కొరింథీయులకు వ్రాసిన పత్రికలు-2
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*రెండవ కొరింథీ పత్రిక*
*114వ భాగము-ఉపోద్ఘాతం*
2కొరింథీ 1:1—2
1. దేవుని చిత్తమువలన క్రీస్తు (క్రీస్తు అను శబ్దమునకు
అభిషిక్తుడని అర్ధము) యేసు యొక్క అపొస్తలుడైన పౌలును, మన సహోదరుడైన తిమోతియును,
కొరింథులోనున్న దేవుని సంఘమునకును, అకయయందంతటనున్న పరిశుద్ధులకందరికిని శుభమని
చెప్పి వ్రాయునది.
2. మన తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తు
నుండియు కృపయు సమాధానమును మీకు కలుగును గాక.
ప్రియదైవజనమా! మనము మొదటి కొరింథీ పత్రిక
ధ్యానం చేసుకుని సంఘ క్రమానికి చెందిన ఎన్నో విషయాలు ధ్యానం చేసుకున్నాము!
ఇక
రెండవ పత్రికను ధ్యానం చేసుకుందాం!
ప్రియులారా! రెండవ పత్రికను ధ్యానం
చేసుకునే ముందుగా ఇంతకీ ఈ రెండవ పత్రిక యొక్క నేపధ్యం ఏమిటో చూసుకుంటే మొదటి
పత్రికవలె ఈ రెండవ పత్రిక కూడా బాగా అర్ధం చేసుకోవచ్చు! గనుక ఈ రెండవ పత్రిక యొక్క
నేపధ్యం చూసుకొందాం!
రచయిత: పరిశుద్ధాత్మ పూర్ణతతో అపోస్తలుడైన పౌలుగారు!
ఎప్పుడు రాశారు: సుమారుగా క్రీ. శ. 56- 57 మధ్యలో! అయితే మొదటి పత్రిక
రాసిన సుమారు 18 నెలలు తర్వాత ఈ రెండవ పత్రిక రాశారని అర్ధం అవుతుంది!
ఎక్కడ నుండి రాశారు? ఇది కూడా
ఎఫెసీ పట్టణం నుండే రాశారు! ప్రియులారా! మొదటి పత్రిక ఉపోద్ఘాతంలో ఎఫెసీ పట్టణంలో
పరిచర్య ప్రారంభించిన మొదట్లో మొదటి పత్రికను రాసినట్లు చూసుకున్నాము, ఇంకా అక్కడ
సుమారుగా మూడు సంవత్సరాలు సేవ చేసినట్లు అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం ప్రకారం
చూడగలం! కాబట్టి ఎఫెసీ పట్టణం విడిచిపెట్టే ముందుగా ఈ రెండవ పత్రికను రాశారు!
ఎందుకు రాశారు?
నేపధ్యం:
మొదటి
పత్రికలో రాసిన సమస్యలు కంటే మరో పెద్ద సమస్య వచ్చిపడింది! కొందరు అబద్ద బోధకులు
కొరింథీ పట్టణానికి వచ్చి అసలు పౌలుగారు అపోస్తలుడు కాదని, యేసుక్రీస్తుప్రభులవారిచే
పిలువబడలేదని, పంపబడలేదని, పౌలుగారు నిజమైన అపోస్తలుడు కాదని, దొంగ అపోస్తలుడు,
ఆయన చెప్పేవి నిజమైన బోధలు కావు, పరిశుద్ధాత్మ బోధలు కావు, ఆయన మాటలు నమ్మవద్దు
అని చెప్పి వారిని కంగారు పెట్టారు! అనేకమంది వాటిని నమ్మారు! పౌలుగారిని
బహిరంగంగా వ్యతిరేకించడం మొదలుపెట్టారు కొందరు సంఘస్తులు!! ఈరకంగా పౌలుగారు-
కొరింథీ సంఘం మధ్య అవగాహన లోపించింది! దీనిని అవకాశం తీసుకుని తప్పుడుగాళ్ళు మరింత
తప్పుడు బోధలను బోధించడం మొదలుపెట్టారు!
అయితే
పౌలుగారిని కొందరు సంఘస్తులు వ్యతిరేకించినా పౌలుగారు సంఘ క్షేమాన్ని కోరుకుని
ఎంతో తగ్గించుకొని వారితో సమ్మతిని కోరారు! అప్పుడు చాలామంది తమ తప్పును
తెలుసుకుని పౌలుగారి అపోస్తలత్వమునకు లోబడ్డారు! అందుకు సంతోషించారు పౌలుగారు!
ఇక మరో ముఖ్య సందేశం
ఏమిటంటే తనయొక్క అపొస్తలత్వమునకు గుర్తులు ఏ సంఘమునకు చెప్పలేదు గాని ఈ సంఘమునకు
తనయొక్క అపొస్తలత్వమునకు గుర్తులు ఏమిటో, దేవుని నుండి తను పొందుకున్న
ప్రత్యక్షతలు ఏమిటో, సువార్త పరిచర్య కోసం ఎన్ని పాట్లు పడ్డారో ఈపత్రికలో
వివరించారు!
ఇక అవిశ్వాసులతోనూ అబద్ద
బోధకులతోను పొత్తు పెట్టుకోవద్దు అన్నారు!
ఇక మరొక కారణం ఏమిటంటే: మొదటి పత్రిక 5వ అధ్యాయం ధ్యానం చేసినప్పుడు
చూసుకున్నాము- ఒక వ్యక్తి తన పిన్నితో పాపం చేస్తున్నాడు, పౌలుగారు వానిని సంఘము
నుండి వెలివేయమని చెప్పారు! ఆ వ్యక్తి పశ్చాత్తాపపడి తన పాపమును విడిచిపెట్టాడు!
మరలా సంఘములో చేర్చుకోమని బ్రతిమిలాడుతున్నాడు! అయ్యా ఏమి చెయ్యాలి, చేర్చుకోవాలా వద్దా అని సంఘస్తులు ఉత్తరం రాశారు! అప్పుడు
పౌలుగారు సంతోషించి చేర్చుకోమని ఆ వ్యక్తిని క్షమించమని కోరారు!
కానుకలు-
బీదలకు చందాలు ఎలా ఇవ్వాలో చెప్పమని విశ్వాసులు అడిగితే దానికి సమాధానం చెప్పారు!
ఈ
పత్రిక ముఖ్యాంశాలు: .....
1—7 అధ్యాయాలు- పౌలు గారు-
కొరింథీ సంఘము- కొరింథీ సంఘముతో అనుబంధం- ఎన్ని పాట్లు పడ్డారు సువార్త కోసం
8—9 యూదయలో లేక యేరూషలేములో
ఉన్న బీదలైన పరిశుద్దుల కొరకు విరాళాలు
10—13 పౌలుగారు తన అపోస్తలత్వము
సమర్ధించుకోవడం
వివరంగా చూసుకుంటే :
కష్టాలలోనూ,
బాధలలోనూ ఆదరణ 1:3-11
రద్దయిన
పౌలు కొరింథీ ప్రయాణం 1:12—2:4
దుఃఖాన్ని
కలిగించేవారికి క్షమాపణ 2:5-11
క్రీస్తుద్వారా
సామర్థ్యం 2:12—3:6
పాత
నిబంధనకంటే క్రొత్త నిబంధన ఎంతో గొప్పది 3:7-18
దేవుని
సేవకులు: మట్టి పాత్రలలోని దేవుని ఐశ్వర్యం 4:1-8
విశ్వాసుల
పరమ నివాసం 5:1-8
పరమ
నివాసం కోసం పౌలుగారి లక్ష్యం, కారణాలు 5:9-10
సమాధానం/
సఖ్యత: దేవుని వంతు, దేవుని సేవకుల వంతు 5:11-21
‘రక్షణ
దినం’ ఇదే 6:1-2
పౌలుగారు
సువార్త కోసం అనుభవించిన కష్టాలు, అతని జీవిత విధానం 6:3-13
విశ్వాసులు
అవిశ్వాసులతో పొందు పెట్టుకోకూడదు 6:14-18
పవిత్రతను
సంపూర్తి చేస్తూ ఉండడం 7:1
పౌలుగారు,
కొరింథీ విశ్వాసుల పశ్చాత్తాపం 7:2-12
తీతు,
కొరింథీ క్రైస్తవులు 7:13-16
ధారాళమైన
కానుకలు 8:1—9:15
మాసిదోనియాలోని
సంఘాల ఉదాహరణ 8:1-5
మాసిదోనియా
ఉదాహరణను అనుసరించమని కొరింథీవారిని కోరడం 8:6-8
క్రీస్తు
ఉదాహరణ 8:9
పౌలుగారి
సలహా 8:10-15
పౌలుగారు
తీతును కొరింథీకు పంపడం 8:16—9:5
ధారాళంగా
ఇచ్చినందువల్ల ఫలితాలు 9:6-15
పౌలుగారు
తన అపొస్తలత్వమును దృఢపరచడం 10:1—12:21
ఆధ్యాత్మిక
పోరాటం 10:3-6
పౌలుగారి
“అతిశయం” 10:7-18
కొరింథీ
విశ్వాసులపట్ల పౌలుకున్న ఆశ, భయం 11:1-3
తప్పుడు
అపొస్తలులు 11:4-6
కొరింథీవారిపట్ల
పౌలుగారి ప్రవర్తన 11:7-12
తప్పుడు
బోధకులు సైతాను సేవకులు 11:13-14
పౌలుగారి
మరింత అతిశయం 11:15-22
కష్టాలలోనూ,
అపాయాలలోనూ ఆనందించడం 11:23-33
పౌలుగారు
పరలోకానికి వెళ్ళిరావడం 12:1-6
పౌలు
శరీరంలో ముల్లు 12:7-10
కొరింథీ
విశ్వాసులపట్ల పౌలుగారి ప్రేమ 12:11-21
ముగింపు
మాటలు, అభివందనాలు 13:1-14
....
దైవాశీస్సులు!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*115వ భాగము*
2కొరింథీ 1:1—2
1. దేవుని చిత్తమువలన క్రీస్తు (క్రీస్తు అను శబ్దమునకు
అభిషిక్తుడని అర్ధము) యేసు యొక్క అపొస్తలుడైన పౌలును, మన సహోదరుడైన తిమోతియును,
కొరింథులోనున్న దేవుని సంఘమునకును, అకయ యందంతటనున్న పరిశుద్ధులకందరికిని శుభమని
చెప్పి వ్రాయునది.
2. మన తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తు
నుండియు కృపయు సమాధానమును మీకు కలుగును గాక.
ప్రియదైవజనమా! మనము రెండవ కొరింథీపత్రికను
ధ్యానం చేసుకుందాం!
ప్రియులారా!
మొదటి వచనం ప్రకారం- ఈ ఉత్తరం పౌలుగారు ధ్యానిస్తూ చెబుతుండగా సోస్తెనేసు
అనే అసిస్టెంట్ పాష్టర్ గారు వ్రాయలేదు, పౌలుగారు చెబుతుండగా తిమోతిగారు
రాస్తున్నారు! అందుకే దేవుని చిత్తమువలన అపోస్తలుడుగా మారిన పౌలును, మన సహోదరుడైన
తిమోతి యును శుభమని చెప్పి వ్రాయునది అని రాశారు!
ఇక
ఆకయయందంతటనున్న పరిశుద్ధులకు కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అంటున్నారు! గత
భాగాలలో చెప్పడం జరిగింది- కొరింథీ పట్టణం- గ్రీసు లేక గ్రీకు దేశం లో అకయ అనే
ప్రాంతములో ఉంది! చూడండి- మన ఆంద్రప్రదేశ్ లో కోస్తా ఆంధ్రా, రాయలసీమ అనే ప్రాంతాలు
ఎలా ఉన్నాయో అలా గ్రీసు దేశంలో అకయ కూడా ఒక ప్రాంతం! పౌలుగారి పరిచర్యవలన అకయ
అంతటా సువార్త మారుమ్రోగింది! ఇది మనకు 1థెస్స 1:7 లో ఉంటుంది...
1థెస్సలొనికయులకు 1: 7
కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికిని
మాదిరియైతిరి; ఎందుకనగా మీయొద్దనుండి ప్రభువు వాక్యము మాసిదోనియలోను అకయలోను
మ్రోగెను;
ఇక
ప్రత్యేకించి దేవుని చిత్తమువలన క్రీస్తుయేసు
యొక్క అపోస్తలుడైన పౌలు అని ఎందుకు రాస్తున్నారు?
గతభాగంలో వివరించినట్లు దుర్భోధకుల
బోధల వలన అనేకులు పౌలుగారి అపోస్తలత్వమును వ్యతిరేకించారు. పౌలుగారిని
దొంగ అపోస్తలుడు అన్నారు! నిజానికి ఇది కొరింథీ వారికి పుట్టినది కాదు- మొదటి
పత్రికలో ఎన్నో తప్పుడుబోధలను తప్పుడు బోధకులను పౌలుగారు ఖండించినందువలన
తప్పుడుగాళ్ళకు పొట్టపోషణ భారమయ్యింది, అందుకే వారు పౌలుగారినే అబద్ద అపోస్తలుడు
అనే ఆరోపణ చేసి పౌలుగారు దొంగ అపోస్తలుడు అని వారిని నమ్మించారు! పౌలుగారు ఎప్పుడు
యేసుక్రీస్తుప్రభులవారిని కలుసుకోలేదు! అపోస్తలులు 12 మందే, ఈయన యేసుక్రీస్తు
ద్వారా ఎన్నుకోబడలేదు! ఎప్పుడూ యేసుక్రీస్తు ప్రభులవారు పౌలుగారికి కనబడలేదు- ఆయన
బోధించేవి అబద్దబోదలు అని నమ్మించారు! అందుకే మొదట నేను కేవలం దేవుని చిత్తము వలన
అపోస్తలుడయ్యాను అని మొదలుపెట్టారు!
దీనిని ఈ తప్పుడుగాళ్ళు అనడం ఏమిటి?
ఆయన కొరింథీ లో ఉన్నప్పుడు గాని, తన మొదటి పత్రికలో గాని తనకుతానుగా ఎన్నోసార్లు
చెప్పారు- నేను అపోస్తలుడు అని పిలిపించుకోడానికి యోగ్యుడను కాను ఎందుకంటే సంఘమును
ఘోరముగా హింసించాను గాని దేవుడు తన మహా కృపవలన నన్ను ఏర్పరచుకున్నారు. నేను
అకాలమందు పుట్టినట్లు ఉన్నాను సంఘములో!అయినా నేను
క్రీస్తుయేసు చేత అపోస్తలులుగా ఎన్నుకున్న వారికంటే ఎక్కువగా కష్టపడ్డాను,
ఇలా కష్టపడింది నేను కాదు నాలో ఉండి నన్ను నడిపించిన దేవుని కృపయే కష్టపడింది అని మొదటి
పత్రికలో ఎంతో స్పష్టముగా రాశారు కదా!!
1 Corinthians(మొదటి కొరింథీయులకు) 15:9,10
9. ఏలయనగా నేను అపొస్తలులందరిలో తక్కువవాడను దేవుని సంఘమును
హింసించినందున అపొస్తలుడనబడుటకు యోగ్యుడనుకాను.
10. అయినను నేనేమైయున్నానో అది దేవుని కృప వలననే
అయియున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని,
వారందరికంటె నేనెక్కువగా ప్రయాస పడితిని. ప్రయాసపడినది నేను కాను,నాకు తోడైయున్న
దేవుని కృపయే.
గలతీ పత్రికలో దీనికోసం ఇంకా వివరంగా రాశారు.
గలతీ 1:1—౩
1.మనుష్యుల మూలముగానైనను ఏమనుష్యుని వలననైనను కాక,
యేసుక్రీస్తు (క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్ధము) వలనను, ఆయనను
మృతులలోనుండి లేపిన తండ్రియైన దేవునివలనను అపొస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును,
2. నాతోకూడనున్న సహోదరులందరును, గలతీయలోనున్న సంఘములకు
శుభమని చెప్పి వ్రాయునది.
3. తండ్రియైన దేవునినుండియు మనప్రభువైన యేసుక్రీస్తునుండియు
మీకు కృపయు సమాధానమును కలుగును గాక.
మొదటి వచనంలో ఆయన
చెబుతున్న విషయం ఏమిటంటే నేను పొందుకున్న అపోస్తలత్వము మనుషులనుండిగాని లేక
మనుష్యుల మూలముగా పొందుకోలేదు గాని క్రీస్తుయేసునుండి ఇంకా ఆయనను మృతులలోనుండి
లేపిన తండ్రియైన దేవునినుండి నేను అపోస్తలుడు గా నియమింపబడ్డాను అంటున్నారు. ఇలా
కుండబద్దలు గొట్టినట్లు చెప్పడానికి అసలు కారణం, ఎవరో చెబితే లేక ఎవరో బయలుపరిస్తే
నేను ఈసువార్త పొందుకోలేదు గాని దేవదేవుడే నాకు ప్రత్యక్షమై బయలుపరచిన సత్యమును
సత్యసువార్తను నేను ఉన్నదిఉన్నట్లు మీకు బోధించాను. ఎవరో చెబితే నేనునేర్చుకోలేదు
అంటున్నారు.
సరే, ఆయనైతే
చెప్పేసుకున్నారు నేను దేవుని నుండి డైరెక్ట్ గా అపోస్తలత్వము పొందాను. నన్ను ఎవరూ
అపోస్తలుడుగా చేయలేదు అని మరి ఇది నిజమా?
లేఖనాలు చూస్తే అది
నిజమే! అది తెలుసుకోవాలంటే అపోస్తలుల కార్యములు 9, 1౩,15 అధ్యాయాలు ధ్యానిస్తేనే
తెలుస్తుంది. తొమ్మిదో అధ్యాయంలో హింసకుడుగా సంఘాన్ని బాధపెట్టేవాడుగా ఉన్న
పౌలుగారు దమస్కుమార్గంలో క్రీస్తుయేసుద్వారా పట్టబడి దేవదర్శనం పొందుకున్నట్లు
చూడగలం! తర్వాత కళ్ళు పోగొట్టుకున్నవాడై ఉండగా దేవుడు అననీయ భక్తునితో నీవువెళ్లి
పౌలుకు ప్రార్ధనచేయమంటే ప్రభువా అతను మనసంఘాన్ని ఎంతో పాడుచేస్తున్నాడు
అలాంటివాడికి ప్రార్ధన చేయమంటావా అంటే దేవుడు చెప్పారు యితడు నేను ఏర్పరచుకున్న
సాధనము! యితడు నానామము కొరకు అనేక శ్రమలను
ఓర్చి నాసేవచేస్తాడు అని దేవుడే చెప్పారు ఈరకంగా ఆరోజే పౌలుగారు అపోస్తలుడుగా
ఏర్పరచుకున్నట్లు అననీయ భక్తుడు గ్రహించి- ఇంతవరకు ఉన్న ద్వేషముపోయి అంత్యంత
ప్రేమగలవాడై తన్మయంతో సౌలా సహోదరుడా అని పిలిచి ప్రార్ధనచేసి దేవునిమార్గములో
నడిపించారు. బహుశా అప్పుడు అననీయ భక్తుడు చెప్పి ఉండవచ్చు! ఇలా కొన్ని సంవత్సరాలు
గడిచిపోయాయి. సువార్తలో సాగిపోతుండగా అపొస్తలుల 13వ అధ్యాయంలో ఒకసారి దేవుని
ప్రేరేపణతో ఉపవాసం చేస్తున్నారు. సడన్ గా దేవుడు బర్నబాను పౌలును నేను పిలిచిన
పనికొరకు వారిని నాకు ప్రత్యేకబపరచండి అని చెబుతారు.
అనగా వారిని నాకొరకు అపోస్తలులుగా చేయండి అంటే
వారు వెంటనే పౌలుగారిని బర్నబా గారిని ఇద్దరినీ ప్రార్ధనచేసి వారిమీద చేతులుంచి
అభిషేకం చేశారు అనగా ఆర్డినేషన్ చేశారు అపోస్తలులుగా!
వారిని అపోస్తలులుగా చేయమని ఏమనుష్యుడు
చెప్పలేదు. దేవుడు చెప్పారు వీరుచే శారు. మరి అదే కదా పౌలు గారు వ్రాశారు.
ఈవిషయం కౌన్సిల్కు తెలిసి ఉండవచ్చు గాని
పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన పిలుపు కాబట్టి మా ఆమోదం లేకుండా మిమ్మల్ని ఎవడు
అపోస్తలులుగా అభిషేకం చెయ్యమన్నారు అనివారు అడగలేదు! ఇలా కొన్ని సంవత్సారాలు గడిచి
పోయాయి! అప్పుడు గతభాగాలలో వివరించిన సున్నతి సమస్య వచ్చినప్పుడు పౌలుగారు
బర్నబాగారు సంఘములద్వారా కౌన్సిల్కు పంపబడ్డారు 15వఅధ్యాయంలో. ఆ సమస్యకు
పరిష్కారం దొరికింది. అయితే సడన్ గా దేవుడు కౌన్సిల్కు అనగా పేతురుగారికి,
యాకోబుగారికి, యోహానుగారికి ప్రేరేపించి ఆత్మపూర్ణులై గలతీ 2వ అధ్యాయం ప్రకారం తమ
కుడిచేతినిచ్చి అభినందించి, మేము యూదులకు అపొస్తలులుగా ఉంటాము. మీరు అన్యజనులకు
అపొస్తలులుగా ఉండమని చెప్పారు. అనగా వారు పొందిన అపోస్తలత్వానికి token of Acceptance అన్నమాట!....... గలతియులకు 2: 9
స్తంభములుగా ఎంచబడిన
యాకోబు కేఫా యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకును
తాము సున్నతిపొందినవారికిని అపొస్తలులుగా ఉండవలెనని చెప్పి, తమతో పాలివారమనుటకు
సూచనగా నాకును బర్నబాకును కుడిచేతిని ఇచ్చిరి.
మరి పౌలుగారిని
బర్నబాగారిని అన్యజనులకు అపొస్తలులుగా ఎందుకు ఉండమన్నారంటే వారి పరిచర్యలో
ఎక్కువభాగం అన్యజనుల మధ్య జరిగింది కాబట్టి!
సరే, మరి పౌలు గారు
చెప్పినది నిజమే కదా! పౌలుగారు పొందుకున్న అపోస్తలత్వము మనుష్యుల నుండి కాక
దేవునినుండే పొందుకున్నారు. అందుకే ఈ పత్రికలో దేవుని చిత్తమువలన క్రీస్తుయేసు
అపోస్తలుడను అని చెప్పుకున్నారు!
నేడు అనేకమంది
ఈఅపోస్తలుడు అనే బిరుదులు కొనుక్కుంటున్నారు. పౌలుగారు దేవునినుండి పొందుకుని
యేసుక్రీస్తుప్రభులవారి లాగ ఎన్నెన్నో శ్రమలను అనుభవించారు. యేసుప్రభులవారి కంటే
ఎక్కువరోజులు శ్రమలను పొందారు! గాని ఈ డబ్బుతో కొనుక్కున అపోస్తలులుకి అనుభవంలేదు,
అభిషేకం లేదు, పిలుపులేదు గాని బిరుదులున్నాయి. ఇలా సంఘాన్ని మోసగిస్తున్నారు.
శ్రమలను అనుభవించాకనే ఆ అనుభవం నుండి పరిపూర్ణత సాధించి అప్పుడు అపోస్తలులుగా
మారగలరు గాని ఇవేమీలేకుండా అపోస్తలుడు బిరుదు పొందుకోవడం దండగ అని నా ఉద్దేశ్యం!
ఇంతకీ అపొస్తలుడు అనగా ఎవరూ?
పంపబడినవారు!
యోహాను 13: 16
దాసుడు తన యజమానుని కంటె గొప్పవాడు కాడు, పంపబడినవాడు (అనగా
అపొస్తలుడు) తన్ను పంపినవాని కంటె గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా
చెప్పుచున్నాను.
దేని కోసం పంపబడ్డారు?
పరలోక
రాజ్యం సమీపించి యున్నది. మారు మనస్సు పొంది రక్షణ పొందమని, ఆ రక్షణమార్గం యేసే
అని చెప్పడానికి.
అయితే
1కొరింథీ 12 వఅధ్యాయంప్రకారం, ఎఫెసీ 4:13-14 ప్రకారం
అపొస్తలుడు
ఎప్పుడు అవుతాడు అంటే నాలుగు రకాల సేవలు జరిగించేవాడు. అనగా సువార్తికుడుగా
ఉపదేశకుడుగా ఉంటూ, ఆత్మలను సంపాదించి, సంఘాలు కట్టి, కాపరిగా సంఘాలను నడిపిస్తూ,
ఆత్మాభిషేకం కలిగి ప్రవచనవరం అధ్బుతాలుచేసే వరములు కలిగి, రాబోయేసంగతులను
ఆత్మద్వారా వివేచిస్తూ, సంఘాన్ని నడిపిస్తూ ఉండేవాడు అపొస్తలుడు. ఇవేమి లేకపోతే
ఆవ్యక్తి అపొస్తలుడు కానేకాడు.
పైన
పేర్కొన్న అన్ని పరిచర్యలలో టాప్ ఎఫెసీ 2:20 ప్రకారంఅపొస్తలుడు!
ఇక
2వ వచనంలో అన్నిలేఖలలో వ్రాసినట్లు తండ్రియైన దేవునినుండి కుమారుడైన
యేసుక్రీస్తునుండి మీకు కృప సమాధానం కలుగును గాక అంటున్నారు. గమనించాలి పౌలుగారు
కృప సమాధానముతో ఈపత్రికను మొదలుపెట్టి మరలా అదే కృపా సమాదానముతో ఈపత్రికను ముగించారు.
ఇదీ ఆయన పత్రికలు రాసే విధానము!!
దైవాశీస్సులు!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*116వ భాగము*
2కొరింథీ 1:3—7
3. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు
దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక.
4. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో
ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు, ఆయన మాశ్రమ అంతటిలో
మమ్మును ఆదరించుచున్నాడు.
5. క్రీస్తుయొక్క శ్రమలు మాయందేలాగు విస్తరించుచున్నవో,
ఆలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది.
6. మేము శ్రమపొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును
పొందుదుము; మేమాదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ, మేముకూడ
పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమైయున్నది.
7. మీరు శ్రమలలో ఏలాగు పాలివారైయున్నారో, ఆలాగే ఆదరణలోను
పాలివారైయున్నారని యెరుగుదుము గనుక మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమైయున్నది.
ప్రియదైవజనమా! మనము రెండవ కొరింథీపత్రికను
ధ్యానం చేసుకుంటున్నాము!
ప్రియులారా!
ఈ అధ్యాయములో మనకు ముఖ్యముగా కనిపించే విషయం ఏమిటంటే: శ్రమలు-కష్టాలు-
ఆదరణ-- శ్రమలలో ఆదరణ దేవుడు మనకు ఇస్తారు
అనియు, దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి మనకు ఆదరణ దయచేస్తారు, కాబట్టి మనము ఆ
శ్రమలను ఓపికగా సహించగలుగుతున్నాము! ఇదే ఈ అధ్యాయంలో కనిపించేది!
ఆదరణ అనే పదం వివిధ రూపాల్లో 17 సార్లు
కనిపిస్తుంది ఈ అధ్యాయంలో. కష్టాలు, బాధలు మొదలైన పదాలుగా తర్జుమా చేసిన గ్రీకు
పదాలు దాదాపు అదే సంఖ్యలో కనిపిస్తాయి. పౌలుగారు ఇక్కడ తన కష్టాల గురించి తన గోడు వినిపించుకోవడం లేదు
– దీనికి సరిగ్గా వ్యతిరేకంగా
చేస్తున్నారు (6:10; 7:4; 12:10; రోమా 5:3). తన కష్టాలు, బాధలు తనకు మేలే
చేస్తున్నాయని తెలుసుకున్నారు.
2కోరింథీయులకు 6: 10
దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడు సంతోషించువారము;
దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము; ఏమియు
లేనివారమైనట్లుండియు సమస్తమును కలిగినవారము.
2కోరింథీయులకు 7: 4
మీ యెడల నేను బహు ధైర్యముగా మాటలాడుచున్నాను, మిమ్మును
గూర్చి నాకు చాల అతిశయము కలదు, ఆదరణతో నిండుకొనియున్నాను, మా శ్రమయంతటికి మించిన
అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను.
2కోరింథీయులకు 12: 10
నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు
నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవముల
లోను నేను సంతోషించుచున్నాను.
రోమీయులకు 5: 3
అంతే కాదు; శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష
నిరీక్షణను (శీలము) కలుగజేయునని యెరిగి
రోమీయులకు 5: 4
శ్రమలయందును అతిశయపడుదము.
ఇప్పుడు
ఇదే శ్రమలు/శోధనల మూలంగా దేవుణ్ణి గురించి మరింత లోతైన అనుభవంలోకి ఆయన
రాగలిగారు 3,4 వచనాల ప్రకారం!
ఆ
బాధలు పడడం మేలే అనిపించేంతగా క్రీస్తులోని తియ్యని ఆదరణను అతడు అనుభవించాడు 5వ వచనం ప్రకారం!
దానిమూలంగా
ఇతరులను మరింత బాగా ఓదార్చగలిగారు 4,6
వచనాలలో!
అందుకే
దేవునిపై ఎక్కువగా ఆధారపడడం నేర్చుకున్నారు
9వ వచనం ప్రకారం!
రాబోయే
శాశ్వత యుగాల్లో మరింత మహిమ కలగడానికి ఇప్పటి బాధలు దోహదం చేస్తున్నాయని మరింత
స్పష్టంగా అర్థం చేసుకోగలిగారు (4:17)
తన
బాధల్లోనే వాటివల్ల కలిగే బలహీనతలోనే తనలోని దేవుని బలం అధికమౌతున్నట్టు
గ్రహించారు (12:9-10)
2 Corinthians(రెండవ కొరింథీయులకు) 12:9,10
9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి
పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు
నిమిత్తము (లేక, నన్ను కప్పునిమిత్తము) , విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా
అతిశయపడుదును.
10. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు
నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవముల
లోను నేను సంతోషించుచున్నాను.
సరే,ఇప్పుడు
మన భాగమునకు వద్దాం!
కనికరము
చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు
తండ్రియైన దేవుడు స్తుతించబడును గాక అంటూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు పౌలుగారు!
చూడండి
ఇక్కడ నిజానికి దేవుని యొక్క స్వభావం గూర్చి చెబుతున్నారు పౌలుగారు: మొదట ఆయన
కనికరం చూపించేవాడు!
రెండు:
సమస్తమైన ఆదరణ అనుగ్రహించేవాడు!!
దీనినే
4వ వచనంలో కూడా చెబుతున్నారు: దేవుడు మమ్మును ఏ
ఆదరణతో ఆదరించుచున్నాడో అదే ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు
శక్తిగలవారమగునట్లు ఆయన మాశ్రమ అంతటిలో మమ్మును ఆదరిస్తున్నారు అంటున్నారు!
5వ
వచనంలో క్రీస్తు యొక్క శ్రమలు అనగా క్రీస్తుకోసం మేము పడే శ్రమలు మాయందు ఎలాగు
విస్తరించుచున్నాయో అలాగే క్రీస్తుద్వారా మాకు ఆదరణ కూడా విస్తరిస్తుంది
అంటున్నారు!
అనగా
మన దేవుడు శ్రమలలో మనలను వదిలెయ్యడం లేదు, ఆయన మన శ్రమలలో మొదటగా తోడుగా ఉండి,
మనలను ఆదరిస్తున్నారు, శ్రమలు ఎంతగా విస్తరిస్తున్నాయో అంత ఎక్కువగా ఆయన కృప మనతో
ఉండి, అంతగా ఎక్కువగా ఆదరణ దయచేస్తున్నారు! అంతేకాకుండా దేవుడు మనకు మనము
సహించలేని శ్రమలను అనగా సహించలేనంత శ్రమలను శోధనలను మనకు రానివ్వడం లేదుగాని,
శ్రమలు శోధనలను తట్టుకునే శక్తిని ఇవ్వడమే కాకుండా వాటిని జయించే మార్గము కూడా
మనకు చూపుతున్నారు అంటున్నారు...
1కోరింథీయులకు 10: 13
సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు
సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింప గలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును
శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడ తప్పించుకొను మార్గమును
కలుగజేయును.
ఇక
మనము ఆదరణ కోసం చూసుకుందాం!
దేవుడు
ఆదినుండి ఎన్నో విధాలుగా మనలను ఆదరిస్తున్నారు. బైబిల్ మొత్తం ఆదరణ కోసం
చెబుతుంది.
కీర్తనలు 23: 4
గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను
నీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును నన్ను ఆదరించును.
కీర్తనలు 119: 50
నీ వాక్యము నన్ను బ్రదికించి యున్నది నా బాధలో ఇదే నాకు
నెమ్మది కలిగించుచున్నది.
యెషయా 40: 2
నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా
మాటలాడుడి ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను ఆమె దోషరుణము తీర్చబడెను యెహోవా చేతివలన
ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనను సమాచారము ఆమెకు ప్రకటించుడి.
యెషయా 61: 2
యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును
ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరిని ఓదార్చుటకును
యెషయా 61: 3
సీయోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును
బూడిదెకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును భారభరితమైన ఆత్మకు
ప్రతిగా స్తుతివస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను
మహిమపరచుకొనునట్లు నీతి అను మస్తకివృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి
పేరు పెట్ట బడును.
యెషయా 66: 13
ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆద రించెదను
యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు.
2 Thessalonians(రెండవ థెస్సలొనీకయులకు) 2:16,17
16. మన ప్రభువైన యేసుక్రీస్తును, మనలను ప్రేమించి, కృపచేత
నిత్యమైన ఆదరణయు, శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రియైన దేవుడును,
17. మీ హృదయములను ఆదరించి, ప్రతిసత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును
మిమ్మును స్థిరపరచును గాక.
హెబ్రీయులకు 6: 18
మనయెదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణా గతులమైన మనకు
బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను.
దేవుని
ఆత్మకు “ఆదరణకర్త” అనే పేరు ఈ గ్రీకు మూలపదం నుంచే వచ్చింది (యోహాను 14:16).
ఇక
కనికరము చూపే తండ్రి కోసం చూసుకుంటే- కనికరం అనగా Mercy
నిర్గమ
34వ అధ్యాయం లో దేవుని గుణగణాలు కనిపిస్తాయి మనకు!
Exodus(నిర్గమకాండము) 34:6,7
6. అతని యెదుట యెహోవా అతని దాటి వెళ్లుచు: యెహోవా కనికరము,
దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా.
7. ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును
పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులగా ఎంచక మూడు నాలుగు
తరములవరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించునని
ప్రకటించెను.
కీర్తనలు 86: 5
ప్రభువా, నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడవు
నీకు మొఱ్ఱపెట్టువారందరియెడల కృపాతిశయము గల వాడవు.
కీర్తనలు 86: 15
ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములుగల దేవుడవు ధీర్ఘశాంతుడవు
కృపాసత్యములతో నిండినవాడవు
కీర్తనలు 103: 13
తండ్రి తన కుమారులయెడల జాలిపడునట్లు యెహోవా తనయందు
భయభక్తులు గలవారి యెడల జాలిపడును.
కీర్తనలు 145: 8
యెహోవా దయా దాక్షిణ్యములు గలవాడు ఆయన దీర్ఘశాంతుడు
కృపాతిశయము గల వాడు.
విలాపవాక్యములు 3: 22
యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక
మనము నిర్మూలము కాకున్నవారము.
మీకా 7: 19
ఆయన మరల మనయందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి
పాపములన్నిటిని సముద్రపు అగాధములలో నీవు పడవేతువు.
మత్తయి 9: 36
ఆయన సమూహములను చూచి, వారు కాపరిలేని గొఱ్ఱెలవలె విసికి
చెదరియున్నందున వారిమీద కనికరపడి...
ఇక
తర్వాత మనకు వచ్చే అన్ని భాధలలోను శ్రమలలోను మనకు తోడుగా ఉన్నారు దేవుడు!
“అన్నిటిలోనూ”– దేవుడు “అన్ని విధాలా” ఆదరణ
కలిగించేవాడు. ఏ కష్టమైనా ఆయన ఆదరణ ఇస్తారు. విశ్వాసులు ఓదార్పును నిరాకరిస్తే ఆ
ఆదరణను అనుభవించకుండా ఉంటారు. కేవలం పౌలుగారి కోసమనే దేవుడు అతణ్ణి ఆదరించలేదు,
పౌలుగారు ఇతరులను ఆదరించగలగాలని దేవుడు అలా చేశారు (వ 6)
కాబట్టి
దేవుడు మనలను మన శోధనలలో శ్రమలలో కష్టాలలో మనలను గాలికి వదిలేసే దేవుడు కానేకాదు!
మనలను
ఆదరించి వాటిని జయించే శక్తినిచ్చే వాడు! కాబట్టి ఆయనమీద ఆనుకుందాం!
దైవాశీస్సులు!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*117వ భాగము*
2కొరింథీ 1:3—7
3. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు
దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక.
4. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో
ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు, ఆయన మాశ్రమ అంతటిలో
మమ్మును ఆదరించుచున్నాడు.
5. క్రీస్తుయొక్క శ్రమలు మాయందేలాగు విస్తరించుచున్నవో,
ఆలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది.
6. మేము శ్రమపొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును
పొందుదుము; మేమాదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ, మేముకూడ
పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమైయున్నది.
7. మీరు శ్రమలలో ఏలాగు పాలివారైయున్నారో, ఆలాగే ఆదరణలోను
పాలివారైయున్నారని యెరుగుదుము గనుక మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమైయున్నది.
ప్రియదైవజనమా! మనము రెండవ కొరింథీపత్రికను
ధ్యానం చేసుకుంటున్నాము!
ప్రియులారా!
దేవుడు మన కష్టాలలో శ్రమలలో మనలను ఆదరించే దేవుడు అనే విషయం కోసం ధ్యానం
చేసుకుంటున్నాము!
దేవుడు తన భక్తులను వారి కష్టాలలో ఎప్పుడు వదిలెయ్యలేదు! ప్రతీ
భక్తుని జీవితంలో కష్టాలు రావడమే షరామామూలే! వారితోడుగా ఉండి దేవుడు వారిని
వీరులుగా తీర్చడము షరామామూలే!! ఇది ప్రతీ భక్తుని జీవితంలో నిజమైన విశ్వాసి
జీవితంలో కనిపిస్తుంది!
ఇక
5వ వచనంలో క్రీస్తు యొక్క శ్రమలు
అంటున్నారు ఏమిటి?
అనగా క్రీస్తుకోసం లేక క్రీస్తు నామం కోసం పౌలుగారు అనుభవిస్తున్న శ్రమలు
శోధనలు! ఇవి కలుగుతాయి అని యేసుక్రీస్తుప్రభులవారు కొండమీద ప్రసంగంలోనే చెప్పారు!!
నా నామము నిమిత్తం ప్రజలు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్దముగా చెడ్డమాటలు
పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందిన్చుడి పరలోకమందు మీఫలము
అధికమగును. మత్తయి 5:11,12
ఇంకా
నా నామము నిమిత్తం శోధనలు కలుగుతాయి ధైర్యంగా ఉండాలి అని ముందుగా చెప్పారు
మత్తయి 10: 22
మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు;
అంతమువరకును సహించిన వాడు రక్షంపబడును.
మత్తయి 19: 29
నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను
తండ్రినైనను తల్లి నైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన
ప్రతివాడును నూరురెట్లు పొందును; ఇదిగాక నిత్యజీవమును స్వతంత్రించుకొనును.
మత్తయి 24: 9
అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు; మీరు నా
నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు.
మార్కు 13: 13
నా నామము నిమిత్తము అందరిచేత మీరు ద్వేషింపబడుదురు;
అంతమువరకు సహించినవాడే రక్షణ పొందును.
లూకా 21: 17
నా నామము నిమిత్తము మీరు మనుష్యులందరిచేత ద్వేషింపబడుదురు.
లూకా 21: 18
గాని మీ తల వెండ్రుకలలో ఒకటైనను నశింపదు.
లూకా 21: 19
మీరు మీ ఓర్పుచేత మీ ప్రాణములను దక్కించుకొందురు.
ఆయన
ముందుగానే చెప్పారు కాబట్టి ఆయన నామము నిమిత్తం నేను చనిపోవడానికి సిద్ధంగా
ఉన్నాను అని ధైర్యంగా చెబుతున్నారు పౌలుగారు!
అపో.కార్యములు 21: 13
పౌలు ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరేల?
నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక
చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను.
అయితే పేతురుగారు చెప్పేది వినండి.
1 Peter(మొదటి పేతురు) 4:12,13,14
12. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న
అగ్నివంటి మహాశ్రమను గూర్చి మీకేదో యొక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి.
13. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో
సంతోషించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైయున్నంతగా సంతోషించుడి.
14. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనయెడల
మహిమాస్వరూపియైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ, మీమీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు.
అయితే
ఎఫెసీ సంఘస్తుల వలే మనముండాలి!
ప్రకటన గ్రంథం 2: 3
నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి
అలయలేదనియు నేనెరుగుదును.
కాబట్టి
ఆయన నామము కొరకు శ్రమలు శోధనలు మనము అనుభవించాలి. పౌలుగారు తిమోతి గారికి చార్జ్
అప్పగిస్తూ ఆయన చనిపోయే ముందుగా ఒకమాట అంటున్నారు క్రీస్తుయేసునందు సద్భక్తితో
బ్రతుక నుద్దేశించువారికి శ్రమలు విస్తరించును!....
2తిమోతికి 3: 12
క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదకనుద్దేశించు వారందరు
హింసపొందుదురు.
సరే- క్రీస్తుకొరకు పౌలుగారు పడిన శ్రమలు కోసం ఏమన్నారో చూద్దాం!
రోమీయులకు 8: 17
మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము;
క్రీస్తుతో కూడ మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తుతోడి వారసులము.
ఫిలిప్పీయులకు 1: 30
క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున
శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను.
ఫిలిప్పీయులకు 3: 10
ఏ విధముచేతనైనను మృతులలోనుండి నాకు పునరుత్థానము
కలుగవలెనని, ఆయన మరణ విషయములో సమానానుభవముగలవాడనై, ఆయనను ఆయన పునరుత్థానబలమును ఎరుగు
నిమిత్తమును,
ఫిలిప్పీయులకు 3: 11
ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును,
సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను.
కొలస్సీయులకు 1: 24
ఇప్పుడు మీకొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు
సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడినపాట్లలో కొదువైన వాటియందు
నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను.
యేసుక్రీస్తు ఇతరుల కోసం బాధలు అనుభవించారు. తన ప్రజల కోసం
ఇంకా బాధల పాలవుతూనే ఉన్నారు (అపొ కా 9:4-5).
4. అప్పుడతడు నేలమీదపడి సౌలా, సౌలా, నీవేల నన్ను
హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను.
5. ప్రభువా, నీవెవడవని అతడడుగగా ఆయననేను నీవు హింసించుచున్న
యేసును;
అయితే
ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆయనలాగే ఇతరులకోసం ఆయనతో కలిసి సంతోషంగా బాధలు
అనుభవించేందుకు ఒప్పుకునేవారికి ఈ నిజమైన ఆదరణ ఏమిటో తెలుస్తుంది (యోహాను 16:33).
యోహాను 16: 33
నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో
చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను
లోకమును జయించి యున్నాననెను.
అందుకే ఆరవ వచనంలో పౌలుగారు అంటున్నారు: మేము శ్రమ పొందినా మీ ఆదరణ
కొరకు రక్షణ కొరకు పొందుతున్నాము అంటున్నారు! అలాగే మేము ఆదరణ పొందితే మీకోసమే లేక
మీ ఆదరణ కోసమే పొందుతున్నాము! కాబట్టి ఈ దేవుని ఆదరణ అనేది మేము పొందుచున్న
ఆశ్రమలను ఓపికతో సహించడానికి కారణం అవుతుంది అంటున్నారు! దేవుని ఆదరణ వలననే మనకు
కలిగే కష్టాలు శ్రమలు శోధనలు బాధలు నిందలు హింసలు అన్నింటిలోను మనము సహించి
నిలుస్తున్నాము! ధైర్యముగా లోకముతో పోరాడుచున్నాము ! అట్టి ఆదరణ లేకపోతే మనము
ఎప్పుడో అన్యజనాంగము వలే ఆత్మహత్య చేసుకుని ఉండేవారము!!! ఇది అర్ధం కాక మన
శత్రువులు మరియు అన్యులు అనుకుంటున్నారు- వీరు ఎలా ఇన్ని బాధలు అవమానాలు తట్టుకుని
నిలబడ గలుగుతున్నారు? ఎలా నవ్వ గలుగుతున్నారు? అని అనుకుంటున్నారు!! వీరు
పిచ్చోళ్ళు అని కొంతమంది అనుకుంటున్నారు! గాని వారికి తెలియదు ఈ శ్రమలలో శోధనలోనే
దేవుని ఆదరణ మెండుగా మనతో ఉంటుంది అని!! ఎన్ని టన్నులు కష్టాలు వస్తాయో శోధనలు
వస్తాయో దానికంటే ఎక్కువ టన్నులు ఆదరణ మనకు కలుగుతుంది దేవునివలన! హల్లెలూయ!!!
పౌలుగారి
జీవితమంతా ఇతరుల కోసమే జీవించారు. అతడి బాధలు, అతడికి కలిగిన ఆదరణ రెండూ వారికోసమే
1 Corinthians(మొదటి కొరింథీయులకు) 9:19,20,21,22,23
19. నేను అందరి విషయము స్వతంత్రుడనైయున్నను ఎక్కువమందిని
సంపాదించుకొనుటకై అందరికిని నన్ను నేనే దాసునిగా చేసికొంటిని.
20. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదునివలె ఉంటిని.
ధర్మశాస్త్రమునకు లోబడినవారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు
లోబడినవాడను కాకపోయినను, ధర్మశాస్త్రమునకు లోబడినవానివలె ఉంటిని.
21. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని
క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడినవాడను. అయినను ధర్మశాస్త్రము లేనివారిని
సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేనివారికి ధర్మశాస్త్రము లేనివానివలె ఉంటిని.
22. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ
విధముచేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికి అన్నివిధముల వాడనైయున్నాను.
23. మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దానికొరకే
సమస్తమును చేయుచున్నాను.
1 Corinthians(మొదటి కొరింథీయులకు) 10:24,33
24. ఎవడును తనకొరకే కాదు, ఎదుటి వానికొరకు మేలుచేయ
చూచుకొనవలెను.
33. ఈలాగు నేను కూడ స్వప్రయోజనమును కోరక, అనేకులు
రక్షింపబడవలెనని వారి ప్రయోజన మునుకోరుచు, అన్ని విషయములలో అందరిని సంతోష
పెట్టుచున్నాను.
2తిమోతికి 2: 10
అందుచేత ఏర్పరచబడినవారు నిత్యమైన మహిమతో కూడ క్రీస్తు
యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారికొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను.
మనము
కూడా పౌలుగారిని ఆదర్శంగా తీసుకుని ఆ
ఆదర్శాన్ని అనుసరించాలి! అప్పుడు
మాత్రమే దేవునినుంచి అతనికి కలిగిన ఆదరణంతా తమకు కలగాలని ఎదురుచూచే హక్కు
మనకు ఉంటుంది! .
అయితే
పౌలుగారు అంటున్నారు బాధలవల్ల శోధనల వలన కలిగే ఫలితం సహనం –
రోమా 5:3-5;
3. అంతే కాదు; శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష
నిరీక్షణను( శీలము) కలుగజేయునని యెరిగి
4. శ్రమలయందును అతిశయపడుదము.
5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు
అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో
కుమ్మరింపబడియున్నది.
యాకోబు 1:2-4;
2. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును
పుట్టించునని యెరిగి,
3. మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని
యెంచుకొనుడి.
4. మీరు సంపూర్ణులును, అనూనాంగులును,ఏ విషయములోనైనను
కొదువలేనివారునై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి.
యాకోబు 5: 11
సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా? మీరు యోబు యొక్క
సహనమునుగూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు
తెలిసికొనియున్నారు.
అందుకే
7వ వచనంలో మీరు శ్రమలలో ఎలాగు పాలివారై ఉన్నారో, ఆలాగే ఆదరణలోను మీరు పాలివారై
ఉన్నారని ఎరుగుదుము గనుక మీ కోసం మాకున్న నిరీక్షణ స్థిరమై ఉన్నది అంటున్నారు!
కొరింథీ
విశ్వాసులు కూడా క్రీస్తు బాధల్లో పాలిభాగస్థులు అయ్యారు!. పౌలుగారు హింసలకు గురి
అయినంతగా కాకపోయినా వారు కూడా హింసలకు గురి అయ్యారు. క్రీస్తు నామ బాధల్లో, ఆయన
ప్రజల బాధల్లో పాలు పొందడానికి ఇష్టపడడమంటే క్రీస్తు ఇచ్చే ఆదరణ, ఆనందాలలో పాలు
పొందడమే. అందుకే మీరు కూడా క్రీస్తు శ్రమలలో ఎలాగు పాలివారై ఉన్నారో అలాగే ఆయన
ఆదరణ లోను కూడా పాలివారై ఉన్నారు. అందుకే దేవునిమీద మీకున్న విశ్వాసము, ఆయన
మిమ్మును ఆదరించే వాడు అనే నిరీక్షణ, మృతుల పునరుత్థానం కలుగుతుంది అనే నిరీక్షణ
నమ్మకం మీలో విస్తరించింది అని అంటున్నారు!
మనము
కూడా మనకు వచ్చే బాధలలో శ్రమలలో కష్టాలలో ఒలిపోక సోలిపోక ధైర్యంగా నిలుద్దాం!
దేవుడు
అనుగ్రహించే ఆదరణ పొందుదాం! ఒకరోజు ఆయనను కలుసుకుందాం!
దైవాశీస్సులు!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*118వ భాగము*
2కొరింథీ 1:8—11
8. సహోదరులారా, ఆసియలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు
తెలియకుండుట మాకిష్టములేదు; అదేదనగా మేము బ్రదుకుదుమను నమ్మకములేక యుండునట్లుగా,
మా శక్తికి మించిన అత్యధిక భారము వలన క్రుంగిపోతిమి.
9. మరియు మృతులను లేపు దేవునియందేగాని, మాయందే మేము నమ్మిక
యుంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మామట్టుకు మాకు కలిగియుండెను.
10. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించెను, ఇక
ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థనచేయుట వలన మీరు కూడ సహాయము
చేయుచుండగా, ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయనయందు నిరీక్షణ గలవారమై
యున్నాము.
11. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా, మాకు కలిగిన కృపావరము
కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును.
ప్రియదైవజనమా! మనము రెండవ కొరింథీపత్రికను
ధ్యానం చేసుకుంటున్నాము!
ప్రియులారా!
దేవుడు మన కష్టాలలో శ్రమలలో మనలను ఆదరించే దేవుడు అనే విషయం కోసం ధ్యానం
చేసుకుంటున్నాము!
ఇక
8—11 వరకు ఆసియాలో తనకు కలిగిన
శ్రమలు శోధనల కోసం చెబుతున్నారు పౌలుగారు!
సహోదరులారా ఆసియాలో మాకు తటస్థించిన శ్రమలను గూర్చి మీకు తెలియకుండుట ఇష్టం
లేదు, అదేమిటంటే మేము బ్రదుకుతాం అనే నమ్మకం కూడా కోల్పోయినంతగా మా శక్తికి మించి
అత్యధిక భారంవలన కృంగిపోయాము అంటున్నారు!
ఇక్కడ
జాగ్రత్తగా గమనిస్తే మొదటిది: ఆసియా అంటున్నారు,
రెండు శ్రమలు అంటున్నారు, ఇక మాకు మరియు కృంగిపోతిమి అంటున్నారు! అనగా పౌలుగారు
మాత్రమే కాకుండా తనతో మరెవరో ఉన్నారు, అందరికీ శ్రమలు శోధనలు కలిగాయి అన్నమాట!
ఇక్కడ ఆసియా అనగా చిన్న ఆసియా అని గ్రహించాలి! ఈ పత్రిక
ఎఫెసీ పట్టణం నుండి రాశారని చెప్పడం జరిగింది. ఎఫెసీ, గలతీయ, కొలస్సీ ఈ
ప్రాంతాలన్నీ చిన్నాసియాకు చెందిన ప్రాంతాలు! ఎఫెసు చిన్నాసియాలో ప్రధాన నగరం.
ఇక
మాకు తటస్థించిన శ్రమలు బాధలు వలన మేము బ్రతుకుతాము
అనే ఆశ పోయినంతగా మేము కృంగిపోయాము అంటున్నారు- ఇది ఎప్పుడు జరిగింది?
ఇంకా మేము అంటున్నారు కదా పౌలుగారితో
ఎవరున్నారు? 18:5వ వచనం ప్రకారం పౌలుగారితో సీలగారు ఉన్నారని అర్ధమవుతుంది!
ఇంకా కొంచెం క్రిందికి వస్తే
పౌలుగారు సీల గారితో పాటుగా అకుల మరియు ప్రిస్కిల్ల అనే మంచి విశ్వాసులైన
భార్యాభర్తలనుకూడా పౌలుగారు తమతోపాటుగా ఎఫెసీ తీసుకుని వచ్చినట్లు మనకు 18, 19
అధ్యాయలుబట్టి అర్ధమవుతాయి! ఈ ఎఫెసీ మరియు చుట్టుప్రక్కల ప్రాంతాలలో పౌలుగారు
సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎన్నెన్నో ఇక్కట్లు శ్రమలు వారికి వచ్చాయి! ఒకానొక
దశలో బ్రతుకుతాము అనే ఆశను కూడా వారు వదిలేసికొన్నారు! దీనికోసమే ఆయన
రాస్తున్నారు!
భారం
భాదలు అనగా 10వ వచనంలో
ఆయన
అట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మా
కొరకు ప్రార్థనచేయుట వలన మీరు కూడ సహాయము చేయుచుండగా, ఆయన ఇక ముందుకును మమ్మును
తప్పించునని ఆయనయందు నిరీక్షణ గలవారమై యున్నాము.
2 Corinthians(రెండవ కొరింథీయులకు) 4:8,9
8. ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము;
అపాయములోనున్నను కేవలము ఉపాయము లేనివారము కాము;
9. తరుమబడు చున్నను దిక్కులేనివారము కాము; పడద్రోయబడినను
నశించువారము కాము.
2కోరింథీయులకు 6: 9
మేము మోసగాండ్రమై నట్లుండియు సత్యవంతులము;
తెలియబడనివారమైనట్లుండియు బాగుగ తెలియబడినవారము; చనిపోవుచున్న వారమైనట్లుండియు
ఇదిగో బ్రదుకుచున్నవారము; శిక్షింపబడినవారమైనట్లుండియు చంపబడనివారము;
2కోరింథీయులకు 6: 10
దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడు సంతోషించువారము;
దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము; ఏమియు
లేనివారమైనట్లుండియు సమస్తమును కలిగినవారము.
2 Corinthians(రెండవ కొరింథీయులకు)
11:23,24,25,26,27,28,29
23. వారు క్రీస్తు పరిచారకులా? వెఱ్ఱివానివలె
మాటలాడుచున్నాను, నేనును మరి యెక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా
ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని; అపరిమితముగా దెబ్బలు
తింటిని, అనేకమారులు ప్రాణాపాయములలో ఉంటిని.
24. యూదుల చేత అయిదుమారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు
తింటిని;
25. ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని; ఒకసారి రాళ్లతో
కొట్టబడితిని; ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని; ఒక రాత్రింబగళ్లు సముద్రములో
గడిపితిని.
26 .అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదులవలననైన ఆపదలలోను,
దొంగలవలననైన ఆపదలలోను, నా స్వజనులవలననైన ఆపదలలోను, అన్యజనులవలననైన ఆపదలలోను,
పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను,సముద్రములో ఆపదలోను, కపట సహోదరులవలని ఆపదలలో
ఉంటిని.
27. ప్రయాసతోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి
దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని, ఇంకను
చెప్పవలసినవి అనేకములున్నవి.
28. ఇవియును గాక సంఘము లన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ
భారము దిన దినమును నాకు కలుగుచున్నది.
29. ఎవడైనను బలహీనుడాయెనా? నేనును బలహీనుడను కానా? ఎవడైనను
తొట్రుపడెనా? నాకును మంట కలుగదా?
అతనికెదురైన
ప్రమాదాలు, కష్టాలు తనకు తానుగా తప్పించుకోలేనివి, జయించలేనివిగా కనిపిస్తాయి
మనకు!
వాటివలన తనకు మరణ సమయం
వచ్చిందని పౌలుగారికి అనిపించింది. అయితే ఇది కూడా అతని మేలుకే (రోమా 8:28).
దేవునిపై అతడు ఆధారపడడం మరింత బాగా నేర్చుకున్నారు. చనిపోయినవారిని తిరిగి
లేపగలిగిన దేవుడు ఎంత భయానకమైన ప్రాణాపాయం వచ్చినా తనను కాపాడగలడని పౌలుగారు
గ్రహించారు.
చూడండి మృతులను లేపు దేవునియందే గాని మాయందే మేము
నమ్మికయున్చాకుండునట్లు మరణమగుడుము అనే నిశ్చయం మాకు కలిగింది అంటున్నారు! ఇక
మేముచనిపోతాము అని డిసైడ్ అయిపోయారు అక్కడవారు!అయితే ఒక నమ్మకం ఉంది అదేమిటంటే
మృతులలో నుండి దేవుడు మమ్మల్ని లేపుతాడు అనే నమ్మకం ఉంది!
రోమీయులకు 8: 28
దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన
వారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.
10వ వచనంలో అంటున్నారు దేవుడు అట్టి గొప్ప మరణం నుండి మమ్మును
తప్పించారు అంటున్నారు ఇక ముందుకు కూడా తప్పిస్తారు అంటున్నారు!
గమనించాలి మీద చెప్పినట్లు ఈ కష్టాలు శ్రమలు శోధనలు వలన పౌలుగారు
కృంగిపోలేదు గాని కష్టాలు శోధనలు నాకు మరింతగా ఉపయోగపడుతున్నాయి ఎలాగంటే నేను
దేవునిమీద పరిపూర్ణంగా సంపూర్ణంగా ఆధారపడేలా ఈ కష్టాలు శ్రమలు శోధనలే
కారణమవుతున్నాయి అని కష్టాలలో శ్రమలలో శోధనలో సంతోషిస్తున్నారు! ఇదీ నిజమైన
క్రైస్తవ జీవితం!
ప్రియులారా మనం కూడా
పౌలుగారిని ఆదర్శంగా తీసుకోవాలి! మనకు కూడా అనేకసార్లు ఇలాంటి అనుభవాలు
ఎదురయ్యాయి! నిజమైన క్రైస్తవ జీవితం విశ్వాస జీవితం ఎవరైనా జీవిస్తూ ఉంటే
తప్పకుండా ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుంది. ఇది కేవలం నిజమైన క్రైస్తవులకే! అయితే వీరంతా ఇక మేము అయిపోయాము, మాకు ఆశ అనేది
లేదు, తొందరలో చనిపోబోతున్నాను- అయితే మరికొన్ని గంటలలో దేవుణ్ణి
కలుసుకోబోతున్నాము అని వారు నిర్ధారణకు వచ్చేసి ఉంటారు! గాని దేవుని మీద నిందలు
మోపరు వీరు! క్రీస్తుయేసు తమకోసం మరణాన్ని అనుభవించి రక్తము కార్చినప్పుడు
తాముకూడా ప్రభువుకోసం చనిపోదామని దేవునిలో సంతోషిస్తూ చనిపోదామని అనుకున్నారు!
ఇలాంటి Hopeless Situation లోనే దేవుడు
మామూలుగా ప్రత్యక్షం అవుతారు! అప్పుడే దేవుడు తన యొక్క కార్యమును ఆశ్చర్యముగా
చేస్తారు!
*అబ్రాహాము గారు
ఇస్సాకు మీద కత్తి ఎత్తేశారు బలిద్దామని- మోషేగారికి ముందు ఎర్రసముద్రం వెనుక ఫరో
సైన్యం- దావీదు గారికి ప్రపంచంలో బలవంతుడైన విరోధి ఎదురుగా ఉండి రారా నా దగ్గరకు
వస్తే నిన్ను నరికి కాకులకు వేస్తాను అంటున్నాడు- గిద్యోనుకి మూడు వందల మందితో
మూడు లక్షలమందిని ఎదుర్కోవలసి వచ్చింది- దానియేలు గారిని నిర్దాక్షిణ్యంగా సింహాల
బోనులో వేసేసారు, సింహాలు తనను తినేయ్యడానికి వచ్చేస్తున్నాయి- షడ్రక్ మేషక్
అబెద్నేగోలను అగ్ని గుండంలో వేసేశారు – 7 రొట్టెలు 2చిన్న
చేపలు మాత్రమే ఉన్నాయి- 5000 మంది మూడురోజుల నుండి ఆకలితో బాధపడుతున్నారు! –
తాము దేవుడని రక్షకుడని నమ్మిన యేసుక్రీస్తుప్రభులవారిని అన్యాయంగా సిలువవేసి
చంపేశారు*—ఇవన్నీ ఆశకు నిరీక్షణకు ఆధారం లేవు- ఇక అయిపోయింది కధ, Game over, ది ఎండ్ అనుకున్న పరిస్తితులే!
*గాని ఏం జరిగింది? అప్పుడే ఇలాంటి పరిస్తితులలోనే దేవుడు
తన మహాత్యం చూపించారు! ఇదే దేవుని కార్యాలు చేసే విధివిధానం! ఇస్సాకు బదులుగా
గొర్రెపిల్ల బలి అయ్యింది- మోషే గారు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి- అదే ప్రపంచంలో
అత్యంత శక్తివంతమైన సైన్యాన్ని అంతం చేశారు! – ఒకేఒక వడిసల
దెబ్బతో గొల్యాతు బోర్ల పడ్డాడు, వాడి కత్తితోనే గొల్యాతును నరికి అదే కాకులకు
గద్దలకు వేశారు- మూడువందలమంది మూడు లక్షలమందిని హతం చేయగలిగారు- దేవునిదూత వచ్చి
సింహాల నోళ్లను మూశాడు- షడ్రక్-మేషక్ అబెద్నేగోలు అగ్నిగుండంలో పార్కులో షికార్లు
చేసినట్లు షికార్లు చేయడం మొదలెట్టారు!- 7 రొట్టెలు 2 చిన్నచేపలు 5000 మంది
కడుపునిండుగా తినగా 12 గంపల రొట్టెలు చేపలు మిగిలిపోయాయి- యేసుక్రీస్తుప్రభులవారు
మరణము జయించి సాతానుని జయించి విజయుడై లేచారు!*
అసాధ్యాలు
సుసాధ్యాలుగా చేయడం దేవుని విధానం! కాబట్టి దైర్యము వదలవద్దు ప్రియులారా! పౌలుగారు
మరణమై పోతున్నాను అనుకున్నారు గాని దేవుడు తప్పించారు! మీదన ఉన్న అందరిని దేవుడు
తప్పించారు- అందుకే యోబు గ్రంధంలో అంటున్నారు:
యోబు 24: 22
ఆయన తన బలముచేతను బలవంతులను కాపాడు చున్నాడు కొందరు
ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరల బాగుపడుదురు.
యోబు 24: 23
ఆయన వారికి అభయమును దయచేయును గనుక వారు ఆధారము నొందుదురు
ఆయన వారి మార్గముల మీద తన దృష్టి నుంచును
దేవుడు
నిన్ను నన్ను కూడా అలాంటి Hopeless
Situation నుండి తప్పించగలరు!!
దైవాశీస్సులు!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*119వ భాగము*
2కొరింథీ 1:10—14
10. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించెను, ఇక
ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థనచేయుట వలన మీరు కూడ సహాయము
చేయుచుండగా, ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయనయందు నిరీక్షణ
గలవారమైయున్నాము.
11. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా, మాకు కలిగిన కృపావరము
కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును.
12. మా అతిశయమేదనగా, లౌకిక జ్ఞానముననుసరింపక,
దేవుడనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో
నడుచుకొంటి మనియు, విశేషముగా మీయెడలను నడుచుకొంటిమనియు, మా మనస్సాక్షి
సాక్ష్యమిచ్చుటయే
13. మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప,
మరేవియు మీకు వ్రాయుట లేదు; కడవరకు వీటిని ఒప్పుకొందురని నిరీక్షించుచున్నాము.
14. మరియు మన ప్రభువైన యేసుయొక్క దినమందు మీరు మాకేలాగో,
ఆలాగే మేము మీకును అతిశయకారణమై యుందుమని, మీరు కొంత మట్టుకు మమ్మును
ఒప్పుకొనియున్నారు.
ప్రియదైవజనమా! మనము రెండవ కొరింథీపత్రికను
ధ్యానం చేసుకుంటున్నాము!
ప్రియులారా!
దేవుడు మన కష్టాలలో శ్రమలలో మనలను ఆదరించే దేవుడు అనే విషయం కోసం ధ్యానం
చేసుకుంటున్నాము!
మనము
10, 11 వచనాలు మరోసారి చూసుకుంటే ఇక్కడ మనకు ఒక విషయం అర్ధమవుతుంది!
మొదటి
పత్రికలో పౌలుగారు కొరింథీ సంఘస్తులు కోసం మీలో వ్యభిచారం ఉంది, మీలో కక్ష్యలు
కలహాలు బేధాలు ఉన్నాయి, మీరు ప్రభురాత్రి భోజనమును సరిగా అనుసరించడం లేదు ఇలాంటి
విషయాలతో మందలించారు! అయితే ఇలాంటి వ్యక్తుల ప్రార్ధనలు కూడా దేవుడు వింటారు అనేది
ఈ రెండు వచనాల వలన అర్ధమవుతుంది! ఆ వ్యక్తి ఎలాంటి వాడైనా వారి ప్రార్ధనలు
ఫలిస్తాయి అనే అర్ధంలో పౌలుగారు రాస్తున్నారు....
10. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించెను, ఇక
ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థనచేయుట వలన మీరు కూడ సహాయము
చేయుచుండగా, ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయనయందు నిరీక్షణ
గలవారమైయున్నాము.
11. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా, మాకు కలిగిన కృపావరము
కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును.
వారు
తగినరీతిగా జీవించకపోవడం చూచి పౌలుగారు
కొరింథీ విశ్వాసులను మందలించారు – 1 కొరింథీ 3:1-4; 5:1-2; 6:1; మొ।।.
ప్రకారం! అయినప్పటికీ వారి ప్రార్థనలను విలువైనవిగా ఎంచుతున్నారు ఇక్కడ పౌలుగారు. అవి తనకు తోడ్పడతాయని ఖచ్చితంగా
నమ్మారు
ఫిలిప్పీయులకు 1: 20
నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ
ప్రార్థనవలనను, యేసుక్రీస్తు యొక్క ఆత్మనాకు సమృద్ధిగా కలుగుటవలనను, ఆ ప్రకటన నాకు
రక్షణార్థముగా పరిణమించునని నేనెరుగుదును.
ఫిలేమోనుకు 1: 22
అంతేకాదు, నీ ప్రార్థనల మూలముగా నేను నీకు
అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధము చేయుము.
కొరింథీ
విశ్వాసులు కొందరు విశ్వాసంలో బలహీనులు,
ఇంకా తరచుగా పడిపోతూ ఉండే విశ్వాసుల
ప్రార్థనలు కూడా దేవుని దగ్గర పూర్తిగా ప్రభావం లేనివి కావని దీన్ని బట్టి మనం
నేర్చుకుందాం. దేవునికి కృతజ్ఞతలు అంతటా వెల్లివిరియాలని కూడా పౌలుగారు కోరుతున్న విషయం గమనించండి (4:15; 9:11-13).
ఇక
12—14 వచనాలలో ఈ పత్రికను రాసిన
ముఖ్య ఉద్దేశానికి కొద్దికొద్దిగా వచ్చేస్తున్నారు! మా అతిశయం ఏమిటంటే లౌకిక
జ్ఞానమును అనుసరించకుండా దేవుడు ఇచ్చిన పరిశుద్ధత తోనూ కపటం లేని హృదయం మనస్సాక్షి
తోనూ దేవుని కృపను అనుసరించి మేము లోకములోనూ మీ మధ్యను నడచుకున్నామని మా
మనస్సాక్షి మామీద దృఢమైన సాక్షం చెప్పింది! అదే మా అతిశయం! మీరు చదువుకొని
పూర్తిగా గ్రహించిన సంగతులే మేము మీకు రాస్తున్నాము తప్ప మరొక క్రొత్త విషయాలు
రాయడం లేదు! దీనిని మీరు కడవరకు ఒప్పుకుంటారని నమ్ముచున్నాను! ఆశిస్తున్నాను!
మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు దినమున అనగా ఆయన రాకడ సమయంలో మీలో మా అతిశయ కారణం
అని నమ్ముచున్నాను అంటున్నారు!
పౌలుగారి
యొక్క నిజాయితీని, యథార్థతను కొరింథీలో
కొందరు ప్రశ్నిస్తున్నారుకదా (13:3).
అందువల్ల ఆయన దానికి జవాబుగా ఈ మాటలు
రాస్తున్నారు. వారు తనను నమ్మడం ముఖ్యమైన సంగతి –ఎందుకంటే అది తనకోసం కాదు, వారికోసమే. అతని “అతిశయం” తనను
కాదు, తాను ప్రకటించిన సువార్తనూ తన అపోస్తలత్వమును సమర్థించుకోవడానికే. 11:13లో ఉన్న కపట బోధకులు
ఈ లేఖ అంతటా కనిపిస్తూనే ఉన్నారు.
2కోరింథీయులకు 11: 13
ఏలయనగా అట్టి వారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము
ధరించుకొనువారైయుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పనివారునై యున్నారు.
వారు అబద్ధమైన సువార్తను ఒకదానిని
తెచ్చారు. వారు దానిని సమర్థించుకోవాలంటే మరియు తమ పొట్ట పోషించుకోవాలంటే పౌలుగారికి
వ్యతిరేకంగా మాట్లాడడం తప్పదు. కాబట్టి ఇప్పుడు నిజమైన సువార్తను
సమర్థించాలంటే పౌలుగారు వారి దాడులను
ఎదుర్కొని తాను నిజంగా దేవుని సేవకుడనీ క్రీస్తు అపోస్తలుడను అనీ చూపించవలసి వచ్చింది. కొరింథీ వారికి
పౌలుగారు నిజమైనవాడుగా కనబడితే అతడు
ప్రకటించే సువార్త నమ్మతగినదిగా కనబడుతుంది, లేకపోతే నమ్మతగనదిగా కనిపించవచ్చు. తన
గురించి అతడు వారికి రాసినదంతా వారి మేలు కోసమే (12:19). ఎందుకు ఇలా తాను బోధించేది నిజమైన సువార్త అని
చెప్పుకోవాల్సి వచ్చింది అంటే ఆ సమయంలో చూద్దామంటే వారికి క్రొత్త నిబంధన
గ్రంథం గానీ, ఇంకా క్రొత్త నిబంధనలో
కనీసం ఒక్క సువార్త పుస్తకం గానీ అందుబాటులో లేదు. బహుశా మార్కు గారు ఈ
పత్రిక రాసినప్పటికీ తన సువార్త పుస్తకం రాసి ఉంటారు గాని అందరికీ అది
అందుబాటులోకి రాలేదు! నిజానికి మొదటి శతాబ్దం అంతానికి గాని క్రొత్త నిబంధనలో
అన్ని సువార్త పుస్తకాలు అందరికీ అందుబాటులోకి రాలేదు! కాబట్టి ఇప్పుడు పౌలుగారు
తాను మొదటసారి వారి దగ్గరికి వచ్చినప్పుడు బోధించినది నిజమైన సువార్త అని, తాను
యేసుక్రీస్తుప్రభులవారిచే ఏర్పరచబడిన అపోస్తలుడను అని మరోసారి చెప్పుకోవలసి
వచ్చింది! అందుకే గలతీ పత్రికలో నేను మొదట మీకు ప్రకటించిన సువార్త కాక మరో సువార్త ఎవడైనా గాని లేక నేనైనా గాని లేక
మరో దేవదూత గాని చెబితే దానిని నమ్మవద్దు! వాడు శపించబడును గాక అంటున్నారు...
Galatians(గలతీయులకు) 1:6,7,8,9
6. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచినవానిని విడిచి,
భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది.
7. అది మరియొక సువార్త కాదుగాని, క్రీస్తు సువార్తను
చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు.
8. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరియొక సువార్తను
మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు
శాపగ్రస్తుడవును గాక.
9. మేమిది వరకు చెప్పిన ప్రకారమిప్పుడును మరల
చెప్పుచున్నాము; మీరు అంగీకరించిన సువార్త గాక మరియొకటి యెవడైనను మీకు ప్రకటించిన
యెడల వాడు శాపగ్రస్తుడవును గాక.
కారణం దేవుడు బయలుపరిచిన విషయాలు
ఎన్నో శ్రమలకోర్చి వేల కిలోమీటర్లు ప్రయాణించి ఆకలిదప్పులకు లెక్కచెయ్యకుండా ఎంతో
కష్టముతో సంఘాలను కడితే కొందరు పనికిమాలిన వారు తప్పుడుబోధలతో సంఘాలను కలవరపరచడమే
కాకుండా పౌలుగారు నిజమైన అపోస్తలులు కాదని, పౌలుగారు సీలగారు బోధించే సువార్త
నిజమైనది కాదని, వారు అబద్దికులని వారిని నమ్మిస్తూ పోట్టపోశించు కుంటున్నారు!
అందుకే సంఘమును తిట్టకుండా తాను పడిన ప్రయాసం వ్యర్ధం కాకుండా నెమ్మదిగా తను
ప్రకటించిన సువార్తనే నిజమైనదని ఆధారాలతో నిరూపిస్తున్నారు ఈ పత్రికలో!
ఇక ఈ పత్రికలో అతిశయం అనేమాట వాడారు
పౌలుగారు.
ఈ లేఖలో ఇది మరో ముఖ్యాంశం. పౌలుగారు
ఈ మాట వివిధ నామవాచకాల్లో క్రియా రూపాల్లో ఈ లేఖలో 31 సార్లు వాడారు (గ్రీకులో).
ఇక్కడ “అతిశయం” అని తర్జుమా చేసిన గ్రీకు పదం రోమా 5:2-3లో “ఉత్సాహం”గా
కనిపిస్తున్నది. ఈ అతిశయం దేవునిలో ఒక పవిత్రమైన ఆనందం లాంటిది. పాపులు, అవిశ్వాసులైన
మనుషులు డంబాలు కొట్టుకోవడం వంటిది కాదిది. వారేమో తమ బలం గురించి, తెలివితేటలు,
సామర్థ్యం గురించి గొప్పలు చెప్పుకుంటారు. పౌలుగారు అయితే దేవుణ్ణి గురించి,
దేవుడు తనలో, తనతో చేసినదాన్ని గురించి గొప్పగా చెప్పుకున్నాడు. తనలో మంచిది ఏది
ఉన్నా అది దేవునినుంచేననీ, దేవుని కృపవల్లే వచ్చిందనీ అతనికి బాగా తెలుసు – రోమ్ 7:18; 1 కొరింతు 1:29,
31.
Romans(రోమీయులకు) 5:2,3,4
2. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసమువలన ఈ కృపయందు
ప్రవేశముగల వారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణనుబట్టి
అతిశయ పడుచున్నాము.
3. అంతే కాదు; శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష
నిరీక్షణను( శీలము) కలుగజేయునని యెరిగి
4. శ్రమలయందును అతిశయపడుదము.
Romans(రోమీయులకు) 7:17,18,20,21,22,24,25
17. కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని
నేను కాదు.
18. నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని
నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు
కలుగుటలేదు.
20. నేను కోరని దానిని చేసినయెడల, దానిని చేయునది నాయందు
నివసించు పాపమే గాని యికను నేను కాదు.
21. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక
నియమము నాకు కనబడుచున్నది.
22. అంతరంగపురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను
ఆనందించుచున్నాను గాని
24. అయ్యో, నేనెంత దౌర్భాగ్యు డను? ఇట్టి మరణమునకు లోనగు
శరీరమునుండి నన్నెవడు విడిపించును?
25. మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా దేవునికి
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవనియమమునకును,
శరీర విషయములో పాపనియమమునకును దాసుడనైయున్నాను.
ఇక
ప్రభువు దినము అనగా యేసుక్రీస్తుప్రభులవారు వచ్చేరోజు! ఆ రోజు ఈ కొరింథీ వారు
తనయొక్క సంతోషమునకు కారణం అవుతారు అని పౌలుగారు నమ్ముచున్నారు
ఫిలిప్పీ 4:1
కావున నేనపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా
కిరీటమునైయున్ననా ప్రియులారా, యిట్లు ప్రభువునందు స్థిరులైయుండుడి.
1థెస్స 2:19—20
19. ఏలయనగా మా నిరీక్షణయైనను ఆనందమైనను అతిశయకీరీటమైనను
ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన యెదుట మీరే గదా.
20. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునైయున్నారు.
కాబట్టి
మనము కూడా ఇలాంటి అతిశయం కలిగి ఉందాం ఇంకా మనం పొందుకున్నది నేర్చుకున్నది నిజమైన
సువార్త అని గ్రహించి తప్పుడు బోధలనుండి దూరంగా ఉందాం!
మనం
పొందుకున్న సువార్తను, రక్షణను గట్టిగా పట్టుకుందాం!
కడవరకు
దీనిలోనే సాగిపోదాం!
దైవాశీస్సులు!!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*120వ భాగము*
2కొరింథీ 1:15—24
15. మరియు ఈ నమ్మికగలవాడనై మీకు రెండవ కృపావరము లభించునట్లు
మొదట మీయొద్దకు వచ్చి,
16. మీ యొద్దనుండి మాసిదోనియకు వెళ్లి మాసిదోనియ నుండి మరల
మీయొద్దకు వచ్చి, మీచేత యూదయకు సాగనంపబడవలెనని ఉద్దేశించితిని.
17. కావున నేనీలాగు ఉద్దేశించి చపలచిత్తుడనుగా
నడుచుకొంటినా? అవును అవునని చెప్పుచు, కాదు కాదనునట్టు ప్రవర్తింపవలెనని నా
యోచనలను శరీరానుసారముగా యోచించుచున్నానా?
18. దేవుడు నమ్మదగినవాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము
అవునని చెప్పి కాదనునట్టుగా ఉండలేదు.
19. మాచేత, అనగా నా చేతను సిల్వాను చేతను తిమోతి చేతను,
మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదనువాడైయుండలేదు
గాని ఆయన అవుననువాడై యున్నాడు.
20. దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు
అవునన్నట్టుగానే యున్నవి గనుక మనద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయనవలన
నిశ్చయములైయున్నవి (మూలభాషలో- ఆమేన్ అని యున్నవి) .
21. మీతో కూడ క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మును స్థిరపరచి
అభిషేకించినవాడు దేవుడే.
22.ఆయన మనకు ముద్రవేసి, మన హృదయములలో మనకు ఆత్మ అను
సంచకరువును అనుగ్రహించియున్నాడు.
23. మీయందు కనికరము (మూలభాషలో- ద్వారము తెరువబడియుండగా)
కలిగినందున నేను మరల కొరింథునకు రాలేదు. నా ప్రాణముతోడు ఇందుకు దేవునిని సాక్షిగా
పెట్టుచున్నాను.
24. మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని యీలాగు చెప్పుటలేదు
గాని మీ ఆనందమునకు సహకారులమైయున్నాము; విశ్వాసము చేతనే మీరు నిలుకడగా ఉన్నారు.
ప్రియదైవజనమా! మనము రెండవ కొరింథీపత్రికను
ధ్యానం చేసుకుంటున్నాము!
ప్రియులారా!
ఇక 15—20 వచనాలు అర్ధం కావాలంటే
జరిగిన విషయం తెలిస్తే అది మనకు బాగా అర్ధం అవుతుంది! కొరింథీ సంఘములో సమస్యలు
ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పౌలుగారు ఉత్తరాలు రాసి పంపించారు!
అయితే నేను తొందరలో వస్తాను సరిచేస్తాను అని చెప్పేవారు! ఆ విషయం
వారు పౌలుగారు తొందరలో రాబోతున్నారు అని చెప్పేవారు! గాని దేవుడు చెప్పిన మాటవలన
ఎఫెసీ పట్టణంలో మూడు సంవత్సరాలు ఉండిపోయారు! ఎక్కడికీ వెళ్ళలేకపోయారు! దీనిని
అనువుగా తీసుకుని ఆ తప్పుడుభోధకులు తప్పుడుగాళ్ళు పౌలు అంటాడు గాని రాడు, ఎందుకంటే
అతడు అబద్ధికుడు ఇంకా అతడు చెప్పిన సువార్త అబద్దం! అతడు రాసిన మొదటి పత్రికలు అబద్దాలు
అని కొందరు, మృతులు పునరుత్థానం ఏమీ లేదు
అని కొందరు, పౌలుకి తోచినది ఆయన చెప్పేస్తాడు అంతే, పౌలు పెద్ద అబద్దికుడు
మోసగాడు, మరి మేము ఇంత ధైర్యంగా అతడు మోసగాడు అబద్దికుడు అని సవాలు చేసి
చెబుతుండగా మరి ఆయన నిజమైన అపోస్తలుడు ఆయన చెప్పేది నిజమైన సువార్త అయితే ఎందుకు
ధైర్యంగా రావడం లేదు, ఎందుకంటే మేము చెప్పేవాటిని ఎదిరించే శక్తి సత్తా నిజాయితీ
అతనిలో లేదు కనుక అంటూ బోధించడం మొదలుపెట్టారు ఈ తప్పుడుగాళ్ళు! ఇప్పుడు
పౌలుగారికి తనకోసం తన వ్యక్తిత్వం మరియు అపోస్తలత్వం కోసం అన్నా పెద్దగా
పట్టించుకునే వారు కాదు గాని తను చెప్పిన నిజమైన సిలువసువార్త అబద్దమని వాళ్ళు
చేసే ప్రచారం చూసి- సువార్తకు ప్రమాదం జరుగుతుంది అని తెలుసుకుని కొరింథీ
వెళ్లకముందు తను ఎందుకు రాలేకపోతున్నారో రాస్తున్నారు ఇక్కడ!! ఒకరకంగా సంజాయిషీ లాంటిది!!
ఇక –15—20 చూసుకుంటే మరియు ఈ నమ్మకం గలవాడనై మీకు రెండవ కృపావరం లభించేలా
మొదట మీ వద్దకు వచ్చి మీ దగ్గరనుండి మాసిదోనియా వెళ్లి మీ చేత యూదయకు పంపబడాలని
అనుకున్నాను అంటున్నారు!
ఇక్కడ రెండవ కృపావరం అనగా రెండోసారి కొరింథీ పట్టణ సందర్శనం అని
అర్ధం! నేను మీ దగ్గరకు వచ్చి మీ
దగ్గరనుండి మాసిదోనియా వెళ్లి అలానే యూదయ అనగా యేరూషలేము వెళ్ళాలని అనుకున్నాను
అంటున్నారు! ఎందుకు యూదయ అంటే మనకు మొదటి పత్రిక 16 లో ఉంటుంది పేదలైన
పరిశుద్దులకు కానుక ఇవ్వాలని అనుకున్నారు కదా! దానిని అందజేయడానికి! గాని నేను
రాలేకపోయాను అంటున్నారు! ఎందుకు రాలేకపోయారో మనకు 23వ వచనంలో ఉంది! మీ యందు కనికరం
కలిగినందున నేను కొరింథీకి రాలేదు, ఇది మొదటి కారణం! నాప్రాణము తోడు అంటూ ఇంకా
దేవుని సాక్షిగా పెడుతున్నాను అంటున్నారు! ఎందుకు ఇంతగా చెబుతున్నారు పౌలుగారు??
ఎందుకంటే క్రీస్తు సువార్త
పరువు మర్యాదలను కాపాడడమే అతని ముఖ్య శ్రద్ధ. ఇక్కడ తాను వారి దగ్గరికి వెళ్ళదలచిన
విషయంలో తన మనస్సు ఎందుకు మార్చుకోవలసి వచ్చిందో కారణం ఇస్తున్నారు. ఇచ్చిన మాటంటే
తనకు లెక్క లేక కాదు. వారంటే అతనికెంతో శ్రద్ధ గనుక. 2:1-4 కూడా చూడండి. కారణం
కొరింథీలో ఉన్న సంఘం ఎంత హీనమైన స్థితిలో ఉందంటే తాను గనుక వస్తే వారికీ తనకూ కూడా
బాధ, విచారం కలగడం ఖాయం. వారికి ఇలా జరగడం పౌలుకు ఇష్టం లేదు.
2 Corinthians(రెండవ కొరింథీయులకు) 2:1,2,3,4
1. మరియు నేను దుఃఖముతో మీయొద్దకు తిరిగిరానని నామట్టుకు
నేను నిశ్చయించుకొంటిని.
2. నేను మిమ్మును దుఃఖపరచునెడల నాచేత దుఃఖపరచబడినవాడు తప్ప
మరి ఎవడు నన్ను సంతోషపరచును?
3. నేను వచ్చినప్పుడు ఎవరివలన నేను సంతోషము పొందతగినదో,
వారివలన నాకు దుఃఖము కలుగకుండవలెనని యీ సంగతి మీకు వ్రాసితిని. మరియు నా సంతోషము
మీ అందరి సంతోషమేయని మీ అందరియందు నమ్మకము కలిగి యీలాగు వ్రాసితిని.
4. మీకు దుఃఖము కలుగవలెనని కాదు గాని, మీయెడల నాకు
కలిగియున్న అత్యధికమైన ప్రేమను మీరు తెలిసికొనవలెనని, నిండు శ్రమతోను మనోవేదనతోను
ఎంతో కన్నీరు విడుచుచు మీకు వ్రాసితిని.
1కొరింథీ 4:21
మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీయొద్దకు రావలెనా?
ప్రేమతోను సాత్వికమైన మనస్సుతోను రావలెనా?
ఇక్కడ అలా రాశారు కాబట్టి వారు ఇంకా
పరిపూర్ణంగా సరిదిద్దుకోలేదు గనుక ఒకవేళ పౌలుగారు కొరింథీ వెళ్తే పౌలుగారు
బాధపడతారు- కొరింథీ సంఘం వారు బాధపడతారు గనుక, వారు తమకు తాము సరిదిద్దుకునే సమయం
ఇవ్వడానికి ఆయన వెళ్ళలేదు, ఇందుకే నేను రాలేకపోయాను అంటూ వారికి వివరణ
ఇస్తున్నారు!
రెండవది: 23వ వచనం మరోసారి చూడండి
మీయందు కనికరము (మూలభాషలో- ద్వారము
తెరువబడియుండగా) కలిగినందున నేను మరల కొరింథునకు రాలేదు. నా ప్రాణముతోడు ఇందుకు
దేవునిని సాక్షిగా పెట్టుచున్నాను.
మూలభాషలో ద్వారం తెరువబడి ఉండగా ..
దేనికి ద్వారం తెరవబడింది? మొదటి పత్రిక నుండి చూసుకుంటున్నాము- సువార్త ప్రకటనకు
ద్వారం లేక అవకాశం మెండుగా ఉంది కనుక ఎఫెసీ వారికి సంపూర్తిగా ప్రకటించి రావాలని
కోరుకున్నారు ఆయన. అందుకే రాలేకపోతున్నాను అంటున్నారు!
ఇంకా 24వ వచనంలో అంటున్నారు- మీమీద
పెత్తనం చెయ్యడానికి లేక మీ విశ్వాసం మీద మీమీద ప్రభువులమని ఇలాగు చెప్పడం లేదు
గాని మీ ఆనందమునకు మేము సహకారులమై ఉన్నాము గనుక ఇలా రాస్తున్నాను, కాబట్టి
మీరువిశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు అంటున్నారు!
తనను
వారు అపార్థం చేసుకోకూడదని పౌలు కోరిక. అతడు వారిని శాసించగల నిరంకుశుడు కాదు.
వారిని నిలబెట్టినది వారి సొంత విశ్వాసమే, వారిపై తాను చేయగలిగిన ఏ అధికారమూ కాదు
(13:10).
2కోరింథీయులకు 13: 10
కాబట్టి నేను మీయొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక,
మిమ్మును కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారము చొప్పున కాఠిన్యము
కనపరచకుండునట్లు దూరముగా ఉండగానే యీ సంగతులు వ్రాయుచున్నాను.
1 పేతురు 5:3 పేతురు గారు ఏమంటున్నారో చూద్దాం!...
1పేతురు 5: 3
మీకు అప్పగింపబడినవారిపైన ప్రభువునైనట్టుండక మందకు
మాదిరులుగా ఉండుడి;
ఇదీ
వారికిచ్చుకున్న వివరణ లేక సంజాయిషీ! ఎందుకు ఇలా ఇచ్చారు అంటే కేవలం సువార్త
పాడవ్వకూడదు కొరింథీ వారు తప్పుడుగాళ్ల బోధలవలన మోసపోకూడదు అని ఎంతో తగ్గించుకుని
వివరణ ఇచ్చుకుంటున్నారు! నిజానికి పౌలుగారిలో ఒక కాపరి ఒక తండ్రి హృదయం
ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి! నిజానికి పౌలుగారు కాపరులందరికీ ఎంతో ఆదర్శప్రాయుడు!!!
దైవాశీస్సులు!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*121వ భాగము*
2కొరింథీ 1:15—24
15. మరియు ఈ నమ్మికగలవాడనై మీకు రెండవ కృపావరము లభించునట్లు
మొదట మీయొద్దకు వచ్చి,
16. మీ యొద్దనుండి మాసిదోనియకు వెళ్లి మాసిదోనియ నుండి మరల
మీయొద్దకు వచ్చి, మీచేత యూదయకు సాగనంపబడవలెనని ఉద్దేశించితిని.
17. కావున నేనీలాగు ఉద్దేశించి చపలచిత్తుడనుగా
నడుచుకొంటినా? అవును అవునని చెప్పుచు, కాదు కాదనునట్టు ప్రవర్తింపవలెనని నా
యోచనలను శరీరానుసారముగా యోచించుచున్నానా?
18. దేవుడు నమ్మదగినవాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము
అవునని చెప్పి కాదనునట్టుగా ఉండలేదు.
19. మాచేత, అనగా నా చేతను సిల్వాను చేతను తిమోతి చేతను,
మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదనువాడైయుండలేదు
గాని ఆయన అవుననువాడై యున్నాడు.
20. దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు
అవునన్నట్టుగానే యున్నవి గనుక మనద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయనవలన
నిశ్చయములైయున్నవి (మూలభాషలో- ఆమేన్ అని యున్నవి) .
21. మీతో కూడ క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మును స్థిరపరచి
అభిషేకించినవాడు దేవుడే.
22.ఆయన మనకు ముద్రవేసి, మన హృదయములలో మనకు ఆత్మ అను
సంచకరువును అనుగ్రహించియున్నాడు.
23. మీయందు కనికరము (మూలభాషలో- ద్వారము తెరువబడియుండగా)
కలిగినందున నేను మరల కొరింథునకు రాలేదు. నా ప్రాణముతోడు ఇందుకు దేవునిని సాక్షిగా
పెట్టుచున్నాను.
24.
మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని యీలాగు చెప్పుటలేదు గాని మీ ఆనందమునకు
సహకారులమైయున్నాము; విశ్వాసము చేతనే మీరు నిలుకడగా ఉన్నారు.
ప్రియదైవజనమా! మనము రెండవ కొరింథీపత్రికను
ధ్యానం చేసుకుంటున్నాము!
(గతబాగం తరువాయి)
ప్రియులారా ఇక 17—20 లో మన మాటలు ఎలా ఉండాలి, మన చేతలు
ఎలా ఉండాలి అనేది రాస్తున్నారు! మనమాట అవునంటే అవునని, కాదంటే కాదు అనేలా ఉండాలి
గాని వస్తాను అని చెప్పి రాకపోవడం చెయ్యకూడదు, ఇస్తాను అంటే ఇచ్చెయ్యాలి అలా
ఉండాలి అంటున్నారు!
17వ వచనంలో నేను అవును అవునని చెప్పి కాదు కాదు అనిచెప్పే చపల చిత్తుడుగా
నడుచుకొన్నానా అంటున్నారు. నిజానికి దేవుడు నమ్మదగినవాడు కనుక మేము మీకు చెప్పిన
వాక్యము అవునని చెప్పి కాదు అన్నట్టుగా ఉండలేదు గాని మాచేత అనగా నాచేత మరియు
సిల్వాను అనగా సీలగారి చేత తిమోతి చేత మీలో ప్రకటించబడిన దేవుని కుమారుడైన
యేసుక్రీస్తు మరియు ఆయన యొక్క సువార్త
అవునని చెప్పి కాదు అని ఉండలేదు గాని ఆయన అనగా యేసుక్రీస్తు అవును అనువాడై ఉన్నాడు
అంటున్నారు!
ఇక్కడ ఆయన మాటలలో అబద్దికులు ఆయన మీద మోపిన ఆరోపణలు
వారు నమ్మారేమో అని పౌలుగారు సువార్త పక్షంగా కంగారుపడ్డారు. అందువల్ల ఆ
ఆరోపణలు నిజం కాదని ఘంటాపథంగా వారికి
చెప్తున్నారు. తన సందేశం, ఉపదేశం ఎప్పుడూ స్థిరమైనవే, ఖాయమైనవే, “అవును” అనేవే.
అతి ప్రాముఖ్యమైన ఆ విషయాల గురించి అతని మనసులో ఎలాంటి ఊగిసలాటలు, మార్పులు లేవు.
తాను ప్రకటించిన క్రీస్తులో కూడా ఎలాంటి మార్పులు, ఊగిసలాటలు లేవని అతడు గట్టిగా
చెప్పగలిగారు. దేవుడు చేసిన ప్రతి వాగ్దానాన్నీ ఆయన క్రీస్తులో నెరవేరుస్తాడు.
అందుకే అంటున్నారు 20వ వచనంలో దేవుని వాగ్దానాలు ఎన్నియైనను అన్నియు
క్రీస్తునందు అవును అన్నట్లుగానే ఉన్నాయి అందుకే మనద్వారా దేవునికి మహిమ కలుగుటకై
అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నాయి అంటున్నారు!
అలాగే మీతో కూడా క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మను స్థిరపరచినవాడు
అభిషేకించిన వాడు దేవుడే అంటున్నారు!
దేవుని సువార్త, దేవుని సత్యం విషయంలో విశ్వాసులంతా చలనం లేకుండా స్థిరంగా
ఉండాలని పౌలుగారికి బాగా తెలుసు
1కోరింథీయులకు 15: 58
కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు
వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు
ఎప్పటికిని ఆసక్తులునైయుండుడి.
1కోరింథీయులకు 16: 13
మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి,
పౌరుషముగలవారైయుండుడి, బలవంతులైయుండుడి;
దేవుడు మాత్రమే వారిని నిలకడగా స్థిరంగా ఉండేలా
చేయగలరు
రోమీయులకు 16: 25
సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగు నట్లు, అనాది
నుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్యదేవుని
ఆజ్ఞప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడియున్నది. ఈ మర్మమును
అనుసరించియున్న నా సువార్త ప్రకారము గాను,
రోమీయులకు 16: 26
యేసు క్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను, మిమ్మును
స్థిరపరచుటకు శక్తిమంతుడును
1పేతురు 5: 10
తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపా
నిధియగు దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట,తానే మిమ్మును పూర్ణులనుగా
చేసి స్థిరపరచి బలపరచును.
సరే,
ఇక్కడ పౌలుగారు నన్ను అభిషేకించి అనడం లేదు, “మనలను” అంటున్నారు. విశ్వాసులందరినీ
దేవుడు అభిషేకించారు –
1 యోహాను 2:20, 27.
20. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనుక
సమస్తమును ఎరుగుదురు.
27. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది
గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు; ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు;
అది అన్నిటిని గూర్చి మీకు భోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు భోధించిన
ప్రకారముగాను, ఆయనలో మీరు నిలుచుచున్నారు (నిలిచియుండుడి).
వారిని
తన ఆత్మతో అభిషేకించి ఇతర మనుషులకు వేరుగా, రాజులైన యాజక సమూహముగా చేశారు
ప్రకటన గ్రంథం 1: 6
మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను
విడిపించినవానికి (అనేక ప్రాచీనప్రతులలో- కడిగినవానికి అని పాఠాంతరము) మహిమయు
ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక
రాజ్యముగాను యాజకులనుగాను జేసెను.
ఇంకా
22వ వచనంలో ఆయన మనకు ముద్రవేసి మన హృదయాలలో మనకు తన ఆత్మ అను సంచకరువును
అనుగ్రహించి ఉన్నాడు అంటున్నారు!
ముద్ర ఏమిటి సంచకరువు ఏమిటి?
ముద్ర అనగా మనము ఆయన వారము అని మనకు
దేవుడు గుర్తు పెట్టడం –
ఎఫెసీయులకు 1: 13
మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని,
క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి.
ఎఫెసీయులకు 4: 30
దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచన దినమువరకు
ఆయనయందు మీరు ముద్రింపబడియున్నారు.
2థెస్సలొనికయులకు 2: 13
ప్రభువువలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును
పరిశుద్ధపరచుటవలనను, మీరు సత్యమును నమ్ముటవలనను, రక్షణపొందుటకు దేవుడు ఆదినుండి
మిమ్మును (ప్రథమ ఫలముగా అని కూర్చబడియున్నది) ఏర్పరచుకొనెను గనుక మేము
మిమ్మునుబట్టి యెల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప
బద్ధులమైయున్నాము.
ఈ ముద్ర దేవుని ఆత్మ. విశ్వాసులు దేవుని ప్రత్యేకమైన సొత్తుగా ఉన్నారని
ఆయన సన్నిధి సూచిస్తున్నది
1 Corinthians(మొదటి కొరింథీయులకు) 6:19,20
19. మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న
పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,
20. విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని
మహిమపరచుడి.
రోమీయులకు 8: 9
దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము
గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే
వాడాయనవాడు కాడు.
ఇక సంచకరువు ఏమిటి?
సంచకరువు అనగా మూడు అర్ధాలున్నాయి, నిజానికి ఆ మూడు కలిపితే సరియైన అర్ధం
వస్తుంది! హామీ, ఇంకా జామీను, ఇంకా డిపాజిట్! అనగా దేవుడు మనము ఆయన వారము అని తన
ఆత్మను మన హృదయాలలో హామీగా లేక జామీనుగా మన హృదయాలలో డిపాజిట్ చేశారు అని
అర్ధం! ప్రియులారా నాకు అర్ధమయ్యింది
మాత్రమే నేను చెబుతున్నాను!మరో అర్ధమున్నాదేమో నాకు తెలియదు!
2కోరింథీయులకు 5: 5
దీని నిమిత్తము మనలను సిద్ధపరచినవాడు దేవుడే;మరియు ఆయన తన
ఆత్మ అను సంచకరువును మనకనుగ్రహించియున్నాడు.
ఎఫెసు 1:14 కూడా చూసుకుందాం!
ఎఫెసీయులకు 1: 14
దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన (సొతైయిన
ప్రజలకు) ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా
ఉన్నాడు.
విశ్వాసులకు దేవుడు తన ఆత్మను ఇవ్వడం అంటే తాను వాగ్దానం
చేసిన వారసత్వాన్ని కూడా ఇస్తానని హామీ ఇవ్వడం
రోమా 8:16,17, 23;
16. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ
సాక్ష్యమిచ్చుచున్నాడు.
17. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము;
క్రీస్తుతో కూడ మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తుతోడి వారసులము.
23. అంతేకాదు, ఆత్మయొక్క ప్రథమ ఫలముల నొందిన మనముకూడ దత్త
పుత్రత్వముకొరకు, అనగా మన దేహము యొక్క విమోచనముకొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము
1పేతురు 1: 4
మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన
(జీవముగల) నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ
బారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు, ఆయన
తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసెను.
వారి
విముక్తికి లేక విడుదల కు దేవుడు వారికిచ్చిన జామీను పరిశుద్ధాత్మ అన్నమాట. దేవుని
ఆత్మ మనలో ఉన్నాడన్నది ఎంత ఖాయమో మనందరం కూడా ఎన్నడూ నశించమన్నదీ అంతే ఖాయం.
యోహాను
6:37-40; 10:27-29; 17:11-12; రోమ్ 5:9-10; 8:28-39.
John(యోహాను సువార్త) 10:27,28,29,30
27.నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును,
అవి నన్ను వెంబడించును.
28.నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను గనుక అవి
ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు.
29.వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటె గొప్పవాడు గనుక నా
తండ్రి చేతిలో నుండి యెవడును వాటిని అపహరింపలేడు;
30.నేనును తండ్రియును ఏకమైయున్నామని వారితో చెప్పెను.
Romans(రోమీయులకు) 5:9,10
9. కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి,
మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింపబడుదుము.
10. ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణము ద్వారా
మనము దేవునితో సమాధాన పరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి
నిశ్చయముగా రక్షింపబడుదుము.
Romans(రోమీయులకు) 8:28,29,30
28. దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున
పిలువబడిన వారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.
29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు,
దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని
ముందుగా నిర్ణయించెను.
30. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను;
ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో
వారిని మహిమ పరచెను.
కాబట్టి ఆయన మీద ఆనుకుందాం! మనము విన్నది మనము నేర్చుకున్న సువార్త
సత్యములోనే నిలకడగా ఉందాం!
ఇంకా నేటిరోజులలో అనేకమైన దుర్భోదలు వస్తున్నాయి!
🔹 యెహోవా సాక్షులు
🔹 మొర్మాన్స్
🔹 బ్రెన్హ మైట్స్
🔹 జాంగిల్ జా
🔹 సబ్బాత్ ఆచరించకపోతే పరలోకం లేదు.
🔹 సున్నతి లేకుండా గమ్యం లేదు.
🔹 శరీరంతో పాపం చేస్తే తప్పేమీలేదు. ఆత్మను పరిశుద్ధంగా
కాపాడుకోవాలి.
ఇట్లా లెక్కలేనన్ని దుర్భోధలు.
యేసుక్రీస్తు – సాయిబాబా అన్నదమ్ములు
అంటూ కొందరు,
ఏడువారాలు ఆరాధన అంటూ ఒకడు,
యేసుమాల అంటూ మరొకడు తయారయ్యాడు!
అల్లానే దేవుడు, యేసు దేవుడు కాదు అంటూ వారు బయలుదేరారు
ఇలాంటి అబద్దబోదల వైపు తిరుగకుండా సత్యమందు స్థిరంగా ఉందాం!
ఆమెన్!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*122వ భాగము*
2కొరింథీ 2:1—11
1. మరియు నేను దుఃఖముతో మీయొద్దకు తిరిగిరానని నామట్టుకు
నేను నిశ్చయించుకొంటిని.
2. నేను మిమ్మును దుఃఖపరచునెడల నాచేత దుఃఖపరచబడినవాడు తప్ప
మరి ఎవడు నన్ను సంతోషపరచును?
3. నేను వచ్చినప్పుడు ఎవరివలన నేను సంతోషము పొందతగినదో,
వారివలన నాకు దుఃఖము కలుగకుండవలెనని యీ సంగతి మీకు వ్రాసితిని. మరియు నా సంతోషము
మీ అందరి సంతోషమేయని మీ అందరియందు నమ్మకము కలిగి యీలాగు వ్రాసితిని.
4. మీకు దుఃఖము కలుగవలెనని కాదు గాని, మీయెడల నాకు
కలిగియున్న అత్యధికమైన ప్రేమను మీరు తెలిసికొనవలెనని, నిండు శ్రమతోను మనోవేదనతోను
ఎంతో కన్నీరు విడుచుచు మీకు వ్రాసితిని.
5. ఎవడైనను దుఃఖము కలుగజేసి యుండినయెడల, నాకు మాత్రము కాదు
కొంతమట్టుకు మీకందరికిని దుఃఖము కలుగజేసియున్నాడు. నేను విశేషభారము వాని మీద
మోపగోరక యీ మాట చెప్పుచున్నాను.
6. అట్టివానికి మీలో ఎక్కువమంది వలన కలిగిన యీ శిక్షయే
చాలును
7. గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది.
లేనియెడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును.
8. కావున వాని యెడల మీ ప్రేమను స్థిరపరచవలెనని మిమ్మును
బతిమాలుకొనుచున్నాను.
9. మీరన్ని విషయములందు విధేయులైయున్నారేమో అని మీ యోగ్యత
తెలిసికొనుటకే గదా పూర్వము వ్రాసితిని.
10. మీరు దేని గూర్చియైనను ఎవని క్షమించుచున్నారో నేనును
వానిని క్షమించుచున్నాను.
11. నేనేమైనను క్షమించియుంటే సాతాను మనలను మోస
పరచకుండునట్లు, మీ నిమిత్తము, క్రీస్తు సముఖమునందు క్షమించియున్నాను; సాతాను
తంత్రములను మనము ఎరుగనివారము కాము.
ప్రియదైవజనమా! మనము రెండవ కొరింథీపత్రికను
ధ్యానం చేసుకుంటున్నాము!
ప్రియులారా!
ఈ రెండవ అధ్యాయం కూడా మొదటి అధ్యాయంలో మొదలుపెట్టిన విషయమే చెబుతున్నారు- అనగా
తాను ఎందువలన కొరింథీ పట్టణం రెండోసారి రాలేకపోయారో దానికి వివరణ చెబుతున్నారు!
ప్రియులారా ఇక 1—7 వచనాలు చెబుతున్న
విషయం కోసం కొందరు ఇది 1కొరింథీ 5వ అధ్యాయంలో చెప్పిన విషయము కాదు అని అపోహపడతారు-
అనగా 5వ అధ్యాయంలో ఒకడు తన తండ్రి భార్య అనగా తన పిన్నితో పాపం చేస్తున్నాడు
అలాంటి వాడిని వెలివేయమని చెప్పారు కదా! వానికోసము కాదు, మొదటి పత్రిక కాకుండా
పౌలుగారు మరో ఉత్తరం రాశారు, ఆ ఉత్తరం
కొరింథీ సంఘాన్ని చాలా ఏడిపించింది అంటారు! నాకైతే అలా అనిపించడం లేదు! అయితే
పౌలుగారు ఒకవేళ వేరెవరి గురించో రాసి
ఉంటే ఆ వ్యక్తి పౌలుగారికి వ్యతిరేకంగా వ్యక్తిగతంగా ఏదో దోషం
చేసినట్టుంది. ఇక్కడున్న మాటలు దీన్ని సూచిస్తున్నాయి. ఎలా చూచినా ఇక్కడున్న పాఠం
మాత్రం ఒకటే. పాపం చేసిన ఒక మనిషి సంఘ క్రమశిక్షణకు లోబడి పశ్చాత్తాపపడితే అతణ్ణి
క్షమించి సహవాసంలో చేర్చుకోవాలి.
సరే, ఇప్పుడు మన పాఠానికి వచ్చేద్దాం!
మరియు నేను దుఃఖముతో మీ యొద్దకు తిరిగిరానని నా మట్టుకు నేను
నిశ్చయించుకొన్నాను అంటున్నారు- దేనివిషయమై దుఃఖము అంటే 2వ వచనం చూసుకుంటే నేను
మిమ్మును దుఃఖపరిస్తే నాచేత దుఃఖపరచబడినవాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును అని
అభిప్రాయపడుతున్నారు, కాబట్టి ఇది తప్పకుండా 1కొరింథీ పత్రికలో 5వ అధ్యాయంలో
చెప్పబడిన వ్యక్తియే అయి ఉండాలి! వాడు ఇప్పుడు తన తప్పు తెలుసుకున్నాడు కాబట్టి ఆ
పాపములో ఇక లేడు కాబట్టి ఇప్పుడు నేను వచ్చినా నాకు దుఃఖము కలుగదు, సంతోషం
కలుగుతుంది కారణం ఆ వ్యక్తి పశ్చాత్తాప పడి మరలా విశ్వాసం లోకి వచ్చాడు అని అతని
భావము!
నేను వచ్చినప్పుడు ఎవరివలన నేను సంతోషం పొందాలని అనుకున్నానో-
వారివలన నాకు దుఃఖము కలుగకూడదని ముందుగానే నేను మీకు ఉత్తరం రాశాను అంటున్నారు!
దీనికోసం గతంలో చూసుకున్నాము గనుక ముందుకు పోదాం! ఎప్పుడైతే పౌలుగారు రాసిన మొదటి
పత్రిక అందిందో సంఘము ఆవ్యక్తిని సంఘమునుండి వెలివేసింది. ఆ వ్యక్తి అప్పుడు
సిగ్గునొంది పశ్చాత్తాపపడి తన పిన్నితో పాపం చెయ్యడం మానేశాడు! మరియు బహిరంగంగా
తప్పును సంఘము ముందు ఒప్పుకుని ఆవ్యక్తి తన తప్పును తెలుసుకుని క్షమాపణ వేడుకుని
తిరిగి తనను సంఘంలో చేర్చుకోండి అని బ్రతిమాలాడు! ఈ విషయం పౌలుగారికి చెప్పారు!
దానికి జవాబుగానే ఈ మాటలు అని గ్రహించాలి!
6వ వచనంలో అట్టివానికి
మీలో ఎక్కువమంది వలన కలిగిన ఈ శిక్ష ఇక చాలు, ఇక మీరు శిక్షించుట మాని క్షమించి
ఆదరించండి అంటున్నారు! అలా చెయ్యకపోతే
అతడు ఇంకా మిక్కుటమైన దుఃఖములో మునిగిపోతాడు అంటున్నారు!
గమనించాలి:
ఇక్కడ శిక్ష అంటే సంఘ క్రమశిక్షణా చర్య అని అర్థం. వెలివేయడం, లేదా ఆ మనిషితో
సహవాసం మానుకోవడం, లేక అలాంటి పని ఏదైనా
1కోరింథీయులకు 5: 13
మీరు లోపటివారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని
మీలో నుండి వెలివేయుడి.
2 Thessalonians(రెండవ థెస్సలొనీకయులకు) 3:14,15
14. ఈ పత్రిక మూలముగా మేము చెప్పినమాటకు ఎవడైనను లోబడని
యెడల అతనిని కనిపెట్టి, అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి.
15. అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి
బుద్ధిచెప్పుడి.
నిజానికి సంఘ క్రమశిక్షణలోని ఉద్దేశం కేవలం శిక్షించడం మాత్రమే కాదు. పాపం
చేసే క్రైస్తవునిలో పశ్చాత్తాపం కలిగించాలనే. ఈ వచనాలను బట్టి ఆ మనిషి పశ్చాత్తాప
పడ్డాడని తన పాపం విషయం శోకిస్తున్నాడనీ అర్థం అవుతుంది. విశ్వాసులు దీనిని
గమనించి క్రమశిక్షణ చాలించి క్షమించడం, ఆదరించడం ఎప్పుడు మొదలు పెట్టాలో
తెలుసుకోగలిగిన వారై ఉండాలని పౌలుగారు చెప్తున్నారు. క్రమశిక్షణ, పశ్చాత్తాపం
లేకుండానే క్షమించి ఆదరించాలని అనడం లేదు పౌలుగారు. క్రైస్తవులు పాపం చేసేటప్పుడు
సంఘ నాయకులు అలాంటి వ్యక్తుల విషయంలో అతి సున్నితంగానూ మెత్తగానూ ప్రవర్తించకూడదు,
అతి కఠినంగానూ నిష్కర్షగానూ ప్రవర్తించకూడదు. క్రమశిక్షణ ఉండాలి, ప్రేమ కూడా
ఉండాలి.
ఇక 10వ వచనంలో అంటున్నారు: మీరు దేనిగూర్చి ఎవరినైనా క్షమిస్తారో నేనును
వానిని క్షమిస్తున్నాను అంటున్నారు! అనగా తన మనస్సు వారితో కలిసిమెలిసి ఉంది అని
చెబుతున్నారు! వారి ఉద్దేశాలతో తను ఏకీభవిస్తున్నారు ఇక్కడ!! తనకు ఆ మనిషి
వ్యక్తిగతంగా చేసినదానికి పౌలుగారు
ఇంతకుముందే అతణ్ణి క్షమించేశారు. ఇప్పుడా మనిషి పశ్చాత్తాపపడ్డాడు కాబట్టి
అతని పాపాన్ని తేలికగా తీసుకోవడానికి పౌలుగారు ఇష్టపడుతున్నారు. అయితే కొంతమంది
ఏమంటారు అంటే 1 కొరింతు 5:1-5లో ఉన్న
మనిషిని గురించి పౌలుగారు ఇక్కడ
రాస్తున్నాడనుకుంటే ఇలా మాట్లాడడం అసాధ్యం. అది చిన్న విషయం కాదు. పౌలుగారు దాన్నెప్పుడూ అలా పరిగణించేవాడు కాదు అంటారు.
కానీ వ్యక్తిగతంగా తనకెవరైనా కీడు చేస్తే వారిని సంతోషంగా పౌలుగారు క్షమించగలరు
అంటారు.
ఏదిఏమైనా క్షమాపణ గురించి బైబిల్ ఏమి చెబుతుంది అంటే:
మత్తయి 6:12, 14, 15;
12. మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు
క్షమించుము.
14. మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు
తండ్రియు మీ అపరాధములను క్షమించును.
15. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయినయెడల మీ
తండ్రియు మీ అపరాధములను క్షమింపడు.
18:21-35;
21. ఆ సమయమున పేతురు ఆయనయొద్దకు వచ్చి ప్రభువా, నా సహోదరుడు
నాయెడల తప్పిదము చేసిన యెడల నేనెన్నిమారులు అతని క్షమింపవలెను? ఏడు మారులమట్టుకా?
అని అడిగెను.
22. అందుకు యేసు అతనితో ఇట్లనెను ఏడుమారులు మట్టుకే కాదు,
డెబ్బది ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను.
26. కాబట్టి ఆ దాసుడు అతని యెదుట సాగిలపడి మ్రొక్కినాయెడల
ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా
27. ఆ దాసుని యజమానుడు కనికరపడి, వానిని విడిచిపెట్టి, వాని
అప్పు క్షమించెను.
28.అయితే ఆ దాసుడు బయటకు వెళ్లి తనకు నూరు దేనారములు (ఒక
దేనారము ఇంచుమించు అర రూపాయి కావచ్చును) అచ్చియున్న తన తోడిదాసులలో ఒకనినిచూచి,
వాని గొంతుపట్టుకొనినీవు అచ్చియున్నది చెల్లింపు మనెను
29. అందుకు వాని తోడిదాసుడు సాగిలపడినా యెడల ఓర్చుకొనుము,
నీకు చెల్లించెదనని వానిని వేడుకొనెను గాని
30. వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించువరకు వానిని
చెరసాలలో వేయించెను.
33. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని
కరుణింపవలసియుండెను గదా అని వానితో చెప్పెను.
ఎఫెసు 4:32;
ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు
మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.
కొలస్సయి 3:13
ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనిన యెడల ఒకనినొకడు
సహించుచు ఒకనినొకడు క్షమించుడి, ప్రభువు (క్రీస్తు)మిమ్మును క్షమించినలాగున మీరును
క్షమించుడి.
కాబట్టి పౌలుగారికి క్రీస్తు దృష్టి తనపై
ఉన్నదనీ, తాను ఇతరులను క్షమించిన దానికంటే మరెన్నో రెట్లు ఆయన తనను క్షమించాడనీ
పౌలుగారికి తెలుసు.
ఇక 4వ వచనంలో అంటున్నారు మీకు దుఃఖము
కలగాలని నేను మొదట పత్రికలో అలా రాయలేదు గాని మీ యెడల నాకు కలిగిన అత్యధికమైన
ప్రేమను మీరు తెలుసుకోవాలని నిండు శ్రమతోనూ మనోవేదన తోనూ ఎంతో కన్నీరుతోను ఆ మొదటి
ఉత్తరం రాశాను అంటున్నారు! ఇక్కడ మరోసారి పౌలుగారి మాటలలో ఒక కాపరి హృదయం, తండ్రి
మనస్సు కనిపిస్తుంది! బిడ్డలు తప్పుచేసినప్పుడు తండ్రిగా క్రమశిక్షణలో పెట్టారు!
ఎప్పుడైతే పశ్చాత్తాపపడ్డాడో కన్నీరు కార్చుతున్నాడో వెంటనే తిరిగి తన దగ్గరికి
తీసుకుని ఓదార్చుతున్నారు ఇక్కడ ఒక తండ్రిలా, వారి ఆత్మీయతండ్రి!! ప్రతీ సంఘకాపరి ఈ విషయం పౌలుగారి దగ్గరనుండి
నేర్చుకోవాలి!!!
చూడండి 8వ వచనంలో అంటున్నారు: కావున
వానియెడల మీ ప్రేమను స్థిరపరచవలెనని మిమ్మును బ్రతిమిలాడుతున్నాను అంటున్నారు! ఆ
దుర్మార్గున్ని వెలివేయమని మొదటి పత్రికలో అంత కోపంగా చెప్పిన పౌలుగారు ఇప్పుడు
ఎంతో క్షమాగుణంతో ప్రేమతో అంటున్నారు- నేను వ్రాసిన పత్రిక వలన అతనిని వెలివేశారు
కాబట్టి ఇప్పుడు దయచేసి ఆ వ్యక్తిని క్షమించండి అంటూ బ్రతిమాలుతున్నారు! పౌలుగారు
వారికి ఆజ్ఞాపించే స్థితిలో ఉన్నా గాని ఎల్లప్పుడూ తన మాటల్లోనూ చేతలలోను మాదిరి
చూపుతున్నారు!
9వ వచనంలో మీరు అన్ని విషయాలలోనూ
విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకొనుటకే కదా పూర్వము వ్రాశాను అంటున్నారు!
ఇక్కడ విధేయులు అనగా తనకు విధేయులై ఉండాలని కాదు పౌలుగారి ఉద్దేశం (1:24), తనద్వారా వచ్చిన ప్రభువు
ఇచ్చిన ఆదేశాలకు విధేయత చూపాలంటున్నారు. ఈ
రెంటి మధ్య చాలా తేడా ఉంది.
ఇక 11వ వచనంలో మరో విషయం చెబుతున్నారు: నేను ఎందుకు క్షమించాను అంటే
సాతాను మనలను మోసపరచకూడదు అనియు, మీ నిమిత్తము క్రీస్తు సముఖంలో క్షమించాను
అంటున్నారు! మనము సాతాను తంత్రములను ఎరుగని వారము కాదు అంటున్నారు! నేను క్రీస్తు
సమక్షంలో క్షమించాను అంటూ సాతాను పన్నాగాలు అంటున్నారు. సైతాను ఉద్దేశమేమంటే
విశ్వాసుల జీవితాలు పాడుచేయడం, సంఘాలను కూలద్రోయడం, క్రీస్తును అపకీర్తి పాలు
చేయడమే. దీన్ని సాధించేందుకు అతడికెన్నో తంత్రాలు ఉన్నాయి. క్రైస్తవులచేత పాపం
చేయించడానికీ, క్షమాపణ ఉండదని వారికి నిరాశ కలిగించడానికి వాడు ప్రయత్నం చేస్తాడు.
లేదా, అలాంటివారు వారు పశ్చాత్తాపపడక పోయినా సంఘం వారిని స్వీకరించేలా
చేయజూస్తాడు. సంఘ సభ్యుల్లో ఒకరు, లేక ఎక్కువమంది మూలంగా సంఘంలోని శాంతిని,
ఐకమత్యాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తాడు. సంఘ నాయకులను పాపాన్ని అంతగా
పట్టించుకోనివారుగా అయినా చేస్తాడు, లేక పాపం చేసినవారితో అతి కఠినంగా వ్యవహరించేలా
అయినా చేస్తాడు.
అందుకే సాతానుకి అవకాశం ఇవ్వకుండా ఎప్పుడు క్రమశిక్షణ కావాలో అప్పుడు
క్రమశిక్షణ, గద్దించి బుద్ధి చెబుతూ ఉండాలి - ఎప్పుడు క్షమించాలో అప్పుడు క్షమాపణ
ఉండాలని ప్రతీ సంఘము సంఘ కమిటీ మరియు సంఘకాపరీ దీనిని బట్టి తెలుసుకోవాలి!
దైవాశీస్సులు!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*123వ భాగము*
2కొరింథీ 2:12--17
12. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చి
నప్పుడు, ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించియుండగా (మూలభాషలో- ద్వారము
తెరువబడియుండగా) సహోదరుడైన తీతు నాకు కనబడనందున
13. నా మనస్సులో నెమ్మది లేక వారియొద్ద సెలవు తీసికొని
అక్కడనుండి మాసిదోనియకు బయలుదేరితిని.
14. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము
యొక్క సువాసనను కనుపరచుచు ఆయనయందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న
దేవునికి స్తోత్రము.
15. రక్షింపబడువారిపట్లను నశించువారిపట్లను మేము దేవునికి
క్రీస్తు సువాసనయైయున్నాము.
16. నశించువారికి మరణార్థమైన మరణపు వాసనగాను
రక్షింపబడువారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము.
17. కావున ఇట్టి సంగతులకు చాలినవాడెవడు? మేము దేవుని
వాక్యమును కలిపి చెరిపెడు అనేకులవలె ఉండక, నిష్కాపట్యముగలవారమును దేవునివలన
నియమింపబడిన వారమునైయుండి, క్రీస్తునందు దేవునియెదుట బోధించు చున్నాము.
ప్రియదైవజనమా! మనము రెండవ కొరింథీపత్రికను
ధ్యానం చేసుకుంటున్నాము!
ఇక 12—17 వచనాలు చూసుకుంటే:
క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు
ప్రభువునందు నాకు మంచి సమయం ప్రాప్తించియుండగా సహోదరుడైన తీతు నాకు కనబడబందున నా
మనస్సులో నెమ్మది లేక వారియొద్ద సెలవు తీసుకుని అక్కడనుండి మాసిదోనియా బయలుదేరాను
అంటున్నారు!
తీతు రాకపోవడానికి, పౌలుగారి మనస్సులో నెమ్మది లేకపోవడానికి,
కొరింథీయులకు మధ్య సంబంధం ఏమిటి?
పౌలుగారు తీతును పై విషయాలు సరిదిద్దడానికి పౌలుగారి
పక్షముగా కొరింథీ సంఘానికి పంపించారు! కారణం తీతుగారు మంచి విద్వాంసుడు!
దేవునియందు భయభక్తులు కలిగిన వాడై సమస్తము విడిచిపెట్టి తిమోతి గారిలా పౌలుగారి
సువార్త దండయాత్రలో తనతోపాటుగా తిరుగుతున్నాడు! కాబట్టి అతనిని కొరింథీ పంపారు
(7:6-7). అతణ్ణి త్రోయ రేవు దగ్గర కలుసుకోవాలని ఏర్పాటు చేసుకున్నారు. గాని తీతు రాకపోయేసరికి కొరింథీలో ఉన్న పరిస్థితుల
గురించి పౌలుగారికున్న ఆందోళన అలానే ఉండి పోయింది. పరిస్తితులు చక్కబడ్డాయా లేక ఇంకా విషమించాయా
అని పౌలుగారికి ఆందోళన కలిగి త్రోయలో వాక్య పరిచర్యకు మంచి ద్వారం తెరువబడినా
అక్కడ సువార్త ప్రకటించలేకపోయాను అంటున్నారు! కొరింథీవారిపట్ల అతనికున్న ప్రేమ
ఎలాంటిదో దీనిని బట్టి అర్ధమవుతుంది (వ 4). తన ఉత్తరాలకు సరైన రీతిలో వారు
స్పందించాలని ఆశగా ఎదురు చూశారు ఆయన.
ఇక
14వ వచనం నుండి చూసుకుంటే మా ద్వారా ప్రతి స్థలములో క్రీస్తును గూర్చిన జ్ఞానము
యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో
ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక అంటున్నారు! 15వ వచనంలో రక్షించబడువారి
పట్ల ఇంకా నశించు వారిపట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము అంటున్నారు.
క్రీస్తును
గూర్చిన జ్ఞానము అనగా మనం ఈ జ్ఞానము కోసం మొదటి పత్రికలో విస్తారంగా ధ్యానం
చేసుకున్నాము! ఈ జ్ఞానము భౌతిక మైనది, లోకానికి చెందినది కాదు గాని పరలోక సంబంధమైన
ఆధ్యాత్మిక మైనది. ఇది లోకస్తులకు నశించుచున్న వారికి వెఱ్రితనముగా కనిపిస్తుంది
గాని రక్షించబడుచున్న మనకు దేవునిశక్తి అని విస్తారంగా ధ్యానం చేసుకున్నాము!
సంఘాల్లో
సమస్యలున్నా, లోకంలో హింస కలిగినా, దేవుడు తన సేవకులకు విజయం వెంట విజయం ఇస్తారు.
రోమీయులకు 8: 37
అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో
అత్యధిక విజయము పొందుచున్నాము.
“క్రీస్తులో”, “ఎల్లప్పుడూ” అనే మాటలను గమనించండి. ఆయనకు వేరుగా మన
ప్రయత్నాలేవీ విజయవంతం కావు. ఎప్పటికీ కావు. ఏదో కొంత విజయం, సఫలత కనిపించినా అది
లోక సంబంధమైన విజయం, సఫలతే. గాని క్రీస్తులో ఉంటే ఎల్లప్పుడూ మనకు విజయమే
విజయోత్సవమే!! అందుకే దేవునికి స్తోత్రము అంటున్నారు పౌలుగారు!
ఇక 14,15 వచనాలలో క్రీస్తు సువాసన అనే మాట మనకు కనిపిస్తుంది!
క్రీస్తును గురించిన జ్ఞానం హృదయానికి పరిమళం లాగా ఉంది. పౌలుగారు అతని కలిసి వెళ్ళిన వారికి వెళ్ళిన ప్రతి చోటా ఈ పరిమళాన్ని
వ్యాపింపజేశారు. మనం చేస్తున్నామా?
“క్రీస్తు పరిమళం లేక సువాసన ” అనగా – పాపవిముక్తి
ఉన్నవారికీ లేనివారికి కూడా క్రీస్తు సేవకులు క్రీస్తును గురించిన జ్ఞానాన్ని
వ్యాపింపజేశారు. ఈ విధంగా వారు దేవునికి సువాసనగా అయ్యారు. తన బట్టలకు లేక ఒంటికి
అత్తరు/సెంటు రాసుకున్న వ్యక్తి ఎక్కడికి
వెళ్ళినా ఆ పరిమళం వ్యాపిస్తుంది. క్రీస్తు ఒక వ్యక్తిలో నివసిస్తూ ఉంటే, అతడు
క్రీస్తును గురించి మాట్లాడుతూ, క్రీస్తు సువార్త ప్రకటిస్తూ ఉంటే క్రీస్తు పరిమళాన్ని
వ్యాపింపజేస్తాడు. విశ్వాసులు ఎప్పుడూ పాపం కంపు, లోకం కంపు కొట్టుకుంటూ
తిరగకూడదు. అలా తిరగనవసరం లేదు. ఈ విషయాన్ని గమనించి ఎల్లప్పుడూ మనము అవకాశం
దొరికినప్పుడు ఇంకా అవకాశం లేకపోతే కల్పించుకుని క్రీస్తు సువార్త ప్రకటిస్తూ ఆ
సువాసన మన బ్రతుకుల ద్వారా ప్రవర్తన ద్వారా వెదజల్లాలి!
ఇక 16వ వచనంలో ఆ సువాసన ఎలాంటిదో చెబుతున్నారు: నశించుచున్న వారికి
మనము మరణార్ధమైన మరణపు వాసనగాను రక్షించబడువారికి జీవార్ధమైన జీవపు వాసనగాను
ఉన్నాము అంటున్నారు!
దేవుని సేవకులు ఆయన సువార్తను బోధిస్తే దాన్ని నమ్మినవారికి
దానివల్ల జీవం ప్రాప్తిస్తుంది. తిరస్కరించినవారికి మరణం ప్రాప్తిస్తుంది. మార్కు
16:15,16;
15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను
ప్రకటించుడి.
16. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని
వానికి శిక్ష విధింపబడును.
యోహాను 3: 36
కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు,
కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచి
యుండును.
కాబట్టి క్రీస్తుయేసుని నమ్మడానికి
తిరస్కరించేవారికి క్రీస్తు సువార్త భయానకమైన మరణ వాసనగా ఉంది. నమ్మేవారికి మాత్రం
శాశ్వత జీవ పరిమళంగా ఉంది.
ఇక
17వ వచనంలో కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి
చెరిపెడి అనేకులవలే ఉండక , నిష్కాపట్యముగలవారమును దేవుని వలన నియమించబడిన వారమునై
ఉండి, క్రీస్తునందు దేవునియందు బోధించుచున్నాము అంటున్నారు!
చాలినవాడు
అనగా – క్రీస్తును గురించిన
జ్ఞానాన్ని వ్యాపింపజేసేందుకు ఎవరూ కూడా స్వభావ సిద్ధంగా సమర్థుడు కాదు అని అర్ధం.
కానీ 3:5-6 చూడండి.
2 Corinthians(రెండవ కొరింథీయులకు) 3:5,6
5. మావలన ఏదైన అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే
సమర్థులమని కాదు; మా సామర్థ్యము దేవుని వలననే కలిగియున్నది.
6.ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు
గాని ఆత్మకే పరి చారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడు. అక్షరము
చంపునుగాని ఆత్మ జీవింపచేయును.
ఇంకా
కొందరు క్రీస్తు సేవకులమని చెప్పుకుంటూ
అందువల్ల తమకు ఏం లాభము దొరుకుతుందా అని చూస్తూ ఉండే వ్యక్తులున్నారని
పౌలుగారికి తెలుసు.
వారికోసమే
చెబుతున్నారు! వారు తన అపోస్తలత్వమును సవాలుచేస్తున్నారు ఇంకా తాము ప్రకటించిన
నిజమైన సిలువసువార్తను నిజమైనది కాదు అని చెబుతూ దొంగబోధలు చేస్తూ తమ
పొట్టపోషించుకుంటూ దేవుని వాక్యమును కలిపిచెరుపుతున్నారు!
1తిమోతికి 6: 5
చెడిపోయిన మనస్సుకలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకొను
మనుష్యుల వ్యర్థవివాదములును కలుగుచున్నవి.
యోహాను 12:4-6;
4. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనైయున్న
ఇస్కరియోతు యూదా
5.యీ అత్తరెందుకు మూడు వందల దేనారములకు (ఇది ఇంచుమించు 150
రూపాయలు కావచ్చును) అమ్మి బీదలకు ఇయ్యలేదనెను.
6. వాడీలాగు చెప్పినది బీదల మీద శ్రధ్ధకలిగి కాదుగాని వాడు
దొంగయై యుండి, తన దగ్గర డబ్బు సంచియుండినందున అందులో వేయబడినది దొంగిలించుచు
వచ్చెను గనుక ఆలాగు చెప్పెను.
2పేతురు 2: 15
తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన
మార్గమునుబట్టి త్రోవ తప్పిపోయిరి.
2పేతురు 2: 16
ఆ బిలాము దుర్నీతివలన కలుగు బహు మానమును ప్రేమించెను; అయితే
తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను, ఎట్లనగా నోరులేని గార్దభము
మానవస్వరముతో మాటలాడి ఆ ప్రవక్తయొక్క వెఱ్ఱితనము అడ్డగించెను.
అందుకే
తమయొక్క నిజాయితీని 1:12, 18, 19 వచనాలలో
చెప్పారు!
ఇక
ఈ వచనంలో దేవుని చేత నియమించబడినవారము అంటున్నారు దీని అసలు అర్ధము దేవునిచేత
పంపబడినవారము అని అర్ధము! అనగా దేవుని అపోస్తలులము అంటున్నారు! అపోస్తలుడు అనగా
దేవుని చేత పంపబడిన వాడు అని గతభాగాలలో చూసుకున్నాము!
దేవుని
సేవకులలో ప్రతి ఒక్కరి విషయంలోనూ ఇది నిజం కావాలి. అలా కాకపోతే అతడు దేవుని
సేవకుడే కాదు.
మనము
కూడా దేవునిచేత ఏర్పరచబడిన వారము, ఆయన సువార్తను ప్రకటించడానికి, రక్షించబడిన
ప్రతీ వ్యక్తికీ మార్కు 16:15—18 ప్రకారం దేవుని చివరి ఆజ్ఞద్వారా పిలుపునిచ్చారు!
కాబట్టి ఆ సిలువసువార్త ప్రకటిస్తూ మన జీవితాలలో ఆ క్రీస్తు సువాసనను వెదజల్లుతూ
లోకములో జ్యోతులవలే ప్రకాశిద్దాం!
ఆమెన్!
దైవాశీస్సులు!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*124వ భాగము*
2 కొరింథీ 3:1—5
1. మమ్మును మేమే
తిరిగి మెప్పించుకొన మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీయొద్దకైనను మీ
యొద్దనుండియైనను సిఫారసు పత్రికలు మాకు అవసరమా?
2. మా హృదయములమీద వ్రాయబడియుండి, మనుష్యులందరు తెలిసికొనుచు
చదువుకొనుచున్న మా పత్రిక మీరేకారా?
3. రాతిపలకమీదగాని సిరాతోగాని వ్రాయబడక, మెత్తని హృదయములు
అను పలకలమీద జీవముగల దేవుని ఆత్మతో, మా పరిచర్యమూలముగా వ్రాయబడిన క్రీస్తు
పత్రికయై యున్నారని మీరు తేటపరచబడుచున్నారు.
4. క్రీస్తుద్వారా దేవునియెడల మాకిట్టి నమ్మకము కలదు.
5. మావలన ఏదైన అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులమని
కాదు; మా సామర్థ్యము దేవుని వలననే కలిగియున్నది.
ప్రియులారా! మనం 2 వ కొరింథీ
పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!!
ఇక
మూడవ అధ్యాయం నుండి పౌలుగారు తన అపొస్తలత్వమును కొరింథీ ప్రజలతో నిర్ధారించు
కొంటున్నారు! మొదటి వచనం చూసుకుంటే మమ్మును మేమే తిరిగి మెప్పించుకొన
మొదలుపెట్టుచున్నామా అంటున్నారు, ఇంకా కొందరికి కావాలసినట్లు మీ యొద్దనుండి గాని
మీ యొద్దకు గాని సిఫారసు పత్రికలు మాకు అవసరమా అంటున్నారు! ఈ రెండు ప్రశ్నలకూ
“కాదు” అనేదే జవాబు. కొన్ని సందర్భాల్లో సిఫారసు లేఖలు అనవసరమని పౌలుగారు చెప్పడం లేదు. పౌలుగారు స్వయంగా కొన్నిసార్లు కొందరి విషయం సిఫారసు
చేశారు (2 కోరింథీయులకు 8:16-24; రోమీయులకు 16:1-2; 1 కోరింథీయులకు 16:3, 1
కోరింథీయులకు 16:10-11). అయితే తనకోసం అలాంటిదేమీ అవసరం లేదని ఇక్కడ అంటున్నారు.
దానికి కారణం మనకు 2-3 వచనాలలో కనిపిస్తుంది మనకు!
2. మా హృదయములమీద వ్రాయబడియుండి, మనుష్యులందరు తెలిసికొనుచు
చదువుకొనుచున్న మా పత్రిక మీరేకారా?
3. రాతిపలకమీదగాని సిరాతోగాని వ్రాయబడక, మెత్తని హృదయములు
అను పలకలమీద జీవముగల దేవుని ఆత్మతో, మా పరిచర్యమూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయై
యున్నారని మీరు తేటపరచబడుచున్నారు.
ఇలా
వ్రాయడానికి కారణం పౌలుగారు అక్కడ చేసిన పరిచర్యయే కారణం. కారణం అక్కడ పౌలుగారు
మరియు సీలగారు తిమోతి గారు తమ చేతులతో తాము కష్టపడుతూ వారికి సువార్త ప్రకటించారు.
కొరింథీ వారు ఇచ్చే కానుకలతో తమ జీవనోపాధి సాగించలేదు! ఇంకా వారి యొక్క సచ్ఛీలత
లేక మంచి ప్రవర్తన కొరింథీ వారిమీద ఎంతో ప్రభావం చూపింది!! అందుకే కొరింథీ
విశ్వాసులే పౌలుగారికి సిఫారసు లేఖల వంటివారు. వారిని లేఖలుగా పోల్చి ఈ విషయాలను
చెప్తున్నారు: వారు పౌలుగారి హృదయంపై,
అతని తోటి సేవకుల హృదయాలపై రాసిన లేఖల వంటివారు (అంటే పౌలుగారు , ఇతర సేవకులు
కొరింథీ విశ్వాసుల్లో జరిగిన దేవుని పనిని గుర్తించి వారిని అతి ప్రియంగా ఎంచారు – 2 కోరింథీయులకు 7:3); వారు
పౌలుగారి హృదయంలో దాగి ఉన్న రహస్య లేఖ
వంటివారు కారు గాని ఎవరైనా చదవగలిగిన బహిరంగ లేఖ (అంటే పౌలుగారు పరిచర్య ద్వారా
వారిలో కలిగిన మార్పు వారిని చూచే వారందరికీ కనిపిస్తుందన్నమాట); వారు “క్రీస్తు
రాయించిన” లేఖ (అంటే కొరింథీ విశ్వాసుల్లో ఆ మార్పు కలిగించినది క్రీస్తు సంకల్పం,
క్రీస్తు సందేశమే); వారు, పౌలుగారు మరియు అతని తోటి సేవకులు రాసిన లేఖ కూడా (ఈ పనిలో
క్రీస్తు వారిని వాడుకున్నారు); వారి ఆధ్యాత్మిక జీవానికి మూలాధారం దేవుని ఆత్మ
(యోహాను 3:5-8 చూడండి);
ఇలా
రాసిన రాత వారి హృదయాలపై ఉంది (అంటే వారిలోని మార్పు కేవలం బాహ్యంగానే కాదు, వారి
అంతరంగాల్లో జరిగింది – 2 కోరింథీయులకు 5:17).
ఇక రాతి పలకలు అనడానికి కారణం దేవుడు తన పది
ఆజ్ఞలను రాతి పలకలపై దేవుడు ధర్మశాస్త్రాన్ని రాసిన సందర్భానికి పౌలుగారు దీనంతటినీ పోలుస్తున్నారు. నిర్గమకాండము 31:18;
నిర్గమకాండము 32:15-16 చూడండి. యిర్మియా 31:33-34; హెబ్రీయులకు 8:10-12 చూడండి.
ఇప్పుడు కూడా “లేఖలు” రాయడానికి దేవునితో కలిసి ఆయన సేవకులు పని చేస్తున్నారు. ఈ
లేఖలంటే క్రీస్తు సువార్త మూలంగా లోతైన, శాశ్వతమైన మార్పు నొందినవారు. ఇలాంటి పని
కన్నా ఈ భూమిపై మరింత ఘనమైన ఆధిక్యత లేదుకదా!
నిర్గమకాండము 24:12,
12.అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెనునీవు కొండయెక్కి నాయొద్దకు
వచ్చి అచ్చటనుండుము; నీవు వారికి బోధించునట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను,
ధర్మశాస్త్రమును, రాతిపలకలను నీకిచ్చెదననగా
13.మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని
కొండమీదికి ఎక్కెను.
నిర్గమకాండము 31: 18
మరియు ఆయన సీనాయి కొండమీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత
ఆయన తన శాసన ములుగల రెండు పలకలను, అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను
అతనికిచ్చెను.
నిర్గమకాండము 34: 1
మరియు యెహోవా మోషేతోమొదటి పలకల వంటి మరి రెండు రాతిపలకలను
చెక్కుము. నీవు పగుల గొట్టిన మొదటి పలకలమీదనున్న వాక్యములను నేను ఈ పలకలమీద
వ్రాసెదను.
ద్వితీయోపదేశకాండము 9:10-11,
10. అప్పుడు దేవుని వ్రేలితో వ్రాయబడిన రెండు రాతి పలకలను
యెహోవా నాకప్పగించెను. మీరు కూడివచ్చిన దినమున ఆ కొండమీద అగ్ని మధ్యనుండి యెహోవా
మీతో పలికిన వాక్యములన్నియు వాటిమీద ఉండెను.
11. ఆ నలువది పగళ్లు నలువది రాత్రులు గడచినప్పుడు యెహోవా
నిబంధన సంబంధమైన పలకలైన ఆ రెండు రాతిపలకలను నాకప్పగించి
సామెతలు 3: 3
దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనియ్య కుము వాటిని
కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము.
సామెతలు 7: 3
నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము నీ హృదయమను పలకమీద వాటిని
వ్రాసికొనుము
ఇక 3—9 వచనాలలో పాత
నిబంధనకు క్రొత్త నిబంధనకు గల తేడాలు చెబుతున్నారు!
పాతనిబంధన మరణాన్ని తెచ్చిన పరిచర్య (వ 6,7); కొత్త
నిబంధన జీవాన్ని తెచ్చింది (వ 6)
పాతనిబంధన రాతి పలకలపై రాయడం జరిగింది (నిర్గమకాండము
31:18) కొత్తనిబంధన మనుషుల హృదయాలపై
రాయబడింది (వ 3)
పాతనిబంధన మనుషులను నేరస్థులుగా తీర్చే పరిచర్య,
కొత్తనిబంధన వారిని నిర్దోషులుగా తీర్చేది
(వ 9; రోమీయులకు 3:19-24)
పాతనిబంధన గతించిపోతూ
ఉంది (వ 11; హెబ్రీయులకు 8:13) కొత్తనిబంధన శాశ్వతం (వ 11)
ఒక్క మాటలో చెప్పాలంటే పాతనిబంధన మనుషుల హృదయాలను మార్చలేని
ఆజ్ఞల్లో, శాసనాల్లో ఉంది (నిర్గమకాండము 19:5-6 నోట్); కొత్తనిబంధన మనుషులను
కొత్తవారుగా అనగా నూతన జన్మగా చేసే దేవుని ఆత్మ పరిచర్యను తెచ్చేది (వ 3,6,8)
కాబట్టి పాతదానికి కొంత మహిమ ఉన్నప్పటికీ, కొత్తదానికి మరెంతో
ఎక్కువ మహిమ ఉంది (వ 8-11)
మోషే ధర్మశాస్త్రాన్ని
పాటించాలని చెప్తూ కొందరు కొరింతులోని క్రైస్తవులను కలవర పెడుతున్నారు . అపో.
కార్యములు 15:1-2 వారు ఉపదేశిస్తున్న
ధర్మశాస్త్రం కంటే తాను ఉపదేశిస్తున్న సువార్త ఎంత గొప్పదో పౌలు కొరింథీవారికి
చూపిస్తున్నారు.
Acts(అపొస్తలుల కార్యములు) 15:1,2
1. కొందరు యూదయనుండి వచ్చిమీరు మోషేనియమించిన ఆచారము
చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి.
2. పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును
కలిగినప్పుడు, ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరి కొందరును యెరూషలేమునకు
అపొస్తలులయొద్దకును పెద్దలయొద్దకును వెళ్లవలెనని సహోదరులు నిశ్చయించిరి.
ఇక
4 వ వచనంలో అంటున్నారు: క్రీస్తుద్వారా దేవునియెడల మాకిట్టి నమ్మకము కలదు.
ఇలా
అనడానికి కారణం వారు చేసిన నిస్వార్ధ పరిచర్య!! పైన వర్ణించినట్లుగా దేవునిపనిలో
దేవుడు తనను వాడుకుంటున్నారు అనడంలో పౌలుగారికి
ఏ సందేహమూ లేదు. క్రీస్తే స్వయంగా అతనికి ఈ నిశ్చయత ఇచ్చారు .
చూశారా పౌలుగారి త్రయం ఎంతటి ఘనమైన సేవచేశారో!!
ప్రతీ దైవజనుడు ఇలాంటి ఘనమైన సేవచేయాలి ! అలాంటి నిశ్చయతను దేవుని నుండి
పొందుకోవాలి!
అట్టి
కృప దేవుడు ప్రతీ దైవజనునికి దయచేయును గాక!
దైవాశీస్సులు!!!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*125వ భాగము*
2 కొరింథీ 3:1—5
5. మావలన ఏదైన అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే
సమర్థులమని కాదు; మా సామర్థ్యము దేవుని వలననే కలిగియున్నది.
6. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు
గాని ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడు. అక్షరము
చంపునుగాని ఆత్మ జీవింపచేయును.
7. మరణ కారణమగు పరిచర్య, రాళ్లమీద చెక్కబడిన అక్షరములకు
సంబంధించినదైనను, మహి మతో కూడినదాయెను. అందుకే మోషే ముఖముమీద ప్రకాశించుచుండిన ఆ
మహిమ తగ్గిపోవునదైనను,ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరిచూడలేక పోయిరి.
8. ఇట్లుండగా ఆత్మసంబంధ మైన పరిచర్య యెంత మహిమగలదై యుండును?
9. శిక్షా విధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి
కారణమైన పరిచర్య యెంతో అధికమైన మహిమ కల దగును.
10. అత్యధికమైన మహిమ దీనికుండుటవలన ఇంతకు మునుపు మహిమ
కలదిగా చేయబడినది యీ విషయములో మహిమలేనిదాయెను.
11. తగ్గిపోవునదే మహిమగలదై యుండినయెడల,నిలుచునది మరి
యెక్కువ మహిమగలదై యుండును గదా.
12. తగ్గిపోవుచున్న మహిమయొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరిచూడకుండునట్లు
మోషే తన ముఖము మీద ముసుకు వేసికొనెను.
13. మేమట్లు చేయక,యిట్టి నిరీక్షణ గలవారమై బహు ధైర్యముగా
మాటలాడు చున్నాము.
ప్రియులారా! మనం 2 వ కొరింథీ
పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!!
ఇక
మూడవ అధ్యాయం నుండి పౌలుగారు తన అపొస్తలత్వమును కొరింథీ ప్రజలతో నిర్ధారించు
కొంటున్నారు!
ఇక ఇంతటి ఘనమైన సువార్త పరిచర్య చేసిన పౌలుగారు 5—6 వచనాలలో ఎలా తగ్గించుకుంటున్నారో చూడండి!
5. మావలన ఏదైన అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులమని
కాదు; మా సామర్థ్యము దేవుని వలననే కలిగియున్నది.
ఇక్కడ కష్టపడింది మేము కాదు గాని దేవుని కృప యే కష్టపడింది. మేము ఏదో
సమర్ధులము, ఏదో ప్రత్యేకమైన వారము కాదు గాని దేవుని కృప మాకు అలాంటి పరిచర్య
చేయుటకు సామర్ధ్యం కలిగించింది అందువలనే మేము అలాంటి పరిచర్య చేయగలిగాము అని
తగ్గించుకుంటూ రాస్తున్నారు! ఇప్పుడైతే మేము ప్రార్దిస్తే ఇలా అయ్యింది అలా
అయ్యింది అంటూ టీవీలలో డబ్బాలు కొట్టుకుంటారు!
2 కోరింథీయులకు 2:16. దేవుడు పిలిచి సామర్థ్యాన్ని ఇవ్వని పక్షంలో
ఈ పని ఎవరికైనా అసాధ్యమైనంత కష్టతరం. ఈ పనిలో పౌలుగారికున్న నిబ్బరం తన
సామర్థ్యాలను బట్టి కలిగినది కాదు. తాను చేస్తున్నదంతా జరిగించేవాడు దేవుడే
అనిఆయనకు తెలుసు (1 కోరింథీయులకు 15:10; కొలొస్సయులకు 1:29. యోహాను 15:5 చూడండి).
1కోరింథీయులకు 15: 10
అయినను నేనేమైయున్నానో అది దేవుని కృప వలననే అయియున్నాను.
మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కువగా
ప్రయాస పడితిని. ప్రయాసపడినది నేను కాను,నాకు తోడైయున్న దేవుని కృపయే.
కొలస్సీయులకు 1: 29
అందు నిమిత్తము నాలో బలముగా, కార్యసిద్ధికలుగజేయు ఆయన
క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను.
ఇక
6 వ వచనంలో ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే
పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడు. అక్షరము చంపునుగాని ఆత్మ
జీవింపచేయును అంటున్నారు!
దేవుడు
తన పనిమీద పంపిన వారెవరికైనా, ఆ పని చేసేందుకు సామర్థ్యాన్ని ఇస్తారన్న నిబ్బరం
ఉండాలి. ఇక్కడ “అక్షరం” అనగా పౌలుగారు ఉద్దేశంలో
పాత నిబంధననూ దాని చట్టాలు, నియమాలు, ఆజ్ఞలనూ సూచిస్తున్నారు . ఎవరూ దాన్ని
పూర్తిగా ఆచరణలో పెట్టలేదు గనుక అది మరణాన్నే తెచ్చింది. న్యాయంగానే అది మనుషులను
మరణ పాత్రులుగా తీర్పు తీర్చింది (రోమీయులకు 7:9-11; గలతియులకు 3:10. రోమీయులకు
3:19-20; రోమీయులకు 4:15; రోమీయులకు 5:20; రోమీయులకు 8:3 మొదలైనవి కూడా చూడండి).
కానీ కొత్త నిబంధన దేవుని ఆత్మమూలంగా జీవాన్ని తెచ్చింది (రోమీయులకు 7:6;
రోమీయులకు 8:2-4, రోమీయులకు 8:11; యోహాను 3:5-8).
రోమీయులకు 4: 15
ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును; ధర్మశాస్త్రము
లేని యెడల అతిక్రమమును లేకపోవును.
రోమీయులకు 7: 6
ఇప్పుడైతే దేనిచేత నిర్బంధింపబడితిమో దానివిషయమై
చనిపోయినవారమై, ధర్మశాస్త్రమునుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన
ప్రాచీనస్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీనస్థితి గలవారమై సేవచేయుచున్నాము.
ఇక
7 వ వచనంలో మరణ కారణమగు పరిచర్య, రాళ్లమీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను,
మహిమతో కూడినదాయెను. అందుకే మోషే ముఖముమీద ప్రకాశించుచుండిన ఆ మహిమ
తగ్గిపోవునదైనను,ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరిచూడలేక పోయిరి.
ఇక్కడ
మరణకారణమగు పరిచర్య అనగా పాత నిబంధన మరియు ధర్మశాస్త్రము అని గ్రహించాలి! పాత
నిబంధన పరిచర్యలో కూడా కొంత మహిమ ఉన్నా, అంతకంటే గొప్ప మహిమ మరియు ప్రభావాలు
క్రొత్త నిబంధనలో మనకు కనిపిస్తాయి!
నిర్గమకాండము 34:29-30,34
29. మోషే సీనాయికొండ దిగుచుండగా శాసనములు గల ఆ రెండు పలకలు
మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాటలాడుచున్న ప్పుడు తన
ముఖచర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి యుండలేదు.
30. అహరోనును ఇశ్రాయేలీయులందరును మోషేను చూచినప్పుడు అతని
ముఖచర్మము ప్రకా శించెను గనుక వారు అతని సమీపింప వెరచిరి.
34. అయినను మోషే యెహోవాతో మాటలాడుటకు ఆయన సన్నిధిని
ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చు వరకు ఆ ముసుకు తీసివేసెను; అతడు
వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపింపబడిన దానిని ఇశ్రాయేలీయులతో చెప్పెను.
ఇక
8—9 వచనాలలో ఇట్లుండగా ఆత్మసంబంధ మైన పరిచర్య యెంత మహిమగలదై
యుండును?
9. శిక్షా విధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి
కారణమైన పరిచర్య యెంతో అధికమైన మహిమ కల దగును.
ద్వితియోపదేశకాండము
27: 26
ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనక పోవుటవలన వాటిని
స్థిరపరచనివాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్ అనవలెను.
ఇక్కడ
మరణకారణమగు పరిచర్య ఎంతో మహిమగలదైతే మరి ఆత్మ సంబంధమైన జీవార్ధమైన పరిచర్య మరి
ఎన్నోరెట్లు మహిమగలదీ కదా అంటున్నారు!
అంతేకాకుండా
శిక్షా విధికి కారణమైన పరిచర్య మహిమ గలది అయితే మరి నీతికి కారణమైన పరిచర్య మరి ఎంతో
అధికమైన మహిమగలది అవుతుంది కదా అంటున్నారు!
ఇక 10—13 వచనాలలో
అంటున్నారు:
10. అత్యధికమైన మహిమ దీనికుండుటవలన ఇంతకు మునుపు మహిమ
కలదిగా చేయబడినది యీ విషయములో మహిమలేనిదాయెను.
11. తగ్గిపోవునదే మహిమగలదై యుండినయెడల, నిలుచునది మరి
యెక్కువ మహిమగలదై యుండును గదా.
12. తగ్గిపోవుచున్న మహిమయొక్క అంతమును ఇశ్రాయేలీయులు
తేరిచూడకుండునట్లు మోషే తన ముఖము మీద ముసుకు వేసికొనెను.
13. మేమట్లు చేయక, యిట్టి నిరీక్షణ గలవారమై బహు ధైర్యముగా
మాటలాడు చున్నాము.
నిర్గమకాండము
34:29-30
నిరీక్షణ
కోసం చూసుకుంటే రోమీయులకు 5:2-5;
2. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసమువలన ఈ కృపయందు
ప్రవేశముగల వారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణనుబట్టి
అతిశయ పడుచున్నాము.
3. అంతే కాదు; శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష
నిరీక్షణను (శీలము) కలుగజేయునని యెరిగి
4. శ్రమలయందును అతిశయపడుదము.
5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు
అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో
కుమ్మరింపబడియున్నది.
రోమీయులకు 8:23-25.
23. అంతేకాదు, ఆత్మయొక్క ప్రథమ ఫలముల నొందిన మనముకూడ దత్త
పుత్రత్వముకొరకు, అనగా మన దేహము యొక్క విమోచనముకొరకు కనిపెట్టుచు మనలో మనము
మూలుగుచున్నాము
24. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి.
నిరీక్షింపబడునది కనబడునప్పుడు, నిరీక్షణతో పనియుండదు; తాను చూచుచున్న దానికొరకు
ఎవడు నిరీక్షించును?
25. మనము చూడనిదాని కొరకు నిరీక్షించిన యెడల ఓపికతో దానికొరకు
కని పెట్టుదుము.
ఈనిరీక్షణ
, రాబోయే ఈ మహిమను గురించిన ఎదురుతెన్నులు పౌలుగారిని ఇప్పుడెంతో ధైర్యవంతుడిగా
చేశాయి. నిర్గమకాండము 34:33, నిర్గమకాండము 34:35, నిర్గమకాండము 36:35
నిర్గమకాండము
34:29-35.
గమనించాలి
ఇక్కడ దేవుని మహిమ ప్రత్యక్షం ఇజ్రాయేల్ వారికి
భయం కలిగించింది. కొత్త నిబంధన అయితే భయం పుట్టించదు గానీ నిరీక్షణ , ధైర్యం,
ఆనందాలను కలిగిస్తుంది.
దైవాశీస్సులు!!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*126వ భాగము*
2 కొరింథీ 3:14 —18
14. మరియు వారి
మనస్సులు కఠినములాయెను గనుక నేటివరకును పాతనిబంధన చదువబడునప్పుడు, అది
క్రీస్తునందు కొట్టివేయ బడెనని వారికి తేటపరచబడక, ఆ ముసుకే నిలిచియున్నది.
15. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్ల ముసుకు
వారి హృదయముల మీదనున్నది గాని
16. వారి హృదయము ప్రభువువైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు
ముసుకు తీసివేయబడును.
17. ప్రభువే ఆత్మ ప్రభువుయొక్క ఆత్మయెక్కడ నుండునో అక్కడ
స్వాతంత్ర్యము నుండును.
18. మన మందరమును ముసుకు లేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను
అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ
పోలిక గానే మార్చబడుచున్నాము.
ప్రియులారా! మనం 2 వ కొరింథీ
పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!! ప్రియులారా పాత నిబంధన మరియు క్రొత్త
నిబంధన యొక్క తేడాలు మనం ధ్యానం చేసుకుంటున్నాము!
ప్రియులారా
ఇక 14 వ వచనం నుండి చూసుకుంటే మరియు వారి మనస్సులు కఠినము లాయెను గనుక నేటివరకు
వారు పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడెనని వారికి అర్ధం కాక
ఇంకా ఆ ముసుగే నిలిచి ఉంది అంటున్నారు, ఇంకా నేటివరకును మోషే ధర్మశాస్త్ర
గ్రంధమును చదువునప్పుడెల్లా వారికి ఆ ముసుకు వారి హృదయముల మీద ఉన్నది, గాని వారి
హృదయం ఎప్పుడైతే ప్రభువు వైపుకి త్రిప్పబడుతుందో అప్పుడు ఆ ముసుకు తీసివేయబడుతుంది
అంటున్నారు!
దీనిని
జాగ్రత్తగా పరిశీలిస్తే పౌలుగారు మోషే తన
ముఖంపై వేసుకున్న ముసుగు నుంచి ఇప్పుడు
ఆధ్యాత్మిక పాఠాలు నేర్పిస్తున్నారు. నిర్గమ కాండం లో రెండోసారి 40 రోజులు
మోషే గారు సీనాయి కొండమీద ఉండి, కొండ దిగినప్పుడు ఆయన ముఖ చర్మం ప్రకాశించినందువలన
ఇశ్రాయేలు ప్రజలు ఆయన ముఖమును చూడలేకపోయారని మనం చదువుతున్నాము, నిర్గమ 34:34 దీనికోసమే ఈ వచనాలు రాస్తున్నారు పౌలుగారు! ఈ వచనంలో ఇంకా పాత నిబంధన క్రింద ఉన్నవారిని గురించి, అంటే యూదులు, యూదా
మతం పుచ్చుకున్నవారిని గురించి మాట్లాడుతున్నారు. వారి మనసులు మందకొడిగా ఉన్నాయి.
వారి హృదయాలపై ముసుగు ఉంది (వ 15). పాత నిబంధన
గ్రంథంలో వారు చదివినదాన్ని వారెంత మాత్రం ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోలేకపోయారు.
దాని అర్ధం అక్షరార్ధం గానే తీసుకుంటున్నారు గాని ఆధ్యాత్మికమైన అర్ధమును
గ్రహించలేక పోతున్నారు!
2 కోరింథీయులకు
4:3-4.
3. మా సువార్త మరుగుచేయబడిన యెడల నశించుచున్నవారి
విషయములోనే మరుగు చేయబడియున్నది.
4. దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త
ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి
మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.
యోహాను 5:39-40, 46-47 మొదలైన చోట్ల యూదులతో యేసుప్రభువు
అన్న మాటలను చూడండి. చీకటి, అజ్ఞానం అనే ముసుగును క్రీస్తు మాత్రమే తీసివేయగలడు,
మనుషులు సత్యాన్ని అర్థం చేసుకుని దేవుణ్ణి తెలుసుకునేలా చేయగలడు (వ 14,16; మత్తయి
11:27; యోహాను 8:12, యోహాను 8:31-32; యోహాను 14:6).
దీనికోసం యెషయా భక్తుడు ముందుగానే ప్రవచించారు యెషయా 25:7 సమస్తజనముల
ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనములమీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన
తీసివేయును. ఇది సంఘము ఎత్తబడ్డాక జరిగే సన్నివేశము! అయితే దీనిని ముందుగా చూసిన
అననీయ అనే ప్రవక్త అంటున్నారు యేసుప్రభులవారి యొక్క సున్నతి సందర్బంలో లూకా 2:32. నాధా! నీ రక్షణ నేను కన్నులార చూచితిని.
అయితే మీదనున్న ప్రవచనం సంపూర్తిగా ఎప్పుడు జరుగుతుంది అంటే సంఘము ఎత్తబడిన తర్వాతనే!
సంఘము ఎత్తబడే వరకు ఇశ్రాయేలు ప్రజల యొక్క రక్షణ ప్రణాళికా ప్రారంభం కాదు!
ఒక్కసారి సంఘము ఎత్తబడిన వెంటనే ఇశ్రాయేలు ప్రజల యొక్క రక్షణ ప్రణాళిక ప్రారంభమై ,
ఇద్దరు సాక్షుల సాక్ష్యాల వలన వారిలో ఇంకా వారిమీద నున్న ముసుగు తొలగిపోయి వారు
యేసుక్రీస్తుప్రభులవారిని రక్షకునిగా అనగా
మెస్సయ్యగా అంగీకరిస్తారు!
అందుకే 18 వ వచనంలో అంటున్నారు: మన మందరమును ముసుకు లేని ముఖముతో
ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింప జేయుచు, మహిమనుండి అధిక మహిమను పొందుచు,
ప్రభువగు ఆత్మచేత ఆ పోలిక గానే మార్చబడుచున్నాము.
విశ్వాసులంతా ఇప్పుడు క్రీస్తులో దేవుని మహిమను కొంత చూస్తున్నారు (2
కోరింథీయులకు 4:6). అంటే వారికి దాన్ని కొంతవరకు ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోగలరు.
వారికి మనసులో జ్ఞానోదయం ఉంది. కానీ అదంతా కూడా మసకబారిన అద్దంలో చూస్తున్నట్టుగానే ఉంది. 1
కోరింథీయులకు 13:12 చూడండి. అద్దంలో
ప్రతిబింబం మాత్రమే కనిపిస్తుంది. క్రీస్తును ముఖాముఖిగా చూచేటప్పుడు విశ్వాసులకు
కనిపించే వాస్తవికమైన దృశ్యమంతా ఇప్పుడు కనిపించదు. అయితే ఇప్పుడు విశ్వాసులంతా
మార్పు నొందుతూ ఉన్నారు. “పోలికగా మారుతూ ఉన్నాం” అని అనువదించిన గ్రీకు పదం
క్రొత్త నిబంధన గ్రంథంలో నాలుగు సార్లు మాత్రమే కనిపిస్తున్నది – ఇక్కడ, మత్తయి 17:2; మార్కు 9:2; రోమీయులకు 12:2. ఇది బయట కనిపించే
అంతరంగంలోని మార్పును సూచిస్తున్నది. క్రీస్తు విషయంలో ఈ మాటను వాడిన
సందర్భంలోనైతే ఆయన అంతరంగంలో ఏమిటో దానికి అనుగుణంగా బాహ్యరూపంలో కూడా
మార్పునొందాడు. విశ్వాసుల విషయంలో ఇది లోపల, బయట కూడా జరిగే మార్పు. అంతేగాక వారి
విషయంలో ఇది ఓ క్షణంలో జరిగేది కాదు. ఇది క్రమేణా జరుగుతుంది. కీర్తనల గ్రంథము
84:7; సామెతలు 4:18 చూడండి. ఇక్కడే,
ఇప్పుడే దేవుడు వారిని మరింతగా క్రీస్తు రూపము లోకి మారుస్తున్నారు . చివరికి ఆయన
తిరిగి వచ్చే సమయంలో వారు పూర్తిగా ఆయనలాగా అయిపోతారు (రోమీయులకు 8:29; 1 యోహాను
3:1-2). ఇప్పుడు ఇది జరుగుతున్నదని విశ్వాసికే నమ్మకం కుదరనంత మెల్లగా ఈ మార్పు
జరుగుతుండవచ్చు. అయితే దేవుని నిజమైన పిల్లలందరిలోనూ ఇది ఇప్పుడు జరుగుతూ ఉంది.
అయితే ఇది ఎలా సాధ్యమవుతుంది అనేది మనకు 17 వ వచనంలో కనిపిస్తుంది.
ప్రభువే ఆత్మ ప్రభువుయొక్క ఆత్మయెక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును. ఇలా
ఎందుకు రాయవలసి వచ్చింది అంటే ఇప్పుడు వారు ధర్మశాస్త్రము క్రింద ఉన్నారు అనగా
దాస్యము క్రింద ఉన్నారు, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారో వారు
స్వాతంత్ర్యం పొందుకుంటారు వారు అప్పుడు ధర్మశాస్త్రం అనే బానిసత్వం నుండి విడుదల
పొందుకుంటారు! తండ్రి, కుమారుడు ఏవిధంగానో, అదే విధంగా యేసుప్రభువు, దేవుని ఆత్మ
కూడా ఏకంగా ఉన్నారు (యోహాను 10:30; యోహాను 14:9). దేవుని ఆత్మను రోమా 8:9లో క్రీస్తు ఆత్మ అనడం కనిపిస్తుంది.
“స్వేచ్ఛ లేక స్వాతంత్ర్యం”– కోసం చూసుకుంటే
దేవుని ఆత్మ అనేక రకాల స్వేచ్ఛలనిస్తుంది –
1). ధర్మశాస్త్రం నుంచి (రోమీయులకు
7:4, రోమీయులకు 7:6; గలతియులకు 5:18),
2) భయం నుంచి (రోమీయులకు 8:15);
3)
పాపం నుంచి (రోమీయులకు 6:14, రోమీయులకు 6:18). యోహాను 8:36
కాబట్టి
ఇప్పుడు మందరమును ముసుకు లేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింప
చేయాలి అంటే మొదట ఆత్మను పొందుకోవాలి అప్పుడు
మహిమనుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలిక గానే అనగా
క్రీస్తు రూపములోనికి మార్చబడుచున్నాము.
కాబట్టి
ఆయన ఆత్మను పొందుకుందాము! ఆయన రూపము లోనికి మారుదాం!
దైవాశీస్సులు
!!!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*127వ భాగము*
2
కొరింథీ 4:1—6
1. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై
అధైర్యపడము.
2. అయితే కుయుక్తిగా నడుచు కొనకయు, దేవుని వాక్యమును వంచనగా
బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుటవలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి యెదుట మమ్మును
మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు, అవమానకరమైన రహస్యకార్యములను
విసర్జించియున్నాము.
3. మా సువార్త మరుగుచేయబడిన యెడల నశించుచున్నవారి
విషయములోనే మరుగుచేయ బడియున్నది.
4. దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త
ప్రకాశము వారికి ప్రకా శింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి
మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగ జేసెను.
5. అంధకారములోనుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన
దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో
ప్రకాశించెను.
6. గనుక మేము మమ్మునుగూర్చి ప్రకటించు కొనుటలేదు గాని,
క్రీస్తుయేసునుగూర్చి ఆయన ప్రభువనియు, మమ్మునుగూర్చి, యేసు నిమిత్తము మేము మీ
పరిచారకులమనియు ప్రకటించుచున్నాము.
ప్రియులారా! మనం 2 వ కొరింథీ
పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!! ప్రియులారా పాత నిబంధన మరియు క్రొత్త
నిబంధన యొక్క తేడాలు మనం ధ్యానం చేసుకుంటున్నాము! ఇంకా క్రొత్త నిబంధనలో
ముసుగులేని ఘనమైన పరిచర్య చేస్తున్నాము అని పౌలుగారు చెబుతున్నారు!
ఇక
ఈ 4 వ అధ్యాయములో పౌలుగారు క్రీస్తు సువార్తను లాభాపేక్ష లేకుండా కొరింథీ వారికి
ఎలా ప్రకటించారో చెబుతున్నారు! తద్వారా తన యొక్క అపొస్తలత్వమును తన
నిర్ధోషత్వమును నిరూపించుకుంటున్నారు!
ఇక మొదటి వచనంలో అంటున్నారు
కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. కాబట్టి అనగా
ఇది మూడవ అధ్యాయానికి కొనసాగింపు అని గ్రహించాలి! అనగా క్రొత్త నిబంధన
ముసుగులేనిది దేవుని రూపాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రతిబింబెంచేది అని చెబుతూ ఇంకా
అంటున్నారు: కనుక ఇటువంటి గొప్ప పరిచర్య మేము పొందుకున్నాము గనుక మేము కరుణించబడిన
వారమై అధైర్యపడము అంటున్నారు!
కొత్త నిబంధన కింద దేవుని
సేవకులు చేపట్టిన పరిచర్య మోషేగారి పరిచర్యకంటే గొప్పది, ఇంకా అంతకంటే మహిమతో నిండి ఉన్నది (2
కోరింథీయులకు 3:9). ఇప్పుడు క్రొత్త నిబంధనకు పరిచారకులైన వారు మనుషులను నేరస్థులుగా తీర్చే ధర్మశాస్త్రానికి
కాదు, గాని పాపవిముక్తి ఇచ్చే దేవుని కృపకే పరిచారకులు. దేవుని కరుణ వల్ల వారు
ఈ పరిచర్యను పొందారే గాని వ్యక్తిగతమైన
యోగ్యతల వల్ల కాదు (1 కోరింథీయులకు 15:10; 1 తిమోతికి 1:13-14). అందువల్ల ఎన్ని
కష్టాలు, అపాయాలు, బాధలు ఎదురైనా నిరుత్సాహపడి, పరిచర్యను చాలించుకోనని అంటున్నారు
పౌలుగారు . ఇలా అనడానికి కారణం ఇప్పటికే పౌలుగారు అనేకమైన హింసలు అనుభవించారు
క్రీస్తు కొరకు! ఎన్నో అవమానాలు తిరస్కారాలు ఎదుర్కొన్నారు! ఇక ఈ కొరింథీ సంఘమైతే
పౌలుగారి అపొస్తలత్వమును కూడా ప్రశ్నిస్తున్నారు! అందుకే ఇలాంటి ఎన్ని శ్రమలను
అవమానాలు తిరస్కారాలు పొందినా నేను క్రీస్తు పరిచర్యను వదలను అంటున్నారు! (వ 16. 1
కోరింథీయులకు 15:58; లూకా 18:1 చూడండి).
ఇక రెండో వచనంలో అంటున్నారు అయితే కుయుక్తిగా నడుచు కొనకయు, దేవుని
వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుటవలన ప్రతి మనుష్యుని
మనస్సాక్షి యెదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు, అవమానకరమైన
రహస్యకార్యములను విసర్జించియున్నాము అంటున్నారు!
మేము క్రీస్తు సువార్తను కుయుక్తిగా ప్రకటించలేదు ఇంకా లాభాపేక్షతో
ప్రకటించలేదు ఇంకా వంఛనతో ప్రకరించలేదు గాని సత్యాన్ని దేవుడు ప్రత్యక్ష పరచడం వలన
ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మును
మేమే దేవుని సముఖంలో మెప్పించు కొంటున్నాము అంటున్నారు! గమనించాలి పౌలుగారు తన
నిజాయితీని గురించి ఇక్కడ పదే పదే
చెప్తున్నారు! ఎందుకంటే కొరింథీలో కొందరు
దాన్ని సందేహించారు. అతని అపొస్తలత్వమును వారు
నమ్మకపోతే అక్కడి సంఘానికి ఎంత హాని కలుగుతుందో అతనికి తెలుసు.
2కోరింథీయులకు 1: 12
మా అతిశయమేదనగా, లౌకిక జ్ఞానముననుసరింపక, దేవుడనుగ్రహించు
పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటి మనియు,
విశేషముగా మీయెడలను నడుచుకొంటిమనియు, మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే
2కోరింథీయులకు 2: 17
కావున ఇట్టి సంగతులకు చాలినవాడెవడు? మేము దేవుని వాక్యమును
కలిపి చెరిపెడు అనేకులవలె ఉండక, నిష్కాపట్యముగలవారమును దేవునివలన నియమింపబడిన
వారమునైయుండి, క్రీస్తునందు దేవునియెదుట బోధించు చున్నాము.
ఇక
మూడో వచనం మా సువార్త మరుగుచేయబడిన యెడల నశించుచున్నవారి విషయములోనే మరుగుచేయ బడియున్నది.
దీని అర్ధం ఇక్కడ పౌలు గారు అవిశ్వాసులైన యూదుల గురించే గాక అన్యజనులందరి
గురించీ చెప్తున్నారు అందుకే 3 వ అధ్యాయంలో అంటున్నారు:
2 కోరింథీయులకు
3:14. మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటివరకును పాతనిబంధన
చదువబడునప్పుడు, అది క్రీస్తునందు కొట్టివేయ బడెనని వారికి తేటపరచబడక, ఆ ముసుకే
నిలిచియున్నది.
15. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్ల ముసుకు
వారి హృదయముల మీదనున్నది గాని
16. వారి హృదయము ప్రభువువైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు
ముసుకు తీసివేయబడును.
ఇక 4 వ వచ్చనలో అన్యజనులలో అనేకులు ఎందుకు దేవుని వర్తమానమును లేక
సువార్తను అంగీకరించడం లేదో చెబుతున్నారు: దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను
కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత
అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగ జేసెను. ఇదీ అసలు విషయం!!!
ఈ యుగ సంబంధమైన దేవత అంటే
సైతాను. యోహాను 12:31; యోహాను 16:11 చూడండి. వాడు మనుషులు తనను పూజించాలని కోరుతూ
పూజలందుకుంటూ ఉన్నాడు! కాబట్టీ లోకం యొక్క చీకటి రాజ్యాన్ని ఏలుతున్నాడు
(ఎఫెసీయులకు 6:12) కాబట్టి సైతానుకు ఈ పేరు పెట్టాడు. “మనసులకు...గుడ్డితనం కలిగించాడు”
అంటే మనుషులు దేవుని సత్యాన్ని అర్థం చేసుకోకుండేలా, వారికి ఆధ్యాత్మిక దృష్టి
కలగకుండేలా చేస్తాడు. ఇలా జరగడానికి వారు కూడా సైతానుకు సహకరిస్తారు (యోహాను
3:19-20; 2 థెస్సలొనీకయులకు 2:10-11).
ఇక “క్రీస్తు మహిమ”– అనగా సువార్త దేవుని
మహిమను, ఆయన అభిషిక్తుడైన క్రీస్తు మహిమను వెల్లడి చేసింది (యోహాను 12:23).
క్రీస్తు దేవుని స్వరూపం
అని మనకు ఈ రిఫరెన్సులలో కనిపిస్తుంది! హెబ్రీయులకు 1:3; ఫిలిప్పీయులకు 2:6;
కొలొస్సయులకు 1:15; కొలొస్సయులకు 2:9; యోహాను 1:14, యోహాను 1:18; యోహాను 12:45;
యోహాను 14:9). నిజానికి దేవుడు అదృశ్యుడైన దేవుడు అయితే మనకు కంటికి కనిపించిన రూపమే క్రీస్తు.
ఇంకా 5 వ వచనంలో అంటున్నారు: అంధకారములోనుండి వెలుగు ప్రకాశించును
గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు
మా హృదయములలో ప్రకాశించెను. దేవుడు సృష్టిని
చేసేటప్పుడు దేవుడు సృష్టించిన వెలుగును (ఆదికాండము 1:1-3) విశ్వాసుల హృదయాల్లో
దేవుడు ప్రసరింపజేసిన ఆధ్యాత్మిక వెలుగుతో పౌలుగారు పోలుస్తున్నారు. సత్యం గురించిన జ్ఞానాన్ని
వారు గ్రహించేలా దేవుడు వారి మనోనేత్రాలు తెరిచాడు. అంతకుముందు అందరిలాగా వారి
మనస్సు కూడా చీకటి, అల్లకల్లోలంతో నిండి ఉంది – ఎఫెసీయులకు
1:18; అపో. కార్యములు 26:18; యోహాను 8:12; మత్తయి 6:22-23; మత్తయి 11:27; మత్తయి
16:17; 1 కోరింథీయులకు 2:11-16 చూడండి.
దేవుడిచ్చే ఈ జ్ఞానప్రకాశాలు ఎలాంటివో చూడండి. మనిషి తానే దేవుణ్ణని
తెలుసుకోగలడన్న తప్పు సిద్ధాంతంతో ఈ మాటలకు పని లేదు. మనుషులు దేవుడు కాదు,
కాలేరు. తాము దేవుణ్ణని అనుకుంటే గనుక భయంకరమైన పొరపాటులో పడిపోయారన్నమాట. దేవుడు
నిజమైన జ్ఞానప్రకాశాలను మనుషులకు ఇచ్చి దేవుని మహిమ తమలో కాదు క్రీస్తులోనే ఉందని
(హెబ్రీయులకు 1:3) వారు గ్రహించేలా చేస్తాడు. దమస్కు ప్రయాణంలో పౌలుకు ఈ
జ్ఞానప్రకాశాల అనుభవం కలిగింది (అపొ కా 9:3-9). మనలో చాలమందికి అంత హఠాత్తుగా, అంత
వింతగా ఇది జరగదు. అయితే ప్రతి విశ్వాసికీ ఈ ఆధ్యాత్మికమైన కనుచూపు, వెలుగు
కలిగింది; అతడు వెలుగు సంతానమయ్యాడు (యోహాను 12:36; ఎఫెసీయులకు 5:8; 1 థెస్సలొనీకయులకు
5:5).
అందుకే 6 వ వచనంలో అంటున్నారు: గనుక మేము మమ్మునుగూర్చి ప్రకటించు
కొనుటలేదు గాని, క్రీస్తుయేసునుగూర్చి ఆయన ప్రభువనియు, మమ్మునుగూర్చి, యేసు
నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము.
తన అపొస్తలత్వముపై వస్తున్న దాడుల బారినుంచి పౌలుగారు
ఈ లేఖద్వారా తన అపొస్తలత్వమును కాపాడుకోవలసి వస్తున్నది కాబట్టి ఎక్కువగా
తన గురించి చెప్పుకున్నారు . కానీ ఇదంతా కొరింథీ విశ్వాసుల కోసమే గాని తనకోసం కాదు
(2 కోరింథీయులకు 1:12-24). ముక్తి మార్గంగా అతడు తనను వారికి ప్రకటించుకోలేదు.
సువార్త అతడు కల్పించిన ఊహ కాదు. తానెవరో గొప్పవాణ్ణని అతడు అనుకోలేదు.
క్రీస్తుకోసం ఇతరులకు సేవకుణ్ణని మాత్రమే భావించారు (1 కోరింథీయులకు 3:5-7; 1 కోరింథీయులకు
9:19-23). తనకంటే ఎంతో గొప్పవాడైన మరో వ్యక్తిని గురించి, అంటే క్రీస్తును గురించి
ప్రకటించే ఆధిక్యత అతనికి కలిగింది. పరలోకానికీ భూమికీ ఒకే ఒక ప్రభువుగా ఆయనను
పౌలుగారు ప్రకటించారు . లూకా 2:11;
రోమీయులకు 10:9; 1 కోరింథీయులకు 8:6; 1 కోరింథీయులకు 12:3; అపో. కార్యములు 2:36;
ఫిలిప్పీయులకు 2:10-11చూడండి. “
క్రీస్తు
ముఖం”– 2 కోరింథీయులకు 3:13
చూడండి. పాత నిబంధన మహిమకు మోషే ముఖంపై ఉన్న వెలుగు సూచనగా ఉంది. అది మసకబారిపోతూ
ఉండేది. కొత్త నిబంధన స్థాపకుడైన క్రీస్తు ముఖంపై ఉండే మహిమ ఎన్నటికీ గతించదు
అంటున్నారు!
దైవాశీస్సులు
!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*128వ భాగము*
2 కొరింథీ 4:7—10
7. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదైయుండునట్లు
మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు.
8. ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము;
అపాయములోనున్నను కేవలము ఉపాయము లేనివారము కాము;
9. తరుమబడు చున్నను దిక్కులేనివారము కాము; పడద్రోయబడినను
నశించువారము కాము.
10. యేసుయొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్ష పరచబడుటకై యేసు
యొక్క మరణాను భవమును మా శరీరమందు ఎల్లప్పుడును వహించుకొని పోవుచున్నాము.
ప్రియులారా! మనం 2 వ కొరింథీ
పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!! ప్రియులారా పాత నిబంధన మరియు క్రొత్త
నిబంధన యొక్క తేడాలు మనం ధ్యానం చేసుకుంటున్నాము! ఇంకా క్రొత్త నిబంధనలో
ముసుగులేని ఘనమైన పరిచర్య చేస్తున్నాము అని పౌలుగారు చెబుతున్నారు!
ఇక 7 వ వచనం చూసుకుంటే అయినను ఆ బలాధిక్యము
మా మూలమైనది కాక దేవునిదై యుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు
అంటున్నారు. ఇంతకీ ఐశ్వర్యం ఏమిటి? క్రీస్తులో దేవుని మహిమ ఉన్నదని తెలియడమే
అన్నిటికన్నా గొప్ప ఐశ్వర్యం. కీర్తనల గ్రంథము 19:10; కీర్తనల గ్రంథము 119:72,
కీర్తనల గ్రంథము 119:127; సామెతలు 2:1-5 చూడండి.
ఇంకా “ఐశ్వర్యం” అంటే దేవుడు అతనికి
అప్పగించిన సువార్త పరిచర్య అని కూడా పౌలుగారి ఉద్దేశం కావచ్చు. అతని దృష్టిలో ఇది
కూడా దివ్యమైన సత్యమే (ఎఫెసీయులకు 3:8).
ఎఫెసీయులకు 3: 10
శోధింపశక్యము కాని (మూలభాషలో- అడుగుజాడలు పట్ల శక్యముకాని)
క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును,
ఎఫెసీయులకు 3: 11
సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలమునుండి
మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన యేర్పాటు (లేక, గృహనిర్వాహకత్వము) ఎట్టిదో
అందరికిని తేటపరచుటకును, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను.
“మంటి
ఘటము ”– అనగా మట్టి పాత్ర: అంటే
మానవుని జీవితం మట్టి పాత్ర లాంటిది! అది ఎప్పుడుంటాదో ఎప్పుడు పగులుతుందో
తెలియదు! ఇంకా దుర్భలమైన మానవ స్వభావంలో, వ్యక్తుల శరీరం, ఆత్మ, హృదయం, అన్నీ నిలకడ లేనివి . అయితే దేవుడు మనకు
అప్పగించిన ఐశ్వర్యం ఎంతో బ్రహ్మాండమైనది.
అది ఉన్న “పాత్రలు” మాత్రం ఆ ఐశ్వర్యంతో పోల్చుకుంటే కంటికింపుగా లేవు, శక్తివంతం
కావు. అంటే వారు ఇతరులకు ఈ ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగే బలప్రభావాలు, కొత్త నిబంధనకు
సరైన పరిచారకులుగా ఉండే సమర్థత (2 కోరింథీయులకు 3:6) దేవునినుంచే కలిగాయి. అపో.
కార్యములు 1:4-5, అపో. కార్యములు 1:8 చూడండి.
2కోరింథీయులకు 3: 6
ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు గాని
ఆత్మకే పరి చారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడు. అక్షరము చంపునుగాని
ఆత్మ జీవింపచేయును.
Acts(అపొస్తలుల కార్యములు) 1:4,5
4. ఆయన వారిని కలిసికొని యీలాగు ఆజ్ఞాపించెనుమీరు
యెరూషలేమునుండి వెళ్లక, నావలన వినిన తండ్రియొక్క వాగ్దానముకొరకు కనిపెట్టుడి;
5. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది
దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో (లేక, పరిశుద్ధాత్మతో) బాప్తిస్మము పొందెదరనెను.
8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు
శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల
వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.
సరే ఇటువంటి పరిచర్య అనే
ఐశ్వర్యం కలిగిన మేము ఇప్పుడు అదే సువార్త సత్యము కోసం ఎటుచూసినా శ్రమలు ఆటంకాలు
ఎదుర్కుంటున్నాము అంటున్నారు!
ఎటుబోయినను శ్రమపడుచున్నను
ఇరికింపబడువారము కాము; అపాయములో నున్నను కేవలము ఉపాయము లేనివారము కాము; ఇంకా
తర్వాత వచనంలో తరుమబడు చున్నను
దిక్కులేనివారము కాము; పడద్రోయబడినను నశించువారము కాము. అయినా ఎందుకు ఓర్చుకుంటున్నాము
అంటే యేసుయొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసుయొక్క మరణానుభవమును మా
శరీరమందు ఎల్లప్పుడును వహించుకొని పోవుచున్నాము అంటున్నారు!
ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ “మట్టి పాత్రల” బలహీనతను ఈ వచనాల్లో
పౌలుగారు వర్ణిస్తున్నారు. “అన్ని వైపులా
ఒత్తిడి”, “ఏమి చెయ్యాలో పాలుపోవడం లేదు”, “హింసలకు గురి”, పడద్రోయడం”, “మరణించడం”
ఇవి ఆ బలహీనతను సూచిస్తున్నవి. అయితే వారిలో దేవుని శక్తి ఎలా పనిచేస్తున్నదో కూడా
తెలియజేస్తున్నారు పౌలుగారు – “ఇరుక్కొనిపోవడం లేదు”, “నిరాశ చెందడం లేదు”,
“విడిచిపెట్టబడ్డవారం కాము”, “నాశనం కావడం లేదు” మొదలైనవి. ఈ “మట్టి పాత్రల”లో
దేవుని శక్తి పని చేస్తూ ఉండకపోతే మనలో ఎవరమైనా దేన్నీ సాధించలేకపోతాం, త్వరలోనే
నాశనమైపోతాం అని తెలుసుకోవాలి. నిజానికి దేవుని కృప గాని మనలో ఉండి పనిచేయకపోతే
ఇలాంటి ఘనమైన పనులు చేయలేము! దేవుని ఆత్మ ఆయన కృప మనలో పనిచేస్తుంది కాబట్టే
దేవుని పనిని ఎన్ని ఆటంకాలు అడ్డంకులు శోధనలు వచ్చినా ధైర్యంగా చేసుకుంటూ
పోతున్నాము!
ఇక ఎందుకు సహిస్తూ ముందుకు పోతున్నాము అంటున్నారు అంటే ఏవిధంగా
నైనా క్రీస్తు యొక్క శ్రమలలో వారు కూడా పాలుపొందాలి అనేదే వారి తలంపులు!!! “
పౌలుగారు ఎదుర్కొన్న కష్టాలు శ్రమలు , హింసలు అంతకుముందు
యేసుప్రభువు అనుభవించారు! . పౌలుగారు
ఎదుర్కొన్నదంతా “యేసు కోసమే ”
చేస్తున్నారు (వ 11), నిజంగా అది అతనిలో ఉన్న “యేసు మరణానుభవమే”. అంటే
అస్తమానం అపాయాలూ కష్టాలూ కలుగుతూ ఉండడం (2 కోరింథీయులకు 11:23-27),
“అహం” అనేదాన్ని
చంపేసుకోవడం (మత్తయి 10:38-39; లూకా 9:23), క్రీస్తు కోసమే జీవించడం (గలతియులకు
2:20) అతని అనుభవం అయింది. వ్యక్తిగతమైన ఆశయాలు, ఏర్పాట్లు, తన ఇష్టాయిష్టాలు,
సౌకర్యాలు, సుఖభోగాలు, స్వార్థ పూరితమైన సంతోషాలు – వీటికి తన
యజమాని క్రీస్తు మనసులో తావు లేనట్టే పౌలుగారి
మనసులోనూ తావు లేదు. ఇది జీవ మార్గం, ఆధ్యాత్మిక జీవం, తనలో పని చేసే
క్రీస్తు జీవం (వ 11) అని పౌలుగారు
తెలుసుకున్నారు. ఈ అనుభవం మూలంగా కొరింతులోని విశ్వాసులవంటి వారికి (వ 12)
కూడా ఆధ్యాత్మిక జీవం కలగడం సాధ్యమైంది. ఇక్కడొక వాస్తవమైన సూత్రం ఉంది. ఇతరులకు
ఆధ్యాత్మిక జీవం కలిగించే సాధనంగా ఉండగోరినవారు పౌలు లాగా ఈ మరణానుభవానికి కూడా
సిద్ధపడి ఉండాలి. దీనికి ఇష్టం లేనివారికి విజయంగా సఫలతగా కనిపించేది ఉండవచ్చు
గానీ అది దేవుని దృష్టిలో మాత్రం విజయం, సఫలత కాదు.
ప్రియ దైవజనుడా నీవు నేను కూడా పౌలుగారి నుండి
ఇలాంటి అనుభవం, త్యాగం, పట్టుదల నేర్చుకోవాలి! మనకొచ్చే కష్టాలు శ్రమలు క్రీస్తు
మరణాను భవము, శ్రమానుభవములో మనము కూడా పాలుపొందులు పొందుతున్నాము అని గ్రహించాలి!
అలాగే పౌలుగారు సీలగారు ఆనందించినట్లు శ్రమలలో సంకెళ్లలో ఆనందించాలి! పౌలుగారిని
సీలగారిని సువార్త కోసం బాగా తన్ని చెరసాలలో పెడితే ఏడవకుండా సంతోషంతో పాటలు
పాడుతూ సువార్త చెబుతూ గడిపారు చెరసాలలో! మనము కూడా అలాగే శ్రమలలో సంకెళ్లలో
సంతోషంతో గడపాలి ఇంకా అవి క్రీస్తు శ్రమానుభవంలో పాలుపొందడానికి సహకరిస్తున్నాయి
అని సంతోషించాలి!
అట్టివిధంగా
దేవుడు మనలను నడిపించును గాక!
దైవాశీస్సులు!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*129వ భాగము*
2 కొరింథీ 4:11—18
11. ఏలయనగా, యేసుయొక్క జీవముకూడ మా మర్త్య శరీరమునందు
ప్రత్యక్ష పరచబడినట్లు, సజీవులమైన మేము ఎల్లప్పుడు యేసు నిమిత్తము మరణమునకు
అప్పగింపబడుచున్నాము.
12. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి.
13. కృప యెక్కువమంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము
కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున, సమస్తమైనవి మీకొరకై యున్నవి.
14. కాగా విశ్వసించితిని గనుక మాటలాడితిని అని వ్రాయబడిన
ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై,
15. ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మునుకూడ లేపి,
మీతోకూడ తన యెదుట నిలువ బెట్టునని యెరిగి,మేమును విశ్వసించుచున్నాము గనుక
మాటలాడుచున్నాము.
16. కావున మేము అధైర్యపడము; మా బాహ్య పురుషుడు
కృశించుచున్నను, ఆంతర్యపురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు.
17. మేము దృశ్యమైనవాటిని చూడక అదృశ్యమైనవాటినే నిదానించి
చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకొరకు అంత కంతకు ఎక్కువగా
నిత్యమైన మహిమ భారమును కలుగ జేయుచున్నది.
18. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు; అదృశ్యమైనవి
నిత్యములు.
ప్రియులారా! మనం 2 వ కొరింథీ
పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!! ప్రియులారా పాత నిబంధన మరియు క్రొత్త
నిబంధన యొక్క తేడాలు మనం ధ్యానం చేసుకుంటున్నాము! ఇంకా క్రొత్త నిబంధనలో
ముసుగులేని ఘనమైన పరిచర్య చేస్తున్నాము అని పౌలుగారు చెబుతున్నారు!
ఇక 11వ వచనం చూసుకుంటే ఏలయనగా, యేసుయొక్క జీవముకూడ మా మర్త్య
శరీరమునందు ప్రత్యక్ష పరచబడినట్లు, సజీవులమైన మేము ఎల్లప్పుడు యేసు నిమిత్తము
మరణమునకు అప్పగింపబడుచున్నాము. మా మర్త్య శరీరమునందు యేసు యొక్క జీవము ప్రత్యక్ష
పరచబడేటట్లు సజీవులుగా ఉన్న మేము యేసు
నామము నిమిత్తం మరణానికి అప్పగించ బడుతున్నాము అంటున్నారు! అనగా చావుకి కూడా
సిద్దమై పోయారు ఈ భక్తులు!!
12. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి.
దీని అర్ధం మేము సువార్త ప్రకటిస్తున్నందుకు మాకు ఎదురవుతున్న శ్రమల వలన మాలో
మరణము, సువార్తసత్యము మీలో పనిచేస్తున్నందు వలన మీలో జీవము కార్యరూపం దాల్చుతుంది
అంటున్నారు!
ఇక
తర్వాత వచనంలో కృప యెక్కువమంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము
కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున, సమస్తమైనవి మీకొరకై యున్నవి అంటున్నారు!
కీర్తనల గ్రంథము 116:10. ఇన్ని కష్టాలూ ఆపదలూ అపాయాలూ ఉన్నా పౌలుగారు క్రీస్తు సేవలో కొనసాగేలా చేసినది ఏమిటి? అతడు
దేవుణ్ణి నమ్మాడు గనుక మౌనంగా ఉండలేకపోయాడు. ధన్యకరమైన భవిష్యత్తు తనకుందని కూడా
అతనికి బాగా తెలుసు. విశ్వాసులు రాబోయే కాలంలో మరణం నుంచి సజీవంగా లేస్తారన్న
నిరీక్షణనే అతడు ఆగకుండా సువార్త పరిచర్యలో
కొనసాగేలా చేసింది (రోమీయులకు 8:23-25; 1 కోరింథీయులకు 15:49-58).
Romans(రోమీయులకు) 8:23,24,25
23. అంతేకాదు, ఆత్మయొక్క ప్రథమ ఫలముల నొందిన మనముకూడ దత్త
పుత్రత్వముకొరకు, అనగా మన దేహము యొక్క విమోచనముకొరకు కనిపెట్టుచు మనలో మనము
మూలుగుచున్నాము
24. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి.
నిరీక్షింపబడునది కనబడునప్పుడు, నిరీక్షణతో పనియుండదు; తాను చూచుచున్న దానికొరకు
ఎవడు నిరీక్షించును?
25. మనము చూడనిదాని కొరకు నిరీక్షించిన యెడల ఓపికతో
దానికొరకు కని పెట్టుదుము.
ఇక
14 వ వచనం చూసుకుంటే కాగా విశ్వసించితిని
గనుక మాటలాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై,
ప్రభువైన
యేసును లేపినవాడు యేసుతో మమ్మునుకూడ లేపి, మీతోకూడ తన యెదుట నిలువ బెట్టునని
యెరిగి, మేమును విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము అంటున్నారు!
ఇక్కడ
మేము దేవుణ్ణి పూర్తిగా విశ్వసించడమే కాకుండా
మేము చనిపోయన తర్వాత యేసుక్రీస్తుప్రభులవారిని లేపిన దేవుడు మిమ్మల్ని,
మమ్మల్ని కూడా చనిపోతే తిరిగి లేపి తన రాజ్యములో మీతో కూడా నిలబెడతారు అని మాకు
తెలుసు అంటున్నారు! పౌలుగారి బాధలు,
అనుభవాలు అన్నీ ఇతరుల మేలుకోసమే. అతడు కోరినది కూడా అదే – కొలొస్సయులకు 1:24; 1
కోరింథీయులకు 10:33; 2 తిమోతికి 2:10 ప్రకారం!
ఇలాంటి
మనస్తత్వం దేవుని సేవకులకు ఎంతో అవసరం! ఇతరులకెంత దీవెనకరం! దేవునికే (తనకు
కాదు) విరివిగా కృతజ్ఞతలు చెల్లించడం జరగాలని పౌలుగారు ఎంత ఆసక్తితో ఉన్నారో చూడండి – 2 కోరింథీయులకు 1:11; 2
కోరింథీయులకు 9:11-13.
అందుకే
కావున మేము అధైర్యపడము; మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్యపురుషుడు
దినదినము నూతన పరచబడుచున్నాడు అంటున్నారు! పౌలుగారు పడే శ్రమలు శోధనలు వలన
భాహ్యపురుషుడు కృశించిపోతున్నా తనయొక్క
అంతరంగ పురుషుడు అనగా తన ఆత్మ ఎంతో ఫలభరితంగా ఉంది అంటున్నారు! ఈ అధ్యాయంలో ఉన్న
కొన్ని అంశాలను ఇక్కడ మరోసారి క్లుప్తంగా చెప్తున్నారు పౌలుగారు!.
“అధైర్య
పడము లేక నిరుత్సాహం చెందము”– వ 1.
2 Corinthians(రెండవ కొరింథీయులకు) 4:1
1.కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై
అధైర్యపడము.
“క్షీణించిపోతూ”– 7-12. వచనాలు
“కొత్తదనం”– వ
10,11.
2 Corinthians(రెండవ కొరింథీయులకు) 4:10,11
10.యేసుయొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్ష పరచబడుటకై యేసు
యొక్క మరణాను భవమును మా శరీరమందు ఎల్లప్పుడును వహించుకొని పోవుచున్నాము.
11.ఏలయనగా, యేసు యొక్క జీవము కూడ మా మర్త్య శరీరమునందు
ప్రత్యక్ష పరచబడినట్లు, సజీవులమైన మేము ఎల్లప్పుడు యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము.
ఇలా
అనడానికి కారణం: అనుదినం అతడు మరణాన్ని ఎదుర్కొంటూ ఉన్నాడు (1 కోరింథీయులకు 15:31)
గానీ దేవుడు అనుదినం అతనికి జీవాన్ని ఇస్తున్నాడు అని అర్ధం!
ఇక
చివరి రెండు వచనాలు చూసుకుంటే : మేము దృశ్యమైనవాటిని చూడక అదృశ్యమైనవాటినే
నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకొరకు అంత కంతకు
ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ జేయుచున్నది.
18. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు; అదృశ్యమైనవి నిత్యములు.
దృశ్యమైనవి అనగా ఈ భూమిమీద మనకు కనిపించేవి, అదృశ్యమైనవి అనగా
పరలోకంలో మనకొరకు దేవుడు దాచిపెట్టిన తేజేవాసుల స్వాస్థ్యము ! “క్షణమాత్రముండు ”
శ్రమలు అనగా – పౌలుగారు క్రైస్తవుడైన
కొద్ది దినాలకు అతనికి కష్టాలు ఆరంభమై అతడు చనిపోయేదాకా వెంబడించాయి . అంటే చాలా
సంవత్సరాలన్నమాట. అయితే వాటిని అనంత యుగాలతో పోల్చుకుంటే అవి క్షణికమే.
క్రీస్తుకోసం ఎవరైనా అనుభవిస్తున్న కష్టాలు నిజానికి వారి శాశ్వతమైన మేలు కోసమే
పని చేస్తున్నాయని పౌలుగారు అంటున్నారని
గమనించండి. విశ్వాసులు పొందబోయే మహిమను కలిగించడంలో అవి తోడ్పడతాయి. రోమీయులకు
8:17-18, రోమీయులకు 8:28 చూడండి. పౌలుగారు
తనకు వచ్చిన కష్టాలన్నిటినీ ఎందుకు సహనంతో భరించగలిగారో , అవన్నీ అతని
దృష్టిలో చులకనగా, క్షణికంగా ఎందుకు ఉన్నాయో వ 17 తెలియజేస్తున్నది. అయితే కంటికి
కనిపించని వాటిపై దృష్టిని ఎలా నిలుపుకోవడం? దేవుడిచ్చే ఆధ్యాత్మిక జ్ఞానం
మూలంగానే (వ 5). దేవుని అదృశ్యమైన శాశ్వతమైన విషయాలు వాస్తవానికి మనకు తెలిసేది విశ్వాసం ద్వారానే (హెబ్రీయులకు 11:1).
2 కోరింథీయులకు 5:7 లో పౌలుగారు
ఈ సంగతినే వేరే మాటల్లో చెప్పారు. మన కళ్ళతో లోకాన్ని, మనకు వచ్చే కష్టాలు,
బాధల్ని చూస్తాం. మన ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రాలతో క్రీస్తు ముఖము లోకీ (వ 5) అనంత
యుగాల్లోకీ చూడగలం. “బాధలు”(వ 18) – ఇవి ఎలాంటివో చూడండి – వ 8-10; 2 కోరింథీయులకు 1:8; 2 కోరింథీయులకు 11:23-27.
పౌలుగారు వీటిని చులకనైనవని అంటున్నారు !
అంటే తనకు కలగబోయే బహుమతితో పోల్చుకుంటే ఇవి తేలికైనవి అని అర్థం. అలాగైతే మన
చిన్నచిన్న బాధల గురించి మనం ఏమనుకోవాలి? మనమీద మనం జాలిపడుతూ, సణుగుతూ ఉండాలా?
దేవుడు పౌలుగారి కిచ్చిన జ్ఞానమే మనకు ఉంటే అలా ఎన్నడూ చేయము.
కాబట్టి
మనము కూడా మనకొచ్చే శ్రమలు శోధనలు అవి క్షణిక్యమైనవి చిరకాలం ఉండేవి కావు అని
గ్రహిస్తూ ఇంకా అవి క్రీస్తు యొక్క శ్రమానుభవములోనికి మనలను తీసుకుని వెళ్తున్నాయి
అని గ్రహిస్తూ మన ఆత్మీయ యాత్రలో సంతోషంగా సాగిపోదాం!
దైవాశీస్సులు!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*130వ భాగము*
2 కొరింథీ 5:1--6
1. భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను,
చేతిపనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని
యెరుగుదుము.
2. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనినవారముగా
కనబడుదుము. కాబట్టి పరలోకమునుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొన
నపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము.
3. ఈ గుడారములోనున్న మనము భారము మోసికొని మూల్గు చున్నాము.
4. ఇది తీసివేయవలెనని కాదు గాని మర్త్యమైనది జీవముచేత
మింగివేయబడునట్లు, ఆ నివాసమును దీనిపైని ధరించుకొన గోరుచున్నాము.
5. దీని నిమిత్తము మనలను సిద్ధపరచినవాడు దేవుడే;మరియు ఆయన
తన ఆత్మ అను సంచకరువును మన కనుగ్రహించియున్నాడు.
6. వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకొను చున్నాము
ప్రియులారా! మనం 2 వ కొరింథీ
పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము క్రొత్త నిబంధనలో ముసుగులేని ఘనమైన
పరిచర్య చేస్తున్నాము అని పౌలుగారు చెబుతున్నారు!
ప్రియులారా! ఇక 5 వ అధ్యాయం 4 వ
అధ్యాయానికి కొనసాగింపు అని గ్రహించాలి! పౌలుగారు 4 వ అధ్యాయం చివర్లో దృశ్యమైనవి
అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యమైనవి అన్నారు కదా, దానికోసం ఇంకా వివరంగా
చెబుతున్నారు ఈ అధ్యాయంలో!!
మొదటి
వచనం చూసుకుంటే భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపనికాక
దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదుము.
భూమిమీద మన గుడారము అనగా మన దేహము అని గ్రహించాలి!
యోబు 4:19
జిగటమంటి యిండ్లలో నివసించు వారి యందుమంటిలో పుట్టిన వారి
యందుచిమ్మట చితికిపోవునట్లు చితికిపోవు వారి యందు మరి ఎన్ని కనుగొనును?
– ఒక శాశ్వత నివాసం అంటే
పరలోకం! లేక నిత్యత్వము , ఇంకా
నిత్యత్వములో ప్రభువుతో కలిసి ఉండడం (వ 8),
ఇక ఈ అధ్యాయంలో పౌలుగారు దేనిమీద దృష్టి నిలిపారో మనకు
కనిపిస్తుంది! ఒక శాశ్వత నివాసం (1-4), ప్రభువుతో కలిసి ఉండడం (వ 8), తీర్పు,
ప్రతిఫలాలు (వ 10). వీటిపై అతడు దృష్టి నిలుపుకున్నారు!
“మనకు తెలుసు”– పౌలుగారు ఇక్కడ
చెప్తున్నది ఊహాగానం కాదు, దేవుడు వెల్లడించిన సత్యంపై ఆధారపడిన జ్ఞానం. భూమిమీద
మన “నివాసమైన గుడారం” అంటే మన భౌతిక శరీరాలు అని పౌలు భావం (వ 4). అవి మరణిస్తాయి – అంటే క్రీస్తు రాకకు ముందే చావు వస్తేనన్నమాట (1 కోరింథీయులకు
15:51-52). అయితే దేవుడు నిర్మించే కట్టడం, ఎప్పటికీ ఉండే ఇల్లు, పరలోక సంబంధమైన
నివాసం అంటే (వ 2) అర్థమేమిటి? దీని అర్థం
గురించి వ్యాఖ్యాతల్లో ఏకాభిప్రాయం లేదు. ఇది యోహాను 14:2 లో ఉన్న తండ్రి ఇల్లు
కావచ్చు అని కొందరు అంటారు. హెబ్రీయులకు 11:10; హెబ్రీయులకు 13:14; ప్రకటన గ్రంథం 21:10-27;
లూకా 16:9 కూడా చూడండి. అయితే క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు విశ్వాసులకు లభించే
మహిమ దేహాలు (1 కోరింథీయులకు 15:35-53)
అని పౌలు భావం కావచ్చు. ఇప్పటి మన శరీరం “గుడారం” అయితే “ఇల్లు” అనేది పరలోకంలో మన
మహిమ దేహం అవుతుంది!!!
కాబట్టి మన శరీరం ఒకరోజు మరణమౌతుంది! గాని రక్షించబడిన మనకు గల
శుభప్రదమైన నిరీక్షణ ఏమిటంటే ఒకరోజు దేవుని భూర మ్రోగిన వెంటనే మనము మహిమ దేహాలతో
ప్రభువుని కలుసుకుని నిత్యత్వములో
క్రీస్తుతో యుగయుగాలు గడుపుతాము! అది శాశ్వతం!! అదే మన ఇల్లు అని గ్రహించాలి!
ఇప్పుడు మనం జీవించేది లేక మన శరీరం కేవలం అది ఈ భూలోకం గుడారం మాత్రమే అని కూడా
గ్రహించాలి!
ఇక 2, 3 వచనాలలో
అంటున్నారు: మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనినవారముగా కనబడుదుము. కాబట్టి
పరలోకమునుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొన నపేక్షించుచు దీనిలో
మూల్గుచున్నాము.
3. ఈ గుడారములోనున్న మనము భారము మోసికొని మూల్గు చున్నాము.
“దిగంబరంగా”అంటే ఇక్కడ శరీరం లేకుండా ఆత్మను సూచిస్తున్నట్టుంది.
కాబట్టి పునరుత్థాన మందు మనం ఈ ఆత్మ- మహిమ ధేహంగా మారుతుంది అని గ్రహించాలి! అది
మనకు పరలోకం నుండి ఈ మహిమదేహాలను పొందుతాము!
ఇంకా మరో అర్ధం కూడా ఉండి, అది ఏమిటంటే ప్రకటన గ్రంధంలో తెల్లని
వస్త్రాలు ఇవ్వబడ్డాయి, అవి పరిశుద్దుల నీతిక్రియలు అని చెప్పడం జరిగింది! అనగా
మనం ఈ భూలోకంలో జీవిస్తున్నప్పుడు నీతిక్రియలు మంచి పనులు చేయకపోతే మనము
దిగంబరులుగా ఉన్నట్లు తెలుసుకోవాలి!
“మూలుగుతూ”– రోమీయులకు 8:23 చూడండి.
అంతేకాదు, ఆత్మయొక్క ప్రథమ ఫలముల నొందిన మనముకూడ దత్త
పుత్రత్వముకొరకు, అనగా మన దేహము యొక్క విమోచనముకొరకు కనిపెట్టుచు మనలో మనము
మూలుగుచున్నాము
అక్కడ మూలుగు మన శరీరాల విమోచన కోసం. ఇక్కడి
అర్థం ఇదే కావచ్చు. అక్షరార్ధంగా ఈ లోకంలో ఉన్న మనము , మనకు కలిగే ఆకలిదప్పులు,
కష్టానష్టాలు ఇరుకుఇబ్బందులు శ్రమలు శోధనలకు భాధపడుతూ వీటినుండి విముక్తి కోసం
మూలుగుతున్నాము అని అర్ధం కలిగినా మన ఆత్మ ఈ దేహము నుండి విడుదల కోసం మూలుగుతుంది
అని అర్ధం! ఎందుకంటే ఒకసారి విముక్తి కలిగితే ఇక దేవునితో గడపవచ్చు అని ఈ మన
ఆత్మలు ఆలోచిస్తున్నాయి!
“ధరించుకోవడం”
అనే మాట కూడా ఒక వ్యక్తి, లేక వ్యక్తి ఆత్మ తొడుక్కునేది అనే అర్థాన్ని
సూచిస్తున్నది గాని పరలోకంలో శాశ్వత నివాస స్థలం వంటి నగరాన్ని కాదు.
ఒకరోజు
మనము తప్పకుండా ఈ దేహమునుండి విముక్తి పొంది నిత్యనివాసమైన ఆ పరలోక రాజ్యములో
దేవునితో ఉంటాము! అలా గడపాలి అంటే నీవు ఆత్మానుసారమైన జీవితం, సాక్షానుసారమైన
జీవితం, వాక్యానుసారమైన పవిత్ర జీవితం కలిగి ఉంటేనే ఇది సాధ్యం! లేకపోతే మరో
నిత్యత్వం ఉంది, అది నరకం. అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు పండ్లు పటపట
కోరుకుచుందువు ! కాబట్టి నీకు ఏమి కావాలో నేడే తేల్చుకో!!
దైవాశీస్సులు!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*131వ భాగము*
2 కొరింథీ 5:1--6
1. భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను,
చేతిపనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని
యెరుగుదుము.
2. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనినవారముగా
కనబడుదుము. కాబట్టి పరలోకమునుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొన
నపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము.
3. ఈ గుడారములోనున్న మనము భారము మోసికొని మూల్గు చున్నాము.
4. ఇది తీసివేయవలెనని కాదు గాని మర్త్యమైనది జీవముచేత
మింగివేయబడునట్లు, ఆ నివాసమును దీనిపైని ధరించుకొన గోరుచున్నాము.
5. దీని నిమిత్తము మనలను సిద్ధపరచినవాడు దేవుడే;మరియు ఆయన
తన ఆత్మ అను సంచకరువును మన కనుగ్రహించియున్నాడు.
6. వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకొను చున్నాము
ప్రియులారా! మనం 2 వ కొరింథీ
పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము! ఈ దేహం అశాశ్వతమైనది! పరము నిత్యమైనది
అని చెబుతున్నారు!
(గతభాగం తఱువాయి)
ఇక
4—6 వచనాలు చూసుకుంటే . ఇది
తీసివేయవలెనని కాదు గాని మర్త్యమైనది జీవముచేత మింగివేయబడునట్లు, ఆ నివాసమును
దీనిపైని ధరించుకొన గోరుచున్నాము.
5. దీని నిమిత్తము మనలను సిద్ధపరచినవాడు దేవుడే;మరియు ఆయన
తన ఆత్మ అను సంచకరువును మన కనుగ్రహించియున్నాడు.
విశ్వాసులు
మూలిగేది ఈ దేహాన్ని వదిలించుకోవాలని కాదు గాని కొత్త దేహం లేక మహిమ దేహము
పొందాలనే ఇలా మూల్గుచున్నట్లు అర్థమవుతుంది!
అనగా మర్త్య మైన ఈ దేహం మహిమ దేహం ధరించి జీవముచేత మ్రింగివేయబడాలి అని
ఇంకా ఆ స్థిరమైన నివాసం ఈ పనికిమాలిన దేహముపై ధరించుకోవాలి అని మూల్గుచున్నది
అంటున్నారు!
అయితే
ఇలా ఉండాలి అని నిర్ణయించింది దేవుడే అంటున్నారు పౌలుగారు! అందుకోసమే దేవుడు మనలను
సిద్ధపరిచారు, ఇంకా దానికోసం మనకు స్థిరమైన నమ్మిక కలిగి ఉండాలని తన ఆత్మను
పూచీకత్తుగా లేక డిపాజిట్ గా మన దేహాలలో ఉంచారు అంటున్నారు! విశ్వాసులు దేవుని
చేతితో చేసినవారు!, కొత్త సృష్టి (వ 17; ఎఫెసీయులకు 2:10). పరలోక సంబంధమైన
నివాసాన్ని, అంటే పరలోకంలో ఉండేందుకు అనువైన దేహాన్ని మనకిచ్చే ఉద్దేశంతోనే ఆయన
మనల్ని చేశారు . యోహాను 6:39-40 చూడండి.
39. నా యిష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను
పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని.
40. ఆయన నాకు అనుగ్రహించిన దాని యంతటిలో నేనేమియు పోగొట్టుకొనక,
అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపినవాని చిత్తమైయున్నది.
“హామీ/పూచీకత్తు/డిపాజిట్
”– 2 కోరింథీయులకు 1:22
చూడండి. హామీ, లేక బయానా అంటే ఇంకా చాలా రావలసి ఉందన్నమాట. దేవుడెప్పుడైనా తన మనసు
మార్చుకుని ఇచ్చిన బయానాను తిరిగి తీసేసు కుంటాడనుకొనే అవసరం ఎంతమాత్రం లేదు అని
గ్రహించాలి! కాబట్టి మట్టి దేహమునుండి మహిమ దేహము పొందుకోవడం ఖచ్చితం అని
గ్రహించాలి!
ఇక
ఆరవ వచనంలో వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకొను చున్నాము అంటున్నారు! అనగా
పౌలుగారికి ఈ విషయం తెలియడం, నిబ్బరం
కలగడం అంతా దేవుడు వెల్లడించిన దాన్ని బట్టే కలిగాయి. విశ్వాసులందరికీ ఇవి
లభించవచ్చు. 1 కోరింథీయులకు 2:9-16 చూడండి.
9. ఇందును గూర్చిదేవుడు తన్ను ప్రేమించువారి కొరకు ఏవి
సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు
గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది.
10. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచియున్నాడు; ఆ
ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు.
11. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని
మనుష్యులలో మరి ఎవనికి తెలియును? ఆలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి
ఎవనికిని తెలియవు.
12. దేవుని వలన మనకు దయచేయబడినవాటిని తెలిసికొనుటకై మనము
లౌకికాత్మను కాక దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము.
13. మనుష్యజ్ఞానము నేర్పుమాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను
ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము
బోధించుచున్నాము.
14. ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను
అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే
వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.
15. ఆత్మసంబంధియైనవాడు అన్నిటిని వివేచించును గాని అతడెవని
చేతనైనను వివేచింపబడడు.
16. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే
క్రీస్తు మనస్సు కలిగినవారము.
ఇప్పుడు
మనం ఈ లోకంలో, శరీరంతో ఉన్నప్పుడు ప్రభువు మనతో లేడని పౌలుగారి ఉద్దేశం కాదు. విశ్వాసులందరితో ఆయన ఉన్నాడని
మనకు తెలుసు – 2 కోరింథీయులకు 13:5;
మత్తయి 28:20; యోహాను 17:20-23. అయితే విశ్వాసులింకా ప్రభువును చేరలేదు – అంటే పరలోకంలో ఆయన సముఖంలో
లేరు. వారు చనిపోయినప్పుడు అక్కడికి వెళ్తారని పౌలుగారు చెప్తున్నారు. ఫిలిప్పీయులకు 1:23-24 చూడండి.
లూకా 23:43; యోహాను 17:24 చూడండి.
అందుకే
7—9 వచనాలలో అంటున్నారు: గనుక
ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని యెరిగి యుండియు,
ఎల్లప్పుడును ధైర్యముగలవారమై యున్నాము.
8. ఇట్లు ధైర్యము గలిగి యీ దేహమును విడిచి పెట్టి
ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము.
9. కావున దేహమందున్నను దేహమును విడిచినను, ఆయన కిష్టులమై
యుండవలెనని మిగుల అపేక్షించుచున్నాము.
చూడండి కనుక ఈ లోకంలో మనము ఈ దేహముతో ఉన్నంత కాలము మనకు ప్రభువుకు
దూరంగా ఉన్నామని తెలిసినా ఎల్లప్పుడూ మనం ధైర్యము గలవారై ఉన్నాము అంటున్నారు!
ఎందుకు దైర్యంగా ఉంటున్నాము అంటే మనము ఈ దేహము విడిచిన తర్వాత మహిమదేహాలు పొంది
నిత్యత్వములో ఎల్లప్పుడూ ప్రభువుతో ఉంటాము, అలా ఉండడానికే దేవుడు మనలను
సిద్దపరిచారు, దానికి పూచీకత్తుగా లేక బయానాగా దేవుడు తన ఆత్మను మనలో ఉంచారు అని
మనకు తెలుసు కాబట్టే మనము ధైర్యముగా ఉంటున్నాము అంటున్నారు! మరి ఇలాంటి ధైర్యము
ఉంది కాబట్టి ఈ దేహాన్ని వదిలినా మనము ఆయనకు ఇష్టులుగా ఉండేలాగా మనం ప్రవర్తించాలి
అని పౌలుగారు కొరింథీ విశ్వాసుల పట్ల కోరుకుంటున్నారు!
అందుకే మనము దేహముతో ఉన్నా దేవునికి ఇష్టులయి ఉండాలి, దేహాన్ని వదిలినా
మనము దేవునికి ఇష్టులుగా ఉండాలి అంటున్నారు! విశ్వాసులు క్రీస్తు సన్నిధికి చేరి
శాశ్వతంగా అక్కడుంటారు కాబట్టి, వారి జీవిత విధానంపై ఈ సత్యం గాఢమైన ప్రభావం
చూపేదిగా ఉండాలి. తన జీవితంపై అలాంటి ప్రభావం చూపిందని పౌలుగారు అంటున్నారు.
బ్రతికినా, చనిపోయినా అన్నిటికంటే ముఖ్యంగా క్రీస్తుకు సంతోషం కలిగించడమే
అతని కోరిక. క్రీస్తుకు సంతోషం కలిగిద్దామనుకునేవారిలో తమను సంతోషపెట్టుకునే గురి
ఉండదు. క్రీస్తు మహిమకోసం, ఇతరుల మేలుకోసం వారు బ్రతుకుతారు. వ 15; 1 కోరింథీయులకు
9:19-23; 1 కోరింథీయులకు 10:31. క్రీస్తుకు సంతోషం కలిగించాలని కోరనివారు దేవుని
నిజ సేవకులు కాదు అని గ్రహించాలి!
ఇంతకీ బ్రతికి ఉన్నా చనిపోయినా దేవునికి ఇష్టులయిఉండాలి అని ఎందుకు అంటున్నారో మనకు పదవ వచనంలో
కనిపిస్తుంది!
ఎందుకనగా తాను జరిగించిన క్రియలచొప్పున, అవి మంచివైనను సరే
చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును
క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును.
కీర్తనల గ్రంథము 72:2-4, ప్రసంగి 12:14
Psalms(కీర్తనల గ్రంథము) 72:2,3,4
2. నీతిని బట్టి నీ ప్రజలకును న్యాయ విధులను బట్టి శ్రమ
నొందిన నీ వారికిని అతడు న్యాయము తీర్చును.
3. నీతిని బట్టి పర్వతములును చిన్నకొండలును ప్రజలకు నెమ్మది
పుట్టించును.
4. ప్రజలలో శ్రమనొందు వారికి అతడు న్యాయము తీర్చును బీదల
పిల్లలను రక్షించి బాధపెట్టు వారిని నలగగొట్టును.
Ecclesiastes(ప్రసంగి) 11:9,10
9. యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవనకాలమందు నీ
హృదయము సంతుష్టిగా ఉండ నిమ్ము, నీ కోరికచొప్పునను నీ దృష్టియొక్క యిష్టము
చొప్పునను ప్రవర్తింపుము; అయితే వీటన్నిటి నిబట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి
తెచ్చునని జ్ఞాపక ముంచుకొనుము;
10. లేతవయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక
నీహృదయములోనుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాని
తొలగించుకొనుము.
Ecclesiastes(ప్రసంగి) 12:14
14.గూఢమైన ప్రతి యంశమునుగూర్చి దేవుడు విమర్శచేయునప్పుడు
ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును.
ఇదీ
అసలు సంగతి! మనము దేహముతో చేసే ప్రతీ కార్యము కోసం, మాట్లాడే ప్రతీమాట కోసం ఒకరోజు
దేవుని న్యాయపీటం ఎదుట మనం లెక్క అప్పగించాలి అని మర్చిపోకూడదు!
రోమీయులకు 14:10-12;
10.అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేల? నీ సహోదరుని
నిరాకరింపనేల? మనమందరము దేవుని న్యాయ పీఠము ఎదుట నిలుతుము.
11.నా తోడు, ప్రతి మోకాలును నా యెదుట వంగును,ప్రతి నాలుకయు
దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు
12.అని వ్రాయబడియున్నది గనుక మనలో ప్రతివాడును తన్నుగురించి
దేవునికి లెక్క యొప్పగింపవలెను.
రోమీయులకు
2:6;
1
కోరింథీయులకు 3:13-15.
కాబట్టి
ఒకరోజు దేవుడు మనలను లెక్క అప్పగించాలి. కాబట్టి మన నడకను పడకను ఆలోచనలను
జాగ్రత్తగా కాపాడుకుందాం! అలా చేస్తేనే
ఒకరోజు మనము తప్పకుండా ఈ దేహమునుండి విముక్తి పొంది నిత్యనివాసమైన ఆ పరలోక
రాజ్యములో దేవునితో ఉంటాము! అలా గడపాలి అంటే నీవు ఆత్మానుసారమైన జీవితం,
సాక్షానుసారమైన జీవితం, వాక్యానుసారమైన పవిత్ర జీవితం కలిగి ఉంటేనే ఇది సాధ్యం!
లేకపోతే మరో నిత్యత్వం లోకి పోతావు! అది నరకం. అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు
పండ్లు పటపట కొరుకుచుందువు ! కాబట్టి నీకు ఏమి కావాలో నేడే తేల్చుకో!!
దైవాశీస్సులు!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*132వ భాగము*
2 కొరింథీ 5:11 –16
11. కావున మేము ప్రభువు విషయమైన భయము నెరిగి మనుష్యులను
ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడినవారము; మీ మనస్సాక్షులకు కూడ
ప్రత్యక్షపరచబడియున్నామని నమ్ముచున్నాను.
12. మమ్మును మేమే మీ యెదుట తిరిగి మెప్పించుకొనుట లేదు
గాని, హృదయమునందు అతిశయపడక పైరూపమునందే అతిశయపడువారికి ప్రత్యుత్తర మిచ్చుటకు మీకు
ఆధారము కలుగవలెనని మా విషయమై మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము.
13. ఏలయనగా మేము వెఱ్రివారమైతిమా దేవుని నిమిత్తమే;
స్వస్థబుద్ధిగలవారమైతిమా మీ నిమిత్తమే.
14. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది; ఏలాగనగా
అందరికొరకు ఒకడు మృతిపొందెను గనుక అందరును మృతిపొందిరనియు,
15. జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది
తిరిగి లేచినవానికొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెననియు నిశ్చయించు
కొనుచున్నాము.
16. కావున ఇకమీదట మేము శరీరరీతిగా ఎవనినైనను ఎరుగము; మేము
క్రీస్తును శరీరరీతిగా ఎరిగియుండినను ఇకమీదట ఆయనను ఆలాగు ఎరుగము.
ప్రియులారా! మనం 2 వ కొరింథీ
పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము! ఈ దేహం అశాశ్వతమైనది! పరము నిత్యమైనది
అని చెబుతున్నారు!
(గతభాగం తఱువాయి)
ఇక
11 వ వచనంలో అంటున్నారు: కావున మేము
ప్రభువు విషయమైన భయము నెరిగి మనుష్యులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి
ప్రత్యక్షపరచబడినవారము; మీ మనస్సాక్షులకు కూడ ప్రత్యక్షపరచబడియున్నామని
నమ్ముచున్నాను.
మేము ప్రభువు విషయమైన భయమును ఎరిగి మనుష్యులను ప్రేరేపిస్తున్నాము
అంటున్నారు! మొదట పౌలుగారికి దేవుడు అంటే భయము ఉంది ఇంకా చెప్పాలంటే పౌలుగారి
భక్తి దేవుని భయముతో నిండి ఉంది!
నేటిరోజులలో అనేకులకు దేవుడు అంటే భక్తి ఉంది గాని భయములేకుండా పోయింది! నిజానికి
దేవుడంటే భయము ఉంటే నోటితో అబద్దాలు పలకము, వ్యభిచారం చేయము, మత్తు పానీయాలు
త్రాగరు, ఇంకా చెప్పాలంటే దేవుని మందిరానికి భయంకరమైన వస్త్రధారణతో రారు,
మందిరానికి వచ్చి వాక్యము జరుగుతుంటే వీరితోనూ వారితోనూ మాట్లాడటం చేయరు, వాక్యం,
జరుగుతా ఉంతే సెల్ ఫోన్లో ఏ మెసేజ్
వచ్చింది అని చూడరు, కాళ్లుచాపుకుని కూర్చోరు ! ఎంతో భయ భక్తులు కలిగి వణుకుతూ
ఉంటారు ఆయన మందిరంలో! భయము లేనందువలనే నీవు అలా జీవిస్తున్నావు! నిజంగా ఆయన ఎవరో
గుర్తెరిగితే నీ ప్రవర్తన అలా గుండదు ఎప్పటికీ!!!
“ప్రభువుపట్ల భయం”– కోసం పౌలుగారు
అంటున్నారు:రోమీయులకు 3:18
వారి కన్నుల యెదుట దేవుని భయము లేదు.
దావీదు గారు అంటున్నారు: కీర్తనల గ్రంథము 36:1. భక్తిహీనుల హృదయములో అతిక్రమము
దేవోక్తివలె పలుకుచున్నది వాని దృష్టియెదుట దేవుని భయము బొత్తిగాలేదు.
ఆదికాండము 20:11లో
అబ్రాహాము గారు అంటున్నారు: అబ్రాహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు
గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసితిని. ; అందుకే దావీదు గారు కీర్తనల గ్రంథము 34:11-14లో అంటున్నారు:
కీర్తనల గ్రంథము 34
11. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవాయందలి
భయభక్తులు మీకు నేర్పెదను.
12. బ్రతుక గోరువాడెవడైన నున్నాడా? మేలునొందుచు అనేక
దినములు బ్రతుక గోరువాడెవడైన నున్నాడా?
14. కీడు చేయుట మాని మేలు చేయుము సమాధానము వెదకి దాని
వెంటాడుము.
పేతురు గారు అంటున్నారు: 1 పేతురు 3:10. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు
వాడు చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను
కాచుకొనవలెను.
కీర్తనల గ్రంథము
111:10. యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనముల ననుసరించువారందరు
మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది.
సామెతలు 1
7. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము
మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు.
దేవుని
గూర్చిన భయము ఉన్నప్పుడే రాబోయే తీర్పును గురించిన ఆలోచనలు దీన్ని అతనికి గుర్తు
చేస్తాయి! పౌలుగారి పరిచర్యకు ఇది
శక్తివంతమైన ఒక ప్రేరణ.
కాబట్టి
ప్రియ సహోదరి సహోదారులారా మనము కూడా ఇలాంటి దేవుని పట్ల భయము కలిగిన భక్తితో
దేవుని ముందర బ్రతుకుదాము!
దైవాశీస్సులు!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*133వ భాగము*
2 కొరింథీ 5:11 –16
11. కావున మేము ప్రభువు విషయమైన భయము నెరిగి మనుష్యులను
ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడినవారము; మీ మనస్సాక్షులకు కూడ
ప్రత్యక్షపరచబడియున్నామని నమ్ముచున్నాను.
12. మమ్మును మేమే మీ యెదుట తిరిగి మెప్పించుకొనుట లేదు
గాని, హృదయమునందు అతిశయపడక పైరూపమునందే అతిశయపడువారికి ప్రత్యుత్తర మిచ్చుటకు మీకు
ఆధారము కలుగవలెనని మా విషయమై మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము.
13. ఏలయనగా మేము వెఱ్రివారమైతిమా దేవుని నిమిత్తమే;
స్వస్థబుద్ధిగలవారమైతిమా మీ నిమిత్తమే.
14. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది; ఏలాగనగా
అందరికొరకు ఒకడు మృతిపొందెను గనుక అందరును మృతిపొందిరనియు,
15. జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది
తిరిగి లేచినవానికొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెననియు నిశ్చయించు
కొనుచున్నాము.
16. కావున ఇకమీదట మేము శరీరరీతిగా ఎవనినైనను ఎరుగము; మేము
క్రీస్తును శరీరరీతిగా ఎరిగియుండినను ఇకమీదట ఆయనను ఆలాగు ఎరుగము.
ప్రియులారా! మనం 2 వ కొరింథీ
పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము! ఈ దేహం అశాశ్వతమైనది! పరము నిత్యమైనది
అని చెబుతున్నారు!
(గతభాగం తఱువాయి)
ఇక 12 వ వచనంలో అంటున్నారు: మమ్మును మేమే మీ యెదుట తిరిగి
మెప్పించుకొనుట లేదు గాని, హృదయమునందు అతిశయపడక పైరూపమునందే అతిశయపడువారికి
ప్రత్యుత్తర మిచ్చుటకు మీకు ఆధారము కలుగవలెనని మా విషయమై మీకు అతిశయ కారణము
కలిగించుచున్నాము. చూడండి మాకు మేమే సెహభాస్ అని చెప్పుకోవడం లేదు గాని మా
హృదయమందు దీనికోసం అతిశయపడటం కూడా చేయడం లేదు గాని పై రూపమునందే అతిశయపడు వారికి
ప్రత్యుత్తరం చెప్పాలనే మేము ఈ విషయాలు చెబుతున్నాము అంటున్నారు!
2 కోరింథీయులకు 1:12-14; 2 కోరింథీయులకు 3:1-3. ఈ వచనంలో మరోసారి
కొరింతులో ఉన్న తన విరోధులను పౌలుగారు ప్రస్తావిస్తున్నారు (2 కోరింథీయులకు
11:13-15). అక్కడి విశ్వాసులు తన విషయం గర్వపడాలి – అంటే తాను
నిజమైన అపోస్తలుడే అనీ, దేవుని సత్యాన్ని ఉపదేశించేవాడే అనీ వారు నిశ్చయతతో
నిశ్చింతగా ఉండాలి. అప్పుడు కేవలం బయటి విషయాలనుబట్టే అతిశయిస్తున్న దుర్బోధకులకు
వారు జవాబు చెప్పగలుగుతారు.
అందుకే
గత అధ్యాయాలలో అంటున్నారు:
2 కోరింథీయులకు 1:13. మీరు
చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప, మరేవియు మీకు వ్రాయుట లేదు; కడవరకు
వీటిని ఒప్పుకొందురని నిరీక్షించుచున్నాము.
14. మరియు మన ప్రభువైన యేసుయొక్క దినమందు మీరు మాకేలాగో, ఆలాగే
మేము మీకును అతిశయకారణమై యుందుమని, మీరు కొంత మట్టుకు మమ్మును ఒప్పుకొనియున్నారు.
12. మా అతిశయమేదనగా, లౌకిక జ్ఞానము ననుసరింపక, దేవుడనుగ్రహించు
పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటి మనియు,
విశేషముగా మీయెడలను నడుచుకొంటిమనియు, మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే
2 కోరింథీయులకు 3:1.
మమ్మును మేమే తిరిగి మెప్పించుకొన మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు
మీయొద్దకైనను మీ యొద్దనుండియైనను సిఫారసు పత్రికలు మాకు అవసరమా?
2. మా హృదయములమీద వ్రాయబడియుండి, మనుష్యులందరు తెలిసికొనుచు
చదువుకొనుచున్న మా పత్రిక మీరేకారా?
3. రాతిపలకమీదగాని సిరాతోగాని వ్రాయబడక, మెత్తని హృదయములు అను
పలకలమీద జీవముగల దేవుని ఆత్మతో, మా పరిచర్యమూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయై
యున్నారని మీరు తేటపరచబడుచున్నారు.
ఇక 13 వ వచనంలో అంటున్నారు: ఏలయనగా మేము వెఱ్రివారమైతిమా దేవుని
నిమిత్తమే; స్వస్థబుద్ధిగలవారమైతిమా మీ నిమిత్తమే.
గమనించాలి పౌలుగారి విరోధులు అతణ్ణి మతిలేనివాడు అన్నారు! కొన్నిసార్లు అతడు పిచ్చి పట్టినట్టు
ప్రవర్తిస్తాడని అక్కడి విశ్వాసులు తలంచారు! (మార్కు 3:21; అపో. కార్యములు 26:24;
1 కోరింథీయులకు 4:10 పోల్చి చూడండి.) తాను ఏదైనప్పటికీ, తన ప్రవర్తన వారికెలా
కనిపించినప్పటికీ, అది దేవుని కోసం, వారికోసం గాని తనకోసం కాదు. ఇది వారు
తెలుసుకోవాలని అతని ఉద్దేశం. గమనించాలి
యేసుక్రీస్తుప్రభులవారి కోసం కూడా ప్రజలు అలాగే తలంచారు: మార్కు 3: 21. ఆయన ఇంటివారు సంగతి విని, ఆయన మతి
చలించియున్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి.
పౌలుగారిని ఒకరాజు అంటున్నాడు: అపో. కార్యములు 26:24. అతడు ఈలాగు సమాధానము చెప్పుకొనుచుండగా
ఫేస్తు- పౌలా, నీవు వెఱ్ఱివాడవు, అతి విద్యవలన నీకు వెఱ్ఱిపట్టినదని గొప్ప
శబ్దముతో చెప్పెను.
అందుకే
మొదటి పత్రికలో పౌలుగారు రాస్తున్నారు: 1
కోరింథీయులకు 4:10. మేముక్రీస్తు
నిమిత్తము వెఱ్ఱివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు; మేము బలహీనులము, మీరు
బలవంతులు; మీరు ఘనులు, మేము ఘనహీనులము.
ఏదిఏమైనా
ఈ వచనాల ప్రకారం మనకు ఏమి అర్ధం అవుతుంది అంటే పౌలుగారు తనను ఎవరు ఏమని అనుకున్నా
తనకు కావలసిఉంది క్రీస్తు సువార్త ప్రకటించబడాలి! దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి
ఆయనను బలవంతం చేస్తుంది!
యోహాను
2:17. ఆయన శిష్యులు నీ యింటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయ
బడియున్నట్టు జ్ఞాపకము చేసికొనిరి.
కక్ష
చేతగాని మిషచేతగాని ఎలాగైనా క్రీస్తు సువార్త ప్రకటించబడుతుంది అని మరొదగ్గర
చెబుతున్నారు పౌలుగారు!!!
ఫిలిప్పీయులకు 1: 18
అయిననేమి? మిషచేతనేగాని సత్యముచేతనే గాని, యేవిధముచేతనైనను
క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను. ఇక ముందును
సంతోషింతును.
ప్రియ
సేవకూడా! విశ్వాసి! నీకు ఇలాంటి దేవుని సువార్త కోసం ఆలోచన తెగింపు ఆసక్తి ఉన్నదా?
దైవాశీస్సులు!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*134వ భాగము*
2 కొరింథీ 5:11 –16
11. కావున మేము ప్రభువు విషయమైన భయము నెరిగి మనుష్యులను
ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడినవారము; మీ మనస్సాక్షులకు కూడ ప్రత్యక్షపరచబడియున్నామని
నమ్ముచున్నాను.
12. మమ్మును మేమే మీ యెదుట తిరిగి మెప్పించుకొనుట లేదు
గాని, హృదయమునందు అతిశయపడక పైరూపమునందే అతిశయపడువారికి ప్రత్యుత్తర మిచ్చుటకు మీకు
ఆధారము కలుగవలెనని మా విషయమై మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము.
13. ఏలయనగా మేము వెఱ్రివారమైతిమా దేవుని నిమిత్తమే;
స్వస్థబుద్ధిగలవారమైతిమా మీ నిమిత్తమే.
14. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది; ఏలాగనగా
అందరికొరకు ఒకడు మృతిపొందెను గనుక అందరును మృతిపొందిరనియు,
15. జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది
తిరిగి లేచినవానికొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెననియు నిశ్చయించు
కొనుచున్నాము.
16. కావున ఇకమీదట మేము శరీరరీతిగా ఎవనినైనను ఎరుగము; మేము
క్రీస్తును శరీరరీతిగా ఎరిగియుండినను ఇకమీదట ఆయనను ఆలాగు ఎరుగము.
ప్రియులారా! మనం 2 వ కొరింథీ
పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము! ఈ దేహం అశాశ్వతమైనది! పరము నిత్యమైనది
అని చెబుతున్నారు!
(గతభాగం తఱువాయి)
ఇక 14 వ వచనంలో అంటున్నారు! 14. క్రీస్తు ప్రేమ
మమ్మును బలవంతము చేయుచున్నది; ఏలాగనగా అందరికొరకు ఒకడు మృతిపొందెను గనుక అందరును
మృతిపొందిరనియు,
15. జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది
తిరిగి లేచినవానికొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెననియు నిశ్చయించు
కొనుచున్నాము.
చూడండి క్రీస్తుప్రేమ
పౌలుగారిని ఇంకా తనతో పాటుగా ఉన్నవారిని బలవంతం చేస్తుంది, దేని కోసం
బలవంతం చేస్తుంది అంటే క్రీస్తు కోసమే జీవించాలి అని! జాగ్రత్తగా పరిశీలిస్తే అతని
పరిచర్య వెనుక గల ప్రేరణ మరొకటి. ఇది 11వ వచనం లో ఉన్నదానికంటే గొప్పది.
పౌలుగారు చేసినదంతా దేవునికోసం, ఇతరుల
మేలుకోసం ఎలా చేయగలుగుతున్నారు? క్రీస్తు ప్రేమ తనకు తెలిసి ఉండడం, హృదయంలో అది
అతనికి అనుభవం కావడం (రోమీయులకు 5:5) అతణ్ణి దేవుని పనికి పురిగొల్పే శక్తివంతమైన
ప్రేరణ ఇది. అందరు విశ్వాసుల్లో ఉన్నట్టుగానే క్రీస్తు అతనిలో ఉన్నారు . అందువల్ల
క్రీస్తు ప్రేమ అతనిలో ఉంది. అతడు క్రీస్తుకు పూర్తిగా లోబడి ఉన్నారు కాబట్టి
క్రీస్తు ప్రేమక్కూడా పూర్తిగా లోబడి ఉన్నారు. క్రీస్తు ప్రేమ అంటే క్రీస్తుపట్ల
పౌలుగారి కున్న ప్రేమ కాదు గాని మనుషులందరిపట్ల క్రీస్తుకున్న ప్రేమ.
1 యోహాను 4:10, 1 యోహాను 4:19
చూడండి. గలతియులకు 2:20 చూడండి.
1 John(మొదటి యోహాను) 4:10,19
10.మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి,
మన పాపములకు ప్రాయశ్చిత్తమైయుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది.
19.ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము
ప్రేమించుచున్నాము.
గలతియులకు 2: 20
నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను
జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు
జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని
కుమారునియందలి విశ్వాసము వలన జీవించుచున్నాను.
“అందరికోసమూ”– క్రీస్తు మనుషులందరి కోసమూ చనిపోయాడు. వారి పాపాల మూలంగా వారంతా
చనిపోవలసి ఉంది. వారి స్థానంలో ఆయన చనిపోయాడు (వ 19; యోహాను 1:29; యోహాను 3:16; 1
తిమోతికి 2:6; హెబ్రీయులకు 2:9; 1 పేతురు 3:18; 1 యోహాను 2:2). అందువల్ల క్రీస్తు
చనిపోయినప్పుడు దేవుని దృష్టిలో “అందరూ చనిపోయారు”, మానవజాతి ప్రతినిధికి ఏమి
జరిగిందో మానవజాతి అంతటికీ ఇదే జరిగినట్టు లెక్క. అంటే మనుషులందరికీ పాపవిముక్తి
లభించిందని అర్థం కాదు. క్రీస్తు వారికోసం చనిపోయినంత మాత్రాన మనుషులకు
పాపవిముక్తి కలగదు – వారు దేవునితో
సఖ్యపడాలి (వ 20), పశ్చాత్తాపపడి క్రీస్తులో నమ్మకముంచాలి (లూకా 13:3; యోహాను
3:36; యోహాను 8:24; అపో. కార్యములు 17:30); ఆయన మరణంలోకి వారు “బాప్తిసం” పొందాలి
(రోమీయులకు 6:3). అలా కాని పక్షంలో ఎవరికీ పాపవిముక్తి లేదు. మనుషులందరినీ దేవుడు
క్షమించే అవకాశాన్ని క్రీస్తు మరణం కల్పించింది. కానీ క్షమాపణ కోసం క్రీస్తుద్వారా
ఆయనవైపు తిరిగినవారికే పాపవిముక్తి. “అందరికోసమూ చనిపోయాడు” అనే మాటకు వేరే అర్థం
చెప్పారు కొందరు. అదేమంటే దేవుడు ఎన్నుకుని క్రీస్తుకు ఇచ్చినవారందరి (యోహాను
6:37; యోహాను 17:6) కోసం మాత్రమే ఆయన చనిపోయాడు. ఎక్కువమంది వ్యాఖ్యాతలు ఈ వివరణతో
ఏకీభవిస్తారు. దేన్ని తీసుకున్నప్పటికీ ఒక విషయం మాత్రం చాలా స్పష్టం. క్రీస్తు
మరణం వల్ల కలిగిన శాశ్వత లాభాలు ఆయన్ను నమ్మినవారికి మాత్రమే కలుగుతాయి, మనుషు
లందరికీ కాదు.
15. జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది
తిరిగి లేచినవానికొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెననియు నిశ్చయించు
కొనుచున్నాము.
క్రీస్తు మరణంలో ఉన్న ఒక గొప్ప ఉద్దేశం ఇది. స్వప్రయోజనాలను
చూసుకునే స్వార్థపూరితమైన వారి జీవితం నుంచి మనుషులను దారి మళ్ళించి వారు
క్రీస్తుకే తమ హృదయాల్లో కేంద్ర స్థానంమిచ్చేలా చేయడమే. రోమీయులకు 14:9 కూడా
చూడండి. పౌలుగారి విషయంలో కలిగిన ఫలితం ఇదేనని మనం చూశాం (వ 9). మనలో కూడా ఇదే
ఫలితం కనిపిస్తున్నదా? అలా కాకపోతే మనం అసలు క్రీస్తు నెరిగిన వారమేనా? మన నమ్మకం
వాస్తవమైనదేనా? అని చూచుకోవలసి ఉంది.
ఆయన మరణంలోకి “బాప్తిసం”
పొందడమంటే ఆయన కొత్త జీవితంలోకి కూడా బాప్తిసం పొందడమే. దీని ఫలితం పూర్తిగా కొత్త
జీవిత విధానం (వ 17; రోమీయులకు 6:4-7). మనిషి తన కోసమే జీవించడం అన్నిటికన్నా మహా
విపత్తు, గొప్ప ఆపద. క్రీస్తు కోసం జీవించడం అన్నిటికన్నా ధన్యకరమైనది. మత్తయి
10:37-39; లూకా 9:23; లూకా 14:26 చూడండి.
16. కావున ఇకమీదట మేము శరీరరీతిగా ఎవనినైనను ఎరుగము; మేము
క్రీస్తును శరీరరీతిగా ఎరిగియుండినను ఇకమీదట ఆయనను ఆలాగు ఎరుగము.
క్రీస్తులో
విశ్వాసి కాకమునుపు పౌలుగార్కి
ఆధ్యాత్మికమైన జ్ఞానమే లేకుండా క్రీస్తుతో సహా ఇతరులందరినీ బయటి విషయాలను
బట్టే అర్థం చేసుకోవాలని ప్రయత్నించేవాడు. యోహాను 8:15 చూడండి. అయితే క్రీస్తు
మరణంలోని అర్థం తెలియడంవల్ల పైరూపాన్ని బట్టి అభిప్రాయ మేర్పరచుకునే అతని
మనస్తత్వం మారిపోయింది. ప్రతి ఒక్కరినీ క్రీస్తుతో వారికున్న సంబంధం దృష్టితో
చూడడం మొదలుపెట్టాడు.
మనము
కూడా ఇలాంటి ఆలోచనా విధానంలోనే ఉండాలి!
నిజంగా క్రీస్తు మనకోసం ఎందుకోసం చనిపోయారో ఆయన ప్రేమ ఎట్టిదో గుర్తెరిగి ఆయన మార్గంలో నడిచిపోదాం!
దైవాశీస్సులు!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*135వ భాగము*
2 కొరింథీ 5:16 –21
17. కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి;
పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;
18. సమస్తమును దేవుని వలననైనవి; ఆయన మనలను క్రీస్తుద్వారా
తనతో సమాధానపరచుకొని, ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను.
19. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక,
క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు, ఆ సమాధానవాక్యమును మాకు అప్పగించెను.
20. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు
రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును
బతిమాలుకొనుచున్నాము.
21. ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని
ఆయనను మనకోసము పాపముగాచేసెను.
ప్రియులారా! మనం 2 వ కొరింథీ
పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!
(గతభాగం తఱువాయి)
ఇక
17వ వచనంలో అంటున్నారు! కాగా ఎవడైనను
క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;
18. సమస్తమును దేవుని వలననైనవి; ఆయన మనలను క్రీస్తుద్వారా
తనతో సమాధానపరచుకొని, ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను.
ఎవడైనా
క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టిగా మారిపోతాడు కనుక పాతవి గతించెను అనగా పాత
స్వభావము గతించాలి, ఇంకా చెప్పాలంటే పాపపు క్రియలు అన్నీ వదిలేయాలి! పాత భూతులు,
త్రాగుడు, అక్రమ సంబంధాలు , వ్యభిచారం, లంచగొండి తనం, అవిశ్వాసం, విగ్రహారాధన,
సినిమాలు సీరియళ్ళు అన్యాచారాలు అన్నీ పోవాలి! నూతన సృష్టిగా క్రీస్తు రూపములోనికి
మారాలి అంటున్నారు!
యెషయా
గారు అంటున్నారు: యెషయా 43:18. మునుపటివాటిని జ్ఞాపకము చేసికొనకుడి
పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి.
19. ఇదిగో నేనొక నూతనక్రియ చేయుచున్నాను ఇప్పుడే అది
మొలుచును మీరు దాని నాలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను ఎడారిలో
నదులు పారజేయుచున్నాను.
20. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్ళు
పుట్టించుచున్నాను ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను అడవి జంతువులును అడవి కుక్కలును
నిప్పుకోళ్లును నన్ను ఘనపరచును
21. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్త్రోత్రమును
ప్రచురము చేయుదురు.
ఒకరోజు దేవుడు కూడా అన్నింటినీ నూతనముగా చేయబోతున్నారు: ప్రకటన గ్రంథం
21:5. అప్పుడు సింహాసనాసీనుడైయున్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా
చేయుచున్నానని చెప్పెను; మరియు--ఈ మాటలు నమ్మకమును నిజమునై యున్నవి గనుక వ్రాయుమని
ఆయన నాతో చెప్పుచున్నాడు
పేతురు గారు ఏమి చెబుతున్నారో చూద్దాం: 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన
వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము,
ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన
ప్రజలునై యున్నారు.
“కాబట్టి”– అనే పదం దీన్ని పై
వచనాలకు జోడిస్తున్నది. క్రీస్తులో ఉన్న వ్యక్తి కొత్త సృష్టి. అందువల్ల సహజంగా
క్రీస్తును గురించి, ఇతరుల గురించి, తన గురించి అతని అభిప్రాయం ఇంతకు ముందున్నట్టు
ఉండదు.
“క్రీస్తునందు అనగా
క్రీస్తు లో”– క్రీస్తులో ఉండటం కోసం మనకు క్రింది వచనాలలో చూసుకుంటే: యోహాను
17:20-21; రోమీయులకు 6:3, రోమీయులకు 6:5; రోమీయులకు 8:1; 1 కోరింథీయులకు 1:1; 1
కోరింథీయులకు 12:12-13; ఎఫెసీయులకు 1:1, ఎఫెసీయులకు 1:4.
“కొత్త సృష్టి”– అంటే ఆధ్యాత్మిక జన్మ (యోహాను 1:12-13; యోహాను 3:3-8; తీతుకు 3:5;
1 పేతురు 1:23). దాన్ని అనుభవించినవారు మరి ఇక ఎన్నడూ వెనుకటి మాదిరిగా ఉండలేరు.
తమకోసం జీవించడం, లోకం దృష్టితో ఇతరులను, క్రీస్తును చూడడం అనే పాత ధోరణి
మారిపోతుంది. పాత తలంపులు, ఉద్దేశాలు, నియమాలు సమసిపోతాయి. నూతన సత్యాలు, వాటికి
అనుగుణంగా జీవించే శక్తి, కొత్త తలంపులు, ఉద్దేశాలు హృదయంలో ప్రవేశిస్తాయి. ఇది
పౌలువంటి గొప్పవారి విషయంలో మాత్రమే గాక క్రీస్తులో ఉన్న ఎవరి విషయంలోనైనా
సత్యమేనని జాగ్రత్తగా గమనిద్దాం.
ఇంకా అంటున్నారు: సమస్తమును దేవుని వలననైనవి; ఆయన మనలను
క్రీస్తుద్వారా తనతో సమాధానపరచుకొని, ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను.
గమనించండి సమస్తము దేవుని వలనైనవి అంటున్నారు: దీనికోసం – యోహాను 1:13; ఎఫెసీయులకు 2:10; ఎఫెసీయులకు 4:24; యాకోబు 1:18
చూడండి.
మనుషులు పాత అలవాట్లు మానుకుని కొత్త జీవితం ఆరంభించవచ్చు గానీ
తమలో కొత్త జీవాన్ని సృష్టించుకోలేరు. ఇది కష్టం మాత్రమే కాదు, అసాధ్యం. మొదటి
సృష్టిని చేయడం (ఆదికాండము 1:1) వారికెలా అసాధ్యమో ఇదీ అంతే అసాధ్యం.
ఇక “సమాధాన పరచుకోవడం”– అంటే శత్రువులను మిత్రులుగా మార్చడం, శత్రుత్వానికీ, ఎడబాటుకూ
ఉన్న కారణాన్ని తొలగించడం. పాపం మనుషుల్ని దేవునికి శత్రువులుగా చేసింది
(రోమీయులకు 5:10; కొలొస్సయులకు 1:21).
వారి పాపాల మూలంగా దేవుని కోపం వారిపై ఉంది (రోమీయులకు 1:18. కీర్తనల
గ్రంథము 90:7-11; యోహాను 3:36). మనుషులను తనతో సఖ్యపరచుకోవాలంటే వారిలో తనకు కోపం
కలిగించినదాన్నీ, వారిని తనకు దూరం చేసేదాన్నీ మనుషులు తీసివేసుకోవాలి లేకపోతే
దేవుడు దానిని స్వయంగా పరిష్కరించాలి. లోక
పాపాలకోసం బలి అర్పణంగా ఉండేందుకు తన కుమారుణ్ణి పంపడం ద్వారా ఆయన ఇది చేశాడు (వ
14 నోట్లో రిఫరెన్సులు). “క్రీస్తు ద్వారా” దేవుడు మనుషులను సఖ్యపరచుకున్నాడు.
ఎఫెసీయులకు 2:16; కొలొస్సయులకు 1:20, కొలొస్సయులకు 1:22. ఇలా చేసి ఈ శుభవార్తను
ప్రకటించేందుకు అన్ని వైపులకూ తన సేవకులను పంపుతున్నాడు. “సమాధాన పరిచే పరిచర్య
మాకిచ్చాడు” అంటే అర్థం ఇదే.
కాబట్టి ఇంతటి ఘనమైన కృపను పొందుకున్న ప్రతీ విశ్వాసి దేవునికి
లోబడి పాత స్వభావాలు వదిలేసి దేవుని కోసం బ్రతుకుతూ క్రీస్తులో జీవించాలి. ఇక అటువంటి సమాధాన పరిచే పరిచర్యలో
పాలిభాగస్టులైన ప్రతీ దైవజనుడు విశ్వాసి కూడా సత్యసువార్తను ప్రకటిస్తూ మనుష్యులను
దేవునితో సమాధాన పరిచాలి!!
దైవాశీస్సులు!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*136వ భాగము*
2 కొరింథీ 5:16 – 21
17. కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి;
పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;
18. సమస్తమును దేవుని వలననైనవి; ఆయన మనలను క్రీస్తుద్వారా
తనతో సమాధానపరచుకొని, ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను.
19. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక,
క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు, ఆ సమాధానవాక్యమును మాకు అప్పగించెను.
20. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు
రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును
బతిమాలుకొనుచున్నాము.
21. ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని
ఆయనను మనకోసము పాపముగాచేసెను.
ప్రియులారా! మనం 2 వ కొరింథీ
పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!
(గతభాగం తఱువాయి)
ఇక
19 వ వచనంలో అంటున్నారు! అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక,
క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు, ఆ సమాధానవాక్యమును మాకు అప్పగించెను.
చూడండి దేవుడు వారి అపరాధములను అనగా మన అపరాధాలు మనమీద మోపకుండా,
మనలను క్రీస్తుతో సమాధాన పరచాలని ఆ సమాధాన వాక్యమును మాకు అనగా దైవసేవకులకు
విశ్వాసులకు అప్పగించారు అంటున్నారు!
ప్రకటించాలని దేవుడు తన
సేవకులకు ఇచ్చిన “సమాధాన పరిచే పరిచర్య” ఇదే. వ 18లో పౌలు “దేవుడు మమ్ములను తనతో
సమాధాన పరచుకున్నాడు” అన్నారు. ఇప్పుడు దేవుడు “లోకాన్ని” తనతో సమాధాన పరచుకునే
సంగతి గురించి పౌలుగారు మాట్లాడుతున్నారు.
ఇది భూతకాలంలో ఉంది. యేసు క్రీస్తు మరణం ద్వారా తనకు, తన స్నేహాన్ని కోరిన ఏ
వ్యక్తికైనా సరే అలాంటి శాశ్వత స్నేహం ఉండేందుకు పునాది వేశాడు. మనుషుల అపరాధాలు
వారిమీద మోపకుండా, వాటిని క్రీస్తు మీద మోపారు దేవుడు! (వ 21; యోహాను 1:29; యెషయా
53:5-6). అంటే మనుషులంతా పాపవిముక్తి పొందుతారని అర్థం కాదు. అందరూ పాపవిముక్తి
పొందేందుకు మార్గం సిద్ధమైందని దీని అర్థం. పాపవిముక్తి పొందాలంటే దేవుడు తమకోసం
చేసిన దాన్ని మనుషులు స్వీకరించి, క్రీస్తులో నమ్మకం పెట్టుకోవాలి. అలా చేయకపోతే
నశించిపోతారు (యోహాను 3:16, యోహాను 3:36).
ఇక 20 వ వచనంలో అంటున్నారు కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు
మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును
బతిమాలుకొనుచున్నాము. చూడండి: దేవుడు ఏర్పాటుచేసిన మార్గంలో దయచేసి పయనించండి
ఎందుకంటే దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు అపొస్తలులుగా ఉన్నందువలన
ఇప్పుడు మీరు దేవునితో సమాధాన పడండి అని దేవుని పేరిట మిమ్మును
బ్రతిమాలుకుంటున్నాము అంటున్నారు!
యెషయా 52:7. సువార్త ప్రకటించుచు
సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని
పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతములమీద
ఎంతో సుందరములై యున్నవి.
సమాధాన పరచడంలో దేవుని పాత్ర రెండు విధాలుగా ఉంది. మన పాపాలకోసం
చనిపోయేందుకు ఆయన తన కుమారుణ్ణి పంపాడు, ఈ సత్యాన్ని ప్రకటించేందుకు తన సేవకులను
నలుమూలలకూ పంపాడు. అయితే ఇందులో మనుషులు చేయవలసినది కూడా ఉంది – “దేవునితో సమాధాన పడండి” అంటూ ప్రకటించాలి! అంటే క్రీస్తు ద్వారా
దేవుడు చేసిన ఈ ఏర్పాటును ఉపయోగించు కోవాలి. అంటే పశ్చాత్తాపపడి క్రీస్తు
సువార్తను నమ్మాలి. పౌలుగారు (లేక
సువార్తను ప్రకటించేందుకు దేవుడు పంపే వారెవరైనా) క్రీస్తుయొక్క దూత. దూత అంటే
ఒకరికి లేక కొందరికి ప్రతినిధిగా వేరే చోటుకు వెళ్ళేవాడు. అతడు తన సొంత అధికారంతో
ఎప్పుడూ మాట్లాడడు, ఏదీ చెయ్యడు. అతణ్ణి పంపినవాడు ఏది చెప్పాలంటే అది చెప్తాడు.
క్రీస్తు పరలోకంలో ఉన్నారు. అయితే ఆయన పంపినవారు భూమిపై ఆయన పేరున మాట్లాడుతూ ఆయన
సందేశాన్ని వినిపిస్తూ ఉన్నారు. క్రీస్తు వారిద్వారా పిలుస్తూ వారిని “వేడుకుంటూ” ఉన్నారు. పాపవిముక్తి పొందండి అంటూ
దేవుడు మనుషులనెలా బ్రతిమాలుతున్నారో చూడండి. యెహెఙ్కేలు 18:30-32 చూడండి.
30. కాబట్టి ఇశ్రాయేలీయులారా, యెవని ప్రవర్తననుబట్టి వానికి
శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షాకారణములు
కాకుండునట్లు వాటినన్నిటిని విడిచిపెట్టుడి.
31. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన
హృదయమును నూతన బుద్దియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము
నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
32. మరణమునొందువాడు మరణము నొందుటనుబట్టి నేను
సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రదుకుదురు;
ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
ఇక
చివరి వచనంలో అంటున్నారు: ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని
ఆయనను మనకోసము పాపముగాచేసెను. చూడండి పాపము చేయని యేసుక్రీస్తును మనకోసమే దేవుడు
పాపముగా చేసేశారు తన కుమారుని!!
ఇక్కడ
గొప్ప సత్యాలు నాలుగు చెబుతున్నారు పౌలుగారు ఆత్మా వేసుడై ఒకటి,
1). క్రీస్తులో ఏ పాపం లేదు (యోహాను 8:46; హెబ్రీయులకు 4:15; హెబ్రీయులకు
7:26; 1 పేతురు 2:22; 1 యోహాను 3:5).
రెండు, దేవుడాయనను పాపంగా చేశాడు – అంటే లోకమంతటి పాపాలను
ఆయనపై మోపాడు. ఆ దోషాన్నీ ఆ శిక్షనూ క్రీస్తు భరించాడు. ఆయనే పాపమై ఉన్నట్టు
దేవుడు పరిగణించాడు.
మూడు,
దేవుడు అలా ఎందుకు చేశాడు అంటే మనకోసమే!! (వ 14; 1 పేతురు 3:18; 1 యోహాను 4:10).
నాలుగు,
ఇందులో దేవుని ఉద్దేశమేమిటంటే విశ్వాసులు క్రీస్తులో దేవుని నీతిగా కావాలని. ఇది వారిని నిర్దోషులుగా లెక్కించడం
గురించి (రోమీయులకు 3:21-26) చెప్తున్నది, క్రీస్తుతో ఐక్యత కలగడం గురించి (యోహాను
17:20-23; రోమీయులకు 6:3-8; ఎఫెసీయులకు 1:1, ఎఫెసీయులకు 1:4) చెప్తున్నది. దేవుని
నీతి స్వయంగా క్రీస్తే (1 కోరింథీయులకు
1:30; రోమీయులకు 3:21-24; అపో. కార్యములు 3:14). విశ్వాసులు ఆయనతో ఐక్యత
కలిగినవారు కాబట్టి ఆయనలో వారు న్యాయవంతులుగా , నీతిమంతులుగా మారారు. దేవుని ఎదుట
క్రీస్తు ఏమిటో విశ్వాసులు కూడా దేవుని లెక్కకు అదే అయ్యారు.
కాబట్టి
ఈ సత్యము తెలుసుకుని నూతన స్వభావము కలిగిన నూతన సృష్టిగా మారి నీతిమంతులుగా
పరిశుద్దులుగా జీవిద్దాం !
దైవాశీస్సులు!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*137వ భాగము*
2 కొరింథీ 6:1– 3
1. కాగా మేమాయనతోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము
చేసికొనవద్దని మిమ్మును వేడుకొను చున్నాము.
2. అనుకూల సమయమందు నీ మొర నాలకించితిని; రక్షణ దినమందు
నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు గదా!
3. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే
రక్షణ దినము.
ప్రియులారా! మనం 2 వ కొరింథీ
పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము! ఇంతవరకు రెండవ పత్రికనుండి అనేక విషయాలు
నేర్చుకున్నాము! ఇక ఈ ఆరవ అధ్యాయంలో మూడు ప్రాముఖ్యమైన విషయాల కోసం చెబుతున్నారు!
మొదటిది: దేవుడు అనుకూలసమయంలో మనకు జవాబిస్తారు! నేడే అనుకూల సమయం,
ఇదే రక్షణ దినము అంటున్నారు!
రెండవది: పౌలుగారు మరియు మిగిలిన అపోస్టలులు ఇంకా మనము కూడా
పొందుకున్న పరిచర్య ఎన్ని ఆటంకాలు కలిగినా బాధలు శ్రమలు కలిగినా అన్నింటినీ
ఓర్చుకుని దేవుని దగ్గర మమ్మును మేమే మెప్పించుకుంటున్నాము ఎందుకంటే దేవుని నుండి
మనము పొందబోయే మేలులు మరియు పరలోక సౌఖ్యము కోసం ఇంకా క్రీస్తు పొందిన
శ్రమానుభవములో సహానుభవము పొందటానికి!
మూడవది: ఇటువంటి రక్షణ మరియు పరిచర్య పొందిన మనము లోకముతో కలిసి
ఉండకూడదు! లోకమునకు వేరై జీవించాల్సిన అవసరం ఉంది ఉంటున్నారు!
ఇక ఈరోజు మొదటి విషయం
ధ్యానం చేసుకుందాం! మేము ఆయన తోడిపనివారము కాబట్టి ఇప్పుడు మేము ఆయన పక్షముగా
వేడుకొనేది ఏమిటంటే మీరు పొందిన ఈ ఘనమైన దేవుని కృపను మీరు వ్యర్ధం చేసుకోవద్దు
అంటున్నారు!
చూడండి పౌలుగారు ఏమంటున్నారు ఇక్కడ? మేము దేవునితో పాటుగా
జతపనివారమై ఉన్నాము! అనగా ఈ పరిచర్యలో మేము క్రీస్తుతో పాటుగా క్రీస్తుతో కలిసి
మేము ఆయనపనిని చేస్తున్నాము! చూడండి మూడవ అధ్యాయంలో అంటున్నారు కదా 1
కోరింథీయులకు 3:9. మేము దేవుని జతపనివారమై
యున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై యున్నారు. ఇక గత 5 వ అధ్యాయంలో
అంటున్నారు 2 కోరింథీయులకు 5:20. కావున
దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని
క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. అక్కడ సమాధాన పడమని బ్రతిమాలితే
ఇక్కడ క్రీస్తు పక్షముగా మీరు పొందిన క్రీస్తు యొక్క కృపను మీరు వ్యర్ధం
చేసుకోవద్దు అంటున్నారు! ఇంతకీ దేవుని కృప
అనగా ఏమిటి ?
2 కోరింథీయులకు 5:21 లో వర్ణించిన కృప. అనగా మనమీద పడవలసిన శిక్ష
యేసుక్రీస్తు మన పక్షముగా భరించి మనలను పాప విముక్తులనుగా చేశారు! ఆయన నామమందు
విశ్వసించి ఆయనను వేడిన వారిని క్షమాపణ అడిగిన వారిని దేవుడు క్షమించి
పరిశుద్దులుగా చేసి తన పిల్లలుగా చేసుకోవడమే దేవుని అనంతమైన కృప! దాన్ని వ్యర్థం
చేయడమంటే దాన్ని విని, తెలుసుకుని దాని గురించి ఏమీ చెయ్యకపోవడం. లేదా, జీవితంపై
ఎలాంటి ప్రభావమూ లేని రీతిలో, పాపవిముక్తి కలగని రీతిలో దాన్ని అంగీకరించడం. ఈ
అంశాన్ని నొక్కి చెప్పేందుకు పౌలుగారు
యెషయా 49:8 లో గల ప్రవచనాన్ని ప్రస్తావిస్తున్నారు .
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అనుకూలసమయమందు నేను నీ మొర
నాలకించి నీకు ఉత్తరమిచ్చితిని రక్షణదినమందు నిన్ను ఆదుకొంటిని. బయలువెళ్లుడి అని
బంధింపబడినవారితోను బయటికి రండి అని చీకటిలోనున్న వారితోను చెప్పుచు దేశమును
చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచి పెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా
నియమించితిని.
అందుకే అంటున్నారు 2,3 వచనాలలో ఆ అనుకూలసమయం ఇదే! ఇదే రక్షణ దినము
అంటున్నారు! నేడు అనే దినముండగానే ఇప్పుడే మారుమనస్సు పొంది దేవుని శరణు వేడుకో
అంటున్నారు! “రక్షణ దినం ఇదే”– అంటే దేవుడు క్రీస్తులో వెల్లడి చేసిన ఈ కృపాయుగమే.
హెబ్రీ
3:13 ; 4:7; 5:5
హెబ్రీయులకు 3: 13
నేడు మీరాయన శబ్దమును వినినయెడల, కోపము పుట్టించి నప్పటివలె
మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక,
హెబ్రీయులకు 4: 7
నేడు మీ రాయన మాట వినినయెడల మీ హృదయములను కఠినపరచుకొనకుడని
వెనుక చెప్పబడిన ప్రకారము, ఇంత కాలమైన తరువాత దావీదు గ్రంథములోనేడని యొక దినమును
నిర్ణయించుచున్నాడు.
హెబ్రీయులకు 5: 5
అటువలె క్రీస్తుకూడ ప్రధాన యాజకుడగుటకు తన్నుతానే
మహిమపరచుకొనలేదు గాని నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను. అని ఆయనతో
చెప్పినవాడే అయనను మహిమపరచెను.
పౌలుగారు దేవుని సేవకునిగా పరిచర్య చేశారనే అంశాన్ని
ఇంకా కొనసాగిస్తున్నారు ఇక్కడ . 2
కోరింథీయులకు 1:12-14 చూడండి. కొరింతులో కొందరు, లేక చాలమంది తనను క్రీస్తు అపొస్తలునిగా
ఎంచడం మానివేసి, దుర్బోధకులనూ వారు చెప్తున్న అబద్ధ సువార్తనూ అంగీకరిస్తారేమోనన్న
భయం తనకు ఉంది గనుక ఇలా నొక్కి చెప్తూ చూపిస్తున్నారు. అందువల్ల తన గుణాన్ని,
అనుభవాలను వారి ముందుంచుతున్నారు. అతడు దేవుని నిజ సేవకుడని అవి తేటతెల్లం
చేస్తున్నాయి. పౌలుగారి పరిచర్యను
అపకీర్తి పాలు చేసేందుకు కొందరు కంకణం కట్టుకున్నారు. తనకు తాను మాత్రం దానిని అలా
చెయ్యకూడదని పౌలుగారి దృఢ నిశ్చయం.
సరే,
ఏదిఏమైనా పౌలుగారు చెబుతున్నారు: ఇదే రక్షణ దినము ఇదే అనుకూలసమయం! కాబట్టి నేడు
అనే దినముండగానే మనం దేవుని దగ్గరకు వద్దాం! మనలను మనమే పరీక్షించుకుని దేవునికి
వ్యతిరేఖమైన కార్యాలు మనలో ఏవేవి ఉన్నాయో వాటిని ఒప్పుకుని విడిచిపెట్టి ఆయనతో
సమాధాన పడదాం! లేకపోతే విడిచిపెట్ట బడతాము అని మరచిపోవద్దు!
నేడే
ఆయనతో సమాధాన పడదాం! యెషయా భక్తుడు అంటున్నారు యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను
వెదకుడి యెహోవా మీకు సమీపముగా ఉండగానే ఆయనను వేడుకోండి! యెషయా 55:6; మరినీవు
వేడుకొంటావా?
దైవాశీస్సులు
!!!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*138వ భాగము*
2
కొరింథీ 6:4 – 8
4. మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనను
అభ్యంతరమేమియు కలుగజేయక
5. శ్రమలయందును ఇబ్బందులయందును ఇరుకులయందును దెబ్బలయందును
చెరసాలలలోను అల్లరులలోను ప్రయాసములలోను జాగరములలోను ఉపవాసములలోను మిగుల
ఓర్పుగలవారమై,
6. పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘ శాంతముతోను దయతోను
పరిశుద్ధాత్మవలనను నిష్కపటమైన ప్రేమతోను
7. సత్యవాక్యము చెప్పుటవలనను దేవుని బలమువలనను కుడియెడమల
నీతి ఆయుధములు కలిగి,
8. ఘనతా ఘనతలవలనను సుకీర్తి దుష్కీర్తులవలనను దేవుని
పరిచారకులమై యుండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము
ప్రియులారా! మనం 2 వ కొరింథీ
పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!
ఇక
4—8 వరకు అంటున్నారు: మేము
ఇలాంటి ఘనమైన పరిచర్యను పొందుకున్నాము గనుక ఎటువంటి కష్టమైన ఆపదయైనా గాని
సహిస్తున్నాము అంటున్నారు: మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనను
అభ్యంతరమేమియు కలుగజేయక
5. శ్రమలయందును ఇబ్బందులయందును ఇరుకులయందును దెబ్బలయందును
చెరసాలలలోను అల్లరులలోను ప్రయాసములలోను జాగరములలోను ఉపవాసములలోను మిగుల
ఓర్పుగలవారమై,
6. పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘ శాంతముతోను దయతోను
పరిశుద్ధాత్మవలనను నిష్కపటమైన ప్రేమతోను ఉంటున్నాము అంటున్నారు!
ఇక్కడ
మా పరిచర్య నిందింప బడకుండా ఉండాలని మేము మా యోగ్యతలను మేము మీ దగ్గర
కనపరుచుకుంటున్నాము లేక నిరూపించుకున్నాము అంటున్నారు! గమనించాలి దీనిని రూఢి పరచాలనే గత అధ్యాయాలలో
మాటిమాటికి తమ ఆపొస్తలత్వమునకు ఋజువులు చూపిస్తున్నారు!
2కోరింథీయులకు 3: 1
మమ్మును మేమే తిరిగి మెప్పించుకొన మొదలు పెట్టుచున్నామా?
కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్దనుండియైనను సిఫారసు పత్రికలు మాకు
అవసరమా?
2కోరింథీయులకు 5: 12
మమ్మును మేమే మీ యెదుట తిరిగి మెప్పించుకొనుట లేదు గాని,
హృదయమునందు అతిశయపడక పైరూపమునందే అతిశయపడువారికి ప్రత్యుత్తరమిచ్చుటకు మీకు ఆధారము
కలుగవలెనని మా విషయమై మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము.
2కోరింథీయులకు 10: 18
ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని తన్ను తానే
మెచ్చుకొనువాడు యోగ్యుడుకాడు.
గమనించాలి:
కేవలం అతని మాటలు గాక అతని చర్యలు, మార్గాలు అతని యోగ్యతలను కనపరుస్తున్నాయి. వ
4,5లో తన కష్టాల గురించి మాట్లాడుతున్నారు .
2కోరింథీయులకు 1: 8
సహోదరులారా, ఆసియలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు
తెలియకుండుట మాకిష్టములేదు; అదేదనగా మేము బ్రదుకుదుమను నమ్మకములేక యుండునట్లుగా,
మా శక్తికి మించిన అత్యధిక భారము వలన క్రుంగిపోతిమి.
2 కోరింథీయులకు 4:8-9;
8. ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము;
అపాయములోనున్నను కేవలము ఉపాయము లేనివారము కాము;
9. తరుమబడు చున్నను దిక్కులేనివారము కాము; పడద్రోయబడినను
నశించువారము కాము.
2 కోరింథీయులకు 11:23-29;
23. వారు క్రీస్తు పరిచారకులా? వెఱ్ఱివానివలె
మాటలాడుచున్నాను, నేనును మరి యెక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా
ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని; అపరిమితముగా దెబ్బలు
తింటిని, అనేకమారులు ప్రాణాపాయములలో ఉంటిని.
24. యూదుల చేత అయిదుమారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు
తింటిని;
25. ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని; ఒకసారి రాళ్లతో
కొట్టబడితిని; ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని; ఒక రాత్రింబగళ్లు సముద్రములో
గడిపితిని.
26. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదులవలననైన ఆపదలలోను,
దొంగలవలననైన ఆపదలలోను, నా స్వజనులవలననైన ఆపదలలోను, అన్యజనులవలననైన ఆపదలలోను,
పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను,సముద్రములో ఆపదలోను, కపట సహోదరులవలని ఆపదలలో
ఉంటిని.
27. ప్రయాసతోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి
దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని, ఇంకను
చెప్పవలసినవి అనేకములున్నవి.
28. ఇవియును గాక సంఘము లన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ
భారము దిన దినమును నాకు కలుగుచున్నది.
29. ఎవడైనను బలహీను డాయెనా? నేనును బలహీనుడను కానా? ఎవడైనను
తొట్రుపడెనా? నాకును మంట కలుగదా?
1
కోరింథీయులకు 4:9-13.
చూడండి దానికోసమే శ్రమలయందును ఇబ్బందుల యందును ఇరుకుల యందును దెబ్బలయందును
చెరసాల లోనూ అల్లరులలోనూ ప్రయాసములలోనూ జాగరములలోనూ అనగా తిండీలేకుండా రాత్రంతా
మేలుకుని ఉండి ప్రార్థన చేయడంలోనూ ఉపవాసములలోనూ మిగుల ఓర్చుకుంటున్నాము
అంటున్నారు! ఇంకా పవిత్రతతోనూ జ్ఞానములోను
ధీర్ఘశాంతం లోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలనను నిష్కాపట్యమైన ప్రేమతోనూ
ఉంటున్నాము అంటున్నారు! నిజానికి ఇవన్నీ ప్రతీ దైవసేవకుడు పొందుకోవాల్సిన దేవుని
కృపా వరాలు !! వీటికోసం దైవజనుడా అనే శీర్షికలో విస్తారంగా చూసుకున్నాము గనుక
ముందుకు పోదాం! గాని దైవసేవకులకు కాపరులకు అపోస్తులులకు సేవకులకు ఈ పవిత్రత
జ్నానము ధీర్ఘశాంతం దయ కలిగి ఉండాలి అదే సమయంలో ఎవరైతే ఇలా ఉంటారో వారికి శ్రమలు
ఇబ్బందులు ఇరుకులు దెబ్బలు చెరసాల ప్రయాసము జాగరణము ఉపవాసాలు అన్నీ వస్తాయి!
ఇవన్నీ అనుభవించాలి మరియు సహించాలి ప్రతీ ధైవజనుడు!
గమనించాలి
పౌలుగారు ఇవన్నీ అనుభవించారు. దీనికోసం 11 వ అధ్యాయంలో చాలా వివరంగా రాస్తున్నారు!
ఇక
7 వ వచనంలో నీతి ఆయుధాలు అంటున్నారు: “నీతి ఆయుధాలు” అంటే – 2 కోరింథీయులకు 10:4;
ఎఫెసీయులకు 6:11-17 వచనాలలో చెప్పినవి అన్నమాట:
2
కోరింథీయులకు 10:4. మా యుద్ధోపకరణములు
శరీరసంబంధమైనవి కావుగాని, దేవుని యెదుట దుర్గములను పడద్రోయజాలినంత బలముకలవై
యున్నవి.
ఇంక
ఎఫెసీ పత్రికలో చాలా ఆయుధాలు చెబుతున్నారు:
ఎఫెసీయులకు 6:11.
మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును
ధరించుకొనుడి.
12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని
ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను,
ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.
13. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును,
సమస్తము నెరవేర్చినవారై నిలువ బడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు సర్వాంగ
కవచమును ధరించుకొనుడి
14. ఏలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను
మైమరువు తొడుగుకొని
15. పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను
జోడుతొడుగుకొని నిలువ బడుడి.
16. ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టు కొనుడి; దానితో మీరు
దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు.
17. మరియు రక్షణయను శిరస్త్రాణమును,దేవుని వాక్యమను
ఆత్మఖడ్గమును ధరించు కొనుడి.
గమనించాలి
పౌలుగారి ఆయుధాలు మోసం, కపటం కాదు, కాఠిన్యం, క్రూరత్వం కాదు గానీ నీతిన్యాయాల
ఆయుధాలు. నీతిన్యాయాలు గల దేవుడు వాటిని ఇచ్చాడు. పౌలుగారు వాటిని న్యాయమైన రీతిలో ఉపయోగించాడు (2
కోరింథీయులకు 1:12).
తన
గురించి మనుషులు ఏమి చెప్పుకున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా, తన మనసులో ఏమి
అనిపించినా, ఎంత పేదరికమున్నా దేవుణ్ణి సేవిస్తూనే వచ్చాడు. అన్ని పరిస్థితుల్లోనూ
2 కోరింథీయులకు 5:14 తన విషయంలో నిజమని రుజువు చేస్తూ ఉన్నాడు.
ఇక
8 వ వచనంలో ఘనతా ఘనతలవలనను సుకీర్తి దుష్కీర్తులవలనను దేవుని పరిచారకులమై యుండి
అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము ! గమనించాలి వారికివారే స్వంత
డబ్బా కొట్టుకోవడం లేదు గాని దేవుని ముందర వారికి వారే ప్రభువునిమిత్తం ప్రభువు
సేవలో సెహబాస్ అని అనిపించుకున్నారు! అలాగే ప్రతీ దైవజనుడు క్రైస్తవుడు కూడా
దేవుని చేత ఘనపరచ బడాలి గాని మనుషుల చేత అందరిముందు మెప్పుకోసం పాటుపడకూడడు గాని
ఏమి చేసినా సమస్తము దేవుని మహిమకోసమే చేయాలి!
1కోరింథీయులకు
10: 31
కాబట్టి
మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు
చేయుడి.
మరినీవు
సిద్దమా ?
దైవాశీస్సులు
!!!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*139వ భాగము*
2 కొరింథీ 6:4 – 8
4. మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనను
అభ్యంతరమేమియు కలుగజేయక
5. శ్రమలయందును ఇబ్బందులయందును ఇరుకులయందును దెబ్బలయందును
చెరసాలలలోను అల్లరులలోను ప్రయాసములలోను జాగరములలోను ఉపవాసములలోను మిగుల
ఓర్పుగలవారమై,
6. పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘ శాంతముతోను దయతోను
పరిశుద్ధాత్మవలనను నిష్కపటమైన ప్రేమతోను
7. సత్యవాక్యము చెప్పుటవలనను దేవుని బలమువలనను కుడియెడమల
నీతి ఆయుధములు కలిగి,
8. ఘనతా ఘనతలవలనను సుకీర్తి దుష్కీర్తులవలనను దేవుని
పరిచారకులమై యుండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము
ప్రియులారా! మనం 2 వ కొరింథీ
పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!
(గతభాగం తఱువాయి)
ప్రియులారా పరిచర్యలో ఉండే
సేవకులకు దైవజనులకు ఉండవలసిన లక్షణాలు కోసం దైవజనుడా శీర్షికలో వివరించడం
జరిగినది, మరోసారి వాటిని అతి సూక్ష్మముగా చూసుకుని వాటితోపాటుగా నిజమైన పరిచర్య
చేసేవారికి బోనస్ గా ఈ లోకంలో ఏమి సంభవించ బోతున్నాయో చూసుకుండాము
మొదటగా నిజమైన పరిచర్య ఆటంకంగా కలుగబోయే సంభవాలు చూసుకుందాం!
గమనించాలి- యేసుక్రీస్తుప్రభులవారి కి ఈ సంభవాలు ఆహ్వానం పలికాయి! పౌలుగారు
తిమోతికి పత్రికరాస్తూ చెప్పిన విధంగా క్రీస్తుయేసు నందు సద్భక్తితో
బ్రతుకనుద్దేశించు వారు హింస పొందుదురు అన్నట్లుగా మొదటగా ఏసుక్రీస్తు
ప్రభులవారికి ఈ శోధనలు శ్రమలు కలిగాయి ఆయన బాటలో మనం నడుస్తున్నాము లేక ఆయన
జతపనివారం కనుక ఆయనకు జరిగిన విధంగానే మనకు కూడా ఇవన్నీ తప్పకుండా సంభవిస్తాయి!
గమనించాలి ఎవరైతే నిజమైన సేవాపరిచర్య చేయాలని అనుకుంటారో వారికి మాత్రమే ఈ శ్రమలు!
యేసుబాబుని మెప్పించకుండా లోకాన్ని విశ్వాసులను సంఘపెద్దలను మెప్పించాలి అని
ప్రయత్నిస్తే రోజూ బిరియానీలే సన్మానాలే! కేవలం క్రీస్తుని మాత్రమే మెప్పించాలి
అని చూస్తే మొదటగా ఒళ్ళంతా హూనమైపోతుంది! కొన్ని సంవత్సరాలు ఈ శ్రమలలో రాటుదేలిన
తర్వాతనే బిర్యానీలు సన్మానాలు!!!
సరే, మొదటగా 5, 8 వచనాల ప్రకారం శ్రమలు వస్తాయి! దీనికోసం మా ప్రతీ
శీర్షికలోనూ చెబుతూ ఉంటాను కాబట్టి ముందుకు పోదాం! శ్రమలు లేకుండా చేసే
పరిచర్యకు ఏవిధమైన మెప్పు బహుమానం
క్రీస్తునుండీ కలుగదు! మనుష్యులు సెహబాస్ ఓహో ఆహా అనవచ్చు గాని దేవుడు మాత్రం
సోమరియైన చెడ్డదాసుడా నీవు అగ్ని గుండములోనికి పో అంటారు తప్పకుండా!!!
క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రతికేవారికి తప్పనిసరిగా శ్రమలు కలుగుతాయి! ఇది కేవలం
దైవజనులకు సేవకులకు మాత్రమే కాకుండా విశ్వాసులకు కూడా కలుగుతాయి!!
తర్వాత: ఇబ్బందులు: ఇవి ఆర్ధిక
పరమైన ఇబ్బందులు కావచ్చు లేకా పరిస్థితులు వ్యతిరేఖమై పోవచ్చు! నిజంగా సేవచ్చేసిన
గొప్ప భక్తులు గాని సామాన్య దైవసేవకులకు గాని ఇబ్బందులు ఎన్నో ఎదురవుతాయి అవి అన్యులనుండి
మొదటగా కలుగుతాయి, తర్వాత విశ్వాసుల నుండి సంఘపెద్దలనుండి కలుగుతాయి! వాటిని కూడా
జయిస్తే స్వంత కుటుంబం నుండి కలుగుతాయి! ఆంధ్రప్రదేశ్ లో అనేక దైవజనులకు
స్వంతభార్యయే శత్రువుగా మారి సంఘపరిచర్యకు ఆటంకం కలిగించారు! చాలామందికి డబుల్
ధమాకా ఏమిటంటే ఆర్ధికమైన ఇబ్బందులు కూడా ఈ వ్యతిరేఖ పరిస్థితులకు తోడవతూ ఉంటాయి! ఇవన్నీ క్రీస్తు పాదాల ముందు
మోకాళ్లమీద జయించిన వాడే నిజమైన సేవకుడు! పౌలుగారికి ఆది అపోస్తులులకు కూడా ఇవి
తప్పలేదు కాబట్టి ప్రియ సేవకుడా! క్రొత్తగా సేవకు వచ్చిన దైవజనుడా ఇవి నీకు కూడా
తప్పవు అని గ్రహించు!!
తర్వాత: ఇరుకులు: అనగా ఇది కూడా అదే
కోవకు వస్తుంది! ఆర్ధికమైన ఎన్నో ఇబ్బందులు వస్తాయి! దైవజనులు P M శామ్యూల్ అయ్యగారు
అనేకసార్లు వారం రోజులకు ఒకసారి ఒక్కపూట బోజనం చేసి పరిచర్య చేశారు! మా తండ్రిగారు
మూడురోజులు లేక నాలుగు రోజులకు ఒకసారి బోజనం చేసి సుమారు 42 గ్రామాలలో సేవాపరిచర్య
చేశారు! ఇంకా అనేకమందికి ఎక్కడకు వెళ్లాలన్నా దారులు మూసికొని పోయే పరిస్తితులు
కలుగుతాయి! ఇవే ఇరుకులు!!
తర్వాత: దెబ్బలయందు: అనేకసార్లు
పరిచర్యలో రాళ్లు దెబ్బలు బెత్తము దెబ్బలు కలుగుతాయి! పౌలుగారికి పేతురుగారికి
చివరికి యేసుక్రీస్తుప్రభులవారికి కూడా ఈ దెబ్బల అనుభవం ఉంది! అయ్యా ఎందుకు
పనికిరాని నాకు కూడా ఈ అనుభవం ఉంది సువార్త పరిచర్యలో! నా ఆరవ యేట మా తండ్రి
గారితో సువార్తకు వెళ్ళినప్పుడు నా జీవితంలో మొట్టమొదట రాళ్లదెబ్బలు తిన్నాను!
నాకే కాదు, మాతండ్రిగారికి మాతో పాటుగా మా సువార్త పరిచర్యను బలపరచడానికి వచ్చిన
కీ. శే. దైవజనులు జిల్లేల్ల దేవదాసు అయ్యగారు (నర్సీపట్నం), కీ. శే. దైవజనులు యు.
మోహనరావు గారు (ఏటికొప్పాక) వారికి కూడా చాలా రాళ్లదెబ్బలు తగిలాయి! ఆరోజు ఆ
సైతారుపేట గ్రామజనులు మిమ్మల్ని చంపేసే వారే, కేవలం నా మొహం మీద తగిన దెబ్బలకు
ముఖమంతా రక్తం కారుతా ఉంటే కొందరు పెద్దలు జాలిపడి వారి నుండి తప్పించి ఊరిచివరికి
ఈడ్చేశారు ! ఎందుకంటే వారు మరలా వారి గ్రామం రావద్దు వస్తే చంపేస్తాం అన్నారు! మా
నాన్నగారు చంపేస్తే ఇప్పుడే చంపేయండి నేను బ్రతికి ఉంటే మరాలమరలా వస్తాను. నాకు
దేవుడిచ్చిన పనే ఇది అన్నారు! అందుకే చంపేబోయారు ఆరోజు! ఇలాంటివి నా అనుభవంలో
ఎన్నో ఉన్నాయి! ఆ రోజు మరో విధంగా కూడా సాతానుడు నన్ను చంపుదామని అనుకున్నాడు గాని
దేవుడు అప్పుడు కూడా రక్షించారు! 2
కొరింథీ 11 వ అధ్యాయంలో ఎన్ని రకాలైన దెబ్బలు తిన్నారో పౌలుగారు రాస్తున్నారు!
చెరసాల: సేవకు కలిగే ఫలితం లేక బోనస్: చెరసాల! నిజానికి
చెరసాలలో పెట్టడానికి న్యాయమైన కారణం ఒకటి కూడా ఉండదు! అన్నీ అన్యాయంగానే పెడతారు
మనలను! యేసుక్రీస్తుప్రభులవారిని పెట్టారు చెరసాలలో! పేతురు గారిని పెట్టారు!
పౌలుగారికి లెక్కలేనే లేదు! మా తండ్రి గారిని కూడా అన్యాయంగా చేయని నేరానికి
చెరసాలలో వేస్తే చెరసాలలో ఉన్నవారికి ఆ రాత్రి నిద్రపోకుండా సువార్త ప్రకటించి
ప్రార్థించి , చివరికి చెరసాల అధికారి బాబూ బయటికి పో! నీ సువార్త ఆపేయ్ అన్నాడు!
నిజానికి ఈ బోనస్ అందరికీ రాదు కొందరికే వస్తుంది! చూడండి పోనీయ్ లే అని దయ్యాన్ని
వెళ్లగొడితే గుండగా తన్నేసి జైలులో వేసేశారు ఫిలిప్పీ పట్టణస్తులు! ఏదైనా నేరం
చేశారా పౌలుగారు సీలగారు??!! కాబట్టి పరిచర్యలో ఇవి మామూలే గాబట్టి, ఆశ్చర్య
పడవద్దు!
దైవాశీస్సులు!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*140వ భాగము*
2 కొరింథీ 6:4 – 8
4. మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనను
అభ్యంతరమేమియు కలుగజేయక
5. శ్రమలయందును ఇబ్బందులయందును ఇరుకులయందును దెబ్బలయందును
చెరసాలలలోను అల్లరులలోను ప్రయాసములలోను జాగరములలోను ఉపవాసములలోను మిగుల
ఓర్పుగలవారమై,
6. పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘ శాంతముతోను దయతోను పరిశుద్ధాత్మవలనను
నిష్కపటమైన ప్రేమతోను
7. సత్యవాక్యము చెప్పుటవలనను దేవుని బలమువలనను కుడియెడమల
నీతి ఆయుధములు కలిగి,
8. ఘనతా ఘనతలవలనను సుకీర్తి దుష్కీర్తులవలనను దేవుని
పరిచారకులమై యుండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము
ప్రియులారా! మనం 2 వ కొరింథీ
పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము! ప్రియులారా మనం సేవాపరిచర్యలో ఉన్నవారికి
కలిగే సంభవాలు లేక బోనస్ ళు చూసుకుంటున్నాము!!
(గతభాగం తఱువాయి)
అల్లరులలో: కొన్నిసార్లు సువార్త ప్రకటిస్తే సువార్త వ్యతిరేకులు అల్లరి చేసి మనలను
ఊరి బయటకు ఈడ్చేస్తుంటారు. అయ్యా ఇది నాకు నాలుగుసార్లు జరిగినది! పౌలుగారికి
సీలగారికి పేతురుగారికి అయితే వారు లెక్కపెట్టలేనన్ని సార్లు కలిగాయి! ఇదో రకమైన బోనస్! ఈ బోనస్ తో పాటుగా మనకు అవమానాలు
కూడా ఎదురౌతా ఉంటాయి! మనల్ని కడజాతి వాళ్ళంతారు! అమెరికా నుండి డబ్బులు కట్టలు
కట్టలు వచ్చేస్తు ఉంటే మనం ఇలా అడుక్కునే వారిలాగా తిరుగుతా ఉంటామంట! దేవునికి
స్తోత్రం హల్లెలూయ!! నిజానికి నిజమైన పరిచర్య చేసిన దైవజనులకు ఏ ఒక్కరికీ ఆ
అమెరికా నుండి వచ్చే డబ్బు రాకుండానే చేశారు చేస్తున్నారు! ఎన్నోసార్లు
ఉమ్మివేశారు మా మీద! మా కరపత్రికలు లాక్కుని చించేశారు మా ఎదురుగానే కాల్చేశారు! ఇవన్నీ కామన్ పరిచర్యలో బోనస్ బోనస్ బోనస్!! జై
యేసుబాబు అనుకుంటూ ముందుకు పోవాలి
ఇలాంటివి ఎదురైతే! మరి అపోస్తులులను మొదట బంధించి చివరికి గట్టిగా భయపెట్టి విడుదల
చేస్తే అపోస్తులులు సంతోషించి ఈ నామము కొరకు అవమానాలే కాదు చనిపోడానికి సిద్దమే
అన్నారు! మనం కూడా అలా అనాలి!
ప్రయాసము: అనగా ఎంతో కష్టపడి: అవును పల్లెటూర్లలో సేవచేసిన సేవచేస్తున్న వేలాదిమంది
దైవసేవకులు ఎన్నో ప్రయాసలు పడి సువార్త ప్రకటిస్తున్నారు! మారుమూల గ్రామాల్లో కొండలలో
పరిచర్య చేస్తున్నవారు కనీస సౌకర్యాలు లేక కొంతమంది, డబ్బులు లేక కొంతమంది, సరియైన
రోడ్లు లేక ఎంతోమంది ఎన్నెన్నో ప్రయాసలు పదడి సువార్త చేస్తున్నారు!నిజానికి
వీరికి హేట్సాఫ్ చెప్పాలి! ఒకరోజు దేవుడు భళా నమ్మకమైన మంచి దాసుడా లేక
మంచిదాసురాలా అని తప్పకుండా చెబుతారు! ఆ మధ్యన దైవజనుడు జెఫన్యా శాస్త్రి గారు
చెప్పిన సాక్ష్యం నన్ను కదిలించి వేసింది, ఏడ్చాను భోరున! ఒక యవ్వన స్త్రీ
దైవజనురాలు- మావోయిస్టుల చేతిలో తన భర్త ప్రాణం కోల్పోయి ఉన్నాడు. ఆమెకు ప్రార్థన
చెయ్యమని తోటి దైవజనులు ఆయనను వేడుకుంటే అమ్మా దేని కోసం ప్రార్థన చేయమంటావు అని
అడిగితే- అయ్యా- పిల్లల్ని చూసుకునే వారు ఎవరైనా దొరికేలా ప్రార్థన చేయండి , అదిగో
ఆ గ్రామస్తుల విశ్వాసం జారిపోయేలా ఉంది! మా అయ్యగారని చంపేశారు కదండీ అందుకే
అక్కడికి వెళ్ళడం లేదు! నాకే గాని ఎవరైనా
పిల్లల్ని చూసుకునే వారుంటే రెండు కొండలు ఎక్కి సువార్త చేసేస్తాను, ఆ సంఘాన్ని
చూసుకుంటాను అని చెప్పింది అట ఆ విశ్వాస వీరనారి! కేవలం ఆమె వయసు 21 సంవత్సరాలు!!
ఆ దైవజనుడికి ఏమి చెప్పాలో అర్ధం కాక భోరున ఏడ్చాడు అక్కడ! ఇలాంటి దైవజనులు,
సువార్తికులు ఎంతోమంది తెగించి ప్రయాసలు
పడుతూ సేవచేస్తున్నారు వీరు నిజమైన సేవకులు!! వీరికి ఏ మాత్రం అవకాశం కలిగినా
దయచేసి తప్పకుండా సహాయం చేయండి!
జాగరము: అనగా రాత్రంతా బోజనం చేయకుండా నిద్రపోకుండా ఉండటం: ఈ లోకస్తులు అన్యులు
మంచి మొగుడు రావాలని కొంతమంది, మొగుడికి మంచి ఆరోగ్యం కావాలని కొంతమంది రాత్రంతా
జాగారం చేస్తూ ఉంటారు! మరి పౌలుగారు దేని కోసం జాగారం చేశారు? ఆ రాత్రి గడిస్తే
తెల్లవారు జామున పేతురు గారిని చంపేస్తారు! పేతురు గారు చంపుకుంటే చంపుకోనీయ్ నా
సొమ్ము ఏం పోతుంది అని పడుకున్నారు గాని సంఘమంతా అత్యాశక్తితో ప్రార్ధనచేశారు
జాగారం చేశారు! పౌలుగారు ఎన్నోసార్లు ఓడబద్దలై పోతే ఆ రాత్రంతా సముద్రంలోనే
గడిపారు వెలుగు వచ్చేవరకు ఆగటానికి! ఇలాంటివి ఎన్నో కలిగాయి వారికి!
ఉపవాసము : నిజానికి ఇది సువార్త పరిచర్యకు ఎంతో బాగా సహాయపడుతుంది, ఇంకా మన ఆత్మీయ
పురుషుడు లేక అంతరంగ పురుషుడు బలపడటానికి ఎంతో దోహదకారి అవుతుంది! అయితే
చాలాసార్లు పౌలుగారు ఇంకా అనేకమంది దైవసేవకులు తినడానికి ఏమీ లేక పస్తులున్నారు,
ఉపవాసాలు చేశారు! నిజమైన సేవలో ఇవీ షరామామూలే !! త్రిబుల్ బోనస్!!
ఇక
ఎనిమిదవ వచనం ప్రకారం: ఘనత-అఘనత : అనగా సన్మానం మరియు అవమానం: దీనికోసం
గతభాగంలో చెప్పడం జరిగినది! రెండూ ఒకేసారి కలిగాయి కొందరి జీవితాలలో! అపోస్తులుల
కార్యాలు 14 వ అధ్యాయంలో పౌలుగారు ఒక – బలహీన పాదాలుగల వానికి ప్రార్ధనచేసి కాళ్ళు
తెప్పించారు, వెంటనే ఆ అద్భుతం చూసిన ఆ గ్రామస్తులు వారు నిజానికి దేవతలు మానవ
రూపం తో వారిదగ్గరకు వచ్చారు అని భ్రమించి వారిని పొగడుతూ వారికి బలియాగం చేద్దాం
అనుకున్నారు! ఇది ఘనత! అయితే వారు ఎంతో ప్రయాసతో దానిని ఆపితే యూదులు అదే
గ్రామప్రజలతో పౌలుసీలలను రాళ్ళతో కొట్టించారు! ఇది అఘనత లేక అవమానం! కాబట్టి ఇవి
రెండు సువార్త పరిచర్యలో కలుగుతూ ఉంటాయి!
సుకీర్తి దుష్కీర్తి :యేసుక్రీస్తుప్రభులవారు రోగులను
స్వస్త పరుస్తూ, దయ్యాలను వెళ్లగొడుతూ చనిపోయిన వారిని బ్రతికించినప్పుడు ఆయన
కీర్తి దేశ విధేశాలలో వ్యాపించింది! అయితే పరిసయ్యులు ఇంకా దేవాలయ బ్యాచ్ ఆయన
దయ్యముల సహాయంతో ఇలా బాగుచేస్తున్నారు అని దయ్యాలు పట్టిన వాడు అనియు, పిచ్చివాడు
అనియు దుష్ కీర్తి వ్యాపింప జేశారు ! ఇది కూడా చాలా మామూలుగా కలుగుతూ ఉంటాయి
సేవలో!!! మంచి సేవ జరిగినప్పుడు అద్భుతాలు జరిగితే ఇంతా అంతా అంటారు! అదే వారికి
నచ్చని బోధ చేస్తే మనలను ఆన్ పాపులర్ చేస్తారు!
కాబట్టి
ఇవన్నీ సేవాపరిచర్య చేసేవారికి కలిగే సంభవాలు లేక బహుమానాలు బోనస్ ళు!!! అయితే
మరలా చెబుతున్నాను ఇవన్నీ కేవలం నిజమైన పరిచర్య నిజంగా చేసేవారికి మాత్రమే! కేవలం
పొట్ట పోషించు కుందాం అనుకునే వారికి ఇవి కలుగవు!!
దైవాశీస్సులు!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*141వ భాగము*
2 కొరింథీ 6:4 – 8
4. మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమియు
కలుగజేయక
5. శ్రమలయందును ఇబ్బందులయందును ఇరుకులయందును దెబ్బలయందును
చెరసాలలలోను అల్లరులలోను ప్రయాసములలోను జాగరములలోను ఉపవాసములలోను మిగుల
ఓర్పుగలవారమై,
6. పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘ శాంతముతోను దయతోను
పరిశుద్ధాత్మవలనను నిష్కపటమైన ప్రేమతోను
7. సత్యవాక్యము చెప్పుటవలనను దేవుని బలమువలనను కుడియెడమల
నీతి ఆయుధములు కలిగి,
8. ఘనతా ఘనతలవలనను సుకీర్తి దుష్కీర్తులవలనను దేవుని
పరిచారకులమై యుండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము
ప్రియులారా! మనం 2 వ కొరింథీ
పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!
(గతభాగం తఱువాయి)
ప్రియులారా
ఇంతవరకు సేవాపరిచర్యలో ఉన్నవారికి కలిగే సంభావాలు లేక బోనస్ ళు
చూసుకున్నాము!! ఇక దైవజనునికి ఇంకా
ఉండాల్సిన లక్షణాలు ఏమిటంటే : మిగుల ఓర్పు;
పవిత్రత, జ్ఞానము, దీర్ఘ శాంతము, దయ,
పరిశుద్ధాత్మవలనను నిష్కపటమైన ప్రేమ, సత్యవాక్యము చెప్పుటవలనను దేవుని బలము,
కుడియెడమల నీతి ఆయుధములు కలిగి,
ఓర్పు
: ఓర్పుకోసం అనేకసార్లు చెప్పుకున్నాము! ఎన్ని కష్టాలు శ్రమలు శోధనలు కలిగినా
దైవజనుడు అన్నింటినీ ఓర్చుకోవాలి అన్నింటినీ సహించాలి! అయితే పేతురు భక్తుడు ఒక
చైన్ రియాక్షన్ కోసం చెబుతున్నారు!
2 పేతురు 1:5—8
5. ఆ హేతువుచేతనే మీమట్టుకు మీరు పూర్ణజాగ్రత్తగలవారై, మీ
విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును,
6. జ్ఞానమునందు ఆశానిగ్ర హమును, ఆశానిగ్రహమునందు సహనమును,
సహనము నందు భక్తిని,
7. భక్తియందు సహోదరప్రేమను, సహోదర ప్రేమయందు దయను
అమర్చుకొనుడి.
8. ఇవి మీకు కలిగి విస్తరించినయెడల అవి మన ప్రభువైన
యేసుక్రీస్తునుగూర్చిన అనుభవజ్ఞానవిషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను
కాకుండ చేయును.
9. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వపాపములకు శుద్ధి
కలిగిన సంగతి మరచి పోయి, గ్రుడ్డివాడును దూరదృష్టిలేనివాడునగును.
చూడండి విశ్వాసమునందు సద్గుణం ఇమిడి ఉంది. సద్గుణంనందు
జ్ఞానము ఇమిడి ఉంది. జ్ఞానమునందు
ఆశానిగ్రహము ఇమిడి ఉంది. ఆశానిగ్రహమునందు
సహనము ఇమిడి ఉంది. సహనము నందు భక్తి ఇమిడి
ఉంది. భక్తియందు సహోదరప్రేమ ఇమిడి
ఉంది. సహోదర ప్రేమయందు దయ ఇమిడి ఉంది.
ఇవన్నీ ఒకదానికొకటి ఆధారపడి ఉన్నాయి! ఒకటి వస్తే దానికి అనువైనది తోటిది
వచ్చేస్తుంది! అనగా నీ మంచి గుణం ఉంటే ఆటోమేటిక్ గా జ్ఞానము వచ్చేస్తుంది. భక్తి ఉంటే సహోదర ప్రేమ
వచ్చేస్తుంది! అయితే గమనించ వలసిన విషయం ఏమిటంటే నీవు మొదలుపెట్టవలసింది
విశ్వాసముతో మొదలుపెడితే దయ సహోదర ప్రేమ వచ్చేస్తాయి!
అయితే ఆ క్రిందన ఎందుకు ఇవి కావాలో అనేది చెబుతున్నారు! ఇవి
మీకు కలిగి విస్తరించినయెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అనుభవ
జ్ఞానవిషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండ చేయును. ఒకవేళ మీకు
లేకపోతే వాడు తన పూర్వపాపములకు శుద్ధి
కలిగిన సంగతి మరచి పోయి, గ్రుడ్డివాడును దూరదృష్టిలేని వాడునగును.
కాబట్టి ఈ చైన్ ఆఫ్ కమాండ్ ని అందరూ పొందుకోవాలి! అదేవిధంగా
మనము గతభాగాలలో చెప్పిన ఇరుకు ఇబ్బందులు అన్నీ ఓర్చుకుంటే మనకు ఇక్కడ మరోరకమైన
చైన్ ఆఫ్ యాక్షన్స్ సమృద్ధిగా కలుగుతాయి! అవి మిగుల ఓర్పుగలవారమై,
6. పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘ శాంతముతోను దయతోను
పరిశుద్ధాత్మవలనను నిష్కపటమైన ప్రేమతోను
7. సత్యవాక్యము చెప్పుటవలనను దేవుని బలమువలనను కుడియెడమల
నీతి ఆయుధములు కలిగి,
అనగా మిగుల ఓర్పు ఉంటే పవిత్రత వస్తుంది,
పవిత్రత వస్తే జ్నానము వస్తుంది జ్నానము కలిగాక ధీర్ఘ శాంతం వస్తుంది, ధీర్ఘ శాంతం
వస్తే దయ కలుగుతుంది, దయకూడ కలిగి ఉంటే పరిశుద్ధాత్మ వలన నిశ్కపటమైన ప్రేమ
కలుగుతుంది. దేవుని బలము వలన కుడి ఎడమలు ఏవో తెలుసుకునే నీతి ఆయుధాలు వస్తాయి!
నీతి ఆయుధాలు ఏమిటి? ఎఫెసీ 6లో చెప్పిన
ఆయుధాలు అన్ని వస్తాయి!!
కలిగి
ఉండాల్సిన మరో విషయం: జ్ఞానము: ఇక్కడ
చెబుతున్న జ్ఞానము లోకజ్ఞానము కాదుగాని మనం 1 కొరింథీ పత్రికలో చూసుకున్న జ్నానము
తర్వాత అంశము: పవిత్రత: పరిశుద్ధత అని కూడా చెప్పవచ్చు!
క్రైస్తవుడు ముఖ్యంగా దైవసేవకుడు పరిశుద్ధమైన జీవితం జీవించాల్సిన అవసరం ఉంది!
సాక్ష్యము అనే శీలము దైవజనుడు పోగొట్టుకో గూడదు. నిజానికి దైవజనుడు సాక్ష్యమును
కోల్పోతే ఇక ఆ ప్రాంతంలో సేవచేయలేడు! కారణం ఎవరూ ఆ వ్యక్తిని నమ్మరు!!!
అంతేకాకుండా ఈ సేవకుడు చేసిన పనికి దేవుణ్ణి దూషిస్తారు అన్య జనులు, అనేకసార్లు
చెప్పాను- మా గ్రామం ప్రక్కన వమ్మవరం గ్రామంలో ఇద్దరు సేవకులు- ఒకరు పెళ్ళయిన
స్త్రీని, మరొకరు పెళ్ళికాని అమ్మాయిని తీసుకుని పోయారు! అప్పటినుండి ఆ గ్రామంలో
సేవ జరగడం లేదు! సేవకులే సేవ పాడు చేసేశారు అక్కడ! అందుకే పౌలుగారు యవ్వనస్తుడైన తిమోతికి ఉత్తరం
రాస్తూ అంటున్నారు: నిన్ను గూర్చియు నీ బోధను గూర్చి జాగ్రత్త పడుము అన్నారు, ఇంకా
చెబుతున్నారు: నీ యవ్వనము బట్టి ఎవడును నిన్ను తృణీకరించ నీయకుము! మాటయందును
ప్రవర్తనయందును పరిశుద్ధత కలిగి ఉండమన్నారు! యేసుక్రీస్తుప్రభులవారి వలె ఇంకా
యోసేపు వలె పరిశుద్ధమైన జీవితం జీవించాలి! నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును
అని ఏసయ్య సవాలు చేశారు! అలాంటి సవాలుకరమైన పరిశుద్ధ జీవితం జీవించాలి దైవజనుడు
ఇంకా విశ్వాసి!!!
తర్వాత ధీర్ఘశాంతం: దీనికోసం అనేకసార్లు చెప్పుకున్నాము! ఎన్నిసార్లు
మనపట్ల ఎవరైనా తప్పుచేసినా క్షమిస్తూ
ఉండాలి అన్నింటినీ ఓర్చుకోవాలి!
మనము ఎన్నిసార్లు తప్పిపోతున్నా దేవుడు మనలను ఎలా ఓర్చుకుంటున్నారో
అలానే మనము కూడా దీర్ఘశాంతం కలిగి ఉండాలి!
తర్వాత నిష్కటపమైన ప్రేమ: ప్రేమలో స్వార్ధము కపటము లేనటువంటి
స్వచ్ఛమైన ప్రేమ కలిగి ఉండాలి! ప్రేమకోసం మనం ఇదే కొరింథీ మొదటి పత్రిక 13 వ
అధ్యాయంలో నేర్చుకున్నాము!
తర్వాత సత్యవాక్యము చెప్పడం వలన దేవుడిచ్చే బలము కలిగి ఉండాలి!
సువార్త ప్రకటనలో ఎంతో బలము ఉంది ! అందుకే సువార్త నమ్ము ప్రతీవారికి దేవుని శక్తి
అంటున్నారు మొదటి పత్రికలో- సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెర్రితనము,
రక్షించ బడుచున మనకు దేవుని శక్తి అంటున్నారు! ..
కాబట్టి
మనము కూడా ఈ అమూల్యమైన కృపావరాలు పొందుకుందాం! సువార్తలో సాగిపోదాం! నిజమైన
సేవకులుగా వెలిగిపోదాం!
దైవాశీస్సులు
!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*142వ భాగము*
2 కొరింథీ 6:9 – 13
9. మేము మోసగాండ్రమై నట్లుండియు సత్యవంతులము;
తెలియబడనివారమైనట్లుండియు బాగుగ తెలియబడినవారము; చనిపోవుచున్న వారమైనట్లుండియు
ఇదిగో బ్రదుకుచున్నవారము; శిక్షింప బడినవారమైనట్లుండియు చంపబడనివారము;
10. దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడు సంతోషించువారము;
దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము; ఏమియు
లేనివారమైనట్లుండియు సమస్తమును కలిగినవారము.
11. ఓ కొరింథీయులారా, అరమరలేకుండ మీతో మాట లాడుచున్నాను, మా
హృదయము విశాలపరచబడి యున్నది.
12. మీయెడల మా అంతఃకరణము సంకుచితమై యుండలేదు గాని మీ
అంతఃకరణమే సంకుచితమై యున్నది.
13. మీయెడల మాకున్న అంతఃకరణమునకు ప్రతి ఫలముగా మీరును మీ
హృదయములను విశాలపరచు కొనుడి; మీరు నా పిల్లలని మీతో ఈలాగు చెప్పుచున్నాను.
ప్రియులారా! మనం 2 వ కొరింథీ
పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!
ప్రియ
దైవజనమా! ఇక 9వ వచనం నుండి చివరి వరకు మరలా తన ఆపొస్తలత్వము నిరూపించడానికి
ప్రయత్నం చేస్తూ ఆ పనికిమాలిన దొంగబోధకులతో జోడుగా ఉండవద్దు వారితో సహవాసం
చేయవద్దు అనే అంశాన్ని రాస్తున్నారు!!
ఇక 9వ వచనంలో మేము మోసగాళ్లలా మీకు కనబడుతున్నా మేము సత్యవంతులం !!
మేము మీకు ఏమీ తెలియని వెర్రివారిలా కనిపిస్తున్నా అన్నీ బాగుగా తెలిసినవారము!!
ప్రతీరోజు చనిపోతున్నట్లుగా మీ కనులకు కనబడుతున్నా ఇదిగో ప్రతీరోజు
బ్రతుకుచున్నాము శిక్షించ బడిన వారములా కనిపిస్తున్నా చంపబడక బ్రతుకుచున్న వారలము
అంటున్నారు! ఇంతకీ అలా అనడానికి కారణం ఏమిటి? అబద్దబోధకుల మాటలు విని కొరింథీ వారు
పౌలుగారి అపొస్తలత్వమును సందేహిస్తున్నారు, పౌలుగారినే ప్రశ్నించే స్థితికి
వచ్చారు కొంతమంది! అందుకే ఈ మాటలు రాస్తున్నారు! మేము మీకు మోసగాళ్లలా
కనిపిస్తున్నా మేము సత్యవంతులం! ఏమీ తెలియని అమాయకులుగా కనిపిస్తున్నా
పరిశుద్ధాత్మ సహకారంతో అన్నీ తెలిసిన వారము ప్రతీరోజు చనిపోతున్నట్లు
కనిపిస్తున్నా దేవుని కృపవలన ప్రతీరోజు బ్రతుకుచున్నాము అంటున్నారు! ఇంకా
అంటున్నారు దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడు సంతోషించువారము;
దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము; ఏమియు లేనివారమైనట్లుండియు
సమస్తమును కలిగినవారము అంటున్నారు!
“దుఃఖపడిన వారము అనగా ”– 2
కోరింథీయులకు 2:4; 2 కోరింథీయులకు 5:4; రోమీయులకు 9:2-3; రోమీయులకు 7:24 ఈ వచనాల
ప్రకారం దుఃఖించడానికి లోకంలో తప్పకుండా
కావలసినంత కారణం ఉంది. క్రైస్తవ సంఘాల్లో, తమలో కూడా క్రీస్తు సేవకులందరికీ విచారం
కలిగించే కారణాలెన్నో ఉన్నాయి. అయితే దుఃఖంతో ఉన్నప్పటికీ పౌలుగారికి తన హృదయంలో పెల్లుబికే ఆనందాన్ని ఎప్పుడూ
అనుభవిస్తూనే ఉన్నారు – 2 కోరింథీయులకు 2:3; 2 కోరింథీయులకు 7:4; రోమీయులకు 5:11;
రోమీయులకు 14:17; గలతియులకు 5:22.
ఇక “దరిద్రులమైనట్లు ”– అపో. కార్యములు 3:6;
లూకా 6:20; 1 తిమోతికి 6:6-9 చూడండి. పౌలు
గారికి గొప్ప ఆధ్యాత్మిక సామర్థ్యాలు
ఉన్నాయి. కావాలనుకుంటే చాలా డబ్బు సంపాదించుకోగలిగి ఉండేవాడే. తల వాల్చుకోనేందుకైనా
చోటులేని యేసుప్రభువును అనుసరించడానికే అతడు ఇష్టపడ్డాడు (మత్తయి 8:20). అందువల్ల
అనేకమందిని “ఐశ్వర్యవంతులుగా” చేయగలిగాడు. ధనం, ఆస్తిపాస్తుల్లో కాదు, శాశ్వత
దీవెనల విషయంలో వారు ధనికులయ్యారు. 2 కోరింథీయులకు 8:9 పోల్చి చూడండి.
ఇక “ఏమీ లేనివారమైనట్టున్నా అంతా ఉన్నవారమే”–
ఫిలిప్పీయులకు 3:8; మత్తయి 19:27; 1 కోరింథీయులకు 3:21-22 ఒకసారి చూద్దామా!
ఫిలిప్పీయులకు 3: 8
నిశ్చయముగా
నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును
నష్టముగా ఎంచుకొనుచున్నాను.
1
Corinthians(మొదటి కొరింథీయులకు) 3:21,22
21. కాబట్టి యెవడును మనుష్యులయందు అతిశయింపకూడదు; సమస్తమును
మీవి.
22. పౌలైనను అపొల్లోయైనను, కేఫాయైనను, లోకమైనను, జీవమైనను,
మరణమైనను, ప్రస్తుతమందున్నవియైనను రాబోవునవియైనను సమస్తమును మీవే.
ఇక 11 వ వచనంలో కోరింథీయులారా అరమరిక లేకుండా మీతో
మాట్లాడుచున్నాను అనగా మనసులో ఏమీ ఉంచుకోకుండా హృదయ భావం చెబుతున్నాను మా హృదయం
మీకోరకు ఎంతో విశాలపరచబడి ఉంది అంటున్నారు! హృదయం విప్పి మీతో నేను చెబుతున్నాను-
అంటున్నారు
హృదయ ద్వారం పూర్తిగా తెరవడమంటే వారి హృదయాల్లో చోటివ్వడం. ప్రేమ,
శ్రద్ధలను ఇది సూచిస్తున్నది – అందుకే 2
కోరింథీయులకు 7:2-3 అంటున్నారు: 2 కోరింథీయులకు
7:2. మమ్మును మీ హృదయములలో చేర్చుకొనుడి; మే మెవనికి అన్యాయము చేయలేదు,
ఎవనిని చెరుపలేదు, ఎవనిని మోసము చేయలేదు.
3. మీకు శిక్షావిధి కలుగవలెనని నేనీలాగు చెప్పలేదు.
చనిపోయినగాని జీవించిన గాని మీరును మేమును కూడ ఉండవలెననియు మీరు మా హృదయములలో
ఉన్నారనియు నేను లోగడ చెప్పితిని గదా .
కొన్ని
సార్లు క్రైస్తవుల హృదయాలు ఇరుకుగా, సంకుచితంగా ఉంటాయి. వారికి చెందిన విషయాలకే
అందులో చోటుంటుంది
ఫిలిప్పీయులకు 2:4.
మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను.
21. అందరును తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని, యేసుక్రీస్తు
కార్యములను చూడరు.
ఇలా
సంకుచితంగా ఉంటున్నారు మేమైతే క్రీస్తు కార్యములు మీకోసం మీ రక్షణార్ధమై
చేస్తున్నాము అంటున్నారు!
ఇంకా
అంటున్నారు: 12. మీయెడల మా అంతఃకరణము సంకుచితమై
యుండలేదు గాని మీ అంతఃకరణమే సంకుచితమై యున్నది.
13. మీయెడల మాకున్న అంతఃకరణమునకు ప్రతి ఫలముగా మీరును మీ
హృదయములను విశాలపరచు కొనుడి; మీరు నా పిల్లలని మీతో ఈలాగు చెప్పుచున్నాను.
ఇలా
అనడానికి కారణం పౌలుగారిని నేరస్తుని చూసినట్లు చూస్తున్నారు! నిజమైన అపోస్తులుని
అన్యునిగా చూస్తున్నారు! దొంగబోధకులను నిజమైన బోధకులుగా భావించడం వలన కొరింథీ
విశ్వాసుల అంతకరణం పౌలుగారి పట్ల విరోధంగా సంకుచితంగా ఉంది. చెప్పుడుమాటల యొక్క
ప్రభావమే అలాంటిది! అంతేకాకుండా ఒకే అబద్దం ప్రతీరోజు వేరువేరు కోణాలలో మాటిమాటికి
చెబితే ప్రజలు అబద్దమే నిజమని అనుకుంటారు! కొరింథీ వారు కూడా అలాగే నమ్మేశారు!
మనము
కూడా ఇలాంటి చెప్పుడు మాటలకు దొంగబోధలకు దూరంగా ఉందాం! దేవుని నిజబోధకులను వారి
బోధలను బైబిల్ తో సరిచూసుకుని పోల్చుకుని అప్పుడు నిజమైన బోధకులా దొంగబోధకులా
తేల్చుకుందాం!
ఇంకా
ఎల్లప్పుడూ మన పనులే కాకుండా దేవుని కార్యాలను కూడా పట్టించుకుందాం!
దైవాశీస్సులు!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*143వ భాగము*
2 కొరింథీ 6:14 –18
14. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో
ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమిపొత్తు?
15. క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో
విశ్వాసికి పాలెక్కడిది?
16. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల
దేవుని ఆలయమై యున్నాము; అందుకు దేవుడీలాగు సెల విచ్చుచున్నాడు.నేను వారిలో
నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు.
17. కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా
ఉండుడి; అపవిత్రమైనదానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు.
18. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై
యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునై యుందురని సర్వశక్తిగల ప్రభువు
చెప్పుచున్నాడు.
ప్రియులారా! మనం 2 వ కొరింథీ
పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!
ప్రియ
దైవజనమా! ఇక 9 వ వచనం నుండి చివరి వరకు మరలా తన ఆపొస్తలత్వము నిరూపించడానికి
ప్రయత్నం చేస్తూ ఆ పనికిమాలిన దొంగబోధకులతో జోడుగా ఉండవద్దు వారితో సహవాసం
చేయవద్దు అనే అంశాన్ని రాస్తున్నారు!!
ఇక 14 వ వచనంలో అంటున్నారు మీరు అవిశ్వాసులతో జోడుగా
ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమిపొత్తు?
అవును
కదా దేవుని బిడ్డలకు ఆవిశ్వాసులయిన ప్రజలతో స్నేహం ఎందుకు? అంటే వారితో పూర్తిగా
మాట్లాడకూడదు అని కాదు గాని హలో అంటే హలో
అనే రీతిగా ఉండాలే తప్ప వారితోపాటుగా వుండి బోజనాలు చేయకూడదు అనేది పౌలుగారి భావం
ఇక్కడ! చూడండి మొదటి పత్రికలో ఏమంటున్నారొ 1
కోరింథీయులకు 5:9. జారులతో సాంగత్యము
చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసియుంటిని.
10. అయితే ఈలోకపు జారులతోనైనను, లోభులతోనైనను,
దోచుకొనువారితోనైనను, విగ్రహారాధకులతోనైనను, ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు;
ఆలాగైతే మీరు లోకములోనుండి వెళ్లిపోవలసివచ్చును గదా?
మరి ఎవరితో స్నేహం చేయకూడదు?
ఎవడైతే క్రైస్తవుడు సహోదరుడు అని పేరుపెట్టుకుని కూడా ఇలాంటి తప్పుడు పనులు
చేసేవాడు అనగా త్రాగుబోతు జూదగాడు వ్యభిచారి లంచగొండి అన్యాయస్తుడు అయి ఉంటాడో
అలాంటి పనికిమాలిన వాళ్ళతో స్నేహం చేయవద్దు వారికి కనీసం వందనం కూడా చేయవద్దు
అంటున్నారు పౌలుగారు!!!
ఈ ముఖ్యమైన సత్యాన్ని పౌలుగారు ఇక్కడ విశదపరుస్తున్నారు : క్రీస్తులోని
విశ్వాసులు దేవుని ప్రత్యేక ప్రజలు . దానికి తగినట్టుగానే వారు నడుచుకోవాలి.
ద్వితీయోపదేశకాండము 7:3-6; 1 పేతురు 2:9-12; యోహాను 17:6-10, యోహాను 17:17-19. వ
14లో అన్ని కాలాల్లో అన్ని చోట్లా అందరు విశ్వాసులకూ వర్తించే సూత్రాన్ని
పౌలుగారు చెబుతున్నారు . అవిశ్వాసులతో
వారెలాంటి దగ్గర సంబంధమూ పెట్టుకోరాదు. “జతగా” ఉండడమంటే ఒకే ఉద్దేశంతో కలిసి ఒక
పనిలో పాల్గొనడం. ద్వితీయోపదేశకాండము 22:10 చూడండి. విశ్వాసులు క్రీస్తుతో
జతపడ్డారు (మత్తయి 11:28-29). కాబట్టి క్రీస్తును తిరస్కరించిన వారితో జత
కట్టకూడదు. ఇది కేవలం స్నేహమే కాదు విశ్వాసికీ, అవిశ్వాసికీ మధ్య వివాహాన్ని
కూడా ఖచ్చితంగా నిషేధిస్తున్నది (1
కోరింథీయులకు 7:39; ఎజ్రా 9:1-2; నెహెమ్యా 13:23-27; మలాకీ 2:12 కూడా చూడండి).
ఇంకా అబద్ధమైన సువార్తను బోధించేవారితో, ఇంకా దొంగబోధకులు అబద్ద బోధలు చేసేవారితో,
బైబిల్లోని ఏదో ఒక మూల సత్యాన్ని కాదనే దుర్బోధకులతో సహవాసాన్ని కూడా ఇది
పూర్తిగా నిషేధిస్తున్నది. అవిశ్వాసులు
పని చేస్తున్న చోట విశ్వాసులు పని చేయకూడదని పౌలు అనడం లేదు, లేక తమ పని చేసేందుకు
అవిశ్వాసులను జీతానికి పెట్టుకోవద్దనడం లేదు. అవిశ్వాసులతో ఎలాంటి సంబంధం లేకుండా
దూరంగా ఉండాలని దీని అర్థం కాదు (1కోరింథీయులకు 5:9-10). అవిశ్వాసులను
క్రీస్తుదగ్గరికి నడిపించాలని పౌలు స్వయంగా వారితో కలిసిమెలిసి ఉన్నాడు
(1కోరింథీయులకు 9:19-23). కానీ ఇక్కడ వారితో దగ్గర సంబంధం, ఒకటే గమ్యం ఉండకూడదనీ,
బైబిలు సూత్రాల విషయంలో రాజీపడేలా చేసే సంబంధం, క్రీస్తుతో వారి సహవాసాన్ని చెరపగల
ఎలాంటి సంబంధం వారితో ఉండకూడదనీ చెప్తున్నారు . ఈ నియమానికి వ్యతిరేకంగా ప్రవర్తించే
ఏ విశ్వాసి అయినా కష్టాలను కొనితెచ్చుకుంటున్నాడు.
14-16 వచనాల్లో విశ్వాసులు
అవిశ్వాసులతో కలవడం ఎంత పొరపాటో, ఎంత తెలివితక్కువతనమో చూపించే ఐదు ప్రశ్నలు
అడుగుతున్నారు పౌలుగారు! . ఎక్కడా పొంతన లేని విషయాలను గానీ వ్యక్తులను గానీ
ఒకటిగా చూడకూడదు. దుర్మార్గమంతటి నుంచీ, దుర్మార్గులందరినుంచీ వేరుపడడమన్నది తన
ప్రజలకు దేవుని ఆదేశం.
2 కోరింథీయులకు 6:14 “వెలుగు”– విశ్వాసులు వెలుగులో
ఉన్నారు, వెలుగంటే వారికి ప్రీతి. వారు వెలుగు సంతానం (మత్తయి 5:14; యోహాను 3:21;
యోహాను 8:12; ఎఫెసీయులకు 5:8; 1 థెస్సలొనీకయులకు 5:5). అవిశ్వాసుల పరిస్థితి
దీనంతటికీ పూర్తిగా వ్యతిరేకం (యోహాను 3:19; 1 యోహాను 2:9, 1 యోహాను 2:11).
ఇక 15 వ వచనం: క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో
విశ్వాసికి పాలెక్కడిది?
“బెలియాల్”– ఈ పదం “పనికిమాలిన, దుర్మార్గమైన” అని
అర్థాన్నిచ్చే హీబ్రూ పదం నుంచి వచ్చింది. పౌలుగారు ఈ పదాన్ని ఇక్కడ సైతానును
ఉద్దేశించి వాడుతున్నారు . విశ్వాసులు క్రీస్తుతో జతగా ఉన్నారు, అవిశ్వాసులు
సైతానుతో జతగా ఉన్నారు (ఎఫెసీయులకు 2:2; యోహాను 8:44). అలాగైతే విశ్వాసులు
అవిశ్వాసులతో జతపడాలని కలలోనైనా ఎలా కోరుకోగలరు? కాబట్టి క్రీస్తుకు సాతాను గాడితో
ఎలా ఏవిధమైన సంబంధం లేదో అలాగే విశ్వాసికి కూడా ఆవిశ్వాసి దొంగబోధకులతో స్నేహం
సహవాసం ఉండకూడదు అనేది పౌలుగారి భావం!!!
ఇక 16 వ వచనంలో : దేవుని
ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై యున్నాము; అందుకు
దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి
దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు.
దేవుని ఆలయమునకు విగ్రహాలతో ఏమి పొందిక? చూడండి పౌలుగారు రాస్తున్నారు
మొదటి పత్రికలో మీరు దేవుని ఆలయము! ఇంకా బైబిల్ విగ్రహారాధనను వ్యభిచారంతో పోల్చడం
జరిగినది! ఇప్పుడు దేవుని అవయవాలను వ్యభిచారి అవయవాలతో కలుపుతావా అని మొదటి
పత్రికలో సూటిగా అడుచుచున్నారు పౌలుగారు.. ఇక లేవీ గ్రంధంలో అంటున్నారు లేవీయకాండము 26
11. నా మందిరమును మీ మధ్య ఉంచెదను; మీ యందు నా మనస్సు
అసహ్యపడదు.
12. నేను మీ మధ్య నడిచెదను మీకు దేవుడనైయుందును; మీరు నాకు
ప్రజలై యుందురు.
ప్రకటన గ్రంథం 21:3
అప్పుడు ఇదిగో
దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన
ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును.
యిర్మియా 32:38.
వారు నాకు ప్రజలైయుందురు నేను వారికి దేవుడనై యుందును.
విశ్వాసులు
దేవుని ఆలయం (1 కోరింథీయులకు 3:16; 1 కోరింథీయులకు 6:19; ఎఫెసీయులకు 2:21-22).
అవిశ్వాసులు విగ్రహాలను పూజించేవారు, లేదా తమ మనసుల్లోని విగ్రహాలను పూజించేవారు
(యెహెఙ్కేలు 14:3; ఎఫెసీయులకు 5:5), లేక తమను తాము విగ్రహాల్లాగా చేసుకునేవారు.
కాబట్టి ఇంత తేడా ఉన్నా ఈ రెండు రకాల మనుషుల మధ్య సమ్మతి కుదరడమెలా? విశ్వాసులు
దేవుని ఆలయం అనేదాని అర్థం కొంత వివరించేందుకు పౌలుగారు కొన్ని పాత నిబంధన
వచనాలను వారికి చూపిస్తున్నారు – యిర్మియా 32:38;
యెహేజ్కేలు 37: 27
నా మందిరము వారికి పైగానుండును, నేను వారిదేవుడనై యుందును
వారు నా జనులైయుందురు.
అందుకే 17 వ వచనంలో అంటున్నారు కావున మీరు వారి మధ్యనుండి
బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైనదానిని ముట్టకుడని ప్రభువు
చెప్పుచున్నాడు.
ఈ భాగాన్ని సరైన రీతిలో ముగించేందుకు పౌలుగారు కొన్ని పాత నిబంధన లేఖనాల గురించి మాట్లాడుతున్నారు . ఏ వచనాన్నీ
ఉన్నది ఉన్నట్టుగా ఎత్తి రాయలేదు గాని అతని మనసులో బహుశా యెషయా 52:11-12; 2
సమూయేలు 7:14; యిర్మియా 31:9; యెషయా 43:6 వంటి వచనాలు ఉండి ఉండవచ్చు.
ప్రత్యేక, పవిత్ర ప్రజగా
ఉండేందుకు ఇష్టపడేవారి ఎదుట అతడు ఎలాంటి గంబీరమైన గొప్ప విషయాన్ని పెడుతున్నాడో
చూడండి. వారు దుష్ట లోకంతో సహవాసం, సంతోషాలను కోల్పోతారు. కానీ దేవుని సహవాసాన్ని
సంపాదించుకుంటారు. చాలామందికి ఈ రెండూ కావాలి, గానీ అది సాధ్యం కాదు. యెషయా 52:11. పోవుడి పోవుడి అచ్చటనుండి వెళ్లుడి
అపవిత్రమైన దేనిని ముట్టకుడి దానియొద్దనుండి తొలగిపోవుడి యెహోవా సేవోపకరణములను
మోయువారలారా, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి
యిర్మియా 31:9. వారు
ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును,వారు
తొట్రిల్లకుండ చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు
నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా?
ఇక చివరి వచనంలో అంటున్నారు: . మరియు నేను మిమ్మును చేర్చుకొందును,
మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునై యుందురని సర్వశక్తిగల
ప్రభువు చెప్పుచున్నాడు.
హోషేయ 1:10. ఇశ్రాయేలీయుల
జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును; ఏ స్థలమందుమీరు నా జనులు
కారన్నమాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే మీరు జీవముగల దేవుని
కుమారులైయున్నా రని వారితో చెప్పుదురు.
యెహెఙ్కేలు 20:41.
జనములలోనుండి నేను మిమ్మును రప్పించునప్పుడును, మిమ్మును చెదరగొట్టిన ఆ యా
దేశములలోనుండి మిమ్మును సమకూర్చునప్పుడును, పరిమళధూపముగా మిమ్మును అంగీకరించెదను,
అన్యజనులయెదుటను మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందును.
కాబట్టి మనము లోకముతో స్నేహం మానేద్దాం! దొంగబోధకులతో జాగ్రత్తగా
ఉందాం! క్రైస్తవుడు అని పేరుపెట్టుకుని ఇంకా లోక జనులు చేసినట్లు చేసేవారితోనూ
అన్యాఛారాలు చేసేవారితోనూ త్రాగుబోతులతోనూ తిరుగుబోతులతోనూ సహవాసం మానేద్దాం!
దేవునికి తగినట్లు జీవిద్దాం!
దైవాశీస్సులు!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*144వ భాగము*
2
కొరింథీ 7:1– 7
1. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని
భయముతో పరిశుద్ధతను సంపూర్తిచేసి కొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త
కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము.
2. మమ్మును మీ హృదయములలో చేర్చుకొనుడి; మే మెవనికి అన్యాయము
చేయలేదు, ఎవనిని చెరుపలేదు, ఎవనిని మోసము చేయలేదు.
3. మీకు శిక్షావిధి కలుగవలెనని నేనీలాగు చెప్పలేదు.
చనిపోయినగాని జీవించిన గాని మీరును మేమును కూడ ఉండవలెననియు మీరు మా హృదయములలో
ఉన్నారనియు నేను లోగడ చెప్పితిని గదా
4. మీ యెడల నేను బహు ధైర్యముగా మాట లాడుచున్నాను, మిమ్మును
గూర్చి నాకు చాల అతిశయము కలదు, ఆదరణతో నిండుకొనియున్నాను, మా శ్రమయంతటికి మించిన
అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగు చున్నాను.
5. మేము మాసిదోనియకు వచ్చినప్పుడును మా శరీరము ఏమాత్రమును
విశ్రాంతి పొందలేదు. ఎటుబోయినను మాకు శ్రమయే కలిగెను; వెలుపట పోరాటములు లోపట
భయములు ఉండెను.
6. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాకవలన మమ్మును
ఆదరించెను.
7. తీతు రాకవలన మాత్రమే కాకుండ, అతడు మీ అత్యభిలాషను మీ
అంగలార్పును నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు, తాను మీ విషయమై
పొందిన ఆదరణవలన కూడ మమ్మును ఆదరించెను గనుక నేను మరి ఎక్కువగ సంతోషించితిని.
ప్రియులారా! మనం 2 వ కొరింథీ
పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!
ప్రియ
దైవజనమా! ఇక 7 వ అధ్యాయం కూడా పౌలుగారు తన అపొస్తలత్వమును నిర్ధారించుకునే
ప్రయత్నమే జరురుతుంది.
ఇక
మొదటి వచనంలో అంటున్నారు ప్రియులారా మనకు ఈ వాగ్ధానాలు ఉన్నాయి గనుక దేవుని భయముతో
పరిశుద్దతను సంపూర్తి చేసుకుందాం, ఇంకా శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము
నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాం అంటున్నారు! మనకు ఏ వాగ్ధానాలు ఉన్నాయి అంటే
ఇంతవరకు గత అధ్యాయాలలో ఉటంకించిన పాత నిబంధన లేఖనాలు అన్నీ! ఇంకా గత అధ్యాయంలో
చెప్పిన వాగ్ధానాలు!
2. అనుకూల సమయమందు నీ మొర నాలకించితిని; రక్షణ దినమందు
నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు గదా!
3. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే
రక్షణ దినము.
16. మనము జీవముగల దేవుని ఆలయమై యున్నాము; అందుకు దేవుడీలాగు
సెల విచ్చుచున్నాడు.నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును
వారు నా ప్రజలైయుందురు.
(లేవీయకాండము 26:11-12, యిర్మియా 32:38, యెహెఙ్కేలు 37:27)
17. కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా
ఉండుడి; అపవిత్రమైనదానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు.
(యెషయా 52:11, యిర్మియా 51:45, యెహెఙ్కేలు 20:33,
యెహెఙ్కేలు 20:41)
18 మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై
యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునై యుందురని సర్వశక్తిగల ప్రభువు
చెప్పుచున్నాడు.
కాబట్టి ఈ వాగ్ధానాల ప్రకారం మనలను మనం సరిచేసికుని మన ఆత్మకు
శరీరానికి అంటుకున్న పాప కల్మషములను కడిగేసి కుందాం అంటున్నారు! పాపలోకంలో
ఉన్నప్పుడు పాపము మన శరీరమునకు ఆత్మకు సాధారణముగా అంటుకుంటుంది గాని ప్రతీరోజు ఆయన
వాక్యమును ధ్యానించడం ద్వారా, ఇంకా మోకాళ్ళ ప్రార్ధనలో కన్నీటి ప్రార్ధనతో, ఇంకా
పరిశుద్ధాత్మ సన్నిధిని అనుభవించడంలో మనలో ఉన్న ప్రతీ పాపడాగును ప్రతీరోజు శుబ్రం
చేసుకోవచ్చు!
దేవుని గొప్ప వాగ్దానాలను మనం వినకముందు ఎలా ఉన్నామో, విన్నాక
అలానే ఉండకూడదు. దేవునికి లోబడి, ఆయన కోరిన రీతిగా ఆయనకు పవిత్రమైన, ప్రత్యేకమైన,
సంతోషభరితమైన ప్రజలుగా ఉండాలని తన వాక్కును, కృపను మనకు అనుగ్రహించాడు దేవుడు .
రోమీయులకు 12:12; 1 కోరింథీయులకు 15:58; ఎఫెసీయులకు 4:1; కొలొస్సయులకు 3:1; తీతుకు
2:11-14 చూడండి.
ఇక్కడ క్రీస్తు అపోస్తులుడు మనకు ఏమి గుర్తు చేస్తున్నారు
అంటే పవిత్రతలో లోపం లేని స్థితిని గురిగా
పెట్టుకోవాలని మనకు చెప్తున్నారు ! లోపరహితమైన
జీవితం, ఆక్షేపణలకు తావులేని
జీవితం లేక నిందారహితమైన జీవితం, పవిత్రమైన జీవితం జీవించాల్సిన అవసరం ప్రతీ
క్రైస్తవ విశ్వాసికి ఉంది! మనం సగం లేక మూడు వంతులు, లేక పదింట తొమ్మిది వంతులు
పవిత్రంగా ఉండాలని దేవుడు ఎంతమాత్రం చెప్పలేదు! (2 కోరింథీయులకు 13:9, 2
కోరింథీయులకు 13:11). యేసు
క్రీస్తుప్రభులవారు ఈ భూమిపై ఎంత
పవిత్రంగా జీవించారో అంత పవిత్రంగా
జీవించడమే మన గమ్యమై ఉండాలి. అయితే లోప రహిత స్థితిని గురిగా పెట్టుకున్నంత
మాత్రాన దాన్ని సాధించడం జరగదు. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ లోకం చాలా మురికి ప్రదేశం.
అందులో నివసించడం మూలంగా విశ్వాసులకు తేలికగా మురికి అంటగలదు. యోహాను 13:10
చూడండి.
“సంపూర్తి చేసుకొంటూ” అంటే ఎప్పుడూ కొనసాగుతూ ఉండే ఒక చర్య. ఈ అంశం గురించి యోహాను
17:17-19 .
17.సత్యమందు (మూలభాషలో- సత్యమువలన) వారిని ప్రతిష్ఠ చేయుము;
నీ వాక్యమే సత్యము.
18. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని
లోకమునకు పంపితిని.
19. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయ బడునట్లు వారికొరకై నన్ను
ప్రతిష్ఠ చేసికొనుచున్నాను.
లేవీయకాండము 20:7
అంటున్నారు....
కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై యుండుడి;
నేను మీ దేవుడనైన యెహో వాను.
“భయభక్తులతో”– 2 కోరింథీయులకు 5:11; 1
పేతురు 1:17. మనలో పవిత్రత సంపూర్తి అయ్యే పనికి దేవునిపై భయభక్తులు అవసరం అని
గ్రహించాలి!
1పేతురు 1: 17
పక్షపాతము లేకుండ క్రియలనుబట్టి ప్రతివానిని
తీర్పుతీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులైయున్నంతకాలము
భయముతో గడుపుడి.
కాబట్టి
ఈ విధంగా శరీరమునకు ఆత్మకు గల ఏవిధమైన కల్మషమైన కడుగుకుందాం! పవిత్రమైన జీవితం
జీవిద్దాం! పరలోకం చేరుకుందాం!
దైవాశీస్సులు!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*145వ భాగము*
2 కొరింథీ 7:1– 7
1. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని
భయముతో పరిశుద్ధతను సంపూర్తిచేసి కొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త
కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము.
2. మమ్మును మీ హృదయములలో చేర్చుకొనుడి; మే మెవనికి అన్యాయము
చేయలేదు, ఎవనిని చెరుపలేదు, ఎవనిని మోసము చేయలేదు.
3. మీకు శిక్షావిధి కలుగవలెనని నేనీలాగు చెప్పలేదు.
చనిపోయినగాని జీవించిన గాని మీరును మేమును కూడ ఉండవలెననియు మీరు మా హృదయములలో
ఉన్నారనియు నేను లోగడ చెప్పితిని గదా
4. మీ యెడల నేను బహు ధైర్యముగా మాట లాడుచున్నాను, మిమ్మును
గూర్చి నాకు చాల అతిశయము కలదు, ఆదరణతో నిండుకొనియున్నాను, మా శ్రమయంతటికి మించిన
అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగు చున్నాను.
5. మేము మాసిదోనియకు వచ్చినప్పుడును మా శరీరము ఏమాత్రమును
విశ్రాంతి పొందలేదు. ఎటుబోయినను మాకు శ్రమయే కలిగెను; వెలుపట పోరాటములు లోపట
భయములు ఉండెను.
6. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాకవలన మమ్మును
ఆదరించెను.
7. తీతు రాకవలనమాత్రమే కాకుండ, అతడు మీ అత్యభిలాషను మీ
అంగలార్పును నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు, తాను మీ విషయమై
పొందిన ఆదరణవలన కూడ మమ్మును ఆదరించెను గనుక నేను మరి ఎక్కువగ సంతోషించితిని.
ప్రియులారా! మనం 2 వ కొరింథీ
పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!
ప్రియ
దైవజనమా! ఇక 7 వ అధ్యాయం కూడా పౌలుగారు తన అపొస్తలత్వమును నిర్ధారించుకునే
ప్రయత్నమే జరురుతుంది.
(గతభాగం తరువాయి)
ఇక
రెండో వచనం నుండి తిరిగి మరలా తన అపోస్తలత్వము కోసం రాస్తున్నారు! 2. మమ్మును మీ హృదయములలో చేర్చుకొనుడి; మే మెవనికి అన్యాయము
చేయలేదు, ఎవనిని చెరుపలేదు, ఎవనిని మోసము చేయలేదు.
3. మీకు శిక్షావిధి కలుగవలెనని నేనీలాగు చెప్పలేదు.
చనిపోయినగాని జీవించిన గాని మీరును మేమును కూడ ఉండవలెననియు మీరు మా హృదయములలో
ఉన్నారనియు నేను లోగడ చెప్పితిని గదా!
చూడండి మరలా ఆరవ అధ్యాయంలో చెప్పిన విషయాలు మరలా
చెబుతున్నారు 2 కోరింథీయులకు 6:11. ఓ
కొరింథీయులారా, అరమరలేకుండ మీతో మాట లాడుచున్నాను, మా హృదయము విశాలపరచబడి యున్నది.
12. మీయెడల మా అంతఃకరణము సంకుచితమై యుండలేదు గాని మీ
అంతఃకరణమే సంకుచితమై యున్నది.
13. మీయెడల మాకున్న అంతఃకరణమునకు ప్రతి ఫలముగా మీరును మీ
హృదయములను విశాలపరచు కొనుడి; మీరు నా పిల్లలని మీతో ఈలాగు చెప్పుచున్నాను.
అక్కడ మా హృదయం విశాల పరచబడి ఉంది గాని మీ అంతకరణం సంకుచితంగా ఉంది
అంటే ఇక్కడ మమ్మును మీ హృదయాలలో చేర్చుకోండి. మేము ఎవరికి అన్యాయం చేయలేదు
అంటున్నారు! కొరింథీ సంఘములో కొంతమంది పౌలుగారు నిజమైన అపోస్తులుడు కాదు అంటూ
సందేహించడం మొదలుపెట్టారు కాబట్టి మమ్మలను మీ హృదయంలో చేర్చుకోండి అంటున్నారు! ఇక
తర్వాత వచనంలో మీకు శిక్షావిధి కలగడానికి ఇలా చెప్పడం లేదు గాని మనము చనిపోయినా
జీవించినా దేవునికి మహిమకారంగా జీవించాలి, ఇంకా మేము ప్రాణంతో ఉన్నా చనిపోయినా
ఎల్లప్పుడూ మీరు మా హృదయాలలో ఉన్నారు! అలాగే మేము కూడా మీ హృదయాలలో ఉండాలని
ఆశిస్తున్నాను అంటున్నారు! మేము మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నామో మీరు కూడా
మమ్మల్ని అలా ప్రేమించండి అంటున్నారు!
ఇక నాలుగో వచనంలో అంటున్నారు : మీ యెడల నేను బహు ధైర్యముగా
మాటలాడుచున్నాను, మిమ్మును గూర్చి నాకు చాల అతిశయము కలదు, ఆదరణతో
నిండుకొనియున్నాను, మా శ్రమయంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగు చున్నాను
అంటున్నారు!
ఇక్కడ ఆనందం అతిశయం ఎందుకంటే:
ఆ విషయంలో అతని ఆనందం ఏమిటంటే కొరింతులోని క్రైస్తవులు విశ్వాశంలో స్థిరంగా
నిలిచి దేవుని వాక్యమునకు విధేయత చూపుతూ ఉండే ప్రయత్నం చేస్తున్నారనేదే.
ఇంకా ఎందుకు అలా అంటున్నారో తర్వాత వచనాలలో చెబుతున్నారు! ఎందుకంటే 5. మేము మాసిదోనియకు వచ్చినప్పుడును మా శరీరము ఏమాత్రమును
విశ్రాంతి పొందలేదు. ఎటుబోయినను మాకు శ్రమయే కలిగెను; వెలుపట పోరాటములు లోపట
భయములు ఉండెను.
6. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాకవలన మమ్మును
ఆదరించెను.
7. తీతు రాకవలన మాత్రమే కాకుండ, అతడు మీ అత్యభిలాషను మీ
అంగలార్పును నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు, తాను మీ విషయమై
పొందిన ఆదరణవలన కూడ మమ్మును ఆదరించెను గనుక నేను మరి ఎక్కువగా సంతోషించితిని.
ఇక 5 వ వచనంలో శ్రమలు పోరాటాలు భయములు అంటున్నారు: పౌలుగారు గొప్ప అపోస్టలుడు అయినప్పటికీ, ఈ సమయంలో భయాలు,
నెమ్మది లేకపోవడం, సంఘర్షణలు అనుభవించిన స్థితిలోనే ఉన్నారు (2 కోరింథీయులకు 2:13).
ఇక 6 వ వచనంలో అయిననూ దీనులను ఆదరించే దేవుడు తీతురాకవలన మమ్మల్ని
ఆదరించారు అంటున్నారు! మొదటగా దేవుడు దీనులను ఆదరించే దీవుడు! ఇది మనకు బైబిల్
మొత్తం కనిపిస్తుంది! రెండవది: తీతు రాకవలన ఆదరణ కలిగింది అంటున్నారు! ఇలా
అనడానికి కారణం పౌలుగారు సంఘమును ఆదరించమని సరిచేయమని, బలపరచమని మొదటగా తిమోతి
గారిని పంపించారు! ఆయన తర్వాత తీతుగారు గొప్ప లేఖనాల విద్వాంసుడు మరియు చదవరి గనుక
వారిదగ్గరకు తీతు గారిని పంపించారు! తీతుగారు కొరింథీ వెళ్ళి వారు విశ్వాశంలో
స్థిరంగా ఉన్నారు పౌలుగారిని చూడాలని నిజ విశ్వాసులు ఎదురుచూస్తున్నారు అని
తెలిపారు పౌలుగారికి! అందుకే ఎంతో ఆదరణ కలిగింది అంటున్నారు! అయితే మరో వచనంలో
తీతుగారు తొందరగా రానందువలన ఎంతో కలవరం కలిగింది అంటున్నారు!
2:12. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు
వచ్చినప్పుడు, ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి యుండగా సహోదరుడైన తీతు
నాకు కనబడనందున
13. నా మనస్సులో నెమ్మది లేక వారియొద్ద సెలవు తీసికొని
అక్కడనుండి మాసిదోనియకు బయలుదేరితిని.
2 కోరింథీయులకు
1:3. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన
ప్రభువైన యేసుక్రీస్తుతండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక.
4. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో
ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు, ఆయన మాశ్రమ అంతటిలో
మమ్మును ఆదరించు చున్నాడు.
అదే
విషయాన్ని తర్వాత వచనంలో రాస్తున్నారు : 7. తీతు
రాకవలన మాత్రమే కాకుండ, అతడు మీ అత్యభిలాషను మీ అంగలార్పును నా విషయమై మీకు కలిగిన
అత్యాసక్తిని మాకు తెలుపుచు, తాను మీ విషయమై పొందిన ఆదరణవలన కూడ మమ్మును ఆదరించెను
గనుక నేను మరి ఎక్కువగా సంతోషించితిని.
చూడండి
కొరింథీ సంఘములో ఎన్ని శ్రమలు శోధనలు తొందరలు కలిగినా విశ్వాసములో మాత్రము స్థిరంగా
ఉన్నారు! ఇంకా మీవిషయంలో ఎంతో ఆదరణ పొందాడు అంటున్నారు అంటే అతనిని ఎంతో ప్రేమగా
చూశారు! అందువలన పౌలుగారు ఎంతో సంతోషించారు!
మనము
కూడా ఎన్ని తొందరలు కలవరాలు కలిగినా దేవుని ప్రేమనుండి తొలిగిపోకూడదు!
దైవాశీస్సులు!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*146వ భాగము*
2 కొరింథీ 7:8 – 16
8. నేను వ్రాసిన
పత్రికవలన మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడను; నాకు విచారము కలిగినను ఆ పత్రిక
మిమ్మును స్వల్పకాలముమట్టుకే దుఃఖ పెట్టెనని తెలిసికొనియున్నాను.
9. మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదుగాని మీరు దుఃఖపడి
మారుమనస్సు పొందితిరని యిప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయములోనైనను మావలన
మీరు నష్టము పొందకుండుటకై, దైవచిత్తానుసారముగా దుఃఖపడితిరి.
10. దైవచిత్తాను సారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును
కలుగజేయును; ఈ మారుమనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోకసంబంధమైన దుఃఖము మరణమును
కలుగజేయును.
11. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన యీ దుఃఖము ఎట్టి
జాగ్రతను ఎట్టిదోష నివారణకైన ప్రతివాదమును ఎట్టి ఆగ్రహ మును ఎట్టి భయమును ఎట్టి
అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించెనో చూడుడి. ఆ
కార్యమునుగూర్చి సమస్త విషయములలోను మీరు నిర్దోషులై యున్నారని ఋజువు పరచుకొంటిరి.
12. నేను మీకు వ్రాసినను ఆ దుష్కార్యము చేసినవాని నిమిత్తము
వ్రాయలేదు; వానివలన అన్యాయము పొందిన వాని నిమిత్తమైనను వ్రాయలేదు; మాయెడల మీ కున్న
ఆసక్తి దేవునియెదుట మీ మధ్య బాహాటమగుటకే వ్రాసితిని.
13. ఇందుచేత మేము ఆదరింపబడితివిు. అంతే కాదు,మాకు ఈ ఆదరణ
కలిగినప్పుడు తీతుయొక్క ఆత్మ మీ అందరివలన విశ్రాంతిపొందినందున అతని సంతోషమును చూచి
మరి యెక్కువగా మేము సంతోషించితివిు.
14. ఏలయనగా, నేనతని యెదుట మీ విషయమై ఏ అతిశయపు మాటలు
చెప్పినను నేను సిగ్గుపరచబడలేదు మేమేలాగు అన్నిటిని మీతో నిజముగా చెప్పితిమో ఆలాగే
మేము తీతు ఎదుట మీ విషయమై చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనబడెను.
15. మరియు మీరు భయముతోను వణకుతోను తన్ను చేర్చుకొంటిరని
అతడు మీయందరి విధేయతను జ్ఞాపకముచేసికొనుచుండగా, అతని అంతఃకరణము మరి యెక్కువగా మీ
యెడల ఉన్నది.
16. ప్రతివిషయములోను మీవలన నాకు ధైర్యము కలుగుచున్నది గనుక
నంతోషించుచున్నాను.
ప్రియులారా! మనం 2 వ కొరింథీ
పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!
ప్రియ దైవజనమా! ఇక 7 వ అధ్యాయం కూడా పౌలుగారు
తన అపొస్తలత్వమును నిర్ధారించుకునే ప్రయత్నమే జరురుతుంది.
ఇక
8,9 వచనాలలో మరలా పూర్వ సంగతులును వివరిస్తున్నారు!
8. నేను వ్రాసిన పత్రికవలన మిమ్మును దుఃఖపెట్టినందున
విచారపడను; నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్పకాలముమట్టుకే దుఃఖ
పెట్టెనని తెలిసికొనియున్నాను.
9. మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదుగాని మీరు దుఃఖపడి
మారుమనస్సు పొందితిరని యిప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయములోనైనను మావలన
మీరు నష్టము పొందకుండుటకై, దైవచిత్తానుసారముగా దుఃఖపడితిరి.
ఈ
వచనాలు మొదటి పత్రిక ఆరవ అధ్యాయంలో చెప్పబడిన వ్యక్తి కోసమని నా అభిప్రాయం! ఒకడు
తన తండ్రి చనిపోయాక తండ్రియొక్క చినభార్యతో వ్యభిచారం చేయడం మొదలుపెట్టాడు,
పౌలుగారు ఆ దుర్మార్గుడిని మీలోనుండి వెలివేసి సైతానుకి అప్పగించే మన్నారు కదా, ఆ
తర్వాత ఈ అధ్యాయం మొదట్లోనే ఆ వ్యక్తి పశ్చాత్తాప పడ్డాడు కనుక క్షమించి
చేర్చుకోమన్నారు! ఆ విషయమే ఎత్తి రాస్తున్నారు! నా పత్రిక మిమ్మల్ని దుఃఖ
పెట్టినందుకు నేను విచార పడడం లేదుగాని నాకు విచారం కలిగినా గాని ఆ పత్రిక
మిమ్మల్ని కొంచెం కాలమే దుఃఖపెట్టింది గాని మీరు దుఃఖ పడి మీరు మనస్సు పొందారని
ఇప్పుడు ఎంతో సంతోషిస్తున్నాను అంటున్నారు!
2 కోరింథీయులకు
2:3. నేను వచ్చి నప్పుడు ఎవరివలన నేను సంతోషము పొందతగినదో, వారివలన నాకు
దుఃఖము కలుగకుండవలెనని యీ సంగతి మీకు వ్రాసితిని. మరియు నా సంతోషము మీ అందరి
సంతోషమేయని మీ అందరియందు నమ్మకము కలిగి యీలాగు వ్రాసితిని.
4. మీకు దుఃఖము కలుగవలెనని కాదు గాని, మీయెడల నాకు
కలిగియున్న అత్యధికమైన ప్రేమను మీరు తెలిసికొనవలెనని, నిండు శ్రమతోను మనోవేదనతోను
ఎంతో కన్నీరు విడుచుచు మీకు వ్రాసితిని.
వారు ఆధ్యాత్మికంగా ప్రమాదంలో ఉన్నారు కాబట్టి వారికి చాలా ఘాటైన ఉత్తరం
రాశారు. అది వారిని నొప్పించింది. అతనికి వారంటే ప్రేమ కాబట్టి, దేవుని సత్యంలో
వారు స్థిరంగా వేరుపారి ఉండాలని కోరుతున్నారు కాబట్టి అలా రాశారు. ప్రేమ
దుర్బలమైనది కాదు, పైపై భావోద్రేకాలకు లోనయ్యేది కాదు. ఇతరులు తమను తాము నాశనం
చేసుకుంటూ ఉంటే అది నోరెత్తకుండా ఉండదు.
పౌలుగారి ఉత్తరం మూలంగా వారిలో కలిగిన నొప్పి, దుఃఖం ఒక
మంచి ఫలితాన్ని కలిగించాయి – వారిలో పశ్చాత్తాపం కలిగింది. వారు
కొన్ని చెడుతనాలను విసర్జించి, తప్పుడు మార్గాల నుంచి వైదొలగి ఇంతకుముందెన్నడూ
లేనంతగా హృదయ పూర్వకంగా దేవుని వైపుకు తిరిగారు.
ఇలా చెప్పాక రెండు రకాలైన
దుఖముల కోసం రాస్తున్నారు! దైవచిత్తాను సారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును
కలుగజేయును; ఈ మారుమనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోకసంబంధమైన దుఃఖము మరణమును
కలుగజేయును.
మొదటిది దైవ
చిత్తానుసారమైన దుఖము! ఇది నా ఉద్దేశంలో రెండు రకాలుగా ఉంటుంది! మొదటిది: దేవుడు
కొన్నిసార్లు పరిశుద్ధాత్మ ద్వారా మనలను కొన్ని విషయాలలో ఏడ్చి ప్రార్థన
చేయమంటారు! మరికొన్నిసార్లు ఫలాని వారికోసం ఏడ్చి ప్రార్థన చేయమని మనకు వారు ఇష్టం
లేకపోయినా మనకు తెలియకుండా కన్నీటితో వారికోసం ప్రార్థన చేస్తాము! ఇది ఒక రకమైన
దైవ చిత్తానుసారమైన దుఖము!!
రెండవది: మనం దేవుని
పరిశుద్దాత్మకు దుఖం కలిగించే కార్యం చేస్తే, పరిశుద్దాత్ముడు కొన్నిసార్లు మనకు
చెబుతారు, అప్పుడు మన పాపములకై ఎంతో విలపించి ప్రార్థన చేసి కన్నీటితో దేవుని
పాదాలు కడుగుతాము! ఇది దైవ చిత్తానుసారమైన దుఖము! ఇలాంటి దుఖము మనకు మన ఆత్మకు
ఎంతో నెమ్మది కలిగిస్తుంది గాని లోకానుసారమైన దుఖము అనగా ఎవరైనా మనలను కొడితే లేక
భర్త కొట్టినా ఇతరులు మనలను బాధించినా కలిగే దుఖము లేక మన ఆత్మీయులును
పోగొట్టుకుంటే కలిగే దుఃఖము అనేది లోకానుసారమైన దుఖము! ఇది మనకు చావుకు
దారితీస్తుంది! ఏడ్వగా ఏడ్వగా చివరకు ఆ మనో వ్యాధి మనలను అది మరణానికి తీసుకుని పోతుంది !
ఇక మీరు దేవుని చిత్త
ప్రకారము పొందిన యీ దుఃఖము ఎట్టి జాగ్రతను, ఎట్టిదోష నివారణకైన ప్రతివాదమును,
ఎట్టి ఆగ్రహ మును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని ,ఎట్టి
ప్రతిదండనను మీలో పుట్టించెనో చూడుడి. ఆ కార్యమునుగూర్చి సమస్త విషయములలోను మీరు
నిర్దోషులై యున్నారని ఋజువు పరచుకొంటిరి.
దేవుడు
కలిగించే దుఃఖం, పశ్చాత్తాపం ఏవిధంగా కలిసి పనిచేస్తాయో చూడండి. “ఈ విషయం” అంటే 2
కోరింథీయులకు 2:5-7 లోని విషయం.
2 కోరింథీయులకు
2:5. ఎవడైనను దుఃఖము కలుగజేసి యుండినయెడల,నాకు మాత్రము కాదు కొంతమట్టుకు
మీకందరికిని దుఃఖము కలుగజేసియున్నాడు. నేను విశేషభారము వానిమీద మోపగోరక యీ మాట
చెప్పుచున్నాను.
6. అట్టివానికి మీలో ఎక్కువమందివలన కలిగిన యీ శిక్షయే
చాలును
7. గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది.
లేనియెడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును.
ఇక
తర్వాత నేను మీకు వ్రాసినను ఆ దుష్కార్యము చేసినవాని నిమిత్తము వ్రాయలేదు; వానివలన
అన్యాయము పొందిన వాని నిమిత్తమైనను వ్రాయలేదు; మాయెడల మీ కున్న ఆసక్తి దేవునియెదుట
మీ మధ్య బాహాటమగుటకే వ్రాసితిని. చూడండి మీపట్ల మాకు ఎంత ప్రేమ ఉందో చూడండి
అంటున్నారు
“మీపట్ల...శ్రద్థాసక్తులు”– అంటే దేవుని సత్యం పట్ల
ఉన్న శ్రద్ధాసక్తులు అని కూడా. పౌలుగారికి ప్రాముఖ్యమైన విషయం ఇదే. 2
కోరింథీయులకు 2:9. మీరన్ని విషయములందు
విధేయులై యున్నారేమో అని మీ యోగ్యత తెలిసికొనుటకే గదా పూర్వము వ్రాసితిని.
ఇక
తర్వాత వచనం ఇందుచేత మేము ఆదరింపబడితివిు.
అంతే కాదు, మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతుయొక్క ఆత్మ మీ అందరివలన
విశ్రాంతిపొందినందున అతని సంతోషమును చూచి మరి యెక్కువగా మేము సంతోషించితివిు.
విశ్వాసులు
ఒకరినొకరు ఆదరించుకుని ఒకరినుంచి ఒకరు ప్రోత్సాహం, ఆనందం అనుభవించే సంగతికి మంచి
ఉదాహరణ ఈ వచనాల్లో కనిపిస్తున్నది. క్రీస్తు కోసం వ్యక్తుల్ని సంపాదించేవాడు తన
పరిచర్య ద్వారా మార్పు పొందినవారు సత్యంలో నడుచుకుంటుంటే అనుభవించే ఆనందం కూడా
ఇక్కడ కనిపిస్తున్నది.
ఎందుకు
తీతుగారి రాకవలన ఎక్కువ ఆదరణ కలిగింది అంటే 14.
ఏలయనగా, నేనతని యెదుట మీ విషయమై ఏ అతిశయపు మాటలు చెప్పినను నేను సిగ్గుపరచబడలేదు మేమేలాగు
అన్నిటిని మీతో నిజముగా చెప్పితిమో ఆలాగే మేము తీతు ఎదుట మీ విషయమై చెప్పిన
అతిశయపు మాటలు నిజమని కనబడెను. ఇంకా చివరి వచనాలలో అంటున్నారు 15. మరియు మీరు
భయముతోను వణకుతోను తన్ను చేర్చుకొంటిరని అతడు మీయందరి విధేయతను
జ్ఞాపకముచేసికొనుచుండగా, అతని అంతఃకరణము మరి యెక్కువగా మీ యెడల ఉన్నది.
16. ప్రతివిషయములోను మీవలన నాకు ధైర్యము కలుగుచున్నది గనుక
నంతోషించుచున్నాను.
గమనించండి
దైవసేవకులను కొరింథీ సంఘము ఎలా చూసుకున్నదో !! పౌలుగారిని కాదు అతని శిష్యుడు
అక్కడకి వెళ్తే ఎంతో భయముతో ఎంతో వణకుతో తీతుగారిని చేర్చుకున్నారు కొరింథీ వారు
ప్రతీ
సంఘము దైవసేవకుల పట్ల నడుచుకోవాలి ! అదే సమయంలో పేతురు గారు చెప్పినట్లు
దైవసేవకులు కూడా విశ్వాసులమీద అధికారం చేయడానికి ప్రయత్నం చేయకుండా దేవుని సేవకులు
తమ దేవుని పొలంలో విశ్వాసులు కూడా బాగస్వాములే అని గ్రహించి విశ్వాసులను ఎంతో
ప్రేమగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది!..1పేతురు 5:
3
మీకు అప్పగింపబడినవారిపైన ప్రభువునైనట్టుండక మందకు
మాదిరులుగా ఉండుడి;
దైవాశీస్సులు!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*147వ భాగము*
2 కొరింథీ 8:1 – 8
1. సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అను గ్రహింపబడియున్న
దేవుని కృపనుగూర్చి మీకు తెలియ జేయుచున్నాము.
2. ఏలాగనగా, వారు బహు శ్రమవలన పరీక్షింపబడగా, అత్యధికముగా
సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను.
3. ఈ కృపవిషయములోను, పరిశుద్ధులకొరకైన పరిచర్యలో పాలుపొందు
విషయములోను, మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు,
4. వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యముకంటె
ఎక్కువగాను తమంతట తామే యిచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను.
5. ఇదియుగాక మొదట ప్రభువునకును, దేవుని చిత్తమువలన మాకును,
తమ్మును తామే అప్పగించుకొనిరి; యింతగా చేయుదురని మేమనుకొనలేదు.
6. కావున తీతు ఈ కృపను ఏలాగు పూర్వము మొదలుపెట్టెనో ఆలాగున
దానిని మీలో సంపూర్ణము చేయుమని మేమతని వేడు కొంటిమి.
7. మీరు ప్రతివిషయములో, అనగా విశ్వాస మందును ఉపదేశమందును
జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీకు మాయెడలనున్న ప్రేమయందును ఏలాగు
అభివృద్ధిపొందుచున్నారో ఆలాగే మీరు ఈ కృపయందు కూడ అభివృద్ధిపొందునట్లు చూచుకొనుడి.
8. ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుటలేదు; ఇతరుల జాగ్రత్తను
మీకు చూపుటచేత మీ ప్రేమ యెంత యథార్థమైనదో పరీక్షింపవలెనని చెప్పుచున్నాను.
ప్రియులారా! మనం 2 వ కొరింథీ
పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!
ప్రియ
దైవజనమా! ఇక 8 వ అధ్యాయం మరలా యెరూషలేములో ఉన్న నిరుపేద లైన క్రైస్తవ విశ్వాసుల కోసమైన చందా కోసం రాశారు!
మొదటి వచనంలో అంటున్నారు
సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అను గ్రహింపబడియున్న దేవుని కృపనుగూర్చి
మీకు తెలియ జేయుచున్నాము. గమనించాలి మాసిదోనియాలోని సంఘాలు అనగా ఫిలిప్పీ,
థెస్సలొనీకయ సంఘాలు కూడా ఇందులోనివే! ఇక పేదలకు
ఇవ్వడమనే సద్గుణాన్ని దివ్యంగా ఈ సంఘాలు అన్నీ ఎంతగానో చేశాయి . దేవుడు ఆ
సంఘాలకు ఇచ్చిన “కృప” అంటే పేదలకు దారాళంగా తమకున్న దానినుండి ఇవ్వడమే! నిజానికి ఈ
మాసిడోనియా సంఘాలు ఒకప్రక్క విశ్వాసులు
నిరుపేదలు, మరో ప్రక్క అక్కడున్న క్రీస్తు విరోధులచేతిలో ఇంకా యూదుల చేత తీవ్రమైన
హింసను ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ వారు చందా పంపించారు. అందుకే అంటున్నారు
పౌలుగారు 2,3 వచనాలలో వారు తమ నిరుపేదలైనా గాని సామర్ధ్యం కంటే ఎక్కువ దాతృత్వం
కలిగి “ఆనంద సమృద్ధి” మూలంగా వారిచ్చారు. అయితే ఒక విషయం గమనించాలి: ఇలా ఇవ్వాలని పౌలుగారు వారికి విన్నవించలేదు. గాని బహుశా అపోస్తులుల
కార్యంలో పెద్దల సభలో చేసిన తీర్మానం, తీర్మానం కాపీ చూపి ఉంటారు! దానిలో పేదలను దయచేసి పేదలను జ్నాపకం చేసుకోండి అని మాత్రమే
ఉంది! అది చూసిన ఈ మాసిడోనియా సంఘాలు పేదలకు ఇవ్వడానికి సిద్ధపడి, అలా ఇవ్వడానికి
తమకు అనుమతి నివ్వవలసిందని వారు “మనసారా” పౌలుగారిని “వేడుకొన్నారు”. క్రీస్తుకు, క్రీస్తు ప్రజలకు ఇవ్వడమనేది
బాధకరమైన బాధ్యత కాదు గాని మంచి అవకాశమే, ఆధిక్యతే అని వారికి తెలుసు. నిజంగా మన
దేశంలో ఉన్న సంఘాలన్నీ, విశ్వాసులంతా ఈ దివ్య సత్యాన్ని అర్థం చేసుకుని దాని
ప్రకారం ప్రవర్తిస్తే మన సంఘాల్లో కూడా
ఎంత దీవెనకరంగా ఉంటుందో కదా!. దీనికోసమే 1 కోరింథీయులకు 16:1-4 రాస్తున్నారు
.
ఆ స్థానిక సమస్యను గురించి రాస్తూ పౌలుగారు విశ్వాసులు చందాలివ్వడం గురించిన కొన్ని
దివ్య సత్యాలను మనకు తెలియజేస్తున్నారు.
1 కోరింథీయులకు
16:1—4 .
1. పరిశుద్ధులకొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు
నియమించిన ప్రకారము మీరును చేయుడి.
2. నేను వచ్చినప్పుడు చందా పోగుచేయకుండ ప్రతి ఆదివారమున
మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తనయొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను.
3. నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని యెంచి
పత్రికలిత్తురో, వారిచేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును.
4. నేను కూడ వెళ్లుట యుక్తమైనయెడల వారు నాతో కూడ వత్తురు.
చూడండి ఈ వచనాలలో పౌలుగారు చాలా జాగ్రత్త పడుతున్నారు! నేను వచ్చాక
మీరు పొగుచేసిన ధనమును మీరు ఎవరిని యోగ్యులని అనుకుంటున్నారో వారిచేత ఆ ధనమును
యెరూషలేము పంపుతాను, ఒకవేళ నన్ను కూడా వెల్లమంటే వారితో వెళ్తాను అంటున్నారు తప్ప,
నా చేతికి ఇవ్వండి నేను తీసుకుని వెళ్తాను అనడం లేదు! అలా కొరింథీ వారి విశ్వాసులు
లేకుండా అంతాగొప్ప సొమ్ము తీసుకుని వెళ్తే సగం దాచుకుని సగం ఇచ్చారని పౌలుగారు
కిట్టని వ్యక్తులు బహుశా అంటారేమో అని ఆ అవకాశం కూడా లేకుండా విరోధుల చేతికి
ఇవ్వడం లేదు! మీరే ఆ సంఘాలకు పంపించండి. పెద్దలు ఎవరో వారికి వివరాలు మాత్రం
చెబుతాను అంటున్నారు! నేడు అనేకమంది దైవసేవకులు ధనము విషయములో నమ్మకముగా ఉండకుండా
ధనాశ చేత సంఘ విశ్వాసుల దగ్గర చులకన అయిపోతున్నారు! నిజానికి నేటి దైవసేవకులు కూడా
పౌలుగారు జాగ్రత్తపడినట్లు జాగ్రత్తపడితే మన దేశంలో గల సంఘాలు కూడా ఎంతగానో
అభివృద్ధి చెంది ఉండును!!!
ఇక్కడ ఈ 8 వచనాలలో ముఖ్యమైన విషయాలు ఏమంటే: మొదటిది తీతుగారు
మామూలుగా ఈ దేవునికివ్వడం అనే కృపావరం కోసం చెబితే వెంటనే వారు దేవునికి ఇవ్వడం
మొదలు పెట్టారు!
రెండవది: ఒక ప్రక్క కొరింథీ వారు, ఇంకా మాసిడోనియా సంఘాలు కూడా
ఎన్నో శ్రమలను హింసలను అనుభవిస్తున్నా, అదే సమయంలో ఈ శ్రమలు శోధనల వలన వారు కూడా
అనగా కొరింథీ వారు మాసిడోనియా వారు పేదలై పోయినా గాని పేదలకు సహాయం చేయాలి అనే
ఉద్దేశంతో శక్తికి మించి ఇచ్చారు!
మూడవది: పౌలుగారు అనుకున్నారు- వారు వారి శక్తి కొలదీ ఇస్తారు
అనుకున్నారు గాని వారు శక్తికి మించి ఇచ్చారు! వారి సామర్ధ్యం కంటే ఎక్కువ
ఇచ్చారు! నిజంగా ఇది గొప్ప సాక్ష్యం!!!
నాలుగు: పౌలుగారు ఇలా పేదలకు ఇవ్వాలని చెప్పలేదు గాని ఆ సంఘాలే
పౌలుగారిని బ్రతిమాలి ఈ పేదలకు కోసం చందా ఇచ్చారు! అందుకే పౌలుగారు అంటున్నారు:
సంతోషముగా ఇచ్చేవారిని దేవుడు ఎంతో దీవిస్తారు అంటున్నారు!
ఐదు: అలా చేయడానికి తమకుతామే దేవునికి అప్పగించేసుకున్నారు!
రోమీయులకు 12:1.
కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను
ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను.
ఇట్టి సేవ మీకు యుక్త మైనది.
2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును,
సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి
నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.
అలాగే
ప్రతీ విశ్వాసి దేవునికి ఇవ్వడంలో ఇంకా దేవుని పరిచర్య చేయడంలో, సువార్త ప్రకటన
కోసం తముకుతామే దేవునికి అర్పించుకోవాలి! అలాచేస్తే దేవుని ఘనమైన మేలులు
ఆశీర్వాదాలు మెండుగా కలుగుతాయి!
ఆరు:
ఇక ఆరవ వచనంలో . కావున తీతు ఈ కృపను ఏలాగు పూర్వము మొదలుపెట్టెనో ఆలాగున దానిని
మీలో సంపూర్ణము చేయుమని మేమతని వేడుకొంటిమి. ఈ వచనం ప్రకారం ఏమి అర్ధం అవుతుంది
అంటే :
తీతు
కొరింతుకు వెళ్ళాడు (2 కోరింథీయులకు 7:6). ఇప్పుడు అతణ్ణి మళ్ళీ అక్కడికి పంపాలని
పౌలుగారు నిర్ణయించారు (వ 16-18). “సంపూర్తి”– వారు ఇస్తామన్న మొత్తమంతా
ఇవ్వలేదు, లేక తేలికగా ఇవ్వగలిగినంతా కూడా ఇవ్వలేదు అని అనిపిస్తున్నది (2
కోరింథీయులకు 9:5). అందుకే దానిని సంపూర్తి చేయమంటున్నారు !
ఇక
7,8 వచనాలలో 7. మీరు ప్రతివిషయములో, అనగా విశ్వాస
మందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీకు మాయెడలనున్న
ప్రేమయందును ఏలాగు అభివృద్ధిపొందుచున్నారో ఆలాగే మీరు ఈ కృపయందు కూడ
అభివృద్ధిపొందునట్లు చూచుకొనుడి.
8. ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుటలేదు; ఇతరుల జాగ్రత్తను
మీకు చూపుటచేత మీ ప్రేమ యెంత యథార్థమైనదో పరీక్షింపవలెనని చెప్పుచున్నాను.
గమనించాలి:
మొదటి పత్రికలో వారి కోసం గొప్పగా సాక్ష్యం చెప్పారు, ఇప్పుడు అదే విధంగా పూర్తిగా
ఆ విశ్వాశంలోనే బలంగా ఉండండి లేక స్థిరంగా ఉండండి అంటున్నారు 1 కోరింథీయులకు 1:5. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో
స్థిరపరచబడినందున ఆయనయందు మీరు ప్రతి విషయములోను,
6. అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్య
వంతులైతిరి;
7. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన
యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నారు.
“ఆజ్ఞ
పూర్వకంగా చెప్పడం లేదు” అని ఎందుకు అంటున్నారు అంటే – పేదలకు ఇవ్వాలన్న కోరిక
హృదయంలోనుంచి స్వచ్ఛందంగా రావాలని అతనికి తెలుసు. బలవంతంగా, ఇష్టం లేకుండా
ఇవ్వడమంటే దేవునికి ఇష్టం లేదు (2 కోరింథీయులకు 9:7). ప్రేమ ఆధారంగా ఇవ్వడమే ఆయనకు
ఇష్టమైన సంగతి. క్రీస్తుకోసం ఒక మనిషికి ఉన్న ప్రేమకు పరీక్ష ఇవ్వడమే. ఇది
ఎప్పుడైనా సత్యమే. క్రీస్తుకు ఇవ్వనివాడు, అతడేమన్నా, ఏమనుకున్నా క్రీస్తును
ప్రేమించడం లేదన్నమాట. పౌలుగారు ఇవ్వడం
గురించి ఆజ్ఞాపించకుండా, మాసిదోనియావారి ఆదర్శాన్ని వారి ముందు ఉంచుతున్నారు. 9 వ వచనంలో
మరింత శ్రేష్ఠమైన ఉదాహరణ ఇస్తున్నారు.
గనుక
మనం కూడా దేవునికి ఇవ్వడంలో ఇంకా పేదలకు ఇవ్వడంలో ఈ కొరింథీ సంఘాలను ఇంకా
మాసిడోనియా సంఘాలను ఆదర్శంగా తీసుకుని దేవునికి, పేదలకు దారాళంగా ఇద్దాం! దేవుని
దీవెనలు పొందుదాం!
దైవాశీస్సులు!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*148వ భాగము*
2 కొరింథీ 8:9 – 17
9. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుగదా? ఆయన
ధన వంతుడై యుండియు మీరు తన దారిద్ర్యమువలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము
దరిద్రుడాయెను.
10. ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను; సంవత్స
రము క్రిందటనే యీ కార్యము చేయుట యందే గాక చేయ తలపెట్టుటయందు కూడ మొదటి వారై యుండిన
మీకు మేలు
11. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఏలాగు కలిగెనో,
ఆలాగే మీ కలిమికొలది సంపూర్తియగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెర వేర్చుడి.
12. మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగియుంటే శక్తికి మించి
కాదు గాని కలిమి కొలదియే యిచ్చినది ప్రీతికరమవును.
13. ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలెనని ఇది
చెప్పుటలేదు గాని
14. హెచ్చుగా కూర్చుకొనినవానికి ఎక్కువ మిగులలేదనియు
తక్కువగా కూర్చుకొనినవానికి తక్కువ కాలేదనియువ్రాయబడిన ప్రకారము అందరికి సమానముగా
ఉండు నిమిత్తము,
15. ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరియొకప్పుడు
వారి సమృద్ధి మీ యక్కరకును సహాయమై యుండవలెనని ఈలాగు చెప్పుచున్నాను.
16. మీ విషయమై నాకు కలిగిన యీ ఆసక్తినే తీతు హృదయములో
పుట్టించిన దేవునికి స్తోత్రము.
17. అతడు నా హెచ్చరికను అంగీకరించెను గాని అతనికే
విశేషాసక్తి కలిగినందున తన యిష్టముచొప్పుననే మీయొద్దకు బయలు దేరి
వచ్చుచున్నాడు.
ప్రియులారా! మనం 2
వ కొరింథీ పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!
ప్రియ
దైవజనమా! ఇక 8 వ అధ్యాయం మరలా యెరూషలేము లో ఉన్న నిరుపేదలైన క్రైస్తవ విశ్వాసుల కోసమైన చందా కోసం రాశారు!
(గతభాగం తరువాయి)
ఇక
9 వ వచనంలో అంటున్నారు: మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుగదా? ఆయన
ధనవంతుడై యుండియు మీరు తన దారిద్ర్యమువలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము
దరిద్రుడాయెను.
ఇలా
పౌలుగారు వ్రాయడానికి కారణం: యేసుప్రభువులో ఇవ్వడమనే కృప పరిపూర్ణంగా ఉంది. ఆయన
ప్రేమతో తనకున్నదంతా ఇచ్చేశారు . విశ్వాసులందరికీ ఆయన ఆదర్శం. “నిజానికి ఆయన ధనవంతుడు”– యోహాను 1:1-3; యోహాను 17:5;
కొలొస్సయులకు 1:16; హెబ్రీయులకు 1:2. ప్రకారం!
గాని
ఆయన మనకోసమే “దరిద్రుడు అయ్యాడు”– లూకా 2:7; మత్తయి 8:20; మత్తయి 17:27; మత్తయి 27:46;
ఫిలిప్పీయులకు 2:6-8; యెషయా 53:2-6. ప్రకారం
Philippians(ఫిలిప్పీయులకు) 2:6,7,8
6. ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో
సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని
7. మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని,
తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.
8.మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి,మరణము పొందునంతగా,
అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.
ఇది “మీ కోసం”, విశ్వాసులందరి కోసమూ, క్రీస్తు
మనలను ప్రేమించి మనకోసం తనను తాను అర్పించుకున్నారు – యోహాను 10:11-18; గలతియులకు
2:20. ఆయన తద్వారా మనం ధనవంతులం కావాలని కోరారు. దీని అర్థం ఏమిటో ఈ రిఫరెన్సులు
స్పష్టం చేస్తున్నాయి – మత్తయి 19:28-29; యోహాను 14:2-3; రోమీయులకు 8:17; 1 కోరింథీయులకు
3:21-23; ఎఫెసీయులకు 1:3, ఎఫెసీయులకు 1:7-8; 1 పేతురు 1:4; ప్రకటన గ్రంథం 21:7.
ఆయన దరిద్రం మూలంగానే ఇది సాధ్యం
అయింది – అంటే పాపుల స్థానంలో మరణించేందుకు
క్రీస్తు తనకున్నదానంతటినీ వదులుకోకపోతే ఎవరికీ పాపవిముక్తి, రక్షణ అనే ఐశ్వర్యం
దక్కేది కాదు. క్రీస్తు అపోస్టలులు కూడా
ఆయన ఆదర్శాన్ని అనుసరించారు – 2 కోరింథీయులకు 6:10; అపో. కార్యములు 3:6; మత్తయి
19:27.
మరి
మన సంగతేమిటి? మనకు కలిగింది దాచిపెట్టుకుంటూ ఇంకా మనం లేదు లేదు అంటున్నాము
అందుకే మనం ఇంకా ఇలాగే ఉంటున్నాము! దేవునికి దాతృత్వం కలిగి ఇస్తే దేవుడు వాటిని
దీవించే దేవుడు! పాత నిబంధన గ్రంధంలో అంటున్నారు- మీరేగాని దేవునికి ఇస్తే దేశంలో
పేదలు ఉండనే ఉండరు అంటున్నారు..
ద్వితియోపదేశకాండము 15: 5
కావున నేడు నేను నీ కాజ్ఞాపించుచున్న యీ ఆజ్ఞలనన్నిటిని
అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినినయెడల మీలో బీదలు
ఉండనే ఉండరు.
ఇక
10 వ వచనంలో అంటున్నారు మీరు సంవత్సరం క్రితమే దీనిని మొదలుపెడితే బాగుణ్ణు!
తర్వాత
వచనంలో అంటున్నారు . కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఏలాగు కలిగెనో, ఆలాగే
మీ కలిమికొలది సంపూర్తియగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి. ఒకరికి
ఉన్నదాన్ని బట్టి అతడు ఇవ్వాలి (1 కోరింథీయులకు 16:2). పేదలు ఎక్కువ ఇవ్వలేరు,
ధనికులు తక్కువ ఇవ్వకూడదు ఇదీ ఇక్కడ అర్ధం!
1 కోరింథీయులకు
16:2. నేను వచ్చినప్పుడు చందా పోగుచేయకుండ ప్రతి ఆదివారమున మీలో
ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తనయొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను.
ఇక తర్వాత వచనాలలో అంటున్నారు: 12. మొదట ఒకడు సిద్ధమైన
మనస్సు కలిగియుంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే యిచ్చినది
ప్రీతికరమవును.
13. ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలెనని ఇది
చెప్పుటలేదు గాని
14. హెచ్చుగా కూర్చుకొనినవానికి ఎక్కువ మిగులలేదనియు
తక్కువగా కూర్చుకొనినవానికి తక్కువ కాలేదనియువ్రాయబడిన ప్రకారము అందరికి సమానముగా
ఉండు నిమిత్తము,
15. ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరియొకప్పుడు
వారి సమృద్ధి మీ యక్కరకును సహాయమై యుండవలెనని ఈలాగు చెప్పుచున్నాను.
ఇక్కడి
మూల పదం “సమానత”. విశ్వాసుల మధ్య పరస్పర ప్రేమ ఉండాలి. అవసరతలో ఉన్నవారితో
తమకున్నది పంచుకోవాలన్న ఆత్రుత ఉండాలి. అపో. కార్యములు 2:44-45; అపో. కార్యములు
4:32-35 చూడండి
అపో. కార్యములు
2:44. విశ్వసించినవారందరు ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచు
కొనిరి.
45. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి, అందరికిని
వారి వారి అక్కరకొలది పంచిపెట్టిరి.
అపో. కార్యములు
4:32. విశ్వసించినవారందరును ఏకహృదయమును ఏకాత్మయు గలవారై యుండిరి. ఎవడును
తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు; వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా
ఉండెను.
33. ఇదియుగాక అపొస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు
పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరియందు అధికముగా ఉండెను.
34. భూములైనను ఇండ్లయినను కలిగినవారందరు వాటిని అమ్మి,
అమ్మిన వాటి వెలతెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టుచు వచ్చిరి.
35. వారు ప్రతివానికి వానివాని అక్కరకొలది పంచిపెట్టిరి
గనుక వారిలో ఎవనికిని కొదువలేకపోయెను.
యోహాను గారు అంటున్నారు
1 యోహాను 3:16-18
16. ఆయన మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను గనుక దీనివలన
ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనముకూడ సహోదరుల నిమిత్తము మన ప్రాణములను
పెట్ట బద్ధులమై యున్నాము.
17. ఈ లోకపు జీవనోపాధిగలవాడైయుండి, తన సహోదరునికి లేమి
కలుగుట చూచియు, అతనియెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ యేలాగు
నిలుచును?
18. చిన్న పిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను
సత్యముతోను ప్రేమింతము..
దీనిలో కూడా అందరిలోకీ యేసుప్రభువు మనకు గొప్ప
ఆదర్శం. తనకున్నదంతా ఆయన విశ్వాసులతో పంచుకుంటున్నారు. అలాంటప్పుడు విశ్వాసులు
కూడా తమకున్నదంతా ఆయనతోను, ఒకరితో ఒకరు ఎందుకు పంచుకోకూడదు? ఇజ్రాయేల్ ప్రజలు
ఎడారిలో ఉన్నప్పుడు వారిలో సమానత ఉండేలా దేవుడు ఏర్పాటు చేశాడు (వ 15;
నిర్గమకాండము 16:18). నిర్గమకాండము 16:18.
వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చు కొనినవానికి ఎక్కువగా మిగులలేదు
తక్కువగా కూర్చుకొనినవానికి తక్కువకాలేదు. వారు తమ తమ యింటివారి భోజనమునకు సరిగా
కూర్చుకొనియుండిరి.
ఇప్పుడు విశ్వాసులందరికీ చాలినంత
ఉండేలా దేవుడు వారికి మంచివాటిని ఇస్తున్నారు. ఇతరులు ఆకలికి మాడుతుంటే కొందరు
విలాసాల్లో తేలియాడడం ఆయన ఉద్దేశం కాదు. కానీ ఈ విషయాల్లో ఆజ్ఞ ఏమీ లేదు. ఇవ్వాలని
మనల్ని ఎవరూ బలవంతం చేయరాదు. ఒక వ్యక్తి ఆస్తి అతని స్వంతం. తన ఇష్టం వచ్చినట్టు
అతడు ధనాన్ని ఇవ్వవచ్చు. తన ఇష్టం వచ్చినంత తనకు ఉంచుకోవచ్చు. అయితే ఎక్కువ భాగం
తనకే ఉంచుకుని తక్కువ ఇస్తే చివరికి అతనికి నష్టమే (సామెతలు 11:24 పోల్చి చూడండి).
అతడు మరింత ఉదారంగా ఉండివుంటే ఎవరికి సహాయం చేయగలిగేవాడో వారికి కూడా నష్టమే. సామెతలు
11: 24. వెదజల్లి అభివృద్ధిపొందువారు కలరు తగినదానికన్న తక్కువ ఇచ్చి
లేమికి వచ్చువారు కలరు.
కాబట్టి
మనం ఏమి చేద్దాం? పిసినారితనం కలిగి ఉందామా? లేక దేవుని శక్తికొలదీ ఇద్దామా?
దైవాశీస్సులు!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*149వ భాగము*
2 కొరింథీ 8:17– 24
17. అతడు నా
హెచ్చరికను అంగీకరించెను గాని అతనికే విశేషాసక్తి కలిగినందున తన యిష్టముచొప్పుననే
మీయొద్దకు బయలు దేరి వచ్చుచున్నాడు.
18. మరియు సువార్త విషయము సంఘములన్నిటిలో ప్రసిద్ధిచెందిన సహోదరుని
అతనితో కూడ పంపుచున్నాము.
19. అంతేకాక మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తమును మా
సిద్ధమైన మనస్సు కనుపరచు నిమిత్తమును ఈ ఉపకారద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతోకూడ
అతడు ప్రయాణము చేయవలెనని సంఘములవారతని ఏర్పరచుకొనిరి.¸
20. మరియు మేమింత విస్తారమైన ధర్మము విషయమై పరిచారకులమై
యున్నాము గనుక దానినిగూర్చి మామీద ఎవడును తప్పు మోపకుండ మేము జాగ్రత్తగా
చూచుకొనుచు అతనిని పంపుచున్నాము.
21. ఏలయనగా ప్రభువు దృష్టియందు మాత్రమే గాక మనుష్యుల
దృష్టియందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము.
22. మరియు వారితోకూడ మేము మా సహోదరుని పంపుచున్నాము. చాల
సంగతులలో అనేక పర్యాయములు అతనిని పరీక్షించి అతడు ఆసక్తిగల వాడనియు, ఇప్పుడును మీ
యెడల అతనికి కలిగిన విశేషమైన నమ్మికవలన మరి యెక్కువైన ఆసక్తిగలవాడనియు
తెలిసికొనియున్నాము.
23. తీతు ఎవడని యెవరైన అడిగినయెడల అతడు నా పాలివాడును మీ
విషయములో నా జత పనివాడునై యున్నాడనియు; మన సహోదరులెవరని అడిగిన యెడల వారు సంఘముల
దూతలును క్రీస్తు మహిమయునై యున్నారనియు నేను చెప్పుచున్నాను.
24. కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదనియు మీ విషయమైన మా అతిశయము
వ్యర్థముకాదనియు వారికి సంఘములయెదుట కనుపరచుడి.
ప్రియులారా! మనం 2 వ కొరింథీ
పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!
ప్రియ
దైవజనమా! ఇక 8 వ అధ్యాయం మరలా యెరూషలేము లో ఉన్న నిరుపేదలైన క్రైస్తవ విశ్వాసుల కోసమైన చందా కోసం రాశారు!
(గతభాగం తరువాయి)
ఇక
17,18 వచనాలలో మరలా తీతుగారిని పంపుతున్నారు తనతో పాటుగా మరో సహోదరుని
పంపుతున్నారు
17. అతడు నా హెచ్చరికను అంగీకరించెను గాని అతనికే
విశేషాసక్తి కలిగినందున తన యిష్టముచొప్పుననే మీయొద్దకు బయలు దేరి వచ్చుచున్నాడు.
18. మరియు సువార్త విషయము సంఘములన్నిటిలో ప్రసిద్ధిచెందిన
సహోదరుని అతనితో కూడ పంపుచున్నాము.
తీతుగారిని
మరో సహోదరున్నీ పంపుతూ ఒక ప్రాముఖ్యమైన విషయం చెబుతున్నారు! తీతు , తిమోతి మరో
సహోదరుడు వీరంతా నాతో పాటుగా క్రీస్తుతో పనిచేసే వారు, నాతోటి దాసులు! క్రీస్తు
సేవకులు అంటున్నారు!
ఇక 19 వ వచనంలో అంటున్నారు అంతేకాక మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తమును
మా సిద్ధమైన మనస్సు కనుపరచు నిమిత్తమును ఈ ఉపకారద్రవ్యము విషయమై పరిచారకులమైన
మాతోకూడ అతడు ప్రయాణము చేయవలెనని సంఘములవారతని ఏర్పరచుకొనిరి.
ఇక్కడ తీతుకోసం ఒకవిషయాన్ని బయలుపరుస్తున్నారు పౌలుగారు! సంఘముల వారు
పేదలకోసమైన చందా లేక ఉపకార ద్రవ్యమును సంఘాల దగ్గరనుండి తీసుకుని యెరూషలేము
సంఘమునకు ఇవ్వడానికి ఇతర సంఘాలవారు నమ్మకస్తుడని తీతుగారిని ఎంచి అతనితో ఉపకార
సొమ్మును పంపడం మొదలుపెట్టారు! 1 కోరింథీయులకు 16:3. నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని
యెంచి పత్రికలిత్తురో, వారిచేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును.
4. నేను కూడ వెళ్లుట యుక్తమైనయెడల వారు నాతో కూడ వత్తురు.
ఇక్కడ మొదటి పత్రికలో అడిగితే వారు తీతుగారి పేరు చెప్పారు కాబట్టి తీతుగారితో ఆ
ఉపకార ద్రవ్యమును పంపడానికి సిద్దపడ్డారు!
చూడండి
తీతుగారు ఎంత నమ్మకమైన వారో! నిజానికి దేవునికి నమ్మకస్తులైన వారు కావాలి! అందుకే
బైబిల్ చెబుతుంది: దేశంలో నమ్మకమైన వారు కావాలి..
ఇక 20వ వచనంలో అంటున్నారు మరియు మేమింత విస్తారమైన ధర్మము విషయమై
పరిచారకులమై యున్నాము గనుక దానినిగూర్చి మామీద ఎవడును తప్పు మోపకుండ మేము
జాగ్రత్తగా చూచుకొనుచు అతనిని పంపుచున్నాము. చూడండి పౌలుగారి మాటలు మేము ఇంత ఘనమైన
ధర్మము విషయమై పరిచారకులం కనుక మేము దానిని గూర్చి ఎవడు మమ్మల్ని ఆక్షేపించ కుండా
మేము జాగ్రత్తగా చూసుకుంటున్నాము అంటున్నారు! దేవుని పనికి ఇవ్వబడిన డబ్బును ఎలా
కాపాడాలి అన్న విషయంలో ఇదొక మంచి ఉదాహరణ. న్యాయమైన రీతిలో ఈ విధంగా
ప్రవర్తించడానికీ, అది ఇతరులకు తెలిసేలా చూడ్డానికీ ఇప్పుడు కూడా క్రైస్తవులు పౌలు
తీసుకున్న జాగ్రత్తల వంటివే తీసుకోవాలి. అంతేగాక తాము చేసేది మనుషులు చూచినా,
చూడకపోయినా ప్రభువు చూస్తున్నాడని గుర్తుంచుకోవాలి – హెబ్రీయులకు 4:13.
2 కోరింథీయులకు
12:16. అది ఆలా గుండనియ్యుడి. నేను మీకు భారముగా ఉండలేదు గాని
యుక్తిగలవాడనై మిమ్మును తంత్రము చేత పట్టుకొంటిని అని చెప్పుదురేమో.
17. నేను మీ యొద్దకు పంపినవారిలో ఎవని వలననైనను మిమ్మును
మోసపుచ్చి ఆర్జించుకొంటినా?
18. మీయొద్దకు వెళ్లుటకు తీతును హెచ్చరించి అతనితోకూడ ఒక
సహోదరుని పంపితిని. తీతు మిమ్మును మోసపుచ్చి యేమైన ఆర్జించుకొనెనా? మేమొక్క
ఆత్మవలననే ఒక్క అడుగు జాడలయందే నడుచుకొనలేదా?
ఇలా
జాగ్రత్త పడటానికి కారణం
హెబ్రీయులకు 4
13. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్ఠము ఏదియు లేదు.
మనమెవనికిలెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా
ఉన్నది.
దేవుడు
చూస్తున్నారు అనే విషయాన్ని పౌలుగారు ఆది అపోస్తులులు ఎల్లప్పుడూ మనసులో ఉంచుకుని
కార్యాలు చేశారు!
అందుకే
తర్వాత వచనాలలో అంటున్నారు 21. ఏలయనగా ప్రభువు
దృష్టియందు మాత్రమే గాక మనుష్యుల దృష్టియందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా
ఆలోచించుకొనుచున్నాము.
22. మరియు వారితోకూడ మేము మా సహోదరుని పంపుచున్నాము. చాలా
సంగతులలో అనేక పర్యాయములు అతనిని పరీక్షించి అతడు ఆసక్తిగలవాడనియు, ఇప్పుడును మీ
యెడల అతనికి కలిగిన విశేషమైన నమ్మికవలన మరి యెక్కువైన ఆసక్తిగలవాడనియు
తెలిసికొనియున్నాము.
23. తీతు ఎవడని యెవరైన అడిగినయెడల అతడు నా పాలివాడును మీ
విషయములో నా జత పనివాడునై యున్నాడనియు; మన సహోదరులెవరని అడిగిన యెడల వారు సంఘముల
దూతలును క్రీస్తు మహిమయునై యున్నారనియు నేను చెప్పుచున్నాను.
సామెతల
గ్రంధములో అంటున్నారు సామెతలు 3:3, 4.
అప్పుడు దేవుని దృష్టియందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడవని
అనిపించుకొందువు.
ఇక మరో సహోదరుని పేరు చెప్పలేదు గాని అతడుకూడా ఎంతో నమ్మకస్తుడు
అని పౌలుగారు సాక్ష్యం చెబుతున్నారు.
ఇక తీతు కోసం చెబుతున్నారు నాపాలివాడు, సంఘాలకు దేవుడు పంపిన
దూతలు!
ఇక్కడ మరో విషయం చెప్పనీయండి: ప్రకటన 2,3 అధ్యాయాలలో సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము అంటూ
రాశారు! అక్కడ చెప్పడం జరిగినది సంఘపు దూత అనగా సంఘాన్ని కాచేవాడు మేపేవాడు !
బ్రేన్హం అనుచరులు చెబుతున్నట్లు ఒక్క సంఘ కాలం అనేది లేదు! విలియం మరియమ్
బ్రేన్హం గారు ఈ అంత్యకాలానికి దేవుని దూత మరియు ప్రవక్త కానేకాదు! ఇక్కడ కొరింథీ
సంఘానికి భీషప్ గా పౌలుగారు తీతుని పంపించారు కాబట్టి సంఘపు దూత తీతుగారు! అదే
చెబుతున్నారు ఇక్కడ!
ఇక “క్రీస్తుకు మహిమై”– యోహాను 17:10 చూడండి. మనుషుల్లో ఎక్కువ భాగం ఎప్పుడూ క్రీస్తును
అప్రతిష్ఠ పాలు చేస్తూ ఉన్న ఈ పరిస్థితుల్లో ఒక మనిషిని గురించి ఇంతకన్నా మంచి మాట
మరొకటి చెప్పగలమా? తీతుగారి కోసం పౌలుగారు ఎంత గొప్పగా చెబుతున్నారు చూడండి!!
ఇక చివరగా కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదనియు మీ విషయమైన మా అతిశయము
వ్యర్థముకాదనియు వారికి సంఘములయెదుట కనుపరచుడి.
ఈమాట వ్రాయడానికి కారణం
పౌలుగారు కొరింథీ సంఘము కోసం ఎంతో గొప్పగా చెప్పారు తీతుగారికి! 2 కోరింథీయులకు 7:14. ఏలయనగా, నేనతని యెదుట మీ విషయమై ఏ
అతిశయపు మాటలు చెప్పినను నేను సిగ్గుపరచబడలేదు మేమేలాగు అన్నిటిని మీతో నిజముగా
చెప్పితిమో ఆలాగే మేము తీతు ఎదుట మీ విషయమై చెప్పిన అతిశయపు మాటలు నిజమని
కనబడెను.
దీనినే అతిశయం
అంటున్నారు! ఇక్కడ ఈ మాటలలో సంఘం పట్ల పౌలుగారి
తాను సంఘాలకు పంపినవారి పట్ల, ఆ సంఘాల పట్ల, పౌలుకున్న ప్రేమ, శ్రద్ధ ఎంతో స్పష్టముగా కనిపిస్తుంది! 2
కోరింథీయులకు 11:28. ఇవియును గాక సంఘము
లన్నిటినిగూర్చిన చింతయు కలదు. ఈ భారము దిన దినమును నాకు కలుగుచున్నది
సేవకులు
కాపరులు కూడా ఇటువంటి సేవాభారం విశ్వాసుల పట్ల ప్రేమాభిమానాలు పెంచుకుంటే సంఘాలు
ఎంతగానో ప్రేమలో కట్టబడతాయి!
దైవాశీస్సులు!!!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*150వ భాగము*
2
కొరింథీ 9:1– 9
1. పరిశుద్ధులకొరకైన
యీ పరిచర్యనుగూర్చి మీ పేరు వ్రాయుటకు నా కగత్యములేదు.
2. మీ మనస్సు సిద్ధమై యున్నదని నేనెరుగుదును. అందువలన
సంవత్సరమునుండి అకయ సిద్ధపడియున్నదని చెప్పి, నేను మిమ్మును గూర్చి
మాసిదోనియవారియెదుట అతిశయపడుచున్నాను; మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి.
3. అయితే మిమ్మునుగూర్చిన మా అతిశయము ఈ విషయములో
వ్యర్థముకాకుండునట్లు, నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై యీ సహోదరులను
పంపితిని.
4. మీరు సిద్ధపడని యెడల ఒకవేళ మాసిదోనియవారెవరైనను నాతోకూడ
వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవుట చూచినయెడల, ఈ నమ్మిక కలిగియున్నందుకు మేము సిగ్గు
పరచబడుదుము; మీరును సిగ్గుపరచబడుదురని యిక చెప్పనేల?
5. కావున లోగడ ఇచ్చెదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా
ఇయ్యక ధారాళముగా ఇయ్య వలెనని చెప్పి, సహోదరులు మీ యొద్దకు ముందుగావచ్చి దానిని
జమచేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని.
6. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకోయును, సమృద్ధిగా
విత్తువాడు సమృద్ధిగా పంటకోయును అని యీ విషయమై చెప్పవచ్చును.
7. సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో
నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్య వలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.
8. మరియు అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు
సర్వసమృద్ధిగలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీయెడల సమస్త విధములైన
కృపను విస్తరింపచేయగలడు.
9. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను అతని నీతి
నిరంతరము నిలుచును అని వ్రాయబడియున్నది.
ప్రియులారా! మనం 2 వ కొరింథీ
పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!
ప్రియ దైవజనమా! ఇక 9 వ అధ్యాయం కూడా యెరూషలేము లో ఉన్న నిరుపేదలైన క్రైస్తవ విశ్వాసుల కోసమైన చందా కోసమే
రాస్తున్నారు ! ఇక ఈ అధ్యాయంలో ముఖ్య వచనం
సణుగుకోకుండా బలవంతంగా కాకుండా ప్రతీవాడు దేవునికి ఇవ్వాలి అంటూ దేవుడు ఉత్సాహముగా
ఇచ్చేవారిని ప్రేమిస్తారు!
(గతభాగం తరువాయి)
ఇక
మొదటి వచనంలో పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్య కోసం మరలా మీకు చెప్పాలని అనుకోవడం లేదు
అంటున్నారు! పరిశుద్ధుల కోసం చందా అనగా గతభాగలలో చెప్పినవిధంగా యెరూషలేము లో ఉన్న
నిరుపేదలైన పరిశుద్దులయిన విశ్వాసులకు ధన సహాయం చేసే పరిచర్య లేక దేవుని కృప
అన్నమాట! దీని కోసం మొదటి కోరింథీ పత్రికలోనూ అలాగే గత అధ్యాయంలో కూడా
వ్రాయబడింది! 2 కోరింథీయులకు 8:6-7, 2
కోరింథీయులకు 8:10-11.
ఇక
తర్వాత వచనాలలో చెబుతున్నారు: మీ మనస్సు సిద్ధమై
యున్నదని నేనెరుగుదును. అందువలన సంవత్సరమునుండి అకయ సిద్ధపడియున్నదని చెప్పి, నేను
మిమ్మును గూర్చి మాసిదోనియ వారియెదుట అతిశయపడుచున్నాను; మీ ఆసక్తిని చూచి అనేకులు
ప్రేరేపింపబడిరి.
3. అయితే మిమ్మునుగూర్చిన మా అతిశయము ఈ విషయములో
వ్యర్థముకాకుండునట్లు, నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై యీ సహోదరులను
పంపితిని.
ఈ
వచనాల ప్రకారం ఏమి అర్ధమవుతుంది అంటే సంవత్సరం క్రిందట కొరింథీ వారు మాసిడోనియా
వారిని చూసి పౌలుగారు అడగకుండానే మేము కూడా యెరూషలేము లో ఉన్న పరిశుద్ధులకు చందా
ఇస్తాము అని వాగ్ధానం చేశారు! ఈ మాటలు విన్న ఆకయ వారు ఇంకా అనేక సంఘాలు
ప్రేరేపించబడి వారుకూడా దేవునికి ఇవ్వడం మొదలుపెట్టారు! ఇప్పుడు మూడో వచనం ప్రకారం
కొరింథీ వారు వాగ్ధానం చేసిన ధనము కోసం పౌలుగారు సహోదరులలో కొందరిని పంపించారు!
అయితే నాలుగో వచనంలో అంటున్నారు: మీరు సిద్ధపడని యెడల ఒకవేళ మాసిదోనియ వారెవరైనను
నాతోకూడ వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవుట చూచినయెడల, ఈ నమ్మిక కలిగియున్నందుకు మేము
సిగ్గు పరచబడుదుము; మీరును సిగ్గుపరచబడుదురని యిక చెప్పనేల?
దీనిని
బట్టి ఏమని అర్ధమవుతుంది అంటే మొదట ఇస్తామని ఆతృత కనపరిచినా తర్వాత ఆ ఉజ్జీవం
ఆసక్తి తగ్గిపోయింది! (2 కోరింథీయులకు 8:10-11).
2
కోరింథీయులకు 8:10.
ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను; సంవత్సరము క్రిందటనే యీ కార్యము
చేయుట యందే గాక చేయ తలపెట్టుటయందు కూడ మొదటి వారై యుండిన మీకు మేలు
11. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఏలాగు కలిగెనో,
ఆలాగే మీ కలిమికొలది సంపూర్తియగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెర వేర్చుడి అని
రాయవలసి వచ్చింది వారికి!
అనేకమంది
క్రైస్తవులు ఇంతే. మొదట్లో ఒక పని గురించి చాలా ఉత్సాహం చూపిస్తారు. సమయం
గడుస్తున్నకొద్దీ ఆ ఉత్సాహం చల్లారి ఆ పనిని పూర్తి చేయరు. ఇది వారింకా పరిపక్వం
కాలేదనీ, నిలకడ లేదనీ తెలియజేస్తున్నది.
ఒకవేళ నీవు కూడా ఇలాఉంటే దయచేసి ఇప్పుడే సరిచేసుకో మనీ మనవి చేస్తున్నాను!
ప్రసంగీలో అంటున్నారు: నీవు మ్రొక్కుబడి చేసుకుంటే వెంటనే చెల్లించేయ్ ఆలస్యం
చేస్తే అది నీకు ఉరి అవుతుంది! అలాంటప్పుడు మ్రొక్కుకోకుండా ఉండటమే మేలు
అంటున్నారు..
Ecclesiastes(ప్రసంగి) 5:2,4,5,6
2. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును
త్వరపడనియ్యక నీ నోటిని కాచు కొమ్ము; దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమిమీద ఉన్నావు,
కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను.
4. నీవు దేవునికి మ్రొక్కుబడి చేసికొనినయెడల దానిని
చెల్లించుటకు ఆలస్యము చేయకుము; బుద్ధిహీనులయందు ఆయన కిష్టము లేదు.
5. నీవు మ్రొక్కుకొనినదాని చెల్లించుము, నీవు మ్రొక్కుకొని
చెల్లింపకుండుటకంటె మ్రొక్కుకొన కుండుటయే మేలు.
6. నీ దేహమును శిక్షకు లోపరచు నంత పని నీ నోటివలన
జరుగనియ్యకుము; అది పొర పాటుచేత జరిగెనని దూత యెదుట చెప్పకుము; నీ మాటలవలన
దేవునికి కోపము పుట్టించి నీవేల నీ కష్టమును వ్యర్థపరచుకొనెదవు?
ఇక తర్వాత వచనంలో అంటున్నారు కావున లోగడ ఇచ్చెదమని మీరు చెప్పిన
ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్య వలెనని చెప్పి, సహోదరులు మీ యొద్దకు
ముందుగావచ్చి దానిని జమచేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. చూడండి
ఏమంటున్నారో: మీరు ఇంతకుముందు వాగ్ధానం చేసిన చందా ఇవ్వండి! అయితే మీరు
ఇచ్చేధర్మము పిసినారి తనంగా ఇవ్వకుండా ధారాళముగా ఇవ్వండి అంటున్నారు! ఇవ్వడం
విషయంలో విశ్వాసులు తాము ఉంచుకోగలిగినదంతా తమకే ఉంచుకోవాలని కోరరాదు. ఇవ్వక తప్పదు
గనుక, ఇవ్వకుండా తప్పించుకునే మార్గం లేదు గనుక తప్పని పరిస్తితులలో ఎంతో కొంత
ఇవ్వడం అనేది ఉండకూడదు. మనస్పూర్తిగా సంతోషంతో దేవునికి ఇవ్వాలి అందుకే 7 వ వచనంలో
అంటున్నారు సణుగుకొనకయు బలవంతముగా కాకయు
ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా
ఇచ్చువానిని ప్రేమించును.
మొదట సణుగుకుంటూ ఎట్టిపరిస్తితులలో కూడా దేవునికి గాని పేదలకు గాని
ఇవ్వకూడదు! తర్వాత బలవంతంగా కూడా ఇవ్వకూడదు అనగా పాష్టర్ గారి గోల పడలేక లేక
సంఘపెద్దలు యొక్క గోల పడలేక ఇవ్వకూడదు! మనస్పూర్తిగా ఇవ్వాలి! ఈవిషయంలో కొంతమంది
దైవసేవకులు అస్తమాను విశ్వాసులను కానుకల కోసం పీడిస్తూ ఉంటారు! చివరికి కొంతమంది
దైవసేవకులను చూశాను నేను- వీరు తమ కూతురి వివాహం కోసం కూడా మీరే నాకూతురికి పెళ్లి
చేయమంటే సంఘస్టులు చందాలు వేసి పెళ్లి చేశారు! దేవుడిచ్చిన పిల్లలకు దేవుడే పెళ్లి
ఏర్పాట్లు చేస్తారు కదా ఇలా అడుక్కోవడం ఏమిటి? ఇది నిజంగా ఒకరకమైన దోపిడీ
అనుకోవాలి! ఇలాంటివి దయచేసి మానమని దైవసేవకులను క్రీస్తుపేరిట మనవిచేస్తున్నాను!
అయితే
6 వ వచనంలో అంటున్నారు: 6. కొంచెముగా విత్తువాడు
కొంచెముగా పంటకోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోయును అని యీ విషయమై
చెప్పవచ్చును. సామెతల గ్రంధంలో భక్తుడు అంటున్నారు:
సామెతలు 11
24. వెదజల్లి అభివృద్ధిపొందువారు కలరు తగినదానికన్న తక్కువ
ఇచ్చి లేమికి వచ్చువారు కలరు.
25. ఔదార్యముగలవారు పుష్టినొందుదురు. నీళ్లు పోయువారికి
నీళ్లు పోయబడును
సామెతలు 19
17. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చు వాడు వాని
ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును.
సామెతలు 22:9.
దయాదృష్టిగలవాడు తన ఆహారములో కొంత దరిద్రుని కిచ్చును అట్టివాడు దీవెననొందును.
లూకా 6:38.
క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు; ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి,
కుదిలించి, దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో
కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడునని చెప్పెను.
గలతియులకు 6:7. మోస
పోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమివిత్తునో ఆ పంటనే కోయును.
ఎలాంటి సందేహానికీ తావులేకుండా
దీన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి విశ్వాసులు! . దేవునికి, ఇతరులకు ఇవ్వాలన్న మనసు కొందరు
పేదలకు ఉండదు కాబట్టి లౌకికంగానూ, ఆధ్యాత్మికం గానూ కూడా వారు పేదలుగా ఉన్నారు,
పేదలుగానే ఉండిపోతారు.
ఇతరులకు ఉదారంగా సంతోషంగా ఇచ్చేవారు
నష్టపోరు. దీనికి వ్యతిరేకంగానే తరచుగా జరుగుతుంది విశ్వాసుల జీవితాలలో ! ఇవ్వడం
ఇష్టమున్న వారికి ఇచ్చేందుకు ఇష్టపడతాడు దేవుడు. దేవుడు విశ్వానికి పరిపాలకుడు,
మనిషిని సౌభాగ్యవంతుణ్ణి చేయగలవాడు, లేదా నిరుపేదగా మార్చగలవాడు. ఇలా జరిగించే
మానవ పధకాలు, ప్రణాళికలు, భూములు, వాతావరణ పరిస్థితులు తదితర కారకాలన్నీ దేవుని
చేతిలో ఉన్నాయి. తనకు ఇష్టమైనవారికి మేలు కలిగేలా పరిస్థితులన్నిటినీ పని
చేయించగలడు ఆయన. తనకు ఇష్టమైతే వారికోసం అద్భుతాలు కూడా చేయగలడు – చూడండి ఏలియా గారికి ఆ
పేదరాలు విధవరాలు ఇచ్చినందున ఆమె కరువుకాలం పోషించబడింది! 1 రాజులు 17:10-16; . కానీ సాధారణంగా ఆయన వారికి సామాన్య
పద్ధతుల్లోనే వారికి దీవెనలు కలుగజేస్తాడు – సౌభాగ్యాన్ని వృద్ధి చేసేందుకు, పేదరికాన్ని తెచ్చి పెట్టగల
విపత్తులనుంచి తనవారిని కాపాడేందుకు దేవుడు మనుషులనూ సాధారణ పరిస్థితులనూ
వాడుకుంటాడు. తనవారు ఎప్పుడూ తమ భౌతిక, ఆధ్యాత్మిక పరిస్థితుల్లో వర్థిల్లేలా తన
కృపను ఎలా కుమ్మరించాలో ఆయనకు తెలుసు. ఆయన అలా చెయ్యడానికి కారణం తాను దీవించిన
వారికి “ప్రతి మంచి పని కోసమూ సమృద్ధి” ఉండాలనే. ఆయన దీవించినప్పుడు వారు గనుక అలా
ప్రవర్తించకపోతే తాను ఇచ్చినంత తేలికగా తన దీవెనలను ఆయన తీసేసుకోగలడు.
గనుక
మనలను మనం పరిశీలించుకుందాం! దేవునికోశం ఇంకా పేదల కోసం ధారాళంగా ఇద్దాము! దేవుని
దీవెనలు పొందుదాం!
దైవాశీస్సులు!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*151వ భాగము*
2 కొరింథీ 9:9– 15
9. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను అతని నీతి
నిరంతరము నిలుచును అని వ్రాయబడియున్నది.
10. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు
దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి, మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య
భాగ్యముగలవారగునట్లు, మీ నీతిఫలములు వృద్ధిపొం దించును.
11. ఇట్టి, ఔదార్యమువలన మాద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు
చెల్లింపబడును.
12. ఏలయనగా ఈ సేవనుగూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు
సహాయము కలుగజేయుట మాత్రము కాకుండ, అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల
మూలముగా విస్తరించుచున్నది.
13. ఏలాగనగా క్రీస్తుసువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుట
యందు మీరు విధేయులైనందుచేతను, వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము
చేసి నందుచేతను, ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమ
పరచుచున్నారు.
14. మరియు మీయెడల దేవుడు కనుపరచిన అత్యధికమైన కృపను చూచి,
వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయుచు, మిమ్మును చూడవలెనని ఎక్కువ కోరిక గలవారై
యున్నారు.
15. చెప్ప శక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి
స్తోత్రము.
ప్రియులారా! మనం 2 వ కొరింథీ
పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!
ప్రియ దైవజనమా! ఇక 9 వ అధ్యాయం కూడా యెరూషలేము లో ఉన్న నిరుపేదలైన క్రైస్తవ విశ్వాసుల కోసమైన చందా కోసమే
రాస్తున్నారు !
(గతభాగం తరువాయి)
ప్రియులారా!
తొమ్మిదవ వచనం నుండి కూడా పేదలకు దేవునికి
దారాళంగా ఇవ్వాలి అనే విషయమే కొనసాగిస్తున్నారు! ఇందు విషయమై అతడు వెదజల్లి
దరిద్రులకిచ్చెను అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడియున్నది అంటున్నారు!
ఎక్కడ వ్రాయబడింది? కీర్తనల గ్రంథము
112:9. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును వాని నీతి నిత్యము నిలుచును వాని
కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును.
విశ్వాసులు ధారాళంగా , సంతోషంగా ఇస్తే కలిగే కొన్ని ఫలితాలను
పౌలుగారు చెప్తున్నారు . ఆ ఫలితాలు ఈ
జీవితంలోనూ, రాబోయే జీవితంలోనూ కూడా ఉంటాయి. (వ 9). ఆ ఫలితాలేవంటే, వారు
చేసినదాన్ని దేవుడెప్పుడూ మర్చిపోడు (వ 9; హెబ్రీయులకు 6:10)
దేవుడు వారిని ఇహలోక సంబంధంగా దీవిస్తాడు (వ 10,11)
వారు ఇవ్వడం ద్వారా దేవుని ప్రజల అవసరతలు తీరుతాయి (వ 12)
క్రీస్తు శుభవార్తకు తాము లోబడ్డామని వారు రుజువు చేసినట్టవుతుంది
(వ 13)
ఇతరులు తమ ప్రార్థనల్లో వారిని ప్రేమపూర్వకంగా జ్ఞాపకం చేసుకుంటారు
(వ 14)
వారి మూలంగా దేవునికి కృతజ్ఞతలు, స్తుతులు విరివిగా అర్పించడం
జరుగుతుంది (వ 11,12,13).
ఈ చివరి ఫలితాన్ని
మూడుసార్లు చెప్పారు పౌలుగారు . అతనికి అన్నిటికన్నా ఇది ముఖ్యం. 2
కోరింథీయులకు 1:11; 2 కోరింథీయులకు 4:15 కూడా చూడండి. అన్నిటిలోనూ దేవునికి మహిమ
కలగడం అతని ముఖ్యాశయం (1 కోరింథీయులకు 10:31). ఆయన ప్రజలు ప్రవర్తించవలసిన రీతిలో
ప్రవర్తిస్తే, ఆయనకు కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించవలసిన రీతిలో చెల్లిస్తే ఆయనకు
మహిమ కలుగుతుంది.
2 కోరింథీయులకు 1:11.
అందువలన అనేకుల ప్రార్థన ద్వారా, మాకు కలిగిన కృపావరముకొరకు అనేకులచేత మా విషయమై
కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును.
1 కోరింథీయులకు 10:31.
కాబట్టి మీరు భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని
మహిమకొరకు చేయుడి.
ఇక తర్వాత వచనాలలో అంటున్నారు 12. ఏలయనగా ఈ సేవనుగూర్చిన పరిచర్య
పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగజేయుట మాత్రము కాకుండ, అనేకులు దేవునికి చెల్లించు
కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది.
13. ఏలాగనగా క్రీస్తుసువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుట యందు మీరు
విధేయులైనందుచేతను, వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసి
నందుచేతను, ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు.
గమనించాలి ఉదారంగా ఇవ్వడం దేన్ని రుజువు చేస్తున్నదో చూడండి. అలా
ఇవ్వకపోవడం దీనికి వ్యతిరేక పరిస్థితిని నిరూపిస్తుంది.
ఇలా చేయడం వలన దేవునికి మహిమ కలుగుతుంది అంటూ 14. మరియు మీయెడల
దేవుడు కనుపరచిన అత్యధికమైన కృపను చూచి, వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయుచు,
మిమ్మును చూడవలెనని ఎక్కువ కోరిక గలవారై యున్నారు.
15. చెప్ప శక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము అంటూ
ఈ అధ్యాయం ముగించారు!
మనుషులకు దేవుడు ఉచితంగా ఇచ్చినవి అనేకం. అవి గొప్పవి ఏమేమి దేవుడు
ఇస్తున్నారో దయచేసి మీ బైబిల్ తెరచి చదువుకోండి!
కీర్తనల గ్రంథము 68:35;
కీర్తనల గ్రంథము 127:2-3; కీర్తనల గ్రంథము 146:7; సామెతలు 2:6-7; మత్తయి 7:11;
యోహాను 14:27; అపో. కార్యములు 5:31; అపో. కార్యములు 14:17; అపో. కార్యములు 15:8;
అపో. కార్యములు 17:25; రోమీయులకు 5:17; రోమీయులకు 6:23; 1 కోరింథీయులకు 7:7; 1
కోరింథీయులకు 12:7-11; ఎఫెసీయులకు 2:8; ఫిలిప్పీయులకు 1:29; 2 తిమోతికి 3:16;
యాకోబు 1:5, యాకోబు 1:17.
అయితే బహుశా పౌలుగారు
ఇక్కడ అన్నిటిలోకీ శ్రేష్ఠమైన, వర్ణనాతీతమైనదాని గురించి ఆలోచిస్తున్నారు!
అది దేవుడు మనకోసం తనకుమారుడైన ఏసుక్రీస్తు ప్రభులవారిని పంపడమే! – యోహాను 3:16;
రోమీయులకు 8:32; యెషయా 9:6.
యోహాను 3:16.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన
వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను
అనుగ్రహించెను.
రోమీయులకు 8:32. తన
సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో
పాటు సమస్తమును మన కెందుకు అనుగ్రహింపడు?
యెషయా 9:6. ఏలయనగా
మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద
రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి
సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
ఇవ్వడమంటే ఏమిటో విశ్వాసులంతా అర్థం చేసుకోవాలనీ, దేవుడిచ్చినట్టు ఇవ్వడం
నేర్చుకోవాలనీ పౌలుగారు దీని గురించి
మాట్లాడుతున్నారు. విశ్వాసులు ఇవ్వడానికి సంబంధించిన సత్యాన్ని క్లుప్తంగా ఇలా
చెప్పవచ్చు: ఇవ్వగలగడం దేవుడిచ్చే సామర్థ్యం, విశ్వాసుల హృదయాల్లో
బ్రతుకుల్లో పని చేసే దేవుని కృప (2 కోరింథీయులకు 8:1; రోమీయులకు 12:6-8)
అది విశ్వాసులు కోరి పొందవలసిన ఒక విశేషావకాశం, ఆధిక్యతలాంటిది (2
కోరింథీయులకు 8:4)
మన ప్రేమ, విధేయత ఎంత యథార్థమైనదో అది పరీక్షిస్తుంది –
ఇవ్వడం లేదంటే ప్రేమ లేదు. కొద్దిగా ఇస్తుంటే కొద్దిగా ప్రేమ ఉంది. ఎక్కువ
ఇస్తే ఎక్కువ ప్రేమ ఉంది (2 కోరింథీయులకు 8:8)
అది దేవుని స్వభావం (2 కోరింథీయులకు 8:9)
హృదయం సరిగా ఉంటే చిన్న చిన్న మొత్తాలైనా దేవునికి అంగీకారమే (2
కోరింథీయులకు 8:12; మార్కు 12:41-44)
సమృద్ధిగా ఉన్నవారికీ, అవసరతలో ఉన్నవారికీ మధ్యగల వ్యత్యాసాన్ని పూడ్చడమే
ఇవ్వడంలోని ఒక ఉద్దేశం (2 కోరింథీయులకు 8:13)
ఇవ్వడం “పవిత్రుల కోసమైన సేవ” (2 కోరింథీయులకు
9:1)
ఇవ్వడమనేది స్వేచ్ఛగా, సంతోషంగా
ఉండాలి (2 కోరింథీయులకు 9:5, 2 కోరింథీయులకు 9:7)
దానికి తగిన ప్రతిఫలాన్ని అది
తీసుకువస్తుంది (2 కోరింథీయులకు 9:6, 2 కోరింథీయులకు 9:8-11, 2 కోరింథీయులకు 9:14)
ఇంకా దేవునికి ఇవ్వడం అంటే దేవునికి
కృతజ్ఞతలు, స్తుతులు కలగడానికి అది కారణమౌతుంది (2 కోరింథీయులకు 9:11-13).
దేవునికి, లేక ఇతరులకు ఇవ్వడం
గురించి ఇతర రిఫరెన్సులు – నిర్గమకాండము 35:5-9; లేవీయకాండము 7:12-13; లేవీయకాండము 27:30;
సంఖ్యాకాండము 18:21, సంఖ్యాకాండము 18:24; ద్వితీయోపదేశకాండము 14:28-29;
ద్వితీయోపదేశకాండము 15:10; 2 సమూయేలు 24:24; 1 దినవృత్తాంతములు 29:3, 1 దినవృత్తాంతములు
29:5, 1 దినవృత్తాంతములు 29:9, 1 దినవృత్తాంతములు 29:14; కీర్తనల గ్రంథము 37:26;
సామెతలు 11:24-25; సామెతలు 19:17; సామెతలు 22:9; ప్రసంగి 11:1-2; మలాకీ 1:7-8,
మలాకీ 1:14; మలాకీ 3:8-10; మత్తయి 6:1-2, మత్తయి 6:19-20; మత్తయి 19:21; మార్కు
12:41-44; లూకా 6:38; అపో. కార్యములు 20:35; రోమీయులకు 12:13; 1 తిమోతికి 6:18-19;
హెబ్రీయులకు 6:10; యాకోబు 2:15-16; 1 యోహాను 3:17.
గనుక మనలను మనం పరిశీలించుకుందాం! దేవుడే మనకోసం తన ఏకైక
కుమారున్నీ మనకోసం ఇచ్చినప్పుడు మనం కూడా
దేవుని కోసం ఇంకా పేదల కోసం ధారాళంగా ఇద్దాము! దేవుని దీవెనలు పొందుదాం!
దైవాశీస్సులు!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*152వ భాగము*
2 కొరింథీ 10:1—6
1. మీ ఎదుట నున్నప్పుడు మీలో అణకువగలవాడనైనట్టియు, ఎదుట
లేనప్పుడు మీయెడల ధైర్యము గలవాడనైనట్టియు, పౌలను నేనే యేసుక్రీస్తుయొక్క
సాత్వికమును మృదుత్వమునుబట్టి మిమ్మును వేడుకొను చున్నాను.
2. శరీరప్రకారము నడుచుకొనువారమని మమ్మునుగూర్చి
కొందరనుకొనుచున్నారు కారా? అట్టి వారియెడల నేను తెగించి కాఠిన్యము చూపవలెనని
తలంచుకొనుచున్నాను గాని, నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యమును చూపకుండునట్లు
చేయుడని నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను.
3. మేము శరీరధారులమై నడుచు కొనుచున్నను శరీరప్రకారము
యుద్ధముచేయము.
4. మా యుద్ధోపకరణములు శరీరసంబంధమైనవి కావుగాని, దేవుని
యెదుట దుర్గములను పడద్రోయజాలినంత బలముకలవై యున్నవి.
5. మేము వితర్కములను, దేవునిగూర్చిన జ్ఞానమును అడ్డగించు
ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి
6. మీరు సంపూర్ణ విధేయతను కనుపరచినప్పుడు సమస్తమైన
అవిధేయతకు ప్రతిదండనచేయ సిద్ధపడి యున్నాము.
ప్రియులారా! మనం 2 వ కొరింథీ
పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!
ప్రియ దైవజనమా! ఇక 10వ అధ్యాయం మరలా అబద్దబోధకుల గూర్చి ఇంకా తన ఆపొస్తలత్వము
కోసం రాస్తున్నారు! అబద్దబోధకులకు పౌలుగారు మరియు క్రీస్తు అపోస్తులులకు మధ్య గల
తేడాలను ఈ అధ్యాయంలో ఎత్తి రాస్తున్నారు పౌలుగారు!!
మొదటి వచనంలో అంటున్నారు: మీ ఎదుట నున్నప్పుడు మీలో
అణకువగలవాడనైనట్టియు, ఎదుట లేనప్పుడు మీయెడల ధైర్యము గలవాడనైనట్టియు, పౌలను నేనే
యేసుక్రీస్తుయొక్క సాత్వికమును మృదుత్వమునుబట్టి మిమ్మును వేడుకొను చున్నాను.
చూడండి వారి ఎదుట ఉన్నప్పుడు అణకువ కలిగి ఎదుట లేనప్పుడు కొరింథీ వారి ఎడల ధైర్యము
కలిగి పౌలు అను నేను ఏసుక్రీస్తుయొక్క సాత్వికమును మృదుత్వమును గలవాడనై ఆయన
సాత్వికమును బట్టి మృధుత్వమును బట్టి మిమ్మును వేడుకుంటున్నాను అంటున్నారు!
గమనించండి నిజానికి పౌలుగారు కొరింథీ వారికి శాసించే స్తితిలో ఉన్నా, క్రీస్తుయేసు
యొక్క సాత్వికమును బట్టి కొరింథీ వారిని వేడుకుంటున్నారు లేక మనవిచేస్తున్నారు!
అందుకే పేతురు గారు అంటున్నారు మీరు సంఘముల మీద ప్రభువులై ఉండక మాదిరిగా
ఉండమంటున్నారు! ఆది అపోస్టలులు కేవలం చెప్పడం వరకే కాకుండా మొదటగా చేసి అప్పుడు
చెప్పారు! ప్రతీదైవజనుడు ప్రతీ సేవకుడు కూడా ఇలాంటి క్రీస్తు సాత్వికము మరియు మృదుత్వము
కలిగి ఉండాలి! మాదిరిగా ఉండాలి!
2 కోరింథీయులకు 11:10 ఇంకా 10–13 అధ్యాయాల్లో
పౌలుగారు కొరింథీ లో అబద్ధ బోధకుల మాటలు
వింటున్న వారి గురించి, ఆ దుర్బోధకుల గురించి రాస్తున్నారు . ఈ దుర్బోధకులు “వేరే
సువార్తను” ప్రకటిస్తున్నారు (2 కోరింథీయులకు 11:4). వారు సైతాను సేవకులు.
విశ్వాసులను తప్పుదారి పట్టించేందుకు సైతాను వారిని అక్కడికి పంపించాడు (2
కోరింథీయులకు 11:13-14). తాము నిజమైన క్రీస్తుఅపోస్టులులమనీ వారు గొప్పలు చెప్పుకొంటున్నారు (2
కోరింథీయులకు 1:5, 2 కోరింథీయులకు 1:12). దీనిని ఆయన ఖండిచారు కాబట్టి వారి మనుగడకోసం పౌలుగారి
పైనా అతడు ప్రకటించిన సువార్తపైనా దాడి చేశారు. అందువల్ల పౌలు తన
ఆపొస్తలత్వము పక్షంగా వాదిస్తున్నారు. ఇది తనకోసం కాదు గాని కొరింతు సంఘం
వారికోసమే (2 కోరింథీయులకు 12:19). వారి ఆధ్యాత్మిక స్థితి గురించి అతనికి
ఆందోళనగా ఉంది (2 కోరింథీయులకు 11:3; 2 కోరింథీయులకు 12:20-21). వారు తనను
తిరస్కరించి, దేవుడు ఎన్నుకున్న
అపోస్తులునిగా తన ద్వారా దేవుడు
ఉపదేశించిన దాన్ని వారు త్రోసిపుచ్చితే వారి పరిస్థితి మరింత విషమిస్తుందని అతడు
గ్రహించాడు.
“క్రీస్తు సాత్వికం, మృదుత్వం ”– మత్తయి 11:29; మత్తయి
12:20; యెషయా 40:11. యేసుప్రభువు ప్రవర్తించినట్టు పౌలుగారు మనలను కూడా
ప్రవర్తించాలని కోరారు. అపోస్తులునిగా
తనకున్న అధికారాన్ని వినియోగించుకోకుండా (2 కోరింథీయులకు 13:10), ప్రేమతో వారికి
విన్నవించుకుంటున్నారు.
అంతేకాదు తమతో
ఉన్నప్పుడు పౌలు పిరికివాడనీ, ఉత్తరాల్లో మాత్రమే ధైర్యంగా రాయగలడనీ అతని గురించి
కొరింతులో కొందరు చెప్పుకుంటున్నారు. 10 వ వచనంలో కూడా ఇలాంటివే అన్నారు: అతని
పత్రికలు ఘనమైనవియు బలీయమైనవియునై యున్నవి గాని అతడు శరీరరూపమునకు బలహీనుడు, అతని
ప్రసంగము కొరగానిదని యొకడు అనును. అందుకే 11 వ వచనంలో అంటున్నారు పౌలుగారు:
మేమెదుటలేనప్పుడు పత్రికల ద్వారా మాటలయందెట్టి వారమైయున్నామో, యెదుట ఉన్నప్పుడు
క్రియయందు అట్టివారమై యుందుమని అట్లనువాడు తలంచుకొనవలెను
ఇక 2 వ వచనంలో అంటున్నారు: శరీరప్రకారము నడుచుకొనువారమని
మమ్మునుగూర్చి కొందరనుకొనుచున్నారు కారా? అట్టి వారియెడల నేను తెగించి కాఠిన్యము
చూపవలెనని తలంచుకొనుచున్నాను గాని, నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యమును
చూపకుండునట్లు చేయుడని నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. కొరింథీ సంఘంలో
పౌలుగారు ధైర్యంగా ప్రవర్తించగలరు, వారిని
సరి దిద్దేందుకు కఠినమైన చర్యలు కూడా తీసుకోగలరు. అయితే అతడు అలా చేయకుండేలా వారు
తమను తాము దిద్దుకోవాలని ఆశిస్తున్నారు.
“శరీరానుసారంగా” ప్రవరిస్తున్నాడు అని – పౌలుగారి పై కొందరు మోపిన మరో నేరం ఇది. దానికి 3—7 వచనాలలో విస్తారంగా జవాబు చెబుతున్నారు!
3. మేము శరీరధారులమై నడుచు కొనుచున్నను శరీరప్రకారము
యుద్ధముచేయము.
4. మా యుద్ధోపకరణములు శరీరసంబంధమైనవి కావుగాని, దేవుని
యెదుట దుర్గములను పడద్రోయజాలినంత బలముకలవై యున్నవి.
5. మేము వితర్కములను, దేవునిగూర్చిన జ్ఞానమును అడ్డగించు
ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి
6. మీరు సంపూర్ణ విధేయతను కనుపరచినప్పుడు సమస్తమైన
అవిధేయతకు ప్రతిదండనచేయ సిద్ధపడి యున్నాము.
చూడండి ఇక్కడ పౌలుగారి జవాబు! మేము శరీర సంబంధంగా
నడుచుకోవడం లేదు ఎందుకంటే మా ఆయుధాలు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట
దుర్గములను పడగొట్ట గలిగినంత బలమైనవి అంటూ ఇంకా వివరంగా చెబుతున్నారు! ఇక్కడ ఆయన
చెప్పిన వివరణ రెండు రకాలుగా అర్ధం చేసుకోవచ్చు! సత్యానికీ అసత్యానికీ, అంటే
దేవుడు వెల్లడించిన దానికీ మనుషులు కల్పించిన దానికీ మధ్య జరిగే యుద్ధాన్ని
పౌలుగారు ఇక్కడ చెప్తున్నారు. క్రీస్తు
సత్యాన్ని నాశనం చేయడమే లోకానికి/సైతానుకి
ఉన్న ఉద్దేశం. దేవుని నిజ సేవకుల ఉద్దేశం మాత్రం అసత్యాలనూ అబద్ధాలనూ నాశనం
చేసి మనుషుల తలంపులను క్రీస్తుకు విధేయమయ్యేలా చేయడమే. క్రీస్తు సేవకుల ఆయుధాలు
లోకం ఉపయోగించే ఆయుధాల లాంటివి కావు. విశ్వాసులు లోకంలో ఉన్నారు. కానీ సత్యం
పక్షంగా వారు సలిపే పోరాటంలో లోకం ఉపయోగించే ఆయుధాలను ఉపయోగించ కూడదు. అవి హింస,
బలాత్కారం, టక్కరితనం, శరీరసంబంధమైన ఆకర్షణ, తప్పుల ప్రచారం, మానవ తర్కం, ఇంకా
మనిషి భ్రష్ట స్వభావంలోనుంచి వచ్చేదేదైనా. విశ్వాసులకు కూడా ఆయుధాలున్నాయి (2
కోరింథీయులకు 6:7; ఎఫెసీయులకు 6:17). అవి ఆధ్యాత్మికమైన ఆయుధాలు. సత్యం, న్యాయంతో
కలిసి పనిచేసే దేవుని బలప్రభావాలపై పౌలుగారు ఆధారపడ్డారు. దేవుని ఆత్మ సంపూర్ణత,
యథార్థత, నిజాయితీ, ప్రేమతో సత్యం చెప్పడం ఇవే ఆ గొప్ప యోధుడి ఆయుధాలు. ఈ ఆయుధాలకు
దేవుని “బలప్రభావాలు” ఉన్నాయి. వాటి మూలంగా అతడు “కోటలను” నేలమట్టం చేయగలిగాడు – “కోట” అంటే సైతానుకు, చెడుతనం, అపనమ్మకం, అబద్ధ మతం,
వేదాంతం మొదలైనవాటికి చెందే తంత్రాలూ ఆలోచనలూ వివాదాలూ ఉనికిపట్టు. దేవుని యోధుడు
శత్రువులను “చెరపట్ట” గలిగాడు కూడా. లోకంలో చెలరేగుతున్న మహా యుద్ధం సత్యానికీ
అసత్యానికీ మధ్య. పౌలు మనుషుల వేదాంతాలన్నిటినీ, తత్వశాస్త్రాన్నంతటినీ, మత
సంబంధమైన తలంపులన్నిటినీ, జ్ఞానంగా చెలామణి అవుతున్న దానంతటినీ పట్టుకుని దానిపై
క్రీస్తు తీర్పు కోసం ఆయన పాదాల చెంతకు తీసుకువచ్చారు. పౌలుగారు తన మనసు, తలంపులు మాత్రమే గాక, అందరి మనసులూ
తలంపులూ దేవుని కుమారుని ప్రభావం కిందికి రావాలని కోఋతున్నారు . క్రీస్తుకు
లోబడేందుకు సిద్ధమైన మనసులు, ఆయన మెప్పు, ఆమోదం చూరగొన్న తలంపులే మనుషుల్లో
ఉండాలి. ఇది ఖాయం. 1 కోరింథీయులకు 1:17-31; 2 కోరింథీయులకు 3:18-20; కొలొస్సయులకు
2:8 లో పౌలుగారు దేవుని జ్ఞానాన్నీ మానవ జ్ఞానాన్నీ పోల్చిన సందర్భాలన్ని కూడా
చూడండి.
రెండవది: విశ్వాసి ఆత్మీయ పోరాటాలు అనే శీర్షికలో చెప్పినట్లు మానవుల
/విశ్వాసుల అంతరంగాలపై భయంకరమైన ఆలోచనలతో సాతాను గాడు పోరాడుతూ ఉంటాడు విశ్వాసి
ఆత్మీయ పోరాటంలో! అలాంటి సాతాను తంత్రాలను పడగొట్టడానికి పౌలుగారి దగ్గరున్న
ఆయుధాలు శరీర సంబంధమైనవి కావుగాని, అవి పరసంబంధమైనవై కోటలను అనగా సాతాను గాడి
కోటలను పడగొట్టేటంత బలమైనవి అంటున్నారు! మేము వితర్కములను, దేవునిగూర్చిన
జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు
లోబడునట్లు చెరపట్టి, మీరు సంపూర్ణ విధేయతను కనుపరచినప్పుడు సమస్తమైన అవిధేయతకు
ప్రతిదండనచేయ సిద్ధపడి యున్నాము!
మరి
ఇంతటి గొప్ప ఆయుధాలు కలిగి ఉన్న నీవు సాతాను శోధనలను జయిస్తున్నావా లేక
ఓడిపోతున్నావా ?!! గమనించాలి జయించిన వారికే కిరీటాలు! జయించిన వారే ఎత్తబడే
గుంపులో ఉంటారు!! మరి నీవు ఏ గుంపులో ఉన్నావు?
దైవాశీస్సులు!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*153వ భాగము*
2 కొరింథీ 10:7—13
7. సంగతులను
పైపైననే మీరు చూచుచున్నారు, ఎవడైనను తాను క్రీస్తువాడనని నమ్ముకొనినయెడల, అతడేలాగు
క్రీస్తువాడో ఆలాగే మేమును క్రీస్తువారమని తన మనస్సులో తాను తిరిగి
ఆలోచించుకొనవలెను.
8. పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు
అనుగ్రహించిన అధికారమునుగూర్చి నేనొకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను
సిగ్గుపరచబడను.
9. నేను వ్రాయు పత్రికలవలన మిమ్మును భయపెట్టవలెనని
యున్నట్టు కనబడకుండ ఈ మాట చెప్పుచున్నాను.
10. అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవియు నైయున్నవి గాని
అతడు శరీరరూపమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని యొకడు అనును.
11. మేమెదుటలేనప్పుడు పత్రికల ద్వారా మాటలయందెట్టి
వారమైయున్నామో, యెదుట ఉన్నప్పుడు క్రియయందు అట్టివారమై యుందుమని అట్లనువాడు
తలంచుకొనవలెను.
12. తమ్మును తామే మెచ్చుకొను కొందరితో జతపరచుకొనుట కైనను
వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింప జాలము గాని, వారు తమలోనే యొకరిని బట్టి
యొకరు ఎన్నికచేసికొని యొకరితోనొకరు సరి చూచుకొను చున్నందున, గ్రహింపులేక యున్నారు.
13. మేమైతే మేరకు మించి అతిశయపడము గాని మీరున్న స్థలము
వరకును రావలెనని దేవుడు మాకు కొలిచి యిచ్చిన మేరకు లోబడియుండి అతిశయించుచున్నాము.
ప్రియులారా! మనం 2 వ కొరింథీ
పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!
ప్రియ దైవజనమా! ఇక 10వ అధ్యాయం మరలా అబద్దబోధకుల గూర్చి ఇంకా తన ఆపొస్తలత్వము
కోసం రాస్తున్నారు! అబద్దబోధకులకు పౌలుగారు మరియు క్రీస్తు అపోస్టలుకు మధ్య గల
తేడాలను ఈ అధ్యాయంలో ఎత్తి రాస్తున్నారు పౌలుగారు!!
(గతభాగం తరువాయి)
ప్రియులారా ఇక 7వ వచనంలో కూడా అదే ఉద్దేశాన్ని
కొనసాగిస్తున్నారు!
7. సంగతులను పైపైననే మీరు చూచుచున్నారు, ఎవడైనను తాను
క్రీస్తువాడనని నమ్ముకొనినయెడల, అతడేలాగు క్రీస్తువాడో ఆలాగే మేమును
క్రీస్తువారమని తన మనస్సులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను.
8. పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు
అనుగ్రహించిన అధికారమునుగూర్చి నేనొకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను
సిగ్గుపరచబడను.
మీరు సంగతులు పైపైనే చూస్తున్నారు గాని లోతుగా ఆలోచించడం లేదు! ఎవడైనా
తాను క్రీస్తు వాడను అని నమ్మితే అతడు ఎలాగో మేము కూడా క్రీస్తువారమని నమ్మాలి
అంటున్నారు! ఇది అబద్దబోధకులను ఉద్దేశించి చెబుతున్నది!! అందుకే 12 వ వచనంలో అంటున్నారు తమ్మును తామే మెచ్చుకొను కొందరితో జతపరచుకొనుట
కైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింప జాలము గాని, వారు తమలోనే యొకరిని
బట్టి యొకరు ఎన్నికచేసికొని యొకరితోనొకరు సరి చూచుకొను చున్నందున, గ్రహింపులేక
యున్నారు. వారికి జ్ఞానము లేదు అంటున్నారు!
5 వ అధ్యాయంలో అంటున్నారు కదా 2 కోరింథీయులకు 5:12. మమ్మును మేమే మీ యెదుట తిరిగి
మెప్పించుకొనుట లేదు గాని, హృదయమునందు అతిశయపడక పైరూపమునందే అతిశయపడువారికి
ప్రత్యుత్తర మిచ్చుటకు మీకు ఆధారము కలుగవలెనని మా విషయమై మీకు అతిశయ కారణము
కలిగించుచున్నాము.
అందుకే 8 వ వచనంలో అంటున్నారు పడద్రోయడానికి కాకుండా మిమ్మల్ని క్రీస్తులో
క్రీస్తుతో కట్టడానికే దేవుడు మాకు అధికారం ఇచ్చారు అంటున్నారు! ఇక అతిశయం
అంటున్నారు! ఆ అతిశయం ఏమిటంటే 2 కోరింథీయులకు 1:12. మా అతిశయమేదనగా, లౌకిక జ్ఞానము
ననుసరింపక, దేవుడనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే
అనుసరించి లోకములో నడుచుకొంటి మనియు, విశేషముగా మీయెడలను నడుచుకొంటిమనియు, మా
మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే
ఇక 9,10 వచనాలలో అంటున్నారు: 9. నేను వ్రాయు పత్రికలవలన
మిమ్మును భయపెట్టవలెనని యున్నట్టు కనబడకుండ ఈ మాట చెప్పుచున్నాను.
10. అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవియు నైయున్నవి గాని
అతడు శరీరరూపమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని యొకడు అనును.
పౌలుగారికి వాక్చాతుర్యం,
వాగ్దాటి, మానవ జ్ఞానం లేవని కొందరు అనుకుంటున్నట్టుంది (2 కోరింథీయులకు 11:6).
సత్యాన్ని అందించడంలో అతడు మరీ మెతకగా, సున్నితంగా, సాత్వికంగా ప్రవర్తిస్తాడని
కూడా అనుకుంటున్నారు. అతని ఉత్తరాలు మాత్రం “గంబీరమైనవి, తీవ్రమైనవి” అనడంలోనైనా
కనీసం వారు నిజం మాట్లాడుతున్నారు. అసలు అలా ఎందుకు మాట్లాడుతున్నారు పౌలుగారు! దీనికోసం
మొదటి పత్రికలో విస్తారంగా రాశారు! నేను మీకు వాగ్ధాటి మంచి వాక్చాతుర్యం
ఉపయోగించి మాట్లాడలేదు గాని సిలువను గూర్చిన వార్త ఉన్నది ఉన్నట్లే మీకు చెప్పాను
అంటున్నారు! 1 కొరింథీ 2:1—7 ..
ఇంకా 12లో అంటున్నారు: తమ్మును తామే మెచ్చుకొను కొందరితో
జతపరచుకొనుట కైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింప జాలము గాని, వారు తమలోనే
యొకరిని బట్టి యొకరు ఎన్నిక చేసికొని యొకరితో నొకరు సరి చూచుకొను చున్నందున,
గ్రహింపులేక యున్నారు.
మనుషులు తమను కేవలం తమ సాటి వారిలో కొందరితో మాత్రమే పోల్చుకుంటే
(అలాంటి పోలికల్లో ఎవరికి వారే మంచివారుగా అనిపించాలనే ప్రయత్నం తప్పక జరుగుతుంది
గదా) తమను తాము పొగడుకునేందుకు వారికి కారణం దొరకవచ్చు. అయితే పౌలుగారు ఇలాంటిదానిలో తలదూర్చదలచుకోలేదు.
పోల్చుకునేందుకు సాటి మనుషుల కంటే మరెంతో ఉన్నతమైన ప్రమాణం ఉందని అతనికి తెలుసు.
మనం అనుసరించవలసిన ఆదర్శం క్రీస్తే. బుద్ధి ఉన్న ఎవరూ కూడా ఆయనతో పోల్చుకుంటే తమను
గురించి తాము గొప్పగా అనుకోలేరు.
ఇక 13 వ వచనంలో అంటున్నారు 13. మేమైతే మేరకు మించి అతిశయపడము గాని
మీరున్న స్థలము వరకును రావలెనని దేవుడు మాకు కొలిచి యిచ్చిన మేరకు లోబడియుండి
అతిశయించుచున్నాము.
మేము దేనివిషయంలో అతిశయ పడతాను అంటే 2 కోరింథీయులకు 1:12. మా అతిశయమేదనగా, లౌకిక జ్ఞానము
ననుసరింపక, దేవుడనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే
అనుసరించి లోకములో నడుచుకొంటి మనియు, విశేషముగా మీయెడలను నడుచుకొంటిమనియు, మా
మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే అంటున్నారు! ఇక
మేరకు మించి అతిశయ పడము అంటే అపోస్తులునిగా , సువార్త ప్రచారకుడుగా,
ఉపదేశకుడుగా తన పని గురించి పౌలుగారు
చెప్తున్నమాట ఇది. అతని సరిహద్దు కొరింతు వరకు వ్యాపించింది. సువార్తను
అక్కడికి మొదట తీసుకువెళ్ళి ఆ సంఘాన్ని కట్టినది పౌలుగారే కాబట్టి సంపూర్ణ
అధికారంతో చెబుతున్నారు! అందుకే అంటున్నారు:
1 కోరింథీయులకు
4:14. మిమ్మును సిగ్గుపరచవలెనని కాదుగాని నా ప్రియమైన పిల్లలని మీకు
బుద్ధిచెప్పుటకు ఈ మాటలు వ్రాయు చున్నాను.
15. క్రీస్తునందు మీకు ఉపదేశకులు పదివేలమంది యున్నను
తండ్రులు అనేకులు లేరు.; 1 కోరింథీయులకు 9:2
ఇతరులకు నేను అపొస్తలుడను కాకపోయినను మీమట్టుకైనను అపొస్తలుడనై యున్నాను.
ప్రభువునందు నా అపొస్తలత్వ మునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా?
కాబట్టి
మనము కూడా ఇలాంటి అతిశయమే కలిగి ఉండాలి గాని మేరకు మిచ్చి అతిశయపడకూడదు!
అణిగిమణిగి దేవునికే మహిమను ఆపాదించే వ్యక్తులుగా ఉందాం!
దైవాశీస్సులు!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*154వ భాగము*
2 కొరింథీ 10:13—18
13. మేమైతే మేరకు మించి అతిశయపడము గాని మీరున్న స్థలము
వరకును రావలెనని దేవుడు మాకు కొలిచి యిచ్చిన మేరకు లోబడియుండి అతిశయించుచున్నాము.
14. మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు, మీవరకును
వచ్చియుంటిమి గనుక మీయొద్దకు రానివారమైనట్టు మేము మా మేర దాటి వెళ్లుచున్న వారము
కాము.
15. మేము మేరకు మించి యితరుల ప్రయాసఫలములలో భాగస్థులమనుకొని
అతిశయ పడము. మీ విశ్వాసము అభివృద్ధియైనకొలది మాకనుగ్ర హింపబడిన మేరలకు లోపలనే సువార్త
మరి విశేషముగా వ్యాపింపజేయుచు,
16. మీ ఆవలి ప్రదేశములలో కూడ సువార్త ప్రకటించునట్లుగా,
మేము మీ మూలముగా ఘనపరచబడుదుమని నిరీక్షించుచున్నామే గాని, మరియొకని మేరలో చేరి,
సిద్ధమైయున్నవి మావియైనట్టు అతిశయింపగోరము.
17. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను.
18. ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని తన్ను తానే
మెచ్చుకొనువాడు యోగ్యుడుకాడు.
ప్రియులారా! మనం 2 వ కొరింథీ
పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!
ప్రియ దైవజనమా! ఇక 10వ అధ్యాయం మరలా అబద్దబోధకుల గూర్చి ఇంకా తన ఆపొస్తలత్వము
కోసం రాస్తున్నారు! అబద్దబోధకులకు పౌలుగారు మరియు క్రీస్తు అపోస్టలుకు మధ్య గల
తేడాలను ఈ అధ్యాయంలో ఎత్తి రాస్తున్నారు పౌలుగారు!!
(గతభాగం తరువాయి)
ప్రియులారా 13 వ
వచనంలో మేరకు మించి అతిశయ పడము అనే దానికి మరో కోణంలో ఈ క్రింది వచనాలలో
వివరిస్తున్నారు! పౌలుగారు కొరింథీ పట్టణంలో ఎన్నో శ్రమలకు ఓర్చి దెబ్బలకు ఓర్చి
సంఘములు కడితే అబద్దబోధకులు పౌలుగారు కట్టిన సంఘము మీదనే పెత్తనం చెలాయిస్తూ
పౌలుగారినే అబద్ద అపోస్తలుడు అని చెబుతూ నమ్మించి తమ పొట్టలు పోషించు కుంటున్నారు!
వారిని ఉటంకిస్తూ ఈ క్రింది వచనాలు చెబుతున్నారు!
నేను దేవుడు మాకు నిర్ణయించిన హద్దులలో మేమున్నాము! మేము సువార్త
ప్రకటించి కట్టిన సంఘాలలోనే మేము బోధిస్తున్నాము గాని మీలాగా ఇతరులు కట్టిన
సంఘాలమీద ప్రభువులుగా ఉండటం లేదు అంటున్నారు!
చూడండి ఇప్పుడు కొరింథీ వారికి కూడా చెబుతున్నారు మేము క్రీస్తు
సువార్తను అన్ని దేశాలలోనూ ప్రకటిస్తూ మీ దగ్గరకు వచ్చాము! 14. మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు,
మీవరకును వచ్చియుంటిమి గనుక మీయొద్దకు రానివారమైనట్టు మేము మా మేర దాటి
వెళ్లుచున్న వారము కాము.
15. మేము మేరకు మించి యితరుల ప్రయాసఫలములలో భాగస్థులమనుకొని అతిశయ
పడము. మీ విశ్వాసము అభివృద్ధియైనకొలది మాకనుగ్ర హింపబడిన మేరలకు లోపలనే సువార్త
మరి విశేషముగా వ్యాపింపజేయుచు,
చూడండి మేము మీ దగ్గరకు రాకుండా నేను మీద అధికారం చేయడం లేదు
అంతేకాకుండా ఇతరులు కట్టిన సంఘాలమీద మేము అధికారం చేయడం లేదు ఆ అబద్ద బోధకులు వలె!
మీ దగ్గరకు వచ్చి సంవత్సరం మీద ఆరునెలలు ఉండి సంఘాలు కట్టాము అంటున్నారు!
కొరింతుకు
వచ్చిన కపట అపోస్తులులు (వ 13) ఆ సంఘాన్ని హస్తగతం చేసుకుని ఆ పని అంతా తమదేనని
చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అబద్ధ ఉపదేశకులూ బోధకులూ సాధారణంగా చేసేది
ఇదే. పౌలుగారు కొరింథీలో తన పని గురించి
“గొప్పలు చెప్పుకోవడంలో” ఇలా చేయడం లేదు.
16. మీ ఆవలి ప్రదేశములలో కూడ సువార్త ప్రకటించునట్లుగా,
మేము మీ మూలముగా ఘనపరచబడుదుమని నిరీక్షించుచున్నామే గాని, మరియొకని మేరలో చేరి,
సిద్ధమైయున్నవి మావియైనట్టు అతిశయింపగోరము. అంటున్నారు!
తాను ఇతర ప్రదేశాలకు వెళ్ళి తన సమయాన్ని, శక్తిని
ఉపయోగించగలిగేందుకు వీలుగా కొరింతు సంఘం సత్యంలో మరింత స్థిరపడాలని పౌలు
ఆశిస్తున్నారు. అందుకే రోమీయులకు ఉత్తరం రాస్తూ అంటున్నారు రోమీయులకు
15:20-22
20. నేనైతే మరియొకని పునాదిమీద కట్టకుండు నిమిత్తము
ఆయననుగూర్చిన సమాచారమెవరికి తెలియజేయబడ లేదో వారు చూతురనియు, విననివారు గ్రహింతు
రనియు,
21. వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరుగని చోట్లను
సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశగలవాడనై యుండి ఆలాగున ప్రకటించితిని.
22. ఈ హేతువుచేతను మీయొద్దకు రాకుండ నాకు అనేక పర్యాయములు
ఆటంకము కలిగెను.
చూశారా ఆయన సువార్త నిరతి!!
కానీ నేటిదినాలలో దీనికి పూర్తి
వ్యతిరేఖంగా జరుగుతుంది! కాపరులు, దైవసేవకులు కష్టపడి కట్టిన సంఘాలను ఈ క్రొత్త
బోధకులు బలవంతంగా లాగుకుని పోతున్నారు! ఈ పనికిమాలిన బోధకులు సువార్తికులు కాపరులు
సముద్రంలో వలవేయకుండా దీన సేవకులు కాపరులు పట్టిన చేపల గంపలమీద వల వేస్తున్నారు!
వారి సంఘాలను దోచేస్తున్నారు! లేకపోతే సంఘము కట్టిన రెండు సంవత్సరాలలో పది వేలమంది
లక్షలమంది ఎలా వస్తున్నారు మందిరాలకు! ఎవరో కష్టపడితే వీరు రకరకాల జిమ్మిక్కులు
చేసి, పిట్టకధలు చెప్పి, సైన్సు చెప్పి ఏదో బాగోతం చేసి పరాయి సంఘాల విశ్వాసులను
దోచుకుంటున్నారు అంతేకాకుండా మరికొంతమంది ఆ సంఘాలకు రావలసిన కానుకలు కూడా
దోచుకుంటున్నారు ఈ దొంగలు దోచుకొనువారు! వీరు పరలోకం వెళ్లరు అని బైబిల్ ఖరాఖండిగా
చెబుతుంది! బైబిల్ లో పౌలుగారు చెప్పింది ఒకటి. ఈ కపట బోధకులు చేస్తుంది
ఒకటి! ఇంకా మా పల్లెటూర్లలో మేము మీరు ఒకే
కులం కాబట్టి మా సంఘానికి వచ్చెయ్యండి అంటూ కుల సంఘాలు కడుతున్నారు సంఘాలను
దోచుకుంటున్నారు! ఇలాంటి వారీమీదికి కూడా దేవుని ఉగ్రత రాదా!!
చూడండి
ఇక తర్వాత వచనంలో అంటున్నారు 17. అతిశయించువాడు
ప్రభువునందే అతిశయింపవలెను.
18. ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని తన్ను తానే
మెచ్చుకొనువాడు యోగ్యుడుకాడు.
యిర్మీయా భక్తుడు అంటున్నారు: యిర్మియా 9: 24. అతిశయించువాడు దేనినిబట్టి
అతిశయింపవలెననగా, భూమిమీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను
నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలిసికొనుటనుబట్టియే అతిశయింపవలెను; అట్టి
వాటిలో నేనానందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
1 కోరింథీయులకు
1:31. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింప వలెను అని వ్రాయబడినది
నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు
విమోచనమునాయెను.
ఆ
అబద్ధ బోధకులు తమను తాము మెచ్చుకుంటూ ఇతరుల మెప్పును కోరారు (2 కోరింథీయులకు 3:1).
యోహాను 5:44 పోల్చి చూడండి. దేవునినుంచి మాత్రమే వచ్చే మెప్పును పౌలుగారు ఆశించారు
(1 కోరింథీయులకు 4:3-5;
పౌలుగారు
అంటున్నారు వారికి ఇతరుల మెప్పు కావాలి నాకైతే అలాంటి మెప్పు అవసరం లేదు! 2 కోరింథీయులకు 3:1.
మమ్మును మేమే తిరిగి మెప్పించుకొన మొదలు పెట్టు చున్నామా? కొందరికి కావలసినట్టు
మీయొద్దకైనను మీ యొద్దనుండియైనను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? అని
అడుగుతున్నారు!
ఇంకా 1 కోరింథీయులకు
4:3. మీ చేతనైనను, ఏ మనుష్యునిచేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన
సంగతి; నన్ను నేనే విమర్శించుకొనను.
4. నాయందు నాకు ఏ దోషమును కానరాదు; అయినను ఇందువలన నీతిమంతు
డనుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే.
5. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు,
దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి
తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు, ప్రతి వానికిని తగిన మెప్పు
దేవునివలన కలుగును.
గలతియులకు 1: 10.
ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించు కొన జూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొన
జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచు న్నానా? నేనిప్పటికిని మనుష్యులను
సంతోష పెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును.
1 థెస్సలొనీకయులకు
2:4. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవునివలన ఎంచబడిన వారమై,
మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు
వారమై బోధించుచున్నాము.
కాబట్టి
ప్రియులారా! మనము కూడా ఇతరుల సంతోషపెట్ట డానికి కాకుండా దేవుని సంతోషపెట్టడానికి
ప్రయత్నం చేద్దాం! అలాగే అబద్ద బోధకులు కపట సేవకుల వలె ఇతరులు సంపాదించిన సంఘాలను
దోచుకోకుండా కష్టపడి సువార్త ప్రకటించి సంఘాలను కడదాం!
దేవుడు
మిమ్మును దీవిచ్చును గాక!
ఆమెన్!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*155వ భాగము*
2 కొరింథీ 11:1— 6
1. కొంచెమవివేకముగా నేను మాటలాడినను మీరు సహింపవలెనని
కోరుచున్నాను, నన్నుగూర్చి మీరేలా గైనను సహించుడి.
2. దేవాసక్తితో మీ యెడల ఆసక్తి కలిగి యున్నాను; ఎందుకనగా
పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని,
మిమ్మును ప్రధానము చేసితిని గాని,
3. సర్పము తన కుయుక్తిచేత హవ్వను మోసపరచినట్లు మీ
మనస్సులును చెరుపబడి, క్రీస్తు ఎడలనున్న సరళతనుండియు పవిత్రత నుండియు ఎట్లయినను
తొలగిపోవునేమో అని భయపడు చున్నాను.
4. ఏలయనగా వచ్చినవాడెవడైనను మేము ప్రకటింపని మరియొక యేసును
ప్రకటించినను, లేక మీరు పొందని మరియొక ఆత్మను మీరు పొందినను,మీరు అంగీ కరింపని
మరియొక సువార్త మీరు అంగీకరించినను, మీరు వానినిగూర్చి సహించుట యుక్తమే.
5. నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన యీ అపొస్తలులకంటె లేశమాత్రమును
తక్కువవాడను కానని తలంచుకొనుచున్నాను.
6. మాటల యందు నేను నేర్పులేనివాడనైనను జ్ఞానమందు నేర్పులేని
వాడను కాను. ప్రతి సంగతిలోను అందరి మధ్యను మీ నిమిత్తము మేము ఆ జ్ఞానమును
కనుపరచియున్నాము.
ప్రియులారా! మనం 2 వ కొరింథీ
పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!
ప్రియ దైవజనమా! ఇక 11వ అధ్యాయం కూడా అబద్దబోధకుల గూర్చి ఇంకా తన ఆపొస్తలత్వము
కోసం రాస్తున్నారు! అబద్దబోధకుల కోసం ఈ అధ్యాయంలో సూటిగా చెబుతున్నారు!
(గతభాగం తరువాయి)
ప్రియులారా మొదటి రెండు వచనాలలో కొన్ని ఆసక్తి
కరమైన విషయాలు రాస్తున్నారు!
1. కొంచెమవివేకముగా నేను మాటలాడినను మీరు సహింపవలెనని
కోరుచున్నాను, నన్నుగూర్చి మీరేలా గైనను సహించుడి.
2. దేవాసక్తితో మీ యెడల ఆసక్తి కలిగి యున్నాను; ఎందుకనగా
పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని,
మిమ్మును ప్రధానము చేసితిని గాని,
ఇక్కడ రెండవ వచనంలో దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను
అంటున్నారు “ఆసక్తి”అనగా – పౌలుగారు ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుతున్నాడు.
కొరింథీ సంఘం వారు కొందరు అబద్ధ బోధకుల
మాటలు వింటున్నారు. తాను వారికి నేర్పిన దేవుని సత్యాన్ని వారు వదిలేస్తారేమోనని
అతనికి భయంగా ఉంది. ఇక్కడ “ఆసక్తి” అనే పదం అతనికి వారిపట్ల ఉన్న ప్రేమను
తెలుపుతున్నది. కానీ ఆ క్రైస్తవులను అతడు తనకోసమే, తన మెప్పు, ఘనత కోసమే
ఉంచుకోవాలని చూడడం లేదు. క్రీస్తుతో వారికి ఉన్న సంబంధం గురించే అతని ఆందోళనంతా.
ఇక ఒక్కడే “పురుషునికి”– అనడంలో
పౌలుగారి ఉద్దేశం లేక ఒక ఆత్మీయమర్మం ఆత్మావేశుడై రాస్తున్నారు: పవిత్రురాలైన
కన్యకగా ఒక్కడే పురుషుడైన యేసుక్రీస్తుప్రభులవారికీ మిమ్మును ప్రధానం చేశాను
అంటున్నారు! ఇదో గొప్ప మర్మము! మీ దైవజనుడు అనబడే మీసంఘానికి దేవునిచేత
ఏర్పాటుచేయబడ్డ సంఘదూత – మీ కాపరి గారు, మిమ్మును బాప్తిస్మము ఇవ్వడం ద్వారా మీకును
పెండ్లికుమారుడైన ఏసుక్రీస్తుప్రభువులవారికి పరిశుద్ధ వివాహం కోసం ప్రధానం చేశారు!
ఎలా ప్రధానం చేశారు? పవిత్రురాలైన కన్యకలా నిన్ను దేవునికి ప్రధానం చేశారు!
ఇప్పుడు ఒక వ్యక్తికొరకు ప్రధానం చేయబడ్డ నీవు పరులతో లేక పరపురుషులతో సహవాసం
చేయకూడదు! ఏ విధమైన అక్రమ సంబంధం పెట్టుకోకూడదు! ఆ పురుషుని కోసం నీ శీలాన్ని
కాపాడుకొని నమ్మకంగా ఉండాలి! అయితే నీవు లోకాశలు వలన గాని లేక అబద్ద బోధలవలన గాని
నీ స్వంత పురుషుని లేక ప్రధానం చేయబడ్డ పురుషుని వదలి లోకపు పాపపుటాశలకు లొంగిపోతే
నీవు చెడిపోయినట్లే! అప్పుడు నీవు ఇక ఆ ప్రధానం చేసుకున్న వ్యక్తితో నీ నిబంధన
భంగం చేసుకున్నావు కాబట్టి ఇంకా నీవు పవిత్రురాలవు కావు కాబట్టి నీవు ఆ వ్యక్తితో
వివాహానికి అనర్హురాలవు అయిపోయావు! ఇదీ ఆయన ఉద్దేశ్యం!
గమనించాలి: ఉదాహరణకు: మా
పెంతెకొస్తు చర్చి, S. రాయవరం సంఘ సభ్యురాలు ఒక కన్యకతో కాకినాడ సంఘంలో
ఒక అబ్బాయికి ప్రధానం చేశారు ఇరువురు కాపరుల సమక్షంలో ఇంకా బందుమిత్రుల సమక్షంలో!
ఆ ఆబ్బాయి వృత్తిరీత్యా అమెరికా వెళ్ళిపోయాడు ప్రధానం అయిపోయిన తర్వాత! అయితే
ఇప్పుడు ఆ అమ్మాయి పరపురుషునితో సంబంధం పెట్టుకుని తనయొక్క పాపపు కోరికలు
తీర్చుకోంటుంది అనుకుందాం! ఈ విషయం ఆ అమెరికాలో ఉన్న వ్యక్తికి స్నేహితుని ద్వారా
తెలిసింది!! ఇప్పుడు ఆ అబ్బాయి ఈ అమ్మాయిని పెండ్లి చేసుకుంటాడా??!! ఖచ్చితంగా
చేసుకోడు! సరికదా ఆ అబ్బాయి, ఇంకా కాకినాడ దైవసేవకుడు మా దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి
తల్లిదండ్రులను అడగడం తర్వాత, ముందుగా సంఘకాపరి దగ్గరికి వచ్చి- ఏమయ్యా పెద్దమనిషి
ఆ అమ్మాయి మంచిది అన్నావ్, ప్రార్ధనా పరురాలు అన్నావు, భక్తిగలదీ అన్నావు! ఫలానా
వ్యక్తితో అక్రమసంబంధం పెట్టుకుని జీవిస్తుంది! ఇదేనా నీవు నీ సంఘస్తులకు
నేర్పిస్తున్నావు అని అడుగుతాడు! చూడండి: తప్పు చేసినది ఎవరు? ఆ అమ్మాయి! గాని
ఇప్పుడు చెడ్డపేరు ఎవరికి? దైవసేవకునికి! ఆ పనికిమాలిన స్త్రీ చేసిన తప్పుకు చేయని
నేరానికి నీ దైవసేవకుడు తలవంచుకోవలసి వచ్చింది!!
అయ్యా! ఇదే ఒకరోజు జరుగబోతుంది! ఆరోజు దేవుడు నీ సంఘకాపరిని
అందరిముందు అడుగుతాడు- ఇంతమందిని నాకోసం గెలిచాను అంటూ డప్పాలు కొట్టావు, ప్రధానం
చేశావు ఇప్పుడైతే నన్ను విడిచి ఆ విశ్వాసి, లేక
వీరంతా సైతానుతో సహవాసం చేస్తున్నారు! ఏమి నేర్పించావు అయ్యా నీవు!
సోమరివైన చెడ్డదాసుడా అని అంటారు!! నీవు చేసిన తప్పులకు నీకాపరికి ఎందుకు
తలాదించుకొనేలా చేశావు ? దేవుణ్ణి మరచి లోకంతో పాపంతో సైతానుతో సహవాసం చేస్తే నీవు
కూడా ప్రధానమైన తర్వాత తప్పుడు పని చేసినట్లే!
మత్తయి 22:1-2; యోహాను 3:29; రోమీయులకు 7:4; ఎఫెసీయులకు 5:24-33;
ప్రకటన గ్రంథం 1::6-9; కీర్తనల గ్రంథము 45:9-15; యెషయా 54:5; యిర్మియా 3:14,
యిర్మియా 3:20; హోషేయ 2:16, హోషేయ 2:19
చూడండి.
అయితే ఈ సంధర్భంగా మరో విషయం చెప్పనీయండి- బ్రెంహం బోధలు వినేవారు ఒకమాట అంటారు: దేవుడు అతనికి
బహుశా 1959 లో బలిష్టుడైన దూత కనబడి ఈ చివరికాలపు ప్రవక్తగా పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తుప్రభులవారికీ
వదువు సంఘానికి ప్రధానం చేయమని చెప్పాడట! వెంటనే బ్రెన్హం గారు ప్రధానం చేసేశారట! సర్వలోకానికి
చేయడానికి ఆయనెవరు ? మరి ఆయన 1965 లో
చనిపోయారు కదా, మరి ఆ తర్వాత పుట్టి రక్షించబడిన మన పరిస్తితి ఏమిటి? మనకు ఎవడు
ప్రధానం చేస్తారు? ఇక ఆయనకు ముందు పుట్టి రక్షించబడిన సంఘము పరిస్తితి ఏమిటి?
దయచేసి ఇలాంటి తప్పుడు బోధలను నమ్మవద్దు అని మనవి చేస్తున్నాను! దేవుడు ప్రతీ
సంఘములో గల కాపరికి అనగా ఆ సంఘముయొక్క దూత అనబడే సంఘకాపరికి అధికారం ఇచ్చారు-
బాప్తిస్మము పొందేటప్పుడు పరిశుద్ధాత్మ సమక్షంలో ఆ వ్యక్తికి పెండ్లికుమారునికి
ప్రధానం చేయమని ఈ వచనం ప్రకారం! కొరింథీ సంఘానికి కాపరి పౌలుగారు కాబట్టి ఆయన
కొరింథీ సంఘమును పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తుప్రభులవారితో పరిశుద్ధాత్ముని
సమక్షంలో ప్రధానం చేశారు! అలాగే మీ
సంఘములో ఉన్న విశ్వాసులకు ప్రధానం చేసే అధికారం బాధ్యత మీ సంఘకాపరి ఇచ్చారని
తెలుసుకోండి!
కాబట్టి మనము పెండ్లికుమారుడైన క్రీస్తుయేసుకి ప్రధానం చేయబడిన
వారము కాబట్టి మన శీలము అనే సాక్ష్యమును పరిశుద్ధతను కాపాడుకుని పవిత్రమైన
కన్యకలుగా మన ప్రభువుని ఆయన రాకడలో ఎదుర్కొందాము !
ఆమెన్!
దైవాశీస్సులు!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*156వ భాగము*
2 కొరింథీ 11:3 — 6
1. కొంచెమవివేకముగా నేను మాటలాడినను మీరు సహింపవలెనని
కోరుచున్నాను, నన్నుగూర్చి మీరేలా గైనను సహించుడి.
2. దేవాసక్తితో మీ యెడల ఆసక్తి కలిగి యున్నాను; ఎందుకనగా
పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని,
మిమ్మును ప్రధానము చేసితిని గాని,
3. సర్పము తన కుయుక్తిచేత హవ్వను మోసపరచినట్లు మీ
మనస్సులును చెరుపబడి, క్రీస్తు ఎడలనున్న సరళతనుండియు పవిత్రత నుండియు ఎట్లయినను
తొలగిపోవునేమో అని భయపడు చున్నాను.
4. ఏలయనగా వచ్చినవాడెవడైనను మేము ప్రకటింపని మరియొక యేసును
ప్రకటించినను, లేక మీరు పొందని మరియొక ఆత్మను మీరు పొందినను,మీరు అంగీ కరింపని
మరియొక సువార్త మీరు అంగీకరించినను, మీరు వానినిగూర్చి సహించుట యుక్తమే.
5. నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన యీ అపొస్తలులకంటె
లేశమాత్రమును తక్కువవాడను కానని తలంచుకొనుచున్నాను.
6. మాటల యందు నేను నేర్పులేనివాడనైనను జ్ఞానమందు నేర్పులేని
వాడను కాను. ప్రతి సంగతిలోను అందరి మధ్యను మీ నిమిత్తము మేము ఆ జ్ఞానమును కనుపరచియున్నాము.
ప్రియులారా! మనం 2 వ కొరింథీ
పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!
ప్రియ దైవజనమా! ఇక 11వ అధ్యాయం కూడా అబద్దబోధకుల గూర్చి ఇంకా తన ఆపొస్తలత్వము
కోసం రాస్తున్నారు! అబద్దబోధకుల కోసం ఈ అధ్యాయంలో సూటిగా చెబుతున్నారు!
(గతభాగం తరువాయి)
ఇక 3 వ వచనం నుండి మరో ప్రాముఖ్యమయిన విషయం
చెబుతున్నారు!
3. సర్పము తన కుయుక్తిచేత హవ్వను మోసపరచినట్లు మీ
మనస్సులును చెరుపబడి, క్రీస్తు ఎడలనున్న సరళతనుండియు పవిత్రత నుండియు ఎట్లయినను
తొలగిపోవునేమో అని భయపడు చున్నాను.
4. ఏలయనగా వచ్చినవాడెవడైనను మేము ప్రకటింపని మరియొక యేసును
ప్రకటించినను, లేక మీరు పొందని మరియొక ఆత్మను మీరు పొందినను,మీరు అంగీ కరింపని
మరియొక సువార్త మీరు అంగీకరించినను, మీరు వానినిగూర్చి సహించుట యుక్తమే.
ఆదియందు ఆదాము హవ్వలను సర్పము మాయమాటలు చెప్పి కుయుక్తిగా
మోసపరచినట్లు మీరుకూడా మోసపోతున్నారేమో అని నాకు భయం వేస్తుంది అంటున్నారు! ఎలా
మోసపోతున్నారు? కుయుక్తిగల మాటలు అబద్ద బోధలకు మీ మనస్సులు హృదయాలు చెరుపబడి
క్రీస్తు ఎడల ఉన్న సరళత అనగా సత్యమార్గము నుండియు పవిత్రత నుండి ఎలాగైనా
తప్పిపోతారేమో అని భయపడుతున్నారు పౌలుగారు! ఇక్కడ పౌలుగారు ఆదికాండం 3 వ అధ్యాయంలో
జరిగిన విషయాన్ని ఎత్తిరాస్తున్నారు! కొరింథీ సంఘాన్ని హవ్వమ్మ గారితో
పోలుస్తున్నారు! ఆదికాండము 3:1-7. ఆదాము గురించి గాక హవ్వమ్మ గారి గురించి పౌలుగారు ఇక్కడ మాట్లాడ్డం తగిన విషయమే. ఎందుకంటే మొదటి
ఆదాముకు భార్య హవ్వ; చివరి ఆదాముకైతే (1 కోరింథీయులకు 15:45) భార్య తన సంఘం;
అంతేగాక మోసానికి గురి అయింది హవ్వ గాని
ఆదాము కాదు (1 కోరింథీయులకు 2:14). కొరింతులో విశ్వాసులు ఎదుర్కొంటున్నది ఇదే
విధమైన సైతాను ప్రయోగిస్తున్న మోసం (వ 13-15).
మనము కూడా సాతాను తప్పుడు బోధలకు లొంగి విశ్వాసము నుండి సత్యము
నుండి తప్పిపోకూడదు! నిజమైన బోధ నుండి
అపోస్తలుల బోధనుండి తప్పిపోకూడదు!! 1 కోరింథీయులకు 2:14. ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ
విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే
వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.
ఇక నాలుగో వచనంలో అంటున్నారు ఏలయనగా వచ్చినవాడెవడైనను మేము
ప్రకటింపని మరియొక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరియొక ఆత్మను మీరు
పొందినను, మీరు అంగీ కరింపని మరియొక సువార్త మీరు అంగీకరించినను, మీరు
వానినిగూర్చి సహించుట యుక్తమే. ఈ వచనం ప్రకారం సాతాను కూయుక్తులకు మోసపోవడం అంటే
పౌలుగారు ఇంకా నిజమైన క్రీస్తు అపోస్తులుల బోధకాకుండా మరో బోధను నమ్మడమే ! అక్కడి
క్రైస్తవుల్లో కొందరి విషయంలో పౌలుగారికి
ఎందుచేత భయంగా ఉందో కారణం చెప్తున్నారు ఇక్కడ . సత్యం కోసం వారికున్న
ప్రీతి, లేక అసత్యాన్ని పసిగట్టగల సామర్థ్యం వారికి కొదువగా ఉంది. కనీసం అబద్ధ
బోధకులను ఎదిరించేందుకు కూడా సిద్ధంగా
లేరు. అలాంటివారి విషయంలో కొరింథీవారు చూపుతున్న సహనం చూచి పౌలుగారు కంగారు
పడ్డారు. అలాటివారిని తమ మధ్య సహనంతో ఉండనివ్వడం వారిలో సత్యం పట్ల ఏమంత శ్రద్ధ
లేదని సూచిస్తున్నదని అతనికి బాగా తెలుసు. ఏదో ఒక ఆత్మ ఉన్నవారిలో, ఏదో ఒక శక్తి
లేక ప్రభావం ఉన్నవారిలో ప్రతి ఒక్కరూ తప్పకుండా దేవుని ఆత్మ, ప్రభావాలే
ఉన్నవారనుకోనవసరం లేదు. సువార్త ప్రకటిస్తున్నట్టు కనిపిస్తున్న వారిలో ప్రతి
ఒక్కరూ నిజమైన సువార్తనే ప్రకటిస్తున్నారని అనుకోనవసరం లేదు ! అందుకే గలతీ పత్రికలో అంటున్నారు: గలతియులకు 1:6-9;
6. క్రీస్తు కృపనుబట్టి మిమ్మును పిలిచినవానిని విడిచి,
భిన్నమైన సువార్తతట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది.
7. అది మరియొక సువార్త కాదుగాని, క్రీస్తు సువార్తను
చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు.
8. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను
మేమైనను పరలోకమునుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు
శాపగ్రస్తుడవును గాక.
9. మేమిది వరకు చెప్పిన ప్రకారమిప్పుడును మరల
చెప్పుచున్నాము; మీరు అంగీకరించిన సువార్త గాక మరియొకటి యెవడైనను మీకు ప్రకటించిన
యెడల వాడు శాపగ్రస్తుడవును గాక.
1 యోహాను 4:1
ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకము లోనికి బయలు వెళ్లియున్నారు
గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆ యా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి.
మనము కూడా ప్రతి బోధను నమ్మకుండా ఆ బోధలను బైబిల్ తో సరిచూసుకుంటూ
ఉండాలి! లేకపోతే నిజమైన సత్యమార్గము తొలిగిపోయి విశ్వాసము నుండి బ్రష్టులై పోతాము
!
ఇక తర్వాత వచనాలలో డైరెక్ట్ ఎటాక్ ప్రారంభిస్తున్నారు అబద్ద బోధకుల
కోసం! నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన యీ
అపొస్తలులకంటే లేశమాత్రమును తక్కువవాడను కానని తలంచుకొనుచున్నాను.ఇక్కడ పౌలుగారు
చెప్పేది మిక్కిలి శ్రేష్టులయిన
అపోస్టలులు అంటే రెండు అర్ధాలున్నాయి – పేతురుగారు యోహాను
గారు లాంటి యేసుక్రీస్తుప్రభులవారి శిష్యులకోసం! మిక్కిలి శ్రేష్టులయిన ఆ
అపోస్టలుల కంటే కూడా నేను తక్కువ వాడను కాను!
రెండవది: ఈ పిల్ల అబద్దబోధకులు అబద్ద అపోస్తులుల కంటే నేను
ఎంతమాత్రమూ తక్కువ వాడను కాను అంటున్నారు! అలా మాటలు చెప్పడమే కాకుండా తర్వాత
వచనాలలో ఇంకా తర్వాత అధ్యాయంలో దానికి అనగా తన అపొస్తలత్వమునకు ఋజువులు
చూపిస్తున్నారు! ఇంకా కొరింథీలో క్రీస్తు
అపోస్తులులుగా చెలామణి అవుతున్న ఆ అబద్ధ ఉపదేశకులను “ఉత్తమోత్తములైన రాయబారులు”
అని పౌలుగారు వ్యంగ్యంగా పిలుస్తున్నారు. ఎందుకంటే వారు తమ గురించి చాలా గొప్పలు
చెప్పుకొంటున్నారు.
ఇక 6. మాటల యందు నేను నేర్పులేనివాడనైనను జ్ఞానమందు నేర్పులేని
వాడను కాను. ప్రతి సంగతిలోను అందరి మధ్యను మీ నిమిత్తము మేము ఆ జ్ఞానమును
కనుపరచియున్నాము అంటున్నారు!
గమనించాలి గత అధ్యాయంలో
చూసుకున్నాము 2 కోరింథీయులకు 10:10. అతని
పత్రికలు ఘనమైనవియు బలీయమైనవియునై యున్నవి గాని అతడు శరీరరూపమునకు బలహీనుడు, అతని
ప్రసంగము కొరగానిదని యొకడు అనును. దానికి జవాబుగానే ఈ వచనం కూడా చెబుతున్నారు! అందుకే రెండో అధ్యాయంలో
చెప్పారు కదా
2 కోరింథీయులకు 2
1. మరియు నేను దుఃఖముతో మీయొద్దకు తిరిగిరానని నామట్టుకు
నేను నిశ్చయించుకొంటిని.
2. నేను మిమ్మును దుఃఖపరచునెడల నాచేత దుఃఖపరచబడినవాడు తప్ప
మరి ఎవడు నన్ను సంతోషపరచును?
3. నేను వచ్చినప్పుడు ఎవరివలన నేను సంతోషము పొందతగినదో,
వారివలన నాకు దుఃఖము కలుగకుండవలెనని యీ సంగతి మీకు వ్రాసితిని. మరియు నా సంతోషము
మీ అందరి సంతోషమేయని మీ అందరియందు నమ్మకము కలిగి యీలాగు వ్రాసితిని.
4. మీకు దుఃఖము కలుగవలెనని కాదు గాని, మీయెడల నాకు
కలిగియున్న అత్యధికమైన ప్రేమను మీరు తెలిసికొనవలెనని, నిండు శ్రమతోను మనోవేదనతోను
ఎంతో కన్నీరు విడుచుచు మీకు వ్రాసితిని.
5. ఎవడైనను దుఃఖము కలుగజేసి యుండినయెడల,నాకు మాత్రము కాదు
కొంతమట్టుకు మీకందరికిని దుఃఖము కలుగజేసియున్నాడు. నేను విశేషభారము వానిమీద
మోపగోరక యీ మాట చెప్పుచున్నాను.
ఇంకా 1 కోరింథీయులకు 2:6-16; గలతియులకు 1:11-12.లో కూడా ఇదే
విషయాన్ని రాస్తున్నారు!
గలతియులకు 1
11. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన
ప్రకారమైనది కాదని మీకు తెలియ జెప్పుచున్నాను.
12. మనుష్యునివలన దానిని నేను పొందలేదు, నాకెవడును దాని
బోధింపనులేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుటవలననే అది నాకు లభించినది.
ఈ
విధంగా అబద్ద బోధకులకు సమాధానం చెబుతున్నారు!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*157వ భాగము*
2 కొరింథీ 11:7 — 15
7. మిమ్మును హెచ్చింపవలెనని మీకు దేవుని సువార్తను ఉచితముగా
ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకొనినందున పాపము చేసితినా?
8. మీకు పరిచర్య చేయుటకై నేనితర సంఘములవలన జీతము
పుచ్చుకొని, వారి ధనము దొంగిలినవాడనైతిని.
9. మరియు నేను మీయొద్దనున్నప్పుడు నాకక్కర కలిగియుండగా
నేనెవనిమీదను భారము మోపలేదు; మాసిదోనియనుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి.
ప్రతి విషయములోను నేను మీకు భారముగా ఉండకుండ జాగ్రత్తపడితిని, ఇక ముందుకును
జాగ్రత్త పడుదును
10. క్రీస్తు సత్యము నాయందు ఉండుటవలన అకయ ప్రాంతములయందు
నేనీలాగు అతిశయ పడకుండ, నన్ను ఆటంకపరచుటకు ఎవరి తరముకాదు.
11. ఎందువలన? నేను మిమ్మును ప్రేమింపనందువలననా? దేవునికే
తెలియును.
12. అతిశయకారణము వెదకువారు ఏవిషయములో అతిశయించుచున్నారో, ఆ
విషయములో వారును మావలెనే యున్నారని కనబడునిమిత్తము వారికి కారణము దొరకకుండ
కొట్టివేయుటకు, నేను చేయుచున్న ప్రకారమే యిక ముందుకును చేతును.
13. ఏలయనగా అట్టి వారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారై
యుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పనివారునై యున్నారు.
14. ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగుదూత వేషము
ధరించుకొనుచున్నాడు
15. గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము
ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును.
ప్రియులారా! మనం 2 వ కొరింథీ
పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!
ప్రియ దైవజనమా! ఇక 11వ అధ్యాయంలో కూడా అబద్దబోధకుల గూర్చి ఇంకా తన ఆపొస్తలత్వము
కోసం రాస్తున్నారు! అబద్దబోధకుల కోసం ఈ అధ్యాయంలో సూటిగా చెబుతున్నారు!
(గతభాగం తరువాయి)
ఇక
7-9 వచనాలలో అంటున్నారు:
7. మిమ్మును హెచ్చింపవలెనని మీకు దేవుని సువార్తను ఉచితముగా
ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకొనినందున పాపము చేసితినా?
8. మీకు పరిచర్య చేయుటకై నేనితర సంఘములవలన జీతము
పుచ్చుకొని, వారి ధనము దొంగిలినవాడనైతిని.
9. మరియు నేను మీయొద్దనున్నప్పుడు నాకక్కర కలిగియుండగా
నేనెవనిమీదను భారము మోపలేదు; మాసిదోనియనుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి.
ప్రతి విషయములోను నేను మీకు భారముగా ఉండకుండ జాగ్రత్తపడితిని, ఇక ముందుకును
జాగ్రత్త పడుదును
ఉచితముగా
సువార్త ప్రకటించి నేను పాపం చేశానా అని సూటిగా అడుగుతున్నారు ఇక్కడ! ఎందుకంటే
మొదటి పత్రికలో చూసుకున్నాము! పౌలుగారు వారి కానుకలు ఆశించకుండా తన స్వంతచేతులతో
కష్టపడి తనజీవనం సాగించేవారు! అలా కష్టపడి దేవుని పరిచర్య చేశారు పౌలుగారు! మిగిలిన వారు కానుకలు తీసుకుని సువార్త చేశారు!
ఇలా ఉచితముగా మీకు సువార్త ప్రకటించి పాపం చేశానా అంటున్నారు!
ఇలా
అనడానికి కారణం కొందరు చెప్పడం మొదలుపెట్టారు: పౌలుగారికి తాను నిజమైన ఆపోస్తులుడను కానని తెలుసు కాబట్టీ కొరింథీవారి దగ్గర తన
జీవనోపాధి కోసం ఏమైనా పుచ్చుకునే యోగ్యత తనకు లేదనీ తెలుసు కాబట్టీ ఏమీ
పుచ్చుకోవడం లేదని అతని పగవారు చెబుతున్నారు!. జీవనోపాధి కోసం తన సొంత చేతులతో పని
చేసుకోవడం (అపో. కార్యములు 18:3) క్రీస్తు రాయబారి పదవికి తగదని వారు చెప్తున్నారు
. కానీ కొరింథీవారి పట్ల అతనికి గల ప్రేమ మూలానే (వ 11), వారిని “గొప్ప చేసి”,
ఆధ్యాత్మికంగా వారు ఎదిగేలా చేయడమే (వ 7) ఇందులో తన ఉద్దేశమని పౌలు గారు
చెప్తున్నారు.
అపో. కార్యములు 18
3. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తిగలవాడు
గనుక వారితో కాపురముండెను; వారు కలిసి పనిచేయుచుండిరి.
ఇంకా అంటున్నారు:
1 కోరింథీయులకు 9:4-15. 1 కోరింథీయులకు 9
4. తినుటకును త్రాగుటకును మాకు అధికారము లేదా?
5. తక్కిన అపొస్తలులవలెను, ప్రభువుయొక్క సహోదరులవలెను,
కేఫావలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారములేదా?
6. మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారము
లేని వారమా?
7. ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయునా?
ద్రాక్షతోటవేసి దాని ఫలము తిననివాడెవడు? మందను కాచి మంద పాలు త్రాగనివాడెవడు?
8. ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా?
ధర్మశాస్త్రముకూడ వీటిని చెప్పు చున్నదిగదా?
9. కళ్లము త్రొక్కుచున్న యెద్దు మూతికి చిక్కము పెట్టవద్దు
అని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది. దేవుడు ఎడ్లకొరకు విచారించుచున్నాడా?
10. కేవలము మనకొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మనకొరకే
గదా యీ మాట వ్రాయబడెను? ఏలయనగా, దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్లము
త్రొక్కించువాడు పంటలో పాలుపొందుదునను ఆశతో త్రొక్కింపవలెను.
11. మీకొరకు ఆత్మసంబంధమైనవి మేము విత్తియుండగా మీవలన
శరీరసంబంధమైన ఫలములు కోసికొనుట గొప్ప కార్యమా?
12. ఇతరులకు మీ పైని యీ అధికారములో పాలు కలిగినయెడల మాకు
ఎక్కువ కలదు గదా? అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు; క్రీస్తు సువార్తకు
ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండుటకై అన్నిటిని సహించుచున్నాము.
13. ఆలయకృత్యములు జరిగించువారు ఆలయమువలన జీవనము చేయుచున్నా
రనియు, బలిపీఠమునొద్ద కనిపెట్టుకొనియుండువారు బలి పీఠముతో పాలివారై యున్నారనియు
మీరెరుగరా?
14. ఆలాగున సువార్త ప్రచురించువారు సువార్తవలన జీవింపవలెనని
ప్రభువు నియమించియున్నాడు.
15. నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు; మీరు
నాయెడల యీలాగున జరుపవలెనని ఈ సంగతులు వ్రాయనులేదు. ఎవడైనను నా అతిశయమును నిరర్థకము
చేయుటకంటె నాకు మరణమే మేలు.
ఇక 8 వ వచనంలో అంటున్నారు
8. మీకు పరిచర్య చేయుటకై నేనితర సంఘములవలన జీతము
పుచ్చుకొని, వారి ధనము దొంగిలినవాడనైతిని.
గమనించాలి ఈ వచనం ద్వారా మనకు రెండు విషయాలు అర్ధమవుతాయి!
మొదటిది: ఆ సంఘములో పరిచర్య చేయకుండా కానుకలు తీసుకుంటే అది
దొంగతనము! నిజానికి తర్వాత వచనం ప్రకారం పౌలుగారు మాసిడోనియా సంఘాలలో పరిచర్య చేసి
ఆ సంఘములనుండి కానుకలు తీసుకునే అధికారం ఉంది, వారు అనగా మాసిడోనియా సంఘములు అనగా
ఫిలిప్పీ సంఘాలు, థెస్సలొనికయ సంఘాలు మాటిమాటికి కానుకలు పంపించేవారు! దీనిని కూడా
దొంగతనము అంటున్నారు పౌలుగారు! ఎందుకంటే పరిచర్య చేస్తున్నపుడు కానుకలు తీసుకున్నా
పరవాలేదు! ఇప్పుడు మరో ప్రాంతములో ఉండగా కూడా తనకు మాసిడోనియా సంఘాల నుండి వచ్చే
సహాయం తీసుకోవడం తనకు తానే అది ఒకరకమైన దొంగతనముగా భావించారు! పౌలుగారు అలంకారికంగా మాట్లాడు తున్నారు. ఇతర సంఘాలను
పౌలు ఎప్పుడూ ఆర్థిక సహాయం కోసం అడగలేదు గాని వారిస్తే పుచ్చుకొన్నాడు. కొన్ని
సార్లు అలా ఇచ్చినవారు పేదవాళ్ళు కూడా. మరింత ధనికులైన కొరింతువారికి పరిచర్య
చేస్తూ అలాంటి పేదల నుంచి సహాయం స్వీకరించడం దాదాపుగా వారిని దోచుకోవడం వంటిదిగా
అతనికి అనిపించింది.
రెండు: ఈ వచనం ప్రకారం
టీవీ సేవకులు గాని, మరో సేవకులు గాని మేము చర్చిలు కడుతున్నాము, లేక మేము ఫలాని
పరిచర్య చేస్తున్నాము, మేము కాలేజీలు కడుతున్నాము మాకు సహాయం చేయండి లేక ఈ
ప్రోగ్రామ్ చేయడానికి మాకు ఎంతో ఖర్చు అవుతుంది, ధయచేసి ఈ పరిచర్యను సపోర్ట్
చేయడానికి నెలకు ఇంత పంపి సహాయపడండి అని అడుక్కునే వారు ఎవరైనా సంఘాలను
దోచుకొంటున్నారు అని అర్ధం! ఎందుకంటే సంఘములో పరిచర్య చేసినవారే ఆ సంఘస్తుల నుండి
కానుకలు తీసుకునే అధికారం కలిగి ఉంటారు గాని ఏదో ఒక టీవీ ప్రసంగం చేసి అద్భుతాలు హైలెట్
చేసేసి పరిచర్యకు కానుకలు అడిగే వారు దోచుకుంటున్నారు మరియు
బిజినెస్ చేస్తున్నారు తప్ప పరిచర్య చేయడం లేదు! నీకు దేవుడు ఒక పరిచర్య
అప్పగిస్తే అది కొనసాగించడానికి దేవుడే మార్గం చూపిస్తారు గాని ఇతర సంఘాల కానుకలు
దోచుకోవడం చేయకూడదు! ఇలాంటి వారు దొంగలు మరియు దోచుకొనువారు అని ఈ రెండు వచనాల
ప్రకారం అర్ధమవుతుంది!
ఇక
9 వ వచనంలో అంటున్నారు: 9. మరియు నేను మీయొద్దనున్నప్పుడు నాకక్కర కలిగియుండగా
నేనెవనిమీదను భారము మోపలేదు; మాసిదోనియనుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి.
ప్రతి విషయములోను నేను మీకు భారముగా ఉండకుండ జాగ్రత్తపడితిని, ఇక ముందుకును
జాగ్రత్త పడుదును
విశ్వాసుల
నుంచి పౌలుగారు కొన్ని సార్లు ఆర్థిక సహాయం స్వీకరించకపోలేదు. అయితే ఒక సంఘంలో
పరిచర్య చేస్తున్నప్పుడు అతడు మాత్రం దాని నుంచి ఏ సహాయమూ స్వీకరించలేదని
తలంచడానికి అవకాశం ఉంది.
ఇక్కడ
మరో విషయం చెబుతున్నారు: మొదట ఆయన తనచేతులతో కష్టపడి తన వృత్తి ప్రకారం టెంట్లు
కుట్టి జీవనం సాగించారు! ఆ తర్వాత
పౌలుగారిని ప్రేమించి మాసిడోనియా సంఘములు అనగా ఫిలిప్పీ సంఘాలు,
థెస్సలోనికయ సంఘాలు మాటిమాటికి కానుకలు పంపించేవారు! ఇలాప్రతీ విషయంలో కూడా
కొరింథీ వారికి తాను భారం కాకూడదని జాగ్రత్త పడ్డాను! ఇక ముందుకు కూడా జాగ్రత్త
పడతాను అంటున్నారు!
విశ్వాసులారా!
దయచేసి ఈ విషయం గమనించండి ఇవి నా సొంత మాటలు కానేకాదు! మీకానుకలు మీ స్వంత సంఘాలకే
వెళ్ళాలి గాని మరో టీవీ సేవకునికి లేక అద్భుతాలు చేసేవారికి కానేకాదు!
దైవాశీస్సులు!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*158వ భాగము*
2 కొరింథీ 11:7 — 15
7. మిమ్మును హెచ్చింపవలెనని మీకు దేవుని సువార్తను ఉచితముగా
ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకొనినందున పాపము చేసితినా?
8. మీకు పరిచర్య చేయుటకై నేనితర సంఘములవలన జీతము
పుచ్చుకొని, వారి ధనము దొంగిలినవాడనైతిని.
9. మరియు నేను మీయొద్దనున్నప్పుడు నాకక్కర కలిగియుండగా
నేనెవనిమీదను భారము మోపలేదు; మాసిదోనియనుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి.
ప్రతి విషయములోను నేను మీకు భారముగా ఉండకుండ జాగ్రత్తపడితిని, ఇక ముందుకును
జాగ్రత్త పడుదును
10. క్రీస్తు సత్యము నాయందు ఉండుటవలన అకయ ప్రాంతములయందు
నేనీలాగు అతిశయ పడకుండ, నన్ను ఆటంకపరచుటకు ఎవరి తరముకాదు.
11. ఎందువలన? నేను మిమ్మును ప్రేమింపనందువలననా? దేవునికే
తెలియును.
12. అతిశయకారణము వెదకువారు ఏవిషయములో అతిశయించుచున్నారో, ఆ
విషయములో వారును మావలెనే యున్నారని కనబడునిమిత్తము వారికి కారణము దొరకకుండ
కొట్టివేయుటకు, నేను చేయుచున్న ప్రకారమే యిక ముందుకును చేతును.
13. ఏలయనగా అట్టి వారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము
ధరించుకొనువారై యుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పనివారునై యున్నారు.
14. ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగుదూత వేషము
ధరించు కొనుచున్నాడు
15. గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము
ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును.
ప్రియులారా! మనం 2 వ కొరింథీ
పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!
ప్రియ దైవజనమా! ఇక 11వ అధ్యాయంలో కూడా అబద్దబోధకుల గూర్చి ఇంకా తన ఆపొస్తలత్వము
కోసం రాస్తున్నారు! అబద్దబోధకుల కోసం ఈ అధ్యాయంలో సూటిగా చెబుతున్నారు!
(గతభాగం తరువాయి)
ఇక
10—12 వచనాలలో అంటున్నారు:
10. క్రీస్తు సత్యము నాయందు ఉండుటవలన అకయ ప్రాంతములయందు
నేనీలాగు అతిశయ పడకుండ, నన్ను ఆటంకపరచుటకు ఎవరి తరముకాదు.
11. ఎందువలన? నేను మిమ్మును ప్రేమింపనందువలననా? దేవునికే
తెలియును.
12. అతిశయకారణము వెదకువారు ఏవిషయములో అతిశయించుచున్నారో, ఆ
విషయములో వారును మావలెనే యున్నారని కనబడునిమిత్తము వారికి కారణము దొరకకుండ కొట్టివేయుటకు,
నేను చేయుచున్న ప్రకారమే యిక ముందుకును చేతును.
క్రీస్తులో
నేను సత్యము చెబుతున్నాను అంటూ అకయ ప్రాంతం వారికోసం నేను అతిశయపడకుండా ఎవరూ నన్ను
ఆపలేరు అంటున్నారు!
1 కోరింథీయులకు 9
15. నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు; మీరు
నాయెడల యీలాగున జరుపవలెనని ఈ సంగతులు వ్రాయనులేదు. ఎవడైనను నా అతిశయమును నిరర్థకము
చేయుటకంటె నాకు మరణమే మేలు.
16. నేను సువార్తను ప్రకటించు చున్నను నాకు
అతిశయకారణములేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నామీద మోపబడియున్నది. అయ్యో, నేను
సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ.
17. ఇది నేనిష్టపడి చేసినయెడల నాకు జీతము దొరకును.
ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను.
18. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను
ప్రకటించునప్పుడు సువార్తయందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగ పరచుకొనకుండ
సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము.
ఇలా
ధైర్యంగా అతిశయ పడుతున్నారు! అకయ వారు అనేకసార్లు ఆయన అవసరాలు తీర్చారు!
11 వ వచనంలో అంటున్నారు
ఎందువలన? నేను మిమ్మును ప్రేమింపనందువలననా? దేవునికే తెలియును.
12. అతిశయకారణము వెదకువారు ఏవిషయములో అతిశయించుచున్నారో, ఆ
విషయములో వారును మావలెనే యున్నారని కనబడునిమిత్తము వారికి కారణము దొరకకుండ
కొట్టివేయుటకు, నేను చేయుచున్న ప్రకారమే యిక ముందుకును చేతును.
నేను
మిమ్మును ప్రేమిస్తున్నానో లేదో దేవునికే తెలుస్తుంది ఏదిఏమైనా నేను ఇంకా నా
చేతులతో కష్టపడి జీవనం చేస్తాను , ఇంకా మాసిడోనియా వారు కానుకలు పంపితే తీసుకుని
సేవచేస్తున్నాను గాని మీ నుండి నేను ఒక్క పైసా కూడా తీసుకొనే అంటున్నారు!
అబద్ధ
బోధకులు తమ ఉపదేశాలకోసం కొరింథివారి దగ్గర డబ్బులు వసూలు చేశారన్నది నిస్సందేహం (2
కోరింథీయులకు 2:17). వారు తాము పౌలుగారితో
సమానం అనుకొంటున్నారు, గానీ ఉచితంగా శుభవార్త ప్రకటించడంలో వారు తనకు
సమానులు కారని పౌలుగారు చూపిస్తున్నారు. ఈ తేడా చూపించడం అలానే కొనసాగించేందుకు
అతడు దృఢ సంకల్పంతో ఉన్నారు.
2 కోరింథీయులకు
2:17. కావున ఇట్టి సంగతులకు చాలినవాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి
చెరిపెడు అనేకులవలె ఉండక, నిష్కాపట్యము గలవారమును దేవునివలన నియమింపబడిన
వారమునైయుండి, క్రీస్తునందు దేవునియెదుట బోధించు చున్నాము.
ఇక తర్వాత వచనంలో చెబుతున్నారు వారు అనగా అబద్ద బోధకులు
అపోస్టలుల వేషంలో ఉన్నారు గాని నిజమైన అపోస్టలులు కారు అంటున్నారు!
13. ఏలయనగా అట్టి వారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారై
యుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పనివారునై యున్నారు.
14. ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగుదూత వేషము
ధరించుకొనుచున్నాడు
ఇప్పుడు పౌలుగారు దేవుని ఆత్మ
మూలంగా కొరింథీలోని అబద్ధ మత బోధకుల గుట్టు బయట పెడుతున్నారు!. అంతేగాక, అన్ని తరాల్లో,
అన్ని చోట్లా క్రీస్తు పేరుతో వచ్చే అబద్ధ బోధకుల సంగతి కూడా బయట పెట్టాడు. వారి
గురించి ఆరు సంగతులు చెప్తున్నాడు.
ఒకటి, వారు “వాస్తవమైన” సేవకులు
కాదు. దేవుడు తమను పంపాడంటారు గాని నిజంగా ఆయన పంపలేదు (ప్రకటన గ్రంథం 2:2;
యిర్మియా 23:21 ప్రకటన గ్రంథం 2:2. నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును
నేనెరుగుదును; నీవు దుష్టులను సహింపలేవనియు, అపొస్తలులు కాకయే తాము అపొస్తలులమని
చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు,
యిర్మియా 23:21. నేను ఈ
ప్రవక్తలను పంపకుండినను వారు పరుగెత్తి వచ్చెదరు, నేను వారితో మాటలాడకుండినను వారు
ప్రకటించెదరు.
వారు “మోసంగా పని చేసేవారు”– వారి పద్ధతులు, వారి సందేశం కూడా
మోసకరమే, వారి ఉద్దేశం ఇతరులను మోసగించడమే (మత్తయి 24:11, మత్తయి 24:24; రోమీయులకు
16:18; 2 థెస్సలొనీకయులకు 2:9-10)
మత్తయి 24:11.
అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు;
24. అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి,
సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను
మహత్కార్యములను కనబరచెదరు.
రోమీయులకు 16:18.
అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు; వారు ఇంపైన మాటలవలనను
ఇచ్చకములవలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు.
2 థెస్సలొనీకయులకు
2:9. నశించుచున్నవారు తాము రక్షింప బడుటకై సత్యవిషయమైన ప్రేమను అవలంబింపక
పోయిరి గనుక, వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను, నానావిధములైన
సూచకక్రియలతోను, మహత్కార్యములతోను
10. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను, నశించుచున్న
వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించియుండును
వారు
“మారువేషం వేసుకునేవారు”– ఇతరులు తమను క్రీస్తు అపొస్తులుగా భావించాలని తమ బయటి
ప్రవర్తనను మార్చుకొన్నారు గానీ తమ చెడు హృదయాలను మార్చుకోలేకపోతారు.
వారు
సైతాను సేవకులు (వ 15; యోహాను 8:44; 2 థెస్సలొనీకయులకు 2:9; 1 తిమోతికి 4:1-2)
15. గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము
ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును
యోహాను 8:44. మీరు
మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు. ఆదినుండి
వాడు నరహంత కుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు
అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధి కుడును
అబద్ధమునకు జనకుడునై యున్నాడు.
2 థెస్సలొనీకయులకు
2:9. నశించుచున్నవారు తాము రక్షింప బడుటకై సత్యవిషయమైన ప్రేమను అవలంబింపక
పోయిరి గనుక, వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను, నానావిధములైన
సూచకక్రియలతోను, మహత్కార్యములతోను
1 తిమోతికి 4:1.
అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును
2. దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని
ఆత్మ తేటగా చెప్పుచున్నాడు.
వారు నీతిన్యాయాలకు సేవకుల్లాగా నటిస్తారు – వాటి గురించి మాట్లాడేవారే
గాని నిజానికి వారు పాపానికే సేవకులు (2 పేతురు 2:18-19).
పేతురు రాసిన రెండో పత్రిక, యూదా పత్రికలు మొత్తం ఈ అబద్ధ బోధకులు
ఎలాంటివారో వర్ణిస్తున్నాయి.
2 పేతురు 2:18. వీరు వ్యర్థమైన
డంబపుమాటలు పలుకుచు, తామే శరీరసంబంధమైన దురాశలుగలవారై, తప్పుమార్గమందు
నడుచువారిలోనుండి అప్పుడే తప్పించు కొనినవారిని పోకిరిచేష్టలచేత
మరలుకొల్పుచున్నారు.
19. తామే భ్రష్టత్వమునకు దాసులైయుండియు, అట్టివారికి స్వాతంత్ర్యము
ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేనివలన జయింపబడునో దానికి దాసుడగును గదా
చివరగా, దేవుడు వారి క్రియలను
బట్టి వారిని దండిస్తాడు (2 థెస్సలొనీకయులకు 2:8; 2 పేతురు 2:3; 2 పేతురు 2:9;
యూదా 1:13; మత్తయి 7:22-23).
2 థెస్సలొనీకయులకు
2:8. అప్పుడా ధర్మవిరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటియూపిరిచేత
వానిని సంహరించి తన ఆగమన ప్రకాశముచేత నాశనము చేయును.
2 పేతురు 2:3. వారు
అధిక లోభులై, కల్పనావాక్యములు చెప్పుచు, మీవలన లాభము సంపాదించుకొందురు; వారికి
పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు.
9. భక్తులను శోధనలోనుండి తప్పించుటకును, దుర్ణీతిపరులను
ముఖ్యముగా మలినమైన దురాశకలిగి శరీరానుసారముగా నడుచు కొనుచు, ప్రభుత్వమును
నిరాకరించుచు,
యూదా 1:13. తమ
అవమానమను నురుగు వెళ్ల గ్రక్కువారై, సముద్రముయొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పితిరుగు
చుక్కలుగాను ఉన్నారు; వారికొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి యున్నది.
మత్తయి 7:22. ఆ
దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ
నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని
చెప్పుదురు.
యిర్మియా
14:14, యిర్మియా 27:15
23. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము
చేయువారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును.
కొరింతు
క్రైస్తవుల్లో కొందరు ఇలాంటి వ్యక్తుల మాటలు వింటున్నారు, వారికి డబ్బిస్తున్నారు,
వారి ఉపదేశాలను విని సహనం, మెప్పు చూపుతున్నారు. పౌలుగారు కంగారు మనకు అర్థం అవుతున్నది గదా. మనుషులు
సైతాను సేవకులను స్వీకరించి కూడా తమ ఆధ్యాత్మిక జీవితాలకు గొప్ప హాని చేసుకుంటున్నారు!
14 వ వచనంలో అంటున్నారు: 14. ఇది ఆశ్చర్యము కాదు; సాతాను
తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు
15. గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము
ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును.
గమనించాలి: సైతాను సైతానుగా రాడు. పాపాన్ని పాపం లాగా దుర్మార్గం
దుర్మార్గంలాగా కనిపించేలా చేయడు. తనను వెలుగులాగా మెరిసిపోతూ ఆకర్షణీయంగా
చేసుకోగలడు. దేవుని వాక్కును త్రోసిపుచ్చడం చాలా సహజంగా, బుద్ధికి అనుగుణంగా
అనిపించేలా చేయగలడు. పాపాన్ని నీతిన్యాయాల్లాగా కనిపించేలా చేయగలడు. లోకమంతటినీ
తలక్రిందులు చేసి సత్యాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని సత్యంగా, చీకటిని వెలుగుగా
వెలుగును చీకటిగా కనిపించేలా ప్రయత్నం చేస్తున్నాడు (ఈ ప్రయత్నం చాలా వరకు
విజయవంతంగా ఉంది). మనుషులలో అనేకమంది సహాయకులు వాడికి ఉన్నారు. అలాంటివారిపై
దేవుడు యెషయా 5:20 లో తన తీర్పును వినిపిస్తున్నాడు. సైతాను గురించి 1
దినవృత్తాంతములు 21:1; మత్తయి 4:1; యోహాను 8:44
యెషయా 5:20. కీడు
మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొను వారికి
శ్రమ. చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకొనువారికి శ్రమ.
1 దినవృత్తాంతములు 21:1. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా
లేచి, ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా
యోహాను 8:44. మీరు
మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు. ఆదినుండి
వాడు నరహంత కుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు
అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధి కుడును
అబద్ధమునకు జనకుడునై యున్నాడు.
కాబట్టి ప్రియ దైవజనమా!
ఈ అబద్ద బోధకుల విషయమై జాగ్రత్తగా ఉండండి! వారు చేసే మృదువైన మాటలు, మోసకరమైన
తియ్యటి మాటలు నమ్మవద్దు! మా గ్రామానికి ఒక దొంగబోధకుడు వచ్చాడు! మా దగ్గరకు
రాకుండా ఎక్కువ విశ్వాసులు ఉండే కాలనీకి వెళ్ళి సిస్టర్ ఇలా సిస్టర్ అలా సిస్టర్,
దేవుడు నాకు రాత్రి కనబడి మిమ్మల్నే చూపించారు సిస్టర్ అంటూ వారిని లోపరుచుకుని
చివరకు మాకు తెలియకుండా సుమారుగా రెండు లక్షల రూపాయలు వసూలు చేసి పారిపోయాడు! మరో
మోసగాడు సిస్టర్ సిస్టర్ అంటూ మా గ్రామంలో అనేకులను మోసగించి వారిని మా సంఘమునుండి
లాగుకుని, వారిని బురిడీ కొట్టించి సుమారుగా 40 లక్షల రూపాయలకు ఆ విశ్వాసులతో సాక్షి సంతకం పెట్టించుకుని
ఇల్లు రెండు బండ్లు కొనుక్కుని అందరికీ టోపీ పెట్టేశాడు! డబ్బులు తీర్చలేదని
అనేకమందితో దెబ్బలు తిన్నాడు! చివరికి పాష్టర్లు అంటే పరువులేకుండా చేసేశాడు,
దేవుని పేరు తీసేశాడు పాపాత్ముడు!
ప్రియ దైవజనమా! దయచేసి అందరినీ నమ్మవద్దు! ఇంటికి వచ్చిన ప్రతీ
సేవకునికి కానుకలు ఇవ్వవద్దు! చేర్చుకోవద్దు! మీ దైవజనుడితో కలసి వస్తే మీకు
స్తోమత ఉంటే పంచభక్ష పరమాన్నాలు పెట్టండి
కానుకలు ఇవ్వండి పరవాలేదు! మీ దైవసేవకుణ్ణి చాటేసి, ఆయన లేకుండా వస్తే దయచేసి
చేర్చుకోవద్దు! వారి దొంగబోధలను నమ్మవద్దు! మా ప్రాంతాలలో అనేకమైన దొంగబోధకులు
అబద్ధ బోధకులు అన్యులకు సువార్త ప్రకటించడం లేదు! విశ్వాసుల దగ్గరకే వస్తారు ఇంకా
భర్తలు ఆఫీసుకి గాని పనికి గాని వెళ్లాకనే వస్తున్నారు! దొంగబోధలు చేస్తున్నారు!
విశ్వాసులను బ్రష్టులుగా చేస్తున్నారు! ముఖ్యంగా యెహోవా సాక్షులు ముస్లిములు!
కాబట్టి వారినుండి జాగ్రత్తగా ఉండండి!
దైవాశీస్సులు!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*159వ భాగము*
2 కొరింథీ 11:16 — 22
16. నేను
అవివేకినని యెవడును తలంచవద్దని మరల చెప్పు చున్నాను. అట్లు తలంచినయెడల నేను
కొంచెము అతిశయపడునట్లు నన్ను అవివేకినైనట్టు గానే చేర్చు కొనుడి.
17. నేను చెప్పుచున్నది ప్రభువు మాట ప్రకారము చెప్పుటలేదు
గాని ఇట్లు అతిశయపడుటకు ఆధారము కలిగి అవివేకివలె చెప్పుచున్నాను.
18. అనేకులు శరీర విషయములో అతిశయపడుచున్నారు గనుక నేనును
ఆలాగే అతిశయపడుదును.
19. మీరు వివేకులైయుండి సంతోషముతో అవివేకులను
సహించుచున్నారు.
20. ఒకడు మిమ్మును దాస్యమునకు లోపరచినను, ఒకడు మిమ్ము
మింగివేసినను, ఒకడు మిమ్ము వశపరచుకొనినను, ఒకడు తన్ను గొప్పచేసి కొనినను, ఒకడు
ముఖముమీద మిమ్మును కొట్టినను మీరు సహించుచున్నారు.
21. మేము బలహీనులమై యున్నట్టు అవమానముగా మాటలాడుచున్నాను. ఏ
విషయమందు ఎవడైన ధైర్యము కలిగి యున్నాడో, ఆ విషయమందు నేనుకూడ ధైర్యము కలిగినవాడను;
అవివేకముగా మాటలాడుచున్నాను సుమా.
22. వారు హెబ్రీయులా? నేనును హెబ్రీయుడనే. వారు
ఇశ్రాయేలీయులా? నేనును ఇశ్రాయేలీయుడనే. వారు అబ్రాహాము సంతానమా? నేనును
అట్టివాడనే.
ప్రియులారా! మనం 2 వ కొరింథీ పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!
ప్రియ దైవజనమా! ఇక 11వ అధ్యాయంలో కూడా అబద్దబోధకుల గూర్చి ఇంకా తన ఆపొస్తలత్వము
కోసం రాస్తున్నారు! అబద్దబోధకుల కోసం ఈ అధ్యాయంలో సూటిగా చెబుతున్నారు!
(గతభాగం తరువాయి)
ప్రియులారా ఇక 16 వ వచనంలో అంటున్నారు 16. నేను
అవివేకినని యెవడును తలంచవద్దని మరల చెప్పు చున్నాను. అట్లు తలంచినయెడల నేను
కొంచెము అతిశయపడునట్లు నన్ను అవివేకినైనట్టు గానే చేర్చు కొనుడి.
దీని
అర్ధం నేను ఆవివేకిని అని ఎవరూ లెక్కకట్టవద్దు. ఒకవేళ అలా అనుకుంటే అనుకోండి గాని
నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అంటున్నారు ! చూడండి పౌలు గారు ఎక్కడా తనను తాను
పొగడుకోవడం లేదు. దేవుని కృప, బలప్రభావాలు లేకుంటే తానేమిటో అతనికి బాగా తెలుసు – 2 కోరింథీయులకు 12:11;
ఎఫెసీయులకు 3:8; 1 తిమోతికి 1:5. తనను తాను పొగడుకుంటున్నట్టు కనిపించడం కూడా
అతనికి అసహ్యం. అది బుద్ధిహీనతలాగా అతనికి అనిపించింది. అందుకే తనను తాను తగ్గించు
కుంటున్నారు! అదే సమయంలో కొరింథీ క్రైస్తవులకోసం తన అపొస్తలత్వము పక్షంగా వాదించాలని తీవ్రమైన ప్రేరేపణ అతనికి
కలిగింది (2 కోరింథీయులకు 12:19). అలా చేసేందుకు ఏకైక మార్గం తాను దేవుని సహాయంతో
క్రీస్తుకోసం చేయగలగిన పనులు, అనుభవించిన బాధల గురించి చెప్పుకోవడమే. 2
కోరింథీయులకు 12
19. మేమింతవరకు మా విషయమై మీకు సమాధానము
చెప్పుకొనుచున్నామని మీకు తోచునేమో. దేవుని యెదుటనే క్రీస్తునందు మాటలాడుచున్నాము;
ప్రియులారా, మీ క్షేమాభివృద్ధికొరకు ఇవన్నియు చెప్పు చున్నాము.
ఇక
తర్వాత వచనాలలో అంటున్నారు: 17. నేను
చెప్పుచున్నది ప్రభువు మాట ప్రకారము చెప్పుటలేదు గాని ఇట్లు అతిశయపడుటకు ఆధారము
కలిగి అవివేకివలె చెప్పుచున్నాను.
18. అనేకులు శరీర విషయములో అతిశయపడుచున్నారు గనుక నేనును
ఆలాగే అతిశయపడుదును.
19. మీరు వివేకులైయుండి సంతోషముతో అవివేకులను
సహించుచున్నారు.
చాలామంది
అనగా ఈ తప్పుడుబోధగాళ్లు తమ శరీరవిషయమై అతిశయ పడుతున్నారు, అనగా శరీరసంబంధంగా వారు
పుట్టిన గోత్రము మరియు సున్నతి విషయమై అతిశయ పడుతున్నారు, అలాగైతే శరీర విషయంలో
వారికంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నానని అంటున్నారు! అయితే మీరు శరీర విషయంలో ఎవడూ
అతిశయించ కూడదు అని తెలిసినా మీరు వివేకులై ఉండి కూడా వారిని సహిస్తున్నారు ఇది ఎంత సబబో మీరే
ఆలోచించండి అంటున్నారు! వారికి సిగ్గు కలిగించాలని పౌలుగారు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. అబద్ధ బోధకులు
చెప్పుకుంటున్న గొప్పలన్నిటినీ వారు విని సహించారు. క్రీస్తు నిజమైన అపోస్తులులము
అని చెప్పుకునే కొన్ని గొప్పలు కూడా కాస్త వినాలి మరి. ఆ అబద్ధ బోధకులు అక్కడ
చేస్తున్నదేమిటో ఇరవయ్యో వచనంలో వర్ణిస్తున్నారు. ఒకడు మిమ్మును దాస్యమునకు
లోపరచినను, ఒకడు మిమ్ము మింగివేసినను, ఒకడు మిమ్ము వశపరచుకొనినను, ఒకడు తన్ను
గొప్పచేసి కొనినను, ఒకడు ముఖముమీద మిమ్మును కొట్టినను మీరు సహించుచున్నారు. ఇలా
అనడానికి కారణం అబద్దబోధకులు సంఘ సభ్యులమీద ప్రభుత్వం చేస్తుంటే వారికి చాలా
లోబడుతున్నారు! “బానిసలుగా చేస్తే”– మోషే ధర్మశాస్త్రం కిందికి క్రైస్తవులను
తీసుకురావడమని బహుశా దీని అర్థం! (అపో. కార్యములు 15:1; గలతియులకు 2:4 పోల్చి
చూడండి). ఎలాంటి అబద్ధ ఉపదేశం కింద ఉండడమైనా బానిసత్వం వంటిదే.
అపో. కార్యములు 15
1. కొందరు యూదయనుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము
చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి.
గలతియులకు 2
4. మనలను దాసులుగా చేసికొనవలెనని క్రీస్తు యేసువలన మనకు
కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు, రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన
కపట సహోదరులవలన జరిగినది. అందుకే మరలా దాస్యమనే కాడి క్రింద మరలా చిక్కుకోవద్దు
అని చెబుతున్నారు.. ..
ఇక 21,22 వచనాలలో
అంటున్నారు:
21. మేము బలహీనులమై
యున్నట్టు అవమానముగా మాటలాడుచున్నాను. ఏ విషయమందు ఎవడైన ధైర్యము కలిగి యున్నాడో, ఆ
విషయమందు నేనుకూడ ధైర్యము కలిగినవాడను; అవివేకముగా మాటలాడుచున్నాను సుమా.
22. వారు హెబ్రీయులా? నేనును హెబ్రీయుడనే. వారు
ఇశ్రాయేలీయులా? నేనును ఇశ్రాయేలీయుడనే. వారు అబ్రాహాము సంతానమా? నేనును
అట్టివాడనే.
అక్కడున్న అబద్ధ బోధకులు క్రీస్తును
అనుసరిస్తున్నామని చెప్పుకొంటూ కూడా విముక్తికోసం మోషే ధర్మశాస్త్రాన్ని పాటించడం
అవసరమేనని నేర్పించే యూదా క్రైస్తవులని దీన్ని బట్టి అనుకోవచ్చు. తాము అబ్రాహాము
సంతానమనీ, మత నిష్ఠగలవారమై మూల హీబ్రూ భాషలో లేఖనాలను చదవగలవారమనీ (అపో. కార్యములు
6:1) వారు గొప్పలు చెప్పుకుంటున్నారు. తనకు కూడా అలాంటివన్నీ ఉన్నాయని పౌలు
చెప్తున్నారు (రోమీయులకు 11:1; ఫిలిప్పీయులకు 3:5).
అపో. కార్యములు 6
1. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన
పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయులమీద గ్రీకుభాష మాట్లాడు
యూదులు సణుగసాగిరి.
రోమీయులకు 11
1. ఆలాగైనయెడల నేనడుగునదేమనగా, దేవుడు తనప్రజలను
విసర్జించెనా? అట్లనరాదు. నేనుకూడ ఇశ్రాయేలీయుడను, అబ్రాహాము సంతానమందలి
బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను.
ఫిలిప్పీయులకు 3
5. ఎనిమిదవదినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపువాడనై,
బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్రవిషయము
పరిసయ్యుడనై,
ఇలా
ఎన్నో రకాలుగా వారికంటే శ్రేష్టమైన స్థితిలో ఉన్నా ఫిలిప్పీ లో అంటున్నారు ఏవి
నాకు లాభకరంగా ఉన్నాయో వాటిని క్రీస్తు నిమిత్తం మరియు మృతులలో నుండి పునరుత్థానం
కావాలని సమస్తమును పెంటగా ఎంచుకున్నాను అంటున్నారు..
(సశేషం)
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*160వ భాగము*
2 కొరింథీ 11:22— 33
22. వారు హెబ్రీయులా? నేనును హెబ్రీయుడనే. వారు
ఇశ్రాయేలీయులా? నేనును ఇశ్రాయేలీయుడనే. వారు అబ్రాహాము సంతానమా? నేనును
అట్టివాడనే.
23. వారు క్రీస్తు పరిచారకులా? వెఱ్ఱివానివలె మాటలాడు
చున్నాను, నేనును మరి యెక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా
ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని; అపరిమితముగా దెబ్బలు
తింటిని, అనేకమారులు ప్రాణాపాయములలో ఉంటిని.
24. యూదులచేత అయిదుమారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు
తింటిని;
25. ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని; ఒకసారి రాళ్లతో
కొట్టబడితిని; ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని; ఒక రాత్రింబగళ్లు సముద్రములో
గడిపితిని.
26. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదులవలననైన ఆపదలలోను,
దొంగలవలననైన ఆపదలలోను, నా స్వజనులవలననైన ఆపదలలోను, అన్యజనుల వలననైన ఆపదలలోను,
పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరులవలని
ఆపదలలోను ఉంటిని
27. ప్రయాస తోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి
దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలి తోను, దిగంబరత్వముతోను ఉంటిని, ఇంకను చెప్ప
వలసినవి అనేకములున్నవి.
28. ఇవియును గాక సంఘము లన్నిటినిగూర్చిన చింతయు కలదు. ఈ
భారము దిన దినమును నాకు కలుగుచున్నది.
29. ఎవడైనను బలహీను డాయెనా? నేనును బలహీనుడను కానా? ఎవడైనను
తొట్రుపడెనా? నాకును మంట కలుగదా?
30. అతిశయ పడవలసియుంటే నేను నా బలహీనత విషయమైన సంగ
తులనుగూర్చియే అతిశయపడుదును.
31. నేనబద్ధమాడుటలేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన
ప్రభువగు యేసుయొక్క తండ్రియైన దేవుడు ఎరుగును.
32. దమస్కులో అరెత అను రాజుక్రింద ఉన్న అధిపతి నన్ను
పట్టగోరి కావలియుంచి దమస్కీయుల పట్టణమును భద్రము చేసెను.
33. అప్పుడు నేను కిటికీగుండ గోడ మీదనుండి గంపలో దింపబడి
అతని చేతిలోనుండి తప్పించుకొనిపోతిని. ప్రియులారా! మనం 2 వ కొరింథీ
పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!
ప్రియ దైవజనమా! ఇక 11వ అధ్యాయంలో కూడా అబద్దబోధకుల గూర్చి ఇంకా తన ఆపొస్తలత్వము
కోసం రాస్తున్నారు! అబద్దబోధకుల కోసం ఈ అధ్యాయంలో సూటిగా చెబుతున్నారు!
(గతభాగం తరువాయి)
ప్రియులారా ఇక 22 వ వచనం నుండి
వారి లాగే తానుకూడా శరీర విషయంలో వారికంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నాయని చెప్పి- ఇక
దానితో పాటుగా క్రీస్తు సువార్త పక్షయంగా తాను ఎంతటి శ్రమలు అనుభవించి సంఘాలను
కడుతున్నారో చెబుతున్నారు!
ఇక 23 వ వచనం నుండి చూస్తే 23. వారు క్రీస్తు పరిచారకులా? వెఱ్ఱివానివలె
మాటలాడు చున్నాను, నేనును మరి యెక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా
ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని; అపరిమితముగా దెబ్బలు
తింటిని, అనేకమారులు ప్రాణాపాయములలో ఉంటిని.
తాము క్రీస్తు సేవకులమని దొంగ అపోస్తలులు
చెప్పుకున్నారు (వ 23). అది నిజం కాదని పౌలుగారు ఇంతకుముందే చెప్పారు (వ 13-15) కాబట్టి మరలా చెప్పడం లేదు. దానికి
బదులుగా వారికంటే తానే క్రీస్తు సేవకుణ్ణనేందుకు ఎక్కువ సాక్ష్యాధారాలు, రుజువులు
ఉన్నట్టు చూపుతున్నారు. ఈ సాక్ష్యాలు మూడు రకాలుగా చెబుతున్నారు
– క్రీస్తుకోసం అతడు పడ్డ
అధిక ప్రయాస (వ 23,26,27),
క్రీస్తుకోసం అతడు అనుభవించిన అధిక కష్టాలు, బాధలు (వ 23-27),
క్రీస్తు ప్రజలపట్ల అతనికున్న అధిక శ్రద్ధ (వ 28,29).
“ప్రయాసపడ్డాను”–
1 కోరింథీయులకు 4
12. స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము. నిందింప బడియు
దీవించుచున్నాము; హింసింపబడియు ఓర్చు కొనుచున్నాము;
కొలొస్సయులకు 1:29.
29. అందు నిమిత్తము నాలో బలముగా, కార్యసిద్ధికలుగజేయు ఆయన
క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను.
పౌలుగారు తన జాబితాలో దీన్ని మొట్టమొదట ఉంచుతున్నారు.
ఎవరైనా తాను క్రీస్తు సేవకుణ్ణని చెప్పుకుంటే మాటలు కాదు, అతని చేతలే అందుకు
పరీక్ష. క్రీస్తుపట్ల ఒక వ్యక్తికున్న ప్రేమను కొలిచే ఒక విధానం ఏమిటంటే ఆయనకోసం
ఎంత కష్టపడి పని చేసేందుకు అతడు సిద్ధపడుతున్నాడు అని చూడడమే. “చెరసాల”– పౌలుగారు 7 సార్లు చెరసాలలో ఉన్నారని మొదటి శతాబ్దం
నుంచి వాడుకలో ఉన్న ఒక మాట.
“ప్రాణాపాయం”
కోసం చూసుకుంటే – 2 కోరింథీయులకు
1:8-9;
8. సహోదరులారా, ఆసియలో మాకు తటస్థించిన శ్రమనుగూర్చి మీకు
తెలియకుండుట మాకిష్టములేదు; అదేదనగా మేము బ్రదుకుదుమను నమ్మకములేక యుండునట్లుగా,
మా శక్తికి మించిన అత్యధిక భారమువలన క్రుంగిపోతివిు.
9. మరియు మృతులను లేపు దేవునియందేగాని, మాయందే మేము నమ్మిక
యుంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మామట్టుకు మాకు కలిగియుండెను.
ఇక
తర్వాత వచనంలో యూదులచేత ఐదు సార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాను అంటున్నారు!
ధర్మశాస్త్రం అనుమతించే కొరడా దెబ్బలు 40 మాత్రమే – ద్వితీయోపదేశకాండము 25:1-3.
సాధారణంగా యూదులు 39 దెబ్బలే కొట్టేవారు. ఎందుకంటే 40 వరకు కొడితే లెక్కలో ఒక్క
తప్పు వచ్చినా 41 దెబ్బలు వేసి ధర్మశాస్త్రాన్ని మీరిన వారమౌతామని వారి భయం. ఈ
కొరడా దెబ్బలు బహు ఘోరమైనవి. ఈ దెబ్బలు తిన్నవారు చనిపోవచ్చు. ఒక వ్యక్తికి
క్రీస్తుపై గల ప్రేమ ఎంతో ఆయనకోసం ఎలాంటి బాధలు అనుభవించడానికి అతడు
సిద్ధమౌతున్నాడనే దాన్ని బట్టి కూడా తెలుస్తుంది
ద్వితీయోపదేశకాండము
25
1. మనుష్యులకు వివాదము కలిగి న్యాయసభకు వచ్చు నప్పుడు
న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుని నీతి మంతుడనియు దోషిని దోషియనియు తీర్పు
తీర్చవలెను.
2. ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడినయెడల న్యాయాధి పతి వాని
పండుకొనబెట్టి వాని నేరముకొలది దెబ్బలు లెక్కపెట్టి తనయెదుట వాని కొట్టింపవలెను.
3. నలువది దెబ్బలు కొట్టింపవచ్చును అంతకు మించకూడదు. వీటి
కంటే విస్తారమైన దెబ్బలు కొట్టించినయెడల నీ సహోద రుడు నీ దృష్టికి నీచుడుగా
కనబడునేమో.
తర్వాత
25. ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని; ఒకసారి
రాళ్లతో కొట్టబడితిని; ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని; ఒక రాత్రింబగళ్లు
సముద్రములో గడిపితిని.
అపో. కార్యములు 14
19. అంతియొకయ నుండియు ఈకొనియ నుండియు యూదులు వచ్చి,
జనసమూహములను తమ పక్షముగా చేసికొని, పౌలుమీద రాళ్లు రువ్వి అతడు చనిపోయెనని అనుకొని
పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి.
20. అయితే శిష్యులు అతనిచుట్టు నిలిచియుండగా అతడు లేచి
పట్టణములో ప్రవేశించి, మరునాడు బర్నబాతోకూడ దెర్బేకు బయలుదేరి పోయెను.
తర్వాత
26. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదులవలననైన
ఆపదలలోను, దొంగలవలననైన ఆపదలలోను, నా స్వజనులవలననైన ఆపదలలోను, అన్యజనుల వలననైన
ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరులవలని
ఆపదలలోను ఉంటిని
“పదేపదే”– సువార్త ప్రచారం,
ఉపదేశించడం అనే అతని పరిచర్యలోనన్నమాట. “అపాయాలు”– క్రీస్తుకోసం ఏమేమి
ఎదుర్కొనేందుకు ఒక వ్యక్తి సిద్ధమౌతాడో దాన్ని బట్టి కూడా ఆయన పట్ల అతని ప్రేమను
కొలవవచ్చు. దుర్బోధకులు కొరింథీలో కూర్చుని తామేదో గొప్పవాళ్ళమని చెప్పుకోవచ్చు.
అయితే వారు సహించిన హింసలు ఏమిటి? క్రీస్తుకోసం ఏ అపాయాలను ఎదుర్కోవడానికైనా వారు
సిద్ధం?
ఆపో
21:30—32
ఓడ
పగిలి రాత్రింబగల్లు సముద్రంలో ఉండుట విషయం దయచేసి ఈ వచనాలు చదవండి 27:7—20,27—44
28:3—5
ఈ
విధంగా ఎన్నెన్నో కష్టాలు పడి సువార్త ప్రకటించారు పౌలుగారు! గాని ఈ దొంగ
అపోస్టలులు అబద్ద బోధకులు ఏవిధమైన శ్రమలు ప్రయాసలు పడకుండా పౌలుగారు కట్టిన
సంఘములలో రహస్యంగా ప్రవేశించి తాము నిజమైన అపోస్తలులము అని చెప్పుకుంటూ పొట్ట
పోషించుకుంటూ పౌలుగారినే దొంగ అపోస్తలుడు అని చెబుతున్నారు! అందుకే తాను క్రీస్తు
నిజమైన సువార్త విషయమై ఎన్ని అవస్తలు పడ్డారో ఎందుకోసం అవి సహిస్తున్నారో
వివరిస్తున్నారు!
దైవాశీస్సులు!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*161వ భాగము*
2 కొరింథీ 11:22— 33
22. వారు హెబ్రీయులా? నేనును హెబ్రీయుడనే. వారు
ఇశ్రాయేలీయులా? నేనును ఇశ్రాయేలీయుడనే. వారు అబ్రాహాము సంతానమా? నేనును
అట్టివాడనే.
23. వారు క్రీస్తు పరిచారకులా? వెఱ్ఱివానివలె మాటలాడు
చున్నాను, నేనును మరి యెక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా
ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని; అపరిమితముగా దెబ్బలు తింటిని,
అనేకమారులు ప్రాణాపాయములలో ఉంటిని.
24. యూదులచేత అయిదుమారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు
తింటిని;
25. ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని; ఒకసారి రాళ్లతో
కొట్టబడితిని; ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని; ఒక రాత్రింబగళ్లు సముద్రములో
గడిపితిని.
26. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదులవలననైన ఆపదలలోను,
దొంగలవలననైన ఆపదలలోను, నా స్వజనులవలననైన ఆపదలలోను, అన్యజనుల వలననైన ఆపదలలోను,
పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరులవలని
ఆపదలలోను ఉంటిని
27. ప్రయాసతోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి
దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలి తోను, దిగంబరత్వముతోను ఉంటిని, ఇంకను చెప్ప
వలసినవి అనేకములున్నవి.
28. ఇవియును గాక సంఘము లన్నిటినిగూర్చిన చింతయు కలదు. ఈ
భారము దిన దినమును నాకు కలుగుచున్నది.
29. ఎవడైనను బలహీను డాయెనా? నేనును బలహీనుడను కానా? ఎవడైనను
తొట్రుపడెనా? నాకును మంట కలుగదా?
30. అతిశయ పడవలసియుంటే నేను నా బలహీనత విషయమైన యేసుయొక్క
తండ్రియైన దేవుడు ఎరుగును.
32. దమస్కులో అరెత అను రాజుక్రింద ఉన్న అధిపతి నన్ను
పట్టగోరి కావలియుంచి దమస్కీయుల పట్టణమును సంగతులనుగూర్చియే అతిశయపడుదును.
31. నేనబద్ధమాడుటలేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన
ప్రభువగు
భద్రము చేసెను.
33. అప్పుడు నేను కిటికీగుండ గోడ మీదనుండి గంపలో దింపబడి
అతని చేతిలోనుండి తప్పించుకొనిపోతిని.
ప్రియులారా! మనం 2 వ కొరింథీ
పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!
ప్రియ దైవజనమా! ఇక 11వ అధ్యాయంలో కూడా అబద్దబోధకుల గూర్చి ఇంకా తన ఆపొస్తలత్వము
కోసం రాస్తున్నారు! అబద్దబోధకుల కోసం ఈ అధ్యాయంలో సూటిగా చెబుతున్నారు!
(గతభాగం తరువాయి)
ఇక
27 వ వచనంలో అంటున్నారు:
27. ప్రయాస తోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి
దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలి తోను, దిగంబరత్వముతోను ఉంటిని, ఇంకను చెప్ప
వలసినవి అనేకములున్నవి.
“ప్రయాసముతోనూ
”అనగా – 23వ వచనంలో చెప్పినట్లు మరి
విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని; అపరిమితముగా
దెబ్బలు తింటిని, అనేకమారులు ప్రాణాపాయములలో ఉంటిని..
“ఇక
జాగరణముల తోను ” అనగా – నిద్రపోయేందుకు సరైన చోటు కూడా తరచుగా అతనికి దొరికేది కాదు.
అంతే కాక తన పనికి సంబంధించిన ఒత్తిడులు, భారాలు అతణ్ణి నిద్రకు దూరం చేశాయి!.
క్రీస్తుకోసమని తమ జీవితమంతట్లో ఒక్క రాత్రి నిద్రను కూడా వదులుకోని వారు కావాలంటే
తనను విమర్శించుకోనివ్వండని పౌలుగారి
భావం.
“భోజనం”, “సరైన బట్టలు” లేకుండా అనగా – రోమీయులకు 8:35-37 లో
పౌలుగారు ఏదో గొప్పగా ధ్వనించే
సిద్ధాంతాన్ని రాయలేదు.
35. క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను
బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను
ఎడబాపునా?
36. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్ల
మేము వధింపబడినవారము వధకు సిద్ధమైన గొఱ్ఱెలమని మేము ఎంచబడిన వారము.
37. అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో
అత్యధిక విజయము పొందుచున్నాము.
క్రీస్తుప్రేమను
బట్టి అన్నింటినీ సహిస్తున్నారు! తన అనుభవంలో దీన్ని నిరూపించుకున్నారు . తాను
చేసిన పనుల మూలంగా, అనుభవించిన బాధల మూలంగా తాను క్రీస్తు అపోస్తులుడనని కూడా రుజువు చేసుకున్నారు. తన జీవితాన్ని మరింత
సౌఖ్యవంతంగా, హాయిగా, మరింత ఆర్థిక భద్రత ఉన్నదిగా అతడు చేసుకోలేకపోయాడా?
ఆంటే నిస్సందేహంగా చేసుకోగలిగేవారే గాని వ్యక్తులను లేక సంఘాలను డబ్బులు
అడిగేవాడైతే, నేటి ఆధునిక so
called సేవకులవలే లేక ప్రసంగీకుల వలె మార్గమధ్యంలో వచ్చే
విలాసవంతమైన హోటళ్ళు, శ్రేష్ఠమైన భోజనాల కోసం డబ్బు తీసుకుపోయేవాడైతే అలా చేసుకోగలిగేవాడే.
వెళ్ళడానికి అనువైన చోట్లకే వెళ్ళేవాడైతే, అతడు రాకముందే అక్కడ అన్ని ఏర్పాట్లూ
జరిగిపోయే ప్రదేశాలకే వెళ్ళేవాడైతే అతనికి సుఖంగానే ఉండేది. అయితే అలాంటి వాటిల్లో
అతనికి ఆసక్తి లేదు (అపో. కార్యములు 20:24). క్రీస్తు కోసం బాధలు పడడం తనకు
ఆధిక్యతగా మహిమగా అతడు ఎంచారు పౌలుగారు! –
2 కోరింథీయులకు 4:17
17. మేము దృశ్యమైనవాటిని చూడక అదృశ్యమైనవాటినే నిదానించి
చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకొరకు అంత కంతకు ఎక్కువగా
నిత్యమైన మహిమ భారమును కలుగ జేయుచున్నది.;
రోమీయులకు 8:17
17. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో
కూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తుతోడి వారసులము.;
ఫిలిప్పీయులకు 1:29
29. ఏలయనగా మీరు నాయందు చూచినట్టియు, నాయందున్నదని మీరిప్పుడు
వినుచున్నట్టియు పోరాటము మీకును కలిగి యున్నందున;
ఫిలిప్పీయులకు 3
10. ఏ విధముచేతనైనను మృతులలోనుండి నాకు పునరుత్థానము కలుగవలెనని,
ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై, ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు
నిమిత్తమును,
కొలొస్సయులకు 1:24. ఇప్పుడు మీకొరకు నేను అనుభవించుచున్న
శ్రమల యందు సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడినపాట్లలో కొదువైన
వాటియందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను.
కొరింథీలో కూర్చుని గప్పాలు కొట్టుకుంటున్న బోధకులకూ ఉపదేశకులకూ ఈ దేవుని
మనిషి పూర్తిగా భిన్నమైనవాడు. ఈ రోజుల్లో క్రీస్తు కోసం ఒక చిన్న అవమానం భరించడం,
ఒక పూట భోజనం మానెయ్యవలసి రావడం తమకేదో గొప్ప అన్యాయం జరిగిపోయినట్టు భావించే
ప్రసంగీకులకు కూడా పౌలు గారు చాలా భిన్నమైనవారే.
ఇక తర్వాత వచనంలో అంటున్నారు ఇవియును గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు
కలదు. ఈ భారము దిన దినమును నాకు కలుగుచున్నది. చూడండి సంఘాల కోసం ఎంతగా
ఆలోచిస్తున్నారో! ఇది ఒక తండ్రి హృదయం ఇంకా కాపరి తపన!!
“క్రీస్తు సంఘాలు అన్నిటిని”– కొరింథీ సంఘమొక్కటే కాదు,
వివిధ ప్రదేశాల్లో అతడు నాటిన సంఘాలు మాత్రమే కాదు, అతడెన్నడూ చూడని సంఘాల గురించి
(కొలొస్సయులకు 2:1) కూడా అతనికి భారంగా ఉంది. ఈ సంఘాలన్నీ క్రీస్తుతో సంబంధం గలవి,
ఆయన పేరుప్రతిష్ఠలతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి పౌలుగారి ఆలోచనలో వాటన్నిటితో తనకు కూడా సంబంధం ఉంది. ఒక
సంఘ కాపరిని కృంగదీయాలంటే ఒకే సంఘం యొక్క బరువు బాధ్యతలు చాలు. పౌలుకైతే అన్ని
సంఘాల గురించిన భారం, శ్రద్ధ ఉన్నాయి.
ఇక తర్వాత వచనంలో అంటున్నారు:
29. ఎవడైనను బలహీను డాయెనా? నేనును బలహీనుడను కానా? ఎవడైనను తొట్రుపడెనా?
నాకును మంట కలుగదా?
30. అతిశయ పడవలసియుంటే నేను నా బలహీనత విషయమైన సంగ తులనుగూర్చియే
అతిశయపడుదును.
కేవలం సంఘాలు మాత్రమే కాదు అతనిపై ఉన్నభారం. ఆ సంఘాల్లోని వ్యక్తులు కూడా.
“బలహీనత” అనగా – రోమీయులకు
15:1;
1. కాగా బలవంతులమైన మనము, మనలను మనమే సంతోషపరచుకొనక,
బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై యున్నాము.
1 కోరింథీయులకు 9:22.
22. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ
విధముచేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికి అన్నివిధముల వాడనైయున్నాను.
“మంట పుట్టదా అని ఎందుకు రాస్తున్నారు అంటే ”– క్రైస్తవులను ఇతరులెవరైనా
వారి నమ్మకంలో తొట్రుపడేలా చేస్తే పౌలుగారికి చాలా కోపం వచ్చింది. రోమీయులకు 12:15; గలతియులకు 6:2
లో తాను చెప్పిన మాటలను తానే నెరవేరుస్తున్నాడు. క్రైస్తవులకు బాధ కలిగితే పౌలుకు
బాధ కలిగింది. వారి బాధలను, సమస్యలను, కష్టాలను తనపై వేసుకున్నాడు. అతనికి దీన్ని
నేర్పించినది, ఇలా చేసేందుకు సామర్థ్యత ఇచ్చినది క్రీస్తే.
ఇక
చివరి మూడు వచనాలలో మరో విషయం రాస్తున్నారు తాను అనుభవించిన కష్టము కోసం: 31.
నేనబద్ధమాడుటలేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువగు యేసుయొక్క తండ్రియైన
దేవుడు ఎరుగును.
32. దమస్కులో అరెత అను రాజుక్రింద ఉన్న అధిపతి నన్ను
పట్టగోరి కావలియుంచి దమస్కీయుల పట్టణమును భద్రము చేసెను.
33. అప్పుడు నేను కిటికీగుండ గోడ మీదనుండి గంపలో దింపబడి
అతని చేతిలోనుండి తప్పించుకొనిపోతిని.
పౌలుగారు కష్టాలు, బాధల జాబితా కొరింతులో ఉన్న కొందరికీ
నమ్మరానిదిగా అనిపించవచ్చు. అందువల్ల దేవుని పేరట తాను సత్యం చెప్తున్నట్లుగా అతడు
వారికి గంబీరంగా చెప్తున్నారు. దీనికోసం అపో. కార్యములు 9:22-25లో వ్రాయబడింది.
అతడు
అతిశయంగా చెప్పుకున్న “బలహీనత” విషయాల్లో ఈ అవమానకరమైన అనుభవం ఒకటి మాత్రమే.
కష్టాలు, ప్రమాదాలు సహించేందుకు కావలసిన శక్తి తనలో లేదనీ, అలా సహించే శక్తి
ఇచ్చినది దేవుడేననీ, తాను గొప్పలు చెప్పుకోవడం దాని గురించే అనీ వారు అర్థం
చేసుకోవాలని కోరుతున్నాడు (2 కోరింథీయులకు 3:5; 2 కోరింథీయులకు 4:7).
కాబట్టి
నిజమైన బోధకులను నిజమైన బోధలను గుర్తెరుగుదాం! అంతే కాకుండా క్రీస్తు కోసం ఆయన
శ్రమానుభవములో పాలుపొందడానికి ఆయనకొరకు శ్రమలను సయిద్దామ!
దైవాశీస్సులు!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*162వ భాగము*
2 కొరింథీ 12:1—6
1. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయ పడవలసివచ్చినది. ప్రభువు
దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును.
2. క్రీస్తునందున్న యొక మనుష్యుని నేనెరుగుదును. అతడు
పదునాలుగు సంవత్సరములక్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను; అతడు శరీరముతో
కొనిపోబడెనో నేనెరుగను, శరీరములేక కొనిపోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియును.
3. అట్టి మనుష్యుని నేనెరుగుదును. అతడు పరదైసులోనికి
కొనిపోబడి, వచింప శక్యము కాని మాటలు వినెను; ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు.
4. అతడు శరీరముతో కొనిపోబడెనో శరీరములేక కొని పోబడెనో
నేనెరుగను, అది దేవునికే తెలియును.
5. అట్టివాని గూర్చి అతిశయింతును; నా విషయమైతేనో నా
బలహీనతయందే గాక వేరువిధముగా అతిశయింపను.
6. అతిశయపడుటకు ఇచ్ఛయించినను నేను సత్యమే పలుకుదును గనుక
అవివేకిని కాకపోదును గాని నాయందు ఎవడైనను చూచిన దానికన్నను నావలన వినినదానికన్నను
నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను
ప్రియులారా! మనం 2 వ కొరింథీ
పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!
ప్రియ దైవజనమా! ఇక 12వ
అధ్యాయంలో కూడా అబద్దబోధకుల గూర్చి ఇంకా
తన ఆపొస్తలత్వము కోసం రాస్తున్నారు! ఈ అధ్యాయంలో తనకు అపోస్తులుడు అనడానికి పూర్తి
చిహ్నాలు చెబుతూ అపోస్తులుడు అన్నవానికి ఎటువంటి సూచనలు పరిచర్యలు చేయాలో చెబుతూ
తనకున్న ప్రత్యక్షతలు ఏమిటో తెలియజేస్తున్నారు!
మొదటి అధ్యాయంలో అంటున్నారు అతిశయ పడుట నాకు తగదు గాని అతిశయ
పడవలసి వచ్చింది ఎందువిషయములో అంటే తనకు గల దర్శనములు మరియు ప్రత్యక్షతలు కోసం
ఇప్పుడు నేను చెబుతాను అంటున్నారు! దీనిని కొనసాగించే ముందు మీకు ఒక విషయం
చెప్పనీయండి! ఈ ఉత్తరం రాసే సమయానికి పౌలుగారు ఇంకా ఎఫెసీ పట్టణంలోనే ఉన్నారు,
ఇంకా ఎఫెసీ మరియు మాసిడోనియా ప్రాంతాలలో రాజ భాష అధికార భాష గ్రీకు కాబట్టి
కొరింథీ కూడా గ్రీకు దేశానికి చెందినది కాబట్టి గ్రీకు రచయితల బాణీలో అదే
సాహిత్యముతో రాస్తున్నారు! వారు ఏం చేసేవారు అంటే తాము రాసింది ఎవరో థర్డ్ పర్సన్
అనగా ఎవరో మూడో వ్యక్తి కధ చెబుతున్నట్లు మొత్తం చెప్పి చిట్టచివరి పేరాలో ఆ
వ్యక్తిని నేనే అనేవారు. అది తనకోసం కాదంటే ఆవ్యక్తి పేరు చెప్పేవారు! ఈ అధ్యాయంలో కూడా పౌలుగారు ఎవరో వ్యక్తి మూడవ
ఆకాశమునకు వెళ్ళి పరలోకంలో ఉన్న విషయాలు చూసి వచ్చినట్లు చెబుతున్నారు! అయితే ఆ
వ్యక్తి పౌలుగారు అని గ్రహించాలి! ఎందుకంటే నాకు కలిగిన దర్శనాలు ప్రత్యక్షతల కోసం
నేను చెబుతాను అన్నారు కాబట్టి- ఈ అధ్యాయంలో మొదటి ఆరు వచనాలలో ఉన్న వ్యక్తి
పౌలుగారే అని గ్రహించాలి!
సరే, ఇప్పుడు ఆయనకు కలిగిన ప్రత్యక్షతల కోసం చూసుకుందాం! తన
బలహీనతల గురించి అతిశయంగా చెప్పుకోవడం కూడా పౌలుగారికి ఇష్టం లేదు కానీ చెప్పుకోక తప్పలేదు తన
అపొస్తలత్వమునకు గుర్తులు చెప్పాల్సి వచ్చింది!– వ 11,19.
నిజానికి తనకు కలిగిన దర్శనాలు, ప్రత్యక్షతల గురించి చెప్పుకోవడం తనకు
వ్యక్తిగతంగా ఎలాంటి ప్రయోజనము లేదు. అది వారికేమీ సహాయం కూడా చెయ్యదు. అయితే
కొరింథిలో ఉన్న అబద్ధ బోధకులు అలాంటి వాటిగురించి అతిశయంగా చెప్పుకుంటుంటే (బహుశా
వారలా చేస్తూ ఉండి ఉండవచ్చు), ఈ విషయంలో కూడా తాను ఏ మాత్రం వారికి తీసిపోనని
చూపడం అవసరమని పౌలుగారికి అనిపించింది.
ఇక
తరవాత వచనాలు : 2. క్రీస్తునందున్న యొక మనుష్యుని
నేనెరుగుదును. అతడు పదునాలుగు సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను;
అతడు శరీరముతో కొనిపోబడెనో నేనెరుగను, శరీరములేక కొనిపోబడెనో నేనెరుగను, అది
దేవునికే తెలియును.
3. అట్టి మనుష్యుని నేనెరుగుదును. అతడు పరదైసులోనికి
కొనిపోబడి, వచింప శక్యము కాని మాటలు వినెను; ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు.
4. అతడు శరీరముతో కొనిపోబడెనో శరీరములేక కొని పోబడెనో
నేనెరుగను, అది దేవునికే తెలియును.
ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసిన విషయం చూడండి: రెండో వచనంలో
క్రీస్తునందున్న ఒక మనిషి నాకు తెలుసు అంటూ అతడు 14 సంవత్సరాల క్రిందట అనగా
సుమారుగా క్రీ. శ. 43 లో కావచ్చు- ఆ వ్యక్తి అనగా పౌలుగారు పరవశుడై మూడో ఆకాశమునకు
వెళ్ళారు. అయితే మూడో వచనంలో అంటున్నారు
అతడు పరదైసులోనికి కొనిపోబడి అనగా ఆత్మ ద్వారా పరదైసులోనికి కొనిపోబడి మనుష్యులు
వచింప శక్యము కాని మాటలు అనగా మనుషులు పలుక కూడాని లేక పలుకలేని మాటలు విన్నాడు
ఇంకా అంటున్నారు అట్టి మాటలు మనుషుడు పలుక కూడదు అంటున్నారు!
దీనిని బట్టి మనకు అర్ధమవుతుంది ఏమిటంటే మొదట ఇప్పుడు
పరదైసు ఎక్కడుంది? మూడో ఆకాశంలో ఉంది!
అసలు ఎక్కడ ఉండేది? భూమిమీద మనిషి పుట్టాక దేవదూతలు పాపం చేసే వరకు
పాతాళంలో ఒక భాగంగా ఉండేది పరదైసు! పాతాళం ఎక్కడుండేది? భూమి క్రింద! ఏమయ్యా నీవు
వెళ్ళి చూశావా? అని పొరపాటున నన్ను అడిగారో ఆనక- నాకేం తెలియదండీ బైబిల్ రాసి ఉంది
కాబట్టి నమ్ముతున్నాను! సామెతలు 15:24 లో క్రిందనున్న పాతాళమును తప్పించుకోడానికి
బుద్దిమంతుడు పరమునకు పోయే జీవమార్గంలో నడుస్తాడు అంటున్నారు!
ఇంకా యెషయా 14: 9
నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద
పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది భూమిలో
పుట్టిన సమస్త శూరులను జనముల రాజుల నందరినివారి వారి సింహాసనములమీదనుండి
లేపుచున్నది
ఈరెండు రిఫరెన్సుల ప్రకారం పాతాళము అనేది భూమిక్రింద ఉన్నది!
అది యేసుక్రీస్తు ప్రభులవారి మరణము వరకు మూడు భాగాలుగా ఉండేది!
మరలా అడగవచ్చు నీకు ఎలా తెలుసు మూడు భాగాలుగా ఉండేదని! అయ్యా దీనికి కూడా బైబిల్
లో రిఫరెన్సు ఉంది! లూకా సువార్తలో ధనవంతుడు లాజరు ఉపమానం చెబుతూ
యేసుక్రీస్తుప్రభులవారే తన నోటితో చెప్పారు కాబట్టి మనం నమ్మాలి ఆదంతే !! లూకా
16:19--31 లో ఆ ఉపమానం ఉంటుంది! ఈ ఉపమానంలో ఆ దరిద్రుడు అనగా లాజరు చనిపోయి
దేవదూతల చేత కొనిపోబడుటకు అబ్రహాము రొమ్మున కొనిపోబడెను అని ఉంది! దేవదూతల చేత
కొనిబడ్డాడు కాబట్టి మరియు అబ్రాహాము రొమ్ము అనగా పరదైసు అని గ్రహించాలి! టూకీగా
లాజరు పరదైసుకి కొనిపోబడ్డాడు! అయితే ధనవంతుడు పాతాళములో బాధపడుచున్నాడు అని 23 వ
వచనములో చెప్పబడింది! ఇప్పుడు వాడు పాతాళములో బాధలు పడలేక తండ్రివైన అబ్రహామా
నాయందు కనికర పడి లాజరుని పంపి తన చేతి వ్రేలి కొనతో నీళ్ళు నా నాలుకమీద
పొయ్యమంటాడు అబ్రహాము గారు కాదు పో అంటారు! ఏం అంటే మాకునూ మీకును మధ్య అగాధం ఉంది
అన్నారు! ఇప్పుడు పాతాళములో ఉన్నవారికి పరదైసు కనబడుతుంది అనగా పాతాళము అనేది మూడు
బాగాలుగా ఉండేది అని అర్ధమవుతుంది!
అవి ఏమిటి అంటే పాతాళము: ఇది సాతానుకి వాడి సైన్యం కోసం చేయబడింది!
అయితే మనిషి పాపం చేసి పరదైసుకి మరియు పరలోకం వెళ్ళకుండా సాతాను గాడి బానిసలుగా
మారిపోయారు కాబట్టి వాడుండే పాతాళమునకు పాపము చేసిన మనుషులు కూడా పోతున్నారు అని
అర్ధమవుతుంది!
ఇక రెండవది: పరదైసు! ఇది దేవునిలో నడిచి మరణించిన వారు
మరియు మంచి మనస్సాక్షితో ఏమాత్రం తప్పులు చేయని వారికోసం దేవుడు చేసిన గెస్ట్
హౌస్! లేక రెస్ట్ హౌస్! విశ్రాంతి స్థలము! ఎంతవరకు ఉండటానికి అంటే దేవుని తీర్పు
వరకు!
మూడవది: ఆగాధము లేక అబిస్! పరదైసులో ఉన్నవారు పాతాళములోనికి
వెళ్లలేకుండా వారు ఇక్కడకు రాకుండా దేవుడు ఏర్పరచిన ఒక హద్దు! అయితే కొంతమంది
దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు ఈ కటిక
భిలము లోనికి త్రోసినట్లు చూడగలం బైబిల్ లో!
అయితే ఇప్పుడు పరదైసులో ఇంకా మూడవ ఆకాశమునకు కొనిపోబడెను అని
పౌలుగారు అంటున్నారు! అనగా పాతాళము లో ఉండాల్సిన పరదైసు మూడో ఆకాశమునకు ఎలా
వెళ్ళిపోయింది అంటే యేసుక్రీస్తు ప్రభులవారు చనిపోయినప్పుడు మొదట పరదైసుకి వెళ్ళడం
జరిగినది అక్కడ ఉన్నవారికి యేసుక్రీస్తు ద్వారానే పరలోకం వెళ్లగలము మరియు
యేసురక్తంలో మనిషి కడగబడితేనే పరలోకం వెళ్తావు అనే ప్రోటోకాల్ యేసయ్య చెప్పి
వారిని ఈ ప్రోటోకాల్ కి ఒప్పింప జేసి చెరను అనగా పరదైసుని చెరను చెరగా తీసుకొని
పౌయి ఈవులను అనుగ్రహించినట్లు ఎఫెసీ 4:8 లో చెప్పబడింది అని ప్రత్యక్షతల గ్రంధం
అనే శీర్షికలో వివరించడం జరిగినది! కాబట్టి ఇప్పుడు పరదైసు ఎక్కడికి కొనిపోబడింది?
మూడవ ఆకాశమునకు కొనిపోబడింది! అనగా పాతాళము అనేది యేసుక్రీస్తుప్రభులవారి మరణం
వరకు మూడు బాగాలుగా ఉండేది, ఆయన మరణం తర్వాత పాతాళం రెండు భాగాలుగా మారి, ఒకభాగంగా
ఉన్న పరలోకం రెండు భాగాలుగా మారిపోయింది! పరలోకం మరియు పరదైసు!! ఎందుకంటే అక్కడ
కూడా ఇప్పుడు మరుగై ఉన్న మన్నా మరియు జీవజలములు దొరుకుతున్నాయి అంటే ఇది పరలోకంలో
భాగము అని గ్రహించాలి!
సరే ఇటువంటి పరదైసుకి వెళ్లడమే కాకుండా మనుషులు పలుకలేని మరియు
పలకకూడని మాటలు విన్నారు పౌలుగారు! బహుశా
అక్కడే అనేకమైన పరలోక మర్మాలు తెలుసుకుని గ్రహించారు అన్నమాట పౌలుగారు! అయితే అతడు
శరీరంతో ఉన్నారో శరీరం లేకుండా వెళ్లారో అతనికే తెలియదని ఒప్పుకుంటున్నారు! గాని
అతడు పరదైసు లేక మూడో ఆకాశములోని ఇంకా పరలోకం యొక్క దర్శనాలు పొందుకుని మరలా భూమి
మీదికి వచ్చినట్లు తెలుస్తుంది!
మరో
విషయం: ఆకాశాలు ఏడు ఉన్నాయని కొందరు
యూదులు బోధించారు. అయితే బైబిల్లో దేవుడు వెల్లడించిన సత్యంలో ఇలాంటిదానికి తావు
లేదు. మూడు ఆకాశాలే ఉన్నాయి! “మూడో ఆకాశం”
అనడంలో పౌలుగారి భావం అత్యున్నత ఆకాశం,
ఆధ్యాత్మిక లోకం, దేవుడు నివసించే ప్రదేశం, పరదైసు అనగా తెలుగులో పరమానంద నివాసం. పరమానంద నివాసం అనే పదం
క్రొత్త ఒడంబడిక గ్రంథంలో మూడు చోట్ల మాత్రమే కనిపిస్తుంది – ఇక్కడ, లూకా 23:43; ప్రకటన
గ్రంథం 2:7. చెప్పడానికి అనుమతి లేని విషయాలను పౌలు ఇక్కడ విన్నాడు.
ఇక్కడ
అంటున్నారు కొరింథీయులతోనూ ఇంకా అబద్ద బోధకులతోనూ అంటున్నారు నేను అలాంటి విషయాల
విషయమై అతిశయిస్తున్నాను గాని మీలాగా లోక విషయాల కోసం శరీరమును బట్టి అతిశయించడం
లేదు అంటున్నారు!
5. అట్టివాని గూర్చి అతిశయింతును; నా విషయమైతేనో నా
బలహీనతయందే గాక వేరువిధముగా అతిశయింపను.
6. అతిశయపడుటకు ఇచ్ఛయించినను నేను సత్యమే పలుకుదును గనుక
అవివేకిని కాకపోదును గాని నాయందు ఎవడైనను చూచిన దానికన్నను నావలన వినినదానికన్నను
నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను
మనుషులు వినగలిగిన, చూడగలిగిన వాటి మూలంగానే తన గురించి
అభిప్రాయాలు ఏర్పరచుకోవాలని పౌలుగారు
కోరారు గాని నిజమని వారు
నిరూపించలేని వాటి మూలంగా కాదు అంటున్నారు! మనము కూడా పరలోక సంబంధమైన వాటికోసమే
అతిశయిద్దాము మరియు ప్రయత్నం చేద్దాం!
దైవాశీస్సులు!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*163వ భాగము*
2 కొరింథీ 12:7—10
7. నాకు కలిగిన
ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము
నాకు శరీరములో ఒక ముల్లు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము, నన్ను
నలగగొట్టుటకు సాతానుయొక్క దూతగా ఉంచబడెను.
8. అది నాయొద్దనుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు
ప్రభువును వేడుకొంటిని.
9. అందుకునా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి
పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు
నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును
10. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు
నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవముల
లోను నేను సంతోషించుచున్నాను.
ప్రియులారా! మనం 2 వ కొరింథీ
పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!
ప్రియ దైవజనమా! ఇక 12వ అధ్యాయంలో కూడా అబద్దబోధకుల గూర్చి ఇంకా తన ఆపొస్తలత్వము
కోసం రాస్తున్నారు
చూడండి
7—10 వచనాలలో ఏమంతున్నారో 7. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా
ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముల్లు, నేను
అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము, నన్ను నలగగొట్టుటకు సాతానుయొక్క దూతగా
ఉంచబడెను.
ఇక
పౌలుగారి ఆపొస్తలత్వము నకు ఈ వచనాలు ఎలా ఉపయోగ పడతాయి అంటే:
వ 2-5లో పౌలుగారు తన
గురించే చెప్పుకుంటున్నట్టు ఇది రుజువు చేస్తున్నది. పౌలుగారు చూచిన దర్శనాలకంటే అతి తక్కువ స్థాయి దర్శనాలు,
ప్రత్యక్షతలు చూశామని అనుకున్న మనుషులు కొందరు గర్వంతో దురహంకారంతో నిండిపోయారు.
దేవుడు పౌలు గారికి చూపించిన ప్రత్యక్షతలను బట్టి అతనిలో గర్వం ఏర్పడే అవకాశం
ఉందని ఆయనకు తెలుసు. తన అపోస్తులుడిని , తన ప్రజల్లో ఎవరినైనా తనకు అసహ్యమైన గర్వంలో
పడకుండా ఎలా కాపాడుకోవాలో దేవునికి తెలుసు.
పౌలుగారు అడిగినదానిని
ప్రభువు దయ చేయలేదు. అంతకన్నా శ్రేష్ఠమైన దాన్ని ఇచ్చారు. ఒక వివరణనూ గొప్ప
వాగ్దానాన్నీ ఇచ్చాడు. వివరణ ఇది – పౌలు గారు
క్రీస్తుమూలంగా ఆధ్యాత్మికంగా బలపడదలచుకుంటే అతడు తనలో బలహీనుడై ఉండాలి. తన
బలహీనతను గ్రహించాలి. వాగ్దానం ఏమిటంటే పౌలుగారు
ఆ “ముల్లు”ను భరించగలిగేలా, తద్వారా ఆధ్యాత్మిక లాభం పొందేలా క్రీస్తు
చేస్తారని . దాన్ని భరించే శక్తి ఇవ్వకుండా ఏ బాధనైనా, కష్టాన్నైనా, ఆపదనైనా
ఎదుర్కోవాలని గానీ ఏమైనా పని చేయాలని గానీ బాధ్యత నెత్తిన వేసుకోవాలని గానీ దేవుడు
చెప్పడన్న విషయం మనకు సందేహం అక్కర లేదు. తన వారందరికీ, అన్ని పరిస్థితుల్లోనూ,
అన్ని తరాల్లోనూ ఆయన కృప చాలు. “అందుచేత”– మానవ
బలహీనతల్లో క్రీస్తుయొక్క ఆధ్యాత్మిక శక్తి పరిపూర్ణం అవుతుంది అన్న ప్రాముఖ్యమైన
పాఠాన్ని పౌలుగారు నేర్చుకున్నారు . క్రీస్తు
బలప్రభావాలు తనలో నిలిచి ఉండాలన్నది అతనికున్న తీవ్రమైన కోరికల్లో ఒకటి
(ఫిలిప్పీయులకు 3:10). కాబట్టి తన బలహీనతలను తనకు తెలియజేసే దేన్నైనా అతడు
భరించడానికి సంతోషంగా ఒప్పుకున్నాడు. మనం కూడా అంతేనా?
ఇంకా చెప్పుకోవాలంటే “క్రీస్తు కోసం” అనే మాటలు రాస్తున్నారు .
అతని జీవితం, పరిచర్య అంతా క్రీస్తు కోసమే. తనకోసం గాక క్రీస్తుకోసమే ఆయన
బలప్రభావాలు తనలో నిలిచి ఉండాలని కోరుతున్నాడు. అదే కారణాన్ని బట్టి ఆనందంగా
బాధలను కూడా ఎదుర్కొన్నారు .
“ఆనందిస్తాను” అనగా – తన బలహీనతలు, అవమానాలు, కష్టాలు,
హింసలు, కడగండ్లు వీటన్నిటినీ భరించగలిగితే, పండ్ల బిగువున వాటిని భరిస్తే
చాలనుకుంటారు చాలామంది విశ్వాసులు. అయితే అలాంటివాటి మూలంగా కలిగే గొప్ప
ఆధ్యాత్మిక లాభాల గురించి ఒక విశ్వాసి తెలుసుకుంటే వాటిలో ఆనందించగలుగుతాడు. దేవుని
విధానాలను తెలుసుకుంటే బాధ ఆనందాన్ని కలుగజేయగలదు (మత్తయి 5:11-12; అపో. కార్యములు
5:40-41; అపో. కార్యములు 16:22-25; 1 పేతురు 5:12-14 చూడండి). పౌలు ఆధ్యాత్మిక
శక్తిని గురించి, అంటే తనను సమర్థుడైన క్రీస్తు కోసం సేవకుడుగా తీర్చిదిద్దే
శక్తిని గురించి మాట్లాడుతున్నారు. పౌలు బలహీనంగా ఉన్నప్పుడే బలవంతుడు ఎందుచేత?
ఎందుకంటే తన బలహీనతను గుర్తించి ఇక తనపై, తన బలంపై, తెలివితేటలపై, సమర్థతపై
ఆధారపడడం మానుకున్నారు. కేవలం దేవునిపైనే ఆధారపడ్డారు.
2 కోరింథీయులకు 1:8-9; 1 కోరింథీయులకు 2:1-5 చూడండి. దేవుని శక్తిని
పొందడానికి మార్గం తన బలాన్ని పరిత్యజించి ఆయనలో నమ్మకం ఉంచడమే. యెషయా 40:28-31
చూడండి. సాధారణంగా మనుషుల ఆలోచనలకు ఇది సరిగ్గా వ్యతిరేకం.
చూడండి
మన బలహీనతలలో దేవుని కృప ఎంతగానో మనపట్ల విస్తరిస్తుంది! ఈ విషయం అర్ధం చేసుకోలేక
దేవుని మీద అలుగుతున్నాం మనం! దేవుడు మనలను వదిలేశాడేమో మనల్ని పట్టించుకోవడం
లేదేమో అని అనుకుంటున్నాము! గాని దేవునికృపను పరిపూర్ణంగా అర్ధం చేసుకోక అలాగా
అనుకుంటున్నాం! మనబలహీనత లందే దేవునిమీద పూర్ణంగా ఆనుకుంటే దేవుడు అద్భుతాలు
చేయగలము!
అట్టికృప
దేవుడు మనకు దయచేయును గాక!
ఆమెన్!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*164వ భాగము*
2 కొరింథీ 12:11—15
11.
నేనవివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేసితిరి. నేను మీచేత మెప్పు పొందవలసినవాడను,
ఏలయనగా నేను ఏమాత్రపువాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన యీ అపొస్తలులకంటె నేను
ఏ విషయములోను తక్కువ వాడను కాను.
12. సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయుటవలన,
అపొస్తలునియొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనుపరచబడెను.
13. నేను మీకు భారముగా ఉండకపోతినను విషయములో తప్ప, మరి ఏ
విషయములో మీరితర సంఘములకంటె తక్కువ వారైతిరి? నేను చేసిన యీ అన్యాయమును
క్షమించుడి.
14. ఇదిగో, యీ మూడవసారి మీయొద్దకు వచ్చుటకు సిద్ధముగా
ఉన్నాను; వచ్చినప్పుడు మీకు భారముగా నుండను. మీ సొత్తును కాదు మిమ్మునే
కోరుచున్నాను. పిల్లలు తలిదండ్రులకొరకు కాదు తలి దండ్రులే పిల్లలకొరకు ఆస్తి
కూర్చతగినది గదా
15. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మలకొరకు బహు సంతోషముగా
వ్యయ పరచెదను; నన్నును నేను వ్యయపరచుకొందును. నేను మిమ్మును ఎంత యెక్కువగా
ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా?
ప్రియులారా! మనం 2 వ కొరింథీ
పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!
ప్రియ దైవజనమా! ఇక 12వ అధ్యాయంలో కూడా అబద్దబోధకుల గూర్చి ఇంకా తన ఆపొస్తలత్వము
కోసం రాస్తున్నారు
ఇక
ఈ పత్రిక చివరికి వచ్చేశారు పౌలుగారు!
11. నేనవివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేసితిరి. నేను
మీచేత మెప్పు పొందవలసినవాడను, ఏలయనగా నేను ఏమాత్రపువాడను కాకపోయినను మిక్కిలి
శ్రేష్ఠులైన యీ అపొస్తలులకంటె నేను ఏ విషయములోను తక్కువ వాడను కాను.
12. సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయుటవలన,
అపొస్తలునియొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనుపరచబడెను.
నేను
కొంచెం ఆవివేకంగా మాట్లాడాను అతిశయంగా మాట్లాడాను ఎందుకంటే చెప్పడానికి మీరే నన్ను
బలవంతం చేశారు ఇంకా అంటున్నారు నేను మీచేత మెప్పు పొందాల్సిన వాడనే ఎందుకంటే నేను
మీరు నిజమైన అపోస్తులులు అని మీరు భ్రమపడుతున్న అబద్ధ
అపోస్టలుల కంటే మిగిలిన అపోస్తులుల కంటే ఏమాత్రం తక్కువ వాడను కాను ఎలా తక్కువ
వాడను కాను అంటే సూచక క్రియలు అద్భుతాలు చేయడం విషయంలోనూ మహత్కార్యాలు చేయుట వలన
అపోస్తులుని యొక్క చిహ్నాలు పూర్తిగా మీమధ్య ఋజువుగా కనిపించాయి అంటున్నారు!
గతాభాగాలులో చెప్పినట్లు సూచక క్రియలు అద్భుతాలు ఒకటి కావు! ఇక ఈ వచనంలో
అపోస్తులుడు అనేవాని వలన ఈ క్రియలు అన్నీ కనబడాలి! అనగా అతడు మొదట సువార్తికుడు
కాపరి అయి ఉండాలి! హెచ్చరించే వాడుగా ప్రవక్తగా భోధకునిగా ఉండాలి! అప్పుడు ఆ
వ్యక్తివలన సూచకక్రియలు అద్భుతాలు మహత్కార్యాలు జరగాలి అప్పుడే అతడు అపోస్తులుడు
అవుతాడు తప్ప నేటిరోజులలో జరుగుతున్నట్లు ప్రతీ ఒక్కడు డిగ్రీలు కొనుక్కుని
అపోస్టలుడు రెవరెండ్ ఇరవైరెండు అయిపోతున్నారు! వీరంతా దొంగబోధకులు!!!
దేవుడు ఆధ్యాత్మిక సత్యాలను నేర్పేందుకు క్రీస్తుద్వారా ఆయన
అపోస్తులుల ద్వారా “సూచనలు”
చూపించారు!
“మహత్కార్యాలు ”– అంటే ఆశ్చర్యం గొలిపే క్రియలు (మత్తయి 12:22-23; మత్తయి 15:31;
అపో. కార్యములు 2:12; అపో. కార్యములు 3:10).
“అద్భుతాలు”– అంటే అమానుషమైన మానవాతీతమైన శక్తితో క్రీస్తుఅపోస్తులులు చేసిన కార్యాలు. ఇవి “క్రీస్తు అపోస్టలుల సూచనలు”. దేవుడు వారిని ఎన్నుకుని పంపించాడనీ
వారు దేవుని సత్యాన్ని నేర్పించారనీ ఇవి సూచిస్తాయి (అపో. కార్యములు 5:12; అపో.
కార్యములు 14:3; హెబ్రీయులకు 2:4).
అపోస్టలుల కాలం అయిపోయింది. ఎప్పటికీ ఒకేసారి సత్యాన్ని స్థాపించడం, మన
కోసం దాన్ని క్రొత్త ఒడంబడిక గ్రంథంలో రాసి పెట్టడం జరిగిపోయింది.
ఇక
13వ వచనం లో అంటున్నారు నేను మీకు భారముగా ఉండకపోతినను విషయములో తప్ప, మరి ఏ
విషయములో మీరితర సంఘములకంటె తక్కువ వారైతిరి? నేను చేసిన యీ అన్యాయమును
క్షమించుడి.
“క్షమించండి”
అంటూ పౌలుగారు వ్యంగ్యంగా అంటున్నారు .
వారినుంచి సహాయమేమీ తీసుకోక పోవడంలో అతడు ఏ తప్పూ చేయలేదని అతనికి తెలుసు (2
కోరింథీయులకు 7:2).
2 కోరింథీయులకు 11
7. మిమ్మును హెచ్చింపవలెనని మీకు దేవుని సువార్తను ఉచితముగా
ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకొనినందున పాపము చేసితినా?
8. మీకు పరిచర్య చేయుటకై నేనితర సంఘములవలన జీతము
పుచ్చుకొని, వారి ధనము దొంగిలినవాడనైతిని.
9. మరియు నేను మీయొద్దనున్నప్పుడు నాకక్కర కలిగియుండగా
నేనెవనిమీదను భారము మోపలేదు; మాసిదోనియనుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి.
ప్రతి విషయములోను నేను మీకు భారముగా ఉండకుండ జాగ్రత్తపడితిని, ఇక ముందుకును
జాగ్రత్త పడుదును
10. క్రీస్తు సత్యము నాయందు ఉండుటవలన అకయ ప్రాంతములయందు
నేనీలాగు అతిశయ పడకుండ, నన్ను ఆటంకపరచుటకు ఎవరి తరముకాదు.
11. ఎందువలన? నేను మిమ్మును ప్రేమింపనందువలననా? దేవునికే
తెలియును.
12. అతిశయకారణము వెదకువారు ఏవిషయములో అతిశయించుచున్నారో, ఆ
విషయములో వారును మావలెనే యున్నారని కనబడునిమిత్తము వారికి కారణము దొరకకుండ
కొట్టివేయుటకు, నేను చేయుచున్న ప్రకారమే యిక ముందుకును చేతును.
1
కోరింథీయులకు
9:12. ఇతరులకు మీ పైని యీ అధికారములో పాలు కలిగినయెడల మాకు ఎక్కువ కలదు
గదా? అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు; క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను
కలుగజేయకుండుటకై అన్నిటిని సహించుచున్నాము.
13. ఆలయకృత్యములు జరిగించువారు ఆలయమువలన జీవనము చేయుచున్నా
రనియు, బలిపీఠమునొద్ద కనిపెట్టుకొని యుండువారు బలి పీఠముతో పాలివారై యున్నారనియు
మీరెరుగరా?
14. ఆలాగున సువార్త ప్రచురించువారు సువార్తవలన జీవింపవలెనని
ప్రభువునియమించియున్నాడు.
15. నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు; మీరు
నాయెడల యీలాగున జరుపవలెనని ఈ సంగతులు వ్రాయనులేదు. ఎవడైనను నా అతిశయమును నిరర్థకము
చేయుటకంటె నాకు మరణమే మేలు.
16. నేను సువార్తను ప్రకటించు చున్నను నాకు
అతిశయకారణములేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నామీద మోపబడియున్నది. అయ్యో, నేను
సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ.
17. ఇది నేనిష్టపడి చేసినయెడల నాకు జీతము దొరకును.
ఇష్టపడకపోయినను గృహనిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను.
18. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను
ప్రకటించునప్పుడు సువార్తయందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగ పరచుకొనకుండ
సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము.
మీకు భారముగా ఉండలేదు కాబట్టి నన్ను క్షమించండి అనగా సువార్త
ప్రకటనకు విశ్వాసుల కానుకలు అవసరమే గాని పౌలుగారు ఏ విషయంలో కూడా వారు తనను
తప్పుగా అనుకోకూడదు అని ఆలోచించి వారిదగ్గర ఒక పైసా కూడా తీసుకోలేదు!
అందుకే అంటున్నారు 2 కోరింథీయులకు
7:2. మమ్మును మీ హృదయములలో చేర్చుకొనుడి; మే మెవనికి అన్యాయము చేయలేదు,
ఎవనిని చెరుపలేదు, ఎవనిని మోసము చేయలేదు.
ఇక 14 వ వచనంలో అంటున్నారు ఇదిగో, యీ మూడవసారి మీయొద్దకు వచ్చుటకు
సిద్ధముగా ఉన్నాను; వచ్చినప్పుడు మీకు భారముగా నుండను. మీ సొత్తును కాదు మిమ్మునే
కోరుచున్నాను. పిల్లలు తలిదండ్రులకొరకు కాదు తలి దండ్రులే పిల్లలకొరకు ఆస్తి
కూర్చతగినది గదా
వారు ఇవ్వగలిగిన ధనం కన్నా వారి ప్రేమ, సహవాసం అతనికి ఎంతో ముఖ్యం –
2 కోరింథీయులకు 6:11-13. అతడా సంఘానికి తండ్రి వంటివాడు (1
కోరింథీయులకు 4:15). తమ పిల్లలపట్ల తండ్రుల బాధ్యతలు అతడు గుర్తించాడు. తన సమయం,
బలం, సమర్థతలతో సహా (2 కోరింథీయులకు 7:3) తనకున్నదంతా వారికోసం వెచ్చించేందుకు
అతడు సిద్ధమే. తన సేవకులందరిలోనూ దేవుడు చూడాలని ఆశించేది ఇదే. దేవుని ప్రజలకు
తాము ఏమివ్వగలమా అన్నదే వారి ఆశయమై ఉండాలి, వారినుంచి ఏమి పొందగలనూ అన్నది కాదు.
ఇక 15 వ వచనంలో అంటున్నారు
కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మలకొరకు బహు సంతోషముగా వ్యయ పరచెదను;
నన్నును నేను వ్యయపరచుకొందును. నేను మిమ్మును ఎంత యెక్కువగా ప్రేమించుచున్నానో అంత
తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా?
చూడండి ఇక్కడ సూటిగా అడుగుతున్నారు పౌలుగారు: మిమ్మల్ని ఇంత
ఎక్కువగా ప్రేమిస్తున్నాను అయితే మీరు ఎంతో తక్కువగా కనిపిస్తున్నాను మీకు అని
అడుగుతునారు!
యేసుక్రీస్తు ప్రభులవారు కూడా ఆడుతున్నారు ఈరోజు
నా పిల్లలారా నేను మిమ్మును ఎంతగానో ప్రేమిస్తున్నాను అందుకనే మీ తరుపున నేను బలై
పోయాను! నా రక్తం మొత్తం చిందించాను మరి దానికి నిదర్శనంగా నన్ను మరీ తక్కువగా
చూస్తారా?!!! తక్కువగా ప్రేమిస్తారా అని దేవుడు అడుగుతున్నాడు! నీవేమి జవాబు
చెబుతావు ఇప్పుడు దేవునికి!!!
దైవాశీస్సులు!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*165వ భాగము*
2 కొరింథీ 12:16—21
16. అది ఆలా గుండనియ్యుడి. నేను మీకు భారముగా ఉండలేదు గాని
యుక్తిగలవాడనై మిమ్మును తంత్రము చేత పట్టుకొంటిని అని చెప్పుదురేమో.
17. నేను మీ యొద్దకు పంపినవారిలో ఎవనివలననైనను మిమ్మును మోసపుచ్చి
ఆర్జించుకొంటినా?
18. మీయొద్దకు వెళ్లుటకు తీతును హెచ్చరించి అతనితోకూడ ఒక
సహోదరుని పంపితిని. తీతు మిమ్మును మోసపుచ్చి యేమైన ఆర్జించుకొనెనా? మేమొక్క
ఆత్మవలననే ఒక్క అడుగు జాడలయందే నడుచుకొనలేదా?
19. మేమింతవరకు మా విషయమై మీకు సమాధానము చెప్పుకొనుచున్నామని
మీకు తోచునేమో. దేవుని యెదుటనే క్రీస్తునందు మాటలాడుచున్నాము; ప్రియులారా, మీ
క్షేమాభివృద్ధికొరకు ఇవన్నియు చెప్పు చున్నాము.
20. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకిష్టులుగా
ఉండరేమో అనియు, నేను మీకిష్టుడనుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును అసూయయు క్రోధములును
కక్షలును కొండెములును గుసగుసలాడుటలును ఉప్పొంగుటలును అల్లరులును ఉండు నేమో అనియు,
21. నేను మరల వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను
చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపముచేసి తాము జరిగించిన అపవిత్రత జారత్వము పోకిరి
చేష్టల నిమిత్తము మారుమనస్సు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అనియు
భయపడుచున్నాను.
ప్రియులారా! మనం 2 వ కొరింథీ
పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!
ప్రియ దైవజనమా! ఇక 12వ అధ్యాయంలో కూడా అబద్దబోధకుల గూర్చి ఇంకా తన ఆపొస్తలత్వము
కోసం రాస్తున్నారు! ఇక ఈ 16 వ వచనంలో మరో కోణంలో చెబుతున్నారు! నేను మీకు భారంగా
ఉండలేదు! గాని ఉపాయంగా తంత్రముచేసి పట్టుకుంటున్నాడు అని అబద్ధ బోధకులు
అంటున్నారు! ఏమి పట్టుకున్నారు అంటే యుక్తిగా ధనము ఆర్జిస్తున్నాడు అని చెప్పడం
మొదలుపెట్టారు! – “పౌలుగారు సంఘం నుంచి
డబ్బేమీ పుచ్చుకోలేదు. నిజమే. అయితే జెరుసలంలో ఉన్న క్రైస్తవులకోసం వారిని
చందాలెత్తి పంపించమనడంలో అతని ఉద్దేశమంతా కొంత డబ్బు చేజిక్కించుకుని తనకోసమే
వాడుకోవడం; తీతు, వేరొక సోదరుడు ఇందులో అతనిలో లాలూచీ పడ్డారు” అన్నారు! ఇక్కడ పౌలుగారు
వారిని ప్రశ్నిస్తున్నారు – ఈ అపనింద నిజమనేందుకు ఏమైనా
ఆధారం ఉందా? పౌలు ఈ చందా విషయంలో ఇంత జాగ్రత్తగా ఇంత జ్ఞానయుక్తంగా ఉన్నది
ఇందువల్లనే
(2 కోరింథీయులకు 8:16-21; 1 కోరింథీయులకు 16:1-4).
20. మరియు మేమింత విస్తారమైన ధర్మము విషయమై పరిచారకులమై
యున్నాము గనుక దానినిగూర్చి మామీద ఎవడును తప్పు మోపకుండ మేము జాగ్రత్తగా
చూచుకొనుచు అతనిని పంపుచున్నాము.
21. ఏలయనగా ప్రభువు దృష్టియందు మాత్రమే గాక మనుష్యుల
దృష్టియందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము.
1 కోరింథీయులకు 16
1. పరిశుద్ధులకొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు
నియమించిన ప్రకారము మీరును చేయుడి.
2. నేను వచ్చినప్పుడు చందా పోగుచేయకుండ ప్రతి ఆదివారమున
మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తనయొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను.
3. నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని యెంచి
పత్రికలిత్తురో, వారిచేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును.
4. నేను కూడ వెళ్లుట యుక్తమైనయెడల వారు నాతో కూడ వత్తురు.
ఇంతగా
జాగ్రత్తపడినా ఇంకా పౌలుగారు ఒక మోసగాడు అని నిరూపించడానికి ప్రయత్నం చేసి ఆయనను
మోసగాడు అనే అపనింద వేశారు!
అందుకే 17 వ వచనంలో అడుగుతున్నారు నేను మీ యొద్దకు పంపినవారిలో
ఎవనివలననైనను మిమ్మును మోసపుచ్చి ఆర్జించుకొంటినా? నేను మీవద్ద ఉన్నప్పుడు నా
చేతులతో కష్టపడి మీకు సువార్త ప్రకటించాను అని మొదటి కొరింథీ పత్రికలో పత్రికలో
రాశారు! నేను మీ వద్ధ ఉన్నప్పుడు ఏమీ సంపాదించుకోలేదు మిమ్మల్ని మోసం చెయలేదు
ఎవరిని ఏమీ అడగలేదు, ఇక 18 వ వచనంలో అంటున్నారు: నేను తీతుని మరో సహోదారుని
పంపించాను వారు మీనుండి ఏమైనా అన్యాయముగా దోచుకున్నారా అని అడుగుచున్నారు!
మీయొద్దకు వెళ్లుటకు తీతును హెచ్చరించి అతనితోకూడ ఒక సహోదరుని పంపితిని. తీతు
మిమ్మును మోసపుచ్చి యేమైన ఆర్జించుకొనెనా? మేమొక్క ఆత్మవలననే ఒక్క అడుగు జాడలయందే
నడుచుకొనలేదా?
మేము అనగా నేను మరియు తీతు మరియు మరో సహోదరుడు మేమంతా ఒకే ఆత్మద్వారా
ఒకేవిధంగా నడుచుకోలేదా అంటున్నారు! మేము క్రీస్తు యొక్క మరియు పరిశుద్ధాత్ముని
అడుగుజాడలలో నడుచుకోవడం లేడా అంటున్నారు!!!
ఇంకా
అంటున్నారు: 19. మేమింతవరకు మా విషయమై మీకు
సమాధానము చెప్పుకొనుచున్నామని మీకు తోచునేమో. దేవుని యెదుటనే క్రీస్తునందు
మాటలాడుచున్నాము; ప్రియులారా, మీ క్షేమాభివృద్ధికొరకు ఇవన్నియు చెప్పు చున్నాము.
ఈ ఉత్తరంలో పౌలుగారు
“అతిశయంగా” మాట్లాడ్డానికీ, తాను అపోస్తులుడుగా నిరూపించడానికి కారణం ఇదే. వారు తనను అపార్థం
చేసుకోకూడదు. వారేదో న్యాయాధికారులైనట్టు పౌలుగారి వారిముందు తన వాదం వినిపించలేదు (1
కోరింథీయులకు 4:1-5). వారితో చెప్పవలసి వచ్చిన మాటలన్నీ, ఈ అతిశయం మాటలతో సహా
(2కోరింథీయులకు 1:12), వారి మేలుకోసమే, తన కోసం కాదు. అతణ్ణి అతడుగా – అంటే క్రీస్తు అపోస్తులునిగా
– వారికి వారుగా స్వీకరించడం
కోసమే ఇలా చెబుతున్నారు! , అతడు నేర్పించిన సత్యాన్ని పాటించడం ద్వారా వారి
ఆధ్యాత్మిక జీవితంలో వారు బలపడతారు.
ఇక 20 వ వచనంలో అంటున్నారు 20. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు
మీరు నాకిష్టులుగా ఉండరేమో అనియు, నేను మీకిష్టుడనుగా ఉండనేమో అనియు, ఒకవేళ
కలహమును అసూయయు క్రోధములును కక్షలును కొండెములును గుసగుసలాడుటలును ఉప్పొంగుటలును
అల్లరులును ఉండు నేమో అనియు,
చూడండి అసలు విషయం ఇప్పుడు చెబుతున్నారు: అక్కడి సంఘం కొన్ని
విషయాల్లో బలహీనమైనదనీ, చీలికల విషయంలో లైంగిక పాపాల విషయంలో దోషి అనీ
పౌలుగారికి బాగా తెలుసు (1 కోరింథీయులకు
1:11-12; 1 కోరింథీయులకు 3:3; 1 కోరింథీయులకు 4:18; 1 కోరింథీయులకు 5:2, 1
కోరింథీయులకు 5:11; 1 కోరింథీయులకు 6:15-16; 1 కోరింథీయులకు 8:1; 1 కోరింథీయులకు
11:18, 1 కోరింథీయులకు 11:22). వారు గనుక తననూ, తాను నేర్పిన సత్యాన్నీ
తిరస్కరిస్తే పరిస్థితి మరింత చెడ్డదవుతుందని, తాను వారిని సందర్శించే సమయం అది
తనకు, వారికి కూడా విచార కారణం అవుతుందని పాలు గారి భయం. అంతేకాకుండా చివరి వచనంలో అంటున్నారు నేను మరల వచ్చినప్పుడు నా
దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపముచేసి తాము జరిగించిన
అపవిత్రత జారత్వము పోకిరి చేష్టల నిమిత్తము మారుమనస్సు పొందని అనేకులను గూర్చి
దుఃఖపడవలసి వచ్చునేమో అనియు భయపడుచున్నాను.
వారు అనగా కొరింథీ సంఘములో అనేకులు అబద్ద బోధకుల మాటలు విని
సత్యమునుండి తిరిగినా తనను అబద్ధికుడు మోసగాడు అని చెబుతున్నా కోపపడక ఎంతో శాంతంగా
మాట్లాడుతూ వారు విశ్వాస బ్రష్టులు కాకూడదని ఎంతో ప్రేమతో ఓర్పుతో
మాట్లాడుతున్నారు ఇక్కడ! నేను మూడో సారి
మీదగ్గరికి రావాలని అనుకుంటున్నారు అయితే అలా వచ్చినప్పుడు ఒకవేళ మీరు ఇంకా ఆ
పాపములలో ఉంటే నేను ఎంతగానో ఏడ్వాల్సి వస్తుంది! ఇంకా నేను కోపంతో ఏమైనా అంటే మీరు
బాధపడతారు! ఇంకా ఇప్పటికే చాలామంది తప్పుడు బోధకుల మాటలు విని నేనొక మోసగాడ్ని
అబద్ద ఆపొస్తలుడని ప్రచారం చేయగా కొందరు నమ్ముతున్నారు, అప్పుడు నేను నిజమైన
బోధకుడని ఆపొస్తలుడని వారిముందర నిరూపించే విధానం లో మనమధ్య బేధాలు వాదనలు కలిగితే
ప్రేమ పోయి ద్వేషము వస్తుంది కాబట్టి అలాంటివి రాకుండా ముందుగానే మిమ్మును
హెచ్చరిస్తున్నాను అంటూ సవినయంగా చెబుతున్నారు! ఇదే తండ్రి మనస్సు! తనను అవమానించినా
వారు పాడై పోకూడదని ఆయన తపన! ఇలాంటి ఓర్పు ఆత్మలభారం ప్రతీ దైవజనునికి ప్రతీ
కాపరికి దేవుడు దయచేయును గాక!
ఆమెన్!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*166వ భాగము*
2 కొరింథీ 13:1—5
1. ఈ మూడవ సారి
నేను మీయొద్దకు వచ్చుచున్నాను ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచ
బడవలెను.
2. నేను మునుపు చెప్పితిని; నేనిప్పుడు మీయొద్ద లేకున్నను
రెండవసారి మీయొద్దనున్నట్టు గానే, మునుపటినుండి పాపము చేయుచుండిన వారికిని మిగిలిన
వారికందరికిని ముందుగా తెలియజేయునదేమనగా, నేను తిరిగి వచ్చినయెడల కనికరము చూపను.
3. క్రీస్తు నాయందు పలుకుచున్నాడని ఋజువు కోరుచున్నారా? ఆయన
మీయెడల బలహీనుడు కాడు గాని, మీయందు శక్తిమంతుడై యున్నాడు.
4. బలహీనతనుబట్టి ఆయన సిలువవేయబడెను గాని, దేవుని
శక్తినిబట్టి జీవించుచున్నాడు. మేమును ఆయనయందుండి బలహీనులమై యున్నాము గాని, మీ
యెడల దేవుని శక్తినిబట్టి, ఆయనతో కూడ జీవముగల వారము.
5. మీరు విశ్వాసముగలవారై యున్నారో లేదో మిమ్మును మీరే
శోధించుకొని చూచు కొనుడి; మిమ్మును మీరే పరీక్షించుకొనుడి; మీరు భ్రష్టులు
కానియెడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మును గూర్చి మీరే యెరుగరా?
ప్రియులారా! మనం 2 వ కొరింథీ
పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!
ప్రియ దైవజనమా! ఇక 13 వ అధ్యాయంలో అబద్ద బోధకుల కోసం వదిలి నేను మూడోసారి
రాబోవుచున్నాను! మీ ప్రవర్తన వలన నన్ను ఆయాసపెట్టవద్దు అని రాస్తూ ఎవరైతే తనకోసం
వదరుతూ చెబుతున్నారో వారికి వార్నింగ్ ఇస్తున్నారు ఈ అధ్యాయంలో!
1. ఈ మూడవ సారి
నేను మీయొద్దకు వచ్చుచున్నాను ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచ
బడవలెను.
నేను
మూడోసారి వస్తునాను! ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట వచ్చిన ప్రతీమాట స్థిరపరచ బడాలి
అని పాత నిబంధనలో చెప్పిన మాటలను మరోసారి గుర్తుకు చేస్తున్నారు ఇక్కడ! ఈ మాట
ఉదాహరించడానికి కారణం వారేమిటో తానేమిటో
అన్న సత్యం ఇప్పుడు చక్కగా స్థిరపడింది; వేరే సాక్ష్యాధారాలు ఇస్తూ జాగుచేయవలసిన
అవసరం ఇక లేదని పౌలుగారి భావం కావచ్చు.
ద్వితీయోపదేశకాండము 19
15. ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే గాని యే
పాపమునుగూర్చియే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. ఇద్దరు సాక్షుల
మాటమీదనైనను ముగ్గురు సాక్షుల మాటమీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును.
2. నేను మునుపు చెప్పితిని; నేనిప్పుడు మీయొద్ద లేకున్నను
రెండవసారి మీయొద్దనున్నట్టు గానే, మునుపటినుండి పాపము చేయుచుండిన వారికిని మిగిలిన
వారికందరికిని ముందుగా తెలియజేయునదేమనగా, నేను తిరిగి వచ్చినయెడల కనికరము చూపను
అంటున్నారు
ఇక
తర్వాత వచనాలలో అంటున్నారు: 3. క్రీస్తు నాయందు
పలుకుచున్నాడని ఋజువు కోరుచున్నారా? ఆయన మీయెడల బలహీనుడు కాడు గాని, మీయందు
శక్తిమంతుడై యున్నాడు.
4. బలహీనతనుబట్టి ఆయన సిలువవేయబడెను గాని, దేవుని
శక్తినిబట్టి జీవించుచున్నాడు. మేమును ఆయనయందుండి బలహీనులమై యున్నాము గాని, మీ
యెడల దేవుని శక్తినిబట్టి, ఆయనతో కూడ జీవముగల వారము.
కొంతమంది తన అపొస్తలత్వమునకు “రుజువు కావాలి” అన్నారు – ఈ ఉత్తరంలో తన ఆపొస్తలత్వము గురించి పౌలుగారు వాదించినది ఇందుకే. అధికారం, ప్రభావం అనేవి సాత్వికం, మృదుత్వాలకు బదులుగా
బలప్రధర్శన అతడు ప్రదర్శించాలని వారు
కోరితే అలానే ప్రదర్శించడానికి సిద్దంగా ఉన్నారు. తనలో వారికి కనిపిస్తున్న బలహీనత
వారికి అభ్యంతరం కలిగించింది (2 కోరింథీయులకు 10:10; 1 కోరింథీయులకు 2:3). వారు
క్రీస్తు ప్రభావం ఎలాంటిదో తెలుసుకుంటారు. క్రీస్తు కూడా బలహీనంగానే మనుషులకు
అనిపించాడు (“బలహీనత కారణంగా సిలువ మరణానికి గురయ్యాడు”). అయితే పునరుత్థాన
శక్తితో వారి మధ్య జీవిస్తున్నాడు. వారు పశ్చాత్తాప పడకపోతే కొరింథీవారి విషయంలో
వ్యవహరించడంలో పౌలుగారు కూడా ఈ శక్తినే
ప్రదర్శిస్తారు . అయితే మరోసారి తాను ఏది చేసినా అది వారి ఆధ్యాత్మిక అభివృద్ధి
కోసమే (2 కోరింథీయులకు 12:19) అని నొక్కి చెప్తున్నారు .
ఇక “మృదువుగా ఉండను”– అని ఎందుకు
అంటున్నారు అంటే 1 కోరింథీయులకు 4:18-21; 1 కోరింథీయులకు 5:3-5. క్రీస్తుఅపోస్తులునిగా తనకున్న అధికారాన్ని ఉపయోగించి అక్కడున్న
అపరాధులకు శిక్ష పడేలా చూస్తానని అర్థం.
ఇక ఈ అధ్యాయంలో ఉన్న ముఖ్య వచనం: మీరు విశ్వాసముగలవారై యున్నారో
లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచు కొనుడి; మిమ్మును మీరే పరీక్షించుకొనుడి;
మీరు భ్రష్టులు కానియెడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మును గూర్చి మీరే
యెరుగరా?
మనము విశ్వాసము గలిగి ఉన్నామో లేదో పరీక్షించి చూసుకోండి
అంటున్నారు! మనకు మనము చాలా భక్తిపరులము గాను యధార్ధవంతులు గాను కనిపిస్తాము!
మిగలిన వారితో పోల్చుకుని నేను వారికంటే పరవాలేదు అనుకుంటాము గాని అది
దేవునిదృష్టిలో భయాంకరమైన పాపము కావచ్చు! అందుకే మీరు విశ్వాసము గలవారో కాదో
పరీక్షించి చూసుకోండి అంటున్నారు! మరి దేనితో పోల్చుకోవాలి! మన ప్రవర్తన బైబిల్
లేఖనాలతో పోల్చుకుని అప్పుడు తేల్చుకోవాలి!
గమనించాలి: వారు పౌలుగారిని
పరిశోధించే ప్రయత్నం చేస్తూ, క్రీస్తు అతని ద్వారా మాట్లాడుతున్నాడో లేదో
రుజువుల కోసం చూస్తున్నారు (వ 3). వారు తమను తాము పరిశోధించుకుంటే మంచిదని
పౌలుగారు అంటున్నారు . అందులో వారు నెగ్గి
క్రీస్తు వారిలో ఉన్నాడని రూఢి చేసుకుంటే గనుక అతడు కూడా (వారి ఆధ్యాత్మిక తండ్రి
అయిన పౌలుగారు – 1 కోరింథీయులకు 4:15) ఆ పరీక్ష గెలిచాడని వారు గుర్తుంచుకోవాలి. ఆ
పరీక్ష ఏమిటి? క్రైస్తవులు తమను తాము ఎందుకు పరీక్షించుకోవాలి? ఎలా
పరీక్షించుకోవాలి? తాము విశ్వాసంలో ఉన్నామో లేమో చూచుకోవడమే ఈ ఆత్మ పరీక్ష
ఉద్దేశం. అంటే మనం దేవుని సత్యాన్ని అంగీకరించి, నమ్మి, ఆచరిస్తున్నామా? మనం నిజ
క్రైస్తవులమేనా లేక పేరుకు మాత్రమేనా? ఈ పరీక్ష చేసుకోవడమెలా? మన హృదయాల్లోకి
తొంగి చూచుకొని అక్కడేముందని చూడడం ద్వారా కాదు (అలా చూచుకుంటే రోమీయులకు 7:18,
రోమీయులకు 7:21 లో ఉన్నట్టుగా మాత్రమే కనిపించవచ్చు);
రోమీయులకు 7
18. నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని
నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు
కలుగుటలేదు.
రోమీయులకు 7
21. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక
నియమము నాకు కనబడుచున్నది.
ఇంకా మన మనోభావాలను పరీక్షించుకోవడం కూడా కాదు ఈ పరీక్ష (మన
మనోభావాలు ఉయ్యాలలూగుతుంటాయి. కాబట్టి మన ఆధ్యాత్మిక స్థితిని నిర్ణయించడానికి అవి
సరైన సాధనం కాదు). మన అనుభవాల ద్వారా, దేవుని వాక్కు ద్వారా, మనం దానికి విధేయులమా
అవిధేయులమా అనేదాని ద్వారా మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఒక చెట్టుకున్న కాయల్ని
బట్టే ఆ చెట్టును గుర్తించగలం (మత్తయి 7:16-20; హెబ్రీయులకు 6:9-10). మనకు
క్రీస్తుతో ఎలాంటి అనుభవం లేకపోతే మన జీవితం, ఆలోచనలు, చర్యలు దేవుని
వాక్యానికి భిన్నంగా ఉంటే మనం క్రీస్తుకు
చెందినవారమని ఆధారమేమిటి? కానీ మనకు క్రీస్తుతో కొంతైనా అనుభవం ఉంటే, ఆయన
వాక్యముకు లోబడాలని మనస్పూర్తిగా ప్రయత్నిస్తూ ఉంటే (మన ప్రయత్నాలు అప్పుడప్పుడు
బలహీనమైనవిగా, విఫలమైపోయేవిగా ఉన్నా), దేవుడిచ్చే పాపవిముక్తి పొందడానికి ఏమి
చెయ్యాలని బైబిలు చెప్తున్నదో అది మనం చేసి ఉంటే క్రీస్తు మనలో ఉన్నాడని
తెలుసుకోగలం. 1 యోహాను 5:9-13; 1 యోహాను 2:4; 1 యోహాను 3:10, 1 యోహాను 3:14, 1
యోహాను 3:24 చూడండి. విశ్వాసంలో ఉన్నామని రూఢి చేసుకునేందుకు మనం చెయ్యవలసినదంతా
చెయ్యాలి – హెబ్రీయులకు 6:11; 2 పేతురు 1:10. మనం ఈ పరీక్ష నెగ్గలేకపోతే
నిరాశపడకూడదు. దానికి బదులుగా మన పాపాలకు పశ్చాత్తాపపడి మన హృదయమంతటితో మనసారా
క్రీస్తు వైపుకు తిరిగి ఆయనను నమ్మి స్వీకరించాలి. “క్రీస్తు మీలో”– యోహాను 17:23; రోమీయులకు 8:9-10; కొలొస్సయులకు 1:27; ప్రకటన
గ్రంథం 3:10.
కాబట్టి మనము కూడా మనల్ని మనం పరీక్షించు కుందాం! దేనితో?
వాక్యముతో!! అప్పుడు వాక్యము మరియు పరిశుద్ధాత్ముడు మనమీద ఏమైనా నేరం మోపితే
వెంటనే మనల్ని మనం సరిచేసుకుందాం! దేవుని దగ్గర పశ్చాత్తాపంతో క్షమాపణ వేడుకొందాం!
దైవాశీ
స్సులు!
*కొరింథీయులకు వ్రాసిన పత్రికలు*
*167వ భాగము*
2 కొరింథీ 13:6 —14
6. మేము
భ్రష్టులము కామని మీరు తెలిసికొందురని నిరీక్షించుచున్నాను.
7. మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండవలెనని దేవుని ప్రార్థించు
చున్నాము; మేము యోగ్యులమైనట్టు కనబడవలెననికాదు గాని, మేము భ్రష్టులమైనట్టు
కనబడినను మీరు మేలైనదే చేయవలెనని ప్రార్థించుచున్నాము.
8. మేము సత్యమునకు విరోధముగా ఏమియు చేయనేరము గాని, సత్యము
నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము.
9. మేము బల హీనులమై యున్నను మీరు బలవంతులై యుండినయెడల
సంతోషించెదము. దీని నిమిత్తమే, అనగా మీరు సంపూర్ణులు కావలెననియే
ప్రార్థించుచున్నాము.
10. కాబట్టి నేను మీయొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక,
మిమ్మును కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారముచొప్పున కాఠిన్యము
కనపరచకుండునట్లు దూర ముగా ఉండగానే యీ సంగతులు వ్రాయుచున్నాను.
11. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై యుండుడి,
ఆదరణ కలిగియుండుడి, ఏకమనస్సుగలవారై యుండుడి సమాధానముగా ఉండుడి; ప్రేమ సమాధాన ములకు
కర్తయగు దేవుడు మీకు తోడైయుండును.
12. పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకరికి ఒకరు వందనములు
చేసికొనుడి.
13. పరిశుద్ధులందరు మీకు వందనములు చెప్పుచున్నారు.
14. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు
పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.
ప్రియులారా! మనం 2 వ కొరింథీ
పత్రికను ధ్యానం చేసుకుంటున్నాము!
ప్రియ దైవజనమా! ఇక 13వ అధ్యాయంలో అబద్ద బోధకుల కోసం వదిలి నేను మూడోసారి
రాబోవుచున్నాను! మీ ప్రవర్తన వలన నన్ను ఆయాసపెట్టవద్దు అని రాస్తూ ఎవరైతే తనకోసం
వదరుతూ చెబుతున్నారో వారికి వార్నింగ్ ఇస్తున్నారు ఈ అధ్యాయంలో!
ఇక
ఈ పత్రికల చివరకు వచ్చేశాము మనము!
6. మేము
భ్రష్టులము కామని మీరు తెలిసికొందురని నిరీక్షించుచున్నాను.
7. మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండవలెనని దేవుని ప్రార్థించు
చున్నాము; మేము యోగ్యులమైనట్టు కనబడవలెననికాదు గాని, మేము భ్రష్టులమైనట్టు
కనబడినను మీరు మేలైనదే చేయవలెనని ప్రార్థించుచున్నాము.
ఇక్కడ
పౌలుగారు మళ్ళీ తన ఆలోచనల్లో వారినే ముందు
పెట్టారు . అతడు దేవుని ఎదుట సరిగా లేడని వారు భావిస్తున్నప్పటికీ వారు మాత్రం
దేవుని ఎదుట సరిగా ఉండాలని పౌలుగారు
కోరుతున్నారు! వారు దేవునితో యథార్థంగా
ఉండగలిగితే తనను వారెలా చూచినా పౌలుగారి కేమీ బాధ లేదు. ఏది ఎలా ఉన్నా
పౌలుగారు మాత్రం సత్యం పక్షంగానే
ఉంటారు (1 కోరింథీయులకు 9:23; 2 తిమోతికి
2:10).
ఇక
తర్వాత వచనాలలో 8. మేము సత్యమునకు విరోధముగా ఏమియు
చేయనేరము గాని, సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము.
9. మేము బల హీనులమై యున్నను మీరు బలవంతులై యుండినయెడల
సంతోషించెదము. దీని నిమిత్తమే, అనగా మీరు సంపూర్ణులు కావలెననియే
ప్రార్థించుచున్నాము.
చూడండి
మేము ఏమిచేసినా సత్యం కోసం అనగా దేవుని కోసం ఆయన సువార్త కోసం, విశ్వాసుల
ఆధ్యాత్మిక ఉన్నటికోసమే చేస్తున్నాము అంటున్నారు!
ఇక
మేము బలహీనులం అనడానికి కారణం
2 కోరింథీయులకు 4:12;
12. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి.
1 కోరింథీయులకు
4:9-13.
9. మరణదండన విధింపబడినవారమైనట్టు దేవుడు అపొస్తలులమైన
మమ్మును అందరికంటె కడపట ఉంచియున్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకును
దేవదూతలకును మనుష్యులకును వేడుకగా నున్నాము.
10. మేముక్రీస్తు నిమిత్తము వెఱ్ఱివారము, మీరు క్రీస్తునందు
బుద్ధిమంతులు; మేము బలహీనులము, మీరు బలవంతులు; మీరు ఘనులు, మేము ఘనహీనులము.
11. ఈ గడియవరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము;
పిడిగుద్దులు తినుచున్నాము; నిలువరమైన నివాసములేక యున్నాము;
12. స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము. నిందింప బడియు
దీవించుచున్నాము; హింసింపబడియు ఓర్చు కొనుచున్నాము;
13. దూషింపబడియు బతిమాలుకొను చున్నాము లోకమునకు మురికిగాను
అందరికి పెంటగాను ఇప్పటివరకు ఎంచబడియున్నాము.
“పరిపూర్ణులు”– అనగా 2
కోరింథీయులకు 7:1;
1. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని
భయముతో పరిశుద్ధతను సంపూర్తిచేసి కొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త
కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము.
మత్తయి 5:48. మీ
పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు.
కాబట్టి మనము ఇతర విశ్వాసులను పరిపూర్ణులుగా చేయవలసిందని
మనం దేవుణ్ణి ప్రార్థిస్తున్నామా?
10. కాబట్టి నేను మీయొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక,
మిమ్మును కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారముచొప్పున కాఠిన్యము
కనపరచకుండునట్లు దూర ముగా ఉండగానే యీ సంగతులు వ్రాయుచున్నాను.
మొదటి
పత్రికలో కూడా ఇదే విషయాన్ని రాస్తున్నారు 1
కోరింథీయులకు 4
21. మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీయొద్దకు
రావలెనా? ప్రేమతోను సాత్వికమైన మనస్సుతోను రావలెనా?
ఇంతవరకు
పౌలుగారు తన భావము రాసేశారు! ఇక తుది పలుకులు పలుకుతున్నారు! గమనించాలి మిగిలిన
పత్రికలలో ఆయన తుదిపలుకులు వీరికి నా వందనాలు, వారి ఇంట్లో ఉన్న సంఘానికి వందనాలు
లాంటివి ఉంటాయి గాని ఈ పత్రికలో అవేమీ లేవు కారణం కొరింథీ వారిలో కొందరు అంతగా
తనను దుఖ పెట్టారు!
11. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై యుండుడి,
ఆదరణ కలిగియుండుడి, ఏకమనస్సుగలవారై యుండుడి సమాధానముగా ఉండుడి; ప్రేమ సమాధానములకు
కర్తయగు దేవుడు మీకు తోడైయుండును.
చూడండి
మొదటగా అంటున్నారు సంతోషించుడీ: మిగిలిన పత్రికలలో కూడా ఇలాగే రాస్తున్నారు:
ఆనందించండి అంటూ ఫిలిప్పీ 3:1
మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే
సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము.
ఫిలిప్పీ 4:4
ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి,మరల చెప్పుదును
ఆనందించుడి.
“సంపూర్ణులు
లేక పరిపూర్ణులుగా ఉండండి”– వ 9; 2 కోరింథీయులకు 7:1
1. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని
భయముతో పరిశుద్ధతను సంపూర్తిచేసి కొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త
కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము.
ఎందుకు
సంపూర్ణంగా ఉండమంటున్నారు అంటే
మత్తయి
5:48:48. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు
ఇతరుల
పట్ల, మన పట్ల కూడా మన గురి సంపూర్ణమైన ఆధ్యాత్మిక పరిపక్వత సాధించడమే అయి ఉండాలి.
ఇక
“ప్రేమ, సమాధానాల కర్త ”– హెబ్రీయులకు 13:20; 1 యోహాను 4:8. 1 :8. దేవుడు
ప్రేమాస్వరూపి, ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు.
హెబ్రీయులకు 13:20.
గొఱ్ఱెల గొప్ప కాపరియైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు
రక్తమునుబట్టి మృతులలోనుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు,
12. పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకరికి ఒకరు వందనములు
చేసికొనుడి.
రోమా
పత్రికలో కూడా ఇలాగే చెప్పారు! రోమీయులకు
16:16. పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకని కొకడు వందనములు చేయుడి.
క్రీస్తుసంఘములన్నియు మీకు వందనములు చెప్పుచున్నవి. ఇక్కడ క్రీస్తు సంఘములన్నీ
మీకు వందనాలు చెబుతున్నాయి అంటే క్రీస్తు సంఘము అనే సంస్థ వారు లేక అనే పేరు
కలిగినవి కాదు! సార్వత్రిక సంఘములవ అంగములైన ప్రతీ సంఘాలు మీకు వందనాలు
చెబుతున్నారు అని అర్ధం!
13. పరిశుద్ధులందరు మీకు వందనములు చెప్పుచున్నారు.
14. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు
పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.
ఇక చివరలో ఆశీర్వాదం ఇవ్వడం పౌలుగారి యొక్క మంచి వాడుక! ఘనమైన సత్యంతో
పొంగి పొరలుతున్న వచనం. యేసు ఇక్కడ ఉన్నాడు. ఆయనే ప్రభువు, క్రీస్తు (అపో.
కార్యములు 2:36.
పాపులకు పాపవిముక్తి ఇచ్చేది,
విశ్వాసులను దీవించేదీ ఆయన కృపే (2 కోరింథీయులకు 8:9; యోహాను 1:14-17; గలతియులకు
1:6).
మనుషులకు కృప కలగడానికి మూలాధారం
క్రీస్తే అని చెప్పడమంటే ఆయనే దేవుడని చెప్పడం. ఫిలిప్పీయులకు 2:6 చూడండి. తండ్రి
అయిన దేవుడు కూడా ఇక్కడున్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తును పంపించాడు (యోహాను
3:16; రోమీయులకు 5:8; 1 యోహాను 4:10). వ 11 ప్రేమ మూర్తి అయిన దేవుని గురించి
మాట్లాడుతున్నది. ఇక్కడ దేవుని ప్రేమ, కార్యరూపంలో ఆయన ప్రేమ కనిపిస్తున్నది.
క్రీస్తు కృప, దేవుని ప్రేమ కలిసే పని చేస్తాయి. దేవుని ప్రేమ కారణంగానే క్రీస్తు
ఇచ్చిన తన కృపను ప్రదర్శించాడు. ఆయన కృపవల్లే దేవుని ప్రేమ విశ్వాసులతో ఉండగలదు.
పవిత్రాత్మ కూడా ఇక్కడ ఉన్నాడు. యోహాను 14:16-17
. ఆయన వ్యక్తిత్వం ఇక్కడ సూచించబడింది. మనం వ్యక్తులతో మాత్రమే సహవాసం
చేయగలం గానీ శక్తులు, ప్రభావాలతో కాదు. పవిత్రాత్మ మూలంగానే విశ్వాసులమైన మనలో
దేవుడు నివసిస్తున్నాడు. ఆయన మూలంగానే తండ్రియైన దేవునితో, యేసుప్రభువుతో మనకు
సహవాసం ఉంది (1 యోహాను 1:3). “త్రిత్వం” ఈ వచనంలో కనిపిస్తున్నారు. విశ్వాసులకు
పాపవిముక్తి, రక్షణ, పవిత్రత, దీవెనలు ప్రసాదించడంలో త్రిత్వంలోని ముగ్గురు
వ్యక్తులకు భాగం ఉంది.
బేధాలు, తారతమ్యాలు వదిలేయాలి! నేను ఫలానా సంఘానికి చెందిన వాడను, మీరు
ఫలానా సంఘానికి చెందిన వాడనని అసలు చెప్పనే కూడదు! ఇంకా ఫలానా బోధకుడు మంచోడు,
మీకాపరికి వాక్యం చెప్పడం రాదు లాంటి పనికిమాలిన మాటలు మానేయాలి! సంఘములో ఒక బలమైన
స్తంభముగా నిలిచి సంఘాభివ్రుద్ది కి తోడుపడాలి ! ముఖ్యంగా క్రీస్తులో
పరిశుద్దాత్మలో నిలిచి పవిత్రత సాధించి శ్రమల ద్వారా సంపూర్ణత సాధించాలి! ఇదే
పౌలుగారు కోరుకుంటున్నారు! తద్వారా ప్రభువు రాకడలో ఎత్తబడాలి! అట్టి కృప ధన్యత
ప్రభువు మనకు దయచేయును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
(సమాప్తం)
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
ప్రియమైన
దైవజనమా! ఈ కొరింథీయులకు వ్రాసిన పత్రికలు అనే శీర్షిక ద్వారా దేవుడు మనతో
మాట్లాడారని నమ్ముతున్నాను! మొదటి పత్రికలో సంఘ క్రమం నేర్పించి, రెండో పత్రికలో
ఒకదైవజనునికి విశ్వాసులు ఎలా ఉండాలి అనేది మరియు దైవ సేవకులు ఏ విధంగా ఉండాలో
చెప్పారు! ఇవన్నీ మన జీవితాలలో పాటిద్దామ్ !
నా
కోసం, మా పరిచర్యలు కోసం, దయచేసి ప్రార్థన చేయండి! ప్రభువు చిత్తమైతే మరో
శీర్షికతో కలుసుకుందాం!
దైవాశీస్సులు!
ఇట్లు
వందనములతో
మీ ఆత్మీయ సహోదరుడు
*దోనే డేవిడ్ రాజ
కుమార్!*
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి