భక్తిగలవాడే గాని
భక్తిగలవాడే గాని
2 రాజులు 4:1-7 లో ఒక సంఘటన జరిగింది. ఈ సంఘటన మనం చూస్తే ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య ఎలీషా గారి వద్దకు వచ్చి “నీదాసుడైన నా భర్త అప్పుచేసి చనిపోయాడు. ఇప్పుడు అప్పులవాడు వచ్చి నా పిల్లలనిద్దరిని వెట్టిచాకిరి చేయించుకోడానికి తీసుకోనిపోవుచున్నాడు, ఇప్పుడు తమరు ఏమైనా చేయండి అని బ్రతిమాలుతుంది. అప్పుడు ఎలీషా గారు అడిగారు అమ్మా మీ ఇంట్లో ఏముంది. ఆవిడ నిజం చెప్పింది, ఒక నూనెకుండ తప్ప ఏమిలేదు అని. ఆయన వట్టికుండలు ఎరవు తెచ్చుకొని ఈ నూనె ఆ వట్టి పాత్రలలో వేయు. ఆ ప్రవక్త శిష్యుని భార్య అలాచేసి తన సమస్య పరిష్కరించుకోంది.ఇక్కడ మనకు విశ్వాసజీవితానికి కావాల్సిన అనేక విషయాలున్నాయి.
1.భక్తిగలవాడే- గాని అప్పులు చేసి చనిపోయాడు.
మనం పూర్వచరిత్ర చూసుకొంటే ప్రవక్త- ప్రవక్త శిష్యులు మధ్య ఒక గురుకుల వ్యవస్థ ఉండేది. ప్రవక్తల శిష్యుల జీవనం అంతా గురువుగారిమీద ఆధారపడి ఉండేది. ఇట్టి పరిస్తితులలో ఈ శిష్యునికి అప్పు చేయాల్సిన అవుసరం ఏమొచ్చిందో తెలియదు! నేటిదినాల్లో కూడా చాలామందికి అప్పులు చేయడం అలవాటు, ఇంకా ఫేషన్ అయిపొయింది. అట్టహాసాలకోసం, షోకులకోసం, పార్టీలకోసం అవుసరానికి మించి అప్పులు చేస్తున్నారు. ఫైనాన్స్ తీసుకోవడమ్, కట్టలేక ముఖం చాటేయడం లేదా దాక్కోవడం!! మరికొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం! ఇవి అవుసరమా? స్తోమతకు మించి హంగులు, ఆర్భాటాలు, పార్టీలు, షోకులు అవుసరమా? వీటిద్వారా జబ్బులు, చెడు అలవాట్లు, అవమానాలు , కుటుంభంలో అశాంతి! ఒకవేళ ఆ కుటుంబయజమాని అప్పులుచేసి చనిపోతే కుటుంబపరిస్తితి ఏమిటి? భార్యాబిడ్డలు ఎలా బ్రతకాలి ఆలోచించారా? ఈ మధ్య యవ్వనస్తులు చేతిలో బండి ఉందికదా అని ఫుల్ స్పీడ్ లో బండి నడుపుతూ వేగాన్ని అదుపు చేయలేక ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. వారు పోయారు గాని వాని భార్య, తల్లిదండ్రులు పరిస్తితి ఏమిటి?
అందుకే విలాపవాక్యములు గ్రంధంలో 5:7 మాతండ్రులు పాపముచేసి గతించిపోయిరి వారి దోషశిక్షను మేమనుభావిస్తున్నాము అని ఏడుస్తున్నారు. దయచేసి స్తోమతకి మించి,అవుసరానికి మించి అప్పులు చెయ్యొద్దని ప్రేమతో మనవిచేస్తున్నాను.
2. తండ్రి- సంరక్షకుడు.
కుటుంభానికి సంరక్షకుడు లేకపోతె ఏమవుతుంది? పిల్లలకి సరియైన ఆహారం దొరకదు. చెడుతిరుగుల్లుకు అలవాటుపడి పాడైపోతారు. ఇక భార్య, భర్త లేక ఎన్నో అవహేలనలకు, అవమానాలకు గురి కావాల్సి వస్తుంది. ఎప్పుడైనా దీనిని ఆలోచించావా?
3. అప్పులవాడు-సాతానుడు:
ఎప్పుడైతే సంరక్షకుడు లేక తండ్రి లేడో సంరక్షణ లేక అప్పులవాడు అనగా సాతానుడు, లోకం కుటుంబం పై దాడి చేస్తుంది. అందుకే మెలకువగా ఉంది ప్రార్ధనచేయుడి, మీ విరోధియైన సాతానుడు గర్జించు సింహములాగ ఎవని మింగుదునా అని చూస్తున్నాడు. అని వ్రాయబడింది. 1 పేతురు 5:8
ప్రియవిశ్వాసి! దేవునితో సరియైన సంభందాన్ని కలిగియున్నావా? ఒకవేళ లేకపోతె నీకు సంరక్షణ లేదు. నేడే పరమతండ్రి యొద్దకు రమ్మని మనవి చేస్తున్నాను.
4. ఆధారం లేనప్పుడు మానవరీతిగా ఆలోచిస్తే ఎలా బ్రతుకుతారు పై పరిస్తితులలో? అప్పులు తీర్చడానికి తల్లిదండ్రులు యొద్దకు, లేక స్నేహితులయొద్దకు లేక బంధువుల యొద్దకు వెళతారు. వారు నిజంగా సహాయం చేస్తారా? ఎగతాళి చేస్తారా? సహాయం చేసేవారు నేటి దినాల్లో చాలాతక్కువ. భర్త చనిపోతే కుటుంబపోషణకు వ్యభిచారం చేసిన స్త్రీలుకూడా ఉన్నారు. ప్రియవిశ్వాసి! నీ భార్యాబిడ్డలను ఈపరిస్తితులలో ఉహించుకోగాలవా?
ఐతే ఇక్కడ ఈ ప్రవక్త శిష్యుడు తన భార్యకి దేవునిపై ఆనుకోవడం నేర్పించాడు. కావున ఈ స్త్రీ సరియైన పని చేసింది. తల్లిదండ్ర్రుల యొద్దకు గాని, బంధువుల యొద్దకుగాని, స్నేహితుల యొద్దకుగాని వెళ్ళకుండా గురువుగారి దగ్గరకు వచ్చి అడుగుతుంది సహాయం చేయమని. తప్పిపోయిన కుమారుడు కూడా బుద్ధి వచ్చినప్పుడు తండ్రియొద్దకు వచ్చినప్పుడే తనకి ఆదరణ, పోషణ, రక్షణ కలిగింది. ఇశ్రాయేలు! నీవు తిరిగి రానుద్దేశించిన యెడల నా యొద్దకే రావాలి అంటున్నారు దేవుడు. యిర్మియా 4:1, దేవుడు మాత్రమె నీకు సహాయం చేయగలరు. కావున నేడే ఆయన యొద్దకు రా!
5. ఉన్నది ఉన్నట్లే నిజం చెప్పాలి:
ఇక్కడ ఈ స్త్రీ కూడా ఎలీష గారి దగ్గరకు వచ్చి సహాయం అడిగినప్పుడు గురువుగారు అడిగారు నీదగ్గర ఏముంది. ఆమె నిజం చెప్పింది ఒక నూనెకుండ తప్ప నాదగ్గర ఏమి లేదు అని. నీవుకూడా ప్రభువు దగ్గర ఉన్నది ఉన్నట్లు నిజం ఒప్పుకో! ఆయన పరమతండ్రి కాబట్టి నిన్ను అర్ధం చేసుకొని, నిన్ను క్షమించి, దీవిస్తారు.
6. కుండ- నీహృదయం
నూనె- పరిశుద్ధాత్మ:
ఎప్పుడైతే నీహృదయాన్ని దేవునిదగ్గర కుమ్మరిస్తావో అప్పుడు దేవుడు ప్రతీ కళంకాన్ని, కల్మషాన్ని కడుగుతారు, యేసు రక్తం ప్రతిపాపమునుండి నిన్నుకడిగి పవిత్రునిగా చేస్తుంది. ఇప్పుడు కళంకం లేని నీహృదయంలో యేసయ్య పరిశుద్ధాత్మతో నింపుతారు. నీ గిన్ని నిండి పరిశుద్దాత్మతో పొంగి పొర్లిపారుతుంది.
7. అవుసరం తీరాక కూడా దేవునియందు నమ్మిక కలిగియుండాలి:
ఎప్పుడైతే ఊరిలో వట్టికుండలన్నీ నూనెతో నిండిపోయాయో ఆమె గుట్టుచప్పుడు కాకుండా నూనెను అమ్ముకోలేదు. జరిగిన అద్భుతాన్ని గురువుగారి దగ్గరచెప్పి అయ్యా ఇప్పుడు నేను ఏంచెయ్యను అని అడిగింది. గురువుగారు కూడా సగం నాకిచ్చి మిగతావి అమ్ముకో అనలేదు. మొత్తం అమ్మి నీ అప్పులు తీర్చుకొని సుఖంగా జీవించు అని ఆశీర్వదించారు. నీవు నేను కూడా దేవునికి ప్రధమ స్థానాన్ని ఇచ్చినప్పుడు అద్భుతాలు ఆశీర్వాదాలు కలుగుతాయి. జరిగాక నమ్మకముగా కృతజ్ఞతతో జీవిస్తే దేవుడు నిన్ను అత్యధికముగా దీవిస్తారు. అంతేకాక నీ జీవితములో జరిగిన ఆశ్చర్యక్రియలు, మేలులు అందరికి పంచాలి, అప్పుడు నీలో ఉన్న పరిశుద్దాత్మతో ఊరంతా నింపబడుతుంది.
నీవలా జీవించగలవా?
అట్టి కృప, ధన్యత దేవుడు మనందరికీ దయచేయును గాక!
ఆమెన్!
దైవాశీస్సులు!
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి