా మారిపోతుంది
మన జీవితం/ మన హృదయం! గాని దేవుడు కోరుకునేది మన ఆస్తిపాస్తులు మన ప్రాణాలు కాదు!
ఆయన చెప్పినట్లు చేసి, మనిషి- మనిషికి
ప్రేమను పంచాలి! అంతే! సాటిమనిషిని ప్రేమించాలి! ఆయన చెప్పిన ఆజ్ఞలు పాటించాలి!
అంతే! ఇదే చెబుతున్నారు దేవుడు.
ద్వితీ 10:12—13..
12. కాబట్టి ఇశ్రాయేలూ, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన
మార్గములన్నిటిలో నడుచుచు, ఆయనను ప్రేమించి, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ
మనస్సుతోను నీ పూర్ణాత్మతోను సేవించి,
13. నీ మేలుకొరకు నేడు నేను నీకాజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను
కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి
అడుగుచున్నాడు?
మీకా 6:8....
మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది;
న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట
ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు.
ఇంతకంటే
ఎక్కువ ఆయన నీనుండి కోరడం లేదు! ఇవి చేస్తే ఆయనను ప్రేమించినట్లే! ఆయన ప్రేమ యొక్క
లోతు ఎత్తు వెడల్పు పొడవు తెలుసుకొన్నట్లే! మరి నీవు తెలుసుకున్నావా ప్రియ
స్నేహితుడా!!!
పౌలుగారు
కొరింథీ పత్రికలో శ్రేష్టమైనవి ఏమిటో చెబుతూ అంటున్నారు విశ్వాసము, నిరీక్షణ ప్రేమ నిలుచును. వీటిలో శ్రేష్టమైనది
ప్రేమయే అంటున్నారు 1కొరింథీ 13:13..
మన తెలుగు బైబిల్ లో ప్రేమ అని
తర్జుమా చేయబడినా అనిక ప్రతులలో దైవిక ప్రేమ అని వ్రాయబడింది! ఈ దైవిక ప్రేమ
చివరివరకు నిలుస్తుంది! మనలను ప్రేమించి మనకొరకు ప్రాణం పెట్టునంతగా మనలను
ప్రేమించింది. అలాగే అదే ప్రేమ మనము కూడా పొందుకుని దేవుణ్ణి ప్రేమించడమే కాదు
సాటి మనిషిని కూడా ప్రేమించాలి! క్రైస్తవ జీవితానికి విశ్వాసము, ప్రేమ నిరీక్షణ
ఎంతో ముఖ్యమైనవి. విశ్వాసము మనలను దేవుని మీద నమ్మకముంచేలా చేస్తుంది. నిరీక్షణ
దేవుడు ఉన్నాడు ఆయన మనలను ఆదుకుంటాడు/ ఒకరోజు ఆయనతో కలిసి ఉంటామనే ధైర్యం
పుట్టిస్తుంది. అయితే ప్రేమ దేవునికోసం ఏదైనా ఇవ్వమని ప్రేరేపిస్తుంది. అవసరమైతే
దేవుని కోసం చనిపోమని చెబుతుంది. సాటిమనిషిని దేవుణ్ణి ప్రేమించినట్లే ప్రేమించమంటుంది.
అవతలి వ్యక్తి మనకు హాని చేసినా క్షమించమని బలవంతం చేస్తుంది. తద్వారా మనుషుల
మధ్యలో ఉన్న కక్షలను ద్వేషాన్ని తీసివేసి ప్రేమను పంచి దేవుని సన్నిధిని తీసుకుని
వస్తుంది! అందుకే ప్రేమయే –దైవిక ప్రేమయే శ్రేష్టమైనది!
దేవుడు మనపై చూపినది ఆగాపే ప్రేమ! అది స్వార్ధం లేని ప్రేమ!
1యోహాను 4:7
ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము; ఏలయనగా ప్రేమ
దేవుని మూలముగా కలుగుచున్నది; ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై
దేవుని ఎరుగును.
రోమా 5:5
ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు
అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో
కుమ్మరింపబడియున్నది.
ఈ
ప్రేమ దేవుని నుండి వస్తుంది. ఆ ప్రేమకు లొంగి విశ్వాసులు దానిని ఆచరణలో పెట్టాలి!
అదే ప్రేమ యొక్క లోతు ఎత్తు పొడవు వెడల్పు తెలుసుకోవడం!
దీనిలో
విశ్వాసులు వేరు తన్ని పాతుకుని ఎదగాలి అంటున్నారు మంచినేల మీద పడిన విత్తనాల వలే!
బలమైన పునాది మీద కట్టబడాలి ప్రేమలో బండమీద కట్టబడిన ఇంటివలె! అప్పుడే ఆయన ప్రేమ
యొక్క లోతు ఎత్తు తెలుసుకోవడం!!
క్రీస్తు
ప్రేమను ఎరగడం విశ్వాసులలో ప్రేమను పుట్టిస్తుంది.
1యోహాను ౩:16
ఆయన మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను గనుక దీనివలన ప్రేమ
యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనముకూడ సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట
బద్ధులమైయున్నాము.
1 John(మొదటి యోహాను) 4:8,9,10,11,12,18,19,20
8. దేవుడు ప్రేమాస్వరూపి (దేవుడు ప్రేమయైయున్నాడు),
ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు.
9. మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ
(ఒక్కడే,కుమారుడుగా) కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన
ప్రేమ ప్రత్యక్షపరచబడెను.
10. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను
ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమైయుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది.
11. ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా
మనమొకనినొకడు ప్రేమింప బద్ధులమైయున్నాము.
12. ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచియుండ లేదు; మన
మొకనినొకడు ప్రేమించిన యెడల దేవుడు మనయందు నిలిచియుండును; ఆయన ప్రేమ మనయందు
సంపూర్ణమగును.
18. ప్రేమలో భయముండదు; అంతేకాదు; పరిపూర్ణ ప్రేమ భయమును
వెళ్లగొట్టును; భయము దండనతో కూడినది; భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు
కాడు.
19. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము
ప్రేమించుచున్నాము.
20. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన
సహోదరుని ద్వేషించినయెడల అతడు అబద్ధికుడగును; తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని
వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు (ఎట్లు ప్రేమింప గలడు?)
అందువలన
ఆయన ప్రేమలో పాతుకుని స్థిరపడేలా చేసి- ఆయన ప్రేమ ఎంత గొప్పదో కొంతవరకైనా
గ్రహించగలము!
క్రీస్తు ప్రేమ ఈ భూమికంటే వెడల్పైనది! దానికి కొలవలేము!
ఆయన ప్రేమ మనం చేతులతో లేక మరో సాధనంతో కొలిచి- మన కన్నులతో చూడగలిగన దానికంటే
పొడవైనది! అది ఆకాశాల కంటే ఎత్తైనది! అది సముద్రం మరియు అగాధం కంటే లోతైనది!
అందుకే అంతటి మహత్తరమైన ప్రేమను చూపించిన –జ్ఞానానికి
మించిన క్రీస్తుప్రేమను తెలుసుకునే శక్తి గలవారు కావాలని ప్రార్ధన చేస్తున్నారు
పౌలుగారు! జ్ఞానానికి మించిన దాన్ని తెలుసుకోవడం ఎలా? అంతం లేని దానిని
ఇముడ్చుకోవడం ఎలా? దేవుని ఆత్మ దాని గురించిన జ్ఞానాన్ని అనుభవాన్ని మన అంతరాత్మకు
ఇవ్వగలడు! ఎలాగంటే: సముద్రం కోసం మనం ఎన్నెన్నో పుస్తకాలు చదివాము! అంతమాత్రాన సముద్రాన్ని అర్ధం చేసుకోలేము!
దానిమీద ప్రయాణం చేస్తేనే అర్ధమవుతుంది- దానిలోతు ఏమిటో, వడి లేక కరెంట్,
పోటుపాటుల ప్రభావం ఏమిటో- గాలి వస్తే దాని విశ్వరూపం ఏమిటో! 25సంవత్సరాలు నుండి
సముద్రం మీద ప్రయాణం చేస్తున్న నాకే ఇంకా పూర్తిగా అర్ధం కాలేదు! గాని కొంతవరకు
అర్ధమయ్యింది! అలాగే దేవుడు కూడా అపరిమితమైన వాడు, మన జ్ఞానానికి అందనివాడు శాశ్వతుడు! అయినా విశ్వాసులకు ఆయన
తెలుసు! ఎలా అంటే ఆయన ప్రేమలో పడిపోవడం ద్వారా! ఆయన సన్నిధిని రుచి చూడటం ద్వారా!
ఆయన వాక్యాన్ని చదివి అర్ధం చేసుకుని ఆయన వాక్యమర్మాలను జుర్రుకోవడం ద్వారా!
పరిశుద్దాత్మ నింపుదల కలిగి అనుదినం ఆయనతో బోధ పొందుకోవడం ద్వారా!
ఇంకా
మత్తయి 11:27
సమస్తమును నా తండ్రిచేత నా కప్పగింపబడి యున్నది. తండ్రిగాక
యెవడును కుమారుని ఎరుగడు; కుమారుడు గాకను, కుమారుడెవనికి ఆయనను
బయలుపరచనుద్దేశించునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు.
క్రీస్తు
ప్రేమ విషయంలో కూడా అంతే! కాబట్టి ఆయన ప్రేమను తెలుసుకుందాం! ఆయన ప్రేమను పంచుదాం!
ఆయన ప్రేమలో మునిగిపోదాం! ఎలా అంటే ఆయన చెప్పినవి చేద్దాం! ఆయన వద్దు అన్నవి
మానేద్దాం! తద్వారా ఆయనకు ఇష్టులైన వారిగా మరి- ఆయన ప్రేమలో తరిద్దాం!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -44వ భాగం*
ఎఫెసీ 3:20—21
20. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము
అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి,
21. క్రీస్తుయేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ
కలుగునుగాక. ఆమేన్.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాము! ప్రియులారా ఇంతవరకు మాదిరికరమైన పౌలుగారి ప్రార్ధనలు కోసం ధ్యానం
చేసుకున్నాము! ఇక మరల మన భాగాలకు
వచ్చేద్దాం!
ఇక
20 వచనంలో అంటున్నారు మనలో కార్యసాధకమైన తన
శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ
శక్తిగల దేవునికి
చూడండి
తన శక్తిచొప్పున దేవుడు అడుగువాటి కంటే ఊహించువాటి కంటే అత్యధికంగా చేయగలరు
అంటున్నారు! అంతేకాకుండా 16—19
వచనాలలో మహా గొప్ప విషయాలు వ్రాశారు పౌలుగారు! మరి సాధ్యమా? తప్పకుండా
సాధ్యమే!దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు!
జాగ్రత్తగా ఆలోచిస్తే
మోషేగారిని దేవుడు పిలిచినప్పుడు నీవు ఐగుప్తుకి వెళ్లి నా ప్రజలను
విడిపించు అంటే మోషేగారు బహుశా అనుకుని ఉండవచ్చు-రాజుకి మామూలుగా దేవుడు తన
అద్భుతాలు చూపించి తన ప్రజలను విడిపిస్తారేమో అనుకుని ఉండవచ్చు! రాజు హృదయం కఠినమవుతుంది
అని , పది రకాలైన తెగుళ్ళు పంపించి ఐగుప్తును సర్వనాశనం చేస్తారని అని మోషేగారు
ఊహించి ఉండలేదు అని నా ఉద్దేశం!
ఎర్రసముద్రమును దేవుడు పాయలు చేస్తారని, ఇశ్రాయేలు ప్రజలు ఆరిన నేలను నడిచి
వెళ్లిపోతారని ఆయన అసలు ఊహించే ఉండరు! బండనుండి నీరు, తన ప్రజలతో దేవుడు
ముఖాముకిగా మాట్లాడతారు అని, పగలు మేఘ స్తంభం లోను, రాత్రి అగ్ని స్తంభము లోను
దేవుడు ఉండి వారిని నడిపిస్తారు అని మోషే గారు గాని ఇశ్రాయేలు ప్రజలు గాని ఊహించే
ఉండరు! మరి ఇవి వారు అగిగిన దానికంటే ఊహించిన దానికంటే దేవుడు అత్యధికముగా
చేయలేదా?!!
మా జీవితాలలో కూడా మేము దేవుణ్ణి అడిగిన దానికంటే ఇంకా అత్యధికంగా
ఉచ్చారు! మొదట మేము అడిగాము ప్రభువా మా ఇల్లు కారిపోతుంది, చిన్న ఇల్లు మంచి ఇల్లు
ఇవ్వు అని అడిగితే, ఎనిమిది గదులు గల పెద్ద ఇల్లు ఇచ్చారు దేవుడు మాకు! మా చర్చి
చాలడం లేదు, పెద్ద చర్చి అనగా ఒక 500 మంది పట్టే మందిరం ఇవ్వండి అని అడిగితే
దానిని ఇచ్చి, దానిమీద సుమారుగా 1500 మంది కూర్చో గలిగినంత పెద్ద ఆలయం ఇచ్చారు
దేవుడు! మరి మేము అడిగింది 500 మందికి కదా మరిదేవుడు పెద్ద ఆలయం ఇవ్వలేదా!!
కాబట్టి
మనం విశ్వాసముతో అడిగితే దేవుడు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యదికముగా
ఇస్తారు! దానికి మేమే సాక్షులము!
అయితే అడిగేది గొంతెమ్మ కోరికలు అడుగకూడదు! పరాయి వాడి సొమ్ము గాని,
పరాయివాడు కొన్న కార్లు బంగళాలు, లేక పరాయివాని భార్య, లేక వాని కూతురు లాంటివి
అడుగకూడదు! నీకు నీ కుటుంబానికి అనగా నీ కుటుంబ అవసరాలు తీర్చేవి అడగాలి అలాంటివి
తప్పకుండా దేవుడు ఇస్తారు! నీ సంఘ అవసరాలు తీరాలని అడగండి! తప్పకుండా ఇస్తారు
దేవుడు! గాని పనికిమాలిన శరీరాస నేత్రాస జీవపు డంభము గల కోరికలు అడగవద్దు! దేవుడు
తీర్చలేదు అని బాధపడవద్దు!!!
దేవుడు మనలో వీటిని చెయ్యగలరు, మనం ఊహించలేనంత బ్రహ్మాండంగా చేయగలరు.
అలాగైతే విశ్వాసులందరికీ మామూలుగా ఈ అనుభవం కలగదెందుకు? ఎందుకంటే మనం చేయవలసినవి
చేయడం లేదు. మనం నిజంగా దాన్ని ఆశించాలి, దేవునికి పూర్తిగా లోబడాలి, అన్నిటిలోనూ
విధేయత చూపాలి, ఆ అనుభవం కోసం ఆయనలో నమ్మకం ఉంచి ఆ నమ్మకంలోనే కొనసాగాలి. ఇదే
దేవుడు కోరేది . మరి ఇప్పుడు వీటిని ఎలా పొందుకొనేది?
యోహాను 14:21; నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే
నన్ను ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును; నేనును
వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరచుకొందునని చెప్పెను.
రోమీయులకు 12:1-2.
1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన
సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి
మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది.
2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును,
సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి
నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.
యిర్మియా 29:13 13.
మీరు నన్ను వెదకిన యెడల, పూర్ణమనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను
కనుగొందురు,
ఇక
చివరి వచనంలో అంటున్నారు క్రీస్తుయేసు మూలముగా
సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్.
క్రీస్తుయేసు
మూలంగా సంఘములలో తరతరాలు సదాకాలము దేవునికి మహిమ కలుగును గాక అంటూ దేవుణ్ణి
స్తుతిస్తూ ముగిస్తున్నారు ఈ అధ్యాయం! ఆయన పత్రికలలో అన్నింటి లోను ఆయన పత్రికను
ప్రారంబించినప్పుడు ముగించినప్పుడు ఇలాగే స్తుతులు చెబుతూ ఉంటారు దేవునికి! ఈ
పత్రిక మొదటి అధ్యాయంలో కూడా అలాగే చెప్పారు
3. మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు
స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోకవిషయములలో ఆత్మసంబంధమైన ప్రతి
ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.
7. దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన
రక్తమువలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.
15. ఈ హేతువుచేత, ప్రభువైన యేసునందలి మీ
విశ్వాసమునుగూర్చియు, పరిశుద్ధులందరియెడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు,
నేను వినినప్పటినుండి
16. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు
చెల్లించుచున్నాను
ఎందుకు అలా చేస్తున్నారు అంటే దేవుడు ప్రతీ విశ్వాసి పట్ల ఆయన ఎన్నెన్నో
ఆశ్చర్యకార్యాలు మహత్కార్యాలు చేశారు కాబట్టి దేవునికి అలా స్తుతులు చెల్లించడం
భావ్యం కాబట్టి! ఎప్పుడూ పౌలుగారు దేవుని పట్ల కృతజ్ఞతా భావముతో ఉంటారు! అయితే మరో
అనుమానం కూడా రావచ్చు. పత్రిక ముగించేటప్పుడు కూడా ఇలాగే దేవుణ్ణి స్తుతిస్తూ
ముగిస్తారు కదా తన పత్రికను పౌలుగారు, మరి ఎందుకు ఈ అధ్యాయంలో ముగింపు మాటలు
చెప్పే విధంగా దేవుణ్ణి స్తుతించి ముగించారు అంటే ఉపోద్ఘాతంలో చెప్పిన విధముగా
మొదటి మూడు అధ్యాయాలు దేవుడు మనలను ప్రేమించి మనలను ఏర్పరచు కొన్న విధానము, అది
ఎంతటి మహోన్నతమైనదో మన పిలుపు ఏర్పాటు చెప్పారు ఈ మూడు అధ్యాయాలు! చివరి మూడు
అధ్యాయాలు- మరి అంతటి గొప్ప పిలుపు ఏర్పాటు కలిగి ఉన్నారు కాబట్టి మీరు పిలువబడిన
పిలుపుకి తగినట్లుగా జీవించండి అంటూ జీవించే విధానం రాశారు రెండవ అర్ధభాగములో!
అందుకే మొదటి అర్ధభాగం ముగిస్తున్నారు కనుకనే ఈ అధ్యాయం చివరలో ఆమెన్ అంటూ
ముగించారు!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -45వ భాగం*
*పిలుపుకి తగ్గ జీవితం-1*
ఎఫెసీ 4:1—3
1. కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు
ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు,
2. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో
కూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,
3. ప్రభువునుబట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు
కొనుచున్నాను.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాము!
ప్రియులారా! మనము ఎఫెసీ పత్రిక రెండవ
అర్ధభాగమునకు వచ్చేశాము! ఈ 4:1 వ వచనం కాబట్టి అంటూ మొదలు పెట్టారు. గమనించాలి-
మొదటి అర్ధభాగమునకు కొనసాగింపుగా ఈ రెండవ అర్ధభాగము రాస్తున్నారు పౌలుగారు! మొదటి
అర్ధభాగములో ఏమి చెప్పారు? మనం క్రీస్తులో ఏమై ఉండేందుకు దేవుడు మనల్ని
పిలచారో మొదటి అర్ధభాగంలో చెప్పారు పౌలుగారు! – దేవుడు మనలను పిలిచింది ఏర్పాటుచేసుకుంది
1. దేవుని పిల్లలుగా ఉండటానికి,
2. ఆయన వారసత్వంగా మనము జీవించాలని,
3.ఆయన ఆలయంగా
జీవించాలని,
4. క్రీస్తు శరీరంగా మనము ఉండాలని,
చివరిగా దేవుని
ఇల్లుగా ఉండేందుకు పిలిచారు. మరి ఇంత మహోన్నతమైన ఈ పిలుపుకు తగిన రీతిలో
జీవించాలని ఇప్పుడు పౌలుగారు మనకు హితవు పలుకుతూ
మనలను ప్రోత్సహిస్తున్నారు. దేవుని ప్రత్యేకమైన స్వంత పిల్లలుగా ఎప్పుడూ
ప్రవర్తిస్తూ ఉండాలి. మనం క్రీస్తులో ఏమిటో ఆ ఘన సత్యాన్ని దృష్టిలో ఉంచుకుని దాని
వెలుగులో జీవిస్తూ ఉండాలి.
అందుకే
కొలస్సీ పత్రికలో అంటున్నారు ”– కొలొస్సయులకు 1:10; ఆయన చిత్తమును పూర్ణముగా
గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞాన మందు
అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు,
థెస్సలోనికయులకు
చెబుతూ అంటున్నారు
1 థెస్సలొనీకయులకు 2:. 11. తన రాజ్యమునకును మహిమకును
మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో
ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు,
12. తండ్రి తన బిడ్డల యెడల నడుచుకొనురీతిగా మీలో
ప్రతివానియెడల మేము నడుచుకొంటిమని మీకు తెలియును.
దేవునిపట్ల, మనిషిపట్ల ప్రేమ చూపేదే “తగిన”
జీవితం. ప్రేమ లేని జీవితం అదెంత ఖచ్చితంగా, నైతికంగా, త్యాగ భరితంగా, నమ్మకంగా
ఉన్నప్పటికీ మన పిలుపుకు తగిన జీవితం కాదు.
ఇక
ఈ వచనంలో అంటున్నారు మీరు సమాధానము అనే బంధముచేత
ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోనేలాగా శ్రద్దగలవారై ప్రేమతో ఒకనికొకడు సహించాలి
అంటున్నారు
దేవునికి తగిన రీతిగా
లేక ఆయన పిలుపుకు తగిన రీతిగా జీవించే విధానంలో మొదటిది సమాధానం కలిగి ఆత్మదేవుడు కలిగించే
ఐక్యతను కాపాడు కోవాలి, ఇంకా ప్రేమతో ఒకనికొకడు సహించాలి!
చూడండి విశ్వాసులు ఎలా
జీవించాలో పౌలుగారు ఇక్కడ చెబుతున్నారు! సమాధానము అనే బంధము తో నింపబడి
పరిశుద్ధాత్ముని ఆవేశంతో మనకు కలిగే ఐక్యతను కాపాడుకొనాలి అలా చేసి ప్రేమతో
ఒకనికొకడు సహించాలి!
ఈ మొదటి రెండు వచనాలలో
గలతీ పత్రికలో 5 లో చెప్పిన ఆత్మఫలము కనిపిస్తుంది! గలతీ పత్రికలో ఆత్మఫలము అంటే
ఏమిటో చెప్పారు. ఇక్కడ ఆ ఆత్మఫలముతో ఎలా జీవించాలో చెబుతున్నారు! ఈ మొదటివచనంలో
మనకు కనిపించేవి ఆత్మఫలములో: సమాధానము, ఐక్యత, ప్రేమ, ఇంకా సహనము; ఇక రెండవ వచనంలో దీర్ఘశాంతము, సంపూర్ణ వినయము, సాత్వికము
కలిగి ఉండాలి అంటున్నారు!
గలతీ 5: 22. అయితే
ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయా ళుత్వము, మంచితనము,
విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము.
ఇప్పుడు పిలుపుకి
తగినట్లు జీవించాలి అంటే మీద మొదటి వచనంలో చెప్పినవి చేస్తూ దీర్ఘశాంతముతో కూడిన
సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకోవాలి! ఎవరిపట్ల? తోటి విశ్వాసుల పట్ల! ఇదే
పిలుపుకి తగిన జీవితం జీవించడం అంటే!
ఇక వినయం, సాత్వికం కోసం చూసుకుంటే ”– మత్తయి 5:3, మత్తయి 5:5;
3. ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది.
4. దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు.
5. సాత్వికులు ధన్యులు ; వారు భూలోకమును
స్వతంత్రించుకొందురు.
మత్తయి
11:29లో అంటున్నారు: నేను సాత్వికుడను దీనమనస్సు
గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ
ప్రాణములకు విశ్రాంతి దొరకును.
కొలొస్సయులకు 3:12;
కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు
జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంత మును
ధరించుకొనుడి.
1 పేతురు 5:5-6. 5. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడియుండుడి;
మీరందరు ఎదుటివాని యెడల దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును
అలంకరించుకొనుడి; దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును.
6. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన
బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి
“సహనం” కోసం చూసుకుంటే – క్రైస్తవ
సహనంలోని ఒక లక్షణాన్ని పౌలుగారు ఇక్కడ వివరిస్తున్నారు. అది ప్రేమతో ఒకరినొకరు
సహించుకోవడం. ఒకరితో ఒకరి సంబంధాల్లో మనం ఎదుటి వారిలో సహించలేని వాటిని కూడా
సహించగలిగేలా చేసేది ప్రేమే (1 కోరింథీయులకు 13:4). ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ
చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు;
అలా దేవుని పిలుపుకి తగినట్లుగా జీవించమని మూడో వచనంలో ఖైదీనైన
నేను మిమ్మును ప్రభువుని బట్టి
బ్రతిమిలాడుతున్నాను అంటున్నారు! నిజానికి పౌలుగారు ఎఫెసీయులకు ఆజ్ఞాపించే
స్థితిలో ఉన్న ఎంతో ప్రేమతో బ్రతిమిలాడుతున్నారు! ఇదీ నిజమైన క్రైస్తవ్యం మరియు
తండ్రిప్రేమ!
అట్టి
లక్షణం మనము కూడా కలిగి ఉందాము!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -46వ భాగం*
*పిలుపుకి తగ్గ జీవితం-2*
ఎఫెసీ 4:1—3
1. కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు
ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు,
2. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో
కూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,
3. ప్రభువునుబట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు
కొనుచున్నాను.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంతూ మొదటి రెండు వచనాలలో ఉన్న ఆత్మఫలము కోసం ధ్యానం చేసుకుందాం!
ప్రియులారా!
మొదటి వచనంలో కనబడే ఆత్మఫలము మొదటిది
సమాధానం! దీనికోసం అనేకసార్లు చూసుకున్నాసందర్భము
వచ్చింది గనుక మరోసారి చూసుకుందాం!
కొలస్సీ 3:15
క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో
ఏలుచుండనియ్యుడి; ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి; మరియు కృతజ్ఞులై
యుండుడి.
ఈ వచనంలో క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ
హృదయములలో ఏలుచుండనియ్యుడి అంటున్నారు పౌలుగారు!
*సమాధానం*.
1).
ఇది కూడా ఆత్మఫలములో ఒక భాగము. గలతీ 5:22;
2)
ఈ వచనం జాగ్రత్తగా గమనిస్తే క్రీస్తు అనుగ్రహించు సమాధానం అంటున్నారు. సమాధానమునకు
మరో నానార్ధం శాంతి! శాంతి ఉంటేనే సమాధానం ఉంటుంది. అయితే ఇది ఎవరిచ్చే సమాధానం?
క్రీస్తు అనుగ్రహించే సమాధానం! అందుకే యేసుప్రభులవారు తను పరమునకు వెల్లకమునుపు
అంటున్నారు.
యోహాను 14: 27
శాంతి( లేక, సమాధానము) మీకనుగ్రహించి వెళ్లుచున్నాను; నా
శాంతినే (లేక,సమాధానము) మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ
కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి.
కాబట్టి ఆ శాంతిని మనం పొందుకుంటే, మన హృదయాలలో
శాంతి ఉంటుంది, అప్పుడు మనుష్యుల మధ్య సమాధానం ఉంటుంది.
3)
ఇక్కడ పౌలుగారు సమాధానం కలిగియుండుడి అనడం లేదు—సమాధానం ఏలుచుండనియ్యుడి అంటున్నారు. ఈ క్రీస్తు
అనుగ్రహించు సమాధానం మనమీద అధికారం చేయాలి, ఏలాలి. అప్పుడే ఆయన శాంతి, సమాధానం
సంపూర్తిగా పొందుకోవచ్చు!
నేటిదినాల్లో
ఈ శాంతి-సమాధానం లేక కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నాయి! భార్యాభర్తలమధ్య సమాధానం
లేదు! తల్లిదండ్రులు- పిల్లలమధ్య సమాధానం లేదు! పిల్లల మధ్య సమాధానం లేదు! సంఘంలో
సమాధానం లేదు! సంఘకాపరి—సంఘపెద్దల మధ్య
సమాధానం లేదు! సంఘపెద్దలు—సంఘసభ్యులమధ్య
సమాధానం లేదు! సంఘకాపరులు/ సేవకుల మధ్య సమాధానం లేదు! వీరిమధ్య సమాధానమును
తీసివేసి, అశాంతిని కలిగించి, ఈర్ష్య—ద్వేషాలు రగిలించి , వీరు కొట్టుకుంటుంటే, తగాదాలు పడుతుంటే సాతాను గాడు
తెగ సంభరపడుతున్నాడు. గెంతులేస్తున్నాడు! పరిశుద్ధాత్ముడు ఏడుస్తున్నాడు!!! ప్రియ
సంఘమా! ఒకసారి ఆలోచించు! పరిశుద్దాత్ముని సంతోషపరుస్తావా? దుఃఖపరుస్తావా?
ఆలోచించుకో!
ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ ఐక్యత ఉంటుంది. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ
ఆశీర్వాదం ఉంటుంది కీర్తన 133 ప్రకారము
1. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!
2. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల
అంచువరకు దిగజారిన పరిమళ తైలమువలె నుండును
3. సీయోను కొండల మీదికి దిగి వచ్చు హెర్మోను మంచు వలె
నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి
యున్నాడు.
కాబట్టి మన జీవితాలలో ఆశీర్వాదం లేదు అంటే మనలో సమాధానం లేదన్నమాట!
ఐక్యత లేదన్నమాట!
ఈ ఐక్యత—సమాధానం లేనందువలన
మొట్టమొదటి కుటుంబంలో హత్య జరిగింది! కయీను—హేబెలు మధ్య సమాధానం
లేక, కయీను – హేబెలును
చంపివేశాడు. శాపగ్రస్తుడయ్యాడు! యాకోబుగారి కుమారుల మధ్య సమాధానం లేక తమ్ముడిని
చంపబోయారు. చివరికి బానిసగా అన్యుడికి అమ్మివేశారు యోసేపును!
అదే ఐక్యతగా ఉన్నప్పుడు
ఏం చేశారు? అదే యాకోబు కుమారులు శత్రువుల మీద పగతీర్చుకున్నారు. దానియేలు, షడ్రక్,
మేషాక్, అబెద్నేగో సమాధానంగా, ఐక్యంగా ప్రార్ధన చేశారు. రాజు మరచిపోయిన కలను
చెప్పగలిగారు. తమ ప్రాణములు కాపాడుకోగలిగారు. అసాధ్యాలను—సుసాధ్యం చేశారు.
సింహపు నోళ్లను మూశారు. అగ్నిగుండములో ఏమీ ఇబ్బందులు పడకుండా తిరిగి, ప్రాణములతో
బయటికి వచ్చారు. ఆదిమ సంఘం, ఆది అపోస్తలులు కలసిమెలసి ఉండి, సమైక్యతతో ఉన్నందువలన
ఎన్నో అధ్బుతకార్యాలు చేసారు. భూలోకమును తల్లక్రిందులు చేయువారు అనే బిరుదు
పొందుకున్నారు! అదీ సమాధానమునాకు ఉన్న శక్తి!
ఈ సమాధానమును బంధముచేత పోల్చారు పౌలుగారు.
ఎఫెసీయులకు 4: 1
కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును
కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు,
ఈ సమాధానమను బంధము ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదము, శాంతి—సమాధానం, అద్భుతాలు ఉంటాయి. లేకపోతే
తగవులు, కొట్లాటలు, కోర్టులు ఉంటాయి!
అందుకే యేసుప్రభులవారు తన
శిష్యులను సేవకు పంపిస్తూ, మీరు వెళ్ళిన గృహానికి సమాధానము కలుగును గాక అని
దీవించమంటున్నారు! మత్తయి 10:12,13;
రోమీయులకు 5: 1
కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన
ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందము.
అలాచేస్తే
ఫిలిప్పీయులకు 4: 7
అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము
యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.
ఇంకా
2థెస్సలొనికయులకు 3: 16
సమాధానకర్తయగు ప్రభువు తానే యెల్లప్పుడును ప్రతి విధముచేతను
మీకు సమాధానము అనుగ్రహించును గాక. ప్రభువు మీకందరికి తోడైయుండును గాక.
అట్టి సమాధానము మనలో లేకపోతే ఇప్పుడే సమాధాన
పడుదాం! కారణం యోహాను గారు రాస్తున్నారు తన సహోదరున్ని ప్రేమించని వాడు, తన
సోదరునితో సమాధానముగా ఉండని వాడు వేషధారి, నరహంతకుడు, 1 యోహాను 4,5 అధ్యాయాలు. . .
కాబట్టి అందరితో సమాధానముగా ఉందాం. పౌలుగారు అంటున్నారు సఖ్యమైతే సమస్తమైన వారితో
సమాధానముగా ఉండుడి. రోమా 12:18;
అట్టి
సమాధానము, శాంతి మనందరం పొందుకుందుము గాక!
క్రీస్తు
అనుగ్రహించు సమాధానము మన హృదయాలను ఏలుచుండును గాక!
ఆమెన్!
ఆమెన్! ఆమెన్!
*ఎఫెసీ పత్రిక -47వ భాగం*
*పిలుపుకి తగ్గ జీవితం-3*
ఎఫెసీ 4:1—3
1. కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు
ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు,
2. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో
కూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,
3. ప్రభువునుబట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు
కొనుచున్నాను.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంతూ మొదటి రెండు వచనాలలో ఉన్న ఆత్మఫలము కోసం ధ్యానం చేసుకుంటున్నాం!
ప్రియులారా!
మొదటి వచనంలో కనబడే ఆత్మఫలము రెండవది:
ప్రేమ! దీనికోసం అనేకసార్లు చూసుకున్నాసందర్భము
వచ్చింది గనుక మరోసారి చూసుకుందాం!
కొలస్సీయులకు 3:
14
వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి.
ప్రియులారా! ఈ వచనం చాలా జాగ్రత్తగా
పరిశీలించవలసిన అవసరం ఉంది. కారణం పౌలుగారు రాసిన పత్రికలు మామూలుగా చదువుకుంటూ
పోతే – ఏమీ అర్ధం కాదు మనకు.
దానిని జాగ్రత్తగా ప్రార్ధనపూర్వకముగా చదివితే అర్ధం అవుతాయి మనకు పౌలుగారిని
వాడుకొని పరిశుద్ధాత్ముడు ఎన్ని మంచి సందేశాలు మనకోసం వ్రాయించారో అర్ధం అవుతుంది.
ఈ వచనంలో అంటున్నారు పౌలుగారు—పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఇక్కడ
ఆయన వీటన్నికన్నా ప్రేమను ధరించుకొనుడి అనడం లేదు గాని పరిపూర్ణతకు అనుబంధమైన
ప్రేమ అంటున్నారు. దీని అర్ధం చాలా ఉంది గాని సింపుల్ గా చెప్పాలంటే—ప్రేమకు—పరిపూర్ణతకు సంభందం ఉంది.– పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి అంటే
– పరిచర్య చేయాలి అది fivefold ministry గాని,
tenfold ministry అయినా సరే! ఈ సంపూర్ణులు పరిపూర్ణులు
కావాలి అంటే—ప్రేమను
ధరించుకోవాలి!!! ఒక వ్యక్తికి ఎన్ని ఫలాలు, శక్తులు, టాలెంట్లు ఉన్నా ప్రేమలేకపోతే
పరిపూర్ణుడు కాలేడు! పౌలుగారు అంటున్నారు
1 కోరింధీ 13:1-3 లో
1. మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను,
ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునైయుందును.
2. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నియు జ్ఞానమంతయు
ఎరిగినవాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసముగలవాడనైనను,
ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను.
3. బీదలపోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు
(అనేక ప్రాచీన ప్రతులలో- అతిశయించు నిమిత్తము అని పాఠాంతరము) నా శరీరమును
అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమియు లేదు. . .. కాబట్టి ప్రేమలేని విశ్వాసి, ప్రేమలేని
సేవకుడు, ప్రేమలేని ప్రసంగీకుడు –వేస్ట్ ఫెల్లో!
ప్రేమకు ప్రతిరూపం యేసుప్రభులవారు! అందుకే
ఆయన మనలను రక్షించడానికి మానవరూపం దాల్చి, పరమును విడచి, భువికి వచ్చారు.
Philippians(ఫిలిప్పీయులకు) 2:5,6,7,8
5. క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి.
6. ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో
సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని
7. మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని,
తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.
8. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి,మరణము
పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను
తగ్గించుకొనెను. . . .. . ఆయన మనకోసం ఎన్ని బాధలు పడ్డారో కదా!
ఇక ప్రేమకోసం బైబిల్ ఎక్కువగా రాసినవారు
మొదటగా పౌలుగారు, రెండవదిగా యోహానుగారు! ప్రేమకోసం రాయడానికి కారణం విశ్వాసుల మధ్య
ప్రేమ ఒక్కటే వారి మధ్య పరిపూర్ణ ఐక్యతను నెలకొల్పగలదు! ప్రేమలేకపోతే మనుష్యులు మధ్య స్వార్ధంతో కూడిన
ఆశలు, తగాదాలు, కొట్లాటలు, చీలికలు ఉంటాయి. అందుకే సామెతలు 10:12 లో ప్రేమ
దోషములను కప్పును అంటున్నారు. ప్రసంగీ 8:6 ప్రేమ మరణమంత బలవంతమైనది , ఈర్ష్య పాతాలమంత
కఠోరమైనది అంటున్నారు. దేవుడు మనపట్ల
చూపేది ఆగాపే ప్రేమ! అది అమరమైనది! అమోఘమైనది! అందుకే ఆయన యిర్మియా 31:3 లో
అంటున్నారు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల
కృపచూపు చున్నాను. ఎంత ప్రేమామయుడో మన స్వామి యేసు!!!
అదే ప్రేమను మనము కూడా కలిగియుండాలి
అనేది దేవుని ఆశ! అయితే ఈ ప్రేమ చల్లారిపోతుంది మనుష్యులలో! ఎలా? అక్రమము విస్తరించినందువలన అనేకుల ప్రేమ
చల్లారును! మత్తయి 24:12;
యోహాను 17:26 జాగ్రత్తగా పరిశీలన చేస్తే తండ్రియైన దేవుడు
యేసుప్రభులవారియందు ఏ విధమైన ప్రేమను
ఉంచారో- అదేప్రేమ యేసుప్రభులవారు మనయందు ఉండేలా తండ్రిని వేడుకున్నారు. పౌలుగారు చెప్పిన ఈ మాట జాగ్రత్తగా గమనించండి:
రోమా 5:5
ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు
అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో
కుమ్మరింపబడియున్నది.
.
. . దేవుని ప్రేమ మన హృదయంలో
కుమ్మరించబడింది ఎలా? పరిశుద్ధాత్మ ద్వారా! కాబట్టి ఆ ప్రేమను కోల్పోవద్దు! మరి ఈ
ప్రేమ మనలో ఎలా ఉండాలి?
*** నిష్కపటమైనదిగా ఉండాలి. రోమా 12:9;
*** చెడును అసహ్యించుకొనాలి. రోమా 12:9;
*** అనురాగం కలిగినదై యుండాలి. రోమా 12:10;
*** పొరుగువారికి కీడు చేయనిది రోమా 13:10;
*** క్షేమాభివృద్ధి కలుగజేసేది. 1 కొరింథీ 8:1;
ఇంకా Romans(రోమీయులకు) 13:8,9,10
8. ఒకని నొకడు ప్రేమించుట విషయములో తప్పమరేమియు ఎవనికిని
అచ్చియుండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు.
9. ఏలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు,
ఆశింపవద్దు, అనునవియు, మరి ఏ ఆజ్ఞయైన ఉన్న యెడల అదియు నిన్నువలె నీ పొరుగువాని
ప్రేమింప వలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి.
10. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమకలిగి యుండుట
ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే.
* ప్రేమ దీర్ఘకాలము సహించును,
* దయ చూపించును.
* ప్రేమ మత్సరపడదు;
* ప్రేమ డంబముగా ప్రవర్తింపదు;
* అది ఉప్పొంగదు;
* అమర్యాదగా నడువదు;
* స్వప్రయో జనమును విచారించుకొనదు;
* త్వరగా కోపపడదు;
* అపకారమును మనస్సులో ఉంచుకొనదు.
* దుర్నీతివిషయమై సంతోషపడక
* సత్యమునందు సంతోషించును.
* అన్ని టికి తాళుకొనును,
* అన్నిటిని నమ్మును;
* అన్నిటిని నిరీక్షించును;
* అన్నిటిని ఓర్చును.
* ప్రేమ శాశ్వతకాలముండును.
👉 విశ్వాసము,
నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును; వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే.
1కొరింది 13:4-8,13
అందుకే 1 కొరింథీ 14:1 లో
ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడుడి (మూలభాషలో- ప్రేమను
వెంటాడుడి) . ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి; విశేషముగా మీరు ప్రవచన
వరము అపేక్షించుడి.
గలతీ 5:6 ప్రకారం విశ్వాస కార్యసాధకం కావాలి అంటే ప్రేమ
తప్పకుండా కావాలి!
గలతీ 5:22
అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము,
దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.
ఫిలిప్పీ 1:9
మీరు శ్రేష్ఠమైన కార్యములను వివేచింపగలవారగుటకు, మీ ప్రేమ
తెలివితోను, సకల విధములైన అనుభవజ్ఞానముతోను కూడినదై, అంతకంతకు అభివృద్ధి
పొందవలెననియు,
అందుకే హెబ్రీ 10:25 లో
ఆ దినము సమీపించుట మీరు చూచినకొలది మరి యెక్కువగా ఆలాగు
చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని
(మూలభాషలో- లేపవలెనని) ఆలోచింతము
అంటున్నారు.
పేతురుగారు
ప్రేమ కోసం ఏమన్నారు ఈ వచనాలలో ఉన్నాయి
1పేతురు 1: 21
మీరు క్షయ బీజమునుండి కాక, శాశ్వతమగు జీవముగల దేవుని
వాక్యమూలముగా అక్షయ బీజమునుండి పుట్టింపబడినవారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ
కలుగునట్లు,
.
. ., ఇంకా రిఫరెన్సులు 3:8, 4:8;
యోహాను గారు చెప్పినది చూద్దాం.
1 యోహాను 2:5
ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా
పరిపూర్ణమాయెను;
మరిన్ని
రిఫరెన్సులు 3:16; 3:17; 4:7, 12, 18; 2 యోహాను 1:6
కాబట్టి
ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. అట్టి మహోన్నత ప్రేమ మనలో ఉన్నదా? మన ప్రేమ
కేవలం మాటలలోనా, చేతలలో కూడా ఉందా? ఒకవేళ లేకపోతే దానిని పొందుకోడానికి ప్రయత్నం
చేద్దాం!
అట్టి
ప్రేమ, సహోదర ప్రేమ మనందరం పొందుకుందుము గాక!
ఆమెన్!
*ఎఫెసీ పత్రిక -48వ భాగం*
*పిలుపుకి తగ్గ జీవితం-4*
ఎఫెసీ 4:1—3
1. కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు
ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు,
2. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో
కూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,
3. ప్రభువునుబట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు
కొనుచున్నాను.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటూ మొదటి రెండు వచనాలలో ఉన్న ఆత్మఫలము కోసం ధ్యానం చేసుకుంటున్నాం!
ప్రియులారా!
మొదటి వచనంలో కనబడే ఆత్మఫలము మూడవది:
సహనము!
కొలస్సీయులకు 3: 13
ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనిన యెడల ఒకనినొకడు
సహించుచు ఒకనినొకడు క్షమించుడి, ప్రభువు (క్రీస్తు)మిమ్మును క్షమించినలాగున మీరును
క్షమించుడి.
ప్రియదైవజనమా! దేవునిచేత
ఏర్పరచబడినవారికి, పరిశుద్దులకు, ప్రియులకు అనగా దేవుని బిడ్డలుగా పిలువబడిన
వారికి ఉండవలసిన మరిన్ని లక్షణాలు ఈ వచనంలో చూసుకోవచ్చు! మొదటిది *సహనం*, రెండవది
*క్షమాపణ*.
ఈ వచనంలో పౌలుగారు
ఎప్పుడు సహించమంటున్నారు? మీకు ఎవరైనా అన్యాయం చేసినప్పుడు సహించమంటున్నారు,
క్షమించమంటున్నారు. ఇదే వచనాన్ని కొన్ని తర్జుమాలలో ఇలా ఉంది. *ఒకవేళ మీలోఎవరికైనా
ఎవరిమీద అయినా ఫిర్యాదు చేయడానికి కారణం ఉన్నా ఒకరిపట్ల ఒకరు సహనం చూపండి, ఒకరినొకరు
క్షమించండి. క్రీస్తు మిమ్ములను క్షమించినట్టే మీరూ క్షమించండి* .
కాబట్టి అన్యాయాన్ని సహించండి, క్షమించండి అంటున్నారు గాని
వాళ్ళమీద పోలిస్ స్టేషన్లో, పంచాయితీ ఆఫీస్లో, MRO ఆఫీసులో కంప్లైంట్
ఇవ్వమని గాని, కోర్టుల చుట్టూ తిరుగమని గాని చెప్పలేదు! కంప్లైంట్ చేసే అవకాశం
ఉన్నా, వాళ్ళదే అన్యాయం, మీదే న్యాయం అయినా సహించి, క్షమించమంటున్నారు.*ఇదే
క్రీస్తు ప్రేమతత్వం*! *అదే పౌలుగారికి పరిశుద్ధాత్ముడు నేర్పిన బోధ*! మనం కూడా
అలా చేయవలసిందే గాని, నేటిదినాల్లో జరుగుతున్నట్లు – క్రైస్తవ హక్కులకోసం
ధర్నాలు, మీటింగ్లు, కోర్టులు అని బైబిల్ చెప్పడం లేదు.
మొదటిగా మనం
*సహనం* కోసం ధ్యానం చేద్దాం. సహనానికి మరో
నానార్ధం ఓర్పు! సహనము అంటే కష్టాన్ని ఓర్చుకునే బుద్ధి!! సహనానికి మారుపేరు మన
భారతదేశస్త్రీ! ఇంటి ఇల్లాలు! తల్లి! ఇంట్లో ఎన్నో పనులు చేస్తూ, అన్నింటినీ
తట్టుకుంటుంది. ఇన్ని పనులు చేస్తున్నా, కేవలం 8గంటలు ఆఫీసులో పనిచేసి/ పొలంలో
పనిచేసి వచ్చిన భర్త స్త్రీని వెంట్రుకలా తీసి పారేస్తున్నాడు. మరికొంతమంది తాగి
వచ్చి గొడ్డును బాదినట్లు కొడుతున్నారు భార్యలను. ఒకసారి ఆమె చేస్తున్న పనులు
ఆపురుషుడు గాని, పిల్లలు గాని ఒక వారం రోజులు చేస్తే, ఆమె కుటుంబం కోసం ఎంత
కష్టపడుతుందో, ఎంత త్యాగం చేస్తుందో, ఆ పనులు ఎంత కష్టమో , ఎంత సహనంగా చేస్తుందో
అర్ధం అవుతుంది. దేవుడు అంత సహనాన్ని స్త్రీలకు ఇచ్చారు.
అదే విధమైన సహనాన్ని
యేసయ్య చూపించారు. ఒకసారి సహనం కోసం బైబిల్ ఏమి చెబుతుందో చూద్దాం!
సామెతలు 19:11 మనిషి వివేకం అతనికి – సహనాన్ని
నేర్పుతుంది.
సామెతలు 25:15 ఒకని సహనం – పాలకులను/
అధికారులను ఒప్పిస్తుంది.
ప్రసంగీ 7:8 అహం
భావం కన్నా సహనమే మేలు!
సహనానికి మరో నానార్ధం ఓర్పు! ఓరిమి! రోమీయులకు 3: 25
పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన
ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని. . .;
5:4 సహనం/ ఓర్పు – పరీక్షను,
పరీక్ష—నిరీక్షణను
కలుగజేస్తుంది.
రోమీయులకు 12: 12
నిరీక్షణగలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై,
ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి.
ఎఫెసీయులకు 4: 2
మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన
సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని. . . ;
కొలస్సీయులకు 1: 11
ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన
పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ
బలముతో బలపరచబడవలెననియు . . . ;
2 పేతురు 1:6
జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును,
సహనమునందు భక్తిని. . . .;
ఎవరైతే
శోధనలు సహిస్తారో వారికోసం దేవుడు చెప్పిన మాట:
ప్రకటన గ్రంథం 2: 19
నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ
సహనమును నేనెరుగుదును; నీ మొదటి క్రియలకన్న నీ కడపటి క్రియలు మరియెక్కువైనవని
యెరుగుదును.
కాబట్టి
సహనము కలిగి ఉండాలి.
కాబట్టి
అట్టి సహనమును ఓర్పును మనము కూడా కలిగి ఉందాము!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -49వ భాగం*
*పిలుపుకి తగ్గ జీవితం-5*
ఎఫెసీ 4:1—3
1. కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు
ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు,
2. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో
కూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,
3. ప్రభువునుబట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు
కొనుచున్నాను.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటూ మొదటి రెండు వచనాలలో ఉన్న ఆత్మఫలము కోసం ధ్యానం చేసుకుంటున్నాం!
ప్రియులారా!
రెండవ వచనంలో కనబడే ఆత్మఫలము నాల్గవది: దీర్ఘశాంతము!
కొలస్సీ
పత్రికలో కూడా ఈదీర్ఘశాంతము కోసం చెబుతున్నారు
కొలస్సీ
3:12
కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును
ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును,
సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి
ప్రియులారా! తర్వాత ఉండవలసిన లక్షణము *దీర్ఘశాంతము*: అనగా ఓర్చుకొనే బుద్ధి. ఎంత కష్టమైనా
ఓర్చుకుంటారు! కొన్ని ప్రతులలో దీర్ఘశాంతానికి ఓర్పు అని తర్జుమా చేశారు.
ఇది కూడా
1. దేవుని గుణగణాలలో ఒకటి. నిర్గమకాండము 34: 6
అతనియెదుట యెహోవా అతని దాటి వెళ్లుచుయెహోవా కనికరము, దయ,
దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా.;
2. ఆత్మఫలములో ఒక
ఒకభాగము. గలతీ 5:22 అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము,
*దీర్ఘశాంతము*, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.
కాబట్టి
దేవుని లక్షణాలను మనం కూడా అలవర్చుకోవాలి!
సామెతలు 19:11 లో
ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును తప్పులు
క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును.
సుబుద్ధి ఉంటే దీర్ఘశాంతము ఉంటుంది/ వస్తుంది. అదే దుర్బుద్ధి/
సుండుబుద్ధి ఉంటే అతికోపం/ షార్ట్ టెంపర్ ఉంటుంది. అప్పుడు బుద్ధిహీనుడుగా,
మూర్ఖుడిగా పేరు తెచ్చుకొని, ప్రజలచేత ద్వేషించబడతావు. కొన్నిసార్లు దెబ్బలుకూడా
తినవలసివస్తుంది.
మరి అనొచ్చు
నిర్ఘమ 34:6 లో దేవుడు దీర్ఘశాంతుడు అని వ్రాయబడింది కదా మరి ఇశ్రాయేలీయుల మీద
ఎందుకు అలా కోపపడ్డారు? ఎందుకు వారిని అన్ని ఇబ్బందుల పాలు చేశారు?
జవాబు:
మీకా 2:7.
యాకోబు సంతతివారని పేరు పెట్టబడినవారలారా, యెహోవా
దీర్ఘశాంతము తగ్గిపోయెనా? యీ క్రియలు ఆయనచేత జరిగెనా? యథార్థముగా
ప్రవర్తించువానికి నా మాటలు క్షేమసాధనములు కావా?
అనగా వారు యధార్ధముగా ప్రవర్తించనందున దేవుడు
వారిమీద ప్రతీకారం చేయవలసివచ్చింది.
అదే విషయాన్ని యేసుప్రభులవారు ప్రస్తావించారు లూకా 18:8 లో
ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును; వారినిషయమే గదా ఆయన
దీర్ఘశాంతము చూపుచున్నాడని (లేక ఆలస్యము చేయుచున్నాడు) మీతో చెప్పుచున్నాను.
అయినను మనుష్యకుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమిమీద (ఆ విశ్వాసము) విశ్వాసము
కనుగొనునా?
అనగా మనం ఎన్ని తప్పు పనులు చేసినా ఇంకా
మారతారు కదా అని దేవుడు మనయెడల దీర్ఘశాంతము చూపిస్తున్నారు. అంతటా అందరూ
మారుమనస్సు పొందాలని ఆయన కోరుకుంటున్నారు 2 పేతురు 3:9; లేనియెడల మనం ఇప్పటికి
నాశనమైపోయి ఉండేవారము. ఆ దీర్ఘశాంతాన్ని చేతకానితనముగా అనుకోవద్దు!
పేతురు
గారు మాట్లాడుతూ 1 పేతురు 3:20లో.
దేవుని దీర్ఘశాంతము ఇంక కని పెట్టుచుండినప్పుడు పూర్వము
నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, అవిధేయులైన వారియొద్దకు, అనగా చెరలో ఉన్న
ఆత్మలయొద్దకు, ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా
ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణపొందిరి.
అందుకే
2 పేతురు 3:15 లో మన ప్రభువుయొక్క దీర్ఘశాంతము రక్షణార్ధమైనదని ఎంచుకోండి. అది
చేతకానితనముగా జమకట్టవద్దు.
2పేతురు 3: 9
కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును
గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు
మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు.
రోమీయులకు 2: 4
లేదా, దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను
ప్రేరేపించుచున్నదని యెరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘ శాంతమును
తృణీకరించుదువా?
యోసేపుగారు దీర్ఘశాంతము చూపించారు. చివరికి
ఐగుప్తు దేశానికి గవర్నర్ కాగలిగారు. యోబుగారు దీర్ఘశాంతముతో శ్రమలను
ఓర్చుకున్నారు. రెట్టింపు దీవెన/ ఆశీర్వాదం పొందుకున్నారు. అటువంటి దీర్ఘశాంతము
నీకు నాకు కావాలి.
దీర్ఘశాంతమునే ఓర్పు అనికూడా అంటారని
చూసుకున్నాం! కాబట్టి నీవు కూడా
ఓర్చుకోవలసిఉంది.
కీర్తన 40:1.
యెహోవాకొరకు నేను సహనముతో కనిపెట్టు కొంటిని ఆయన నాకు
చెవియొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను.
అంతేకాదు సామెతలు 15:18
కోపోద్రేకియగువాడు కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదము
నణచివేయును.
ఈ
ఓర్పుగలవారిని యేసుప్రభులవారు మంచినేల మీద పడిన విత్తనాలతో పోలుస్తున్నారు. లూకా 8:15 లో
మంచి నేల నుండు (విత్తనమును పోలిన) వారెవరనగా యోగ్యమైన మంచి
మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు.
కాబట్టి
నీవు మంచినేలమీద పడితే ఓర్చుకుంటావు. ఫలిస్తావు.
లూకా 21:19 ప్రకారం అంత్యకాలములో మీ ఓర్పుచేత ప్రాణములు
రక్షించుకొంటావు.
ఎఫెసీయులకు 4: 2
మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన
సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,. .
ఇదే
విషయాన్ని మనం మొదటిబాగాలలో ధ్యానం చేసుకున్న పౌలుగారి ప్రార్ధనలలో కూడా రాశారు.
కొలస్సీ 1:11
ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన
పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ
బలముతో బలపరచబడవలెననియు, . . .
1థెస్సలొనికయులకు 5: 14
సహోదరులారా, మేము మీకు బోధించునది ఏమనగా అక్రమముగా
నడుచుకొనువారికి బుద్ధిచెప్పుడి, ధైర్యము చెడినవారిని దైర్యపరచుడి, బలహీనులకు ఊత
నియ్యుడి, అందరియెడల దీర్ఘ శాంతముగలవారై యుండుడి.. .
తిమోతికి
లేఖ రాస్తూ పౌలుగారు అంటున్నారు 1 తిమోతీ 6:11
దైవజనుడా, నీవైతే వీటివి విసర్జించి (విడిచి పారిపొమ్ము),
నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు
ప్రయాసపడుము (వెంటాడుము).
2 తిమోతీ 3:10 .
అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా
విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును. .
హెబ్రీ 10:36 .
మీరు దేవుని చిత్తమును నెరవేర్చినవారై, వాగ్దానముపొందు
నిమిత్తము మీకు ఓరిమి అవసరమై యున్నది.
యాకోబుగారు కూడా అంటున్నారు 5:7-8 .
సహోదరులారా, ప్రభువు రాకడవరకు ఓపిక కలిగియుండుడి; చూడుడి;
వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము
ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా
కాబట్టి అటువంటి దీర్ఘశాంతము, ఓర్పు మనందరమూ
కలిగియుందుము గాక!
ప్రకటన 3:10 .
నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూ నివా
సులను శోధించుటకు లోకమంతటిమీదికి రాబోవు శోధన కాలములో (మూలభాషలో- శోధనగడియలో)
నేనును నిన్ను కాపాడెదను.
ఆమెన్!
*ఎఫెసీ పత్రిక -50వ భాగం*
*పిలుపుకి తగ్గ జీవితం-6*
ఎఫెసీ 4:1—3
1. కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు
ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు,
2. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో
కూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,
3. ప్రభువునుబట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు
కొనుచున్నాను.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంతూ మొదటి రెండు వచనాలలో ఉన్న ఆత్మఫలము కోసం ధ్యానం చేసుకుంటున్నాం!
ప్రియులారా!
రెండవ వచనంలో కనబడే ఆత్మఫలము ఐదవది : సాత్వికము !
కొలస్సీ
పత్రికలో కూడా ఈదీర్ఘశాంతము కోసం చెబుతున్నారు
కొలస్సీ 3:12
కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును
ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును,
సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి.
ప్రియులారా! మనం కొద్దిరోజులనుండి మనం
విశ్వాసి చేయవలసిన పనులు- ఉండవలసిన లక్షణాలు కోసం ధ్యానం చేసుకుంటున్నాం. ఈరోజు
మనం *సాత్వికం* కోసం ధ్యానం చేసుకుందాం!
సాత్వికము
అనగా చాలా నెమ్మదస్తుడు, ఎవరు ఎన్ని మాటలన్నా కోపపడకుండా భరిస్తూ- పరుషమైన మాటలతో
కాకుండా ప్రేమతో జవాబు చెప్పేవారు సాత్వికులు. సాత్వికము అనే మాట వస్తే మనకు
గుర్తుకు వచ్చేది మోషేగారు! మోషే భూమిమీద నున్న వారందరికంటే మిక్కిలి సాత్వికుడు
అని దేవుడే certify చేశారు.
సంఖ్యా 12:3; ఈసాత్వికమే ఆయనను నాయకుణ్ణి చేసింది. ఐగుప్తులో యుద్ధవిన్యాసాలలో
ప్రావీణ్యం పొందితే, మిధ్యాను దేశంలో 40 సం.లు పశువులు- మందలు కాయడం ఎలా అని
ట్రైనింగ్ ఇచ్చారు. పశువులు అన్ని ఒక రకంగా ప్రవర్తించవు. వాటిని కంట్రోల్ చేయడం
ఎలా, మేపడం ఎలా, నిర్వహించడం ఎలా అన్నీ నేర్పించారు. బహుశా ఇదే ఆయనకు సాత్వికము
నేర్పించి ఉంటుందని నా ఉద్దేశ్యము! మండుచున్న పొద ఆయనకు దేవునితో సాంగత్యము
నేర్పించింది. ఈ మూడు అనుభవాలు ఆయనను మహా గొప్పనాయకున్ని చేశాయి! సాత్వికమును
ఉపయోగించి ఆయన దేవుని దృష్టిలో అత్యంత సాత్వికుడు అయ్యారు.
యేసుప్రభులవారు తన కొండమీద ప్రసంగంలో
సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అంటున్నారు. మత్తయి 5:5;
కాబట్టి సాత్వికమునకు అంత గొప్పశక్తి ఉంది. యేసయ్య గురుంచి ప్రవక్తలు ముందుగానే
చెప్పారు ఆయన సాత్వికుడని! అది మత్తయి 21:5 లో నెరవేరింది.
ఇదిగో నీ రాజు సాత్వికుడై, గాడిదనుభారవాహక పశువుపిల్లయైన
చిన్న గాడిదను ఎక్కినీయొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారితో చెప్పుడి అనునది.
అందుకే ఆయనను
అన్ని చిత్రహింసలు పెట్టినా, హింసించినా, గేలిచేసినా, అవమానపరచినా సాత్వికుడై—తండ్రీ వీరేమి చేయుచున్నారో
వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అని మన పక్షముగా దేవుని దగ్గర క్షమాపణ అడిగి,
మనకు క్షమాభిక్ష పెట్టారు. అందుకే ఆయన మనందరికీ గురువు అయ్యారు. ఆయన సాత్వికుడు
కాబట్టి మనము కూడా సాత్వికులమై ఉండాలి,
2 సమూయేలు 22:36
నీ సాత్వికము నన్ను గొప్పచేసెను. అదేమాట కీర్తనాకారుడు కూడా అంటున్నారు 18:35 లో.
నీ రక్షణ కేడెమును నీవు నాకందించుచున్నావు నీ కుడిచెయ్యి
నన్ను ఆదుకొనెను నీ సాత్వికము నన్ను గొప్పచేసెను.
చూసారా! ఎవరైతే సాత్వికముగా ఉంటారో వారిని
దేవుడు గొప్పచేస్తారు. గర్వించిన వారిని నేలపడగొట్టి దీనులను పైకి లేపుతారు. లూకా
1:51-53; అంతేకాకుండా గలతీ 5:22 లో గల ఆత్మఫలములో ఇది కూడా ఒక భాగము!
అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము,
దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, *సాత్వికము*, ఆశానిగ్రహము.
పౌలుగారికి ఎంతో నచ్చినది ఈ సాత్వికము.
అందుకే 2 కొరింథీ 10:1 లో
మీ ఎదుటనున్నప్పుడు మీలో అణకువ గలవాడనైనట్టియు, ఎదుట
లేనప్పుడు మీయెడల ధైర్యము గలవాడనైనట్టియు, పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క
సాత్వికమును మృదుత్వమునుబట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. అంటున్నారు. చూశారా
పౌలుగారి సాత్వికము.
గలతీ 6:1లో ఎవరైనా
అతిక్రమము చేస్తే వారితో సాత్వికముగా ప్రవర్తించి తిరిగి వారిని దేవుని దారిలోనికి
తీసుకుని రావాలి అని చెబుతున్నారు.
ఎఫెసీయులకు 4: 2
మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన
సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని. . .
ఫిలిప్పీయులకు 4: 5
మీ సహనమును (లేక, మృదుత్వమును/ సాత్వికమును) సకల జనులకు
తెలియబడనియ్యుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు.
2 తిమోతీ 2:25 లో ఎదురించేవారిని సాత్వికముతో సరిదిద్దాలి.
అంటున్నారు,
తీతుకు 3:2
ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధ పడియుండవలెననియు,
మనుష్యులందరియెడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు, ఎవనిని దూషింపక,
జగడమాడనివారును శాంతులునై యుండవలెననియు, వారికి జ్ఞాపకము చేయుము.
1 పేతురు 3:15
నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణను
గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము
చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి,మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా
ప్రతిష్ఠించుడి;
కాబట్టి క్రీస్తుయేసుకు కలిగిన ఈ మనస్సు
మీరును కలిగియుండాలని దేవునిపేరిట మనవి చేస్తున్నాను.
ఇది
విశ్వాసులకు ఉండవలసిన మంచి లక్షణాలలో ఉత్తమమైనది *సాత్వికము*
కాబట్టి
అట్టి సాత్వికమును అలవరచుకొని దేవునికి ఇష్టులుగా ఉందాం!
దేవునిచే
ఘనపరచ బడుదాం!
ఆమెన్!
ఆమెన్! ఆమెన్!
*ఎఫెసీ పత్రిక -51వ భాగం*
*పిలుపుకి తగ్గ జీవితం-7*
ఎఫెసీ 4:1—3
1. కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు
ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు,
2. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో
కూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,
3. ప్రభువునుబట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు
కొనుచున్నాను.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంతూ మొదటి రెండు వచనాలలో ఉన్న ఆత్మఫలము కోసం ధ్యానం చేసుకుంటున్నాం!
ప్రియులారా!
రెండవ వచనంలో కనబడే మరో గొప్ప విషయము : వినయము ! అయితే ఇక్కడ పౌలుగారు సంపూర్ణ వినయముతో
ఉండాలి అంటున్నారు అనగా complete submission!
కొలస్సీ
పత్రికలో కూడా ఈదీర్ఘశాంతము కోసం చెబుతున్నారు
కొలస్సీ 3:12
కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును
ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును,
సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి.
ప్రియులారా! 3:12-16 వచనాలు జాగ్రత్తగా
పరిశీలిస్తే , గలతీ 5:22-23 లో గల ఆత్మఫలములో గల ముఖ్యమైన భాగములే ఇక్కడ కూడా
కనిపిస్తున్నాయి. వీటికి ఒకదానితో ఒకటి సంభందం కలిగియున్నాయి.
ఈరోజు విశ్వాసికి ఉండవలసిన మరో లక్షణం: *వినయం* కోసం ధ్యానం చేసుకుందాం!
విశ్వాసికి తప్పకుండా వినయం ఉండాలి. కారణం యేసుప్రభులవారు అంటున్నారు
తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును, హెచ్చించుకొనువాడు తగ్గించబడును!
మత్తయి 23:12; లూకా 14:11; 18:14; కాబట్టి
ప్రతీ ఒక్కరు తమకుతాము తగ్గించుకోవాలి. ఇతరులను హెచ్చించాలి! అంతేకాదు సామెతలు
గ్రంధం ప్రకారం ఘనతకు ముందు వినయము ఉంటుంది. పడిపోయే ముందు గర్వం ఉంటుంది. సామెతలు
18:12;
కాబట్టి
విశ్వాసికి ఉండవలసిన ప్రశస్త లక్షణం: *వినయం*.
నేటిరోజుల్లో పిల్లలకు
తల్లిదండ్రులు వినయ విధేయతలు నేర్పించడం లేదు. పెద్దలను ఎలా గౌరవించాలో కూడా
నేర్పించడం లేదు. అందుకే వారు పెద్దలకు గౌరవం ఇవ్వడం లేదు, చివరకు తల్లిదండ్రులకు-
తాతలకు బంధువులకు గౌరవం ఇవ్వడం లేదు. పెద్దలకు గౌరవం ఇవ్వలేని వాడు దేవునికి- తల్లిదండ్రులకు
కూడా గౌరవం ఇవ్వడు! బాలుడు నడువ వలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైన
తర్వాత దానినుండి తొలగిపోడు అని బైబిల్ గ్రంధం సెలవిస్తుంది. సామెతలు 22:6;
బాలుడైన సమూయేలు కి నడువ వలసిన విధానం, వినయ విధేయతలు దైవజనుడైన ఏలీ గారు
నేర్పించినట్లు చూస్తాం! అందుకే ఎంత గొప్ప దైవజనుడయ్యారో ఆయన మనం చూసుకోవచ్చు!
కాబట్టి ప్రియ తల్లిదండ్రులారా! మీ పిల్లలకు వినయం నేర్పించండి.
పిల్లలే కాదు పెద్దలు
కూడా వినయముతో ప్రవర్తించాలి. ఒకసారి పాతనిబంధన గుర్తుచేసుకుంటే ఎందరో రాజులు
గర్వించినప్పుడు దేవుడు వారిని శిక్షించారు. తిరిగి వారు తగ్గించుకుంటే / వినయం
కలిగి వేడుకుంటే తిరిగి వారిని క్షమించి రక్షించినట్లు చూడవచ్చు!
ఉదా:
1. ఆహాబు 1 రాజులు 21:29;
2.
రెహబాము 2 దిన వృత్తా 2:6;
3.
మనస్సే 2 దిన 33:12;
4.
నెబుకద్నేజరు దానియేలు 4
అందుకే మహాజ్ఞానియైన సోలోమోను రాస్తున్నారు:
సామెతలు 22:4
యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము
ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివలన కలుగును.
కాబట్టి ఇవి విశ్వాసికి కావాలి.
వినయం
గలవారిని దేవుడు కృప చూపిస్తారు సామెతలు 3:34;
సామెతలు 11:2
అహంకారము వెంబడి అవమానము వచ్చును వినయముగలవారియొద్ద
జ్ఞానమున్నది.
అందుకే దేవుడు ప్రజలతో చెబుతున్నారు యెషయా 66:2
ఎవడు దీనుడై నలిగిన హృదయముగలవాడై నా మాట విని వణకుచుండునో
వానినే నేను దృష్టించుచున్నాను.
ఇంకా మీకా 6:8
మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది;
న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట
ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు.
జెఫన్యా అంటున్నారు 2:3
దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధుల ననుసరించు సమస్త
దీనులారా, యెహోవాను వెదకుడి; మీరు వెదకి వినయముగలవారై నీతిని అనుసరించినయెడల ఒకవేళ
ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు.
అందుకే పౌలుగారు రాస్తున్నారు: వినయమును
ధరించుకొనుడి. 3:12;
ఎఫెసీ 4:2 .
మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన
సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని. . ;
ఫిలిప్పీ 2:3 .
కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన
మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుచు. . .
తీతుకు 3:2 .
ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధ పడియుండవలెననియు,
మనుష్యులందరియెడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు, ఎవనిని దూషింపక,
జగడమాడనివారును శాంతులునై యుండవలెననియు, వారికి జ్ఞాపకము చేయుము.
యాకోబు 3:13 .
మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన
సాత్వికముగలవాడై, తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను.
పేతురు గారు కూడా అంటున్నారు:
1 పేతురు 5:5 .
చిన్నలారా, మీరు పెద్దలకు లోబడియుండుడి; మీరందరు ఎదుటివాని
యెడల దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి; దేవుడు
అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును.
కాబట్టి ప్రియ దైవజనమా!
దేవునికి
నచ్చిన, దేవుడు మెచ్చిన లక్షణం *వినయం* ప్రతీ ఒక్కరు ధరించుకొని ప్రవర్తిద్ధాము.
హెబ్రీయులకు 12: 28
అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, దైవ కృప
కలిగియుందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవచేయుదము,
ఆమెన్!
ఆమెన్!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -52వ భాగం*
*పిలుపుకి తగ్గ జీవితం-8*
ఎఫెసీ 4:1—3
1. కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు
ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు,
2. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో
కూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,
3. ప్రభువునుబట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు
కొనుచున్నాను.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంతూ మొదటి రెండు వచనాలలో ఉన్న ఆత్మఫలము కోసం ధ్యానం చేసుకుంటున్నాం!
ప్రియులారా!
మొదటి వచనంలో కనబడే మరో గొప్ప విషయము : ఐక్యత! ఐక్యత ఎప్పుడు ఉంటాది అంటే సమాధానము ఉన్నప్పుడు!
కాబట్టి ఈ రెండిటికి సంభందము ఉండి అని గ్రహించాలి!
ఐక్యతకోసం మన చిన్నప్పుడు ఎన్నెన్నో కధలు చదువుకున్నాము! కీ.శే.
శ్రీ చిన్నయసూరి గారి రచనలలో మిత్రలాభం అనే శీర్షికలో ఎన్నెన్నో కధలు ఉన్నాయి!
వీటియొక్క భావము సహోదరులు గాని మిత్రులు గాని ఐక్యతతో ఉంటె ఎవడూ ఈ సహోదరులను గాని
మిత్రులను గాని ఎదిరించలేదు విడిపోతే ప్రతీ ఒక్కడు వీరితో ఆడుకుంటాడు!
ఒక తండ్రి తన నలుగురు కుమారులను వెళ్లి కొన్ని పుల్లలు ఏరుకుని
రమ్మంటాడు- ఆ పుల్లలు మోపుగా ఉన్నప్పుడు మోపు విరపమంటాడు అప్పుడు నలుగురు కుమారులు
కూడా విరలేక పోతారు! మూట విప్పి విరవమంటే వెంటనే విరిచేస్తారు! అలాగే మీరుకూడా
కలిసి ఉండండి మీరు విడిపోతే మీరు ఏకాకులైపోయి మిమ్మల్ని నాశనం చేస్తారు అని తండ్రి
చనిపోయే ముందు హితవు పలుకుతాడు!
మరొకటి: నాలుగు ఆవులు/ఎద్దులు కలిసి ఉంటాయి! పులి వాటిని తినాలని
ప్రయత్నించినా ఏమీ చెయ్యలేక పోయేది!ఒకరోజు ఒక్కో ఆవుతో ప్రత్యేకముగా మాట్లాడి
వాటిమధ్య భేదభావము శత్రుత్వము కలిగించి ఒక్కోదానిని తినేసింది!
మరొకటి- ఎంతో శ్రేష్టమైనది: ఒకరోజు పావురాలు చిట్టడివిలో నూకలు
చూస్తాయి, వెంటనే రాజు పావురం వద్దని వారించినా వాటిపై వాలిపోయి తింటూ వలలో చిక్కుకు
పోతాయి! ఈలోగా బోయవాడు వాటిని పట్టుకోబోతుండగా రాజుపావురం ఇప్పుడు విచారించి
లాభములేదు! మనమందరం ఒక్కసారిగా వలతో పాటుగా ఎగిరిపోదాము అని చెప్పి 1,2,3
అనిచెప్పిన వెంటనే వలతో పాటుగా ఎగిరిపోయి తమ ప్రాణాలు కాపాడుకుంటాయి
ఇలా ఎన్నెన్నో మిత్రలాభము కోసం చెప్పారు! గాని ఇక్కడ పౌలుగారు ఈ
ఐక్యత అనేది ఆత్మచేత లభిస్తుంది అంటున్నారు! అనగా రక్షించబడిన విశ్వాసి
పరిశుద్దాత్మ అనే వరము పొందుకుంటాడు బాప్తిస్మం పొందుకున్న తర్వాత! ఆ పరిశుద్ధాత్మ
మనలో ప్రేమ విశ్వాసముతో పాటుగా సమాధానం కలిగించి, అందరిలో ఐక్యత పెంపొందిస్తుంది!
కొలస్సీ 3:15
క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో
ఏలుచుండనియ్యుడి; ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి; మరియు కృతజ్ఞులై
యుండుడి.
ఈ వచనంలో క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ
హృదయములలో ఏలుచుండనియ్యుడి అంటున్నారు పౌలుగారు!
ఇక్కడ
పౌలుగారు సమాధానం కలిగియుండుడి అనడం లేదు—సమాధానం ఏలుచుండనియ్యుడి అంటున్నారు.
ఈ క్రీస్తు అనుగ్రహించు సమాధానం మనమీద అధికారం చేయాలి, ఏలాలి. అప్పుడే ఆయన శాంతి,
సమాధానం సంపూర్తిగా పొందుకోవచ్చు!
నేటిదినాల్లో
ఈ శాంతి- సమాధానం- ఐక్యత లేకనే కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నాయి! భార్యాభర్తలమధ్య
సమాధానం లేదు! తల్లిదండ్రులు- పిల్లలమధ్య సమాధానం లేదు! పిల్లల మధ్య సమాధానం లేదు!
సంఘంలో సమాధానం లేదు! సంఘకాపరి—సంఘపెద్దల
మధ్య సమాధానం లేదు! సంఘపెద్దలు—సంఘసభ్యులమధ్య
సమాధానం లేదు! సంఘకాపరులు/ సేవకుల మధ్య సమాధానం లేదు! వీరిమధ్య సమాధానమును తీసివేసి,
అశాంతిని కలిగించి, ఈర్ష్య—ద్వేషాలు
రగిలించి , వీరు కొట్టుకుంటుంటే, తగాదాలు పడుతుంటే సాతాను గాడు తెగ
సంభరపడుతున్నాడు. గెంతులేస్తున్నాడు! పరిశుద్ధాత్ముడు ఏడుస్తున్నాడు!!! ప్రియ
సంఘమా! ఒకసారి ఆలోచించు! ప్రియ దైవజనుడా! ఆలోచించు! పరిశుద్దాత్ముని సంతోషపరుస్తావా?
దుఃఖపరుస్తావా? ఆలోచించుకో!
ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ ఐక్యత ఉంటుంది.
ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది కీర్తన 133 ప్రకారము
1. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!
2. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల
అంచువరకు దిగజారిన పరిమళ తైలమువలె నుండును
3. సీయోను కొండల మీదికి దిగి వచ్చు హెర్మోను మంచు వలె
నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి
యున్నాడు.
కాబట్టి
మన జీవితాలలో ఆశీర్వాదం లేదు అంటే మనలో సమాధానం లేదన్నమాట! ఐక్యత లేదన్నమాట!
ఈ ఐక్యత—సమాధానం లేనందువలన
మొట్టమొదటి కుటుంబంలో హత్య జరిగింది! కయీను—హేబెలు మధ్య సమాధానం లేక, కయీను – హేబెలును చంపివేశాడు. శాపగ్రస్తుడయ్యాడు! యాకోబుగారి కుమారుల మధ్య
సమాధానం లేక తమ్ముడిని చంపబోయారు. చివరికి బానిసగా అన్యుడికి అమ్మివేశారు
యోసేపును!
అదే ఐక్యతగా ఉన్నప్పుడు ఏం చేశారు? అదే యాకోబు కుమారులు శత్రువుల మీద
పగతీర్చుకున్నారు. దానియేలు, షడ్రక్, మేషాక్, అబెద్నేగో సమాధానంగా, ఐక్యంగా
ప్రార్ధన చేశారు. రాజు మరచిపోయిన కలను చెప్పగలిగారు. తమ ప్రాణములు
కాపాడుకోగలిగారు. అసాధ్యాలను—సుసాధ్యం చేశారు. సింహపు నోళ్లను మూశారు. అగ్నిగుండములో ఏమీ ఇబ్బందులు
పడకుండా తిరిగి, ప్రాణములతో బయటికి వచ్చారు. ఆదిమ సంఘం, ఆది అపోస్తలులు కలసిమెలసి
ఉండి, సమైక్యతతో ఉన్నందువలన ఎన్నో అధ్బుతకార్యాలు చేసారు. భూలోకమును తల్లక్రిందులు
చేయువారు అనే బిరుదు పొందుకున్నారు! అదీ సమాధానమునకు ఉన్న శక్తి!
ఈ సమాధానమును బంధముచేత పోల్చారు పౌలుగారు.
ఎఫెసీయులకు 4: 1
కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును
కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు,
ఈ
సమాధానమను బంధము ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదము, శాంతి—సమాధానం, అద్భుతాలు ఉంటాయి.
లేకపోతే తగవులు, కొట్లాటలు, కోర్టులు ఉంటాయి!
అందుకే యేసుప్రబులవారు తన శిష్యులను సేవకు
పంపిస్తూ, మీరు వెళ్ళిన గృహానికి సమాధానము కలుగును గాక అని దీవించమంటున్నారు!
మత్తయి 10:12,13;
రోమీయులకు 5: 1
కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన
ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందము.
అలాచేస్తే
ఫిలిప్పీయులకు 4: 7
అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము
యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.
ఇంకా
2థెస్సలొనికయులకు 3: 16
సమాధానకర్తయగు ప్రభువు తానే యెల్లప్పుడును ప్రతి విధముచేతను
మీకు సమాధానము అనుగ్రహించును గాక. ప్రభువు మీకందరికి తోడైయుండును గాక.
అట్టి సమాధానము మరియు ఐక్యత మనలో లేకపోతే ఇప్పుడే సమాధాన పడుదాం! కారణం
యోహాను గారు రాస్తున్నారు తన సహోదరున్ని ప్రేమించని వాడు, తన సోదరునితో సమాధానముగా
ఉండని వాడు వేషధారి, నరహంతకుడు, 1 యోహాను 4,5 అధ్యాయాలు. . . కాబట్టి అందరితో
సమాధానముగా ఉందాం. పౌలుగారు అంటున్నారు సఖ్యమైతే సమస్తమైన వారితో సమాధానముగా
ఉండుడి. రోమా 12:18;
అట్టి
సమాధానము, శాంతి మనందరం పొందుకుందుము గాక!
క్రీస్తు
అనుగ్రహించు సమాధానము మన హృదయాలను ఏలుచుండును గాక!
ఆమెన్!
ఆమెన్! ఆమెన్!
*ఎఫెసీ పత్రిక -53వ భాగం*
*పిలుపుకి తగ్గ జీవితం-9*
ఎఫెసీ 4:1—3
1. కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు
ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు,
2. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో
కూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,
3. ప్రభువునుబట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు
కొనుచున్నాను.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం!
ప్రియులారా! రెండవ వచనంలో కనబడే మరో గొప్ప విషయం మరియు ఈ పత్రిక యొక్క
ముఖ్య ఉద్దేశం: మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లు .. నడుచుకోవాలి ! మనము దేనికోసం
పిలువబడితిమో తెలుసుకుని దానికి తగినట్లుగా జీవించాలి అంటున్నారు! మొదటి
అర్ధభాగంలో దేవుడు మనలను ఎలా ప్రేమించారో ఎంతగా ప్రేమించారో, మన పిలుపు ఏర్పాటు
ఎటువంటిదో చూసుకున్నాము! ఎందుకు పనికిరాని మనలను దేవుడు తన స్వకీయజనమైన ఇశ్రాయేలు
ప్రజలతో సహ పౌరులుగా ఉండటానికి ఆయన వాగ్ధానాలకు వారసులుగా తన రాజ్యమునకు మహిమకు
వారసులుగా పౌరులుగా ఉండటానికి పిలువబడ్డాము కాబట్టి ఆ పిలుపుకి తగిన జీవితం
జీవించాలి!
మన పిలుపు సింహము వలె రాజులుగా రారాజు వారసులుగా ఉండటానికి
పిలువబడ్డాము కనుక సింహాలు చేసే లేక రాజులు చేసే పనులే చేయాలి గాని పందులు లాగా
రోడ్లు మీద తాగి తందనాలు ఆడి డ్రైనేజీలో పందితో పాటుగా దొరలడానికి కానేకాదు! మన
దేవుడు పరిశుద్దుడు కనుక మనము కూడా పరిశుద్దమైన పవిత్రమైన పనులే చేయాలి గాని
అపవిత్రమైన పనులు చేయనేకూడదు!
ఆదాముగారు హవ్వమ్మ గారు దేవుని పిల్లలుగా పరిశుద్దులుగా ఏదెను
తోటలో దేవునితో గడపడానికి పిలువబడితే పాము మాటలు ఆలకించి శరీరాశ నేత్రాశ
జీవపుడంబము పొందుకుని తినరాని ఫలము తిని తాము పిలువబడిన పిలుపుకి ఏర్పాటుకి దూరమై
తరుమబడి శపించబడ్డారు!
అబ్రాహాము గారు పిలువబడిన పిలుపుకి తగిన జీవితం జీవించి
విశ్వాసులుకు తండ్రిగా మనకు మాదిరిగా జీవించారు!
అయితే లోతుగారు లోకాన్ని ఆశించి కొంతదూరం మంచిదారిలో పయనించినా
తర్వాత తప్పిపోయారు ! ఇక తన భార్య దేవుని ఏర్పాటుని కాదని ఉప్పు స్తంభమై పోయింది!
తన కూతుర్లు భూలోకంలో ఎవరూ చేయని ఘోరమైన పాపం చేసి నాశనానికి పోయారు! అక్కడ
వారిమాటలు వింటే ఎంతో విచిత్రంగా అబద్దంగాను ఉంటాయి. ఆది 19:31 అట్లుండగా అక్క తన చెల్లెలితో మన
తండ్రి ముసలి వాడు; సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును
లేడు. ఏమండీ కేవలం 4 పట్టణాలు మరియు కొన్ని పల్లెటూర్లు ప్రజలు మాత్రము కాలిపోయారు
గాని మిగిలిన జనాలు ఉన్నారు కదా! కనీసం తన తాతగారు అబ్రహాము గారి దగ్గర కొన్నివేల
మంది పనివారున్నారు- వారిలో ఎవరినైనా చేసుకోవచ్చు గదా! గాని వీరికి కళ్ళు మూసుకుని
పోయి అర్జంటుగా వారికి కామం అవసరమైంది కాబట్టే ఇలాంటి పనికిమాలిన పని చేశారని నా
ఉద్దేశం!
మోషే గారు తాను పిలువబడిన పిలుపు నుండి తప్పిపోలేదు!
సంసోనూ గారి పిలుపు నాజీరు చేయబడి ఇశ్రాయేలు ప్రజలకు
న్యాయాధిపతిగా రక్షకుడిగా ఉండాలని, గాని కామవాంఛ అతనిని పిలుపు తగిన జీవితము నుండి
వెడలిపోయేలా కళ్ళు పీకించుకుని ఘోరమైన చావు చచ్చేలా చేసింది!
దావీదు గారి పిలుపు రాజుగా ఇశ్రాయేలు విమోచకునిగా ఒక
ప్రవక్తగా ఉండాలని, గాని ఒకసారి తప్పుడు బాటను పడితే దేవుని హెచ్చరికను ఆలకించి
పశ్చాత్తాప పడి పరుపు కొట్టుకుని పోయే విధంగా కన్నీరు కార్చి దేవుని పాదాలు
పట్టుకున్నారు, దేవుడు క్షమించారు!
ఇలా
చూసుకుంటే పాత నిబంధన భక్తులు గాని క్రొత్త నిబంధన భక్తులు గాని తాము పిలువబడిన
పిలుపునుండి తొలగిపోలేదు!
దేమా అనేవాడు దేవుని పరిచారకుడుగా పిలువబడి పౌలుగారి పాదాలు
దగ్గర నేర్చుకుని సుమారు పది సంవత్సరాలకు పైగా కొన్ని సంఘాలలో పరిచారకునిగాను
బిషప్ గాను పనిచేసి ధనమును ఇహలోకమును ఆశించి వెండిని ఆశించి థెస్సలొనికయ దగ్గర
కొండమీద నుండి జారీ పడిపోయాడు!
నిజానికి పాత నిబంధన భక్తులకు వారు
పొందుకున్న పిలుపు ఏర్పాటు ఏమిటో మనకు తెలిసినంత వివరంగా తెలియదు! నిజమైన దేవుడు
వారిని పిలుచుకున్నాడు గనుక నమ్మకంగా ఉండాలి అంతే తెలుసు వారికి! మానాకైతే మన
పిలుపు ఏమిటి, దాని విశిష్టత ఏమిటి? ఎలా ఉండాలి ఇదంతా దేవుడు మనకోసం వివరంగా రాసి
ఉంచారు! దైవసేవకులు భోధిస్తున్నారు! కాబట్టి మన పిలుపును ఏర్పాటును తెలుసుకుని
దానికి తగినట్లుగా మనంజీవించాలి! అలా కాకపోతే ఏమి జరుగుతుందో మీదన చూసుకున్నాము!
కాబట్టి
మనలను మనం పరిశీలన చేసుకుని సరిచేసుకుందాం!
యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు పిలువబడిన వారు అనేకులు
గాని ఏర్పరచబడిన వారు కొంతమందే! మత్తయి
22:14
పేతురుగారు అంటున్నారు: మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం
చేసుకోండి 2 పేతురు 2:10
కాబట్టి
పిలుపుకు తగిన జీవితం జీవిద్దాం!
దైవాశీస్సులు
!
*ఎఫెసీ పత్రిక -54 భాగం*
*పిలుపుకి తగ్గ జీవితం-10*
ఎఫెసీ 4:1—3
1. కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు
ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు,
2. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో
కూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,
3. ప్రభువునుబట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు
కొనుచున్నాను.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం!
ప్రియులారా!
రెండవ వచనంలో కనబడే మరో గొప్ప విషయం మరియు ఈ పత్రిక యొక్క
ముఖ్య ఉద్దేశం: మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లు .. నడుచుకోవాలి ! మనము దేనికోసం
పిలువబడితిమో తెలుసుకుని దానికి తగినట్లుగా జీవించాలి అంటున్నారు! ఇంతకీ మనం
దేనికోసము పిలువబడితిమో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం! దీనికోసం అనేకసార్లు
చూసుకున్నా సందర్భం కాబట్టి మరోసారి చూసుకుందాం!
పౌలుగారు
అంటున్నారు: పరిశుద్దులుగా ఉండుటకు
పిలువబడ్డారు ...
రోమీయులకు 1: 2
దేవుని సువార్తనిమిత్తము ప్రత్యేకింపబడినవాడునైన పౌలు రోమాలో
ఉన్న దేవుని ప్రియులకందరికి అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికందరికి
(శుభమని చెప్పి) వ్రాయునది.
చూశారా
మనము పరిశుద్దులముగా ఉండాలనే దేవుడు , మనలను పిలిచారు గాని ఈ పాపపు లోకంలో పాపపు
పనులు చేసి పాపులుగా మారడానికి కానేకాదు! అందుకే పౌలుగారు అంటున్నారు: తన ఘటమును
కాపాడుకోవడమే దేవుని చిత్తము....1థెస్సలొనికయులకు
4: 5
పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లు
కాపాడుకొనవలెనో అది యెరిగియుండుటయే దేవుని చిత్తము.
యాకోబు
గారు భక్తికి ఇచ్చిన నిర్వచనంలో అంటున్నారు ఇహలోక మాలిన్యము అంటకుండా తన ఘటమును
కాపాడుకోవడమే భక్తీ.... 1:27
తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి
యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు,
ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.
కాబట్టి
ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్దులుగా ఉండాలి ....లేవీ 11:44,45; 21:8;
ఇంకా
పరిశుద్ధత లేకుండా ఎవరూ తండ్రిని చూడలేరు పరలోకం చేరలేరు అని గ్రహించాలి
హెబ్రీయులకు 12: 14
అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు
ప్రయత్నించుడి. పరిశుద్ధతలేకుండ ఎవడును ప్రభువును చూడడు.
ఇక
అదే పౌలుగారు దేనికోసం పిలువబడిన వారు అని చెబుతున్నారు అంటే కొంతమంది
అపోస్తలులుగా ఉండటానికి పిలువబడ్డారు!
రోమీయులకు 1: 1
యేసు క్రీస్తు( క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని
అర్ధము) దాసుడును, అపొస్తలుడుగా నుండుటకు పిలువబడినవాడును,
1కోరింథీయులకు 1: 1
దేవుని చిత్తమువలన యేసుక్రీస్తు (క్రీస్తు అను శబ్దమునకు
అభిషక్తుడని అర్ధము) యొక్క అపొస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన
సొస్తెనేసును
ఇదే వచనాన్ని ఇంకా మిగిలిన వాటికి వర్తింపజేస్తే కొంతమంది
కాపరులుగా ఉండటానికి, కొంతమంది ప్రవక్తలగా ఉండటానికి, కొంతమంది భోధకులుగా
ఉండటానికి కొంతమంది పరిచర్య చేయడానికి, కొంతమందిని విశ్వాసులుగా ఉండటానికి,
కొంతమందిని అద్భుతాలు చేయడానికి పిలిచారు. అయితే వీరందరినీ పరిశుద్దులుగా
ఉండటానికే పిలిచారు అంటి గ్రహించాలి.........
1కోరింథీయులకు 12: 28
మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులు గాను, పిమ్మట
కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని
అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను,
కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను,
కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను.
ఇక స్వాతంత్రము
పొందటానికి పిలువబడ్డారు.
1కోరింథీయులకు 7: 22
ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్ర్యము
పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడైయుండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు.
ఇంకా మనందరిని నిత్యమైన స్వాస్త్యము పొందటానికి
పిలువబడ్డాము... హెబ్రీ 9:15
ఈ హేతువుచేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధములనుండి
విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును
గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్తనిబంధనకు మధ్యవర్తి యైయున్నాడు.
నిత్యమైన
స్వాస్త్యము అంటే: పరలోకంలో మనము అనుభవించబోయే మేలులు అన్నమాట!!!
అసలు
నీ పిలుపు ఎంత మహత్తరమైనదో నీకు తెలుసా?
ఒకసారి
రోమా 8:28—౩౦ చదువుదాం....
28. దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున
పిలువబడిన వారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.
29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు,
దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని
ముందుగా నిర్ణయించెను.
30. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను;
ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో
వారిని మహిమ పరచెను.
మరి
ఇంతటి ప్రశస్తమైన పిలుపు, ఏర్పాటు కదా దానికి తగిన జీవితం జీవిస్తున్నావా?
అందుకే పేతురు గారు నీ పిలుపును ఏర్పాటును నిశ్చయం
చేసుకోమంటున్నారు
2పేతురు 1: 10
అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము
చేసికొనుటకు మరి జాగ్రత్తపడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును
తొట్రిల్లరు.
రోమా 1:7, 9:24
మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు
పిలువబడియున్నారు.
ఇంకా దేవుడు నిన్ను నన్ను దేనికి పిలిచారు అంటే ఆయన
కుమారుని సహవాసానికి పిలిచారు
1కొరింథీ 1:9
మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు
మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు.
అది చాలా ఉన్నతమైనది
ఫిలిప్పీ 3:14
క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు
బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను.
ఇంకా మనకు పాప విముక్తి దయచేయాలని మనలను పిలిచారు
2తిమోతికి 1: 10
క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షత వలన
బయలుపరచబడినదియునైన తన కృపను బట్టియు, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన
మనలను పిలిచెను. ఆ క్రీస్తుయేసు, మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్తవలన
వెలుగులోనికి తెచ్చెను.
ఇంకా చీకటినుండి తనవెలుగు లోనికి పిలిచారు! ఎందుకోసం
పిలిచారు అంటే తన గుణాతిశయములను ప్రకటించడానికి:
1పేతురు 2:9
అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి
మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును,
రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.
ఇంకా దీవెనకు ఆశీర్వాదాలకు వారసులవ్వడానికి
1పేతురు 3: 9
ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు
ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి.
ఇంకా శాశ్వత మహిమకు పిలిచారు
1పేతురు 5: 10
తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన
సర్వకృపానిధియగు దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట,తానే మిమ్మును
పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును.
ఇంకా గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడ్డారు.
ప్రకటన గ్రంథం 19: 9
మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను గొఱ్ఱెపిల్ల పెండ్లివిందుకు
పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము; మరియు ఈ మాటలు దేవుని యథార్థ మైన మాటలని నాతో
చెప్పెను.
గమనించాలి- ఈ
గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు అతిశ్రేష్టులు అన్నమాట! గమనించాలి
దేవునికి పక్షపాతం అనేది లేదు! అందరూ దేవునికి సమానులే! కాబట్టి రక్షణ పొందిన వారినందరినీ దేవుడు గొర్రెపిల్ల పెండ్లి
విందుకు పిలిచినా కొందరే ఆ విందులో పాల్గొనే అర్హతను పొందుకుంటారు! వారు ఎవరంటే
జయించిన వారు! జయజీవితం పొందిన వారు! తమ ఘటమును కాపాడుకున్నవారు! తమ సాక్ష్యమును
కాపాడుకున్నవారు! వాక్యానుసారమైన జీవితం,
సాక్ష్యార్ధమైన జీవితం, ఆత్మానుసారమైన జీవితం కలిగి పరిశుద్ధంగా జీవించిన వారు
అన్నమాట! వీరే జయించిన వారు! పాపము మీద
జయం! లోకాశల మీద జయం! ఆలోచనలో జయం! తలంపులలో జయం! చూపులో జయం! అన్నింటిమీద జయం
కలిగిన జయవీరులు అన్నమాట! వీరే గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు!
ఇంకా బాగా అర్ధం
చేసుకోవాలంటే గొర్రెపిల్ల పెండ్లివిందు ఎప్పుడు జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది?
సంఘము ఎత్తబడిన తర్వాత మధ్యాకాశంలో జరుగుతుంది. అనగా ఈ గొర్రెపిల్ల పెండ్లివిందులో
ఎవరుంటారు? ఎత్తబడిన వారు! ఎత్తబడిన వారే జయించిన వారు! వీరే అర్హులు!
ప్రియ దైవజనమా! నీవు నేను ఈ గొర్రెపిల్ల
పెండ్లివిందుకు పిలువబడ్డాము కదా! మరి అందుకు తగినట్లు జీవిస్తున్నావా? ఎత్తబడే
గుంపులో నీవున్నావా? ఒకవేళ ఈరోజే యేసయ్య వస్తే ఈరోజే సంఘము ఎత్తబడితే నీవు ఎత్తబడతావా?
అటువంటి జీవితం జీవిస్తున్నావా? విడువబడితే ఆ శ్రమలు నీవు పడలేవు అని నీకు
గుర్తుందా?
అందుకే
పౌలుగారు అంటున్నారు ఎఫెసీ 4:2లో మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా జీవించండి.
దీర్ఘశాంతముతో సంపూర్ణ వినయంతో సాత్వికముతో నడుచుకోండి అంటున్నారు....
పేతురు
గారు అంటున్నారు:
1 Peter(మొదటి పేతురు) 1:14,15,16
14. నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై
యుండుడని వ్రాయబడియున్నది.
15. కాగా మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞానదశలో మీ
కుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక,
16. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము
మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.
అందుకే
యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు: పిలువబడిన వారు అనేకులు అయితే ఏర్పరచబడిన వారు
కొందరే!!!
మత్తయి 22: 14
కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరే అని
చెప్పెను.
మరి
నీవు పిలువబడ్డావు కదా, ఏర్పరచబడిన గుంపులో ఉన్నావా? ఎత్తబడే గుంపులో ఉన్నావా?
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -55వ భాగం*
*పిలుపుకి తగ్గ జీవితం-11*
ఎఫెసీ 4:4—6
4. శరీర మొక్కటే, ఆత్మయు ఒక్కడే; ఆ ప్రకారమే మీ
పిలుపువిషయమై యొక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి.
5. ప్రభువు ఒక్కడే, విశ్వాస మొక్కటే, బాప్తిస్మ మొక్కటే,
6. అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా
ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలోఉన్నాడు.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం!
ప్రియులారా! ఇక నాల్గవ వచనం నుండి
విశ్వాసులంతా క్రీస్తులో ఐక్యమై ఉన్నారు అనడానికి ఋజువులు చూపిస్తున్నారు! ఇక్కడ
అంటున్నారు 4 వ వచనంలో శరీర మొక్కటే ఆత్మయు ఒక్కడే అంటున్నారు! ఎందుకు అన్నారు
అంటే అలాగే మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణయందు ఉండటానికే మీరు పిలువబడ్డారు
అంటున్నారు!
సరే వివరంగా చూసుకుంటే మొదటగా శరీర మొక్కటే
అంటున్నారు! ఏ శరీరం కోసం పౌలుగారు చెబుతున్నారు? అంటే మొదట అధ్యాయం నుండి
పౌలుగారు చెబుతున్నారు మనమందరం అనగా యూదులమైన మేము, అన్య జనులలోనుండి రక్షించ బడిన
విశ్వాసులయిన మీరు అందరం ఇప్పుడు
క్రీస్తులో ఒక్కటే శరీరంగా ఉన్నాము అంటున్నారు!
ఎఫెసీయులకు 1
22. మరియు సమస్తమును ఆయన పాదములక్రింద ఉంచి, సమస్తముపైని
ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను.
23. ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపుచున్న
వాని సంపూర్ణతయై యున్నది.
ఎఫెసీ 3:6 ఈ మర్మమేదనగా అన్యజనులు, సువార్తవలన
క్రీస్తుయేసునందు, యూదులతోపాటు సమానవారసులును, ఒక శరీరమందలి సాటి అవయవములును,
వాగ్దానములో పాలివారలునై యున్నారను నదియే.
కాబట్టి
పౌలుగారు చెప్పే శరీరమొక్కటే అనగా క్రీస్తు శరీరములో అవయవములుగా ఉన్న మనం అనగా
క్రీస్తుయేసు సార్వత్రిక సంఘముగా ఉన్న ఆయన యొక్క శరీరములో అవయవములుగా ఉన్న మనము
ఒకే శరీరానికి చెందిన వారము అంటున్నారు! ఇప్పుడు ఆ శరీరము ఒక్కటే గాని అనేక
శరీరాలు కావు అంటున్నారు!
ఇక
తర్వాత ఆత్మ కూడా ఒక్కడే అంటున్నారు! ఎఫెసీ
1:13 మీరును సత్యవాక్యమును, అనగా మీ
రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత
ముద్రింపబడితిరి.
ఇంక
ఆత్మచేత ఎందుకు మనకు ముద్ర వేశారు
అంటే 2:22
ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమై యుండుటకు కట్టబడుచున్నారు.
కాబట్టి
ఆత్మ ఒక్కడే! ఆ ఆత్మ లేకుండా మనము ఆయన అనగా దేవునికి నివాస స్థలముగా ఉండేలాగా
కట్టబడలేము! ఇంకా వివరంగా చెప్పాలంటే పరిశుద్దాత్మకు నివాస స్థలంగా ఉండేలా
కట్టబడలేము!
1కోరింథీయులకు 6:19
మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న
పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,
అందుకే ఆయనాత్మ లేనివాడు ఆయన వాడు కాదు అని బైబిల్
చెబుతుంది!
రోమీయులకు 8:9
దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము
గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే
వాడాయనవాడు కాడు.
ఆయనవాడు కాకపోతే ఎవని వాడు అవుతారు మరి? ఆయన
వారు కాకపోతే సాతాను గాడి బ్యాచ్ కి చెందుతారు అని గ్రహించాలి! అందుకే
పరిశుద్దాత్మ దేవుణ్ణి పొందుకోవడమే కాకుండా ఆ ఆత్మచేత అనునిత్యము నింపబడుతూ
ఉండాలి!..
ఇక్కడ మరో అనుమానం తీర్చనీయండి! ఇక్కడేమో పౌలుగారు ఆత్మ ఒక్కడే అని వ్రాస్తే
ప్రకటన గ్రంధంలో పరిశుద్దాత్మ పూర్ణుడై యోహాను గారు అంటున్నారు ప్రకటన 1, 2
అధ్యాయాలలో దేవుని ఏడాత్మలు అంటున్నారు! మరి రెండు గ్రంధాలు రాసినవారు వేరైనా
వ్రాయించింది పరిశుద్దాత్మ దేవుడే కదా?!! మరి ఎందుకంత గందరగోళం!!!
రెండు గ్రంధాలు వ్రాయించింది పరిశుద్ధాత్మ దేవుడే! మరి ఏది
నిజం అంటే రెండూ నిజమే! సరే దేవుని ఏడాత్మలు అనగా యెషయా గ్రంధంలో ఇలా ఉంది 2:2 2.
యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని
యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును! ఇక్కడ దేవుని
పరిశుద్దాత్మకు గల ఏడు లక్షణాలు చూపిస్తున్నారు! అనగా ఒకే పరిశుద్దాత్మ దేవునిలో ఈ
ఏడు లక్షణాలు పనిచేస్తున్నాయి! అందుకే ప్రకటన గ్రంధంలో దేవుని ఏడాత్మలు
అన్నారు! గాని ఆత్మ అనే దేవుడు నిజానికి
ఒక్కడే అని గ్రహించాలి!
ఇక
ఈ వచనంలో చివరగా అంటున్నారు ప్రకారమే మీ పిలుపువిషయమై యొక్కటే నిరీక్షణ యందుండుటకు
పిలువబడితిరి! ఇక్కడ నిరీక్షణ కూడా ఒక్కటే అంటున్నారు! ఏ నిరీక్షణ అది? శుభప్రధమైన
నిరీక్షణ అని మొదటి అధ్యాయం ధ్యానంలో చూసుకున్నాము! అనగా యేసుక్రీస్తుప్రభులవారు
అతి త్వరలో ఈ భూలోకానికి రాబోతున్నారు- ఎందుకు రాబోతున్నారు అంటే
యోహాను 14:2,3 వచనాలలో అంటున్నారు 2. నా తండ్రి యింట అనేక
నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను.
3. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు
స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని
పోవుదును. కాబట్టి యేసుక్రీస్తుప్రభులవారు అతి త్వరలో తన పిల్లలను తనతో పాటు ఉండేలా ఈ
భూలోకానికి వచ్చి తన పిల్లలను తీసుకుని పోబోతున్నారు! అప్పుడు మనము మేఘముల మీద
కొనిపోబడి దేవునితో దేవుని పరిశుద్ధ సేనలతో దూతలతో పాత నిబంధన క్రొత్త నిబంధన
భక్తులతో కలసి ఆనందించ బోతున్నాము! ఇదే నిరీక్షణ! శుభప్రధమైన నిరీక్షణ అంటారు! ఈ
నిరీక్షణ కూడా ఒక్కటే అని రాస్తున్నారు పౌలుగారు!
ప్రియ
సహోదరీ సహోదరుడా అటువంటి నిరీక్షణ, అటువంటి ఆత్మను పొందుకున్నావా? లేకపోతే నేడే పశ్చాత్తాప పడి దేవుని పాదాలు
పట్టుకుని శరణు వేడి దేవునితో సమాధాన పడి ఆయన రాజ్యానికి ఆయన పరలోకానికి వారసుడిగా
వారసురాలిగా మారిపో!!!!
దైవాశీస్సులు
!
*ఎఫెసీ పత్రిక -56వ భాగం*
*పిలుపుకి తగ్గ జీవితం-12*
ఎఫెసీ 4:4—6
4. శరీర మొక్కటే, ఆత్మయు ఒక్కడే; ఆ ప్రకారమే మీ
పిలుపువిషయమై యొక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి.
5. ప్రభువు ఒక్కడే, విశ్వాస మొక్కటే, బాప్తిస్మ మొక్కటే,
6. అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా
ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలోఉన్నాడు.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం!
ప్రియులారా! ఇక నాల్గవ వచనం నుండి విశ్వాసులంతా క్రీస్తులో ఐక్యమై ఉన్నారు
అనడానికి ఋజువులు చూపిస్తున్నారు! ఇక్కడ అంటున్నారు 4 వ వచనంలో శరీర మొక్కటే
ఆత్మయు ఒక్కడే అంటూ ఇంకా అంటున్నారు ప్రభువు ఒక్కడే ఇంకా విశ్వాసము ఒక్కటే మరియు
బాప్తిస్మము కూడా ఒక్కటే అంటున్నారు! ప్రభువు అనగా మన రక్షకుడైన యేసుక్రీస్తుప్రభులవారు
, విశ్వాసం అనగా మన ప్రభువునందు మనకున్న విశ్వాసము, బాప్తిస్మము అనగా మనం రక్షణ
పొందుకున్నప్పుడు పొందుకున్న నీటి బాప్తిస్మము అని అర్ధం చేసుకోవాలి!
ఇక్కడ జాగ్రత్తగా పరిశీలన చేస్తే పౌలుగారు తాను రాసే ప్రతి పత్రికలలోనూ
ఒకమాట రాస్తూ ఉంటారు మన తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు
మీకు కృపయు సమాధానమును కలుగును గాక. ఇది దాదాపు అన్నీ పత్రికలలోనూ కనిపిస్తుంది!
అయితే మొదటి కోరింథీ పత్రిక 8 వ అధ్యాయంలో అంటున్నారు పౌలుగారు : 6. ఆకాశమందైనను
భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి;
ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు
ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా
కలిగినవారము. ఈయన కోసం దూతలు గొల్లలతో చెబుతున్నారు లూకా సువార్త రెండో అధ్యాయంలో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు
పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు! కాబట్టి ఈ రక్షకుడైన ప్రభువు ఒక్కడే!
ఆయనే యేసుక్రీస్తుప్రభులవారు! ఈ విషయం కోసం అనేక మారులు ప్రస్తావించ బడింది బైబిల్
లో!
మత్తయి 1:21; అపో. కార్యములు 4:12; 1
యోహాను 4:14. క్రొత్త నిబంధన గ్రంథంలో యేసయ్యను
16 సార్లు “ముక్తిప్రదాత” లేక “రక్షకుడు” అనడం కనిపిస్తుంది (లూకా 1:47
చూడండి.). మత్తయి 1:1 దగ్గర “అభిషిక్తుడు”
అన్నారు . దేవదూత యేసుప్రభువును “ప్రభువు” అంటున్నాడు. లూకా 1:43; మత్తయి
22:41-45; అపో. కార్యములు 2:36; 1 కోరింథీయులకు 8:6; ఫిలిప్పీయులకు 2:10-11;
ఎఫెసీయులకు 4:5 కూడా ఒకసారి చదవండి .
గ్రీకులో ప్రభువు అనే అర్థాన్ని
ఇచ్చే పదం “కురియొస్”. “యెహోవా”ను అనువదించడానికి ఈ పదం వాడారు (యెహోవా అనేది పాత
నిబంధన గ్రంథంలో దేవునికి సామాన్యంగా
వాడబడిన పేరు ఇది . నిర్గమకాండము 3:14-15
).
క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుప్రభువును కొన్ని వందల సార్లు “ప్రభువు” అన్నారు.
ఆయన ప్రభువులందరికీ ప్రభువు (ప్రకటన
గ్రంథం 19:6).
ఆయన పేరున దీవెనతో బైబిలు ముగిసింది
(ప్రకటన గ్రంథం 22:21).
యేసుక్రీస్తు ప్రభులవారు యెహోవాదేవుని అవతారమని ఈ క్రింది రిఫరెన్సులు
రుజువు చేస్తున్నాయి: మత్తయి 3:3; మత్తయి 23:27; యోహాను 8:24-25, యోహాను 8:58;
యోహాను 10:11; యోహాను 12:41; అపో. కార్యములు 2:21; రోమీయులకు 10:9-10, రోమీయులకు
10:13; 1 కోరింథీయులకు 1:31; 1 కోరింథీయులకు 2:8; 1 కోరింథీయులకు 10:4; ఎఫెసీయులకు
4:10; ఫిలిప్పీయులకు 2:10-11; తీతుకు 2:13; హెబ్రీయులకు 1:10-12; యూదా 1:5; ప్రకటన
గ్రంథం 19:16.
యేసు దేవుడని వెల్లడించే ఇతర
రిఫరెన్సులకోసం ఫిలిప్పీయులకు 2:6 చూడండి. పాత నిబంధనలో ఆదికాండము 16:7;
నిర్గమకాండము 3:14; కీర్తనల గ్రంథము 23:1; కీర్తనల గ్రంథము 24:7-10; కీర్తనల
గ్రంథము 96:10-13; యెషయా 6:1; యెషయా 9:6; జెకర్యా 12:10; మొ।। చూడండి.
కాబట్టి ఇక్కడ మనకు త్రిత్వము
కనిపిస్తుంది! త్రిత్వములో కనబడే ప్రభువు! ఆయన యేసుక్రీస్తుప్రభులవారు !
ఇక విశ్వాసం కూడా ఒక్కటే అంటున్నారు! విశ్వాసం కోసం అనేకసార్లు
చూసుకున్నాము! అది దేవునియందలి మనకున్న విశ్వాసము! అదే మనలను నడిపిస్తుంది మనలను
పోషిస్తుంది! మనకు విజయం చేకూర్చుతుంది! చివరకు అదే మనలను ప్రభువుతో మరియు
దేవునితో ఐక్యం చేస్తుంది! విశ్వాసం లేకుండా ఎవడూ తండ్రి యొద్దకు చెరలేరు! ఇంకా
విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులుగా ఉండటం అసాధ్యం అని బైబిల్ సెలవిస్తుంది! ఈ పత్రిక మొదటి రెండు అధ్యాయాలలో దీనికోసం బాగా
చెప్పారు పౌలుగారు :
13. మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని,
క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి.
15. ఈ హేతువుచేత, ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమునుగూర్చియు,
పరిశుద్ధులందరియెడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు, నేను వినినప్పటినుండి..
ఇక 2:8 లో అంటున్నారు 8. మీరు విశ్వాసముద్వారా కృపచేతనే
రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.
కాబట్టి
ఈ విశ్వాసం ఒక్కటే! ఇదే తప్ప మనలో మరో విశ్వాసం మరో దేవునియందు విశ్వాసము ఉండకూడదు
అని గ్రహించాలి!
దైవాశీస్సులు
!
*ఎఫెసీ పత్రిక -57వ భాగం*
*పిలుపుకి తగ్గ జీవితం-13*
ఎఫెసీ 4:4—6
4. శరీర మొక్కటే, ఆత్మయు ఒక్కడే; ఆ ప్రకారమే మీ
పిలుపువిషయమై యొక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి.
5. ప్రభువు ఒక్కడే, విశ్వాస మొక్కటే, బాప్తిస్మ మొక్కటే,
6. అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా
ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలోఉన్నాడు.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం!
ప్రియులారా!
ఇక నాల్గవ వచనం నుండి విశ్వాసులంతా క్రీస్తులో ఐక్యమై ఉన్నారు అనడానికి ఋజువులు
చూపిస్తున్నారు! ఇక్కడ అంటున్నారు 4 వ వచనంలో శరీర మొక్కటే ఆత్మయు ఒక్కడే అంటూ
ఇంకా అంటున్నారు ప్రభువు ఒక్కడే ఇంకా విశ్వాసము ఒక్కటే మరియు బాప్తిస్మము కూడా
ఒక్కటే అంటున్నారు
(గతభాగం తరువాయి)
ఇక తరువాత
బాప్తిస్మం కూడా ఒక్కటే అంటున్నారు! ఇలా
అనడానికి కొందరు బాప్తిస్మములు అనేకాలు అనడం ప్రారంబించారు! అయితే ఇక్కడ
చాలామందికి పౌలుగారు ఏ బాప్తిస్మము కోసం మాట్లాడుతున్నారో స్పష్టముగా లేదు అంటారు!
నాకైతే నీటి బాప్తిస్మము కోసమే మాట్లాడుచున్నట్లు అనిపిస్తుంది! ఈ రోజులలో చిలకరింపు బాప్తిస్మము, జెండా క్రింద
బాప్తిస్మము (రక్షణ సైన్యం), నీటి బాప్తిస్మము లాంటివి ఉన్నాయి! వీటిలో ఏది
సరియైనది అంటే బైబిల్ లో యోహాను గారు నీటి బాప్తిస్మము ఇచ్చినట్లు, దానినే
యేసుక్రీస్తుప్రభులవారు కూడా పొందుకున్నారు! ఇంకా ఆయన శిష్యులు కూడా అపోస్తలుల
కార్యముల ప్రకారం నీటి బాప్తిస్మము అనగా నీటిలో పూర్తిగా మునిగి బాప్తిస్మము
తీసుకోవడమే మనకు కనిపిస్తుంది. కాబట్టి సరియైన బాప్తిస్మము నీటి బాప్తిస్మము అని
ఖరాకండిగా చెప్పగలము! మరికొందరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి
బాప్తిస్మము పొందాలి ఎందుకంటే ఏసయ్య అలానే మనకు ఆజ్ణ ఇచ్చారు అంటూ, మరికొందరు ఆది
అపోస్తలులు ఆత్మను పొందుకున్నప్పుడు వారు పొందుకున్న ప్రత్యక్షత యేసు నామంలో
బాప్తిస్మము. కాబట్టి తండ్రి కుమార పరిశుద్దాత్మ నామంలో పొందిన బాప్తిస్మము
చెల్లదు, యేసునామంలో పొందినదే చెల్లుతుంది అంటారు!
మరి దీనిలో ఏది సరైనది???
జవాబు: రెండూ సరైనవే!
ఎందుకంటే తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని
యొక్కయు నామము లోనికి అంటే యేసునామములోనికే వారిని లేక మనలను బాప్తిస్మము ఇచ్చారు
కాబట్టి రెండూ వేరువేరు కావు రెండు ఒకటే అని గ్రహించమని మనవి!
ఇక దైవ సేవకులకు నాదో చిన్న అభ్యర్ధన!!! అయ్యా మీరు
బాప్తిస్మము ఇచ్చేటప్పుడు తండ్రియొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు
నామము అనగా యేసునామములోనికి నిన్ను బాప్తిస్మము ఇస్తున్నాను అని చెబితే మనకు గాని
వారికి గాని ఎటువంటి అభ్యంతరాలు ఉండవని నా ఉద్దేశం!!
అసలు బాప్తిస్మము అనగా ఏమిటి? ముంచబడుట అని! గ్రీకు పదాన్ని నేరుగా
అనువదిస్తే క్రీస్తు శరీరమై ఉన్న సంఘంలోకి ఒకే ప్రవేశం అని అర్థం చెప్పుకోవచ్చు!
రోమా 6:3—4 వచనాలలో అంటున్నారు:
3. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన
మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా?
4. కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు
లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము
బాప్తిస్మమువలన మరణములో పాలు పొందుటకై ఆయనతోకూడ పాతిపెట్టబడితివిు.
పౌలుగారు ఇక్కడ మాట్లాడుతున్న బాప్తిసం ఏమిటి? బాప్తిసం
అనేది గ్రీకు భాషలోనుంచి వచ్చిన పదం. ఇక్కడ “బాప్తిసం పొందడం” అని కాకుండా ఆ
గ్రీకు పదాన్ని తెలుగులోకి అనువదిస్తే ఇలా ఉంటుంది – “క్రీస్తులోకి ముంచబడిన”,
లేక “క్రీస్తులోకి ప్రవేశించిన”, లేక “యేసుక్రీస్తులోకి తీసుకురాబడిన”. మనం “ఆయన
మరణంలో ముంచబడ్డామని”, లేక “ఆయన మరణంలో ప్రవేశించామని”, లేక “ఆయన మరణంలోకి
తీసుకురాబడ్డామని” అనవచ్చు. ఆ విధంగా ముంచబడడమంటే క్రీస్తులోకి మునగడమని అర్థం
గానీ నీటిలోకి కాదు. అలాంటప్పుడు బాప్తిసం క్రీస్తుతో ఐక్యతను సూచిస్తుంది, ఆయనతో
ఒక ప్రత్యేక సంబంధంలోకి ప్రవేశించడం, పరిశుద్ధాత్మ మూలంగా ఆయన ఆధ్యాత్మికదేహంలో ఒక
అవయవంగా మారడం అని దీని అర్థం (1 కోరింథీయులకు 12:12-13; యోహాను 17:21, యోహాను
17:23). బాప్తిసం అనే అర్థాన్నిచ్చే గ్రీకు పదం క్రొత్త నిబంధన లో ఇతర చోట్ల
చిహ్నంగా సాదృశ్య రూపకంగా వాడడం కనిపిస్తుంది. లూకా 12:50; 1 కోరింథీయులకు 10:2.
నీటి బాప్తిసంకోసం పౌలుగారు ఇక్కడ చెప్తున్న ఆధ్యాత్మిక వాస్తవ విషయాలకు ఒక
చిహ్నంగా సూచనగా మాత్రమే ఉండగలదు. నీటిలోకి వెళ్ళడం క్రీస్తుతో మరణానికీ
పాతిపెట్టబడడానికీ సూచన. నీటినుంచి బయటికి రావడం క్రీస్తుతో సజీవంగా తిరిగి
లేవడానికి సూచన. . క్రీస్తులో దేవుడు
మనకోసం చేసినదానంతటి ఉద్దేశం అనగా బాప్తిస్మము పొందాక మనమొక కొత్త రకం జీవితం గడపాలనే, పాపం మరణాలు
అనే బంధకాలనుంచి విడుదల అయిన పునరుత్థాన సంబంధమైన జీవితం మనకు కలగాలనే. 2
కోరింథీయులకు 5:17; తీతుకు 2:11-14 చూడండి.
కాబట్టి బాప్తిస్మము
పొందాక విశ్వాసి నూతన జీవితం జీవించాలి తప్ప పాత రోత జీవితాన్ని జీవించకూడదు! ఈ విషయంలీ ఒక విషయాన్ని చెప్పనీయండి! చాలామంది మారుమనస్సు నిజమైన పశ్చాత్తాపం పాప
క్షమాపణ అడగకుండా పొందుకోకుండా పెళ్లి కోసం బాప్తిస్మము తీసేసుకుంటున్నారు!! మరి ఈ
బాప్తిస్మములు చెల్లుతాయా?? అనగా ఈ బాప్తిస్మములు నిన్ను పరలోకానికి చేరడానికి
పనికొస్తుందా?? నా జవాబు కాదు కాదు కాదు!
పెళ్లికోసం తీసుకున్న బాప్తిస్మము చెల్లదు! పెళ్లికోసం బాప్తిస్మము
తీసుకున్న పనికిమాలిన వాడు ఎవడు పరలోకం వెళ్ళడు! ఎవడేమి అనుకుంటే నాకనవసరం !!
ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం నాకు వచ్చు! మా సంఘంలో కూడా చాలామంది పనికిమాలిన వాళ్ళు
పెళ్లికోసం బాప్తిస్మము తీసేసుకొని మారుమనస్సు పొందినట్లు యాక్షన్ చేసి ఒక నెల
పోయాక గుడి లేదు బడి లేదు! క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి మాత్రమే కనిపిస్తూ ఉంటారు
ఇలాంటి పెళ్లి క్రైస్తవులు, పండుగ క్రైస్తవులు, ఇలాంటివాడు ఎవడూ పరలోక రాజ్యము
దరికి చేరలేరు!
మరి ఇప్పుడు పెళ్ళికి బాప్తిస్మము తీసుకున్న వ్యక్తి-
లోకానుసారంగా జీవించిన వ్యక్తి- ఏవిధముగానైనా నిజమైన మారుమనస్సు పొందితే ఏమి
చేయాలి? మరలా బాప్తిస్మము పొందాలా? దీనికోసం స్పష్టమైన రిఫరెన్సులు బైబిల్ లో
లేవు! అయితే బాప్తిస్మము ఒక్కటే అన్నారు కదా,
మరి ఆ పెళ్లి బాప్తిస్మము చెల్లుతుందా??
అయ్యా నా ఉద్దేశం చెప్పనీయండి! నిజమైన మారుమనస్సు నిజమైన
పశ్చాత్తాపం పొందాక మరలా యధార్ధంగా బాప్తిస్మము పొందాలి అని నా ఉద్దేశం! కారణం
పౌలుగారు యోహానుగారు చెప్పిన బాప్తిస్మం పొందిన
కొంతమందికి మరలా బాప్తిస్మము ఇచ్చారు అని బైబిల్ లో ఉంది! ఇది నా అభిప్రాయం
మాత్రమే!! ..
అపో.కార్యములు 19:3
అప్పుడతడు ఆలాగైతే మీరు దేనినిబట్టి బాప్తిస్మము పొందితిరని
అడుగగా వారు యోహాను బాప్తిస్మమునుబట్టియే అని చెప్పిరి.
అపో.కార్యములు 19:4
అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చు వానియందు, అనగా యేసునందు
విశ్వాస ముంచవలెనని ప్రజలతో చెప్పుచు, మారు మనస్సు విషయమైన బాప్తిస్మమిచ్చెనని
చెప్పెను.
అపో.కార్యములు 19:5
వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము
పొందిరి.
ఇలా
నిజమైన మారుమనస్సుతో పొందిన బాప్తిస్మము మాత్రం నిజమైనది మరియు ఒక్కటే!
అలాంటి
మారుమనస్సు తో కూడిన బాప్తిస్మముతో మనమంతా పరమునకు చేరుదాం! నీటి బాప్తిస్మము
పొందిన మనమంతా తప్పకుండా ఆత్మలోనూ బాప్తిస్మము పొందాలని మరచిపోవద్దు! ఆపో 1:5 5. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది
దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెద రనెను.
1 కోరింథీ 12: 13. ఏలాగనగా, యూదులమైనను,
గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి
ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితివిు. మనమందరము ఒక్క ఆత్మను పానము
చేసినవారమైతివిు.
గనుక
నీటి బాప్తిస్మము పొందిన మనము పరిశుద్దాత్మ అగ్నిలో కూడా బాప్తిస్మము
పొందుకుందాము!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -58వ భాగం*
*పిలుపుకి తగ్గ జీవితం-14*
ఎఫెసీ 4:4—6
4. శరీర మొక్కటే, ఆత్మయు ఒక్కడే; ఆ ప్రకారమే మీ
పిలుపువిషయమై యొక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి.
5. ప్రభువు ఒక్కడే, విశ్వాస మొక్కటే, బాప్తిస్మ మొక్కటే,
6. అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా
ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలోఉన్నాడు.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం!
ప్రియులారా! ఇక నాల్గవ వచనం నుండి
విశ్వాసులంతా క్రీస్తులో ఐక్యమై ఉన్నారు అనడానికి ఋజువులు చూపిస్తున్నారు! ఇక్కడ
అంటున్నారు 4 వ వచనంలో శరీర మొక్కటే ఆత్మయు ఒక్కడే అంటూ ఇంకా అంటున్నారు ప్రభువు
ఒక్కడే ఇంకా విశ్వాసము ఒక్కటే మరియు బాప్తిస్మము కూడా ఒక్కటే అంటున్నారు
(గతభాగం తరువాయి)
ఇక తరువాత 6 వ వచనంలో అంటున్నారు అందరికీ
తండ్రియైన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో
ఉంటున్నాడు అంటున్నారు! “తండ్రి అయిన దేవుడు”– ఈ ఎఫెసీ పత్రికలో త్రిత్వము కోసం అనేకసార్లు
చెప్పబడింది. ఉదా ఎఫెసీయులకు 1:2-3,
2. మన తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తు
నుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక.
3. మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు
స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోకవిషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును
మనకనుగ్రహించెను.
ఇక్కడ
తండ్రియైన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్దాత్మ యైన దేవుడు కలసి ఉన్నట్లు
కనిపిస్తుంది మనకు!
ఎఫెసీయులకు 3:14.
14. ఈ హేతువుచేత పరలోకమునందును, భూమిమీదను ఉన్న ప్రతి
కుటుంబము ఏ తండ్రినిబట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రియెదుట నేను
మోకాళ్లూని
“అందరిలో”– అంటే విశ్వాసులందరిలో
(2:22). మనుషులందరిలో దేవుడు లేడు (ఎఫెసీయులకు 2:12; ఎఫెసీయులకు 4:18). వ 4-6లో
ఒక్కటే (లేక ఒక్కడే) అనే పదం ఏడు సార్లు కనిపిస్తున్నది. ఈ ఏడు విషయాల్లోనూ
విశ్వాసులంతా ఒక్కటే కాబట్టి వారు ఈ ఏకత్వాన్ని శాంతి బంధంలో కాపాడుకుంటూ ఉండాలి
(వ 3). ఈ వచనాల్లోని త్రిత్వాన్ని గమనించండి. ఆత్మ ఒక్కడే, ప్రభువు ఒక్కడే, దేవుడు
ఒక్కడే. ముగ్గురు వ్యక్తులు, ఒక్కడే దేవుడు. మత్తయి
3:16-17;
16. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు
వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట
చూచెను.
17. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు
నేనానందించు చున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.
మత్తయి
28:19 కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను
శిష్యులనుగాచేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు
నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు;
కాబట్టి
ఇలాంటి ఒక్కడై ఉన్న దేవుడు, అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు! ఇంకా పాత నిబంధన కాలంలో
పాత నిబంధన భక్తులతో ఉండి వారిని నడిపించిన దేవుడు, ఇప్పుడు నూతన నిబంధన కాలంలో కూడా
ఉన్నారు, యేసుక్రీస్తుప్రభులవారితో ఇంకా ఆయన శిష్యులతో ఉన్న అదే తండ్రియైన దేవుడు
ఇప్పుడు మనతోనూ ఉన్నారు మనలను కూడా నడిపిస్తున్నారు! ఈ త్రిత్వము కోసం అనేకసార్లు
చూసుకున్నాము గనుక ముందుకు పోదాం!!
ఇక
7 వ వచనంలో అంటున్నారు
7. అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము
యొక్క పరిమాణముచొప్పున కృప యియ్యబడెను.
4—6 వచనాలు ఎందుకు చెప్పారో ఏడవ వచనంలో అర్ధమవుతుంది!
మొత్తానికి దేవుడు ఒకడే కనుక అదే దేవుడు ఒక్కొక్కరి విశ్వాస పరిమాణం చొప్పున తన
కృపావరాలు ఇస్తారు అంటున్నారు!
దీనికోసం
1 కోరింథీ 12 వ అధ్యాయంలో ఎంతో వివరంగా చెప్పారు!
4. కృపావరములు నానావిధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే.
5. మరియు పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి గాని ప్రభువు
ఒక్కడే.
6. నానావిధములైన కార్యములు కలవు గాని అందరిలోను అన్నిటిని
జరిగించు దేవుడు ఒక్కడే.
7. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ
ప్రత్యక్షత అనుగ్రహింపబడు చున్నది.
8. ఏలాగనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును,
మరియొకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞాన వాక్యమును,
9. మరియొకనికి ఆ ఆత్మవలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క
ఆత్మవలననే స్వస్థపరచు వరము లను
10. మరియొకనికి అద్భుతకార్యములను చేయు శక్తియు, మరియొకనికి
ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి
యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి యున్నవి.
11. అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున
ప్రతివానికి ప్రత్యేకముగా పంచి యిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు.
12. ఏలాగు శరీరము ఏకమైయున్నను అనేకమైన అవయవములు
కలిగియున్నదో, యేలాగు శరీరముయొక్క అవ యవములన్నియు అనేకములైయున్నను ఒక్కశరీరమై
యున్నవో, ఆలాగే క్రీస్తు ఉన్నాడు.
13. ఏలాగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను,
స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము
పొందితివిు. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతివిు.
14. శరీరమొక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది.
ఇదే
విషయాన్ని రోమా పత్రికలో కూడా చెబుతున్నారు
12: 4. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను, ఈ
అవయవములన్నిటికిని ఒక్కటే పని యేలాగు ఉండదో,
5. ఆలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి,
ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై యున్నాము.
6. మన కనుగ్రహింపబడిన కృపచొప్పున వెవ్వేరు కృపావరములు
కలిగినవారమై యున్నాము గనుక,
7. ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణముచొప్పున ప్రవచింతము;
పరిచర్యయైతే పరిచర్యలోను,
8. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే
హెచ్చరించుటలోను పనికలిగియుందము. పంచిపెట్టువాడు శుద్ధమనస్సుతోను, పైవిచారణ
చేయువాడు జాగ్రత్తతోను, కరుణించు వాడు సంతోషముతోను పని జరిగింపవలెను.
కాబట్టి త్రిత్వమై ఉన్న దేవుడు ఇప్పుడు విశ్వాసి
యొక్క ఆత్మీయ మరియు విశ్వాస పరిమాణం ప్రకారం ప్రతీ మనిషికి కొన్ని కృపావరాలు
ఇచ్చారు! అయితే దేవుడిచ్చిన ఆ కృపావరాలు మనము వాడుతున్నామా లేక బీరువాలో పెట్టి
తాళం వేసేశావా??!!!
దేవుడిచ్చిన
తలాంతులు కృపావరాలు దేవునికోసం వాడుతున్నావా?
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -59వ భాగం*
ఎఫెసీ 4:8—10
8. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, చెరను చెరగా పట్టుకొనిపోయి
మనష్యులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడియున్నది.
9. ఆరోహణమాయెననగా ఆయన భూమియొక్క క్రింది భాగములకు దిగెననియు
అర్థమిచ్చు చున్నదిగదా.
10. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలము
లన్నిటికంటె మరి పైకి ఆరోహణమైన వాడునై యున్నాడు.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను
ధ్యానం చేసుకుంటున్నాం!
ప్రియులారా! ఇక
ఎనిమిదవ వచనం చూసుకుంటే ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుష్యులకు
ఈవులను అనుగ్రహించెను అని చెప్పబడి ఉన్నది అంటున్నారు!!! ఎక్కడ
చెప్పబడింది? ఇది కీర్తనల గ్రంధంలో భక్తుడు ఆత్మావేశుడై ప్రవచించిన ప్రవచనం:
68: 18. నీవు ఆరోహణమైతివి పట్టబడినవారిని చెరపట్టుకొని
పోతివి మనుష్యులచేత నీవు కానుకలు తీసికొనియున్నావు. యెహోవా అను దేవుడు అక్కడ
నివసించునట్లు విశ్వాసఘాతకులచేత సహితము నీవు కానుకలు తీసికొనియున్నావు.
అయితే ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరింది అంటే యేసుక్రీస్తుప్రభులవారు చనిపోయి
తిన్నగా పరదైసుకి వెళ్ళి అక్కడున్న ఆత్మలను అనగా మరణము స్వాధీనములో ఉన్న ఆత్మలను
విడిపించి పరదైసు అడ్రసు మార్చినప్పుడు జరిగిన సంభవం!! దీనికోసం మనం
థెస్సలోనికయులకు వ్రాసిన పత్రికలు మరియు
ప్రత్యక్షతల గ్రంధం అనే శీర్షికలలో విస్తారంగా చూసుకున్నాము!
ఇక్కడ ఈ మూడు వచనాలు చూసుకుంటే మొదటగా ఆయన ఆరోహణ మయ్యేటప్పుడు చెరను చెరగా
పట్టుకుని పోయారు! అనేకసార్లు చెప్పడం జరిగినది బైబిల్ లో చెర అనగా మూడు అర్ధాలు మొదటిది: ధర్మశాస్త్రమనే చెర,
రెండు: ఎఫెసీ పత్రిక 4:8 ప్రకారం చెరను చెరగా పట్టుకుపోయారు
అనే సందర్భంలో ఇక్కడ చెర అనగా పరదైసు అని నూతన నిబంధన భక్తుల మైన మనమంతా నమ్ముతాము
కదా, ఇక 1 పేతురు 3:20 ఈ వచనంలో చెరలో ఉన్న ఆత్మలయొద్దకు ఆయన ఆత్మ స్వరూపిగా
వెళ్లి వారికి ప్రకటించెను అనగా సువార్త ప్రకటించెను అంటున్నారు! ఎప్పుడు
ప్రకటించెను చెరను చెరగా పట్టుకుని పోయే క్రమంలో మొదట వారి మెస్సీయ ఎవరో వారికి
చెప్పి గొర్రెపిల్లగా వచ్చినది నేనే అని చెప్పి, అప్పుడు సాతాను/మరణపు చెరనుండి
విమోచించారు
మూడవది మానవులలో దేవుడు పెట్టిన ఆత్మ మనిషిలో చెరలో లేక బంధీగా ఉంది! ఈ
ప్రయాణం పోయిన వెంటనే చెర విముక్తి కలుగుతుంది! దీనికోసం ప్రసంగీ భక్తుడు వివరంగా
రాశారు! అయితే ఈ వచనాలలో చెబుతున్న చెర అనగా పరదైసు అని గ్రహించాలి!
తొమ్మిదవ
వచనంలో అంటున్నారు ఆరోహణ మాయెను అనగా మొదట ఆయన భూమిక్రింద భాగాలకు దిగెను అని
అర్ధం వస్తుంది అంటున్నారు. అవును కదా ముందు క్రిందికి దిగక పోతే ఆరోహణం ఎలా
అవ్వగలరు?? మొదట అవరోహణం జరిగితే ఆ తర్వాతనే ఆరోహణం జరుగుతుంది! కాబట్టి
చనిపోయినప్పుడు మొదట పాతాళంలో భాగమైన పరదైసుకి దిగిపోయారు! ఆ తర్వాతనే దిగినవాడు
తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలము లన్నింటి కంటే పైకి ఆరోహణమయ్యారు అని అర్ధం!
సరే, మొదటగా పరదైసు కోసం చూసుకుని ఆ తర్వాత ఏసయ్య పరదైసుకి దిగిపోవలసిన
అవసరం ఏమిటో చూసుకుందాం!
పరదైసూ అనేది గెస్ట్ హౌస్ /
విడిది గది/ రెస్ట్ రూమ్ ఎందుకు అంటే దేవుని రాకడ మరియు తీర్పు వరకు మృతినొందిన
పరిశుద్ధులు ఉండే గెస్ట్ /రెస్ట్ హౌస్!
మొదట ఈ పరదైసు ఎక్కడ ఉండేది! భూమిక్రింద! భూమిక్రింద మొదట భాగము పాతాళము
దీనినే హెడేస్ అంటారు! ఒకానొకప్పుడు ఇది మూడు బాగాలుగా ఉంది! ఇప్పుడు రెండు
బాగాలుగా ఉంది! సరే ఈ పాతాళము ఎవరి కోసం ఇది? చనిపోయిన ఆత్మలు, అనగా పాపాత్ములై
చనిపోయిన ఆత్మలు ఉండేది, తీర్పు వరకు!
యోబు 24: 19
అనావృష్టిచేతను ఉష్ణముచేతను మంచు నీళ్లు ఎగసి పోవునట్లు
పాతాళము పాపముచేసిన వారిని పట్టుకొనును.
సామెతలు 15:24 క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలేనని
బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడుచుకొనును
కాబట్టి పాతాలము అనేది భూమిక్రింద ఉన్నది!
దాని ప్రక్కన అగాధము! ఇది
ఎవరి కోసం సాతాను గాడి సైన్యం కోసం! దేవునిమీద తిరుగబడ్డ దూతలు కోసం అగాధం ఉంది!
ప్రకటన గ్రంథం 9 మరియు, 20:3ప్రకారం!
దానిప్రక్కన పరదైసు
ఉండేది! లాజరు- ధనవంతుడు ఉపమానం ప్రకారం! లూకా 16; లాజరు అబ్రాహాము రొమ్ము అనబడే
పరదైసులోను, ధనవంతుడు పాతాళములోను ఉన్నాడు.
అందుకే తండ్రియైన అబ్రాహాము గారు మాకును మీకును మధ్యన మహా అగాధం
ఉంచబడింది అన్నారు! ఇది దేవునియందు భయభక్తులు కలిగి భక్తి కలిగిన విశ్వాసుల
విశ్రాంతి కోసం ఏర్పాటు చేయబడింది!
సరే,
ఎప్పుడైతే యేసుక్రీస్తుప్రభులవారు చనిపోయారో ఆ
మూడురోజులలో మరణాన్ని సాతానుని జయించి చెరను చెరగా పట్టుకుని పోయారు అని
వ్రాయబడింది! .
ఎఫెసీయులకు 4: 8
అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, చెరను చెరగా పట్టుకొనిపోయి
మనష్యులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడియున్నది.
.. అనగా ఈ పరదైసునే దాని అడ్రస్ మార్చివేశారు యేసయ్య! భూమిక్రింద
మూడో భాగంలో ఉన్న పరదైసును దానిలో ఉన్న ఆత్మలతో అనగా పాతనిబంధన భక్తుల ఆత్మలతో
పాటుగా మూడో ఆకాశంలోనికి తీసుకుని పోయారు!
మొదటి ఆకాశం అంతరిక్షం! రెండో ఆకాశంలో అంధకార సంబంధమైన లోకనాధులు,
సాతాను శక్తులు ఉన్నారు! యేసుక్రీస్తుప్రభులవారి రెండో రాకడలో మొదటి ప్రస్తానమైన
రహస్యరాకడ లో వచ్చేది ఈ మధ్యాకాశమునకే! ఆయనరాకడతో ఈ అంధకార సంబంధమైన లోకనాధులు
సైతాను సమూహం క్రిందకు త్రోయబడతారు! అప్పుడు పరిశుద్ధులకు ఏడేండ్లు మధ్యాకాశంలో
విందు! భూమిమీద ఏడేండ్లు మహాశ్రమలు!
సరే ఆ పైన ఉన్న ఆకాశములోనే ఇప్పుడు పరదైసు ఉంది అని 2కొరింథీ 12వ
అధ్యాయం చెబుతుంది!
(ఇంకాఉంది)
*ఎఫెసీ పత్రిక -60వ భాగం*
ఎఫెసీ 4:8—10
8. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, చెరను చెరగా పట్టుకొనిపోయి మనష్యులకు
ఈవులను అనుగ్రహించెనని చెప్పబడియున్నది.
9. ఆరోహణమాయెననగా ఆయన భూమియొక్క క్రింది భాగములకు దిగెననియు
అర్థమిచ్చు చున్నదిగదా.
10. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలము
లన్నిటికంటె మరి పైకి ఆరోహణమైన వాడునై యున్నాడు.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను
ధ్యానం చేసుకుంటున్నాం!
ప్రియులారా! ఇక ఎనిమిదవ వచనం చూసుకుంటే
ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించేను
అని చెప్పబడి ఉన్నది అంటున్నారు!!! మనం పరదైసు ఎక్కడ ఉండేది? ఇప్పుడు ఎక్కడ ఉంది?
దాని అడ్రస్ మార్చవలసిన అవసరము ఏమిటి అనే విషయాలు ధ్యానం చేసుకుంటున్నాము!
(గతభాగం తరువాయి)
పరదైసు ఇప్పుడు ఎక్కడ ఉంది?
పౌలుగారి దర్శనం ప్రకారం 2కొరింథీ 12
ప్రకారము మూడో ఆకాశంలో ఉంది!
2 Corinthians(రెండవ కొరింథీయులకు) 12:2,3,4
2. క్రీస్తునందున్న యొక మనుష్యుని నేనెరుగుదును. అతడు
పదునాలుగు సంవత్సరములక్రిందట *మూడవ ఆకాశమునకు కొనిపోబడెను*; అతడు శరీరముతో
కొనిపోబడెనో నేనెరుగను, శరీరములేక కొనిపోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియును.
3. అట్టి మనుష్యుని నేనెరుగుదును. అతడు *పరదైసులోనికి కొనిపోబడి,
వచింప శక్యము కాని మాటలు వినెను*; ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు.
4. అతడు శరీరముతో కొనిపోబడెనో శరీరములేక కొని పోబడెనో
నేనెరుగను, అది దేవునికే తెలియును.
సరే, ఇప్పుడు ఇంతకీ యేసుక్రీస్తుప్రభులవారు క్రిందనున్న పరదైసుకి
ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? ఎందుకు చెరను చెరగా తీసుకుని పోవలసి వచ్చింది?
పరలోకం వెళ్ళాలి అంటే యేసురక్తమందు కడుగబడాలి, ఇంకా యేసే మెస్సయ్యా అని నమ్మకుండా అంగీకరించకుండా
ఎవరూ పరలోకం వెళ్లరు అది పాత నిబంధన భక్తులైనా క్రొత్త నిబంధన భక్తులైనా!
పాతనిబంధన భక్తులు ధర్మశాస్త్రం అనుసరించి పరలోకం వెళ్దాము అని ప్రయత్నించినా అది
వ్యర్ధ ప్రయత్నం అయిపోయింది. ధర్మశాస్త్రం వలన పరిశుద్దులుగా అవ్వలేకపోతున్నారు
అనే మెల్కీసేదేకు క్రమం వచ్చింది అని మనం హెబ్రీ పత్రికలో చూడగళం! మరి వీరు ఎలా
మెల్కీసేదేకు క్రమం క్రిందకు వచ్చారు?
పాత నిబంధన పరిశుద్ధులు కూడా క్రీస్తు రక్తము క్రిందకు వచ్చేసారు
అని నేను అంటున్నాను ! ఎలాగో చెబుతాను! ఇది మీకు అర్ధం కావాలంటే అంతర్జాతీయ
న్యాయశాస్త్రంలో కొన్ని డెఫినిషన్లు తెలియాలి. నేను ఇంటర్నేషనల్ మారిటైమ్ లా
చదువుకున్నాను కాబట్టి కేవలం నాలుగు డెఫినిషన్లు చెబుతాను! ఇందులో నేను నా
జ్ఞానమును చెప్పడానికి ఇలా చేస్తున్నాను అనుకోవద్దు! నేను మరో కోణంలో మీకు
అర్ధమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అంతే!
మొదటిది: ట్రీటీ:
అనగా రెండు లేదా మూడు దేశాల మధ్య ఒకే ప్రయోజనం ఆశించి ఇద్దరికీ మేలుకలిగేలా
చేసుకునే అంతర్జాతీయ ఒప్పందం! దీనిని ట్రీటీ అంటారు! అయితే ఈ ఒప్పందం కేవలం మాటలతో
సరిపోదు! దీనికి చట్టబద్దత కల్పించాలి. అనగా పార్లమెంటులో చట్టంచేసి ఆమోదించాలి!
అప్పుడే ట్రీటీ అధికారంలోకి వస్తుంది.
రెండవది: కన్వెన్షన్: ట్రీటీ చాలా బాగుంది, బాగా
పనిచేస్తుంది. మేము కూడా దీనిలో బాగస్తులమవుతాము అని ప్రపంచంలో అనేక దేశాలు వీరితో
కలిసి అగ్రిమెంట్ చేసుకుంటే దానిని కన్వెన్షన్ అంటారు! మిగిలిన దేశాలలోను దీనికి
చట్టబద్ధత కల్పించాలి మరియు కనీసం 60% దేశాలు ఆమోదించి చట్టబద్దత చేయాలి. అప్పుడే
కన్వెన్షణ్ అధికారం లోకి వస్తుంది.
మూడు: అమెండమెంట్: కన్వెన్షన్ లో ఏదైనా పేరా గాని రెండు
మూడు లైన్లు గాని రెండు మూడు పదాలు గాని లేక అర్ధము గాని మారిస్తే దానిని
అమెండ్మెంట్ అంటారు!
నాలగవది: ప్రోటోకాల్ : కన్వెన్షన్ చాలా పాతది అయిపోయినా-
దాని విధివిధానాలు చాలా పాతవి అయిపోయినా, లేక దానివలన కావాలనుకున్న ఉద్దేశం-
ప్రయోజనం నెరవేరక పోయినా – కన్వెన్షన్
యొక్క ఉద్దేశము మరియు ప్రయోజనం మారకుండా – మొత్తం కన్వెన్షన్
ని మార్చి వ్రాయడం అనేది ప్రోటోకాల్ అంటారు! దీనిలో ఉద్దేశం మరియు ప్రయోజనం మారదు
గాని మొత్తం కన్వెన్షన్ దాని టెక్నికాలిటీస్ – విధివిధానాలు
మొత్తం మారిపోతాయి!
అయిపోయింది
నా లా సబ్జెక్ట్!
దేవుడు- మానవునితో సహవాసం చెయ్యాలని దేవుడు కోరుకున్నారు!
గాని మానవుడు పాపం చేసి దేవునికి దూరం అయిపోయాడు! దేవుడు ప్రవక్తలను పంపించి ఇలా
ఉండాలి అలా ఉండాలి అని చెప్పి వారితో ఒప్పందం చేసుకున్నారు! ఇది ట్రీటీ!
దానిని బలపరచడానికి ధర్మశాస్త్రము ఇచ్చి- ఆహారోను
యాజకత్వములో బలులు అర్పణలు ద్వారా నీతిమంతులుగాను పరిశుద్దులుగాను మారి పరలోకం
చేరాలి. ఇదీ కన్వెన్షన్!
అయితే ఈ ధర్మశాస్త్రము- మరియు ఆహారోను యాజకధర్మము అనే
కన్వెన్షన్ అట్టర్ ఫ్లాఫ్ అయిపోయింది అని మనము హెబ్రీపత్రిక ప్రకారం చూడవచ్చు! ఇక
దేవుడు ఆలోచించి దానివలన ప్రయోజనం లేదు అని- కన్వెన్షన్ మొత్తం మార్చేసి-
యేసుక్రీస్తుప్రభులవారి ద్వారా మెల్కీసెదకు యాజకక్రమము తీసుకుని వచ్చారు.
యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు- నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునై
ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రియొద్దకు చేరలేడు—ఇదీ ప్రోటోకాల్! పాతనిబంధన పరిశుద్దుడైనా క్రొత్త నిబంధన
పరిశుద్దుడైనా ఎవరైనా సరే ఈ క్రీస్తుయేసు – యేసు రక్తములో
కడుగబడి పరిశుద్దుడిగా మార్చబడి పరలోకం చేరాలి అనే ప్రోటోకాల్ ద్వారానే పరలోకం
వెళ్తారు!
ఇంతవరకు బాగుంది! క్రొత్త నిబంధన
వ్యక్తులకు, ప్రస్తుతము ఉన్న వారికి పర్వాలేదు! మరియు పాత నిబంధన భక్తుల సంగతి
ఏమిటి? వారు చనిపోయారు. పరదైసులో ఉన్నారు. మరి వారిని ప్రోటోకాల్ క్రిందకు ఎలా
తీసుకుని రావాలి?? మరి దేవుడు చేసిన రూల్ ని దేవుడే వ్యతిరేఖించి చేయలేరు కదా! మరి
వారిని ప్రోటోకాల్ క్రిందకు ఎలా తీసుకుని రావాలి?
రండి ఎఫెసీ 4:8 లో చెరను చెరగా పట్టుకుని పోయి మనుష్యులకు
ఈవులు అనుగ్రహించెను అంటున్నారు.
రెండవది: 1పేతురు 3:20 లో అవిదేయులైన ఆత్మలయొద్దకు వెళ్లి,
ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను అంటున్నారు. తర్వాత ఆయన ఆ తర్వాత
పరలోకమునకు వెళ్లి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొంది దేవుని
కుడిపార్శవమున కూర్చెండెను అంటున్నారు.
ఈ రెండు వచనాలు కలిపి చదువుకుంటే- చెరను చెరగా పట్టుకుపోవడం
అనగా మన అందరికీ తెలుసు చెర అనగా పరదైసు! ఎక్కడికి పట్టుకుని పోయారు అంటే సాతాను
ఆధ్వర్యంలో భూమిక్రిందన గల పరదైసుని యేసుక్రీస్తుప్రభులవారు చనిపోయిన వెంటనే ఆ
రెండు రోజులలో సాతానుని మరణమును జయించి పరదైసుని మధ్యాకాశం లోనికి తీసుకుని
పోయారు. పరదైసు యొక్క అడ్రస్ మారిపోయింది. అయితే ఈ క్రమంలోనే ఈ వచనాలు ప్రకారం
చెరలో ఉన్న ఆత్మలకు ఆత్మస్వరూపి గానే వారికి ప్రకటించెను అనగా ఆత్మస్వరూపిగా
పరదైసుకి వెళ్లి పాత నిబంధన భక్తులకు
సువార్త ప్రకటించి ప్రోటోకాల్ క్రిందకు తీసుకుని వచ్చారు అని నాకు అర్ధమవుతుంది.
కాబట్టి వెంటనే వారు నమ్మారు! అంగీకరించారు! వెంటనే యేసుక్రీస్తుప్రభులవారు
పరదైసుని మూడో ఆకాశములోనికి తీసుకుని వచ్చారు!
ఇదీ జరిగినది ఈ రకంగా చెరను చెరగా తీసుకుని పోయి పాత నిబంధన
భక్తులకు ఈవులను అనుగ్రహించడానికి పరదైసు అడ్రస్ మార్చి మూడో ఆకాశమునకు తీసుకుని
పోయారు అన్నమాట !
ఇక
“సమస్తమును నింపేలా”– యిర్మియా 23:24 లో
యెహోవాదేవుడు దీన్ని చేసినట్టు రాసి ఉంది. ఇక్కడ క్రీస్తు దీన్ని చేసినట్లు
చూస్తున్నాం. క్రీస్తు యెహోవాదేవుని అవతారం అనడానికి ఇది మరో సూచన. . “ఎక్కిపోయాడు”– అనగా
ఎఫెసీయులకు
1:20-21; 20. ఆయన ఆ బలాతిశయముచేత క్రీస్తును మృతులలోనుండి లేపి, సమస్తమైన
ఆధిపత్యముకంటెను అధికారముకంటెను శక్తికంటెను ప్రభుత్వముకంటెను, ఈ యుగమునందుమాత్రమే
21. గాక రాబోవు యుగము నందును పేరుపొందిన ప్రతి నామముకంటెను,
ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వ మున కూర్చుండబెట్టుకొనియున్నాడు.
22. మరియు సమస్తమును ఆయన పాదములక్రింద ఉంచి, సమస్తముపైని
ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను.
23. ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపు చున్న
వాని సంపూర్ణతయై యున్నది.
అపో. కార్యములు 2:31-35.
31. క్రీస్తు పాతాళములో విడువ బడలేదనియు, ఆయన శరీరము
కుళ్లిపోలేదనియు దావీదు ముందుగా తెలిసికొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను.
(కీర్తనల గ్రంథము 16:10)
32. ఈ యేసును దేవుడు లేపెను; దీనికి మేమందరము సాక్షులము.
33. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి,
పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రివలన పొంది, మీరు చూచుచు వినుచునున్న
దీనిని కుమ్మరించి యున్నాడు.
34. దావీదు పరలోకమునకు ఎక్కి పోలేదు; అయితే అతడిట్లనెను–నేను నీ శత్రువులను నీ పాదములక్రింద పాదపీఠముగా ఉంచువరకు
(కీర్తనల గ్రంథము 110:1)
35. నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో
చెప్పెను.
కాబట్టి
ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభులవారు పరమునకు ఎక్కిపోయి తండ్రి కుడి పార్శ్వమున ఉంది
సమస్తమును నిర్వహించు చున్నారు అన్నమాట!!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -61వ భాగం*
*పిలుపుకి తగ్గ జీవితం-15*
ఎఫెసీ 4:11—12
11. మనమందరము
విశ్వాసవిషయములోను దేవుని కుమారునిగూర్చిన జ్ఞానవిషయములోను ఏకత్వముపొంది
సంపూర్ణపురుషులమగువరకు,
12. అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత
కలవారమగువరకు, ఆయన ఈలాగు నియమించెను.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను
ధ్యానం చేసుకుంటున్నాం!
ప్రియులారా! ఇక మరలా
11 వ వచనం నుండి మనమందరం దేవునిలో ఐక్యముగా ఒకే శరీరముగా ఉన్నాము! ఒక్కొక్కరు అదే శరీరములో ఒక్కొక్క అవయవముగా
ఉన్నాము అంటూ మన ఆధ్యాత్మిక సామర్ధ్యము ప్రకారం దేవుడు ఒక్కొక్కరికి ఒక్కో కృపావరం
ఇచ్చారు అనే విషయాన్ని రాస్తూ దానికంటే ముందు మనము దేవుని కుమారుడు అనగా
యేసుక్రీస్తుప్రభులవారిని గురించిన జ్ణానవిషయంలో మొదటగా మనమంతా ఏకత్వం పొందాలి,
తర్వాత సంపూర్ణ పురుషులుగా మారాలి అంటున్నారు! ఎలా మారాలో 12 వ వచనంలో
చెబుతున్నారు క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగి ఉండాలి, అలా
సంపూర్ణత సాధించుటకు దేవుడు మనకు ఒక్కొక్కరికి ఒక్కో కృపావరం ఇచ్చారు అంటున్నారు!
ప్రియులారా నిజానికి పౌలుగారి పత్రికలు కేవలం చదువుకుంటూ పోతే ఏమీ
అర్ధం కావు! వాటిని లోతుగా ధ్యానం చేసే కొలదీ ఎన్నో ఆత్మీయ మర్మాలు తెలుస్తుంటాయి!
మనమందరము విశ్వాస విషయములోనూ దేవుని కుమారుని గూర్చిన
జ్ఞానవిషయములోను ఏకత్వం పొందాలి అంటున్నారు! ఆధ్యాత్మిక పరిపక్వతలోకి లేక
సంపూర్ణత లోనికి మనం ఎదగాలని మన విషయంలో
దేవుని ఇష్టం. 1 కోరింథీయులకు 3:1-3; ఈ
వచనాలలో కోరింథీయుల మధ్య భేధములు ఉన్నట్లు చూడగలము! అందుకే మొదటగా బేధములు లేకుండా
ఏకత్వం కలిగి ఉండాలి అని పౌలుగారు అభిప్రాయ పడుతున్నారు!
హెబ్రీయులకు
5:11-14; లో కూడా ఇదే విషయాన్ని రాస్తున్నారు!
అయితే
పేతురు గారు ఏకత్వములో ఎదగటానికి అంటున్నారు 1 పేతురు 2:1-3;
1. ప్రభువు దయాళుడని మీరు రుచిచూచియున్న యెడల
2. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను,
అసూయను, సమస్త దూషణ మాటలను మాని,
3. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మల మైన
వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి.
ఎందుకు ఐక్యముగా ఉండాలి అంటే
5. యేసుక్రీస్తుద్వారా దేవునికి అనుకూలము లగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు
పరిశుద్ధయాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలెనుండి ఆత్మ సంబంధమైన
మందిరముగా కట్టబడుచున్నారు.
ఇంకా 18. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు
అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధిపొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంతదినము
వరకును మహిమ కలుగును గాక. ఆమేన్.
ఇక్కడ
ఈ పరిపక్వత క్రీస్తులో ఒకటే విశ్వాసంలోను, క్రీస్తును గురించిన జ్ఞానంలోను ఉంది.
ఇంకా
క్రిందికి పోతే 15వ వచనంలో అన్ని ఆధ్యాత్మిక విషయాల్లో ఎదిగిపోవాలని ఉంది.
15. ప్రేమగలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె
ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము.
మనం క్రమేణా క్రీస్తులో మరింత లోతుగా వెళ్తూ, చివరికి అందరం కలిసి ఆయన
సంపూర్ణతను అందుకునే దాకా ఎదగాలి. తన సంఘం మొత్తం విషయంలో దేవుని ఉద్దేశం ఇదే. ఆయన
ఈ ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు. వ్యక్తిగతంగానైతే ప్రేమతో సత్యం చెపుతూ ఉండడం మూలంగా
ఆయనతో కలిసి పని చేయాలి (వ 15). ఆధ్యాత్మిక ఎదుగుదలలో ఇది ఎంతో ప్రాముఖ్యం.
ఎదగాలని మనకు ఉంటే బైబిల్లో వెల్లడైన దేవుని సత్యాలను ఒకరితో ఒకరు చెప్పుకుంటూ, మన
మధ్య జరుగుతుండే వాటన్నిటిలోనూ సత్యం పలుకుతూ ఉండాలి (వ 2,25; ఎఫెసీయులకు 6:14;
కీర్తనల గ్రంథము 15:2; కీర్తనల గ్రంథము 25:5; కీర్తనల గ్రంథము 31:5; కీర్తనల
గ్రంథము 51:6; సామెతలు 6:16-17; సామెతలు 12:22; 1 కోరింథీయులకు 5:8; కొలొస్సయులకు
3:9; 1 యోహాను 2:21).
ఒకభక్తుడు ఇలా చెప్పారు:
క్రీస్తు తన సంఘాన్ని నాటిన నేల సత్యము . అది తినవలసిన ఆహారం,
పీల్చుకోవలసిన గాలి సత్యమే. సత్యం పాడైపోతే అన్నీ పోయినట్టే. మనం సత్యమంటే ప్రీతి
కలిగి ఒకరిపట్ల ఒకరికి గల ప్రేమభావం మూలంగా సత్యం పలకడం నేర్చుకోవాలి.
కానీ ఈ రోజుల్లో సంఘాల్లోకి దూరి 14వచనంలో దేవుడు ఖండించిన వాటిని
చేస్తూ ఉండే అనేకమంది దీనికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై
యుండి, మనుష్యుల మాయోపాయములచేత వంచనతోను, తప్పుమార్గమునకు లాగు కుయుక్తితోను,
గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు
కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగురగొట్టబడినవారమైనట్లుండక..
సరే, అయితే క్రింది వచనాలలో సంపూర్ణత సాధించుటకు దేవుడు కొందరిని
ప్రవక్తలుగా అపోస్టలులుగా కాపరులుగా బోధకులు ఇలాంటి వివిధమైన స్తితులలో ఉంచారు
అంటున్నారు 13 వ వచనంలో! 13. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము
క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని
అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని
కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను.
అయితే క్రీస్తుతో సమానమైన సంపూర్ణత కేవలం ఈ fivefold మినిస్ట్రీ లేక tenfold మినిస్ట్రీ చేస్తుంటే
వచ్చేస్తుందా, లేక ఇంకా ఏమైనా ఉందా అని ఆలోచిస్తే మూడవ అధ్యాయంలో మనము ధ్యానం
చేసుకున్నట్లు శ్రమల ద్వారా మనము సంపూర్ణులుగా మారతాము!
శ్రమలు లేకుండా మనము సంపూర్ణత పొందుకోలేము! ఎందుకంటే
యేసుక్రీస్తుప్రభులవారు కూడా అదే శ్రమలద్వారా మాత్రమే సంపూర్ణత సాధించారు అని మూడో
అధ్యాయంలో ధ్యానం చేశాము!
ఇక
మరొక విషయం: సంపూర్ణత సాధించాలి అంటే ప్రేమ కలిగి ఉండాలి! కొలస్సీ 3:14 లో
అంటున్నారు : వీటన్నిటి పైనా పరిపూర్ణతకు
అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి అంటున్నారు!
ఇవీ
సంపూర్ణతకు సాధనాలు!
ఇవి
కలిగి ఉండి క్రీస్తుయేసు సాధించిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనము కూడా
సాధిద్దాం!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -62వ భాగం*
*పిలుపుకి తగ్గ జీవితం-16*
ఎఫెసీ 4:13
13. పరిశుద్ధులు
సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము
జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని
సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను
ధ్యానం చేసుకుంటున్నాం!
ప్రియులారా! ఇక మరలా 11 వ వచనం నుండి
మనమందరం దేవునిలో ఐక్యముగా ఒకే శరీరముగా ఉన్నాము!
ఒక్కొక్కరు అదే శరీరములో ఒక్కొక్క అవయవముగా ఉన్నాము అంటూ మన ఆధ్యాత్మిక
సామర్ధ్యము ప్రకారం దేవుడు ఒక్కొక్కరికి ఒక్కో కృపావరం ఇచ్చారు అనే విషయాన్ని
రాస్తూ పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును,
పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని
ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను
నియమించెను అంటున్నారు
దీనికోసం అనేక శీర్షికలలో
చెప్పినట్లు దేవుడు కొందరిని fivefold మినిస్ట్రీ లో బాగస్టులై ఉండటానికి
పిలిచారు వీరు ఫుల్ టైమ్ మినిస్ట్రీ చేసేవారు
కొందరు tenfold
మినిస్ట్రీ లో ఉండటానికి పిలిచారు! వీటిలో చివరి ఐదు చేసే వారు పార్ట్ టైమ్ మినిస్ట్రీ చేస్తారు!
దీనికోసం
1 కోరింథీ 12 వ అధ్యాయంలో కూడా చెప్పబడింది 28.
మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులు గాను, పిమ్మట కొందరిని
ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు
చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని
ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా
భాషలు మాటలాడువారినిగాను నియమించెను.
1. అపోస్తులులు, 2. ప్రవక్తలు, 3. భోదకులు, 4. కాపరులు, 5.
సువార్తికులు/ఉపదేశకులు,
మిగతా ఐదు భాగాలు : 6. అద్భుతాలు చేసేవారు, 7. భాషలు
మాట్లాడువారు/భాషలకు అర్ధం చెప్పేవారు, 8. ఉపకారాలు చేసేవారు, 9. పరిచర్య
చేసేవారు, 10. ప్రభుత్వాలు చేసేవారు.
రక్షించబడిన ప్రతీ విశ్వాసి, వీటిలో ఏదో ఒకటి తప్పకుండా చేయాలి. లేకపోతే ఆ
విశ్వాసి నులివెచ్చగా ఉన్నట్లు లెక్క!
ఈ Fivefold ministry లో మొదటగా *ఉపదేశకులు*:
సువార్తికులు/ఇవాంజిలిస్టులు, బైబిల్ టీచర్లు, మిషనరీలు ఈ లెక్కలోకి వస్తారు.
సువార్త ప్రకటించడం, విశ్వాసులను బలపరచడం వీరిపని.
తర్వాత
*కాపరులు*: ఈ Fivefold ministry లో
చాల ముఖ్యమైన వారు. సువార్తికుని పనిచేస్తూనే సంఘకాపరిగా భాద్యత నిర్వహించాలి.
తర్వాత
*బోధకులు*: సంఘకాపరిగా చేస్తూనే
సంఘాన్ని హెచ్చరిస్తూ-సరిచేస్తూ దేవుని సందేశాలు అందించడం వీరి పని.
తర్వాత
*ప్రవక్తలు*: వీరు పరిశుద్ధాత్మ
పూర్ణులై, దేవుని దగ్గర అనునిత్యం కనిపెడుతూ, దేవుని ప్రవచనాలు- వర్తమానాలు
ప్రజలకి తెలియజేస్తూ సంఘాన్ని సరిదిద్దే వారు.
*అపోస్తలులు*: పై నాలుగు వరాలు కలవారు లేక నాలుగు భాగాలులో
భాగస్తులై, ఆ ఆధిక్యత గలవారిని అపోస్తులులు అంటారు. అనగా సువార్త ప్రకటిస్తూ,
సంఘాలలో భోదిస్తూ, అద్భుతాలు చేయగలిగే వరాన్ని కలిగి, ప్రవచన వరం కలిగి సంఘాన్ని
ముందుకు నడిపించేవారే అపోస్తులులు.
ఇది అత్యంత గొప్పవిషయం!
ఈ
Fivefold ministry లో అపోస్తలులు, ప్రవక్తలు top ఎఫెసీ 2:20 ప్రకారం. Ephesians(ఎఫెసీయులకు) 2:20
20. _క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియైయుండగా అపొస్తలులును
ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు_.
ఇక
తర్వాత
*అద్భుతాలు
చేసేవారు*. అయితే దీనిని చేయడానికి పరిశుద్ధాత్మ అభిషేకం, ప్రార్ధనా
శక్తి, అచంచలమైన విశ్వాసం అవసరం. అయితే మార్కు 16:16 ప్రకారం ఈశక్తి అధికారం
అందరికి ఇవ్వబడింది. దానిని వాడుకొనే శక్తి, విశ్వాసం లేక, వాడే విధానం తెలియక
ఇటుఅటు తిరుగులాడుతున్నాం! నాయందు విశ్వాసముంచువాడు నాకంటే ఎక్కువ కార్యాలు
చేయును. అన్న యేసయ్య మాట ద్వారా మనం అద్భుతాలు చేయగలము.
తర్వాత విభాగం *నానాభాషలు
మాట్లాడువారు- అర్ధం చెప్పువారు*. పెంతుకోస్తు పండుగనాడు దేవుడు
పరిశుద్ధాత్మను పంపించి భాషలు మాట్లాడే వరాన్ని ఇచ్చారు. పౌలు గారు అంటున్నారు-
మీరందరూ భాషలతో మాట్లాడవలెనని కోరుచున్నాను, మరి విశేషముగా ప్రవచింపవలెనని
కోరుచున్నాను. ఎందుకనగా భాషలతో మాట్లాడువాడు మనుష్యులతో కాదు దేవునితో
మాట్లాడుచున్నాడు. మనుష్యుడు గ్రహింపడు గాని ఆత్మవలన మర్మములు మాట్లాడుచున్నాడు
అని పౌలు గారు చెబుతున్నారు. అయితే మరో ప్రాముఖ్యమైన విషయం చెబుతున్నారు- భాషలకు
అర్ధం చెప్పేవారు లేకపోతే సంఘంలో భాషలు మాట్లాడువారు మౌనంగా ఉండాలి అని వ్రాయబడి
ఉంది. కాబట్టి భాషలకు అర్ధం చెప్పే వరం కోసం ప్రార్ధించాలి.
తర్వాత విభాగం వారు *ఉపకారాలు చేసేవారు*. మరల మనం మత్తయి 25:31కి
వెళ్ళాలి. ఆపదలో ఉన్నవారికి, నిరుపేదలకి, దిక్కులేనివారికి సహాయం చేయాలి. ఇది
దేవుడు మెచ్చే సేవ!! అదే నిజమైన భక్తి అని బైబిల్ సెలవిస్తుంది. యాకోబు 1:27;
యెషయా 58
తర్వాత విభాగం *పరిచర్య
చేసేవారు*. సంఘంలో ఇది ప్రాముఖ్యమైనది. దీనికి ట్రైనింగ్, చదువు అవసరం
లేదు. చేయాలనే ఆశ, తగ్గింపు, commitment (స్తిరమైన ఒడంబడిక)ఉండాలి.
చివరగా *ప్రభుత్వాలు
చేసేవారు*. అనగా సంఘంలో సంఘపెద్దగా సంఘంలో పనులు నిర్వహించే వారు.
నిస్వార్ధముగా పనిచేసి సంఘాన్ని ముందుకు నడిపేవారు. అయితే ఈరోజుల్లో పదవులు, పేరు
ఆశించేవారే తప్ప ప్రభువుకోసం పనిచేసే వారు తక్కువ. ఓ సంఘపెద్దా! నీవు అలా ఉంటే
నేడే నిన్ను నీవు తగ్గించుకొని ప్రభువు పరిచర్యకై పాటుపాడమని ప్రభువు పేరిట మనవి
చేస్తున్నారు.
ఇక
29—౩౦ వచనాలలో కొన్ని ప్రశ్నలు
కనిపిస్తున్నాయి....
29. అందరు అపొస్తలులా? అందరు ప్రవక్తలా? అందరు బోధకులా?
అందరు అద్భుతములు చేయువారా? అందరు స్వస్థపరచు కృపావరములు గలవారా?
30. అందరు భాషలతో మాటలాడుచున్నారా? అందరు ఆ భాషల అర్థము
చెప్పుచున్నారా?
ఈ ప్రశ్నలన్నిటికీ
జవాబు “కారు” అని గమనించి అర్థం చేసుకోండి. దేవుడు తన ఇష్టం వచ్చిన రీతిలో తన
ప్రజలకు ఆధ్యాత్మిక సామర్థ్యాలు ఇస్తారు, ఇవ్వకపోతారు. ఇస్తే తన ఇష్టం
వచ్చినప్పుడు ఇస్తారు.
ఇక
చివరి వచనంలో కృపావరములలో శ్రేష్టమైన వాట్ని
ఆసక్తితో ఆపేక్షించుడి, ఇదియు గాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుతున్నాను అంటూ
అన్నింటిలో మిన్నయైనది ప్రేమయే అని 13వ అధ్యాయం లో చెబుతున్నారు!
1కోరింథీయులకు 14: 1
ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడుడి (మూలభాషలో- ప్రేమను
వెంటాడుడి) . ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి; విశేషముగా మీరు ప్రవచన
వరము అపేక్షించుడి.
ఒక
విశ్వాసి ఆధ్యాత్మిక సామర్థ్యాలను ఎందుకు కోరాలి? తన తృప్తి కోసం కాదు, లేక ఇతరులు
తనను స్వీకరించాలని, తనకు పేరు ప్రఖ్యాతులు కలగాలని కాదు.
మొదటగా
ఈ ఎఫెసీ 4:13 ప్రకారం పరిశుద్దులు సంపూర్ణులు అయ్యేలాగా ఈ tenfold మినిస్ట్రీ
లోగాని fivefold మినిస్ట్రీలో గాని పాలుపొందాలి!
ఇక
1 కోరింథీ 12:7 ప్రకారం అందరి ప్రయోజనం
అనగా సంఘ క్షేమాభివృద్ధి కోసమే వాటిని కోరాలి, దేవుని చిత్తము నెరవేరాలనే అలా కోరాలి. ప్రతి విశ్వాసీ ఇతరుల
క్షేమం గురించే ఆలోచిస్తుండాలి గాని తన క్షేమం గురించి కాదు (10:24).
అన్నిటి కంటే మేలురకమైన కృపావరాలు ఏమిటి? ఏవైతే
ఇతరులకు ఎక్కువ మేలు చేసేందుకు సహాయపడతాయో
ఆ వరాలు: (14:3, 5, 12).
3. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు,
ప్రవచించువాడు మనుష్యులతో మాటలాడుచున్నాడు.
5. మీరందరు భాషలతో మాటలాడవలెనని కోరుచున్నానుగాని మీరు
ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము
భాషలతో మాటలాడువాడు అర్థము చెప్పితేనేగాని వానికంటె ప్రవచించువాడే శ్రేష్ఠుడు.
12. మీరు ఆత్మసంబంధమైన వరముల విషయమై ఆసక్తిగలవారు గనుక
సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించునట్లు ప్రయత్నము
చేయుడి.
కాబట్టి
ఈ విషయాన్ని గ్రహిద్దాం!
ఆయన
సేవలో పరిచర్యలో ప్రేమకలిగి ఏవిధమైన కక్ష్యలు లేకుండా భేదాలు లేకుండా ముందుకు
సాగిపోదాం!
దైవాశీస్సులు!!
*ఎఫెసీ పత్రిక -63వ భాగం*
*పిలుపుకి తగ్గ జీవితం-17*
ఎఫెసీ 4:13
14. అందువలన మనమిక
మీదట పసిపిల్లలమై యుండి, మనుష్యుల మాయో పాయములచేత వంచనతోను, తప్పుమార్గమునకు లాగు
కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు
కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగురగొట్టబడినవారమైనట్లుండక
15. ప్రేమగలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు,
మనమన్ని విషయములలో ఎదుగుదము.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను
ధ్యానం చేసుకుంటున్నాం!
ప్రియులారా! ఇంతవరకు సంఘ క్షేమాభివృద్ధి కోసం మరియు సంపూర్ణ
పురుషులమయ్యే విధానం చెప్పి ఇప్పుడు మరలా పిలుపుకి తగిన జీవితం జీవించడం ఎలాగో మరో
కోణంలో చెబుతున్నారు! సంపూర్ణత సాదించడం కూడా పిలుపుకి తగిన జీవితం జీవించడమే!
ఇక 14 వ వచనంలో అంటున్నారు ఇక మనము ఇక మీద పసిపిల్లలమై యుండి
మనుష్యుల మాయోపాయములచేత వంచనచేత తప్పు మార్గమునకు లాగు కుయుక్తితో గాలికి
కొట్టుకుని పోయేటట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశానికి ఇటు అటు కొట్టుకొని పోవద్దు
అంటున్నారు! పిలుపుకి తగ్గ జీవితం జీవించడానికి చేయవలసిన లేక విసర్జించ వలసిన మరో
విషయం: కల్పనా కధాలవైపుకి తప్పుడు బోధలవైపు తిరగకూడదు!
ఇందుకోసం
క్రొత్త నిబంధనలో అనేసార్లు వ్రాయబడింది!
రోమా 16: 17. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు
వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును
బతిమాలుకొను చున్నాను. వారిలోనుండి తొలగిపోవుడి.
18. అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే
దాసులు; వారు ఇంపైన మాటలవలనను ఇచ్చకములవలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు.
ఇట్టివారి బోధలు ఎందుకు వినవద్దు అంటే 2 కోరింథీ 11 వ
అధ్యాయంలో అంటున్నారు
13. ఏలయనగా అట్టి వారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము
ధరించుకొనువారై యుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పనివారునై యున్నారు.
14. ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగుదూత వేషము
ధరించుకొనుచున్నాడు
15. గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము
ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును.
కొలస్సీ
పత్రికలో అంటున్నారు 2: 8. ఆయనను అనుసరింపక
మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన
నిరర్థక తత్వ జ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని
జాగ్రత్తగా ఉండుడి.
చూడండి
ఇలాంటివాడు మిమ్మను ఈడ్చుకుని పోతాడు లేక చెర పట్టుకుని పోతాడు అంటున్నారు
ఎక్కడికి ఈడ్చుకుని పోతాడు? నరకానికి! లోకానికి! సాతాను పాదాల దగ్గరకు! అందుకే
ఇలాంటి అబద్ద బోధల చుట్టూ తిరుగవద్దు అంటున్నారు
తిమోతి
పత్రికలో మరో రూపాన్ని చెబుతున్నారు పౌలుగారు: 1
తిమోతి 4: 1. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు
ఆత్మలయందును
2. దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని
ఆత్మ తేటగా చెప్పుచున్నాడు.
3. ఆ అబద్ధికులు, వాత వేయబడిన మనస్సాక్షిగలవారై,
వివాహమునిషేధించుచు, సత్యవిషయమై అనుభవజ్ఞానముగల విశ్వాసులు కృతజ్ఞ తాస్తుతులు
చెల్లించి పుచ్చుకొనునిమిత్తము దేవుడు సృజించిన ఆహారవస్తువులను కొన్నిటిని తినుట
మానవలెనని చెప్పు చుందురు.
4. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది.
కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనినయెడల ఏదియు నిషేధింపతగినది కాదు;
5. ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థనవలనను
పవిత్రపరచ బడుచున్నది.
6. ఈ సంగతులను సహోదరులకు వివరించినయెడల,నీవు అనుసరించుచు
వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యములచేత పెంపారుచు క్రీస్తుయేసునకు మంచి
పరిచారకుడవై యుందువు.
7. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి, దేవభక్తి
విషయములో నీకు నీవే సాధకము చేసికొనుము.
యూదా
గారు అంటున్నారు:
యూదా 1:3,4
3. ప్రియులారా, మనకందరికి కలిగెడు రక్షణను గూర్చి మీకు
వ్రాయవలెనని విశేషాసక్తిగలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే
అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు
వ్రాయవలసివచ్చెను.
4. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడియున్నారు. వారు
భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగ పరచుచు, మన
అద్వితీయనాధుడును ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు; ఈ
తీర్పుపొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు (మూలభాషలో- వ్రాయబడినవారు) .
ఇంకా
అబద్దభోధకులు కోసం ఆలోచిస్తే 2 పేతురు 2:1లో...
మరియు అబద్ధప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలెనే మీలోను
అబద్దబోధకులుందురు; వీరు తమ్మును కొనిన ప్రభువును కూడ విసర్జించుచు, తమకుతామే
శీఘ్రముగా నాశనము కలుగజేసికొనుచు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా
బోధించుదురు.
అబద్దబోధకులు
పాతనిబంధన కాలంలో ఉన్నారు. ఇప్పుడు మీలో కూడా ఉన్నారు. వారి భోదలు మిమ్మల్ని నాశనం
లోనికి నడిపిస్తాయి జాగ్రత్తగా ఉండండి. వారినుండి దూరంగా ఉండండి అంటున్నారు పేతురు
గారు!
పాత
నిబంధనలో ఈ కపట భోధకుల కోసం ఎక్కడ వ్రాయబడ్డాయి అంటే ద్వితీ 13:1—5; 18:20—22; 1రాజులు 18:19—40; 22:6—7; యెషయా 9:15; యిర్మియా
2:8; 5:31; 14:14; 28:1—9; యెహే 13:2—7
ఇక
క్రొత్త నిబంధనలో కూడా చెబుతున్నారు:
యేసుక్రీస్తుప్రభులవారే చెప్పారు మత్తయి 7:15
అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱెల
చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు.
మత్తయి 7: 16
వారి ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు. ముండ్లపొదలలో
ద్రాక్ష పండ్లనైనను, పల్లేరుచెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా?
మత్తయి 24: 11
అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు;
పౌలుగారు చెబుతున్నారు అపో 20:29—30
29. నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో
ప్రవేశించునని నాకు తెలియును; వారు మందను కనికరింపరు.
30. మరియు శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు
పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు.
గలతీ 1:7
అది మరియొక సువార్త కాదుగాని, క్రీస్తు సువార్తను చెరుపగోరి
మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు.
ఇలాంటి
తప్పుడుభోధకులు క్రీస్తు సిలువకు విరోధులు అని చెబుతున్నారు! ఫిలిప్పీ 3:18
అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు;
వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి యిప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను.
అయితే
విశ్వాసులలో అనేకులకు ఇలాంటి భోధలే కావాలట! 2తిమోతి
4:3,4
3. ఎందుకనగా జనులు హితబోధను (ఆరోగ్యకరమైన భోదన) సహింపక,
దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని,
4.సత్యమునకు చెవినియ్యక కల్పనా కథలవైపునకు తిరుగుకాలము
వచ్చును.
యాకోబు
గారు అంటున్నారు 4:1
మీలో యుద్ధములును పోరాటములును దేని నుండి కలుగుచున్నవి? మీ
అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛలనుండియే గదా?
గమనించాలి అనేక శతాబ్దాలుగా ఇదే
పద్దతిని ఉపయోగించుకుని సాతానుగాడు విజయం సాధిస్తున్నాడు! డైరెక్టుగా ఎటాక్ చేస్తే
వాడిని చావజంపుతున్నాము కాబట్టి విశ్వాసులలో విశ్వాసులకే ఇలాంటి తప్పుడుభోదలతో
కలవరపరచి విశ్వాసబ్రష్టులు చేస్తూ వాడు విజయం సాధిస్తున్నాడు! కాబట్టి ప్రియ సంఘమా
ఇలాంటి తప్పుడు భోధలకు తప్పుడుగాళ్ళకు దూరంగా ఉండమని మనవిచేస్తున్నాను! గమనించాలి
భూమిమీద మొట్టమొదటి అబద్ద ప్రవక్త/ తప్పుడుభోధకుడు ఎవరో తెలుసా?!!! అది సాతాను
గాడే! అవునా ఇది నిజమా అంటూ ప్రారరంభించి మొట్టమొదటి అబద్దం చెప్పాడు ఆదికాండం
3:4లో మీరు చావనే చావరు అంటూ! అంతే, అప్పటినుండి పాపం ప్రభలిపోయింది. ఆరోజు
హవ్వమ్మ గారు వాడిని ఎదిరించి ఉంటే మనకు ఈ తిప్పలు ఉండేవి కావు! అందుకే
యేసుక్రీస్తుప్రభులవారు అన్నారు.
యోహాను 8: 44
మీరు మీ తండ్రియగు అపవాది ( అనగా,సాతాను) సంబంధులు; మీ
తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు
నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము
అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై (లేక, అబద్దకునికి
జనకుడునై) యున్నాడు.
గమనించాలి ఈ అబద్దభోధకులు తమ తప్పుడు సిద్ధాంతాలను ఎంతో కుయుక్తిగా
విశ్వాసులకు భోధిస్తారు. అక్కడ అవునా ఇది నిజమా అంటూ అనుమాన బీజము వేసి చిన్న
అబద్డంతో ఏదేనుతోటలో ఉన్న సంఘాన్ని నాశనం చేశాడు! గమనించాలి వీరు అసత్యానికి కొంత
సత్యాన్ని కలిపి దానిని ఆకర్షణీయంగా మార్చి కలిపిచెరుపుతుంటారు వారు బైబిల్లో ఉన్న
విషయాలే చెబుతూ ఉంటారు గాని దానికి కొంత అబద్దాన్ని కలిపి మన చెవులకు ఇంపైనట్లుగా
చెబుతూ మనలను నమ్మబుచ్చుతారు. కాబట్టి ఇలాంటి అబద్ద భోధకులనుండి దూరంగా
ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీరికోసం పౌలుగారు చెబుతున్నారు వారు మారువేషం వేసుకుని
ఎంతోమంచి వారు అయినట్లు ఎంతో భక్తిపరులు అయినట్లు నటించి గొర్రె చర్మము వేసుకున్న
తోడేలు వలె పాడుచేస్తారు అంటున్నారు. 2కొరింథీ 11:13—15
13. ఏలయనగా అట్టి వారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము
ధరించుకొనువారైయుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పనివారునై యున్నారు.
14. ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగు దూత వేషము
ధరించుకొనుచున్నాడు
15. గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము
ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును.
గలతీ 2:4
మనలను దాసులుగా చేసికొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన
మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు, రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట
సహోదరులవలన జరిగినది.
చూడండి యూదా గారు అంటున్నారు వీరు భక్తిహీనులు గాని భక్తి గలవారి
వలె నటిస్తారు గాని వీరు నిజక్రైస్తవులు కాదు అంటున్నారు. అది వారి ప్రవర్తనే
ఋజువుచేస్తుంది.
ఇంకా అంటున్నారు వీరు దేవుని కృపను వారి కామాతురతకు
ఉపయోగించుకుంటున్నారు. దేవుని కృపా సిద్ధాంతమును తప్పుగా భోధించి తమ కామం
తీర్చుకుంటున్నారు – ఎవరితో? సంఘంలో గల
బలహీన విశ్వాసం గల స్త్రీలతో!!!
వీరు పైకి సిస్టర్ సిస్టర్ అంటూ ఎంతో ప్రేమగా మాట్లాడి మిమ్మల్ని
వశపరచుకుంటారు. కాబట్టి ప్రియ యవ్వన స్త్రీలారా! ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి.
చివరకు వీరు యేసుక్రీస్తుప్రభులవారిని విసర్జించి మిమ్మల్ని కూడా
విశ్వాసబ్రష్టులు చేస్తారు! చివరకు వీరు శిక్షావిధికి గురి అవుతారు అంటున్నారు. ఆ
భోదను నీవు కూడా నమ్మితే నీవు కూడా అదే శిక్షకు పాలవుతావని మరచిపోకు!
అయితే నీవనొచ్చు! ఏది తప్పుడుభోధ?
ఏది నిజమైన భోధ అని మాకు ఎలా తెలుస్తుంది?
అయ్యా
అమ్మా! బైబిల్ ని పరిశీలంచండి! బైబిల్ లో అలా వ్రాయబడిందా లేదా అని! బెరయ
విశ్వాసులు పౌలుగారు సీల గారు భోధించిన భోధలను కూడా నిజంగా లేఖనంలో అలా
వ్రాయబడిందా లేదా అని పరిశీలించి అప్పుడు నమ్మేవారు.
అపో.కార్యములు 17: 11
వీరు థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక
ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో
అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి.
అలాగే మీరుకూడా
అది అనగా వారిభోధ వాక్యానుసారమా లేదా అనేది చూసుకుని పరిశీలించండి. అది వాక్యానుసారమో కాదో చూసుకుని నమ్మండి. అది
వాక్యానుసారం కాదు అని తెలిస్తే వెంటనే ఎదిరించండి. కనీసం వారికి వందనం కూడా
చెయ్యవద్దు! టీ కూడా ఇవ్వవద్దు! మీ గృహం లోపలి వారిని ఆహ్వానించవద్దు! స్తీలారా
వారు ఎపుడు వస్తారో తెలుసా? మీ భర్త పనిమీద వెళ్ళాక వస్తారు, తప్పుడు భోదలు
చేస్తారు!
ఇంకా వారివి తప్పుడుభోధలో కాదో మీ సంఘకాపరికి చెప్పి తెలుసుకోండి!
ఇలాంటివారు వస్తే వెంటనే మీ కాపరికి ఫోన్ చెయ్యండి రమ్మని చెప్పండి. మీ కాపరి
వస్తే వాడు అబద్ధభోధకుడు అయితే పారిపోతాడు!
ఇంకా
మత్తయి 7: 16
వారి ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు. ముండ్లపొదలలో
ద్రాక్ష పండ్లనైనను, పల్లేరుచెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా?
కనుక
ఈ తప్పుడుగాళ్ళకు దూరంగా ఉందాం! తప్పుడుభోధలను విసర్జిద్దాం!
పరలోకం
చేరుకుందాం!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -64వ భాగం*
*పిలుపుకి తగ్గ జీవితం-18*
ఎఫెసీ 4:13
14. అందువలన మనమిక
మీదట పసిపిల్లలమై యుండి, మనుష్యుల మాయో పాయములచేత వంచనతోను, తప్పుమార్గమునకు లాగు
కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు
కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక
15. ప్రేమగలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు,
మనమన్ని విషయములలో ఎదుగుదము.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను
ధ్యానం చేసుకుంటున్నాం! మనము పిలుపుకి తగ్గ జీవితం ఎలా జీవించాలో
నేర్చుకుంటూన్నాము
ఇక
ఈ 14 వ వచనంలో అంటున్నారు మాయోపాయముల చేత వంచన చేత మనలను మోసపుచ్చాడమే కాకుండా తప్పుడు మార్గములను
కూయుక్తిగా మనలను లాగుకు పోతారు అంటున్నారు
నిజానికి
ఇది దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని
ఆచరించకుండా క్రీస్తులో ఎదగకుండా ఉండేవారికి ఇది సంభవించవచ్చు!
గలతీ 1: 6.
క్రీస్తు కృపనుబట్టి మిమ్మును పిలిచినవానిని విడిచి, భిన్నమైన సువార్తతట్టుకు
మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది.
7. అది మరియొక సువార్త కాదుగాని, క్రీస్తు సువార్తను
చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు.
బిలాము గారు సరియైన మార్గములో
ఉండేవారు. ధనం కోసం తప్పుడు మార్గం ఎంచుకున్నారు- చివరకు గాడిదతో బుద్ధి
చెప్పించుకున్నారు! అక్కడితో ఆగిపోతే సరిపోను- గాని అంతటిలో ఆగకుండా దేవుడు తన
బిడ్డలను ఏవిధముగా హతముచేస్తారో అన్యులకు చెప్పి, దేవుని బిడ్డలు దేవునికి
వ్యతిరేఖమైన పనులు చేసేలా అన్యులకు పనికిమాలిన ఆలోచన చెప్పి- దేవుని బిడ్డలను
దేవుని ఉగ్రతతోనే చంపేలా చేసి ధనము సంపాదించాడు! చివరకు ఏమైంది- నీతిమంతుల మరణం
వంటి మరణం నాకు రావాలని కోరుకుని తనకుతాను దీవించుకున్నా- ఇశ్రాయేలు ప్రజల ఆ గొప్ప
ప్రవక్తని కత్తితో చీల్చి చీల్చి చంపారు!
సంసోనూ తప్పుడు త్రోవను వెళ్ళాడు-
ఘోరమైన చావు చచ్చాడు! కాబట్టి ఇలా మనుషుల మయోపాయములలో వెళ్ళినా వంచన మార్గాలు
అవలంభించినా తప్పుడు మార్గాలు పట్టినా మనుష్యులు కలిపించే తప్పుడు బోధలను
అనుసరించినా చివరి ఫలితం- దేవుని నుండి దూరమై పోయి ఆధ్యాత్మిక చావు భౌతిక చావు
తప్పదు జాగ్రత్త!!
ఇక
తర్వాత వచనంలో గనుక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండటానికి అన్ని
విషయాలలో ఎదుగుదాము అంటున్నారు! గత
వచనాలలో క్రీస్తుయేసు కలిగిన సమానమైన సంపూర్ణత కలిగి ఉండాలి అని చెబితే ఈ వచనంలో
అంటున్నారు సత్యము చెబుతూ క్రీస్తువలే అన్నీ విషయాలలో ప్రవర్తించాలి అంటున్నారు!
అనగా క్రీస్తుయేసు ఎటువంటి పరిశుద్ధమైన జీవితం జీవించారో అలాంటి పరిశుద్ధమైన
మచ్చలేని జీవితం జీవించాలి అంటూ ఆదేవిధముగా అన్నీ విషయాలలో ఆధ్యాత్మికముగా
ఎదుగుదాము అంటున్నారు!
అయితే
ఈ వచనంలో మనం ముఖ్యముగా గుర్తుంచుకో వలసిన విషయం ఏమంటే ప్రేమగలిగి సత్యము చెబితేనే
మనము క్రీస్తువాలే ఉండగలము! మన జీవితంలో సత్యము యధార్ధత లేకపోతే మనము క్రీస్తులయా
ఉండలేము!
యోబు భక్తునికి ఎన్ని కష్టాలు శోధనలు కలిగినా తన యధార్ధత
వీడలేదు!
యోసేపు గారు సత్యాన్ని యధార్ధతను నీటిని వదలలేదు!
ఇలాంటి జీవితం జీవించమంటున్నారు !
మనం
క్రమేణా క్రీస్తులో మరింత లోతుగా వెళ్తూ, చివరికి అందరం కలిసి ఆయన సంపూర్ణతను
అందుకునే దాకా ఎదగాలి. తన సంఘం మొత్తం విషయంలో దేవుని ఉద్దేశం ఇదే. ఆయన ఈ
ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు. వ్యక్తిగతంగానైతే ప్రేమతో సత్యం చెపుతూ ఉండడం మూలంగా
ఆయనతో కలిసి పని చేయాలి (వ 15). ఆధ్యాత్మిక ఎదుగుదలలో ఇది ఎంతో ప్రాముఖ్యం.
ఎదగాలని మనకు ఉంటే బైబిల్లో వెల్లడైన దేవుని సత్యాలను ఒకరితో ఒకరు చెప్పుకుంటూ, మన
మధ్య జరుగుతుండే వాటన్నిటిలోనూ సత్యం పలుకుతూ ఉండాలి (వ 2, 25;
2. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో
కూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,
25. మనము
ఒకరికొకరము అవయవములై యున్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన
పొరుగువానితో సత్యమే మాటలాడవలెను.
ఎఫెసీయులకు 6:14;
14. ఏలా గనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను
మైమరువు తొడుగుకొని
కీర్తనల గ్రంథము 15:2;
. యథార్థమైన ప్రవర్తన గలిగి నీతి ననుసరించుచు హృదయపూర్వకముగా నిజము
పలుకువాడే.
కీర్తనల గ్రంథము
25:5; నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన
దేవుడవు దినమెల్ల నీకొరకు కనిపెట్టుచున్నాను
కీర్తనల గ్రంథము 51:6;
. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము
తెలియజేయుదువు.
సామెతలు 6:16-17; 16. యెహోవాకు అసహ్యములైనవి ఆరు గలవు ఏడును
ఆయనకు హేయములు
17. అవేవనగా, అహంకారదృష్టియు కల్లలాడు నాలుకయు నిరపరాధులను
చంపు చేతులును
18. దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి
పరుగులెత్తు పాదములును
19. లేనివాటిని పలుకు అబద్ధసాక్షియు అన్నదమ్ములలో జగడములు
పుట్టించువాడును.
సామెతలు 12:22; అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు
సత్యవర్తనులు ఆయనకిష్టులు.
1 కోరింథీయులకు 5:8; గనుక పాతదైన పులిపిండితోనైనను
దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండ, నిష్కాపట్యమును సత్యమునను
పులియని రొట్టెతో పండుగ ఆచరింతము.
కొలొస్సయులకు 3:9;
9. ఒకనితో ఒకడు అబద్ధ మాడకుడి;ఏలయనగా ప్రాచీనస్వభావమును దాని క్రియలతో కూడ
10. మీరు పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని
సృష్టించినవాని పోలికచొప్పున నూతన పరచబడుచున్న నవీనస్వభావమును ధరించుకొని
యున్నారు.
1 యోహాను 2:21 మీరు సత్యమెరుగనివారైనందున నేను వ్రాయలేదు
గాని, మీరు దానిని ఎరిగియున్నందునను, ఏ అబద్ధమును సత్యసంబంధమైనది కాదని యెరిగి
యున్నందునను మీకు వ్రాయుచున్నాను.
కాబట్టి క్రీస్తు తన సంఘాన్ని నాటిన నేల సత్యం. అది
తినవలసిన ఆహారం, పీల్చుకోవలసిన గాలి సత్యమే. సత్యం పాడైపోతే అన్నీ పోయినట్టే. మనం
సత్యమంటే ప్రీతి కలిగి ఒకరిపట్ల ఒకరికి గల ప్రేమభావం మూలంగా సత్యం పలకడం
నేర్చుకోవాలి.
అట్టి
కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!
ఆమెన్! ఆమెన్!
*ఎఫెసీ పత్రిక -65వ భాగం*
*పిలుపుకి తగ్గ జీవితం-19*
ఎఫెసీ 4:16
16. ఆయన శిరస్సయి యున్నాడు, ఆయననుండి సర్వశరీరము చక్కగా
అమర్చ బడి, తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి
కీలువలన గలిగిన బలముచేత అతుకబడి, ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు
శరీరమునకు అభివృద్ధి కలుగజేసికొనుచున్నది.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను
ధ్యానం చేసుకుంటున్నాం! మనము పిలుపుకి తగ్గ జీవితం ఎలా జీవించాలో
నేర్చుకుంటూన్నాము
ఇక
ఈ 16 వ వచనంలో అంటున్నారు ఆయన శిరస్సు అయి ఉన్నారు
ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి ఆవయవము తన పరిమాణం చొప్పున
పనిచేయుచుండగా ..
గమనించాలి క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు అని మనం చాలా శీర్షికలలో
చూసుకున్నాము! సంఘానికి యేసుక్రీస్తుప్రభులవారే శిరస్సు అని పౌలుగారు అనేక
పత్రికలలో చెప్పారు! అయితే ఆ శిరస్సుతో మన శరీరములో గల అవయవములు అన్నీ అటుకబడి
ఉంటేనే గాని అవయవాలు జీవించలేవు! చచ్చుబడి పోతాయి అంటున్నారు! అలా అతుకబడి ఉంటేనే శరీరం అందులోని నరాలు, కండరాలు, ఎముకలు మొదలైన
“ప్రతి భాగమూ సరిగా పని చేయడంవల్ల శరీరం...వర్ధిల్లుతూ ఉంటుంది”. ఇప్పుడు మొత్తం
అవయవములు శిరస్సుతో కూర్చబడి ఒకటిగా ఉంది.
క్రీస్తు శరీరం అయిన సంఘం దేవుని ఆత్మ సృష్టించిన ఆధ్యాత్మిక బంధాలతో ఒకటిగా
అమర్చి ఉంది (1 కోరింథీయులకు 12:12-27). ప్రతి అవయవానికీ దేహం అంతటి విషయంలో
బాధ్యత ఉంది –
12. ఏలాగు శరీరము ఏకమైయున్నను అనేకమైన అవయవములు
కలిగియున్నదో, యేలాగు శరీరముయొక్క అవ యవములన్నియు అనేకములైయున్నను ఒక్కశరీరమై
యున్నవో, ఆలాగే క్రీస్తు ఉన్నాడు.
13. ఏలాగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను,
స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము
పొందితివిు.మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతివిు.
14. శరీరమొక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది.
15. నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము
చెప్పినంతమాత్రమున శరీరములోనిది కాక పోలేదు.
16. మరియు నేను కన్ను కాను గనుక శరీరము లోనిదానను కానని
చెవి చెప్పినంత మాత్ర మున శరీరములోనిది కాకపోలేదు.
17. శరీరమంతయు కన్నయితే వినుట ఎక్కడ? అంతయు వినుటయైతే వాసన
చూచుట ఎక్కడ?
18. అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్తప్రకారము
శరీరములో నుంచెను.
19. అవన్నియు ఒక్క అవయవమైతే శరీరమెక్కడ?
20. అవయవములు అనేకములైనను శరీర మొక్కటే.
21. గనుక కన్ను చేతితో నీవు నాకక్కరలేదని చెప్పజాలదు; తల,
పాదములతోమీరు నాకక్కరలేదని చెప్పజాలదు.
22. అంతేకాదు, శరీరముయొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా
కనబడునో అవి మరి అవశ్యములే.
23. శరీరములో ఏ అవయవములు ఘనతలేనివని తలంతుమో ఆ అవయవములను
మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. సుందరములుకాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము
కలుగును.
24. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యమక్కరలేదు.
25. అయితే శరీరములో వివాదములేక, అవయవములు ఒకదాని నొకటి
యేకముగా పరామర్శించులాగున, దేవుడు తక్కువ దానికే యెక్కువ ఘనత కలుగజేసి, శరీరమును
అమర్చియున్నాడు.
26. కాగా ఒక అవయవము శ్రమపడునప్పుడు అవయవములన్నియు దానితోకూడ
శ్రమపడును; ఒక అవయవము ఘనత పొందునప్పుడు అవయవములన్నియు దానితోకూడ సంతో షించును.
27. అటువలె, మీరు క్రీస్తుయొక్క శరీరమైయుండి వేరు వేరుగా
అవయవములై యున్నారు.
సరే,
ఈ వచనంలో ధ్యానం చేయవలసిన మరో విషయం ఉంది: మనమంతా క్రీస్తులో ఐక్యంగా ఉండాలి
అతుకబడి ఉండాలి!
యేసుక్రీస్తుప్రభులవారు
కూడా అంటున్నారు మీరు నాలో అతుకబడి ఉండాలి, నాకు వేరుగా మీరు బ్రతుకలేరు
అంటున్నారు! యోహాను సువార్త 15 వ అధ్యాయము మొత్తం దీనికోసమే వ్రాయబడి ఉంది!
1. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు.
2. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును; ఫలించు
ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసి వేయును.
3. నేను మీతో చెప్పిన మాటనుబట్టి మీరిప్పుడు పవిత్రులై
యున్నారు.
4. నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును.
తీగె ద్రాక్షావల్లిలో నిలిచి యుంటేనేగాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నాయందు
నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు.
5. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు
నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా
ఉండి మీరేమియు చేయలేరు.
6. ఎవడైనను నాయందు నిలిచియుండని యెడల వాడు తీగెవలె బయట
పారవేయ బడి యెండిపోవును; మనుష్యులు అట్టివాటిని పోగుచేసి అగ్నిలో పార వేతురు, అవి
కాలిపోవును.
7. నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండినయెడల
మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింప బడును.
8. మీరు బహుగా ఫలించుటవలన నా తండ్రి మహిమపరచబడును; ఇందువలన
మీరు నా శిష్యులగుదురు.
9. తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో నేనును మిమ్మును ఆలాగు
ప్రేమించితిని, నా ప్రేమయందు నిలిచి యుండుడి.
10. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు
నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనినయెడల నా ప్రేమయందు నిలిచియుందురు.
చూడండి ఇక్కడ నేను నిజమైన
ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు అంటూ నాలో ఫలించని ప్రతీ తీగె తీసి
పారవేయబడుతుంది ఫలించని తీగెలను పారవేస్తారు అంటున్నారు! ఇంకా నాలో నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు
అంటున్నారు! నిలిచి ఉండటం లేక అతుకబడి ఉండటం ఏమిటో కూడా చెప్పారు నాయందు మీరు
మీయందు నా మాటలు నిలిచి ఉంటే అప్పుడు మీరు ఫలించడమే కాకుండా మీకేది ఇష్టమో అడగండి
అవి మీకు అనుగ్రహించబడును అంటున్నారు! ఇంకా అంటున్నారు మీరు బహుగా ఫలించడం వలన నా
తండ్రి ఎంతో మహిమ పరచబడతారు అని కూడా అంటున్నారు యేసుక్రీస్తుప్రభులవారు!! చివరికి
శిరస్సుకు లోబడటం అంటే ప్రభువిచ్చే ఆలోచనలతో ప్రభువు యొక్క తలంపులతో ప్రభువుతో
నడిపించబడటమే!!
కాబట్టి
ఆ శిరస్సులో శిరస్సుతో అతుకబడి ఉండాలని ఆయన చెప్పినట్లు చేయాలి! మన హృదయంలో
మనస్సులో తలంపులలో ఎప్పుడూ దేవుడు దేవుని నామం, ఆయన కార్యాలు చేయడం లాంటి ఆలోచనలతో
నిండిపోతే అప్పుడు మనము దేవునితో synchronize అవుతాము! అప్పుడు మనము బహుగా
ఫలిస్తాము!
అట్టి
విధంగా జీవిద్దాం! ఆయనలో ఐక్యమై ఉందాము!
దైవాశీస్సులు
*ఎఫెసీ పత్రిక -66వ భాగం*
*పిలుపుకి తగ్గ జీవితం-20*
ఎఫెసీ 4:16
17. కాబట్టి అన్యజనులు నడుచుకొనునట్లు మీరికమీదట
నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను
ధ్యానం చేసుకుంటున్నాం! మనము పిలుపుకి తగ్గ జీవితం ఎలా జీవించాలో
నేర్చుకుంటున్నాము
ఇక
ఈ 17 వ వచనంలో అంటున్నారు కాబట్టి ఇక మీరు
అన్యజనులు చేసినట్లు చేయవద్దు వారు నడుచుకుంటున్నట్లు లోకానుసారంగా నడుచుకోవద్దు
అంటున్నారు!
అయ్యా పిలుపుకి తగ్గ జీవితం జీవించాలి అంటే చేయాల్సిన అతిముఖ్యమైన
పని ఇదే! దీనికోసం నేను అనేకసార్లు నొక్కివక్కాణించి చెప్పడం వలన చాలామందికి చెడ్డ
అయిపోయాను! చాలామంది మిత్రులు వదిలిపోయారు! ఏది ఏమైనా బైబిల్ లో ఉన్నది చెప్పినది
ఉన్నట్లుగా చెప్పడం నాకు అలవాటు! లోకమంతా నాకు వ్యతిరేఖం అయిపోయినా పరవాలేదు!
కొద్దిమంది అయినా మారుమనస్సు పొంది దేవునితో సంబంధం కలిగి ఉంటే చాలు!
దేవుడు మనలను తన ఉన్నతమైన పిలుపు ఏర్పాటు ఇచ్చారు తన అమూల్యమైన
రక్తముతో కడిగారు! అందుకుగాను ఎంతో వెల చెల్లించారు! ఆ వెల వెండి బంగారాలు
కానేకావు! ఆయన తన అమూల్యమైన పవిత్రమైన రక్తము చిందించారు! అప్పుడు తన పిలుపు
మనకిచ్చారు! కాబట్టి ఆ పిలుపుకు తగినట్లు జీవించాలి! అలా జీవించాలి మొట్టమొదటి పని
అన్యజనులు చేసినట్లు అన్యజనులు ప్రవర్తించివనట్లు మనము ప్రవర్తించకూడదు! పేతురు
గారు పరిశుద్దాత్మ అభిషేకం పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా ఇచ్చిన
ఆజ్ఞ మూర్ఖులయిన ఈ తరమువారికి వేరై రక్షణ పొందుడి! కాబట్టి అన్యజనులు
ప్రవర్తించినట్లు మనము ప్రవర్తించ కూడదు!
కారణం ఈ అధ్యాయం మొదట్లో మనం ధ్యానం చేశాము, మీరు పిలువబడిన
పిలుపుకి తగిన జీవితం జీవించాలి అంటూ దేనికోసం పిలువబడ్డామో ధ్యానం చేశాము!
మనము మనమందరం దేవునిచేత పిలువబడిన వారము. దేనికోసం పిలువబడిన వారు?
పౌలుగారు అంటున్నారు: పరిశుద్దులుగా ఉండుటకు పిలువబడ్డారు ...
రోమీయులకు 1: 2
పౌలుగారు అంటున్నారు: తన ఘటమును కాపాడుకోవడమే దేవుని
చిత్తము....1థెస్సలొనికయులకు 4: 5
ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్దులుగా ఉండాలి ....లేవీ
11:44,45; 21:8;
ఇంకా పరిశుద్ధత లేకుండా ఎవరూ తండ్రిని చూడలేరు పరలోకం
చేరలేరు అని గ్రహించాలి
హెబ్రీయులకు 12: 14
అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు
ప్రయత్నించుడి. పరిశుద్ధతలేకుండ ఎవడును ప్రభువును చూడడు.
ఇంకా మనందరిని నిత్యమైన స్వాస్త్యము పొందటానికి
పిలువబడ్డాము... హెబ్రీ 9:15
మరి ఇంతటి ప్రశస్తమైన పిలుపు, ఏర్పాటు కదా దానికి తగిన జీవితం
జీవిస్తున్నావా?
ఇంకా దేవుడు నిన్ను నన్ను దేనికి పిలిచారు అంటే ఆయన
కుమారుని సహవాసానికి పిలిచారు 1కొరింథీ 1:9
ఇంకా మనకు పాప విముక్తి దయచేయాలని మనలను పిలిచారు
2తిమోతికి 1: 10
ఇంకా చీకటినుండి తనవెలుగు లోనికి పిలిచారు! ఎందుకోసం
పిలిచారు అంటే తన గుణాతిశయములను ప్రకటించడానికి
1పేతురు 2:9
ఇంకా దీవెనకు ఆశీర్వాదాలకు వారసులవ్వడానికి
1పేతురు 3: 9
ఇంకా శాశ్వత మహిమకు పిలిచారు
1పేతురు 5: 10
ఇంకా గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడ్డారు.
ప్రకటన గ్రంథం 19: 9
ఇంకా బాగా అర్ధం చేసుకోవాలంటే గొర్రెపిల్ల పెండ్లివిందు ఎప్పుడు
జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది? సంఘము ఎత్తబడిన తర్వాత మధ్యాకాశంలో జరుగుతుంది.
అనగా ఈ గొర్రెపిల్ల పెండ్లివిందులో ఎవరుంటారు? ఎత్తబడిన వారు! ఎత్తబడిన వారే
జయించిన వారు! వీరే అర్హులు!
ప్రియ దైవజనమా! నీవు నేను
ఈ గొర్రెపిల్ల పెండ్లివిందుకు పిలువబడ్డాము కదా! మరి అందుకు తగినట్లు
జీవిస్తున్నావా? ఎత్తబడే గుంపులో నీవున్నావా? ఒకవేళ ఈరోజే యేసయ్య వస్తే ఈరోజే
సంఘము ఎత్తబడితే నీవు ఎత్తబడతావా? అటువంటి జీవితం జీవిస్తున్నావా? విడువబడితే ఆ
శ్రమలు నీవు పడలేవు అని నీకు గుర్తుందా?
అందుకే
పౌలుగారు అంటున్నారు ఎఫెసీ 4:2లో మీరు పిలువబడిన
పిలుపుకు తగినట్టుగా జీవించండి. దీర్ఘశాంతముతో సంపూర్ణ వినయంతో సాత్వికముతో
నడుచుకోండి అంటున్నారు....
అందుకే యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు:
పిలువబడిన వారు అనేకులు అయితే ఏర్పరచబడిన వారు కొందరే!!!
మత్తయి 22: 14
కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరే అని
చెప్పెను.
మూర్కులైన ఈ తరమువారికి వేరై రక్షణ పొందమని చెప్పారు పరిశుద్ధాత్మ
దేవుడు. అపొస్తలుల 2:40; కాబట్టి మనము ప్రత్యేకించబడిన వారము కాబట్టి అన్యులు
చేసినట్లు మనము చేయకూడదు. అన్యాచారాలు మనం ఎంతమాత్రము చేయకూడదు. అన్యులు
ప్రవర్తించినట్లు మనం ఎంతమాత్రము ప్రవర్తించకూడదు! నీ మాట ప్రత్యేకముగా ఉండాలి. నీ
చూపు పవిత్రముగా ప్రత్యేకముగా ఉండాలి! నీ చేష్టలు ప్రత్యేకముగా ఉండాలి. అన్యులు
త్రాగినట్లు నీవు త్రాగకూడదు! అన్యులు చేసినట్లు నీవు వేషధారణ, వస్త్రధారణ
చేయకూడదు. అన్నీ ప్రత్యేకముగా ఉండాలి. దానియేలు, షడ్రక్, మేషాక్, అబెద్నేగోలు
ప్రత్యేకముగా జీవించారు. తద్వారా కష్టాలకు శ్రమలకు గురయ్యారు. అయినా సహించారు.
గొప్ప అధికారులు కాగలిగారు. ముఖ్యంగా రాజుచేతనే వీరు పూజిస్తూ, సేవిస్తున్న దేవుడు
పూజార్హుడు అని అనిపించగలిగారు
మారినీవు ప్రత్యేకముగా ఉంటూ దేవుని పిలుపుకు తగిన జీవితం
జీవిస్తావా??!!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -67వ భాగం*
*పిలుపుకి తగ్గ జీవితం-21*
ఎఫెసీ 4:16
17. కాబట్టి అన్యజనులు నడుచుకొనునట్లు మీరికమీదట
నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను
ధ్యానం చేసుకుంటున్నాం! మనము పిలుపుకి తగ్గ జీవితం ఎలా జీవించాలో
నేర్చుకుంటూన్నాము
ఇక
ఈ 17 వ వచనంలో అంటున్నారు కాబట్టి ఇక మీరు అన్యజనులు చేసినట్లు చేయవద్దు వారు
నడుచుకుంటున్నట్లు లోకానుసారంగా నడుచుకోవద్దు అంటున్నారు!
ఇక
మనము పిలుపుకి తగ్గ జీవితం జీవించాలి అంటూ అనియాజనుల వలె ప్రవర్తించకూడదు అనే
విషయాన్ని ధ్యానం చేసుకుంటున్నాము!
(గతభాగం తరువాయి)
కొలస్సీ
పత్రిక చూసుకుంటే
కొలస్సీయులకు
2: 8
ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ
లోకసంబంధమైన (భూతములు) మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానముచేత
మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి.
ప్రియులారా!
ఒకసారి దేవుణ్ణి తెలుసుకొన్న నీవు వెంబడించాల్సింది దేవున్నే గాని , ఆయనను
వెంబడించకుండా ఎవడో చెప్పాడని, మనుష్యుల పారంపర్యాచారాలు అనగా ఈ లోక మూలపాఠాలు లేక
లోక ఆచారాలు, ఈ లోకపు పోకడలను అనుసరించి నడుస్తారేమో అని జాగ్రత్తగా ఉండమని
చెబుతున్నారు. ఇక్కడ నిరర్ధకమైన తర్కజ్ఞానము అనడానికి కారణం, గత భాగాలలో
వివరించినట్లు పరమాత్ముని చేరుకోవాలంటే జ్ఞానమార్గము అనుసరించాలి. ఆ జ్ఞానమార్గము
తత్వశాస్త్రము, వేదాంతము తెలుసుకోవడం వలన వస్తుంది అని సంఘములో తత్వజ్ఞానమును,
వేదాంతమును బోధించడం మొదలుపెట్టారు అబద్దబోధకులు! అందుకే ఇలాంటి నిరర్ధకమైన
తత్వజ్ఞానము అనగా మన సామాన్య భాషలో చెప్పాలంటే పనికిమాలిన తత్వజ్ఞానము వెనుక
పారిపోవద్దు అని హెచ్చరిస్తున్నారు!
ఇక ఈ లోకపు ఆచారాలు-
పోకడలు చేయవద్దు అని చెబుతున్నారు పౌలుగారు. బైబిల్ గ్రంధం మొత్తం మనము
లోకస్తులనుండి వేరై – ప్రత్యేకముగా
జీవించాలి అని చెబుతుంది.
యిర్మియా 10:2-3 లో
యెహోవా
సెలవిచ్చుచున్న దేమనగా అన్యజనముల ఆచారముల నభ్యసింపకుడి, ఆకాశమందు అగపడు చిహ్నములకు
జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి.
.ఎందుకంటే అవి వ్యర్ధములు!
అందుకే అపొస్తలుడైన పేతురు గారు పరిశుద్ధాత్మను పొందుకున్న వెంటనే తన
ప్రసంగంలో నుండి వెలువడిన ప్రత్యక్షత/ ఆజ్ఞ- -
ఏమిటంటే మీరు మూర్ఖులైన ఈ తరమువారికి వేరై రక్షణ పొందుడి!!! అపోస్తలులు
2:40; చూశారా ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత ఇక పాత అలవాట్లు, పాత ఆచారాలు
చేయకూడదు! కారణం లోకాచారాలు- లోకపు పోకడలు ఆత్మ సంభందమైన మరణము నుండి పుట్టి,
శాశ్వతమరణానికి దారితీస్తాయి!
2 కొరింథీ 6:14-16
మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి
సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమిపొత్తు?
క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో
విశ్వాసికి పాలెక్కడిది? . . మీరు జీవముగల దేవుని ఆలయమై ఉన్నారు కాబట్టి
జీవముగల దేవుని పనులు చేయాలి గాని విగ్రహ సంభంధమైన పనులు ఏమీ చేయకూడదు!
ఉదాహరణ:
** వారు (అన్యులు) ముహూర్తాలు చూస్తారు- మీరు కూడా ముహూర్తాలు
చూస్తే వారికి- మీకు తేడా ఏమిటి?
** వారు వాస్తు పాటిస్తారు- మీరుకూడా బైబిల్ కి వ్యతిరేఖమైన వాస్తు
పాటిస్తే వారికి- మీకు తేడా ఏమిటి?
** అన్యులు తమ వివాహాలలో- తాళి కట్టడం, పసుపు రాయడం, అక్షింతలు
వేయడం, గంధం పూయడం, పందిరి రాటవేయడం, మామిడాకులు కట్టడం లాంటివి చేస్తారు.
క్రైస్తవుడని పేరు పెట్టుకుని నీవుకూడా అదే విగ్రహ సంభంధమైన అన్యాచారాలు చేస్తే
వారికి- మనకు తేడా ఏమిటి? కేవలం బొట్టు ఒకటి పెట్టుకోవడం లేదు అంతే! అక్కడ
బ్రాహ్మణ పురోహితుడు, ఇక్కడ క్రైస్తవ పూజారి అంటే తేడా! ఇదేనా క్రైస్తవ్యం??!!!
*** ఇక వారిలాగే mature function చేయడం! ఇది గొప్పగా అందరికీ
డప్పు వేసుకుని చేసే కార్యక్రమమా? వారేదో చేస్తున్నారు. క్రైస్తవులారా ఇలా
చేయవచ్చా! ఆలోచించారా?
*** ఎవరైనా చనిపోతే 11వ నెలలో జ్ఞాపకార్ధ కూటము- జ్ఞాపకార్ధ కూటము
అంటే అదే నెలలో, అదే తారీకున చేయాలి, ఇది అన్యాచారం కాదా!!!
** ఇంకా మరికొందరు ఎదుర్లు చూస్తారు, వీరు ఎదురు వస్తే మంచిది కాదు
అంటారు, ఇంకా కొంతమంది జ్యోతిష్యం చెప్పించుకుంటారు, సోదెలు, శకునాలు చూస్తారు.
ఇలాంటివారిని దేశం నుండి వెళ్ళగొట్టమని (లేవీ 19:31) బైబిల్ చెబితే వీరి వెనుకాల
తిరగటానికి సిగ్గులేదా? సౌలురాజు ఏమయ్యాడు ఇవి చూసి?
** ఇక అన్యులు, సినిమా తారలు వేసుకునే వస్త్రధారణనే క్రైస్తవ సంఘం
వేసుకుంటుంది. ఇది దేవుడు మేచ్చేదా? ఇంకా కొంతమంది స్త్రీలు – స్త్రీ
పురుషవేషం ధరించకూడదు, పురుషుడు స్త్రీ వేషం ధరించకూడదు అని చెబితే (ద్వితీ 22:5),
స్త్రీలు జీన్స్ పేంట్, టీ-shirts వేసుకుని తిరుగుతున్నారు, మరీ
ఘోరమేమిటంటే అవి వేసుకుని, ముసుగువేసుకోకుండా స్టేజిమీద పాటలు పాడుతున్నారు! ఇది
పరిశుద్దాత్మునికి దుఃఖపరుస్తున్నారని తెలియదా??!!
** ఇక అన్యులు తమ పండుగలలో డేన్స్ వేస్తారు, ఇక క్రైస్తవులు కూడా
అదే సినిమా స్టెప్పులతో డేన్స్ వేస్తే లోకానికి- సంఘానికి తేడా ఏమిటి?
ప్రియ సహోదరుడా/ సహోదరి!
అన్యులు త్రాగినట్లు నీవుకూడా త్రాగుబోతుగా ఉంటే, లంచగొండిగా, జూదగానిగా,
అబద్ధకునిగా, వ్యభిచారిగా ఉంటే వారికి- నీకు తేడా ఏమిటి? అందుకే నీవు యేసయ్య కోసం
చెప్పలేకపోతున్నావు- ఇక ఎప్పుడైనా చెబితే చాలు చాలులే ఇక ఆపు అంటున్నారు- నీ
బ్రతుకు బాగులేక!!
ఇందుకేనా యేసయ్య నీకోసం
రక్తం కార్చినది? ఇన్ని శ్రమలు పడ్డాది?
మీరు వెండిబంగారాలు వంటి వెలగల వస్తువుల చేత రక్షించబడలేదు గాని
అమూల్యమైన రక్తము ద్వారా విమోచించబడ్డారని మరచిపోయావా? 1పేతురు 1:18-19;
అందుకే
1 Peter(మొదటి
పేతురు) 2:9,10,11
9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి
మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును,
రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.
10. ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు
కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి.
11. ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునైయున్నారు గనుక
ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి,
. .అంటున్నారు.
చివరికి
అన్యులతో వియ్యమొందరాదు అని చెబుతుంది బైబిల్
ద్వితీ 7:3-6;
రోమీయులకు 12: 2
మీరు ఈ లోక( లేక, ఈ యుగ) మర్యాదను అనుసరింపక, ఉత్తమమును,
అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ
మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి.
ఒకవేళ నీవు లోకచారాలు చేస్తే, లోకాన్ని స్నేహిస్తే
యాకోబుగారు అంటున్నారు
:4:4
వ్యభిచారిణులారా, యీ లోక స్నేహము దేవునితో వైరమని
మీరెరుగరా? కాబట్టియెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.
కాబట్టి ప్రియదైవజనమా! ఈలోకాచారాలు, లోక
మర్యాదలు చేసి దేవుని నుండి దూరమైపోవద్దు! మన భారతీయులం, భారత దేశ సాంప్రదాయం అనే
బోధించే, అనుకూల బోధకుల బోధకు మోసపోవద్దు! అవి చేసేవారికి దేవుని శాపం వస్తుంది,
చేయించే వారికి కూడా దేవుని ఉగ్రత వస్తుంది! అంతేకాకుండా యేసుప్రభులవారికి
చోటులేని ఏ భోదను మీ చెంతకు రానీయవద్దు!
యేసుప్రభులవారు లేని ఏ ఆచారము/ వాక్యానుసారం కాని పని ఏవీ చేయొద్దు. ఈ రోజులలో కొన్ని
సాంప్రదాయాల మీద, ప్రాచీన రచనలమీద, మానవ అభూత కల్పనల మీద ఆధారపడిఉన్న ఈ ఆచారాలు,
ఆలోచనలు పాటించకూడదు కారణం వీటిలో నిజ దేవుని జ్ఞానం కొంచెమైనా లేదు! క్రీస్తుకు
వాటిలో చోటులేదు!
కాబట్టి
వాటిని పాటించవద్దు అని పరిశుద్ధాత్ముడు పౌలుగారి ద్వారా మనకు సెలవిస్తున్నాడు!
మనం
కూడా ఈ అన్యాచారాలు మానేద్దాం! క్రీస్తుని ఎదుర్కొందాం!
ఆమెన్!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -68వ భాగం*
ఎఫెసీ 4:17
18. వారైతే అంధకారమైన మనస్సుగలవారై, తమ హృదయ కాఠిన్యమువలన
తమలోనున్న అజ్ఞానముచేత దేవునివలన కలుగు జీవములోనుండి వేరుపరచబడినవారై, తమ మనస్సు
నకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు.
19. వారు సిగ్గులేనివారైయుండి నానావిధమైన అపవిత్రతను
అత్యాశతో జరిగించుటకు తమ్మునుతామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! మనము పిలుపుకి తగ్గ జీవితం ఎలా జీవించాలో నేర్చుకుంటున్నాము
ప్రియులారా ఇంతవరకు
పిలుపుకి తగిన జీవితం జీవించండి అని చెబుతూ ఈ రెండు వచనాలలో అన్యజనులైతే వారికి
పిలుపు ఏర్పాటు లేదు కాబట్టి వారికి అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన
తమలో ఉన్న అజ్ఞానము చేతను వారు దేవుని వలన కలుగు జీవములోనుండి వేరు పరచబడిన వారై
తమ మనస్సునకు కలిగిన వ్యర్ధత అనుసరించి నడుచుకొంటున్నారు అంటూ వారు సిగ్గులేని
వారై ఉండి నానావిధమైన అపవిత్రతను అత్యాశక్తితో జరిగిస్తూ తమ్మును తామే
కాముకత్వమునకు అప్పగించుకొన్నారు అంటున్నారు! వీరు ఎవరు? పిలుపును ఏర్పాటును లేని
వ్యక్తులు అన్నమాట!!
చూడండి ఏమని చెబుతున్నారో: వారైతే అంధకార మైన మనస్సు గలవారై
అంటున్నారు, మరో దగ్గర అంటున్నారు ఈ యుగసంబంధమైన దేవత వీరికి అనగా వీరి ఆత్మీయ
నేత్రాలకు గ్రుడ్డితనము కలిగించి నందు వలన వీరు నిజమైన వెలుగైన క్రీస్తును
పొందుకోలేక పోతున్నారు! ఇక్కడ వీరికి అంధకారమైన మనస్సు కలిగి ఉన్నారు అంటున్నారు!
“వ్యర్థమైన విషయాల వైపు వీరు మ్రగ్గుచూపు తున్నారు ”–
రోమీయులకు 1:21; మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా
మహిమపరచ లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి.
అపో. కార్యములు 14:15;
అయ్యలారా,
మీరెందుకీలాగు చేయుచున్నారు? మేము కూడ మీ స్వభావమువంటి స్వభావముగల నరులమే. మీరు ఈ
వ్యర్థమైనవాటిని విడిచి పెట్టి, ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోఉండు సమస్తమును
సృజించిన జీవముగల దేవునివైపు తిరుగ వలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము.
పేతురు గారు అంటున్నారు మీరు చేసే ఆచారాలు పితృపారంపర్యాలు
వ్యర్ధమైనవి
1 పేతురు 1:18
పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా
వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని
లోకంలో అనేకమంది బుద్ధికి అనుగుణంగా,
హేతుబద్ధంగా ఆలోచించడంలో తమకు గల సామర్థ్యం గురించి గర్వపడుతుంటారు. కానీ దేవుని దృష్టిలో వారి ఆలోచనలు, ముఖ్యంగా
మత, వేదాంత సంబంధమైన ఆలోచనలు శూన్యమైనవి, పనికి రానివి. క్రీస్తులేని ప్రజల
స్థితిని పౌలుగారు ఇక్కడ నాలుగు మాటల్లో
వివరించారు .
చూడండి
క్రీస్తులేని జీవితం మరియు మనస్సు
అంధకారమైనది “చీకటి మయం”–
కీర్తనల గ్రంథము 82:5;
జనులకు తెలివి లేదు
వారు గ్రహింపరు వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు దేశమునకున్న ఆధారములన్నియు
కదలుచున్నవి.
యోహాను 1:5;
ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని
గ్రహింపకుండెను.
యోహాను 3:19;
ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు
చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి.
అపో. కార్యములు 26:18;
వారు చీకటిలోనుండి వెలుగులోనికిని సాతాను అధికారమునుండి
దేవుని వైపుకును తిరిగి, నా యందలి విశ్వాసముచేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచ
బడినవారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను
వారియొద్దకు పంపెదనని చెప్పెను.
2 కోరింథీయులకు 4:4;
దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము
వారికి ప్రకా శింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో
నేత్రములకు గ్రుడ్డితనము కలుగ జేసెను.
1 పేతురు 2:9; అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన
వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము,
ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన
ప్రజలునై యున్నారు.
1 యోహాను 2:11. తన
సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి, చీకటిలో నడుచుచున్నాడు; చీకటి అతని కన్నులకు
గ్రుడ్డితనము కలుగజేసెను గనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు.
ఇక
తర్వాత లక్షణం: హృదయ కాఠిన్యం లేక “బండబారి పోవడం:”– దేవుణ్ణి సంతోషపెట్టేదాన్ని
లెక్కచేయకుండా తమనుతాము సంతోషపెట్టుకునే పనులు చెయ్యాలని నిశ్చయించు కోవడం ద్వారా,
పాపం చేయడం ద్వారా మనుషులు దేవునికి వ్యతిరేకంగా తమ హృదయాలను కఠినం
చేసుకుంటున్నారు:
హెబ్రీయులకు 3:13; నేడు మీరాయన శబ్దమును వినినయెడల, కోపము
పుట్టించి నప్పటివలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక,
నిర్గమకాండము 8:15;
ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరచుకొని వారి మాట
వినక పోయెను.
2 రాజులు 17:14; వారు విననివారై తమ దేవుడైన యెహోవా దృష్టికి
విశ్వాసఘాతుకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి.
కీర్తనల గ్రంథము
95:8 అరణ్యమందు మెరీబాయొద్ద మీరు
కఠినపరచుకొని నట్లు మస్సాదినమందు మీరు కఠినపరచుకొనినట్లు మీ హృదయములను
కఠినపరచుకొనకుడి.
ఇక
తర్వాత లక్షణం: “అజ్ఞానం చేత నిండి
ఉన్నారు ”– వారికి అనేక సంగతులు తెలిసి
ఉండవచ్చు గాని నిజ దేవుడు వారికి తెలియదు
రోమీయులకు 1:22; వారి అవివేకహృదయము అంధకారమయమాయెను; తాము
జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి.
1 కోరింథీయులకు 1:21; దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానముచేత
దేవునిని ఎరుగకుండినందున, సువార్త ప్రకటన యను వెఱ్ఱి తనముచేత నమ్మువారిని
రక్షించుట దేవుని దయా పూర్వక సంకల్పమాయెను.
1 యోహాను 2:4 ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు, ఆయన
ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు; వానిలో సత్యములేదు.
చివరిగా
దేవునివలన కలుగు జీవములోనుండి వేరుపరచబడినవారై,
లేక “దేవుని జీవం నుంచి పరాయివారుగా వేరై జీవిస్తున్నారు ”– ఎఫెసీయులకు 2:12; ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుకాక, పరదేశులును,
వాగ్దాన నిబంధనలు లేని పరజనులును, నిరీక్షణలేనివారును, లోక మందు దేవుడు
లేనివారునైయుండి, క్రీస్తుకు దూరస్థులై యుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి.
యోహాను 14:17; లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను
పొంద నేరదు; మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడ నివసించును, మీలో ఉండును.
రోమీయులకు 8:9, దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు
ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ
లేనివాడైతే వాడాయనవాడు కాడు.
యూదా 1:19.
అట్టివారు ప్రకృతి సంబంధులును ఆత్మ లేనివారునైయుండి భేదములు కలుగజేయుచున్నారు.
19
వ వచనంలో ఇంకా అంటున్నారు వారు
సిగ్గులేనివారైయుండి నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మునుతామే
కాముకత్వమునకు అప్పగించుకొనిరి.
బండబారిపోయిన హృదయాల వల్ల కలిగే ఫలితం ఇది – మనుషుల్లో నీతి సంబంధమైన
గ్రహింపు, మనోభావం నశిస్తుంది. అందుకే ఎఫెసీ 2:3 లో అంటున్నారు : వారితో కలిసి
మనమందరమును శరీరముయొక్కయు మనస్సుయొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను
అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు
పాత్రులమై యుంటిమి.
కనుక ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు పాపం పాపంలాగా అనిపించదు. అది పాపమే
కాదనడం మొదలు పెడతారు. ఇక లైంగిక అవినీతిలో, ఇతర దుర్మార్గతల్లో తమను తాము
మరచిపోవడమే తరువాత దశ. అప్పుడు ఏమి జరుగుతుందో రోమీయులకు 1:24-32 లో వాస్తవమైన,
భయంకరమైన వర్ణన ఉంది. “కామ వికారాలకు”– కామవికారానికి ఎప్పుడూ
తృప్తి ఉండదు. దాన్ని ఎంత తృప్తి పరచుకుందామని మనుషులు ప్రయత్నిస్తే అది అంతగా
కోరుతుంది, అంతగా చెలరేగుతుంది, ఇంకా కావాలంటుంది.
24. ఈ హేతువుచేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, తమ
శరీరములను పరస్పరము అవమాన పరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను.
25. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి,
సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన
స్తోత్రార్హుడై యున్నాడు, ఆమేన్.
26. అందువలన దేవుడు తుచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించెను.
వారి స్త్రీలు సయితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును
అనుసరించిరి.
27. అటువలె పురుషులు కూడ స్త్రీయొక్క స్వాభావికమైన ధర్మమును
విడిచి, పురుషులతో పురుషులు అవాచ్యమైనదిచేయుచు, తమ తప్పిదమునకు తగిన ప్రతి ఫలమును
పొందుచు ఒకరియెడల ఒకరు కామతప్తులైరి.
28. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి
గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను.
29. అట్టివారు సమస్తమైన దుర్నీతిచేతను, దుష్టత్వముచేతను,
లోభముచేతను, ఈర్ష్యచేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము వైరమనువాటితో
నిండినవారై
30. కొండెగాండ్రును అపవాదకులును, దేవద్వేషులును,
హింసకులును, అహంకారులును, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును,
తలిదండ్రులకవిధేయులును, అవివేకులును
31. మాట తప్పువారును అనురాగ రహితులును, నిర్దయులునైరి.
32. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను
దేవుని న్యాయ విధిని వారు బాగుగ ఎరిగియుండియు, వాటిని చేయు చున్నారు. ఇది మాత్రమే
గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు.
కాబట్టి
ఇటువంటి మనస్సు మనలో ఉంటే వెంటనే తీసివేద్దాం! గమనించాలి ఇలా చేసేవారు పిలువబడిన
వారు కానేకాదు! ఇలా జీవించడం పిలువబడిన పిలుపుకి తగిన జీవితం జీవించడం అసలు
కానేకాదు!
కాబట్టి
మనలని మనం ఒకసారి పరిశీలన చేసుకుని దేవునికి ఆయాసకరమైన కార్యాలు ఏవైనా ఉంటే నేడే
తొలిగించుకుందాం!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -69వ భాగం*
*పిలుపుకు తగిన జీవితం-22*
ఎఫెసీ 4:20—24
20. అయితే మీరు యేసునుగూర్చి విని,
21. ఆయనయందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు
ఉపదేశింపబడినవారైనయెడల, మీరాలాగు క్రీస్తును నేర్చుకొన్నవారుకారు.
22. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన
దురాశవలన చెడిపోవు మీ ప్రాచీనస్వభావమును వదలుకొని
23. మీ చిత్తవృత్తియందు నూతనపరచబడినవారై,
24. నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా
సృష్టింప బడిన నవీనస్వభావమును ధరించుకొనవలెను.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! మనము పిలుపుకి తగ్గ జీవితం ఎలా జీవించాలో నేర్చుకుంటున్నాము
ఇక ఈ వచనాలలో చూసుకుంటే అయితే
మీరు యేసుక్రీస్తుప్రభులవారి కోసం విన్నారు, ఇంకా ఆయన యందలి సత్యాన్ని ఉన్నది
ఉన్నట్లుగానే ఆయనయందు ఉపదేశించ బడిన వారైతే మీరు అలాగు క్రీస్తును నేర్చుకొన్న
వారు కారు అంటున్నారు! అనగా మీరు ఏసుక్రీస్తు కోసం విని, ఆయన సత్యాన్ని ఉన్నది
ఉన్నట్లుగా గ్రహించినా మంచి ఉపదేశం పొందినా మీలో ఇంకా సంపూర్ణమైన మార్పు కనబడటం
లేదు! మీ ప్రాచీన పురుషుడు ఇంకా పూర్తిగా చావలేదు అంటున్నారు!
గమనించాలి క్రైస్తవులు అనిపించుకునేవారు కొందరు కూడా వ 19లో ఉన్నట్టు
ప్రవర్తిస్తారు. కానీ క్రీస్తును గురించి వారు నేర్చుకున్న వాటన్నిటికీ వారి
ప్రవర్తన భిన్నంగా వ్యతిరేకంగా ఉంటుంది. బాప్తిస్మముతో పేరు మారింది కానీ బ్రతుకు
మారలేదు, నిజమైన పశ్చాత్తాపం లేనేలేదు! పేరుకు మాత్రమే క్రైస్తవులు! పాత అలవాట్లు,
త్రాగుడు, లంచాలు, జూదము, వ్యభిచార క్రియలు, మోహపు చూపులు సినిమాలు సీరియళ్ళు
పోలేదు! కోపము అసూయ పోలేదు! క్రీస్తునందు గల సత్యాన్ని ఉన్నది ఉన్నట్లు విన్నా
సరియైన ఉపదేశం పొందినా గాని బ్రతుకులు మాత్రము మారలేదు! అందుకే 22 వ వచనంలో
అంటున్నారు కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశవలన చెడిపోవు మీ
ప్రాచీనస్వభావమును వదలుకొని.....
ప్రాచీన
స్వభావాన్ని వదిలివేయాలి! ఎందుకు
వదిలివేయాలి అంటున్నారు అంటే రోమా 6:6 లో అంటున్నారు
6. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాపశరీరము
నిరర్థకమగునట్లు, మన ప్రాచీన స్వభావము ఆయనతోకూడ సిలువవేయ బడెనని యెరుగుదుము.
7. చనిపోయినవాడు పాపవిముక్తుడని తీర్పుపొందియున్నాడు.
8. మనము క్రీస్తుతోకూడ చనిపోయిన యెడల, మృతులలోనుండి లేచిన
క్రీస్తు ఇకను చనిపోడనియు,
9. మరణమునకు ఇకను ఆయనమీద ప్రభుత్వము లేదనియు ఎరిగి,
ఆయనతోకూడ జీవించుదుమని నమ్ముచున్నాము.
10. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా, పాపము విషయమై, ఒక్కమారే
చనిపోయెను గాని ఆయన జీవించుట చూడగా, దేవుని విషయమై జీవించుచున్నాడు
11. అటువలె మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై
క్రీస్తుయేసు నందు సజీవులుగాను మిమ్మును మీరే యెంచుకొనుడి.
12. కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ
శరీరమందు పాపమును ఏలనియ్యకుడి.
13. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు
అప్పగింపకుడి, అయితే మృతులలోనుండి సజీవులమనుకొని, మిమ్మును మీరే దేవునికి
అప్పగించు కొనుడి, మీ అవయవములను నీతిసాధనములుగా దేవునికి అప్పగించుడి.
ఇంకా కొలస్సీ 3:9—10 లో
అంటున్నారు
9. ఒకనితో ఒకడు అబద్ధ మాడకుడి;ఏలయనగా ప్రాచీనస్వభావమును
దాని క్రియలతో కూడ
10. మీరు పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని
సృష్టించినవాని పోలికచొప్పున నూతన పరచబడుచున్న నవీనస్వభావమును ధరించుకొని
యున్నారు.
కాబట్టి
ఇక్కడ కూడా ప్రాచీన స్వభావము లేక ప్రాచీన పురుషుడు వాడు సిలువవేయబడి చనిపోయాడు!
వాడు ఇక నీలో బ్రతుక కూడదు! పాత లక్షణాలు ఒకటి కూడా నీలో ఇప్పుడు కనబడకూడదు
ఎందుకంటే ఇప్పుడు నీవు నూతన పురుషునిగా మార్చబడ్డావు! పాతవి గతించెను ఇదిగో
క్రొత్తవాయేను అంటుంది బైబిల్!!
2కోరింథీయులకు 5:17
కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి
గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;
ఇంకా ఎందుకు పాత
స్వభావమును అనుసరించి నడవకూడదు అంటే : మీరు/మనము ప్రాచీన పురుషుని అనగా
మార్పుచెందని, మారుమనస్సు నొందని హృదయము గల అంతరంగపురుషుని, వాని పనులతో/ క్రియలతో
పాటు పరిత్యజించి- అనగా వదలివేసారు (లేదా విడాకులు ఇచ్చారు). ఏమి క్రియలు – చేయరాని పనులు అనగా జారత్వం, వ్యభిచారం, అక్రమసంభంధాలు, దొంగతనం,
అబద్దాలు, మోసం, కోపం, ఆగ్రహం, అవినీతి, బూతులు లాంటివాటికి విడాకులు ఇచ్చారు/
వదలివేసారు. ఆ తర్వాత జ్ఞానము కలుగు నిమిత్తము దానిని అనగా శరీరాన్ని పుట్టించిన
వాని పోలిక చొప్పున అంటున్నారు – మరికొన్ని తర్జుమాలలో
సృష్టికర్త పోలిక ప్రకారం సంపూర్ణమైన అవగాహనలో నూతన పరచబడుతూ క్రొత్త మానవునిగా
లేదా నూతన అంతరంగపురుషుని ధరించుకొన్నారు.
చూసారా! మొదటగా మనం
సృష్టికర్తయైన దేవుని పోలికలో చేయబడ్డాం! ఆదికాండంలో దేవుడు తనపోలిక చొప్పున నరుని
చేసినట్లు చూస్తున్నాం. 1:27; అయితే క్రొత్తనిబంధనకి రాబోయేసరికి రోమా 8:4 ప్రకారం పాప శరీరాకారం
అంటున్నారు.
దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన
శరీరమందు పాపమునకు శిక్ష విధించెను.
అయితే తిరిగి ఆ దేవునిపోలిక ఎలా కలుగుతుంది?
మార్పుచెంది, మారుమనస్సు పొంది, బాప్తిస్మం పొందితే – అంతరంగపురుషుడు
పాపశరీరాకారము నుండి దేవునిపోలికగా మారతాడు.
మనష్యులు పశ్చాత్తాపపడి క్రీస్తుపై
నమ్మికయుంచి పాతజీవిత విధానానికి స్వస్తి చెప్పినప్పుడు, బాప్తిస్మము ద్వారా
క్రొత్త జీవిత విధానాన్ని ధరిస్తారు. క్రొత్త మనుష్యులు అంటున్నారు 2 కొరింథీ 5:17
లో. ఈ క్రొత్త స్వభావమే దేవునిపోలిక! అనగా
ఈ క్రొత్త ఆధ్యాత్మిక జీవిత విధానమే/ పవిత్ర హృదయమే/ న్యాయమైన ప్రవర్తనయే నూతన
జీవము/ జీవనము.
ఎఫెసీ 4:22-24
22. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన
దురాశవలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును (మూలభాషలో-ప్రాచీన పురుషుని) వదలుకొని
23. మీ చిత్తవృత్తియందు నూతన పరచబడినవారై,
24. నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా
సృష్టింపబడిన నవీన స్వభావమును (మూలభాషలో-నవీన పురుషుడు) ధరించుకొనవలెను.
ఇంకా గలతీ 3:27
క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరు క్రీస్తును
ధరించుకొనియున్నారు. కాబట్టి పాత అలవాట్లు వదిలెయ్యాలి.
మరి ఈ మార్పు కేవలం యూదులకేనా? కాదు
అందరికి!! 11వ వచనం
ఇట్టివారిలో గ్రీసుదేశస్థుడని యూదుడని భేదము లేదు; సున్నతి
పొందుటయని సున్నతి పొందక పోవుటయని భేదము లేదు; పరదేశియని సిథియనుడని (అనాగరికమైన
ఒక జనము) దాసుడని స్వతంత్రుడని లేదుగాని, క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై
యున్నాడు.
చూశారా గ్రీసు దేశస్తుడని, యూదుడు,
ఆఫ్రికా, అమెరికా, ఇండియా, పాకిస్తాన్ అని లేదు, చదువుకొన్న వాడు, చదువులేని
పామరుడు అనిగాని, ధనవంతుడు—పేదవాడు అనిగాని, స్త్రీ -- పురుషుడు అనిగాని లేదు. వారు ఎవరైనా సరే
మారుమనస్సు చెంది, యేసురక్తములో కడుగబడితే నూతన సృష్టి. పాతవి గతించెను ఇదిగో
క్రొత్తవాయెను. 2 కొరింథీ 5:17; నూతన
పురుషుడుగా మార్పు చెందుతారు.
ఇక
అప్పుడు ఈ చేయరాని పనులు చేయకూడదు.
మరి ఇది నిజంగా/ ప్రాక్టికల్గా
సాధ్యమా? సాధ్యమే!
గలతీ 5:16-17
16. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి,
అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు.
17. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా
అపేక్షించును. ఇవి యొకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయనిచ్ఛయింతురో
వాటిని చేయకుందురు. అప్పుడు మనిషి
దేవుని స్వరూపంలో మారినందున పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా పరిశుద్దుడిగా జీవించగలడు.
సాతాను
శారీరక శోధనలను జయించగలడు.
దేవుని
దృష్టికి పవిత్రుడిగా, అనింధ్యుడిగా మారి—తేజోవాసుల స్వాస్త్యమునకు
హక్కుదారులుగా, గొర్రెపిల్ల పెండ్లి విందులో పాల్గొన గలరు.
కాబట్టి
పిలుపుకి తగిన జీవితం జీవించడం అంటే మరొక విధానం: ప్రాచీన స్వభావాన్ని వదిలి
క్రీస్తులో నూతన స్వభావం పొందుకోవాలి!!!
ప్రియ
చదువరీ! ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకో!
ఇంకా
ఆ పాతరోత బ్రతుకు ఉంటే వాటిని వదలివేసి యేసయ్య సిలువచెంతకు రా!
నూతన
స్వభావాన్ని పొందుకో!
ఆమెన్!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -70 వ భాగం*
*పిలుపుకు తగిన జీవితం-23*
ఎఫెసీ 4:25
మనము ఒకరికొకరము అవయవములై యున్నాము గనుక మీరు అబద్ధమాడుట
మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! మనము పిలుపుకి తగ్గ జీవితం ఎలా జీవించాలో నేర్చుకుంటూన్నాము
చూడండి
ఇక్కడ పిలుపుకి తగిన జీవితం జీవించే విధానంలో మరో పద్దతి: మీరు అబద్ధమాడుట మాని
ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను.
ఎందుకు
అంటే మనము ఒకరికి ఒకరు అవయవములు! ఎందుకంటే
4. శరీర మొక్కటే,
ఆత్మయు ఒక్కడే; ఆ ప్రకారమే మీ పిలుపువిషయమై యొక్కటే నిరీక్షణ యందుండుటకు
పిలువబడితిరి.
5. ప్రభువు ఒక్కడే, విశ్వాస మొక్కటే, బాప్తిస్మ మొక్కటే,
6. అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా
ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలోఉన్నాడు.
ఇంకా 16. ఆయన శిరస్సయి యున్నాడు, ఆయననుండి సర్వశరీరము చక్కగా
అమర్చ బడి, తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి
కీలువలన గలిగిన బలముచేత అతుకబడి, ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు
శరీరమునకు అభివృద్ధి కలుగజేసికొనుచున్నది.
కాబట్టి
మనమంతా క్రీస్తుయేసు శరీరంలో అవయవములు గనుక అందరమూ కలిసి ఉండాలి, ఇంకా సత్యమే
చెప్పాలి అబద్దాలు వదిలివేయాలి! కొలస్సీ పత్రికలో అంటున్నారు
కొలస్సీ 3:9 .
ఒకనితో ఒకడు అబద్ధ మాడకుడి;ఏలయనగా ప్రాచీన స్వభావమును
(ప్రాచీన పురుషుని)దాని క్రియలతో కూడ. . .
ప్రియులారా!
పిలుపుకి తగిన జీవితం జీవించాలంటే విసర్జించవలసినవి
*అబద్దాలు- అబద్ద బ్రతుకులు*! కారణం 3:10
మీరు పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని
సృష్టించినవాని పోలికచొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొనియున్నారు.
మీరు
నావాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులైయుండి సత్యమును గ్రహింతురు.(యోహాను
8:31),
మీరు మీ తండ్రియగు అపవాధి సంబంధులు, మీతండ్రి దురాశలను
నెరవేర్చగోరుచున్నారు- ఆదినుండి వాడు నరహంతకుడు. . . . వానియందు సత్యము లేదు, వాడు
అబధ్దికుడు, అబద్ధమునకు జనకుడై(తండ్రి) యున్నాడు (యోహాను 8:44)
ప్రియ సహోదరి/సహోదరుడా! నేడు అబద్ధాలు చెప్పడం మనకు అనగా
చిన్నవారికి పెద్దవాళ్ళకు అందరికీ అలవాటైపోయింది. పెద్ద అబద్ధాలు కాకపోయినా చిన్ని
చిన్ని అబద్ధాలు ఆడుతూ తప్పులేదు అనుకొంటున్నాం. అబద్ధం చిన్నదైనా పెద్దదైనా
అబద్ధమే, పాపం చిన్నదైనా పెద్దదైనా పాపమే. ఉదా- ఒక వ్యక్తి విశాఖపట్నం నుండి
రాజమండ్రి ట్రైన్లో వెళ్తున్నాడు అనుకొందాము, ఆ వ్యక్తి తునిదగ్గర ఉండగా మరో
వ్యక్తి ఫోన్ చేస్తే ఎక్కడున్నారు ఎప్పుడొస్తారు అని అడిగితే సామర్లకోట దాటేశాను
అరగంటలో వచ్చేస్తాను అంటాడు. ఇది అబద్ధం కాదా? సరే, చివరకు ఇక గంటన్నర లేటుగా
వెళ్తాడు, వెళ్ళి మరో అబద్ధం చెబుతాడు ట్రాఫిక్ జామ్ అనో, మధ్య దారిలో కారు
పాడైపోయింది అనో. ఒక అబద్ధం కప్పిపుచ్చుకోవడానికి మరో అబద్ధం, పాపానికి పాపం జత
చేస్తున్నావని మర్చిపోకు. దేవుడు ఏమన్నారు? నీ మాట అవునంటే అవును; కాదు అంటే కాదు
అని ఉండాలి, వీటికి మించునది దుష్టునినుండి పుట్టింది (మత్తయి 6:37). ప్రియబిడ్డా!
ఆలోచించు! ప్రతీ రోజూ మనం ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాము. సత్యం చెబితే దేవుని
సంబంధివి, అబద్ధాలు చెబుతున్నావు అంటే సాతాను సంభంధివే!
మరికొంతమంది,
ఎవరైనా అవసరానికి చేబదులు (అప్పు) అడిగితే డబ్బులు ఉంచుకొని కూడా డబ్బులు లేవు,
జీతాలు రాలేదు ఇలా సాకులు చెబుతారు అతనికి/ఆమెకు ఇవ్వడం ఇష్టం లేక. ఇది అబద్ధం
కాదా? అబద్ధం చెప్పి నరకానికి పోవడం కన్నా నిజంచెప్పి నిష్ఠూర పడటమే మంచిది కదా!
బైబిలులో ఏమి వ్రాయబడింది నీవు సహాయం చేయగలిగే స్థితిలో ఉండి కూడా సహాయం చేయకపోతే
అది నీకు పాపం(సామెతలు 3:27). యోబుగారిని ఒకసారి తలంచుకొందాం. దేవుడే సాతానుదగ్గర
సాక్ష్యం చెబుతున్నారు " యోబు యదార్థవర్తనుడు,నీతిమంతుడు ...." అని
(యోబు 1:8). నీకోసం దేవుడు కాదు కదా కనీసం పొరుగువారు యధార్ధవంతుడు అని చెప్పగలరా?
కనీసం నీ మనస్సాక్షి అయినా సాక్ష్యం చెప్పగలదా?
ఇంకొంతమంది అబద్ధ ప్రమాణాలు చేస్తారు.
యాకోబు 3:14 లో ఏమి వ్రాయబడింది : సత్యమునకు విరోధముగా అబధ్ధమాడవద్దు అని
ఖండితముగా ఆజ్ఞాపిస్తున్నారు.
ఇలాంటి కొంతమందిని జ్ఞాపకం చేసుకొందాం.
1) యెజెబెలు రాణి అబధ్ధ
సాక్షులను ఏర్పాటు చేసి భక్తుడైన నాబోతుగార్ని చంపించింది.(1రాజులు 21వ అధ్యాయం).
వెంటనే దేవుడు ఏలియాగారిని పంపించి "ఏ స్థలమందు నాబోతు రక్తము కుక్కలు నాకెనో
అదే స్థలమందు నీ రక్తము కుక్కలు నాకును" అని సెలవిచ్చారు. ఆహాబురాజు రక్తం కుక్కలు నాకాయి, అతని భార్య
యెజెబెలు రక్తం కూడా కుక్కలు నాకాయి.(1రాజులు 22:28 & 2 రాజులు 9:35-37).
జాగ్రత్త! అబద్ద ప్రమాణాలు చేసి నిర్ధోషుల ఆస్తిని,
ప్రాణాలను హరిస్తే నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి.
2) ఇద్దరు భార్యాభర్తలు అననీయ-సప్పీర. గొప్పకోసం తమ ఆస్తిని అమ్మి
దేవునికిచ్చేస్తాం అని చెప్పారు. సగం
ఉంచుకొని సగం తీసుకొని వస్తాడు అననీయ. పరిశుధ్ధాత్ముడు పేతురు గారి ద్వారా
అంటున్నారు " అననీయా నీ భూమివెలలో కొంత దాచుకొని పరిశుధ్ధాత్మను
మోసగిస్తావా" అని, వెంటనే అక్కడే చనిపోతాడు,
ఈ విషయం తెలియని సప్పీరా సుమారు మూడు గంటలకి వస్తాది, పేతురు గారు
అడుగుతారు సప్పీరా! మీ భూమిని అంతకే అమ్మారా? అని, మరోసారి అబద్ధం, వెంటనే ఆమెకూడా అక్కడే పడి చనిపోయింది. (అపో
5:1-11). నీవు పరిశుధ్ధాత్మని మోసగించలేవు జాగ్రత్త! ఏమైనా మ్రొక్కుకొంటే వెంటనే చెళ్లించు, లేకపోతే
అది నీకు శాపము.
3)
పేతురుగారు యేసుప్రభు ఎవరో తనకి తెలియదని ముమ్మారు
అబద్దమాడతారు. తన జీవితమంతా దానికోసం సంతాప పడవలసి వచ్చింది (లూకా 23:54-42)
కావున నీ అబద్దాలు అబధ్ద ప్రమాణాలు నేడే
విడిచి పెట్టు. అప్పుడు నీవు దేవుని
పరిశుధ్ధ పర్వతం మీద నివాసం చేయగలవు. ఎప్పుడూ? నష్టం కలిగినా మాట తప్పనప్పుడు.(కీర్తనలు 15వ
అధ్యాయం) . అలా కాకపోతే దేవుని ఉగ్రత, శాపం వస్తుంది. నరకానికి పోతావు. ప్రకటన 21:8 పిరికివారును,. . . . అబధ్ధికులందరునూ అగ్ని
గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు. కుక్కలును, . . . అబధ్ధమును ప్రేమించి
జరిగించు ప్రతీవాడును వెలుపటనుందురు (ప్రకటన 22:15).
నీ
జీవితం సరిచేసుకో ఎందుకంటే మనము దేవుని అవయవాలము కాబట్టి మీరు అబద్ధమాడుట మాని తన
పొరుగువానితో సత్యమే పలుకవలెను (ఎఫెసీ 4:25).
నేనే
మార్గము, నేనే సత్యము అని చెప్పిన సత్యవంతుడైన దేవుని బిడ్డగా సత్యమే పలుకుతావా?
లేక
అబధ్ధపు జనకుడైన సాతానుగాడి కొడుకుగా/ దయ్యం కూతురుగా అబద్ధాలు చెబుతావా?
ఆలోచించుకో!
అబద్ధికులు
పరలోకం వెళ్ళలేరు.
జీవితాన్ని
సరిచేసుకొని ఆయన వెలుగులో, జీవములో, ఆయన మార్గములో నడుద్దాము.
అట్టి
కృప మనకు కలుగును గాక!
ఆమెన్!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -71వ భాగం*
*పిలుపుకు తగిన జీవితం-24*
ఎఫెసీ 4:26—27
26. కోపపడుడి గాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ
కోపమునిలిచియుండకూడదు.
27. అపవాదికి చోటియ్యకుడి;
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! మనము పిలుపుకి తగ్గ జీవితం ఎలా జీవించాలో నేర్చుకుంటూన్నాము
చూడండి
ఇక్కడ పిలుపుకి తగిన జీవితం జీవించే విధానంలో మరో పద్దతి: కోపపడుడి గాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపము
నిలిచియుండకూడదు
చూడండి కోపపడుడీ గాని పాపము చేయకుడి అంటున్నారు! బైబిల్
చెబుతుంది సమస్తమైన దుష్టత్వము కోపమును వదిలివేయాలి! ఇక్కడేమో కోపపడుడీ గాని పాపం
చేయవద్దు అంటున్నారు! మరి ఏది నిజము? రెండూ నిజమే!
దీని అర్ధములు ఏమంటే న్యాయమైన కోపాలు పడవచ్చు గాని వెంటనే
సమాధాన పడాలి అన్నమాట! నిజానికి కోపం ఎందుకు వచ్చింది? అవతలి వారు ఏదో తప్పు
చేశారు! లేదా నీకు అన్యాయం జరిగినది! కాబట్టి నీవు న్యాయంగా కోపపడ్డావు! ఇక దానిని
అక్కడితో వదిలేయాలి తప్ప- దానిని మనస్సులో పెట్టుకుని మాటిమాటికి కోపపడకూడదు!
సమాధాన పడాలి! ఎప్పటిల్లోగా సమాధాన పడాలి అంటే సూర్యుడు అస్తమించే లోగా అనగా
సాయంత్రం లోగా మరలా సమాధాన పడాలి అంటున్నారు!
మరో ఉదాహరణ: నీ కుమారుడు గాని కుమార్తె గాని భార్య గాని
ఏమైనా పొరపాటు చేసినప్పుడు న్యాయంగా ఆ
తప్పు యొక్క తీవ్రత వారికి అర్ధమయ్యేలా కోపపడాలి! గాని దానిని మనస్సులో పెట్టుకుని
మాటిమాటికి తిట్టకూడదు, గొణగకూడదు! అవమానించి మాట్లాడకూడదు! మరోసారి అరవకూడదు!
సాయంత్రం లోగా క్షమించి బుజ్జగించి అలా నాన్న ఇలా నాన్న , మరలా అలా చేయకు అంటూ
వారితో మాట్లాడాలి! ఇదీ దీని అర్ధం!
ఇలాంటి కోపము వలన దేవుని ఉగ్రత మనమీదకు రాదు, సరికదా మన పిల్లలను
సరియైన దారిలో పెట్టే విధానం, పిల్లలను పెంచే విధానం ఇదే!
కాబట్టి ఇలా కోపము లాంటి పాపము చేసి సైతానుకి చోటివ్వకూడదు!
*కోపము—ఆగ్రహము*: ప్రియులారా! పిలుపుకి తగిన జీవితం జీవించాలంటే తర్వాత విడచి
పెట్టవలసినవి కోపము మరియు ఆగ్రహము!! ఈ రెండింటికి కూడా ఇంటర్లింక్ ఉంది. కోపం
రావడం సహజం అయితే ఆకోపం ఎక్కువసేపు/ కాలం ఉంటే దానిని ఆగ్రహము అంటారు. ఆ కోపంతో
ఏదైనా ప్రతీకారం చేస్తే ఆగ్రహం, క్రోధం అంటారు.
ఉదాహరణ: ఒక వ్యక్తి/ భార్య మనకు
నచ్చని పని చేస్తే, మనస్సు ఆయాసపడటం – కోపం!
అయితే ఆ కోపంతో ఆ వ్యక్తితో/ భార్యతో
కొన్ని రోజులు/ నెలలు మాట్లాడటం మానేస్తే దానిని ఆగ్రహం అంటారు.
అయితే ఆ వ్యక్తిని కొట్టినా,
తిట్టినా గాయపరచినా క్రోధం అంటారు.
అయితే
మన పవిత్ర గ్రంధం సెలవిస్తుంది: కోపపడుడి గాని పాపము చేయకుడి!!! ఎఫెసీ 4:26; ఆ కోపం సూర్యుడు అస్తమించే వరకు నిలిచియుంటే
1)అది ఆగ్రహము; 2)అది పాపము అవుతుంది. కాబట్టి కోపాన్ని, ఆగ్రహాన్ని మనిషి విడచి
పెట్టాలి కారణం నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు! యాకోబు 1:20;
అంతేకాకుండా
పిల్లలు తండ్రికి కోపం పుట్టించకూడదు, అలాగే తండ్రులు పిల్లల కోపం రేపకూడదు!!
కొలస్సీ 3:21; ఎఫెసీ 6:4;
అందుకే ఎఫెసీ 4:31 లో
సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన
దుష్టత్వము మీరు విసర్జించుడి.
కాబట్టి
కోపము, ద్వేషము, క్రోధము విసర్జించమని సెలవిస్తున్నారు.
2) *ఆగ్రహము*: కోపము నిలిచియుంటే అది ఆగ్రహము!! అది నీ
ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. అందుకే కీర్తనలు 37:8 లో
కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసనపడకుము అది
కీడుకే కారణము
కాబట్టి నీ
కోపం, ఆగ్రహము అది నీకు వ్యసనాన్ని తీసుకొస్తుంది, అది నీకు చివరకు నీ కీడుకే
కారణం అవుతుంది. ఆగ్రహపడి ఆవేశంలో ఏదైనా చేస్తే, అనుభవించాల్సింది నీవే!
నీ పిల్లలను ఆవేశంతో కోపంతో గాయపరిస్తే, తర్వాత వారిని
హాస్పిటల్ చుట్టూ తిప్పాల్సింది నీవే!
పొరుగువారి మీద/ విరోధుల మీద ఆగ్రహంతో గాయపరిచినా, చంపినా
జైలుపాలు కావాల్సింది నీవే!
కాబట్టి ఆగ్రహాన్ని అణచుకో!
అప్పుడు
నీ ప్రవర్తన మంచిదైతే దేవుడు నీ శత్రువులను కూడా మిత్రులుగా చేస్తారు. సామెతలు 16:17; అదే ఆగ్రహాన్ని అణచుకోకపొతే నీ వీపుకే
దెబ్బలు తగులుతాయి. అది నీకీడుకే కారణం!
కాబట్టి ప్రియ విశ్వాసి నీ కోపాన్ని,
ఆగ్రహాన్ని విడచిపెట్టు! ఇవి విడచి పెడితేనే పరలోకం దొరుకుతుంది.
శక్యమైతే సమస్త ప్రజలతో సఖ్యంగా ఉండమని సెలవిస్తుంది
బైబిల్! రోమా12:18;
లేకపోతే అవిధేయుల మీదకు దేవుని ఉగ్రత రాబోతుంది!
ఇంకా సైతానుకి చోటు ఇవ్వవద్దు! నీ మాట ద్వారా గాని, నీ చూపు ద్వారా గాని,
నీ ప్రవర్తన వలన గాని, నీ తలంపుల వలన గాని పాపము చేసి అపవాదికి అవకాశం ఇవ్వవద్దు!
అలా చేస్తే వెంటనే వాడు నీమీద ఆలోచనల ద్వారా యుద్ధం చేస్తాడు! కాబట్టి ఇలాంటి
వాటికి దూరంగా ఉందాం! అబద్ధాలు, కోపం, ఇవి రెండూ క్రైస్తవుల మధ్య తగవులు
పెట్టేందుకు సైతానుకు సహాయం చేస్తాయి. ఇలాంటి అవకాశాల కోసం సైతాను ఎప్పుడూ
ఎదురుచూస్తూ ఉంటాడు
1 కోరింథీ 2:11. నేనేమైనను క్షమించియుంటే సాతాను మనలను మోస
పరచకుండునట్లు, మీ నిమిత్తము, క్రీస్తు సముఖమునందు క్షమించియున్నాను; సాతాను
తంత్రములను మనము ఎరుగనివారము కాము.
1 పేతురు 5: 8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి;
మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు
తిరుగుచున్నాడు.
నేడే
నీ కోపం, ఆగ్రహం విడచి పెట్టు! పరలోకం పట్టు!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -72వ భాగం*
*పిలుపుకు తగిన జీవితం-25*
ఎఫెసీ 4:28—32
28. దొంగిలువాడు
ఇకమీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలుకలుగు నిమిత్తము తన చేతులతో మంచి
పనిచేయుచు కష్టపడవలెను.
29. వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి
క్షేమాభివృద్ధికరమైన అను కూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీనోట రానియ్యకుడి.
30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచనదినమువరకు
ఆయనయందు మీరు ముద్రింపబడి యున్నారు.
31. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ,
సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.
32. ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు
దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! మనము పిలుపుకి తగ్గ జీవితం ఎలా జీవించాలో నేర్చుకుంటున్నాము
చూడండి
ఇక్కడ పిలుపుకి తగిన జీవితం జీవించే విధానంలో మరో పద్దతి: దొంగిలువాడు ఇకమీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు
వీలుకలుగు నిమిత్తము తన చేతులతో మంచి పనిచేయుచు కష్టపడవలెను
నిజానికి
దొంగతనం చేయడం అనేది తప్పు! దేవుడిచ్చిన పది ఆజ్ఞలలో ఒకటి దొంగిల కూడదు!
“దొంగతనం”– ఇతరులు మన దగ్గర ఉంచిన డబ్బును
వాడుకోవడం, అందులోనికి కొంత “అప్పు” తీసుకుని తిరిగి జమ చేయకపోవడం, లేక స్వంత లాభం
కోసం దొంగ లెక్కలు రాయడం మొదలైనవన్నీ దొంగతనం కిందకే వస్తాయి. యోహాను 12:6 లో
ఇష్క్ రియోతూ యూదా కూడా ఇలాగే చేసే వాడు! వాడి దగ్గర సొమ్ము సంచి ఉండేది అట! ఎవరూ
చూడనప్పుడు యేసుప్రభులవారికి ప్రజలు ఇచ్చిన సొమ్మును వీడు కాజేస్తూ ఉండేవాడు! .
కొన్ని రకాల వ్యక్తులకు ఇది బలీయమైన చెడు ప్రేరణ. ఇలాంటి విషయాల్లో క్రైస్తవుల్లో
కనిపించే అనేక లోపాలూ దోషాలూ ఆధ్యాత్మిక వ్యక్తులను ఏడ్చేలా చేస్తాయి. నిజంగా
యేసుక్రీస్తుప్రభులవారిని కూడా ఏడ్చేలా చేస్తాయి. “పంచిపెట్టడానికి”– అపో. కార్యములు 20:34-35; 2
థెస్సలొనీకయులకు 3:6-10. విశ్వాసి కష్టపడి సంపాదించిన ధనాన్ని ఇతరులతో పంచిపెట్టడం
దేవునికి మహిమ కలిగిస్తుంది. కపటంగా సంపాదించడం, స్వార్థం కోసం అంతా ఉంచుకోవడం
దేవునికి అపఖ్యాతి కలిగిస్తుంది.
కాబట్టి దొంగిలించడం దోచుకోవడం అనేవి పిలువబడిన వారు విడిచిపెట్టాల్సిన
విషయాలలో ఒకటి!!!
ఇక దొంగల కుండా అక్కరగలవారికి వీరే ధనము సంపాదించి అవసరములలో
ఉన్నవారికి పంచిపెట్టాలి! తన చేతులతో మంచిపని చేయుచు కష్టపడాలి! దీని అర్ధం
ఏమిటంటే చెడు పని చెడు వ్యాపారం చేస్తూ ధనం సంపాదించకూడదు గాని చేతులతో కష్టపడి ధనము
సంపాదించి నీ అవసరాలకు వాడుకుని ఆ తర్వాత అవసరాలలో ఉన్నవారికి సహాయం చేయాలి!
దీనికోసం థెస్సలోనికయ ప్రజలకు ఉత్తరం రాస్తూ పౌలుగారు అంటున్నారు
2 థెస్స 3: 6. సహోదరులారా, మావలన పొందిన బోధన ప్రకారముకాక
అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్దనుండి తొలగిపోవలెనని మన ప్రభువైన యేసు
క్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము.
7. ఏలాగు మమ్మును పోలి నడుచుకొనవలెనో మీకే తెలియును. మేము
మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు;
8. ఎవనియొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు; మేము మీలో
ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబగళ్లు పనిచేయుచు
జీవనము చేసితివిు.
9. మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని మమ్మును మేము మాదిరిగా
కనుపరచుకొనుటకే యీలాగు చేసితివిు గాని, మాకు అధికారములేదనిచేయలేదు.
10. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు- ఎవడైనను పనిచేయ
నొల్లని యెడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞా పించితివిు గదా.
11. మీలోకొందరు ఏ పనియు చేయక పరులజోలికి పోవుచు, అక్రమముగా
నడుచుకొనుచున్నారని వినుచున్నాము.
12. అట్టివారు నెమ్మదిగా పని చేయుచు, సొంతముగా
సంపాదించుకొనిన ఆహారము భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని
ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము.
ఇక్కడ
పౌలుగారు ప్రజల యొక్క కానుకలతో సువార్త ప్రకటించ వచ్చు గాని తాను మాదిరిగా ఉంటూ
ప్రజలకు మాదిరి మరియు మార్గదర్శం చేశారు!
అపో. కార్యములు 20
34. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా
చేతులు కష్టపడినవని మీకే తెలియును.
35. మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు
పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము
చేసికొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను.
ఇంకా యాకోబు గారు అంటున్నారు 1:27
27. తండ్రియైన
దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను
విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను
కాపాడుకొనుటయునే.
కాబట్టి
అవసరాలలో ఉన్నవారికి సహాయం చేద్దాం!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -73వ భాగం*
*పిలుపుకు తగిన జీవితం-26*
ఎఫెసీ 4:28—32
28. దొంగిలువాడు
ఇకమీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలుకలుగు నిమిత్తము తన చేతులతో మంచి
పనిచేయుచు కష్టపడవలెను.
29. వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి
క్షేమాభివృద్ధికరమైన అను కూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీనోట రానియ్యకుడి.
30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచనదినమువరకు
ఆయనయందు మీరు ముద్రింపబడి యున్నారు.
31. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ,
సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.
32. ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు
దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! మనము పిలుపుకి తగ్గ జీవితం ఎలా జీవించాలో నేర్చుకుంటున్నాము
చూడండి
ఇక్కడ పిలుపుకి తగిన జీవితం జీవించే విధానంలో మరో పద్దతి: . వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి
క్షేమాభివృద్ధికరమైన అను కూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీనోట రానియ్యకుడి.
నిజానికి
క్రీస్తు మన హృదయాల్లో ఉంటే బూతులు మాట్లాడేందుకు మనమెలా తెగించగలం? చూడండి ఇక్కడ ఏమంటున్నారో వినువారికి
మేలుకలుగునట్లు అవసరాన్ని బట్టి మాట్లాడాలి, ఇంకా ఆ మాటలు క్షేమాభివృద్ధి
కలిగించాలి అవతలి వ్యక్తికి! అంతేకాని దుర్భాశలు బూతులు రాకూడదు అంటున్నారు!
కొలస్సీ
పత్రిక 3:8
ఇప్పుడైతే మీరు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట
బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి
ప్రియులారా! పిలువబడిన పిలుపుకి తగిన జీవితం
జీవించే విధములో తర్వాత విసర్జించవలసినది *బూతులు*!
నేటిదినాల్లో అనేకమంది బూతులు మాట్లాడుతున్నారు.
బూతులేకపోతే పదం పూర్తికాదు చాలామందికి. సెంటెన్స్ కి ముందు బూతు, తర్వాత బూతు.
కోపం వస్తే బూతులు! భార్యను ఏం మాట అంటారో, పిల్లలను ఏం మాట అంటారో, అది అనవలసిన మాటేనా
అని చూడటం లేదు! నోటికి వచ్చిన బూతులు విచక్షణారహితంగా మాట్లాడుతున్నారు. ఇది
కూడదు అని చెబుతుంది బైబిల్. కోపపడుడి గాని పాపం చేయకుడి అని చెబుతుంది బైబిల్.
ఎఫెసీ 4:26; బూతులు మాట్లాడవద్దు అని చెబుతుంది బైబిల్—ఆజ్న అతిక్రమమే పాపము. 1 యోహాను 3:4; కాబట్టి బూతులాడటం
పాపం. కాబట్టి విశ్వాసి దీనిని తప్పకుండా విసర్జించాలి.
బైబిల్ గ్రంధంలో కూడా చాలామంది బూతులు
తిట్టినట్లు చూస్తాం! ఉదాహరణ: రాజైన సౌలు తన కుమారుడైన యోనాతానును ఆగడిగొట్టుదాని
కొడుకా అని తిట్టినట్లు చూస్తాం. 1 సమూయేలు 20:30;
దైవజనుడైన మోషేగారు కేవలం
దుష్టులు అనే పదం వాడినందుకు దేవుడు ఆయనపై కోపగించి, కనాను దేశం వెళ్ళకుండా
చేసారు. మరి నీవు నేను బూతులాడితే దేవుడు ఒప్పుకుంటారా??
దేవుడు *సర్వాధికారి, సర్వ సృష్టికర్త! భూమిమీద నున్న
అందరికి తండ్రి. ఆయన చేసుకున్న సంతానాన్ని తిట్టడానికి నీకు నాకు హక్కు లేదు*!
మోషేగారిని అందుకే దేవుడు దండించవలసి వచ్చింది.
మరి
ఇంకా అనొచ్చు—మరి దేవుడు తన పిల్లలను
తిట్టినప్పుడు యెషయా 57:3 లో మరి నా
పిల్లలను నేను తిడితే, బూతులాడితే తప్పేముంది?
తప్పే!
కారణం దేవుడు మీ పిల్లల కోపం రేపవద్దు
అంటున్నారు. ఎఫెసీ 6:4; కొలస్సీ 3:21; వారిని భక్తిలోను, ప్రేమ విశ్వాసంలోను
పెంచమంటున్నారు ఎఫెసీ 6:5; తప్ప బూతులాడవద్దు అంటున్నారు. అందుకే ఎఫెసీ 5:4లో
కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను,
పోకిరిమాటలైనను (లేక, వెఱ్ఱిమాటలైనను), సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు; ఇవి మీకు
తగవు.
చూసారా
, బూతులుగాని, పోకిరి మాటలు గాని, సరసోక్తులు గాని ఉపయోగించ కూడదు అంటున్నారు.
మరి ఏం మాట్లాడాలి?
మీనోట కృతజ్ఞతా వచనమే తప్ప అవి మాట్లాడకూడదు.
నేటిదినాల్లో చాలామంది సేవకులు ప్రజలను నవ్వించడానికి అన్యులు మాట్లాడే
బూతుమాటలు మాట్లాడుతున్నారు ప్రసంగాలలో! ప్రియ సేవకుడా! ఇది మనకు తగదు అని
ప్రభువుపేరిట మనవి చేస్తున్నాను!
సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను:
విసర్జించవలసిన తర్వాత అంశము: *సరసోక్తులు*: ఎఫెసీ 5:4 .కృతజ్ఞతావచనమే
మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరిమాటలైనను (లేక, వెఱ్ఱిమాటలైనను), సరసోక్తులైనను
ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు. . .
నిజానికి
ఇలా వ్రాయడానికి కారణం: యేసుక్రీస్తుప్రభులవారు చెప్పిన మాట:
మత్తయి 12
36. నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన
ప్రతి మాటనుగూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును.
సరసోక్తులు అనగా సరసం—కామెంట్స్ చేయడం. మా
పల్లెటూర్లలో సరసాలు ఆడటం చాలా ఎక్కువ! వరసైన వారిని సరసం ఆడుతుంటారు.
మేనమామలు—మేనకోడల్ని, బావలు—మరదల్ని, మేనత్తలు—మేనల్లుల్ని, తాతయ్యలు—మనవరాలిని సరసాలు ఆడుతారు.
ప్రియ విశ్వాసి! ఇది తప్పు అని
వాక్యం సెలవిస్తుంది ఈ వచనంలో!
సరదాకే కదా అంటున్నాం. నిజంగా కాదు
గదా అనొచ్చు!
*దేవుడు
ఏం చెప్పారో అదే చెయ్యాలి. ఏం చెయ్యవద్దు అన్నారో అది చెయ్యకూడదు! అది అంతే!
ప్రశ్నించకూడదు*!
కాబట్టి
ప్రియ నేస్తమా! దయచేసి సరసం ఆడవద్దు!
మీ
స్నేహితులతో గాని, స్నేహితురాళ్ళతో గాని, కొలీగ్స్ తో గాని, మేనకోడళ్ళు, మేనల్లల్లు,
మరదళ్ళు, బావలు, మనవరాల్లతో ఎప్పుడూ సరసాలు ఆడవద్దు!
కాబట్టి
వాక్యానుసారంగా జీవిద్దాం!
బూతులు, సరసోక్తులు విడచి, కృతజ్ఞతా వచనాలే
ఉపయోగిద్దాం!
మాదిరికరమైన
జీవితాల్ని జీవిద్దాం!
అట్టి
కృప, ధన్యత దేవుడు మనందరికీ దయచేయును గాక!
ఆమెన్!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -74వ భాగం*
*పిలుపుకు తగిన జీవితం-27*
ఎఫెసీ 4:28—32
28. దొంగిలువాడు
ఇకమీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలుకలుగు నిమిత్తము తన చేతులతో మంచి
పనిచేయుచు కష్టపడవలెను.
29. వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన
అను కూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీనోట రానియ్యకుడి.
30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచనదినమువరకు
ఆయనయందు మీరు ముద్రింపబడి యున్నారు.
31. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ,
సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.
32. ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు
దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! మనము పిలుపుకి తగ్గ జీవితం ఎలా జీవించాలో నేర్చుకుంటున్నాము!
చూడండి ఇక్కడ పిలుపుకి తగిన జీవితం జీవించే
విధానంలో మరో పద్దతి: . . దేవుని పరిశుద్ధాత్మను
దుఃఖపరచకుడి; విమోచనదినమువరకు ఆయనయందు మీరు ముద్రింపబడి యున్నారు
పరిశుద్ధాత్మ
దేవుణ్ణి మనం ఎట్టి పరిస్తితులలోనూ దుఖపెట్ట కూడదు! పరిశుద్ధాత్ముడు ఎలాంటి చలనం,
అనుభూతి, చైతన్యం లేని ప్రభావం కాదు. ఆయన ఒక వ్యక్తి (యోహాను 14:16-17).
యోహాను 14
16. నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండు
టకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపి యగు ఆత్మను మీకనుగ్రహించును.
17. లోకము ఆయ నను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొంద
నేరదు; మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడ నివసించును, మీలో ఉండును.
విశ్వాసులు
ఆయన్ను ఎలా దుఃఖపెడతారు? పౌలుగారు ఇంతవరకూ
చెప్తున్న పాపాల ద్వారా – అబద్ధాలు, కోపం, దొంగతనం, స్వార్థం, బూతులు మొదలైన వాటి
మూలంగా దుఃఖపెడతారు. అపవిత్ర మైనదేదైనా సరే ఆ మహా పవిత్రుణ్ణి దుఃఖపెడుతుంది. మనం
దేవుని ప్రజల్లో ఎవరినైనా అనవసరంగా దుఃఖపెడితే అది కూడా ఆయన్ను దుఃఖపెడుతుంది. యెహెఙ్కేలు 6:9
9. మరియు నన్ను విసర్జించినవారి విశ్వాస ఘాతక మైన
వ్యభిచారమనస్సును, విగ్రహముల ననుసరించిన వ్యభిచారదృష్టిని నేను మార్చి నాతట్టు
తిరుగజేయగా, చెరపట్టబడినవారై శేషించినవారు అన్యజనులమధ్య నన్ను జ్ఞాపకము చేసికొని,
తామనుసరించిన హేయకృత్యము లన్నిటినిబట్టి తాము చేసిన దుష్క్రియలను కనుగొని తమ్మును
తామే అసహ్యించుకొనుచు
ఇక “ముద్ర వేయబడ్డారు ”–అనగా ఎఫెసీయులకు 1:13-14.
విశ్వాసులు పరిశుద్దాత్మను దుఃఖ
పెట్టినప్పటికీ ఆయన వారిని విడిచిపోడు – కానీ వారి హృదయాల్లో బాధ, అశాంతి
ఉంటాయి. ఎఫెసీయులకు 1
13. మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని,
క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి.
14. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు
విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు.
కాబట్టి మనం చేసే ప్రతీ పని ముందు, మాట్లాడే ప్రతీమాట ముందు,
ఆలోచించే తలంపులలో చూసే చూపులలో మొదటగా మనం ఆలోచన చేయవలసినది: ఈ పని
పరిశుద్ధాత్మునికి సంతోషం కలిగిస్తుందా లేక దుఖం కలిగిస్తుందా? ఈ మాట దేవునికి
పరిశుద్ధాత్మునికి సంతోషం కలిగిస్తుందా లేక దుఖం కలిగిస్తుందా? మన చూపులు ఆలోచనలు
దేవునికి మహిమకరంగా ఉన్నాయా లేక ఆయనకు అపకీర్తి తెచ్చేవిగా ఉన్నాయా అని ఆలోచించి
అప్పుడు మనం ఏదైనా చేయాలి!
పిలుపుకి
తగిన జీవితం జీవించే విధానంలో మరో పద్దతి: ఒకని యెడల ఒకడు
దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును
ఒకరినొకరు క్షమించుడి.
చూడండి
అందుకే మొదటి రెండు వచనాలలో అంటున్నారు 1.
కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ
కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు,
2. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో
కూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,
రోమీయులకు 12
10. సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగల వారై,
ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి.
రోమీయులకు 12
17. కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు; మనుష్యు లందరి
దృష్టికి యోగ్యమైనవాటినిగూర్చి ఆలోచన కలిగి యుండుడి.
రోమీయులకు 12
19. ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు
చోటియ్యుడి పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని
వ్రాయబడి యున్నది.
కొలొస్సయులకు 3
12. కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును
ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును,
సాత్వికమును, దీర్ఘశాంత మును ధరించుకొనుడి.
13. ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనిన యెడల ఒకని నొకడు
సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును
క్షమించుడి.
దేవుడు
విశ్వాసులను ఉచితంగా, పూర్తిగా క్షమించాడు. అందువల్ల తమను నొప్పించిన వారిని
విశ్వాసులు క్షమించాలి. వారలా చెయ్యకపోతే దేవునినుండి వారికి సమస్య వస్తుంది. వారు
ఇతరుల పట్ల చేసినట్టే ఆయన వారికి చేస్తాడు. మత్తయి
6:12,
12. మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు
క్షమించుము.
మత్తయి 6:14-15;
14. మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు
తండ్రియు మీ అపరాధములను క్షమించును
15. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయినయెడల మీ
తండ్రియు మీ అపరాధములను క్షమింపడు.
మత్తయి 18:21-35 ఇక
వచనాలలో పేతురు గారు అడిగారు నా సహోదరుడు నా యెడల తప్పుచేస్తే ఎన్నిసార్లు
క్షమించాలి అంటే 22. అందుకు యేసు అతనితో ఇట్లనెను ఏడుమారులు మట్టుకే కాదు, డెబ్బది
ఏళ్ల మారులమట్టుకని నీతో చెప్పుచున్నాను.
కాబటీ మనల్ని నొప్పించిన వారిని క్షమించకపోతే మనకు
మనమే హాని చేసుకుంటున్నాం, క్రీస్తును దుఃఖపెడుతున్నాం, సంఘంలో సమస్యలు
సృష్టిస్తున్నాం.
యేసుక్రీస్తుప్రభులవారిని
అన్నీ హింసలు పెట్టినా ఆయన తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగారు గనుక వీరిని
క్షమించమని అడిగి మనకు క్షమాభిక్ష పెట్టారు! అంతటి కరుణామయుడు యేసు!!!
కాబట్టి
క్రీస్తుయేసుకి కలిగిన ఈ మనస్సు మనము కలిగి అందరినీ క్షమిద్దాం!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -75వ భాగం*
*పిలుపుకు తగిన జీవితం-28*
ఎఫెసీ 4:28—32
28. దొంగిలువాడు
ఇకమీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలుకలుగు నిమిత్తము తన చేతులతో మంచి
పనిచేయుచు కష్టపడవలెను.
29. వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి
క్షేమాభివృద్ధికరమైన అను కూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీనోట రానియ్యకుడి.
30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచనదినమువరకు
ఆయనయందు మీరు ముద్రింపబడి యున్నారు.
31. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ,
సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.
32. ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు
దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! మనము పిలుపుకి తగ్గ జీవితం ఎలా జీవించాలో నేర్చుకుంటున్నాము
చూడండి
ఇక్కడ పిలుపుకి తగిన జీవితం జీవించే విధానంలో మరో పద్దతి: . ప్రియులారా! తరువాత
చంపాల్సినది/ విసర్జించవలసినది *ద్వేషము*!
ఇది
శరీరకార్యాలు లో చాలా ప్రమాదకరమైనది! ఎందుకంటే ఈ లోకంలో మొట్టమొదటి హత్య బైబిల్
ప్రకారం ఈ ద్వేషము వలననే జరిగింది. మొట్టమొదటి సంఘము- మొట్టమొదటి కుటుంబము- ఆదాము
గారు, హవ్వమ్మగారు, కయీను- హేబెలు చిన్న కుటుంబం! తండ్రి కుమారులకు దేవునికి
కృతజ్ఞతలు చెప్పడం, దేవునికి అర్పణలు ఇవ్వడం నేర్పించాడు! కుమారులు
నేర్చుకున్నారు! కుమారులు ఇద్దరూ అర్పణలు అర్పించారు! చిన్నవాడు శ్రేష్టమైనవి
అర్పించాడు! పెద్దోడు ఏవో కొన్ని అర్పించాడు! దేవుడు హృదయాలను అంతరంగాలను
పరిశీలించే నీతిగలవాడు గనుక చిన్నవాడు హృదయపూర్వకముగా అర్పించడం చూసి చిన్నవాడి
అర్పణ అంగీకరించారు! పెద్దవాడిది అంగీకరించలేదు! ఆ కాలంలో అర్పణ అంగీకరించడం అనగా
ఆకాశం నుండి దేవుని అగ్ని వచ్చి బలిపీఠం మీదనున్న అర్పణను, బలిని దహించాలి!
అప్పుడు దానిని దేవుడు అంగీకరించినట్లు! కాబట్టి ఇప్పుడు బహుశా హేబెలు అర్పణను
దేవుని అగ్ని వచ్చి దహించినది. కయీను అర్పణ దేవుడు అంగీకరించలేదు కాబట్టి అలాగే
ఉండిపోయింది. దీనిని చూసిన అన్న కయీను – హేబెలు మీద
ద్వేషం పెంచుకున్నాడు! అదును చూసి పొలంలో ఒంటరిగా ఉండి కొట్టేశాడు. హేబెలు రక్తం
భూమిమీదకు పారింది. అయితే జంతువులే చనిపోతాయని అనుకున్నాడు గాని మనుషులు కూడా
చనిపోతారని తెలియదు! భయంతో పారిపోయాడు. దేవుడు చూసి శపించేశారు! కాబట్టి
ద్వేషానికి ప్రతిఫలం- ప్రతిదండన- శాపం!
ప్రియ
స్నేహితుడా! ద్వేషమును వదిలిపెట్టు!
చిన్న కుటుంబం కోసం
చూసుకున్నాం! ఇక బైబిల్ లో పెద్ద కుటుంబం- యాకోబుగారు, అతనికి నలుగురు బార్యలు!
12గురు కొడుకులు! ఏకైక ముద్దుల చెల్లి! వారిలో చిన్న భార్య పెద్ద కుమారుడు- యోసేపు
గారు! తను ప్రేమించిన భార్య కొడుకు, ఇంకా మాట వినే కొడుకు కాబట్టి ఎక్కువగా
యోసేపును ప్రేమించారు యాకోబు గారు! ఇది అన్నలకు ఇష్టం లేదు! పగ పట్టారు,
ద్వేషించారు! అసూయ పడ్డారు! సమయం కోసం ఎదురుచూశారు! ఈలోగా అన్నలు చేసే చెడ్డ పనులు
చూసి తండ్రికి పిర్యాదు చెయ్యడం మొదలుపెట్టారు యోసేపుగారు! అది వారిమీద చాడీలు
చెబుతున్నారు అనుకున్నారు వారు! ఎలాగైనా చంపేద్దామని అనుకున్నారు! సమయం కోసం
ఎదురుచూశారు! ఒకరోజు వచ్చింది- దూరప్రాంతంలో అన్నలు తమయొక్క మందలు మేపుతుండగా వారి
క్షేమ సమాచారం తెలుసుకోడానికి యాకోబు గారు యోసేపుని పంపించారు. అదునుచూసి అక్కడే
చంపేద్దామని అనుకున్నారు- రూబేను వీరిచేతిలో నుండి తప్పించి తండ్రికి ఇద్దామని
అనుకున్నాడు. అన్నలు చంపేద్దామని ప్రయత్నిస్తుంటే యూదా హత్యాప్రయత్నం మానిపించాలని
యోసేపుని ఇష్మాయేలీయులకు అప్పగించేటట్లు చేశాడు. దేవుని అనుగ్రహం ఉంది కాబట్టి
తప్పించుకున్నారు లేకపోతే ఆ రోజు అక్కడ మరణమైపోయి ఉండును యోసేపు గారు! కాబట్టి ఈ
రెండు ఉదాహరణలలో ద్వేషం అనేది హత్యకు దారితీసింది!
మోషేగారికి దేవుడు
ఇశ్రాయేలు జాతిని విడిపించి వారిని కనాను దేశానికి నడిపించే నాయకత్వపు భాద్యతలు
అప్పగించారు! అయితే ఇది కొంతమందికి
కిట్టలేదు! వారు ఎవరో పరాయి వారు కారు! సొంత పెదనాన్న చిన్నాన్న పిల్లలు!
వారికి ఇంకా మరికొంతమంది
తోడుచేసుకున్నారు! ద్వేషము పెంచుకున్నారు! మోషేగారికి అన్నింటిలో ఎదురు తిరుగుతూ
ఇబ్బందులు పెట్టడం మొదలుపెట్టారు! యాజకత్వం, నాయకత్వం మాకు కూడా కావాలని
అనుకున్నారు! చివరికి దేవుని తీర్పులో కాలిపోయారు కొంతమంది. భూమి నేరవిడిచి
మ్రింగివేసింది కొందరిని! జాగ్రత్త! ద్వేషము మానుము!
అదిగో గొల్యాతు! 6 మూరల
జానెడు ఎత్తుమనిషి! ప్రజలు చూసి పారిపోయారు!
దావీదుగారు చూశారు! తన దేవునితో గొల్యాతు ఎత్తు, తన దేవునితో గొల్యాతు
పరాక్రమం పోల్చుకున్నాడు! వీడా! వేడిని నేను చంపేస్తాను అనుకున్నాడు! ప్రార్ధించి
చంపేశాడు! ప్రజలు జేజేలు కొట్టారు! స్త్రీలు తంభురాలు తీసుకుని నాట్యము చేసి సౌలు
వేలకొలది, దావీదు పదివేలకొలది శత్రువులను హతం చేశారు అని పాట పాడితే నాటినుండి
దావీదు మీద ద్వేషం పెంచుకుని విషపు చూపు చూడటం మొదలుపెట్టాడు! వెంటనే దేవుని నుండి
దురాత్మ వచ్చి సౌలును పట్టింది. చివరకు యుద్దంలో చచ్చాడు సౌలు! తనే కాదు తన
కొడుకులు అందరూ చచ్చారు! ద్వేషము, మత్సరము ఎముకలకు కుళ్ళు అని బైబిల్ చెబుతుంది!
సామెతలు 14:౩౦
కాబట్టి ప్రియ సహోదరి! సహోదరుడా! నీలో ద్వేషం అనేది ఉంటే దానిని
ఇప్పుడే వదిలిపెట్టు! లేకపోతే ఆ ద్వేషము నిన్ను హత్య చేయించడానికి కూడా
పురికొల్పుతుంది. అది నీ ఎముకలకు కుళ్ళుగాను, నీ శరీరమునకు గొప్ప వ్యాధి గాను
పనిచేసి నిన్ను మరణానికి చివరికి ఆత్మీయ మరణానికి దారితీస్తుంది! జాగ్రత్త!
గమనించాలి: ఈ శరీరకార్యములను
చేసేవారు దేవుని రాజ్యమును స్వతంత్రించు కోలేరు అని చాలా స్పష్టంగా రాయబడింది 21వ
వచనంలో! ఆయన రాజ్యంలో చేరలేవు అంటే నరకంలో సీటు కన్ఫర్మ్ అన్నమాట! నీకేది కావాలి?
పరలోకమా- నరకమా? తేల్చుకో!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -76వ భాగం*
*పిలుపుకు తగిన జీవితం-29*
ఎఫెసీ 4:28—32
28. దొంగిలువాడు
ఇకమీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలుకలుగు నిమిత్తము తన చేతులతో మంచి
పనిచేయుచు కష్టపడవలెను.
29. వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి
క్షేమాభివృద్ధికరమైన అను కూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీనోట రానియ్యకుడి.
30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచనదినమువరకు
ఆయనయందు మీరు ముద్రింపబడి యున్నారు.
31. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ,
సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.
32. ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు
దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! మనము పిలుపుకి తగ్గ జీవితం ఎలా జీవించాలో నేర్చుకుంటున్నాము
చూడండి
ఇక్కడ పిలుపుకి తగిన జీవితం జీవించే విధానంలో మరో పద్దతి: కోపమును విడిచి
పెట్టాలి! 26 వ వచనములో దీనికోసం మాట్లాడుకున్నాము కాబట్టి ఇక విడిచిపెట్టాల్సిన
మరొక అంశము: క్రోధము!!!
*క్రోధము
అంటే*?
* రెచ్చిపోయేంత కోపం
* హింసాయుతమైన మాటలు
క్రోధము అంటే?
కోపము
కంటే చాలా రెట్లు అధికం అని చెప్పొచ్చు. అట్లాంటి సందర్భాలలో వారు ఉపయోగించే మాటలు
ఎట్లా వుంటాయంటే? కత్తులు అవసరము లేకుండానే మనిషిని చంపేస్తాయి.
🔺
*క్రోధమునకు కారణం?*
హృదయపూర్వకమైన
భక్తి లేకపోవడమే.
లోలోపల హృదయపూర్వకమైన భక్తిలేని వారు క్రోధము
నుంచుకొందురు. యోబు 36:13
🔺
*తిరస్కారమునకు కారణము క్రోదము:*
నీకు క్రోధము పుట్టుచున్నది గనుక నీవు ఒక వేళ తిరస్కారము
చేయుదువేమో జాగ్రత్తపడుము నీవు చేయవలసిన ప్రాయశ్చిత్తము గొప్పదని నీవు
మోసపోయెదవేమో జాగ్రత్తపడుము.
యోబు 36:18
🔺
*క్రోధము క్రూరమైనది*:
క్రోధము క్రూరమైనది కోపము వరదవలె పొర్లునది. రోషము ఎదుట
ఎవడు నిలువగలడు? సామెతలు
27:4
🔺
*క్రోధముగలవానితో పరిచయము వద్దు:*
కోపచిత్తునితో సహవాసము చేయకుము క్రోధముగలవానితో పరిచయము
కలిగి యుండకుము. సామెతలు 22:24
🔺
*మృదువైన మాట క్రోధమును చల్లార్చును. *
మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును
రేపును. సామెతలు 15:1
🔺
*క్రోధమును విసర్జించాలి:*
సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన
దుష్టత్వము మీరు విసర్జించుడి.
ఎఫెసీయులకు 4:31
*ఇంతకీ
ఎవరికీ క్రోధము ఉంటుంది?*
యోబుగారు
చెబుతున్నారు: లోలోపల హృదయపూర్వకమైన భక్తిలేని
వారు క్రోధమును ఉంచుకొందురు! 36:13
అనగా
దీని అర్ధం నీలో క్రోధముంది అంటే నీలో హృదయపూర్వకమైన భక్తి లేదు అని అర్ధం! నీకు
క్రోధముంటే పెదాలతో భక్తి చేస్తున్నావు తప్పనిజమైన భక్తిలేదు!
శరీరకార్యమేదైనా
నిన్ను దేవుని నుండి దూరంచేసి, లోకానికి మరింత దగ్గర చేస్తుంది. లోకము, దాని ఆశలు
గతించిపోతాయి. ఆయన చిత్తాన్ని జరిగించేవారే స్థిరముగా నిలుస్తారు.
క్రోధమును
వీడి, దాని స్థానంలో క్రీస్తు ప్రేమను నింపుకొని, సమాధాన కరమైన జీవితాన్ని
జీవించడానికి ప్రయాస పడదాం!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -77వ భాగం*
*పిలుపుకు తగిన జీవితం-30*
ఎఫెసీ 4:28—32
28. దొంగిలువాడు
ఇకమీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలుకలుగు నిమిత్తము తన చేతులతో మంచి
పనిచేయుచు కష్టపడవలెను.
29. వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి
క్షేమాభివృద్ధికరమైన అను కూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీనోట రానియ్యకుడి.
30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచనదినమువరకు
ఆయనయందు మీరు ముద్రింపబడి యున్నారు.
31. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ,
సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.
32. ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు
దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! మనము పిలుపుకి తగ్గ జీవితం ఎలా జీవించాలో నేర్చుకుంటున్నాము
చూడండి
ఇక్కడ పిలుపుకి తగిన జీవితం జీవించే విధానంలో మరో పద్దతి: ! తరువాత చంపాల్సినది/
విసర్జించవలసినది *అల్లరి మరియు అల్లరితో కూడిన ఆట పాటలు*!
“శరీరం” అనేది తన దుష్ట వాంఛలతో కూడిన మానవ స్వభావంలోని పాపపూరితమైన ఒక
వస్తువు. ఒక వ్యక్తి మారుమనస్సు పొందిన తర్వాతకూడా, అది నిలిచేవుండి, అతనికి బహు
ప్రమాదకరమైన శత్రువుగా పరిణమిస్తుంది. అనుకూల పరిస్థితులను బట్టి ఏదో ఒక సందర్భంలో
బయట పడుతూనే ఉంటుంది.
అల్లరి ఎలా వస్తుంది అంటే మన మనస్సు మన కంట్రోల్ తప్పినప్పుడు!
కొన్నిసార్లు ఫుల్ గా మధ్యపానం త్రాగితే , ఇంకా మత్తుపదార్దాలు తీసుకుంటే ఇలాంటి
అల్లర్లు వస్తాయి! వీటిని మనం విసర్జించాలి!
అల్లరితో కూడిన
ఆట పాటలు అంటే?
* సినిమాలు, సీరియల్స్
* అధికంగా వినోదించడం
* తిండిబోతుతనం
* మత్తు పానీయాలు
* మాదక ద్రవ్యాలు
* లైంగిక సంభోగాలతో కూడిన సమావేశాలు మొదలైనవి.
సినిమాలు చూడకూడదని ఎక్కడ వ్రాయబడి వుంది? అని ప్రశ్నించేవారు నేటి
దినాలలో కోకొల్లలు. అవును! అట్లా వ్రాయబడలేదు. బైబిల్ వ్రాయబడే దినాలకు సిమాలు
లేవు కాబట్టి, దానిని ప్రత్యక్షంగా వ్రాయవలసి అవసరం లేకపోయింది. కానీ, ఒక్క విషయం!
పరోక్షంగా అవన్నీ “అల్లరితో కూడిన ఆటపాటలలో” చేర్చడం జరిగింది.
* సినిమా అనేది నటనతో నిండి ఉంటుంది. నటన అనగా వేషధారణ. ఆయన వేశ్యనైనా
క్షమిస్తాడు గాని, వేషధారిని క్షమించడు.
* సినిమాలో శృంగార సన్నివేశాలుంటాయి. శృంగారం అనేది భార్యాభర్తల మధ్య
రహస్య ప్రక్రియగా ఉండాలనేది దేవుని చిత్తం. కానీ సినిమా ఆ రహస్య ప్రక్రియలను
బహిరంగముగా అనేకమందికి చూపి వ్యభిచారపు ఆలోచనలను మనుష్యులలో రేకెత్తిస్తుంది.
* సినిమాలో హింసాత్మక దృశ్యాలు, పోరాటo సన్నివేశాలు ఉంటాయి.
ఒక మనిషి ఇంకొక మనిషిని హింసించడం, కొట్టడం, చంపడం ఇటువంటివన్నీ సినిమాలో
కనబడతాయి. అన్యాయం చేసిన వాడిని కొట్టవచ్చు, తన్నవచ్చు, చంపవచ్చు అని సినిమా
బోధిస్తుంది. కానీ ఇది యేసయ్యకు వ్యతిరేకం. నిన్ను వలె నీ పొరుగువారిని
ప్రేమించుము అని చెప్పిన యేసయ్య తన్ను హింసించినవారిని క్షమించాడు.
ఇట్లా
చెప్పకుంటూపోతే, చెప్పలేనన్ని.
చాలా
ఎక్కువమంది సినిమాలు చూడకూడదు గాని, సీరియల్స్
చూసినా ఏమి కాదు. అని వారికి వారే సర్ది చెప్పేసుకుంటారు. అయితే ఒక్క విషయం!
సినిమాయైతే, మూడు గంటలలో అయిపొతుందేమో గాని, ఈ సీరియల్ అయితే? మూడు సంవత్సరాలైనా
సమాప్తం కాదు. వీటికి అలవాటుపడిన నీవు, శరీరకార్యాలనే నెరవేర్చుతున్నావనే విషయం
ఎట్టి పరిస్థితులలోనూ మరచిపోవద్దు.
తాగి తందనాలాడడం, డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడడం, శరీరవాంఛలను
రేకెత్తించే పదజాలం, ఇవన్నీ అల్లరితోకూడిన ఆటపాటలే.
శరీరకార్యమేదైనా
నిన్ను దేవుని నుండి దూరంచేసి, లోకానికి మరింత దగ్గర చేస్తుంది. లోకము, దాని ఆశలు
గతించిపోతాయి. ఆయన చిత్తాన్ని జరిగించేవారే స్థిరముగా నిలుస్తారు.
అల్లరితో కూడిన ఆట పాటలు వీడి, దాని స్థానంలో క్రీస్తు
ప్రేమను నింపుకొని, సమాధాన కరమైన జీవితాన్ని జీవించడానికి ప్రయాస పడదాం!
ప్రియ దైవజనమా! ఈ
శరీరకార్యాలు అన్నీ నిన్ను నరకానికి నడిపిస్తున్నాయి! ఇవి గనుక నీలో పనిచేస్తే
నీవు పరలోకం దరికూడా చేరలేవు! ఈ శరీరకార్యాలు తప్పకుండా నీలో కాలిపోవలసినదే! అయితే
నీకు నీవుగా వీటిని వదలలేవు కాల్చలేవు! దానికి తప్పకుండా ఆత్మశక్తి కావాలి!
పరిశుద్ధాత్ముడు నీలో పనిచేస్తుంటే ఆ ఆత్మశక్తి ద్వారానే వీటిని నీవు దహించగలవు!
ఆత్మావేషం, ఆత్మాభిషేకం లేకుండా నీవు వీటిపై జయం పొందడం అసాద్యం! కాబట్టి ప్రియమైన
స్నేహితుడా! నీకు శరీరకార్యాలు వదిలెయ్యాలని ఉన్నా సరే, వాటిని వదలలేని
పరిస్థితిలో ఉన్నావు కదా, నేడే ఆ పరిశుద్ధాత్మయొక్క శక్తి కోసం ప్రార్ధించి
పొందుకో! అప్పుడు వీటిని చీకొట్టగలవు! కాల్చివేయగలవు!
గమనించాలి:
ఇలాంటి శరీరకార్యములు చేసేవారు ఎవరూ దేవుని రాజ్యములో ప్రవేశించరని 21వ వచనంలో
చెబుతున్నారు! దేవునిరాజ్యంలో ప్రవేశించక పొతే నరకంలో సీటు కన్ఫర్మ్ అన్నమాట!
కాబట్టి
ఏమికావాలో నిర్ణయించుకో!
శరీరకార్యాలు
వదలివేసి- ఆత్మఫలము కలిగి ఆత్మానుసారంగా నడచుకొందాం!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -78వ భాగం*
*పిలుపుకు తగిన జీవితం-31*
ఎఫెసీ 4:28—32
28. దొంగిలువాడు
ఇకమీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలుకలుగు నిమిత్తము తన చేతులతో మంచి
పనిచేయుచు కష్టపడవలెను.
29. వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి
క్షేమాభివృద్ధికరమైన అను కూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీనోట రానియ్యకుడి.
30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచనదినమువరకు
ఆయనయందు మీరు ముద్రింపబడి యున్నారు.
31. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ,
సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.
32. ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు
దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! మనము పిలుపుకి తగ్గ జీవితం ఎలా జీవించాలో నేర్చుకుంటున్నాము!
చూడండి
ఇక్కడ పిలుపుకి తగిన జీవితం జీవించే విధానంలో మరో పద్దతి: ! తర్వాత
విసర్జించవలసినది దూషణ!
దూషణ అనగా విమర్శిస్తూ తిట్టడం, గెలిచేయడం, చెడ్డమాటలు పలకడం.
ఇలాంటివి విశ్వాసి ఎట్టి పరిస్తితులలో కూడా చేయకూడదు!
ఒకవేళ ఇతరులు/ అన్యులు మన దేవుని నామము
నిమిత్తం మనల్ని విమర్శిస్తే మారుమాట్లాడకుండా సహించమని చెప్పారు దేవుడు. మనముకూడా
వారిని దూషించమని విమర్శించమని చెప్పలేదు దేవుడు! నా నిమిత్తము ప్రజలు మిమ్మును
నిందించి, హింసించి మీమీద అబద్దముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు!
సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును అని చెప్పారు యేసుప్రభులవారు!
మత్తయి 5:11-12. అదేసమయంలో దూషించేవారి నోరుమూయించగల సమర్ధుడు మనదేవుడు! వారి
దవడపల్లు రాలగొట్టేవాడు మన దేవుడు! కీర్తనలు 3:7;
అందుకే పగతీర్చుట నాపని అంటున్నారు. హెబ్రీ 10:30; కాబట్టి ఆయననే
పగతీర్చుకోనిద్దాం!
సరే ఇప్పుడు *దూషణ*
కోసం చూసుకుందాం! ఇశ్రాయేలీయులను అన్యులు/ విరోధులు దూషించినప్పుడు
దేవుడు స్పందించిన రీతి అమోఘం!
మొదటగా: దావీదుగారిని, ఇశ్రాయేలీయులను గొల్యాతు తిరస్కరించి—దూషించినప్పుడు దావీదుగారు తిరిగి దూషించలేదు! నీవు కత్తిని, ఈటెను
తీసుకొని వస్తున్నావు గాని, నేను యెహోవాపేరిట వస్తున్నాను, యుద్ధము యెహోవాదే అని
వడిసెలతో ఒక్క దెబ్బకొడితే దిమ్మదిరిగి, బోర్లపడి, నేలనాకాడు. చచ్చాడు. 1 సమూయేలు
17; దేవుణ్ణి, దేవుని ప్రజలను విమర్శించేవారికి దక్కేఫలం ఇదే!
రెండవదిగా:
హిజ్కియా భక్తుడు రాజుగా ఉన్నప్పుడు, అష్శూరు రాజైన సన్హేరీబు యేరూషలేము మీదకు
దండెత్తి—నా చేతిలోనుండి తప్పించే దేవుడెవడు? ఆ దేవత తప్పించగలిగేనా? ఈ
దేవుడు తప్పించగలిగేనా? మీ దేవుడు నా చేతిలోనుండి తప్పించగలడా అంటూ ప్రగల్భాలు
పలికినప్పుడు, రాజైన హిజ్కియా ఆ పత్రిక దేవాలయంలో పరచి, తన హృదయాన్ని అక్కడే
దేవునిముందు కుమ్మరించినప్పుడు యెషయా 37వ అధ్యాయం, దేవుడు అంటున్నారు నీవు ఎవర్ని
తిరస్కరిస్తున్నావు? ఎవరిని దూషిస్తున్నావు? ఎవరిని భయపెడతావు? (23)
28. నీవు కూర్చుండుటయు బయలువెళ్లుటయు లోపలికి వచ్చుటయు
నామీదవేయు రంకెలును నాకు తెలిసేయున్నవి.
29. నామీద నీవు వేయు రంకెలును నీవు చేసిన కలహమును నా
చెవులలో జొచ్చెను నా గాలము నీ ముక్కునకు తగిలించెదను నా కళ్లెము నీ నోటిలో పెట్టి
నిన్ను మళ్లించెదను నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను.
అందుకు దేవుడు
36. అంతట యెహోవా దూత బయలుదేరి అష్షూరువారి దండు పేటలో లక్ష
యెనుబదియైదువేలమందిని మొత్తెను; ఉదయమున జనులు లేవగా వారందరును మృతకళేబర ములుగా
ఉండిరి. .
. . . . చివరికి సన్హేరీబు అవమానంతో తనదేశానికి తిరిగి వెళ్ళిన వెంటనే తన కడుపున
పుట్టిన కుమారులే అతనిని చంపివేశారు.
మూడవదిగా:
పైన ఉదాహరించిన వారిలాంటి వారు చాలామంది ఉన్నారు, అయితే జెఫన్యా గ్రంధంలో 2:8,9లో
8. మోయాబువారు చేసిన నిందయు, అమ్మోనువారు పలికిన దూషణ
మాటలును నాకు వినబడెను; వారు నా జనుల సరిహద్దులలో ప్రవేశించి అతిశయపడి వారిని
దూషించిరి.
9. నా జీవముతోడు మోయాబుదేశము సొదొమ పట్టణమువలెను,
అమ్మోనుదేశము గొమొఱ్ఱా పట్టణమువలెను అగును. అవి ముండ్లచెట్లకును ఉప్పు గోతులకును
స్థానమై నిత్యము పాడుగా ఉండును; నా జనులలో శేషించువారు ఆ దేశములను దోచుకొందురు; నా
జనులలో శేషించువారు వాటిని స్వతంత్రించుకొందురు. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన
సైన్యములకు అధిపతియగు యెహోవావాక్కు ఇదే. .
.
కాబట్టి ఎవరైతే దూషణమాటలు పలుకుతారో వారిగతి
ఇంతే!
దేవుని
బిడ్డలను దూషిస్తే అంతే!! అదేవిధంగా దేవుని బిడ్డలు అని పేరు పెట్టుకొని, నీవుకూడా
అదేపని చేస్తే నీ గతికూడా అంతే!!!
అందుకే ఎఫెసీ 4:31 లో.సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము,
అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. అంటున్నారు.;
పేతురుగారు
కూడా అంటున్నారు: 1 పేతురు 2:2,3లో
2. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను,
అసూయను, సమస్త దూషణ మాటలను మాని,
3. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన
వాక్యమను పాలవలన (నిర్మలమైన ఆత్మసంబంధమగు పాలవలన) రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము,
ఆ పాలను అపేక్షించుడి. . . . కాబట్టి విశ్వాసులైన
వారు ఇలాంటి దూషణమాటలు వదలాల్సి ఉంది.
అంతేకాకుండా మనం చేసే పనులను బట్టి
దేవునినామం దూషణపాలు అవుతుంది. అయినా దేవుడు మనలను ఎందుకు క్షమిస్తున్నారంటే మనలను
శిక్షించి, తన నామమునకు దూషణ/ చెడ్డపేరు రాకూడదు అని. యేహెజ్కేలు 20:9, 14, 22;
39:7;
ఎన్నోసార్లు దేవుడు మనవల్లనే తన నామం దూషణపాలు
అవుతుంది అని భాదపడ్డారు. యేహెజ్కేలు 36:20.
యెహేజ్కేలు 36: 21
కాగా
ఇశ్రాయేలీయులు పోయిన యెల్లచోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా నేను చూచి నా
నామము విషయమై చింతపడితిని.
చివరికి
దేవునికి కోపం వచ్చి వారిని నాశనం చేశారు యేహెజ్కేలు
43:8
నా గడపదగ్గర వారి స్థలముల గడపలను, నా ద్వారబంధములదగ్గర వారి
ద్వార బంధములను కట్టి, తాముచేసిన హేయక్రియలచేత నా పరిశుద్ధనామమునకు దూషణ కలుగుటకై
వారు హేతువు లైరి గనుక నేను కోపావేశుడనై వారిని నాశనము చేసితిని.
కాబట్టి ఇశ్రాయేలీయులను శిక్షించిన దేవుడు
నిన్ను నన్ను కూడా శిక్షిస్తారు. కారణం యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరమూ ఏకరీతిగా
ఉన్నాడు! హెబ్రీ 13:8;
కాబట్టి
నేడే నీ దూషణమాటలు వదిలేసెయ్!
అంతేకాకుండా
నీ ప్రవర్తన వలన దేవుని నామమునకు దూషణ కలగకుండా జాగ్రత్త పడు!
అట్టి
కృప దేవుడు మన అందరికి దయచేయును గాక!
ఆమెన్!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -79వ భాగం*
*పిలుపుకు తగిన జీవితం-32*
ఎఫెసీ 4:28—32
28. దొంగిలువాడు
ఇకమీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలుకలుగు నిమిత్తము తన చేతులతో మంచి
పనిచేయుచు కష్టపడవలెను.
29. వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి
క్షేమాభివృద్ధికరమైన అను కూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీనోట రానియ్యకుడి.
30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచనదినమువరకు
ఆయనయందు మీరు ముద్రింపబడి యున్నారు.
31. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ,
సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.
32. ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు
దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! మనము పిలుపుకి తగ్గ జీవితం ఎలా జీవించాలో నేర్చుకుంటున్నాము!
చూడండి ఇక్కడ పిలుపుకి తగిన జీవితం జీవించే
విధానంలో మరో పద్దతి: ! తర్వాత విసర్జించవలసిన అలవాటు: *దుష్టత్వము* దీనికి మరో అర్ధం దుర్మార్గము. అనగా చెడుచేసే బుద్ధి.
బాగున్నవారిని పాడుచేసే బుద్ధి. అన్యాయంగానైనా పరుల ఆస్తిని కాజేయాలని, పరులను
భాదపెట్టి వారు ఆనందపడే ఒకరకమైన పాశవికమైన పని/ ఆనందం—ఈ దుష్టత్వం! వీరిలో
శాడిస్ట్ బుద్దులుంటాయి. sadism
చాలా ఉంటుంది వీరిలో!
దుష్టత్వం ఎవరిలో ఉంటుందో వారిని దుష్టులు
అంటారు!!! లేదా దుర్మార్గముగా ఎవరు ప్రవర్తిస్తారో వారిని దుర్మార్గులు అంటారు. ఈ
దుష్టులకోసం, దుర్మార్గుల కోసం బైబిల్ గ్రంధంలో చాలా చోట్ల వ్రాయబడి యుంది.
దుష్టులు—దుర్మార్గులు దేవుని
దృష్టికి అసహ్యులు! వీరిమీదకు దేవుని
ఉగ్రత పెళ్లుమని దిగివస్తుంది అని వ్రాయబడింది. యిర్మియా 23:19; 30:23;
*దుష్టులు*:
**గాలి చెదరగొట్టు పొట్టువలె ఉందురు. కీర్తన 1:4;
** తాము చేసిన దానిలో/ తవ్విన గోతిలో వారే పడతారు. కీర్తనలు
9:16;
** దుష్టులు తమ మనోభిలాషనుబట్టి అతిశయపడుదురు. కీర్తనలు 10:
3
** పొగరెక్కి యెహోవా విచారణ చేయడు అనుకొంటారు 10:4;
** దేవుడు లేడని అనుకొంటారు. అనగా కీర్తనలు 14/ 53 ప్రకారం
వీరు బుద్ధిహీనులు అన్నమాట! 10:4;
** దేవుణ్ణి తృణీకరిస్తారు 10:13;
** యదార్ధహృదయులు మీద విల్లు, బాణములు ఎక్కుపెడతారు. 11:12;
** గర్విష్టులై తిరుగులాడుడురు. 12:8;
** నీతిమంతుల ప్రాణాన్ని తీయాలని చూస్తారు. 94:2;
నిర్దోషులను, దోషులు అని మరణానికి అప్పగిస్తారు.
** న్యాయాన్ని గ్రహించరు
సామెతలు 28:5;
** దుష్టకార్యాలు చేస్తారు. దానియేలు 12:10;
అందుకే
ఈ దుష్టుల దవడ పళ్ళు మీద కొడతాను, పళ్ళు
రాలగొడతాను అంటున్నారు దేవుడు. కీర్తనలు 3:7;
*దుర్మార్గులు*:
** అందకారమందు మాటుమణుగుదురు . 1 సమూయేలు 2:9;
** దేవుని చేత విసర్జింప బడతారు 2 సమూయేలు 23:6;
** గాలికి చెట్టు కూలిపోయినట్లు రాలిపోతారు. యోబు 24:20;
హబక్కూకు
గారు అంటున్నారు: దేవుని కన్ను దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది అనగా
దుష్టత్వమును చూసి ఓర్చుకోలేనిది. 1:13; అందుకే పౌలుగారు దుష్టత్వము విషయమై
శిశువులు గా ఉండమంటున్నారు. 1 కొరింథీ 14:20; కారణం పిల్లలకు మాయా-మర్మం తెలియదు!!
అందుకే ఎఫెసీ 4:31
సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు
విసర్జించుడి.
కాబట్టి ప్రియ సహోదరీ/ సహోదరుడా! నిన్ను నీవు
పరీక్షించుకో! ఒకవేళ ఈ శాడిస్ట్ బుద్దులు, దుష్ట—దుర్మార్గపు బుద్దులు నీలో
ఉంటే ఇప్పుడే వాటిని తొలగించుకో! దానియేలు గారిమీద దుష్టులు చాడీలు చెప్పి- సింహాల
బోనులో వేయిస్తే, దానియేలు గారిమీద చాడీలు చెప్పినవారే, ఆయన బయటకు వచ్చిన తర్వాత
సింహాల పాలు అయిపోయారు. కాబట్టి అలాంటి పాడుబుద్దులు , చెడు పనులు విసర్జించి,
దుష్ట-దుర్మార్గపు పనులు వదలి దేవుని పాదాల వద్దకు రమ్మని దేవుని పేరిట మనవి
చేస్తున్నాను.
యిర్మియా,
యేహెజ్కేలు గ్రంధాలలో చాలా క్లియర్ గా చెబుతున్నారు దేవుడు—దుర్మార్గులు చావడం వలన ఆయన
సంతోషించేదేవుడు కాదు గాని వారు మారుమనస్సు చెంది పరివర్తన చెందడమే దేవునికి
కావాలి.
కాబట్టి
నేడే నీ దుష్టబుద్దులు వదలి వేసి ఆయన యొద్దకు రా!
ఆయన నిన్ను చేర్చుకోడానికి సిద్ధంగా ఉన్నారు.
దేవుడు
మిమ్మును దీవించును గాక!
ఆమెన్!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -80వ భాగం*
*పిలుపుకు తగిన జీవితం-33*
ఎఫెసీ 5:1
1. కావున మీరు
ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి నడుచుకొనుడి.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! మనము పిలుపుకి తగ్గ జీవితం ఎలా జీవించాలో 4వ అధ్యాయం నుండి
నేర్చుకున్నాము! ఇక 5 వ అధ్యాయం నుండి పిలుపుకి తగిన జీవితం ఎలా జీవించాలో
చూసుకుందాం!
చూడండి
ఇక్కడ పిలుపుకి తగిన జీవితం జీవించే విధానంలో మరో పద్దతి: ! మీరు ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి నడుచుకొనుడి!
ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసిన విషయాలు: మొదటిది దేవుని పోలి నడుచుకోవాలి, రెండు
ఎలాగు అంటే ప్రియమైన పిల్లల వలె!!
గమనించాలి:
దేవుని పోలి నడుచుకోవాలి అంటే దేవునిలా ప్రవర్తించాలి! లేవీకాండంలో దేవుడు అంటున్నారు:
నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అంటున్నారు ..11:44,45;
20:26;21:8
కాబట్టి పిలుపుకి తగిన జీవితం జీవించడం అంటే
అనేకసార్లు చెప్పినట్లు పరిశుద్ధులుగా జీవించాలి! మన మాట, చూపు, ప్రవర్తన, తలంపులు
అన్నీ పరిశుద్ధమై ఉండాలి!
దేవుని
పిల్లలు తమ తండ్రిలాగానే ప్రవర్తించాలి. ఇంకా మత్తయి సువార్తలో అంటున్నారు
మత్తయి 5
48. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును
పరిపూర్ణులుగా ఉండెదరు.
పరిపూర్ణులుగా
ఉండాలి! గత అధ్యాయంలో చూసుకున్నాము! పిలుపుకి తగిన జీవితం జీవించాలి అంటే సంపూర్ణత
సాధించాలి! సంపూర్ణత సాధించాలి అంటే మూడు రకాలుగా సాధించవచ్చు అని చూసుకున్నాము! Tenfold మినిస్ట్రీ లో
పాలుపొందడం ద్వారా, ఇంకా శ్రమల ద్వారా సంపూర్ణత సాధించాలి, చివరగా ప్రేమ ద్వారా
సంపూర్ణత సాధించాలి. కారణం దేవుడే ప్రేమ గనుక ప్రేమ అనే దేవుడిని కలిగి ఉంటే
పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావు. పరిశుద్ధాత్ముడు ఉంటే ఆత్మ కార్యాలు ఆత్మఫలము
పనిచేస్తాయి కాబట్టి పరిశుద్ధులుగా ఉండగలము!!! పరిపూర్ణత సాధించగలము!!
ఇక
తర్వాత మనము దేవుని ప్రియమైన పిల్లలవలె జీవించాలి! దేవునికి ప్రియంగా ఎలా
ఉండగలము?? ఆయన చెప్పింది చేయాలి ఉన్నది ఉన్నట్లుగానే!!
దేవుని
మాట వినాలి! 1 యోహాను 3:21—5
1. మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి
ప్రేమ ననుగ్రహించెనొ చూడుడి; మనము దేవుని పిల్లలమే.ఈ హేతువుచేత లోకము మనలను
ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు.
2. ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమై యున్నాము.
మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన
యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము.
3. ఆయనయందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన
పవిత్రుడై యున్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసికొనును.
4. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును;
ఆజ్ఞాతిక్రమమే పాపము.
5. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెనని మీకు
తెలియును; ఆయనయందు పాపమేమియు లేదు.
ఇక్కడ
అంటున్నారు: మనము దేవుని పిల్లలవలె ఉండాలి అంటే ఆయన పవిత్రుడై ఉన్నట్లు ఆయనను పోలి
నడుచుకోవాలి అంటున్నారు!
ఇక తర్వాత ప్రియమైన పిల్లలుగా ఉండాలి అంటే పాపము
చేయకూడదు అంటున్నారు!
ఇంకా
అంటున్నారు
9. దేవుని మూలముగా
పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపముచేయడు; వాడు దేవుని
మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు.
10. దీనినిబట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో
తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును
దేవుని సంబంధులు కారు.
11. మనమొకని నొకడు ప్రేమింపవలెననునది మొదటనుండి మీరు వినిన
వర్తమానమేగదా
కాబట్టి
ఈ రకంగా ఆయనకు ప్రియమైన పిల్లలుగా మనము జీవించగలము!
యేసుక్రీస్తుప్రభులవారు
ఒక ఉపమానం చెప్పారు మత్తయి 21 లో
28. మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యునికి ఇద్దరు
కుమారులుండిరి. అతడు మొదటివానియొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్షతోటలో
పని చేయుమని చెప్పగా
29. వాడుపోను అని యుత్తరమిచ్చెను గాని పిమ్మట మనస్సు
మార్చుకొని పోయెను.
30. అతడు రెండవవాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు
అయ్యా, పోదుననెను గాని పోలేదు. ఈ యిద్దరిలో ఎవడు తండ్రి యిష్టప్రకారము చేసినవాడని
వారి నడిగెను.
కాబట్టి
తండ్రి ఇష్టప్రకారం ఆయన చిత్తప్రకారం చేయువాడే ఆయనకు ప్రియులైన పిల్లలుగాని
వారికిష్టమొచ్చినట్లు చేసేవారు కాదు!
గనుక
మనం దేవునికి ప్రియులైన పిల్లలముగా ఉండటమే ఆయన పిలుపుకి తగిన జీవితం జీవించడం! అలా
ఉండాలంటే దేవుడు చెప్పినది చేయాలి పరిశుద్దులుగా జీవించాలి!
అట్టి
కృప ధన్యత దేవుడు మనకు దయచేయును గాక!
ఆమెన్!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -81వ భాగం*
*పిలుపుకు తగిన జీవితం-34*
ఎఫెసీ 5:2
2. క్రీస్తు మిమ్మును ప్రేమించి, పరిమళ వాసనగా ఉండుటకు
మనకొరకు తన్నుతాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను; ఆలాగుననే మీరును
ప్రేమగలిగి నడుచుకొనుడి.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! మనము పిలుపుకి తగ్గ జీవితం ఎలా జీవించాలో ధ్యానం చేసుకుంటున్నాము!
చూడండి క్రీస్తు ఎలా మనలను ప్రేమించి తనకు తాను
మనకొరకు దేవునికి అర్పణముగా బలిగా అర్పించుకొన్నారో అలాగే మీరును ప్రేమ కలిగి
నడుచుకోండి అంటున్నారు! నిజానికి ఈ ఎఫెసీ పత్రికలో అనేకసార్లు ప్రేమ కలిగి ఉండాలి
అంటున్నారు! ఎందుకంటే యోహాను పత్రికలో అంటున్నారు దేవుడు ప్రేమ గనుక.. కాబట్టి
దేవుడే ప్రేమ కాబట్టి ప్రేమ కలిగి ఉంటే దేవుణ్ణి కలిగి ఉండటమే! అందుకే ఇక్కడ
మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి!
నిర్గమకాండము
29:18, కీర్తనల గ్రంథము 40:6
“క్రీస్తు
మనలను ప్రేమించారు అంటున్నారు ”– 25వ వచనంలో
కూడా అంటున్నారు: క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించారు అంటున్నారు!;
యోహాను
సువార్తలో వ్రాయబడింది యోహాను 13:1
1. తాను ఈ లోకమునుండి తండ్రియొద్దకు వెళ్లవలసిన గడియ
వచ్చెనని యేసు పస్కాపండుగకు ముందే యెరిగిన వాడై, లోకములోనున్న తనవారిని ప్రేమించి,
వారిని అంతమువరకు ప్రేమించెను.;
చూడండి దేవుడు మనలను అంతము వరకు ప్రేమించారు! మనము కూడా మన సహోదరులను
పొరుగువారిని అందరినీ అంతము వరకు ప్రేమించాలి. ఎవరి అంతము వరకు అంటే మన అంతము వరకు
అనగా మనము చనిపోయేవరకు మనకు ప్రేమిస్తూ ఉండాలి!
యోహాను 15:9, తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో నేనును
మిమ్మును ఆలాగు ప్రేమించితిని, నా ప్రేమయందు నిలిచి యుండుడి.
యోహాను 15:12; నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, మీ రొకని
నొకడు ప్రేమించ వలెననుటయే నా ఆజ్ఞ
రోమీయులకు 8:37; అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము
వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము.
గలతియులకు 2:20. నేను క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాను;
ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీర
మందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన
దేవుని కుమారునియందలి విశ్వాసమువలన జీవించుచున్నాను.
“పరిమళమైన వాసనగా .. బలిగా”– మత్తయి
20:28; ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించు కొనుటకు రాలేదు గాని పరిచారము
చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని
చెప్పెను.
మత్తయి 26:28; ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము
అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము.
యోహాను 1:29;
మరువాడు యోహాను యేసు తనయొద్దకు రాగా చూచి ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని
గొఱ్ఱెపిల్ల.
రోమీయులకు 5:8; అయితే దేవుడు మనయెడల తన ప్రేమను
వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.
2 కోరింథీయులకు 5:14; క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము
చేయుచున్నది; ఏలాగనగా అందరికొరకు ఒకడు మృతిపొందెను గనుక అందరును మృతిపొందిరనియు,
హెబ్రీయులకు 9:14; నిత్యుడగు ఆత్మద్వారా తన్నుతాను దేవునికి
నిర్దోషినిగా అర్పించు కొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి
జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధిచేయును.
హెబ్రీయులకు 10:10, యేసుక్రీస్తుయొక్క శరీరము ఒక్కసారియే
అర్పింపబడుటచేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడియున్నాము.
హెబ్రీయులకు 10:14; ఒక్క అర్పణచేత ఈయన పరిశుద్ధపరచబడు
వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు.
1 పేతురు 2:24; మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై
జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసి కొనెను. ఆయన
పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి.
1 పేతురు 3:18. ఏలయనగా మనలను దేవునియొద్దకు తెచ్చుటకు,
అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరవిషయములో చంపబడియు
పరిమళ
వాసనగా మరియు బలి అనే పదములు క్రీస్తు
సిలువకు సూచనగా ఉన్న పాత నిబంధన గ్రంధంలో గల
అర్పణలను గుర్తుకు తెస్తున్నది (లేవీయకాండము 1:9, లేవీయకాండము 1:13,
లేవీయకాండము 1:17 మొ।।). “ప్రేమభావం”– ఎఫెసీయులకు 3:19; ఎఫెసీయులకు 4:15; యోహాను 13:34; రోమీయులకు
12:10; గలతియులకు 5:6, గలతియులకు 5:13; 1 యోహాను 3:11, 1 యోహాను 3:16-18; 1 యోహాను
4:7-8.
కాబట్టి
క్రీస్తు మనకోసం తననుతాను ఎలా అర్పించుకున్నారో అలాగే మనము కూడా క్రీస్తు ప్రేమను చాటుతూ
అందరినీ ప్రేమిస్తూ దేవునికి పిల్లలు వలె జీవించాలి! అదే పిలుపుకి తగిన జీవితం!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -82వ భాగం*
*పిలుపుకు తగిన జీవితం-35*
ఎఫెసీ 5:3—6
3. మీలో జారత్వమే గాని, యే విధమైన అపవిత్రతయే గాని,
లోభత్వమేగాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది.
4. కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను,
పోకిరిమాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు.
5. వ్యభిచారియైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై
యున్నలోభియైనను, క్రీస్తుయొక్కయు దేవునియొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను
సంగతి మీకు నిశ్చయముగా తెలియును.
6. వ్యర్థమైన మాటలవలన ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి;
ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైనవారిమీదికి వచ్చును
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! మనము పిలుపుకి తగ్గ జీవితం ఎలా జీవించాలో ధ్యానం చేసుకుంటున్నాము!
ఇక
పిలుపుకి తగిన జీవితం జీవించడానికి విసర్జించవలసిన మరో విషయం: జారత్వం
ఇది
శరీరకార్యములలో మొదటిది: *జారత్వము*:
జారత్వము---
వ్యభిచారము:
ప్రియ
దైవజనమా! మొట్టమొదట నిర్మూలించ వలసినది జారత్వం! దీనికి మరో అర్ధం లైంగిక అవినీతి!
అనగా unauthorised sex.
నీ భార్యతో తప్ప మరో స్త్రీతో శారీరక సంబంధం కలిగిఉంటే అది వ్యభిచారం, జారత్వం! నీ భర్తతో కాకుండా మరో
వ్యక్తితో శారీరక సంబంధం కలిగి ఉంటే అది
వ్యభిచారం. నీకు పెళ్ళికాకుండా sex లో పాల్గొంటే జారత్వం!
మీరు
పరిశుధ్దులగుటయే అనగా జారత్వమునకు దూరంగా పారిపోవుటయే దేవుని చిత్తము -1;
మీలో ప్రతీ వాడును దేవుని ఎరుగని అన్యజనులవలె కామాభిలాషయందు
కాక తన ఘటమును కాపాడుకొనుట ఎరిగియుండుటయే దేవుని చిత్తము -2. 1 ధెస్సలో 4: 3,4
ప్రియ
సహోదరి/సహోదరులారా - దేవుని చిత్తమును జరిగించుటకే మనలను దేవుడు ఏర్పరచుకొన్నారు,
పిలచుకొన్నారు, ప్రత్యేక పరచుకొన్నారు, మహిమపరచుకొన్నారు. అలాంటప్పుడు మనం ఈ
జారత్వక్రియలు చేయడం సరియైన పనా? ఎందుకంటే భూమిమీద మనిషి చేసే ప్రతీ పాపం
ఒకవ్యక్తి మాత్రమే చేస్తాడు కాని ఈ జారత్వం అనేది ఇద్దరు వ్యక్తులు, రెండు
శరీరాలు, రెండు మనస్సులు, రెండు ఆత్మలు కలసి చేసేది వ్యభిచారం. 1 కొరింథీ 6:16.
ఇక్కడ శరీరంతో పాటు ఆత్మను కూడా బ్రష్టు పట్టిస్తున్నాం. నీ దేహము దేవునిచే నీకు
దానముగా దయచేయబడింది. 19 వచనం. అది
విలువపెట్టి కొనబడింది(20), విమోచింపబడింది. పాపానికి ఆశ్రయమైయున్న నీ దేహాన్ని
దేవుడు తన స్వరక్తమిచ్చి మిమ్మల్ని కొన్నారు(అపొ 20:28) . ఇప్పుడు నీ దేహము
నీదికాదు. దేవునిది. దానిని దేవుడు తన ఆలయముగా మందిరముగా చేశారు (1కొరింథీ
3:16,17; 6:19-20 వచనాలు) మీరు దేవుని ఆలయము. దేవుని ఆత్మ మీలో నివశించుచున్నదని మీకు
తెలియదా? ఎవడైననూ దేవుని ఆలయమును పాడుచేసిన యెడల దేవుడు వానిని పాడుచేయును.
ఖభడ్దార్. దేవునిలో
వెలిగింపబడి పరిశుద్ధ పరచబడిన మీరు తిరిగి, మీఅవయవాలు, అనగా పవిత్రమైన
క్రీస్తురక్తములో కడుగబడి పవిత్ర పరచబడిన మీ అవయవాలు -దేవుని ఆలయముగా మలచబడిన మీ దేహాలు వేశ్యలతో
లేక పరస్త్రీలతో కలిపి పాపం చేస్తారా?
1 కొరింథీ
6:13-16 , నీ దేహము జారత్వము కొరకు కాదుగాని ప్రభువు నిమిత్తమే, మీ దేహములు
క్రీస్తు అవయవములు, క్రీస్తు అవయవములు తీసుకొని వాటిని వేశ్యయొక్క అవయవములతో
కలుపుతావా? చేస్తే తప్పించుకొంటావా? ఇటువంటి వారిపై దేవుని ఉగ్రతయను పెనుగాలి
రాబోతుంది.
1 కొరింథీ 6:8,9
మోసపోకుడి జారులైననూ.........వ్యభిచారులైననూ.......పురుష సంయోగులైననూ......దేవుని
రాజ్యమునకు వారసులు కానేరరు. మనకున్నవి రెండే రెండు గమ్యములు. ఒకటి పరలోకం. రెండు నరకం-
నిత్య నరకాగ్నిగుండము,అగ్ని ఆరదు పురుగు చావదు.
ఇప్పుడు పై కార్యాలు చేసేవారు దేవుని
రాజ్యానికి వారసులు కారు అంటే నరకంలో సీటు కన్ఫర్మ్. జాగ్రత్త.
ప్రకటన 21:8 పిరికివారును,......వ్యభిచారులును,...అగ్ని
గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు.
22:15 కుక్కలును,.... వ్యభిచారులును.......వెలుపటనుందురు.
చూశారా లేఖనం ఏమి సెలవిస్తుంది? వ్యభిచారం, జారత్వం దేవునికి అసహ్యమైన క్రియ. పవిత్రగ్రంథం నుండి
కొందరు యవ్వనస్తులను జ్ఞాపకం చేసుకొందాం.
1. యాకోబుగారి ప్రియమైన భార్య పెద్దకుమారుడు, యాకోబు గారిచే
ఎక్కువగా ప్రేమింపబడినవాడు యోసేపు. అయితే దైవప్రణాళికలో, అన్నల పాశవిక కక్ష
క్రోదాలకు బలై, కొట్టబడి చివరకు ఐగుప్తుదేశంలో బానిసగా అమ్మబడ్డాడు. గాని అతని
భక్తి విశ్వాసాలు వలన పోతీఫర్ గృహాధిపతిగా చేయబడ్డాడు. చివరకు యజమాని భార్య ఈ
యవ్వనస్తుని మోహించి ఎంతగా వలపించినా ఏమంటున్నాడో చూడండి, నాయజమానునికి మోసం
చేయలేను అనడం లేదు, దేవునికి వ్యతిరేకంగా ఈ పాపం చేయలేను అని చెప్పి జారత్వం నుండి
పారిపోయాడు. ఫలితంగా శ్రమలు పడినా జైలు శిక్ష భరించినా చివరకు ఐగుప్తు దేశానికే
అధిపతి కాగలిగాడు. సహోదరుడా నీవు పాపం
నుండి పారిపోగలవా?
2. ఇశ్రాయేలీయులు ఐగుప్తు చెరవిముక్తి అయిన మీదట మార్గమధ్యంలో
మోయాబు ప్రాంతం సమీపిస్తారు. వారితో యుద్ధము చేయలేని బాలాకు రాజు బెయేరు కుమారుడు
దేవుని ప్రవక్త, సోదెగాడైన బిలామును
పిలిచి శపించమని చెప్పగా దేవుడు శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేశారు. చివరకు ధనాశతో ఆ
ప్రవక్త మోయాబీయులకి ఒక తప్పుడు సలహా ఇస్తాడు ఇశ్రాయేలీయులు మోయాబు స్త్రీలతో
జారత్వం చేస్తారు దేవుని ఉగ్రత మండి తెగులు ప్రారంభమవుతుంది. ఇంతలో ఇశ్రాయేలీయుల
ఒక ప్రధాని కుమారుడు మోయాబీయుల ప్రధాని కుమార్తెతో పాపం చేయడాన్ని చూసిన ఒక
యవ్వనస్తుడు ఫీనెహాసు ఈటె తీసుకుని ఇద్దరినీ ఒకేపోటుతో పొడుస్తాడు. వెంటనే తెగులు
ఆగిపోతుంది. దేవుడు ఏమన్నారు ఫీనెహాసుకోసం (సంఖ్యా 25:10,11లో) నేను ఓర్వలేని
దానిని తానును ఓర్వలేకుండుట చూచి.............
దేవుడు
ఓర్వలేనిది ఏమైనా ఉందంటే అది వ్యభిచారం దానినే ఫీనేహాసు పొడిచేసాడు. అలా నీవు
చేయగలవా?
3. ఇక మరో వ్యక్తి దేవునిచే
నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని పిలవబడిన వ్యక్తి . వసంతకాలంలో రాజులు
యుధ్దం చేసేకాలంలో యుద్దానికి పోక ఇంట్లో మేడమీద షికార్లు చేస్తూ, స్నానం
చేస్తున్న సైనికుని భార్యను చూసి, మోహించి, ఆమెను తీసుకొని వచ్చి బలవంతంగా
వ్యభిచారం చేశాడు. ఆ పాపానికి ప్రతిఫలంగా ఆ స్త్రీ గర్భవతి కాగా, దానిని తనభర్త పై
నెట్టడానికి ప్రయత్నం చేశాడు అయితే ఆ స్త్రీ
భర్త నీతిమంతుడు కాబట్టి సైనికులు దగ్గరే పడుకొంటాడు. దావీదుగారు తనకంటె ఆ
సైనికుడే నీతిమంతుడుగా కనబడడం చూసి ఆ వ్యక్తిని హత్యచేసే ప్రణాళిక చేసి అతనిని
చంపించారు. వెంటనే దేవుని వాక్కు ప్రవక్తయైన నాతాను గారి ద్వారా ఏమంటుంది...(2
సమూయేలు 11,12 అధ్యాయాలు) ఒకానొక పట్టణంలో ఇద్దరు మనుష్యులుండిరి... ఈవిధంగా
జరిగింది ...ఆ విధంగా జరిగింది ...అని చెప్పిన వెంటనే దావీదు గారు రౌద్రుడై
"ఆ మనుష్యుడు ఎవడు, యెహోవా జీవంతోడు నిశ్చయంగా ఆ మనుష్యుడు మరణపాత్రుడు"
అని చెప్పగా ప్రవక్త గారు ఏమన్నారు "ఆ హంతకుడు, ఆ వ్యభిచారివి నీవే."
దేవునికి దేవుని ప్రవక్తలకు తన మన తారతమ్యం లేదు దావీదుగారు చక్రవర్తి యైనా సరే
దేవుని వాక్కు సెలవిస్తుంది ఆ మనుష్యుడు నీవే, మనం ఆయన స్థానంలో ఉంటే నీవు నాకే
చెప్పేటంత వాడవయ్యావా అని ప్రవక్తని హతం చేస్తాం. గాని దావీదుగారు ఉన్నచోటనే
సాష్టాంగ పడి, పశ్చతాప్తపడి, కన్నీటితో దేవుని పాదాలు కడిగారు. ఎంతగా విలపించారంటే
కన్నీటితో తన పరుపు తేలిపోయేటంతగా. అందుకే ఆయన పాపాన్ని దేవుడు పరిహరించారు.
ప్రియబిడ్డా నీ బ్రతుకు ఎలాఉంది? వ్యభిచారం
/జారత్వం దగ్గర ఆగిపోతున్నావా?
జారత్వంలో
పడిపోతున్నావా? యోసేపులాగ జారత్వానికి దూరంగా పారిపోతున్నావా దావీదుగారి లాగ పాపం
లో పడిపోతున్నావా?
ఫీనెహాసులాగ
పాపాన్ని అంతం చేయగలవా?
గమనించాలి:
ఈ శరీరకార్యములను చేసేవారు దేవుని రాజ్యమును స్వతంత్రించు కోలేరు అని చాలా
స్పష్టంగా రాయబడింది 21వ వచనంలో! ఆయన రాజ్యంలో చేరలేవు అంటే నరకంలో సీటు కన్ఫర్మ్
అన్నమాట! నీకేది కావాలి? పరలోకమా- నరకమా? తేల్చుకో!
నీ
బ్రతుకు ఇప్పటికైనా మార్చుకో!
*ఎఫెసీ పత్రిక -83వ భాగం*
*పిలుపుకు తగిన జీవితం-36*
ఎఫెసీ 5:3—6
3. మీలో జారత్వమే గాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమేగాని,
వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది.
4. కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను,
పోకిరిమాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు.
5. వ్యభిచారియైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై
యున్నలోభియైనను, క్రీస్తుయొక్కయు దేవునియొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను
సంగతి మీకు నిశ్చయముగా తెలియును.
6. వ్యర్థమైన మాటలవలన ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి;
ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైనవారిమీదికి వచ్చును
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! మనము పిలుపుకి తగ్గ జీవితం ఎలా జీవించాలో ధ్యానం చేసుకుంటున్నాము!
ఇక
పిలుపుకి తగిన జీవితం జీవించడానికి విసర్జించవలసిన మరో విషయం: *అపవిత్రత*!
దీనికి మరో అర్ధం కల్మషం అని తర్జుమా చేయబడింది. అపవిత్రత అనగా
మనభాషలో మలినం అంటుకోవడం. మలిన పడటం. దీనికోసం పాతనిభంధన గ్రంధంలో చాలాచోట్ల
పవిత్ర జంతువులూ, అపవిత్ర జంతువులు, పక్షులు, పవిత్రుడు, అపవిత్రుడు ఇలాంటివి చాలా
చెప్పబడ్డాయి. చనిపోయిన కలేభరాన్ని ముట్టుకొంటే అపవిత్రత కలుగుతుందని, ఆ అపవిత్రత
ఎలా పోతుందో వ్రాయబడియుంది.
ఇంకా జారత్వం లాంటి పనులు
చేస్తే అపవిత్రులు అనియు, కుష్టురోగులు అపవిత్రులు అనియు వ్రాయబడింది. అయితే
ఇవన్నీ శారీరక అపవిత్రత!
అదేకాకుండా ఆత్మీయ
అపవిత్రత కూడా ఉంది. యేహెజ్కేలు 20:23 ప్రకారం దేవుడు విధించిన కట్టడల ప్రకారం
జీవించకపోతే అపవిత్రులు. ఇంకా యేహెజ్కేలు, యిర్మియా గ్రంథాల ప్రకారం విగ్రహారాధన
చేస్తే అపవిత్రులు!
అయితే యేసుప్రభులవారు చెప్పిన ప్రకారం
అపవిత్రులు ఎవరనగా లేదా అపవిత్రత ఎలా కలుగుతుంది మానవునికి:- మార్కు సువార్త 7:15,16. .
15. వెలుపలి నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా
చేయగలుగునది ఏదియు లేదు గాని,
16. లోపలినుండి బయలు వెళ్లునవే మనుష్యుని అపవిత్రునిగా
చేయుననెను. . . .
దీని
అర్ధం వివరంగా 18-23 వచనాలలో ఉంది.
18. *ఆయన వారితో ఇట్లనెను మీరును ఇంత అవివేకులై యున్నారా?
వెలుపలినుండి మనుష్యుని లోపలికి పోవునదేదియు వాని నపవిత్రునిగా చేయజాలదని మీరు
గ్రహింపకున్నారా?*
19. *అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి
బహిర్బూమిలో విడువబడును; ఇట్లు అది భోజనపదార్థములన్నిటిని పవిత్రపరచును*.
20. *మనుష్యుని లోపలినుండి బయలు వెళ్లునది మనుష్యుని
అపవిత్రపరచును.*
21. *లోపలినుండి, అనగా మనుష్యుల హృదయములోనుండి దురాలోచనలును
జారత్వములును దొంగతనములును*
22. *నరహత్యలును వ్యభిచారములును లోభములును చెడుతనములును
కృత్రిమమును కామవికారమును మత్సరమును (మూలభాషలో-చెడ్డ కండ్లును) దేవదూషణయు
అహంభావమును అవివేకమును వచ్చును*.
23. *ఈ చెడ్డ వన్నియు లోపలినుండియే బయలువెళ్లి, మనుష్యుని
అపవిత్ర పరచునని ఆయన చెప్పెను*. . . .
కాబట్టి
పై వచనాల ప్రకారం మనిషిని నిజంగా అపవిత్రతకు దారితీసేవి మనిషి హృదయంలో గల చెడ్డ తలంపులు, దురాశలు,
దురాలోచనలు!!!
ప్రియ చదువరీ! నీ హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి? నీ పడక మీద ఏం
ఆలోచిస్తున్నావ్? దైవనామస్మరణా? లేక చెడు తలంపులతో, స్త్రీల మీద, సినిమా యాక్టర్ల మీద
కామం కోసం ఆలోచిస్తున్నావా?
రేపు ఎవడ్ని ముంచాలి, ఎవడి నెత్తిమీద చేయి వేయాలి అని
ఆలోచిస్తున్నావా? ఎవడ్ని చంపుదామా? నాశనం చేద్దామా అని ఆలోచిస్తున్నావా?
పక్కవాడి పొలాన్ని, ధనాన్ని ఎలా లాక్కుందామా అని ఆలోచిస్తున్నావా?
పొరుగువాడి భార్యను, లేక పొరుగునున్న అమ్మాయిని ఎలా ట్రాప్ చేద్దామా అని
ఆలోచిస్తున్నావా?
ఇవే నిన్ను ముఖ్యంగా అపవిత్ర పరిచేవి! జాగ్రత్త! హృదయమును,
అంతరంగమును పరిశీలించు నీతిగల దేవుడు మనదేవుడు. యిర్మియా 11:20; 20:12;
వాడియైన రెండంచుల ఖడ్గము గలవాడు మన దేవుడు! ఒక్కట్టిచ్చారా నేల
నాకేస్తావు జాగ్రత్త! జీవముగల దేవుని చేతిలో పడటం బహు భయంకరం! హెబ్రీ 10:31;
గమనించాలి: ఈ శరీరకార్యములను చేసేవారు దేవుని రాజ్యమును
స్వతంత్రించు కోలేరు అని చాలా స్పష్టంగా రాయబడింది 21వ వచనంలో! ఆయన రాజ్యంలో
చేరలేవు అంటే నరకంలో సీటు కన్ఫర్మ్ అన్నమాట! నీకేది కావాలి? పరలోకమా- నరకమా?
తేల్చుకో!
అపవిత్రమైనదేదీ/
అపవిత్రుడు ఎవడూ దేవుని పరలోకంలో/ పరలోకరాజ్యంలో స్థానం లేదు అని గ్రహించు! ఎఫెసీ
5:5; పరలోకంలో కేవలం పరిశుద్దులు మాత్రమే ఉంటారు గాని అపవిత్రులు ఎవరూ ఉండరు! నీకు
పరలోకం కావాలా అయితే నీలో ఉన్న అపవిత్రత, అపవిత్ర తలంపులు అన్నీ చంపివేసేయ్!
ఈలోకంలో పవిత్రులు ఎవరూ లేరు, కేవలం దేవుని దయనొందిన వారు మాత్రం
పవిత్రులుగా జీవించగలరు.
ఇంతవరకు
అపవిత్రమైన తలంపులతో అపవిత్రుడుగా జీవిస్తున్నట్లు అయితే, నేడే యేసయ్య పాదాలు
పట్టుకొని, కన్నీటితో ఆయన పాదాలు కడుగుతూ క్షమాపణ వేడుకో!
ఆయన
జాలి గలవాడు గనుక నిన్ను క్షమించుటకు సిద్దమనస్సుతో ఉన్నారు. నేడే ఆయన వద్దకు రా!
ఇకను
పాపము చేయకు!
పరలోకాన్ని
స్వతంత్రించుకో!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -84వ భాగం*
*పిలుపుకు తగిన జీవితం-37*
ఎఫెసీ 5:3—6
3. మీలో జారత్వమే గాని, యే విధమైన అపవిత్రతయే గాని,
లోభత్వమేగాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది.
4. కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను,
పోకిరిమాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు.
5. వ్యభిచారియైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై
యున్నలోభియైనను, క్రీస్తుయొక్కయు దేవునియొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను
సంగతి మీకు నిశ్చయముగా తెలియును.
6. వ్యర్థమైన మాటలవలన ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి;
ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైనవారిమీదికి వచ్చును
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! మనము పిలుపుకి తగ్గ జీవితం ఎలా జీవించాలో ధ్యానం చేసుకుంటున్నాము!
ఇక
పిలుపుకి తగిన జీవితం జీవించడానికి విసర్జించవలసిన మరో విషయం: లోభత్వము:
కొలస్సీ
పత్రికలో దీనిని అంటున్నారు విగ్రహారాధనయైన
ధనాపేక్షను (లోభత్వమును) చంపివేయుడి. ధనాపేక్షనే లోభత్వము అంటున్నారు! ఇది విగ్రహారాధనతో
సమానంగా పౌలుగారు పోలుస్తున్నారు!!
*లోభత్వము/ధనాపేక్ష*:
ఇక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తే విగ్రహారాధనయైన ధనాపేక్ష అని వ్రాయబడింది. అనగా
ఎవరైతే ధనాపేక్ష కలిగియుంటారో వారు విగ్రహారాధన చేస్తున్నారు అన్నమాట! పేరుకే
క్రైస్తవుడే, పేరుకు బోధకుడే, విశ్వాసే గాని ధనాశతో ఆస్తిని పెంచుకోడానికి/ కార్లు
కొనడానికి, బంగళాలు కట్టుకోడానికి, లగ్జరీగా బ్రతకటానికి ప్రయత్నిస్తున్నాడు అంటే
ఆ వ్యక్తి విగ్రహారాధికుడు!!! నేను కాదు బైబిల్ క్లియర్ గా చెబుతుంది ఈ వచనంలో!
ప్రియ సేవకుడా! విశ్వాసి! నీవు దేవుని సేవకోసం, ఆయన రాజ్యవ్యాప్తి
కోసం, ఆయన నీతిని స్వతంత్రించుకోడానికి పాకుర్లాడితే ధనం దానికదే వస్తుంది.
దానికోసం అడ్డదార్లు తొక్కాల్సిన పనిలేదు! తప్పుడు రాతలు రాయనవసరం లేదు! వీళ్ళని
వాళ్ళని సహాయం చేయండి అని అడుక్కోవలసిన పనిలేదు! ఇది కడుతున్నాం, అది కడుతున్నాం
అని అందరిని అడగాల్సిన పనిలేదు! నీవు మంచి ఉద్దేశ్యముతో, నీ స్వలాభం ఆశించకుండా
దేవుని సేవకోసం— దేవుని పని మొదలెడితే దేవుని పని దేవుడు చూసుకుంటారు. సమస్త
అవసరాలు ఆయనే తీర్చుతారు. ఇది నా స్వానుభవము!
ఈ ధనాపేక్షకు మరో పేరు లోభత్వము! లోభి తన ఇంటివారిని భాదపెడతాడు. సామెతలు 15:27;
నీవు కూర్చుకొన్న ధనం ఎవడు అనుభవిస్తాడో నీకు తెలియదు. కీర్తనలు
39:6;
ధనాన్ని లక్ష్యపెట్టకు. కీర్తనలు 62:10;
నీవు మోసం చేసి సంపాదించిన ధనం క్షీణించిపోతుంది. సామెతలు 13:11;
అలాచేస్తే మరణం సంభవిస్తుంది
సామెతలు 21:6;
ధనం శాశ్వతం కాదు!! సామెతలు 27:24;
అయితే యేసుప్రభులవారు ధనవంతునితో అంటున్నారు: నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము! అప్పుడు నీకు పరలోకంలో ధనము
కలుగును! మత్తయి 19:21; మార్కు 10:21; లూకా 18:22; అయితే ఆ ధనవంతుడు వ్యసనపడుతూ
వెళ్ళిపోయాడు వెంటనే యేసయ్య అంటున్నారు ధనవంతుడు పరలోకం ప్రవేశించడం చాలా
కష్టం!! ధనవంతులు అవుదామని ఆశించే వారంతా
ఎన్నో కష్టాలలో పడతారు అని భక్తుడు అంటున్నారు. 1తిమోతికి 6: 9
ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక
యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను
నష్టములోను నాశనములోను ముంచివేయును.
అయితే పౌలుగారు మరో ధనము కోసం
మాట్లాడుతున్నారు: 1 తిమోతీ 6:19
సత్క్రియలు అనే ధనాన్ని సంపాదించు కోవాలి ప్రతీ విశ్వాసి!!!
ప్రియ చదువరీ! ఎప్పుడైనా ఇతరులకు సహాయం చేసావా?
ఆపదలో ఉన్నవారికి సహాయము చేశావా?
దిక్కులేనివారిని, అనాధలకు సహాయం చేసావా?
భీదలకోసం, సేవ-పరిచర్యకోసం ఖర్చు పెడుతున్నావా?
ప్రియ దైవజనమా! ఆలోచించు, పరీక్షించుకో! ధనాశ,
దురాశ రెండూ నీ మరణానికి దారితీస్తాయి. గనుక నేడే వాటిని విసర్జించు!
పరలోకాన్ని
స్వతంత్రించుకో!
ఆమెన్!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -85వ భాగం*
*పిలుపుకు తగిన జీవితం-38*
ఎఫెసీ 5:3—6
3. మీలో జారత్వమే గాని, యే విధమైన అపవిత్రతయే గాని,
లోభత్వమేగాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది.
4. కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను,
పోకిరిమాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు.
5. వ్యభిచారియైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై
యున్నలోభియైనను, క్రీస్తుయొక్కయు దేవునియొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను
సంగతి మీకు నిశ్చయముగా తెలియును.
6. వ్యర్థమైన మాటలవలన ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి;
ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారిమీదికి వచ్చును
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! మనము పిలుపుకి తగ్గ జీవితం ఎలా జీవించాలో ధ్యానం చేసుకుంటున్నాము!
ఇక
పిలుపుకి తగిన జీవితం జీవించడానికి విసర్జించవలసిన మరో విషయం: బూతులు,
పోకిరి మాటలు, సరసోక్తులు ఇవి మీకు తగవు అంటున్నారు! ఇవన్నీ పరిశుద్దులకు మరియు
పిలువబడిన వారికి తగవు అంటున్నారు!
వీటికోసం నాల్గవ అధ్యాయంలో ధ్యానం చేసుకున్నాము గనుక ముందుకు పోదాము!
ఇక
వ్యభిచారి గాని అపవిత్రుడు గాని విగ్రహారాధికుడు అయి ఉన్న లోభి గాని క్రీస్తు
యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాదు అంటున్నారు! 1 కోరింథీ 6 లో
అంటున్నారు 9. అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు
వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను
వ్యభిచారులైనను ఆడంగితనముగలవా రైనను పురుష సంయోగులైనను
10. దొంగలైనను లోభులైనను త్రాగు బోతులైనను దూషకులైనను
దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.
ఇంకా
ప్రకటన 21:8 లో అంటున్నారు దేవుడు: పిరికివారును,
అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును,
విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు;
ఇది రెండవ మరణము.
22:15 లో కుక్కలును
మాంత్రికులును వ్యభిచారులును నరహంతకులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి
జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.
కాబట్టి
ఇలాంటివి కలిగి ఉంటే నరకానికి పోతావు! నీవు పిలువబడిన పిలుపుకి తగినట్లు జీవించడం
లేదు!
ఇక
చివరగా విసర్జించాలిసింది విగ్రహారాధన!
*విగ్రహారాధన!*
*విగ్రహారాధన
దేవునికి అత్యంత అసహ్యమైన చర్య.
*విగ్రహారాధన అంటే?
విగ్రహాలను తయారు చేసుకొని, వాటికి కొబ్బరికాయలు కొట్టి,
అరటి పళ్ళు పెట్టి, అగరబత్తీలు వెలిగించి వాటిని దేవునిగా పూజించడం.!
బైబిల్ చెబుతుంది నీవు ఏ రూపంలో కూడా విగ్రహాలు
చేసుకోకూడదు! ఇది దేవదేవునికి అసహ్యమైన క్రియ! కారణం జీవము గల దేవుడు, పౌరుషం,
అధికారం, శక్తి, మహిమ, ప్రభావాలు గల దేవుడు, సర్వసృష్టికర్తయైన దేవునికి రావలసిన
ఘనత, జీవములేని విగ్రహాలు చేసుకుని వాటినే దేవుళ్ళుగా పూజించడం అనేది నిజ దేవునికి
ఇష్టం లేని పని!
అదేనా?
ఇంకా ఏవైనా విగ్రహారాధన ఉందా?
నీవు చెప్తావ్. నేను అట్లా విగ్రహారాధన చెయ్యడంలేదు. నేను
ఎట్టి పరిస్థితులలోనూ విగ్రహారాధికుడను కాదని.
కాని, ఒక్క విషయం!
విగ్రహారాధన అంటే అది మాత్రమే కాదు.
•దేవుని కంటే ఎక్కువగా
దేనికి నీవు ప్రాధాన్యత ఇస్తున్నావో? అదే నీ జీవితంలో ఒక 'విగ్రహం'.
•నీ హృదయం దేనితో నిండి
పోయిందో? అదే నీ జీవితంలో ఒక 'విగ్రహం'.
*దేనికి
ప్రాధాన్యత నిస్తున్నావ్?
నీ హృదయం దేనితో నిండిపోయింది?
•గాళ్ ఫ్రెండా?
•బాయ్ ఫ్రెండా?
•మోటార్ బైక్సా?
•వస్త్రాలా?
•సెల్ ఫోన్సా?
•బంగారమా?
•ధనమా?
•ఆస్థులా?
•అంతస్తులా?
•నీ పిల్లలా?
•అసూయా?
•ద్వేషమా? ఏది?
ఇవన్నీ విగ్రహాలే.
ఇప్పుడు
చెప్పగలవా?
నేను
విగ్రహారాధికుడను కాదని.
ఇట్లా
టన్నుల కొద్దీ చెత్త మన హృదయంలో పేరుకుపోయినప్పుడు ఇక దేవునికి స్థానం ఎక్కడ?
ఏదో
కాస్త ఖాళీ ఉంచినా? ఆ చెత్త మధ్య పరిశుద్దుడైన దేవుడు నివాసం చెయ్యగలడా?
అందుకే
కదా!
సంవత్సరాలు
నీ జీవితంలో దొర్లిపోతున్నా?
ఆయన
నీ హృదయమనే తలుపునొద్ద (బయట) మాత్రమే నిలబడిపోవలసి వస్తుంది.
నేడే
ఆ విగ్రహాలను తొలగించి నీ ప్రియ రక్షకుని లోనికి ఆహ్వానించగలవా?
*లేకపోతే
ఏమవుతుందో తెలుసా?
'విగ్రహారాధకులు' అగ్ని గంధకములతో మండు గుండములో
పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.
ప్రకటన 21:8
గమనించాలి: ఈ శరీరకార్యములను చేసేవారు దేవుని రాజ్యమును
స్వతంత్రించు కోలేరు అని చాలా స్పష్టంగా రాయబడింది 21వ వచనంలో! ఆయన రాజ్యంలో
చేరలేవు అంటే నరకంలో సీటు కన్ఫర్మ్ అన్నమాట! నీకేది కావాలి? పరలోకమా- నరకమా?
తేల్చుకో!
వద్దు!
ఇది
వినడానికే భయంకరం.
సరి
చేసుకుందాం.
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -86వ భాగం*
*పిలుపుకు తగిన జీవితం-39*
ఎఫెసీ 5:6—7
6. వ్యర్థమైన మాటలవలన ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి;
ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైనవారిమీదికి వచ్చును
7. గనుక మీరు అట్టివారితో పాలివారై యుండకుడి.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! మనము పిలుపుకి తగ్గ జీవితం ఎలా జీవించాలో ధ్యానం చేసుకుంటున్నాము!
ఇక పిలుపుకి తగిన జీవితం జీవించడానికి
పౌలుగారు చెబుతున్న మరో విధానం: వ్యర్ధమైన మాటలవలన ఎవడు మిమ్మును మోసపరచనీయకండి అంటున్నారు! నిజానికి ఇది 4:14
చెప్పబడిన వచనానికి దగ్గరగా ఉంది 14. అందువలన
మనమిక మీదట పసిపిల్లలమై యుండి, మనుష్యుల మాయోపాయములచేత వంచనతోను, తప్పుమార్గమునకు
లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు
అటు కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక..
ఇక్కడ వ్యర్ధమైన
మాటలవలన ఎవడు మిమ్మును మోసపరచనీయకండి అంటున్నారు!
పౌలుగారు ఈ మాటలు పలకడానికి కారణం కొలస్సీ సంఘంలోనూ, కోరింథీ సంఘంలోనూ
లవదొకయ సంఘములోనూ కొందరు పనికిమాలిన బోధకులు తప్పుడు బోధలను చెబుతూ అనేకులైన స్త్రీలను
మోసపరచి వారిని విశ్వాస బ్రష్తులు చేసేశారు! వారిని కాముకత్వమునకు పురికొల్పారు!
అందుకే వ్యర్ధమైన మాటలవలన ఎవడు మిమ్మును మోసపరచనీయకండి అంటున్నారు! వీరు ఏమనే
వారంటే: మానవుడు చేసిన పాపము కేవలం శరీరానికే అంటుకుంటుంది గాని ఆత్మకు అంటుకోదు.
కనుక మనం పాపము చేసినా పరవాలేదు! వ్యభిచారం చేసినా పరవాలేదు అని మోసపరుస్తూ ఒక
వచనం చూపించే వారు- మన్నయినది వెనుకటి వలె మంటికి చేరును, ఆత్మ తాను దయచేసిన
దేవుని యొద్దకు చేరును అనే ప్రసంగీ 12 వ
అధ్యాయంలో గల మాట చూపెడుతూ ఆత్మ అనేది దేవుడిచ్చాడు కాబట్టి ఆత్మ మరలా
దేవుని దగ్గరకే వెళ్తుంది. నీవు పాపం చేసినా పుణ్యం చేసినా! కాబట్టి నీకు పాపం
చేసినా ఆత్మకు పాపం అంటుకోదు అంటూ తప్పుడు బోధలను చేస్తూ సంఘాలలో ఉన్న స్త్రీలను
లోపరుచుకుని వారితో లైంగిక పాపం చేస్తూ బ్రష్టులుగా చేసేశారు!
మరికొంతమందిని నీవు బాప్తిస్మము
పొందుకున్నావు మంచిది దానితో పాటుగా సున్నతి కూడా పొందుకోవాలని గలతీ సంఘాన్ని
మోసగించారు ! ఇక కొలస్సీ సంఘాన్ని మీరు పరలోకం వెళ్లాలంటే వీటన్నిటితో పాటుగా
వేద్ధాంతశాస్త్రం తత్వ శాస్త్రము నేర్చుకోవాలని అని చెప్పి ఈ వేదాంత శాస్త్రము
తత్వ శాస్త్రము చెబుతూ కొలస్సీ వారిని తికమక పెట్టి తాము పొట్ట పోసుకునే వారు!
ఇవన్నీ మనసులో పెట్టుకుని వీటినుద్దేశించి పౌలుగారు చెబుతున్నారు వ్యర్ధమైన
మాటలవలన ఎవడును మిమ్మును మోసపరచ నీయవద్దు!!
ఇలాచేస్తే దేవుని ఉగ్రత ఆవిధేయులైన వారిమీదకు వస్తుంది అంటున్నారు! ఇంకా
అట్టివారితో పాలివారై ఉండవద్దు అంటున్నారు. అనగా అలాంటివారితో మాట్లాడటం కూడా
మానేయండి అంటున్నారు!
మనుషులు (కొందరు
క్రైస్తవులు కూడా) తమ ఇష్టం వచ్చినట్టు పాపాలు చేస్తూ కూడా దేవుని రాజ్యంలో తమకు
చోటుందని తమను తాము నమ్మించుకుంటారు, ఇతరులను నమ్మించేలా ప్రయత్నిస్తారు.
అలాంటివారు చేసేది బహు నీచమైన వంచన, కేవలం వట్టి మాటలు.
1 కోరింథీయులకు 6
9. అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు
తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవా
రైనను పురుష సంయోగులైనను......
గలతియులకు 5
21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన
ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేనుమునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని
చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.
1 యోహాను 3
7. చిన్న పిల్లలారా, యెవనిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన
నీతిమంతుడైయున్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు.
8. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము
చేయువాడు అపవాది సంబంధి; అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు
ప్రత్యక్షమాయెను.
“దేవుని కోపం” గురించి
చూసుకుంటే ద్వితీయోపదేశకాండము
4:25;
25. మీరు పిల్లలను పిల్లల పిల్లలను కని ఆ దేశమందు బహు కాలము
నివసించిన తరువాత మిమ్మును మీరు పాడుచేసి కొని, యే స్వరూపము కలిగిన విగ్రహము నైనను
చేసి నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించి ఆయన కన్నుల యెదుట కీడు చేసినయెడల..
కీర్తనల గ్రంథము 90:7-11;
7. నీ కోపమువలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతనుబట్టి
దిగులుపడుచున్నాము.
8. మా దోషములను నీవు నీ యెదుట నుంచుకొని యున్నావు నీ
ముఖకాంతిలో మా రహస్యపాపములు కనబడు చున్నవి.
9. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నియు గడిపితివిు.
నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపు కొందుము.
10. మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధికబలమున్న యెడల
ఎనుబది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము
ఎగిరిపోవుదుము.
11. నీ ఆగ్రహబలము ఎంతో ఎవరికి తెలియును? నీకు చెందవలసిన
భయముకొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియును?
యోహాను 3:36;
కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు
కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచి యుండును.
రోమీయులకు 1:18
దుర్నీతిచేత సత్యమును అడ్డగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనతమీదను,
దర్నీతిమీదను దేవుని కోపము పరలోకమునుండి బయలుపరచబడుచున్నది.
2కొరింథీ 6:
14. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో
ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమిపొత్తు?
15. క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో
విశ్వాసికి పాలెక్కడిది?
16. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల
దేవుని ఆలయమై యున్నాము; అందుకు దేవుడీలాగు సెల విచ్చుచున్నాడు.నేను వారిలో
నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు.
17. కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి;
అపవిత్రమైనదానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు.
18. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై
యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునై యుందురని సర్వశక్తిగల ప్రభువు
చెప్పుచున్నాడు.
కాబట్టి ఇలాంటి వ్యర్ధమైన మాటలు
మాట్లాడేవారినుండి దూరంగా ఉందాము! కేవలం బైబిల్ ని మాత్రమే అనుసరిద్దాము ! బెరయ
సంఘస్తులు వలె ఎవరైనా దైవసేవకులు చెప్పిన మాటలు అలా ఉన్నాయా లేదా అని లేఖనాలతో
పోల్చుకుని నమ్ముదాము!!
ఆమెన్!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -87వ భాగం*
*పిలుపుకు తగిన జీవితం-40*
ఎఫెసీ 5:8—14
8. మీరు పూర్వమందు చీకటియై యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు
వెలుగైయున్నారు.
9. వెలుగు ఫలము సమస్తవిధములైన మంచితనము, నీతి, సత్యమను
వాటిలో కనబడుచున్నది.
10. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు,
వెలుగు సంబంధులవలె నడుచు కొనుడి
11. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలి వారైయుండక వాటిని
ఖండించుడి.
12. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు
పనులను గూర్చి మాటలాడుటయైనను అవమానకరమై యున్నది.
13. సమస్తమును ఖండింపబడి వెలుగుచేత ప్రత్యక్షపరచబడును;
ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగేగదా
14. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలోనుండి
లెమ్ము, క్రీస్తు నీమీద ప్రకాశించునని ఆయన చెప్పు చున్నాడు.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను
ధ్యానం చేసుకుంటున్నాం! మనము పిలుపుకి తగ్గ జీవితం ఎలా జీవించాలో ధ్యానం
చేసుకుంటున్నాము!
ఇక పిలుపుకి తగిన జీవితం జీవించడానికి పౌలుగారు
చెబుతున్న మరో విధానం: మీరు పూర్వమందు చీకటియై
ఉన్నారు యిప్పుడైతే మీరు ప్రభువునందు
వెలుగై ఉన్నారు కాబట్టి వెలుగు ఫలములు ఫలించమంటున్నారు ! వెలుగు ఫలములు మంచితనము,
నీతి, సత్యము అంటున్నారు! అందుకే 10 వ వచనంలో కాబట్టి
ఇప్పుడు మీరు ప్రభువున కేది ఇష్టమో దానిని పరీక్షించి తెలిసికొని వెలుగు సంబందుల
వలె నడుచుకోండి అంటున్నారు!
దీని
అర్ధమేమిటంటే పాపులు కేవలం ఆధ్యాత్మిక అంధకారంలో ఉండడం మాత్రమే కాదు, వారే
అంధకారం. అలాగే విశ్వాసులు వెలుగులో ఉండడం మాత్రమే కాదు, క్రీస్తులో వారే ఆ వెలుగు
(మత్తయి 5:14-16). వారు ఏమిటో దాని ప్రకారం నడుచుకోవడం వారికి దక్కిన ఆధిక్యత,
విధి. దేవుడు వెలుగు (1 యోహాను 1:5). అందువల్ల ఆయన పిల్లలు వెలుగు సంతానం, కేవలం
శుద్ధుడూ పవిత్రుడూ అయినవాని సంతానం. అందువల్ల వారు కేవలం శుద్ధులుగా పవిత్రులుగా
నడుచుకోవాలి అనేది అర్ధం!!
మత్తయి 5
14. మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండమీదనుండు పట్టణము
మరుగైయుండనేరదు.
15. మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని
అది యింటనుండు వారికందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభముమీదనే పెట్టుదురు.
16. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ
తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి.
1 యోహాను 1
5. మేమాయనవలన విని మీకు ప్రకటించు వర్తమాన మేమనగా దేవుడు
వెలుగై యున్నాడు; ఆయనయందు చీకటి ఎంతమాత్రమును లేదు.
లేవీకాండం 11:44,45 లో నేను పరిశుద్ధుడను కనుక మీరును
పరిశుద్ధులై ఉండండి అంటున్నారు! మనం కూడా పరిశుద్దంగా జీవించాలి!
ఇక తొమ్మిదవ వచనంలో అంటున్నారు వెలుగు ఫలము సమస్తవిధములైన
మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది
నిజానికి
ఇది గలతీ పత్రికలో ఆత్మఫలము అనేది మొత్తం తొమ్మిది భాగాలు అయితే పౌలుగారు ఈ ఎఫెసీ
పత్రికలో వాటిని మూడు ఫలాలుగా చేసేశారు!!!
22. అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము,
దీర్ఘశాంతము, దయా ళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము.
ఇవి
మూడుగా క్లుప్తీకరించారు! సమస్త విధాలైన మంచితనము
నీతి మరియు సత్యము!!
కాబట్టి
మనము ప్రభువునకు ఏది ఇష్టమో అది మాత్రమే చేద్దాం అంటున్నారు 10 వ వచనంలో!! మొదటి
వచనంలో అంటున్నారు మీరు ప్రియులైన పిల్లలవలే దేవుని పోలి నడుచుకోండి అన్నారు!
ఇక్కడ ప్రభువునకు ఏది ప్రీతికరమో దానిని పరీక్షించి దానిని చేస్తూ వెలుగు సంబందుల
వలె నడుచుకోండి అంటున్నారు!
యేసుప్రభువుకు
ఇష్టమైనదేమిటో తెలుసుకుని వాటిని చేయడమే విశ్వాసికి జీవిత ఆశయం కావాలి. అదే
పిలుపునకు తగిన జీవితం జీవించడం!!!
రోమీయులకు 12
2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును,
సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి
నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.
2 కోరింథీయులకు 5
9. కావున దేహమందున్నను దేహమును విడిచినను, ఆయన కిష్టులమై
యుండవలెనని మిగుల అపేక్షించుచున్నాము.
కాబట్టి
దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ ఆయన పరిశుద్దాత్మ అసహ్యపడే విషయాలు మానేస్తూ వెలుగు
సంబందుల వలె నడుచుకొందాం! అదే పిలుపునకు తగిన జీవితం!
దైవాశీస్సులు!!
*ఎఫెసీ పత్రిక -88వ భాగం*
*పిలుపుకు తగిన జీవితం-41*
ఎఫెసీ 5:8—14
8. మీరు పూర్వమందు చీకటియై యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు
వెలుగైయున్నారు.
9. వెలుగు ఫలము సమస్తవిధములైన మంచితనము, నీతి, సత్యమను
వాటిలో కనబడుచున్నది.
10. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు,
వెలుగు సంబంధులవలె నడుచు కొనుడి.
11. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలి వారైయుండక వాటిని
ఖండించుడి.
12. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు
పనులను గూర్చి మాటలాడుటయైనను అవమానకరమై యున్నది.
13. సమస్తమును ఖండింపబడి వెలుగుచేత ప్రత్యక్షపరచబడును;
ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగేగదా
14. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలోనుండి
లెమ్ము, క్రీస్తు నీమీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను
ధ్యానం చేసుకుంటున్నాం! మనము పిలుపుకి తగ్గ జీవితం ఎలా జీవించాలో ధ్యానం
చేసుకుంటున్నాము!
ఇక పిలుపుకి తగిన జీవితం జీవించడానికి
పౌలుగారు చెబుతున్న మరో విధానం: మంచితనము, నీతి, సత్యమును
కలిగి జీవించడం!!
అయితే
గత భాగాలలో మనము నీతి మరియు సత్యము కోసం ధ్యానం చేసుకున్నాము గనుక మంచితనము కోసం చూసుకుందాం!
♻
ఆత్మ ఫలము లోని ఆరవ అంశము: *మంచితనము*
🔺 *మంచితనము అంటే?*
సత్యం,
నీతి విషయాల్లో రోషం కలిగి, దుష్టత్వం విషయంలో ద్వేషం కలిగియుండడం.
🔺 *వెలుగుయొక్క ఫలము మంచితనము:*
వెలుగు ఫలము సమస్తవిధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో
కనబడుచున్నది. (ఎఫెసీ 5:6)
♻ *మంచితనము రెండు విషయాల ద్వారా
వ్యక్తం కావాలి.*
🔺 1. *దయాపూర్వకమైన విషయాలలో*:
దయచూపడంలో
ప్రభువుకు సాటి మరెవ్వరూ లేరు. ఆయన పేరే దయామయుడు.
* కుంటివారికి కాళ్ళిచ్చారు
* గ్రుడ్డివారికి కళ్ళు ఇచ్చారు
* కుష్టు రోగులను స్వస్థపరిచారు.
* చనిపోయినవారిని బ్రతికించారు.
* రోగులను స్వస్థపరిచారు
* పాపములను క్షమించారు.
* ఆయన ప్రాణమునే ఇచ్చారు
ఇట్లా
లెక్కలేనన్ని.
ఇవి మనము చేయలేకపోయినా, కనీసం మన పొరుగువారికి ప్రేమించగలగాలి.
కష్టసమయాలలో ఆదరించాలి, ఆదుకోవాలి. నశించిపోతున్నవారి కొరకు ప్రార్ధించి, వారిని
నిత్యమరణం నుండి తప్పించాలి.
🔺 2.
*చెడుతనాన్ని గద్దించి, సరిదిద్దడంలో* :
దయామయుడుగా,
శాంతమూర్తిగా కనబడే ప్రభువు, దుష్టత్వం విషయంలో మాత్రం రాజీపడే వాడు కాదు. చూచీ
చూడనట్లు తప్పించుకొని పోయేవాడు కాదు.
యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు
చేయువారినందరిని వెళ్లగొట్టి, రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్మువారి పీఠములను
పడద్రోసి, నా మందిరము ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడియున్నది, అయితే మీరు
దానిని దొంగల గుహగా చేసెడివారనెను.
మత్తయి
21:12,13
ఈ
పరిస్ధితి నేటి దినాలలో లేదు కదా? ఆయన పని ఆయన చూచుకుంటాడులే అని ఎవరికీ వారిమే
తప్పించుకొనిపోతుంటే, ఇక రాజ్యమేలేది దుష్టత్వమే కదా?
దయాపూర్వకమైన
విషయాలలోనూ, చెడుతనాన్ని గద్దించి, సరిదిద్దడంలోనూ ఈ రెండింటిలో ఏది లోపించినా?
“మంచితనము” లోపించినట్లే. తద్వారా ఆత్మఫలము లోపము గలిగినదిగానే మిగిలిపోతుంది.
దేవుడు మననుండి కోరుకొనేది లోపభూయిష్టమైనది కాదు గాని, శ్రేష్టమైన ఫలాన్ని
ఆశిస్తున్నాడు.
ఇంకా
యెషయా ప్రవక్త ప్రవచించిన విషయాలు జరిగించడం కూడా మంచితనమే!
Isaiah(యెషయా గ్రంథము) 58:6,7,8
6. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు
తీయుటయు బాధింపబడినవారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగగొట్టుటయు నే
నేర్పరచుకొనిన ఉపవాసము గదా?
7. నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి
ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు
8. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము
లిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము? ఆలాగున నీవు చేసినయెడల నీ వెలుగు వేకువ
చుక్క వలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడచును
యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును.
ఆరీతిగా
మన జీవితాలను సిద్ద పరచుకుందాం!
ఆత్మఫలమును
పొందుకుని , మంచితనమును మన జీవితాలలో కలిగి పేరుకు తగ్గట్టుగా దేవుని బిడ్డలుగా
జీవిద్దాం!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -89వ భాగం*
*పిలుపుకు తగిన జీవితం-42*
ఎఫెసీ 5:8—14
8. మీరు పూర్వమందు చీకటియై యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు
వెలుగైయున్నారు.
9. వెలుగు ఫలము సమస్తవిధములైన మంచితనము, నీతి, సత్యమను
వాటిలో కనబడుచున్నది.
10. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు,
వెలుగు సంబంధులవలె నడుచు కొనుడి
11. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలి వారైయుండక వాటిని
ఖండించుడి.
12. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు
పనులను గూర్చి మాటలాడుటయైనను అవమానకరమై యున్నది.
13. సమస్తమును ఖండింపబడి వెలుగుచేత ప్రత్యక్షపరచబడును;
ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగేగదా
14. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలోనుండి
లెమ్ము, క్రీస్తు నీమీద ప్రకాశించునని ఆయన చెప్పు చున్నాడు.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను
ధ్యానం చేసుకుంటున్నాం! మనము పిలుపుకి తగ్గ జీవితం ఎలా జీవించాలో ధ్యానం
చేసుకుంటున్నాము!
ఇక పిలుపుకి తగిన జీవితం జీవించడానికి
పౌలుగారు చెబుతున్న మరో విధానం: నిష్ఫలమైన
అంధకార క్రియలలో పాలివారై ఉండవద్దు వాటిని ఖండించాలి! ఎందుకంటే అట్టి క్రియలు
చేసేవారు తాము జరిగించే రహస్యకార్యాల కోసం మాట్లాడటం కూడా అవమానము అంటున్నారు!
యోహాను భక్తుడు అంటున్నారు యోహాను 3
19. ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ
క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి.
20. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన
క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు.
పౌలుగారు అంటున్నారు అందుకే:
రోమీయులకు 13
12. రాత్రి చాల గడచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార
క్రియలను విసర్జించి, తేజస్సంబంధమైన యుద్ధోపకరణములు ధరించు కొందము.
13. అల్లరితోకూడిన ఆటపాటలైనను మత్తయినను లేకయు,
కామవిలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు
నడుచుకొన్నట్టు మర్యాదగా నడుచుకొందము.
14. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనినవారై,
శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసికొనకుడి.
విశ్వాసులు
అలాంటి వాటిని బయట పెట్టవలసిన విధానం వాటి గురించి మాట్లాడ్డం ద్వారా కాదు (వ
12,13), “వెలుగు”గా ఉండడం ద్వారా, వెలుగు సంతానంగా జీవించడం ద్వారా (వ 8), దేవుని
సత్యం పలకడం ద్వారా.
ఇదే
ఎఫెసీ పత్రిక 6 వ అధ్యాయంలో అంటున్నారు ఎందుకు మనం ఈ క్రియలు విసర్జించాలి అంటే
మనం పోరాడేది అంధకారసంబంధమైన లోకనాధులతో పోరాడుతున్నాము!!
11. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు
దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.
12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని
ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను,
ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.
13. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును,
సమస్తము నెరవేర్చినవారై నిలువ బడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు సర్వాంగ
కవచమును ధరించుకొనుడి
ఇక
12 వ వచనంలో అంటున్నారు: ఇలాంటి అంధకార సంబంధమైన పనులు చేసే వారు వారుచేసే
చీకటిపనులు కోసం మాట్లాడుకోవడం కూడా మనకు పాపమే అవమానమే అంటున్నారు! ఉదాహరణకు: దొంగ ఉదయం దొంగతనం చేయడు చీకటికోసం
ఎదురుచూస్తూ చీకటిలోనే చేస్తాడు!
ఒక వ్యభిచారి/వేశ్య రాత్రికోసమే
ఎదురుచూస్తే తమ వ్యాపారం జరిగిస్తారు. ఇవి చీకటిపనులు!
ఇక బార్ లలో పబ్ లలో ఎందుకు లైట్లు
ఆపివేసి డిమ్ లైట్లలో చేస్తారు అంటే వెలుగుకు చీకటికి పడదు! ఇలాంటి చీకటి పనులకు
వెలుగు పడదు! చివరికి హత్యచేసేవాడు కూడా
ఎవరో చూడకుండా ఎక్కువగా చీకటిలో చేయడానికి ప్రయత్నం చేస్తాడు!
ఒకప్పుడు
మనలో అనేకమంది ఇలాంటి పనులు చేసేవారమే గాని ఇప్పుడైతే దేవుడు మనలను విడుదల చేశారు
అంటున్నారు కొలస్సీ పత్రికలో పౌలుగారు
1:13...
13. ఆయన మనలను అంధకారసంబంధమైన అధికారములోనుండి విడుదలచేసి,
తాను ప్రేమించిన తన కుమారునియొక్క రాజ్యనివాసులనుగా చేసెను.
14. ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాపక్షమాపణ
కలుగుచున్నది.
మనుషులు
దేవునికి అవిధేయులై ఆయన వెలుగుకు రాకపోవడం మూలంగా చీకటిలో ఉన్నారు.
యోహాను 3
20. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన
క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు.
ఎఫెసీయులకు 2
2. మీరు వాటిని చేయుచు, వాయు మండల సంబంధమైన అధిపతిని, అనగా
అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ
ధర్మముచొప్పున మునుపు నడుచుకొంటిరి.
కొలొస్సయులకు 3
6. వాటివలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును.
తీతుకు 1
16. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని, అసహ్యులును
అవిధేయులును ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునైయుండి, తమ క్రియలవలన ఆయనను
ఎరుగమన్నట్టున్నారు.
కాబట్టి ఇలాంటి అంధకార సంబంధమైన క్రియాలను
విసర్జించడం మరియు వాటిని ఖండించడం పిలుపుకి తగినట్లు జీవించడం అవుతుంది! వాటిని
విసర్జిద్దాం! ఎదిరిద్దాము!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -90వ భాగం*
*పిలుపుకు తగిన జీవితం-43*
ఎఫెసీ 5:8—14
8. మీరు పూర్వమందు చీకటియై యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు
వెలుగైయున్నారు.
9. వెలుగు ఫలము సమస్తవిధములైన మంచితనము, నీతి, సత్యమను
వాటిలో కనబడుచున్నది.
10. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు,
వెలుగు సంబంధులవలె నడుచు కొనుడి
11. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలి వారైయుండక వాటిని
ఖండించుడి.
12. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు
పనులను గూర్చి మాటలాడుటయైనను అవమానకరమై యున్నది.
13. సమస్తమును ఖండింపబడి వెలుగుచేత ప్రత్యక్షపరచబడును;
ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగేగదా
14. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలోనుండి
లెమ్ము, క్రీస్తు నీమీద ప్రకాశించునని ఆయన చెప్పు చున్నాడు.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను
ధ్యానం చేసుకుంటున్నాం! మనము పిలుపుకి తగ్గ జీవితం ఎలా జీవించాలో ధ్యానం
చేసుకుంటున్నాము!
ఇక పిలుపుకి తగిన జీవితం జీవించడానికి
పౌలుగారు చెబుతున్న మరో విధానం: నిద్రించు
చున్న మనము మేలుకొని క్రీస్తు మహిమ ప్రకాశించేలా జీవించాలి, వెలుగు క్రియలు
చేయాలి!
13—14 వచనాలలో అంటున్నారు
13. సమస్తమును ఖండింపబడి వెలుగుచేత ప్రత్యక్షపరచబడును;
ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగేగదా
14. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలోనుండి
లెమ్ము, క్రీస్తు నీమీద ప్రకాశించునని ఆయన చెప్పు చున్నాడు.
ఇక్కడ ప్రత్యక్ష పరిచేది వెలుగు
అంటున్నారు! బైబిల్ చెబుతుంది: మనుష్యులు
చేసేపనులు విమర్శ దినమందు బయలుపరచ బడతాయి
యోబు 12:22 చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచుచు
మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును
యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు మత్తయి 10:26—27
26. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేదియు బయలుపరచ
బడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు.
27. చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి;
చెవిలో మీకు చెప్పబడినది మేడలమీద ప్రక టించుడి.
అందుకే మత్తయి 12:36 లో అంటున్నారు నేను మీతో చెప్పునదేమనగా
మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుగూర్చియు విమర్శదినమున లెక్క
చెప్పవలసియుండును.
ఇప్పుడు
ఇలా ఖండించి ప్రత్యక్ష పరిచేది పరిశుద్దాత్ముడు మరియు యేసుక్రీస్తుప్రభులవారు!!
అలా ప్రత్యక్ష పరిచేది వెలుగే కదా అంటున్నారు! అందుకే యేసుక్రీస్తుప్రభులవారు నేను
లోకమునకు వెలుగు అనడమే కాకుండా మీరుకూడా లోకమునకు వెలుగై ఉన్నారు ఉప్పై ఉన్నారు
అంటున్నారు! మత్తయి సువార్త 5 వ అధ్యాయములో:
13. మీరు లోకమునకు ఉప్పయి యున్నారు. ఉప్పు నిస్సారమైతే అది
దేనివలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యులచేత త్రొక్కబడుటకే గాని మరి
దేనికిని పనికిరాదు.
14. మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండమీదనుండు పట్టణము
మరుగైయుండనేరదు.
15. మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని
అది యింటనుండు వారికందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభముమీదనే పెట్టుదురు.
16. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని
మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి.
అందుకే
14 వ వచనంలో అందుచేత నిద్రించుచున్న నీవు లే అంటున్నారు! నీవు మేల్కొని మృతులలో
నుండి లెమ్ము అంటున్నారు! అనగా ఇలాంటివి పట్టించుకోకుండా నిద్రావస్తలో ఉంటే నీవు
మృతుడవు అన్నమాట! ఆత్మీయంగా చచ్చిపోయావు! నీవు అలా ఆత్మీయ మృతి నుండి లేస్తే
క్రీస్తు నీమీద ప్రకాశించడానికి సిద్దంగా ఉన్నారు!
యెషయా 52
1. సీయోనూ, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము పరిశుద్ధ
పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము ఇకమీదట సున్నతిపొందని
వాడొకడైనను అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు.
యెషయా 60
1. నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా
మహిమ నీమీద ఉదయించెను.
కాబట్టి
క్రీస్తు వెలుగు మనమీద ప్రకాశించనిద్దాం! వెలుగు పనులు చేద్దాం! అంధకార సంబంధమైన
పాపక్రియలు వదిలేద్దాము!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -91వ భాగం*
*పిలుపుకు తగిన జీవితం-44*
ఎఫెసీ 5: 15—17
15. దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక
సద్వినియోగము చేసికొనుచు,
16. అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా
చూచుకొనుడి.
17. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువుయొక్క చిత్తమేమిటో
గ్రహించుకొనుడి.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను
ధ్యానం చేసుకుంటున్నాం! మనము పిలుపుకి తగ్గ జీవితం ఎలా జీవించాలో ధ్యానం
చేసుకుంటున్నాము!
ఇక
పిలుపుకి తగిన జీవితం జీవించడానికి పౌలుగారు చెబుతున్న మరో విధానం:
1 సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం
2. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోవాలి
3. ఆవివేకుల వలె కాకుండా ప్రభువు చిత్తం ఏదో తెలుసుకోవాలి!
15
వ వచనంలో అంటున్నారు దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనివ్వక అనగా వ్యర్ధంగా
మీ సమయాన్ని గడపకుండా అర్ధవంతంగా సమయాన్ని గడుపుతూ సద్వినియోగం చేసుకోండి
అంటున్నారు!
కారణం ఆ దినాలలో చాలామంది ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవడంలో
కొంతమంది, క్రొత్త విషయాలు తెలుసుకోవాలి అనే
బహానాలో(సాకు) కొంతమంది, నిద్రపోవడంలో కొంతమంది, త్రాగుడు తాగి పడిపోతూ
వ్యభిచార సంబంధమైన క్రియలతో కొంతమంది ఇలా అనేకులు తమ విలువైన సమయం పాడుచేసుకునే
వారు!
ఆ రోజులలోనేనా ? నేడు కూడా అలా లేరా? నేటి యువత నూటికి 80%
వ్యర్ధంగా ఫోన్ లోనే సమయం గడిపేస్తున్నారు! Facebook లోనూ, వాట్సప్ లోనూ instagram
లోనూ ఇంకా వ్యర్ధమైన పనికిమాలిన వెబ్సైట్ లలో గడుపుతూ జబర్దస్ట్
లాంటి పనికిమాలిన వాటిని చూస్తూ తమ విలువైన సమయాన్ని పాడుచేసుకుంటున్నారు! ఇంకా
చాలామంది చదువుకున్నవారు తమకు నచ్చిన మరియు చదువుకున్న చదువుకు తగిన ఉద్యోగం కోసం
చూస్తూ ఇంట్లో కాళీగా కూర్చుంటున్నారు! సరియైన ఉద్యోగం వచ్చేవరకు చేతికి దొరికిన
ఉద్యోగం చేస్తూ తండ్రికి తోడుగా ఉండాలని అనుకోవడం లేదు! ఇంకా అనేకమంది స్త్రీలు తమ
విలువైన సమయాన్ని పనికిమాలిన సీరియళ్ళు చూస్తూ పనికిమాలిన కబుర్లు చెబుతూ అది ఇలా,
ఇది ఇలా అంటూ గాసిప్ లు చెప్పుకుంటూ సమయాన్ని వ్యర్ధం చేసుకుంటున్నారు! బయటవారు
అన్యులు ఎలా పోతే మనకెందుకు గాని దేవుని బిడ్డలే తమ సమయాన్ని సీరియళ్ళు మొబైల్ లో
రీల్సు చూస్తూ, రీల్సు చేస్తూ కాలాన్ని వ్యర్ధం చేస్తున్నారు! ఆ సమయంలో కొంతసేపు
బైబిల్ చదువుకుంటూ కొంతసేపు నీ పొరుగువారికి సువార్త చెప్పడంలోనో వారికోసం
ప్రార్ధించడంలోనో గడపడం లేదు! రేపు వారి ఆత్మల కోసం దేవుడు నిన్ను నన్ను లెక్క
ఆడగరా దేవుడు!!!!!
కాబట్టి సమయాన్ని దేనిలోనో గడపకుండా సమయం
దొరికినప్పుడు ప్రభువులో ప్రభువుతో
గడుపుతూ ప్రార్ధనలో గడుపుతూ వాక్య పఠనంలో గడుపుతూ సమయానికి చేతికి అందివచ్చిన
పనిపాటులు చేస్తూ గడపాలి! ఇదే చెబుతున్నారు పౌలుగారు! థెస్సలోనికయ సంఘానికి ఉత్తరం
రాస్తూ కూడా ఇదే చెబుతున్నారు 2 థెస్స 3:
7. ఏలాగు మమ్మును పోలి నడుచుకొనవలెనో మీకే తెలియును. మేము
మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు;
8. ఎవనియొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు; మేము మీలో
ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబగళ్లు పనిచేయుచు
జీవనము చేసితివిు.
9. మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని మమ్మును మేము మాదిరిగా
కనుపరచుకొనుటకే యీలాగు చేసితివిు గాని, మాకు అధికారములేదని చేయలేదు.
10. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు-ఎవడైనను పనిచేయ నొల్లని
యెడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితివిు గదా.
11. మీలోకొందరు ఏ పనియు చేయక పరులజోలికి పోవుచు, అక్రమముగా
నడుచుకొనుచున్నారని వినుచున్నాము.
12. అట్టివారు నెమ్మదిగా పని చేయుచు, సొంతముగా
సంపాదించుకొనిన ఆహారము భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని
ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము.
నిజానికి
దినములు చెడ్డవి అంటూ ఎప్పుడూ మనకు హెచ్చరిస్తున్నారు
గలతియులకు 1
4. మన తండ్రియైన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను
ప్రస్తుతపు దుష్టకాలములోనుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను
అప్పగించుకొనెను.
2 తిమోతికి 3
1. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము.
చివరికి సణుగులు సంశయాలు కూడా వదిలేయ మంతున్నారు
ఫిలిప్పీయులకు 2
15. సణుగులును సంశయములును మాని, సమస్త కార్యములను చేయుడి.
నిజానికి
లోకంలో దేవుడు తన వెలుగు ప్రకాశించనిచ్చేందుకు అవకాశాలు మనకు వస్తాయి. మనం వాటిని
చక్కగా వాడుకోవాలని పౌలుగారి ఉద్దేశం. మరి
నీవు దీనిని ఉపయోగించుకుంటావా? దుర్వినియోగం చేస్తావా? చెడ్డ రోజులలో మనము ఉన్నాము
గనుక మనము చెడిపోకుండా పడిపోకుండా సమయాన్ని వృధా చేయకుండా దేవునికోసం పనిచేస్తూ
ముందుకు పోదాం!!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -92వ భాగం*
*పిలుపుకు తగిన జీవితం-45*
ఎఫెసీ 5: 15—17
15. దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక
సద్వినియోగము చేసికొనుచు,
16. అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా
చూచుకొనుడి.
17. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువుయొక్క
చిత్తమేమిటో గ్రహించుకొనుడి.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను
ధ్యానం చేసుకుంటున్నాం! మనము పిలుపుకి తగ్గ జీవితం ఎలా జీవించాలో ధ్యానం
చేసుకుంటున్నాము!
ఇక పిలుపుకి తగిన జీవితం జీవించడానికి
పౌలుగారు చెబుతున్న మరో విధానం:
1 సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం
2. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోవాలి
3. ఆవివేకుల వలె కాకుండా ప్రభువు చిత్తం ఏదో తెలుసుకోవాలి!
ఇక సమయాన్ని
సద్వినియోగం ఎందుకు చేసుకోమంటున్నారో 16 వ వచనంలో చెబుతున్నారు . అజ్ఞానులవలె కాక,
జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దీని అర్ధం ఏమిటంటే ఎవరైతే
సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా సెల్ ఫోన్లోను సినిమాలు సీరియళ్ళలోనూ పనికిమాలిన
ముసలమ్మ ముచ్చట్లు అనబడే గాసిప్ లతోనూ గడుపుతారో వారు అజ్ఞానులు అనగా ఫూల్స్
అంటున్నారు పౌలుగారు మరియు బైబిల్!! యవ్వనుడా యవ్వనురాలా నీవు నీ సమయాన్ని
సద్వినియోగం చేసుకోవడం లేదా అయితే నీవు ఫూల్ వి అని బైబిల్ సెలవిస్తుంది! కాబట్టి
సమయాన్ని సద్వినియోగం చేసుకో!! అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె
నడుచుకోమంటున్నారు పౌలుగారు!
అది
ఎలాగో పౌలుగారు చెబుతున్నారు కొలొస్సయులకు 4
5. సమయము పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, సంఘమునకు
వెలుపటి వారియెడల జ్ఞానము కలిగి నడుచు కొనుడి.
మత్తయి 10
16. ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱెలను పంపినట్టు నేను మిమ్మును
పంపుచున్నాను గనుక పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునై యుండుడి.
జ్ఞానియైన ప్రసంగీ సోలోమోను గారు అంటున్నారు మీ చేతికి
వచ్చిన పనిని చేయమంటున్నారు!! ప్రసంగీ 9:10
చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము; నీవు పోవు
పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.
కాబట్టి
ఇలాంటి భ్రష్ట లోకంలో ఎలా జీవించాలో ఎరిగే జ్ఞానం విశ్వాసులకు ఉండాలి. అది మనకు
అందుబాటులో ఉంది (యాకోబు 1:5-6). “నడుచుకోవడానికి”– మనుషులు పాపంలో నిద్రపోతూ
మరణించిన స్థితిలో ఉండగా విశ్వాసులు తమ ద్వారా దేవుని వెలుగు వారి మీద ప్రకాశించేలా
నడుచుకోవాలి.
యాకోబు 1
5. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని
అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్ర హింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని
ధారాళముగ దయచేయువాడు.
6. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను;
సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును.
సామెతలు 2:3-6
3. తెలివికై మొఱ్ఱపెట్టిన యెడల వివేచనకై మనవి చేసినయెడల
4. వెండిని వెదకినట్లు దాని వెదకిన యెడల దాచబడిన ధనమును
వెదకినట్లు దాని వెదకిన యెడల
5. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు
గ్రహించెదవు దేవునిగూర్చిన విజ్ఞానము నీకు లభించును.
6. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన
నోటనుండి వచ్చును.
అందుకే
17 వ వచనంలో అంటున్నారు ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువుయొక్క
చిత్తమేమిటో గ్రహించుకొనుడి.
ఇక
జ్ఞానులుగా ఎలా నడుచుకోవాలో అదికూడా చెబుతున్నారు:
ఎఫెసీయులకు 1
18. ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమునుబట్టి
విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తియొక్క అపరి మితమైన మహాత్మ్యమెట్టిదో,
మీరు తెలిసికొనవలెనని,
ఎఫెసీయులకు 4
18. వారైతే అంధకారమైన మనస్సుగలవారై, తమ హృదయ కాఠిన్యమువలన
తమలోనున్న అజ్ఞానముచేత దేవునివలన కలుగు జీవములోనుండి వేరుపరచబడినవారై, తమ మనస్సు
నకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు.
మనమైతే
అలా ఉండకూడదు వెలుగు సంబంధులుగా జీవించాలి అంటున్నారు!
కొలొస్సయులకు 2
2. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలిసికొనగోరు చున్నాను.
వారు ప్రేమయందు అతుకబడి, సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యము కలిగినవారై, దేవుని
మర్మమైయున్న క్రీస్తును, స్పష్టముగా తెలిసికొన్నవారై, తమ హృదయములలో ఆదరణపొందవలెనని
వారందరి కొరకు పోరాడుచున్నాను.
దేవుని
మర్మాలు సంపూర్తిగా గ్రహించి ఆయనయొక్క జ్ఞానములో జీవించాలి!
రోమీయులకు 12
1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన
సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి
మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది.
2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును,
సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి
నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.
కాబట్టి
అజ్ఞానులవలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకుంటూ అనగా ఆధ్యాత్మిక విషయాల యందు ఆసక్తి
కల్గి దేవుడు మనచేతికి ఇచ్చిన పనిని శక్తివంచన లేకుండా చేస్తూ దేవుడు మనకిచ్చిన
సువార్త ప్రకటనను కూడా శక్తివంచన లేకుండా చేస్తూ ముందుకు సాగిపోవడమే పిలుపుకి తగిన
జీవితం జీవించడం మరియు జ్ఞానముకలగి జీవించడం!
అట్టివిధంగా
దేవుడు మనలను నడిపించును గాక!
ఆమెన్!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -93వ భాగం*
*పిలుపుకు తగిన జీవితం-46*
ఎఫెసీ 5: 18
18. మరియు మద్యముతో
మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు; అయితే ఆత్మ పూర్ణులైయుండుడి.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను
ధ్యానం చేసుకుంటున్నాం! మనము పిలుపుకి తగ్గ జీవితం ఎలా జీవించాలో ధ్యానం
చేసుకుంటున్నాము!
ఇక
పిలుపుకి తగిన జీవితం జీవించడానికి విడిచి పెట్టాల్సిన మరో విషయం : త్రాగుడు!!
మధ్యముతో
మత్తులై ఉండవద్దు దానిలో దుర్వ్యాపారము కలదు అంటున్నారు! దానికి బదులుగా అనగా
మధ్యముతో మత్తుగా ఉండక ఆత్మపూర్ణులై ఉండండి అంటున్నారు!
*మద్యపానం -
ధూమపానము*
ఎవరికి
శ్రమ? ఎవరికి దుఃఖము? ఎవరికి జగడములు? ఎవరికి హేతువులేని గాయములు? ద్రాక్షరసంతో
ప్రొద్దుపుచ్చు వారికే కదా! . . . పిమ్మట అది సర్పమువలె కరచును. కట్లపాము వలె
కాటువేయును. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. వెర్రిమాటలు పలుకుదువు. (సామెతలు
23:29-35).
ప్రియ సహోదరి/సహోదరుడా! నేటి దినాలలో త్రాగుడు మరియు ధూమపానం
ఎక్కువైపోయింది. ముఖ్యంగా యవ్వనస్తులు చాలా ఘోరంగా వీటికి బానిసైపోయారు. త్రాగి
వాహనాలు నడపడం, యాక్సిడెంటులు అవ్వడం జరుగుతుంది. పట్టణాలలో, ముఖ్యంగా
మెట్రోపాలిటన్ సిటీల్లో యువకులుతో పోటీగా యువతులు కూడా మద్యపానం ధూమపానం
చేస్తున్నారు, సాతానుకి బానిసైపోతున్నారు. అయితే విచారం ఏమిటంటే అన్యులతో పాటు
దేవుని బిడ్డలు కూడా అదే పాపం చేస్తున్నారు సరికదా ప్రభురాత్రి సంస్కారం కూడా
తీసుకొంటున్నారు. దేవుడంటే భయం లేకుండా జీవిస్తున్నారు. ఇప్పుడు నేను వ్రాసేది దేవుని బిడ్డలు కోసమే.
ఎదుట వారికి తీర్పు తీర్చడం నాకేల? పౌలుగారు అంటున్నారు " ఇప్పుడైతే
సహోదరుడనబడిన వాడెవడైననూ- తిట్టుబోతుగాని, త్రాగుబోతుగాని. . . అయితే అట్టివానితో
సాంగత్యము చేయరాదు, కలసి భుజింపరాదు. . . సంఘంలో నుండి వెలివేయమని చెబుతున్నారు
(1కొరింథీ 5:11-13). ఎందుకంటే అది దేవునికి అసహ్యమైన క్రియ. మోసపోకుడి! జారులైననూ.
. . త్రాగుబోతులైననూ, దూషకులైననూ. . దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు (1కొరింథీ 6:9,10).
నేటి దినాలలో
క్రైస్తవ జనాంగము దీనిని మరచిపోతున్నారు. లోకస్తులతో కలసి లోకస్తులు
త్రాగుతున్నట్లు త్రాగుతున్నారు. దానివలన ఏమేమి సంభవిస్తాయో సొలొమోనుగారు
వివరించారు. మొదటగా శ్రమ. తన దేహాన్ని తనే శ్రమ పెట్టుకొంటున్నాడు. తమ కుటుంబాన్ని
కూడా శ్రమపెడుతున్నారు. దానివలన దుఃఖము అశాంతి,
కారణం లేని జగడాలు, ఎందుకంటే త్రాగేసి ఏం మాట్లాడుతారో వారికే తెలియదు.
ఫుల్ గా త్రాగేసి రోడ్డుమీద పడిపోతారు, పందిలా బురదలో , డ్రైనేజీలో దొర్లుతుంటారు.
ఫలితంగా హేతువులేని గాయాలు.
గమనించండి అన్యులుకూడా ఇలా
చేస్తారు కాని ఎవరూ పట్టించుకోరు, అదే దేవుని బిడ్డలు చేస్తే పెద్ద రాధ్ధాంతం
చేస్తారు దేవుని బిడ్డలు రోడ్డుమీద దొర్లుతున్నారు అంటారు. తద్వారా దేవుని నామం
అవమానపరచడుతుంది దూషింపబడుతుంది. ఇంకా ఏమి వస్తాయి? Sugar, BP, Lever పనిచేయదు,
ధూమపానం వలన ఊపిరితిత్తుల పాడైపోతాయి, కేన్సర్ ఇంకా అనేక రోగాలు - పిమ్మట అది
సర్పము వలె కరచును అంటే ఇదే. కట్లపాము కాటేస్తే వెంటనే చనిపోరు, పక్షవాతము,
ధీర్ఘకాలిక రోగాలు వస్తాయి. ఈ మద్యపానం, ధూమపానం వల్ల కూడా అలాగే ధీర్ఘకాలిక
రోగాలు వస్తాయి. ప్రియ సహోదరుడా! దేవుని పరువు తీస్తున్నావు, నీ ఆరోగ్యం
పాడుచేసుకొంటున్నావు. నీ కుటుంబాన్ని కూడా బాధపెడుతున్నావ్. త్రాగుబోతులు దేవుని
రాజ్యమునకు వారసులు కానేరరని తెలుసుకో!
కొందరంటారు త్రాగకూడదని
బైబిలులో ఎక్కడుంది? వారు బైబిల్
చదివితేనే కదా తెలుస్తుంది ఎక్కడ వ్రాయబడిందో తెలుస్తాది. 1కొరింథీ 5:10-13;
6:9,10; 1 పేతురు 4:3; సామెతలు 23:29-35. ఇంకొందరు అంటారు మరి పౌలుగారు
తిమోతిగారికి పత్రిక వ్రాస్తూ నీ కడుపు నొప్పి కోసం ద్రాక్షారసం తీసుకోమని
వ్రాశారు కదా అని. ప్రియబిడ్డా! దైవ
వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి, కలిపి చెరపకూడదు. నీకు అనుకూలంగా మలచుకోకూడదు.
1. ఇక్కడ
ద్రాక్షారసం (wine) అంటే
ద్రాక్షపళ్ళునుండి తీసిన రసం డైరెక్టుగా త్రాగమని అర్థం. దానికి ఈస్ట్ కలిపి,
పులియబెట్టిన తర్వాత త్రాగమనికాదు. ప్రస్తుతం చాలామంది (RCM) చేస్తున్న పని ఇదే. బైబిల్ కు వ్యతిరేకంగా చేస్తున్నారు.
2.
పూర్వకాలంలో Medicine అభివృద్ధికాని రోజులలో యూరోప్, మధ్య
ఆసియా ప్రాంతాలలో ఏదైనా అనారోగ్యం కలిగితే ద్రాక్షరసం, అంజూరపు ఆకులు, ఒలీవ ఆకులు,
ఒలీవ నూనె వాడేవారు. (మన దేశంలో నల్లమందు వాడినట్లు 50 సం. ల క్రితం) .
ద్రాక్షరసంతో గాయాలు కడిగితే తొందరగా నయమయ్యేది (wine తో
కాదు). ఆ ద్రాక్షారసం త్రాగితే కడుపు నొప్పి లాంటివి తగ్గేవి. ఆ ఉద్దేశంతోనే
పౌలుగారు చెప్పారు గాని ఈస్ట్ కలిపిన wine త్రాగమని
చెప్పలేదు.
ఇక పేతురుగారు
అంటున్నారు మద్యపానం గాని, త్రాగుబోతుల విందులు గాని చేయగూడదు అని (1 పేతురు 4:3).
పౌలుగారు అంటున్నారు త్రాగుబోతులు పరలోకం వెళ్లరని (1 కొరింథీ 6:9,10). యెషయా
గ్రంథంలో త్రాగుబోతులకు శ్రమ అంటున్నారు (యెషయా 28:1).
అందుకే యోవేలు గ్రంథంలో దేవుడంటున్నారు "మత్తులారా!
మేలుకొని కన్నీరు విడువండి, ద్రాక్షరస పానం చేయువారలారా! రోదనం చేయుడి"
(యోవేలు 1:5)
కాబట్టి నేడే నీ మత్తు, మద్యపానం, ధూమపానం, మాదకద్రవ్యాలు వదలి యేసయ్య పాదాలు
దగ్గరకు రా! మానేద్దామని అనుకొంటున్నా మానలేక పోతున్నావా? నీ సిగరెట్ పేకట్లు,
మందు బాటిల్లు బయట పారవేసి యేసయ్య పాదాలను నీ కన్నీటితో కడుగు. వెంటనే నీకు దేవుడు
వాటిమీద అసహ్యాన్ని కలిగిస్తారు. అప్పుడు నీవు సంతోషిస్తావు. నీతో పాటు నీ
కుటుంబం. సమాజంలో మంచి పేరు కూడా వస్తుంది. చివరకు పరలోకాన్ని పొందుకొంటావు.
అట్టి కృప అందరికీ కలుగును గాక!
దైవాశీస్సులు.
*ఎఫెసీ పత్రిక -94వ భాగం*
*పిలుపుకు తగిన జీవితం-47*
ఎఫెసీ 5: 18—19
18. మరియు మద్యముతో
మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు; అయితే ఆత్మ పూర్ణులైయుండుడి.
19. ఒకనినొకడు కీర్తనల తోను సంగీతములతోను ఆత్మసంబంధమైన
పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువునుగూర్చి పాడుచు కీర్తించుచు,
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను
ధ్యానం చేసుకుంటున్నాం! మనము పిలుపుకి తగ్గ జీవితం ఎలా జీవించాలో ధ్యానం
చేసుకుంటున్నాము!
ఇక
పిలుపుకి తగిన జీవితం జీవించడానికి కావలసిన మరో ప్రాముఖ్యమైన విషయం : ఆత్మ
పూర్ణత కలిగి జీవించడం!!
మధ్యముతో మత్తులై ఉండవద్దు దానిలో దుర్వ్యాపారము కలదు అంటున్నారు!
దానికి బదులుగా అనగా మధ్యముతో మత్తుగా ఉండక ఆత్మపూర్ణులై ఉండండి అంటున్నారు! ఈరోజు
మనం ఆత్మపూర్ణులై ఉండండి అంటున్నారు కదా దానికి గుర్తులు ఏమిటి అనేది చూసుకుందాం!
నిజానికి పెద్ద పెద్ద గుర్తులు ఏమీ నిర్ధిష్టంగా లేవు గాని పౌలుగారు 19 వ వచనంలో
అంటున్నారు ఒకని కోకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ
హెచ్చరించుచు మీ హృదయాలలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు ఉండాలి అంటున్నారు!
ఇదో గుర్తుగా చెబుతున్నారు ఆత్మపూర్ణతతో ఉండటానికి!
గమనించాలి అనేకసార్లు చెప్పడం జరిగినది: పరిశుద్దాత్మ పొందుకున్నాము
మనలో ఆత్మ దేవుడు పనిచేస్తున్నాడు అనడానికి అన్య భాషలు నానావిధ భాషలు మాట్లాడటం
అనేది ఒక గుర్తు! గాని బాషలు మాట్లాడటం మాత్రమే పరిశుద్ధాత్మ కాదు అని గ్రహించాలి!
నిజానికి 1 కోరింథీ పత్రికలో అందరూ భాషలతో మాట్లాడానికి ప్రయత్నం చేయండి,
ప్రవచనాలు పలికే సామర్ధ్యం కోసం ప్రార్ధించి పొందుకోండి అంటూ పౌలుగారు అందరినీ
ప్రోత్సాహ పరుస్తున్నారు! అయితే కేవలం బాషలు మాట్లాడటం ప్రవచనాలు చెప్పడం మాత్రమే
పరిశుద్దాత్మ పనిచేస్తున్నట్లు కాదు అని నా ఉద్దేశం! కొంతమందికి పరిశుద్దాత్మ
తాకిడి కలిగిన వెంటనే మోకరించగానే కళ్ళునుండి కన్నీరు కారిపోతూ ఉంటుంది. ఎవరికోసమే
మీకు తెలియకుండా కన్నీటి ప్రార్ధన, ఒప్పింపు ప్రార్ధన వచ్చేస్తుంది. మనవారు ఎవరో
చనిపోయినట్లు గానో మనవారికి ఏదో ఘోర ప్రమాదం జరిగినంతగా విలపిస్తూ ప్రభువా దయచేసి
రక్షించవా అంటూ ప్రార్ధన చేసేస్తావు! ఇది కూడా పరిశుద్ధాత్మ కార్యమే! మరికొంతమందికి
నవ్వు వస్తుంది. మరికొంతమంది ఉజ్జీవంగా ఊగిపోతూ ఉంటారు మరికొంతమంది దొర్లేస్తూ
ఉంటారు! ఇలా అనేకరకాలుగా ఆయన ఆత్మ తాకిడి ప్రత్యక్షత ఉంటుంది! కాబట్టే బాషలే పరిశుద్దాత్మ కాదు. అవి ఒక
గుర్తు మాత్రమే అంటున్నాను! ఇక్కడ ఈ వచనంలో పౌలుగారు మరో నిదర్శనం చూపిస్తున్నారు
19 వ వచనంలో ఒకనినొకడు కీర్తనల తోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను
హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువునుగూర్చి పాడుచు కీర్తించుచు,
ఇక
ఆత్మ పూర్ణులై ఎందుకు ఉండమంటున్నారు అంటే నీవు ఆత్మ పూర్ణత కలిగి ఉంటే
శరీరకార్యాలు చేయలేవు అని గలతీ పత్రికలో చెబుతున్నారు పౌలుగారు!
గలతీ 5:16—18
16. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి,
అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు.
17. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా
అపేక్షించును. ఇవి యొకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయనిచ్ఛయింతురో
వాటిని చేయకుందురు.
18. మీరు ఆత్మచేత నడిపింపబడినయెడల ధర్మశాస్త్రమునకు
లోనైనవారు కారు.
పై
వచనాలలో పౌలుగారు ఎంతో ప్రాముఖ్యమైన విషయాలు చెబుతున్నారు! *క్రైస్తవ జీవితంలో జయ
జీవితం జీవించడానికి ఏమి కావాలో వివరంగా వివరిస్తున్నారు*. *Explains what are the essentials to live victorious life!!*
అన్నింటికన్నా
ముఖ్యంగా కావలసినది: *ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీరానుసారంగా నడుచుకోరు*! నిజం
కదా!
శరీరానుసారంగా నడుచుకోవడం అంటే: మొదటగా *శరీర కార్యాలు చెయ్యడం* అనగా
క్రింద వచనాలలో వివరించిన (19—21 వచనాలు) శరీర కార్యాలు చేయడం .
అనగా వ్యభిచారం, జారత్వం, కలహాలు, మంత్రం ప్రయోగం, ద్వేషం, కోపం, కక్షలు
ఈర్షభావాలు కలిగి ఉండటం, తప్పుడుబోధలు, కామవికారం కలిగి ఉండటం, విగ్రహాల పూజ,
అసూయ, హత్యలు చేయడం, త్రాగుబోతుతనం, అల్లరితో కూడిన ఆటపాటలు అనగా సినిమాలు
సీరియల్లు చూడటం, ఇంకా జూడమాడటం, రేసులు ఆడటం లాంటి వ్యసనాలలో ఉండటం అన్నీ
శరీరానుసారమైన పనులు చెయ్యడం. వీటి అంతం ఏమిటంటే ఇలా చేసిన వారు ఎవరూ దేవుని
రాజ్యమునకు హక్కుదారులు కాదు అంటున్నారు 21వ వచనంలో!
రెండవదిగా: *లోకానుసారమైన జీవితం జీవించడం* అనగా లోకస్తులు
చేస్తున్న పనులు చేయడం- లోకాచారాలు చెయ్యడం! లోకస్తుల వలె వస్త్రధారణ, లోకస్తుల
ఆచారాలు అనగా తాళి కట్టుకోవడం, వాస్తులు చూడటం, ముహూర్తాలు చూడటం, జాతకాలు
చూపించుకోవడం, లోకాచార పండుగలు, షష్టిపూర్తి లాంటి కార్యాలు చెయ్యడం అనగా అన్యజనుల
ఆచారాల వంటి ఆచారాలు చేస్తూ దానికి కొంచెం క్రైస్తవ్యం కలిపినా అది లోకాచారమే!
ఇలాంటి కార్యాలు చేస్తే శరీరానుసారులే!
*ఆత్మానుసారంగా ఉండటం
అంటే ఎల్లప్పుడూ దేవుని ఆత్మతో నింపబడుతూ, ఆత్మాభిషేకాన్ని పొందుకుంటూ, ఆత్మఫలము
ఫలిస్తూ ప్రార్ధన వాక్య పఠనం, బాషలు మాట్లాడటం, ఆత్మీయ వరాలతో నింపబడటం,ముఖ్యంగా
పాపమంటే అసహ్యించుకుని పాపమునకు దూరంగా పారిపోవడం యోసేపులా! ఇవన్నీ ఆత్మానుసరంగా
నడచుకోవడం*!
అయితే ఇక్కడ పౌలుగారు ఇంతగా నొక్కివక్కానించి చెప్పడానికి కారణం ఏమిటంటే:
తన జయజీవితానికి కారణం ఇదే! అనగా ఆత్మానుసారంగా నడచుకోవడమే! *క్రీస్తులో
ఆధ్యాత్మిక జీవితం అనగా విజయవంతమైన జయజీవితం జీవించటానికి విశ్వాసులకు
శక్తినిచ్చేది కేవలం దేవుని ఆత్మ – పరిశుద్ధాత్మ మాత్రమే!* ఇలా ఆత్మతో నడిపించబడి జీవిస్తే నీవు
శరీరానుసారమైన జీవితం జీవించలేవు! దీనినే రోమా 8:4—14 వరకు ఎంతో బాగా
వివరిస్తున్నారు పౌలుగారు! శరీర స్వభావంతో ఉన్నవారు శరీర సంబంధమైన విషయాల మీద ఆసక్తి
చూపిస్తారు. అయితే దేవుని ఆత్మచేత నడిపించ బడేవారు ఆత్మ సంబంధమైన విషయాల మీద
ఆసక్తి చూపిస్తారు. అయితే శరీర సంబంధమైన మనస్సు కలిగి ఉంటే అది మరణమే అంటున్నారు.
దేవుని ఆత్మ సంబంధమైన మనస్సయితే జీవము, శాంతి కలిగి ఉంటుంది అంటున్నారు. అలా
జరగటానికి కారణము శరీరస్వభావం దేవునికి వ్యతిరేఖంగా ఉంటుంది. అది దేవుని
ధర్మశాస్త్రానికి కూడా లొంగదు! అయితే మీరు దేవుని ఆత్మతో నడుచుకుంటే లేక దేవుని
ఆత్మ మీలో ఉంటే శరీర స్వభావంలో ఉండలేరు. దేవుని ఆత్మ మీలో ఉంటుంది కాబట్టి ఈ శరీర
సంబంధమైన విషయాలను జయించగలరు అంటున్నారు......
4. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన
శరీరమందు పాపమునకు శిక్ష విధించెను.
5. శరీరానుసారులు శరీరవిషయములమీద మనస్సునుంతురు;
ఆత్మానుసారులు ఆత్మవిషయములమీద మనస్సునుంతురు; శరీరాను సారమైన మనస్సు మరణము;
6. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది.
7. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది;
అది దేవుని ధర్మ శాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు.
8. కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు.
9. దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము
గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే
వాడాయనవాడు కాడు.
10. క్రీస్తు మీలోనున్నయెడల మీ శరీరము పాపవిషయమై మృతమైనది
గాని మీ ఆత్మ నీతివిషయమై జీవము కలిగియున్నది.
11. మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీలో
నివసించినయెడల, మృతులలో నుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకులోనైన మీ శరీరములను
కూడ మీలో నివసించుచున్న తన ఆత్మద్వారా జీవింపజేయును.
12. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు
మనము శరీరమునకు ఋణస్థులము కాము.
13. మీరు శరీరానుసారముగా ప్రవర్తించినయెడల చావవలసినవారై
యుందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపినయెడల జీవించెదరు.
14. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని
కుమారులై యుందురు.
దేవుని
ఆత్మచేత ఎవడు నడిపించబడతాడో వాడే దేవుని సంతానంగా ఉంటారు!
అయితే ఇక్కడ పౌలుగారి మాటలు
జాగ్రత్తగా పరిశీలన చేస్తే విశ్వాసులలో లేక ఆత్మచేత నడిపించబడే వారిలో లేక
ఆత్మానుసారంగా జీవించే వారిలో ఇలాంటి శరీర సంబంధమైన కోరికలు చెడ్డ భావాలు కలగవు
అనడం లేదు! అవికూడా వస్తాయి! అందుకే పౌలుగారు కూడా రోమా 7:14—25 లో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను
అంటూ విలపిస్తున్నారు కారణం చెయ్యాలన్న మేలు చేయలేక చేయకూడదనే పాపం కీడు
చేస్తున్నాను. ఇట్టి మరణం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అని అంటున్నారు. యోహాను
గారు కూడా 1యోహాను 1:8 లో నాలో పాపం లేదని లేక మనలో పాపం లేదని చెబితే మనలను మనమే
మోసం చేసుకుంటున్నాము మనలో సత్యముండదు అంటున్నారు!
అయితే ఎప్పుడైతే మనం ఆత్మానుసారంగా నడుచుకొంటామో – ఈ ఆత్మ బలము చేత శరీర
కార్యాలను అణగద్రొక్కగలము!!! భక్తులకు
కూడా ఇలాంటి శరీర సంబంధమైన శోధనలు కలుగుతాయి! అయితే ఆత్మానుసారులైన వారికి
ఇలాంటిశోధన ఎదురైతే వారిలో ఉన్న పరిశుద్ధాత్ముడు వారికి బోధిస్తాడు అది తప్పు అని!
వెంటనే వారు అలాంటి కోరికలను ఆశలను ఆత్మ నడిపింపు ద్వారా జయించగలరు!
నా అనుభవాన్ని కూడా
చెప్పనీయండి! నాలోకూడ అనేకసార్లు చెడ్డ భావాలు, మోహపు చూపులు, చెడ్డ తలంపులు
కలుగుతుంటాయి- వెంటనే నా అంతరాత్మ- పరిశుద్దాత్మునితో కలిసి- ఒరేయ్ నీవు ఎవడవో, ఏం
చేస్తున్నావో, ఏం చూస్తున్నావో తెలుసా?
నీవు దేవుని పవిత్ర రక్తంలో కడుగబడిన వాడవని మర్చిపోయావా? నీవు దేవుని బిడ్డవని
మరచిపోయావా? నరకానికి పోతావు జాగ్రత్త బుద్ధిలేనోడా!! అని నన్ను హెచ్చరిస్తూ ఉంటుంది.
వెంటనే ప్రభువా క్షమించమని అడుగుతూ ఉంటాను. సరిచేసుకుంటాను. ఇంకా వినకపోతే
పరిశుద్దాత్ముడు అడుగుతాడు నన్ను: ఇందుకేనా యేసయ్య నీకోసం రక్తం కార్చింది?
ఇందుకేనా ఆయన నీ కోసం అన్ని దెబ్బలు హింసలు పడింది? ఈ మాట వినిన వెంటనే నా హృదయం
బద్దలైపోతుంది! వెంటనే దేవుని సన్నిధిలో నా తప్పు క్షమించమని అడిగి నన్ను నేను
సరిచేసుకుంటూ ఉంటాను. ఇక వాటిజోలికి పోడానికి ధైర్యం చెయ్యను! గమనించాలి ఈ తప్పుడు
ఆలోచనలు కోరికలు ఊహలు చూపులు భావాలు రాకుండా లేకుండా పోవడం లేదు గాని
పరిశుద్ధాత్ముడు వాటిని వెంటనే జయించడానికి నాకు సహాయం చెయ్యడం వలన దేవునితో మంచి
సంబంధాన్ని కలిగి ఉండగలుగుతున్నాను! ఆత్మానుసారంగా ప్రవర్తించ గలుగుతున్నాను!
ఎప్పుడు? ఆత్మతో నింపబడుతూ ఆత్మ మాట వినగలిగేటప్పుడు మాత్రమే! ఇంకా హృదయం నిండా
వాక్యము నింపుకుని వాక్యానికి చోటిచ్చినప్పుడే ఇది సాధ్యమవుతుంది! ఎప్పుడైతే
వాక్యానికి పరిశుద్దాత్మునికి భయపడతావో- పాపం చెయ్యడానికి భయపడతావు! అప్పుడు శరీర
కార్యాలు చేస్తూ, శరీరానుసారంగా జీవించలేవు!
గమనించాలి 17వ వచనంలో చెబుతున్నారు శరీరము
ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షిస్తూ అనగా పోరాడుతూ ఉంటున్నాయి. ఇలా
జరిగేటప్పుడు మీరేమి చెయ్యాలి అనుకుంటారో అలా చెయ్యలేరు. దీనికి ఉదాహరణ పైన
చెప్పినట్లు రోమా పత్రిక 7లో పౌలుగారు చెబుతున్నట్లు చేయకూడని పాపం చేసి
చెయ్యాలన్న మేలు చేయలేము. శరీర కార్యాలు,
శరీర కోరికలు- దేవుని ఆత్మ ఈ రెండింటి కోరికలు, తలంపులు లక్ష్యాలు లక్షణాలు
పూర్తిగా ఒకదానితో ఒకటి వ్యతిరేఖంగా ఉంటాయి. రోమా 8:5—8
ఇది
మనకు తల్లిదండ్రుల నుండి అనగా జన్మనుండి చిన్నతనం నుండి అలవాటై పోయింది. మనం
పవిత్రంగా ఉందామన్నా మనకు మనం ఉండలేము! అయితే ఆత్మ సహాయం తీసుకుంటే
పరిశుద్ధాత్ముడు దీనిని జయించడానికి సహాయం చేస్తారు! విశ్వాసులు తాము చెయ్యాలను కున్న మంచి తాము
చెయ్యకుండా ఈ శరీర స్వభావం అడ్డుకుంటుంది
రోమా
7:15, 18—20; అయితే
పరిశుద్ధాత్మ వలన ఆ కోరికలను జయించవచ్చు అంటున్నారు పౌలుగారు!
ఇక 18వచనంలో అంటున్నారు మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల ఇక
ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అంటున్నారు.
కాబట్టి పౌలుగారు చెబుతున్నారు-
ఆత్మానుసారంగా నడుచుకోండి అప్పుడు శరీరనుసారంగా ప్రవర్తించరు! కాబట్టి ఎవరైతే
ఆత్మానుసారంగా జీవిస్తారో వారే పిలువబడిన పిలుపుకి తగిన జీవితం జీవిస్తున్నట్లు!
ప్రియ స్నేహితుడా! ఆత్మానుసారంగా
నడచుకుంటున్నావా? లేక శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నావా? ఇంకా నీలో లోకాశలు,
లోకాచారాలు కనిపిస్తున్నాయా? అయితే నీవు ఇంకా పాపం, దాస్యం అనే మార్గం లోనే
ఉన్నావు! నీవు సరిగా ఉన్నావు అనుకుంటున్నావు గాని నీవు లేవు! మంచిగా ఉన్నానని
సాతాను గాడు నిన్ను భ్రమపెడుతున్నాడు. నీవు మంచిగా ఆత్మానుసారంగా ఉండాలని ఉంది
గాని ఉండలేక పోతున్నావా? నీకు నీవుగా ఉండలేవు! పరిశుద్ధాత్ముని సహాయం తీసుకో!
దేవుని ఆత్మ లేకపోతే వాడాయన వాడు కాదు అని మీదన చదువుకున్నాము! ఆయన వారము కాకపోతే
సాతాను గాడికి చెందుతాము! దాని ఫలితం మరణం నరకం! ఆ భాధలు నీవు పడలేవు! నేడే నీ
శరీర కార్యాలు, లోకాచారాలు వదిలి దేవుని ఆత్మచేత నడిపించ బడు! ఆయన ఆత్మపూర్ణుడు ఉండు!
పిలువబడిన పిలుపుకి తగినట్లుగా జీవించు!!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -95వ భాగం*
*పిలుపుకు తగిన జీవితం-48*
ఎఫెసీ 5: 18—19
18. మరియు మద్యముతో
మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు; అయితే ఆత్మ పూర్ణులైయుండుడి.
19. ఒకనినొకడు కీర్తనల తోను సంగీతములతోను ఆత్మసంబంధమైన
పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువునుగూర్చి పాడుచు కీర్తించుచు,
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను
ధ్యానం చేసుకుంటున్నాం! మనము పిలుపుకి తగ్గ జీవితం ఎలా జీవించాలో ధ్యానం
చేసుకుంటున్నాము!
ఇక
పిలుపుకి తగిన జీవితం జీవించడానికి కావలసిన మరో ప్రాముఖ్యమైన విషయం: కీర్తనల తోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను
హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువునుగూర్చి పాడుచు కీర్తించుచు,
దేవుని
ఆత్మతో నిండి ఉన్నామనడానికి రుజువు ఏమిటి? ఇక్కడ పౌలుగారు సూచనలు అద్భుతాల
గురించి, లేక ఆధ్యాత్మిక సామర్థ్యాలు, ఆత్మ ప్రత్యక్షతల గురించి ఏమీ చెప్పడం లేదు.
వీటిల్లో అన్నీ కూడా విశ్వాసులందరికీ ఇవ్వబడదు. ఒకరికి ఒకటుంటే, మరొకరికి వేరొకటి
ఉంటుంది (రోమీయులకు 12:4-8; 1 కోరింథీయులకు 12:7-11, 1 కోరింథీయులకు 12:28-30).
ఏదో ఒకటి లేక ఎక్కువ ఆధ్యాత్మిక సామర్థ్యాలు లేక ఆత్మీయ వరాలు ఉండి కూడా
పరిశుద్ధాత్మతో నిండిన స్థితిలో
ఉండకపోవడం సాధ్యమే (1 కోరింథీయులకు 1:7; 1 కోరింథీయులకు 3:1, 1 కోరింథీయులకు 3:3).
అలానే ఒకరు పరిశుద్ధాత్మతో నిండి ఉండి కూడా, కొందరు క్రైస్తవులు ఎక్కువగా ప్రాముఖ్యత
ఇచ్చే సామర్థ్యం వారిలో లేకపోవడం కూడా సాధ్యమే (అపో. కార్యములు 2:4, అపో.
కార్యములు 2:11; 1 కోరింథీయులకు 12:10, 1 కోరింథీయులకు 12:28-30 ). పౌలుగారు ఇక్కడ ఇతర సంగతులను చెప్తున్నాడు. ఇవి దేవుని
ఆత్మతో నిండి ఉండడానికి గుర్తులు – ఇతర విశ్వాసులతో ఆనందకరమైన సహవాసం, దేవునికి
కృతజ్ఞతలు చెప్తూ ఉండడం, ఒకరికొకరు లోబడి ఉండడం. ఆత్మఫలం (గలతియులకు 5:22)
అస్తమానం ఆత్మతో నిండి ఉండేవారిలో ఏపుగా పెరుగుతుంది. ఆధ్యాత్మికమైన సంగీతం, పాటలు
పవిత్రాత్మ నిండిన హృదయాల్లోనుంచి సహజంగా పెల్లుబుకుతాయి.
కొలస్సీయులకు
3: 16
సంగీతములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి
ఒకడు బోధించుచు, బుద్ధిచెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము
చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా
నివసింపనియ్యుడి.
సంగీతములతోను, కీర్తనలతోను, ఆత్మసంభంధమైన
పద్యములతోనూ గడపాలి! అయితే కొన్ని సంఘాలవారు వాయిద్యాలు వాయించకూడదు. చప్పట్లు
కొట్టకూడదు అంటారు. కారణం దేవుడు అల్లరికి కర్త కాదు అంటారు. గాని ఇక్కడ
పరిశుద్ధాత్ముడు పౌలుగారిని ఉపయోగించుకొని ఇంత స్పష్టముగా వ్రాయించారు
సంగీతములతోను, కీర్తనలతోను ఆత్మ సంభంధమైన పద్యములతో పాడాలి! మరి వారు చెప్పిన బోధ
వాక్య విరుద్ధమే గదా! దావీదు గారు తన జీవితకాలమంతా దేవునిపాటలు పాడుచూ, రాస్తూ,
వాయిద్యాలు వాయిస్తూ గడిపారు! తనకు కష్టమొచ్చినా పాటలు పాడారు, నష్టమొచ్చినా పాటలు
పాడారు. సుఖమొచ్చినా పాడారు. ఏదిఏమైనా అన్ని పరిస్తితులలోను, అన్ని విషయాలలోనూ
పాటలు పాడారు, దేవుణ్ణి స్తుతించారు. ఆయన పాటలు పాడని రోజు ఒకరోజు కూడా లేదు తన
జీవితాంతము! కీర్తనలు 146: 2
నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించె దను నేను
బ్రతుకుకాలమంతయు నా దేవుని కీర్తించెదను
అందుకే దేవునికి ఇస్తానుసారుడైన వ్యక్తిగా
పిలువబడ్డారు. మరి ప్రియ దేవునిబిడ్డా!
నీవు పాడుతున్నవా?
ఇక వాయిద్యాల కోసం చూద్దాం! కీర్తనల గ్రంధంలో
ఎన్నో వాయిద్యాలు వాయిస్తూ దేవుణ్ణి స్తుతించమని వ్రాయబడియుంది. ఇక 150 వ కీర్తన
మొత్తం వాయిద్యాలు వాయిస్తూ దేవుణ్ణి స్తుతించమని వ్రాయబడింది. 148, 149 కీర్తనలో
ఎవరెవరు, ఎందుకు దేవుణ్ణి స్తుతించాలో వ్రాయబడియుంది. కాబట్టి వాయిద్యాలు వాయిస్తూ
పాడుతూ దేవుణ్ణి స్తుతించాలి మనం!
అయితే ఇక్కడ ఒక
విషయం మరచిపోకూడదు మనం. నేటిరోజులలో పాటలు- స్తుతి వినబడటం లేదు గాని వాయిద్యాల
ఘోష, రిధం మాత్రం వినిస్పిస్తుంది ఎక్కువగా! పాటలు వినబడటం లేదు. ఏం పాడుతున్నారో
స్పష్టముగా వినబడకుండా వాయిద్యాలు dominate చేస్తున్నాయి. దేవుడు
అల్లరికి కర్త కాడు! ఇటువంటి మ్యూజిక్ ఉద్రేకాన్ని- ఆహ్లాదాన్ని కలిగించవచ్చు
గాని, దేవునికి మహిమను తీసుకుని రావని నా ఉద్దేశ్యం! మీ స్తుతి—ఆరాధన, పాటలు, వాయిద్యాలు అన్నీ దేవునికి మహిమను తేవాలి గాని మీ వాయిద్య
మెలుకువలు, technics,
skills దేవుని సన్నిధిలో ప్రదర్శించి మీకు గొప్ప తెచ్చుకోవడానికి
కానేకాదు!
అంతేకాకుండా నేటిదినాల్లో చాలా మందిరాలలో, కూడికలలో దేవుని ఆరాధనలో
పాడేపాటలు, వాయించే సంగీతం, దేవుని పాటలు, దేవుని సంగీతంలా కాకుండా లోకానుసారంగా,
సినీ స్టైల్లో ఉంటున్నాయి. పరిశుద్ధమైన మందిరంలో అపరిశుద్ధమైన tunings! ఇది భావ్యమా ప్రియ సంఘమా?? ఎందుకు అలా వాయిస్తున్నారు అని అడిగితే ఇది
న్యూ ట్రెండ్; ట్రెండ్ మారింది అంటున్నారు. అయ్యా! మీ ట్రెండ్ మారినా – నాయేసయ్య మారలేదు కదా! మారడు కూడా! దేవుని సన్నిధిలో సినీ స్టైల్
లో పాటలు, లోకానుసారమైన సంగీతం కుదరదు!
మనం పాతపాటలు
గమనిస్తే ఆ పాటలలో ఎంతో ఆత్మీయత, ఉజ్జీవం కనిపిస్తాయి. ఆ ఉజ్జీవం, ఆత్మీయత నేటి
పాటలలో కనబడటం లేదు. కారణం పాతపాటలు ఆ దైవజనులు తమ శ్రమల అనుభవాలనుండి, అనుభవించి
రాసినవి, ప్రార్ధనాపూర్వకముగా రాసినవి. అందుకే ఆ పాటలలో ఉజ్జీవం. పాడుతుంటే కళ్ళంట
నీరు వస్తుంది. ఎంతో ఆదరణ కలుగుతుంది. హృదయాలను తాకుతాయి. నేటిరోజలలో అవి లేవు!
కాబట్టి ప్రియ సంఘమా! గమనించ మని మనవి చేస్తున్నాను.
అంతేకాదు సంగీతములతోను,
కీర్తనలతోను, ఆత్మసంభందమైన పధ్యములతోను – ఒకనికి ఒకడు
భోదించుచూ, కృపా సహితముగా ఉండాలి అని వ్రాస్తున్నారు. పాడే పాటలు— పాపాన్ని ఖండించాలి. బుద్ధి చెప్పాలి. పాపి—ఆ పాటలు విని
చెంప చెల్లుమనేటట్లు ఉండాలి. తిమోతీ పత్రికలో వ్రాసినట్లు ఖండించుము, గద్ధించుము,
బుద్ధిచెప్పుము అన్నట్లు ఉండాలి. బుద్ధి చెప్పాక—ఆపాపమును
తప్పించుకొనే విధానం కూడా ఉండాలి పాటలలో. కృపాసహితముగా ఉండాలి. క్రీస్తుయేసు సిలువ
త్యాగమును గుర్తుచేయాలి. అప్పుడు మారుమనస్సు పొందగలడు పాపి. అటువంటి పాటలు,
అటువంటి సంగీతం, అటువంటి ఆరాధన దేవునికి అంగీకారం అవుతాయి.
ప్రియ సంఘమా! నీకు కష్టమొచ్చినా, నష్టమొచ్చినా.
సంతోషమొచ్చినా దేవునిపాటలు పాడుతుండాలి. యాకోబుగారు అంటున్నారు 5: 13. మీలో
ఎవనికైనను శ్రమ సంభవించెనా? అతడు ప్రార్థనచేయవలెను; ఎవనికైనను సంతోషము కలిగెనా?
అతడు కీర్తనలు పాడవలెను.
అటువంటి జీవితం కలిగియుండాలి. పాటలు పాడుతూ దేవుని స్తుతించడానికి
ప్రయత్నించు. దానికోసం నీవు ప్రత్యేకముగా సంగీతం నేర్చుకోవాల్సిన అవుసరం లేదు.
వీలుంటే నేర్చుకో! నీవు ఎలా పాడినా దేవుడు ఆనందిస్తారు. నీవు అపశ్రుతిలో ఎందుకు
పాడుతున్నావు అని దేవుడు అడుగరు నిన్ను. నీ పాటలు ఆయనకు ఆనందం కలుగజేస్తాయి. కేవలం
నీవు హృదయపూర్వకముగా, నీ పూర్ణ ఆత్మతో పాడుతున్నావా లేదా, ఆత్మతో సత్యముతో ఆరాధన
చేస్తున్నావా లేదా? ఇదే కావాలి దేవునికి. నీ skills అవుసరం లేదు.
ఒకవేళ పాడటం రాదా? దేవుణ్ణి అడుగు, నాకు పాటలు పాడటం నేర్పించమని. దేవుడు నేర్పిస్తారు
తన దూతను పంపి.
మా సంఘంలో నిజంగా ఇది జరిగింది. తన భర్త రెండు సం.లు చర్చికి పంపకుండా
బంధిస్తే, క్రొత్త పాటలు నేర్పమని, పాటలు పాడమని ప్రార్ధన చేస్తే, ఆ సం.ము మా
సంఘంలో పాడిన క్రొత్తపాటలు దేవుడు దూతను పంపించి నేర్పించారు ఆమెకు! దేవునికి
అసాధ్యమైనది ఏదీ లేదు! అడుగుడి మీకు ఇవ్వబడును. అడుగ వలసినవి ఇలాంటివే!
కాబట్టి మనం ఆత్మసంభంధమైన
పాటలతో, సంగీతములతో హృదయపూర్వకముగా దేవుణ్ణి పాడి ఆరాధన చేద్దాము. ఒకవేళ అలా
చేయకపోతే, లోకానుసారమైన సంగీతంతో ఆరాధన చేస్తుంటే నేడే వదిలేద్దాం! దేవునికి
ఇష్టమైన వారముగా జీవిద్దాం!
దైవాశీస్సులు!
ఆమెన్!
*ఎఫెసీ పత్రిక -96వ భాగం*
*పిలుపుకు తగిన జీవితం-49*
ఎఫెసీ 5: 19—21
19. ఒకనినొకడు
కీర్తనల తోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో
ప్రభువునుగూర్చి పాడుచు కీర్తించుచు,
20. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమునుగూర్చి
తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు,
21. క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడియుండుడి.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను
ధ్యానం చేసుకుంటున్నాం! మనము పిలుపుకి తగ్గ జీవితం ఎలా జీవించాలో ధ్యానం
చేసుకుంటున్నాము!
ఇక పిలుపుకి తగిన జీవితం జీవించడానికి
కావలసిన మరో ప్రాముఖ్యమైన విషయం: మన ప్రభువైన
యేసుక్రీస్తు పేరట సమస్తమునుగూర్చి తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు . .
చూడండి
ఇక్కడ పిలుపుకి తగిన జీవితం జీవించడానికి మరో మంచి విషయం చెబుతున్నారు: సమస్తము గూర్చి తండ్రియైన దేవునికి యేసుక్రీస్తు పేరిట
కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి!
బైబిల్ లో అనేకమంది భక్తులు తమకు అన్యాయం జరిగినా మాకు
ఎందుకు ఎలా జరిగింది అంటూ దేవుణ్ణి నిందించకుండా దేవుణ్ణి స్తుతించారు. అసాధారమైన
అద్భుతాలు చేయగలిగారు!
యోసేపు భక్తునికి ఘోరమైన అన్యాయం జరిగింది. స్వంత అన్నలే
కొట్టేసి బానిసగా అమ్మేశారు! గాని ఎప్పుడూ దేవుణ్ణి నిందించలేదు! దేవుడా ఇంతన్నావు
అంతన్నావ్ నన్ను దేశానికి అధికారిగా చేస్తానన్నావ్! ఏమయ్యా ఇప్పుడు నేను బానిసను,
చెరసాలలో ఉన్నాను అని అనలేదు. విశ్వాసాన్ని నిరీక్షణ వదలలేదు! గాని one fine day దేశమంతటి మీద అధికారిగా ఉండటానికి
చెరసాల నుండి పిలువబడ్డారు!
యోబు గారికి కలిగిన ఆస్తి మొత్తం, తన పదిమంది పిల్లలు
ఒకేరోజు కోల్పోయారు! తర్వాత ఆరోగ్యం పోయింది! గాని దేవుణ్ణి నిందించలేదు! యెహోవా
ఇచ్చెను యెహోవా తీసికొనేను! యెహోవా నామమునకు స్తోత్రము కలుగును గాక అన్నారు! బార్య
శోధిస్తే దేవుడు మనకు అన్నీ ఇచ్చినప్పుడు మనం అనుభవించ లేదా? ఈ బాధలు మనము
అనుభవించ కూడదా అన్నారు!
ఇక దావీదు గారు తనకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా
బాధలువచ్చినా సంతోషం వచ్చినా ప్రతీదానికి దేవుణ్ణి స్తుతించడం ఒక పాట రాయడం,
పాడటం! ఇంతే తన జీవితమంతా! తనకు కలిగిన కష్టాలకోసం ఎప్పుడు దేవుణ్ణి నిందించలేదు!
సరికదా దేవుణ్ణి స్తుతించారు!
ఇక పౌలుగారు సీలగారు వారికి సువార్తలో గల బాధలకు దేవుణ్ణి
నిందించలేదు! చెరసాలలో కూడా దెబ్బలను నొప్పిని సంకెళ్లను లెక్కచేయకుండా పాటలు పాడుతూ
సువార్త ప్రకటిస్తూ ఉంటే చెరసాల బ్రద్దలై సంకెళ్ళు ఊడి తెగిపడ్డాయి!
కాబట్టి
ఆ మంచి గొప్ప దైవజనులను మనం మాదిరిగా తీసుకుని మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదురైన
సవాళ్లను తట్టుకుని ముందుకు పోవాలి! ఇదే పిలుపుకి తగిన జీవితం జీవించడం!
విశ్వాసులు
ఇలా చేయగలరు – అయితే దీనికి వారు
పరిశుద్ధాత్మ లో నిండి ఉండాలి
2 కోరింథీయులకు 4
15. ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మునుకూడ లేపి,
మీతోకూడ తన యెదుట నిలువ బెట్టునని యెరిగి,మేమును విశ్వసించుచున్నాము గనుక
మాటలాడుచున్నాము..
కొలొస్సయులకు 2
7. మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు,
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు, ఆయనయందుండి నడుచుకొనుడి.
కొలొస్సయులకు 4
2. ప్రార్థనయందు నిలుకడగా ఉండి కృతజ్ఞతగలవారై దానియందు
మెలకువగా ఉండుడి.
1 థెస్సలొనీకయులకు
5
18. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.
ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము.
1 తిమోతికి 2
1. మనము సంపూర్ణభక్తియు మాన్యతయు కలిగి, నెమ్మది గాను
సుఖముగాను బ్రదుకు నిమిత్తము, అన్నిటికంటె ముఖ్యముగా మనుష్యులందరికొరకును. . .
హెబ్రీయులకు 13
15. కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును
స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.
కాబట్టి
అన్నీ విషయాల యందు దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ
ముందుకు పోదాం!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -97వ భాగం*
*పిలుపుకు తగిన జీవితం-50*
ఎఫెసీ 5: 20—21
20. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమునుగూర్చి
తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు,
21. క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడియుండుడి.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను
ధ్యానం చేసుకుంటున్నాం! మనము పిలుపుకి తగ్గ జీవితం ఎలా జీవించాలో ధ్యానం
చేసుకుంటున్నాము!
ఇక
పిలుపుకి తగిన జీవితం జీవించడానికి కావలసిన మరో ప్రాముఖ్యమైన విషయం: క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడియుండుడి
చూడండి కొలస్సీ పత్రికలో దాసులారా
మీరు మీ యజమానులకు లోబడి ఉండండి అన్నారు! గాని ఇక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తే
క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండండి అంటున్నారు! అనగా విశ్వాసులు తోటి విశ్వాసులకు కూడా
ఒకరికొకరు లోబడి ఉండాలి! ఇంకా విశ్వాసులు సంఘపెద్దలకు లోబడి ఉండాలి! ఇక విశ్వాసులు సంఘపెద్దలు అందరూ సంఘ కాపరికి
లోబడి ఉండాలి! ఇలా అందరూ ఒకరికొకరు లోబడి ఉండాలి! లోబడి ఉండడమంటే విధేయత. స్వంత
ఇష్టం నెరవేర్చుకోవడం, స్వార్థాన్ని హెచ్చించుకోవడం, గర్వంతో కూడిన స్వేచ్ఛ
వీటన్నిటికీ ఇది విరుద్ధం.
సామెతల
గ్రంధములో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి. అదే జ్ఞానము అంటూ ఎన్నోసార్లు
చెప్పారు సామెతలు 1
7. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము
మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు.
కీర్తనల గ్రంథము 34
11. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవాయందలి
భయభక్తులు మీకు నేర్పెదను.
12. బ్రతుక గోరువాడెవడైన నున్నాడా? మేలునొందుచు అనేక
దినములు బ్రతుక గోరువాడెవడైన నున్నాడా?
13. చెడ్డ మాటలు పలుకకుండ నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండ
నీ పెదవులను కాచు కొనుము.
14. కీడు చేయుట మాని మేలు చేయుము సమాధానము వెదకి దాని
వెంటాడుము
హెబ్రీయులకు 12
14. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు
ప్రయత్నించుడి. పరిశుద్ధతలేకుండ ఎవడును ప్రభువును చూడడు.
కీర్తనల గ్రంథము
111
10. యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనముల
ననుసరించువారందరు మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది.
ఆది భక్తులు అందరూ మొదటగా దేవునికి లోబడ్డారు! తర్వాత ప్రవక్తలకు యాజకులకు
లోబడ్డారు! దావీదుగారు రాజు చక్రవర్తి అయినా గాని గాదు గారికి, నాతాను గారికి
లోబడ్డారు! ఏలీషా గారు ఏలీయా గారికి లోబడ్డారు! ఇలా అందరూ లోబడ్డారు! అయితే ఇక్కడ
క్రీస్తునందలి భయము కలిగి ఒకరికొకరు లోబడి ఉండాలి!
ఈరోజులలో అనేకులకు భక్తి ఉంటుంది గాని భయము ఉండటం లేదు! నీకు భయం
ఉంటే ఆరాధనకు ఆలస్యంగా రావు! నీకు దేవుడంటే భయం ఉంటే నీకిష్టమొచ్చిన వస్త్రధారణ
చెయ్యవు! సినిమాలలో చూపించే బట్టలు శరీర అవయవాలు వాటి సౌష్టవం చూపించే వస్త్రాలు
వెయ్యవు! నీకు దేవుడంటే భయం ఉంటే అబద్దాలు ఆడవు! దేవుడంటే భయం ఉంటే ఆయన చూసే
దేవుడు మాట్లాడే దేవుడు అనే భయం ఉంటే వ్యభిచారం చెయ్యవు! అక్రమ సంబంధాలు
పెట్టుకోవు! పందిలా ఫుల్ గా త్రాగేసి రోడులుమీద కుళ్ళి కాలువలలో దొర్లవు! దేవుడంటే
భయం ఉంటే దేవుని డబ్బులు దొంగిలించవు! దేవుడంటే భయం ఉంటే కుటుంభ ప్రార్ధనలో
కూర్చుంటావు! దేవుడంటే భయం ఉంటే సువార్త ప్రకటిస్తావు! నీకు దేవుడంటే భయం లేదు
అందుకే ఇలా ఉంటున్నావు! నీవు ఒక కలెక్టర్ ఆఫీసుకి వెళ్తే ఎంతో విధేయతగా ఉంటావు!
సెల్ ఫోన్ సైలెంట్ లో పెడతావు! మరి చర్చిలో ఎందుకు నీకు సెల్ ఫోన్? చర్చిలో ఎందుకు
సెల్ ఫోన్ లో వాట్సప్ facebook చూస్తావు? ఎందుకు చర్చిలో సెల్ ఫోన్లో ఆటలు
ఆడతావు!
ఒక ఆఫీసర్ ఆఫీసుకు వెళ్తే ఇలా అజాగ్రత్తగా ఉంటావా? నీవు చర్చిలోకి
వేసుకుని వచ్చే వస్త్రాలు వేసుకుని కలెక్టర్ ఆఫీసుకి వెళ్లగలవా? ఫార్మల్ డ్రెస్
వేసుకుని వెళ్తావు . మరి చర్చికి వెళ్ళినప్పుడు ఈ ఫార్మాలిటీ పాటించవు? ఎందుకంటే
దేవుడంటే భయం లేదు! నీకంటే తక్కువ వాడు అనుకుంటున్నావు లేక మా దేవుడే కదా అని
దేవుణ్ణి చిన్నచూపు చూస్తున్నావు!
జాగ్రత్త దేవుడు సామాన్యుడు కాదు! దేవుని ఇవ్వాల్సిన గౌరవం మర్యాద
దేవునికి ఇవ్వాలి! లేకపోతే ఖబడ్దార్!
కాబట్టి దేవుడంటే భయభక్తులు కలిగి ఒకరికొకరు లోబడి ఉందాం!
ఇదే
పిలుపుకి తగిన జీవితం జీవించడం!
అట్టి
కృప ధన్యత దేవుడు మనకు దాయచేయును గాక!
ఆమెన్!
*ఎఫెసీ పత్రిక -98వ భాగం*
*పిలుపుకు తగిన జీవితం-51*
*వివాహ వ్యవస్థ-1*
ఎఫెసీ 5: 22—33
22. స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు
లోబడియుండుడి.
23. క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్న లాగున పురుషుడు
భార్యకు శిరస్సై యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు.
24. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలుకూడ ప్రతి
విషయములోను తమ పురుషులకు లోబడవలెను.
25. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె
క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి,
26. అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక,
పరిశుద్ధమైనదిగాను,
27. నిర్దోష మైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని
నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి,
పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను.
28. అటువలెనే పురుషులుకూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను
ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు.
29. తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును
దానిని పోషించి సంరక్షించుకొనును.
30. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై యున్నాము గనుక అలాగే
క్రీస్తుకూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు.
31. ఈ హేతువుచేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన
భార్యను హత్తుకొనును; వారిద్దరును ఏకశరీరమగుదురు.
32. ఈ మర్మము గొప్పది; అయితే నేను క్రీస్తునుగూర్చియు
సంఘమునుగూర్చియు చెప్పుచున్నాను.
33. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను
ప్రేమింప వలెను, భార్యయైతే తన భర్తయందు భయము కలిగి యుండునట్లు చూచుకొనవలెను.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! మనము పిలుపుకి తగ్గ జీవితం ఎలా జీవించాలో ధ్యానం చేసుకుంటున్నాము!
పిలుపుకి తగిన జీవితం జీవించడంలో కుటుంభ వ్యవస్త భాధ్యత ఎంతో గొప్పది!
ప్రాముఖ్యమైనది! కారణం సాతాను గాడు ఎప్పటినుండో సంఘాన్ని పాడుచేద్దాం
అనుకుంటున్నాడు- ఓడిపోతున్నాడు! సంఘాన్ని డైరెక్ట్ గా ఎటాక్ చేయలేక సంఘంలో గల
కుటుంబాలను కుటుంభ వ్యవస్తను పాడుచేస్తున్నాడు! కారణం కుటుంబాలు పాడై పోతే సంఘములు
దెబ్బతింటాయి! అందుకే సాతాను గాడు కుటుంబాలనే పాడుచేసి సంఘాలను పాడుచేస్తున్నాడు!
అసలు
వివాహ వ్యవస్త ను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశారో చూసుకుని అప్పుడు స్త్రీ పురుషులు
సంఘంలో పిలుపుకి తగిన జీవితం ఎలా జీవించాలో మనం ధ్యానం చేసుకుందాం! కొంతమంది ఏమండీ
పెళ్లి ప్రసంగం ఎందుకు చేస్తున్నారు అంటే మరి ఈ వచనాలలో పెళ్లి ప్రసంగమే ఉంటుంది
కాబట్టి దానినే ధ్యానం చేసుకుందాం! నిజానికి కొంతమంది దైవసేవకులకు పెళ్లి
ప్రసంగాలకు పనికొస్తుంది అని కొంచెం వివరంగా ధ్యానించడం జరుగుతుంది!!
అసలు వివాహం దేనికోసం చేసుకుంటారు?
ఈ ప్రశ్న యవ్వనస్తులను అడిగితే
సెక్స్ కోసం అని సమాధానం చెబుతారు!
పెద్దవారిని అడిగితే సంతానోత్పత్తి
కి అని సమాధానం చెప్పారు!!
నిజానికి దేవుడు వివాహ వ్యవస్తను ఎందుకు ఏర్పాటుచేశారు అంటే సెక్స్
కోసం కాదు, సంతానోత్పత్తికి కూడా కాదు గాని ఆదికాండం 2:20 ప్రకారం చూసుకుంటే
సాటియైన సహాయం కోసం దేవుడు వివాహ వ్యవస్తను ఏర్పాటు చేశారు! అనగా స్త్రీకి తోడుగా
పురుషుని, పురుషునికి తోడుగా స్త్రీని అన్నీ విషయాలలోనూ చేదోడు వాదోడుగా ఉండటానికే
దేవుడు ఈ వివాహ వ్యవస్తను ఏర్పాటు చేశారు!
20. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త
భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు *సాటియైన సహాయము* అతనికి లేక
పోయెను.
కాబట్టి దేవుడు కేవలం సాటియైన సహాయం కోసమే వివాహాన్ని ఏర్పాటుచేశారు!
ఇప్పుడు స్త్రీ అన్నీ విషయాలలోనూ భర్తకు సహకరించాలి! కుటుంబ విషయాలలో ఇంకా ఆర్ధిక
విషయాలలోనూ అన్నీ విషయాలలోనూ సహకరించాలి! అలాగే భర్త కూడా స్త్రీకి అన్నీ
విషయాలలోనూ సహకరించాలి! చివరకు పిల్లలను పెంచడం లోకూడా సహకరించాలి!
సరే, సాటియైన సహాయం చేయడానికి స్త్రీని దేవుడు చేసి ఇచ్చారు ! ఎలా అంటే
దేవుడు
21. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి
అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో
పూడ్చి వేసెను.
22. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన
ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసికొనివచ్చెను.
23. అప్పుడు ఆదాము ఇట్లనెను నా యెముకలలో ఒక యెముక నా
మాంసములో మాంసము ఇది నరునిలోనుండి తీయబడెను గనుక నారి అనబడును.
24. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన
భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.
దేవుడు ప్రక్కనుండే ఎముకను ఎందుకు తీశారు? కారణం దేవుని దృష్టిలో స్త్రీ
పురుషులు ఇద్దరూ సమానమే! ఇద్దరూ సమానంగా ఉంటూ వారి వారి భాధ్యతలు నిర్వహించాలని!
ఒకవేళ దేవుడు తలనుండి ఎముకను తీసి ఉంటే స్త్రీ పురుషుని నెత్తిమీద కూర్చుండునేమో,
ఇక కాలు నుండి తీస్తే పురుషుడు ఎక్కడ స్త్రీని తన కాలి క్రింద వేసి త్రొక్కుతాడు
ఏమో అని దేవుడు తెలివిగా ఆలోచించి ప్రక్కటెముక నుండే తీశారు. ఆ ప్రక్కటెముక తోనే
స్త్రీని చేసి సాటియైన సహాయముగా ఆదాముగారికి ఇచ్చారు! కాబట్టి ఇప్పుడు స్త్రీ
పురుషులు ఇద్దరు దేవునికి సమానమే! గాని ఎవరి బాధ్యతలు వారు నిర్వహించాలి! ఇలా
కలిసిమెలిసి కుటుంబాన్ని కట్టుకోవాలి! ఇదే బైబిల్ చెబుతుంది!
దైవాశీస్సులు!
(ఇంకాఉంది)
*ఎఫెసీ పత్రిక -99వ భాగం*
*పిలుపుకు తగిన జీవితం-52*
*వివాహ వ్యవస్థ-2*
ఎఫెసీ 5: 22—33
22. స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి.
23. క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్న లాగున పురుషుడు
భార్యకు శిరస్సై యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు.
24. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలుకూడ ప్రతి
విషయములోను తమ పురుషులకు లోబడవలెను.
25. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె
క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి,
26. అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక,
పరిశుద్ధమైనదిగాను,
27. నిర్దోష మైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని
నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి,
పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను.
28. అటువలెనే పురుషులుకూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను
ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు.
29. తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును
దానిని పోషించి సంర క్షించుకొనును.
30. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై యున్నాము గనుక అలాగే
క్రీస్తుకూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు.
31. ఈ హేతువుచేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన
భార్యను హత్తుకొనును; వారిద్దరును ఏకశరీరమగుదురు.
32. ఈ మర్మము గొప్పది; అయితే నేను క్రీస్తునుగూర్చియు
సంఘమునుగూర్చియు చెప్పుచున్నాను.
33. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను
ప్రేమింప వలెను, భార్యయైతే తన భర్తయందు భయము కలిగి యుండునట్లు చూచుకొనవలెను.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! మనము పిలుపుకి తగ్గ జీవితం ఎలా జీవించాలో ధ్యానం చేసుకుంటున్నాము!
పిలుపుకి
తగిన జీవితం జీవించడంలో కుటుంభ వ్యవస్త పాత్ర కోసం ధ్యానం చేస్తున్నాము! స్త్రీ
పురుషులు ఇద్దరూ దేవుని దృష్టిలో సమానమే మరియు ఇద్దరూ కలిసి కుటుంబాన్ని
కట్టుకోవాలని ఇంతవరకు ధ్యానం చేశాము!
ఇక
22 వ వచనంలో అంటున్నారు స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి.
ఎలాగంటే క్రీస్తు సంఘానికి శిరస్సై యున్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై
యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు. ఇంకా సంఘము క్రీస్తునకు
లోబడినట్టుగా భార్యలుకూడ ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను అంటున్నారు! పేతురు గారు అంటున్నారు 3:1 లో
1. అటువలె
స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి; ప్రతీ
భార్య తన స్వంత భర్తకు లోబడి ఉండాలి! ఈరోజులలో చాలామంది స్త్రీలు తమ స్వంత
పురుషులకు లోబడటం లేదు! ఇతర పురుషులకు లోబడుతున్నారు! స్వంత పురుషుడు అనగా భర్త
వారికి ఎందుకు పనికిరాని దద్దమ్మగా కనిపిస్తున్నాడు గాని వారి బావ గారు గాని లేక
కుటుంబంలో మరో వ్యక్తి ఎంతో ఘనమైన వాడు గాను గౌరవించ తగిన వాడు గాను
కనిపిస్తున్నాడు! ఓ స్త్రీ మొదట నీవు నీ భర్తను గౌరవిస్తే ఇతరులు కూడా నీ భర్తను
గౌరవిస్తారు! నీవే పుల్లముక్కలా తీసిపడేస్తే ఇతరులు ఈడ్చి ఈడ్చి కొడతారు నీ
భర్తను! అప్పుడు పోయేది నీ పరువే! మా పల్లెటూర్లలో అనేకమంది తమ భర్తలను సోదోడా
దద్దమ్మ అని పిలుస్తూ వారి పరువు వారే తీసుకుంటున్నారు! బైబిల్ చెబుతుంది శారమ్మ
గారి గురించి ఎల్లప్పుడూ తన భర్తను నా యజమానుడా అని పిలిచి గౌరవిస్తూ ఉండేది!
అందుకే ఆదర్శవంతమైన దంపతులు అయ్యారు ఇద్దరూ!
అయితే ఒక విషయం చెప్పనీయండి- పురుషులు కూడా తమ భార్యలను చూసేవిధంగా
చూడాలి! హుందాగా ప్రవర్తించాలి. చిల్లర పనులు చేయకూడదు! భార్యలను ప్రేమించాలి!
క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించారో పురుషులు కూడా తమ భార్యలను అలా ప్రేమించాలి
అంటున్నారు! సంఘము ప్రతీ విషయంలో క్రీస్తుకు లోబడినట్లు ప్రతీ విషయంలో తమ స్వంత
భర్తకు స్త్రీ లోబడాలి! అది నీకు నచ్చినా నచ్చక పోయినా నీవు లోబడాలి అంతే! అయితే
మరి నీ ఉద్దేశం చెప్పుకునే అవకాశం లేదా అంటే ఉంది- ఒకవేళ ఆ పని నీకు నచ్చకపోతే – ముందు ఆ పని చేసి తర్వాత ఏమండీ ఇది మంచిపద్దతి కాదు అంటూ
నెమ్మదిగా నీ భర్తకు కోపం రాకుండా నచ్చచెప్పుకుని ఆ పనిచేయకుండా ఆపాలే తప్పా భర్త
మీద తిరుగబడ కూడదు! ఇదే బైబిల్ చెబుతుంది! మా స్త్రీలకు హక్కులున్నాయి అంటూ పోరాటం
చేయకూడదు! స్త్రీలు ఏమైనా అనుకుంటే అనుకోండి గాని నేను చెప్పేది బైబిల్ లో
వ్రాయబడినదే చెబుతున్నాను! ప్రతీ విషయంలోనూ స్త్రీ తన భర్తకు లోబడి ఉండాలి! కుటుంబ
యజమాని భర్త మాత్రమే! స్త్రీ ఎంతమాత్రమూ కాదు! మన దేశంలో కొన్ని రాష్ట్రాలలో
ముఖ్యంగా ఒరిస్సాలో కొంత భాగం, తమిళనాడులో, ఇంకా బీహారలో కొంతభాగంలో స్త్రీలే
ఇంటికి పెద్దలుగా వ్యవహరిస్తున్నారు శతాబ్దాల నుండి! గాని దీనిని బైబిల్
ఒప్పుకోదు! ప్రతీ విషయంలో స్త్రీ తన భర్తకు లోబడి ఉండాలి! ఇంకా తన భాధ్యత
నిర్వహించాలి!
నిజానికి స్త్రీ యొక్క భాధ్యత ఏమిటి? అది మన దేశమైన పశ్చిమ
దేశాలైనా ఏ దేశంలో నైనా స్త్రీ యొక్క భాద్యతలు ఏమంటే మొదటగా: భర్తకు లోబడాలి!
రెండు: పిల్లలను కనాలి ! నేను కలెక్టర్ ని, నేను ఈ ఆఫీసర్ ని నాకు కాళీ ఉండదు, నా
ఉద్యోగానికి పిల్లలు కనడం సూట్ అవ్వదు అని నీవు వాదించినా అది కుదరదు!
నోరుమూసుకుని పిల్లలు కనాలి! ఇది దేవుని
శాసనం! ఆదికాండం లోనే స్త్రీకి దేవుడిచ్చిన
మార్గం ఇది! నీవు ప్రయాస పడి పిల్లలను కంటావు అని చెప్పారు దేవుడు! ఒకవేళ
నీ మీద అత్యధిక ప్రేమతో నీ భర్త పిల్లలను కందామన్న అతను కనలేడూ ఎందుకంటే ఆ శరీర
వ్యవస్త దేవుడు స్త్రీలకే పెట్టాడు! కాబట్టి స్త్రీ పిల్లలను కనీ తన వంశం/కుటుంబం
యొక్క సంతానాన్ని వృద్ది పొందించాలి!
మూడవది: వంట చేయడం: మరలా మీద సేమ్ డైలాగ్! నేను కలెక్టర్
ని, మా నాన్న కోట్లు లక్షలు ఇచ్చాడు నీకు, లేక మరో కారణం చెప్పి నేను వంట వండను!
నీవే వండుకో లేక పని మనిషితో వండించుకో అంటే కుదరదు! నోరు మూసుకుని వంట చేయాలి!
దయచేసి స్త్రీలు నా భాషను క్షమించండి గాని దీనియొక్క విశిష్టత అర్ధం కావాలనే ఈ
భాషను ఉపయోగిస్తున్నాను! స్త్రీలు తప్పకుండా వంట చేసి తన భర్తకు పిల్లలకు తన
కుటుంబానికి పెట్టాలి! ఇది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ! స్త్రీ యొక్క ముఖ్య విధి! అది ఏ
దేశమైనా సరే! అలాగని పురుషులు ఎట్టి పరిస్తితులలో వంటచేయకూడదు అని నేను అనడం
లేదండోయ్! ఒకవేళ నీ భార్యకు ఆరోగ్యం బాగోలేక పోతే నీవు వంట చేయడం తప్పుకాదు.
సరికదా చాలామంచిది! నీ భార్య మంచి పొజిషన్ లో ఉంది! ఉద్యోగ ఒత్తిడి వలన కొంచెం
ఆలస్యంగా రావచ్చు! అంతవరకు నీవు నీ పిల్లలు ఆకలితో ఉండకుండా నీవు వంట చేయడం
తప్పుకాదు! ఇంకా ప్రతీ భర్త తన భార్యకు వంటలో సహాయం చేస్తే నిజంగా భార్య ఎంతో
సంతోషపడుతుంది! కొంతమంది భర్తలు ఏం పనిచేస్తున్నావు, కాళీగా ఉన్నావు కదా ఇది
ఎందుకు చేయలేదు అది ఎందుకు చేయలేదు అంటూ భార్యను పూచిక పుల్లలా తీసేస్తూ
అవమానిస్తూ సతాయిస్తూ ఉంటారు! భర్తలే కాదు పిల్లలు కూడా తల్లిని అంటూ ఉంటారు!
ఇలాంటి పనికిమాలిన వారు ఒక వారం రోజులు తల్లి లేక భార్య చేసే పనులు ఉదయం నుండి
సాయంత్రం వరకు చేస్తే అప్పుడు
అర్ధమవుతుంది ఇంట్లో స్త్రీలు ఎంతగా కష్టపడుతున్నారో! నిజానికి పురుషులు కంటే
స్త్రీలే ఎక్కువగా కష్టపడుతున్నారు! కొంతమంది స్త్రీలు ఇంట్లో పనులు చేసుకుని
ఉద్యోగం కూడా చేస్తున్నారు! వీరికి నిజానికి మరింత శ్రమ! కాబట్టి భార్య వంటపని
ఇంటిపని చేస్తుంది కాబట్టి మరింత గౌరవించాలి భార్యను!
నాల్గవది: పిల్లలను
కనడమే కాకుండా వారిని సరియైన రీతిగా పెంచాలి! భర్త సంపాదించి డబ్బులు తీసుకుని
రాగలడు గాని వారిని కనిపెడుతూ అన్నీ విషయాలలో సహకరిస్తూ పిల్లలను పెంచే భాధ్యత
ముఖ్యంగా స్త్రీలకు లేక తల్లులకు ఉంది ఇది మరిచిపోవద్దు! అలాగని పిల్లలను పెంచే
బాధ్యత పురుషులకు లేక తండ్రికి లేదు అని నేను చెప్పడం లేదు ఇద్దరిదీ భాద్యతే! గాని
స్త్రీకి ఎక్కువ భాధ్యత అంటున్నాను! ఎందుకంటే పిల్లలు తమ ఊహలు ఉద్దేశాలు
అభిప్రాయాలు తల్లితోనే ఎక్కువగా పంచుకోగలరు!!
(సశేషం)
*ఎఫెసీ పత్రిక -100వ భాగం*
*పిలుపుకు తగిన జీవితం-53*
*వివాహ వ్యవస్థ-3*
ఎఫెసీ 5: 22—33
22. స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి.
23. క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్న లాగున పురుషుడు
భార్యకు శిరస్సై యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు.
24. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలుకూడ ప్రతి
విషయములోను తమ పురుషులకు లోబడవలెను.
25. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె
క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి,
26. అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక,
పరిశుద్ధమైనదిగాను,
27. నిర్దోష మైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని
నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి,
పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను.
28. అటువలెనే పురుషులుకూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను
ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు.
29. తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును
దానిని పోషించి సంర క్షించుకొనును.
30. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై యున్నాము గనుక అలాగే
క్రీస్తుకూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు.
31. ఈ హేతువుచేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన
భార్యను హత్తుకొనును; వారిద్దరును ఏకశరీరమగుదురు.
32. ఈ మర్మము గొప్పది; అయితే నేను క్రీస్తునుగూర్చియు
సంఘమునుగూర్చియు చెప్పుచున్నాను.
33. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను
ప్రేమింప వలెను, భార్యయైతే తన భర్తయందు భయము కలిగి యుండునట్లు చూచుకొనవలెను.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! మనము పిలుపుకి తగ్గ జీవితం ఎలా జీవించాలో ధ్యానం చేసుకుంటున్నాము!
పిలుపుకి తగిన జీవితం జీవించడంలో కుటుంభ
వ్యవస్త పాత్ర కోసం ధ్యానం చేస్తున్నాము!
ఇక 22 వ వచనంలో అంటున్నారు స్త్రీలారా, ప్రభువునకువలె
మీ సొంతపురుషులకు లోబడియుండుడి. అంటూ
స్త్రీ తమ భర్తకు అన్నీ విషయాలలో లోబడి ఉండాలి అనే అంశాన్ని ధ్యానం చేస్తున్నాము!
ఇంకా
కొలస్సీ పత్రికలో అంటున్నారు
కొలస్సీయులకు 3: 18
భార్యలారా, మీ భర్తలకు విధేయులైయుండుడి; ఇది ప్రభువునుబట్టి
యుక్తమైయున్నది.
ఈ వచనంలో మొదటగా పౌలుగారు భార్యల కోసం/
స్త్రీల కోసం రాసారు. భార్యలారా! మీ భర్తలకు విధేయులైయుండుడి , ఇది ప్రభువునందు
యుక్తమై యున్నది. మొదటగా స్త్రీలను భర్తకు విధేయులై ఉండమంటున్నారు. ఎందుకు? ఇది
ప్రభువును బట్టి యుక్తమై యున్నది. ఎలా? దీనికోసం మరల మనం ఆది దంపతులు ఆదాము-హవ్వల
దగ్గరకు వెళ్ళాలి. హవ్వమ్మ సర్పము-సాతాను ద్వారా మోసగించబడి, తినవద్దన్న ఫలం తాను
తిని, తన భర్తతో కూడా తినిపించి, మానవాళికి పాపాన్ని శాపాన్ని తీసుకుని వచ్చింది.
అప్పుడు పశ్చాత్తాపపడకుండా ఆ తప్పు- సర్పము (సాతాను) మీద నెట్టాలని ప్రయత్నం చేసింది.
ఆదాముగారు హవ్వమ్మ మీదకు నెట్టారు. ఈ విధంగా హవ్వమ్మ, ఆదాముగారు, సర్పము, భూమి
శపించబడ్డారు. అప్పుడు దేవుడు హవ్వమ్మతో అంటున్నారు:
ఆదికాండం 3:16
ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి
హెచ్చించెదను; వేదనతో పిల్లలను కందువు; నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు
నిన్ను ఏలునని చెప్పెను.
చూశారా నీ భర్త
యెడల నీకు వాంఛకలుగును, అతడు నిన్ను ఏలును. ఇది దేవుడు విధించిన శిలాశాసనం. దీనిని
మార్చే అధికారం ఎవరికీ లేదు! ఇదీ వాక్యం సెలవిస్తుంది. నేను కాదు! మహిళా సంఘాలు
దీనిని గమనించాలి. అయితే దేవుని దృష్టికి స్త్రీ- పురుషుడు ఇద్దరూ సమానమే! స్త్రీ
నిర్వర్తించవలసిన విధులు—భాద్యతలు స్త్రీ
నిర్వర్తించాలి! పురుషుని భాద్యత- విధి పురుషుడు నిర్వర్తించాలి. స్త్రీ
పురుషునికి బానిస ఎంతమాత్రము కాదు!! ఇద్దరూ సమానమే! అందుకే దేవుడు ఆమెను
ప్రక్కటెముక తీసి చేశారు. ఒకవేళ స్త్రీ- పురుషునికి బానిసగా ఉండాలంటే దేవుడు బహుశా
కాలు నుండి తీసియుండునేమో!!
కాబట్టి స్త్రీ పురుషునికి లోబడి ఉండడం అనేది—ప్రభువుని బట్టి యుక్తమై
ఉన్నది! ఇదే విషయాన్ని ఎఫెసీ 5:22-24 లో వివరంగా రాసియున్నారు.
22. స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి.
23. క్రీస్తు సంఘమునకు శిరస్సైయున్న లాగున పురుషుడు భార్యకు
శిరస్సైయున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు.
24. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలుకూడ ప్రతి
విషయములోను తమ పురుషులకు లోబడవలెను. . . . . . .
స్త్రీ తన సొంత పురుషుడు అనగా భర్తకు లోబడి ఉండాలి. స్త్రీ – దేవునికి ఎలా లోబడుతుందో అలా స్త్రీ—తన భర్తకు
లోబడిఉండాలి. కొలస్సీ పత్రికలో విధేయత కలిగియుండాలి అని వ్రాయబడితే ఇక్కడ
లోబడియుండాలి అని వ్రాయబడింది. ఇంకా దీనిని క్రీస్తు—సంఘముతో
పోల్చారు. సంఘానికి శిరస్సు క్రీస్తు! పురుషునికి శిరస్సు క్రీస్తు! అలాగే
స్త్రీకి శిరస్సు- పురుషుడు! సంఘము క్రీస్తుకు లోబడినట్లుగానే స్త్రీ—ప్రతి విషయములోనూ పురుషునికి లోబడియుండాలి,. ఈ మాట జాగ్రత్తగా
గమనించాలి *ప్రతీ విషయములోను లోబడియుండాలి*. ఇదీ వాక్యం చెబుతుంది. స్త్రీ భర్తమీద
ఎట్టి పరిస్తితులలోను పెత్తనం చెయ్యకూడదు! అలా చేస్తే వాక్యవిరుద్ధము! భర్తమీద
పెత్తనం చేసిన యెజెబేలు రాణి కుటుంబం ఏమయ్యిందో మన చూడగళం రాజుల గ్రంధంలో!
పరిశుద్ధాత్ముడు ఏమి రాసినా దానిని కనీసం
రెండుచోట్ల వ్రాయించారు. ఈ విషయాన్ని మూడుచోట్ల ప్రస్తావించడం జరిగింది. అనగా ఇది పరిశుద్దాత్ముని
స్తిరమైన నిర్ణయం అన్నమాట! 1 పేతురు 3:1-6 చూసుకుంటే దీనికోసం చాలా వివరంగా
వ్రాయబడింది. అటువలె స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడియుండుడి. చూసారా ఇక్కడ కూడా
స్త్రీ—భర్తకు లోబడి యుండాలని
వ్రాయబడింది. భర్త ఎలాంటివాడైనా సరే!, అలా లోబడి ఉండినప్పుడు తన మంచి ప్రవర్తన
ద్వారా తన భర్తను రక్షించుకోగలదు అంటున్నారు. ఇంకా జడలు అల్లుకోవడం, బంగారునగలు
పెట్టుకోవడం, ఖరీదైన వస్త్రాలు ధరించుకోవడం – లాంటి షోకులు చేయడం
కాదుగాని, సాదువైన, మృదువైన గుణాలనే అక్షయాలంకారాలుగా ధరించుకోవాలి అంటున్నారు.
కాబట్టి స్త్రీలారా! మీరు ఏమి అలంకరించుకొంటున్నారు? బంగారమా? రోల్డ్ గోల్డా?
మెటలా? ఇవికాదు గాని సాధువైన, మృదువైన, భక్తిగల స్త్రీలకూ తగినట్లుగా
అక్షయాలంకారాలు ధరించుకోవాలి.
ఇంకా 6వ వచనంలో
శారమ్మ అబ్రాహాముగారిని నా యజమానుడా! అని పిలిచింది. మీరు కూడా అలా పిలిస్తే మీరు
కూడా ఆమె సంతానము అవుతారు అంటున్నారు. స్తీలారా! మీరు మీ భర్తలకు లోబడియుంటున్నారా
శారమ్మ లా! అంత ముసలమ్మ కూడా దేవదూతలు వచ్చారని అబ్రాహాముగారు రొట్టెలు కాల్చమని
చెబితే—అంతమంది పనివారున్నా భర్తమాట గౌరవించి తనే స్వయముగా రొట్టెలు చేసి
పెట్టారు ఆవిడ! దేవుడు నన్ను ఈ ఊరు వదలి వెల్లిపోమంటున్నారు, ఉదయాన్నే మనం
వెళ్ళిపోతున్నాం అంటే, ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఇలాంటి ప్రశ్నలు
అడుగకుండా భర్తను వెంబడించింది ఆ తల్లి! అందుకే ఆమె విశ్వాసులకు తల్లి అయ్యింది.
ఇలాంటి విధేయత ప్రతీ స్త్రీకి ఉండాలని పరిశుద్ధాత్ముడు పౌలుగారి ద్వారా, పేతురు
గారి ద్వారా వ్రాయించారు. శారమ్మ తనభర్తను నా యజమానుడా! అని పిలిచేది. మీరు ఏమని
పిలుస్తున్నారు మీ భర్తలను? ఒరేయ్ అనా? పేరు పెట్టా? నీ భర్తను గౌరవిస్తున్నావా ?
దూషిస్తున్నావా? వేదిస్తున్నావా? సాధిస్తున్నావా చీరల కోసం, నగలు కోసం!! శారమ్మ తన
భర్తకు లోబడింది అందుకే రాజకుమారి అని పిలువబడింది. రాణియైన వస్తి, తన భర్తకు లోబడలేదు. విందుకు
రమ్మని కబురు పెట్టినా రాలేదు. అందుకే పట్టపురాణిగా ఉండకుండా త్రోసివేయబడింది.
విడాకులు ఇవ్వబడింది. ఎస్తేరు 1; ఎస్తేరు తనభర్తకు లోబడి నడచుకొంది. తద్వారా తన
జనాంగాన్ని మరణం నుండి తప్పించింది.
అననీయ భార్య సప్పీర భర్తకు ఏం చెప్పిందో
తెలియదు. సగం దాచుకొని—సగం తెచ్చారు. దేవుని సన్నిధిలోనే చచ్చారు.
ప్రియ రక్షించబడిన స్త్రీలారా! మీ భర్తలకు
లోబడియుంటున్నారా? శారమ్మలా లోబడుతున్నారా? వస్తిలా తిరగబడుతున్నారా? ఒకసారి
మిమ్మల్ని మీరు పరిశీలించుకొనండి! మీ భర్తకు లోబడి శారమ్మ పిలిచినట్లు నా యజమానుడా
అని పిలిచి, గౌరవించి, శారమ్మ గారు పొందుకున్నట్లు దీవెనలు పొందుకోండి!
అంతేకాకుండా నగలు ధరించుకోవడంలాంటివి కాదు
గాని, అక్షయాలంకారాలు ఐన సాదువైన, మృదువైన మనస్సులను, స్వభావాలనే అలంకారాలుగా
ధరించాలని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -101వ భాగం*
*పిలుపుకు తగిన జీవితం-54*
*వివాహ వ్యవస్థ-4*
ఎఫెసీ 5: 22—33
22. స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు
లోబడియుండుడి.
23. క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్న లాగున పురుషుడు భార్యకు
శిరస్సై యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు.
24. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలుకూడ ప్రతి
విషయములోను తమ పురుషులకు లోబడవలెను.
25. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె
క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి,
26. అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక,
పరిశుద్ధమైనదిగాను,
27. నిర్దోష మైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని
నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి,
పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను.
28. అటువలెనే పురుషులుకూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను
ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు.
29. తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును
దానిని పోషించి సంర క్షించుకొనును.
30. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై యున్నాము గనుక అలాగే
క్రీస్తుకూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు.
31. ఈ హేతువుచేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన
భార్యను హత్తుకొనును; వారిద్దరును ఏకశరీరమగుదురు.
32. ఈ మర్మము గొప్పది; అయితే నేను క్రీస్తునుగూర్చియు
సంఘమునుగూర్చియు చెప్పుచున్నాను.
33. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను
ప్రేమింప వలెను, భార్యయైతే తన భర్తయందు భయము కలిగి యుండునట్లు చూచుకొనవలెను.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! మనము పిలుపుకి తగ్గ జీవితం ఎలా జీవించాలో ధ్యానం చేసుకుంటున్నాము!
పిలుపుకి
తగిన జీవితం జీవించడంలో కుటుంభ వ్యవస్త పాత్ర కోసం ధ్యానం చేస్తున్నాము! ఇక 25వ
వచనంలో అంటున్నారు పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అంటున్నారు ఎలా
ప్రేమించాలి అంటే క్రీస్తు సంఘాన్ని ప్రేమించిన విధంగా పురుషుడు స్త్రీని
ప్రేమించాలి! క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించారు అంటే అటువలె
క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, 26. అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను
లేక, పరిశుద్ధమైనదిగాను,
27. నిర్దోష మైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని
నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై
దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను.
28. అటువలెనే పురుషులుకూడ తమ సొంత శరీరములనువలె తమ భార్యలను
ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు.
ఇంకా అంటున్నారు తమ స్వంత శరీరం లాగా పురుషుడు తన భార్యను ప్రేమించాలి
అంటున్నారు! చూడండి ప్రతీ మనిషి తన శరీరాన్ని ఎంతో ప్రేమిస్తూ ఉంటారు! దీనికోసం
ఉదయాన్నే టిఫిన్, టీలు కాఫీలు, మధ్యాహ్నం బోజనం, రాత్రికి బోజనం, బిరియాణీలు మటన్
చికెన్ పఫ్ లు బూరెలూ గారెలు ఇంకా అబ్బోబ్బో చెప్పలేము! హార్లిక్స్ బోర్న్ విటా
చెత్తాచెదారం అన్నీ పెడతాము! దేనికోసం? అంటే మన దేహాన్ని పోషించుకోవడం కోసం
ఆరోగ్యం కోసం! ఇంకా జిమ్ కి వెళతాడు వ్యాయామం చేస్తాడు! ఎన్నెన్నో చేస్తారు! నీవు
నీ దేహాన్ని ఎలా ప్రేమిస్తున్నావో అలాగే నీ భార్యను కూడా ప్రేమించాలి అంటున్నారు!
ఎందుకంటే బైబిల్ చెబుతుంది వారిద్దరూ ఏక శరీరమై ఉందురు!
31 వ వచనం ఈ హేతువుచేత పురుషుడు
తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారిద్దరును ఏకశరీరమగుదురు.
కాబట్టి నీ భార్యను ప్రేమిస్తే నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే!
*ఒకవేళ నీ భార్యను
నీవు కొడితే తిడితే నిన్నునీవు కొట్టుకున్నట్లే నిన్ను నీవు తిట్టుకున్నట్లే!
అయ్యా ఒకసారి గమనించండి : ఎవడైనా తన దేహాన్ని తానే కొట్టుకుంటే లేక తన వ్రేలిని
తానే రాతితో కొట్టేసుకుంటూ ఉంటే వారు ఏమై ఉండాలి? అయితే వాడు దయ్యం పట్టిన వాడైనా
అయి ఉండాలి, లేకపోతే పిచ్చోడు అయినా అయి ఉండాలి! కాబట్టి ఇప్పుడు ఎవడైనా తన
భార్యను కొడితే, తిడితే వాడు ఈ తప్పకుండా ఈ రెండు కేటగిరీ లలో ఏదో ఒక గ్రూపు కి
చెంది ఉండాలి! పురుషులకు కోపమొస్తే రానియ్యండి నేను చెప్పేది నిజము మరియు బైబిల్
దీనికి రుజువు చెబుతుంది!*
కాబట్టి
భర్త భార్యను ప్రేమించాలి! తప్ప శిక్షించ కూడదు! ఒకవేళ ఆమె ప్రవర్తన బాగోలేక పోతే
అప్పుడు ఆమెతో మాట్లాడి ఆమెను సరిచేయాలి అంతేతప్ప ఇలా కొట్టకూడదు అని గ్రహించాలి!
(అయితే కొంతమంది స్త్రీలు తమ భర్తలను ఏమంటారో ఎలా మాట్లాడతారో తెలియదు. మరి అలాంటి
వారిని శిక్షించాలేమో నాకు పూర్తిగా తెలియదు. మా సంఘంలో ఒక స్త్రీ ఉంది. ఒకసారి అన్నయ్య
గృహ దర్శనాలకు వెళ్తే ఆమె మూతి బాగా వాచిపోయి ఉంది. ఏమ్మా మూతి అలా వాచిపోయిందే
ఎక్కడైనా పడిపోయావా అని అడిగాడంట అన్నయ్య! ఇంకేముంది అన్నయ్యా- వాడున్నాడు కదా
వాడు కొట్టేశాడు అన్నది. ఏమయ్యా ఎందుకు కొట్టేశావు మీ ఆవిడను అని అడిగితే ఆయన
చెప్పాడు: అన్నయ్యా- నేను షేవింగ్ చేసుకుంటున్నాను, అద్దం మరిచిపోయాను దయచేసి
తెచ్చి ఇవ్వు అని బాత్రూమ్ నుండి పిలిచాను! నీకు కాళ్ళు చేతులు లేవా, వెళ్ళి
తెచ్చుకో అన్నది, కొంచెం తీసుకురా అంటే గీర సమాధానం చెప్పింది, నేను వస్తే
బాగుండదు అన్నాను, నీవు మగాడివైతే వచ్చి కొట్టరా అన్నాది! నన్ను నేను తడిమి
చూసుకున్నాను, మూతిమీద మీసం, ఇంకా మగాడి కున్నవన్నీ నాకున్నాయి, వెళ్ళి
ఒక్కటిచ్చాను అంతే మూతి వాచిపోయింది అని చెప్పాడు. మరి ఇలాంటి వారిని ఏమి చేయాలో
ఎలా హేండిల్ చేయాలో మీ విజ్నతకే వదిలేస్తున్నాను!)
కాబట్టి
భర్త భార్యను ప్రేమించాలి!
ఇంతకీ భర్త భాధ్యతలు ఏమిటి?
మొదట భర్త అంటే భరించేవాడు. ఇంకా పోషించే వాడు, ఇంకా సంరక్షించే
వాడు! అనగా భార్యను పోషించాలి! భరించాలి! అనగా ఆమె సూటిపోటు మాటలు భరించాలి!
ఊరికనే ఏడ్చేస్తూ ఊరికనే ఉడికిపోతూ ఉంటుంది! ఓర్పుతో ఆమెను భరించాలి! ఆమె ప్రేమను
తట్టుకోలేం ఆమె కోపాన్ని తట్టుకోలేము! అందుకే ఆమెతో జ్ఞానంతో కాపురం చేయమని
చెబుతుంది బైబిల్! ఒక బైబిల్ పండితుడు అన్నాడు- జ్ఞానంతో కాపురం చేయడమంటే ఎక్కడో
ట్రైనింగ్ తీసుకుని పట్టా తీసుకోవడం కాదు, ఆమె చెప్పింది చేసేయడమే జ్ఞానంతో కాపురం
చేయడం! లేదంటే నీకు ఫుడ్ బెడ్ రెండూ కట్ అన్నాడు! కాబట్టి అన్నింటినీ భరించాలి!
ఇంకా ఆమెను
సంరక్షించాలి! ఆమె మానాన్ని కాపాడాలి! ఆమె ప్రాణాన్ని కాపాడాలి! ఇంకా ఆమె యొక్క
గౌరవాన్ని కాపాడాలి! ఎవరో నీ భార్యను తిడితే నీవు: నేను ఎలాగూ తిట్టలేక పోతున్నాను
వారైనా తిట్టనీ అని అనుకోగూడదు! వెంటనే ఆమెకు తోడుగా ఉండాలి! నీవు ఎవడివి రా నా
భార్యను అనడానికి అంటూ ఆమెకు సపోర్ట్ చేయాలి! అలాగని ఆమె బుద్ధిలేకుండా వివేకం లేకుండా షార్ట్ టెంపర్ తో అందరిమీద
నోరువేసుకుని పడిపోతూ ఉంటే ఆమెకు సపోర్ట్ చేయమని చెప్పడం లేదు! అప్పుడు ఆమెను సరిచేయాలి!
అలా కాకుండా ఆమె న్యాయమైన కారణంతో ఎవరితోనైనా వాదిస్తున్నా తగవాడు తున్నా ఆమెకు
వెంటనే సహాయం చేయాలి!
ఇంకా ఆమెకు కావాల్సిన ప్రతీదీ ఆమెకు తెచ్చి ఇవ్వాలి!
ఇక తర్వాత భాధ్యత:
కుటుంబాన్ని పోషించాలి! ఏదో ఒక పనిచేసి డబ్బు సంపాదించి నీ డబ్బులతో నీ భార్యను నీ
కుటుంబాన్ని పోషించాలి! ఒకవేళ నీ భార్య
ఉద్యోగం చేస్తున్నా సరే, నీవు మాత్రం నీ చేతులతో కష్టపడి లేక వ్యాపారం చేసి గాని
స్వయంగా ధనము సంపాదించి ఆ డబ్బులతోనే నీ భార్యను నీ కుటుంబాన్ని పోషించాలి. నీ
భార్య సంపాదించిన ధనమును మరో పనికి ఉపయోగించు గాని నీవు మాత్రం నీ డబ్బులతోనే నీ
భార్యను పోషించాలి! ఇది ఆదికాండంలో దేవుడు రాసిన శిలా శాసనం!!
ఇంకా చివరిది: నీ పిల్లలను సరియైన విధంగా పెంచాలి!
*మరో విషయం చెప్పనీయండి: పురుషులకు కోపం వచ్చినా పర్వాలేదు
గాని నిజాన్ని చెప్పనీయండి: కేవలం పిల్లలని పుట్టించడం, భార్యకు సంసార సుఖం ఇవ్వడం
మాత్రమే పురుషుడి విధి కానేకాదు! ఆ రెండు పంది చేయగలదు, ప్రతీ పశువు జంతువూ
చేయగలదు! మరి మగాడికి పశువుకి/జంతువుకి తేడా ఏమిటి అంటే మగాడు ఆ రెంటితో పాటుగా
భార్యను సంరక్షించాలి, పోషించాలి, పాలించాలి! కుటుంభ అవసరాలు కష్టపడి తీర్చాలి!
లేకపోతే అలాంటి పురుషునికి- పందికి లేక పశువుకి తేడా లేదు అని నా ఉద్దేశం*!!!
(సశేషం)
*ఎఫెసీ పత్రిక -102వ భాగం*
*పిలుపుకు తగిన జీవితం-55*
*వివాహ వ్యవస్థ-5*
ఎఫెసీ 5: 22—33
22. స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు
లోబడియుండుడి.
23. క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్న లాగున పురుషుడు
భార్యకు శిరస్సై యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు.
24. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలుకూడ ప్రతి
విషయములోను తమ పురుషులకు లోబడవలెను.
25. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె
క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి,
26. అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక,
పరిశుద్ధమైనదిగాను,
27. నిర్దోష మైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని
నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి,
పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను.
28. అటువలెనే పురుషులుకూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను
ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు.
29. తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును
దానిని పోషించి సంరక్షించుకొనును.
30. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై యున్నాము గనుక అలాగే
క్రీస్తుకూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు.
31. ఈ హేతువుచేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన
భార్యను హత్తుకొనును; వారిద్దరును ఏకశరీరమగుదురు.
32. ఈ మర్మము గొప్పది; అయితే నేను క్రీస్తునుగూర్చియు
సంఘమునుగూర్చియు చెప్పుచున్నాను.
33. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను
ప్రేమింప వలెను, భార్యయైతే తన భర్తయందు భయము కలిగి యుండునట్లు చూచుకొనవలెను.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! మనము పిలుపుకి తగ్గ జీవితం ఎలా జీవించాలో ధ్యానం చేసుకుంటున్నాము!
పిలుపుకి
తగిన జీవితం జీవించడంలో కుటుంభ వ్యవస్త పాత్ర కోసం ధ్యానం చేస్తున్నాము! కుటుంభ
వ్యవస్తలో పురుషుల పాత్ర కోసం చూసుకుంటున్నాము!
కొలస్సీ
పత్రికలో అంటున్నారు
కొలస్సీ 3:19
భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని
నిష్ఠూరపెట్టకుడి.
ఈ వచనంలో
అంటున్నారు పౌలుగారు: భర్తలారా! మీ భార్యలను ప్రేమించుడి. వారిని
నిష్టూరపెట్టకుడి. ఇది మాత్రమే చెప్పారు గాని, భర్తలారా! మీ భార్యలను ఏలండి,
వారిమీద అధికారం చేయండి, మాట వినకపోతే తన్నండి అని ఎంతమాత్రము చెప్పలేదు బైబిల్!
భార్యను ప్రేమించమని చెబుతుంది బైబిల్. కారణం కుటుంబంకోసం భార్య చేసినంత త్యాగం
మరొకరు చేయలేరు. అంత కష్టపడి కుటుంబాన్ని నిలబెట్టుకొస్తుంది. మామూలుగా భర్త కేవలం
డబ్బులు సంపాదించి పెడుతుంటాడు. గాని దానిని సక్రమంగా మైంటైన్ చెయ్యడం అంతా భార్య
పనే! అంతేనా, పిల్లలను, కనడం, పెంచి పెద్ద చెయ్యడం, ఇంటిల్లిపాదీకి వండి పెట్టడం,
ఇల్లు చక్కపెట్టడ్డం మామూలు విషయం కాదు. దీనికి చాలా ఓపిక, త్యాగం కావాలి. కాబట్టి
ఓ భర్తా! నీకోసం, నీ పిల్లల కోసం, నీ తల్లిదండ్రుల కోసం ఇంతపని చేసిపెడుతుంది
కాబట్టి నీ భార్యను ప్రేమించాలి, ప్రేమగా చూసుకోవాలి. లాలించాలి. మరి నీవు
ప్రేమిస్తున్నావా ప్రియ పెండ్లియైన సహోదరుడా! ఎప్పుడైనా మనఃస్పూర్తిగా నాకోసం
ఇంతకష్టపడుతున్నావు. నీకు ధన్యవాదాలు అనిగాని, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని
చెప్పావా నీ భార్యతో!!!
ఇక్కడ పౌలుగారు భర్తలారా! మీ భార్యలను *ప్రేమించుడి* అనేమాట కేవలం sex కోసం మాత్రమే ఎంతమాత్రము
చెప్పడం లేదు! ఇది గ్రీకు పదం నుండి వచ్చింది. దీని అర్ధం భార్యను అనురాగంతో
చూడండి అని!
ఇదే విషయాన్ని ఎఫెసీ
5:25-33 వరకు చాలా వివరంగా రాస్తున్నారు పౌలుగారు. పురుషులారా! మీ భార్యలను
ప్రేమించుడి. ఎలా? క్రీస్తు—తన సంఘమును
ప్రేమించినట్లు! యేసయ్య తన సంఘమును ప్రేమించి మనకోసం ఎన్ని కష్టాలు పడ్డారో
మనందరికీ తెలుసు. తన రక్తాన్ని కార్చారు, తన ప్రాణం అర్పించారు. అలాగే పురుషుడు
కూడా , తన భార్యను సంరక్షించాలి. పోషించాలి. ప్రేమించాలి. లాలించాలి.
ఆదరించాలి! 28-29
అటువలెనే పురుషులు కూడ తమ సొంత శరీరములనువలె తమ భార్యలను ప్రేమింప
బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు.
తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని
పోషించి సంరక్షించుకొనును.
కాబట్టి భర్త భార్యను
ప్రేమించాలి. ఇంకా 30వచనంలో క్రీస్తు సంఘాన్ని పోషించి, సంరక్షించినట్లు భర్త కూడా
భార్యను సంరక్షించాలి అంటున్నారు. భర్త కేవలం శారీరక సుఖం కలుగజేసి, ఆమెను
పోషించకుండా, సంరక్షించకుండా ఉంటే, ఆ వ్యక్తికి—జంతువుకు తేడా
లేదు! కారణం ఆ మాత్రం పని జంతువులూ కూడా చేస్తాయి. శారీరక ధర్మ, నెరవేర్చి-
పిల్లలు పుట్టేలా చూస్తాయి. ఇంకా తన భాగస్వామిని కొన్నిసార్లు రక్షిస్తుంటాయి.
ఒకవేళ పురుషుడు ఈ పనులు చేయకపోతే పశువుకన్నా హీనమన్న మాట! ఇక 31 వ వచనంలో
ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను
హత్తుకొనును; వారిద్దరును ఏక శరీరమగుదురు.
ఇదే విషయాన్ని ఆదికాండం 2:24 లో కూడా చెప్పారు
దేవుడు.
కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను
హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.
పౌలుగారు ఈ
విషయాన్ని చెప్పడానికి కారణం భార్య—భర్త ఒకే శరీరం! భార్య తన సొంత శరీరం కాబట్టి భర్త తన సొంత శరీరమును
ప్రేమించి, పోషించి, సంరక్షించుకొన్నట్లు—భార్యను కూడా పోషించి, ప్రేమించి, సంరక్షించాలి! ఇంకా ఇక్కడ పురుషుడు తన
తల్లిదండ్రులను వదలి తన భార్యను హత్తుకొనును అంటే—పెళ్లి అయిన మరుక్షణం నుండి
తల్లిదండ్రులను గాలికి వదిలెయ్యమని ఎంతమాత్రమూ కాదు! భార్య తనకోసం అందరిని
వదలివేసి వచ్చింది నీ కోసం. తన ఇంటిపేరును కూడా వదలివేసింది. కాబట్టి ఆమెకు ఎక్కువ
ప్రాధాన్యత ఇవ్వాలి. అదే సమయంలో నిన్ను ఇంతటివాడ్ని చేసిన నీ తల్లిదండ్రులను కూడా
పోషించాలి. అదే సమయంలో నీ తల్లిదండ్రులు ఏదో చెప్పారని నీ భార్యను నిర్లక్షపెట్టడం
గాని, ఆమెను నిష్టూరపెట్టడం కాని చెయ్యకూడదు! భార్య కన్నీరుపెట్టకుండా చూసుకోవాలి!
పౌలుగారు భార్యలేకుండా ఇన్నిమాటలు రాసారు. భార్య ఉంటే తెలుస్తుంది అనొచ్చు!
పేతురుగారు కూడా అదే రాస్తున్నారు. ఆయన తన భార్యతో పాటే సువార్త సేవలో
పాల్గొన్నారు. ఆయన అంటున్నారు: 1 పేతురు 3:7
అటువలెనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో
పాలివారైయున్నారని యెరిగి, యెక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ
ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు, జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి.
ఇక్కడ జాగ్రత్తగా పరిశీలన చేస్తే జీవము అనే
కృపావరంలో నీతోపాటే ఆమె పాలిభాగస్తురాలు!
ఏ జీవం? మామూలుగా జీవించే హక్కు! రెండవది: నూతనజీవం, నిత్యజీవం. ఈ రెంటిలోనూ ఆమె
నీతోపాటు పాలిభాగస్తురాలు. నీకు ఈలోకంలో జీవించే హక్కు ఎలా ఉందో, ఆమెకు కూడా
సమానహక్కు ఉంది. ఆమె నీ బానిస కాదు! నీకు సాటియైన సహాయంగా ఇచ్చారు దేవుడు. ఆదికాండము 2: 18
మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు;
వానికి సాటియైన సహాయమును వానికొరకు చేయుదుననుకొనెను.
కాబట్టి నీ భార్యను ప్రేమించు, గౌరవించు! ఇంకా
చూసుకుంటే ఎక్కువ బలహీనమైన ఘటమని సన్మానించు అంటున్నారు.
ఎలా
బలహీనమైన ఘటం స్త్రీ?
1) శారీరకంగా! కారణం
స్త్రీ పురుషుని కన్నా బలహీనమైనది.
2) మానసికంగా. పురుషుడు ఏమైనా అంటే ఇట్టే tap విప్పేస్తుంది.
వారికి కళ్ళల్లో వాటర్ tap ఉంటుంది. ఏమైనా అంటే వెంటనే
విప్పేస్తారు. ఆ కన్నీళ్లు చూసి పురుషుడు కరిగిపోతాడు. అలా కరగలేదు అంటే ఆ
పురుషుడు బండరాయి అన్నమాట!
3) ఇట్టే మోసపోతారు- చెప్పుడుమాటలు విని—హవ్వమ్మ
మోసపోయినట్లు.
4) వారు శరీరాస విషయంలో బలహీనులు కారు గాని, నేత్రాస, జీవపుఢంభం
విషయంలో చాలా బలహీనులు. కనబడిన ప్రతీ వస్తువు కోనేయాలని అనుకుంటుంది. ఎవరైనా మంచి చీర కొనుక్కుంటే, నగ కొనుక్కొంటే
అవి వెంటనే తనకు కూడా కావాలి అనే నేత్రాస, జీవపుఢంభము ఎక్కువ. భర్త ఎంత కష్టపడి
డబ్బులు సంపాదిస్తున్నాడో ఆలోచించని స్త్రీలు చాలామంది ఉన్నారు. మరికొంతమంది
భర్తను, పిల్లలను పట్టించుకోకుండా సీరియల్ చూడటంలో మునిగేవారు కొంతమంది. అద్దం
దగ్గర షోకులు చేసేవారు కొంతమంది. ఈ రకంగా పురుషుల కంటే వీరు బలహీనులు కాబట్టి
వారిని సన్మానించు అంటున్నారు. వారిని తిట్టి,కొట్టి, నిష్టూరపెట్టమని చెప్పడం
లేదు. మంచిమాటలతో వారిని మార్చవలసిన అవసరం ఉంది. ఆమె చేసే పనికి ఆమెను అభినందించ
వలసిఉంది. ఈ కారణాల వలన పేతురుగారు స్త్రీని బలహీనమైన ఘటం అన్నారు. స్త్రీని
ఘటముతో పోల్చారు—కారణం ఘటము—కుండ దేనికి తగిలినా
పగిలిపోతుంది. మరొక వస్తువు వచ్చి దానికి తగిలినా పగిలిపోతుంది. అలాగే స్త్రీని
కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. *హేండిల్ విత్ కేర్* అన్నమాట! ఏది అన్నా మనకే బాధ! ఏం
జరిగిగినా మనకే(పురుషులకే) బాధ! అందుకే ఆ తర్వాత మాటలలో జ్ఞానంతో కాపురం
చెయ్యమన్నారు పేతురుగారు! జ్ఞానంతో కాపురం చెయ్యడం ఎలా? దానికి ఎక్కడ ట్రైనింగ్
ఇవ్వరు కదా! ఏ బుక్స్ కూడా దొరకవు. ఒక గొప్ప ప్రసంగీకుడు దీనివిషయం ఒక జోక్
చెప్పారు. జ్ఞానంతో కాపురం చెయ్యడం అంటే ట్రైనింగ్ పొంది, పట్టా పొందడం కాదంట! ఆమె
చెప్పినట్లు చెయ్యడమే జ్ఞానంతో కాపురం చెయ్యడం. అప్పుడు కాపురంలో కలతలు ఉండవు. ఇది
జోక్ అనుకోండి. సరే ఏదిఏమైనా భార్యాభర్తలమధ్య కాపురం బాగుండాలంటే—ప్రార్ధనతో, వాక్యంతో తమ గృహాలను కట్టుకోవాలి. పరిశుద్దాత్మునికి
ప్రధమ స్థానం ఇవ్వాలి. తప్పు ఎవరు చేసినా క్షమించమని అడగాలి ఎదుటవారిని. లేకపోతే
సాతానుగాడు వారిమధ్య కమ్యూనికేషన్ గ్యాప్ సృష్టించి, దానిని మరింత జటిలం చేస్తాడు.
కాబట్టి ప్రియ భర్తలారా/ పెండ్లయిన
పురుషులారా! వాక్యం చెప్పినట్లు చెయ్యండి! మీ భార్యలను ప్రేమించండి! పోషించండి!
గాని నిష్టూర పెట్టవద్దు! వారిని దుఃఖపెట్టవద్దు! ఆజ్న అతిక్రమమే పాపము! అంటే మీ
భార్యలను నిష్టూరపెడుతున్నారు, దుఃఖపెడుతున్నారు అంటే మొదటగా మీరు పాపం
చేస్తున్నారు, రెండవదిగా మీ కుటుంబాన్ని/ మీ శరీరాన్ని మీరే పాడుచేసుకుంటున్నారు
అన్నమాట! అలాచేసి మీ కాపురంలో సమస్యలు తీసుకుని రావద్దు!
వాక్యానుసారంగా
జీవిద్దాం!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -103వ భాగం*
*పిలుపుకి తగిన జీవితం-56*
*వివావ వ్యవస్థ-6*
ఎఫెసీ 5:22—33
22. స్త్రీలారా,
ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి.
23. క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్న లాగున పురుషుడు
భార్యకు శిరస్సై యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు.
24. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలుకూడ ప్రతి
విషయములోను తమ పురుషులకు లోబడవలెను.
25. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె
క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి,
26. అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక,
పరిశుద్ధమైనదిగాను,
27. నిర్దోష మైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని
నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి,
పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను.
28. అటువలెనే పురుషులుకూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను
ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు.
29. తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును
దానిని పోషించి సంర క్షించుకొనును.
30. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై యున్నాము గనుక అలాగే
క్రీస్తుకూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు.
31. ఈ హేతువుచేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన
భార్యను హత్తుకొనును; వారిద్దరును ఏకశరీరమగుదురు.
32. ఈ మర్మము గొప్పది; అయితే నేను క్రీస్తునుగూర్చియు
సంఘమునుగూర్చియు చెప్పుచున్నాను.
33. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను
ప్రేమింప వలెను, భార్యయైతే తన భర్తయందు భయము కలిగి యుండునట్లు చూచుకొనవలెను.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! మనము పిలుపుకి తగ్గ జీవితం ఎలా జీవించాలో ధ్యానం చేసుకుంటున్నాము!
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం చేసుకుంటున్నాం! క్రైస్తవుడు పిలుపుకి తగిన జీవితం జీవించడానికి
కుటుంబ వ్యవస్థ యొక్క పాత్రను ధ్యానం చేసుకుంటున్నాము! అయితే వివాహం కోసం, పెళ్లి
ప్రసంగం చూసుకుంటున్నాము కనుక చివరగా అవసరమైన కొన్ని మాటలు చూసుకుందాం!
ప్రియులారా! ఇంతవరకు పురుషుడు ఎలా
భార్యను ప్రేమించాలి, భార్య తన భర్తకు ఎలా లోబడాలి? ఇద్దరూ వారి విధులు ఎలా
నిర్వర్తించాలి అనేవి చూసుకున్నాము!
ఇక భార్య- భర్తలు తమ
జీవితాంతము ఎలా కలసిమెలసి ఉండగలరో కొన్ని మాటలు చూసుకుందాము!
మొదటిది: దేవునికి మొదటి స్థానం ఇవ్వండి! అన్నింటిలో మొట్టమొదటి
లేక అత్యధిక ప్రాధాన్యత ప్రభువుకి ఇవ్వండి! మీ దాంపత్య బంధము స్థిరంగా
ఉండడానికి ప్రభువుమీద ఆనుకోండి! ప్రభువుని
మీ దాంపత్య జీవితానికి మీ కుటుంబానికి అధ్యక్షునిగాను నాయకుని గాను, మీ సంసార
నావకు చుక్కానిగాను, మార్గము చూపేవాని గాను చేసుకోండి! ఆయన మిమ్మును కట్టనీయండి!
మీ నిర్ణయాలు మీరు తీసుకోకుండా దేవుని డైరెక్షన్ కోసం ఎదురుచూడండి! ఇంకా ఏ నిర్ణయం
తీసుకున్నా ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకోండి!
నా చిన్ని సాక్ష్యం
పంచుకోనీయండి! నాకు వివాహమై సుమారుగా 16 సంవత్సరాలు అయ్యింది! ఇంతవరకు నేను నా
బార్యను కొట్టడం గాని తిట్టడంగాని చేయలేదు! మా బార్యభార్తలిద్దరం తగవులాడుకొని
ఒకరినొకరు దూషించు కోవడం కూడా లేదు!
దీనికి నేను గాని నా భార్య యొక్క మంచి లక్షణాలు ఎంతమాత్రము కాదు! దానికి కారణం
దేవుడే! నేను గొప్పగొప్ప దైవజనుల జీవితచరిత్రలు చదివాను! వారి వైవాహిక జీవితాన్ని
ప్రార్ధనతో మొదలుపెట్టారు అని చదివాను! అందుకే మాకు వివాహమై మొదటి రాత్రి మమ్మల్ని
గదిలోకి పంపిన వెంటనే నేనుగాని నా భార్యగాని మంచము ఎక్కలేదు! నాభార్యతో చెప్పాను,
మనము కలసి మన జీవితాంతం జీవించాలి కాబట్టి మనకు నాయకునిగా గైడ్ గాను ప్రభువుని
చేసుకుందాం! మన దాంపత్య జీవితాన్ని వైవాహిక జీవితాన్ని ప్రార్ధనతో మొదలు పెడదాం
అన్నాను! నా భార్య సరే అన్నది! వెంటనే క్రిందన మోకాళ్ళమీద ప్రార్ధనతో మా వైవాహిక
జీవితాన్ని ప్రభువుపాదాల దగ్గర మొదలుపెట్టాము! సుమారుగా మూడుగంటలు కన్నీటితో దేవుని
పాదాలు కడిగి, మా సంసారమనే నావకు మీరే నాయకులుగా నడిపించే వాడుగా, చుక్కానిగా
ఉండమని మా జీవితాలను దేవునిచేతిలో పెట్టేశాము ఇద్దరమూ కలిసి! 16 సంవత్సరాలు
అయ్యింది! జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు , కష్టాలు కన్నీరు, శోధనలు, అయినవారే చేసిన
నిందలు అవమానాలు, ఆర్ధిక ఇబ్బందులు! అయినా అన్నింటినీ నెట్టుకుని ప్రభువు చేతిలో
బాణముగా సాగిపోతుంది మా జీవితాలు! ఎన్ని ఇబ్బందులు వచ్చినా బార్యాభర్తలు మధ్య
అనురాగం ప్రేమ అభిమానం, ఒకరిపట్ల మరొకరికి నమ్మకం తగ్గలేదు, ఇంకా బలపడుతుంది!
దీనిని ఇలా చేసింది, చేస్తుంది దేవుడే! హల్లెలూయ! మా జీవితాలను వైవాహిక జీవితాన్ని
నడిపిస్తున్న దేవుడు- మీ జీవితాలను కూడా కట్టగలడు! కనుక ప్రభువుకే ప్రధమ స్థానం
ఇవ్వడం నేర్చుకోండి!
2. ఆరాధన మానవద్దు! ప్రతీ ఆదివారం మందిరానికి వెళ్లి ప్రభువుని
స్తుతించడం మానకండి! ఇంకా సంఘ సహవాసంలో మీరిరువురు బలపడండి! ఆదివారం కదా అని
బంధువులందరూ బోజనానికి పిలుస్తారు! గాని ఆదివారం మాత్రం ఎవరి ఇంటికీ వెళ్ళవద్దు!
సాధ్యమైనంత సేపు మందిరంలో గడపడానికి
ప్రయత్నం చేయండి! సాతాను గాడు దేవుని సమయాన్ని దొంగిలించడానికి ఆదివారం నాడే
బందువులు పిలువడం, ఆదివారం నాడే ఫంక్షన్ లు ఏర్పాటుచేస్తున్నారు! దయచేసి
విశ్వాసులైన వారు అందరూ ఏ ఆదివారంనాడు పెట్టుకున్న ఫంక్షన్ లకు వెళ్ళవద్దు! దానిని
ఘనము గాను పరిశుద్ధము గాను ఆచరించమని, ఇంకా ఆరోజు లోక వార్తలు చెప్పుకోకుండా,
వ్యాపారం చేసుకోకుండా గడపాలని దైవగ్రంధము సెలవిస్తుంది. కాబట్టి ఆరోజు దేవునితో
దేవుని సన్నిధిలో గడపండి!
3. వైవాహిక జీవితం
బ్రద్దలై పోడానికి ముఖ్య కారణం మీ వివాహ బంధములో మూడో వ్యక్తి రావడం! ఆ మూడో
వ్యక్తి ఎవరైనా కావచ్చు! అది అక్రమ సంబంధమైనా కావచ్చు, స్నేహితుడు,స్నేహితురాలు
కావచ్చు! లేక మీ తల్లి లేక తండ్రి కావచ్చు! ఇక సాతాను గాడు కావచ్చు! అయితే సాతాను
గాడు డైరెక్ట్ గా ఎంటర్ కాడు! వాడు అనుమానం పుట్టించో, చెప్పుడు మాటలు వినిపించో,
పలు రకాలైన ఆలోచనలు పుట్టించో, ఆత్మన్యూనతా భావం పుట్టించో భార్య భర్తలు మధ్య
కలహాలు పుట్టించి వివాహాలను పాడుచేస్తున్నాడు! దీనిని గ్రహించి ప్రార్ధనలో వాడిని
ఓడించాలి! నీ భర్తకు/భార్యకు అనుమానం,
అవమానం కలిగించే పని ఒకటి కూడా నీవు చేయకూడదు! దయచేసి మీ మొబైల్ ఫోన్ లో లాక్
గాని, పిన్ గాని పెట్టవద్దు! మీ ఫోన్ ని నీ భర్త లేక భార్య చూడనీయండి! ఒకవేళ మీకు
గత చరిత్ర ఉంటే ఉండనీయండి! గాని ఇప్పుడు మాత్రం వాటికి దూరంగా ఉండండి! నీ
భర్తకు/భార్యకు అనుమానం పుట్టించే కాంటాక్ట్ లు మీఫోన్ లో మొదట బ్లాక్ చేయండి,
తర్వాత వెంటనే డిలీట్ చేసెయ్యండి! ఇక వారితో ఎటువంటి సంబంధము కనీసం హాయ్ అనే
పిలుపు కూడా లేకుండా చూసుకోండి! గతాన్ని వదిలేయండి! వివాహం అనేది దేవునిచిత్తము
కాబట్టి క్రొత్త జీవితాన్ని ప్రారంభించండి!
ఒక ముఖ్యమైన విషయం చెప్పనీయండి! ఈ మధ్య జరిగిన సర్వే ప్రకారం మన
భారతదేశంలో భార్యాభర్తలు విడిపోవడానికి కారణం మొదటిది అత్తగారు లేక అమ్మాయి తల్లి!
రెండు: సెల్ ఫోన్, మూడు: సీరియళ్ళు
విడిపోయిన వారిలో నూటికి ఎనబై శాతం పిల్ల తల్లి వల్లనే విడిపోతున్నారు
అట! ఇది మేరేజ్ కౌన్సిలర్లు బహిరంగంగా చెబుతున్న విషయమం! వివాహం జరిగాక ఆడపిల్ల
తల్లి ప్రతీరోజూ తన కుమార్తెతో మాట్లాడు చున్నందువలనే ఇలా జరుగుతుంది అంటున్నారు!
అమ్మా! నీ కూతురుని మరొక ఇంటికి ఇచ్చాక, వారి గొడవలు వారిని పడనీయండి, ఆరోజు కూర
ఏమి వండుకుంటే నీకనవసరం, వారి ఇంట్లో ఏమి జరిగితే నీకనవసరం! పెండ్లి కుమార్తె!
దయచేసి గమనించు! నీ వివాహమైన మరుక్షణం నీ ఇంటిపేరు మారిపోయింది, నీ సొంత ఇంట్లో
ఇంతవరకు నీకున్న అన్ని అధికారాలు పోయి, నీ అత్తవారింటిలో అన్ని అధికారాలు మరియు
వారి ఆస్తికి నీవు వారసురాలవు అయ్యావు! కాబట్టి ఇప్పుడు మీ ఇంటిపేరు A అనగా నీ అత్తవారు
ఇంటిగుట్టు, B అనే
నీ తల్లిదండ్రుల ఇంటిపేరు వారికి వారికి చెప్పవద్దు! అలాగే B ఇంటిగుట్టు A ఇంటికి చెప్పవద్దు! ఏమి జరిగినా నీవు
నీభర్త చూసుకోవాలి గాని ప్రతీ చిన్నవిషయం నీ తల్లిదండ్రులకు చెప్పవద్దు! నీ
కాపురాన్ని నీవు పాడుచేసుకోవద్దు! మీరిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుని సమస్యలను
పరిష్కారం చేసుకోండి! ఈరోజులలో అందరూ చదువుకున్న వారే కనుక మాట్లాడుకోండి! ఇది
నాకు నచ్చలేదు అని చెప్పండి! నీ అత్తగాని
మామగారు గాని, నీ భర్త గాని కోప్పడితే వెంటనే వారిమీద అరవకుండా, వారు శాంతంగా
ఉన్నప్పుడు మీరు అలా మాట్లాడారు, అది నాకు నచ్చలేదు! నేను అలా ప్రవర్తించడానికి
కారణం ఇది అని వారికి అర్ధమయ్యేలా చెప్పండి! మీ అత్త వారింట్లో ఉన్న ప్రతీ సమస్య
నీ భర్తకు చెప్పండి! ఒకవేళ నీ భర్తయే సమస్య అయితే నీ తండ్రికి చెప్పండి! అయితే
గమనించవలసిన విషయం ఏమిటంటే ఇప్పుడు నీతండ్రి నిన్ను కన్న తండ్రి కాదు! నీ భర్తను
కన్న తండ్రియే ఇపుడు నీ తండ్రి! అనగా నీ భర్తే నీకు సమస్య అయితే నీ మామగారికి చెప్పాలి!
అందుకే ఇంగ్లీషులో మామగారిని ఫాదర్ ఇన్ లా అంటారు! అనగా చట్టప్రకారపు తండ్రి!
కాబట్టి ఆయనకు చెప్పుకో! నిన్ను కన్న తల్లిదండ్రులకు నీ అత్తవారి గుట్టు గాని , నీ
భాధలు గాని ఎప్పుడు చెప్పుకోవాలంటే ఇక నీవు మీ అత్తగారింట్లో గడపడం దుర్భరం,
అసాధ్యం, నీ మాన ప్రాణాలకు ముప్పు కలిగింది, ఇలాంటిస్తితిలో నీవు గత్యంతరం లేక
విడిపోవలసి వచ్చింది – అలాంటి స్థితిలో
చెప్పాలి! అంతే! గాని తొందరపడి నిర్ణయం తీసుకోకండి! ఓర్పు అనేక ద్రోహ కార్యాలను
ఆపుతుంది అని చెబుతుంది బైబిల్! ఓర్చుకుంటే తప్పకుండా నీ భర్తను గాని అత్తమామలను
గాని దేవుడు మార్చగలరు!
ఇక స్త్రీలు
ప్రతీదానికి నీ కూతురుకి ఫోన చేసి వారి అత్తవారి కబురులు అడుగకూడదు! ప్రతీ
చిన్నదానికి బట్టలు సర్దుకుని వచ్చేయ్ అని చెప్పకుండా, అమ్మా సర్దుకుని పోవాలి, ఓర్చుకోవాలి అని
చెప్పాలి అపుడే కాపురాలు నిలబడతాయి!
ఇక చివరగా క్రొత్తగా మన సంఘంలో పెళ్లి జరిగినప్పుడు ఆసంఘము ఆ దంపతుల కోసం
భారంగా ప్రార్ధన చెయ్యాలి!
కాబట్టి ప్రభువుకి ప్రాధాన్యత ఇచ్చి ఓర్పుతో మీ
కుటుంబాలు కట్టుకోండి! ఎట్టి పరిస్తితులలోను మూడవ వ్యక్తిని మీ దాంపత్య
జీవితం మద్యలోకి రానివ్వకండి!
ఆదర్శ దంపతులుగా జీవించండి!
దేవుడు
మిమ్మును దీవించును గాక!!
ఆమెన్!
*ఎఫెసీ పత్రిక -104వ భాగం*
*పిలుపుకు తగిన జీవితం-57*
*వివాహ వ్యవస్థ-6*
ఎఫెసీ 5: 22—33
22. స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు
లోబడియుండుడి.
23. క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్న లాగున పురుషుడు
భార్యకు శిరస్సై యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు.
24. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలుకూడ ప్రతి
విషయములోను తమ పురుషులకు లోబడవలెను.
25. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె
క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి,
26. అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక,
పరిశుద్ధమైనదిగాను,
27. నిర్దోష మైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని
నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి,
పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను.
28. అటువలెనే పురుషులుకూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను
ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు.
29. తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును
దానిని పోషించి సంర క్షించుకొనును.
30. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై యున్నాము గనుక అలాగే
క్రీస్తుకూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు.
31. ఈ హేతువుచేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన
భార్యను హత్తుకొనును; వారిద్దరును ఏకశరీరమగుదురు.
32. ఈ మర్మము గొప్పది; అయితే నేను క్రీస్తునుగూర్చియు
సంఘమునుగూర్చియు చెప్పుచున్నాను.
33. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను
ప్రేమింప వలెను, భార్యయైతే తన భర్తయందు భయము కలిగి యుండునట్లు చూచుకొనవలెను.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! మనము పిలుపుకి తగ్గ జీవితం ఎలా జీవించాలో ధ్యానం చేసుకుంటున్నాము!
పిలుపుకి
తగిన జీవితం జీవించడంలో కుటుంభ వ్యవస్త పాత్ర కోసం ధ్యానం చేస్తున్నాము! కుటుంభ
వ్యవస్తలో పురుషుల పాత్ర కోసం చూసుకుంటున్నాము!
ఇక
ఈ వివాహ బంధంలో సంఘము- క్రీస్తు విషయాలను చూపిస్తున్నారు పౌలుగారు. వాటికోసం
క్లుప్తంగా చూసుకుందాం!
23వ వచనంలో క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్న లాగున పురుషుడు
భార్యకు శిరస్సై యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు అంటున్నారు
“రక్షకుడు”– క్రీస్తే నిజ సంఘాన్ని ప్రమాదాలనుంచి
విడిపించేవాడు, కాపాడేవాడు. “శిరస్సు”– అంటే స్త్రీలు పురుషులకన్నా తక్కువ అని కాదు. దేవుడు
తన మహా జ్ఞానం చొప్పున కుటుంబంలోను, సమాజంలోను ఈ క్రమాన్ని ఏర్పరిచాడు. విశ్వాసులు
ఈ క్రమాన్ని అనుసరించాలని కోరుతున్నారు.
1 కోరింథీ 11 వ అధ్యాయం లో
3. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు
పురుషు డనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసి కొనవలెనని కోరుచున్నాను.
8. ఏలయనగా స్త్రీ పురుషునినుండి కలిగెనే గాని పురుషుడు
స్త్రీనుండి కలుగలేదు.
9. మరియు స్త్రీ పురుషునికొరకే గాని పురుషుడు స్త్రీకొరకు
సృష్టింప బడలేదు.
10. ఇందువలన దేవదూతలనుబట్టి అధికార సూచన స్త్రీకి తలమీద
ఉండవలెను.
11. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు
పురుషునికి వేరుగా స్త్రీలేదు.
12. స్త్రీ పురుషునినుండి ఏలాగు కలిగెనో ఆలాగే పురుషుడు
స్త్రీ మూలముగా కలిగెను, గాని సమస్తమైనవి దేవునిమూలముగా కలిగియున్నవి.
ఇక
24 వ వచనంలో 24. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా
భార్యలుకూడ ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను.
“అన్ని విషయాలలో”– భార్యాభర్తలిద్దరూ విశ్వాసులై,
ఇద్దరూ ప్రభువుకు లోబడి ఉండే స్థితిని గురించి పౌలు మాట్లాడుతున్నారు. ఒక భర్త తన
భార్యను దేవుని వాక్కుకు లేక ఆమె అంతరాత్మకు
వ్యతిరేకంగా ఏమైనా చేయమంటే ఆమె చెయ్యకూడదు. పాపం చెయ్యవలసి వచ్చే
పరిస్థితుల్లో కూడా భర్తకు లోబడాలని దేవుడు చెప్పలేదు. దేవుని వాక్కులో విధించిన
సూత్రాలు చూడండి.
ఇక 26. అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక,
పరిశుద్ధమైనదిగాను,
27. నిర్దోష మైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని
నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి,
పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను.
ఇక్కడ సంఘం కోసం క్రీస్తు చేసిన వన్నీ ఇక్కడ ఎత్తి రాస్తున్నారు! క్రీస్తు
సంఘము కోసం కళంకమైనా ముడత యైన అట్టిది ఏదైనా లేకుండా ఉండాలని ఇంకా నిర్ధోష
మైనదానిగా ఇంకా మహిమ గలదానిగా ఉండాలని వాక్యముతో ఉదక స్నానం చేత సంఘాన్ని పవిత్ర
పరచి పరిశుద్ధ పరచడానికి దేవుడు తనకుతానుగా అర్పించుకున్నారు అంటున్నారు! యోహాను గారు కూడా 3:16 లో అంటున్నారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను
కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతీవాడును
నశింపక నిత్యజీవం పొందేలా ఆయనను అనగా కుమారుడైన ఏసుక్రీస్తును ఈలోకమునకు పంపించెను
అంటున్నారు! ఫిలిప్పీ పత్రిక 2 లో ఆయన సంఘాన్ని ప్రేమించి ఎంతగా తగ్గించుకున్నారో
చెబుతున్నారు
2: 5. క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును
కలిగియుండుడి.
6. ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా
ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని
7. మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని,
తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.
8. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము
పొందునంతగా, అనగా సిలువమరణము పొందు నంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను
తగ్గించుకొనెను.
ఇంకా రోమా పత్రికలోనూ కోరింథీ పత్రికలోనూ యేసుక్రీస్తుప్రభులవారు దేవునికి
మానవునికి మధ్యలో ఉన్న అడ్డుగోడను అనగా పాపము ద్వారా మరియు ధర్మశాస్త్రం వలన
దేవునికి మానవునికి మధ్యలో ఉన్న అడ్డుగోడను ఏవిధంగా బ్రద్దలు చేశారో వివరంగా
రాస్తున్నారు! క్రీస్తు రక్తంతో మానవునికి దేవునికి మధ్యలో ఉన్న తెర అనగా పరిశుద్ధ
స్థలాన్ని అతిపరిశుద్ద స్థలమును వేరుచేస్తున్న తెరను దేవుడు ఆ సిలువమీద తీసివేసి
కొట్టివేసి మనకు విమోచనం దయచేశారు! అందువలనే మనము పరిశుద్దులుగా తీర్చబడ్డాము అని
చెబుతున్నారు!
ఇక 31. ఈ హేతువుచేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన
భార్యను హత్తుకొనును; వారిద్దరును ఏకశరీరమగుదురు.
32. ఈ మర్మము గొప్పది; అయితే నేను క్రీస్తునుగూర్చియు
సంఘమునుగూర్చియు చెప్పుచున్నాను.
33. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను
ప్రేమింప వలెను, భార్యయైతే తన భర్తయందు భయము కలిగి యుండునట్లు చూచుకొనవలెను
అంటున్నారు.
ఆధ్యాత్మికంగా
క్రీస్తుతో ఐక్యత కావడానికి వ్యక్తులు తమ తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని,
తమకున్నదానంతటినీ, తమను కూడా కాదని చెప్పి ఆయనదగ్గరికి వస్తారు. వారు ఆయనతో ఒకే
ఆత్మ అవుతారు ఇదీ ఆధ్యాత్మిక అర్ధం దీనిలో
(1 కోరింథీయులకు 6:17; మత్తయి 4:18-22; మత్తయి 10:37-39; లూకా 14:26-27,
లూకా 14:33). భర్తను క్రీస్తుకు సాదృశ్యంగా లేక చిహ్నంగా, అతని భార్యను సంఘానికి
చిహ్నంగా ఎంచి పౌలుగారు ఇక్కడ
మాట్లాడుతున్నారు . 2 కోరింథీయులకు 11:2; యోహాను 3:28-29; ప్రకటన గ్రంథం
19:7
ఇక
33. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తననువలె తన
భార్యను ప్రేమింప వలెను, భార్యయైతే తన భర్తయందు భయము కలిగి యుండునట్లు చూచుకొనవలెను.
దీని అర్ధం భర్త తన భార్య గౌరవాన్ని చూరగొనే రీతిలో మెలగాలనీ, భార్య తన భర్త
ప్రేమకు అర్హురాలుగా నడుచుకోవాలనీ పౌలుగారు మరియు పరిశుద్ధాత్ముడు
అభిప్రాయపడుతున్నారు!
కాబట్టి
అట్టి రీతిగా మనం నడుచుకుందాం!
మన కుటుంబాలు కట్టుకుందాం!
ఆమెన్!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -105వ భాగం*
*పిలుపుకి తగిన జీవితం-58*
ఎఫెసీ 6:1--3
1. పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు
విధేయులైయుండుడి; ఇది ధర్మమే.
2.నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము,
3. అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడ వగువుదు, ఇది వాగ్దానముతో
కూడిన ఆజ్ఞలలో మొదటిది.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! క్రైస్తవుడు పిలుపుకి
తగిన జీవితం జీవించడానికి కుటుంబ వ్యవస్థ యొక్క పాత్రను ధ్యానం చేసుకుంటున్నాము!
5వ
అధ్యాయంలో భార్యాభర్తలు కోసం చెప్పారు. ఇక ఆరవ అధ్యాయంలో కుటుంభ వ్యవస్థలో పిలువబడిన పిలుపుకి తగినట్లుగా మొదటగా పిల్లలు
తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి అనేది, తండ్రులు పిల్లల పట్ల ఎలా ప్రవర్తించాలి
అనేది చెబుతున్నారు!, ఇంకా రక్షించబడిన దాసులు
యజమానుల పట్ల ఎలా ఉండాలి, యజమానులు దాసుల పట్ల ఎలా ఉండాలి అనేది పిలువబడిన
పిలుపుకి తగినట్లుగా ఎలా నడుచుకోవాలి అనేది ముఖ్యంగా ఈ ఆరవ అధ్యాయంలో చూసుకోగలము!
ఈరోజు పిల్లలు
తమ తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి అనేది చూసుకుందాము! ఇక్కడ మొదట వచనంలో పిల్లలారా
ప్రభువునందు మీ తల్లిదండ్రులకు లోబడి ఉండాలి అంటున్నారు! అనగా ప్రతీ పిల్లలు తమ తల్లిదండ్రులకు
లోబడి ఉండాలి అని అర్ధం! అలాచేస్తే ఇది ధర్మమే అనిచెబుతూ అలా లోబడి ఉంటె మీరు
ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నారు అంటున్నారు! ఎందుకంటే ధర్మశాస్త్రంలో నీకు
మేలు కలుగునట్లు నీ తల్లిని తల్లిని సన్మానించుము అని వ్రాయబడింది అంటున్నారు!
ఎక్కడ వ్రాయబడింది అంటే నిర్గమ కాండం 20:12 లోను, ద్వితీ 5:16 లోను వ్రాయబడింది!
కాబట్టి క్రైస్తవ పిల్లలు తప్పకుండా తమ తల్లిదండ్రులకు లోబడి ఉండాలి! ఎందుకంటే
దేవుడు ఇచ్చిన ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ అంటున్నారు! ఈ ఆజ్ఞ సామాన్యమైనది కాదు
వాగ్దానముతో కూడిన ఆజ్ఞ అంటున్నారు! ఏమి వాగ్ధానము దాగి ఉంది దీనిలో అంటే: నీవు
దీర్ఘాయుష్మంతుడవు కావాలి అంటే నీ తల్లిదండ్ర్రులకు లోబడి ఉండాలి అనిచెబుతుంది బైబిల్!!!
కొలస్సీ
పత్రికలో అంటున్నారు:
కొలస్సీ 3:20
పిల్లలారా, అన్ని విషయములలో మీ తలిదండ్రుల మాట వినుడి; ఇది
ప్రభువునుబట్టి మెచ్చుకొనతగినది.
ఈ వచనంలో పిల్లలారా! అన్ని విషయాలలో మీ తల్లిదండ్రుల
మాట వినుడి అంటున్నారు. ఎందుకు? ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది అంటున్నారు.
కొన్ని ప్రతులలో ఈ మాట: అది దేవునికి సంతోషకరం అని తర్జుమా చేయబడింది. పిల్లలు—తల్లిదండ్రుల మాటలు వినడం
దేవునికి సంతోషం అంట! ఇక్కడ పౌలుగారు పిల్లలారా! మీ తల్లిదండ్రుల మాట వినుడి అనడం
లేదు—అన్ని విషయాలలోనూ మీ తల్లిదండ్రుల మాట వినుడి అంటున్నారు. కొన్ని విషయాలలో
వినండి, కొన్ని విషయాలలో వినొద్దు అనడం లేదు. మీకు నచ్చితే వినండి, నచ్చకపోతే
వినవద్దు అనడం లేదు! నచ్చకపోతే తల్లిదండ్రుల మీద తిరగబడండి అనడం లేదు బైబిల్!
*అన్ని విషయాలలోనూ తల్లిదండ్రుల మాట వినాలి* అని చెబుతుంది బైబిల్! ఈ కాలంలో
పిల్లలు (క్రైస్తవ పిల్లలు/ మారుమనస్సు చెందినవారు కూడా) అన్ని విషయాలలోనూ
తల్లిదండ్రుల మాట వింటున్నారు గాని తమ వివాహం విషయంలో వినడం లేదు! తమకు నచ్చినవారినే/
ప్రేమించినవారినే చేసుకుంటానని పట్టుపడుతున్నారు. చివరకు అనుభవిస్తున్నారు. ప్రియ
తమ్ముడు/ చెల్లీ! ఇది వాక్య విరుద్ధమని మరచిపోవద్దు!
సంసోను గారు నాజీరు చేయబడిన వాడు
దేవునికి; ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి/ జడ్జ్! అయినా తన పెళ్లి విషయంలో
తల్లిదండ్రులమాట వినకుండా తిరుగబడ్డారు. ఏమయ్యింది? పెళ్లి పెడాకులయ్యింది.
జీవితాంతం ఒంటరిగా మిగిలిపోవాల్సి వచ్చింది. చివరి దినాలలో అక్రమ సంభంధాలలో మునిగి
దిక్కులేని చావు చావాల్సి వచ్చింది.
కాబట్టి
ప్రియ యవ్వనజనమా! దయచేసి మీ తల్లిదండ్రుల మాట వినండి అన్ని విషయాలలోనూ! ఈలోకంలో మీ
బాగు కోరేవారు ఎవరైనా ఉన్నారా అంటే నిజంగా మీ తల్లిదండ్రులే! మీకు బాగోలేక పోయినా,
మీరు ఎట్టి గడ్డు పరిస్తితులను ఎదుర్కొన్నా అన్నివేళలా మీతో ఉండి, సహాయం చేసేది మీ
తల్లిదండ్రులు మాత్రమే! వారు మీకోసం దేవునిచేత పంపబడిన Protecting
Angles.
ఎఫెసీ పత్రిక 6:1-3 లో ఇదే విషయాన్ని పౌలుగారు చాలా వివరంగా
రాస్తున్నారు.
1. పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు
విధేయులైయుండుడి; ఇది ధర్మమే.
2. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము,
3. అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడ వగువుదు, ఇది
వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. చూశారా,
తల్లిదండ్రులకు లోబడండి అది ధర్మమే! అంటున్నారు. అంతేకాదు ధర్మశాస్త్రప్రకారం నీ
తల్లిని తండ్రిని సన్మానిస్తే ఎక్కువ కాలం బ్రతుకుతావు. మరి ప్రియ తమ్ముడా!
చెల్లీ! మీ తల్లిదండ్రుల మాట వింటున్నావా?
బైబిల్
గ్రంధం నుండి తల్లిదండ్రుల మాట వినిన వారి జీవితాలు ఎలా ఆశీర్వదింప బడ్డాయో, మాట
వినని వారు ఏమయ్యారో చూద్దాం!
1). *ఇస్సాకు గారు*: తన తండ్రిమాట జవదాటలేదు! తన తండ్రి—తనను బలి అర్పించబోతున్నాడు అని తెలిసినా, అనగా తన
కన్నతండ్రి తనను చంపెయ్యబోతున్నాడు దేవుని అర్పణకోసం అని తెలిసినా, తండ్రికి
లోబడి, గౌరవించారు. అందుకే బైబిల్ గ్రంధంలో 100% ఆశీర్వదింపబడిన వారు ఎవరైనా
ఉన్నారంటే అది కేవలం ఇస్సాకు గారు మాత్రమే!
2) *యోసేపు*- తన తండ్రిమాటకు లోబడినందువలన అనేక కష్టాలు
పడ్డారు. చివరికి ఐగుప్తు దేశానికి గవర్నర్ కాగలిగారు!
3) *దావీదుగారు*: తన తండ్రిమాట జవదాట లేదు. చివరికి
ఇశ్రాయేలు దేశానికి చక్రవర్తి కాగలిగారు.
4) ఎస్తేరు- తన అన్న – ఎలియాస్
పెంపుడు తండ్రి మాట విన్నది—127
సామ్రాజ్యాలకు మహారాణి అయ్యారు.
5) *యేసుప్రభులవారు*: తన బాల్యంలో తన తల్లిదండ్రుల మాటకు
లోబడ్డారు. సృష్టికర్తే, దేవునికుమారుడే గాని ఈ భూలోకంలో పుట్టినందువలన తన
తల్లిదండ్రుల మాటకు లోబడ్డారు అని వ్రాయబడింది.లూకా 2: 51
అంతట ఆయన వారితో కూడ బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి
*లోబడి యుండెను*. ఆయన తల్లి ఈ సంగతులన్నిటిని తన హృదయములో భద్రము చేసికొనెను.
అందుకు ప్రతిఫలం 52 .
యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల
దయ యందును వర్ధిల్లు చుండెను.
చూశారా!
యేసుప్రభులవారే తన తల్లిదండ్రులకు లోబడ్డారు, అలాంటప్పుడు నీవు నేను ఆఫ్టరాల్ ఎంత?
ప్రియ తమ్ముడా! యేసయ్యకంటే నీవు గొప్పవాడివి కాదు అని నాఅభిప్రాయం. ప్రియ చెల్లి!
నీవు ఇస్సాకుగారికంటే, యోసేపు గారి కంటే, దావీదు గారికంటే గొప్పదానివి కాదు అని
అనుకుంటున్నాను. కాబట్టి తప్పకుండా మీ తల్లిదండ్రుల మాట ప్రతీ విషయములోనూ
వినవలసిందే! ఇదీ వాక్యం సెలవిస్తుంది!
సంసోను తన తల్లిదండ్రుల
మాట విననందున ఏమయ్యిందో మీదన ధ్యానించాము. దీనా తన తల్లిదండ్రుల మాట వినక ఊరిలో
షికార్లు కొట్టడానికి వెళ్లి బలాత్కరించబడింది. చిన్నకుమారుడు తన తండ్రిమాట
వినలేదు—దూరదేశం పోయాడు, ఏమయ్యింది? పందులపొట్టు తిందామన్న దొరకలేదు.
ప్రియ యవ్వనుడా!
యవ్వనురాలా! నీకు దేవుని ఆశీర్వాదం కావాలా? నీకు దేవుడు నియమించిన ఆయుష్కాలం
బ్రతకాలా? అయితే నీ తల్లిదండ్రుల మాట విను! వారికి లోబడు! అన్ని విషయాలలోనూ వారి
మాట జవదాటకూడదు! అలా కాకుండా తల్లిని దూషించి, తండ్రిమాట వినవా? అయితే నీ కన్నులు
లోయకాకులు పీకును అని సెలవిస్తుంది బైబిల్. సామెతలు 30: 17
తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ
కాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును.
వాని దీపం చీకటిలో ఆరిపోతుంది జాగ్రత్త!సామెతలు 20: 20
తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారుచీకటిలో
ఆరిపోవును.
అర్దాయుస్సుతోనే పోతావు జాగ్రత్త!
ఇక్కడ
నన్ను మరోమాట జోడించనీయండి: ఈ వచనంలో అనగా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు లోబడి
ఉండండి అంటున్నారు- సంఘములో ప్రతీ విశ్వాసికి ప్రభువులో తల్లిదండ్రులు మీసంఘకాపరి
మరియు పాష్ట్రమ్మ గారు! కాబట్టి ప్రతీ విశ్వాసి నీ సంఘకాపరికి లోబడి ఉండాలి అని
కూడా ఇక్కడ అర్ధం వస్తుంది అని నా ఉద్దేశం!!!
కాబట్టి
నీముందు మేలు—కీడు ఉంచబడింది.
ఏం
కావాలో నీవే కోరుకో!
జీవమా?
మరణమా?
ఆశీర్వాదమా?
శాపమా?
నిర్ణయించుకో!
దైవాశీస్సులు!
ఆమెన్!
*ఎఫెసీ పత్రిక -106వ భాగం*
*పిలుపుకి తగిన జీవితం-59*
ఎఫెసీయులకు 6:4
తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క
శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! క్రైస్తవుడు పిలుపుకి
తగిన జీవితం జీవించడానికి కుటుంబ వ్యవస్థ యొక్క పాత్రను ధ్యానం చేసుకుంటున్నాము!
ఇక
తర్వాత తండ్రి తమ పిల్లల పట్ల ఎలా నడుచుకోవాలి అనే విషయాన్ని చెబుతున్నారు
పౌలుగారు!
తండ్రులారా
మీ పిల్లలకు కోపమురేపక ప్రభువుయొక్క శిక్షలోను భోధలోను వారిని పెంచమంటున్నారు!
కొలస్సీయులకు 3: 21
తండ్రులారా, మీ పిల్లల మనస్సు క్రుంగకుండునట్లు వారికి
కోపము పుట్టింపకుడి.
ప్రియదైవజనమా! ఇంతవరకు మనం క్రైస్తవ కుటుంబంలో
భర్త, భార్య, పిల్లలు ఎలా నడచుకోవాలో వాక్యానుసారంగా ధ్యానం చేసుకున్నాం. ఈ రోజు
పిల్లల పట్ల తండ్రి ఎలా ప్రవర్తించాలి అనేది చూసుకుందాం!
ఈ వచనంలో
తండ్రులారా! మీ పిల్లల మనస్సు క్రుంగకుండునట్లు వారికి కోపం పుట్టించవద్దు! మొదటగా
పురుషుడు—భర్తగా తన భార్యపట్ల
ఎలా నడచుకోవాలో వ్రాసారు పౌలుగారు. తర్వాత తండ్రిగా – తన
పిల్లలపట్ల నడవాల్సిన విధానం రాస్తున్నారు.
మామూలుగా చూసుకుంటే పిల్లలు తండ్రితో కన్నా, తల్లితోనే
ఎక్కువగా మమేకమై ఉంటారు. కుమార్తెలు తండ్రిని ఎక్కువగా ప్రేమిస్తుంటారు. తండ్రికి
పిల్లలపై చాలా ప్రేమ ఉంటుంది గాని దానిని మామూలుగా పైకి చూపించరు. అది మంచిదే! ఏ
తండ్రియైతే పిల్లలపట్ల ఎక్కువ ప్రేమ/ శ్రద్ధ చూపిస్తారో ఆ పిల్లలు బాగా
పెరుగుతారు. అయితే ఆ ప్రేమ—ముద్దుల పాలు
పెరిగి – గారాభంగా మారకూడదు! ఎప్పుడైతే గారాభంగా మారుతుందో ఆ
కుమారుడు/ కుమార్తె 100% చెడిపోతారు! పిల్లలను ప్రేమించాలి గాని అతిగా ఉండకూడదు!
ఇక్కడ తండ్రులారా!
మీ పిల్లల మనస్సు క్రుంగకుండా వారికి కోపం పుట్టించవద్దు అంటే పౌలుగారి అర్ధం – వారు తల్లిదండ్రుల మాట వినకపోయినా, తల్లిదండ్రుల కోపం
రేపినా, సర్దుకొని, ఓర్చుకుని, పిల్లలకు మాత్రం కోపం పుట్టించవద్దు అని ఎంతమాత్రము
కాదు! అదే పరిశుద్ధాత్ముడు సామెతలు గ్రంధంలో ఏమని వ్రాయించారు?
బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు
పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు.
సామెతలు
22:6; ఇంకా బెత్తము వాడమని చెబుతుంది బైబిల్.
సామెతలు 29:15.
బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును అదుపులేని బాలుడు
తన తల్లికి అవమానము తెచ్చును.;
సామెతలు 22:15
బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును
శిక్షాదండము దానిని వానిలోనుండి తోలివేయును.;
సామెతలు 6:20
నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము నీ తల్లి ఉపదేశమును
త్రోసివేయకుము.
కాబట్టి పిల్లలను శిక్షాదండముచేత పెంచమని
బైబిల్ చెబుతుంది! అయితే ఆ శిక్షాదండము హిట్లర్ లాగ, నియంతలాగ ఉండకూడదు.
ప్రేమించేటప్పుడు ప్రేమించాలి, దండించవలసినప్పుడు దండించాలి. వారికి కోపం
పుట్టించకుండా వారికి అర్ధంఅయ్యేలా వివరిస్తూ, లాలిస్తూ, నచ్చచెప్పాలి.
పూర్వకాలంలో
ఇశ్రాయేలు దేశంలో ఒక విధానం ఉండేదట, ఇప్పుడు ఉందో లేదో తెలియదు. పిల్లలను
పెంచాల్సిన విధానం:
0—3 years: Treat them like Angels of
God;
4—13 years: Treat them as your
students;
14—17 years: Treat them like servants;
18—till marriage: Treat them as your
close friends.
కాబట్టి
పిల్లలు చిన్నతనములో వారికి శిక్షాబుద్ధులు నేర్పించాలి. మంచి—మర్యాద నేర్పించాలి. కొద్దిగా ఎదిగాక పనులు నేర్పించాలి.
నేటికాలంలో తల్లులు తమ కుమార్తెలకు వంట—వార్పూ
నేర్పడం లేదు. ముద్దు చేస్తున్నారు, లేదా ఎల్లప్పుడూ చదువు, చదువు అంటున్నారు.
కనీసం బైబిల్ జ్ఞానం, ప్రార్ధన చేసే విధానం కూడా నేర్పడం లేదు. ఇక పెళ్ళయ్యాక – వంట వార్పూ చేతకాక—భర్తతో,
అత్తమామలతో చీవాట్లు తినాల్సివస్తుంది. కాబట్టి దయచేసి మీ పిల్లలకు పనులు
నేర్పించండి. పిల్లలు పెద్దవారు అయ్యాక, వారిని ప్రేమతో స్నేహితులులా ఆదరించండి.
మీ పట్ల భయం పోగొట్టండి. బయట లోకంలో పొంచిఉన్న ప్రమాదాలు, ఆపదలు వివరించండి.
త్రాగుడు, జూదం, సినిమాలు, షికార్లు, చెడు స్నేహం, ప్రేమ వలన కలిగే నష్టాలు
ప్రేమతో వారికి అర్ధం అయ్యేలా వివరించండి.
*తండ్రులారా! ఎల్లప్పుడూ మీ డబ్బులు గొడవ మానేసి, ఇంటికి
వచ్చిన వెంటనే మీ పిల్లలకు కొంచెం time ఇవ్వండి. వారితో ప్రేమగా
గడపండి. తల్లులారా! అస్తమాను మీ పనికిమాలిన సీరియల్లో మునుగకుండా, మీ పిల్లలను
పట్టించుకోండి. వారికి మంచి బుద్దులు నేర్పించండి*.
అందుకే ఎఫెసీ 6:4 లో
తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క
శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.
ప్రభువుయొక్క
శిక్షలోను, భోధలోను వారిని పెంచండి అంటున్నారు. చిన్నప్పటి నుండి వారికి ప్రార్ధన,
వాక్యం నేర్పిస్తే, వాక్యానుసారంగా జీవించడం నేర్పిస్తే, వారు పెద్దవారు అయ్యాక
దానినుండి తొలగిపోక ఆశీర్వాదకరమైన జీవితాలు జీవిస్తారు. ఒకవేళ చెడు స్నేహితుల
వాళ్ళ తప్పుడు దారి పట్టిన, మీ ప్రార్ధన వలన, వారి గుండెల్లో ఉన్న వాక్యం వలన
తప్పకుండా వారు మారుమనస్సు పొంది, రక్షణ పొందుతారు. వాక్యం వారిని సన్మార్గంలోనికి
నడిపించగలదు!
కాబట్టి మీ పిల్లలకు
వాక్యం నేర్పించండి. శిక్షలోను, భోధలోను పెంచండి. చిన్నకుమారుడ్ని ఆ తండ్రి
ముద్దుగా గారభంగా పెంచడం వలన ఒకరోజు ఆస్తిలో వాటా తీసుకొని, చెడుస్నేహాలు పట్టి,
వేశ్యలతో తన ఆస్తిమొత్తం ఆర్పేసి, భికారి వాడు అయిపోయాడు. 12 మంది సహోదరులకు
ఒక్కర్తే సోదరి కదా అని సోదరులు, ఒక్కర్తే కూతురు కదా అని తల్లిదండ్రులు ఎక్కువ ముద్దు చేసారు దీనాను. ఏమయ్యింది?
పరాయిఊర్లో షికారుకు వెళ్ళింది. ఆ రాజుకొడుకు ఆమెను పట్టుకొని బలాత్కరించాడు.
కాబట్టి మీ పిల్లలను శిక్షలో పెంచండి. ముద్దు చెయ్యవద్దు! వాక్యపువెలుగులో
పెంచుతూ, వాక్యపువెలుగులో నడిపించండి. ప్రార్ధన నేర్పించండి. అప్పుడు నీ ఇంట్లో ఒక
సమూయేలు లేస్తాడు, ఒక దావీదు లేస్తాడు. ఒక దానియేలు లేస్తాడు. ఒక ఏలీయా, ఒక ఎలీషా,
ఒక పేతురు, ఒక పౌలు, ఒక ఎస్తేరు, ఒక మిర్యాము, ఒక దెబోరా, ఒక ప్రిస్కిల్లా మీ గృహం
నుండే తయారు చేసి, దైవరాజ్య వ్యాప్తికి సహకరించగలరు. లేకపోతే ముద్దుచేసి-- ఈ దేశానికి పట్టిన దరిద్రులు – ఓ లంచగొండి, ఓ బద్దకస్తుడు, ఓ త్రాగుబోతు, ఒక వ్యభిచారి . . . వీళ్ళను మీరే తయారు చేస్తున్నారు.
కాబట్టి
తండ్రులారా! నేడే నిర్ణయించుకోండి. వాక్యానుసారమైన జీవితం మీరు జీవించి, మీ
పిల్లను వాక్యపు వెలుగులో పెంచండి.
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -107వ భాగం*
*పిలుపుకి తగిన జీవితం-60*
ఎఫెసీ
6:5—8
5.
దాసులారా, యథార్థమైన హృదయముగలవారై భయముతోను
వణకుతోను క్రీస్తునకువలె, శరీర విషయమై మీ యజమానులైనవారికి విధేయులైయుండుడి.
6. మనుష్యులను సంతోషపెట్టువారు చేయునట్లు, కంటికి కనబడుటకే
కాక, క్రీస్తు దాసులమని యెరిగి, దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు,
7. మనుష్యులకు చేసినట్టుకాక ప్రభువునకు చేసినట్టే
యిష్టపూర్వకముగా సేవచేయుడి.
8. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ
సత్కార్యముచేయునో దాని ఫలము ప్రభువువలన పొందునని మీరెరుగుదురు.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! క్రైస్తవుడు పిలుపుకి
తగిన జీవితం జీవించడానికి కుటుంబ వ్యవస్థ యొక్క పాత్రను ధ్యానం చేసుకున్నాము! ఇక
రక్షించబడిన దాసులు పిలువబడిన పిలుపుకి
తగినట్లుగా తమ యజమానులు పట్ల ఎలా ఉండాలి? యజమానులు దాసుల పట్ల ఎలా ఉండాలో
చూసుకుందాం!
5వ వచనం నుండి అంటున్నారు దాసులారా
యదార్ధమైన హృదయంతో భయముతోను వణుకు తోనూ క్రీస్తుకి మీరు ఎలా లోబడుతున్నారో అలాగే
శరీరం విషయంలో మీ యజమానులకు లోబడి ఉండండి అంటున్నారు! ఇంకా ఆరవ వచనంలో మీరుచేసేది
మనుష్యులకు చేసినట్లు కాక, మీరు మొదట క్రీస్తుకు దాసులు అనిగుర్తెరిగి ఇది మీ పట్ల
దేవునిచిత్తము అని గ్రహించి మనఃపూర్వకముగా పనిచేయండి ఎలా చేయమంటున్నారు అంటే మీరు
చేసేది మనుష్యులకు చేస్తున్నాము అని ఆలోచించకుండా నేను దేవునికి చేస్తున్నాను అని
తలంచి అప్పుడు చేయండి అంటున్నారు!
కొలస్సీ
పత్రికలో కూడా ఇదే రాశారు:
కొలస్సీ 3:22-25
22. దాసులారా, మనుష్యులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి
కనబడవలెనని కాక, ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణగలవారై, శరీరమునుబట్టి మీ
యజమానులైనవారికి అన్ని విషయములలో విధేయులైయుండుడి.
23. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని
యెరుగుదురు గనుక,
24. మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు
నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులైయున్నారు.
25. అన్యాయము చేసినవానికి తాను చేసిన అన్యాయముకొలది మరల
లభించును, పక్షపాతముండదు.
3:22 దాసులారా,
మనుష్యులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలెనని కాక, ప్రభువునకు భయపడుచు
శుద్ధాంతఃకరణగలవారై, శరీరమునుబట్టి మీ యజమానులైనవారికి అన్ని విషయములలో
విధేయులైయుండుడి. చూశారా, దాసులారా
అంటున్నారు. అనగా బానిసలకు మాత్రమే రాయడం లేదు. అన్ని రకాల పనిచేసేవారికోసం అనగా
కూలిపనిచేసేవారి కోసం, ఉద్యోగం చేసేవారికోసం – అది
గవర్నమెంట్ ఉద్యోగం గాని, ప్రైవేట్ ఉద్యోగం గాని, ఏమిచేసినా – ఒక యజమాని
క్రింద పనిచేసేవారు ఎవరైనా సరే; వారంతా మనుష్యులను సంతోషపెట్టేవిధంగా కాకుండా అనగా
వారు ఉన్నప్పుడు ఒకలాగా , బాస్ లేనప్పుడు ఒకలాగా కాకుండా, దేవునికి భయపడుచూ
శుద్ధహృదయం గలవారై మీ యజమానులకు *అన్ని విషయములలో* విధేయులై ఉండుడి. ఇక్కడ మరో
అనుమానం రావచ్చు! మరి షడ్రక్, మేషాక్, అబెద్నేగోలు యజమాని ఆజ్ఞకు లోబడలేదు కదా,
మరి దేవుడు వారిని దీవించారు కదా! ప్రియులారా! వారు యజమానిని ఎదిరించింది
నిత్యత్వం కోసం, వారి విశ్వాసం కోసం, దైవత్వం కోసం. అందుకే వారు ఎదిరించారు. ఆ
విషయంలో తప్ప మిగిలిన విషయంలో వారు యజమాని మాటలు గౌరవించి నమ్మకముగా
పనిచేసినందువలన గొప్ప ప్రమోషన్లు పొందుకున్నట్లు చూస్తాం!
ఈ వచనం
కొన్ని తర్జుమాలలో ఇలా ఉంది. దాసులారా, శరీరసంబంధంగా మీ యజమానులపట్ల అన్ని
విషయాలలో విధేయత చూపండి. మనుషులను మెప్పించాలని వారి కళ్ళెదుటే కాక, దేవుని మీది
భయభక్తులతో, కపటం లేని మనసులతో విధేయత చూపండి.
చూసారా మనుష్యులకు కనబడేలా వారి
కళ్ళెదుటే కాకుండా, దేవునియందు భయభక్తులతో కపటం లేని మనస్సులతో విధేయత చూపండి
అంటున్నారు. అవును మనం మన బాస్ ఉన్నప్పుడు ఒకలాగా, ఆయన లేనప్పుడు మరోలాగా
పనిచేస్తుంటాం. అలా కాదు ఎప్పుడూ ఒకేలాగా పనిచేయాలి అని బైబిల్ సెలవిస్తుంది. మీరు
పనిచేసేటప్పుడు బాస్ చూడకపోయినా, దేవుడు చూస్తున్నాడు అనే భయంతో పనిచేయాలి. అందుకే
ప్రభువునకు భయపడుచు, శుద్దాంతఃకరణము గలవారై పనిచేయమంటున్నారు. ప్రియ విశ్వాసి! నీవు
మనఃస్పూర్తిగా పనిచేస్తున్నావా లేక కేవలము డ్యూటీ చేస్తున్నావా? డ్యూటీ చేస్తే
దేవుని నుండి మెప్పురాదు గాని మనఃస్పూర్తిగా చేస్తే బాస్ నుండి, ఇంకా దేవునినుండి
మెప్పుకలుగుతుంది.
ఇక 23వ వచనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఇలా
పనిలో నమ్మకముగా పనిచేస్తే కేవలం యజమాని నుండి ప్రతిఫలమే కాదు—దేవుని వలన స్వాస్థ్యము
ప్రతిఫలంగా పొందుతాము. అది ఏ స్వాస్థ్యము
అనేది గతభాగాలలో చూసుకున్నాం! కాబట్టి ప్రియ విశ్వాసి! నమ్మకముగా
పనిచేస్తున్నావా?
ఇక
24వ వచనం: మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తం చేసినట్లు తలంచకుండా అది
ప్రభువుకోసం చేసినట్లు తలంచి, మనఃస్పూర్తిగా పనిచేయమంటున్నారు. కారణం మీరు
ప్రభువైన క్రీస్తుకు దాసులు అంటున్నారు. ఏం చేసినా అది దేవునికోసమని తలంచి, దేవుని
సేవ చేస్తున్నట్లు అంకితభావంతో, లాభాపేక్ష లేకుండా చెయ్యమంటున్నారు. ఇదే విషయం
ఎఫెసీ 6:5-8 లో వివరంగా వ్రాయబడింది.
5. దాసులారా, యథార్థమైన హృదయముగలవారై భయముతోను వణకుతోను
క్రీస్తునకువలె, శరీర విషయమై మీ యజమానులైనవారికి విధేయులైయుండుడి.
6. మనుష్యులను సంతోషపెట్టువారు చేయునట్లు, కంటికి కనబడుటకే
కాక, క్రీస్తు దాసులమని యెరిగి, దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు,
7. మనుష్యులకు చేసినట్టుకాక ప్రభువునకు చేసినట్టే
యిష్టపూర్వకముగా సేవచేయుడి.
8. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యముచేయునో
దాని ఫలము ప్రభువువలన పొందునని మీరెరుగుదురు.
. .
. . . చూశారా ఇక్కడ యదార్ధ హృదయం తోను,
భయంతోనూ, వణకుతోనూ, క్రీస్తుకు వలే అంటున్నారు అనగా క్రీస్తుయేసుకు భయపడినట్లు మీ
యజమానులకు కూడా భయపడి పనిచేయమంటున్నారు. ఇక 6వ వచనం మనుష్యులను సంతోషపెట్టినట్లు
కాకుండా 1) క్రీస్తు దాసులమని, 2) మీరు చేసేది దేవుని చిత్తమని తెలుసుకొని
మనఃస్పూర్తిగా పనిచెయ్యమంటున్నారు.
ఇక 7వ వచనం . మనుష్యులకు చేసినట్టుకాక ప్రభువునకు
చేసినట్టే యిష్టపూర్వకముగా సేవచేయుడి.. . ..
మీరు చేసే పని దేవునికి చేస్తున్నట్లు తలంచి కష్టపడే కాకుండా, ఇష్టపడి
పనిచెయ్యమంటున్నారు, అప్పుడు యజమాని నుండే కాకుండా ప్రభువు వలన కూడా బహుమానం
పొందుతారు. కావున ప్రియవిశ్వాసి! నీవు చేసేపని నమ్మకముగా, ఇష్టపూర్వకముగా
పనిచెయ్యమని మనవి చేస్తున్నాను.
ఇక దాసులు
అనగా దేవుని సేవ చేసేవారు కూడా దేవుని సేవకులు/ దాసులు కూడా మనుష్యులను
సంతోషపెట్టడానికి కాకుండా దేవుణ్ణి సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయాలి. కొంతమంది
సేవకులు కొన్ని సంఘాలలో జీతానికి సేవచేస్తుంటారు. అటువంటి వారు సంఘపెద్దలను,
సభ్యులను సంతోషపెట్టడానికి కాకుండా, దేవుడు మెచ్చేవిధంగా, దేవుడు భళా నమ్మకమైన
మంచిదాసుడా అని పిలిచేవిధంగా సేవ చేయాలి. వారు జీతం కోసం కాకుండా, ఆత్మలభారంతో,
కన్నీటితో ప్రార్ధిస్తూ, తన సంఘం ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా ఎదిగేలా మంచి ఆత్మీయ
ఆహరం పెట్టాలి. వారి కానుకలకు ఆశించి ఎప్పుడూ వారిని మెప్పించే బోధలే కాకుండా,
తప్పుచేసినప్పుడు ఖండిస్తూ, గద్దిస్తూ, బుద్ధి చెబుతూ ఉండాలి. కారణం వారు నరకానికి
వెళితే ప్రియ దైవజనుడా! వారి ఆత్మలకు నీవే ఉత్తరవాదివని మరచిపోకు!
కాబట్టి
ప్రియ విశ్వాసి! నీవు చేసే పని దేవునికోసం చేస్తున్నట్లు నమ్మకముగా చేయు!
ప్రియ
దేవుని సేవకుడా! నీ పని నమ్మకముగా దైర్యంగా చేయు!
అప్పుడు
దేవుడు ప్రతీవానికి వాని వాని క్రియల చొప్పున జీతము ఇవ్వబోవుచున్నారు.
ఆమెన్!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -108వ భాగం*
*పిలుపుకి తగిన జీవితం-61*
ఎఫెసీ 6:8—9
8. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ
సత్కార్యముచేయునో దాని ఫలము ప్రభువువలన పొందునని మీరెరుగుదురు.
9. యజమాను లారా, మీకును వారికిని యజమానుడైనవాడు
పరలోకమందున్నాడనియు, ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగినవారై, వారిని బెదరించుట మాని,
ఆ ప్రకారమే వారియెడల ప్రవర్తించుడి.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! ఇక రక్షించబడిన దాసులు పిలువబడిన పిలుపుకి తగినట్లుగా తమ
యజమానులు పట్ల ఎలా ఉండాలి? అనేది చూసుకున్నాము! ఇక రక్షించబడిన యజమానులు పిలువబడిన పిలుపుకి తగినట్లుగా దాసుల పట్ల ఎలా ఉండాలో చూసుకుందాం!
చూడండి ఈ వచనాలలో దాసుడైనను స్వతంత్రుడైనను
మీలో ప్రతీవాడును ఏ సత్కార్యము చేయునో
దానికి ప్రతిఫలం దేవుడు ఇస్తారు అంటున్నారు! అందుకే యజమానులారా! మీకు కూడా ఒక
యజమానుడున్నాడు ఆయన పరలోకంలో ఉన్నాడు, ఆయనకు పక్షపాతం అనేది లేదు! మీదాసులకు మీరు
ఎలా యజమానులో అలాగే మీకు మరియు మీదాసులకు కూడా యజమానుడైన వాడు పరలోకపు తండ్రి
కాబట్టి వారిని బెదిరించడం మాని ఆ ప్రకారమే మీరు చేయండి అంటున్నారు!!
కొలస్సీ
పత్రికలో కూడా అంటున్నారు:
కొలస్సీయులకు 4: 1
యజమానులారా, పరలోకములో మీకును యజమానుడున్నాడని యెరిగి, న్యాయమైనదియు
ధర్మాను సారమైనదియు మీ దాసులయెడల చేయుడి.
ప్రియ దైవజనమా! గతభాగంలో ఒక క్రైస్తవుడైన
ఉద్యోగి, దాసుడు, సేవకుడు ఎలా ప్రవర్తించాలి అనేది ధ్యానం చేసుకున్నాం! ఈరోజు
యజమానుడు లేక బాస్ ఎలా ప్రవర్తించాలి అనేది చూసుకుందాం!
ఇక్కడ యజమానులకోసం
ప్రత్యేకంగా వ్రాయడానికి కారణం ఆ రోజులలో యజమాని- బానిసలు అనే వ్యవస్థ ఉండేది.
మనుష్యులను బలవంతంగా ఎత్తుకుపోయి బానిసలుగా అమ్మివేసేవారు. ముఖ్యంగా నల్లవారిని
తెల్లవారు బానిసలుగా ఎత్తుకు పోయేవారు. ఇంకా ఎవరైనా అప్పుచేసి తీర్చకపోతే వారిని
బానిసలుగా చేసుకొనేవారు. దీనిని కట్టు బానిసత్వం అనేవారు. ఒక తండ్రి బానిస అయితే
వారి సంతానాన్ని కూడా బానిసలుగా చేసుకునేవారు. కావున ఈ వ్యవస్థ ఉన్నప్పుడు వారి
యజమానులకోసం పౌలుగారు వ్రాసారు. అయితే పరిశుద్ధాత్ముడు దివ్యజ్ఞాని! ఇప్పుడు ఆ
బానిస వ్యవస్థ లేదు. అందుకే ఇప్పుడున్న వారికోసం కూడా ముందుగానే రాసారు.
నేటిదినాల్లో యజమానులు అని చెప్పబడే వారి అందరికోసం వ్రాయబడింది. అనగా భూస్వాములు
గాని, వ్యాపారస్తులు గాని, ఆఫీసులో బాస్ లు గాని, అధికారులు గాని, తన క్రింద
పనిచేసే వారితో ఎలా మెలగాలి, ఎలా ప్రవర్తించాలి అనేదానికోసం వ్రాయడం జరిగింది.
అంతేకాకుండా ఇంట్లో పనిచేసే హౌస్ మైడ్స్ పట్ల, ఇంట్లో పనిచేసే పనిమనుష్యులతో ఓ
యజమాని, యజమానురాలు ఎలా ప్రవర్తించాలి అనేది రాస్తున్నారు పౌలుగారు.
యజమానులారా!
పరలోకంలో మీకు కూడా ఒక యజమాని ఉన్నాడని ఎరిగి. . . . అంటే ఓ యజమానుల్లారా! మీరే
బాస్ లు అనుకోవద్దు! మీ కంటే పెద్ద బాస్, మిమ్మల్ని, మీ సర్వెంట్స్ ని పుట్టించిన
పెద్ద బాస్ – అదే దేవుడు – పరలోకంలో ఉన్నాడని గుర్తెరగండి అంటున్నారు. నీవు నీ పనివాళ్ళను
ఎలా టార్చర్ పెడుతున్నావో, నీకు బాస్ ఐన దేవుడు చూస్తున్నారు అని, ఆయన నీకు కూడా
అలా టార్చర్ పెట్టగలరు అని తెలుసుకో అంటున్నారు. నిన్ను చేసినవాడే, వారినికూడా
చేసారు అని తెలుసుకోవాలి. కాబట్టి మీ ఇద్దరికీ పెద్దబాస్ ఒకరు ఉన్నారని
మర్చిపోవద్దు అని ప్రేమ పూర్వకమైన వార్నింగ్ ఇస్తున్నారు. అందుకే న్యాయమైనది,
ధర్మానుసారమైనది మీ దాసులపట్ల చేయండి అంటున్నారు. న్యాయమైనది అనడానికి కారణం:
కొంతమంది బాస్ లకు వారి పనివారిమీద వివక్ష ఉంటుంది. అది కుల వివక్ష కావచ్చు,
ప్రాంతీయ వివక్ష కావచ్చు. ఏదైనా కావచ్చు! నచ్చినవారిని బాగా చూస్తారు, నచ్చని
వారిని బాగా చూడరు. వారికి ప్రమోషన్, బోనస్ లు ఉండవు. ఇలాంటిది కుదరదు అంటున్నారు
పౌలుగారు. వారిని ప్రేమించాలి గాని వారిమీద వివక్ష కుదరదు. పూర్వకాలంలో నచ్చని
దాసులను కొట్టేవారు. ఇది కూడా కుదరదు అంటున్నారు. మరికొంతమంది ఎవరైతే చెంచాగిరి
చేస్తారో, వారికి మాలిస్ కొడతారో వారికి ప్రమోషన్లు ఇస్తారు. పని perfect గా చేస్తూ, ఉన్నది ఉన్నట్లు మాట్లాడే వారిని ఇష్టపడరు. ఇదికూడా మంచిది
కాదు. అందుకే న్యాయమైనది, ధర్మానుసారమైనది అంటున్నారు.
మరికొంతమంది యజమానులు
పనిచేయించుకుంటారు గాని జీతం/ కూలి ఇవ్వరు. ఇది పాపం, శాపం అని సెలవిస్తుంది
బైబిల్. లేవీయకాండము 19: 13
నీ పొరుగువాని హింసింప కూడదు, వాని దోచుకొనకూడదు, కూలి వాని కూలి
మరునాటి వరకు నీయొద్ద ఉంచుకొనకూడదు;
అందుకే ధర్మానుసారమైనది అంటున్నారు. వారి దగ్గర డబ్బులు లేకనే కదా
మీ దగ్గర పనిచేస్తున్నారు. వారికికూడా ఓ కుటుంబం ఉందని, ఆ కుటుంబం ఈ డబ్బులమీదనే
ఆధారపడి బ్రతుకుతున్నారని మరచిపోతున్నారు. మీరు జీతాలు ఇవ్వకపోతే ఆ కుటుంబం మొత్తం
ఆకలిదప్పులతో ఉంటారు. అలా చేస్తే దేవుడు తీర్పు తీర్చుతాను అంటున్నారు. మలాకి 3:5;
అందుకే న్యాయమైనది ధర్మానుసారమైనది అంటున్నారు పౌలుగారు. మరో తర్జుమాలో న్యాయంగా,
నిష్పక్షపాతంగా వ్యవహరించాలి అని రాయబడింది.
అందుకే
ఎఫెసీయులకు 6: 9
యజమానులారా, మీకును వారికిని యజమానుడైనవాడు
పరలోకమందున్నాడనియు, ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగినవారై, వారిని బెదరించుట మాని,
ఆ ప్రకారమే వారియెడల ప్రవర్తించుడి.
వారిని బెదిరించవద్దు, ప్రేమతో
వ్యవహరించమంటున్నారు.
కాబట్టి ప్రియక్రైస్తవ అధికారులారా! వ్యాపారస్తులారా! యజమానులారా! మీరు మీ
క్రింద పనిచేసే వారితో న్యాయంగా, ధర్మానుసారంగా, ప్రేమతో వ్యవహరించమని ప్రేమతో
మనవి చేస్తున్నాను.
అలా చేయకపోతే దేవుని తీర్పు వస్తుందని
గుర్తుచేస్తున్నాను.
కుటుంబ యజమానులారా! మీ
కుటుంబసభ్యులతో, భార్యతో కూడా, ప్రేమతో , న్యాయంతో వ్యవహరించాలి.
అలాచేస్తే మీకు, వారికి యజమానుడైన పరమతండ్రి
అందరికి తగిన సమయమందు, తగిన జీతం ఇవ్వగలరు.
ఆమెన్!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -109వ భాగం*
*పిలుపుకి తగిన జీవితం-62*
*విశ్వాసి-ఆత్మీయ పోరాటాలు-1*
ఎఫెసీ 6:10—13
10. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయనయందు
బలవంతులైయుండుడి.
11. మీరు అపవాది (అనగా సాతాను) తంత్రములను ఎదిరించుటకు
శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.
12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో(మూలభాషలో-
రక్తమాంసములతో) కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు
లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.
13. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును,
సమస్తము నెరవేర్చినవారై నిలువ బడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు (దేవుని)
సర్వాంగ కవచమును ధరించుకొనుడి
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం!
ప్రియులారా!
ఇంతవరకు పిలుపుకి తగిన జీవితం జీవించడానికి కుటుంబం యొక్క పాత్రను ధ్యానం
చేసుకున్నాము! ఇక తర్వాత వచనాలలో ముగింపుగా కొన్ని ఆధ్యాత్మిక సందేశాలు
చెబుతున్నారు!
కొలస్సీ
పత్రికలోకూడా తాను వ్రాయాల్సిన ముఖ్య సమాచారం చెప్పి అమూల్యమైన తుదిపలుకులు
పలికారు! ఇక్కడ కూడా అమూల్యమైన
తుదిపలుకులు పలుకుతున్నారు!
తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులుగా ఉండండి
అంటున్నారు! అయితే ఎందుకోసం బలవంతులుగా ఉండాలి?ఎలా బలవంతులుగా ఉండగలము అనేది
తర్వాత వచనాలలో మనకు కనిపిస్తుంది!!!
ఎందుకు బలవంతులుగా ఉండాలి అంటే రక్షించబడిన ప్రతీ విశ్వాసి ఆత్మీయ
పోరాటంలో ఉన్నాడు! పిలువబడిన పిలుపుకి తగినట్లుగా జీవిద్దాం అని విశ్వాసి ప్రయత్నం
చేస్తూ ఉంటే విశ్వానిని ఓడించి విశ్వాసం నుండి పడగొడదాం అని అనునిత్యము
ప్రయత్నిస్తూ ఉంటాడు సాతాను గాడు! మరి అటువంటి ఆత్మీయ పోరాటంలో ఉన్న విశ్వాసికి
బలము కావాలి! ఎవరి బలము కావాలి! ఆత్మబలము కావాలి! ఆ శక్తి క్రీస్తుయొక్క
మహాశక్తిని బట్టి పొందుకోవచ్చు! అదే పరిశుద్ధాత్మ శక్తి!! ఇంకా ఆ బలమును పొందుకుని దేవుని నుండి ఆయుధాలు
పొందుకుని సాతాను గాడితో పోరాటం చేయాలి! ఆ ఆయుధాలు ఎలా వాడాలి?ఎటువంటి
పరిస్తితులలో వాడాలి అనేవి ఆత్మావేశుడై రాస్తున్నారు పౌలుగారు!
వీటికోసం
గతంలో విశ్వాసి-ఆత్మీయ పోరాటాలు అనే శీర్షికలో విస్తారంగా చూసుకున్నాము! సందర్బము
వచ్చింది కనుక మరోసారి చూసుకుందాం!
*ఒక యవ్వనస్తుడు పనీపాటు లేకుండా తిరుగుతున్నాడు. ఒక
తెల్లనిబట్టలు కట్టుకున్న వ్యక్తికి పనిచేయడానికి కొంతమంది కావాలి! ఈ తెల్లని
బట్టలు వేసుకున్న వ్యక్తి అడిగాడు ఈ యవ్వనస్తుడిని నా ఆర్మీలో పనిచేస్తావా? వెంటనే
ఆ యవ్వనస్తుడు ఆర్మీ అంటున్నాడు- తెల్లనిబట్టలు వేసుకున్నాడు అని చూసి- ఓ యస్!!!
దానికోసమే ఎదురుచూస్తున్నాను అన్నాడు! వెంటనే ఈ యవ్వనస్తుడికి తెల్లనిబట్టలు గల
యూనిఫారం మరియు మొత్తం కవచం ఆయుధాలు (AK47 అనుకుందాం) ఇచ్చి – ఒక మహా పెద్ద హాలు
తలుపులు తెరచి ఆ హాలులోకి త్రోసేసారు. తలుపు తీసిన వెంటనే చాలా పెద్ద హాలు- ఒక
హాలు దాటితే మరో హాలు- అలాంటివి ఎన్నో ఉన్నాయి- మరీ ముఖ్యంగా అత్యాధునిక ఆయుధాలు
ధరించి భయంకరులైన శత్రుసైన్యం- తనకు ముందుగా కోట్లాదిమంది ఉన్నారు. ఈ
తెల్లనిబట్టలు వేసుకున్న వ్యక్తి అన్నాడు- ఈ హాలునుండి బయటకు పోకూడదు, వెనక్కిపోతే
చస్తావు! ముందుకే పోవాలి! నీవు నీకు కనిపిస్తున్న సైనికులను తప్పించుకుంటూ
అవసరమైతే వారిని చంపుతూ ఈ హాలులన్నీ దాటుకుని అవతలి గమ్యానికి పోవాలి! వీరోచితంగా
పోరాడి చివరి గమ్యస్థానంకి చేరితే అదిగో ఆ కనపడే- వెలిగిపోయే నగరానికి మేజర్ గాని
కమాండర్ గాని అవుతావు! మధ్యలో ప్రాణంపోతే పరమవీరచక్ర అవార్డు గెలుచుకుంటావు అని
చెప్పి- హాలు డోరు మూసేసి వెళ్ళిపోయాడు! ఆ సైనికులను చూసి మన యవ్వనస్తుడు ఏదో
ఆర్మీ అంటే వచ్చాను. నాకు తోడూ ఎవరు లేరు! ఎలా అంటూ ఆలోచనలో పడ్డాడు! చివరకు
వెనక్కిపోతే చచ్చిపోతావు అన్నాడు కాబట్టి ఏదైతేఅదే అయింది అనుకుంటూ ముందుకు పోవడం
మొదలుపెట్టాడు!*..... ఇది నేను చదివిన ఒక ఆత్మీయ కధ!
నేటి దినాలలో
ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకున్న వెంటనే అనుకుంటున్నాడు- ఇక నాకు కష్టాలు లేవు/
రావు. వచ్చినా యేసయ్య చూసుకుంటాడు! నా జీవితం పూలతోట! మల్లెలబాట! ఓ అందాల
ఉద్యానవనం! అనుకుంటూ భ్రమపడుతున్నాడు! గాని అదికాదు! అలా ఆలోచించడానికి కారణం
ముమ్మాటికి బోధకులే!!! మీరు దేవుణ్ణి
నమ్ముకుంటే మీకు అన్నీ ఆశీర్వాదాలే! దేవుని గల్లాపెట్టి నుండి కాసులు దీవెనలు
ఆశీర్వాదాలు ప్రతీరోజు మీ ఇంట్లోకి కారిపోతూ ఉంటాయి! దీవెనలతో మీ ఇల్లు నిండిపోతూ
ఉంటుంది అంటూ తప్పుడు భోదలు చెబితే వీరు నమ్మి అలా అనుకుంటున్నారు! కాని విశ్వాస
జీవితం సామాన్యమైనది కాదు! మీద ఉదాహరించిన కధవలే బాప్తిస్మము తీసుకున్న వెంటనే ఆ
వ్యక్తి ఆత్మీయ పోరాటం ప్రారంభమవుతుంది.
12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో
(మూలభాషలో-రక్తమాంసములతో) కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార
సంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. కాబట్టి ఇది
తనకుతానుగా ఈ పోరాటం చెయ్యాలి! తన సిలువనెత్తుకుని ప్రతీరోజు పోరాటం చెయ్యాలి!
ఎవరూ తోడు ఉండరు! యేసయ్య తోడుగా ఉంటారు, నీకు సలహాలు సహకారం చేస్తారు! గాని నీ
యుద్ధము, నీ పోరాటము నువ్వే చెయ్యాలి! నీ తరుపున ఎవరూ చెయ్యరు! ఎంత వీరోచితంగా పోరాడతావో అన్ని కిరీటాలు-
అవార్డులు-రివార్డులు! పౌలుగారిలా పోరాడి- మంచిపోరాటం పోరాడాను. నా పరుగు తుద
ముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను! ఇక నాకు నీతి కిరీటం మహిమ కిరీటం ఈ కిరీటం
ఆకిరీటం ఎదురుచూస్తుంది అని గొప్పగా చెప్పుకోవాలి! 2తిమోతి 4:7,8;
ఇదే నిజమైన విశ్వాస
జీవితం! క్రైస్తవ జీవితం అంటేనే పోరాటం! ఆత్మీయ యుద్ధం! ఆ యుద్ధంలో జయం పొందితే
జయించిన వారిలెక్కలో చేర్చబడి- ఎత్తబడిన గుంపులోనూ, తేజోవాసులైన పరిశుద్ధుల
గుంపులోనూ, ఏడేండ్ల పెండ్లి విందులోను, మన ప్రభువును ప్రియ రక్షకుడైన
యేసుక్రీస్తుప్రభులవారితో సహవాసం కలిగి, నిరంతరమూ ఆయనతో ఉంటావు! లేకపోతే సోమరియైన
చెడ్డదాసుడా అనిపించుకుంటావు!
ఇప్పుడు మనము
ఆత్మీయ పోరాటాలు ఎన్ని రకాలు, ఎలా ఎదుర్కోవాలి లేక జయించాలి అనేది బైబిల్
నే ప్రామాణికంగా తీసుకుంటూ, నా స్వానుభవంనుండి పరిశుద్దాత్ముని సహాయంతో నాకు
అర్ధమైనంత వరకు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను! గమనించాలి- ఇవి కేవలం నా అనుభవాలనుండి, నేను నేర్చుకున్నవి
మరియు పరిశుద్ధాత్ముడు నాకు నేర్పించినవి మాత్రమే రాస్తున్నాను! కాబట్టి ఈ
శీర్షికలో రాస్తున్నవి అన్నీ నా ఉద్దేశాలు మాత్రమే! మీరు అర్ధాలు తీసుకుంటే
తీసుకోండి లేకపోతే వదిలెయ్యండి!
ప్రియ దైవజనమా! మీదన వివరించినట్లు విశ్వాసి
ప్రతీరోజు ఆత్మీయ పోరాటాలు చేస్తున్నాడు! అవి కొన్ని రకాలుగా నేను
విడదీసుకున్నాను! (నాకు అర్ధం కావడానికి, సౌలభ్యం కోసం)!
అవి మూడు రకాలు! (అని
నా ఉద్దేశ్యం)
మొదటిది: *సాతానుతో
పోరాటం!*
రెండు: *ఆత్మీయ
యుద్ధం-1. ఇది పాపముతో చేస్తాడు.*
మూడు: *ఆత్మీయ యుద్ధం—2. ఇది మరలా రెండు రకాలు!*
*ఆత్మీయ యుద్ధం 2.1—ఆలోచనద్వారా*
*ఆత్మీయ యుద్ధం—2.2 గిల్టీ (అపరాదభావం, ఆత్మన్యూన్యతా భావం) మరొకటి దేవుని
మీద నిష్టూరాలు వెయ్యడం.*
అయితే నూటికి 75% విశ్వాసులు ఈ
ఆత్మీయ పోరాటాలులో ఓడిపోతున్నారు!!!
ఎందుకు ఓడిపోతున్నారు???
సరియైన ఆయుధాలు లేకనా?
కానేకాదు!
ఎఫెసీ 6:11—18 లో సంపూర్ణంగా ఇచ్చారు దేవుడు!
యుద్ధానికి నిన్ను పంపి ఆయుధాలు లేకుండా చేసి, నిన్ను చంపాలని చూసే దేవుడు కాదు!
అన్ని ఆయుధాలు లోడ్ చేసి మరీ ఇచ్చారు దేవుడు!
మరెందుకు ఓడిపోతున్నాడు?
(ఇంకాఉంది)
*ఎఫెసీ పత్రిక -110వ భాగం*
*పిలుపుకి తగిన జీవితం-63*
*విశ్వాసి-ఆత్మీయ పోరాటాలు-2*
ఎఫెసీ 6:10—13
10. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయనయందు
బలవంతులైయుండుడి.
11. మీరు అపవాది (అనగా సాతాను) తంత్రములను ఎదిరించుటకు
శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.
12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో(మూలభాషలో-
రక్తమాంసములతో) కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు
లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.
13. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును,
సమస్తము నెరవేర్చినవారై నిలువ బడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు (దేవుని)
సర్వాంగ కవచమును ధరించుకొనుడి
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! పిలువబడిన పిలుపుకి తగిన జీవితం కోసం ధ్యానిస్తూ, విశ్వాసి యొక్క
ఆత్మీయ పోరాటాలు కోసం ధ్యానం చేసుకుంటున్నాము!
( గతభాగం తరువాయి)
ప్రియ దైవజనమా! విశ్వాసి ఆత్మీయ పోరాటంలో ఉన్నాడు గాని నూటికి 75% ఓడిపోతున్నాడు, ఎందుకు
ఓడిపోతున్నాడు అనేది ధ్యానం చేసుకుంటున్నాము మనము!
ఎందుకు
ఓడిపోతున్నాడు అంటే నా ఉద్దేశం ప్రకారం- (నా ఉద్దేశం మాత్రమే సుమా)
మొదటిది: *సర్వాంగ
కవచము మరియు ఆయుధాలు ఎలా వాడాలో తెలియక!*
రెండు: *సగం సగం వాడటం వలన!*
మూడు: *ఎప్పుడు ఏ ఆయుధం వాడాలో తెలియక! లేక సరియైన ఆయుధం
వాడక!*
మొదటిది: *సర్వాంగ కవచము మరియు ఆయుధాలు ఎలా వాడాలో తెలియక
ఓడిపోతున్నాడు!*
అర్ధం అవ్వడానికి ఒక ఉదాహరణ చూడండి: కారుని మనమందరం
చూస్తున్నాము! గాని మనలో అనేకమంది కారుని నడపలేరు! మనందరికీ తెలుసు- కారులో ఇందనం
నింపుకుని- సెల్ఫ్ ఆన్ చేసి, ఆక్సిలిరేటర్ త్రొక్కితే కారు ముందుకు పోతుందని,
ప్రక్కకి త్రిప్పడానికి స్టీరింగ్ ఇటూ అటూ త్రిప్పాలని, కారుని ఆపడానికి బ్రేక్
వెయ్యాలని, గేరు మార్చడానికి క్లచ్ నొక్కి గేరు రాడ్ సహాయంతో గేరు మార్చాలని,
సిగ్నల్ వెయ్యాలని, హార్న్ కొట్టాలని మనందరికీ తెలుసు! సరే, ఇప్పుడు మా కారులో
ఇందనం నింపి ఇస్తాను, ఒకసారి కారుని రెండు కి.మీ త్రిప్పి రండి అంటే మీలో ఎంతమంది
కారు డ్రైవ్ చేసుకుని రెండు కి.మీ త్రిప్పి తీసుకుని రాగలరు???? నా ఉద్దేశం ఏ
ముప్పై శాతం మంది మాత్రమే చెయ్యగలరు? ఏం? మనందరికీ కారు తెలుసు, కారులో స్టీరింగ్
ఎక్కడుంది, బ్రేక్ ఎక్కడుంది, క్లచ్ ఎక్కడుంది, హార్న్ ఎక్కడుంది లాంటివి అన్నీ
మనకు తెలుసు, ప్రతీరోజు చూస్తున్నాము, గాని ఎందుకు నడుపలేకపోతున్నారు అంటే
ప్రాక్టీస్ లేక! ఎప్పుడు నడపక!!!
అలాగే
ఆత్మీయ యుద్ధాలు కూడా ఎలా చెయ్యాలో తెలియక విశ్వాసి ఓడిపోతున్నాడు! ఆశీర్వాదాలు
ఎలా పొందుకోవాలి అనేది తెలిసికోడానికి ప్రయత్నం చేస్తున్నారు గాని ఈ ఆత్మీయ
పోరాటాలు ఎలా జయించాలి అనేది తెలుసుకోడానికి ప్రయత్నం చెయ్యడం లేదు! బోధకులు కూడా
ఆశీర్వాదాలు దీవెనలు కోసం చెబుతున్నారు గాని ఈ ఆత్మీయ పోరాటాలు ఎలా జయించాలో
చెప్పడం లేదు!
రెండు: *ఆయుధాలు- సగం సగం వాడటం వలన!!!* అనగా దేవుడు ఎఫెసీ 6:11—18 వరకు చూసుకుంటే సర్వాంగకవచములో అనేకమైనవి ఇచ్చారు. కవచముతో
పాటుగా శిరస్త్రానం అనే హెల్మెట్, డాలు, ఖడ్గము, దట్టి అనే బెల్ట్, పాదాలకు జోళ్ళు లేక బూట్లు
ఇలాంటివి అన్నీ సంపూర్ణంగా ఇచ్చారు! అయితే మన ఓవర్ కాన్ఫిడెన్స్ తో వాటిని
పూర్తిగా ఉపయోగించుకోకుండా సాతాను గాడ్ని తక్కువగా, తప్పుగా అంచనా వేసి, సగం లేక
కొన్ని ఆయుధాలు మాత్రమే వాడి , సాతాను గాడి చేతులలో ఓడిపోతున్నారు! గమనించాలి-
దేవుడు సర్వాంగకవచము ఇచ్చింది వాడడానికి—ఇంట్లో పెట్టి
తాళం వేసుకోడానికి కాదు! అన్నీ బాగా వాడాలి!
ఇక మూడవది: *ఎప్పుడు ఏ
ఆయుధం వాడాలో తెలియక, లేక సరియైన ఆయుధం ఉపయోగించక ఓడిపోతున్నారు!*
ఒకసారి
ఎఫెసీ 6:12,13 చదవండి...
12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో
(మూలభాషలో-రక్తమాంసములతో) కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార
సంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.
13. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును,
సమస్తము నెరవేర్చినవారై నిలువ బడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు (దేవుని)
సర్వాంగ కవచమును ధరించుకొనుడి .
ఉదాహరణకు సాతాను గాడు అగ్ని బాణాలు వేస్తున్నాడు, నీవు
సత్యమనే దట్టి తోనో, దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గముతోనో ఎదుర్కొంటే ఆ అగ్నిబాణం
సూటిగా గుండెల్లో గుచ్చుకుంటుంది. ఆ అగ్ని బాణాలు ఎదుర్కోడానికి దేవుడు విశ్వాసమనే
డాలునిచ్చారు! అ డాలునే వాడాలి! మరో ఆయుధంతో దానిని అడ్డుకోలేవు! దానిని వాడడానికి
దేవుడిచ్చారు గాని ఇంట్లో పెట్టి పూజ చెయ్యడానికి కాదు!
నీ విశ్వాస యాత్రలో ముందుకు పోతుంటే అడ్డుగా పెద్ద పొట్ట
వేసుకుని సాతాను గాడు గాండ్రించుకుంటూ దారికి అడ్డుగా వస్తున్నాడు- నీవేమి
చెయ్యాలి- దేవుడిచ్చిన వాక్యమను ఆత్మ ఖడ్గమును తీసి- పనికిమాలినోడా నా దారికి
అడ్డుగా వస్తావురా అంటూ ఖడ్గముతో వాడిమీద ఎటాక్ చేసి, వాడి పెద్ద పొట్టలో ఖడ్గముతో
పొడిస్తే అక్కడనుండి పరుగోపరుగు! కాబట్టి మొత్తం సర్వాంగకవచమును ధరించుకుని,
ఎవర్రెడీ బేటరీలాగ ఎప్పుడు సిద్ధముగా ఉంటూ, సందర్బాన్ని బట్టి సరియైన ఆయుధం వాడాలి
అన్నమాట! సరియైన ఆయుధం వాడకపోతే వాడే మనలని చావజంపుతాడు అని గ్రహించాలి!
సరే, ఇప్పుడు మనకు ఒక అనుమానం రావచ్చు! ఆయుధాలు ఎలా వాడాలో, ఎప్పుడు ఏవి
వాడాలో మనకు తెలియదు కదా! మనకు ఎవరూ ట్రైనింగ్ ఇవ్వలేదు కదా! వాటిని వేసుకోవడం
ఎలా, వాడటం ఎలా ఎవరు చెబుతారు? ఎవరు మనకు ట్రైనింగ్ ఇస్తారు అని అనుమానం రావచ్చు!
వీటిని వేసుకోడానికి, వాడటానికి ట్రైనింగ్ అవసరం
లేదు! మనకన్నా ముందు పాత నిబంధన భక్తులు, క్రొత్త నిబంధన భక్తులు ఇదే ఆత్మీయ పోరాట
మార్గంలో ప్రయాణం చేసి విశ్వాస వీరులుగా, ఆత్మీయ యోధులుగా నిలిచిపోయారు! వారి
అడుగుజాడలలో మనం నడిస్తే వారిని చూసి వారు ఇదే ఆత్మీయ పోరాటంలో ఎలా గెలిచారో, ఏ
రకమైన పోరాటాన్ని ఏ రకంగా గెలిచారో మనం తెలుసుకోవచ్చు!
ఎలా తెలిసికోవచ్చు! బైబిల్ గ్రంధమును
చదవడం ద్వారా! గమనించాలి ఈ సంగతులు వారికి సంభవించి ఈ యుగాంతమందున్న మనకు బుద్ధి
కలుగుటకై వ్రాయబడ్డాయి అని బైబిల్ చెబుతుంది....1కోరింథీయులకు 10: 11
ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంత మందున్న
మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను.
కాబట్టి
ఎక్కడో ట్రైనింగ్ తీసుకోవలసిన అవసరం లేదు! సత్యవేదాన్ని చదువుతూ పాత నిబంధన
భక్తులు క్రొత్త నిబంధన భక్తులైన వారిని ఉదాహరణగా తీసుకుంటూ వారి ఆత్మీయ
జీవితాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి! ఇంకా హెబ్రీ 11వ అధ్యాయంలో చెప్పబడిన సాక్షి
సమూహాన్ని ఉదాహరణంగా తీసుకోవాలి! ఈ రకంగా వారిని ఆదర్శంగా తీసుకుంటూ ఈ సర్వాంగకవచం
ధరించుకుని మన ఆత్మీయ పోరాటంలో వీరోచితంగా పోరాడుతూ ముందుకు సాగిపోవాలి!
ఆమెన్!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -111వ భాగం*
*పిలుపుకి తగిన జీవితం-64*
*విశ్వాసి-ఆత్మీయ పోరాటాలు-3*
ఎఫెసీ 6:10—13
10. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయనయందు
బలవంతులైయుండుడి.
11. మీరు అపవాది (అనగా సాతాను) తంత్రములను ఎదిరించుటకు
శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.
12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో(మూలభాషలో-
రక్తమాంసములతో) కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు
లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.
13. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును,
సమస్తము నెరవేర్చినవారై నిలువ బడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు (దేవుని)
సర్వాంగ కవచమును ధరించుకొనుడి
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! పిలువబడిన పిలుపుకి తగిన జీవితం జీవించే విధాంలో విశ్వాసి యొక్క
ఆత్మీయ పోరాటాలు కోసం ధ్యానం చేసుకుంటున్నాము!
( గతభాగం తరువాయి)
ప్రియ దైవజనమా! ఇంతవరకు మనం విశ్వాసి
ఆత్మీయ పోరాటంలో ఉన్నాడు, మూడు రకాలైన పోరాటాలు చేస్తున్నాడు, అయితే పోరాడే
విధానం- ఆయుధాలు వాడే విధానం అన్నీ బైబిల్ లో గల భక్తుల జీవితానుభవాలనుండి మనం
నేర్చుకోవాలి అనేది ధ్యానం చేసుకున్నాము! ఇక ఈ రోజు మొదటి రకమైన ఆత్మీయ పోరాటం
కోసం ధ్యానం చేసుకుందాము!
పోరాటాలు:
మొదటిది: *సాతానుతో పోరాటం!*
రెండు: *ఆత్మీయ యుద్ధం-1. ఇది పాపముతో చేస్తాడు.*
మూడు: *ఆత్మీయ యుద్ధం—2. ఇది మరలా రెండు రకాలు!*
*ఆత్మీయ యుద్ధం 2.1—ఆలోచనద్వారా*
*ఆత్మీయ యుద్ధం—2.2 గిల్టీ (అపరాదభావం,
ఆత్మన్యూన్యతా భావం) మరొకటి దేవుని మీద నిష్టూరాలు వెయ్యడం.*
సాతానుతో పోరాటం! ఇవి విశ్వాసి ప్రతీరోజు సాతానుతో చేసే
డైరెక్ట్ పోరాటం!
సాతానుతో ఏ రకమైన పోరాటాలు సాధారణంగా విశ్వాసి చేయాల్సి వస్తుంది అంటే నా
అనుభవం ప్రకారం:
చెడుపు-చిల్లంగులు, దయ్యం పట్టిన వారికి ప్రార్ధన చెయ్యడం- వదల గొట్టడం,
జబ్బులు-రోగాలు, శ్రమలు-శోధనలు, లేనిపోని కుటుంబ కలహాలు, మనకు సంబంధం లేని అనుకోని కోర్టు కేసులు, జైలు,
అవమానం, క్రీస్తునామం కోసం దెబ్బలులాంటివి. (నాకు గుర్తున్న కొన్ని మాత్రం
రాశాను).
సరే, వీటిని ఎలా ఎదుర్కోవాలి?
మనం
చూసుకుందాం! బైబిల్ లో గల సాక్షి సమూహం ఎలా ఎదుర్కొందో చూసి వారి జీవితానుభవాల
నుండి నేర్చుకోవాలి! సాతానుతో డైరెక్ట్ పోరాడిన
వారు ఎందఱో ఉన్నారు గాని ముందుగా మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తుప్రభులవారు
సాతాను గాడ్ని ఎలా ఎదుర్కొన్నారో ఆయన అనుభవం నుండి నేర్చుకుందాం!
ఇది
మనకు మత్తయి సువార్త నాలుగో అధ్యాయంలో కనిపిస్తుంది! 4:1—11..
మొదటి
వచనం చూసుకుంటే కొంచెం విచిత్రంగా ఉంటుంది. అప్పుడు
యేసు అపవాది చేత శోదించబడుటకు అరణ్యమునకు ఆత్మచేత కొనిపోబడెను! ఏమిటండి
సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తుప్రభులవారు సాతానుచేత శోధించబడుటకు ఆత్మచేత
అరణ్యమునకు కొనిపోబడ్డారా? చిత్రంగా ఉంది కదూ!
ఇక్కడ
మూడు విషయాలు అర్ధం చేసుకోవాలి!
మొదటిది: సాతానుగాడికి డైరెక్ట్ access
ఉంది పరలోకానికి! యోబు గారి చరిత్ర చూసుకుంటే మొదటి వచనంలో దేవుడు--
దూతలు కలిసి చేసే దేవుని ఆలోచన సభకు
రావడానికి వాడికి డైరెక్ట్ అనుమతి ఉంది. కారణం దేవుడు ఇచ్చి తీసుకొనే వాడు కాదు!
వాడికి అనుమతి ఎప్పుడో ఇచ్చారు దేవుడు, వాడు పరము నుండి త్రోయబడినా అనుమతి వెనుకకు
తీసుకోలేదు! అది ఎప్పుడు పూర్తిగా మూసుకు పోతుంది అంటే హార్మేగిద్దోను యుద్ధము,
గోగు మాగోగు యుద్ధముతో వాడి ఆట ముగిసిపోయి- నరకం లోకి శాస్వతంగా పోతాడు! అంతవరకూ
వాడికి పరలోకంలో ఆలోచనా సభ జరిగే స్థలము వరకు వాడికి అనుమతి ఉంది. అక్కడకు వెళ్లి
దేవుని బిడ్డలమీద కంప్లైంట్ చేస్తూ ఉంటాడు!
రెండవది: సాతాను గాడు కూడా శక్తిమంతుడు! కారణం దేవుడు వీడికి
కొన్ని అధికారాలు శక్తులు ఇచ్చారు. వాటిని మరలా దేవుడు తీసుకోరు! వాడికే కాదు
ఎవరికైనా ఒక్కసారి ఇచ్చారా- మరలా తీసుకోరు!
మూడవది: తండ్రియైన దేవుని దగ్గరికే వెళ్లి కంప్లైంట్ చేయగలిగిన సాతాను
గాడు చాడీలగాడు, కుమారుడైన యేసుక్రీస్తుప్రభులవారు దగ్గరకు కూడా వచ్చాడు! చూడండి!
యేసుక్రీస్తుప్రభులవారినే శోధించిన పనికిమాలిన వాడు, మన దగ్గరకు రాలేడా?
ఈ భూలోకం మొత్తం వాడి
స్వాధీనంలోఉన్నప్పుడు ఇంకా ధైర్యంగా రాలేడా? మనలను శోధించలేడా? కాబట్టి యేసయ్య
ఉన్న పడవకి కూడా ఎలా తుఫాను వచ్చిందో, విశ్వాసి విశ్వాస పడవకు కూడా తుఫానులు
గాలివానలు వస్తూ ఉంటాయి! వాటిని తట్టుకుంటూ అణుచుకుంటూ పోవాలి! ఇదే విశ్వాసయాత్ర!
మరోదారి లేదు పరమునకు!!!
నాలుగు: సేవాపరిచర్య ఘనముగా చెయ్యాలి అంటే ఉపవాస ప్రార్ధన
చేసి- సిద్ధపడి- సాతాను గాడిమీద విజయం సాధించాలి. ఇది క్రమం! అందుకే దేవుడే గాని
భూమిమీద మనిషిగా వచ్చారు కాబట్టి ఉపవాసముండి శక్తి సాధించి, వాడి శోధనను
ఎదుర్కొని- వాడిని ఓడించారు!
సరే, సాతాను గాడు
వాడు వచ్చాడు- వాడ్ని చూసి యేసుక్రీస్తుప్రభులవారు ఒరేయ్ మూర్కుడా! నా దగ్గరకు
రాడానికి నీకెన్ని గుండెలురా అంటూ డైలాగ్లు చెప్పలేదు! ఎందుకంటే తండ్రియైన దేవుడు,
కుమారుడైన దేవుడు అయిన త్రియేకదేవుడు జెంటిల్ మేన్! ఆయన ఎవరిని తృణీకరించేవాడు
కాదు! ఒకవేళ నిజంగా-- సాతానా నా దగ్గరకు వస్తావా? బయటకు పో! అని ఒక్కమాట అంటే వాడు
పారిపోతాడు! గాని చెప్పాను కదా జెంటిల్ మేన్!
అందుకే అడిగారు యేసయ్య వాడిని—ఏమిటి సంగతి?
ఇలా వచ్చావ్ అంటే నీవు నలబై రోజులు ఆకలితో ఉన్నావు, చాలా ఆకలి వేస్తుంది కదా మరి
నీవు దేవుని కుమారుడివి కదా, ఆకలితో బాధపడటం ఏమిటి? ఈ రాళ్ళు రొట్టెలవ్వాలని
ఆజ్ఞాపించు! వెంటనే అవి రొట్టెలు అయిపోతాయి కదా అన్నాడు!
గమనించాలి!
యేసుక్రీస్తుప్రభులవారి శక్తి సాతాను గాడికి తెలిసే ఈమాట అన్నాడు! వెంటనే యేసయ్య
ఉక్రోషపడి అది నాకు తెలుసులే నీవు నోర్ముయ్యు అనలేదు ఎందుకంటే చెప్పాను కదా ఆయన
జెంటిల్ మేన్ మరియు మర్యాదస్తుడు! లేదా ఆవేశపడి రాళ్ళను రొట్టెలుగా మార్చనులేదు!
ప్రశాంతమైన వదనముతో లేఖనం నుండి ఒక వచనాన్ని ఆయుధంగా తీసుకుని మనుష్యుడు రొట్తెవలన
మాత్రము జీవించడు గాని దేవుని నోటినుండి వచ్చే ప్రతిమాట వలన జీవిస్తాడు అని
అన్నారు యేసయ్య! మత్తయి 4:4;
ఈ సందర్భంగా ఒక్కమాట మీకు చెప్పనీయండి! దీనిని మనం జాగ్రత్తగా
గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది! యేసయ్యకి రాళ్ళు రొట్టెలుగా చేసే శక్తి ఉంది గాని
చెయ్యలేదు! ఎందుకు? అది చెయ్యకూడదు! దేవుడు తాను విధించిన విధులకు రూల్స్
రెగ్యులేషన్ కి తానే వ్యతిరేఖంగా చెయ్యరు! బాగా అర్ధం కావాలంటే సువార్తలలో ఐదు
రొట్టెలు రెండు చిన్నచేపలు ఐదువేల మందికి పంచిపెట్టిన అద్భుతములో గాని,
ఏడురొట్టెలు కొన్ని చిన్నచేపలు నాలుగువేలమందికి పంచిపెట్టిన అద్భుతములో గాని మీరే
వారికి భోజనం పెట్టండి అని యేసుక్రీస్తుప్రభులవారు శిష్యులతో చెప్పినప్పుడు, వారు
మన దగ్గర అన్ని రొట్టెలు ఎక్కడ, అన్ని డబ్బులు ఎక్కడ అన్నారు! వెంటనే ఆయన అయితే
వారిని కూర్చోబెట్టి రాళ్ళు పట్టుకోమని చెప్పండి, నేను ప్రార్ధన చేస్తాను, వెంటనే
రాళ్ళు రొట్టెలవుతాయని అనలేదు. మీ దగ్గర ఏమున్నాయి అన్నారు! ఉన్నది ఉన్నట్లుగా
చెప్పారు! ఉన్నవాటినే ప్రార్ధించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి వారికి సంపూర్తిగా
తినేలాగా పంచారు! దీనిని బట్టి మనకు
అర్ధమయ్యేది ఏమిటంటే అసాధారణ అద్భుతాలు చేసే శక్తి ఆయనకు ఉన్నా ప్రకృతికి
వ్యతిరేఖమైన పనులు చెయ్యలేదు!
ఇక దేవుడు ఎప్పుడు మానవ జీవితంలో అద్భుతాలు మహా అద్భుతాలు అసాధారణ
అధ్బుతాలు చెయ్యడానికి ఇష్టపడుతుంటారు! అయితే దేవుడు తానే స్వయంగా చెయ్యరు! దానికి
దేవునికి సంపూర్తిగా సమర్పించుకున్న విశ్వాసులు కావాలి! అప్పుడు దేవుడు వారిని
ఉపయోగించుకుని, వారి కాంబినేషన్ లో అసాధారణ అద్భుతాలు చేస్తారు! అదికూడా
వారికున్న, వారిచ్చిన పరిమితి గల వస్తువులను ఉపయోగించుకునే అసాధారణ అద్భుతాలు
చేస్తారు! ఇక్కడ ఒక చిన్న కుమారుడు తీసుకుని వచ్చిన రొట్టె లనే దీవించి
ప్రార్ధించి 5000మందికి సరిపడేలా ఆశీర్వదించారు! గమనించాలి రొట్టేలనే మరిని
రొట్టెలుగా చేశారు గాని మరొక దానిని రొట్టెలుగా చేయలేదు!
నా అనుభవం కూడా పంచుకోనియ్యండి! ప్రతీ సంవత్సరం మా ఊరిలో నేను చిన్న సభలను
ఏర్పాటుచేస్తుంటాను మా చిన్న గ్రౌండ్ లో! 2018లో మా చర్చి యవ్వనస్తుడు వచ్చి-
అన్నయ్యా ఈ సంవత్సరం సభలకు అవసరమయ్యే ఆకులు నేను పెట్టుకుంటాను అన్నాడు! సరే
అన్నాను! నాలుగువేల ఆకులు తీసుకొచ్చాడు! ఆ సంవత్సరం మూడు రోజులు కలిసి వచ్చిన వారి
సంఖ్య 5200 మంది కంటే ఎక్కువ! నేను ఎప్పుడూ లెక్కపెట్టిస్తాను ఎందుకంటే సభ అయ్యాక
అందరికీ భోజనం పెట్టి పంపించడం అలవాటు! సభలు అయ్యాక ఇంకా 200 ఆకులు మిగిలాయి! ఆ
అబ్బాయిని అడిగాను, మరలా ఎన్ని ఆకులు తెచ్చావు అని, నేనేమి తేలేదు అన్నాడు! ఎవరూ
తేలేదు! అలాగే వాటర్ పాకెట్లు కూడా రెండు బస్తాలు మిగిలిపోయాయి! వచ్చినవారు భోజనం
చెయ్యకుండా మేము వదలం! అందరూ తినేసి వెళ్ళారు! నాలుగువేల ఆకులు- 5200 మందికంటే
ఎక్కువ తిన్నా ఇంకా 200 ఆకులు మిగిలిపోయాయి! అలాగే తెచ్చిన సరకులు అన్నీ ఇంకా
మిగిలాయి! ఇది అద్భుతం కాదా?
అనగా
మనకున్న చిన్న పరిమితి గల వస్తువులు, ధనము, రొట్టెలు, ధాన్యము లాంటివి , అదికూడా
దేవుడిచ్చినవే తిరిగి ఆయనకు ఇస్తే వాటినే దీవించి అద్బుతాలు చేసి తిరిగి మనలనే
పోషిస్తారు అన్నమాట! అందుకే సాతాను గాడు ప్రలోభపెట్టినా ప్రలోభపడకుండా వాడి
ఉచ్చులో పడకుండా శాంతంగా అద్భుతాన్ని ఆయుధంగా చేసుకోకుండా వాక్యాన్ని, వాక్యమనే ఆత్మఖడ్గముతో వాడిని ఎదుర్కొన్నారు
యేసుక్రీస్తుప్రభులవారు! మనం కూడా అసాధారణ అద్భుతాలు కోసం ఎదురుచూడకుండా, మనకున్న
పరిమితులు అన్ని దేవునికి తెలిపి, మనకున్నవి ఆయన చేతిలో పెడితే, చివరకు మనలనే మనకు
మనంగా ఆయన చేతులకు అర్పనగా అప్పగించుకొంటే---
ఇక చెప్పేదేమీ లేదు! నీ జీవితమే మారిపోతుంది. వీడా? ఒకరోజు ఇలా కదా ఉండేవాడు!
ఇప్పుడు ఎలా మారిపోయాడో అంటారు! సరే, ఇక్కడ యేసుక్రీస్తుప్రభులవారు వాడిన ఆయుధం
వాక్యమనే ఆత్మఖడ్గము!
(సశేషం)
*ఎఫెసీ పత్రిక -112వ భాగం*
*పిలుపుకి తగిన జీవితం-65*
*విశ్వాసి-ఆత్మీయ పోరాటాలు-4*
ఎఫెసీ 6:10—13
10. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయనయందు
బలవంతులైయుండుడి.
11. మీరు అపవాది (అనగా సాతాను) తంత్రములను ఎదిరించుటకు
శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.
12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో(మూలభాషలో-
రక్తమాంసములతో) కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు
లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.
13. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును,
సమస్తము నెరవేర్చినవారై నిలువ బడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు (దేవుని)
సర్వాంగ కవచమును ధరించుకొనుడి
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! విశ్వాసి యొక్క ఆత్మీయ పోరాటాలు కోసం ధ్యానం చేసుకుంటున్నాము!
( గతభాగం తరువాయి)
ప్రియ దైవజనమా! ఇంతవరకు మనం విశ్వాసి
ఆత్మీయ పోరాటంలో ఉన్నాడు, మూడు రకాలైన పోరాటాలు చేస్తున్నాడు అయితే పోరాడే విధానం-
ఆయుధాలు వాడే విధానం అన్నీ బైబిల్ లో గల భక్తుల జీవితానుభవాలనుండి మనం
నేర్చుకోవాలి అనేది ధ్యానం చేసుకుంటూ మొట్టమొదటగా యేసుక్రీస్తుప్రభులవారు సాతాను
గాడిని ఎలా ఎదుర్కొన్నారు అనేది ధ్యానం చేస్తున్నాము!
చూడండి ఇక్కడ యేసుక్రీస్తుప్రభులవారు
సాతానుతో అంటున్నారు- మనిషి రొట్టె వలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చే
ప్రతీ మాటవలన జీవించును అని చెప్పారు! ఇది ఎక్కడ వ్రాయబడి ఉంది అంటే ద్వితీ 8:3
లో. సాతాను గాడు సంధించిన శోధనను దేవుడు వాక్యమనే ఆత్మఖడ్గముతో ఎదుర్కొన్నారు!
కాబట్టి సరియైన ఆయుధాన్ని శత్రువు మీద ప్రయోగించాలి!
ఎప్పుడైతే దేవుడు వాక్యమనే
ఆయుధాన్ని సంధించారో- వెంటనే సాతాను గాడు అదే వాక్యమనే ఆయుధాన్ని బాణంగా మరో
శోధనను సంధిస్తున్నాడు ఎవరిమీద? యేసుక్రీస్తుప్రభులవారిమీద! సాతాను గాడికి
వాక్యము, లేఖనాలు బాగా తెలుసు! ఇప్పుడైతే మనము B Thలు BDలు చేస్తున్నాము గాని వాడెప్పుడో వాక్యం మీద Ph.D చేసేశాడు!
ఇప్పుడు వాక్యాన్ని వెదికి- ముందుగా ఆయనను పరిశుద్ధపట్టణం మీదికి తీసుకుని
పోయి, దేవాలయ శిఖరం మీద ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడవు అయితే ఈ శిఖరం
మీదనుండి క్రిందికి దూకెయ్! ఆయన నిన్నుగూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అని
వ్రాయబడింది కదా! దేవదూతలు వచ్చి నిన్ను ఎత్తిపట్టుకొందురు అవి వ్రాయబడింది కదా
అంటున్నాడు! మత్తయి
4:6...
ఈ
మాట/ లేఖనం మనకు కీర్తన 91:12 లో ఉంటుంది...
చూడండి తక్కువ
శక్తిగల సాతాను గాడు యేసుక్రీస్తుప్రభులవారినే ఎత్తుకుని దేవాలయ శిఖరం మీదికి
తీసుకుని పోయాడు! అయితే దేవుడు వాడికి లోంగిపోలేదు గాని పరిస్తితులను గమనిస్తూ
వాడిని ఇప్పుడు జయించాలి గాబట్టి సరియైన ఆయుధంతో వాడిని దెబ్బకొట్టాలని
చూస్తున్నారు అన్నమాట! చూడండి- తన విరోధి తనను తీసుకుని వచ్చినా ఎంతో శాంతంతో
జవాబు చెబుతున్నారు యేసుక్రీస్తుప్రభులవారు! హీరోగిరి చూపించడానికి దానిమీద నుండి
దూకెయ్యడం లేదు! ఒకరకంగా ఎంత మెంటల్ టెన్షన్ పెడుతున్నా ఆయన శాంతంతో వాక్యం నుండి
సరియైన జవాబు చెబుతున్నారు!
నీ దేవుడైన ప్రభువును శోధించకూడదు అని కూడా వ్రాయబడి ఉంది కదా
అన్నారు! మత్తయి 4:7. ఇది ద్వితీ 6:16 చెప్పబడిన లేఖనం అన్నమాట! కాబట్టి రెండోసారి
కూడా వాడిని వాక్య ఖడ్గముతో ఎదుర్కొన్నారు ప్రభువు!
అయితే ఇక్కడ ఒక అనుమానం రావచ్చు! ఎందుకు
వాక్యంతోనే సమాధానం చెబుతున్నారు ప్రభువు అని! కారణం వాక్యం బలమైనది! శక్తిగలది!
సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడి గలది ప్రాణములను
మూలుగులను విభజించునంత శక్తి గలది! బండలు బద్దలు చేసింది!
యిర్మియా 23:29 లో నామాట అగ్ని
వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తివంటిది కాదా? అంటున్నారు.
చివరకు ఆదియందు వాక్యముండెను వాక్యమే
దేవుడైయుండెను!
2 తిమోతి ౩:16,17 ప్రకారం వాక్యాన్ని
ఇలాంటి వారికోసం, మరి విశ్వాసులను సరిదిద్దడానికి కూడా పనికొస్తుంది!
ఇక 2పేతురు 1:21 ప్రకారం ప్రవచనాలు
గాని లేఖనాలు గాని మనుష్యుల ఇచ్చనుండి పుట్టలేదు గాని పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా
కలిగాయి కాబట్టి వాక్యానికి ఇంత శక్తి ఉంది! అందుకే శక్తిగల వాక్యాన్ని ఉపయోగిస్తూ
సాతాను గాడిని ఎదుర్కొంటున్నారు అన్నమాట!
మరో
విషయం గమనించాలి—ఈ మాటలు పలకబోయేసరికి
యేసుక్రీస్తుప్రభులవారు అప్పటికే 40రోజులు ఉపవాసంలోను ప్రార్ధన లోను ఉన్నారు!
ఆత్మావేశుడై ఉన్నారు! అన్ని ఆయుధాలు ధరించుకుని ఉన్నారు! ఇప్పుడు సాతాను గాడు
వాదిస్తున్నాడు శోదిస్తున్నాడు కాబట్టి వాడికి వాక్యంతోనే బుద్ధిచెబుతున్నారు!
ఇక మూడవదిగా వాడు
ఆయనను ఎత్తైన కొండమీదికి తీసుకుని పోయి క్క రాజ్యములు వాటిమహిమను పెద్ద స్క్రీన్
మీద రెండు నిమిషాలలో చూపించేశాడు! చూపించి ఈ భూలోక రాజ్యాలన్నీ ప్రస్తుతం నా
చేతిలో ఉన్నాయి! నన్ను ఒక్కఈ భూలోకం యొసారి మ్రొక్కేసేయ్! వెంటనే ఈ రాజ్యాలన్నీ
నీకిచ్చేస్తాను! నీవు సిలువమీద చనిపోవలసిన అవసరం లేదు లాంటి పనికిమాలిన డైలాగ్లు
అన్ని వేశాడు! ఇప్పుడు వాడికి తెలుసు—దేవుని కొడుకు
దేవుడే! దేవుని కన్నా నన్ను నేను హెచ్చించుకోవాలి అనుకున్నాడు కాబట్టి ఇప్పుడు
యేసుక్రీస్తుప్రభులవారుకూడా దేవుడే కాబట్టి ఒక్కసారి గాని యేసయ్య ఈ సాతాను గాడికి
మ్రొక్కితే ఇప్పుడు దేవునికన్నా తానే గొప్పవాడైనట్లు లెక్క! కాబట్టి తెలివిగా
యేసయ్యను బుట్టలో వేసుకొందామని చూస్తున్నాడు!
వెంటనే యేసుక్రీస్తుప్రభులవారు కి కోపం వచ్చింది- పనికిమాలిన
సాతానుగా నోరుమూసుకుని పో! లేఖనం ఏమి చెబుతుంది అంటే ప్రభువైన నీ దేవునికి
మ్రొక్కి ఆయనకు మాత్రమే సేవించాలి అని వ్రాయబడింది. మూసుకుని పో అన్నారు! మత్తయి
4:9; వెంటనే వాడు పారిపోయాడు!
ఈమాట నిర్గమ 20:1--6; 23:25 లో ఉంది.
ఇక్కడ కూడా డైరెక్టుగా సాతానా పో
అంటే పోతాడు గాని ఒక లేఖనం చూపించి అది తప్పు అని చెప్పి అప్పుడు పనికిమాలిన మాటలు
మాట్లాడుతున్న నీవు మూసుకుని పొమ్మన్నారు దేవుడు! ఇదీ విధానం! సాతాను గాడిమీద మనకు
సంపూర్ణ అధికారం ఉంది! అయితే లేఖనములు చూపించి ఆ వాక్యాధారంగా ఇదిగో ఫలాని లేఖనం
ప్రకారం నీకు నా మీద, ఈ పరిస్తితి మీద ఎటువంటి అధికారం లేదు! పో అని గద్ధించాలి!
ఇది దేవుడు మనకు చూపించిన విధానం! మనం కూడా ఆ విధానం లోనే వాడ్ని ఎదుర్కోవాలి! అలా
చెయ్యాలంటే మొదట మీకు లేఖనములు తెలిసి ఉండాలి. బాగా చదివి అర్థం చేసుకొని ఉండాలి!
మరో అనుమానం
వస్తుంది! ఆయన దేవుడు కదా సాతాను గాడితో శోధనకు ఎందుకు అనుమతించారు? అంటే మొదటిది
ఆయన భూమిమీద ఉన్నారు అప్పుడు! భూలోకం సాతాను గాడి అధికారంలో ఉంది. కాబట్టి తన
పరిచర్య ప్రారంభం చెయ్యాలంటే బలమైన వాడిని ముందు బంధించాలి! కాబట్టి మొదటగా
పరిశుద్ధాత్మ శక్తి పూర్తిగా కావాలి!
తర్వాత ఆ శక్తితో సాతాను గాడిని ఎదిరించి బంధించి ఓడించాలి!
ఇదేసువార్త విధానం!
కాబట్టి ఆయన దేవుడై యున్నా
గాని ఆయన చేసిన విధానాలు- భూమిమీద ఆయనకూడా మీరలేడు! అలా చేస్తే అనగా తాను చేసిన
నియమాలు తానే వ్యతిరేకిస్తే ఎలా? అందుకే ఆయన తాను చేసిన విధానంలో తానే ముందుగా
ప్రయాణించి మనకు మాదిరిగా ఉంచి పోయారు!
అలాగే ఆయన భూమిమీద ఉన్నప్పుడు దేవునికి ప్రార్ధనలు- విజ్ఞాపనలు
చేసినట్లు చూస్తున్నాము! ఆయన దేవుడు కదా, మరెందుకు ప్రార్ధన చేశారు? ఆయనదేవుడు కదా
మరెందుకు అందరిలా బాప్తిస్మము పొందారు అంటే అదంతే! నీతియావత్తు అలా జరగాలి!
భూమిమీద నీకు ఏదైనా జరగాలి అంటే అప్లికేషన్ పెట్టుకోవాలి! అప్పుడు నీ సమస్యకు
పరిష్కారం లేక నీకు కావలసిన సహాయం దొరుకుతుంది! ఇక్కడ ఆయన భూమిమీద మానవుడుగా
వచ్చారు మానవునిగా ఉన్నారు కాబట్టి ప్రార్ధన అనే అప్లికేషన్ పెట్టాల్సిన అవసరం
ఉంది కాబట్టి ఆయనకూడా ప్రార్ధన చేసారు! అదంతే! ఆయనే ప్రార్ధన చేసినప్పుడు, ఆయనే
ఉపవాసముండినప్పుడు నీవు నేను కూడా తప్పకుండా ప్రార్ధించాలి ఉపవాసం ఉండాలి! అదంతే!
ఆయన మాదిరిలోనే మనం కూడా నడవాలి!
కాబట్టి ఈ
మూడు శోధనలకు ఆయన సంపూర్తిగా సర్వాంగకవచం ధరించి వాక్యము అనే ఆత్మఖడ్గాన్ని వాడి,
వాడిని తరిమి జయించారు! మనం కూడా యేసుక్రీస్తుప్రభులవారు చూపించిన మాదిరిగా సాతాను
గాడితో యుద్ధం చెయ్యాలంటే సర్వాంగకవచం ధరించి, ప్రార్ధనాబలం, ఉపవాస బలం,
ఆత్మపూర్ణత పొంది ఆ శక్తితో సాతాను గాడ్ని సరియైన ఆయుధంతో ఎదిరించాలి! సాతాను చేసే
ప్రతీ ఎటాక్ లో మనం వాక్యాన్నిఉపయోగించాలి.
కాబట్టి ఆయన ఉంచిన మాదిరిలో పయనిస్తూ
మన ఆత్మీయ పోరాటంలో సాతానుతో పోరాడుదాం!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -113వ భాగం*
*పిలుపుకి తగిన జీవితం-66*
*విశ్వాసి-ఆత్మీయ పోరాటాలు-5*
ఎఫెసీ 6:11—18
11. మీరు అపవాది (అనగా సాతాను) తంత్రములను ఎదిరించుటకు
శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.
12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో (మూలభాషలో-
రక్తమాంసములతో) కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు
లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.
13. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును,
సమస్తము నెరవేర్చినవారై నిలువ బడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు (దేవుని)
సర్వాంగ కవచమును ధరించుకొనుడి
14. ఏలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను
మైమరువు తొడుగుకొని
15. పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధమనస్సను
జోడుతొడుగుకొని నిలువ బడుడి.
16. ఇవన్నియు గాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు
దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు.
17. మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను
ఆత్మఖడ్గమును ధరించు కొనుడి.
18. ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను
విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో
విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! విశ్వాసి యొక్క ఆత్మీయ పోరాటాలు కోసం ధ్యానం చేసుకుంటున్నాము!
( గతభాగం తరువాయి)
ప్రియ దైవజనమా! ఇంతవరకు మనం విశ్వాసి
ఆత్మీయ పోరాటంలో ఉన్నాడు. మూడు రకాలైన పోరాటాలు చేస్తున్నాడు. అయితే పోరాడే
విధానం- ఆయుధాలు వాడే విధానం అన్నీ బైబిల్ లో గల భక్తుల జీవితానుభవాలనుండి మనం
నేర్చుకోవాలి అనేది ధ్యానం చేసుకుంటూ మొట్టమొదటగా యేసుక్రీస్తుప్రభులవారు సాతాను
గాడిని ఎలా ఎదుర్కొన్నారు అనేది ధ్యానం చేసుకున్నాము!
అయితే సాతానుతో చేసే విభిన్న పోరాటాలు
చూసుకునే ముందు ఈరోజు దేవుడు మనకోసం తయారుచేసిన సర్వాంగకవచము- ఆయుధాలు కోసం చాలా
క్లుప్తంగా ధ్యానం చేద్దాం! కారణం వీటికోసం అనేకమంది ఎంతో మంచి వర్తమానాలు
పొందుచేశారు కాబట్టి క్లుప్తంగా చూసుకుని ముందుకుపోదాం!
గమనించాలి- ప్రతీ విశ్వాసి ఆత్మీయపోరాటం లో ఉన్నాడు! కారణం మనం
రక్షించబడుట సాతానుగాడు జీర్ణించుకోలేక మన విరోధియైన సాతాను ఎవరిని మ్రింగుదునా
అని గర్జించు సింహములా చూస్తున్నాడు! అందుకే వీడితో పోరాడటానికి దేవుడు మనకు
సర్వాంగకవచము ఇచ్చారు!
11లో
మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు అంటున్నారు... *అపవాది తంత్రములు* అంటే సాతాను గాడు ఎన్నో రకాలుగా మోసపూరితముగా
మన ఆధ్యాత్మికతను పోగొట్టడానికి క్రొత్త క్రొత్త టెక్నిక్కులు వాడతాడు. మరో విషయం
సాతాను గాడు సిగ్గులేని వాడు! 10సార్లు ఛీ పోరా అంటే 11వ సారి మరో రూపంతో, మరో
టెక్నిక్ తో వస్తాడు! కాబట్టి వాడి తంత్రాలు మనం తెలుసుకుంటూ ఉండాలి! వాడి
తంత్రాలను ఎదిరించాలి అంటే దేవుడిచ్చు సర్వాంగకవచమును ధరించుకోండి అంటున్నారు
పౌలుగారు! వాడి ఆయుధాలను తంత్రాలను ఎదుర్కోవాలి అంటే తప్పకుండా ఈ సర్వాంగకవచము
ధరించుకోవాలి! మరలా చెబుతున్నాను- సర్వాంగకవచమును పూర్తిగా ధరించాలి, సగం సగం
ధరించకూడదు! అనగా సత్యమనే దట్టి కట్టుకుని రక్షణ అనే శిరస్త్రానాన్ని మరచిపోకూడదు!
శిరస్త్రానాన్ని వేసుకుని ఆత్మఖడ్గము పట్టుకోవడం మరచిపోకూడదు!
ఇక
12 వచనంలో ఏలయనగా మనం పోరాడేది శరీరులతో కాదు ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత
అంధకార సంబంధమగు లోకనాదులతోను పోరాడుతున్నాము అంటున్నారు! గమనించాలి విశ్వాసి చేసే
ఆత్మీయ పోరాటంలో సాతాను గాడికి అనేకులైన సహకారులున్నారు! ఈ భూలోకంలోను,
మధ్యాకాశంలోను, ఇంకా మృతులలోకంలోనూ, ఆత్మలుండే అదృశ్య లోకంలోనూ చాలామంది వాడి
పక్షాన ఉన్నారు. దానియేలు 10వ అధ్యాయం ప్రకారం, 1తిమోతి 4:1, ప్రకటన 16:14 ప్రకారం
అదృష్యులైన పాలకులు కూడా ఉన్నారు. వీరే మనుష్యులు పూజించే దేవుళ్ళు, దేవతలు!
లోకనాదులు అధికారులు ఎవరంటే దేవునిమీద తిరుగబడి పరము నుండి లూసీఫర్ గాడితో పాటు
త్రోయబడిన దేవదూతలు అన్నమాట! దేవుడు వీరిని త్రోసివేసారని దేవునికి వ్యతిరేఖంగా
ఆయన బిడ్డలను పాడు చెయ్యాలనే మాస్టర్ ప్లాన్ వీరిది! కాబట్టి వీరితో మనం
పోరాడుతున్నాము అని గ్రహించాలి!
ఇక
1౩వచనంలో *ఆపద్దినమందు* అంటున్నారు. ఆపద్దినము అనగా ఆపద వచ్చేరోజు
అని అర్ధమయినా- అది క్రీస్తులేని రోజు అని అర్ధం చేసుకోవాలి! అనగా మన స్వంత
ఆశలకోసం, పాపాల కోసం దేవుణ్ణి ప్రక్కన పెట్టి, మన స్వచిత్తం ముందు పెడితే, మన
విశ్వాసం మీద కాకుండా మన ధనం మీద, స్వచిత్తం మీద ఆధారపడితే, ఆరోజు విశ్వాసం
సన్నగిల్లిన రోజు, సాతాను గాడు చాలా సులువుగా మనమీద దాడిచేస్తాడు! అదే ఆపద్దినము!
కాబట్టి ఈ ఆపద్దినమందు వాడిని ఎదిరించాలన్నా మనం సర్వాంగకవచాన్ని పూర్తిగా
ధరించాలి!
14
వ వచనంలో *నడుముకి సత్యమనే
దట్టి*!
అనగా బెల్ట్! బెల్ట్ ఎందుకు వేసుకుంటాము? నడుముకి బలంగా
ఉండటానికి! యోహాను సువార్తలో చెబుతున్నారు- సత్యము నిన్ను స్వతంత్రులుగా
చేయును!..యోహాను సువార్త 8:32; యేసుక్రీస్తుప్రభులవారు అంటున్నారు నేనే మార్గమును
నేనే సత్యమును....యోహాను 14:6; అనగా సత్యము అనే యేసుక్రీస్తు ప్రభులవారిని నీకు
బలంగా ధరించుకుంటే ఎటువంటి సాతాను తంత్రాలనైనా జయించగలవు అన్నమాట! అందుకే 2తిమోతి
2:1లో పౌలుగారు అంటున్నారు క్రీస్తుయేసునందు బలవంతుడవు కమ్ము! బలం కావాలంటే
క్రీస్తుయేసులోనే ఉంది! ఏ బలము? ఆధ్యాత్మిక బలము! ఆత్మబలము! దానితో మాత్రమే నీవు
సైతానుని జయించగలవు!
సత్యమనే దట్టి కట్టుకోవడం అంటే మన
మనస్సులోని బైబిల్ సత్యాలు నింపుకుని ఉన్నది ఉన్నట్లు బోధిస్తూ, వాక్యమెత్తి
వాక్యాన్ని చూపిస్తూ సైతానుతో పోరాటం చెయ్యడం అన్నమాట!
ఇక
*నీతి అనే
మైమరువు*! మైమరువు అనగా కవచం! It
protects sensitive parts of the body! అయితే ఈ మైమరువు అనే కవచం
ఒక్కటే ఉండదు 1థెస్స 5:8ప్రకారం... విశ్వాసం మరియు ప్రేమలు కలిసి కవచంగా
ఏర్పడుతుంది! గాని ఇక్కడ నీతి అనే మైమరువు అని వ్రాయబడింది! అనగా విశ్వాసం-ప్రేమ
కలిసిన కవచమే నీతి అనే మైమరువుగా నిన్ను కాపాడుతుంది అన్నమాట! గమనించాలి- ఆ కవచం మరేదో కాదు! రక్షకుడు అని
పిలువబడే యేసుక్రీస్తుప్రభులవారు! ఆయనే నీకు నీతిగా- ఆయన వలన పొందిన
విశ్వాసం-ప్రేమలు పొందుకుని సాతానుతో యుద్ధము చెయ్యాలి అన్నమాట!
15. *పాదములకు సమాదాన సువార్త వలనైన సిద్ధమనస్సు అనే
జోడుని* తోడుగుకోవాలి!
మొదటిది:
సమాధానం! సాధ్యమైతే సమస్తజనులతో సమాధానంగా సఖ్యముగా ఉండమని బైబిల్ సెలవిస్తుంది!
రోమీయులకు 12: 18
శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా
ఉండుడి.
కనబడిన ప్రతీ ఒక్కరితో తగవు ఆడాలని జగడమాడమని
బైబిల్ చెప్పడం లేదు! సమాధానాన్ని ప్రేమించి దానిని వెంటాడమని చెబుతుంది బైబిల్!
కీర్తన 34:14;
కాబట్టి సమాధానం కలిగి ఉండాలి!
యేసుక్రీస్తుప్రభులవారు తనకు ఎవరు కనబడినా మీకు సమాధానం కలుగును గాక అనేవారు!
షాలోం!!! అలాగే సమాధానంగా ఉండేవారు!
రెండు: సమాధానంగా ఉన్న నీవు ఇప్పుడు
దేవుని సువార్త చెబితే అప్పుడు నీ సువార్త ప్రజలు వింటారు గాని అందరితో కయ్యాలు
ఆడుతూ సువార్త చెబితే ఎవడూ వినడు! ఇలా అందరితో సమాధానంగా ఉంటూ సువార్త చెప్పుకుంటూ
పోతే సాతాను గాడి పునాదులు వణకుతాయి అన్నమాట! ఈ రకంగా మరో రకమైన పోరాటం చెయ్యాలి!
జోడు లేక బూట్లు ఎందుకు? పాదములకు ముళ్ళు,
రాళ్ళు గుచ్చుకోకుండా! తొట్రుపడకుండా! కాబట్టి ఈ సమాధానం, సువార్త కలిస్తే నీవు
తొట్రుపడవు!
ఇక
16వ వచనంలో *విశ్వాసమనే డాలు*
పట్టుకొనుడి. దానితో సాతాను వేసే అగ్ని బాణములను
ఆర్పుటకు శక్తివంతులవుతారు అంటున్నారు! విశ్వాసం అనే డాలు! సాతానుడు వాడు మన
మనస్సులో సంధించే ప్రశ్నలు- అనుమానాలు
నిజంగా అగ్ని బాణాలు వలే పనిచేస్తాయి! మనకు గనుక ఈ విశ్వాసమనే డాలు లేకపోయిందా అంతే
సంగతులు! ఆ బాణము మన గుండెలో గుచ్చుకుపోయి ఆత్మీయ మరణం ఆత్మీయ బ్రష్టులు కావడం
ఖాయం! అందుకే విశ్వాసమనే డాలు! దేవుడు అన్నారు: నేను నిన్ను విడువను! ఎడబాయను!
ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే! నిన్ను ఎత్తుకుని రక్షించు వాడను
నేనే! ఇలాంటి బలమైన ధృడమైన వాగ్దానాలు మనకు ఉండగా సాతాను గాడు వాటిని పనిచేయకుండా
చూడాలని ఈ పనికిమాలిన ప్రశ్నలు- అనుమానాలు హృదయంలో- మనస్సులో పుట్టిస్తున్తాడు
వెంటనే మనం చెప్పాలి- ఇదిగో ఫలాని వచనంలో దేవుడు ఇలా అన్నారు! అలా అన్నారు! దేవుడు
నాతోనే ఉన్నారు!! నీవు నోరు మూసుకుని పో అనాలి! ఇలా ఈ విశ్వాసమనే డాలుని వాడాలి!
ఇశ్రాయేలు ప్రజలకి తాము గొలియాతుకి పురుగులులా ఉన్నామని అనుకున్నారు! దావీదు గారు
తన సమస్యను తనతో పోల్చుకోకుండా తన సమస్యను- దేవునితో పోల్చుకుంటే గొల్యాతే ఒక
పురుగులాగా కుక్కలాగా కనబడ్డాడు! విశ్వాసాన్ని ప్రదర్శించాడు! కారణం బండను బద్దలు
చేసిన దేవుడు, సూర్యచంద్రులను ఆపిన దేవుడు, ఎర్రసముద్రం, యోర్దాను నదిని పాయలు
చేసిన దేవుడు ఈ గొల్యాతును చంపగలడు అనుకున్నాడు- వెళ్లి ఒక్కదెబ్బతో కొట్టి
చంపేశాడు! అదీ విశ్వాసం! మనం కూడా అలాగే చెయ్యాలి!
17
వ వచనం: *రక్షణ అనే శిరస్త్రాణం* అనగా రక్షణ అనే హెల్మెట్! హెల్మెట్ మన తలకు రక్షణగా ఉంటుంది!
అయితే మరలా ఈ హెల్మెట్ సింగిల్ గా రాదు! 1థెస్స 5:8 ప్రకారం ఇది రక్షణ-నిరీక్షణ
అనే కాంబినేషన్లో దొరుకుతుంది! అనగా రక్షణ ఉంటే నిరీక్షణ వస్తుంది! నిరీక్షణ
లేకపోతే రక్షణ నిలబడదు! కాబట్టి ఈ రెండు ఒకదానిమీదొకటి ఆధారపడి ఉంటాయి! దేవుడు
నన్ను చేయివిడువడు అనే నిరీక్షణ కలిగి మనకు కలిగిన రక్షణను కాపాడుకుంటే అది నిన్ను
అనగా రక్షణ నిన్ను పరలోకం తీసుకెళ్తుంది!
ఇక్కడ
మొదటగా: రక్షణ నిన్ను నరకం నుండి తప్పిస్తుంది! కాబట్టి నీ రక్షణను
అనగా నీవు పొందుకున్న రక్షణ భాగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి!
రెండు: *హెల్మెట్ అనేది ఎప్పుడూ తలమీద ఉంటుంది! అలాగే రక్షణ అనేది
కూడా నీ తలమీద ఉండాలి! తలలో మెదడు ఏ రకంగా మనిషిని కంట్రోల్ చేస్తుందో అదే రకంగా
రక్షణ కూడా నిన్ను కంట్రోల్ చెయ్యనియ్యాలి! అనగా రక్షణ కూడా నీ తలమీద ఉండాలి అనగా
అస్తమాను- నేను రక్షణ పొందుకున్నవాడిని/దానను అనే స్పృహ నీకుండాలి! నేను రక్షణ
పొందుకున్న వాడిని అనే ఆలోచనతో నీవుంటే- నీ ఆలోచనల ద్వారా గాని, మాటల ద్వారా గాని,
చూపుల ద్వారా గాని, ప్రవర్తన ద్వారా గాని పాపం చెయ్యలేవు! ఎందుకంటే రక్షణ
పొందుకున్నావు అనే విషయం నిన్ను కంట్రోల్ చేస్తుంది! అంటే చివరికి It Contols your Attitude!!! ఈ
రకంగా రక్షణ అనేది నీవు పాపం చెయ్యకుండా నిన్ను ఆపి నిన్ను నరకంలోకి పోకుండా
నిన్ను తప్పిస్తుంది! అదే విధముగా రక్షణను
నీవు కూడా కాపాడుకోవాలి!*
ఇక
తర్వాతది: *దేవుని వాక్యము అనే ఆత్మఖడ్గము!*
దేవుని వాక్యాన్ని ఆత్మఖడ్గము అని ఎందుకు అన్నారు?
ఎందుకంటే వాక్యము అనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఖడ్గము కాబట్టి! ముందు బాగాలులో
చెప్పడం జరిగింది వాక్యమునకు ఎంత శక్తి ఉందో! వాక్యమే దేవుడు! కాబట్టి ఈ
ఆత్మఖడ్గమును ఉపయోగిస్తూ ఉండాలి! అనగా వాక్యాన్ని అర్ధం చేసుకుని దానిని ఖడ్గం వలే
ఉపయోగిస్తూ ఉండాలి- సాతాను మీద యేసుక్రీస్తుప్రభులవారు వాడినట్లు సాతాను మీద! మనలో
రేగే తలంపుల మీద, పాపపు ఆలోచన మీద, తలంపుల మీద, సాతాను సంధించే ప్రశ్నలు -అనుమానాల
మీద వాక్యాన్ని ఖడ్గములా వాడాలి!
వాక్యము ఆయుధము! ఉదాహరణకు కీర్తన 119:95లో
భక్తుడు అంటున్నారు: నన్ను సంహరించాలని భక్తిహీనులు పొంచియున్నారు అయితే నేను నీ
శాసనములు తలపోయుచున్నాను అంటున్నారు! అనగా ఇక్కడ వాక్యాన్ని ఖడ్గములా
వాడుతున్నారు భక్తుడు! అనగా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పని చేసి అనేకులను
ప్రభువు దగ్గరకు నడిపించగలరు!
హెబ్రీ
4:12 ప్రకారం వాక్యము: రెండంచులు గల ఖడ్గము!
శక్తిగలది! సజీవమైనది! బలమైనది!
రెండంచులు ఎందుకంటే ఒక అంచుతో మనలను మనం కాపాడుకుంటూ రెండో
అంచుతో సాతాను గాడి అంతు చూడాలి అన్నమాట!
ఖడ్గాన్ని ఎప్పుడూ వరలో పెట్టుకోవాలి మరియు పదును పెడుతూ ఉండాలి!
వరలో ఉంచుకోవాలి అనగా నీ మనస్సులో హృదయంలో ఎల్లప్పుడూ వాక్యము నిండిపోవాలి!
పదును పెట్టాలి అంటే ఎల్లప్పుడూ దానిని చదువుతూ ధ్యానిస్తూ ఉండాలి!
అప్పుడే అది పదును గలదై సాతానుతో పోరాడేటప్పుడు షార్ప్ గా ఉండు వాడిని చీల్చగలదు!
18:
*ఆత్మవలన ప్రతీ విషయంలోనూ ప్రార్ధన చెయ్యాలి*!
ప్రార్ధన ద్వారానే మనం ప్రభుతో మాట్లడగలము కాబట్టి
ప్రార్ధన ద్వారా మనం దేవునితో సంబంధం కలిగి ఉంటాము కాబట్టి పరిశుద్ధాత్మను
అనుభవిస్తూ మన ఆత్మయందు అనుదినం ప్రతీ సమయంలో కూడా ప్రతీ విధమైన ప్రార్ధన
చెయ్యాలి! అవును ఇదే ప్రార్ధన ద్వారా అనేకులైన సాక్షి సమూహము ఎన్నో గొప్ప
కార్యాలు, అసాధారణ అద్భుతాలు చెయ్యగలిగారు! మనం కూడా ప్రార్ధనా పూర్ణులై ఉండాలి!
సాతానుగాడి కోటలు కూల్చాలి!
ఇదీ సర్వాంగకవచము అంటే! ఈ సర్వాంగ కవచము మనందరం ధరించి ఆత్మీయ
పోరాటంలో విజయులై నిలిచిపోదాము!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -114వ భాగం*
*పిలుపుకి తగిన జీవితం-67*
*విశ్వాసి-ఆత్మీయ పోరాటాలు-6*
ఎఫెసీ
6:11—18
11. మీరు అపవాది (అనగా సాతాను) తంత్రములను ఎదిరించుటకు
శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.
12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో (మూలభాషలో-
రక్తమాంసములతో) కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు
లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.
13. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును,
సమస్తము నెరవేర్చినవారై నిలువ బడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు (దేవుని)
సర్వాంగ కవచమును ధరించుకొనుడి
14. ఏలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను
మైమరువు తొడుగుకొని
15. పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధమనస్సను
జోడుతొడుగుకొని నిలువ బడుడి.
16. ఇవన్నియు గాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు
దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు.
17. మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను
ఆత్మఖడ్గమును ధరించు కొనుడి.
18. ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను
విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో
విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! విశ్వాసి యొక్క ఆత్మీయ పోరాటాలు కోసం ధ్యానం చేసుకుంటున్నాము
( గతభాగం తరువాయి)
ప్రియ దైవజనమా! ఇంతవరకు మనం విశ్వాసి
ఆత్మీయ పోరాటంలో ఉన్నాడు. మూడు రకాలైన పోరాటాలు చేస్తున్నాడు. అయితే పోరాడే
విధానం- ఆయుధాలు వాడే విధానం అన్నీ బైబిల్ లో గల భక్తుల జీవితానుభవాలనుండి మనం
నేర్చుకోవాలి అనేది ధ్యానం చేసుకుంటూ మొట్టమొదటగా యేసుక్రీస్తుప్రభులవారు సాతాను
గాడిని ఎలా ఎదుర్కొన్నారు అనేది ధ్యానం చేసుకున్నాము!
ఇప్పుడు భక్తుడైన యెహోషువా గారు ఎలా ఎదుర్కొన్నారో
క్లుప్తంగా చూసుకుందాం!
మోషే గారి తర్వాత దేవునిచేత నాయకత్వము అనుగ్రహించబడింది యెహోషువా
గారికి! మోషే గారి పాదాల దగ్గరే నాయకత్వపు లక్షణాలు నేర్చుకున్నారు. ముఖ్యంగా
మోషేగారి జీవితపు- నాయకత్వపు అనుభవాల నుండి నేర్చుకుని రాటుదేలారు యెహోషువా గారు!
మరీ ముఖ్యంగా మోషే గారి నుండి దేవునిమీద ఆనుకోవడం, నిరీక్షణ, విశ్వాసం అనేవి చాలా
బాగా నేర్చుకున్నారు! అంతకంటే శ్రేష్టంగా దేవునితో గడపడం వలన పొందుకునే లాభాలు
ఏమిటి? దేవుని సన్నిధిలో గడపడంలో గల మజా మోషేగారి కంటే ఎక్కువగా అనుభవించారు
యెహోషువా గారు! ఆ తర్వాత దేవుడు నాయకత్వాన్ని అప్పగించారు!
మోషేగారికి మొదట నుండి శత్రువులే! ఇశ్రాయేలు ప్రజలలో నుండే కాక
సొంత బంధువుల నుండి కూడా శత్రువులు ఉన్నారు, ఆయన చనిపోయే వరకు! గాని యెహోషువా
గారికి శత్రువు అనేవాడే లేడు! ఆయనకోసం ప్రాణం పెట్టేవారు ఉన్నారు! ఆయనకు
వ్యతిరేఖంగా ఎవడైనా పొరపాటున మాట్లాడితే వారిని చంపెయ్యడానికి అందరూ అనుమతి
ఇచ్చేశారు! అంత పవర్ ఫుల్ నాయకుడు యెహోషువా గారు!
అయితే యెహోషువా గారు ఆత్మీయ పోరాటాలు- యుద్దాలు చెయ్యలేదా అంటే-
మోషే గారి కంటే ఎక్కువగా చేశారు! మోషేగారికి సొంతవారితోనూ శత్రువుతోను పోరాటాలు
అయితే యెహోషువా గారికి పరిస్తితులు, 36మంది రాజులు, యోర్దాను నది, యెరికో కోట,
అరణ్యం లాంటివి ఎదురయ్యాయి! మోషేగారికైతే
ఎప్పుడూ దేవుని సన్నిధి తోడుగా నుండి- తండ్రి అంటే కుమారుడా అని పిలిచే దేవుడు-
సాన్నిహిత్యం ఉంది! యెహోషువా గారికి లేదు! అయినా వీరోచితంగా ఆత్మీయ యుద్ధాలు-
శత్రువులతో యుద్దాలు చేశారు!
మోషేగారు కేవం ముగ్గురు
రాజులనే జయించారు! యెహోషువా గారు 36మంది రాజులను జయించారు! మోషేగారు- అమోరీయుల
రాజులైన సీహోను ఓగు ప్రాంతాలను మాత్రమే స్వాధీనం చేసుకుంటే యెహోషువా గారు యెరికోతో
మొదలెట్టి మొత్తం కనాను రాజ్యమంతా జయించారు!
యెహోషువా గారికి
ఎదురైన మొదటి చాలెంజ్- యెరికో!
దేవుడన్నారు: నీవు బయలుదేరి యోర్దాను దాటిపో! మీతో నేను
ఉంటాను అన్నారు! అయితే ఒక వాగ్ధానం ఉంది. నేను మోషేకు తోడుగా ఉన్నట్లు నీకును
తోడుగా ఉందును అన్నారు దేవుడు. ఆ వాగ్దానం పట్టుకుని పోతున్నారు ఇక్కడ. అయితే
దేవుడు మోషేగారి తో చెప్పినట్లు ఏ అద్భుతం చేస్తారో చెప్పలేదు! వెంటనే ప్రజలను
తయారవమని చెప్పి మిమ్మును మీరు శుద్ధిచేసుకోమని చెబుతూ- మనం రేపు యోర్దాను
దాటుతున్నాము! దేవుడు ఏం చేస్తారో నాకయితే తెలియదు గాని మీరు రడీగా ఉండండి! దేవుడు
అద్భుతం చేస్తున్నారు, మనం యోర్దాను దాటుతున్నాము అన్నారు అంతే! ప్రజలు నమ్మారు! ముఖ్యంగా
యెహోషువా గారు విశ్వాసంతో నమ్మిక ఉంచారు! ఈ నమ్మిక ప్రోసెస్ జరిగాక చివరలో దేవుడు
చెప్పారు- యాజకుల కాళ్ళు యోర్దాను తాకిన వెంటనే యోర్దాను విడిపోతుంది అని! ముందుగా
చెప్పలేదు! యాజకుల కాళ్ళు యోర్దానును తాకాయి! యోర్దాను ఆగిపోయింది! ఇక్కడ యెహోషువా
గారు వాడినవి- విశ్వాసమనే డాలు! నమ్మకం, నిరీక్షణ ఇంకా పూర్తి లొంగుబాటు! (complete submission
and full obedience)! దేవుడికి మనిషిలో కావలసినవి అవే! మోషేగారి
పాదాల దగ్గర అవే నేర్చుకున్నారు ఆయన!
తర్వాత ఎదురైంది
యెరికో కోటలు! మహా బ్రహ్మాండమైనవి! పడగొట్టడం
అసాధ్యం! దేవుడు ఎలా చెయ్యాలో ఏమి చెయ్యాలో చెప్పారు! అయితే సాతాను గాడు ఎప్పటిలా
ఈ యెరికో కోటలు పడగొట్టగలవా అంటూ గుసగుసలాడాడు! వెంటనే ధైర్యం చెప్పుకున్నారాయన!
యోర్దాను నదిని పాయలు చేసిన దేవుడు యెరికో కోటలు బ్రద్దలు గొట్ట గలడు! అయినా
యోర్దాను దాటిన వెంటనే యెహోవా సైన్యాధిపతితో ముఖాముఖి జరిగాక అసలు భయపడటం లేదు!
యెహోషువా యెహోవా సైన్యాధిపతి దగ్గరికి వెళ్లి నీవు మా పక్షాన వచ్చావా లేక మా
శత్రువుల పక్షాన వచ్చావా? అంటే నేను మీ పక్షం వాడిని కాదు, వారి పక్షం వాడిని
కాదు! ఇశ్రాయేలు పక్షంగా యుద్దాలు చెయ్యమని యెహోవా సేనాధిపతిగా వచ్చాను అన్నాడు
ఆయన! వెంటనే సాష్టాంగపడ్డాడు! ఇప్పుడు ఎందుకు భయపడాలి? దేవుడే తన సైన్యాధిపతిని
పంపించారు! విజయం ఖాయం! భయపడలేదు! ఎందుకు ఏమిటి ఎలా? అని అనుమానించలేదు! ఏడురోజులు
చుట్టూ తిరిగి ఏడో రోజు కేకలు వేస్తే వచ్చిన అనునాదం (Resonance) వలన కోట బ్రద్ధలయ్యింది. గెలిచేశారు! ఇక్కడ కూడా గెలవడానికి సహాయం చేసింది
- విశ్వాసమనే డాలు, నమ్మకం, నిరీక్షణ ఇంకా పూర్తీ లొంగుబాటు! (complete
submission and full obedience)!
తర్వాత పెద్ద చాలెంజ్! ఐదుగురు రాజులు, లెక్కించలేనంత సైన్యం!
అయితే దేవుడు వారి పక్ష్యాన యుద్ధం చేస్తున్నారు!
వీరు కేవలం దొరికిన వారిని దొరికినట్లు నరుకుకుంటూ పోతున్నారు! శత్రువులు ఓడిపోయి
పారిపోతున్నారు! అది మనలాంటి పీఠభూమి చదును ప్రాంతం కాదు! కొండలు లోయలు అరణ్యాలు
గల ప్రాంతం! శత్రువులు ఇప్పుడు పారిపోతున్నారు! వీరు తరుముతున్నారు! ఇంతలో మీదన
చూస్తే తొందరలో ప్రొద్దు గుంకే లాగుంది! ఒక్కసారి చీకటి పడితే శత్రువులను
పట్టుకోవడం కష్టం! ఏమి చెయ్యాలి? గెలిచినా విజయం సగం కూడా సాధించినట్లు అవదు!
ఆలోచించి దేవుడు చేసిన అద్భుతాలు జ్ఞాపకం చేసుకున్నారు! ఎర్రసముద్రం తన కళ్ళముందే
కదా చీలిపోయింది! తన కళ్ళముందే కదా బండనుండి నీరు వచ్చింది! ఐగుప్టు దేశంలో తన
కళ్ళముందు దేవుడు ఎన్ని అద్భుతాలు చేసారో తెలుసు! తను నాయకుడయ్యాక ఏవిధంగా
యోర్దాను నది పాయలయ్యిందో ఏవిధంగా యెరికోకోటలు బ్రద్ధలయ్యాయో తెలుసు! ఇక ఆగలేదు!
యుద్ధం గంభీరంగా జరుగుతుంది! ఆయన హృదయంలో పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తున్నాడు!
(యుద్ధం మానేసి భాషలు మాట్లాడుతున్నారు అని నా ఉద్దేశం). వెంటనే అత్మపూర్నుడై ఒక
అసాధారణ ప్రార్ధన చేశారు ఆయన! ఇంతవరకు ఏ మానవుడు అలాంటి ప్రార్ధన చెయ్యలేదు!
అలాంటి ప్రార్ధనను దేవుడు కూడా అంగీకరించలేదు! సూర్యుడా! నీవు గిబియోనులో ఆగిపో!
చంద్రుడా! నీవు అయ్యాలోను లోయలో ఆగిపో! అన్నాడు ఆయన! సూర్యుడు చంద్రుడు తమ
గమనాన్ని ఆపేశాయి! ప్రకృతి స్తంభించింది! వెళ్లారు- ఐదుగురు రాజ్యాల సైనికులను
చీల్చి చెండాడి, అయిదుగురు రాజులను చంపేశారు! అసాధారణ ప్రార్ధన, అసాధారణ అద్బుతం!
మహాద్భుతం!
యెహోషువ 10: 12
యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట అమోరీయులను అప్పగించిన దినమున,
ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను సూర్యుడా, నీవు
గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ
శత్రువులమీద పగతీర్చుకొనువరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను. అను మాట యాషారు
గ్రంథములో వ్రాయబడియున్నది గదా.
యెహోషువ 10: 13
సూర్యుడు ఆకాశమధ్యమున నిలిచి యించు మించు ఒక నాడెల్ల
అస్తమింప త్వరపడలేదు.
యెహోషువ 10: 14
యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినమువంటి దినము దానికి
ముందేగాని దానికి తరువాతనేగాని యుండలేదు; నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా
యుద్ధము చేసెను.
ఇక్కడ యెహోషువా
గారు వాడిన ఆయుధం ఆత్మవలన ప్రతీ విధమైన ప్రార్ధన! ప్రార్థన అనే కవచం! ఇది
ప్రత్యక్షగుడారంలో తను దేవుని సన్నిధిలో గడపడం వలన నేర్చుకున్నారు ఆయన! అక్కడే
ఆత్మను పొందుకున్నారు! మోషేగారు అయితే గుడారం నుండి పనుల వలన బయటకు వచ్చేవారు గాని
యెహోషువా అనే యువకుడు బయటకు రాలేదు అని వ్రాయబడింది! ఇక్కడ యెహోషువా గారికి ఎక్కడ
ఏ ఆయుధం ఉపయోగించాలో ఎలా ఉపయోగించాలో బాగా తెలుసు! అందుకే పరిశుద్ధాత్మను
పొందుకుంటే ఆయన మనలను సర్వసత్యములోనికి నడిపిస్తారు!
మనం కూడా ఇలాగే దేవుడు మనకిచ్చిన సర్వాంగ కవచం ధరించుకుని
ఆతీయపోరాటం చెయ్యాలి!
దైవాశీస్సులు!
(ఇంకాఉంది)
*ఎఫెసీ పత్రిక -115వ భాగం*
*పిలుపుకి తగిన జీవితం-68*
*విశ్వాసి-ఆత్మీయ పోరాటాలు-7*
ఎఫెసీ 6:11—18
11. మీరు అపవాది (అనగా సాతాను) తంత్రములను ఎదిరించుటకు
శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.
12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో (మూలభాషలో-
రక్తమాంసములతో) కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు
లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.
13. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును,
సమస్తము నెరవేర్చినవారై నిలువ బడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు (దేవుని)
సర్వాంగ కవచమును ధరించుకొనుడి
14. ఏలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను
మైమరువు తొడుగుకొని
15. పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధమనస్సను
జోడుతొడుగుకొని నిలువ బడుడి.
16. ఇవన్నియు గాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు
దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు.
17. మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను
ఆత్మఖడ్గమును ధరించు కొనుడి.
18. ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను
విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో
విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! పిలుపుకి తగ్గ జీవితం జీవించడములో కలిగే విశ్వాసి యొక్క ఆత్మీయ
పోరాటాలు కోసం ధ్యానం చేసుకుంటున్నాము!
( గతభాగం తరువాయి)
సాతానుతో పోరాటం
ప్రియ దైవజనమా! ఇంతవరకు మనం విశ్వాసి
ఆత్మీయపోరాటం – సాతాను గాడితో చేసే విధానం
కోసం యేసుక్రీస్తుప్రభులవారు చేసిన విధానం నుండి యెహోషువా గారి జీవితానుభవం నుండి
చూసుకున్నాం!
ఇక మిగిలిన సాతానుతో చేసే ఆత్మీయ
పోరాటాల కోసం క్లుప్తంగా చూసుకుందాం!
అవి:
రోగాలు, చెడుపులు-చిల్లంగులు, దయ్యం పట్టడం- వాటిని
వదలగొట్టడం, శ్రమలు-శోధనలు, లేనిపోని
కుటుంబ కలహాలు, మనకు సంబంధం లేని కోర్టు కేసులు, క్రీస్తు నామం కొరకైన
దెబ్బలు-అవమానాలు, జైలు లాంటివి!
అయతే
వీటికోసం ధ్యానం చేసే ముందు కొన్ని విషయాలు ప్రతీ విశ్వాసి గుర్తుపెట్టుకోవాలి!
మొదటిది: ఎప్పుడైతే ఒక వ్యక్తి నిజమైన పశ్చాత్తాపంతో మారుమనస్సు
పొంది బాప్తిస్మము తీసుకుంటాడో వెంటనే ఆ వ్యక్తి స్టేటస్ మారిపోతుంది! ముందు పాపి,
పాపానికి బానిస గా ఉన్న వ్యక్తి, విశ్వాసి, దేవుని కుమారుడు, వాగ్దానాలకు వారసుడు,
రాజకుమారుడుగా స్టేటస్ మారిపోతుంది. తనను
ఎందరు అంగీకరింతురో వారందరికీ పిల్లలు అగుటకు అనగా ఆయన పిల్లలు వారసులు అవడ్డానికి
ఆయన అధికారం ఇచ్చారు! మీరు పిల్లలైతే వారసులు అనికూడా చెప్పారు! అనగా దేవుడు చేసిన
వాగ్దానాలకు, పరలోకానికి ఆశీర్వాదాలకు హక్కులకు-విధులకు వారసులు! ఇక పాపానికి బానిసలూ
కారు! ఇంకా మార్కు 16:15—18 వరకు చూసుకుంటే
అక్కడ రక్షించబడిన వ్యక్తికీ కొన్ని అధికారాలు ఇచ్చారు. నా నామమున దయ్యాలు
వెళ్ళగొడతారు, క్రొత్త భాషలు మాట్లాడుతారు! పాములను ఎత్తి పట్టుకుంటారు.... రోగుల
మీద చేతులుంచినప్పుడు అనగా రోగులమీద చేతులుంచి ప్రార్ధన చేసినప్పుడు వారి స్వస్థత
పొందుదురు! ఇంత స్పష్టమైన అధికారాలు దేవుడు తన కుమారులమైన మనకు ఇచ్చి యుండగా ఇంకా
పనివాడులాగా, బానిస లాగ ఎందుకు సాతాను గాడి దగ్గర లొంగి ఉంటావు? కాబట్టి అధికారంతో
పోరాటం చెయ్యాలి!
రెండు: రక్షణ పొందిన ప్రతీ వ్యక్తి దేవుడు ఆరోగ్యంగా ఆశీర్వాదంతో
ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు! నీవు రోగాలతో, ఆర్ధిక ఇబ్బందులతో, పేదరికంతో
అనేకమైన బాధలతో ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు లేదు లేదు! అన్ని విషయాలలో నీవు
సౌకర్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి! సౌక్యం గా ఉండాలి! ఇదే దేవుడు
కోరుకుంటున్నారు! కాబట్టి ఆరోగ్యం నీ హక్కు! దానిని జబ్బులతో బాధపెట్టడానికి
సాతాను గాడికి అధికారం లేదు! కాబట్టి అధికారంతో దానిని శాశించాలి! అది పరిస్తితి
అయినా, రోగమైనా, ప్రకృతి అయినా సమస్య అయినా సరే!
సరే,
మొదటగా: *రోగాలు-జబ్బులు
వచ్చినప్పుడు ఏమి చెయ్యాలి?* ఎలావిడుదల పొందాలి?
జవాబు: దేవుడిచ్చిన సర్వాంగకవచమును పూర్తిగా వాడాలి! ఇక్కడ
ఉపయోగించాల్సిన ఆయుధాలు: సర్వాంగకవచము+ వాక్యఖడ్గము! ఎలా అంటే ఆరోగ్యం/స్వస్థత
నీహక్కు! అది నీ జన్మహక్కు! కాబట్టి అధికారంతో చెప్పాలి సాతాను గాడితో-
యేసుక్రీస్తుప్రభులవారి నామంలో స్వస్థత ఉంది, ఆయన ఎంతోమందిని స్వస్తపరిచారు, ఆయన
పొందిన గాయాల వలన నేను స్వస్తత విడుదల పొందాను... 1పేతురు 2:24 వచనం ప్రకారం,
మార్కు 16:16—18 ప్రకారం దేవుడు నాకు అధికారం ఇచ్చాడు!
జన్మహక్కు అని ఎందుకంటున్నాము అంటే నిశ్చయంగా ఆయన మన రోగములను
భరించెను. యెషయా 53:4; కాబట్టి ఈ వాగ్ధానాలు స్వతంత్రించుకుని విశ్వాసంతో పలకాలి!
కాబట్టి యేసుక్రీస్తుప్రభులవారు అధికారం గల నామంలో నిన్ను ఆజ్ఞాపించేదేమిటంటే నేను
దేవుని బిడ్డను, నా మీద నీకు అధికారం ఏమీలేదు! ఆరోగ్యం/స్వస్థత నాహక్కు! కాబట్టి
నన్ను బాధిస్తున్న ఓ రోగమా, దురాత్మా, సమస్యా యేసునామంలో నీకు ఆజ్ఞాపిస్తున్నాను
నన్ను విడచిపో ఇప్పుడే! అని అధికారంతో వాక్యాన్ని అనగా ఆత్మఖడ్గంతో వచనాలు
చూపిస్తూ విశ్వాసంతో చెప్పాలి! వెంటనే వాడు పారిపోతాడు! అది ఏ రోగమైనా పోవలసినదే!
యేసునామము కంటే బలమైన రోగము సమస్య ఏమీలేదు! యేసుక్రీస్తు స్వస్థ పరచలేని రోగం,
సమస్య లోకంలో ఏదీలేదు! భూలోకమందు పరలోకమందు ఆయన నామమునకు ఏదైనా లోబడవలసినదే!
కాబట్టి ఉన్న వనరులు వాడండి! అలా కాకుండా
ఏమండి దయ్యం గారు! దయచేసి వెళ్ళిపొండి! తట్టుకోలేకపోతున్నాను అని
బ్రతిమిలాడితే వాడు- ఎవడ్రా నీవు? నేను పొమ్మంటే పోను అంటాడు! అదే ఓ పనికిమాలిన
దయ్యమా! (మీద చెప్పిన అన్నీ చెప్పి) యేసునామంలో బయటకు ఇప్పుడే పో అని విశ్వాసంతో
అధికారంతో వాక్యాన్ని ఉపయోగించి చెబితే వెంటనే వాడు పటాపంచలైపోతాడు! రోగం
మాయమవుతుంది!
ఈ మధ్యనే నాకు కలిగిన
అనుభవం ఒకటి చెబుతాను! ఈ మధ్యన దేవుడు నాకు 5000 మంది ఆత్మలను ఇస్తాను అని
వాగ్దానం చేశారు! దానికి ఈ మధ్యన నేను సరే, దేవుడా! నా ఆశ నీవు నెరవేర్చావు
కాబట్టి నీవు నాకిచ్చిన టాస్క్ నేను నెరవేర్చు తాను అని హృదయపూర్వకంగా వాగ్దానం
చేశాను! దేవుడు వెంటనే అడిగారు నన్ను సరేనా? అన్నారు! నేను సరే ప్రభువా అన్నాను!
వెంటనే ఆయన అన్నారు- దానిని నీవు సాధించాలి అంటే ఇంతవరకు నీవు ఎన్ని శోధనలు
కష్టాలు అనుభవించావో దానికి రెట్టింపు పరీక్షలు శోధనలు పంపబోతున్నాను, ఆర్ధికంగా,
మానసికంగా, కుటుంబపరంగా ఆరోగ్యపరంగా అన్ని విషయాలలోనూ రెట్టింపు పరీక్షలు ఇప్పటి
నుండి పెట్టబోతున్నాను, నీవు తట్టుకుని నేర్చుకున్న తర్వాత నీకు 5000 మంది ఆత్మలను
ఇస్తాను అన్నారు! నేను సరే అన్నాను! ఆ రోజునుండి భయంకరమైన పరీక్షలలో నేను
వెళ్తున్నాను! అన్ని విషయాలలోనూ శోధించబడుతున్నాను! నా కుమారుని ఆరోగ్యం బాగాలేదు,
కొన్ని రోజులకు నాకు కూడా బ్లడ్ లో CRP పెరిగిపోయి ముడుకుల నొప్పి,
జాయింట్ల నొప్పి పెరిగిపోయి చాలారోజులు బాధపడ్డాను! నేను ఏమనుకున్నాను అంటే దేవుడు
ముందే చెప్పారు కదా- అదే ఇది అనుకున్నాను! సాతాను గాడు కూడా అదే నా చెవిలో
ఊదేవాడు! పదిరోజులముందు నాకు ఏమని గుర్తుకు వచ్చిందంటే ఆరోగ్యం/స్వస్థత నా హక్కు
కదా! మరి ఎందుకు అడగకూడదు అనుకున్నాను- వెంటనే మందిరంలోకి పోయాను, (మందిరానికి- నా
మెయిన్ డోర్ కి కేవలం నాలుగు అడుగులే, అలాగే ఇల్లు కట్టుకున్నాను) వెంటనే నోరు
తెరిచి- ప్రభువా ఆరోగ్యం నాహక్కు కదా, అందుకే అడుగుతున్నాను అని చెప్పి- వాక్య
రిఫరెన్సులు ఎత్తి చెబుతూ నన్ను భాధపెడుతున్న ఓ ముడుకుల నొప్పి, జాయింట్ నొప్పి,
యేసు అధికారం గల నామంలో చెబుతున్నాను- ఆరోగ్యం/స్వస్థత నా హక్కు కాబట్టి వెంటనే
విడిచిపో! అని విశ్వాసంతో చెప్పాను! రెండు
రోజుల తర్వాత వెదికినా నా నొప్పి తెలియడం లేదు! మాయమైపోయింది! అది మన హక్కు!
అధికారంతో అడగండి! బ్రతిమిలాడవద్దు! అధికారంతో సాతాను గాడిని పొమ్మని శాశించండి!
నోరు మూసుకుని పెట్టె సర్దుకుని పోతాడు! అది ఆరోగ్య సమస్య గాని, బయట సమస్యలు గాని
యేసునామంలో వాక్యానుసారమైన అధికారాలతో వాక్యాన్ని ఎత్తి గట్టిగా శాశించండి! అంతే!
వాడు పోక తప్పదు!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -116వ భాగం*
*పిలుపుకి తగిన జీవితం-69*
*విశ్వాసి-ఆత్మీయ పోరాటాలు-8*
ఎఫెసీ 6:11—18
11. మీరు అపవాది (అనగా సాతాను) తంత్రములను ఎదిరించుటకు
శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.
12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో (మూలభాషలో-
రక్తమాంసములతో) కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు
లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.
13. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును,
సమస్తము నెరవేర్చినవారై నిలువ బడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు (దేవుని)
సర్వాంగ కవచమును ధరించుకొనుడి
14. ఏలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను
మైమరువు తొడుగుకొని
15. పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధమనస్సను
జోడుతొడుగుకొని
నిలువ బడుడి.
16. ఇవన్నియు గాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు
దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు.
17. మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను
ఆత్మఖడ్గమును ధరించు కొనుడి.
18. ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను
విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో
విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! పిలుపుకి తగ్గ జీవితం జీవించడములో కలిగే విశ్వాసి యొక్క ఆత్మీయ
పోరాటాలు కోసం ధ్యానం చేసుకుంటున్నాము!
( గతభాగం తరువాయి)
సాతానుతో పోరాటం
ఇక
మిగిలిన సాతానుతో చేసే ఆత్మీయ పోరాటాల కోసం క్లుప్తంగా చూసుకుందాం!
అవి:
రోగాలు, చెడుపులు-చిల్లంగులు, దయ్యం పట్టడం- వాటిని
వదలగొట్టడం, శ్రమలు-శోధనలు, లేనిపోని
కుటుంబ కలహాలు, మనకు సంబంధం లేని కోర్టు కేసులు, క్రీస్తు నామం కొరకైన
దెబ్బలు-అవమానాలు, జైలు లాంటివి!
ఇక *దయ్యం
పట్టడం, చెడుపు చిల్లంగులు, దయ్యాన్ని వదలగొట్టేటప్పుడు ఏమిచెయ్యాలి అనేది
చూసుకుందాం!*
గతభాగం లో చెప్పినట్లు దేవుడు మనకు మార్కు 16:16—18 లో ఇచ్చిన అధికారాన్ని
ఉపయోగించాలి! వాడికి చెప్పాలి- నేను లేదా ఈ వ్యక్తి యేసుక్రీస్తుప్రభులవారి
రక్తంలో కడుగబడిన వ్యక్తి, ఈ వ్యక్తిమీద నీకు అధికారం లేదు సరికదా, మార్కు 16:16—18 ప్రకారం దయ్యాలు
వెళ్లగొట్టే శక్తి దేవుడు నాకిచ్చారు కాబట్టి ఆ అధికారం బట్టి నీకు
ఆజ్ఞాపించేదేమిటంటే యేసునామంలో ఇప్పుడే ఈ వ్యక్తిని లేక నన్ను
విడిచిపో!ఆరోగ్యం/స్వస్థత ఈ బిడ్డ హక్కు అని విశ్వాసమనే ఆత్మఖడ్గంతో వాడితో
అధికారంతో పోరాడి, వాడిని వెల్లగొట్టాలి!
ఈ సందర్బంగా కొన్ని విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి! దయ్యాలు
వెళ్లగొట్టే ముందు నీవు తప్పకుండా ప్రార్ధన చేసుకుని వెళ్ళాలి! ప్రభువా అక్కడ
దయ్యాలను వెల్లగొట్టడానికి వెళ్తున్నాను నాతో రండి! తగిన శక్తి నాకు దయచేయండి అని
అడగాలి! అదే ప్రతీ విధమైన ప్రార్ధనలు ప్రతీ విషయంలో చెయ్యాలి! మరో విషయం – వాడు నీమీద దాడిచేయ్యకుండా ముందుగా నిన్ను నీవు యేసురక్తంతో కవర్
చేసుకోవాలి!
తర్వాత నీవు పరిశుద్ధాత్మ
పూర్ణుడవై ఉండాలి! నీలో సరుకు లేకుండా విశ్వాసం లేకుండా స్కెవ అనే యాజకుని ఏడుగురు
కుమారుల వలే వెళ్తే వాడు పౌలు ఎవరో తెలుసు యేసు ఎవరో తెలుసు, ఇంతకీ మీరెవరూ అంటూ
ఏడుగురిని బట్టలూడదీసి తన్నినట్లు తంతాడు సాతాను గాడు! అపొ 19:14;
కాబట్టి పరిశుద్ధాత్మ పూర్ణుడవై,
విశ్వాసంతో, వాక్యాలు లేఖనాలు అనే వాక్య-ఆత్మఖడ్గాన్ని లోడ్ చేసుకుని వెళ్ళాలి!
అవసరమైతే బాషలు మాట్లాడాలి- గమనించండి- బాషలు వాడికి అర్ధం కావు, భయపడి
పారిపోతాడు! మార్కు 16:16—18 ప్రకారం క్రొత్త
బాషలు మాట్లాడటం అనేది నమ్మి బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనము పొందుకున్న
ఆశీర్వాదాలు అభిషేకాలు, అధికారాలలో ఇది ఒకటి! ఉపయోగించండి!
ప్రార్ధనకు,
వాక్యముకు, నీలోనుండి వచ్చే ప్రతీ వాక్కుకు శక్తి ఉంది! ఉపయోగించండి!
*చెయ్యకూడనివి ఏమిటంటే*: సాతాను గాడితో
డిస్కషన్ పెట్టుకోవద్దు! నీ పేరు ఏమిటి? ఎప్పుడు నుండి ఉన్నావు? ఇలాంటి పనికిమాలిన
ఇన్ఫర్మేషన్ మనకి అనవసరం! యేసయ్య ఎప్పుడు ఏ దయ్యాన్ని మాట్లాడనీయలేదు అని
వ్రాయబడింది! మనం కూడా వాళ్ళను మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు! యేసునామంలో బయటకు పో
అని శాశించాలి అంతే! ఇంకా వాడితో బేరమాడకూడదు! మా పల్లెటూళ్ళలో ఇలాగే
బేరాలాడుతుంటారు. అమ్మా తల్లి పో అమ్మా! పోవాలంటే నీకేం చెయ్యాలి? అని
అడుగుతుంటారు, వాడు/అది నాకు కోడికోసి వండి పెట్టు, టీ ఇవ్వు, కాఫీ ఇవ్వు అంటూ
ఉంటాడు! అవి చేస్తే వెంటనే పోతాడు, గాని కొన్ని రోజుల తర్వాత మరలా వస్తాడు! అసలు
వాడితో బేరాలాడకూడదు! పొమ్మని చెప్పాలి! ఇన్ఫర్మేషన్ లాగకూడదు! యేసయ్య ఒక్కసారి
మాత్రమే నీ పేరు ఏమిటి అని అడిగారు, కారణం వారు ఎక్కువగా ఉన్నట్లు ఆయనకు
తెలిసిపోయింది కాబట్టి! ఒకవేళ నీ గొప్పకోసం వాడి ఇన్ఫర్మేషన్ అడిగితే తప్పకుండా
ఒకరోజు వాడు నీ అడ్రస్ తెలుసుకుని నీదగ్గరకు వస్తాడు! అవసరమా మనకు!
మరో విషయం నీకు ఆ శక్తి ఉంటే
దయ్యాన్ని పాతాళానికి గాని, అగాదానికి గాని పంపించేయ్! అప్పుడు వాడు మరొకరి
దగ్గరికి వెళ్ళలేడు! అందుకే గెరాసేనీయుల దేశంలో దయ్యాలు యేసయ్యను ఆ రెండుచోట్లకు
పోకుండా దేవుణ్ణి అడుక్కున్నాయి!
ఇక చెడుపులు-చిలంగులు
పట్టిన వారికి ప్రార్ధనచేసే ముందుగా- రెండు ఉండాలి అని నా ఉద్దేశం!
పైన చెప్పినవి అన్నీ చేస్తూనే మొదటగా ఉపవాస ప్రార్ధన కావాలి! రెండు
పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండాలి! నీతో పాటు విశ్వాసులైన పరిశుద్ధులైన వారు ఒకరో
ఇద్దరో నీకు తోడుగా ఉండాలి! నీవు సాతానుతో పోరాడుతున్నప్పుడు వారిలో ఒకరు నీకోసం
నీకు సపోర్టుగా ఉండి ప్రార్ధన చెయ్యాలి నీకోసం! అప్పుడు వాడు నీపై చేసే ఎటాక్ లు
నీపై పనిచెయ్యవు!
ఒకవిషయం చెబుతాను- ఏమి
చేసినా ఎక్కడకు వెళ్ళినా ప్రార్ధన, ప్రార్ధన ప్రార్ధన! దేవునికి చెప్పకుండా ఏమి
చెయ్యవద్దు! ఇలాంటి దయ్యాలతో ప్రార్థన లేకుండా ఇంకా ఒంటరిగా పోరాటం చెయ్యవద్దు!
ఇక చివరగా ఆయన నీతో
ఉన్నారు అనే భావన తప్పకుండా ఉండాలి! ఆయన నీ పక్ష్యంగా పోరాడుతున్నారు, నీతో
ఉన్నారు అనే విశ్వాసం నీకు లేకపోతే నీవు గెలుపు పొందలేవు!
ఇక
*శ్రమలు-శోధనలు
కలిగితే ఏమి చెయ్యాలి!*
శ్రమలు-
శోధనలు ఎందుకు కలుగుతాయి? బైబిల్ చెబుతుంది దేవుడు ఎవరిని శోధించడు, మనుష్యుడు తన
స్వకీయమైన దురాశలతో ఈడ్వబడి శోదించబడుతున్నాడు! యాకోబు 1:12--15;
కాబట్టి వెంటనే మనలను మనం పరీక్షించుకోవాలి!
ఎందువలన ఈ శోధనలు వస్తున్నాయి అనేది
పరిశీలించుకుని దేవునికి ఆయాసకరమైనది, దురాశలను తొలిగించుకుని దేవునితో సమాధాన
పడాలి! అయితే కొన్నిసార్లు యోబుగారి విషయంలో జరిగినట్లు శోధనలు వస్తాయి, మరికొన్ని
సార్లు దేవుడు నిన్ను ఒక్కో మెట్టు ఎక్కించాలని అనుకుంటారు! అప్పుడు నిన్ను శ్రమల
అలలలో పెట్టి వెండిని పరీక్షించినట్లు పరీక్షించి, అప్పుడు నిన్ను ఒక్కోమెట్టు
ఎక్కిస్తారు! ఈ విషయంలో బైబిల్ చెబుతుంది 1కొరింథీ 10:13 లో అంటున్నారు..
సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు
సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింప గలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును
శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింప గలుగుటకు ఆయన శోధనతో కూడ తప్పించుకొను మార్గమును
కలుగజేయును.
కాబట్టి నీవు తట్టుకోగలిగినంత శోధనలే
నీకు పెడతారు! అంతేకాకుండా దానిని జయించే మార్గము తప్పించే మార్గము దేవుడు నీకు
చూపిస్తారు! ఈ విషయం గుర్తుపెట్టుకుంటే నీకు వచ్చిన శోధనలలో జయించగలవు!
శోధన కలిగినప్పుడు వెంటనే నీవు పరీక్షించుకోవాలి- నీలో తప్పు ఉంటే
సరిచేసుకోవాలి! తప్పు చెయ్యక పోయినా శోధన వస్తుంది అంటే నీవు తెలుసుకోదగిన విషయం
ఏమిటంటే- నీవు దేవునిచేత ప్రేమించబడుతున్నావు! దేవుడు నిన్ను ప్రేమించి శ్రమల
మార్గం ద్వారా నిన్ను మొదటగా ఒక్కోమెట్టు ఎక్కిద్దామని, నీ విశ్వాసాన్ని
బలపరుద్దామని అనుకుంటున్నారు! రెండవదిగా సంపూర్ణత సాధించాలి అంటే శ్రమల మార్గము
ద్వారానే సాధించాలి! దీనికోసం అనేకసార్లు రాశాను కాబట్టి ముందుకు పోదాం! యేసయ్య
కూడా శ్రమల మార్గం ద్వారా ఎలా సంపూర్ణత సాధించారో అలాగే మనం కూడా ఆ మార్గంలోనే
సంపూర్ణత సాధించాలి అని హెబ్రీ పత్రిక చెబుతుంది! 2:10--11;
కాబట్టి శ్రమలు- నీవు దేవునిచేత ప్రేమించబడితేనే వస్తాయి అని
గ్రహించాలి, పరిపూర్ణత సాధించడానికి వస్తాయి అని గ్రహించాలి! అప్పుడు వెంటనే
దేవుడు చెప్పిన పై వాక్యాలు గుర్తుచేసుకుని ఓ పనికిమాలిన సైతానా, నా మదిలో నీవు
వాదించవద్దు. దేవుడు శోధన నేను తట్టుకునేటంత మాత్రమే గాని తట్టుకోలేనంతగా ఇవ్వరు,
దేవుడు నాకు ప్రమోషన్ ఇద్దామని అనుకుంటున్నారు కాబట్టి నేను వెళ్లవలసినది శ్రమల
మార్గం లోనే! కాబట్టి సరియైన మార్గంలోనే వెళ్తున్నాను! నీవు మూసుకో అని చెప్పాలి
సైతాను గాడికి! చాలు- వాడిని జయించిన వెంటనే దేవుడు శోధనలో విజయం ఇచ్చి ప్రమోషన్
ఇస్తారు!
*లేనిపోని కుటుంబ కలహాలు తగాదాలు, కోర్తుకేసులు వస్తే:*
దేవుడు అందరితోను సమాధానంగా ఉండండి అన్నారు! అవసరమైతే మీ ఆస్తులను
పోగొట్టుకోవడం మంచిది గాని కోర్టులుకు వెళ్ళడం, తగాదాలు పెట్టుకోవడం, పోలీస్
స్టేషన్ కి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు! కాబట్టి మొదటగా మనమే తగ్గిపోవాలి!
అన్యాయాన్ని సహించమంటున్నారు!
1కోరింథీయులకు
6: 7
ఒకనిమీద ఒకడు వ్యాజ్యెమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము.
అంతకంటె అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటె మీ సొత్తుల నపహరింప బడనిచ్చుట మేలు
కాదా?
అదేకదా
మత్తయి సువార్తలో కొండమీద ప్రసంగలో చెబుతున్నారు దేవుడు! దేవుడు చెప్పినట్లు
చెయ్యాలి! సాతాను గాడి మాస్టర్ ప్లాన్ ఏమిటంటే కుటుంబాల మధ్య, అన్నదమ్ముల మధ్య,
విశ్వాసుల మధ్య, ఇరుగుపొరుగు వారి తోను తగవులు-తగాదాలు పెట్టి- నీ మనస్సు
పాడుచేసి, నెమ్మది లేకుండా చేసి- నీవు అలసిపోయి ప్రార్ధన చెయ్యకుండా నిన్ను చేసి-
నీవు దేవునిమీద నిష్టూరాలు వెయ్యాలి! ఇదే వాడి ప్లాన్!
కాబట్టి నీవే తగ్గిపో! అవసరమైతే నీవే నష్టపోయి-
దేవుని ప్రేమను పంచు! ఇప్పుడు శత్రువులుగా ఉన్నవారు కూడా ఒకరోజు- నీ దగ్గరకు వచ్చి
క్షమించమని అడుగుతారు! ఇప్పుడు కొన్నిరోజులు సహించు! ఇక్కడ నీకు కావలసిన ఆయుధాలు-
ప్రేమ, ఓర్పు, నిరీక్షణ, నెమ్మది! ఏ పరిస్తితులలో కూడా దేవుడు నిన్ను విడువను
ఎడబాయను అన్నారు కాబట్టి- దేవుడు నీతో ఉన్నారు అన్న భావనతో ఇలాంటి ఈ శ్రమలు
జయించగలవు!
*ఒకవేళ- క్రీస్తునామం కోసం-అవమానం- దెబ్బలు, కోర్టులు, జైలు
సంభవిస్తే:*
సంతోషించు ఆనందించు! ఇదే కొండమీద ప్రసంగంలో చెప్పారు!
మత్తయి 5:10--12; పెద్ద ఏదో శ్రమలు శోధనలు వచ్చినట్లు ఫీల్ అయిపోకు! అపోస్తలుల
కార్యంలోను థెస్సలోనికయులకు పత్రికలోను ఇదే చెప్పారు! ఇలాంటి శ్రమలు
అనుభవించడానికే మనం పిలువబడ్డాం! అనేక శోధనలు అనుభవించిన తర్వాతనే మనం పరలోకం
చేరుతామని యేసయ్య చెప్పారు, శిష్యులు కూడా చెప్పారు! మరి ఎందుకు ఊరికినే ఫీల్
అయిపోతావు! కేవలం సంతోషించు! ప్రభువా నీవు పొందిన శ్రమలలో నేను పాలువాడనైనందుకు
నీకు ధన్యవాదాలు అని చెప్పు! ఎక్కడా ఎప్పుడూ అనుభవించలేని ఒకరకమైన మనశ్శాంతి భావన
నెమ్మది కలుగుతుంది! ఆత్మ అభిషేకం కల్గుతుంది దానితో సాగిపో! అంతే! ఆయుద్ధాలు
లేవు!
కాబట్టి సాతానుతో చేసే పోరాటానికి సర్వాంగకవచం సరిపోతుంది!
To fight in Spiritual Warfare with Satan- the Armor of God is
sufficient! Use it! Don it properly! Practice it everyday! Ask God’s help by
means of praying every day for everything in every aspect !!!
Ask help of your church and your Pastor only to pray for you!
God Bless You!
Amen!
*ఎఫెసీ పత్రిక -117వ భాగం*
*పిలుపుకి తగిన జీవితం-70*
*విశ్వాసి-ఆత్మీయ పోరాటాలు-9*
ఎఫెసీ
6:11—18
11. మీరు అపవాది (అనగా సాతాను) తంత్రములను ఎదిరించుటకు
శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.
12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో (మూలభాషలో-
రక్తమాంసములతో) కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు
లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.
13. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును,
సమస్తము నెరవేర్చినవారై నిలువ బడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు (దేవుని)
సర్వాంగ కవచమును ధరించుకొనుడి
14. ఏలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను
మైమరువు తొడుగుకొని
15. పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధమనస్సను
జోడుతొడుగుకొని
నిలువ బడుడి.
16. ఇవన్నియు గాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు
దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు.
17. మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను
ఆత్మఖడ్గమును ధరించు కొనుడి.
18. ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను
విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో
విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! పిలుపుకి తగ్గ జీవితం జీవించడములో కలిగే విశ్వాసి యొక్క ఆత్మీయ
పోరాటాలు కోసం ధ్యానం చేసుకుంటున్నాము!
( గతభాగం తరువాయి)
ఆత్మీయ యుద్ధము-1
ప్రియ దైవజనమా! ఇంతవరకు మనం విశ్వాసి
ఆత్మీయపోరాటం – సాతాను గాడితో చేసే విధానం
కోసం చూసుకున్నాం! ఇక మనం విశ్వాసి చేసే రెండో రకమైన ఆత్మీయ పోరాటం కోసం
చూసుకుందాము!
దానికి నేను
పెట్టుకున్న పేరు- ఆత్మీయ యుద్ధము/పోరాటం-1. ఇది విశ్వాసి- పాపముతో లేక లోకముతో
చేస్తాడు!
రకాలు: శరీరాసలు, నేత్రాస,
జీవపుడంభము, కామవాంచ, అధికార కాంక్ష, ధనాశ లాంటివి. ఇంకా చెప్పాలంటే గలతీ 5వ
అధ్యాయంలో చెప్పబడిన శరీర కార్యములలో సగం ఈ కోవకు వస్తాయి!
ఇప్పుడు
వీటిని ఎలా జయించాలో కేవలం బైబిల్ లో గల సాక్షి సమూహమును చూసి నేర్చుకుందాము!
మీకు నాలుగు గుంపులు చూపిస్తాను. వీరు ఎలా జయించారు? దేనిలో ఓడిపోయారు?
తద్వారా మనం ఎలా జయించాలి ఏమి పాఠం నేర్చుకోవాలి అనేది మన ఆధ్యాత్మిక జీవితం ఎలా
మలచుకోవాలి అనేది వారి జీవితానుభవాలనుండి చూసుకుందాం!
మొదటి బాచ్: *యోసేపు, సంసోను, దావీదు*
రెండు: *సౌలురాజు, దావీదు రాజు*;
మూడో బ్యాచ్: *బిలాము, దేమా, గేహాజి, అననీయ-సప్పీర*
నాలుగో బ్యాచ్: *దానియేలు, షడ్రాక్, మేషాక్, అబెద్నేగో*
మొదటి బ్యాచ్: *యోసేపు గారు, సంసోను గారు, దావీదు గారు*!
మహా గొప్ప భక్తులు- దైవజనులు!
ముగ్గురిమీద ఒకే రకమైన శోధన ఎదురైంది! అది కామవాంచ! (Sexual Desires).
యోసేపు గారి దగ్గరకే అవకాశం వస్తే- ఈ పాపము నుండి పారిపోయారు!
దావీదు గారు ఈ పాపాన్ని పిలిపించుకున్నారు. పాపం దగ్గర ఆగిపోయారు!
సంసోను గారు వాటి దగ్గరకే పోయారు అనగా వాటివెనుక వెళ్లారు! వాటిలో
పడిపోయారు!
ఫలితం: యోసేపు గారు జయజీవితం
జీవించగా, దావీదుగారు సంసోను గారు పతనమైపోయారు!
యోసేపు గారి జయజీవితానికి కారణం లేక యోసేపు గారు తన ఆత్మీయ
పోరాటంలో సాతాను మీద, పాపం మీద, లోకం మీద ఏ విధముగా జయించగలిగారు అంటే కేవలం
వాక్యం వలన! ధర్మశాస్త్రం కూడా లేని మనస్సాక్షి కాలంలో- అబ్రాహాము గారు తన ముత్తాత
అయిన నోవాహు గారి దగ్గర వాక్యము-పద్దతులు నేర్చుకుంటే, అబ్రాహము గారి దగ్గర
ఇస్సాకు గారు, ఇస్సాకు గారి దగ్గర యాకోబు గారు, యాకోబు గారి దగ్గర యోసేపు గారు
నేర్చుకున్నారు! నేర్చుకున్న పాఠమునుండి కుడికి గాని ఎడమకు గాని తొలగలేదు యోసేపు
గారు! అవసరమైతే చెరసాల అనుభవించారు గాని సత్యమునుండి తొలిగిపోలేదు! తన యజమానురాలు
తనతో పాపం చెయ్యమని అడిగితే- ఆయన జవాబు చూడండి: కాబట్టి నేనెట్లు ఇంత దుష్కార్యము
చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును...??? అది దేవునికి వ్యతిరేఖమైన
కార్యం అని తన తండ్రి చెప్పారు. దానిని నేర్చుకున్నారు యోసేపు గారు! అవును పెండ్లి
కాకుండా చేసే సెక్స్ అది వ్యభిచారం! పర పురుషునితో లేక పరాయి స్త్రీతో చేసేది
వ్యభిచారం! దేవునికి ఇది ఇష్టం ఉండదు! కాబట్టి ఈ యవ్వనస్తునికి ఈ శోధన కలిగిన
వెంటనే వాక్యమనే ఆత్మఖడ్గమును వాడి శోధనను జయించారు ఇంకా చెప్పాలంటే శోధన
పెరగకుండా పారిపోయారు! చివరకు ఒకరోజు దేశానికే గవర్నర్ కాగలిగారు!
గాని దావీదుగారు, సంసోను గారు ఇద్దరు- ధర్మశాస్త్రంలో మంచి
పట్టున్నవారే, ఇద్దరూ ఆత్మపూర్ణులే! గాని తమ కోరికలు అణచుకోలేక సాతాను వేసిన
కామవాంచ అనే అగ్నిబాణం వలన క్లీన్ బౌల్డ్ అయిపోయారు! దావీదుగారు దేవుని శాపం
పొందితే, సంసోను గారు కల్లు పీకించుకుని అవమానాలు పొంది కుక్కచావు చచ్చారు!
వీరిద్దరూ వాక్యమనే ఆత్మఖడ్గము తమవద్ద ఉన్నా గాని ఆ పాపం కమ్మగా ఉంది అని
వాడలేకపోయారు! నీవు కూడా నీకిచ్చిన ఆయుధాలు వాడకపోతే నీ ఆత్మీయపోరాటంలో నీవు కూడా
ఓడిపోతావు జాగ్రత్త!
రెండవ బ్యాచ్: *సౌలురాజు, దావీదు
రాజు*!
ఇద్దరు దేవుని చేత ఏర్పాటుచేయబడిన
వారే, ఇద్దరు అభిషేకం పొందిన వారే, ఇద్దరు పరిశుద్ధాత్మను పొందినవారే, ఇద్దరు
ప్రార్ధనాపరులే! ఇద్దరు ధర్మశాస్త్రం లో దిట్ట! ఇద్దరిమీద పనిచేసిన శోధన- అధికార
కాంక్ష!
సౌలురాజుగారు- అధికారం కోసం దేనిని చేయడానికైనా రెడీ అయిపోయారు!
చివరికి దావీదు గారిని అనగా తనసొంత అల్లుడిని చంపడానికి ప్రయత్నించి కుక్కను తరిమినట్లు తరిమారు! అధికారం
నిలబెట్టుకోవడం కోసం ధర్మశాస్త్రం ద్వారా, సమూయేలు గారి ద్వారా ఇచ్చిన ఆజ్ఞను
కాలదన్ని, దేవుణ్ణి వదలి కర్ణపిశాచం గల స్త్రీ దగ్గరకు వెళ్ళాడు! భయంకరమైన చావు
చచ్చాడు!
దావీదు గారు దేవునిచేత అభిషేకించబడిన వ్యక్తిని తాకకూడదు అని
ధర్మశాస్త్రం అర్ధం చేసుకొని వాక్యమనే ఆత్మఖడ్గంవాడి శోధన జయించారు! నిజం
చెప్పాలంటే దావీదు గారు వీరుడు! నీకోసం- దేశం కోసం ఇంతాచేస్తే, నన్ను చంపడానికి
వస్తావా అని కత్తి పట్టుకుని వెళ్తే పదినిమిషాలలో సౌలురాజుని చంపెయ్యగలరు దావీదు
గారు! కాని సత్యం కోసం- ఆ పాపం నుండి హత్యా నేరం/దోషము నుండి తప్పించుకోడానికి
పారిపోయారు ఆయన! రెండుసార్లు దొరికినా చంపలేదు! అది నీతిని కలిగించింది దావీదు
గారికి! ఇక్కడ ఆయన ఉపయోగించిన ఆయుధాలు: వాక్యమనే ఆత్మఖడ్గము, దేవునిమీద భయం! ఇంకా
పగతీర్చుట నాపని అని వాక్యం చెప్పడం వలన దానిని గౌరవించడం! మనం కూడా దీనినే
అనుసరించాలి!
దైవాశీస్సులు!
(ఇంకాఉంది)
*ఎఫెసీ పత్రిక -118వ భాగం*
*పిలుపుకి తగిన జీవితం-71*
*విశ్వాసి-ఆత్మీయ పోరాటాలు-10*
ఎఫెసీ 6:11—18
11. మీరు అపవాది (అనగా సాతాను) తంత్రములను ఎదిరించుటకు
శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.
12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో (మూలభాషలో-
రక్తమాంసములతో) కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు
లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.
13. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును,
సమస్తము నెరవేర్చినవారై నిలువ బడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు (దేవుని)
సర్వాంగ కవచమును ధరించుకొనుడి
14. ఏలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను
మైమరువు తొడుగుకొని
15. పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధమనస్సను
జోడుతొడుగుకొని
నిలువ బడుడి.
16. ఇవన్నియు గాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు
దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు.
17. మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను
ఆత్మఖడ్గమును ధరించు కొనుడి.
18. ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను
విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో
విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! పిలుపుకి తగ్గ జీవితం జీవించడములో కలిగే విశ్వాసి యొక్క ఆత్మీయ
పోరాటాలు కోసం ధ్యానం చేసుకుంటున్నాము!
( గతభాగం తరువాయి)
ఆత్మీయ యుద్ధము-1
ప్రియ దైవజనమా! మనం విశ్వాసి చేసే రెండో
రకమైన ఆత్మీయ పోరాటం కోసం చూసుకుంటున్నాము!
దానికి నేను పెట్టుకున్న పేరు- ఆత్మీయ యుద్ధము/పోరాటం-1. ఇది విశ్వాసి-
పాపముతో లేక లోకముతో చేస్తాడు!
రకాలు: శరీరాసలు, నేత్రాస, జీవపుడంభము, కామవాంచ, అధికార కాంక్ష, ధనాశ
లాంటివి. ఇంకా చెప్పాలంటే గలతీ 5వ అధ్యాయంలో చెప్పబడిన శరీర కార్యములలో సగం ఈ
కోవకు వస్తాయి!
మూడో బ్యాచ్: *బిలాము, దేమా, గేహాజి, అననీయ-సప్పీరా*!
నలుగురిమీద పనిచేసిన శోధన: ధనాశ!
బిలాము మహా గొప్ప ప్రవక్త!
దేమా పిలువబడ్డవాడు, ఏర్పరచబడిన వాడు సువార్తకై!
సువార్తికుడు!
గేహజీ- గొప్ప ప్రవక్త అయిన ఎలీషాగారి శిష్యుడు!
అననీయ-సప్పీరాలు మంచి విశ్వాసులు!
ధనాశ నలుగురిని లాగుకుంది! బయటకు రాలేకపోయారు! జయించలేకపోయారు!
వీరంతా భయంకరమైన చావులు, కుక్కచావులు దిక్కులేని చావులు చచ్చారు!
అననీయ సప్పీరలు దేవుని మందిరంలోనే చచ్చారు!
నలుగురు అట్టర్ ఫ్లాప్! ప్రియ దేవుని బిడ్డా! ధనాశ నిన్ను ఆకర్షిస్తుందా?
జాగ్రత్త! జాగ్రత్త! జాగ్రత్త! అంతటి గొప్పవారు జయించలేక పోయారు- బొక్కబోర్లాపడి
చచ్చారు. ఈలోకము నైనను దాని ఆశలను గాని ప్రేమించకుడి అన్నారు దేవుడు! 1యోహాను 2: 15
ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను
లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు.
ఇక యేసయ్య ధనమును ప్రేమించకుడి భూమిమీద మీ కొరకు ధనమును సంపాదించకండి గాని
పరలోకంలో సంపాదించుకోమంటే, భూలోకంలో సంపాదించుకోవాలని చూశారు! జీవితాలు నాశనమై
పోయాయి!
దేవుడు చెప్పిన వాక్యానికి లోబడు! వాక్యమనే ఆత్మఖడ్గము వాడి ఈ శోధనను
జయించు!
నాలుగో బ్యాచ్: *దానియేలు, షడ్రక్, మేషక్, అబెద్నేగో*
వీరి
నలుగురి మీద పనిచేసిన శోధనలు:
మొదటిది:
బోజనపానములు! రాజు భుజించు ఆహారం, రాజు త్రాగే పానము అనగా సురాపానం! అనగా మందు
ముక్క! వీరు నలుగురు రాజు భుజించే ఆ ఆహారం రాజు త్రాగే ఆ పానము అనగా మందు ముక్క మనం
మానెయ్యాలి! మన జీవితాలు కట్టుకోవాలి! సాక్ష్యాన్ని కాపాడుకోవాలి! తమ ఘటాన్ని
శీలాన్ని కాపాడుకోవాలి అనుకున్నారు! సత్యం కోసం నిలబడ్డారు! వాక్యపు వెలుగులో
నడిచి వాక్య ఖడ్గాన్ని వాడి శోధనను జయించారు! దానియేలు గారు ప్రపంచానికి
ప్రధానమంత్రి అయ్యారు! , షడ్రక్, మేషక్, అబెద్నేగోలు పెద్ద మంత్రులు గవర్నర్ లు
అయ్యారు! అంతేకాకుండా దేవుని సాక్షాత్కారం కలిగించారు అందరికీ!
రెండవ శోధన! నిజం చెప్పాలంటే ఇవి సాతానుతో పోరాటం క్రిందన
కూడా వస్తాయి!
దానియేలు గారిని ప్రార్ధన ఆపుతావా? సింహాల బోనులో పడేయ్యాలా
అన్నారు!!
షడ్రక్, మేషక్,
అబెద్నేగోలను బంగారుబొమ్మకు మ్రోక్కుతారా అగ్నిగుండములో త్రోసేయ్యాలా అన్నారా?
వీరంతా మేము
మ్రొక్కమంటే మ్రొక్కం, చావనైనా చస్తాం గాని మ్రొక్కం! అసలు మా దేవుడు
రక్షించడానికి సమర్ధుడు అన్నారు!
దానియేలు గారు నేను
ప్రార్ధన మానమంటే మానను! నీ దిక్కున్నవాడితో చెప్పుకో అన్నారు!
ఫలితం:దానియేలు గారిని సింహాలబోనులో వేసేశారు!
ఆ ముగ్గురిని అగ్నిగుండములో త్రోసేశారు!
పరలోకం పరవశించిపోయింది! పరమునుండి దూతలు వచ్చి నలుగురిని
కాపాడాయి!
అక్కడ నెబుకద్నేజర్ రాజు షడ్రక్, మేషక్, అబెద్నేగోల
దేవునివంటి దేవుడు మరో దేవుడు లేడు అన్నాడు!
దర్యావేషు దానియేలు దేవుని లాంటి దేవుడు లేడు! అన్నాడు!
నలుగురు రక్షించబడటమే కాదు-దేవుణ్ణి వారికి చూపించారు!
వీరు వాడింది విశ్వాసమనే డాలు! దేవుడు తోడున్నాడు అనే
వాగ్దానాలు! ప్రార్ధన!
ఇక్కడ కేవలం కొన్ని మాత్రమే పాపంతో చేసే ఆత్మీయ పోరాటాలు చెప్పాను! గలతీ
5:19—21 వ్రాయబడిన శరీరకార్యాలులో
సగం అనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, చివరిది
అల్లరితోకూడిన ఆటపాటలు! ఇవన్నీ లోకం-లోకాశాలను మనకు చూపించి ఎరవేసి మనం పాపము
చెయ్యడానికి సాతానుగాడు ప్రయత్నం చేస్తాడు! వీటన్నిటిని...
మొదటగా: సర్వాంగకవచం ద్వారా
జయించాలి!
రెండు: వాక్యమును అనుదినం చదువుతూ
ఆదిమ భక్తులు ఆ పాపములను శోధనలను ఎలా జయించారో ధ్యానం చెయ్యాలి!
మూడు: కూడా వాక్యమే! వాక్యం ద్వారా
పాపం చెయ్యకుండా ఉండగలము! ఎలా అంటే నీ ఎదుట నేను పాపం చెయ్యకుండునట్లు నా హృదయంలో
నీ వాక్యమును ఉంచుకొందును అన్నారు భక్తుడు! కీర్తన 119:11; ఇది నేను ప్రాక్టీస్ చేశాను! పాపం చెయ్యకుండా
వాక్యం నన్ను ఆపుతుంది!
ఏమైనా పాపపు ఆలోచన గాని, పాపపు చూపు
గాని నా హృదయంలో మెదిలితే ఒరేయ్ నీవు ఎవడవో తెలుసా! దేవుని బిడ్డవు! విలువపెట్టి
కొనబడిన వాడవు! ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి చూపులు మనం చూడవచ్చా? నరకానికి పోతావు
జాగ్రత్త! ఖబడ్దార్ అని నన్ను హెచ్చరిస్తుంది వాక్యము! వాక్యపు రిఫరెన్సులు ఫలాని
చోట ఏమన్నారో తెలుసా అని గుర్తుకు చేస్తుంది వాక్యము! వెంటనే సరిచేసుకుని దేవుడా
క్షమించు అని వేడుకుంటాను!
ఒకవేళ వాక్యపు గద్దింపు కూడా వినకపోతే మెల్లని చల్లని దుఃఖస్వరముతో
పరిశుద్ధాత్ముడు అంటాడు నాతో: ఇందుకోసమేనా నీకోసం సిలువ మోసింది! ఇందుకేనా నీకోసం
రక్తం కార్చింది! అంతే నా గుండె బ్రద్దలయిపోతుంది! కన్నీటితో ఒప్పుకుంటాను:
ప్రభువా ఇంకెప్పుడు చెయ్యను- పాపపు చూపు గాని, పాపపు ఆలోచన గాని నాలో రానియ్యను
అని ఒప్పుకుంటాను! ఈవిధంగా మొదటగా వాక్యము నన్ను పాపం చెయ్యకుండా ఆపుతుంది, రెండు
పరిశుద్ధాత్ముడు నన్ను పాపం చెయ్యకుండా ఆపుతున్నాడు!
కాబట్టి పాపం చెయ్యకుండా ఉండాలంటే మన
హృదయం నిండా వాక్యముతో నిండిపోవాలి! అనగా ప్రతీరోజు వాక్యముతో ఉదకస్నానం చెయ్యాలి!
అలాగే ప్రతీరోజు ఆత్మతో నింపబడుతూ
ఆత్మపూర్ణులుగా ఉండాలి! అపుడు పాపము చెయ్యనే చెయ్యవు! అందుకే గలతీ 5:16,17 లో మీరు
ఆత్మతో నడిపించబడితే లేక ఆత్మానుసారంగా నడచుకుంటే శరీరకార్యాలు చెయ్యనే చెయ్యరు!
నాల్గవది: ఇలాంటి పాపం నుండి నీవు తప్పించుకుని ఆత్మీయపోరాటం లో
విజయం సాధించాలి అంటే ప్రార్ధనాజీవితం కావాలి! నీవు చేసేప్రతీవిషయం లోను
ప్రార్ధించి దేవుని సహాయం తీసుకో! నీకు నీవుగా పరిశుద్దుడుగా
పవిత్రుడుగాఉండటం అసాధ్యం! దేవుని సహాయం
అడుగు! అది ప్రార్ధనతోనే మనం అడుగగలం!
5. పైన చెప్పిన నలుగురు తమ భక్తిని కాపాడుకున్నట్లు మన భక్తిని
కాపాడుకోవాలి! సాఖ్యాన్ని కాపాడుకోవాలి! లేకపోతే సాతాను గాడు వచ్చి అంటాడు-
చాలుచాలులే గొప్పగా ప్రార్ధనచేసేస్తున్నావ్ గాని ఫలాని తారీకున అక్కడ ఏంచేశావ్? ఇక
ఆపు నీ ప్రార్ధన! ఆపు నీ విశ్వాసం! చాలు నీ బడాయి భక్తి అని నిన్ను దెప్పి
పొడుస్తూ నిన్ను డీమోరలైజ్ చేసేసి నిన్ను భ్రష్టుడను చేసేస్తుంది! కాబట్టి భక్తిని- సాక్షాన్ని-శీలాన్ని
కాపాడుకోవాలి!
6. పరిశుద్ధాత్మ పూర్ణుడవై ఉండాలి!
ఈ రకంగా ఈ ఆయుధాలు ఉయోగించి పాపంతో యుద్ధం చేసి గెలుద్దాము!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -119వ భాగం*
*పిలుపుకి తగిన జీవితం-71*
*విశ్వాసి-ఆత్మీయ పోరాటాలు-11*
ఎఫెసీ 6:11—18
11. మీరు అపవాది (అనగా సాతాను) తంత్రములను ఎదిరించుటకు
శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.
12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో (మూలభాషలో-
రక్తమాంసములతో) కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు
లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.
13. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును,
సమస్తము నెరవేర్చినవారై నిలువ బడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు (దేవుని)
సర్వాంగ కవచమును ధరించుకొనుడి
14. ఏలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను
మైమరువు తొడుగుకొని
15. పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధమనస్సను
జోడుతొడుగుకొని
నిలువ బడుడి.
16. ఇవన్నియు గాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు
దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు.
17. మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను
ఆత్మఖడ్గమును ధరించు కొనుడి.
18. ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను
విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో
విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! పిలుపుకి తగ్గ జీవితం జీవించడములో కలిగే విశ్వాసి యొక్క ఆత్మీయ
పోరాటాలు కోసం ధ్యానం చేసుకుంటున్నాము!
( గతభాగం తరువాయి)
ఆత్మీయ యుద్ధము-2.1
ప్రియ దైవజనమా! ఇంతవరకు మనం విశ్వాసి
ఆత్మీయపోరాటం – సాతాను గాడితో చేసే విధానం
కోసం, రెండో రకమైన ఆత్మీయ పోరాటం కోసం చూసుకున్నాం! ఇక మనం విశ్వాసి చేసే మూడో
రకమైన ఆత్మీయ పోరాటం కోసం చూసుకుందాము!
దానికి నేను పెట్టుకున్న పేరు-
ఆత్మీయ యుద్ధము/పోరాటం-2.
ఇది రెండు రకాలు
ఆత్మీయ యుద్ధం 2.1—ఆలోచనల
ద్వారా
ఆత్మీయ యుద్ధం 2.2—అపరాధభావము,
ఆత్మన్యూనత భావం మరియు దేవునిమీద నిష్టూరాలు వెయ్యడం!
ఈరోజు మనం ఆత్మీయ యుద్ధం 2.1—ఆలోచనల ద్వారా చేసే
పోరాటాన్ని ధ్యానించుకుందాం! గమనించాలి- విశ్వాసి చేసే ఆత్మీయ పోరాటాలలో
అన్నిటికంటే కష్టమైనది బలమైనది ప్రభావశీలి అయినది ఈ ఆత్మీయ యుద్ధం 2.1 మరియు 2.2.
ఈ రెండు సాతానుతో చేసే పోరాటాలు కంటే ఘోరమైనవి! ఎందుకు కష్టమైనవి అంటే-
విశ్వాసులకు అది పోరాటం/యుద్ధం అని తెలియక! ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి
అనుకుంటున్నావు గాని అది ఆత్మీయ పోరాటం, దానిని సాతానుగాడు నీకు తెలియకుండా నీమీద
కుట్రపన్ని నిన్ను బ్రష్టునిగా చెయ్యాలనే మాస్టర్ ప్లాన్ తో సీన్ లో వాడు ఉండకుండా
ఇండైరెక్టుగా వాడు నీతో ఆలోచనల ద్వారా పాపం చెయ్యిస్తున్నాడు!!! అది ఎంతో
స్వాభావికంగా కనిపిస్తుంది గాని సాతాను శోధన అని తెలియడం లేదు నీకు!
ఇప్పుడు నీకు శత్రువు ఎవరో తెలిస్తే వాడి శక్తిసామర్ధ్యాలు ఏమిటి?
ఎలా జయించాలి అనేది చూడగలవు! అసలు నీ శత్రువు ఎవరో తెలియకుండా ఉంటే ఎలా యుద్ధం
చెయ్యగలవు? లేదా నీ మిత్రువే నీకు తెలియకుండా నీమీద యుద్ధం చేస్తే ఎలా గెలువగలవు?
ఇక్కడ కూడ అదే జరుగుతుంది!! కాబట్టి తెలుసుకుని జాగ్రత్తపడు!
శోధన రకాలు: భయము, నిరాశ, పిరికితనం, స్వార్ధం, అసూయ, కోపం,
సణుగుడు, అనుమానం, అసహనం, ఇంకా గలతీ 5:19—21 లో
శరీరకార్యాలలో మిగిలినవి, చివరగా భర్తమీద పెత్తనం, పిల్లలమీద చిరాకు, భార్యాభర్తలు
మధ్య తగాదాలు!
(నాకు తెలిసినవి
మాత్రం రాశాను, ఇంకా ఉండొచ్చు),
వీటిని
కూడా మనం బైబిల్ లో చెప్పబడిన ఉదాహరణల ద్వారా జయించవచ్చు!
*భయము, పిరికితనం-నిరాశ-నిష్ప్రుహ*:
ఇవి కలిగితే ఏమి
చెయ్యాలి!
సింపుల్! వాక్యాన్ని ధ్యానిస్తూ ధైర్యం తెచ్చుకోవాలి!
దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియనిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము
గల ఆత్మను ఇయ్యలేదు! అని 2తిమోతి 1:7 లో వ్రాయబడింది! కాబట్టి ఇప్పుడు భయము,
పిరికితనం వచ్చాయి అంటే వెంటనే తెలుసుకోవాలి- ఇది దేవుని నుండి వచ్చినది కాదు,
సైతాను గాడి నుండి వచ్చాయి కాబట్టి వెంటనే వాక్యఖడ్గము తీసి- ఓ పనికిమాలిన సాతానా!
నాలో ఈ పిరికితనం భయమును తీసుకుని వెళ్ళిపో! నేను దేవుని బిడ్డను, అయన ఆత్మను
పొందుకున్నవాడిని/దానను! ఆ దేవుడు నాకు దేవుని శక్తి దేవుని ప్రేమను ఇంద్రియ
నిగ్రహం గల ఆత్మను మాత్రమే ఇచ్చారు గాని ఇలా పిరికితనం ఇవ్వలేదు!యేసునామంలో నాలో
పిరికితనం, భయము కలిగించే దురాత్మా బయటకు పో! యేసు నామంలో పిరికితనం భయము భయటకు
పో! అనాలి! వెంటనే వాడు పటాపంచలైపోతాడు!
మరికొన్ని సార్లు
నిరాశ నిస్పృహ ఆవరిస్తూ ఉంటాయి యాకోబు గారికి ఆవరించినట్లు! ఒకసారి ఆదికాండం 31,32
అధ్యాయాలు చూసుకుంటే దేవుడే- యాకోబు—ఇక్కడ ఉన్నది చాలు,
నీవులేచి నీ తండ్రి ఇంటికి వెళ్ళు! నేను నేకు తోడుగా ఉన్నాను అనే వాగ్దానం చేశారు!
యాకోబుగారు దానిని నమ్మారు గాని మనసావాచాః కర్మేనా నమ్మలేదు! ఆ వాగ్దానాన్ని
స్వతంత్రించుకోలేదు! బయలుదేరారు యాకోబుగారు తన సమస్తాన్ని తీసుకుని! నేను ఇంటికి
వస్తున్నాను అని అన్నయ్యకి కబురు పెడితే అన్నయ్య సంతోషించి నిన్ను ఎదుర్కోడానికి
నేను వస్తున్నాను అని చెబితే కమ్యూనికేషన్ గేప్ వలన- అర్ధం మారిపోయి నానా అగచాట్లు
పడ్డారు! వెంటనే భయము, నిరాశ, పిరికితనం అన్నీ కలిగాయి యాకోబుగారికి! దేవుడు చేసిన
వాగ్దానాలు మరిచిపోయారు యాకోబుగారు! పిరికితనం ఆవరించింది భయము యాకోబుగారిని
ఏలింది! ఇక ఏమిచెయ్యాలి అనేది అర్ధం కాక తల్లినుండి తండ్రి నుండి నేర్చుకున్న
ప్రార్ధన గుర్తుకు వచ్చింది! పిల్లలను, పశువులను అందరిని పంపించివేసి తను మాత్రం యబ్బోకు
రేవుదగ్గర నిలిచిపోయాడు! దేవునితో ముఖాముఖి జరిగింది! ఉడుంపట్టు పట్టారు- నీవు
నన్ను దీవిస్తేనే గాని నేను నిన్నువిడువను! దీవిస్తావా లేదా అని మొదలుపెట్టారు!
దూత దిగివచ్చాడు! దీవించి పంపాడు! భయము, నిరాశ ఎగిరిపోయిది! ధైర్యము వచ్చింది! వాగ్దానాలు మరిచిపోయి- సాతాను శోధన ఎదుర్కొన్న
యాకోబుగారు- ఏకాంతప్రార్ధన అనే ఆయుధం ద్వారా దేవునితో ముఖాముకి ద్వారా
పిరికితనమును నిరాశ నిస్పృహ, భయమును పోగొట్టుకున్నారు! కాబట్టి నీకు కూడా ఇలాంటి
పిరికితనం, భయం వస్తున్నాయా? ప్రార్ధనలో ఏకీభవించు!
యాకోబు గారి ఆయుధాలు: ప్రార్ధన!
Complete obedience!
*అసూయ వస్తుంటే*: అసూయ అనగా ప్రక్కన ఉన్న
వ్యక్తి తనకంటే ఆర్ధికముగా గాని, అందంగా గాని, తలాంతులలో గాని గొప్పగా ఉంటే
కుళ్ళుపోవడం! అదింకా ముదిరితే మత్సరం!
ముందు ద్వేషము వస్తుంది, తర్వాత అసూయ వస్తుంది, ఇంకా
పెరిగితే క్రోధము వస్తుంది! అది పెరిగితే మత్సరం వస్తుంది! మత్సరం వస్తే అవతల
వ్యక్తికి ఏదో హాని చెయ్యకుండా ఉండలేవు! ఇలాంటివి వస్తే వాడెవడు దేవుని రాజ్యమును
స్వతంత్రించుకోలేరు అని గలతీ 5:21 లో ఉంది!
కాబట్టి నీలో అసూయ కలిగినా, ద్వేషం కలిగినా, క్రోధము
పెరిగినా, మత్సరం పెరిగినా నీవు దేవుని రాజ్యానికి అనర్హుడవు అని గ్రహించాలి ఇంకా
నరకానికి దగ్గరగా ఉన్నావు అని గ్రహించి వాటిని విడిచిపెట్టాలి! ఇలా నిన్నునీవు
హెచ్చరించుకుంటూ నీలో వస్తున్నా ఆ ఆలోచనలను వాక్యఖడ్గముతో ఖండించాలి!
ఇక
*క్రోధములు- కక్షలు, బేదములు విమతములు కలిగితే*:
మరలా మీద వ్రాసిన విధంగానే సరిచేసుకోవాలి! అలాంటి ఆలోచనలు మనస్సులో రేగే
తలంపులు నిన్ను నరకానికి తీసుకుని వెళ్ళిపోతాయి కాబట్టి నీ హృదయంలో నీవు
అనుకోవాలి- నీకు పరలోకం కావాలా? నరకం కావాలా? పరలోకం కావాలంటే ఆసూయను వదిలేయ్,
ద్వేషాన్ని వదిలేయ్! స్వార్ధం, లోభము, క్రోధము,మత్సరం లాంటివి వచ్చినవెంటనే
అనుకోవాలి- నన్ను నరకానికి పంపించడానికి సైతాను గాడు ఇవన్నీ నాలో
పుట్టిస్తున్నాడు, కాబట్టి వీటిని వెంటనే వదిలెయ్యాలి అనే ఉద్దేశ్య వచ్చి వెంటనే
వాటిని నీలోనుండి తొలగించు కోవాలి!
*స్వార్ధం, లోభము నిన్ను
ఆవరిస్తే*: దేవునివాక్యాలు గుర్తుకు చేసుకోవాలి! కారణం స్వార్ధము,
లోభత్వము ధనాశ వలన వస్తుంది! లోభి ఎవడూ దేవుని రాజ్యాన్ని స్వతత్రించుకోలేడు! ఆశకు
అంతులేదు! దానిలోనూ ధనాశకు అంతులేదు! వెయ్యి రూపాయలు కావలంటాడు! దేవుడు అదిస్తే
లక్ష కావలంటాడు! అది కూడా ఇస్తే పదిలక్షలు కావాలంటాడు, కోట్లు కావాలంటాడు! చివరకు
దేవుణ్ణి మరచిపోతాడు! తనకన్నా తక్కువ ఆర్ధిక స్థాయిలో ఉన్నవారు మనిషిలా కనబడరు!
కాబట్టి ఎప్పుడైతే నీలో స్వార్ధము, లోభత్వము ధనాశ పెరగడం మొదలయ్యింది- వెంటనే నీకు
అంతము దగ్గరికి వచ్చింది అని గ్రహించి ఈ మూడింటిని వదిలెయ్యాలి!
దైవాశీస్సులు!
(ఇంకాఉంది)
*ఎఫెసీ పత్రిక -120వ భాగం*
*పిలుపుకి తగిన జీవితం-72*
*విశ్వాసి-ఆత్మీయ పోరాటాలు-12*
ఎఫెసీ 6:11—18
11. మీరు అపవాది (అనగా సాతాను) తంత్రములను ఎదిరించుటకు
శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.
12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో (మూలభాషలో-
రక్తమాంసములతో) కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు
లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.
13. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును,
సమస్తము నెరవేర్చినవారై నిలువ బడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు (దేవుని)
సర్వాంగ కవచమును ధరించుకొనుడి
14. ఏలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను
మైమరువు తొడుగుకొని
15. పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధమనస్సను
జోడుతొడుగుకొని
నిలువ బడుడి.
16. ఇవన్నియు గాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు
దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు.
17. మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను
ఆత్మఖడ్గమును ధరించు కొనుడి.
18. ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను
విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో
విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! పిలుపుకి తగ్గ జీవితం జీవించడములో కలిగే విశ్వాసి యొక్క ఆత్మీయ
పోరాటాలు కోసం ధ్యానం చేసుకుంటున్నాము!
( గతభాగం తరువాయి)
ఆత్మీయ యుద్ధము-2.1
మూడో రకమైన ఆత్మీయ పోరాటం కోసం చూసుకుంటున్నాము!
దానికి నేను పెట్టుకున్న పేరు- ఆత్మీయ
యుద్ధము/పోరాటం-2. ఇది రెండు రకాలు
ఆత్మీయ యుద్ధం 2.1—ఆలోచనల
ద్వారా
ఆత్మీయ యుద్ధం 2.2—అపరాదభావము,
ఆత్మన్యూనత భావం మరియు దేవునిమీద నిష్టూరాలు వెయ్యడం!
*బేదములు- విమతములు*:
సాతాను గాడు నీ హృదయంలో కొన్ని
భావాలు పెట్టిస్తూ ఉంటాడు- ఆ వ్యక్తి ఫలాని కేస్ట్, నీది గొప్ప కులము! నీకు
డబ్బుంది వాడ్డికి లేదు!
ఇలాంటి బేధము పుట్టించి వారిమీద
ద్వేషము లేదా వారంటే నీలో చిన్నచూపు పుట్టిస్తాడు! ఇలాంటి భావాలు గనుక నీలో ఉంటే
నీవు నరకం పోవడం 100% గారంటీ! క్రైస్తవుడు అన్నవాడు కులాన్ని పట్టించుకుంటే వానిలో
క్రీస్తుప్రేమ లేదు! కులాన్ని పట్టించుకున్నవాడు క్రైస్తవుడు కాదు! బాప్తిస్మం
తీసుకున్న వెంటనే నీ ప్రాచీన పురుషుడుతో పాటుగా నీ కులం కూడా చచ్చింది! కాబట్టి
ధనబేధం, కులభేదం అంతస్తు బేధం, రంగుభేధం, ప్రాంతీయబేదములు ఏవి ఉన్నా నీవు నరకం
పోతావు! కాబట్టి ఎప్పుడైతే ఇలాంటి ఆలోచనలు వస్తాయి వెంటనే నీ మనస్సులో నీ హృదయంలో
అనుకోవాలి! నీకు నరకం కావాలా పరలోకం కావాలా? జాగ్రత్తపడు! ఇలాంటివారికి దేవుని
రాజ్యం లేదు అని బైబిల్ చెబుతుంది! ఓ మనసా! నాకు పరలోకం కావాలి! కాబట్టి గుణపడు
అని చెప్పాలి!
తర్వాత సైతానుతో చెప్పాలి! ఓ
పనికిమాలిన వాడా! నేను బాప్తిస్మము తీసుకుని కడుగబడిన వాడను/దానను! నా కులం, నా
వర్గం అన్నీ కలువరి సిలువలో చచ్చాయి! కాబట్టి ఇలాంటి బేదములు విమతములకు నాలో
చోటులేదు! యేసునామంలో బేదములు విమతములు లాంటి ఆలోచనలు నాలో పుట్టిస్తున్న సైతానా పో బయటకు! అని
చెప్పాలి!
ఒకసారి నరకానికి పోయే బ్యాచ్ ఏవో
చూసుకుని జాగ్రత్తపడితే ఇక మనం వాటి జోలికి పోకుండా ఉంటాము!
గలతీ 5:19—21
19. శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము,
అపవిత్రత, కాముకత్వము,
20. విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు,
క్రోధములు, కక్షలు,
21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన
ఆటపాటలు మొదలైనవి. *వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని
చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.*
1కొరింథీ 6:9—10
9. అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు
తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గల
వారైనను పురుష సంయోగులైనను
10. దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను
దోచుకొనువారైనను *దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు*.
ప్రకటన గ్రంథం 21: 8
పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును,
వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని
గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.
ప్రకటన గ్రంథం 22: 15
కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంత కులును
విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.
చూడండి
ఈ బ్యాచ్ అంతా పరలోకానికి వెళ్లరట, అనగా నరకానికి పోతారు! కాబట్టి అలాంటి ఆలోచనలు
ఏవైనా వస్తే వెంటనే మనలను మనం వాఖ్యఖడ్గంతో సరిచేసుకోవాలి! వాక్యపుటద్దముతో మనం
తప్పులుచూసుకుని సరిచేసుకోవాలి!
సరే,
ఇంతకూ పరలోకమునకు ఎవరు వెళ్తారు?
జయించిన
వారు!!
ప్రకటన 21:7....
జయించువాడు వీటిని స్వతంత్రించు కొనును; నేనతనికి దేవుడనై
యుందును అతడు నాకు కుమారుడై యుండును.
వేటిని
జయించాలి- సాతానుని, లోకమును అనగా పాపమును, తర్వాత ఇలాంటి ఆలోచనలను జయించిన వానికే
దేవుని రాజ్యములో చోటు ఉంటుంది!!!
కాబట్టి
దేవుడు నీకిచ్చిన సర్వాంగకవచమును వాడు! దానిలో పెట్టెలో పెట్టుకోవద్దు! సానపెట్టు!
సైతానుని జయించు!
ఇక
*కోపము*: కోపపడుడి గాని పాపం చేయకుడి అని
బైబిల్ చెబుతుంది.
ఎఫెసీయులకు 4:
26
కోపపడుడి గాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపము
నిలిచియుండకూడదు.
ఉదయం కోప పడితే సాయంత్రానికి సమాధాన
పడమని బైబిల్ చెబుతుంది. అంతకంటే ఎక్కువ సేపు కోపం నీలో ఉంది అంటే సాతాను గాడి
క్రియ కాబట్టి వెంటనే గుర్తించి ఆ కోపమును నీలో నుండి తీసివేసి మరలా సమాధాన
పడటానికి ప్రయత్నించు లేకపోతే పాపము నిన్ను నరకానికి తీసుకుని పోతుంది జాగ్రత్త!!!
ఇక
*సణుగుడు*: కొంతమంది స్త్రీలు పురుషులు-
అస్తమాను సణుగుతూ ఉంటారు! ఇది సాతాను గాడి క్రియ! గమనించాలి—కొంతమంది అనుకుంటారు నేను
ఊహించినట్లే అందరూ ఊహించాలి! నేను చేసినట్లు అందరూ చెయ్యాలి! లోకంలో తెలివైన
వాడిని/దానను నేనే అనుకుంటారు! వారి ఊహలకు వ్యతిరేఖంగా ఎవరైనా ఏమైనా చేస్తే అనగా
వారు అనుకున్నట్లుగా కాకుండా మరో రకంగా చేస్తే వీరికి మండిపోయి సణుగుతూ ఉంటారు!
ఉదయం ఆరుగంటలకు మొదలుపెట్టిన సణుగుడు—రాత్రి పన్నెండు అయినా ముగియదు!
మరి ఏమిచెయ్యాలి? సింపుల్!
వాక్యము జ్ఞాపకం చేసుకోవాలి!
మొదటిది:
1కొరింథీ 10:10....
మీరు సణుగకుడి; వారిలో కొందరు సణిగి సంహారకుని చేత
నశించిరి.
రెండవది: యాకోబు
5:9
సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీదనొకడు
సణగకుడి; ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు.
ఈ వాక్యాలు అన్నీ గుర్తుకు చేసుకోవాలి! ఒకసారి 1కొరింథీ 10:8—10 వరకు చదవండి! ఇలాంటి ఆలోచనలు
వస్తే వెంటనే వీటిని జ్ఞాపకం తెచ్చుకుని ఓ పనికిమాలిన మనసా/ హృదయమా! నరకానికి
పోతావట జాగ్రత్త! అంటూ మనలను మనం వాక్యఖడ్గముచేత హెచ్చరించుకోవాలి!
*అనుమానం*: అనుమానం రెండు రకాలు నా
ఉద్దేశంలో!
మొదటిది: పిరికితనంతో కూడిన అనుమానం! అయ్యో! అక్కడ ఏదో ఉందేమో!!
అయ్యో వాడు నన్నే చూస్తున్నాడేమో!! అక్కడ పాము ఉందేమో!!! అక్కడ దయ్యాలున్నాయేమో!!!
ఇలాంటి పిరికితనంతో కూడిన అనుమానం మొదటిది!
వీటికి- దేవుడు మనకు పిరికితనం గల ఆత్మనియ్యలేదు గాని
శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చారు అనే వచనాన్ని జ్ఞాపకం చేసుకుని
ఇలాంటి ఆలోచనలను గద్ధించాలి!
మరో అనుమానం ఉంది: భర్తమీద భార్యకు అనుమానం! భార్యమీద భర్తకి అనుమానం! ఓ
భర్త! నీ భార్యకు ఎవరో దారిలో కనబడి అమ్మా
మీ అత్తగారు మామగారు ఎలా ఉన్నారు లేక మీ ఆయన ఇంట్లో ఉన్నారా లేక మరో విషయం అడిగితే
అతనికి నీ భార్యకు లింకు పెట్టేస్తావా? భార్య నీతో కాకుండా మరెవరితోనూ
మాట్లాడకూడదా? మాట్లాడితే అది అక్రమ సంబంధమేనా?
ఓ భార్యా! నీ భర్త బయటకు పనిమీద వెళ్ళినప్పుడు పురుషులతోనే కాదు
స్త్రీలతోను మాట్లాడాలి! అలా మాట్లాడితే ఆమెతో నీ భర్తకు అక్రమ సంబంధం అంట
కట్టేస్తావా? నీ భర్త నీకంటే అందంగా ఉంటే అనుమాన పడాలా? నీభార్య అందంగా ఉంటే
అనుమానం పడాలా?
అయ్యా! అమ్మా! ఇది సాతాను మాస్టర్ ప్లాన్! భార్యభర్తల మధ్య తగాదాలు పెట్టి
కుటుంబాలను విడదీయాలని, తద్వారా సంఘాన్ని పాడుచేయ్యాలని వాడి ప్లాన్! వాడి ప్లాన్
లో పడిపోయి మీ చక్కటి సంసారాన్ని పాడుచేసుకోకండి!
*అవునా! ఇది నిజమా*! అని మొదలయ్యింది అనుమానం! తినవద్దన్న పండు
తిన్నది! ఇంతవరకు మనం పీక్కోలేక కక్కుకోలేక పోతున్నాము! ఇంకా ఇది కూడా కావాలా?
కాబట్టి అనుమానం అనేది సాతాను గాడి ఆయుధం దానికి లోను కాకండి;
అయితే కొంతమంది ఉంటారు అనుకోండి! వారు కామంతో కళ్ళుబైర్లు కమ్మిపోయి
అందరూ వ్యభిచారులు లాగానే కనిపిస్తారు వారికి! అలాగే తమ భర్త భార్య కూడా ఆలాగే
అనుకుని ఉంటారు!
మరికొంతమందికి తన భార్య
అందంగా ఉన్నా, తన కళ్ళకి అందంగా కనబడదు—ప్రక్క ఇంట్లో నున్న
పేడముఖంది చాలా అందంగా కనిపిస్తుంది! దాని మేకప్ తీసి చూస్తే బండారం బయటపడుతుంది!
మరికొందరికి తమ భర్త అందంగా కనబడడు- దారంటపోయే ప్రతీ పురుషుడు ఎంతో సుందరంగా
కనిపిస్తూ ఉంటాడు!
అయితే ఈ విషయంలో కొన్నిసార్లు స్త్రీపురుషులది కూడా తప్పు ఉంటుంది!
ఎక్కడికో పార్టీకో ప్రయాణానికి వెళ్ళినప్పుడు రడీ అవుతుంటారు గాని ఇంట్లో
ఉన్నప్పుడు పేడ ముఖాలు/ జిడ్డు ముఖాలు వేసుకుని ఉంటారు! ఓ స్త్రీ! నీ అందం నీ
భర్తకోసమే! కాబట్టి నీ భర్త ఇంట్లో ఉన్నప్పుడు కనీసం తయారై భర్తకు అందంగా శుభ్రంగా
కనిపించు! అలాగని మూతుకి రంగు పెదాలకు రంగు ముఖానికి రంగు పూసుకోమని చెప్పడం లేదు!
స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకో చాలు! ఎప్పుడూ నైటీలే కాదు! నీ అందం నీ భర్తకు
చూపించు!
ఓ భర్త ఇది నీకు కూడా అప్లై అవుతుంది! కాబట్టి బార్యాభర్తల మధ్య
ప్రేమను పెంచుకోండి! అనుమానాలు పెంచుకోవద్దు! ఈలోకంలో ఉన్న ప్రతీ ఒక్కరు
వ్యభిచారులు కాదు! ముందు నీ ఆలోచనా విధానం మార్చుకో!
దైవాశీస్సులు!
(ఇంకాఉంది)
*ఎఫెసీ పత్రిక -121వ భాగం*
*పిలుపుకి తగిన జీవితం-73*
*విశ్వాసి-ఆత్మీయ పోరాటాలు-13*
ఎఫెసీ 6:11—18
11. మీరు అపవాది (అనగా సాతాను) తంత్రములను ఎదిరించుటకు
శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.
12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో (మూలభాషలో-
రక్తమాంసములతో) కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు
లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.
13. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును,
సమస్తము నెరవేర్చినవారై నిలువ బడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు (దేవుని)
సర్వాంగ కవచమును ధరించుకొనుడి
14. ఏలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను
మైమరువు తొడుగుకొని
15. పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధమనస్సను
జోడుతొడుగుకొని
నిలువ బడుడి.
16. ఇవన్నియు గాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు
దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు.
17. మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను
ఆత్మఖడ్గమును ధరించు కొనుడి.
18. ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను
విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో
విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! పిలుపుకి తగ్గ జీవితం జీవించడములో కలిగే విశ్వాసి యొక్క ఆత్మీయ
పోరాటాలు కోసం ధ్యానం చేసుకుంటున్నాము!
( గతభాగం తరువాయి)
ఆత్మీయ యుద్ధము-2.1
విశ్వాసి చేసే మూడో రకమైన ఆత్మీయ పోరాటం
కోసం చూసుకుంటున్నాము! దానికి నేను పెట్టుకున్న పేరు- ఆత్మీయ యుద్ధము/పోరాటం-2.
ఇది రెండు రకాలు
ఆత్మీయ
యుద్ధం 2.1—ఆలోచనల ద్వారా
ఆత్మీయ
యుద్ధం 2.2—అపరాధభావము, ఆత్మన్యూనత భావం
మరియు దేవునిమీద నిష్టూరాలు వెయ్యడం!
*భర్తమీద పెత్తనం*: ఇదికూడా ఒక పోరాటమే యుద్ధమే! కాని
అది నీకు తెలియదు! బైబిల్ చాలా స్పష్టముగా చెబుతుంది- భార్య భర్తకి లోబడి ఉండాలి!
ఒక్కసారి కాదు నాలుగు సార్లు చెప్పబడింది....
ఎఫెసీయులకు 5: 22
స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి.
ఎఫెసీయులకు 5: 24
సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలుకూడ ప్రతి
విషయములోను తమ పురుషులకు లోబడవలెను.
కొలస్సీయులకు 3: 18
భార్యలారా, మీ భర్తలకు విధేయులైయుండుడి; ఇది ప్రభువునుబట్టి
యుక్తమైయున్నది.
1పేతురు 3: 1
అటువలె స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి;
గాని కొంతమంది భార్యలు- తామే తెలివైన వారము, భర్త పనికిమాలిన వాడు!
వాడికి తెలివిలేదు! నా తెలివితో నేను నా కుటుంబాన్ని కట్టుకుని ధనాన్ని
పోగుచేసుకోవాలి అనే భావన కలిగి భర్తమీద పెత్తనం చేస్తున్నారు! ఇది బైబిల్ కి
వ్యతిరేఖం! స్త్రీలు నన్నుక్షమించాలి! ఒక్కసారి వాక్యపు వెలుగులో మిమ్మల్ని మీరు
చూసుకుని అలా వ్రాయబడి ఉంటే మిమ్మల్ని మీరు సరిదిద్దు కోవాలి! నీవు ఎంతటి పోష్టులో
ఉన్నా, నీవు ఎంత ధనవంతురాలవైనా, అమ్మగారి
ఇంటినుండి కోట్లు తీసుకుని వచ్చినా, నీవు ఎంత అందమైన దానివైనా, నీవు MLA, MP, కలెక్టర్ వి అయినా బైబిల్ చెబుతుంది నీవు నీ భర్తకు లోబడవలసినదే!!! నీ భర్త బంట్రోతు అయినా, కూలి పనోడు అయినా నీవు
నీ భర్తకు లోబడవలసినదే! ఇదే నా బైబిల్ చెప్పేది! ఇదే క్రమము!
ఈ క్రమము తప్పితే అక్రమము చేయువారలరా! నాయొద్దనుండి తొలిగిపొండి
అనిపించుకుని నిత్యనరకానికి పోతావు!!!
నరకం కావాలా పరలోకం కావాలా??!!
అమ్మా! అది సాతాను గాడు నీలో పడి ఒకరకమైన గర్వాన్ని నీలో పెట్టి నీ
భర్తమీద పెత్తనం చేసి- నిన్ను నరకానికి తీసుకుని పోతూ, ఇంటినే నరకంగా మార్చేయాలని
వాడి ఉద్దేశం! సాతాను యొక్క తంత్రమును అర్ధము చేసుకుని భర్తకు క్షమాపణ చెప్పి
ఇప్పటి నుండి అయినా లోబడటం నేర్చుకో! తద్వారా పరలోకం చేరుకో!
*పిల్లలమీద చిరాకు-అసహనం చూపించడం*: ఇది
కూడా యుద్ధమే! అది యుద్ధము, ఆత్మీయ పోరాటం అని తెలియక- చిరాకు పెరిగిపోతుంది అంటూ
ఈ డాక్టర్ కి- ఆ డాక్టర్ కి చూపిస్తున్నావు గాని పరమ డాక్టర్ దగ్గరకు రావడం లేదు!
నీవు చూపించాల్సింది డాక్టర్ కి కాదు! నీలో పనిచేస్తున్న ఆత్మీయ పోరాటంలో- అది
పోరాటం అని గ్రహించి- వాడిని తరిమికొట్టు! చాలామందికి ఆఫీసులో ఉన్న చిరాకు, బయట
పరిస్తితుల చిరాకు- ఎవరిమీద చూపించాలి తెలియక- ఇంట్లో ఉన్న పసిపిల్లల మీద
చూపిస్తుంటారు! లేకపోతే భార్య తేరగా దొరికింది కదా- తిట్టినా ఏమనదు, పడి ఉంటుంది
కదా అని చిరాకు అంతా భార్యమీద గాని, పిల్లలమీద గాని చూపిస్తూ ఉంటారు చేతకాని వారు!
అయ్యా! నీ పిల్లలు నీతో తప్ప ఎవరితో ప్రేమను పంచుకుంటారు! అయ్యా! నాన్న కదా- డాడీ
కదా, డాడీ వచ్చారు అని నీ దగ్గరికి వస్తే పురుగుని చూసి చీత్కరించుకున్నట్లు
చిరాకు పడి వారిని గసిరేసి తగిలేస్తే ఎవరి దగ్గరకు వెళ్తారు? ఎవరికి తమ ప్రేమను
పంచుకుంటారు? ఎవరికీ తమ భాదను చెప్పుకుంటారు? ఎవరి దగ్గర ప్రేమను పొందుకుంటారు? ఆ
పసి మనస్సులు ఎంతగా గాయపడ్డాయో కదా!! ఇదెప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? నీ భార్య
నీ దగ్గర కాకపోతే తమ భాధలు ఎవరి దగ్గర చెప్పుకుంటుంది? ఎందుకు ఆ చిరాకు? చివరకు ఆ
చిరాకు ఎక్కువై పోయి, కుటుంబాలలో కలహాలు పెరిగి కుటుంభాలు విడిపోతున్నాయి! భార్య
ఒక దగ్గర, భర్త ఒక దగ్గర- పిల్లలు హాస్టలులో! చివరకు పిల్లలకు తల్లి ప్రేమా దక్కక,
తండ్రిప్రేమా దక్కక- బ్రష్టులు- దుర్మార్గులు, హంతకులు, రౌడీలు, మారకద్రవ్యాలుకి
అలవాటు పడుతున్నారు! కారణం ఓ తండ్రీ! నీవే!
ఇంటికి వస్తున్నప్పుడు నీ
చిరాకు అంతా గేటు బయట వదిలేయ్! ఇది నీ ఇల్లు! నీ ప్రేమను పంచు! ప్రేమను
అందుకో! ఇంటికి వచ్చిన వెంటనే- పనికిమాలిన
ఫోన్ తీసుకుని వీడియోలు చూసుకోవడమో, ఎవరితోనో మాట్లాడుకోవడమో, గేమ్లు ఆడుకోవడమో
చేస్తున్నావ్ కదా అందుకే ఈ భాదలు! ఆ పనికిమాలిన ఫోన్లు ప్రక్కన పెట్టేసి నీ
పిల్లలతో గడుపు! నీ భార్యతో గడుపు! కుటుంబం అంతా కలిసి కుటుంబ ప్రార్ధనలో గడపండి!
దేవుడు మీ గృహాన్ని కడతారు!
ఓ భార్యా! ఎల్లప్పుడూ పనికిమాలిన వ్యభిచార సంబంధమైన సీరియల్లు
కాకుండా పిల్లలను పట్టించుకో! భర్తను పట్టించుకో! పిల్లలకు భక్తి ప్రార్ధన
నేర్పించు! లేకపోతే బుద్ధిహీనురాలు తనచేతులతో తన ఇల్లు ఊడబీకుకొనును అన్న సామెతల
గ్రంధ వచనాన్ని సార్ధకం చేసుకుంటావు జాగ్రత్త!
గమనించండి ఇది సాతాను గాడి మాస్టర్ ప్లాన్! ఇలాంటి చిరాకులు అసహనం
మీలో పెంచి, ఇంట్లో శాంతి సమాధానాలు దూరం చేసి, మిమ్మల్ని నరకానికి పంపించాలని
వాడి కోరిక! దీనిని తెలిసికొని- ఇది సాతానుపని అని గ్రహించి- హాస్పటల్ కి డాక్టర్ల
దగ్గరికి వెళ్ళకుండా మోకాళ్లమీద జయించు! వాక్యంతో సాతానుని గద్దించు! నేను విడుదల
పొందిన దానను! నేను దేవుని బిడ్డను- నాలో చిరాకు అసహనం కలిగించే ఓ దురాత్మా!! యేసు
అధికారం గల నామంలో నీకు ఆజ్ఞాపించేదేమిటంటే నామీద నీకు ఎటువంటి అధికారం లేదు!
ఇప్పుడే నన్ను విడిచిపెట్టి పో! వెంటనే వాడు పారిపోతాడు! ఇంట్లో శాంతి సమాధానలు
వస్తాయి! ఇప్పుడే ప్రయత్నించి విడుదల పొందుకో!
చివరగా
*భార్యాభర్తల మధ్య తగాదాలు*: మరలా
చెబుతునాను: ఇదికూడా ఆత్మీయ పోరాటమే!!!
అది పోరాటం అని తెలియక- తగాదాలు పడి కోర్టులకు వెళ్తున్నావు!
ఇంటిని నరకం చేసుకుంటున్నావు!
అయ్యా అది సాతాను గాడి ప్లాన్! మీరు విడిపోవాలి అదే వాడి ప్లాన్!
ఇది తెలియక కుటుంబాన్ని పాడుచేసుకొంటున్నావు! దానికి కారణం మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన
లేదు! ఆదివారం నాడు ఆరాధనకు వెళ్ళడం లేదు! సందు దొరికితే నీవు నీ భర్తను తీసుకుని
మీ ఇంటికో అత్తగారి ఇంటికో షికార్లుకో, బీచ్ లకి, పార్కులకి వెళ్తున్నావు దానికోసం
ఆరాధన ఉన్నా ఎగ్గొడుతున్నావు కదా, సాతాను గాడికి అవకాశం దొరికింది- వాక్యానికి
చోటు తగ్గిపోయింది, ప్రాధాన్యత తగ్గింది గనుక సాతానుగాడు పేట్రేగిపోయి భార్యాభర్తల
మధ్య తగాదాలు పెట్టి కుటుంబాలను చీల్చేస్తున్నాడు! ఇది వాడి ప్లాన్! వాడుచాలా వరకు
సక్సెస్ అవుతున్నాడు!
అది యుద్ధమని తెలియక కోర్టులచుట్టూ తిరుగుతున్నారు! ఇప్పుడైనా
మోకరించి నీ తప్పులు ఒప్పుకుని నీభార్యతో సమాధాన పడతావా? సాతాన్ని జయిస్తావా?
మరొక కారణం కూడా ఉంది! స్త్రీలు నన్ను క్షమించాలి- దీనిని బాగా
అర్ధం చేసుకోవాలి! ఈ మధ్య నేను ఒక ఫ్యామిలీ కౌన్సలర్ ఇంటర్వూ చూశాను! ఫ్యామిలి
కోర్టులలో ఉంటారు వీరు! విడిపోకుండా భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇస్తుంటారు!
ఆమె చెప్పిన మాటలు విని
నాకు షాక్ కలిగింది! మన తెలుగు రాష్ట్రాలలో భార్యాభర్తలు ఎందుకు ఎలా
విడిపోతున్నారు అంటే: నూటికి 75% తల్లులు లేక అత్తలు వలన విడిపోతున్నారు అట!
తండ్రి లేక మామ గారి వలన ౩% విడిపోతున్నారు అట! అక్రమ సంబంధాలు వలన 17%
విడిపోతున్నారు! ఇతర కారణాల వలన మిగిలిన వారు విడిపోతున్నారు! అయ్యా అమ్మా! ఇంకా
అయిపోలేదు-- అత్తలవలన లేక తల్లుల వలన ఎలా విడిపోతున్నారో చూడండి! 75% లో మొబైల్ ఫోన్ల వలన 70% విడిపోతున్నారు అట!
పూర్వకాలంలో ఫోన్లు అనగా మొబైల్ ఫోన్లు లేనప్పుడు ఇంతగా విడిపోయేవారు కాదట! ఎలాగో
చెబుతాను వినండి!
ఇప్పుడు తుమ్మితే ఫోన్, దగ్గితే ఫోన్, ఆరోజు తనకు కూర తక్కువైపోతే
ఫోన్, అత్తగారు ఏమైనా అంటే ఫోన్! వెంటనే ఆ తల్లి ఏమనాలి? అమ్మా సర్దుకో!
కొన్నిరోజులకు అంతా కుదుట పడుతుంది అనాలి! అనడం లేదు- ఎవర్తది- నీకు గతిలేక
దిక్కులేక కాదు- ఇదిగో తమ్మున్ని పంపిస్తున్నాను వచ్చేయ్! కోర్టులో చూసుకుందాం!
ఇంకేం కోర్టులో చూసుకుంటావు- కాపురం విడిపోయాక!! పిల్లలకి/కూతురికి
బుద్ధి చెప్పాల్సిన తల్లి లేక తండ్రి విడిపోమని ప్రోత్సహిస్తున్నారు ఈ పనికిమాలిన
సీరియల్లు చూసి! అయ్యా ఇది మంచి పనికాదు! అయితే మొబైల్ ఫోన్ల వలన ఇది చాలా ఈజీ
అయిపోయింది! అయితే ఇలాంటి తల్లిదండ్రులకు మొబైల్ ఫోన్లు లేనప్పుడు ఇలా విడిపోవడం
చాలా తక్కువ! ఎవరైనా కూతురు –ఇక్కడ అత్తా గారు అలా అన్నారు, మామ గారు ఇలా అన్నారు, భర్త
ఇలా అన్నాడు అంటే- అమ్మా సర్దుకో అనేవారు ఆరోజులలో! మరికొందరైతే భర్తతో కాకుండా
ఒంటరిగా వస్తే దవడ వాయగొట్టే వారు! ఏమైనా సరే నీభర్తతోనే రావాలి నీ పుట్టింటికి
లేకపోతే పో అనేవారు! కాపురాలు నిలబడేవి!
సరే, ఫోన్లు- లేనప్పుడు ఎలా కాపురాలు నిలబడ్డాయి అంటే ఆదివారం నాడు
భర్త తిట్టాడు. ఆదివారం రాత్రికి ఉత్తరం సంపాదించి మా ఆయన ఇలా అన్నాడు .... అని
ఉత్తరం రాసి సోమవారం ఉదయానికి పోస్టు చేయగలగింది. ఆ ఉత్తరం గురువారం నాడు
తల్లిదండ్రులకు చేరింది! వెంటనే తండ్రి నేను వస్తున్నాను లేక వెంటనే వచ్చేయ్ అని
రాసి, శుక్రవారం పోస్టు చేసాడు అనుకుందాం.
అది సోమవారం గాని మంగళవారం గాని అందింది ఆ అమ్మాయికి! అనగా తొమ్మిది రోజులు గడిచిపోయింది
ఉత్తరం అందడానికి! ఈలోగా మొగుడుపెళ్ళాల మధ్య గొడవ తీరిపోవడం, వారు కలిసిపోవడం కూడా
జరిగిపోయింది. ఆ ఉత్తరం చూసి మరలా ఈ అమ్మాయే -చూశావా మా అమ్మా నాన్నకు మేము కలిసి
ఉండాలని లేదేమో అనుకుంటుంది! కాబట్టి ఈ కమ్యూనికేషన్ డిలే వలన కాపురాలు నిలబడేవి!
ఈ మొబైల్ ఫోన్లు కాపురాలను విడదీసేస్తున్నాయి!
దానికి ఆమె చెప్పిన పరిష్కారం ఒక్కటే! అత్తల దగ్గర లేక అమ్మల దగ్గర
ఫోన్లు ఉండకూడదు, వారానికి ఒక్కసారే కూతురు తల్లితో మాట్లాడాలి అంతే! (క్షమించండి-
నేను ఫ్యామిలి కౌన్సిలర్ ని కాదు, ఇందుకోసం దేవుడు నన్ను పిలవలేదు, ఉపయోగ పడుతుందేమో
అని రాశాను, అంతే)
కాబట్టి కాపురాలు పాడుచేసుకుకోకండి! పూర్వకాలములో చదువు లేక భార్య-
భర్తను బెడ్ రూమ్ లో తప్ప ఎప్పుడూ చూసేది కాదు! చూడకూడదు! ఇప్పుడు అన్నీ
మారిపోయాయి కదా- అందరూ చదువు కున్నవారే కదా. కాబట్టి నీకు ఇష్టం లేనిది, అభ్యంతరం
కలిగించేది ఏదో నీ భర్తతో లేక భార్యతో చెప్పేయ్! కేవలం విడిపోదాం అని అనుకుంటేనే
సమస్యను నీ తల్లిదండ్రులకు చెప్పు! లేకపోతే నీ సమస్యను నీవే పరిష్కరించుకో!
ప్రార్ధనలో కనిపెట్టు! ఆరాధనకు క్రమం తప్పకుండా వెళ్ళు! ముఖ్యంగా యేసుక్రీస్తు ఈ
గృహాధిపతి అని బోర్డు పెట్టుకుంటే కాదు- నిజంగా యేసుక్రీస్తుప్రభులవారు ని
అధిపతిగా చేసి ఆయనకు మొదటి స్థానం ఇవ్వు! నీ కాపురం నిలబడే ఉంటుంది కారణం ఆయన
అల్లరికి కర్త కారు! సమాధానాధిపతి, సమాధాన కర్త! మరి ఆయనకు స్థానమిచ్చి ఈ
పనికిమాలిన సాతానుగాడు పెట్టిన తగాదాలకు స్వస్తి చెప్పు!
* వాక్యాన్ని హృదయంలో
నింపుకుని కన్నీటితో ప్రార్ధన చెయ్యాలి! ప్రభువా ఫలాని వచనంలో ఇలా అన్నావు కదా!
నీవు చేసినవాగ్ధానం నా జీవితంలో నెరవేర్చు అని ప్రార్ధన చెయ్యాలి!
అలాగే సాతానుతో
ఆలోచనలతో పోరాడేటప్పుడు వాక్యాన్ని ఎత్తి చెప్పాలి అనగా వాక్యఖడ్గముతో ఎదుర్కోవాలి!
* ఇక తర్వాత దేవునికి
మనలను మనం సంపూర్తిగా అప్పగించుకోవాలి! అయ్యా నీకిష్టము వచ్చినట్లుగా నన్ను
వాడుకో! నా ఆలోచనలకు కావలిగా ఉండు! నేను మాటయందును, చూపుయందును ప్రవర్తన యందును
తప్పిపోకుండా నీ బిడ్డగా జీవించేలా నాకు సహాయం చెయ్యండి అంటూ వేడుకో!
* తర్వాత పరిశుద్ధాత్మ
పూర్ణులై ఉండండి! ముందు చెప్పినట్లు శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధంగా
పనిచేస్తాయి కాబట్టి ఆత్మపూర్ణులుగా ఉంటే శరీరకార్యాలను మనం నేరవేర్చలేము!
* తర్వాత ఉపవాస
ప్రార్ధన ద్వారా ఇలాంటి ఆలోచనలను జయించవచ్చు! కాబట్టి ఉపవాస ప్రార్ధన చెయ్యండి! యేసుక్రీస్తుప్రభులవారు
కూడా ఉపవాసమున్నప్పుడు మనం కూడా ఉండాలి!
* చివరగా స్తుతి ఆరాధనలో నోరు తెరిచి గట్టిగా ఆరాధించి
నప్పుడు, ప్రార్ధించినప్పుడు, పాటలు పాడినప్పుడు ఇలాంటి ఆలోచనలను కలిగించే దయ్యాలు
పారిపోతాయి! నీకు విడుదల కలుగుతుంది! కాబట్టి స్తుతి ఆరాధనలో సమయమును గడుపు!
ఈ
రీతిగా నడుచుకోవడం వలన పైన చెప్పిన ఆయుధాలు వాడటం వలన నీవు ఆత్మీయ పోరాటం 2.1 లో
విజయం సాధించగలవు!
ఆమెన్!
దైవాశీస్సులు!
*ఎఫెసీ పత్రిక -122వ భాగం*
*పిలుపుకి తగిన జీవితం-74*
*విశ్వాసి-ఆత్మీయ పోరాటాలు-14*
ఎఫెసీ 6:11—18
11. మీరు అపవాది (అనగా సాతాను) తంత్రములను ఎదిరించుటకు
శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.
12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో (మూలభాషలో-
రక్తమాంసములతో) కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు
లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.
13. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును,
సమస్తము నెరవేర్చినవారై నిలువ బడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు (దేవుని)
సర్వాంగ కవచమును ధరించుకొనుడి
14. ఏలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను
మైమరువు తొడుగుకొని
15. పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధమనస్సను
జోడుతొడుగుకొని
నిలువ బడుడి.
16. ఇవన్నియు గాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు
దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు.
17. మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను
ఆత్మఖడ్గమును ధరించు కొనుడి.
18. ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను
విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో
విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! పిలుపుకి తగ్గ జీవితం జీవించడములో కలిగే విశ్వాసి యొక్క ఆత్మీయ
పోరాటాలు కోసం ధ్యానం చేసుకుంటున్నాము!
( గతభాగం తరువాయి)
*ఆత్మీయ యుద్ధము-2.2*
విశ్వాసి చేసే మూడో రకమైన ఆత్మీయ పోరాటం
కోసం చూసుకున్నాము!
ఆత్మీయ యుద్ధము/పోరాటం-2. ఇది రెండు రకాలు
ఆత్మీయ
యుద్ధం 2.1—ఆలోచనల ద్వారా
ఆత్మీయ
యుద్ధం 2.2—అపరాధభావము, ఆత్మన్యూనత భావం
మరియు దేవునిమీద నిష్టూరాలు వెయ్యడం!
ఇక చివరగా మనం ఆత్మీయ పోరాటం/యుద్ధం 2.2 కోసం ధ్యానం చేసుకుందాము!
గమనించాలి- ఈ ఆత్మీయ పోరాటం/యుద్ధం 2.2లో సాతానుగాడి ముఖ్య
ఉద్దేశ్యం ఏమిటంటే నిన్ను ప్రార్ధన చెయ్యకుండా ఆలోచనల ద్వారా ఆపి- తద్వారా నిన్ను
భ్రష్టుడిని చెయ్యాలి! నిన్ను ప్రార్ధన చెయ్యనివ్వడు సాతాను! తప్పకుండా వీటిని
జయించాలి లేదా జయజీవితం జీవించలేవు, సాతానుని జయించలేవు పరలోకం చేరలేవు!!!
మొదటిది:*అపరాధ భావం*:
ఎప్పుడో బాప్తిస్మం తీసుకోక మునుపు లేక నిజమైన మారుమనస్సు పశ్చాత్తాపము పొందక
మునుపు, నీవు పాపివి, వ్యభిచారివి, దొంగవు
లేక మరో పాపం కావచ్చు! గాని నీ విశ్వాసం ఎప్పుడైనా సన్నగిల్లినప్పుడు ఆరాధనను నిర్లక్షం
చేసిన తర్వాత లేక కొన్ని రోజులు గేప్ తర్వాత నీవు ఎప్పుడైతే ప్రార్ధన చేద్దామని
మోకరిస్తావో – వెంటనే సాతానుగాడు నీ చెవులలో అంటాడు—చాలుచాలులే ప్రార్ధన
చేసేస్తున్నావు గాని అప్పుడు ఏఏ పాపాలు చేసేవాడవో/దానవో మర్చిపోయావా? ఇప్పుడు
భక్తిపరుడిలా ప్రార్ధన చేసేస్తున్నావు!! ఇలాంటి పాపుల ప్రార్ధన ఆలకిస్తాడంటావా?
నీవు పాపివి అంటూ నీ చెవిలో మ్రోగిస్తూ ఉంటాడు! లేదా బాప్తిస్మం తీసుకున్న తర్వాత
ఈ మధ్యన ఏదో పాపం చేసి, దానికి దేవుని దగ్గర క్షమాపణ అడిగి విడుదల పొందావు అనుకో,
లేక పొందుకోలేదు అనుకో- భక్తిపరుడ్ని అంటావు, పాటలు పాడేస్తుంటావు, మొన్న ఏమి
చేశావో మర్చిపోయావా? నీ సెల్ఫోన్లో ఏమి చూసావో మర్చిపోయావా? ఎలాంటివి చూశావో
మర్చిపోయావా? ఇప్పుడు ఏమీ ఎరగనట్లు పెద్ద భక్తిపరుడిలా ప్రార్ధన చేసేస్తున్నావు,
వాక్యం చెప్పేస్తున్నావు అంటూ నిన్ను చాలా ఘోరంగా గందరగోళ పరిస్తితులకు నెట్టేస్తూ
ఉంటాడు!!
*జయించడం ఎలా*?: మొదటగా: బాప్తిస్మం
పొందకముందు పాపాలకోసం మరియు దేవుని క్షమాపణ అడిగి పశ్చాత్తాప పడి విడుదల క్షమాపణ
పొందుకున్న పాపాల కోసం:
దేవుడు వాటిని మర్చిపోయారు! దేవుడే తుడిచివేశాను అని చెప్పారు!
వాటిని కడిగివేసి- దేవుని వీపు వెనుకభాగానికి త్రోసివేశారు!
యెషయా 38: 17
మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలు గుటకు కారణమాయెను నీ
ప్రేమచేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. *నీ వీపు వెనుకతట్టు నా
పాపములన్నియు నీవు పార వేసితివి.*
యెషయా 43: 25
*నేను నేనే నా చిత్తానుసారముగా నీ యతిక్రమము లను
తుడిచివేయుచున్నాను* *నేను నీ పాపములను జ్ఞాపకము చేసికొనను*.
ఈ అన్ని వచనాల ఆధారంగా దేవుడు తానే మన దోషములను
హరించినప్పుడు, తుడిచివేసినప్పుడు మనం పాపవిముక్తి పొంది క్షమించబడిన తర్వాత వీడు
చెప్పేవి అబద్దాలు- వాడు మోసగాడు! నిన్ను పాడుచెయ్యడానికి బ్రష్టుడుగా మార్చడానికి
వాడు నాటకం ఆడుతున్నాడు! వెంటనే ఇటువంటి పరిస్తితులు ఎదురయితే వాడికి చెప్పాలి-
ఒరే సాతానుగా! నీవు నోరుమూసుకుని నా దగ్గర నుండి పారిపో! కారణం యెషయా 38:17
ప్రకారం, యెషయా 43:25 ప్రకారం దేవుడు నా పాపములను తుడిచివేశారు క్షమించివేశారు!
ఇప్పుడు నేను విముక్తిపొంది ఆ పాపములకు పరిశుద్దుడిగా తీర్చబడిన వాడను, కాబట్టి
దేవుడే వాటిని మర్చిపోయాక నీవెవడవురా మరలా గుర్తు చెయ్యడానికి? యేసు అధికారం గల
నామంలో నీకు ఆజ్ఞాపిస్తున్నాను- పో నా దగ్గర నుండి!! అని గద్దించు, తోక ముడుచుకుని
పారిపోతాడు!
ఒకవేళ నీవు ఈ మధ్యనే చేసిన పాపాలను ఎత్తిచూపుతూ నిన్ను
ప్రార్ధన చెయ్యకుండా గుసగుసలాడుతున్నాడా?? వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళు! నిజమైన
పశ్చాత్తాపంతో కన్నీరు విడుస్తూ దేవుని దగ్గర క్షమాపణ వేడుకో! కేవలం వేడుకోవడమే
కాదు, దేవుని సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టు! మరలా పాపం చెయ్యకు! అతిక్రమములను
దాచిపెట్టువాడు వర్దిల్లడు గాని దానిని ఒప్పుకుని విడిచిపెట్టు వాడు కనికరం
పొందును అని బైబిల్ వాగ్దానం! సామెతలు 28:23; కాబట్టి ఒప్పుకుని విడిచిపెట్టు!
దేవుని దగ్గర క్షమాపణ పొందుకో! ఆ తర్వాత మరలా వాడు వచ్చి మరలా జ్ఞాపకం చేస్తే మీదన
చెప్పినట్లు చెప్పు- నేను విడుదల పొందాను, క్షమించబడ్డాను! దేవుడు వాటిని
తుడిచేశారు! కాబట్టి నీవు నోరుమూసుకోమని చెప్పండి!
అపరాధభావం దగ్గర వాడాల్సిన ఆయుధాలు:
మొదటి కన్నీటి ప్రార్ధన చేసి పాపములను ఒప్పుకోవడం; రెండు వాక్య ఖడ్గము తీసుకుని
వాడిని చిత్తుచెయ్యడం! వాక్యాన్ని చూపిస్తూ వాడ్ని చెండాడాలి!
*ఆత్మన్యూనతా భావం*: అనగా నిన్నునీవు తక్కువ చేసుకోవడం- నిన్ను
ఎవరూ పట్టించుకోవడం లేదు అనుకోవడం! ఇలాంటి ఆలోచనలను వాడే నీకు పుట్టిస్తుంటాడు!
దేవుడు నీ ప్రార్ధనలు వినడం లేదు! అందుకే నీ ప్రార్ధనకు జవాబు రావడం లేదు! దేవుడు
కూడా నిన్ను వదిలేశాడు! దారంటపోయే ఎవరో ఎందుకో నవ్వుకుంటున్నారు- అది చూపించి
చూశావా వాళ్లకు కూడా నీవు లోకువైపోయావు! నీ పని అంతే! ఇదిగో ఇక ఈ రోగం నీకు పోదు!
డాక్టర్లకు నీ డబ్బు మొత్తం ఖర్చు అయిపోతుంది! గాని నీవు బ్రతుకవు! దేవుడు కూడా
నిన్ను స్వస్తపరచడు! నీవు చనిపోయాక నీ భార్యకు ఎవరూ సహాయం చెయ్యరు! ఇక నీ భార్య
అడుక్కుంటుంది, నీ పిల్లలు బిచ్చమెత్తకుంటారు... ఇలా నీకు నీవు నీ మనస్సులో
అనుకుని పూర్తిగా డీమొరలైజ్ అయ్యేలా చేస్తాడు, అవసరమైతే నిన్ను ఆత్మహత్య
చేసుకొనేలా చేస్తాడు! ఇదీ వాడి మాస్టర్ ప్లాన్!
*ఎలా జయించాలి*: వాడు అబద్దికుడు- అబద్దాలకు జనకుడు అని
యేసుక్రీస్తుప్రభులవారు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోవాలి! యోహాను 8:44; నేను నిన్ను
విడువను ఎడబాయను అన్న దేవుని వాగ్దానం జ్ఞాపకం చేసుకోవాలి! యెహోషువ 1:6; యోహాను
14:18; హెబ్రీ 13:5; నీకు తోడుగా ఉంటాను నిన్ను నడిపిస్తాను అన్నాడు కదా దేవుడు!
స్త్రీ తన గర్భమున పుట్టిన తన చంటి బిడ్డను కరుణించ కుండా మరుచునా వారైనా మరచుదురు
గాని నేను నిన్ను మరవను- చూడుము నిన్ను నా అరచేతుల మీద చెక్కుకున్నాను అనే అంత
ఘనమైన వాగ్దానం మరిచిపోకు! యెషయా 49:15,16; ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తుకొను
వాడను నేనే! నిన్ను ఎత్తుకుని సంరక్షించువాడను నేనే అని చెప్పిన దేవుడు నిన్ను ఎలా
వదిలేస్తారు???!! యెషయా 46:4; కాబట్టి ఈ వచనాలు జ్ఞాపకం చేసుకుని మొదట నీవు
ధైర్యంగా ఉండాలి! తగిన కాలమందు ఆయన మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన కాడి
క్రింద దీన మనష్కులై యుండుడి అని ఆయన చెప్పిన మాటలతో ఆదరణ పొంది ఆయన కోసం
కనిపెట్టాలి! 1 పేతురు 5:6; ఒకవేళ ఇలాంటి మాటలు ఆ అబద్దికుడు, మోసగాడుమన చెవిలో
ఊదితే ఒరేయ్ సాతానుగా—ఇదిగో ఇన్ని వాగ్దానాలు నా సొత్తు! ఫలాని వచనం
ప్రకారం దేవుడు ఎప్పుడూ నాతోడుగా ఉన్నారు! ఇప్పుడు కొంచెం పరీక్ష కాలంలో ఉన్నాను.
శోధించబడిన మీదట నేను సువర్ణమై వెలగబోతున్నాను కాబట్టి యేసు అధికారం గల నామంలో
నన్ను విడిచిపెట్టి పో! యోబు 23:10; అని గద్దించు! వెంటనే వాడు పారిపోతాడు!
నా చిన్ని సాక్ష్యం
చెప్పనీయండి: నేను ఎప్పుడూ ప్రతీ సంవత్సరం సభలు పెట్టిస్తుంటాను! కొన్నిసార్లు
అప్పులు అయిపోయాను! 2016 లో కూడా పెడదాము అని డేట్స్ ఫిక్స్ చేసి- సేవకులను బుక్
చేసి ఉంచాను! ఆ రోజులలో విశ్వాసులు కానుకలు ఇస్తే తీసుకొనే వాడిని కేవలం సభలకోసం!
(ఇప్పుడు నేనే నా డబ్బులతో పెడుతున్నాను) ఆ సంవత్సరం ఎవరూ ఏమీ ఇవ్వలేదు! డేట్స్
దగ్గరకి వచ్చేస్తున్నాయి! అమ్మగారు అన్నారు- ఈ సారికి మానేయ్ బాబు! నీ దగ్గర కూడా
డబ్బులు లేవు కదా, ఇంకా అప్పులు అయిపోతావ్ అన్నారు! ఇక సాతాను గాడు శోధించడం
మొదలుపెట్టాడు! ఇదిగో ఈ సంవత్సరం ఎవరూ నీకు డబ్బులు ఇవ్వరు! నీవు అప్పుల పాలు
అయిపోతావ్! ఒకవేళ నీవు చచ్చి పోతే నీ భార్యపిల్లలు ఏమవుతారు? వారు అడుక్కోవాలి
అంటూ నా బుర్ర తినేసేవాడు సాతాను గాడు! ఒకరోజు రెండు రోజులు కాదు, ఇలా చాలారోజులు
గడిచిపోయాయి! అప్పుడు నేను ముంబైలో ఉన్నాను! ఒకరోజు ఇక భరించలేక- నా రూమ్ తలుపులు
వేసుకుని గట్టిగా ఇలా అన్నాను- ఒరే సాతానుగా! నేను సంపాదించే సొమ్ములో నాకోసం, నా
కుటుంబం కోసం ఖర్చుపేట్టేది తక్కువ, దేవునికి ఖర్చుపెట్టేది ఎక్కువ! కాబట్టి నేను
దేవునిపని చేస్తున్నాను కాబట్టి దేవుడు నా పని చేస్తారు! అంతేకాకుండా ఇది కూడా
దేవుని పనే! కాబట్టి దేవుని పని దేవుడు చూసుకుంటాడు! నీవు నోర్మూసుకో! అంతేకాదు-
నీవు అంటున్నావు కదా- దేవుడు నన్ను ఇలా ఊరికినే చంపెయ్యరు! కారణం నేను ఆయన పని
చేసేటప్పుడు నన్ను ఆయనే కాపాడుతారు! ఒకవేళ నేను చనిపోయాను అనుకో ...(కీర్తనలు
37:25!). ప్రకారం నీతిమంతుని కుమారులు భిక్షమెత్తరు, చింపిరి గుడ్డలు ధరించరు అని
వ్రాయబడిన ప్రకారం- ఒకవేళ నేను చనిపోతే ఇప్పటికన్నా బాగా నా భార్యాబిడ్డలు
బ్రతుకుతారు! అప్పుడు దేవుని ప్రత్యేక ఆశీర్వాదాలు నాకుటుంబంపై దిగుతాయి! కాబట్టి
ఓ సైతానా నోరు మూసుకుని బయటకు పో అని గట్టిగా అన్నాను! వెంటనే వాడు పారిపోయాడు!
ఇంతవరకు రాలేదు! ఆ సంవత్సరం సభలు ఉజ్జీవంగా జరిగాయి! సుమారు మూడు లక్షలు ఖర్చు
అయ్యాయి! కేవలం యాబై వేలు మాత్రమే నేను ఖర్చు చేశాను! ఈ రకంగా ఆరోజు నేను వాడిని
వాక్యమును ఉపయోగించి జయించగలిగాను!
దైవాశీస్సులు!
(ఇంకాఉంది)
*ఎఫెసీ పత్రిక -123వ భాగం*
*పిలుపుకి తగిన జీవితం-75*
*విశ్వాసి-ఆత్మీయ పోరాటాలు-15*
ఎఫెసీ 6:11—18
11. మీరు అపవాది (అనగా సాతాను) తంత్రములను ఎదిరించుటకు
శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.
12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో (మూలభాషలో-
రక్తమాంసములతో) కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు
లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.
13. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును,
సమస్తము నెరవేర్చినవారై నిలువ బడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు (దేవుని)
సర్వాంగ కవచమును ధరించుకొనుడి
14. ఏలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను
మైమరువు తొడుగుకొని
15. పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధమనస్సను
జోడుతొడుగుకొని
నిలువ బడుడి.
16. ఇవన్నియు గాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు
దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు.
17. మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను
ఆత్మఖడ్గమును ధరించు కొనుడి.
18. ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను
విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో
విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! పిలుపుకి తగ్గ జీవితం జీవించడములో కలిగే విశ్వాసి యొక్క ఆత్మీయ
పోరాటాలు కోసం ధ్యానం చేసుకుంటున్నాము!
( గతభాగం తరువాయి)
*ఆత్మీయ యుద్ధము-2.2*
చివరగా *దేవునిమీద
నిష్టూరాలు వెయ్యడం*: ఇది సాతానుగాడు మంచి విశ్వాసుల మీద దాడిచేసే టెక్నిక్!
దానిని ఎదుర్కోవాలి అంటే కొన్ని విషయాలు మీరు గమనించాలి!
దేవుడు కొంతమంది ఎన్ని
తప్పులు చేసినా ఏమీ అనరు! వారు ఆర్ధికంగా అభివృద్ధి కూడా పొందుతుంటారు! అయితే
విశ్వాసులలో కొంతమంది ఏ చిన్నతప్పు చేసినా దేవుడు లెంపకాయ కొట్టేస్తూ ఉంటారు! కారణం ఏమిటంటే
వీరు పరలోకం పోయే బాచ్ లో ఉన్నారు!
ఒకవేళ మీరు ఏ తప్పు చేయకపోయినా శోధన కలిగింది అంటే దేవుడు మీకు ప్రమోషన్
ఇస్తున్నారు అందుకే ముందుగా పరీక్ష పెడుతున్నారు అని గ్రహించాలి! గాని సాతానుడు
దీనిని త్రిప్పి నీచేత దేవునిమీద
నిష్టూరాలు వేయిస్తుంటాడు.
ఇంకా దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు
వారియందు ఆయన సంతోషపడుతున్నారు అంటున్నారు! ఇంకా కొంతమంది దేవుడు న్యాయకర్త అంటారు
కదా దేవుడు, మరిలోకంలో ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే దేవుడు చూస్తూ ఏమిచేస్తున్నాడు
అంటున్నారు!
ఇంకా సాతానుగాడు మన చెవిలో
ఏమంటాడు అంటే భక్తిగా ఉండి ఉపయోగం ఏమిటి?
చూడు వాడికి దేవుడంటే భయం లేదు! ఎప్పుడూ త్రాగుతూ, వ్యభిచారంచేస్తూ, లంచాలు
పుచ్చుకుంటూ వీడిని వాడిని దోచుకుంటూ ఉంటాడు! వాడికి ఏమీ అవ్వడంలేదు! వాడి పిల్లలు
ఎంతో అభివృద్ధి పొందుతున్నారు! బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడుతున్నారు! వాడిని
వదిలేయ్, నీవు ఎంతోభక్తిగా ఉంటావు ,
ఉపవాసాలు ఉంటావు, వాడైతే ఎప్పుడో క్రిస్మస్కో, క్రొత్తసంవత్సరానికో ఈష్టర్కో
మందిరానికి వస్తాడు! వాడికి ఏ కష్టాలు, శ్రమలు రావు! నీకైతే అన్నీ కష్టాలే! అన్నీ శ్రమలే! నీవు ఏమాత్రం చిన్న
పొరపాటుచేసినా దేవుడు వెంటనే లెంపకాయ
కొట్టేస్తున్నాడు! వాడు ఎన్ని అవినీతి క్రియలు
చేసినా దేవుడు వాడిని చూసిచూడనట్లు వదిలేస్తున్నాడు అని చెబుతున్నాడు. అది
నిజమని అనుకుంటున్నారు కదా ఇలా మీరు కూడా!
సరే,
భక్తులైన వారు ఎలా దీనిని ఎదుర్కొన్నారో చూసుకుందాం! ముందుగా బైబిల్ నుండి, ఆ
తర్వాత ఇద్దరు గొప్ప దైవజనుల అనుభవాల నుండి చూసుకుందాం!
మహా గొప్ప భక్తుడైన
ఆసాపుగారు కూడా ఇలాగే దేవునిమీద ఆయాసపడ్డారు!
కీర్తనలగ్రంధం 73 లో ఇది కనిపిస్తుంది మనకు! మూడో వచనంలో అంటున్నారు
భక్తుడు—భక్తిహీనుల
క్షేమము నాకంట పడినప్పుడు,
గర్వించువారినిబట్టి నేను మత్సరపడ్డాను! ఆభక్తిలేని వారికి మరణయాతనలు లేవు,
వారు పుష్టిగా ఉన్నారు, ఇతరులకు కలిగే
ఇబ్బందులు గాని అందరికీ వచ్చేజ్వరాలు తెగుళ్ళుగాని వారికి రావడం లేదు! అందుకే
వారికి గర్వం పెరిగిపోయింది! బలత్కారాన్ని
వారి వస్త్రంలా ధరించుకుంటున్నారు! వారికి
క్రొవ్వు పెరిగి పోయి కళ్ళు నెత్తిమీదికి వచ్చేశాయి. గర్వంగా మాట్లాడుచున్నారు! భక్తిపరులు
అంటే హేళన చేస్తున్నారు! ఇంకా వారు
అంటున్నారు మహోన్నతుడు అనగా దేవునికి ఎట్లు తెలుస్తుంది ? దేవుడికి బుద్ధి తెలివి
ఉందా అంటున్నారు! వారు మమ్మల్నే కాదు దేవుడా నిన్ను కూడా తిడుతున్నారు కదా! వారు
ప్రతీరోజు ధనవృద్ది కలుగజేసుకుంటున్నారు కదా అని బాధపడుతూ ఇక విసిగిపోయి పదమూడో వచనం రాబోయేసరికి ఇక నేను భక్తిగా ఉండటం
వ్యర్ధమే, ఏమీ ఉపయోగం లేదు, నాహృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవడం వ్యర్ధమే! నిర్మలంగా పవిత్రంగా ఉండటం వ్యర్ధమే!
నాకైతే దినమంతా బాధలు శిక్ష వస్తుంది వారైతే ఏభాధలు లేకుండా
నిశ్చింతగా ఉన్నారు అంటున్నారు! ఇక దీనికోసం ఆలోచించి ఆలోచించి చాలా బాధపడి
నలిగిపోతున్నారు భక్తుడు! దేవునిమీద ఎంతో
కోపం వచ్చింది! దేవునిమీద అలిగాడు ఈభక్తుడు;
అయితే ఈయన భక్తుడు కదా దేవుడు లేకుండా ఉండలేడు కదా, అందుకే ఇక వీరిని వారిని అడగడం అనవసరం,
దేవునితోనే తేల్చేసుకుందాం అని మందిరానికి పోయి ప్రార్ధన మొదలుపెట్టారు!
ధ్యానించడం మొదలుపెట్టారు ఈభక్తుడు! అయ్యా
ఇదేమి నీకు న్యాయం? మాకో న్యాయమా వాడికో
న్యాయమా? నీకేమేమైనా కొంచెమైనా జాలి ఉందా మాపట్ల అంటూ ప్రార్ధన చేస్తున్నారు! ప్రార్ధన అంతా దేవుడు చాలా
ఓపికతో తాపీగా విని నవ్వుతూ ఆయనకు అసలు విషయం బయలు పరిచారు దేవుడు! ఈ భక్తిహీనుల అంతాన్ని దేవుడు 70 mm సినిమా స్కోప్లో చూపించారు! 16—22 వచనాలలో దీనికోసం వివరంగా ఉంది! దేవుడు ఆయనకు చూపించారు ఈ భక్తిహీనులు కాలుజారు
చోటున అంచులో ఉన్నారు అనగా ఒక ఎత్తైన
కొండ, ఆశిఖరంలో ఎడ్జ్లో ఉన్నారు, గాని
వారు గర్వంతో క్రిందకు చూడటం లేదు కొద్ది నిమిషాలలో లేక క్షణాలలో వీరు కాలు జారిపోయి భయంకరమైన లోతైన గోతిలో పడబోతున్నారు
ఒక్కసారి పడ్డారా ఇక లేవరు అన్నమాట!
పరదేశులమో ప్రియులారా పాడటానికి వారి శవం కూడా దొరకదు అన్నమాట! ఇది చూసి ముందు ఈ
భక్తుడు లెంపలు వేసుకుంటున్నారు అయ్యా నేను పశుప్రాయుడను ఎన్నెన్నో అన్నాను బాబు
నిన్ను! నన్ను క్షమించమని అడిగారు ఈయన!
చివరగా ఒక మేలిరత్నం
లాంటి మాటలు అంటున్నారు భక్తుడు 25 వచనంలో ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు
నాకుండగా ఈలోకము లోనిది ఏదీ నాకు అక్కరలేదు చివరికి నాశరీరము నాహృదయం
క్షీణించిపోయినా గాని దేవుడు నిత్యమూ నాహృదయంలో ఆశ్రయదుర్ఘముగా స్వాస్త్యముగా
ఉన్నారు అంటున్నారు!
ఈ భక్తుణ్ణి చూసి మనం నేర్చుకోవాలి! ఎన్నోసార్లు ఈభక్తుడిలా మనం
దేవునిమీద బాధపడ్దాము కదా! ఇలా దేవుణ్ణి ఎన్నో మాటలాడి ఆయనను ఆయాసపెట్టాము కదా! మనకు చిన్న పొరపాటు చేసిన
లెంపకాయ ఎందుకు తగులుతుంది అంటే మనము దేవునికి
ఇష్టులము కాబట్టి! తండ్రి తనకు ఇష్టమైన పిల్లలను శిక్షించురీతిగా మనలను ఆయన శిక్షించి తిరిగి ఆయన దారి లోనికి తీసుకుని
వస్తున్నారు! ఇంకా మనము ఎత్తబడేగుంపులో, పరలోకం చేరే బాచ్లో ఉన్నాము. కాబట్టి
ఏమాత్రం పొరపాటు చేసినా వెంటనే మనలను
సరిచెయ్యడానికి ఇలాంటి లెంపకాయలు వేస్తున్నారు! వారైతే నరకానికి పోయేబాచ్! వారిని
దేవుడు అసహ్యించుకుంటున్నారు అందుకే వారు ఎలాపోయినా వదిలేసి, వాడు ఇంకా మూర్కించి
మూర్ఖించి తాను త్రవ్వుకున్న గోతిలో వాడేపడి నిత్యనాశనం పొందుకోవడం దేవునిప్లాన్!
గాని సాతాను గాడు దీనిని మరో కోణంలో చూపించి దేవునిమీద నిష్టూరాలు
వెయ్యడానికి నిన్ను ప్రేరేపిస్తున్నాడు! ఈ మోసాన్ని గ్రహించి సత్యమును గ్రహించి-
సాతాను గాడిని వాక్యఖడ్గముతో ఎదుర్కోవాలి! లేకపోతే ఇంకా నిన్ను ఇలాంటి ఆలోచనలతో
సతాయించి నిన్ను దేవునికి దూరంచేస్తాడు! వాడిని నేడే గద్దించు!
దైవాశీస్సులు!
(ఇంకాఉంది)
*ఎఫెసీ పత్రిక -124వ భాగం*
*పిలుపుకి తగిన జీవితం-76*
*విశ్వాసి-ఆత్మీయ పోరాటాలు-16*
ఎఫెసీ 6:11—18
11. మీరు అపవాది (అనగా సాతాను) తంత్రములను ఎదిరించుటకు
శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.
12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో (మూలభాషలో-
రక్తమాంసములతో) కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు
లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.
13. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును,
సమస్తము నెరవేర్చినవారై నిలువ బడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు (దేవుని)
సర్వాంగ కవచమును ధరించుకొనుడి
14. ఏలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను
మైమరువు తొడుగుకొని
15. పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధమనస్సను
జోడుతొడుగుకొని
నిలువ బడుడి.
16. ఇవన్నియు గాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు
దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు.
17. మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను
ఆత్మఖడ్గమును ధరించు కొనుడి.
18. ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను
విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో
విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! పిలుపుకి తగ్గ జీవితం జీవించడములో కలిగే విశ్వాసి యొక్క ఆత్మీయ
పోరాటాలు కోసం ధ్యానం చేసుకుంటున్నాము!
( గతభాగం తరువాయి)
*ఆత్మీయ యుద్ధము-2.2*
ఇప్పుడు
ఇద్దరు గొప్ప దైవజనుల సాక్ష్యాలను గుర్తుకు చేసి వారు ఇలా దేవునిమీద నిష్టూరాలు
వేయించే సాతాను గాడిని ఎలా ఎదుర్కొన్నారో వారి జీవితానుభవాలనుండి నేర్చుకుందాము!
*టెర్రీ లా*: ఈయన అమెరికాలో
ఓక్లహోమా అనే రాష్ట్రంలో పరిచర్య ప్రారంభించి సుమారు 75 దేశాలలో సువార్త పరిచర్య
చేసి కొన్ని లక్షలమందిని దేవుని యొద్దకు నడిపించారు! ఆయన ముఖ్య పరిచర్య ముఖ్యంగా
ఇలాంటి ఆత్మీయ పోరాటాలలో విశ్వాసులు ఎలా విజయం సాధించాలి! వీటిమీద ఎన్నో పుస్తకాలూ
కూడా రాశారు! ఆయన గొప్ప పాటగాడు, వాయిద్యకారుడు! ఆయన ఈ వాద్య బృంధమును తీసుకుని ఆ
రోజులలో కమ్యూనిస్ట్ దేశాలలోను ముస్లిం దేశాలలోను ధైర్యంగా సువార్త ప్రకటించారు!
పోయిన సంవత్సరం 77 సంవత్సరాల వయస్సులో ప్రభువు పిలుపును అందుకున్నారు!
అయితే ఆయన విశ్వాసుల
ఆత్మీయ పోరాటాలను ఉత్తేజపరిచే పరిచర్య ఎలా ప్రారంభించారు అంటే ఒకరోజు ఒక దేశంలో
పరిచర్య చేస్తుండగా దేవుడు నీ కిష్టమైనది తీసేస్తున్నాను! అయినా నేను నీతో ఉన్నాను
అన్నారు! సాయంత్రానికి తనభార్య (మొదటి భార్య) చనిపోయినట్లు తెల్సింది. వెంటనే
అమెరికా వెళ్లి సమాధి చేశారు! చాలా దుఖంలో మునిగిపోయారు భక్తుడు! కారణం తన
కష్టాలలో తనతో ఎంతగానో సపోర్ట్ గా ఉండేది ఆమె! తనను ఎంతగానో తన సేవలో తన
ఆధ్యాత్మిక జీవితంలో బలపడటానికి సహాయపడింది! ఇంట్లో ఏవి ఉన్నా లేకున్నా ఏమనేది
కాదు! సేవలో నిజమైన సహకారి ఆమె! అయ్యా ఎందుకు నా భార్యను తీసేసుకున్నావు అంటూ చాలా
బాధపడ్డారు! సమయం చూసుకుని సాతాను గాడు ప్రక్కకి చేరాడు! చూశావా—నీవు ఇన్ని సంవత్సరాలు
ఇంతకష్టమైన పరిచర్య చేసినందుకు నీ ప్రియమైన దేవుడు నీకిచ్చిన గిఫ్ట్ నీ భార్య
మరణం! నీవు ప్రార్ధన చేయగా అనేకమందిని దేవుడు బ్రతికించారు కదా! మరి నీ భార్యను
ఎందుకు చంపేశాడు!! నీవు అనుకున్నట్లు ఆయన మంచివాడు కాదు- స్వార్ధపరుడు! నీ భార్య
లేకపోతే నీవు ఇంకా ఆయన సేవచేస్తావు అని ఆశించి దేవుడు కుల్లుపోయి నీ భార్యను
చంపేశాడు! ఇదీ దేవుని అసలు రూపం! చాలు ఇక, సేవను ఆపెసేయ్! అని చెప్పాడు! కొన్ని
రోజులు ఈయన కూడా దేవుణ్ణి నిందించినా, ప్రార్ధన చెయ్యడం ఆయనకు అలవాటు, కష్టాలలో
కూడా స్తుతి ఆరాధన చెయ్యడం ఆయనకు అలవాటు! స్తుతి ఆరాధన కాన్సెప్టు తోనే ఆయన
దేశవిదేశాలలో పేరు గాంచారు! ప్రపంచంలో స్తుతి ఆరాధన అనగా Praise and Worship నడిపించడంలో ఆయనకు సాటిరారు
ఎవరూ! కాబట్టి ఇప్పుడు ప్రార్ధన చేద్దాం అన్నాగాని, స్తుతి ఆరాధన చేద్దామన్నా గాని
ప్రారంభించిన వెంటనే ఏమని స్తుతిస్తావు నీవు ఎలా స్తుతిస్తావు నీవు? ఏమని ప్రార్ధన
చేస్తావు నీవు! ప్రభువా ప్రేమించిన నా భార్యను చంపేసి నందుకు నీకు ధన్యవాదాలు అని
చెబుతావా? నా భార్యను చంపినందుకు నీకు స్తుతి ఆరాధన అని చెబ్తావా? అసలు నీకు
భార్యమీద ప్రేమ ఉందా? ప్రేముంటే నీ భార్యను చంపిన దేవునికి ఎలా ప్రార్ధనలు
చేస్తావు? ఎలా స్తుతి ఆరాధన చేస్తావు అని చెవులలో వాదించేవాడట! తట్టుకోలేక
పోయేవారు ఈ భక్తుడు!
రెండు నెలలు గడిచాక,
ఒకరోజు-మోకరించి ప్రభువా! నా భార్యను ఏదో ప్రణాళికతో నీ దగ్గరికి తీసుకున్నావని
నాకు తెలుసు! నాకు ఏదో పాఠము నేర్పిస్తున్నావని తెలుసు! అయితే నిన్ను
స్తుతించలేకపోతున్నాను, నీకు అయిదు నిమిషాలు కూడా ప్రార్ధనచేయలేకపోతున్నాను! ఏమి
జరుగుతోందో తెలియడం లేదు! నిన్ను ప్రార్దించేలా సహాయం చెయ్యండి అని చెప్పారట!
దేవుడు తప్పు నీదే! అన్నారు! ఏమి ప్రభువా అలా అంటున్నావు, నాది తప్పు ఎలా
అవుతుంది? ప్రార్ధన చెయ్యడానికి ప్రయత్నం చేస్తున్నాను! గాని సాతాను గాడు నా
చెవిలో ఈ మాటలుచెప్పి నన్ను ప్రార్ధన చెయ్యడం లేదు! ఏమిచెయ్యాలి అన్నారు ఆయన!
సాతానుని గద్దించావా? అసలు నేను ఏమని చెప్పాను- నీ నోరు బాగుగా తెరువుము, నేను
దానిని నింపుతాను అని చెబితే (కీర్తనలు 81:10) నోట్లో నోట్లో గొణుక్కుంటే నేను ఎలా
సహాయం చెయ్యగలను! నీ నోరు తెరువు! అప్పుడు స్తుతి ఆరాధన ప్రార్ధన రాకపోతే చూడు
అన్నారట!
వెంటనే దేవునికి సారీ
చెప్పి- ఇంట్లో అందరికీ నేను ప్రార్ధన చెయ్యడానికి వెళ్తున్నాను, నన్నెవరు
లేపవద్దు అని చెప్పి- గదికి తాళం వేసుకున్నారు! నోరు తెరిచి గట్టిగా దేవుని
స్తుతులు వందనాలు చెప్పడం మొదలుపెట్టారు! సాతాను నీవు దుష్టుడివి దుర్మార్గుడివి!
భార్య అంటే నీకు ప్రేమలేదు! సెల్ఫిష్ మనిషివి అనడం మొదలుపెట్టింది! ఇంకా గట్టిగా
స్తుతించడం మొదలుపెట్టారు! ఇప్పుడు సాతాను గాడి మాటలు వినబడటం లేదు! కేవలం
స్తుతులు మాత్రమే! అరగంట అయ్యింది ప్రార్ధన- స్తుతి ఆరాధనా ఆగలేదు! సాతాను గాడు
ఎప్పుడో పారిపోయాడు! పరిశుద్ధాత్ముడు తాకాడు! గంట అయ్యింది, ఆశ్చర్యం ప్రార్ధన
కొనసాగుతుంది! మూడు గంటలు నాలుగు గంటలు, ఎనిమిది గంటలు అయ్యాయి! పదమూడు గంటలు
గుర్తున్నాయి ఆయనకు! ఎప్పుడు నిద్రపోయారో తెలియదు! తర్వాత రోజు ఉదయం లేచారు! సేవను
దివ్యమైన కోణంలో మొదలుపెట్టారు! ఈ సంఘటన జరిగాక ఆయన రాసిన పుస్తకం- The Power of Praise and Worship!! ఆధ్యాత్మిక
పోరాటంలో గెలవడానికి ఆయుధాలు అంటూ చాలా పుస్తకాలు రాశారు! ఇప్పుడు ఈ సాక్ష్యం ఆ
పుస్తకం నుండే! కొన్ని లక్షల విశ్వాసులకు మాదిరిగా నిలిచారు! ఇక్కడ ఈయన ఉపయోగించిన
ఆయుధం- వాక్యపు ఆత్మఖడ్గం మరియు ప్రార్దన- స్తుతి ఆరాధన! మీరు కూడా దీనిని
ఉపయోగించండి!
మనకు
కూడా చాలా సార్లు ప్రార్థన రానీయకుండా చేస్తాడు. అప్పుడు మీరుకూడా గద్ధించి,
గట్టిగా ప్రార్ధన చెయ్యాలి. గట్టిగా స్తుతులు చెప్పాలి. వెంటనే వాడు పారిపోతాడు!
తర్వాత
దైవజనుడు: మన అందరికి తెలిసిన వ్యక్తి: దైవజనుడైన
*DGS దినకరన్ గారు*: మీ
అందరికీ తెలుసు- వారు సువార్తకై విమానాశ్రయం కి వెళ్తుండగా వారి కారు ఆక్సిడెంట్
జరిగి దినకరన్ గారికి, ఆయన భార్యకి బలమైన గాయాలు తగిలాయి! గాని వారి ముద్దుల
కుమార్తె ఏంజిలిన్ చనిపోయింది! హాస్పటల్ నుండి బయటకు వచ్చాక ఆయన చాలా నిరాశ
నిస్పృహ, కన్నీటిలో మునిగిపోయారు! దేవునిమీద నిష్టూరాలు వేసేవారు. అయ్యా నా
బిడ్డను ఎందుకు తీసుకున్నావు అని అరిచే వారట బాత్రూంలోకి వెళ్లి ఏడ్చేవారట!
ప్రార్ధన నడిపింపు వచ్చేది కాదు! సభలు మానేశారు!
ఇలా కొన్ని నెలలు గడిచాక, దేవుడు ఆయనకు ఓక దర్శనం
చూపించారట- ఆయనను పరలోకం తీసుకుని వెళ్లి అక్కడ ఒక పెద్ద రిజిస్టర్ చూపించారు!
అక్కడ మనిషి జన్మదినం- మరణ దినం రెండూ ఆ పుస్తకం లో ముందుగానే వ్రాయబడి ఉన్నాయి
ఆయన కుమార్తె పేరు కూడా అక్కడ ఉంది! నీ కుమార్తె ఆరోజు చనిపోవాలనేది దేవుని
నిర్ణయం అని ఆ దూత చెప్పాడట! ఆ తర్వాత అక్కడ రెండు గుంపులు కనబడ్డాయి, ఒక గుంపు
దయ్యాల గుంపు: దినకరన్ ఇక సేవ మానేస్తాడు, ఇక ఏ మొఖం పెట్టుకుని దేవుడు కరుణామయుడు
మిమ్మల్ని కాపాడుతాడు అని చెప్పగలడు? ఆయన సొంత కుమార్తెనే దేవుడు కాపాడలేదు, ఇక
దినకరన్ సేవ మానేస్తాడు అంటున్నాయి! మరో గుంపు దేవదూతల గుంపు- దినకరన్ దేవుని
గొప్ప విశ్వాసి- మరలా సేవ ప్రారంభం చేస్తాడు. మరింతగా గొప్ప సేవ చేసి దేవునికి
పేరు తీసుకుని వస్తాడు అని దేవదూతల గుంపు చెబుతుంది-ఇలా ఈ రెండు గుంపులకు
వాగ్వివాదం అవుతుండగా, కుమారుడా! ఇప్పుడు నీ జవాబుచెప్పు అన్నారట దేవుడు! వెంటనే
కుడిచేయి పైకెత్తి DGS దినకరన్ అనే నేను ఈ రోజునుండి చచ్చేవరకు దేవుని
సేవ మానను అన్నారట! దేవదూతల చప్పట్లతో పరలోకం మారుమ్రోగింది అట! క్రిందికి వచ్చి
రెండు చేతులు పైకెత్తి ప్రార్ధించడం స్తుతించడం మొదలుపెట్టారు. ప్రభువా నన్ను
క్షమించు అన్నారు! ఘనమైన సేవచేసి చనిపోయారు! ఈయన కూడా వాడిన ఆయుధం: ప్రార్ధన మరియు
వాక్యం!
మనం ముగింపుకి వచ్చేశాము! ప్రతీ విశ్వాసి ఆత్మీయ
పోరాటంలో/యుద్ధంలో ఉన్నాడు! మన శత్రువైన సాతాను అనేక తంత్రాలు ఉపయోగించి మనలను
బ్రష్టులుగా చెయ్యాలని మనం అనారోగ్యం పాలు అవ్వాలని, మనం అనేక శోధనలు శ్రమలు
అనుభవించాలని తద్వారా దేవునికి దూరంగా చేయాలని వాడి ప్లాన్! కాబట్టి వాడిని
ఎదిరించాలంటే ఓడించాలి అంటే ఇంతవరకు చూసుకున్నట్లు:
మొదటగా: సర్వాంగకవచమును ధరించుకోవాలి! అదికూడా పూర్తిగా
ధరించాలి! సగం సగం వాడకూడదు!
రెండు: సరియైన ఆయుధం వాడాలి! ఏ శోధనకు ఏ ఆయుధం వాడాలో
బైబిల్ నుండే నేర్చుకోవాలి! సరైన ఆయుధం వాడి అపవాదిని ఓడించాలి!
మూడు: ఆత్మ ఖడ్గము అనే వాక్య ఖడ్గము వాడాలంటే బైబిల్ ని
బాగా చదివి అర్ధం చేసుకుని, వాటిని జ్ఞాపకం చేసుకుంటూ వాక్య ఖడ్గాన్ని
వాడుతుండాలి! కాబట్టి బైబిల్ ను అనుదినం పటిస్తూ ఉండాలి!
నాలుగు: ప్రార్ధనా జీవితం కలిగి ఉండాలి!
ఐదు: ఉపవాస ప్రార్ధనా అనుభవం కలిగి ఉండాలి!
ఆరు: ఒకవేళ దేవునికి విరోధమైనవి, ఆయనకు ఆయాసం కలిగించేవి
ఏవైనా ఉంటే మొదటగా దేవునితో సమాధాన పడి, పాపములను ఒప్పుకుని కడిగి వేసుకోవాలి,
లేకపోతే సాతాను గాడు నిన్ను ప్రార్ధన చేయనివ్వడు, ఆలోచనలతో నిన్ను సతాయిస్తాడు!
ఒప్పుకుని విడిచిపెట్టిన తర్వాత ప్రార్ధించు! విశ్వాసంతో ప్రార్దించు!
ఏడు: ప్రతీరోజు నిన్ను నీవు శుద్దీకరించుకుంటూ ఉండాలి!
పవిత్రమైన జీవితం జీవిస్తూ ఉండాలి!
ఎనిమిది: ఏ పనిచేద్దామనుకున్నా ముందుగా ప్రార్ధించు!
దేవునికి చెప్పి చెయ్యు! చివరకు ఎవరికైనా
ప్రార్ధన చెయ్యాలన్నా ముందుగా నీవు ప్రార్ధన చేసుకో! ఫలాని దగ్గరకు వెళ్తున్నాను!
దేవా నాకు సహాయం చెయ్యు! అని అడుగు! దయ్యాలను వెల్లగొట్టే ముందుగా నిన్ను నీవు
యేసురక్తంతో కవర్ చేసుకో! వాక్యాలు ఉపయోగించు! దేవుడు మనకు మార్కు 16:16—18 లో ఇచ్చిన
అధికారాలు ఉపయోగించు! అధికారంతో శాశించు! ఆయన సిలువ శక్తిని రిలీజ్ చెయ్!
తొమ్మిది: విశ్వాసాన్ని విశ్వాస జీవితాన్ని, సాక్ష్యాన్ని
కాపాడుకో!
పది: పరిశుద్ధాత్మ పూర్ణుడవై ఉండాలి! అనుదినం ఆయన శక్తితో
నింపబడుతూ ఉండాలి! దేవదూతల భాషలు, అన్య భాషలు విస్తారంగా మాట్లాడుతూ శక్తి
పొందుకుంటూ ఉండాలి.
పదకొండు: అన్ని విషయాలలోనే దేవునికి నిన్ను నీవు
సమర్పించుకో! ఆయనకు పూర్తిగా లోబడు!
అప్పుడు దేవుడు నీకు జయజీవితం ఇస్తారు. సాతాను గాడు నిన్ను
జయించలేడు!
అట్టి
కృప ధన్యత జయజీవితం దేవుడు మనందరికీ దయచేయును గాక!
దేవుడు
మిమ్మును దీవించును గాక!
ఆమెన్!
ఆమెన్! ఆమెన్!
*ఎఫెసీ పత్రిక -125వ భాగం*
*పిలుపుకి తగిన జీవితం-77*
ఎఫెసీయులకు 6:18
ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను
విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో
విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! పిలుపుకి తగ్గ జీవితం జీవించడములో కలిగే విశ్వాసి యొక్క ఆత్మీయ
పోరాటాలు కోసం ధ్యానం చేసుకున్నాము!
ఇక
18వ వచనంలో అంటున్నారు: ఆత్మవలన ప్రతీ సమయమందు
ప్రతీవిధమైన ప్రార్ధనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం
పూర్ణమైన పట్టుదలతో ప్రార్ర్ధన చేయుచు మెలకువగా ఉండండి అంటున్నారు!
చూడండి ఇక్కడ ఆత్మవలన అనగా ఆత్మచేత
ప్రతీ సమయమందు ప్రతీ విధమైన ప్రార్ధన చేయమంటున్నారు.
ప్రతీసమయంలో ఎలా ప్రార్ధన చేయడం?
అనగా నీవు ఇంటిదగ్గర ఉన్నప్పుడు పనిలో ఉన్నప్పుడు కూడా ప్రార్ధన చేయాలి!
ఇది సాధ్యమా అంటే సాధ్యమే! ఉదాహరణకు
నీవు అన్నం వండటానికి బియ్యం ఏరుతున్నావు అనుకుందాం- దానిలో రాళ్ళు వచ్చాయి వెంటనే
నీవు ప్రార్ధన చెయ్యాలి- ప్రభువా ఈ బియ్యంలో పనికిరాని రాళ్ళు ఒడ్లు, మట్టి వలె
నాలో ఉన్న చెడు అలవాట్లు చెడు ఆలోచనలు నాలో ఉన్న చెడుగును తీసి పవిత్రపరచండి అనాలి.
ఇంకా బియ్యాన్ని కడుగుతున్నప్పుడు ప్రభువా ! ఈ బియ్యాన్ని నీళ్ళతో ఎలా
కడుగుతున్నావో అలాగే నీవాక్యమనే నీళ్ళతో నాలో ఉన్న మలినాలను కడగండి పవిత్రపరచండి
అంటూ ప్రార్ధించాలి! ఇలా నీ మనస్సు ఆత్మ దేవునితో అనుసంధానం అయిపోతే నీవు అనుక్షణం
అను నిత్యమూ దేవుని దగ్గర ప్రార్ధన విజ్ఞాపనలు చేయగలవు!
6:18
పౌలుగారు ఇంకా దేవుని సైనికుల గురించే రాస్తున్నారు. ఆధ్యాత్మిక శత్రువులపై విజయ
విధానాన్నే ఇంకా చూపిస్తున్నారు. ప్రార్థన లేని స్థితి ఉండడమంటే ముందుగానే
ఓడిపోవడంతో సమానమని అతనికి తెలుసు. కానీ విశ్వాసులు ప్రార్థన చేస్తుండడం చూస్తే
సైతాను గజగజ వణకుతాడని కూడా అతనికి తెలుసు. ప్రార్థన లేకపోతే పైన చెప్పిన
సర్వాంగకవచమంతా మనల్ని సంరక్షించలేదంటున్నారు. ప్రార్థనతో దాన్ని ధరించాలి,
ప్రార్థనతో దానితో నిలబడాలి. ప్రార్థన గురించి కీర్తన 66:18; యిర్మీయా 33:3;
మత్తయి 6:5-13; 7:7-11; 26:41; మార్కు 11:24-25; లూకా 11:5-13; హీబ్రూ 4:16;
10:19-22; యాకోబు 5:13, 16; 1 పేతురు 4:7.
సువార్త గురించి, క్రైస్తవ సిద్ధాంతాల గురించి సరైన అభిప్రాయాలు
కలిగివున్నంత మాత్రాన సైతానుపై విజయం కలగదు. ప్రార్థన లేకుంటే సైతానుతో యుద్ధం
చెయ్యడానికి మనలో ఆధ్యాత్మిక బలం ఉండదు. మనం ప్రార్థన చేయడం అనేది దేవుని ఆత్మలో
జరగాలి – 2:18; రోమ్ 8:26; యూదా 20.
ఆయనకు లోబడి ఆయన చూపించిన రీతిలో ప్రార్థించాలి. “అన్ని” సమయాల్లోనూ
“అన్ని” విధాలుగా ప్రార్థించాలి. అంటే దేవుని సంకల్పానికి అనుగుణంగా అన్ని విధాల
విన్నపాలూ ఇతరుల కోసం విజ్ఞాపనలూ చేయాలి, కృతజ్ఞతలూ స్తుతులూ సమర్పించాలి (1
తిమోతి 2:1).
ఏకాంతంగా లేక బహిరంగంగా, మాటలతో లేక మాటలు లేకుండా లోలోపల
ప్రార్థించవచ్చు. అన్ని రకాలుగా ప్రార్థనలు చెయ్యడం మంచిది. అన్నిటికీ దేని
ప్రయోజనం దానికి ఉంది.
పరిశుద్దుల కోసం ప్రార్దన అనగా – ఆత్మ సంబంధమైన శత్రువులతో
ఈ పోరాటంలో విశ్వాసులంతా పాల్గొంటున్నారు. ప్రార్థన ద్వారా అందులో ఒకరినొకరు సహాయం
చేసుకోవాలి. ఇతరుల కోసం మనం చేసే ప్రార్థనలు నిజంగా వారికి సహాయం చేస్తాయా?
తప్పకుండా. ఈ విధానాన్ని నియమించినది దేవుడే. ఉపయోగం లేని పనులు చెయ్యాలని దేవుడు
చెప్పడు.
ఇంకా ఆ చేసే ప్రార్ధన ఎలా ఉండాలి అంటే పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన
చేస్తూ మెలుకువతో చేయాలి! సగం నిద్రపోతూ ఉండకుండా ఎల్లప్పుడూ ఆత్మలో మెలుకువగా
ఉండాలి!
ఇక చివరిగా ఎవరి కోసం
ప్రార్ధన చేయాలి అంటే:
నీ కుటుంబం కోసం ఎలాగూ ప్రార్థన
చేస్తావు, అయితే ముఖ్యంగా వీరికోసం ప్రార్థన చేయాలి.
*ప్రభుత్వ అధికారుల కొరకు*:
1 తిమోతి 2:1-4
రాష్ట్రపతి,
ప్రధాన మంత్రి, సుప్రీం కోర్టు, హై కోర్టు న్యాయ మూర్తులు, సైన్యాధి పతులు,
గవర్నర్లు, మేయర్లు మరియు ఇతర ప్రభుత్వాధి కారులు కొరకు ప్రార్ధించాలి.
*సంఘ నాయకుల కొరకు*:
సంఘకాపరి,
సండేస్కూలు టీచర్స్, సంఘ పెద్దలు, పరిచారకులు మొదలైన స్థానికి సంఘ నాయకులకు
అనుదినం ప్రార్ధించాలి. 1 థెస్స
5:12,13
మీ
సంఘకాపరి ఆరోగ్యాన్ని,, సాక్ష్యాన్ని దెబ్బతీయడానికి, కుటుంబాన్ని పాడుచేయడానికి
సాతాను తీవ్రంగా ప్రయత్నింస్తుంటాడు. కావున ప్రతీరోజూ ప్రార్థన చేయాలి.
*ఇతర క్రైస్తవ నాయకుల కొరకు*:
సువార్తికులకోసం,
బైబిల్ బోధకుల కోసం, క్రైస్తవ సాహిత్యం కోసం, క్రైస్తవ రచయితల కోసం, ఎడిటర్ల కోసం,
బైబిల్ సొసైటీ వంటి ముద్రణాలయాల కోసం, సువార్త గాయకులు, సంగీత కళాకారులు, యూత్
లీడర్స్, చిన్న పిల్లల పరిచర్య చేసే వారి కోసం
*మిషనరీ పరిచర్య కొరకు*:
యేసు
క్రీస్తు పేరే తెలియని ప్రజలు ఈ లోకంలో ఎంతో మంది వున్నారు. అయితే, సర్వలోకానికి
సువార్త ప్రకటించాల్సిన భాద్యత మన మీదుంది.
(మత్తయి 28:18-20)
మనం
ఆపని చేయలేకపోయినా, చేసే వారి నిమిత్తం తప్పక ప్రార్ధించాలి.
*ఇతర క్రైస్తవ పరిచర్యలు కొరకు*:
రేడియో,
టెలివిజన్, కర పత్రికల పరిచర్య, దండయాత్రల పరిచర్య, సువార్త బృందాలు, చెరసాల
పరిచర్య, యూత్ పరిచర్య.
*దేవుని నామం కోసం హింసించబడుచున్న వారికోసం*
ఈ
చివరి రోజులలో యేసునామం కోసం మన దేశంలోనూ, విదేశాల్లోనూ ఎంతోమంది ఎన్నోవిధాలుగా
బాదపడుతున్నారు, ఊచకోత కోయబడుచున్నారు, చిత్రహింసలకు గురౌచున్నారు. మానభంగాలకు
గురౌచున్నారు. గేలిచేయబడి, చెరసాలలో మగ్గుచున్నారు. కొంతమంది ఇవి తట్టుకోలేక
కొండలకు పారిపోయి ఆకలిబాదలతో బాదపడుచున్నారు. వారందరికోసం ప్రార్ధించాల్సిన
అవుసరము మనకుంది.
*నీ ప్రియమైన వారికోసం*:
వారి
రక్షణ, వ్యక్తిగత అవసరాల కొరకు.
*ప్రత్యేకమైన అవసరాల కొరకు*:
టి.వి,
వార్తా పత్రికల ద్వారా తెలుసుకున్న విషయాలను గురించి, వరదలు, భూకంపాలు, అతివృష్టి,
అనావృష్టి, ప్రమాదాలు, వ్యాధులు, హృదయ విదారకమైన పరిస్థితుల గురించి.
తినడానికి
తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, నివసించడానికి గృహాలు లేక దుర్భరమైన
జీవితాలు జీవిస్తున్న వారి నిమిత్తం, సేద్యం చేస్తున్న రైతుల కోసం, దేశాన్ని కావలి
కాస్తున్న సైనికుల కోసం ఇట్లా... అనేక విషయాలను గురించి ప్రార్ధించాల్సిన బాధ్యత
మన మీదుంది.
ఆ
భారం నీకుందా?
ప్రార్ధిద్దాం!
ప్రభువు చెంతకు నడిపిద్దాం!
అట్టి
కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్!
ఆమెన్!
*ఎఫెసీ పత్రిక -126వ భాగం*
*పిలుపుకి తగిన జీవితం-78*
ఎఫెసీ 6:18
ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను
విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో
విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! ప్రార్ధన కోసం ధ్యానం చేస్తున్నాము!
*ఎట్లా ప్రార్ధించాలి?*
*ఏఏ సమయాల్లో ప్రార్ధించాలి?*
మనకు
అన్నింటికీ సమయం ఉంటుంది. ప్రార్ధించడానికి, వాక్యం చదవడానికి తప్ప.
ప్రార్ధించడానికి అసలు అనుకూల పరిస్థితులు లేవంటూ ఎన్నో సాకులు చెప్తాము. అవకాశం
వుంటే, తప్పక మోకరించాలి. లేని పక్షంలో మనము ఎట్లా అయినా ప్రార్ధించొచ్చు.
*ప్రార్ధించడానికి పరిశుద్ధ గ్రంధములో ఉపయోగించిన శరీర
రీతులు:*
*మోకాళ్లూనడం*
•యేసు
ప్రభువుల వారు ( లూకా 22:41)
•దానియేలు
గారు (దానియేలు 6:10)
•పౌలు
గారు ( అపో. కా. 20:36)
*చేతులెత్తి*
•మోషేగారు
(నిర్గమ 17 :11-13)
*కన్నులెత్తి*
•యేసు
ప్రభువుల వారు ( మార్కు 6:41)
•సుంకరి
(లూకా 18:13)
•దావీదుగారు
( కీర్తనలు 121:1)
*పరుండి*
•దావీదుగారు
( కీర్తన 6:6)
*కూర్చుండి*
•నెహెమ్యాగారు ( నెహెమ్యా 1:4)
•దావీదుగారు ( 1 దిన 17: 16-27)
* సాష్టాంగపడి*
•యేసు
ప్రభువుల వసరు ( మత్తయి 26:39)
•ఎజ్రాగారు
( ఎజ్రా 10:1)
•దావీదుగారు
(28:2)
*వంగి ( నేల వరకు తలవంచి)*
•మోషేగారు
( నిర్గమ 34:8)
*పారచాచుకొని*
•ఏలియా
గారు ( 1రాజులు 17:21)
@*ఏఏ సమయాల్లో
ప్రార్ధించాలి?*@
*ప్రాతఃకాలము*
•యేసు
ప్రభువుల వారు ( మార్కు 1:35)
•దావీదుగారు
(కీర్తన 63:1)
*మధ్యాహ్నము*
•పేతురు గారు
( అపో. కా. 10:9)
•దానియేలు
గారు (దాని 6:10)
*సాయంకాలము*
•యేసు
ప్రభువుల వారు ( మత్తయి 14:23)
•దావీదుగారు
( కీర్తన 6:6)
* రేయి మొదటి జాము*
విలాప 2:19
*యెడతెగక ప్రార్ధించాలి*
1 థెస్స 5:16
ఇట్లా...
అనేక విషయాలను గురించి అనేక పద్దతులతో ప్రార్ధన చేయాలి!
యాకోబు
గారు యబ్బోకురేవు దగ్గర చేసిన ప్రార్ధన వలె పట్టుదలతో, యెహోషువా గారు కనాను దేశపు
వారితో యుద్ధం చేసినప్పుడు చేసిన ప్రార్ధన వలె విశ్వాసముతో, రాజైన ఆసా మరియు రాజైన
హిజ్కియా గార్లు నీవే మాకు దిక్కు నీవు తప్ప మాకు ఆధారం లేదు అంటూ చేసిన యదార్ధమైన
ప్రార్ధన; ఎజ్రా గారు, నేహేమ్యా గారు, దానియేలుగారు చేసిన తగ్గింపుతో ప్రార్ధన చేయాలి!
ఈ
రీతిగా మన ప్రార్ధనా సమయాన్ని ప్రభువు సన్నిధిలో గడపగలిగితే? ప్రభువు మన ప్రార్ధన
ఆలకించి, తప్పక ప్రతిఫలమిస్తారు.
అట్టి
రీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం!
అట్టి
కృప, ధన్యత
దేవుడు
మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్!
ఆమెన్! ఆమెన్!
*ఎఫెసీ పత్రిక -127వ భాగం*
ఎఫెసీ 6:19—24
19. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంకెళ్లలో
ఉన్నానో, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు
తెరచునప్పుడు
20. దానిని గూర్చి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో
మాటలాడుటకై వాక్చక్తి నాకు అనుగ్రహింపబడునట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో
విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.
21. మీరును నా క్షేమసమాచారమంతయు తెలిసికొనుటకు ప్రియ
సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకికు నా సంగతులన్నియు మీకు
తెలియజేయును.
22. మీరు మా సమాచారము తెలిసికొనుటకును అతడు మీ హృదయములను
ఓదార్చుటకును అతనిని మీయొద్దకు పంపితిని.
23. తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు
సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయును సహోదరులకు కలుగును గాక.
24. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో
ప్రేమించు వారికందరికిని కృప కలుగును గాక.
ప్రియ దైవజనమా! మనము ఎఫెసీ పత్రికను ధ్యానం
చేసుకుంటున్నాం! ఇక చివరికి వచ్చేశాం!
ఇక
19వ వచనంలో అంటున్నారు మరియు నేను దేని నిమిత్తమై రాయభారిగా అనగా అపోస్తలునిగా
సంకెళ్ళతో ఉన్నానో ఆ సువార్త నిమిత్తం ధైర్యంతో మాట్లాడటానికి నోరు తెరచినప్పుడు
దానికితగిన ధైర్యము మరియు వాక్చాతుర్యం
నాకు దేవునిచేత అనుగ్రహించ బడేలా నా నిమిత్తం పట్టుదలతో విజ్ఞాపన ప్రార్ధన
చేస్తూ మెలకువగా ఉండండి అంటున్నారు!
ఈ రెండు వచనాలు చూసుకుంటే పౌలుగారు నేను సంకెళ్ళతో ఉన్నాను.
చెరసాలలో ఉన్నాను. నేను విడిపింప బడేలా ప్రార్ధన చెయ్యమని అనడం లేదు! నాకు అవకాశం దొరికినప్పుడు ఈ సువార్త నిమిత్తం
కావలసిన వాక్యపు నేర్పు మాటలు దేవుడు నాకు ఇచ్చేలాగా మరియు నేను సంకెళ్ళతో ఉన్నాను
గనుక భయపడకుండా ధైర్యంతో బోధించే శక్తి నాకు కలిగేలా ప్రార్ధనచేయమంటున్నారు! అసలు
సంకెళ్ళ కోసం ప్రార్ధనచేయమని ఎందుకు అడగడం లేదు?
దానికి జవాబు ఏమిటంటే: మొదటగా ఇంతకు
ముందే సువార్త ప్రకటన యొక్క భాద్యత- చార్జ్ తిమోతి గారికి హేండ్ ఓవర్ చేసేశారు
(అప్పగించేశారు).
రెండవది: ఫిలిప్పీ పత్రికలో చాలా
స్పష్టముగా చెప్పారు. నేను ప్రాణంతో ఉండి మీతో కలసి ఉండాలని ఆశిస్తున్నాను. అయినా
అంతకంటే దేవునితో నిత్యత్వములో ఉండాలని ఇంతకంటే ఆశిస్తున్నాను! కాబట్టి సంకెళ్ళు
విడిపోతే అనగా నేను విడిచిపెట్టబడితే మీ దగ్గరకు వస్తాను. చనిపోతే దేవునితో ఉంటాను
కాబట్టి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అంటున్నారు!
ఫిలిప్పీ 1:19—30
19. మరియు నేను ఏ విషయములోను సిగ్గుపడక యెప్పటివలెనే
యిప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుటవలన నా బ్రదుకు మూలముగా నైనను సరే, చావు
మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని
20. నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా
మీ ప్రార్థనవలనను, యేసుక్రీస్తు యొక్క ఆత్మనాకు సమృద్ధిగా కలుగుటవలనను, ఆ ప్రకటన
నాకు రక్షణార్థముగా పరిణమించునని నేనెరుగుదును.
21. నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము.
22. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి
ఫలసాధనమైన యెడల నేనేమి కోరుకొందునో నాకు తోచలేదు.
23. ఈ రెంటి మధ్యను ఇరుకునబడియున్నాను. నేను వెడలిపోయి
క్రీస్తుతో కూడ నుండవలెనని నాకు ఆశయున్నది, అదినాకు మరి మేలు.
24. అయినను నేను శరీరమునందు నిలిచియుండుట మిమ్మునుబట్టి మరి
అవసరమైయున్నది.
25. మరియు ఇట్టి నమ్మకము కలిగి, నేను మరల మీతో
కలిసియుండుటచేత నన్నుగూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు.
26. మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు
నిమిత్తము, నేను జీవించి మీ అందరితో కూడ కలిసియుందునని నాకు తెలియును.
27. నేను వచ్చి మిమ్మును చూచినను, రాకపోయినను, మీరు ఏ
విషయములోను ఎదిరించువారికి బెదరక, అందరును ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున
పోరాడుచు, ఏక మనస్సుగలవారై నిలిచియున్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున, మీరు
క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి.
28. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును
కలుగుననుటకు సూచనయైయున్నది. ఇది దేవునివలన కలుగునదే.
29. ఏలయనగా మీరు నాయందు చూచినట్టియు, నాయందున్నదని
మీరిప్పుడు వినుచున్నట్టియు పోరాటము మీకును కలిగియున్నందున
30. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున
శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను.
సరే,
ఇక నాకోసం ప్రార్ధన చేయండి అంటూ దాదాపు అన్ని పత్రికలలో పౌలుగారు రాశారు.
అన్నింటిలోను సువార్త దైర్యముగా ప్రకటించే శక్తికోసమే వ్రాసారు!
రోమా
15:౩౦; 2కొరింథీ 1:11; ఫిలిప్పీ 1:19; కొలస్సీ 4:3; 1థెస్స 3:1.
ఇక
21వ వచనంలో అంటున్నారు: ఇక మీరు కూడా నా క్షేమ సమాచారం తెలిసికోడానికి ఆశ
పడుచున్నారు కనుక ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడైన తుకికును
పంపుతున్నాను గనుక అతడు నాకోసం మీకు చెబుతాడు అంటున్నారు!
ఇక్కడ రెండు విషయాలు తెలుసుకోవాలి!
మొదటి భాగం లో చెప్పినట్లు ఈ ఎఫెసీ పత్రిక రాసి పౌలుగారు తుకికు (తుకికస్) తోనూ,
ఒనేసీము గారితోనూ పంపుతున్నారు!
ఇక రెండవ ప్రాముఖ్యమైన మాట ఏమంటే
పౌలుగారు మరియు పరిశుద్ధాత్ముడు కలిసి ఇస్తున్న స్టేట్మెంట్ : తుకికస్
భక్తుడు ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు!
మొదట నమ్మకమైన
వాడు! ప్రకటన గ్రంధంలో అంటున్నారు గొర్రెపిల్ల
ఎందుకు సాతాను సైన్యాన్ని జయించెను !
అంటే మొదట ఆయన రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అంటూ తనతో
ఉన్నవారు పిలువబడిన వారును, ఏర్పాటుచేయబడిన వారును, మరింత ముఖ్యముగా నమ్మకమైన
వారును అయి ఉన్నారు అంటున్నారు!
ప్రియ దైవసేవకుడా నీ కోసం ఈరోజు దేవుడు ఇలాంటి సాక్ష్యం చెప్పే
స్తితిలో నీవున్నావా? నమ్మకమైన వానిగా నీవున్నావా? దేవుడు అనేకులకోసం సాక్ష్యం
చెప్పారు! మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు! అబ్రాహాము నా స్నేహితుడు! దావీదు నా
ఇష్టానుసారమైన మనుష్యుడు! యోభు యధార్ధవంతుడు నీతిమంతుడు! దానియేలు నోవాహు యోబు
నీతిమంతులు అంటూ! మరి నీకోసం దేవుడు ఏమని సాక్ష్యం చెప్పగలిగే స్తితిలో
నీవున్నావు? భళా నమ్మకమైన మంచిదాసుడా అనా, లేక సోమరియైన చెడ్డదాసుడా అనా?!! ఒకసారి
నిన్నునీవు పరిశీలించుకో!
ఇక తర్వాత వచనంలో అతడు అనగా తుకికు మా సమాచారమంతా మీకు
చెప్పి మీ హృదయాలను ఓదార్చగలడు అంటున్నారు.
ఇక చివరలో ఎప్పటిలాగే తండ్రియైన దేవుని నుండియు ప్రభువైన
యేసుక్రీస్తు నుండియు మీకు సమాధానమును ఇంకా విశ్వాసముతో కూడిన ప్రేమయు సహోదరులకు
కలుగును గాక అంటున్నారు! ఇక్కడ మీకు ప్రేమ కలగాలి అని దీవించడం లేదు గాని
విశ్వాసముతో కూడిన ప్రేమ మీరు పొందుకోవాలని నిండుమనస్సుతో దీవిస్తున్నారు! దీనిలో
తండ్రి మనస్సు హృదయం మనకు కనిపిస్తుంది! ఇక్కడ అంటున్నారు నిజ విశ్వాసంతో పాటుగా
ప్రేమకూడా మీకుకలుగుతుంది . ఎలాగా ఎందుకు అంటే గలతీ 5:6 లో ఆత్మఫలము లో ప్రేమ
సంతోషము తో పాటుగా విశ్వాసము కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్స్తుంది ఆత్మఫలముతో!!
ఇక
చివరగా మన ప్రభువైన యేసుక్రీస్తు మీద అమరప్రేమ ఉన్నవారందరికీ ఆయన కృప తోడై ఉందును
గాక! ఆమెన్! అంటూ ముగించారు!
ఆ
కృప మన అందరికీ తోడై యుండును గాక!
ప్రియులారా!
ఈ పత్రికలో దేవుని కృప మనయందు ఎలాంటిదో, దేవుని పిలుపు ఏర్పాటు మనపట్ల ఎంత గొప్పదో
మూడు అధ్యాయాలలో చెప్పి, అంతటి ఘనమైన పిలుపు నీవు నేను పొందుకున్నాము గనుక
పిలువబడిన పిలుపుకి తగినట్లుగా జీవించమని ప్రతీవిశ్వాసికి మరియు ప్రతీ
కుటుంబస్తునికి తెలియజేశారు! మరి నీవు పిలువబడిన పిలుపుకి తిగినట్లుగా జీవిస్తున్నావా?
లేకపోతె
విడువబదతావు-నరకానికి పోతావు! గనుక నేడే బ్రతుకుని మార్చుకుని క్రీస్తుకోసం మరియు
నీవు పిలువబడిన పిలుపుకి తగినట్లుగా జీవించి ఆయన రాజ్యములో ప్రవేశించు!
ఆమెన్!
ఆమెన్! ఆమెన్!
దైవాశీస్సులు!
(సమాప్తం)
=====================================================================================================
ప్రియ దైవజనమా! ఈ ఎఫెసీ పత్రిక ధ్యానాల
ద్వారా దేవుడు మీతో మాట్లాడారని నమ్ముచున్నాను! మనముకూడా పిలువబడిన పిలుపుకి
తగినట్లుగా జీవిస్తూ ఆయనకు సరియైన బిడ్డలుగా జీవిద్దాం! ప్రభువుచిత్తమైతే మరో మంచి
ధ్యానాలతో మరలా కలుసుకుందాం! దయచేసి మాకోసం మా పరిచర్యల కోసం, నేను చేసే ఉద్యోగం
కోసం, మా సోషల్ మీడియా పరిచర్యల కోసం, వెబ్సైట్ మరియు పేజీల కోసం ప్రార్ధన చేయండి!
దైవాశీస్సులు!
ఇట్లు
ప్రభువునందు మీ ఆత్మీయ సహోదరుడు
డేవిడ్ రాజకుమార్.
దోనే
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి