ఆధ్యాత్మిక సందేశాలు-2-కొన్ని కీర్తనల ధ్యానం- part-3

ఆధ్యాత్మిక సందేశాలు-2  కొన్ని కీర్తనల ధ్యానం

                                          32 కీర్తనా ధ్యానం 
                                          (మొదటి  భాగం)
తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు.
               కీర్తనలు 32:1
ధన్యులెవరు? 
*తమ అతిక్రమములకు పరిహారమునొందినవారు
*తమ పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవారు

1.తమ అతిక్రమములకు పరిహారము నొందినవారు ధన్యులు:
ధర్మ శాస్త్రమును అతిక్రమించడం ద్వారా దొషులుగా మారినవారు, వాటి నుండి పరిహారం పొందితే ధన్యులుగా తీర్చబడతారు.
ధర్మశాస్త్రం మనిషిని శిక్షించేదిగావుంది గాని, ఆ శిక్ష నుండి తప్పించలేక పోయింది. 
ధర్మశాస్త్రం విధించే శిక్షకు పరిహారం బలి. మనిషి చేసే అపరాధములకు బలి అర్పించుకొంటూ పొతే ఈ లోకంలోనున్న  పక్షులు, జంతువులు చాలవేమో? 

అందుకే పరిశుద్దుడైన యేసయ్య నీ పాపమును పరిహరించడానికి ఆయనే బలిగా వధించ బడ్డాడు. 
ఆ రక్తంలో నీవు కడుగబడితేనే పరిహరించ బడతావు. 
పరిహరించ బడితేనే ధన్యుడుగా తీర్చబడతావు. 

2.తమ పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవారు ధన్యులు:
పుట్టుకతోనే మనలను వెంటాడుతున్న పాపమునకు ప్రాయశ్చిత్తము పొందితేనే ధన్యులము కాగలము. 

ఎట్లా ప్రాయశ్చిత్తము పొందగలం? 
సంవత్సరమునకు ఒకసారి ప్రాయశ్చిత్తార్థ దినమును ఆచరించినంత మాత్రాన ఎట్టి పరిస్థితులలోను ప్రాయశ్చిత్తము పొందలేము గాని, 
ప్రాయశ్చిత్తార్థ బలిగా నీ కోసం అర్పించ బడిన యేసయ్య చెంత చేరి నీ పాపములను కడుగుకొనుట ద్వారా ప్రాయశ్చిత్తమును పొందగలవు. 
ఆ రక్తంలో నీవు కడుగబడితేనే ప్రాయశ్చిత్తము పొందగలవు. 
ప్రాయశ్చిత్తము పొందితేనే ధన్యుడుగా తీర్చబడతావు. 

ఆ అనుభవం నీకుందా?
పశ్చాత్తాప పడదాం!
ఆయన పాదాల చెంత ప్రణమిల్లుదాం! 
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 
                                                                            32వ కీర్తనా ధ్యానం 
                                                ( రెండవ భాగం)
యెహోవాచేత నిర్దోషి అని యెంచబడినవాడు ఆత్మలో కపటములేనివాడు ధన్యుడు.   కీర్తనలు 32:2
ధన్యులెవరు? 
*
తమ అతిక్రమములకు పరిహారమునొందినవారు
*
తమ పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవారు.

అంతే కాకుండా, 
*
యెహోవాచేత నిర్దోషి అని యెంచబడినవారు
*
మనస్సులో కపటము లేనివారు
యెహోవాచేత నిర్దోషి అని యెంచబడాలి అంటే, మనస్సులో కపటం లేకుండా జీవించాలి. 
"
కపటం" అంటే? మనస్సులో ఆలోచించేది ఒకటి. మెప్పుకోసం చేసేది మాత్రం మరొకటి. 
మాటల్లో ప్రేమను  ఒలకబోస్తాం. 
కాని, మనం మాట్లాడేదానికి, మన మనస్సులో ఉన్నదానికి ఎక్కడా పొంతన వుండదు. 
నిష్కపటమైన మనస్సు ఆయనకిష్టం. 
కాని, మనలో అదే లోపించింది. 

ఆయన ఏది బోధించినా దానిని చేసి చూపించారు. 
"
ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు."    1 పేతురు 2:22
ఆయనను ప్రేమించే నీవు ఆ రీతిగానే జీవించగలగాలి. 

జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను.    1పేతురు 3:10
*
ధన్యతను పొందుకోవాలంటే? దేవునితో ఇట్లాంటి సాక్ష్యమును పొందుకోవాలి.          
యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి ఇదిగో యితడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనియందు ఏ కపటమును లేదని అతనిగూర్చి చెప్పెను.   యోహాను 1:47
*
ఇశ్రాయేలీయుడు అంటే?
ఇశ్రాయేలు దేశ పౌరసత్వం కలిగినవాడు. 
*
నిజమైన ఇశ్రాయేలీయుడు 
అంటే?
 నిష్కపటమైన జీవితాన్ని జీవిస్తూ, దేవుని చేత నిర్దోషి అని ఎంచబడినవాడు.

మన మాటలు, క్రియలు నిష్కపటమైనవేనా? 
కాకపొతే ధన్యులం కాలేము. 
సరిచేసుకుందాం! సాగిపోదాం! 
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 
                                             32 కీర్తనా ధ్యానం 
                                       ( మూడవ భాగం)
నేను మౌనినై యుండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వనివలన నాయెముకలు క్షీణించినవి.
దివారాత్రులు నీ చెయ్యి నామీద బరువుగా నుండెను నా సారము వేసవికాలమున ఎండినట్టాయెను.      కీర్తనలు 32:3,4
 
బహుశా దావీదు బత్సేబతో పాపం చేసిన తర్వాత దానిని ఒప్పుకొంటూ వ్రాసిన కీర్తన కావొచ్చు. 
*అందరూవున్నా ఎవరూ లేనట్లు ఒంటరిగా గడపవలసి వస్తుంది. 
*దినమంతా అంటే? రాత్రీ , పగలు ఇదే పరిస్థితి. 
*మూల్గులతో తన ఎముకలు పట్టు తప్పిపోతున్నాయి.
*రాత్రీ, పగలు దేవుని హస్తము తన మీద చాలా భారంగా వుంది. 
*ఎంత సారవంతమైన భూమి అయినా నీరు లేకపోతే ఎట్లా నిస్సారంగా వుంటుందో? దావీదు జీవితం కూడా అట్లానే వుంది. 

కారణం? 
దావీదు చేసిన పాపం కొన్నినెలల వరకూ దేవుని ఎదుట ఒప్పుకోలేదు. 
అప్పటి వరకూ పాపం తన హృదయంలో నిలిచే వుంది. 

మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబాలలో శాంతి, సమాధానం లేకపోవడానికి కూడా కారణం ఇదే కావొచ్చేమో? 
మన పాపం మనలను పట్టి పీడిస్తుంటే? నిద్రలేని రోజులు గడపాల్సి వస్తుందేమో? 
జీవితం సారాన్ని కోల్పోయి జీవచ్చవంలా బ్రతకాల్సి వస్తుందేమో? 

ఎంతకాలం ఇట్లా? 
దీనికి పరిష్కారం ఏంటి? 
ఒక్కటే! నీ హృదయ భారాన్ని, పాప భారాన్ని ఆయన పాదాల చెంత క్రుమ్మరించడమే. 
అప్పటి వరకూ నీ హృదయం తేలికకాదు. 

మరెందుకు ఆలస్యం? 
పశ్చాత్తాప పడదాం!
ఆయన పాదాల చెంత ప్రణమిల్లుదాం! 
సమాధానాన్ని అనుభవిద్దాం! 
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 

                                            32 కీర్తనా ధ్యానం 
                                            (నాలుగవ భాగం)
నా దోషమును కప్పుకొనక నీ యెదుట నాపాపము ఒప్పుకొంటిని యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పు కొందు ననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు.            కీర్తనలు 32:5

దావీదు జీవితం అంత దయనీయమైన స్థితికి చేరుకోవడానికి గల కారణం?*తన పాపమును ఒప్పుకోకుండా, 
కప్పు కోవడమేనని గ్రహించగలిగాడు. 
**ఆ గ్రహింపు అతనిని పశ్చాత్తాపం లోనికి నడిపించగలిగింది. 
* పశ్చాత్తాపం అతని పాపమును పరిహరించ గలిగింది. 

మన జీవితాలు ఎట్లా వున్నాయి? 
మన పాపమేమిటో మనకు గ్రహింపువున్నా, ఒప్పుకోలేని స్థితిలో వున్నామా? 

అయితే ఒక్క విషయం!
"అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును."
           సామెతలు 28:13
ఒకవేళ శారీరికంగా అభివృద్ధి చెందినా, ఆత్మీయంగా పతనమవుతాం. 
అట్లా కాకుండా మన పాపములను  కప్పుకోకుండా, ఒప్పుకోగలిగితే? 
మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.
           1యోహాను 1:9
కప్పుకోవద్దు!!
ఒప్పుకుందాం! 
పవిత్ర పరచబడదాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 
                                                    32వ కీర్తనా ధ్యానం 
                                                (ఐదవ భాగం)
కావున నీ దర్శనకాలమందు భక్తిగలవారందరు నిన్ను ప్రార్థనచేయుదురు. విస్తార జలప్రవాహములు పొరలివచ్చినను రావు నిశ్చయముగా అవి వారిమీదికి.         కీర్తనలు 32:6

ఎవరు పాపములయితే పరిహరించబడ్డాయో? వారందరూ, 
ఆయన దర్శనకాలమందు (దొరికే సమయంలో) భక్తిగలవారందరు ఆయనను ప్రార్ధిస్తారు. 

అంటే? 
ఆయన దొరకని కాలముందా? 
అవును! 
దోషులు తమ పాపములను ఒప్పుకొని, క్షమాపణ కోరడానికి ఆయన కలలాలం ఎదురు చూడడు.
ఒకానొక దినాన్న పాపానికి వ్యతిరేకంగా తీర్పు విస్తార జలప్రవాహంలా ( వరదలా) ముంచుకొస్తుంది. 

అయితే? 
ఆ దినాన్న నీవు తప్పించబడతావు. 

కారణం? 
నీ పాపమునకు పశ్చాత్తాప పడ్డావ్. 
నీ పాపములను ఆయన పావన పరిచాడు. 
కావున, దేవుడు నీ అపరాధములను నీ లెక్కలోకి చేర్చడు.

ఒకవేళ ఇంకనూ వాయిదా వేస్తుంటే? 
ఆ దినాన్న మనలను రక్షించే వాళ్ళెవ్వరూ లేరు. 
వద్దు! 
అది ఊహలకే భయంకరం. 
ఇక అనుభవించాల్సి వస్తే ఘోరం!

సరి చేసుకుందాం! 
ఆయన చెంత సాగిలపడదాం! 
ఆ ఉగ్రత నుండి తప్పింప బడదాం! 
ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 

32 కీర్తనా ధ్యానం
(ఆరవ భాగం)

నా దాగు చోటు నీవే, శ్రమలోనుండి నీవు నన్ను రక్షించెదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు.
               కీర్తనలు 32:7
        .............................

"పశ్చాత్తాపం" అనేది పాప క్షమాపణ మనస్సుకు హాయి, ప్రశాంతతతో కూడిన విడుదలను ఇస్తుంది.

పాపమును కప్పుకోకుండా, ఒప్పుకొనే వ్యక్తికి శ్రమదినాన్న దేవునిలో దాగియుండే స్థలం దొరుకుతుంది.

ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గముమీద ఆయన నన్ను ఎక్కించును.
             కీర్తనలు 27:5

దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు
కావున భూమి మార్పునొందినను నడిసముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము."
           కీర్తనలు 46:1-3

కారణం?
మన దాగు చోటు ఆయనే.

ఇదెప్పుడు సాధ్యం?
మన పాపములకు పశ్చాత్తాప పడినప్పుడు మాత్రమే.

ఆయన చెంత సాగిలపడదాం!
శ్రమ నుండి తప్పింపబడదాం!

రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్!
       32 కీర్తనా ధ్యానం
(ఏడవ భాగం)
నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గ మును నీకు బోధించెదను నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను
బుద్ధి జ్ఞానములులేని గుఱ్ఱమువలెనైనను కంచరగాడిద వలెనైనను మీరు ఉండకుడి అవి నీ దగ్గరకు తేబడునట్లు వాటి నోరు వారుతోను కళ్లెముతోను బిగింపవలెను.     కీర్తనలు 32:8,9
నీ జీవిత గమ్యాన్ని చేరడానికి 
* ఆయన ఉపదేశకుడుగా వున్నాడు.
* మార్గములను ఆయన బోధిస్తాడు. 
* ఆయన కనుదృష్టి నీమీద వుంచుతాడు. 
*ఆలోచన చెప్పి నడిపిస్తాడు. 
ఇవి నీకు ఎప్పుడు అర్ధమవుతాయి అంటే
బుద్ధి, జ్ఞానం కలిగి వున్నపుడు. 

ఇవి లేకపోతే?
పశువులతో సమానం. 
అవెట్లా వస్తాయి
బుద్ధి, జ్ఞానం సర్వ సంపదలు ఆయనయందే గుప్తమైవున్నవి. 
అందుకే దావీదు అంటున్నాడు. 
యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి! నీ ఆలోచనలు అతిగంభీరములు,
పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు వివేచింపరు.  కీర్తనలు 92: 5,6
యుద్ధమునకు చొరబడు గుఱ్ఱమువలె ప్రతి వాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు.    యిర్మియా 8:6
యుద్ద రంగంలో నున్న గుర్రం ఎటువైపు పరుగులు తీస్తుందో, ఎవ్వరికీ అర్ధం కాదు. 
ఒకవేళ మనము కూడా ఆరీతిగా నచ్చిన మార్గాలలో తిరుగుతూ, నచ్చినట్లు జీవిస్తున్నామేమో

వద్దు! 
ఆయన ఉపదేశాన్ని విందాం! 
ఆయన మార్గాలలో
ఆయన ఆలోచన చొప్పున జీవిద్దాం! 

ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! 
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 

                                                 40వ కీర్తనా ధ్యానం 
                                              (మొదటి  భాగం)
యెహోవాకొరకు నేను సహనముతో కనిపెట్టు కొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను.
                 కీర్తనలు 40:1

మన జీవితాల్లో ప్రార్ధనలకు  ప్రతిఫలాలు పొందలేకపోతున్నాం అంటే, ప్రధాన కారణం 
*
కనిపెట్టలేక పోవడం. 
*
సహనం లేకపోవడం. 

రాత్రి ప్రార్ధిస్తే ఉదయానికి అది జరిగిపోవాలి. 
కాస్త ఆలస్యం అయితే సహనం కోల్పోయి, విసిగిపోయి, ప్రార్ధించడమే మానేస్తాం. 

ఆయన ఆలస్యం చేస్తాడేమో గాని అలక్ష్యం మాత్రం చెయ్యడు. అనే విషయాన్ని మరచిపోతాం. 
ఆ ఆలస్యంలో కూడా ఒక మేలు దాగి వుంటుంది అనే విషయాన్ని గుర్తించలేం. 

*
అనేక సందర్భాలలో దేవుడు మన ప్రార్ధనలకు సమాధానాన్ని సిద్దపరుస్తాడు. 
*
ఇక అది మన చేతికి వచ్చే సమయానికి సహనం కోల్పోయి, కనిపెట్టలేక ప్రార్ధించడం మానేస్తాం. 
*
ఆ ఆశీర్వాదాలు మన కండ్లముందే నిలిచిపోతాయి గాని, మన చేతికి దక్కవు. 

ఆయన తగిన సమయమందు నీ ప్రార్ధన ఆలకించి ప్రతిఫలమిస్తాడు. 
అయితే, ఆ క్షణం కోసం సహనంతో కనిపెట్టుకొని వుండాలి. 

దానికి ఎంత కాలం పట్టొచ్చు? 

*
కాలేబు వాగ్ధాన నెరవేర్పు కోసం 45 సంవత్సరాలు, అబ్రాహాము 25 సంవత్సరాలు సహనంతో కనిపెట్టవలసి వచ్చింది. 

*
సిలువలో దొంగ అయితే, తన ప్రార్ధనకు ప్రతిఫలాన్ని అదేరోజు పొందగలిగాడు. 

అది ఎప్పుడు నీకవసరమో నీకంటే ఆయనకే బాగా తెలుసు. అప్పటివరకు సహనంతో ఆయన కొరకు కనిపెట్టుకొనివుండు. 

ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! 
వాగ్ధాన ఫలాలను అనుభవిద్దాం! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 
                                            40వ కీర్తనా ధ్యానం 
                                                (రెండవ భాగం)
నాశనకరమైన గుంటలోనుండియు జిగటగల దొంగ ఊబిలో నుండియు. ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిర పరచెను         కీర్తనలు 40:2

నాశనకరమైన గుంట
జిగటగల దొంగ ఊబి

ఇది  ఘోరమైన కష్టం, అపాయం, దీనావస్థతో కూడిన అనుభవం. 
జీవిత పునాదులే కుప్పకూలే పరిస్థితులు. 

హృదయం, మనస్సు, ఆత్మ నిలిచేందుకు ఆధారం లేక ఎక్కడో అగాధంలోకి దిగిపోతున్నట్లు అనిపించే పరిస్థితులు. 

అందుకే దావీదు ఇట్లా అంటున్నాడు. 

"
నిలుక యియ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవుచున్నాను అగాధ జలములలో నేను దిగబడియున్నాను వరదలు నన్ను ముంచివేయుచున్నవి."
               కీర్తనలు 69:2

అవును!!
ఈ పరిస్థితికి కారణం మన పాపమే. 

నాశనకరమైన గుంట
జిగటగల దొంగ ఊబి
ఇవే నిత్య మరణానికి అసలైన సాదృశ్యాలు. 

ఈ పరిస్థితి నుండి తప్పించి, విడిపించడానికి ఆయన తన ప్రియ కుమారుని పంపించి క్రీస్తు అనే బండ పైన మన పాదములు స్థిర పరిచాడు. 

అందును బట్టి దేవుని స్తుతిద్దాం! 
స్థిరపరచ బడిన పాదములు తొట్రిల్లకుండా కాపాడుకుందాం! 

ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్!                                             
                                           40వ కీర్తనా ధ్యానం 
                                              (మూడవ భాగం)

తనకు స్తోత్రరూపమగు క్రొత్తగీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాని చూచి భయభక్తులుగలిగి యెహోవా యందు నమ్మిక యుంచెదరు.         కీర్తనలు 40:3

నాశనకరమైన గుంట, 
జిగటగల దొంగ ఊబి నుండి
 విడిపించబడిన వ్యక్తినుండి ఒక నూతనమైన విమోచనా స్తోత్రగీతం పెల్లుబికి వస్తుంది. 

ఆగీతాన్ని ఆ వ్యక్తి మాత్రమే ఆలపించగలడు.
అది కృతజ్ఞతా గీతం. 

విశ్వాసులకు విడుదల కలగడం, వారు దేవుని స్తుతించడం ఇతరులు చూసి, వారు కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆయన యందు నమ్మికయుంచుతారు.

ఇంతకీ, నీవు ఆ దొంగ ఊబి నుండి విడిపించబడ్డావా? 
ఇంకా దానిలోనేనా? 

అయితే, ఆ నూతనమైన విమోచనా స్తోత్రగీతాన్ని నీవు పాడలేవు.

నిన్ను బట్టి ఇతరులు దేవుని తెలుసుకొనే అవకాశమే లేదు. 

ఒక్క నిమిషం ఆలోచించు!!! ఒకవేళ  నిన్ను బట్టి దేవుని నామం అన్యజనుల మధ్య దూషించ బడుతుందేమో? 

అట్లా జరగడానికి వీల్లేదు. నిన్ను బట్టి దేవుని నామం మహిమ పరచబడాలి. అనేకులు ఆయనయందు విశ్వాసముంచాలి. 

ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! 
విమోచనా స్తోత్రగీతాన్ని ఆలపిద్దాం! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 
                                            40వ కీర్తనా ధ్యానం 
                                               (నాలుగవ భాగం) 

గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధములతట్టు తిరుగు వారినైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు.        కీర్తనలు 40:4

*
నాశన కరమైన గుంటనుండి తప్పించ బడిన నీవు. 
*
పాపపు ఊబి నుండి విడిపించబడిన నీవు, 

1.
గర్విష్టుల జోలికిపోవద్దు. 
ఎందుకంటే? 
వారి మాటలుగాని, వారి ప్రవర్తనగాని కనీసం దేవునిని కూడా లెక్కచెయ్యకుండా వుంటాయి. 

వారికి ఒక విషయం తెలియదు. పతనానికి ముందు గర్వం నడుస్తుందని. వాళ్ళు పతనం అంచులలో వున్నారని. 

2.
సక్రమమైన మార్గం  విడచి అక్రమమైన మార్గములలో నడిచే  వారి తట్టు చూడొద్దు. 
దేవునికి ఆయాసకరమైన మార్గమేదైనా  అది అక్రమమైన మార్గమే. 

ఈ మార్గం  కొన్ని రోజులు నీకు సంతోషాన్ని కలిగించొచ్చు. కాని ఒకక్షణాన్న నీకళ్ళ ముందే ఆ సంతోషం ఆవిరై ఆవేదన మాత్రమే మిగులుతుంది. 

3.
అబద్ధములతట్టు తిరుగు వారిని  లక్ష్య పెట్టొద్దు. 
ఎందుకంటే? 
అబద్దములకు జనకుడు సాతాను. అబద్దముల తట్టు తిరుగువారు వాడి పిల్లలే. 

ఇక, నీవు చెయ్యాల్సింది ఒక్కటే. 
ఆయన యందు విశ్వాసముంచు.
ధన్యతను పొందుకోగలవు.
ధన్యుడు అంటే? "ఆశీర్వదించబడిన వాడు."

నిజమైన ఆశీర్వాదం ఏమిటంటే? 
ఆ నిత్య రాజ్యంలో చేరడమే. 

ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! 
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 
                                             40వ కీర్తనా ధ్యానం 
                                                  (ఐదవ భాగం)
యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్యక్రియలును మాయెడల నీకున్న తలంపులును బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించియున్నవి నీకు సాటియైనవాడొకడును లేడు.          కీర్తనలు 40:5

నాశనకరమైన గుంట, 
జిగటగల దొంగ ఊబి నుండి దేవుడు నిన్ను రక్షించాడంటే? 
నీ పట్ల దేవునికొక ప్రత్యేకమైన ప్రణాళిక వుంది. 

*
ఆయన మన యెడల జరిగించిన, జరిగిస్తున్న ఆశ్చర్యక్రియలు బహు విస్థారమైనవి. 
అవి కంటికి కనబడవు. 
చెవికి వినబడవు 
మనకు అర్ధం కావు. 
*
మన పట్ల ఆయన కలిగియున్న తలంపులు లెక్కలేనన్ని. 

అందుకే, సృష్టిలోనే అత్యంత ఉన్నతమైన సృష్టముగా నిన్ను, నన్ను సృష్టించాడు. 
దేవదూతల కంటే అధికముగా మనలను హెచ్చించాడు. 
కాని, దేవునిని గురించిన తలంపే మనకు లేదు. 

*
ఆయనకు సాటియైన వాడొకడును లేడు.
అవును!
నీ కోసం ఆయన తన ప్రాణాన్నే ఫణంగా పెట్టాడు. 
అంతగా నిన్ను ప్రేమించిన వారెవరన్నా వున్నారా? 

గతించిన కాలంలో లేరు!
వర్తమాన కాలంలోనూ లేరు!!
భవిష్యత్ కాలంలోనూ వుండబోరు!!!

ఆయనకు సాటి లేరేవ్వరూ లోకాన. 
ఆ సాటిలేని దేవునికి నీవేమివ్వగలవు?
నీహృదయంలో చోటివ్వు చాలు. 

ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 
                                           40వ కీర్తనా ధ్యానం 
                                                (ఆరవ భాగం)
బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించియున్నావు. దహన బలులనైనను పాపపరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు.      కీర్తనలు 40:6
 
*
బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు:
బలులు అర్పించాలని చెప్పింది దేవుడే. 
కాని, దావీదు అంటున్నాడు 
నీవు బలులను,నైవేధ్యములను కోరుటలేదు. 

ఏది వాస్తవం?
రెండూ వాస్తవాలే. 

అదెట్లా? 
దేవుడే బలులను ప్రవేశ పెట్టాడు. బలుల వలన ఆనందించడానికి కాదు. బలి పశువుగా వధించబడనున్న యేసు ప్రభువు వారికి ఒక నీడగా, ఛాయగా మాత్రమే. 
ఇప్పుడు మనకు బలులతో సంబంధం లేదు. 

ఎందుకంటే? ఆయనే బలిపశువుగా 
వధించబడ్డాడు కాబట్టి. 

అయితే, మనము చెయ్యాల్సింది ఏమిటంటే? 

ఆత్మీయ బలులను ఆయనకు సమర్పించాలి. 

అంటే?
సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు 
సమర్పించగలగాలి. 

ఆయన మనకు చెవులు 
నిర్మించి యున్నాడు. వాటితో ఆయన మాటలు వినగలగాలి. 
అట్టిరీతిగా జీవించగలగాలి. 

ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! 

అట్టి కృప, ధన్యత దేవుడు 
మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 
                                        40వ కీర్తనా ధ్యానం 
                                            (ఏడవ భాగం)

అప్పుడు పుస్తకపుచుట్టలో నన్నుగూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చియున్నాను.

నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది.

               కీర్తనలు 40:7,8
         ...............................

దావీదు ద్వారా యేసు ప్రభువు వారు చెప్తున్నమాట ఇది.

అప్పుడు పుస్తకపుచుట్టలో నన్నుగూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చియున్నాను.

అప్పుడు అంటే ఎప్పుడు? 
పాత నిబంధనా కాలంలో. 

అవును!!
పాత నిబంధన అంతా పుస్తకపు చుట్టలలోనే వ్రాయబడింది. యేసు ప్రభువును గురించి కొన్ని వేల ప్రవచనాలు ముందుగా వ్రాయబడిన ప్రకారమే, ఆయన 
ఈ లోకానికి వచ్చాడు. 

యేసు ప్రభువు దేవుడైయుండి. ఆయన తండ్రితో చెప్తున్నమాట. 

"
నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము."

అవును! అవి ఎట్లాంటి పరిస్థితులైనాసరే!
చివరికి, గేత్సేమనే వనములో 
నీ, నా పాపపు శ్రమల పాత్రను స్వీకరించబోయేముందు కూడా.. 
ఆయన చేస్తున్న ప్రార్ధన ఇదే.
తండ్రీ! నీ చిత్తమైతే ఈ పాత్రను నాయొద్ద నుండి తొలగించు. అయిననూ, నీ చిత్తమే నెరవేర్చు. 

ఎందుకంటే? తండ్రి చిత్తము నెరవేర్చుట ఆయనకు సంతోషం. 

మన జీవితాలు ఎట్లా వున్నాయి? 
ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారముగా మనమున్నామా? 

*
అసలు, దేవుని చిత్తమేమిటో 
మనకు తెలుసా? 
*
దేవుని చిత్తమేమిటో 
మనకుఎట్లా తెలుస్తుంది? 

యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు. 
"
నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది."

*
అవును! ఆయన చిత్తమేమిటో మనకు తెలియాలి అంటే? 
ఆయన వాక్యము మన హృదయంలో వుండాలి. 

*
ఆయన వాక్యము మన హృదయంలో వుండాలి అంటే? పరిశుద్ద గ్రంధాన్ని ధ్యానించాలి. 
(
చదవడం కాదు)

ఇట్లాంటి అనుభవం మనజీవితంలో ఉందా? 

లేకుంటే,
*
పరిశుద్ద గ్రంధాన్ని ధ్యానిద్దాం!
*
ఆయన చిత్తమేమిటో తెలుసుకుందాం!
*
ఆయన చిత్తాన్ని నెరవేర్చుదాం! 
*
నిత్యరాజ్యానికి వారసులవుదాం! 

అట్టి కృప, ధన్యత దేవుడు 
మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 
                                          40వ కీర్తనా ధ్యానం 
                                           (ఎనిమిదవ భాగం)
నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించియున్నానని నేనంటిని యెహోవా, అది నీకు తెలిసేయున్నది.     కీర్తనలు 40:9
"
నీతి సువార్త" అంటే?
నీతి అంటే? 
ఆయనను నమ్మడమే నీతి. 
"
అబ్రాహాము యెహోవాను నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచబడెను."
సువార్త అంటే? మంచి వార్త.
ఈ లోకంలో మంచి వార్త ఏదయినా ఉన్నదంటే? 
అది ఆయనను నమ్మడమే. 

నమ్మిన వ్యక్తి ప్రకటించ కుండా, మౌనముగా ఉండలేడు. 
అందుకే, యేసయ్య సహితం ఇట్లా అంటున్నారు. 

నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించాను. 
యేసు వారి సమాజమందిరములలో బోధించుచు రాజ్యసువార్తను ప్రకటించుచు సంచరించెను.మత్తయి 9:35

దావీదు కూడా ఇదేమాట చెప్తున్నాడు. నీ చిత్తం నేరవేర్చుటే నాకు సంతోషం కాబట్టి, 
నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించాను. 
మహా సమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను      కీర్తనలు 22:25

కాని, ఒక్క విషయం!
మన పెదవులు గంటలు తరబడి మాట్లాడుతూనే వుంటాయి గాని, ఎక్కడా దేవుని ప్రస్తావన రానేరాదు కదా? 
*
నమ్మిన వ్యక్తి ఆయన గురించి మాట్లాడకుండా, మౌనముగా ఉండలేడు. 
*
నీతి సువార్తను ప్రకటించకుండా నిద్రపోలేడు.

కాని మనమెందుకిలా?
*
మనమింకా నీతిమంతులుగా తీర్చబడలేదా?
*
అబ్రహాము కుమారుల జాబితాలో చేర్చబడలేదా? 

*
పరిశీలన చేసుకుందాం! 
*
నీతిమంతులుగా తీర్చబడదాం! 
*
నీతి రాజ్యాన్ని ప్రకటిద్దాం! 
*
నిత్య రాజ్యంలో ప్రవేశిద్దాం! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 
                                        40వ కీర్తనా ధ్యానం 
                                         (తొమ్మిదవ భాగం)

నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడిచేసి యున్నాను నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగుచేయలేదు.
                    కీర్తనలు 40:10
          ............................

దేవుని నమ్మిన వ్యక్తి ఆయన గురించి మాట్లాడకుండా, మౌనముగా ఉండలేడు. 

అందుకే, 
*
సత్యాన్ని ప్రకటిస్తున్నాడు. 
*
రక్షణను ప్రకటిస్తున్నాడు. 
*
కృపను ప్రకటిస్తున్నాడు. 

*సత్యం అంటే? 
*
సత్యం అంటే ఆయనే. 
*
ధర్మ శాస్త్రము మనకు విధించిన శిక్షను మనకు బదులుగా చెల్లించింది "ఈ సత్యమే."
*"
నేనే సత్యమును"
               యోహాను 14:6 

*
రక్షణ అంటే? 
*
శిక్ష నుండి తప్పించబడుట. 
*
ఆ శిక్ష నుండి తప్పించి 
రక్షణ ఇవ్వగలిగేది యేసు ప్రభువారు మాత్రమే. 
*
యేసు అనుమాటకు "రక్షకుడు" అని అర్ధం. 
*
ఆయన పేరులోనే వుంది రక్షణ. 
*
రక్షణ అంటే ఆయనే. 

కృప అంటే? 
ఏ అర్హత లేనివాడు అర్హునిగా యెంచబడడమే కృప. 

ఒక వ్యక్తి దొంగతనానికి వచ్చి పట్టుబడినప్పుడు, అతనిని శిక్షించకుండా విడచిపెట్టేస్తే ? 
అది దయ.
అంతే కాకుండా, తినడానికి ఆహారంపెట్టి, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని బస్సు చార్జీలు కూడా ఇచ్చి పంపిస్తే?
అది కృప. 

*
ఆయన కృప ఎట్టిదో గమనించు!!

"
ప్రభువా!" అని పిలిచే అర్హతకూడా లేని మనలను "తండ్రీ!"అని పిలిచే యోగ్యతనిచ్చి, తన బిడ్డలుగా స్వీకరించాడు. 

దీనికి కారణం, మన పరిశుద్దత, నీతి కాదుగాని, ఆయన ఉచితమైన "కృప" మాత్రమే.

అట్టి కృపను పొందుకున్న నీవు, 
ఆ సత్యమును గూర్చి 
ఆ రక్షణను గూర్చి 
ఆ కృపను గూర్చి జగమంతా చాటాలి. 

నాకు ప్రసంగాలు చెయ్యడం రాదు, పాడడం రాదు. 
ఎట్లా ప్రకటించగలను? అని తప్పించుకొనే ప్రయత్నం చెయ్యొద్దు. 

*
నీ జీవితమే (నీ క్రియలే) ఒక ప్రసంగం కావాలి. 
*
నీ జీవితమే శృతి తప్పని సంగీతం కావాలి. 
అట్టి జీవితాన్ని జీవించు. 

ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 
                                      40 కీర్తనా ధ్యానం
                                       (పదియవ భాగం) 
యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు నీ కృపాసత్యములు ఎప్పుడును 
నన్ను కాపాడునుగాక.           కీర్తనలు 40:11

దావీదు మాట్లాడుతూ.....
"యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు." అంటున్నాడు. 
"వాత్సల్యము" అనే మాట తలిదండ్రులు వారి బిడ్డల మధ్యగల ప్రేమను సూచిస్తుంది.
అవును! ఆయన మన తండ్రి. అందుకే మనపై ఆయనకంత వాత్సల్యం.

ఆయనను మనము విడచి పెట్టేసిన సందర్భాలు లెక్కలేనన్ని.
 కాని, ఏ క్షణాన ఆయన మనలను విడచి పెట్టలేదే? 
ఒక్క క్షణం ఆయన నిన్ను విడచి పెట్టేస్తే? 
ఇక నీవు సజీవుల లెక్కలో లేనట్లే. 
ఆయన నీ తండ్రిగా నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగియున్నాడు. 

అది ఎంత అద్భుతమైనదో తెలుసా? 
* నీవు పిండముగా ఉన్నప్పుడే ఆయన కన్నులు నిన్ను చూచాయి. 
* నీ కోసం నియమింప బడిన దినాలలో ఒక్కటైనా గడవకముందే, నీ జీవితమంతా ఆయన గ్రంధంలో వ్రాసేసాడు. 
నీ పట్ల ఆయనకున్న ప్రణాళిక అంత గొప్పది. 

అయితే ఒక్క విషయం!!
నీకు నచ్చినట్లుగా నీవు జీవించి, నీజీవితాన్ని నాశనం చేసుకొని, దేవుని ప్రణాళికలో నేను ఇట్లానే వున్నానని ఆ తప్పును ఆయన మీదకు త్రోసేసే ప్రయత్నం చెయ్యొద్దు. ఆయన్ని నిందించవద్దు. 

ఎందుకంటే? నీ యెడల ఆయనకున్న తలంపులు బహు విస్తారములు. నీ పట్ల దేవునికో అద్భుతమైన ప్రణాళిక వుంది. 

లేదంటే? 
*నీ ప్రవర్తనే దేవుని ప్రణాళికను మార్చేసింది. 
*ఆయన వాత్సల్యతను దూరం చేసింది.
*అట్లా అని, ఆయన వాత్సల్యత నీకు పూర్తిగా దూరం కాలేదులే. 


ఇప్పుడు నివ్వేం చెయ్యాలి? 
*హిజ్కియా ప్రార్ధన దేవుని ప్రణాళికను మార్చగలిగింది. *నీవునూ పశ్చాత్తాపపడి, ప్రార్ధించి తిరిగి ఆయన ప్రణాళికలోనికి ప్రవేశించగలగాలి. 
*దూరమైన తండ్రి వాత్సల్యాన్ని తిరిగి పొందుకోగలగాలి.
*అప్పుడు ఆయన కృపాసత్యములు ఎప్పుడును 
నిన్ను  కాపాడుతాయి. 

ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! 
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 

                                        40 కీర్తనా ధ్యానం 
                                        (పదకొండవ భాగం) 

లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొనియున్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల యెత్తి చూడలేకపోతిని లెక్కకు అవి నా తలవెండ్రుకలను మించియున్నవి నా హృదయము అధైర్యపడి యున్నది.
యెహోవా, దయచేసి నన్ను రక్షించుము యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము.
          కీర్తనలు 40:12,13
         ...........................

దావీదు దేవుని సహాయాన్ని అభ్యర్దిస్తున్నాడు. 


"యెహోవా, దయచేసి నన్ను రక్షించుము యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము."

దేవుని యొక్క సహాయము తనకి ఎందుకు కావాలో? దానికి గల కారణాలు చెప్తున్నాడు. 

ఎందుకంటే? 
*లెక్కలేని అపాయములు అతనిని చుట్టేసాయట. 
*ఆ దోషములు ఎంత ఎక్కువంటే? తన తల వెంట్రుకల లెక్కకు మించివున్నాయట. 
*ఇక తప్పించుకొనే మార్గమే లేదట. 

ఈ పరిస్థితికి కారణం కూడా చెప్తున్నాడు. 
"తన యొక్క పాపమే. తన యొక్క దోషమేనని". 


ఈ దోషము లేక పాపము తనకు ఎట్లా సంక్రమించింది? 
*రెండు రకాలుగా. 
1. దేవుడు చెయ్యమన్నది 
చెయ్యకపోవడం ద్వారా.
2. దేవుడు చెయ్యవద్దన్నది 
చెయ్యడం ద్వారా. 


ఈ రెండు రకాల పాపములు దావీదును వెంటాడి తరుముతున్నాయి, చివరికి పట్టుకొని బంధించేసాయి. 


ఎప్పుడైతే పాపముచేత బంధించ బడ్డాడో?
ధైర్యం కోల్పోయి, సిగ్గు అవమానంతో తలదించుకొని, దేవుని సహాయం కోసం ప్రార్దిస్తున్నాడు. 

కాని, దావీదు జీవితం నుండి నేర్చుకోవలసిన విషయమేమీటంటే? తప్పు చేసాడు. పశ్చాత్తాపపడి, దానిని ఒప్పుకొని, దేవుని సహాయానికై ప్రార్దిస్తున్నాడు. 


అయితే, మన జీవితాల్లో అట్లాంటి పశ్చాత్తాపం లేదు. 
నేటికి మనం పాపంచేత బంధించబడిన స్థితిలోనే వున్నాం. కాని, ఆ పాపాన్ని ఒప్పుకొనక, కప్పుకొని పరిశుద్దులుగా నటిస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ మనలను మనమే మోసం చేసుకొంటున్నాం. 

వద్దు! 
ఇక, గతించినకాలమే చాలు. 


ఆయన పాదాల చెంత చేరుదాం!
క్షమాపణ వేడుదాం! 
శిక్ష నుండి తప్పించబడదాం!


ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 

                                        40వ కీర్తనా ధ్యానం 
                                        (పండ్రెండవ భాగం)

నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురు గాక నాకు కీడు చేయ గోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురు గాక.
నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయ మొందుదురు గాక.
              కీర్తనలు 40:14,15

శత్రువులకు సిగ్గు, కీడు, అవమానం, నాశనం కలగాలని 
దావీదు ప్రార్దిస్తున్నాడు. 

ఇది యుక్తమైన ప్రార్ధనేనా? 
మనం ఇట్లా ప్రార్ధించవచ్చా? 
ఇట్లాంటి ప్రార్ధనలకు సమాధానం వస్తుందా? 

పాత నిబంధన కాలంలో వారు. దేవుని కృప క్రిందలేరు.  ధర్మ శాస్త్రము క్రింద వున్నారు. ఆకాలంలో అట్లా ప్రార్ధించడం సరియైనదే. 

అక్కడ వారి ఉద్దేశ్యం వ్యక్తిగత కక్షలు తీర్చుకోవాలని కాదుగాని. దేవుని న్యాయం నిత్యమూ నిలవాలని. దేవుడంటే వారికి భయం కలగాలని అట్లా ప్రార్ధించేవారు. 

కాని, నూతన నిబంధనా విశ్వాసులముగా మనం ధర్మ శాస్త్రము క్రిందలేము. కృపక్రింద ఉన్నాము. అందుచే శత్రువుల నాశనం కావాలని ప్రార్ధించడానికి వీల్లేదు. వారి విమోచనకోసం ప్రార్ధించాలి. 

నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.
              మత్తయి  5:44

ఆయన చేసేది చెప్పకుండా చెయ్యడు. 
చెప్పింది చెయ్యకుండా వుండడు.

అందుకే, 
కల్వరి సిలువలో శత్రువులు ఆయనను గేళిచేసి, హేళన చేసి చిత్ర హింసలు పెడుతున్న సందర్భంలో, వారిని ప్రేమించి వారిని గురించి ప్రార్ధిస్తున్న సందర్భమిది.  

"
తండ్రీ! వీరేమి చేయు చున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు." అంటూ శత్రువుల నిమిత్తం ప్రార్ధించాడు. 

మనమయితే, 
మన శత్రువులు మన తలంపులలోనికి రావడానికి కూడా మనం ఇష్టపడం. 
వచ్చినా కోపంతో రగిలిపోతాం. 
ఇక వారి క్షేమం గురించి ఎట్లా ప్రార్ధించగలం? 

అవును! 
లోకంలో శత్రువులు
వుండడం సహజమే!
కోపం రావడమూ సహజమే!
కాని, ఒక్క విషయం!!! 
నీశత్రువు కూడా దేవుని పోలికలోనే ఉన్నాడన్న విషయం మాత్రం మరచిపోవద్దు. 

అంతేకాదు, 
పరలోకమందున్న నీ తండ్రికి ప్రియమైన కుమారునిగా, ప్రియమైన కుమార్తెగా నీవుండాలంటే?
శత్రువులను ప్రేమించాలి. 
వారి కొరకు ప్రార్ధించాలి. 

ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 

                                          40 కీర్తనా ధ్యానం 
                                         (పదమూడవ భాగం) 
నిన్ను వెదకు వారందరు నిన్నుగూర్చి ఉత్సహించి సంతోషించుదురు గాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమ పరచబడును గాక అని నిత్యముచెప్పుకొందురు గాక.      కీర్తనలు 40:16

మనిషి పరుగులు తీస్తున్నాడు. అనేక మార్గాలను అన్వేషిస్తున్నాడు. 
దేనికోసం? ? 
సంతోషం కోసం. 

క్లబ్లు - పబ్లు 
చాటింగ్ - డేటింగ్ 
స్మోకింగ్ - డ్రింకింగ్
ఇట్లా లెక్కలేనన్ని. 

సంతోషం కోసం 
ఇంటర్నెట్ కి కనెక్ట్ అయ్యి,
దేవునితో డిస్ కనెక్ట్ అయిపోయాడు. 

ఎందుకోసం? 
గమ్యం మాత్రం ఒక్కటే. 
సంతోషం కావాలి. 

ఆ సంతోషాన్ని 
చేరుకోగలిగాడా? లేదు. 
*సంతోషం కోసం పరుగులు తీస్తే? 
సమాధానం లేకుండా పోయింది. 
*అలవాట్లకు బానిసై అధఃపాతాళానికి
 దిగిపోతున్నాడు. 

*సంతోషంకోసం ఎన్నో మార్గాలు అన్వేషించాడు. 
ఫలితం మాత్రం శూన్యం. 

*నిజమైన సంతోషం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? 
ప్రియ రక్షకుడైన యేసయ్యలోనే. 

ఎందుకంటే? 
నీకు సంతోషం ఇవ్వాలని, నీవు అనుభవించ వలసిన శ్రమలన్నీ నీకు బదులుగా ఆయనే అనుభవించాడు. 

యేసయ్యలోనే సంతోషం.
అది శాశ్వతమైనది. 

ఆ సంతోషం నీకు కావాలా? 
అయితే, 
ఆయన్ని వెదకు!

ఎక్కడున్నాడు? 
నీ హృదయమనే తలుపునొద్దనే. 
లోనికి ఆహ్వానించు. 
ఆ సంతోషాన్ని అనుభవించు. 
ఆ రక్షణను ప్రేమించు!
ఆయనను మహిమ పరచు! 


ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 

                                          40 కీర్తనా ధ్యానం 
                                      (పదునాలుగవ భాగం) 
నేను శ్రమలపాలై దీనుడనైతిని ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకుము.          కీర్తనలు 40:17
దావీదు తన అనుభవంలో
నుండి చెప్తున్న మాట. 

"నేను శ్రమలపాలై దీనుడనైతిని ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు."

*శ్రమలు తనను  దీనత్వము లోనికి నడిపించాయట.
*ఎప్పుడయితే అతడు దీనుడయ్యాడో? 
దేవుడు తనను గురించి ఆలోచించడం మొదలు పెట్టాడట.

 "దీనత్వం" అంటే తనను తాను తగ్గించుకొనుట. 
*దేవుని చిత్తానికి తలవంచుట. 

అవును!
శ్రమలు మనలను దీనత్వములోనికి నడిపించి ఆయనకు దగ్గర చెయ్యాలి. 

అంతే గాని, 
శ్రమలవల్ల దేవుని నుండి మనము దూరం కాకూడదు. 

శ్రమ మన మేలుకేగాని, 
కీడుకు కాదు. 

అందుకే దావీదు అంటాడు. 
"శ్రమ కలిగియుండుట నాకు మేలాయెను." 
శ్రమ మనలను శుద్దమైన సువర్ణముగా మార్చుతుంది. 

శ్రమ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోను ఆయనకు దగ్గరకాలేము. 

ఆరోగ్యంగా వుంటే?
 డాక్టర్ తో పనిలేదు. 

శ్రమ లేకపోతే?
దేవునితో పనిలేదు. 

*శ్రమలు, శోధనలు అనేవి నిత్యజీవానికి మార్గాలు.
*అవే నిన్ను గమ్యానికి 
నడిపిస్తాయి. 

దీనుడైన దావీదు 
నీవే నాకు సహాయము, 
నీవే నా రక్షణకర్తవు అంటూ ఆయనపైనే ఆధార పడుతున్నాడు. 

అతనికి తెలుసు దేవుడు 
తనను అలక్ష్యము చెయ్యడని. 

ఒకవేళ ఆలస్యం అవుతుందేమోనని
ఆలస్యంచెయ్యక వేగిరమే సహాయానికి రమ్మని అభ్యర్దిస్తున్నాడు. 

ఒక్కవిషయం! 
ఆయన ఆలస్యంచేసినా మన అవసరానికి మించిపోయిన ఆలస్యం మాత్రం చెయ్యడు. 

తగిన సమయమందు సమస్తమును సమకూర్చగల సమర్ధుడు.

*దీనులుగా ఉందామా? 
అయితే, దేవుని చిత్తానికి తలవంచుదాం! 
*మనము తగ్గించుకుందాం! 
*ఆయన నామాన్ని హెచ్చిద్దాం! 

ఆరీతిగా మన జీవితాలను 
సిద్ద పరచుకుందాం! 

అట్టి కృప, ధన్యత 
దేవుడుమనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్! 

(40వ కీర్తనాధ్యానం సమాప్తం)

 

కామెంట్‌లు

సందేశాల లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఎక్కువ చూపు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

పొట్టి జక్కయ్య

సమరయ స్త్రీ

పేతురు వ్రాసిన పత్రికలు

ఆరాధనకి వెళ్ళినప్పుడు కావాల్సిన సిద్ధపాటు - కనీస క్రమశిక్షణ

అబ్రాహాము విశ్వాసయాత్ర

యేసు క్రీస్తు రెండవ రాకడ

శరీర కార్యములు

పక్షిరాజు

పాపము