ఆధ్యాత్మిక సందేశాలు-2- కొన్ని కీర్తనల ధ్యానాలు. part-5

ఆధ్యాత్మిక సందేశాలు-2- కొన్ని కీర్తనల ధ్యానాలు
51 వ కీర్తనా ధ్యానం
(మొదటి భాగం )

పరిచయం:
రచయితదావీదు 
సందర్భం: దావీదు బత్షెబతో పాపం చేసిన సందర్భంలో నాతాను ప్రవక్త అతని దగ్గరకు వచ్చినప్పుడు. 
ముఖంశాలుదావీదు పాపం,దాని ప్రతిఫలం, పశ్చాత్తాపం.
పాపము అంటే? 
"దేవుడు చెయ్యవద్దు అన్నది చెయ్యడం, దేవుడు చెయ్యమన్నది చెయ్యకపోవడం."

పాపము: 
*చూడడానికి అందముగా వుంటుంది. 
*చేస్తున్నప్పుడుఆనందాన్నిస్తుంది.
*చేసాక ఆవేదన మిగుల్చుతుంది. 
ఏదేనులో హవ్వకు ....
*పండు అందముగా కనిపించింది.
*తింటున్నప్పుడు ఆనందాన్నిచ్చింది. 
*తిన్నాక ఆవేదన మిగిల్చింది.
అది సృష్టి ఆరంభములో మొదలై ఆ వేదన నేటికి కొనసాగుతుంది.

దావీదు జీవితంలో కూడా ఇదే జరిగింది. 
బత్షెబచూపులకు అందముగా కనిపించింది. 
ఆమెతో పాపం ఆనందాన్నిచ్చింది.
*తర్వాత ఆవేదన మిగిల్చింది.

ఆవేదన:
*పుట్టిన బిడ్డ చనిపోయాడు. 
*పిల్లలు వ్యభిచారులయ్యారు.
*పిల్లలు హంతకులయ్యారు.
*కన్నకొడుకే దావీదును చంపడానికి కంకణం కట్టుకున్నాడు.
*కనీసం చెప్పులు లేకుండా రాజైన దావీదు కొండలకు పారిపోవలసి వచ్చింది. 
*కుక్క వంటి "షిమి " ఓ దుర్మార్గుడానరహంతకుడా! ఛీ! ఫో ...అంటూ దూషిస్తూ, శపిస్తూ వుంటేమౌనముగా తల వంచాల్సి వచ్చింది. 
*దేవుని పక్షంగా యుద్దాలు చెయ్యడానికి దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ప్రజలు ఇక నీవు యుద్దాలు చెయ్యొద్దని ప్రమాణం చేయించారు.
ఇట్లా... ఎన్నో! ఎన్నెన్నో!


కారణం:
1.పొరుగు వాని భార్యను ఆశించడం ద్వారా 10వ ఆజ్ఞను మీరి,వ్యభిచారిగా మారాడు. 
2.ఆమె భర్తను చంపించడం ద్వారా నరహంతకుడయ్యాడు.

*ఇంతకీ ఎవరీ దావీదు? 
దేవుని చేత
 "నా హృదయానుసారుడు" అని సాక్ష్యము పొందినవాడు. 

*గోల్యాతుపై విజయం దావీదుకీర్తిని ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్ళితే,
బత్సేబతో పాపం దావీదును పతనం అంచులకు తీసుకొని వచ్చింది.

ప్రవక్త నాతాను వచ్చి 
"  మనుష్యుడవు నీవే" అంటూ దావీదు పాపం బయటపెట్టాడు. అప్పట్లో టి. వి చానల్స్ లేవు కాబట్టి దావీదు బ్రతికిపోయాడు అనుకొంటున్నావా?
ఉంటే,10 చానెల్స్ కవర్ చేసేవేమోకాని దేవుడు దావీదు పాపాన్ని 2000 భాషల్లోకి తర్జుమా చేయించాడు. 

దేవుడు పాపివైన నిన్ను ప్రేమిస్తాడు గాని, నీ పాపాన్ని ఎప్పటికి ప్రేమించడు,
సహించడు.

అదెట్లా సాధ్యం?
మన ఇంట్లో ఎవరయినా  కాన్సర్ తో 
బాధపడుతుంటేఆ రోగిని ప్రేమిస్తాంకాని ఆ కాన్సర్ ని ప్రేమించం. అట్లా ....


ఏ పాపం నిన్ను దేవుని నుండి దూరం చేస్తుందో? 
ఏ పాపం నిన్ను పట్టి పీడిస్తుందో?
ఏ పాపం నీకు ఆవేదన మిగిల్చిందో?
ఆ పాపాన్ని కప్పుకోకసిలువ చెంత ఒప్పుకో!
నీ జీవితంలో ఎన్నాడులేని శాంతినిసమాధానాన్ని అనుభవించు.


అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక !
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 

                                          51 వ కీర్తనా ధ్యానం 
                                          (రెండవ భాగం )
"దేవానీ కృపచొప్పున నన్ను కరుణింపుము నీ వాత్సల్య బాహుళ్యముచొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము."
              కీర్తనలు 51:1 

పాపముతో నిండిన లోకములోపాపపు శరీరంతో జీవిస్తున్నాం గనుక పాపంలో పడటం అత్యంత సులభం.

అట్లా అనిపాపపు శరీరంతో ఉన్నాము కాబట్టి పాపము చెయ్యడం సహజంఅనినీకు నీవే సర్ది చెప్పుకొనే ప్రయత్నం చెయ్యొద్దుఆ పాపంలోనే నిలచియుండే ప్రయత్నం చెయ్యొద్దు. 
హృదయానుసారుడైన దావీదే పాపం చేస్తే నేనెంతఅని ఆ పాపాన్ని ఆదర్శంగా తీసుకొనే ప్రయత్నం చెయ్యొద్దుదాని ఫలితం భయంకరం.
హృదయానుసారుడైన దావీదే పశ్చాత్తాపపడితేఆ పశ్చాత్తాపం నాలో ఎందుకు ఉండకూడదుఅని దానిని ఆదర్శంగా తీసుకోదాని ఫలితం "సమాధానం".
దావీదు ఎంతగా ఏడ్చాడు అంటేతన కన్నీటితో తన పరుపు తెలిపోయిందట. 
ఇది సాధ్యమాకాదు. 
"
పరుపుఅంటే "సుఖం" .... అంటే తన వేదనకన్నీళ్లు ముందు సుఖం తేలిపోయింది. 
తాను చేసిన ఘోరమైన పాపాలకు ఏమంచి కార్యముగానితాను అర్పించే ఏవిధమైన బలిఅర్పణ గాని తన పాపాన్ని పావనం చెయ్యలేదు. 
 పాప క్షమాపణ కలిగేందుకు మిగిలియున్న ఒకే ఒక్క మార్గం ఆయన కృపకరుణా వాత్సల్యం.
ఇక ఏది ఆయన పాపాన్ని పరిహరించలేదు.
అందుకే ఆయన కృపకై అర్ధిస్తున్నాడురోధిస్తున్నాడు.
ఏ పాపం నిన్ను తరుముతుందో?
ఏ పాపం నిన్ను వెంటాడుతుందో?
ఏ పాపం నిన్ను బంధించిందో?
అది ఎంతటి ఘోరపాపమైనా!
ఎవ్వరితో చెప్పుకోలేనిది 
అయినా సరే !
ఆయన పాదాల చెంత చేరుదాం!
ఆయన కృపకై అర్ధిద్దాం!

"
దేవాపాపినైన నన్ను కరుణించు"
              లూకా 18:13
సుంకరి చేసిన చిన్న ప్రార్ధన అతనిని నీతిమంతుల జాబితాలో చేర్చింది. 
ఈ చిన్న ప్రార్ధననీ అతిక్రమములను తుడిచివేయ గలదునీవు కోల్పోయిన సమాధానాన్ని తిరిగి నీజీవితంలో ప్రతిష్టించ గలదు. 
విరిగిన మనస్సుతో ప్రార్ధిద్దాం!
పొందుకుందాం!
అట్టి కృపధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్   ఆమెన్   ఆమెన్!                                 

                                                                 51 వ కీర్తనా ధ్యానం 
                                                       (మూడవ భాగం)
నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుమునా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము.
                 కీర్తనలు  51:2
దావీదు చేస్తున్న ఈ పాప ప్రక్షాళనా ప్రార్ధనలోమొదటిరెండు చరణాల్లో అంశాలు ప్రస్తావిస్తున్నాడు. 
1. నా అతిక్రమములను తుడచివెయ్యి (అతిక్రమములు అంటే దేవుని చట్టాన్ని ఉల్లంఘించడం.)

2. 
నా దోషమును కడుగు
(
దోషములు లేదా అపరాధములు అంటే తప్పు అని తెలిసినా మనము చేసిన పనులు.)
3. నా పాపమును పవిత్రపరచు. 
(
పాపము మన పుట్టుకతోనే మనలను వెంటాడేది.) 
ఈ అంశాలు దావీదు ఒప్పుకోవడం ద్వారా తన మొత్తం జీవితాన్నే దేవుని పాదాల చెంత అప్పగించి నట్లయింది. 
ఇదే ప్రార్ధన మనము చెయ్యగలగాలి.
ఎందుకంటేమన అతిక్రమములుదోషములుపాపములు మనపై పేరుకుపోయి వున్నాయిఅవి అసహ్యకరమైన మచ్చలులా వున్నాయి. 
 అవి తుడవబడాలి, 
కడుగబడాలి,
 పవిత్ర పరచాబడాలి అంటేఈలోకంలోవున్న సోప్స్ గానిఆయింట్ మెంట్స్ గాని ఏవి పనికిరావు. "యేసయ్య ఆ కల్వరిలో కార్చిన ఆ పరిశుద్ద రక్తం ఒక్కటి  మాత్రమేఆ పని చెయ్యగలదు.
"మన పాపములను మనము ఒప్పుకొనిన యెడలఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును."
            1యోహాను 1:9

1.
నీ అతిక్రమములుఅపరాధములుపాపములు ఆయన సన్నిధిలో ఒప్పుకుంటేవాటిని క్షమించితుడచివేస్తాడటఅవి ఎప్పటికి జ్ఞాపకము చేసుకొనబడవు.
"నేను నేనే నా చిత్తానుసారముగా నీ యతిక్రమము లను తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసికొనను."
      యెషయ 43:25

2.
నీ అతిక్రమములుఅపరాధములుపాపములు ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే పరిహారము నొందుతావుతద్వారా ధన్యత లభిస్తుంది. 
ధన్యుడు అంటే ఆశీర్వధించబడిన వాడు. 
"తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు.
యెహోవాచేత నిర్దోషి అని యెంచబడినవాడు ఆత్మలో కపటములేనివాడు ధన్యుడు"
       కీర్తనలు 32:1,2

*
విరిగి నలిగిన మనస్సుతో ఈ రీతిగా ప్రార్ధిద్దాం!
"
నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుమునా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము."
*
ఈ ప్రార్ధనా ఫలాన్ని అనుభవిద్దాం! 
అట్టి కృపధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్   ఆమెన్   ఆమెన్!  
      51 వ కీర్తనా ధ్యానం
(నాలుగవ భాగం)
నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి నా పాపమెల్లప్పుడు నాయెదుట నున్నది.
నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి యున్నాను నీ దృష్టియెదుట నేను చెడుతనము చేసియున్నాను కావున ఆజ్ఞ ఇచ్చునప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడుదువు తీర్పు తీర్చునప్పుడు నిర్మలుడవుగా అగపడుదువు.    కీర్తనలు  51:3,4
మనము చేసే తప్పులలో  తొంబై తొమ్మిది శాతం   అవి తప్పు అని తెలిసే చేస్తాం. మన పాపం ఎప్పుడూ మన కళ్ళముందే వుంటుంది. నీవు తప్పు చేసావ్ అంటూ మనఃసాక్షి గద్దిస్తున్నా, పీక నొక్కి దాన్ని చంపేసి. మన పని మనం కొనసాగిస్తున్నాం! 
కాని,ఒక్కటి మాత్రం నిజం. సమాధానం కోల్పోయామని మనకు స్పష్టంగా తెలుసు. 
దేవుని సన్నిధిలో ఒప్పుకొనివాటిని మానుకుంటేనేగాని సమాధానం తిరిగిరాదనీ తెలుసు. 
కానిఆపని మాత్రం చెయ్యం. 
దావీదు ఆపని  చెయ్యగలుగు తున్నాడు. 
దొరికిపోయాననిగత్యంతరం లేక నోటితో పైపై మాటలు కాదు దావీదు చెప్తున్నది. హృదయాంత రంగంలో నుండి పెల్లుబికే పశ్చాత్తాపం అది. 

"నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి యున్నాను." అంటున్నాడు. 
బత్షేబకుఊరియకు వ్యతిరేకముగా పాపం చేసాను అని చెప్పట్లే. ఎందుకంటే వారును దేవుని పోలికలో సృస్టించబడిన వారేవారు సృష్టిలో భాగమే. అందుచే వారికి చేస్తే దేవునికి చేసినట్లే. అనేఅద్భుతమైన సత్యాన్ని గ్రహించగలిగాడు దావీదు. 

దావీదు మాటలతో ఒక విషయం స్పష్టం. 
*ఒకరిని బాధించామంటేదేవునిని భాధించినట్లు.
*ఒకరికి సహాయం చేశామంటే దేవునికి చేసినట్లు. 

"అప్పుడతడు నేలమీదపడి సౌలాసౌలానీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను.
ప్రభువానీవెవడవని అతడడుగగా ఆయననేను నీవు హింసించు చున్న యేసును;"  అపో. కా.  9:4,5
యేసును ప్రత్యక్షముగా సౌలు హింసించిన సందర్భంలేదు. కాని దేవుని పిల్లలను హింసించడం ద్వారా దేవుని హింసించిన వాడయ్యాడు. 
"సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలననువారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలననుమీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయు వారగుచున్నారు"   కొరింది 8:12
అందుకు రాజుమిక్కిలి అల్పులైన యీ నా సహోదరు లలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చ యముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును.       మత్తయి 25:40

ఒక తప్పు చెయ్యడానికి మనం సిద్దపడుతున్నప్పుడు "నేను దేవునికే విరోధముగా ఈ పని చేస్తున్నాను" అనే తలంపు ఆ తప్పు చెయ్యకుండా కాపాడగలదేమో? 
అందుచేమన ప్రతీ కదలికలోను ఆయన్ని ముందుపెట్టుకొని జీవించగలిగినట్లయితే మన పాదములు తొట్రీల్లె అవకాశాలు చాల తక్కువ. 
అట్లా కాని పక్షంలోపాపం ఎంత తేటగాఎంత ఘోరంగా కనిపిస్తుందంటేదేవుడు దానికి తీర్పు తీర్చేటప్పుడు ఆయన మీద ఆరోపణ చెయ్యడానికి కూడా ఏమి మిగలదు. 
అందుచే మన నడతను సరిచేసుకొని ఆయనకోసం జీవిద్దాం. 
అట్టి కృపధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 
                                                                                     51 వ కీర్తనా ధ్యానం 
                                                (ఐదవ  భాగం)
"నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను."
                కీర్తనలు 51:5
దావీదు తన పాపముల గురించి మాట్లాడుతూఇక్కడ తన పాపమంతటికి గల ప్రధాన కారణమను ఎత్తి చూపుతున్నాడు. 
తన తల్లి గర్భంలో తాను రూపు దిద్దుకొంటున్నప్పటినుండి తన స్వభావం చెడ్డదని అతను ఒప్పుకొంటున్నాడు. 
       యేసు ప్రభువు తప్ప ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతీ వ్యక్తి విషయంలోనూ ఇది నిజం. 
ఆదాముహవ్వ పాపంలో పడినప్పటినుండి స్త్రీపురుషులందరికీ భ్రష్ట స్వభావం వుందిదానిని వారు వారి సంతానానికి అందజేస్తారు. 
ఆదాము నూట ముప్పది యేండ్లు బ్రదికి తన పోలికెగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను.    ఆదికాండము 5:3
ఆదాము తన పోలికలోతన స్వరూపమున కుమారుని కన్నాడట. 
పోలికరూపు రేఖలు. 
స్వరూపముఅంతరంగ స్తితి.
దీనిని బట్టి వారి పాప స్వభావం కూడా తర్వాత తరాలకు అందజేయబడుతుంది 
నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది.    ఆదికాండము 8:21
తల్లికడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు పుట్టినతోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు.      కీర్తనలు 58:3
పై విషయాలనుబట్టి మన పుట్టుకతోనే పాపం మనలను వెంటాడుతుంది.
సిల్వలో ఆయన కార్చిన రక్తం ఆ పాపం నుండి మనలను పవిత్ర పరచుతుంది. 
సిలువ చెంత చేరుదాం! 
విడుదల పొందుదాం! 
అట్టి కృపధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్   ఆమెన్   ఆమెన్! 

                                                                                    51 వ కీర్తనా ధ్యానం 
                                                     (ఆరవ భాగం)

నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు.
              కీర్తనలు 51:6 
మనిషి బాహ్యంగా బాగానే కనిపిస్తున్నాఅంతరంగం చెడిపోయిందిఅందుచే అంతరంగంలో మార్పు అవసరమయ్యింది. 
మనిషి హృదయంలో స్వభావ సిద్దంగా కల్లాకపటంమోసం వున్నాయిఅయితే దేవుడు నిజాయితినియదార్ధతను కోరుతున్నాడు. 
ఆయన అంతరంగములో సత్యాన్ని కోరుతున్నాడుసత్యం అంటే "ఆయనే". నేనే మార్గమునుసత్యమునుజీవమును.
        యోహాను 14:6
నీ అంతరంగములో ఆ సత్యానికి చోటివ్వగలిగితే నీవు ఏమి చెప్పినాఏమి చేసినా అది దేవునిని సంతృప్తి పరచగలుగుతుంది. 
దేవుడిచ్చే జ్ఞానం తప్ప మరేది మంచి జ్ఞానం కాదుదేవుడు జ్ఞానాన్ని కుడా అంతరంగములోనే ప్రసాదిస్తాడు.
దేవుడు ఇచ్చే జ్ఞానం శాశ్వతమైనదిసోలోమోను జ్ఞానం కోసం ప్రార్ధించగాదేవుడు అనుగ్రహించిన జ్ఞానం ఎంత గొప్పది అంటేనేటి వరకు అట్లాంటి జ్ఞాని లేడుఇక ఉండడు.

"
బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నానుపూర్వికులలో నీవంటివాడు ఒకడును లేడుఇకమీదట నీవంటివాడొకడును ఉండడు."
            1 రాజులు 3:12
"అయితే పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనదితరువాత సమాధానకరమైనదిమృదువైనదిసులభముగా లోబడునదికనికరము తోను మంచి ఫలములతోను నిండుకొనినదిపక్షపాతమైననువేషధారణ అయినను లేనిదియునై యున్నది." 
                 యాకోబు 3:17
ఇటువంటి పవిత్రమయిన జ్ఞానము మనకు ఎట్లా లభిస్తుంది?
అంతరంగములో సత్యము(ఆయనవున్నప్పుడు మాత్రమే.
ఆయనను చేర్చుకుందాం!
సమాధానకరమైన జ్ఞానాన్ని పొందుకుందాం!
అట్టి కృపధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్   ఆమెన్   ఆమెన్! 
                                                                          51 వ కీర్తనా ధ్యానం 
                                                    (ఏడవ భాగం)
నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుముహిమముకంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము.
                  కీర్తనలు 51:7

"
హిస్సోపుఅనేది ఒక చిన్న చెట్టు పేరుపాతనిబంధన కాలంలో జంతుబలి రక్తాన్ని చిలుకరించేందుకు ఈ హిస్సోపు మొక్కను వాడేవారట. 
యాజకుడు పవిత్రత పొంద గోరువాని కొరకు సజీవమైన రెండు పవిత్ర పక్షులను దేవదారు కఱ్ఱను రక్తవర్ణముగల నూలును హిస్సో పును తెమ్మని ఆజ్ఞాపింపవలెను.
           లేవీకాండము 14:4
ఆ హిస్సోపుతో చిలుకరించబడే జంతు రక్తంపాపమును శుద్ధిచేసే క్రీస్తు రక్తానికి సూచన. 
"అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడలమనము అన్యోన్యసహవాసము గలవారమై యుందుముఅప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును."
              1 యోహాను 1:7
దావీదు తన రక్తాపరాధామునురక్తపు డాగులను శుద్ధి చెయ్యమనిఅవి మంచు కంటే తెల్లగా వుండాలనిఅట్లాంటి పరిశుద్దత లోనికి నడిపించమని ప్రార్దిస్తున్నాడు. 
"యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకొందము మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱబొచ్చువలె తెల్లని వగును."
          యెషయ 1:18
ఆ కల్వరి గొల్గోతలో నీ ప్రియ రక్షకుడైన యేసయ్య చిందించిన రుధిర ధారలే  నీ పాపాన్ని హిమము కంటే తెల్లగా శుద్దీకరించ గలదు. 
దావీదు చేరిన ఆ పశ్చాత్తాప అనుభవంలోనికి మనము చేరాలివిరిగి నలిగిన దీన మనస్సుతో ఈ చిన్న ప్రార్ధన చేయ గలగాలి. 

"
నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుముహిమముకంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము."
ప్రార్ధిద్దాం!
పవిత్ర పరచబడదాం!
ఆయన సాక్షిగా జీవిద్దాం! 
అట్టి కృపధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్   ఆమెన్   ఆమెన్! 
                                                  51 వ కీర్తనా ధ్యానం 
                                                       ఎనిమిదవ భాగం)
"ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము అప్పుడు నీవు విరిచిన యెముకలు హర్షించును."         కీర్తనలు 51:8
దావీదు తన పశ్చాత్తాప ప్రార్ధనలో ...
దేవునితో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. 

"
ఆనందంసంతోషంకలిగించే మాటలు నాకు వినిపించువిరిగిన ఎముకలు తిరిగి ఆనందించనియ్యి."
*ఉత్సాహముసంతోషము ఎందుకు కోల్పోవలసి వచ్చింది? 
అంతరంగములో సత్యం లేదు గనుక. 
*
అంతరంగములో సత్యము లేకపోతే?
దాని స్థానంలో పాపం వచ్చి కూర్చుంటుంది. 
పాపం వచ్చి కూర్చుంటే ?
*
ఉత్సాహము ఉండదు.
*
సంతోషము ఉండదు.
*
నవ్వుతూనే వుంటాంకాని అది పెదవులకు మాత్రమే పరిమితం. 
*
అందరిలో వుంటాంకాని ఒంటరి తనాన్ని అనుభవిస్తాం. 
*
విరిగిన ఎముక శరీరాన్ని ఎంతగా నొప్పిస్తుందోపాపము కూడా హృదయాన్ని అంతగా నొప్పిస్తుంది.
*
నొప్పింపబడిన హృదయం వేధనతో నిండిపోయి కృంగిపోతుంది. 
అందుకే దావీదు తన వ్యక్తిగత అనుభవంలో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు.
నా బ్రదుకు దుఃఖముతో వెళ్లబుచ్చుచున్నాను నిట్టూర్పులు విడుచుటతో నా యేండ్లు గతించు చున్నవి నా దోషమునుబట్టి నా బలము తగ్గిపోవుచున్నది నా యెముకలు క్షీణించుచున్నవి.   కీర్తనలు 31:10
నేను మౌనినై యుండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వనివలన నాయెముకలు క్షీణించినవి.        కీర్తనలు 32:3
మన జీవితంలో పాప ఫలితంగా కోల్పోయిన ఆనందంసంతోషంశాంతిసమాధానం తిరిగి పొందాలంటే?
ఒక్కటే మార్గంపాప క్షమాపణహృదయ శుద్ధిఅంతరంగములో సత్యంఇవి మాత్రమే ఉత్సాహాన్నిసంతోషాన్ని తీసుకురాగలవు. 
ఆయన పాదాలచెంత చేరుదాం!
పశ్చాత్తాప పడదాం! 
శాస్వతానందాన్ని అనుభవిద్దాం!
అట్టి కృపధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్   ఆమెన్   ఆమెన్! 

                                                                                 
51 వ కీర్తనా ధ్యానం 
                                                          (తొమ్మిదవ భాగం)
నా పాపములకు విముఖడవు కమ్ము నా దోషములన్నిటిని తుడిచివేయుము.      కీర్తనలు 51:9 
దావీదు ప్రార్దిస్తున్నాడు...
నా పాపములకు విముఖుడవు కమ్ముఅంటే? 
నా పాపముల వైపు కాకుండా నీ ముఖాన్ని వేరే వైపుకు త్రిప్పేసుకో!
ఎందుకలా?
నీవు చూడకుండా వుంటేనాపని నేను చేసుకుంటాఅని దావీదు ఉద్దేశ్యమాకానే కాదు. 
ఎందుకంటే?
"నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది."         హబక్కుకు 1:13
ఒక వేళ నీవు నా పాపములవైపు తేరి చూస్తేనేను బ్రతుకలేను. 
"
నా దోషములన్నిటిని తుడిచివేయుము."
అంటే? 
వ్రాసి వున్న దానిని తుడచివెయ్యి అని దీనర్ధం. 
క్షమించమని అడిగితే దేవుడు చేసేది కూడా సరిగ్గా అదేఆయన  తుడచివేసాడంటేమరల ఎన్నటికి జ్ఞాపకం చేసుకొనడు.
దావీదు ప్రార్ధనలోనున్న అత్యంత ప్రత్యేకత ఏమిటంటే? 
నా పాపాలను తుడచివెయ్యి అని ప్రార్దిస్తున్నాడు గానినా పాపానికి తగిన శిక్ష నాపైకి రాకుండా చెయ్యి అని మాత్రం ప్రార్ధించుట లేదు. 
తన యొక్క పాపములు క్షమించబడిదేవునితో సహవాసాన్ని తిరిగి పొందే అవకాశమున్న పక్షంలో దేవుడిచ్చే శిక్షను అనుభవించేందుకు దావీదు సిద్దంగా వున్నాడు. 
దావీదు పాపానికి శిక్ష:
"నీ యింటివారికి సదాకాలము యుద్ధము కలుగును.
.....
నీ యింటివారి మూలముననే నేను నీకు అపా యము పుట్టింతును." సమూయేలు 12:10,11
ఆ రీతిగా అనుభవించాడు కూడా. 
మనమూ ఇటువంటి ప్రార్ధన చెయ్యగలగాలి. 
తండ్రీనా పాపములకు విముఖడవు కమ్ము నా దోషములన్నిటిని తుడిచివేయుము."
ఈ రీతిగా మన జీవితాలను సరిచేసుకుందాం! 
ఈ లోకంలో ప్రత్యేకంగా ఆయనకై జీవిద్దాం! 
ఆ నిత్య రాజ్యాన్ని స్వంతం చేసుకుందాం! 
అట్టి కృపధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్   ఆమెన్   ఆమెన్! 
                                                                                   51 వ కీర్తనా ధ్యానం
                                                    (పదియవ భాగం)
దేవానాయందు శుద్ధహృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము.
           కీర్తనలు 51:10
*దేవానాయందు శుద్ధహృదయము కలుగజేయుము. అంటే
హృదయం మలినమయ్యింది. 
*అంతరంగంలో స్థిరమైన మనస్సు పుట్టించు. అంటే 
మనస్సు అస్థిరమయ్యింది.
స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. అంటే
గతకాలంలో వుండేది ఇప్పుడు అస్థిరమయ్యింది. నూతనమైన మనస్సు అనుగ్రహించు. 

*హృదయం ఎందుకు మలినం అయ్యింది
*మనస్సు ఎందుకు అస్థిరమయ్యింది?
కారణం ఒక్కటే "పాపం"

దావీదు పట్టించుకోనేది తాను మనుష్యులకు ఎట్లా కనిపిస్తున్నాడో?అనికాదు. తన అంతరంగ స్థితి ఎట్లా వుందో అని మాత్రమే.
ఎందుకంటేఅంతరంగంలో యదార్ధతనుపరిశుద్దతను కలుగజేయు వాడు దేవుడు ఒక్కడే అని అతనికి తెలుసు. 

ఇప్పుడు దావీదుకు కావలసింది. 
*పవిత్ర ఉద్దేశాలు గల యదార్ధ హృదయం.
*నిర్మలమైన కోరికలతో నిండిన హృదయం. 
*పాపానికి ఎదురు తిరిగే హృదయం.
*దేవుని పరిశుద్దాత్మ అదుపులో వుండే హృదయం. 
ఇట్లాంటి హృదయం దేవుడే అనుగ్రహించాలి. అందుకే దావీదు అంటున్నాడు 'శుద్ద హృదయం కలుగజేయుము.'

హృదయ శుద్ధి నిలిచి ఉండాలంటేస్థిరమైన గట్టి మనస్సు
పాపాన్ని వ్యతిరేకించే అచంచలమైన గుణం వుండాలి
ఇది ఇంతకు ముందు దావీదులో వుండేది. అయితే పాపం చేసి దాన్ని జార విడచుకున్నాడు. 
అందుకే దేవుని అర్ధిస్తున్నాడు.
కోల్పోయిన అట్లాంటి స్థిరమైన మనస్సు నూతనముగా అనుగ్రహించమని.
పశ్చాత్తాప హృదయంతో ఈ చిన్ని ప్రార్ధన మనమూ చెయ్యగలగాలి.  
"దేవానాయందు శుద్ధహృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము."

ప్రార్ధిద్దాం!పవిత్ర పరచ బడదాం!
అట్టి కృపధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 
51 వ కీర్తనా ధ్యానం
(పదకొండవ భాగం)
నీ సన్నిధిలోనుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నాయొద్దనుండి తీసివేయకుము.        కీర్తనలు 51:11

దావీదుకు తన భ్రష్ట స్వభావం గురించి పూర్తిగా నిస్సందేహముగా తెలిసిపోయింది. 
అయితేదేవుడు తనను పూర్తిగా తిరష్కరించలేదనిఆయన ఆత్మను తన యొద్ద నుండి తీసివెయ్య లేదని నమ్మకం వుంది. కాని అట్లా చేస్తాడేమో అని భయపడుతున్నాడు. 

దావీదు భయానికి కారణాలు:
1. పాత నిభందన కాలంలో దేవుడు విశ్వాసులకు సత్యాన్ని పూర్తిగా తెలియజేయలేదు.
2. పరిశుద్దాత్మను పూర్తిగా ఇవ్వలేదు. 

1."నీ సన్నిధిలోనుండి నన్ను త్రోసివేయకుము" 
*ఒక వ్యక్తి పాపం చేస్తే దేవుని సన్నిధిలోనుండి దేవుడు అతనిని త్రోసివేస్తాడా?
*ఆ వ్యక్తికి దేవునితో సంబంధం తెగిపోతుందాఅట్లా జరుగదు. 
పాపము దేవునితో మనకు గల సంబంధాన్ని(Relationship) త్రెంచివేయ్యలేదు. కాని ఆయనతోగల  సహవాసంను (Fellowship) త్రెంచివేస్తుంది. 

ఉదా: మన తండ్రితో గొడవపడి వేరే చోట జీవిస్తున్నామీ తండ్రి పేరేంటి అని అడిగితేతండ్రిపేరే చెప్తాము. అంటే ఆ సంబంధం అట్లానే కొనసాగుతుంది.కాని ఒకరికొకరు మాట్లాడుకోకపోవడం వాళ్ళ "సహవాసం" మాత్రం వుండదు. సహవాసం తప్పనిసరి. 

2." నీ పరిశుద్ధాత్మను నాయొద్దనుండి తీసివేయకుము"
మనం పరిశుద్ధంగా వున్నప్పుడు పరిశుద్దాత్మ మనతో వుండిపాపం చేసేనప్పుడు వెళ్లిపోతాడాఅట్లా జరుగదు.
పాప క్షమాపణరక్షణబాప్తీస్మం ద్వారా పొందుకున్న పరిశుద్దాత్మడు మన జీవితాంతం మనతోనే ఉంటాడు. 
అయితేమనం పాపం చేసినప్పుడు మన పాపపు క్రియలు పరిశుద్దాత్ముని మీద కుప్పలాపడి పరిశుద్దాత్ముడు పని చెయ్యకుండా ఆయనని
అణచివేస్తాయి. తద్వారా పరిశుద్ద జీవితం జీవించలేము.

పరిశుద్ద జీవితం జీవించాలంటే
1. ఆయనతో సహవాసం కలిగి వుండాలి.
2. శరీర క్రియలు పరిశుద్డాత్ముని సహాయంతో 
నియంత్రించు కోగాలగాలి. 
అప్పుడు మాత్రమే సాధ్యం.

ఈ రీతిగా మన జీవితాలను సిద్దపరచు కుందాం!

అట్టి కృపధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 
                                                    51 వ కీర్తనా ధ్యానం 
                                                    (పండ్రెండవ భాగం)

"నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము సమ్మతిగల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము."           కీర్తనలు 51:12
దావీదు దేవుని సన్నిధిలో ఈరీతిగా ప్రాదేయపడుతున్నాడు.
*
కోల్పోయిన రక్షణానందం మరళా అనుగ్రహించు. 
*
సమ్మతించే మనస్సు దయచెయ్యి. 
*
నన్ను ధృడపరచు.
 
1.రక్షణానందం మరళా అనుగ్రహించు:
ఈలోకంలో ఎన్ని ఆనందాలున్న అవి రక్షణానందానికి సాటిరావుఆ ఆనందం యొక్క రుచి రక్షించబడిఅనుభవించిన వారికే తెలుసు.
దావీదు ఈలోకంలో నున్న ఆనందం కోసంశాస్వతానందాన్ని కోల్పోయాడు. 
దావీదును పరిశుద్దాత్మ విడచిపెట్టలేదు గాని ఆనందం తొలగిపోయింది. 
పాపంఆధ్యాత్మిక ఆనందం రెండూ కలసి వుండడం అసాధ్యం. 
క్షమాపణపరిశుద్దతల వెంట ఆనందం వస్తుందివాటిని ఇవ్వగలిగేది దేవుడొక్కడే. 
కోల్పోయిన ఆ ఆనందం యొక్క విలువ ఏంటోదావీదుకి ఇప్పుడు అర్ధమయ్యిందిఅందుకే మరల తిరిగి పొందడానికి దేవుని సన్నిధిలో రోధిస్తున్నాడు. 
2.సమ్మతించే మనస్సు దయచెయ్యి. 
"
సమ్మతిగల మనసువిధేయత గలిగిఇష్టపూర్వకంగాసంతోషంతో తనకు తాను దేవునిని ఆరాధించడానికి కావలసిన మనస్సు.
పాపము చేసి ఇట్లాంటి మనస్సును కోల్పోయాడుమరలా అట్లాంటి మనస్సును అనుగ్రహించు అని దావీదు ప్రార్దిస్తున్నాడు.
3.నన్ను ధృడపరచు. 
పాపము మనిషిని బలహీనుని చేస్తుందిమరణం వరకు తీసుకెళుతుంది. 
గోల్యాతును సహితముకూల్చిన దావీదు నేడు బలహీనుడయ్యాడుఅందుకే అంటున్నాడు నన్ను ధృడ పరచు.
చూపులు,తలంపులు,
క్రియల ద్వారా...పాపం చేసి 
దేవునికి దూరమై,శాంతిసమాధానంరక్షణానందం కోల్పోయిన మనము 
విరిగినలిగిన మనస్సుతో,
పశ్చాత్తాపంతో ఈ చిన్ని ప్రార్ధన చేద్దాం!
"
తండ్రీనీ రక్షణానందము నాకు మరల పుట్టించుము సమ్మతిగల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము." ఆమెన్!
విశ్వసిద్దాం!ప్రార్ధనాఫలాన్ని అనుభవిద్దాం!
అట్టి కృపధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్   ఆమెన్   ఆమెన్! 
      
                                                                                        51 వ కీర్తనా ధ్యానం 
                                                          (పదమూడవ  భాగం)

అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించెదను పాపులును నీ తట్టు తిరుగుదురు.          కీర్తనలు 51:13
"అప్పుడుఅంటే ఎప్పుడు?
*
రక్షణానందము మరళా అనుగ్రహించినప్పుడు,
*
సమ్మతించే మనస్సు దయచేసినప్పుడు,
*
ధృడ పరచినప్పుడు.

దావీదు ఏమి చేస్తాడు?
"
పాపము చేయు వారికి దేవుని త్రోవలను భోదిస్తాడు.
ముందు తాను కాలుజారి ఆధ్యాత్మిక ఆరోగ్యం తిరిగి పొందుకున్న వాడుపాపం చేస్తున్న ఇతరులకు తగిన రీతిలో భోధించగలడు.
ఎందుకంటే?
పాపానికి తగిన శిక్ష తానూ అనుభవించాడు కాబట్టి. 
ఇదెప్పుడు సాధ్యం?
తన పాపములు క్షమించబడి,
రక్షణ ఆనందాన్ని మరళా పొందుకున్నప్పుడు మాత్రమే.
నేటి పరిస్థితులు అట్లా లేవు.
నోట్లో సిగరెట్ పెట్టుకొని నాకేదో ఇట్లా అలవాటయిపోయింది ఇక మానలేకపోతున్ననీవు మాత్రం దీని జోలికి పోవద్దు అని భోధించే పరిస్తితులలో వున్నాం. 
నీవు చెడు వ్యసనాలకు బానిసవైమంచిని భోధించే ప్రయత్నం చేస్తేనిన్ను పట్టించుకొనేదెవరు?
మొదట మనం మారాలి. 
తర్వాత ఇతరులను మార్చే ప్రయత్నం చెయ్యాలి.

అందుకే దావీదు అంటున్నాడుమొదటగా నన్ను మార్చుఅప్పుడు నీ మార్గములు పాపము చేయుచున్న వారికి బోధించివారు నీ తట్టు తిరిగేల చేస్తా.
మనమూఈ చిన్న ప్రార్ధన చెయ్య గలగాలి. 
తండ్రినన్ను క్షమించు.
*
నీ రక్షణానందం తిరిగి అనుగ్రహించు. *విధేయత చూపే హృదయాన్నివ్వు. 
*
నన్ను బలపరచు. 

తద్వారా నా కుటుంబాన్నినీ ప్రేమను గూర్చి తెలియని వారిని నీ వైపుకు త్రిప్ప గలిగే ధన్యత నివ్వుఆమెన్! 
అట్టి కృపధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్   ఆమెన్   ఆమెన్! 
      
                                                                                   51 వ కీర్తనా ధ్యానం 
                                                    (పదునాలుగవ  భాగం)

దేవానా రక్షణకర్తయగు దేవా 
రక్తాపరాధమునుండి నన్ను విడిపింపుము అప్పుడు నా నాలుక నీ నీతినిగూర్చి ఉత్సాహగానము చేయును.
           కీర్తనలు 51:14

1.నా రక్షణకర్తయగు దేవా:
"
రక్షణ అంటే శిక్ష నుండి తప్పించబడుట."
పాపము దావీదుకు శిక్షను తెచ్చిపెట్టిందిఆ శిక్ష నుండి తప్పించగలిగే వాడు రక్షణ కర్త అయిన దేవుడే.
2.రక్తాపరాధమునుండి నన్ను విడిపింపుము:
ఏమిటి దావీదు రక్తాపరాధం?
యుద్దాలు చేసి అనేక మంది రక్తం ఒలికించాడుఅదేనాఅది కానేకాదు. 
దేవుని పక్షముగాదేవుని ప్రజలకోసం చేసిన యుద్దాలు రక్తాపరాధాన్ని తెచ్చిపెట్టలేదు. 
ఉదావిధి నిర్వహణలో నున్న పోలీసు పరిస్టితులను బట్టి ఒకరిని కాల్చి చంపినాఅతని మీదకు ఆ రక్తాపరాధం రాదువ్యక్తిగత కక్షలతో ఆ పని చేస్తే అతడు రాక్తాపరాది.

 
తన పాపం కప్పిపుచ్చుకోవడం కోసం బత్షేబ భర్త ఊరియను చంపించినదే అతనికి రక్తాపరాధాన్ని తెచ్చిపెట్టింది. 
ఆ రక్తాపరాధం నుండి విడిపించునీవు విడిపిస్తేనీ నీతిని గూర్చి పాడి స్తుతిస్తాను అంటున్నాడు దావీదు. 
మనమూఆయనను స్తుతిస్తున్నాముకాని ఆ స్తుతి దేవునికి చెందడం లేదు. 
కారణంపాపమునుండి విడిపించబడకుండాపాపములోనే వుంటూ స్తుతించేవారముగా ఉన్నాము. 
కాని అట్లా కాదుదావీదులా మొదట విడిపించబడాలితర్వాత ఆయన నీతిని ఉత్సాహగానము చెయ్యాలి.
సరిచేసుకుందాం!
ఆయన పాదాల చెంత ప్రణమిల్లుదాం!
ఆయన నీతిని ఉత్సాహగానం చేద్దాం!
అట్టి కృపధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్   ఆమెన్   ఆమెన్! 

     
                                                                                 51 వ కీర్తనా ధ్యానం 
                                                     (పదిహేనవ భాగం)

ప్రభువానా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము.
నీవు బలిని కోరువాడవుకావు కోరినయెడల నేను అర్పించుదును దహనబలి నీకిష్టమైనది కాదు.    కీర్తనలు 51:15,16

దేవుని స్తుతించడం కోసం మన పెదవులు విప్పడం కూడా ఆయన ఉచితమైన కృప.
1.నీవు బలిని కోరువాడవుకావు:
పాతనిబందనా కాలంలో బలులు ప్రవేశ పెట్టింది దేవుడే కాని,
దావీదు అంటున్నాడు "నీవు బలిని కోరువాడవు కావు."

ఏది నిజం? 
రెండూ నిజమే.


*
బలులు ప్రవేశ పెట్టింది దేవుడేకానిఆ బలులు ఆయన కోసం కాదుమన పాప ప్రాయశ్చిత్తం కోసమే. 
అదే సమయంలో ఆ బలులు యేసయ్య బలియాగానికి సూచనగా ముందుగ ప్రవేశపెట్టబడ్డాయి.
 
2.దహనబలి నీకిష్టమైనది కాదు:
దేవుడే చెప్పాడు అబ్రహాముతో.. "నీ ఏకైక కుమారుని నాకు దహన బలిగా అర్పించుఅని.
 
దహనబలి నీకిష్ట మైనది కాదనిదావీదు అంటున్నాడు.

ఏది నిజం? 
రెండూ నిజమే
.
దేవుడు దహనబలి కోరింది అబ్రహాము విశ్వాసాన్ని పరీక్షించడం కోసం మాత్రమేఒకవేళ దహనబలి ఆయనకు ఇష్టం అయితేఅబ్రాహామును దేవుడు అడ్డగించేవాడు కాదు కదా? 
అందుచే,
నీవర్పించే బలులుదహన బలులు ఆయనకు అక్కరలేదునీ కోసం ఆయనే బలిపశువుగా మారాడుఆయన నీకోసం చిందించిన రుధిర ధారల్లో నీ పాపమును కడుక్కో!
శుద్దీకరించబడిఆయనకోసం జీవించు.
అట్టి కృపధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్   ఆమెన్   ఆమెన్! 
     
                                                                               51 వ కీర్తనా ధ్యానం 
                                                     (పదహారవ భాగం)

విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు  దేవావిరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు.
           కీర్తనలు 51:17

    ..................................
మనము చేసిన పాపముల నిమిత్తం నిజమైన పశ్చాత్తాపం పొందితేనే దేవుడు క్షమిస్తాడుస్వీకరిస్తాడుపశ్చాత్తాపం లేకుండా ఏ బలిఅర్పణ వల్ల ప్రయోజనం లేదు. 

"
మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములుగల వాడును,శాంతమూర్తియు అత్యంతకృపగలవాడునైయుండితాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయనతట్టు తిరుగుడి."
        యోవేలు 2:13

మన దేవుడు:
*
కరుణా వాత్సల్యం గలవాడు. 
*
శాంతమూర్తి 
*
అత్యంత కృపగలవాడు. 
మన పాపములకు ప్రతిఫలముగా మన మీదకి రావలసిన కీడును రానీయకుండా ఆయన మనస్సు మార్చుకొని కీడుకు బదులుగా మేలు చేస్తాడు. 
ఇదెప్పుడు?
మనం హృదయాన్ని చింపుకొని పశ్చాత్తాప పడినప్పుడు.
పాత నిబంధనా కాలంలో వస్త్రాలు చింపుకొనిగోనెపట్ట కట్టుకొనిబూడిదేలో కూర్చొని పశ్చాత్తాప పడేవారు. 
కాని ఇప్పుడు మనం చెయ్యాల్సింది హృదయాన్ని చింపిహృదయంలో టన్నుల కొద్దీ పేరుకుపోయిన చెత్తను యేసయ్య పాదాల చెంత కుమ్మరించి, 
పశ్చాత్తాప పడాలి.
విరిగినలిగిన హృదయంతో సిలువ చెంత చేరుదాం!
స్తుతి బలిపీటం కడదాం!
ఆత్మీయ బలులు అర్పిందాం!
అట్టి కృపధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్   ఆమెన్   ఆమెన్! 
                                                         51 వ కీర్తనా ధ్యానం 
                                                        ( పదిహేడవ భాగం)

నీ కటాక్షముచొప్పున సీయోనుకు మేలుచేయుము యెరూషలేముయొక్క గోడలను కట్టించుము.
అప్పుడు నీతియుక్తములైన బలులును దహనబలులును సర్వాంగ హోమములును నీకు అంగీకృతము లగును అప్పుడు జనులు నీ బలిపీఠముమీద కోడెల నర్పించె దరు.
     కీర్తనలు 51:18,19

  ..................................... 
దావీదు పాపము చేసి నిజముగా పశ్చాత్తాపపడి తన పాపాన్ని విడచి పెట్టాడు. 
పాపంలో పడిన వ్యక్తి విషయంలో దేవుడు మాత్రమే చెయ్యగలిగేవి.
1.
కృప చూపి కరుణిస్తాడు.
2. 
శుద్దీకరిస్తాడు. 
3. 
అంతరంగాన్ని స్టిరపరుస్తాడు.
4.
ధృడ పరుస్తాడు 
5.
రక్షణానందం అనుగ్రహిస్తాడు. 

ఇవన్నీ దావీదు తిరిగి పొందుకున్నాడు.
ఇప్పుడు ఇతరులకోసం ప్రార్ధించడానికి అతని మనస్సు సిద్దంగా వుంది. 
ఇశ్రాయేలు రాజైన దావీదు చేసిన పాపం ఇశ్రాయేల్ కు  అనేకమైన అగచాట్లుఅవమానాలు తెచ్చిపెట్టింది. 
తాను చేసిన పాపం కారణముగా,  యెరూషలేము ఇబ్బందులకు గురి అయ్యిందిఅందుచే ఆ యెరూషలేమును గూర్చి  ్రార్దిస్తున్నాడు. 
మన పాపములు కూడా ఇతరులపై తప్పక ప్రభావాన్ని చూపుతాయితండ్రులు ద్రాక్షలు తింటే పిల్లల పళ్ళు పులుస్తాయటమనము చేసిన తప్పులకు మన పిల్లలు ప్రతి ఫలాలు అనుభవించ వలసి వస్తుందిఅందుచేమన పాపములను ఒప్పుకొనివారికోసం ప్రార్ధించాలి. 
ఈరీతిగా మన హృదయాలను సరిచేసుకొని, 
ఈ ఆత్మీయ యాత్రలో ఆనందంగా సాగిపోదాం! 
ఆ నూతన  యెరూషలేము చేరువరకు.
అట్టి కృపధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్   ఆమెన్   ఆమెన్! 
  (51
వ కీర్తనా ధ్యానం సమాప్తం)



73వ కీర్తనా ధ్యానం
(మొదటి భాగం )
"ఇశ్రాయేలుయెడల శుద్ధహృదయులయెడల నిశ్చయముగా దేవుడు దయాళుడై యున్నాడు."   కీర్తనలు 73:1
పరిచయం:
 రచయిత : ఆసాపు 
* లేవి గోత్రమునకు చెందినవాడు.
* గాయకుడు, సంగీత విద్వాంసుడు 
అనేకమైన సందేహాలతో పెనుగులాడి, ఆత్మీయ యుద్దంలో నుండి విజయవంతంగా బయటపడి, పరిపూర్ణమైన నిశ్చయతకు చేరుకున్న ఆసాపు పలుకుతున్న మాటలివి. 

*శుద్ధ హృదయం గలవారిపట్ల దేవుడు దయ చూపుతాడు. 
*దేవుడు అందరి పట్ల మంచివాడే.
*దుర్మార్గుల పట్ల కూడా మంచివాడే. 
ఎంతవరకు?
వారి పట్ల ఇక దయ చూపించడం అనేది ఇక ఎంత మాత్రం న్యాయం కాదు అని అనిపించేవరకు. 
"ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతి మంతులమీదను వర్షము కురిపించుచున్నాడు."  మత్తయి 5:45

యెహోవా అందరికి ఉపకారి   కీర్తనలు 145:9

*దుర్మార్గులను పశ్చాత్తాపంలోకి నడిపించేందుకు ఆయన వారిపై దయ చూపుతాడు. 
మనం ఆశీర్వదించబడుతున్నాము అని చెప్పి మనమేదో పరిశుద్దులం, నీతిమంతులం అని చెప్పుకొని మనలను మనమే మోసపరచుకోవద్దు.

"దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని యెరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘ శాంతమును తృణీకరించుదువా?"          రోమా 2:4
దుర్మార్గులపట్లే దయ చూపినప్పుడు, 
పవిత్ర హృదయులను నిర్లక్ష్యం చేస్తాడా? 
శుద్ధ హృదయం కలిగినవారికి ఆశీర్వాదాలు, ఆనందము కలిగించేందుకు వారిపట్ల ఆయన తప్పక దయ చూపిస్తాడు. 
దేవుని మంచితనాన్ని ప్రశ్నించే పరిస్తితులు, శోధనలు సాతాను నీ జీవితంలో సృష్టించినప్పుడు, 
నీకోసం ప్రాణం పెట్టిన నీ ప్రియ రక్షకుడైన యేసయ్య శాశ్వతమైన ప్రేమను, నిత్యం నిలిచే ఆయన మంచితనాన్ని బట్టి ధైర్యముగా ముందుకు సాగిపో! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 


                                         73వ కీర్తనా ధ్యానం 
                                            (రెండవ భాగం)

నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను నా అడుగులు జార సిద్ధమాయెను.
భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించువారినిబట్టి నేను మత్సరపడితిని.   
 కీర్తనలు 73:2,3

శుద్ధ హృదయుల పట్ల దేవుడు దయ చూపిస్తాడు అని ఆసాపు చెప్తున్నాడు. 

ఇంతకీ ఆ శుద్ధ హృదయులు ఎవరు?
ఈలోకంలో పాపములేనివారా? 
అట్లాంటి వారెవ్వరూ లేరు. 
పాపములేనివారు కాదుగాని, పాపము నుండి వేరుపడినవారు.

అట్లా చెప్తున్న ఆసాపు ఇక్కడ మాట్లాడుతూ నా పాదములు ఇంచుమించు జారిపోయాయి. 
ఎక్కడనుండి?
దేవుని నుండి. 

అందుకే ఆ శుద్ధ హృదయుల జాబితాలో నేనుండడం అసంభవం అనుకొని, తన బుద్ధిహీనతను, బలహీనతను ఒప్పుకొంటున్నాడు.

అట్లా జరగడానికి కారణం నాలోవున్న "అసూయే"(మత్సరము)

సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్లు.
           సామెతలు 14:30

భక్తి హీనుల క్షేమాన్ని చూసి అసూయ చెందడం కాదు గాని, మనమున్న స్తితిని బట్టి సంతోషిద్దాం. 

సాత్వీకమైన మనస్సును కలిగి ఉందాం!
అసూయను విడనాడుదాం! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 




       
73వ కీర్తనా ధ్యానం
                                             (మూడవ భాగం )
మరణమందు వారికి యాతనలు లేవు వారు పుష్టిగా నున్నారు.
ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు.
కావున గర్వము కంఠహారమువలె వారిని చుట్టుకొను చున్నది వస్త్రమువలె వారు బలాత్కారము ధరించుకొందురు.       కీర్తనలు 73:4-6
ఆసాపు అసూయ చెందడానికి గల కారణములు:
*భక్తిహీనులకు వేదనలు లేవు 
*వారు ఆకలితో అలమటించాల్సిన  పనిలేదు. 
*వారికి వ్యాధులు లేవు.
* ఏ విధమైన ఇబ్బందులు లేవు. 
* మాటల్లోనూ, చూపుల్లోనూ గర్వం.
*వారి జీవితమంతా బలాత్కారమే. 
అయినా, వారి జీవితమంతా సంతోషమే. 

ఇట్లా ఆలోచిస్తున్నది ఎవరో తెలుసా?
ఆసాపు లేవి గోత్రానికి చెందినవాడు. 
లేవీయులకు స్వాస్థ్యము లేదు. ఎందుకంటే "వారు యెహోవానే స్వాస్థ్యముగ కలిగియున్నారు" 
ఆయననే స్వాస్థ్యముగ కలిగియుంటే ఇట్లా ఆలోచించాల్సిన పనిలేదు. 

మన జీవితాల్లో కూడా ఇట్లా ఆలోచించిన సందర్భాలు కోకొల్లలు. 
*అనుదినం ప్రార్దిస్తున్నాం.
*వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. 
*వాక్యాన్ని అనుసరిస్తున్నాం. 
*తప్పక దేవుని మందిరానికి వెళ్తున్నాం. 
అయినా, జీవితమంతా శోధనలే,వేదనలే, అపజయాలే. 
భక్తి హీనులయితే విచ్చలవిడిగా జీవిస్తున్నారు. 
దేవుడంటే వాళ్లకి లెక్కే లేదు. అయినా సంతోషం వారి స్వంతం. (కాని అది అల్పకాలమే) 

ఒక్కటి గుర్తుంచుకో!
ఎన్ని శోధనలు వచ్చినా, నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య కృప నీకు తోడగా వుంది. 
కలవర పడకు   కన్నీళ్లు రానియ్యకు.
అసూయ చెందకు కృశించి పోకు. 
భక్తి హీనుల గమ్యం ఏమిటో నీకూ తెలియదు, వారికీ తెలియదు. 
నీవే స్తితిలో వున్నా ఆ స్తితినిబట్టి దేవుని స్తుతిస్తూ ........
నీ గమ్యం వైపు  సాగిపో!   ఆగిపోవద్దు!  
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 
           
73వ కీర్తనా ధ్యానం 
                                             (నాలుగవ భాగం)
క్రొవ్వుచేత వారి కన్నులు మెరకలై యున్నవి వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చు చున్నవి
ఎగతాళి చేయుచు బలాత్కారముచేత జరుగు కీడును గూర్చి వారు మాటలాడుదురు. గర్వముగా మాటలాడుదురు.
ఆకాశముతట్టు వారు ముఖము ఎత్తుదురు వారి నాలుక భూసంచారము చేయును.        కీర్తనలు 73:7-9

ఆసాపు భక్తిహీనులు అనుభవిస్తున్న విలాసవంతమైన జీవితాన్ని గురించి ఇంకా కొనసాగిస్తున్నాడు. 

*
శోదనలచేత నా కళ్ళు గుంటలు పడుతుంటే, భక్తి హీనులు కన్నులు క్రొవ్వు చేత మెరకలౌతున్నాయి.
*
వారు చేస్తున్న క్రియలే వారి తలంపులు ఎట్లాంటివో అర్ధం చేసుకోవచ్చు.
*
వారు మాట్లాడే మాటలన్నీ ఎవరికి కీడు తలపెడదామా? అన్నట్లు వున్నాయి. 
*
వారి మాటల్లో గర్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
*
మాకెదురు ఎవరు అన్నట్లు వారి ముఖాన్ని పైకెత్తుతున్నారు.
*
వారి నాలుక ఊరందరిని గురించి మాట్లాడుతుంది. 

ఏమిటీ విపరీత పరిస్తితులు? 
నిన్ను లెక్క చేయని వారికేమో సంతోషమా?
నీపై ఆనుకున్నవారికేమో శోధనలా? 
ఆసాపు హృదయం అసంతృప్తితో రగిలిపోతుంది.  

మనమేమీ వీటికి అతీతులం కాదు. 
అనుదినం మన కళ్ళముందే ఇట్లాంటి పరిస్తితులను చూస్తున్నాం. 
ఇట్లాంటి తలంపులే మనల్ని కూడా వెంటాడుతున్నాయి. 

ఒక్కటి మాత్రం గుర్తుంచుకో!
నీ పట్ల ఆయనకో ప్రత్యేక ప్రణాళిక వుంది.
తగిన సమయమందు అది నెరవేరబోతుంది.

ఆయనను ప్రశ్నించే స్థాయి నీకులేదు. 
అట్లాంటి సాహసం చెయ్యొద్దు. 
నీవున్న స్తితిలోనే సంతృప్తిని కలిగియుండు.
ఆయన చిత్తమే నీ జీవితంలో నేరవేరనివ్వు. 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 


                                      73వ కీర్తనా ధ్యానం 
                                        ( ఐదవ భాగం)
వారి జనము వారిపక్షము చేరును వారు జలపానము సమృద్ధిగా చేయుదురు.
దేవుడు ఎట్లు తెలిసికొనును మహోన్నతునికి తెలివియున్నదా? అని వారను కొందురు.
ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు. వీరు ఎల్లప్పుడు నిశ్చింతగలవారై ధనవృద్ధి చేసికొందురు   కీర్తనలు 73: 10-12

ఆసాపు భక్తిహీనులు అనుభవిస్తున్న విలాసవంతమైన జీవితాన్ని గురించి ఇంకా కొనసాగిస్తున్నాడు. 
*
భక్తిహీనులందరూ ఏకమవుతున్నారు.
*
వారు కోరిందంతా వారికి జరుగుతుంది.  
*
దేవుని కంటే మేమే తెలివయినవాళ్ళం అని  వాళ్ళనుకొంటున్నారు.
*
వీరికసలు చింత అనేదే తెలియదు. 
*
ఎంతో ధనాన్ని సంపాదిస్తున్నారు. 

ఇట్లా సాగిపోతుంది ఆసాపు ప్రశ్నల పరంపర. 
ఇక దేవుని మీద యుద్దానికే సిద్దమవుతున్నాడు. 
కారణం: భక్తి హీనుల క్షేమం, ఆరోగ్యం, ఐశ్వర్యం చూచి. 

కాని ఒక్క విషయం?
ఆసాపు ఎవరో తెలుసా? 
క్షేమం, ఆరోగ్యం, ఐశ్వర్యానికి కర్త అయిన యెహోవానే స్వాస్త్యముగా కలిగియున్న వాడు.  
ఆయననే స్వాస్త్యముగా కలిగి యుంటే ఇక వాటితో పనేంటి?
ఆ విషయాన్ని మరచిపోయాడు.

మనమూ ఒక విషయం మరచిపోయాం. 
*
మనము ఆయన సొత్తు 
*
ఆయన స్నేహితులం
*
ఆయన పిల్లలం 
*
రాజులం, రారాజు పిల్లలం,యువరాజులం 
*
మనమొక యాజక సమూహం. 
*
నిత్య రాజ్యానికి వారసులం. 
ఇవన్నీ మరచిపోయే ఆ భక్తిహీనులవలే అల్పకాల సుఖాలను అనుభవించడానికి ఆరాటపడుతున్నాం. 

వాటికోసం ఆరాటం కాదు.
సాతానుతో పోరాటం చేద్దాం!
ఆయనిచ్చే ఆశీర్వాదం కొరకు వేచియుందాం!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 

                                         73వ కీర్తనా ధ్యానం
                                           ( ఆరవ భాగం )
నా హృదయమును నేను శుద్ధిచేసికొని యుండుట వ్యర్థమే నా చేతులు కడుగుకొని నిర్మలుడనై యుండుట వ్యర్థమే
దినమంతయు నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. కీర్తనలు 73:13,14
     
ఇంత వరకు భక్తి హీనుల క్షేమం, ఆశీర్వాదాలు, వారి జీవిత విధానం గురించి మాట్లాడిన ఆసాపు ఇప్పుడు భక్తి పరులు గురించి మాట్లాడుతున్నాడు. 

*ఈ రంగుల ప్రపంచంలో నలుదిశల నుండి అనుక్షణం పాపం దాడి చేస్తుంటే, వాటి నుండి మనలను మనం కాపాడుకుంటూ, మన హృదయాన్ని పరిశుద్దంగా ఉంచుకోవడం వలన ఏమి ప్రయోజనం లేదు. 
*నీ చేతులకు మలినం అంటకుండా జీవించడం వలన  అసలే ప్రయోజనం లేదు. 
*ఇట్లా వుండడం వలన ఏమవుతుందో తెలుసా?
దేవుడు పంపించే  శ్రమల కోసం ఎదురు చూసినట్లవుతుంది.
*ఆ శిక్ష దినమంతా అంటే రాత్రీ, పగలూ కూడా నెమ్మది లేకుండా చేస్తుంది. 
*మనము ఉదయాన్నే ఎందుకు లేవాలో తెలుసా? ఆయన పంపించే శిక్షను అనుభవించడానికే.
ఈరీతిగా ఆసాపు హృదయం రగిలిపోతుంది. 

ఆసాపు అంతరంగంలో అనుభవిస్తున్న ఈ గొప్ప సంఘర్షణ నీజీవితంలోనూ అనుభవిస్తున్నావా?
అయితే నీవు ఆయన కుమారుడవు, కుమార్తెవు. ( ఆయనకు మనుమలు, మనుమరాళ్ళు లేరు.) 
*ప్రభువు శిక్షించినప్పుడు తృణీకరించకు.
*ఆయన నిన్ను శిక్షిస్తున్నాడు అంటే, నిన్ను ప్రేమిస్తున్నాడని అర్ధం చేసుకో. 

*ఆయన గద్దిస్తే విసిగిపోవద్దు.
*ఎందుకంటే తన కుమారులను ఆయన దండిస్తాడు. 
*తండ్రి కుమారులను శిక్షిస్తాడు.
*నీవు కుమారుడుగా, కుమార్తెగా ఉండాలంటే ఆ శిక్షలో పాలుపొందాల్సిందే. 
*తన పరిశుద్దతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షిస్తున్నాడు. 
* ప్రస్తుతము ఆ శిక్ష దుఃఖకరముగ ఉన్నప్పటికీ , ప్రతిఫలము మాత్రము సంతోషము, సమాధానము.
 హెబ్రీ 12:5-12
నీ దుఃఖ దినములు సమాప్తం కాబోతున్నాయి. 
నీ కన్నీటిని ఆయన ప్రేమతో తుడవబోతున్నాడు.

నీవు చెయ్యాల్సింది ఒక్కటే. 
ఆయన చిత్తానికి తలవంచు. 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 

                                             73వ కీర్తనా ధ్యానం 
                                               ( ఏడవ భాగం)

ఈలాగు ముచ్చటింతునని నేననుకొనినయెడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చినవాడ నగుదును.
అయినను దీనిని తెలిసికొనవలెనని ఆలోచించినప్పుడు
నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమునుగూర్చి ధ్యానించువరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. 
 కీర్తనలు 73:15-17
   ....................................

భక్తి పరులు, భక్తిహీనుల జీవితాలను బేరీజు వేసుకున్న ఆసాపు హృదయంలో చెలరేగిన కల్లోలం అంతా ఇంతా కాదు. 

అయినప్పటికీ, దేవునిపట్ల, దేవుని ప్రజలపట్ల ఆయనకున్న గౌరవం చెక్కు చెదరలేదు. 

తన హృదయంలో చెలరేగిన భీకరతుఫానును అణచుకుంటూ అట్లా మౌనముగా ఉండిపోయాడు తప్ప, తన వ్యక్తిగత తలంపులను ప్రజల్లోకి తీసుకువెళ్లి వారి విశ్వాసాలను దెబ్బతీసినవాడు కాదు. దేవునికి వ్యతిరేకముగా ప్రజలను ప్రేరేపించే పని కుడా ఆసాపు చేసినవాడు కాదు. 

నేటి సమాజంలో దేవుని వాక్యంలోనికి వ్యక్తిగత తలంపులను చొప్పించి, దాని అర్ధంమార్చి విశ్వాసులలో గందరగోళం సృష్టిస్తున్న వారికి(సేవకులకు),ఆసాపు వ్యక్తిత్వం ఒక ఆధ్యాత్మిక మేలుకొలుపు. 

ఆసాపు ఒక నిర్ణయానికి వచ్చాడు. తన హృదయంలో రేగిన ఈ సంఘర్షణకు పరిష్కారం ఒక్కటే. 
అదే, ఆయన పరిశుద్ద సన్నిధికెళ్ళి ధ్యానించడంలో ఎన్నడూ అనుభవించని గొప్ప ప్రశాంతత అనుభవించ గలిగాడు. 

జ్ఞాపకముంచుకో!!!
*
నీ ప్రతీ ప్రశ్నకు సమాధానం ఆయనే!
*
నీ ప్రతీ సమస్యకు పరష్కారం ఆయనే!

ప్రభు పాదాల చెంత మోకరించు!
ఆ గొప్ప ప్రశాంతతను అనుభవించు!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 


   
                                     73వ కీర్తనా ధ్యానం 
                                         (తొమ్మిదవ భాగం)
నా హృదయము మత్సరపడెను. నా అంతరింద్రియములలో నేను వ్యాకులపడితిని.
నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని.    నీ సన్నిధిని మృగమువంటి వాడనైతిని.   కీర్తనలు 73:21,22

ఆసాపు వ్యాకులతకు గల కారణమేంటి ?
దేవుని మంచితనాన్ని సందేహించి, భక్తిహీనులను చూచి అసూయపడడం. 

ఇట్లాంటి పాపములు మనిషిని ఆధ్యాత్మిక అవగాహన లేని మృగాలుగా మార్చేస్తాయి. 
"
వీరైతే తాము గ్రహింపని విషయములనుగూర్చి దూషించువారై, వివేకశూన్యములగు మృగములవలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటివలన తమ్మునుతాము నాశనముచేసికొనుచున్నారు."     యూదా 10.

ఆసాపు దేవుని సన్నిధిలో గాయకుడుగా నియమింప బడ్డాడు. అతడు పాడి దేవుని స్తుతించాలి అంతే. 
అట్లా కాకుండా, దేవుని న్యాయాన్ని, దేవుడు తీసుకునే నిర్ణయాలను ప్రశ్నిస్తున్నాడు. 

దేవునితో వాదములు పెట్టుకుంటే మనో వేదన, దుఖం తప్ప మరేమీ మిగలదు. 
ఆసాపుకు మిగిలింది అదే.

కాని, అసాపు తన మూర్ఖత్వాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని తిరిగి తన ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేసుకొంటున్నాడు.
పాపపు శరీరంతో వున్నాం 
పాపం చెయ్యడం సహజం. 
ఆ పాపాన్ని ఒప్పుకోవాలి. 

అట్లా అని పాపం చేస్తూ, 
ఒప్పుకొంటూ.........మరళా చేస్తూ.. మరళా ఒప్పుకొంటూ 
ఇట్లా గడిపేద్దామా? 
అట్లా చేస్తే పాప క్షమాపణ లేదు. 
నీవు ఒప్పుకున్న దాన్ని తిరిగి చెయ్యకుండా జాగ్రత్త పడాలి. 

నాకు పాపమంటే ఏంటో తెలియదు అనిచెప్పే ప్రయత్నం చేయొద్దు. బైబిల్ చదువు పాపానికి పరిశుద్ధతకు తేడా చెబుతుంది.

నీ పాపమును ఆయన సన్నిధిలో ఒప్పుకో. కప్పుకొనే ప్రయత్నం చెయ్యొద్దు. 
ఆయన అనుగ్రహించే నెమ్మది, సమాధానం పొందుకో! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 
73వ కీర్తనా ధ్యానం 
                                           (పదియవ భాగం)
అయినను నేను ఎల్లప్పుడు నీయొద్దనున్నాను నా కుడిచెయ్యి నీవు పట్టుకొని యున్నావు.        కీర్తనలు 73:23
"
అయినను" ఇదొక అద్భుతమైన పదం. 
పేతురు యేసు ప్రభువుతో అంటున్న మాట. 
రాత్రంతా ప్రయాస పడ్డాను. ఒక్క చేప కూడా దొరక లేదు. "అయిననూ" నీ మాట చొప్పున వల వేస్తాను. 
                లూకా 5:5
ఆసాపు అంటున్న మాట 
నీకు వ్యతిరేకముగా తలంచాను. 
నీ మార్గాలను తప్పు పట్టాను. "అయినను",
నీవుమాత్రం క్షణమైనా, నన్ను విడచి పెట్టలేదు. 

ఆసాపు దారి తప్పినా,
సందేహాలకు తావిచ్చినా?
ఆయన మాత్రం చిన్న పిల్లవాడి చేతిని తండ్రి పట్టుకొని నడిపించినట్లుగా, ఆసాపు చేతిని పట్టుకొని నడిపిస్తున్నాడు. 

మనము ఆయన చేతిని పట్టుకుంటే ఏ క్షణంలోనయినా విడచిపెట్టిసే అవకాశం వుంది. అందుకే ఆయన మనచేతిని పట్టుకొని నడిపిస్తున్నాడు.
"
నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహ రింపడు."   యోహాను 10:28 

మన మీద ఆయనకు ఎందుకంత శ్రద్ధ?
మనం పరిశుద్దులమనా? 
నీతి మంతులమనా? 
కానే కాదు. 
అది ఆయన కృప మాత్రమే.

ఆయన కృపను.....
నిర్లక్ష్యం చెయ్యొద్దు!
చులకన చెయ్యొద్దు!

ఆ కృప నీ నుండి దూరం చెయ్యబడక ముందే, 
ఆ కృపామయుని చెంతకురా!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 

     
                                         73వ కీర్తనా ధ్యానం 
                                               (పదకొండవ భాగం)
"నీ ఆలోచనచేత నన్ను నడిపించెదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు"       కీర్తనలు 73:24
దేవుని కృపవల్ల సంపూర్ణమైన విశ్వాసం ఆసాపు హృదయాన్ని నింపింది. 
తన స్వంత ఆలోచనలతో కలవరపడిన ఆసాపు పరిపూర్ణత లోనికి ప్రవేశించగానే, 
నీ ఆలోచనతోనే నన్ను నడిపించు. 
నీ చిత్తానికే తల వంచుతా అనే స్థితికి చేరాడు. 
ఈ స్థితికి మనమూ చేరగలగాలి.
*
ఇంతకీ ఆయన ఎక్కడికి నడిపిస్తాడు? 
"
శాశ్వత మహిమ"లోనికి నడిపిస్తాడు. 

అవును!   మన గమ్యం ఒక్కటే. 
అదే,"శాశ్వత మహిమ"లోనికి చేరడం. 
*
ఆ గమ్యం చేరాలంటే?   ఆయన చేత నడిపించబడాలి.
*
ఆయన చేత నడిపించబడాలి అంటే?  ఆయన చిత్తానికి తలవంచాలి. 
*
ఆయన చిత్తానికి ఎప్పుడు తలవంచగలం?   నిన్ను నీవు ఆయనకొరకు సమర్పించుకున్నప్పుడు.
*
ఇది ఎట్లా సాధ్యం?   నీ పాపములను ప్రభు పాదాల చెంత ఒప్పుకోవడం ద్వారా. 
*
నీవు చేసింది పాపం అని నీకెట్లా తెలుస్తుంది?    పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించడం ద్వారా. 
*
ఇంతకీ, ఆ పరిశుద్ద గ్రంధాన్ని ధ్యానించి  ఎన్ని రోజులయ్యింది???

జ్ఞాపకముంచుకో!
నీ శరీరం జీవించాలంటే ప్రతీ రోజూ ఆహారం ఎట్లా అవసరమో? 
నీ ఆత్మ జీవించాలంటే, అనునిత్యం పరిశుద్ద గ్రంధాన్ని ధ్యానం చెయ్యాలి. 

గమనిక:
*
పరిశుద్ద గ్రంధాన్ని చదవడంవల్ల ఫలితం చాలా తక్కువ.
 *పరిశుద్ద గ్రంధాన్ని ధ్యానం చెయ్యాలి. 

*
చదివితే, ఆయనను గూర్చిన 
జ్ఞానం మాత్రమే సంపాదించ గలవు. 
*
ధ్యానిస్తే, ఆయనతో సాన్నిహిత్యాన్ని అనుభవించ గలవు. 

మన జీవితాలను సరిచేసుకుందాం!
ఆయన చిత్తానికి తలవంచుదాం! 
ఆయన చేత నడిపించ బడదాం!
శాశ్వత మహిమలో ప్రవేశిద్దాం!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 

     
                                    73వ కీర్తనా ధ్యానం 
                                       (పండ్రెండవ భాగం)

"ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నా కక్కర లేదు."
             కీర్తనలు 73:25

ఆసాపు లేవీ గోత్రమునకు చెందినవాడు. 
లేవీయులకు స్వాస్థ్యము లేదు. ఎందుకంటే,
"
యెహోవాయే వారికి స్వాస్థ్యము"

ఇప్పటికి ఆసాపు తనకు తగిన ఆధ్యాత్మిక స్థితికి చేరుకున్నాడు. 
అందుకే అనగలుగుతున్నాడు.

*
నీవు తప్ప నాకెవరున్నారు?
ఈ మాట ఎవరు చెప్పగలరు? 
ఆయన మీద పూర్తిగా ఆధారపడినవారు మాత్రమే.

"
నీవు నాకు (స్వాస్థ్యముగ) వుండగా లోకములోనిది ఏదియు నాకక్కరలేదు."

ఎంత ఉన్నతమైన దశకు చేరుకుంటే ఆసాపు ఈ మాట చెప్పగలడు? 

ఇంత వరకూ నాకు అదిలేదు ఇదిలేదు అని మాట్లాడిన ఆసాపు, ఇప్పుడు అంటున్నాడు. నాకు ఏదీ వద్దు. "నీవుంటే చాలు".

"
అవును! ఆయన వుంటే చాలు"

*
ఆశీర్వాదాలకు కర్త మనతో వుంటే, ఇక ఆశీర్వాదాలతో పనేముంది?

*
యాకోబుతో దేవుడు అంటున్నాడు "నీతో పాటు నేను ఐగుప్తుకు వస్తాను" అని. ఆయనే వస్తే ఇక భయమేంటి?

*
హెబ్రీ యువకులతో దేవుడు వున్నప్పుడు, అగ్ని గుండం ఏమి చెయ్యగలిగింది? 

*
సింహాల బోనులో దానియేలుతో దేవుడు వున్నప్పుడు సింహాలు ఏమిచెయ్య గలిగాయి?

సమస్యల సుడిగుండమా?
ఆర్ధిక సమస్యలా? 
ఆరోగ్య సమస్యలా?
కుటుంబ సమస్యలా? 
ఉద్యోగ సమస్యలా? 
అవి ఎట్లాంటి పరిస్తితులు అయినా కానివ్వండి.

ఈ మాట నీవు చెప్పగలగాలి 
"
యేసయ్యా! నీవుంటే నాకు చాలు"
ఇది పెదవులకే పరిమితం కాకూడదు. 
నీ హృదయంతరంగం లోనుండి రావాలి.

అదెప్పుడు సాధ్యం? 
ఆసాపు చేరుకున్న ఆ పరిపూర్ణమైన అనుభవం లోనికి మనమూ చేరుకున్నప్పుడు.

ఆరీతిగా  మన జీవితాలను సరిచేసుకుందాం!
ఆశీర్వదించబడదాం!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్!                                                  
                                                   73వ కీర్తనా ధ్యానం 
                                                  (పదమూడవ భాగం)
నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గ మును స్వాస్థ్యమునై యున్నాడు.    కీర్తనలు 73:26
భక్తిహీనుల జీవితాలను చూసిన ఆసాపు మదిలో రేగిన సంఘర్షణ.
*
మరణమందు వారికి యాతనలు లేవు.
*
వారికి తెగులు పుట్టదు.
*
దినమంతయు నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది.
అంటూ మాట్లాడిన ఆసాపు,
ఎప్పుడయితే "యెహోవాయే నా స్వాస్థ్యము"అని గ్రహింపులోనికి వచ్చాడో? 
అతని ఆధ్యాత్మిక పరిపక్వత ఎంతో, ఆయన మాటల్లోనే అర్ధమవుతుంది. 

నా శరీరం కుళ్ళి కృశించినాగాని, 
నా హృదయం క్రుంగిపోయినాగాని,  నేను కదల్చబడను.
ఎందుకంటే,
ఆయనే "ఆశ్రయ దుర్గము"
ఆయనే  "స్వాస్థ్యము"
*ఆశ్రయ దుర్గము:
దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు
           కీర్తనలు 46:1
నీ శోధన కాలంలో ఆయనే ఒక బలమైన, స్థిరమైన కొండ. దానిలోనికి ప్రవేశించి సురక్షితముగానుండు.డును
యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును.
         సామెతలు 18:10

*
స్వాస్థ్యము:
స్వాస్థ్యము అంటే మన పితరులనుండి సంక్రమించే ఆస్తి . దానిని మన జీవితాంతము అనుభవించ వచ్చు. గాని, దానిని అమ్ముకోవడానికి లేదు. 
యెహోవాయే అతనికి స్వాస్థ్యముగా వున్నాడు.
*
ఆయనే ఒక ఆశీర్వాదపు ఘని. 
*
ఆయనే ఆశ్రయ దుర్గము.

మనము కూడా ఆయనకు స్వాస్థ్యమైన పిల్లలుగా ఉండాలంటే?
మన శోదన సమయంలో ఆయన మన ఆశ్రయ దుర్గముగా ఉండాలంటే?
ఆసాపు చేరుకున్న ఆ పరిపూర్ణమైన అనుభవం లోనికి మనమూ చేరాలి. 

ఆరీతిగా  మన జీవితాలను సరిచేసుకుందాం!
ఆయన పిల్లలుగా జీవిద్దాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 

                                          73వ కీర్తనా ధ్యానం
                                        (పదునాలుగవ భాగం)
నిన్ను విసర్జించువారు నశించెదరు నిన్ను విడిచి వ్యభిచరించు వారినందరిని నీవు సంహ రించెదవు.
నాకైతే దేవుని పొందు ధన్యకరము 
నీ సర్వకార్యములను నేను తెలియజేయునట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చియున్నాను.
     కీర్తనలు 73:27,28

ఆసాపు తన కీర్తనలో చివరి మాటలుగా, పరోక్షముగా నిత్య మరణమును ప్రస్తావిస్తున్నాడు. 

 ఎవరు అయితే, దేవుని విసర్జించి వారి జీవితాన్ని కొనసాగిస్తారో? వారు నాశనమవుతారు. అది నిత్య నాశనం. 


దేవుని విడచి వ్యభిచారం చేసేవారు వారు ఖడ్గం పాలవుతారు. 

"వ్యభిచారం" అంటే?
నీ ప్రియుడైన యేసయ్యతోసాంగత్యం కాకుండా, సాతాను ఒడిలో చేరి, నీవు జరిగించే ఏ కార్యమైనా అది వ్యభిచారమే.  

ఖడ్గము దేవుని ఉగ్రత ను సూచిస్తుంది. ఆ సంహారమునుండి నిన్ను తప్పించే వారెవరూ లేరు. 


దేవుని ఉగ్రత ఊహలకే భయంకరం.
అది యేసయ్య ఉగ్రత రోజు
ఏడేండ్ల శ్రమల రోజు
పాపులంతా ఏడ్చే రోజు 


సూర్యుడు నలుపయ్యేరోజు
చంద్రుడు ఎరుపయ్యేరోజు
భూకంపం కలిగే రోజు
దిక్కులేక అరచే రోజు 


వ్యభిచారులు ఏడ్చే రోజు
మోసగాళ్ళు మసలేరోజు 
అబద్దికులు అరచేరోజు
దొంగలంతా దొర్లేరోజు


తల్లిజాడ పిల్లకు లేదు.
పిల్లజాడ తల్లికి లేదు 
చెట్టుకొకరు పుట్టకొక్కరై 
అనాధలై అరచేరోజు 


ప్రియ నేస్తమా? యోచించు.
నీ బ్రతుకు ఎలా ఉన్నదో?
బలము చూచి బంగపడకు
ధనము చూచి ధగాపడకు 
ఆ ఉగ్రత దినమునుండి
నిన్నెవరూ(ఏది) తప్పించలేరు.


ఆ ఉగ్రత దినము నుండి తప్పించాబడాలి అంటే ఎట్లా?
ఒక్కటే మార్గము. ఆసాపు చెప్తున్నాడు కదా?
"నాకైతే దేవుని పొందు ధన్యకరము".



అవును!!!
దేవుని పొందు అంటే "దేవునితో మనకు గల సాంగత్యము" మాత్రమే ఆ ఉగ్రత దినము నుండి మనలను తప్పించి, మన జీవితాలకు ధన్యత చేకూర్చ గలదు. 


ఆరీతిగా  మన జీవితాలను సరిచేసుకుందాం!
ఆయన పిల్లలుగా జీవిద్దాం!
శాశ్వత రాజ్యాన్ని స్వతంత్రించు కుందాం!


అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్! 
(73వ కీర్తనా ధ్యానం సమాప్తం)

కామెంట్‌లు

సందేశాల లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఎక్కువ చూపు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

యేసుక్రీస్తు చేసిన అద్భుతములు

పొట్టి జక్కయ్య

సమరయ స్త్రీ

పేతురు వ్రాసిన పత్రికలు

ఆరాధనకి వెళ్ళినప్పుడు కావాల్సిన సిద్ధపాటు - కనీస క్రమశిక్షణ

యేసు క్రీస్తు రెండవ రాకడ

అబ్రాహాము విశ్వాసయాత్ర

పక్షిరాజు

శరీర కార్యములు

పాపము