ఆధ్యాత్మిక సందేశాలు-2- కొన్ని కీర్తనల ధ్యానం- part-7

ఆధ్యాత్మిక సందేశాలు-2- కొన్ని కీర్తనల ధ్యానం


                                            100వ కీర్తనా ధ్యానం 
                                       (మొదటి  భాగం) 

సమస్త్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి.         కీర్తనలు 100:1


ఈ లోకం అనేక దేశాలు, అనేక జాతులు, అనేక మతాలు, అనేక భాషలు, అనేక కులాలు, అనేక వర్గాలు, అనేక తెగలతో నిండివుంది. 

వీరిలో ఒక్కొక్కరు ఒక్కొక్క దేవునిని ఆరాధించే పరిస్థితి నేటి దినాలలో కనిపిస్తుంది. 

అయితే, కీర్తనా కారుడైన దావీదు చెప్తున్నాడు. వీరంతా కలసి ఒకే ఒక్క దేవునికి మాత్రమే స్తుతి చెయ్యాలని. ఆయనే "యెహోవా" 

ఆయనను మాత్రమే ఎందుకు స్తుతించాలి? 

యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండు టకై, ఐగుప్తుదేశములో నుండి ఆ యినుపకొలిమిలోనుండి మిమ్మును రప్పించెను.
                  ద్వితి  4:20

ఐగుప్తు పాపమునకు,
యినుప కొలిమి శ్రమలకు సాదృశ్యం.

సర్వ మానవాళి పాపము చేత బంధించబడి, విడిపించుకోలేక, శోధనలు అనుభవిస్తూ నిత్య మరణం వైపు సాగిపోతున్న సమయంలో, 

తండ్రి తన ప్రియ కుమారుని ఈ లోకమునకు పంపించి మనలను, నిత్య మరణం నుండి తప్పించాడు.  

ఆయన పిల్లలుగా, ఒక రాజ్యముగా, యాజక సమూహముగా, ఆయన స్నేహితులుగా మనలను చేసుకున్నాడు. 

అందుచే సమస్త దేశాలు, అనగా సర్వ మానవాళి ఆయనను స్తుతించాలి. 

సర్వమానవాళిలో ఒకరైన నీవు ఆయనను స్తుతించ గలుగుతున్నావా?

కృతజ్ఞత గలిగి ఆయనను స్తుతిద్దాం!
అట్టి రీతిగా జీవిద్దాం! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 


                                                                          100వ కీర్తనా ధ్యానం 
                                           (రెండవ భాగం)
సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి.    కీర్తనలు 100:2

1.సంతోషముతో యెహోవాను సేవించుడి.

ఆ సేవ ఎట్లా వుండాలి అంటే?
*
పరిశుద్దమై వుండాలి.
*
దేవునికి అనుకూలమై వుండాలి. 
*
సజీవయాగాముగా మనకు మనమే సమర్పించుకొనే బలిగా వుండాలి. 
(
సజీవయాగమైన బలి అంటే? మన స్వంత శరీరాలు దేవుని మహిమార్ధం ఉపయోగపడేలా సమర్పించాలి)

పాత నిబంధన కాలములో జంతు బలులు అర్పించేవారు. ఇప్పుడు వాటితో పనిలేదు. ఆయనే మనకోసం బలి పశువుగా వధించ బడ్డాడు. 

పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది.
                  రోమా 12:1

2. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి.

ఆయన సన్నిధిని చేరి ఆయనను స్తుతించాలి. 

ఆయనను స్తుతించే ముందు నీ శరీరాన్ని సజీవ యాగముగా ఆయనకు సమర్పించాలి. 

అట్లా కాని పక్షంలో, నీ స్వరం ఎంత మధురమైనా? 
ఆ స్తుతి ఆయనకు చేరదు. 
ఆ స్తుతి ఆయనకు చెందదు.

దేవుడు మనకిచ్చిన ఈ శరీరాన్ని, తలాంతులను కేవలం మన ఘనత కోసమే ఉపయోగించు కొంటున్నామేమో?

పరిశీలన చేసుకుందాం!
సజీవ యాగాముగా మనలను మనము 
సమర్పించు కుందాం! 

ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 

           
                                               100వ కీర్తనా ధ్యానం 
                                          (మూడవ భాగం)

యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱలము.
                 కీర్తనలు 100:3

*సమస్త దేశాలు ఎందుకు యెహోవాను స్తుతించాలి? 
*
ఆయనకెందుకు ఉత్సాహ ధ్వని చెయ్యాలి? 
*
ఆయన సన్నిధిని చేరి ఎందుకు ఆయనను స్తుతించాలి? 

దానికి గల కారణాలు దావీదు చెప్తున్నాడు. 
*
ఆయనే మనలను పుట్టించాడు.
*
మనము ఆయనకు చెందినవారము.
*
ఆయన ప్రజలము
*
ఆయన మేపు గొర్రెలము.

మనలను పుట్టించినవాడు ఆయనే. పోషించే వాడు ఆయనే. 
మన కోసం ప్రాణం పెట్టినవాడు ఆయనే. 

ఆయన గొర్రెల కాపరిగా మన పట్ల ఎట్లాంటి శ్రద్ధ తీసుకొంటున్నాడో గమనించు: 

*పర్వతముల మీదను, వాగుల వద్దను, మంచి మేతగల స్థలముల యొద్ద వాటిని  మేపెదను.
*
తప్పిపోయిన వాటిని వెదకుతాను.
*
గాయపడిన వాటికి కట్టుకడతాను. 
*
బలహీనమైన వాటిని బలపరుస్తాను. 
*
నేనే నా గొర్రెలను మేపి పరుండబెడతాను. 
        యేహెజ్కేలు 34: 13-16

ఇంతకంటే నీకు చేసేవారు ఎవరూలేరు. 
ఇంతకంటే నీకు చెయ్యాల్సింది కూడా ఏమీలేదు. 

ఈ విషయాన్ని నీవు గుర్తించి, అంగీకరించినప్పుడే సజీవ యాగముగా నీశరీరాన్ని ఆయనకు సమర్పించి ఆయనను సేవించగలవు. నిజమైన స్తుతి చెయ్యగలవు. 

ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 

           
                                                         100వ కీర్తనా ధ్యానం 
                                            (నాలుగవ భాగం)
కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడి.      కీర్తనలు 100:4

మేలు అనుభవిస్తున్నప్పుడు దేవునిని స్తుతించగలం.
కాని, కీడు అనుభవించాల్సి వచ్చినప్పుడు  అట్లా చెయ్యలేం. 

ఏయే సందర్భాలలో దేవునిని స్తుతించాలి? 
ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము.     1థెస్స  5:18

అది మేలైనా, కీడైనా ప్రతీ విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 

ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. 
*
అతడు యథార్థవర్తనుడు
*
న్యాయవంతుడు
*
దేవునియందు భయభక్తులు కలిగిన వాడు. 
*
చెడుతనము విసర్జించిన వాడు.
*
గొప్ప ఆస్తిపరుడు. 

ఒక దినాన్న, 
*
షెబాయీయులు వచ్చిగాడిదలను, ఎద్దులను తీసుకు పోయారు. 
*
కల్దీయులు వచ్చిఒంటెలను తీసుకు పోయారు. 
*
ఆకాశం నుండి అగ్ని వచ్చి గొర్రెలను కాల్చి వేసింది. 
*
అరణ్యం నుండి సుడిగాలి వచ్చి తన 10 మంది పిల్లలను చంపేసింది. 

ఇట్లాంటి భయంకరమైన పరిస్థితులలో....
యోబు చెప్తున్నమాట వింటే శరీరం జలదరిస్తుంది. 

"యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక.        యోబు 1:21

ఇది నిజమైన స్తుతి. 
పరిస్థితులు ఎట్లావున్నా? వాటితో సంబంధం లేకుండా, ప్రతీ విషయమందునూ ఆయనను స్తుతించగలగాలి. 
ఆ అనుభవం లోనికి మనం రావాలి. 

ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 
                                                                          100వ కీర్తనా ధ్యానం 
                                        (ఐదవ భాగం)
యెహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతరములుండును.        కీర్తనలు 100:5
యెహోవాను ఎందుకు స్తుతించాలి? 
ఆయనకు కృతజ్ఞతా అర్పణలు ఎందుకు అర్పించాలి? 
దానికి గల కారణాలను దావీదు తెలియజేస్తున్నాడు. 
1.యెహోవా దయాళుడు:
అవును! 
*
ఆయన దయ గలిగినవాడు. 
*
క్షమించే మనస్సు గలవాడు. 
*
ప్రార్ధించే వారందరికీ కృప చూపేవాడు. 
ప్రభువా, నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడవు నీకు మొఱ్ఱపెట్టువారందరియెడల కృపాతిశయము గల వాడవు.     కీర్తనలు 86:5

2.ఆయన కృప నిత్యముండును:
కృప అంటే అర్హత లేని వాడు అర్హునిగా ఎంచబడడమే "కృప"
నేటి వరకు మనము జీవించి యున్నాము అంటే ఒకే ఒక్క కారణం. అది ఆయన "కృప మాత్రమే".
*
అది విడువక చూపే కృప. 
*
అది నిత్యమైన కృప. 
నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయెడల కృప చూపుచున్నాను.
               యిర్మియా 31:3

3.ఆయన సత్యము తరతరములుండును:
ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు.
ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దాని లోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడును మాట తప్పనివాడు.       కీర్తనలు 146:6
ఇవి చాలవా? 
ఆయనను స్తుతించడానికి? 
కృతజ్ఞతా అర్పణలు అర్పించడానికి? 

సజీవ యాగాముగా మనలను మనము 
సమర్పించు కుందాం! 
ఆయన పాదాల చెంత ప్రణమిల్లుదాం!

ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 
(100
వ కీర్తనా ధ్యానం సమాప్తం)


                                              103 వ కీర్తనా ధ్యానం 
                                                   (మొదటి భాగం)
పరిచయం:
రచయిత : : దావీదు
అంశము:  : ఆయన యొక్క దయాదాక్షిణ్యం, కృపా సమృద్ధి 
నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము.    కీర్తనలు 103:1
దావీదు తన ప్రాణముతో చెప్పుకొంటున్న మాటలు.
నా ప్రాణమా, యెహోవాను స్తుతించు.
నా అంతరంగముననున్న సమస్తమా యెహోవాను స్తుతించు.

ఎందుకంటే?
ఆయన నామము పరిశుద్దమయినది. 
ఆయనకున్న లక్షణాలలో ప్రప్రధమం పరిశుద్ధత, ఆయన అనునిత్యము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు,పరిశుద్ధుడు అని కొనియాడబడుచున్నాడు
స్తుతి పెదవులకు పరిమితం కాకూడదు. 
అది హృదయంతరంగం నుండి నిష్కపటంగా పెల్లుబికి రావాలి. 
స్తుతి అంటే?
*
దేవుని సహాయాన్ని అభ్యర్ధించడం "ప్రార్ధన". 
*
ఆయన చేసినదానికి కృతజ్ఞతలు చెప్పడం "స్తుతి". 
*
ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి ఆయనను హెచ్చించడం "ఆరాధన".
స్తుతి మన జీవితంలో ఒక భాగం కావాలి. 
"స్తుతిచేయుట యథార్థవంతులకు శోభస్కరము."  కీర్తనలు 33:1

ఎట్లాంటి పరిస్తితులలో స్తుతించాలి? 
అవి ఎట్లాంటి పరిస్థితులైనా సరే.  
యోబు ఒకే దినాన్న 10  మంది పిల్లలతోసహా,  సమస్తాన్ని కోల్పోయినప్పుడు చెప్తున్నమాట. 
ఆ మాట వింటున్నప్పుడు శరీరం జలదరిస్తుంది. మనకు 10 మంది పిల్లలువుండి, వారిలో ఒక్కరిని కోల్పోయినా ఈ మాట మనం చెప్పలేము. 
"యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును
గాక."      యోబు 1: 21
ఇదే నిజమైన స్తుతి.
మన జీవితంలో, లేదా కుటుంబంలో ఏదయినా మేలు జరిగితే "స్తుతి కూడిక" పెడతాము. అదే మనకు వ్యతిరేకముగా ఏదయినా జరిగితే? అసలు దేవుడే వుంటే ఇట్లా జరిగేదా? అని ప్రశ్నించే స్థాయికి దిగజారిపోతాం.

వద్దు ప్రతీ పరిస్తితియందు ఆయనను స్తుతించడం నేర్చుకొందాం.
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 

                                         103 వ కీర్తనా ధ్యానం 
                                            (రెండవ  భాగం)

నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము
     కీర్తనలు 103:2
    ..................................
దావీదు తన ప్రాణంతోఈరీతిగా  చెప్తున్నాడు. 
ప్రాణమా!!! "ఆయన చేసిన ఉపకారములలో దేనినీ మరువకుండా ఆయనను స్తుతించు."

ఆయన నాకేమి చేసాడు?
అని ప్రశ్నించాలి అని నీవనుకుంటే? 
ఈ ప్రశ్న అడగడానికి జీవముతో 
నీవున్నావంటే , అది ఆయన చేసిన ఉపకారమే. 

అన్నీ నీకోసం చేసాడు.
నీకంటే ముందుగా నీకు కావలసిన సృష్టినంతటిని చేసాడు. 

హాస్పిటల్ లో ఆక్సిజన్ పెట్టాలంటే గంటకి 
రూ 300. ఆ రీతిగా ఒకవేళ 60 సంవత్సరాలు జీవిస్తే  అయ్యే ఖర్చు ఎంతో తెలుసా?
 5 కోట్ల రూపాయలు. 

కాని,నేడు మనం గాలికోసం చెల్లించేది ఎంత?

ఒక లీటరు వాటర్ బాటిల్ రూ20. నీవు ఉపయోగించే నీటికి లెక్కలు కడితే? 

ఏమో? ఒకవేళ నీవు వీటికి లెక్కలు కట్టగలవేమో? కాని, 
నీవు లెక్కకట్టలేనది  మాత్రం ఒకటుంది. 
అదేంటో తెలుసా?
ఆయన నీకోసం చిందించిన "రుధిరధారలు"

అది ఏ పరిస్థితులలో  తెలుసా? 
*
మనము బలహీనులముగా వున్నప్పుడు. 
*
మనము పాపులమై వున్నప్పుడు 
*
మనము శత్రువులమై వున్నప్పుడు. 

ఇప్పుడు ప్రశ్నించ గలవా? 
దేవుడు నాకు ఏమి చేసాడు అని?

ఇప్పుడు నీవు ప్రశ్నించుకోవలసింది 
దేవుడు నాకు ఏమి చేసాడు?అనికాదు. 
దేవుని కోసం నేనేమి చేసానని? 

ఆయన కోసం మనమేమి చెయ్యగలం?
ఆయన ప్రాణమునకు బదులుగా నీ ప్రాణమును ఆయన కోరేవాడుకాదు. 

నీవు, నేను చెయ్యగలిగింది ఏదయినా వుందంటే అది, విరిగి నలిగిన హృదయంతో ఆయన చెంతచేరి, ఆయన మనకోసం చేసిన ఉపకారములను బట్టి ఆయనను స్తుతించ గలగడం ఒక్కటే.  

రక్షణ పాత్రను పట్టుకొని, కృతజ్ఞత కలిగిన హృదయాలతో సిలువ చెంత చేరుదాం! 
స్తుతులతో ఒక సింహాసనాన్ని ఆయనకోసం మన హృదయాల్లో సిద్దపరచుదాం! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 
                                             103 వ కీర్తనా ధ్యానం 
                                                (మూడవ భాగం)
ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు.      కీర్తనలు 103:3
దేవుని ఎందుకు స్తుతించాలో దానికి గల కారణాలను దావీదు చెప్తున్నాడు. 

1.
ఆయన మన అపరాధములను క్షమించువాడు:
క్షమాపణ ఇతర దీవెనలకు పునాది. క్షమాపణ లేకుండా ఇతర ఆశీర్వాదాలకు శాశ్వత ప్రయోజనం లేదు. 

ఉదా: ఆరోగ్యం, సంపద వుండి, క్షమాపణ లేకుండా మరణిస్తే? నిత్య మరణమే.
నేను నేనే నా చిత్తానుసారముగా నీ యతిక్రమము లను తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసికొనను.         యెషయా 43:25

ఆయన సిలువలో కార్చిన రుధిరధారలే మన అతిక్రమములను తుడచివేసి, మన అపరాధములకు క్షమాపణ కలిగించాయి. దీనికంతటికి మూలము "ఆయన కృపయే".

దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమో చనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.         ఎఫెస్సి 1:7 

2.
ఆయన మన రోగములను బాగుచేయు వాడు. 
అవును! స్వస్థత చేకూర్చగల సమర్ధుడు, సర్వశక్తి మంతుడు. 
దానిలో ఎట్టి సందేహం లేదు.

అట్లా అని, రోగములు స్వస్థపడడం  కోసమే ఆయన దగ్గరకి వస్తే, ప్రయోజనం శూన్యం.
నేటి దినాల్లో ఈ భోద ఎక్కువయ్యింద. ఆత్మీయ స్వస్థతను ప్రక్కన పెట్టేసి, శరీర స్వస్థతలకే ప్రాధాన్యతఇస్తున్నారు. 
ఇందుకోసమే దేవుడు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. 

ఒక్కటి మాత్రం గుర్తుంచుకో! 
ఆత్మీయ స్వస్థత లేకుండా, శారీరిక స్వస్థత నిన్ను నిత్య రాజ్యానికి చేర్చలేదు. 

ఆత్మీయ స్వస్థతను నీవు కలిగివుంటే, దానిని బట్టి దేవుని చిత్తమైతే శారీరక స్వస్థతనూ పొందవచ్చు. అట్లా అని, తప్పకుండా పొందుతావు అనే వాగ్దానం ఏమిలేదు. 

శారీరిక రోగమైతే డాక్టర్ దగ్గరకి వెళ్ళవచ్చు. 
ఆత్మీయ రోగమైతే ఆయనే శరణ్యం. 
రండి. ఆయన పాదాల చెంత చేరుదాం. 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 
                                         103 వ కీర్తనా ధ్యానం 
                                           (నాలుగవ భాగం)
సమాధిలోనుండి నీ ప్రాణమును విమోచించు చున్నాడు కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచు చున్నాడు      కీర్తనలు 103:4

దేవునిని ఎందుకు స్తుతించాలో దానికి గల కారణాలను దావీదు చెప్తున్నాడు. 

1.
సమాధిలోనుండి ప్రాణమును విమోచించు చున్నాడు:
అవును!! 
పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన మనలను,
నిత్య మరణమునకు తప్ప దేనికి అర్హత లేని మనలను , 
కోడెల రక్తము, మేకల రక్తము, గొర్రెల రక్తము మనలను పరిశుద్ద పరచలేనప్పుడు. 
ఆయన తన స్వరక్తమిచ్చి నిన్ను నన్ను సమాధి ( నిత్య మరణం) నుండి విమోచించాడు. 

"మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును,
జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను.            హెబ్రీ  2:14,15

2.
కరుణాకటాక్షములను కిరీటముగా ఉంచు చున్నాడు:
ఈ లోకంలోవున్న ఏ కిరీటము కంటెను, అత్యంత శ్రేష్టమైన కిరీటం, ఆయన మాత్రమే ఇవ్వగల కిరీటములు కరుణ, కటాక్ష్యము.

అంతే కాదు, మహిమ, ఘనత అనే కిరీటములను ధరింప చేసాడు. 

దేవునికంటె వానిని కొంచెము తక్కువవానిగా చేసియున్నావు.మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి యున్నావు.         కీర్తనలు 8:5

ఆయన మనకు ధరింపజేసిన కిరీటములే మనకు ఘనతను తీసుకొని వస్తున్నాయి. 
కాని, మనం ఆ విషయం మరచిపోయి ఆ కిరీటములను ధరింపజేసిన దేవునిని మరచి మనలను మనమే ఘన పరచుకొనే దారుణమైన స్థితికి దిగజారిపోతున్నాము.

వద్దు!
దయ, వాత్సల్యము, మహిమ, ఘనత అనే కిరీటములను ధరింపజేసిన దేవునినే స్తుతిస్తూ ..... ఆయన కోసం జీవిద్దాం. 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 

                                           103 వ కీర్తనా ధ్యానం 
                                                (ఐదవ భాగం)
పక్షిరాజు ¸యవ్వనమువలె నీ యవ్వనము క్రొత్తదగు చుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు           కీర్తనలు 103:5

దేవునిని ఎందుకు స్తుతించాలో దానికి గల కారణాలను దావీదు చెప్తున్నాడు. 
గతించన కాలం మన జీవితాల్లో ఎప్పటికీ తిరిగిరాదు. దినాలు గడిచే కొలది వృద్ధాప్యం ముంచుకొస్తుందితప్ప, కోల్పోయిన యవ్వనం తిరిగిరాదు. ఇది నిత్య సత్యం. 
కాని, వాక్యం చెప్తూవుంది. క్షిరాజు కోల్పోయిన యవ్వనము తిరిగి  పొందుకొంటుంది అని. ఇది వాస్తవమా? 

అవును!
వాక్యం చెప్పేది ఏదయినా వాస్తవమే. 

ఇది పక్షి రాజులో మాత్రమే  వున్న ఒక ప్రత్యేకమైన లక్షణము. 
పక్షి రాజు 40 సంవత్సరాలు జీవించి, వృద్ధాప్యం లోనికి చేరుతుంది. ఆసమయంలో అది ఒక ఎత్తయిన శిఖరానికి వెళ్లి, 
*
తన ఈకలన్నీ పెరికివేసు కొంటుంది.
*
తన గోర్లు లాగివేస్తుంది.
*
తన పదునైన ముక్కును బండకేసి బ్రద్దల గొట్టేస్తుంది. 
*
అట్లా ఆ రక్తపు మడుగులో  ఏవిధమైన ఆహారం లేకుండా చాల రోజులు ఉండిపోతుంది. 
*
ఈ సమయంలో  కోల్పోయిన స్థానంలో క్రొత్త ఈకలు, గోర్లు, ముక్కు వస్తాయి. 
దానితో పాటు, నూతన యవ్వనం, బలము తిరిగి పొందుకుంటుంది.
*
మరళా మరొక 30 సంవత్సరాలు జీవించి, తర్వాత మరణమవుతుంది.

అయితే, ఇక్కడ ఒక విషయం గమనించాలి. 
పక్షిరాజు నూతన బలము పొందాలంటే? తనకుతానే తన శరీరంను నలుగగొట్టు కొంటుంది. శ్రమ పడుతుంది. 

కాని, నీకు నూతన బలము, నూతన యవ్వనము ఇవ్వడానికి,  నీకు బదులుగా  నీ ప్రియ రక్షకుడైన యేసయ్య నలుగ గొట్టబడ్డాడు, శ్రమ పడ్డాడు.   

మేలుతో నీ హృదయాన్ని తృప్తి పరచాలని నీ స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. 
ఇంతచేసిన ఆయన కోసం నీవేమి చెయ్యగలవు? 
విరిగి నలిగిన హృదయంతో ఆయన పాదాల చెంతచేరి, రక్షణ పాత్రను చేత పుచ్చుకొని ఆ ప్రియ రక్షకుని స్తుతించు. అది చాలు. అంతకుమించి దేనినీ నీ నుండి ఆయన ఆశించడు.

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 
                                           103 వ కీర్తనా ధ్యానం
                                               (ఆరవ భాగం)
యెహోవా నీతిక్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికి న్యాయము తీర్చును
ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను.
           కీర్తనలు 103:6,7

దేవునిని ఎందుకు స్తుతించాలో దానికి గల కారణాలను దావీదు చెప్తున్నాడు. 

ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాస్యము నుండి ఎట్లా విడిపించాలో మోషేను ఏర్పాటు చేసుకొని ఆయన యొక్క మార్గములను తెలియజేసాడు. 

    అంతేకాదు, దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను వారికి చూపించాడు. 

బాధపరచబడువారికి ఆయన న్యాయము తీర్చును ఆకలిగొనినవారికి ఆహారము దయచేయును యెహోవా బంధింపబడినవారిని విడుదలచేయును.
            కీర్తనలు 146:7

ఐగుప్తు అనే బందీ గృహములో బందీలుగా,  430 సంవత్సరాలు వారు అనుభవించిన బాధలు వర్ణనాతీతం. 

ఆ బాధలన్నిటినుండి విడిపించి పాలుతెనేలు ప్రవహించే కనానులో వారిని ప్రవేశపెట్టాడు. 

ఐగుప్తు "లోకమునకు, పాపమునకు" సాదృశ్యం. లోకానికి సారధి అయిన సాతాను చేతిలో బందీలుగా తర తరాలుగా మనం జీవిస్తున్నాం. 


తండ్రి తన మార్గములను కుమారుడైన యేసయ్యకు తెలియజేసి ఈ లోకానికి పంపించి నిన్ను నన్ను సాతాను బంధకాల నుండి సిలువ మరణం ద్వారా విడిపించి, పరమ కనాను చేరుటకు మార్గము సిద్దం చేసాడు. 


ఇంతచేసిన ఆయన కోసం నీవేమి చెయ్యగలవు? 
విరిగి నలిగిన హృదయంతో ఆయన పాదాల చెంతచేరి, రక్షణ పాత్రను చేత పుచ్చుకొని ఆ ప్రియ రక్షకుని స్తుతించు. అది చాలు. అంతకుమించి దేనినీ నీ నుండి ఆయన ఆశించడు.


అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 


                                       103 వ కీర్తనా ధ్యానం 
                                           (ఏడవ భాగం)
యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపాసమృద్ధిగలవాడు.        కీర్తనలు 103:8
దేవునిని ఎందుకు స్తుతించాలో దానికి గల కారణాలను దావీదు చెప్తున్నాడు. 

1.
యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు:
దేవుని దయ సంపూర్ణమయినది. ఇశ్రాయేలీయులు అరణ్యములో సణుగుతూ వున్నారు. దేవుని మీద తిరుగుబాటు చేస్తూ వున్నారు. అయినా ప్రతీ పరిస్థితియందు వారి అవసరతలు తీరుస్తూ వారిని ముందుకు నడిపిస్తూ వున్నాడు.

మన జీవితాలు అంతే. భక్తి చేస్తున్నాం. కాని ఆ భక్తిలో భయం లేదు. సంతృప్తికి చోటేలేదు. అయినా, ఆయన దయాళుడు కాబట్టి ఇట్టి రీతిగా జీవింప చేస్తున్నాడు. 

2.
యెహోవా దీర్ఘశాంతుడు:
ఇశ్రాయేలీయులు జరిగించిన ప్రతీ పరిస్థితిని ఆయన సహిస్తున్నాడు. 
మన జీవితాలు అంతే. మన పట్ల కూడా అదే దీర్ఘ శాంతమును చూపు చున్నాడు. 
క్షణక్షణం ఆయన గాయాలను రేపే వారిగానే వున్నాం. 
ప్రతీ క్షణం ఆయనను సిలువ వేస్తూనే వున్నాం. 
ఒక్క క్షణం ఆయన కన్నెర్ర చేస్తే ఏమవుతుందో తెలుసా?  అది ఊహలకే భయంకరం.
వద్దు! ఆయన సహనాన్ని చులకన చెయ్యొద్దు. 

3.
యెహోవా కృపాసమృద్ధిగలవాడు:

ఏ అర్హత లేని మనం నిర్మూలము కాకుండా నేటి వరకు నిలిచి యున్నామంటే ఆయన యొక్క సమృద్ధి అయిన కృప మాత్రమే. 

"యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము"       విలాప 3:22
అవును!
సందేహం లేనేలేదు. 

నీ కోసం ఇంత శ్రద్ధ కలిగియున్న ఆయన కోసం నీవేమి చెయ్యగలవు? 

విరిగి నలిగిన హృదయంతో ఆయన పాదాల చెంతచేరి, రక్షణ పాత్రను చేత పుచ్చుకొని ఆ ప్రియ రక్షకుని స్తుతించు. అది చాలు. అంతకుమించి దేనినీ నీ నుండి ఆయన ఆశించడు.

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 
                                        103 వ కీర్తనా ధ్యానం 
                                           (ఎనిమిదవ భాగం)
ఆయన ఎల్లప్పుడు వ్యాజ్యెమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు.
మన పాపములనుబట్టి మనకు ప్రతికారము చేయలేదు మన దోషములనుబట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు.
           కీర్తనలు 103:9,10
దేవునిని ఎందుకు స్తుతించాలో దానికి గల కారణాలను దావీదు చెప్తున్నాడు. 
*ఆయన మనతో వాదించేవాడు కాదు. 
*నిత్యము కోపించేవాడు కాదు. 
*మన పాపములకు ప్రతీకారం చేసినవాడు కాదు.
* మన అపరాధములకు ప్రతిఫల మిచ్చినవాడు కాదు.
ఒకవేళ,
*ఆయన వాదిస్తే వాదించ గలవాడెవడు?
*ఆయన కోపిస్తే నిలువబడ గలవాడెవడు?
*ఆయన ప్రతీకారంచేస్తే తప్పించుకో గలవాడెవడు?
*ఆయన ప్రతిఫలమిస్తే కాదని ప్రశ్నించ గలవాడెవడు?

అట్లాఅని,
*ఆయన వాదించడు
*కోపించడు 
*ప్రతీకారం చెయ్యడు
*ప్రతిఫలం ఇవ్వడు
అని ఎట్టి పరిస్థితులలోనూ తలంచకు. 

ఒక్క విషయం జ్ఞాపకముంచుకో!!!
*ఆయనే వాదించాల్సివస్తే?
ఒక్క ప్రశ్న చాలు. నీదగ్గర సమాధానం లేదు. 
*ఆయనే కోపించాల్సివస్తే ?
ఒక్క నిమిషం చాలు. ఇక నీవే వుండవ్.
*ఆయనే ప్రతీకారం చెయ్యాల్సివస్తే?
అది నిత్య మరణమే. 
*ఆయనే ప్రతిఫలమియ్యాల్సివస్తే?
అగ్ని గుండమే. 
ఆయన ప్రతీకారం చెయ్యలేదు.ప్రతిఫలమియ్యలేదు. సరికదా తన ప్రాణమునే నీకోసం అర్పించాడు. 
నిన్ను ఇంతగా ప్రేమించిన  ఆయన కోసం నీవేమి చెయ్యగలవు? 
విరిగి నలిగిన హృదయంతో ఆయన పాదాల చెంతచేరి, రక్షణ పాత్రను చేత పుచ్చుకొని ఆ ప్రియ రక్షకుని స్తుతించు. అది చాలు. అంతకుమించి దేనినీ నీ నుండి ఆయన ఆశించడు.
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 
                                          103 వ కీర్తనా ధ్యానం 
                                            (తొమ్మిదవ భాగం)
భూమికంటె ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయనయందు భయభక్తులు గలవారియెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది
పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూర పరచి యున్నాడు.
          కీర్తనలు 103:11,12

దేవునిని ఎందుకు స్తుతించాలో దానికి గల కారణాలను దావీదు చెప్తున్నాడు. 
దేవుడు మన అతిక్రమములను ఎంత దూరపరిచాడో, తన కృపను అంత దగ్గర చేసాడు. 

ఆయన కృప ఎంత అత్యున్నతమైనదో? అది వర్ణనకే సాధ్యం కాదు. 
అందుకే దావీదు అంటున్నాడు. 
యెహోవా, నీ కృప ఆకాశము నంటుచున్నది నీ సత్యసంధత్వము అంతరిక్షము నంటుచున్నది.     కీర్తనలు 36:5 

అయితే, ఈ కృప ఎవరికోసం?
దీనికో షరతు వుంది. 
ఎవరయితే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి మాత్రమే చెందుతుంది, 
భక్తి చేస్తున్నాం. దానికి లోటు లేదు. 
కాని, అది భయముతో కూడిన భక్తి మాత్రం కాదు. భక్తిలో భయం లోపిస్తుంది. 

అదెట్లా?
*
మన ఇంటి గోడల మీద దేవుని వాక్యాలతో కూడిన వాల్ పోస్టర్స్. అది మంచిదే. కాని ఆ వాక్యాలు గోడలకే పరిమితం. ఇంట్లో పరిస్థితి మాత్రం అంతా వేరు. 
"
యేసే ఈ గృహాధిపతి" అంటా. అధిపతి కాదుకదా, అసలు ఆ గృహంలో యేసయ్యకే స్థానం వుండదు.
మెడలో సిలువ. అదేదో భక్తి అనుకొంటాం. కాని మనం చేసే పనులు చూస్తే దయ్యాలు కూడా ఓహ్ మైగాడ్ అని ఆశ్చర్యపోయేలా వుంటాయి. మెడలో సిలువ ఉంది అనే భయం ఏ కోశానా ఉండదు.
ఇట్లా కోకొల్లలు.  ఇవన్నీ మేము భక్తిపరులం అని చెప్పుకోవడానికి మనం పడేతిప్పలు తప్ప, చేసే భక్తిలో మాత్రం భయం లేదు. 

వద్దు! వేశ్యనయినా క్షమిస్తాను గాని, వేషధారిని క్షమించను అంటున్నాడాయన.
భక్తి చేస్తున్నాం కాని, ఆయన శక్తిని ఆశ్రయించలేక, మనం చేసే భక్తిలో భయంలేక  ప్రతిఫలాలు పొందలేకపోతున్నాం. 

భయముతో కూడిన భక్తి చేద్దాం!
ఆయన కృపకు మరింత దగ్గరవుదాం!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 
                                          103 వ కీర్తనా ధ్యానం 
                                             (పదియవ భాగం)

తండ్రి తన కుమారులయెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును.
మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసికొను చున్నాడు.     కీర్తనలు 103: 13,14

తండ్రి తన కుమారుల యెడల ఎట్లా జాలి చూపిస్తాడో మన పరలోకపు తండ్రి కూడా ఆయన యందు భయ భక్తులు కలిగిన తన పిల్లలపట్ల కూడా అదే రీతిగా జాలిని కలిగి ఉంటాడు. 

కారణం ఏంటో తెలుసా?
ఆయన చేతులే మనలను నిర్మించాయి. మనము మంటి వారమని ఆయనకు తెలుసు.

ఏల యనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను.        ఆది 3:19

మనము బలహీనులము, మంటివారమని చెప్పి, ఆయన మన పట్ల జాలిని చూపిస్తుంటే?

మనమేమో ఇది నా నీతి, నా పరిశుద్దత, నా తెలివి, నా జ్ఞానం అంటూ నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం నేనే అంటూ అతిశయిస్తున్నాం. 


అంతేగాని, పెంట కుప్పల మీద ఉండాల్సిన మనలను మింటపైన ఘనులతో కూర్చుండ బెట్టాడు అనే సత్యాన్ని అర్ధం చేసుకోలేకపోతున్నాం.


ప్రతీ పరిస్థితియందు ఆయన మనపట్ల జాలి చూపి మనలను ఈస్థితిలో ఉంచాడు అనే విషయాన్ని గుర్తిద్దాం!
అంగీకరిద్దాం!
ఆయనను స్తుతిద్దాం!


అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 

                                          103 వ కీర్తనా ధ్యానం 
                                           (పదకొండవ భాగం)
నరుని ఆయువు గడ్డివలె నున్నది అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును.
దానిమీద గాలి వీచగా అది లేకపోవును ఆ మీదట దాని చోటు దాని నెరుగదు.        కీర్తనలు 103: 15,16
అవును!
మనిషి జీవితం క్షణబంగురం.
అంతలోనే కనిపించి అంతలోనే మాయమయ్యే నీటి బుడగ వంటిది. 
దాని అందం వర్ణనాతీతం. లెక్కలేని రంగులతో ఎవ్వరినైనా ఇట్టే ఆకర్షిస్తుంది. కాని దాని అందం ఎంతసేపు? ఏ క్షణంలో పగిలిపోతుందో? 

గడ్డి పువ్వు అందం అద్భుతం, దానికీ ఎన్ని రంగులో? గాలిలో అటూ ఇటూ ఊగుతూ వుంటే దాని వైభవం మరింత పెరిగిపోతుంది. కన్నార్పకుండా చూడాలనిపిస్తుంది. 
కాని, దాని అందం ఎంతసేపు? 
దాని వైభవం ఎంత కాలం? 
మన జీవితాలు అంతే. ఈ రంగుల ప్రపంచంలో ఇదే శాశ్వతం ఆనుకొని అంతా నేనే, నాకు నేనే సాటి. అనుకొంటూ దేవుడంటే భయము భక్తి లేని జీవితాన్ని జీవిస్తున్న మనము ఏ క్షణాన్ని వాడిపోతామో?  రాలిపోతామో?
సర్వశరీరులు గడ్డినిపోలినవారు, వారి అంద మంతయు గడ్డిపువ్వువలె ఉన్నది; గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును.      1పేతురు 1:24

ఆ ఎండిన గడ్డిపువ్వు గాలిచేత నెట్టబడినప్పుడు దాని గమ్యమెటో దానికి తెలియదు. మరల ఎప్పటికీ కూడా తన స్థలానికి తిరిగి చేరుకోలేదు. 
ఈలోకంలో ఎన్ని రంగులు మార్చినా, ఒకదినాన్న ఈ లోకాన్ని విడవాల్సిందే?

అది నీ ప్రాణం పోకడో? 
దేవుని రాకడో? 
ఏదయినా కావొచ్చు. 
మరళా ఎప్పటికీ నీ స్థలానికి రావు. 

వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదువారి స్థలమున వారు మరి ఎప్పుడును కనబడరు    యోబు  20:9
మనవి అంత అల్ఫమైన జీవితాలు, మట్టి జీవితాలు అని ఆయన జ్ఞాపకం చేసుకొని మనపై జాలి చూపి, ఆయన కృపతో మనలను నడిపిస్తుంటే? 

మనమేమో, దేవునికే ఎదురాడు వారివలే జీవిస్తున్నామేమో?
వద్దు! అల్పమైన ఈ జీవితం ఆయనకోసం జీవించి, శాశ్వత రాజ్యమును స్వతంత్రించు కుందాం!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 
                                           103 వ కీర్తనా ధ్యానం 
                                             (పండ్రెండవ భాగం)
ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడల ననుస రించి నడచుకొను వారిమీద యెహోవాయందు భయభక్తులు గలవారిమీద
ఆయన కృప యుగయుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్లపిల్ల తరమున నిలుచును.
    కీర్తనలు 103: 17,18

ఆయన నిబంధన, కట్టడ అనగా "దేవుని వాక్యము."
ఎవరయితే దేవుని వాక్యమును అనుసరిస్తారో? 
ఎవరయితే  దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో?
వారి మీద ఆయన కృప వారి పిల్ల తరములు నిలిచి వుంటుంది. 
అవును!
మన జీవితాలు మన పిల్లలమీద ప్రభావం చూపుతాయి. 

ఆ దినాలలో ఒకమాట వాడుకలో వుండేది. 
"తండ్రులు ద్రాక్షలు తింటే పిల్లల పళ్ళు పులుస్తాయి."అని
అంటే దీని అర్ధం, తలిదండ్రులు జరిగించిన క్రియల ఫలితాన్ని వారి బిడ్డలు అనుభవించాల్సి వస్తుందని. 

అట్లానే, మనము తలిదండ్రులుగా దేవుని యెడల భయభక్తులు కలిగి జీవిస్తే ఆ ప్రతిఫలం మన పిల్లలు అనుభావిస్తారట. 
అట్లాఅని, మనము రక్షించబడి మన పిల్లలు రక్షణ లేని వారయితే, మనలను బట్టి వారు నిత్య జీవంలోనికి ప్రవేశించరు. 

కాని ఒక్క విషయం!!
మనము రక్షించబడిన వారమైతే మన జీవిత విధానం మన పిల్లల మీద ప్రభావం చూపి వారును రక్షణలోనికి వచ్చే అవకాశం తప్పక వుంటుంది. 

అంతేగాని,
చేదు విత్తులు విత్తి, శ్రేష్ఠ ఫలాలకోసం  ఎదురు చూడొద్దు. 
కొబ్బరి చెట్టు నుండి ఖర్జూరాలు ఆశించ్చొద్దు

*ఆయన యందు భయభక్తులు కలిగియుందాం!
*ఆయన కట్టడలను, నిబంధనలను అనుసరిద్దాం!
*ఆయన కృపకు మరింత దగ్గరవుదాం!
*తద్వారా మన పిల్లలు ఆశీర్వదించ బడడానికి కారకులవుదాం! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 

                                              103 వ కీర్తనా ధ్యానం 
                                               (పదమూడవ భాగం)

యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిర పరచియున్నాడు. ఆయన అన్నిటిమీదరాజ్యపరిపాలనచేయుచున్నాడు.
యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకులోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి.
    కీర్తనలు 103: 19,20
     .....................................

"ఆకాశము నా సింహాసనము 
భూమి నా పాద పీఠము"
             యెషయా 66:1


ఆయన ఎంత అత్యున్నతుడో ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాయి.

ఆకాశమునే ఆయన సింహాసనముగా చేసుకొని కూర్చుంటే, 
ఆయన పాదములు భూమిని తాకుతున్నాయట.

అంతటి గొప్ప దేవునిపై  6 అడుగులు పొడవు కూడా లేని ఈ మనిషి ఎదురు తిరుగుతున్నాడంటే?
అది మూర్ఖత్వమో?అమాయకత్వమో? 

ఆయన ఒక దేశానికే రాజు కాదు. 
రాజులకే రాజు.
విశ్వమంతటికి రారాజు. 

దూతలు మొదలుకొని సామాన్య మానవుని వరకు ఆ రాజుని స్తుతిచెయ్యాలని దావీదు జ్ఞాపకం లోనికి తీసుకొని వస్తున్నాడు. 

సర్వజనులారా, చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవునిగూర్చి ఆర్భాటము చేయుడి.
యెహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజై యున్నాడు.
              కీర్తనలు 47:1,2


బలహీనత చేత కృంగిపోతున్న నీవు ఆయన వాక్యాన్ని అనుసరిస్తున్నట్లయితే?
ఆయన మనకు  పెట్టిన పేరేంటో తెలుసా?
"
బలశూరులు".

శారీరకంగా బలహీనులమే కావొచ్చు. 
ఆత్మీయంగా బలవంతులం. 

ఎందుకంటే?
ఆయన బలవంతుడైన దేవుడు. 
ఆయన పిల్లలమైన మనం బలశూరులం.

మనకు బలమిచ్చి,
మనకోసం బలియాగమైన, 
ఆ దేవునికి మనమేమిచ్చి ఋణం తీర్చుకోగలం? 

మనసారా!
నోరారా! 
ఊరూరా! 
ఆయన స్తుతించడం తప్ప. 

ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచు కొందాం! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 


                                                121వ కీర్తనా ధ్యానం 
                                                    (మొదటి  భాగం)
కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడనుండి వచ్చును?
యెహోవావలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు.      కీర్తనలు 121:1,2

ప్రతీ యూదుడు సంవత్సరమునకు మూడు సార్లు నియామిక దినాల్లో యెరుషలేము వచ్చి దేవునిని ఆరాధించాలి. ఇది దేవుడు ఇశ్రాయేలీయులకు నియమించిన నిబంధన. 
యెరుషలేము పట్టణము యూదయ కొండల్లో ఎత్తయిన ప్రదేశంలో వుంది. 
యాత్రికుడు ఆ కొండల దగ్గరకు వచ్చి, ఎక్కబోయేముందు ఆ కొండలవైపు కన్నులెత్తి చూస్తూ తనలోతాను ఈరీతిగా ప్రశ్నించుకొంటున్నాడు. 

కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడనుండి వచ్చును?
దానికి సమాధానం ఆయనే చెప్పుకొంటున్నాడు. 

యెహోవాయే నాకు సహాయం చెయ్యగలడు. భూమిని, ఆకాశాన్ని సృష్టించిన సర్వ శక్తిమంతుడైన దేవుడు ఆయనే. ఈ కొండలను ఎక్కడానికి ఆయనే శక్తిని అనుగ్రహించగలడు. 

అవును!!
*
కొండల్లాంటి సమస్యలు నీ జీవితంలో ఎదురుపడినప్పుడు, వాటిని అధిగమించే శక్తి నీకు లేనప్పుడు  ...... 
ఆ సమస్య నుండి విడిపించగల సమర్ధుడు, శక్తిమంతుడు ఆయనే. 

*
కొండలాంటి సమస్యను చూచి భయపడకు. 

*
కనానును వేగు చూడడానికి వెళ్ళిన మనుష్యులు "ఉన్నత దేహులను " చూచారు. 
కాని, కాలేబు "ఉన్నత దేవుని" చూడగలిగాడు. 

*
వారు కొండలాంటి సమస్యను చూచారు. 
కాని, కాలేబు ఆ సమస్యను పరిష్కరించగల దేవునిని చూడగలిగాడు.

*
ఆయన వైపే చూద్దాం! 
*
ఆయన సహాయానికై వేచియుందాం!

ఆరీతిగా మన జీవితాలను 
సిద్ద పరచుకుందాం! 
అట్టి కృప, ధన్యత 
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్! 
121 కీర్తనా ధ్యానం
(రెండవ భాగం)
ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు నిన్ను కాపాడువాడు కునుకడు.
ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు       కీర్తనలు 121:3,4
కొండలు ఎక్కే సమయంలో కాలుజారితే ఏమి జరుగుతుందో ఊహించలేము. ఏదయినా జరగొచ్చు.
కాళ్ళు చేతులు విరగొచ్చు, తల పగిలి ప్రాణాలు పోవచ్చు. 

కొండలు ఎక్కే సమయంలో ....
ఒకవేళ నీవు అలసిపోయి ,శక్తి లేక, నిద్ర ఆవరించి నీకాలు తొట్రిల్లినా? 
నిన్ను కాపాడే దేవుడు మాత్రం కునుకక, నిద్రపోక నీవు వేసే ప్రతీ అడుగుకు తోడుంటాడు. 
అందుకే దావీదు అంటాడు. 
"నాకాలు జారెనని నేననుకొనగా యెహోవా, నీ కృప నన్ను బలపరచుచున్నది."     కీర్తనలు  94:18

అంతే కాదు, 
నీ జీవిత పయనంలో, అనేక సూదంటి రాళ్ళ వంటి సమస్యలు తారసపడతాయి. వాటి మీద అడుగు వెయ్యలేము. 
వేస్తే? రక్తం ఏరులై ప్రవహిస్తుంది.

అటువంటి సందర్భాలలో, దేవుడే తన దూతలను పంపిస్తాడట. ఆ దూతలు ఆ సూదంటి రాళ్ళ వంటి భయంకరమైన సమస్యలు దాటే వరకు నిన్ను ఎత్తుకొని మోస్తారట. 

అంటే? కనీసం ఆ రాళ్ళకుండే  ధూళికూడా నీ పాదములకు అంటుకోదు. 
నీ పాదములకు రాయి తగులకుండ వారు నిన్ను తమ చేతులమీద ఎత్తి పట్టుకొందురు        కీర్తనలు  91:12

అవును! 
నీవు ఎదుర్కోలేని సమస్యలు నీకు ఎదురు పడినప్పుడు ఆయనే నిన్నెత్తుకొని ఆ సమస్యలగుండా నిన్ను దాటిస్తాడు. 
నీ దారి మార్చడు. అదే దారిలో ఆయన నీతో ఉంటాడు. 
ఆయనే నీతో వుంటే? 
అగ్ని గుండములో సహితము ఆనందమే కదా! 
కలవర పడకు, 
కన్నీళ్లు రానియ్యకు.
ఆయన వైపే చూడు! ఆయన సహాయానికై వేచియుండు!
ఆరీతిగా మన జీవితాలను 
సిద్ద పరచుకుందాం! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్! 
                                                 121వ కీర్తనా ధ్యానం 
                                                    (మూడవ  భాగం)
యెహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడిప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును.
పగలు ఎండ దెబ్బయైనను నీకు తగులదు. రాత్రి వెన్నెల దెబ్బయైనను నీకు తగులదు.     కీర్తనలు 121:5,6

*
ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు 
*
ఆయన నిన్ను కాపాడువాడు 
*
ఆయన కునుకడు,నిద్రపోడు.
*
ఆయన కృప నీడలా నిన్ను వెంటాడుతుంది. 
*
నీ నీడ అన్ని వేళల్లో నిన్ను వెంటాడదు. ఆయన కృప అనే నీడమాత్రం  అనుక్షణము నిన్ను వెంటాడుతూనే వుంటుంది. 

*
పగలు ఎండ దెబ్బయైనను నీకు తగులదు. రాత్రి వెన్నెల దెబ్బయైనను నీకు తగులదు.

అంటే? సూర్య చంద్రగోళాల వల్ల వడదెబ్బగాని, ఇతర వ్యాధులు, మరణంగాని  ఏమీ సంభవించవని దీని అర్ధం కాదు. 

ఆయన అనుమతి లేకుండా రాత్రి గాని, పగలుగాని, ఏ విప్పత్తు వాటిల్లదని. 

ఒకవేళవాటిల్లినా? 
దానిలో కూడా ఒక మేలును 
నీకోసం దాచివుంచుతాడు దేవుడు. 

దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.           రోమా  8:28

అయితే ఒక్కవిషయం! 
శ్రమల ద్వారా నీకు కలిగే మేలు ఏంటో అది పొందుకునేవరకు నీకర్ధంకాదు. 

ఆయన ఏ రీతిగా నీకు తోడుగా వుంటాడు అనేది మనకు అర్ధం కావాలంటే?  
విసిగిపోకుండా అంతము వరకూ వేచిచూడగలగాలి. 

ఆరీతిగా మన జీవితాలను 
సిద్ద పరచుకుందాం! 

అట్టి కృప, ధన్యత 
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్ఆమెన్ ఆమెన్!
                                                                121వ కీర్తనా ధ్యానం 
                                                      (నాలుగవ భాగం)
ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను కాపా డును ఆయన నీ ప్రాణమును కాపాడును.
ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును.       కీర్తనలు 121:7,8

*
ఆయన నిన్ను కాపాడుతాడు. 
*
నీ ప్రాణమును కాపాడుతాడు. 

*
బయటకి వెళ్ళిన వారు క్షేమంగా తిరిగి వస్తారు అనే నమ్మకంలేని ఈరోజుల్లో మనము, మన కుటుంబాలు సజీవంగా 
ఉన్నాయి అంటే? 
అది దేవుని కాపుదల మాత్రమే.

*
ఆయన కాపుదలలో.....
ఆపదలు సంభవించిన తర్వాత ఆయన కాపాడిన సందర్భాలు కొన్ని అయితే? 
ఏ ఆపద మన దరిచేరకుండా మనలను కాపాడిన సందర్భాలు లెక్కలేనన్ని. 

*
ప్రతి దుష్కార్యమునుండి తప్పించ బడుతున్నాము అంటే? అది ఆయన కాపుదల మాత్రమే. 

*
అంతే కాదు, 
ఈ జీవితం ముగించిన తర్వాత రెండు శాశ్వతమైన స్థలాలున్నాయి. 
1.
నిత్య జీవం 
2.
నిత్య మరణం 
అయితే,  నిత్య మరణంలోనికి పోకుండా ఆయన నీ ప్రాణమును కాపాడుతాడు. 
ప్రభువు ప్రతి దుష్కార్యమునుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగయుగములు ఆయనకు మహిమ కలుగును గాక, ఆమేన్‌.       2 తిమోతి  4:18

మనము ఈ లోకంలో బాటసారులం, యాత్రికులం. మన జీవితమే నిరంతర ప్రయాణం. 

ఈ ప్రయాణంలో కొండలు, లోయలు,మెట్టలు (శ్రమలు, శోధనలు,వేదనలు, సంతోషం) ఇంకా..... ఎన్నెన్నో అనుభవాలుి మన ప్రతీ పరిస్తితి యందు ఆయన తోడైయుండి మన గమ్యమైన నిత్య రాజ్యం చేర్చుతాడు. 
ఆయన వైపే చూడు! ఆయన సహాయానికై వేచియుండు!
ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్! 
 (121వ కీర్తనా ధ్యానం సమాప్తం)



122
 కీర్తన


   122 కీర్తనా ధ్యానం
(మొదటి  భాగం)
యెహోవా మందిరమునకు వెళ్లుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని.       కీర్తనలు 122:1

ప్రతీ యూదుడు సంవత్సరమునకు మూడు సార్లు నియామిక దినాల్లో యెరుషలేము వచ్చి దేవునిని ఆరాధించాలి. ఇది దేవుడు ఇశ్రాయేలీయులకు నియమించిన నిబంధన. 
రాజైన దావీదు దగ్గరకు ప్రజలు వచ్చి మనం దేవునిని ఆరాధించడానికి ఆయన మందిరానికి వెల్దామన్నప్పుడు దావీదు సంతోషానికి గల కారణాలు రెండు. 
1. ప్రజలు దేవునిని ఆరాధించాలనే మనసు కలిగియున్నందుకు. 
2. తన ప్రజలతో కలసి తానుకూడా  దేవునిని ఆరాధించే అవకాశం కలిగినందుకు. 

*దేవునిని ఆరాధించడానికి దేవుని మందిరానికే ఎందుకు వెళ్ళాలి? 
1.దేవుని మందిరంలో ఆయన నివసిస్తున్నాడు.
2. దేవుని మందిరంలో ఆయన తేజోమహిమ నిలచియుంది. 

అందుచే దావీదు దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నాడు. 
యెహోవా, నీ నివాసమందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించు చున్నాను.       కీర్తనలు 26:8

మనకయితే, దేవుని మందిరం అంటే లెక్కేలేదు. 
కారణం? ఆయన ప్రకాశమానమైన మహిమ మందిరంలో వుంది అనే గ్రహింపు మనకు లేనేలేదు. 
అసలు అట్లాంటి గ్రహింపే లేనప్పుడు, ఇక ఆ మహిమను ఎట్లా అనుభవించగలము? 

అందుకే, 
దేవుని మందిరానికి వెళ్ళడం అలవాటుగా మారింది తప్ప,  ఆనందించే హృదయం దేవునికి దూరమయ్యింది. 
సంతోషం కరువయ్యింది. 

రాజు సహితం తన పనులన్నీ ప్రక్కనపెట్టి, ఆయనను ఆరాధించడానికి పరుగులెడుతుంటే? 
మనమేమో, మన పనులన్నీ అదేరోజు పెట్టుకొని  దేవుని సన్నిధికి దూరమవుతున్నాము. 

వద్దు!!
దేవుని మందిరమంటే? ఆయన తేజో మహిమ నిలచియుండే స్థలము. ఆ మహిమను, ఆ ప్రసన్నతను అనుభవించడానికి సంతోషంతో పరుగులుతీద్దాం! 

ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం! 
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్! 
122 కీర్తనా ధ్యానం
(రెండవ  భాగం)

యెహోవా మందిరమునకు వెళ్లుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని.        కీర్తనలు 122:1
           ..........................

రాజైన దావీదు దగ్గరకు ప్రజలు వచ్చి మనం దేవునిని ఆరాధించడానికి ఆయన మందిరానికి వెల్దామన్నప్పుడు దావీదుకి చెప్పలేనంత సంతోషం కలిగింది.

కారణం?
దేవుని మందిరంలోనికి ప్రవేశిస్తే? కలిగే శాంతి, సమాధానం అది అనుభవించిన వారికే అర్ధమవుతుంది. అట్లాంటి అనుభవం కలిగియున్నవాడు దావీదు.

ఇట్లాంటి అనుభవాన్నే, ఆశనే  కోరహు కుమారులు కూడా కలిగియున్నారు.

దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా, నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది.
         కీర్తనలు 42:1

దుప్పి తన దప్పిక తీర్చుకోవడం కోసం చేసే ప్రయత్నం ఎట్లాంటిది అంటే?
తన ప్రాణముణే ఫణముగాపెట్టి, ప్రాణమును రక్షించుకోవడం వంటిది.

ఎండమావులే నీటి మడుగులుగా భ్రమించి, ఆశతో అంతులేని వేగముతో సాగిపోతున్న దుప్పికి ఎంత దూరం ప్రయాణించినా, దాని ఆశలు అడియాశలే.

కాని నీటి మడుగును చేరేవరకు దాని ఆశ చావదు. తన పయనం ఆగదు.   

నీటి మడుగు కోసం తాను చేసే ప్రయాణంలో ఎన్నో ఆపదలు.
పొదల చాటున పొంచివుండే పులులు, సింహాలు.
 అయినా వేటిని లెక్కచెయ్యకుండా సాగిపోతుంది గమ్యం చేరేవరకు. నీటి మడుగును చేరగానే, తాను చేసిన ప్రయాణం, అలసట ఏమి గుర్తుండదు. ఆనందంతో కేరింతలు కొడుతుంది.

దాని ఆశ దాని గమ్యం చేర్చుతుంది.
మరి నీ ఆశ ఏమిటి?
నీ గమ్యమేమిటి?

శారీరాశా?
నేత్రాశా?
జీవపు డంబమా?
దాని కోసమేనా నీ పోరాటం?
అయితే, గమ్యం భయంకరం.

కాని, కీర్తనా రచయితలు అయిన కోరహు కుమారుల ఆశ మాత్రం 
" యేసయ్య నిన్ను చేరాలన్నది మా ఆశ."
ఎందుకు?
కృంగిన జీవితాలకు ఆదరణ,
నలిగిన వారికి ఓదార్పు,
బహీనులకు బలం,
ఆపదలో ఉన్నవారికి విడుదల.
ఆయన చెంతే సాధ్యం.

జీవిత పరుగు పందెములో అలసిపోయావా?
ఆయన చెంత చేరు.
నీ కన్నీటిని ఆయన ప్రేమతో తుడుస్తాడు.

ఈమాట చెప్పగలవా?
"యేసయ్యా నిన్ను చేరాలన్నదే నా ఆశ"
చెప్పగలిగితే ఆయనే నీకు ఎదురొస్తాడు.
నిన్నెత్తుకుంటాడు. ఎప్పటివరకు? ముదిమి వరకు.

కాని ఆయన్ని చేరే మార్గంలో కొన్ని ఇబ్బందికర పరిస్తితులు వుంటాయి.
క్రూర మృగం(సాతాను) పొంచివుంటుంది.
భయపడకు సాగిపో.
ఆయన చెంత చేరు వరకు.

అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక !
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్!
                                                   122వ కీర్తనా ధ్యానం 
                                                     (మూడవ భాగం)

యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి

యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణమువలె నీవు కట్టబడియున్నావు

ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్లును.
           కీర్తనలు 122:2-4
         ............................

జెరూషలేము ఇశ్రాయేలు రాజధాని. 
పరిపాలనకు, ఆరాధనకు అది కేంద్ర స్థానం. 
అది దేవుని పట్టణం. 

పండ్రెండు గోత్రాల వారిని ఒకే త్రాటిపై నడిపించే శక్తిగా వుండాలని దేవుని ఉద్దేశ్యం. 

అందుకే ఆరాధన నిమిత్తం సంవత్సరానికి కనీసం మూడు సార్లు అక్కడకి వెళ్లాలని తన ప్రజలకు ఆయన అజ్ఞాపించడానికి కారణం ఇదే. 

వారందరికీ ఒక కేంద్రం, ఒక హృదయం, ఒక విశ్వాసం వుండాలని ఆయన కోరాడు. 

ఇపుడైతే, విశ్వాసులకు లోకంలో ఒక కేంద్రమంటూ ఏదీ లేదు. పైనున్న నూతన యెరూషలేమే వారి నగరం. 
వారి కేంద్రం ప్రభువైన క్రీస్తే. 

యెరూషలేముకు యాత్రలు చెయ్యాల్సినపని ఎంత మాత్రమూ లేదుగాని, పరమ కనాను అయిన, నూతన యెరూషలేము వైపు సాగిపోదాం!

ఆరీతిగా మన జీవితాలను 
సిద్ద పరచుకుందాం! 

అట్టి కృప, ధన్యత 
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్! 

                                                         122 కీర్తనా ధ్యానం
(నాలుగవ భాగం)

అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి యున్నవి.
యెరూషలేముయొక్క క్షేమముకొరకు ప్రార్థన చేయుడి యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు.

నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. నీ నగరులలో క్షేమముండును గాక.
              కీర్తనలు 122:5-7
           .........................

ఇశ్రాయేలు వారి జాతి సమైక్యతకు జెరుషలేములో శాంతి అత్యవసరం. అక్కడ పోరాటాలు, చీలికలు వుంటే మొత్తం యూదా జాతి మనుగడకే గొప్ప ప్రమాదం. 


పోరుతో వుండే ఆ పట్టణానికి వెళ్ళడానికి వివిధ గోత్రాల వారికి ఇష్టం వుండదు. 

అందుచే ప్రజల మేలును, దేవుని ఇంటి మేలును దృష్టిలో వుంచుకొని రచయిత శాంతి, సమాధానం కోసం ప్రార్దిస్తున్నాడు. 


ఈ రోజుల్లో కూడా చీలికలు, కొట్లాటలు వున్న, సంఘాలకు వెళ్ళడం ఎవ్వరికీ ఇష్టముండదు. 

అందుచే, 
దేవుని ప్రజల కోసం, దేవుని పేరు ప్రతిష్టలకోసం మనము కూడా పరిశుద్దాత్మ మూలముగా, సత్యం మూలముగా సంఘాలలో ఐక్యత, సమాధానం నిలుపుకోవడానికి విశ్వ ప్రయత్నం చెయ్యాలి. 
అది ప్రతీ విశ్వాసి వ్యక్తిగత  భాద్యత. 


ఆరీతిగా మన జీవితాలను 
సిద్ద పరచుకుందాం! 

అట్టి కృప, ధన్యత 
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్! 


                                                            122వ కీర్తనా ధ్యానం 
                                                               (ఐదవ భాగం) 

నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమి త్తమును నీకు క్షేమము కలుగును గాక అని నేనందును.
మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలుచేయ ప్రయత్నించెదను.
     
             కీర్తనలు 122:8,9
           .........................

ప్రతీ విశ్వాసికి ఇది ఆదర్శం. క్రీస్తు సంఘానికి, ప్రజలకు మేలు జరిగే మార్గాలనే ఎప్పుడూ ఆలోచిస్తూ వుండాలి. 

మన సహోదరుల యొక్కయు, మన సహవాసుల యొక్కయు క్షేమాన్ని కోరుకొనేవారముగా మనముండాలి.

అందుచే, 

     కొందరు మానుకొను చున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు,

 ఆ దినము సమీపించుట మీరు చూచినకొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.
             హెబ్రీ 10:24,25 

దేవుని రాకడకు గల సూచనలు చూస్తూ ఉన్నాము. రాజ్యము మీదికి రాజ్యము లేచుట, భూకంపాలు, ఇట్లా....

ఇటువంటి సంభవాలు మనము చూస్తున్నకొలదీ మరీ ఎక్కువగా సమాజముగా కూడి, ఒకరినొకరు హెచ్చరించు కోవాలి. 

ఒకరికొకరు ప్రేమ కలిగి, మంచి పనులు చేయుటకు  పూనుకోవాలి. 

ఆరీతిగా మన జీవితాలను 
సిద్ద పరచుకుందాం! 

అట్టి కృప, ధన్యత 
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్! 

 (122వ కీర్తనా ధ్యానం సమాప్తం)

కామెంట్‌లు

సందేశాల లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఎక్కువ చూపు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

పొట్టి జక్కయ్య

సమరయ స్త్రీ

పేతురు వ్రాసిన పత్రికలు

ఆరాధనకి వెళ్ళినప్పుడు కావాల్సిన సిద్ధపాటు - కనీస క్రమశిక్షణ

యేసు క్రీస్తు రెండవ రాకడ

అబ్రాహాము విశ్వాసయాత్ర

పక్షిరాజు

శరీర కార్యములు

పాపము